రుణాలమాఫీకి క్యాబినెట్ ఆమోదంతో ఇరకాటంలో పడిన వైకాపా

  ఇంతవరకు పంట రుణాల మాఫీపై ప్రభుత్వ నిజాయితీని శంకిస్తూ, రైతులలో అనుమానాలు కలిగే విధంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు చేనేత కార్మికుల రుణాలతో సహా అన్ని రకాల రుణాల మాఫీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకొంది. క్యాబినెట్ ముద్ర వేయడం ద్వారా ఇక ఈ అంశంపై రైతులకు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా చేయడమే కాక దీనిపై ప్రభుత్వానికి మరో ఆలోచన కానీ, ఈ జాప్యం వెనుక ఎటువంటి దురుదేశ్యాలు కానీ లేవని విస్పష్టంగా ప్రకటించినట్లయింది. ఈ పరిణామాన్ని ఊహించని వైకాపా ఇప్పుడు ఇరుకునపడింది.   నెలరోజులలోగా అన్ని రుణాలను మాఫీ చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని తొందరపడి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇందులో నుండి గౌరవప్రదంగా బయటపడేందుకు మార్గాన్వేషణ చేయక తప్పదు. కానీ ఆ ప్రయత్నం చేయకపోగా వైకాపా నేతలు చంద్రబాబు ఎన్నికలలో చెప్పినట్లు మొత్తం రుణాలు మాఫీ చేయకుండా ఇంటికి లక్షన్నర, డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తానని మోసం చేస్తున్నారని అప్పుడే మీడియాకు ఎక్కడం ఆరంభించారు.   ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితిలో కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సాధ్యమయినంత మేర రైతుల రుణాలను మాఫీ చేస్తుంటే, అందుకు వైకాపా సంతోషించకపోగా ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక గగ్గోలు పెడుతోంది. తద్వారా ఈ అంశంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న వైకాపా చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం అవుతోంది. పంట రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేయడాన్ని రైతులందరూ హర్షిస్తుంటే వైకాపా మాత్రం నిరసించడమే ఆ పార్టీ ప్రత్యేకత. జగన్ తన దుందుడుకుతనంతో వైకాపా ఇదివరకు చాలా సార్లు భంగపడింది. బహుశః ఈ రుణాలమాఫీ వ్యవహారంలో కూడా మరోమారు భంగపాటు తప్పదేమో!

రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదముద్ర

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కొన్ని ముఖ్యమయిన నిర్ణయాలు తీసుకొన్నారు. పంటరుణాల మాఫీపై అధ్యయనం కోసం వేసిన కోటయ్య కమిటీ సరిగ్గా నిర్దేశిత సమయానికి తన నివేదికను చంద్రబాబుకు సమర్పించడంతో మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కూడా లోతుగా చర్చ జరిగింది. 2014, మార్చి31 వరకు రైతులు తీసుకొన్న అన్ని రుణాలను మాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. దీనివల్ల రుణాల ఊబిలో కూరుకుపోయి విలవిలలాడుతున్న వేలాది మంది రైతులకు ఆ బాధ నుండి స్వేచ్చ దొరుకుతుంది.   ప్రతీ ఒక్క కుటుంబానికి లక్షన్నర చొప్పున పంట రుణాలు, బంగారు నగలపై తీసుకొన్న రుణాలను మాఫీ చేసింది. డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష రూపాయలు ఋణం మాఫీ చేసింది. కొందరు రైతులు, డ్వాక్రా సంఘాలు ఇప్పటికే రుణాలు తిరిగి చెల్లించినవారున్నారు. అటువంటి వారికి కూడా ఈ రుణమాఫీని వర్తింపజేసి నిజాయితీగా రుణాలు చెల్లించినవారిని ప్రభుత్వం గౌరవిస్తుందని నిరూపించుకొంది. పంట రుణాలతో బాటు చేనేత కార్మికుల రుణాలు కూడామాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.   ప్రస్తుతం ప్రభుత్వమే స్వయంగా ఈ రుణాలన్నిటినీ బ్యాంకర్లకు తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోయినప్పటికీ, రిజర్వు బ్యాంకు ఈ రుణాలను రీషెడ్యుల్ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది గనుక, బ్యాంకు ఇచ్చిన నిర్దిష్ట గడువులోగా ఆ రుణాలను తిరిగి చెల్లించేందుకు అవసరమయిన నిధుల సమీకరణకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రుణ మాఫీ కోసం దాదాపు రూ.37,900 కోట్లు అవసరం కాగా దానిలో రూ.25, 000 కోట్లు వరకు నిధులు సమీకరించుకొనేందుకు యఫ్.ఆర్.బీ.యం. చట్టంలో వెసులుబాటు ఉంది గనుక ఆవిధంగా నిధుల సమీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రిజర్వు బ్యాంక్ కేవలం 3సం.ల కాలపరిమితికే రుణాలను రీషెడ్యుల్ చేసేందుకు యోచిస్తున్నప్పటికీ, మరో నాలుగు సం.లు పొడిగించమని ఆర్.బీ.ఐ. ను అర్ధించాలని మంత్రివర్గం నిర్ణయించింది.   తెదేపా రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ రుణాల మాఫీకి మంత్రివర్గం చేత అధికారికంగా ఆమోదముద్ర వేయించడం ద్వారా ఇక దీనిపై ఎటువంటి సందేహాలకు తావు లేకుండా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకొంది. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకోకుండా, వాటిని రీ షెడ్యుల్ చేయించడానికి, ఆ రుణాలను ప్రభుత్వమే తిరిగి చెల్లించడానికి అవసరమయిన నిధుల సమీకరణ గురించి కూడా ఆలోచించడం ద్వారా ఈ అంశంపై చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

1956 నిబంధనకి నో ఛాన్స్!

  ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ విషయంలో విద్యార్థుల స్థానికతలు 1956 సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పుడు తెలంగాణలోని సీమాంధ్ర విద్యార్థులతోపాటు అనేకమంది తెలంగాణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిబంధన వల్ల అనేకమంది పక్కా తెలంగాణ విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం వుందని వారు వాపోయారు. తెలంగాణ ప్రజలు గగ్గోలు పెడుతున్నప్పటికీ ఫీ రీఎంబర్స్‌మెంట్‌కి 1956నే ప్రామాణికతగా నిర్ణయిస్తూ కేసీఆర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేసింది. ఈ నిర్ణయంతో అనేకమంది తెలంగాణ విద్యార్థులు హతాశులయ్యారు. తెలంగాణలోని విద్యార్థి లోకం నుంచి ఈ నిర్ణయం మీద వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 1956 నిబంధన కనుక అమలు అయితే వేలాదిమంది తెలంగాణ విద్యార్థులు నష్టపోయే ప్రమాదం వుంది. వీరిలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు కూడా వుంటారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారి పిల్లలు కూడా ఈ జాబితాలో చేరతారు. తెలంగాణ కోసం ఇంత పోరాటం చేస్తే తమకే ప్రభుత్వం షాక్ ఇచ్చిందన్న అభిప్రాయం వీరిలో కలిగింది. ఈ అభిప్రాయాల సెగ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి తగిలింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయాన్ని పునస్సమీక్షించుకునే అవకాశం వుందని తెలుస్తోంది. తెలంగాణలోని మీడియా ప్రతినిధులతో కేసీఆర్ జరిపిన ఒక సమావేశంలో దీనికి సంబంధించిన సూచనలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. 1956 నిబంధనను కచ్చితంగా అమలు చేయడం వల్ల తెలంగాణ విద్యార్థులకు కూడా నష్టం జరగడంతోపాటు న్యాయపరమైన ఇబ్బందులు కూడా వస్తాయని అర్థం కావడం వల్ల కేసీఆర్ ఈ విషయంలో పునరాలోచనలో పడ్డారని పరిశీలకులు అంటున్నారు.

మోడీ మళ్ళీ అణు పరీక్షలు చేయనున్నారా?

  భారతదేశం అణు పరిజ్ఞానం గురించి ఆలోచించడానికే సాహసం చేయబోదన్న అభిప్రాయం ప్రపంచ దేశాలకు.. ముఖ్యంగా అమెరికా, చైనాలకు వున్న సమయంలో అటల్ బీహారి వాజ్‌పేయి ప్రభు్తవం పోఖ్రాన్‌లో విజయవంతంగా అణు పరీక్షలు జరిపించింది. ఈ సంఘటన అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరీక్షల తర్వాత భారతదేశం కూడా అణ్వస్త్ర సహిత దేశంగా ప్రపంచం ముందు సగర్వంగా నిలబడింది. ఈ పరిణామం అమెరికా, చైనా, పాకిస్థాన్ లాంటి దేశాలకు ఇండియాని చూస్తేనే వెన్నులో చలిపుట్టేలా చేసింది. ఇదిలా వుంటే, ఇటీవలే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భారతీయ జనతాపార్టీ నాయకుడు నరేంద్ర మోడీ దేశంలో అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, దేశ భద్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. భారతదేశాన్ని ఇతర దేశాలు ఆషామాషీగా తీసుకోకూడదని ఆయన భావిస్తున్నారు. తాజాగా ఆయన సోమవారం నాడు భాభా ఆటమిక్ కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి తరహాలోనే నరేంద్ర మోడీ కూడా మరోసారి అణు పరీక్షలు నిర్వహించే అవకాశాలు వున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత అణు సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటాల్సిన అవసరం వుంది. నరేంద్రమోడీ ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జగన్ రాజకీయ జీవితం ఓ లాటరీ!

  వైఎస్సార్సీపీ నాయకుడు జగన్ జీవితం, పొలిటికల్ జీవితం ఒక లాటరీలా మారింది. దానికి ఒక తాజా ఉదాహరణ నెల్లూరు జడ్పీటీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను వైసీపీ లాటరీ ద్వారా గెలుచుకోవడం. మొదటి నుంచీ జగన్ రాజకీయ ప్రస్థానం ఒక లాటరీలాగానే సాగుతూ వచ్చింది. తన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రి పీఠం మీద వుండగా జగన్ పొలిటికల్ లాటరీ ఆడాడు. ఆ లాటరీలో పైసా పెట్టుబడి లేకుండా జగన్‌కి లక్షల కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. వైఎస్సార్ మరణం తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం జగన్ లాటరీ ఆడాడు. అయితే ఆ లాటరీలో విజయం సాధించలేకపోయాడు. బెడిసికొట్టిన ఆ లాటరీ కారణంగా జగన్ 16 నెలలు జైలులో గడపాల్సివచ్చింది. తర్వాత జగన్ కాంగ్రెస్ పార్టీతో కలసి ఆడిన పొలిటికల్ లాటరీ గురించి అందరికీ తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికలను కూడా ఆయన ఒక లాటరీగానే తీసుకున్నాడు. ఈ లాటరీలో ఎలాగైనా విజయం సాధించాలన్న తాపత్రయంతో కోట్లాది రూపాయలను వినియోగించాడు. అయినాసరే ఆయనకు ఆ లాటరీలో విజయం దక్కలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ ఆడుతున్న లాటరీ గురించి అందరికీ తెలిసిందే. తాను పొలిటికల్ లాటరీలో ఎలాగూ గెలవలేకపోయాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని బద్నామ్ చేసే లాటరీ ఆడటం మొదలుపెట్టాడు. అలాగే జగన్ జనజీవన స్రవంతిలో ఉండే విషయం కూడా ఒక లాటరీ మాదిరిగానే వుంది. ఆయన ఏ నిమిషంలో మళ్ళీ జైలుకు వెళ్ళాలో ఆయనకే అర్థంకాని పరిస్థితిలో వున్నారు. ఇన్ని లాటరీలు ఆయన జీవితంలో ఉండగా, తాజాగా మరో లాటరీ ఆయన జీవితంలోకి ప్రవేశించింది. నెల్లూరు జడ్పీటీసీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలను జగన్ పార్టీ లాటరీ ద్వారానే సొంతం చేసుకుంది.

మగపిల్లలన్నాక తప్పులు చేయడం సహజం: ములాయం

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు హత్యలు, సామూహిక అత్యాచారాలకు, మత ఘర్షణలకు నిలయంగా మారిపోయింది. గత కొన్ని నెలలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడో అక్కడ నిత్యం హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం లక్నోలో మోహన్ లాల్ గంజ్ అనే ప్రాంతానికి చెందిన 30ఏళ్ల మహిళను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి ఆ తరువాత చాలా కిరాతకంగా చంపేశారు.   అదే విషయం గురించి అధికార సమాజవాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ ను మీడియా ప్రశ్నిస్తే, “దేశంలో కెల్లా అత్యధికంగా 21కోట్ల మంది జనాభా యూపీలోనే ఉన్నారు. అందువల్ల ప్రతీ నేరాన్ని అదుపు చేయడం అసాధ్యం. అయినా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే యూపీలోనే అత్యాచారాలు చాలా తక్కువ” అని నిసిగ్గుగా సమర్ధించుకొన్నారు. ఇదివరకు ఓసారి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “మగపిల్లలు అన్నాక తప్పులు చేయడం సహజం. అంతమాత్రన్న వారినందరినీ దండించాలంటే ఎలా?” అని ప్రశ్నించారు కూడా.   ఇక ఆ తండ్రికి తగ్గ కొడుకు యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. పెరుగుతున్న ఈ నేరాలను మీడియా ఎత్తి చూపిస్తే, “దేశంలో చాలా చోట్ల ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. కానీ మీడియా మాత్రం ఒక్క యూపీలోనే అత్యాచారాలు జరుగుతున్నట్లు గగ్గోలు పెడుతోంది,” అని సమర్ధించుకొన్నారు.   ఆవు చేలోబడి మేస్తుంటే దూడ గట్టున ఎందుకు మేస్తుంది? రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాధినేత ఈవిధంగా మాట్లాడుతుంటే, పార్టీ నేతలు, మంత్రులు మాత్రం ఎందుకు సిగ్గుపడాలి అనుకోన్నారో ఏమో పార్టీకి చెందిన నరేష్ అగర్వాల్ అనే నాయకుడు మీడియాతో మాట్లాడుతూ “ నేతాజీ (ములాయం సింగ్) చెప్పిన మాట అక్షరాల సత్యం. లక్నో రేప్, హత్య కేసులో మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే ఆ మహిళా తనకు బాగా తెలిసిన వ్యక్తితోనే బయటకు వెళ్ళింది. ఆ తరువాత ఈ సంఘటన జరిగింది. అందువల్ల ప్రతీ నేరాన్ని అదుపు చేయడం అసాధ్యం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశమంతటా ఎక్కడో అక్కడ ఇటువంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ పరిస్థితిలో మార్పు లేదు. అటువంటప్పుడు ఒక్క యూపీలోనే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నట్లు మీడియా చూపించడం చాలా అన్యాయం,” అని యధా రాజా తధా ప్రజా అని నిరూపించారు.   ప్రజల ధన మాన ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే ఈవిధంగా మాట్లాడుతుంటే మరి హత్యలు, అత్యాచారాలు పెరగడంలో ఆశ్చర్యం ఏముంది? రాష్ట్రంలో 21 కోట్ల మంది జనాభా ఉన్నారని తెలిసి ఉన్నపుడు అందుకు తగినంత మంది పోలీసులను నియమించుకొని, వారికి కూడా నైతిక విలువలు పాటించేలా శిక్షణ ఇస్తే ఇటువంటి నేరాలు ఎందుకు జరుగుతాయి? కానీ అధికారం చేప్పట్టిన పార్టీలు ఆపని చేయకపోగా రాష్ట్రమంతట వేలకొద్దీ తమ నేతల విగ్రహాలు, చివరికి తమ పార్టీ గుర్తుగా ఉన్న జంతువుల విగ్రహాల ఏర్పాటు చేయడానికి విచ్చలవిడిగా ప్రజాధనం ఖర్చు చేస్తుంటారు. అటువంటప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయని ఏవిధంగా ఆశించగలము? అందుకే అది అత్యాస అవుతుందని స్వయంగా అధికార పార్టీ నేతలే చెప్పుకొంటున్నారు.

ఉస్మానియా విద్యార్థుల కలలు కరుగుతున్నాయి!

  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎంతగానో కృషి చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే చల్లారిపోయిందని అనుకున్న తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఉవ్వెత్తున ఎగసిందంటే దానికి ప్రధాన కారణం ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులే. ఉద్యమాన్ని కొనసాగించలేక చేతులు ఎత్తేసిన, జ్యూసులు తాగిన నేతలు కూడా విద్యార్థుల ప్రభంజనాన్ని చూసి ఉద్యమాన్ని కొనసాగించాల్సివచ్చింది. అలాగే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటూ అనేకమంది ఉస్మానియా విద్యార్థులు ఆత్మ బలిదానాలు కూడా చేసుకున్నారు. విద్యార్థులు ఉద్యమం విషయంలో ఇంత పట్టుదలగా వుండటానికి కారణం, తెలంగాణ రాష్ట్రం వస్తే తమకు భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్న ఆశే! అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వారి ఆశలు అడియాశలు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులలో కలుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయనున్నట్టు ప్రకటించింది. ఇది తెలంగాణ విద్యార్థుల మీద పిడుగుపాటుగా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేస్తే తమకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయన్న ఆందోళన వారిలో పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ కూడా జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలన్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థిలోకం గళమెత్తుతోంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును రెండేళ్ళపాటు పెంచింది. అదే నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని కూడా తీసుకోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్న పక్షంలో రెండేళ్ళపాటు ఉద్యోగాల ఖాళీలు ఏర్పడవు. చదువులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఉద్యోగ ఖాళీలు వుండవు. ఇది కూడా తెలంగాణ విద్యార్థుల ఆగ్రహానికి, ఆందోళనకీ కారణమవుతోంది.

ఏపీ మంత్రుల లాబీయింగ్ పురాణం!

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద వున్న ప్రత్యేక శ్రద్ధ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక విద్యా సంస్థలు, పరిశ్రమలు మంజూరు అయ్యాయి. ఆయా విద్యా సంస్థలను, పరిశ్రమలను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయడం ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలోని వారు మాత్రం అలాంటి విశాల దృక్పథం ప్రదర్శించకుండా తాము తమ ప్రాంత అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.   ప్రతిష్ఠాత్మకమైన పెట్రోలియం యూనివర్సిటీని కాకినాడలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అయితే ఈ విశ్వవిద్యాలయలన్ని తమ జిల్లాకు తన్నుకుపోవాలని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు, విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.   కేంద్రం ప్రతిపాదించిన కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుంటూరు జిల్లాలలోనే ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గట్టి పట్టుదల మీద వున్నారు. వేరే మంత్రులు ఎవరైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం మీద కర్చీఫ్ వేస్తే ఆయన ఎంతమాత్రం సహించేట్టు లేరు.   కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి మంజూరు చేసిన ఎయిమ్స్.ని గుంటూరు - విజయవాడ మధ్యలో వున్న మంగళగిరిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మాత్రం ఎయిమ్స్.ని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కృష్ణాజిల్లాకు తరలించుకుపోవాలని ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు.   తిరుపతిలో ఐఐటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అయితే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఐఐటీ మా నియోజకవర్గంలో పెట్టాంటే మా నియోజకవర్గంలో పెట్టాలని చంద్రబాబు మీద వత్తిడి పెంచుతున్నారు. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ని కర్నూలు జిల్లాకి ఇచ్చి తీరాల్సందేనన్న పట్టుదలను ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక రాయలసీమకే చెందిన మరో మంత్రి పరిటాల సునీల అనంతపురాన్ని రాష్ట్రానికి రెండో రాజధాని చేసితీరాలని నినదిస్తున్నారు.   అనంతపురం జిల్లాకే చెందిన ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తన జిల్లాకు భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలను తరలించుకువెళ్ళే ప్రయత్నాలు భారీ స్థాయిలో చేస్తున్నారు. ఇక రాష్ట్రమంతటా అమలు చేసే ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం మొట్టమొదటగా హిందూపురం నియోజకవర్గంలోనే అమలు చేసే విషయంలో నందమూరి బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. ప్రభుత్వంలో ఇలా లాబీయింగ్ చేయగలిగినవారు తమ ప్రాంతానికి ఏమేం కావాలో సాధించుకునే ప్రయత్నాలు చేస్తుంటే, తమ ప్రాంతానికి కావలసిన వాటిని డిమాండ్ చేసి సాధించుకునే శక్తిలేని మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేయాలో అర్థం కాక మథనపడిపోతున్నారు.   ఏది ఏమైనప్పటికీ ఎంతో అభివృద్ధి జరగాల్సి వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు ఎవరి ప్రాంతం గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమదృష్టితో చూస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాబీయింగ్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టి అన్ని ప్రాంతాల్లోనూ సమాన అభివృద్ధి జరిగేలా చూస్తే బాగుంటుందన్న ఆకాంక్షలూ వినిపిస్తున్నాయి.

మరో గ్యాస్ నిధి.. ఆంధ్రప్రదేశ్ వాటా ఏది?

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజవాయు నిక్షేపాలకు కొదువలేదు. ఏ ప్రాంతంలోని వనరులు ఆ ప్రాంతానికి ఉపయోగపడాన్న ప్రాథమిక సూత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాస్ నిక్షేపాల విషయంలో మాత్రం అమలు కావడం లేదు. గ్యాస్ వాటా విషయంలో ఆంధ్రప్రదేశ్‌కి న్యాయం జరగడం లేదన్న అభిప్రాయాలు, ఆందోళన వున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో గ్యాస్ నిక్షేపం బయటపడింది. కృష్ణ - గోదావరి బేసిన్ ప్రాంతంలోని బంటుమిల్లి దగ్గర 10 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ నిక్షేపం ఓఎన్జీసీ అన్వేషణలో బయటపడింది. ఇటీవలి కాలంలో బయటపడిన అతి పెద్ద గ్యాస్ నిక్షేపమిది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలోని సహజ వనరుల విషయంలో న్యాయమైన వాటా కోసం పోరాడటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించే అవకాశం వుంది. ఇప్పుడు బంటుమిల్లిలో బయటపడిన గ్యాస్ నిక్షేపాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన హక్కును కాపాడుకోవాల్సిన అవసరం వుంది. తనకు దక్కాల్సిన న్యాయమైన వాటాను దక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు నిక్షేపాల విషయంలో ఆ రాష్ట్రం ప్రదర్శిస్తున్న హక్కును గ్యాస్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రదర్శించాల్సిన అవసరం వుంది. ఇప్పటి వరకూ సహజ వాయువు విషయంలో ఆంధ్రప్రదేశ్ చేసిన త్యాగం చాలు. ఇంకా త్యాగాలు చేసి భారీగా నష్టపోయే కంటే, హక్కుకోసం పోరాడి ఆర్థిక అభివృద్ధిని సాధించడమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందు వున్న కర్తవ్యం.

బంగారు తెలంగాణ బహుదూరమేనా?

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్దాన కర్ణుడిలాగా ప్రతిరోజూ కొన్ని వాగ్దానాలను తెలంగాణ ప్రజలకు ఇస్తూ వున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఇక ‘బంగారు తెలంగాణ’ని నిర్మించుకోవడమే మన పని అన్నట్టుగా ఆయన హామీల మీద హామీలు గుప్పిస్తూ, రకరకాల పథకాలను ప్రకటిస్తూ తెలంగాణ ప్రజల్లో తాత్కాలిక ఆనందాన్ని కలిగిస్తున్నారు. కేసీఆర్ ప్రకటించిన పథకాలు, హామీల చిట్టా చూస్తే తెలంగాణలో ఏదో అద్భుతం జరగబోతోందన్న భ్రమ కలుగుతుంది. అయితే కేసీఆర్ వరాల జల్లు అమలుకు ఎంతవరకు సాధ్యమన్న విషయాలను వాస్తవ దృక్పథంతో పరిశీలిస్తే మాత్రం గుండె జల్లుమంటుంది. పథకాలు అయితే ఫుల్లుగా వున్నాయిగానీ, పైసల పరిస్థితి మాత్రమే డల్లుగా, నిల్లుగా వుంది. పేద దళిత రైతులకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ చెబుతున్నారు. అది కూడా ఆగస్టు 15 నుంచే భూ పంపిణీ మొదలుపెడతామని అంటున్నారు. తెలంగాణలో మొత్తం 18 లక్షల పేద దళిత కుటుంబాలు వున్నాయి. వారందరికీ మూడు ఎకరాల చొప్పున భూమి ఇవ్వాలంటే 54 లక్షల ఎకరాల భూమి కావాలి. మరి వారందరికీ పంచేంత ప్రభుత్వ భూమి లేదు. అలాంటప్పుడు ప్రయివేటు భూమిని ప్రభుత్వమే కొని పంచాలి. ప్రయివేటు భూమి ఎకరం యావరేజ్‌గా మూడు లక్షలు వుంటుంది. ప్రయివేటు వ్యక్తుల నుంచి భూమిని కొనుగోలు చేయాలంటే లాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం మార్కెట్ విలువకు నాలుగు రెట్లు చెల్లించి కొనుగోలు చేయాలి. అంటే ఎకరానికి 12 లక్షలు చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మొత్తం 54 లక్షల ఎకరాల్లో కనీసం 30 లక్షల ఎకరాలు అయినా కొనుగోలు చేయాలంటే, 30 లక్షలని పన్నెండు లక్షలతో హెచ్చవేస్తే మూడు లక్షల అరవై వేల కోట్లు అవుతుంది. ఈ డబ్బంతా కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడి నుంచి తెస్తుంది? భూమి విలువ సంగతి అలా వుంచితే ప్రభుత్వం పంచదలచుకున్న భూమిని సర్వే చేయడానికే 6 వందల కోట్లు ఖర్చవుతుంది మరి! అలాగే తెలంగాణ ప్రభుత్వానికి రైతు రుణాల మాఫీకి 19 వేల కోట్లు, పోలీసు వాహనాల కొనుగోలుకు 4,342 కోట్లు, 2000 మంది అమరవీరుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున ఎక్స్.గ్రేషియా చెల్లించాలంటే రెండొందల కోట్లు కావాలి. కళ్యాణ లక్ష్మి పథకం కోసం 50 వేల కోట్లు కావాలి. ఇక కేసీఆర్ ప్రకటించిన పథకాలు, వరాలు ఇవన్నీ నెరవేర్చాలంటే ఎన్ని లక్షల కోట్లు కావాలన్నది ఆర్థిక నిపుణులు మాత్రమే చెప్పగలిగిన అంశం. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 70 వేల కోట్లు మాత్రమే. అయితే వార్షిక బడ్జెట్ కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా వున్న ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసింది. మరి బడ్జెట్‌కి, ఖర్చుకి వున్న హస్తిమశకాంతరాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా బేలన్స్ చేస్తుందనేది కాకలు తిరగిన ఆర్థిక నిపుణులకు కూడా అంతుపట్టని అంశం. కేసీఆర్ బంగారు తెలంగాణ సాధిస్తానని చెబుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును తలచుకుంటే బంగారు తెలంగాణ బహుదూరంగా వున్నట్టుగా అనిపిస్తోందని తెలంగాణకు చెందిన అధికారులు, ఆర్థికవేత్తలే అంటున్నారు. బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ ఇస్తున్న హామీలు మాత్రం తెలంగాణ ప్రజల గుండెల నిండుగా వున్నాయి. అయితే ఆ కలలను నిజం చేయాల్సిన ఖజానా మాత్రం ఖాళీగా వుంది.

ఆ విమాన ప్రయాణికులు చాలా లక్కీ

  ఆ విమాన ప్రయాణికులు చాలా లక్కీ మలేసియా విమాన దుర్ఘటనకు సరిగ్గా రెండు రోజుల ముందు అంటే జూలై 15న అమెరికాలో న్యూ జెర్సీ నుండి 313 మంది ప్రయాణికులతో ముంబై బయలుదేరిన ఎయిర్ ఇండియా కూడా అటువంటి ఘోర ప్రమాదం నుండి త్రుటిలో తప్పించుకొన్న సంగతి బయటపడింది. అయితే ఆ ప్రమాదం ఉగ్రవాదుల దాడివలన కాక ఇంజనులో మంటలు అంటుకోవడం వలన జరగేది. కానీ విమాన పైలట్లు గౌతం వర్మ మరియు ఆయన సహచర పైలట్లు చాలా సమయస్పూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.   న్యూజెర్సీ నుండి బయలుదేరిన బోయింగ్-777 ఎయిర్ ఇండియా విమానం, ఎడమవైపు ఉన్న ఇంజన్ నుండి మంటలు అంటుకొన్నట్లు పైలట్ వర్మ గమనించారు. వెంటనే నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానశ్రయం ఫ్లయిట్ కంట్రోల్ రూమ్ అధికారులకు సమస్య గురించి చెప్పడంతో వారు విమానంలో ఉన్న ఇంధనాన్ని అవసరమయినంత మేర ఖాళీ చేసి, నిర్దిష్ట ఎత్తుకి విమానాన్ని దింపమని సూచించారు. అయితే ఇంధనం ఖాళీ చేయడానికి దాదాపు 30 నుండి 40 నిమిషాల సమయం, క్రమంగా ఎత్తు తగ్గించుకొంటూ రావడానికి మరో 15-30 నిమిషాలు పడుతుంది.   దాదాపు 80టన్నుల పైగా బరువున్న విమానం ఒక్క ఇంజనుతో గాలిలో అంతసేపు నిలవడం చాలా ప్రమాదమని గ్రహించిన పైలట్ గౌతం వర్మ, విమానాన్ని వెంటనే ఎమర్జన్సీ ల్యాండిగ్ చేయబోతున్నట్లు తెలిపి, దాదాపు గంటకు 370 కి.మీ.ల వేగంతో విమానాన్ని నివార్క్ లిబర్టీ అంతర్జాతీయ విమానశ్రయం రన్ వే పై చాలా నేర్పుగా ల్యాండింగ్ చేసి, 313 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు.   సాధారణంగా అంత భారీ విమానం, ఒక్క ఇంజనుతో సాధారణ వేగం కంటే 100కిమీ అధిక వేగంతో ల్యాండింగ్ చేయడం అసంభవమే. ఆ వేగంలో విమానం టైర్లు పేలిపోయి అదుపు తప్పవచ్చు లేదా రన్ వే దాటి ముందుకు దూసుకుపోవచ్చును, లేదా ఏమయినా జరుగవచ్చును. కానీ పైలట్లు చాలా నేర్పుగా దైర్యంగా విమానాన్ని చాలా భద్రంగా ఎటువంటి ప్రమాదం జరగకుండా దింపగలిగారు. ఆ ప్రయత్నంలో నిజంగానే విమాన టైర్లు పగిలిపోయాయి. కానీ పైలట్లు విమానం మాత్రం అదుపు తప్పనీయలేదు. ఈ ప్రమాదం జరిగి ఉండిఉంటే ఎవరూ బ్రతికి ఉండేవారు కాదని చెప్పవచ్చును. కానీ పైలట్లు సమయస్పూర్తి, దైర్యం, నేర్పు కారణంగా ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా మరో విమానాలలో తమ గమ్య స్థానాలకు చేరుకొన్నారు కూడా.   ఇందులో కొస మెరుపు ఏమిటంటే ఈ భయంకర ప్రమాదం నుండి 313 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన పైలట్లు, క్యాబిన్ సిబ్బంది చేతిలో సరిపోయినంత డబ్బు లేకపోవడంతో తమ సంస్థ యాజమాన్యానికి ఫోన్ చేసి తమందరికీ భోజనం కోసం ‘కాంప్లిమెంటరీ మీల్స్ టోకెన్లు’ ఇప్పించవలసిందిగా కోరినట్లు సమాచారం.

మలేషియా విమాన దుర్ఘటనలో 100మంది ఎయిడ్స్ శాస్త్రవేత్తల దుర్మరణం

  వేటగాడి బాణం దెబ్బకు విలవిలలాడుతూ నేలకొరిగిన శాంతి కపోతంలా, 280మంది ప్రయాణికులతో వెళుతున్నమలేషియా విమానం ఉగ్రవాదుల దాడిలో నిన్న రష్యా సరిహద్దుల వద్ద నేలకొరిగింది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ మహమ్మారిని అణచివేసేందుకు కృషి చేస్తున్న దాదాపు వందమంది రీసర్చ్ శాస్త్రవేత్తలు, వారికి నాయకత్వం వహిస్తున్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిడ్స్ పరిశోధకుడు మరియు అంతర్జాతీయ ఎయిడ్స్ సొసైటీకి మాజీ అధ్యక్షుడు అయిన జోయీప్ లాంజ్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. వారందరూ ఆస్ట్రేలియాలో జరగబోయే అంతర్జాతీయ ఎయిడ్స్-2014 సమావేశానికి వెళుతున్నారు. వారు గనుక మరణించి ఉండకపోతే బహుశః ఎయిడ్స్ నివారణకు వారు ఏదయినా పరిష్కారం చూపేవారేమో? కానీ దురదృష్టం కొద్దీ ఎయిడ్స్ మహమ్మారి గురించి చాలా లోతయిన అధ్యయనం చేసిన వందమంది శాస్త్రవేత్తలను ఒకేసారి ఏ కోల్పోయాము. ఇది యావత్ ప్రపంచానికి తీరని నష్టంగా చెప్పుకోవచ్చును.

వైకాపాకు 167 సీట్లు గ్యారంటీ : జగన్

  ఎన్నికలకి సరిగ్గా పదిరోజుల ముందు కూడా తన ఓటమిని పసిగట్టలేని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఓటమి నుండి తేరుకొన్న తరువాత వచ్చే ఎన్నికలలో తమ పార్టీకి 125 సీట్లు పైనే వస్తాయని జోస్యం చెప్పారు. మళ్ళీ ఈరోజు ఆ సంఖ్యని మరికొంత పెంచి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తన పార్టీకి 167 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బహుశః మరి కొన్ని రోజుల తరువాత మొత్తం 175 సీట్లు తమ పార్టీకే వచ్చేస్తాయని తేల్చి చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎన్నికల ప్రచార సభలో 30యంపీ సీట్లు, 115-125 అసెంబ్లీ సీట్లు సాధించి కేంద్రంలో, రాష్ట్రంలో గిరగిర చక్రం తిప్పుతానని ఖరాఖండిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి స్వయంకృతాపరాదాల వల్లన్నే ఓడిపోయారు. అందుకు తనను తాను నిందించుకోకపోగా ప్రజామోదంతో ఎన్నికలలో విజయం సాధించి అధికారం చెప్పట్టిన చంద్రబాబు నాయుడుని నిందించడం విశేషం. మరో ఐదేళ్ళ దాక ఎన్నికలు ఎలాగు రావు గనుక కేవలం 167 సీట్లు మాత్రమే వస్తాయని తృప్తిపడటం కంటే, తమ పార్టీని ఎలాగూ జాతీయ పార్టీగా ప్రకటించుకొన్నారు గనుక యావత్ దేశంలో తమ పార్టీయే గెలిచి తనే ప్రధానమంత్రి అయిబోతునట్లు ఊహించుకొంటే ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది కదా? ఏమయినప్పటికీ జగన్ తన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో జోస్యం చెప్పగలుగుతున్నపుడు, ఆ నోటితోనే తన సీబీఐ కేసుల పురోగతి గురించి కూడా నాలుగు ముక్కలు చెపితే బాగుండేది కదా?

కొండకి వెంట్రుక వేసిన టీడీపీ లీడర్ల ‘బంగారు కొండ’లు!

  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తుంటే, ఆయనకి చేదోడు వాదోడుగా నిలవాల్సిన కొందరు టీడీపీ లీడర్లు మాత్రం సందట్లో సడేమియా అని ‘నాలుగు రాళ్ళు’ వెనకేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఒక కొండకి వెంట్రుక వేశారు. వస్తే కొండ... పోతే వెంట్రుక అన్నట్టుగా, ఎవరి సొమ్ము కోసమో తాపత్రయపడుతున్నారు. ఇంతకీ ఆ కొండ ఏదో మామూలు కొండ కాదు. ప్రకాశం జిల్లాలోని అత్యంత ఖరీదైన గెలాక్సీ గ్రానైట్ కొండ. ఈ మేటర్ పూర్వాపరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతం అత్యంత ఖరీదైన గెలాక్సీ గ్రానైట్ కొండలకు నిలయం. అలాంటి అనేకానేక కొండల్లో రాఘవరెడ్డి అనే ఒక వ్యాపారవేత్త కూడా కొన్ని కొండలకు సొంతదారు. ఆయనకి చెందిన ఓ పెద్ద కొండమీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల ‘బంగారు కొండల’ కన్ను పడింది. వెంటనే రంగంలోకి దిగిపోయి ఆ కొండను లాక్కెళ్ళడానికి వెంట్రుక వేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి ‘ఉప’ నేత అయిన కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ టీడీపీ నాయకుడి పుత్రరత్నం, ప్రకాశం జిల్లాలో మంచి బలమున్న నాయకుడి కుమారుడు.... ఈ ఇద్దరు ‘బంగారు కొండలు’ కేంద్రంలో చక్రం తిప్పుతున్న నాయకుడి మనవడిని కలుపుకుని సదరు గ్రానైట్ కొండ మీద కన్నేశారు. ఆ కొండని సొంతం చేసుకోవడం కోసం సర్వేలంటూ, కలెక్టర్లంటూ, రికార్డులంటూ నానా హడావిడి చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొండ సొంతదారుడైన రాఘవరెడ్డి వినోదం చూస్తున్నారే తప్ప ఎంతమాత్రం టెన్షన్ పడటం లేదు. ఈ బంగారు కొండలు ఎన్ని వెంట్రుకలు వేసినా తన నుంచి గ్రానైట్ కొండని లాక్కెళ్ళలేరన్న ధీమాలో ఆయన వున్నారు. ఎందుకంటే, అగ్రనేత బావమరిది ఆయనకి కొండంత అండగా వున్నారు మరి! రాఘవరెడ్డికి ఇంత బ్యాక్‌గ్రౌండ్ వుందని తెలిసి కూడా కుర్రాళ్ళు తమ ప్రయత్నాలను మానుకోవడం లేదు. మరి వెంట్రుక గెలుస్తుందా... పెద్ద అండ వున్న కొండ గెలుస్తుందా? చూడాలి!

167 సీట్లంట.. జగన్ ఆశకి అంతేలేదా?

  కాంగ్రెస్ పార్టీలో వుండగా ముఖ్యమంత్రి పదవి కోసం లొట్టలేసి మొదటికే మోసాన్ని తెచ్చుకున్న జగన్, ఎన్నికల ముందు కూడా అలాగే లొట్టలేసి, ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయిపోయినట్టు కలలు కన్నారు. చివరికి అవన్నీ కల్లలైపోయి 67 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్నారు. అయితే ఆయనకి త్వరలో జైలు కూడు తప్పదని రాజకీయ ప్రత్యర్థులు అంటూ వుంటే, ఆయన మాత్రం ముఖ్యమంత్రి పదవి చుట్టూ మనసును తిప్పుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నంలో వున్న చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్న జగన్ అర్జెంటుగా మళ్ళీ ఎన్నికలు వస్తే తాను ముఖ్యమంత్రి అయిపోవడం ఖాయమని కలలు కంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న విష ప్రచారం జనంలో పనిచేస్తోందని భ్రమపడుతున్నారు. అందుకే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తన పార్టీకి ఇప్పుడున్న 67 స్థానాలకు మరో వంద స్థానాలు కలసి మొత్తం 167 స్థానాలు వస్తాయని ఆయన భ్రమిస్తూ, ఆ భ్రమల్ని ప్రజలకు కూడా కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎక్కడ మైకు దొరికినా తన మనసులో వున్న 67 - 167 లెక్కని చెప్పకుండా వుండలేకపోతున్నారు. జగన్ బాబు ఆశిస్తున్నట్టు మరో ఐదేళ్ళ వరకు ఎన్నికలు జరిగే అవకాశమే లేదు. ఒకవేళ పొరపాటుగా జగన్ ముచ్చట తీర్చాలని మళ్ళీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్‌కి ఇప్పుడున్న 67 స్థానాలు కూడా రావు. అంచేత జగన్ మళ్ళీ ఎన్నికలు జరగాలనే అనవసరపు స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా గప్ చుప్‌గా వుండి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబుకు సహకరిస్తే మంచిదని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

కేసీఆర్ వరం: హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు!

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. హైదరాబాద్‌‌లో వున్న కల్లు ప్రియులు సంతోషంతో పులకరించిపోయే నిర్ణయాన్ని కేసీఆర్ తీసుకున్నారు. ఆయన మాస్టర్ బ్రెయిన్‌లో నుంచి వచ్చిన నిర్ణయం హైదరాబాద్‌ చరిత్రలో మరో ముందడుగు కాబోతోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే, సైబర్ సిటీ, మెట్రో నగరం, అంతర్జాతీయ స్థాయి నగరం అని చెప్పుకునే హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండగ తర్వాత హైదరాబాద్ నగరంలో భారీ సంఖ్యలో కల్లు దుకాణాలు ఓపెన్ కాబోతున్నాయి. అందువల్ల కల్లు ప్రియులకు దసరా నుంచి ప్రతిరోజూ దసరా పండగే. గతంలో అంటే... 2004 సంవత్సరానికి ముందు హైదరాబాద్‌ నగరంలో బోలెడన్ని కల్లు కాంపౌండ్లు వుండేవి. కల్లు ప్రియులు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా ఒక కల్లు బాటిల్ కొనుక్కుని తాగి ఎంజాయ్ చేసేవారు. అయితే 2004 సంవత్సరంలో తెలంగాణ ప్రజల ఆనందాన్ని, ఎంజాయ్‌మెంట్‌ని చూసి ఓర్చుకోలేని సీమాంధ్ర పాలకులు ఏవేవో సాకులు చెప్పి హైదరాబాద్ నగరం పరిధిలో కల్లు దుకాణాలను తొలగించేశారు. దాంతో కల్లుగీత కార్మికులు ఉపాధిలేక ఇబ్బందులు పడిపోయారు. వారి ఆవేదనను గమనించిన కేసీఆర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను మళ్ళీ తెరిపిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగా హైదరాబాద్‌లో కల్లు దుకాణాలకు అనుమతి ఇస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2004 సంవత్సరం కంటే ఇప్పుడు హైదరాబాద్‌లో జనాభా పెరిగింది కాబట్టి పెరిగిన జనాభాకి అనుగుణంగా కల్లు దుకాణాల సంఖ్యను కూడా పెంచాలని నిర్ణయించారు. ఈరకంగా హైదరాబాద్‌లో పెరిగిన జనాభాలో వున్న కల్లు ప్రియులు కూడా ఎంతమాత్రం నిరాశపడకుండా తమవంతు కల్లును ఆస్వాదించవచ్చు. హైదరాబాద్ కల్లు దుకాణాలను అందరూ మెచ్చుకునేలా నిర్వహించాలని ప్రభుత్వం అనుకుంటోంది. హైదరాబాద్‌లోని కల్లు దుకాణాలలో కల్తీలేని నిఖార్సయిన కల్లును విక్రయించాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. అలా చేస్తే కేవలం రెగ్యులర్ కల్లు ప్రియులను మాత్రమే కాకుండా కొత్తవారు కూడా కల్లు తాగడానికి ఆసక్తి చూపించే అవకాశం వుంది. హైదరాబాద్‌ కల్లు కాంపౌండ్లలో నాణ్యమైన కల్లు విక్రయించడం ద్వారా హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్ హలీమ్ ఎలా పాపులర్ అయ్యాయో హైదరాబాద్ కల్లు కూడా పాపులర్ అయ్యే అవకాశం వుంటుంది. కల్లు కాంపౌండ్లకి 1956 నిబంధన విధించని కేసీఆర్‌కి హైదరాబాద్‌లోని సీమాంధ్ర సెటిలర్ కల్లు ప్రియుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు.

చంద్రబాబుకి నెల రోజులు గడువు ఇస్తున్నా: జగన్

  ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్న విద్వేషం గురించి తెలియనివారులేరు. అవకాశం దొరికితే చంద్రబాబుపై నిప్పులు చెరిగే జగన్మోహన్ రెడ్డి, నెలరోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మొత్తం మాఫీ చేయకపోయినట్లయితే ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని హెచ్చరించారు. ఈలోగా అసెంబ్లీ సమావేశాలలో ఎలాగూ ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పారు.   వ్యవసాయ రుణాల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాటం చూస్తుంటే రైతుల పట్ల ఆయనకు చాలా అపేక్ష ఉందని అందరూ పొరబడుతుంటారు. కానీ నిజానికి చంద్రబాబు వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తే, ఆయనను ప్రజలలో దోషిగా నిలబెట్టాలనే తపనే జగన్ లో ఎక్కువగా కనిపిస్తోంది. రైతుల పట్ల నిజంగా అంత అపేక్ష ఉంటే, తెలంగాణా రైతుల రుణాల మాఫీ గురించి కూడా మాట్లాడి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు కూడా వారి ప్రసక్తి ఎత్తలేదు. దీనిని బట్టి ఆయన రైతుల గురించి కాక చంద్రబాబును నిలదీసి, ప్రజలలో దోషిగా నిలబెట్టి, ఎన్నికలలో తనను ఓడించినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నట్లు అర్ధమవుతోంది. అందుకే రైతు రుణాల మాఫీ గురించి పదేపదే మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు భావించవచ్చును.   జగన్ తన తండ్రి మరణించిన నాటి నుండి ముఖ్యమంత్రి అవుదామని తపించిపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మొన్న జరిగిన ఎన్నికలలో ఆ అవకాశం చేతివరకు వచ్చి తప్పిపోవడానికి చంద్రబాబే కారణమని దుగ్ధ జగన్ లో ఉంది. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు కూడా.   తను గెలుపుపై ధీమాతో అతివిశ్వాసం ప్రదర్శించితే, చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని రైతుల రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలుపొందారని చాలా సార్లు చెప్పుకొన్నారు. నీతి నిజాయితీకి కట్టుబడిన తాను ప్రజలను మభ్యపెట్టడం ఇష్టంలేకనే అటువంటి హామీలు ఇవ్వలేదని అందుకే తను ఓడిపోయానని, చంద్రబాబు మాటలు నమ్మిన ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించారని చెప్పుకొన్నారు. తను నీతి నిజాయితీలకు కట్టుబడి రుణాల మాఫీపై హామీ ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొన్నప్పటికీ, తమ పార్టీ ఎన్నికలలో ఖచ్చితంగా గెలుస్తుందనే ధీమాతోనే రుణాల మాఫీపై వెనకడుగు వేసినట్లు ఆయన చెప్పకనే చెప్పారు. ఒకవేళ ఓడిపోతున్నామని ఏమాత్రం ముందు పసిగట్టినా ఆయన కూడా రుణాల మాఫీకి హామీ ఇచ్చి ఉండేవారే!   ఎన్నికలలో గెలిచేందుకు ఫ్యాను గాలి వీస్తోంది...దుమ్ము దులపండి....ఐదు సంతకాలు పెడతా.. కేంద్రం మెడలు వంచుతా...ముప్పై యంపీ సీట్లు..115 యం.యల్యే సీట్లు నావే.. నాకు నచ్చిన వాడినే ప్రధాన మంత్రిని చేస్తా...అంటూ ఉత్తర ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి రుణాల మాఫీపై హామీ ఇవ్వనప్పటికీ అంతకు పదింతలు వ్యయం అయ్యే అనేక సంక్షేమ, అభివృద్ధి పధకాలు ప్రకటించిన సంగతి అందరికీ తెలుసు. ఆ సంగతి ఆయన ఇప్పుడు చెప్పుకోకపోవచ్చు కానీ, ఆయన ఇచ్చిన అనేక హామీలను కొంతమంది ప్రజలు నమ్మబట్టే వైకాపాకు అన్ని సీట్లు వచ్చాయనే సంగతి ఆయన అంగీకరిస్తే బాగుంటుంది.   ఏమయినప్పటికీ వ్యవసాయ రుణాలను మూడేళ్ళ పాటు రీషెడ్యూల్ చేయడానికి రిజర్వు బ్యాంక్ అంగీకరించింది. ఆ రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది తప్ప రైతులు కాదనే సంగతి జగన్ గుర్తిస్తే బాగుంటుంది. అందువల్ల చంద్రబాబు ప్రజలలో దోషిగా నిలబెట్టాలనే ఆయన కోరిక తీరే అవకాశం లేదనే అనుకోవాలి. ఇటీవల చెన్నైలో జరిగిన భవన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని ఓదార్చేందుకు హడావుడిగా విజయనగరం బయలుదేరిపోయిన జగన్మోహన్ రెడ్డి, వారికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేసిందో లేదో తెలుసుకోకుండానే, ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని నిందించి అభాసుపాలయ్యారు. అయినా అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసి నవ్వుల పాలయ్యేందుకు ఉవ్విళ్లూరుతుంటే ఎవరు మాత్రం కాదంటారు.

తిరుమల కొండపై కూడా రాజకీయాలు మాట్లాడటం అవసరమా?

  సాధారణంగా ప్రజలు కేవలం దైవదర్శనం కోసమే అనేక వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలకు వెళుతుంటారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం దైవదర్శనంతో బాటు అలవాటులో పొరపాటుగా అక్కడ కూడా రాజకీయాలు చేస్తుంటారు. మీడియావాళ్ళను చూడగానే తామొక పరమ పవిత్రమయిన పుణ్యక్షేత్రంలో ఉన్నామనే సంగతి కూడా మరిచిపోయి తమ రాజకీయ ప్రత్యర్ధులపై చెలరేగిపోతుంటారు. ఆధ్యాత్మిక అంశాలతో ఎటువంటి సంబంధమూ లేని మాటలు, ప్రకటనలు, వ్యాక్యాలు, విమర్శలు చేస్తుంటారు. కేవలం గోవింద నామస్వరం ప్రతిధ్వనించాల్సిన పవిత్రమయిన తిరుమల కొండపై రాజకీయ నేతలు ఈవిధంగా రాజకీయ విమర్శలు, వ్యాఖ్యలు చేయడం చాలా అవివేకం, అసంబద్దం, అపచారం కూడా. అసలు వారు దైవదర్శనానికి ఎందుకు వచ్చారో గ్రహించినట్లయితే ఆవిధంగా మాట్లాడరు.   తిరుమల వచ్చే ప్రతీ రాజకీయ నాయకుడు, దైవదర్శనం వల్ల కలిగిన పుణ్యాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడేసి అక్కడే తుడిచిపెట్టుకొని కొండదిగి వస్తుంటారు. రాజకీయ నాయకులు, సినీ తారలు తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడటమే కాదు వారి రాక వల్ల సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కూడా అంతులేదు. ఒక్క రాజకీయ నేత దైవ దర్శనానికి వచ్చినట్లయితే, యావత్ టీటీడీ అధికారులు, చివరికి గుళ్ళో పూజారులు సైతం సామాన్య భక్తులను, దేవుడిని కూడా గాలికొదిలి పెట్టి సదరు నేతలు, తారల సేవకు అంకితమయిపోతారు. జనాలు నవ్వితే నవ్వి పోదురు గాక... ఈసడించుకొంటే ఈసడించుకొందురు గాక మాకేల సిగ్గు ఎగ్గు... అన్నట్లు వ్యవహరిస్తారు నేతలు, టీటీడీ అధికారులు.   మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే తిరుమల దేవుని దర్శనానికి వచ్చే స్వామీజీలు, పీటాదిపతులు, బాబాలు కూడా తమకు రాచమర్యాదలు జరగాలని కోరుకోవడం, అలకలు పూనడం, మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేయడం. సర్వసంఘ పరిత్యాగులమని చెప్పుకొనే వారు భౌతిక వాంఛలకు, రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించకపోగా వారు కూడా రాజకీయ నాయకులలాగే వ్యవహరిస్తుంటారు. దైవ సన్నిధిలో అందరూ సమానమే అనే భావన వారిలో ఏ కోశాన్న కనబడదు. నిజం చెప్పాలంటే ఆ దేవునికంటే తామే మిన్న అన్నట్లు, తాము ఆ దేవుని కొలవడానికి రావడం ఆ దేవుని అదృష్టం అన్నట్లు ఉంటుంది వారి వ్యవహార శైలి. వారు కూడా తమకు వీవీఐపీ ట్రీట్ మెంటు, సకల సౌకర్యాలు కల్పించాలని లేకపోతే అక్కడే ధర్నాలు కూడా చేస్తుంటారు.   బహుశః ఇటువంటి దురలవాట్లు మరే ఇతర మతస్తుల పుణ్యక్షేత్రాలలో కనబడదు. కేవలం హిందూ పుణ్య క్షేత్రాలలో అదీ సినీ తారలు, రాజకీయ నాయకులు తరచూ వచ్చే తిరుమలలోనే ఎక్కువగా కనబడుతుంది. తిరుమల కొండపై ఈవిధంగా నేతలు, సినీ తారలు మీడియాతో మాట్లాడటం, రాజకీయ విమర్శలు చేయడం చాల సహజ విషయమన్నట్లు ప్రజలు, ప్రభుత్వాలు, మీడియా చివరికి టీటీడీ కూడా భావించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.   నిన్న తిరుమల శ్రీవారి దర్శినం కోసం వచ్చిన ఆనం వివేకానంద రెడ్డి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఆ పనేదో ఆయన కొండ క్రిందకు దిగివచ్చి చేసి ఉండి ఉంటే ఎవరికీ అభ్యంతరమూ ఉండేది కాదు. ఇది ఆయనొక్కరికే కాదు, తిరుమల కొండపై అడుగుపెట్టే ప్రతీ రాజకీయ నాయకుడికి వర్తిస్తుంది. పరమ పవిత్రమయిన దైవ కార్యంలో నిమగ్నమవ్వాల్సిన టీటీడీ బోర్డులో అనేక నేరాలు, సారా వ్యాపారాలు, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిన రాజకీయ నాయకులకు పదవులు కట్టబెట్టడమే ఈ అనర్దాలన్నిటికీ మూలకారణం. తిరుమల పవిత్రత, ఆచార వ్యవహారాల గురించి ఏమాత్రం అవగాహన లేని నేతలు, ఆధ్యాత్మికత, మానవసేవ, దైవార్చన, నియమ నిష్టల పట్ల ఏమాత్రం ఆసక్తిలేని వారికి ఇటువంటి బాధ్యతలు అప్పగిస్తునంత కాలం ఈ పరిస్థితుల్లో మార్పు ఉండదు.   ఇప్పటికయినా ప్రభుత్వం తిరుమల పవిత్రతను, గొప్పదనాన్ని కాపాడేవిధంగా చర్యలు తీసుకొని, అందుకు అర్హులయిన వారి చేతుల్లోనే టీటీడీని పెట్టాలి. కొండపై జరుగుతున్న ఈ అపచారాలను అరికట్టే ప్రయత్నాలు చేయాలి. తిరుమలలో తొలి ప్రాధాన్యత ఆ ఏడుకొండల వాడికే తప్ప నేతలు, స్వామీజీలకు కాదు. ఆ తరువాత ప్రాధాన్యం ఎంతో వ్యవ ప్రయాసలకోర్చి ఎంతో భక్తితో వస్తున్న సామన్యభక్తులకే తప్ప నేతలకు పీటాధిపతులకు కాదనే సంగతి టీటీడీ కూడా గ్రహిస్తే బాగుంటుంది.

ఆంధ్రా ప్రజలపట్ల ఇంత వివక్ష అవసరమా?

  ఆంధ్రా, తెలంగాణా ప్రజలపట్ల ఇంత వివక్ష అవసరమా? తెరాస పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన చాలా హామీలను అమలు చేస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకొంది. దీనివల్ల తెలంగాణాలో అన్ని వర్గాల ప్రజలకు లబ్దికలుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయ, బంగారు, పవర్ లూమ్ కార్మికుల రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం ఎటువంటి సందిగ్దత కనబరచకుండా చాలా స్పష్టంగా నిర్ణయం ప్రకటించడం హర్షణీయం. అదేవిధంగా తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం, మళ్ళీ వారిలోవయసు మీరినవారి పట్ల సానుభూతిగా వ్యవహరిస్తూ వారి కోసం నిబంధనలు సడలించాలని నిర్ణయించడం ప్రభుత్వం యొక్క మానవీయ కోణాన్ని చాటిచెపుతోంది. సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల తెలంగాణా ప్రభుత్వం చూపిన ఆదరణ కూడా చాలా అభినందనీయం.   తెలంగాణాలో జనాభాలో అత్యధికంగా ఉన్న యస్సీ, ఎస్టీ, ముస్లిం, గిరిజన, ఆదివాసీలకు పెన్షన్లు, భూములు, ఇళ్ళు, విద్యావకాశాలు కల్పించాలనుకోవడం కూడా చాలా హర్షణీయం. తెలంగాణా కోసం అమరులయిన వీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలనుకోవడం గొప్ప విషయమే. కానీ 1969నుండి పోరాడి అమరులయిన వీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలనుకోవడం ఇంకా గొప్ప విషయం.   తెలంగాణా ప్రజల పట్ల అవ్యాజమయిన ప్రేమాభిమానాలు, కరుణ చూపించిన తెరాస ప్రభుత్వం ప్రతీచోట కూడా ఆంధ్రా, తెలంగాణా అనే భేదం ఖచ్చితంగా పాటించాలని అనుకోవడం చాలా బాధాకరం. విద్యార్ధుల విషయంలో కూడా ఖచ్చితంగా ఈ వివక్ష పాటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం మరింత బాధాకరం.   ఏదో ఒకరోజు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతుందని ఎవరూ ఎన్నడూ ఊహించలేదు. అందుకే రాష్ట్రం నలుమూలల నుండి ప్రజలు హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డారు. హైదరాబాదునే తమ స్వస్థలంగా భావిస్తూ అక్కడే చాలా మంది స్థిరపడ్డారు. వారిలో అనేకమంది వివిధ ప్రభుత్వ శాఖలలో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఎన్నో ఏళ్లబట్టి పనిచేస్తున్నారు. వారి పిల్లలు అక్కడే పుట్టి అక్కడే చదువుకొని తాము తెలంగాణావాసులమనే అనే భావనతో ఉన్నారు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే వారి పట్ల వివక్ష చూపుతామని ప్రకటించడంతో వారందరి జీవితాలు, భవిష్యత్తు అయోమయంగా మారబోతోంది.   అనేక దశాబ్దాలుగా తెలంగాణాలో స్థిరపడి, అక్కడే పుట్టిపెరిగిన వారు ఇప్పుడు అటు తెలంగాణాకు, ఇటు ఆంధ్రాకు చెందని కాందీశీకులయిపోయారు. వారందరినీ తెలంగాణా ప్రభుత్వమే ఆదుకోవలసిన అవసరం లేదు. ఆంధ్రా ప్రభుత్వంతో మాట్లాడి వారి సంక్షేమం కోసం రెండు ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక వ్యవస్థలు, నిధులు, పధకాలు ఏర్పాటు చేసి మానవత్వంతో వ్యవహరించాలి. ప్రాంతీయవాదాన్ని పక్కనబెట్టి జాతీయ దృక్పధంతో వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేయాలి తప్ప ప్రభుత్వాలే ప్రజల పట్ల కక్ష పూరితంగా వ్యవహరించడం సబబు కాదు.