క్రీడలను పట్టించుకోని ప్రభుత్వాలు

    ప్రపంచంలో ఏవయినా అంతర్జాతీయ క్రీడా పోటీలు జరిగిన ప్రతీసారి భారతీయులందరిలో ఒకటే ప్రశ్న తలెత్తుతుంటుంది. చిన్నచిన్న దేశాలు సైతం మెడల్స్ గెలుచుకొంటున్నాయి. కానీ 120కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క మెడల్ కూడా ఎందుకు గెలుచుకోలేకపోతోంది? అనేదే అందరి ప్రశ్న. మొన్న ముగిసిన అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీలలో భారత్ ఊసేలేదు. ఏమంటే భారతీయులు కేవలం క్రికెట్ ఆట మీదనే మక్కువ చూపుతారనే కుంటి సాకు ఒకటి చెప్పుకొంటాము. కానీ అసలు కారణాలు వేరే చాలానే ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు.   గత మూడు దశాబ్దాల నుండి తల్లితండ్రులు పిల్లలకి బొమ్మలు, చాక్లెట్లు, ఐస్ క్రీములు కొనిపెట్టినట్లే చదువుని కూడా కొనిపెట్టడం ఆరంభించినప్పటి నుండీ వారు మనుషులుగా కాక మార్కులు సంపాదించే యంత్రాలుగా మారిపోయారు. స్కూళ్ళు కాలేజీలు కూడా ఆ మార్కుల యంత్రాలను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మారిపోయాయి. దానితో బాటే వందల కొద్దీ టీవీ ఛానళ్ళు, ఫేస్ బుక్కులు, సెల్ ఫోన్ చాటింగులు, ఇంటర్ నెట్, వీడియో గేములు అన్నీ ఒకటొకటిగా, పిల్లల బాల్యాన్ని మింగేసాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో మినీ కుటుంబాలు, విచ్చినమయిన కుటుంబాలు వంటివి కూడా పిల్లల జీవన శైలిని పూర్తిగా మార్చివేశాయి.   ఇక ప్రభుత్వాలు కూడా క్రీడలను ఎన్నడూ సీరియస్ అంశంగా భావించలేదు. క్రీడల పట్ల సహజంగా ఆసక్తి ఉన్నవారు లేదా ఎవరి వల్లనయినా ప్రేరణ పొందిన వారు, ఓపికుంటే నలుగురి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకొని స్వయంకృషితో పైకి ఎదగాలి తప్ప ప్రభుత్వం ఎన్నడూ అటువంటి వారిని గుర్తించి వారికి అండగా నిలిచిన సందర్భాలు అరుదు. ప్రభుత్వాలు ఎప్పుడు గుర్తిస్తాయంటే వారు స్వయంకృషితో విజయాలు సాధించి చూపినపుడు. అంతవరకు వారు ఒంటరి పోరాటం చేయవలసిందే. ఇక క్రీడలలో సౌకర్యాలు, శిక్షణా మాట దేవుడెరుగు ముందు కులం, మతం, ప్రాంతం, బాష, ధనం, రాజకీయ ప్రభావాలను తట్టుకొని పైకి ఎదగాలంటే ఎంత కష్టమో ఆ బాధలు అనుభవించిన వారికే తెలుసు. ఇటువంటి లక్షా తొంబై కారణాల వల్లనే 120 కోట్ల భారతీయులలో కోటికొక్క క్రీడాకారుడు, క్రీడాకారిణి కూడా తయారవడం లేదు.   అయితే ఈ పరిస్థితుల్లో ఎన్నటికీ మార్పురాదా? మార్పు చేసుకోలేమా? అని ప్రశ్నించుకొంటే, క్రీడల పట్ల ప్రజల, ప్రభుత్వాల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తే తప్పకుండా సాధ్యమేనని చెప్పుకోవచ్చును. ముందుగా ప్రభుత్వాలు ప్రాధమిక విద్యాభ్యాసం స్థాయి నుండే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో తప్పనిసరిగా రోజూ క్లాసు పాటాలతో బాటు అన్ని రకాల క్రీడలలో పిల్లలకు శిక్షణ తరగతులు ఉండేలా చట్టాలు చేసి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అది డిగ్రీ స్థాయి వరకు తప్పనిసరి అంశంగా అమలు చేయాలి. అంతేకాక మిగిలిన సబ్జెక్టులకు ఏవిధంగా పరీక్షలు నిర్వహించి ఉతీర్ణత నిర్ణయిస్తారో అదేవిధంగా వివిధ క్రీడలలో కూడా పరీక్షలు నిర్వహించాలి. ప్రాధమిక స్థాయి డిగ్రీ వరకు సాగే సుదీర్గ విద్యా ప్రస్థానంలో అనేకమంది మెరికలలాంటి క్రీడాకారులను తయారుచేసుకోవచ్చును. ఈవిధంగా ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, తల్లి తండ్రులు అందరూ క్రీడలను ప్రోత్సహించినట్లయితే, వారికి శిక్షణ, క్రీడా సంబంధిత వస్తువుల తయారీ వంటి వాటి ద్వారా దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా సృష్టించుకోవచ్చును.   మన రాష్ట్రంలో దేశంలో క్రీడల కోసం చాలా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ అవన్నీ దేశానికి మెడల్స్ తేగల క్రీడాకారులు తయారుచేయకపోగా రాజకీయనాయకులకి ఉపాధి కేంద్రాలుగా మారిపోయాయి. సమాజంలో ఆకస్మికంగా మార్పులు తేవడం సాధ్యం కాదు గనుక, ప్రభుత్వాలే చొరవ తీసుకొని ప్రాధమిక విద్యా స్థాయి నుండి పిల్లలకు క్రీడలు తప్పనిసరి చేసి, క్రీడల అభివృద్ధికి ఇప్పటి నుండి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయితే, మరో రెండు దశాబ్దాల తరువాత నేటి బాలలు మేటి క్రీడాకారులుగా తయారయ్యి, దేశానికి మెడల్స్ తెచ్చే అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... బీ కేర్‌ఫుల్!

  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కరెక్ట్... ఈ రెండు రాష్ట్రాలు పోటీ పడటం కరెక్ట్.. ఒక రాష్ట్రాన్ని మించిపోవాలని మరో రాష్ట్రం ప్రయత్నించడమూ కరెక్టే! అయితే ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలూ జాగ్రత్తగా వుండాల్సిన అంశం ఒకటుంది! అదేమిటో చెప్పేముందు, పాతకాలం కథను ఓసారి గుర్తు చేసుకోవాలి. ఒక రొట్టె ముక్క కోసం రెండు పిల్లలు గొడవ పడ్డాయట. ఆ రెండు పిల్లుల మధ్యలో చేరిన ఓ కోతిగారు ఎంచక్కా ఆ రెండు పిల్లులకీ జెల్ల కొట్టి ఆ రొట్టెను తాను తినేసిందట. ఈ కథతో పోల్చితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చెరో పిల్లి అనుకుంటే, మరి ఆ కోతి కేరెక్టర్ ఎవరిది? ఎవరిదో కాదు... కార్పొరేట్ సంస్థలది! అవును, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వున్న పోటీని క్యాష్ చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు పథకరచన చేస్తున్నాయి. పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలుస్తున్నాయి. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వుందని ఇద్దరికీ చెబుతున్నాయి. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే మాకు ఎలాంటి సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తారని ఇద్దర్నీ అడుగుతున్నాయి. సహజంగా సదరు కార్పొరేట్ సంస్థలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు స్థాపించాలని రెండు రాష్ట్రాలు పోటీ పడటం, ఒకరిని మించి మరొకరు రాయితీలు ఇవ్వాలనుకోవడం జరుగుతుంది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య పోటీని క్రియేట్ చేసి తాము లాభం పొందాలని, తమకు ఎవరు ఎక్కువ సదుపాయాలు, రాయితీలు కల్పిస్తే ఆ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టాలన్నది కార్పొరేట్ సంస్థల ఎత్తుగడగా కనిపిస్తోంది. మొత్తంమీద ఈ అంశంలో నష్టపోయేది రెండు రాష్ట్రాలే తప్ప కార్పొరేట్ సంస్థలు కాదు. అందువల్ల కార్పొరేట్ సంస్థల వ్యూహంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నష్టపోకూడదు. అనారోగ్యకరమైన పోటీతో మొదటికే మోసం తెచ్చుకోకూడదు.. అందుకే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలూ.. బీ కేర్‌ఫుల్!

తెలంగాణ టీడీపీ వెరీగుడ్!

  ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా వున్న సందర్భంలో తెలంగాణలో మిగతా రాజకీయ పార్టీలన్నీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశాయి. తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని అస్సలు లేకుండా చేయాలని పథకాలు రచించాయి. తెలంగాణ టీడీపీ నాయకుల మీద ఆకర్ష మంత్రాన్ని ప్రయోగించాయి. అలాంటి సందర్భంలో తెలంగాణ టీడీపీలోని కీలక నాయకులు చంద్రబాబుకు అండగా నిలిచారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, ఇటు తెలంగాణలో టీడీపీ గౌరవప్రదమైన స్థానాలు పొందడానికి సహకరించారు. ఇతర పార్టీలు... ముఖ్యంగా టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నాయకులను తన పార్టీలోకి లాక్కోవాలని తీవ్రంగా ప్రయత్నించినా ఎవరూ ఆ మాయలో పడకుండా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. ఎర్రబెల్లి దయాకరరెడ్డి లాంటి నాయకుడైతే రాజకీయాల్లోంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుని బతుకుతాను తప్ప తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకులు, కార్యకర్తలున్న పార్టీ కాబట్టే తెలుగుదేశం పార్టీ రాజకీయ రంగంలో గౌరవాన్ని పొందుతోంది. తాజాగా మరోసారి తెలంగాణ తెలుగుదేశం మీద ‘ఆకర్ష’ మంత్రాన్ని ప్రయోగించే ప్రయత్నాలు జరిగాయి. తలసాని, రేవంత్ రెడ్డి లాంటి పలువురు తెలుగుదేశం నాయకులు టీఆర్ఎస్‌‌లో చేరబోతున్నారని పుకార్లు క్రియేట్ అయ్యాయి. ఇలాంటి సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చాలా ఘాటైన కామెంట్ చేసి పుకార్లను తిప్పికొట్టారు. కేసీఆర్ తన కాళ్ళు పట్టుకుని బతిమాలినా టీఆర్ఎస్‌లో చేరబోనని స్పష్టం చేశారు. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్‌లో చేరబోతున్నారని, తలసాని ఇంటికి కేసీఆర్ వెళ్ళబోతున్నారని ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఇప్పటి వరకు తలసాని ఇంటికి కేసీఆర్ వెళ్ళింది లేదు. తలసాని టీఆర్ఎస్ వైపు చూసిందీ లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలసలు వుంటాయని వచ్చిన వార్తలన్నీ కేవలం పుకార్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పుకార్లను సమర్థంగా తిప్పికొట్టిన తెలంగాణ టీడీపీ వెరీగుడ్ అంటున్నారు.

కేంద్రంతో ఘర్షణ వైఖరి తెలంగాణకు మంచిది కాదు!

  తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు పూర్తి కావొస్తోంది. ఈ 45 రోజుల కాలంలో కేసీఆర్ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం తప్ప చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రతిపక్షంలో వుంది కాబట్టి, అధికారం వస్తుందని కలలు కని ఫెయిలయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ తరహా విమర్శలు చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఈ విమర్శలను లైట్‌గా తీసుకోవచ్చు. అయితే ఎలాంటి రాజకీయ ఎజెండా లేని వర్గాల నుంచి కేసీఆర్ ప్రభుత్వం విషయంలో ఒక బలమైన విమర్శ వినిపిస్తోంది. అది కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు విషయంలో వినిపిస్తోంది. కేసీఆర్ అధికారాన్ని చేపట్టిన దగ్గర్నుంచి కేంద్ర ప్రభుత్వం ఘర్షణాత్మక వైఖరినే అనుసరిస్తూ వస్తున్నారు. పోలవరం విషయంలో అయినా, హైదరాబాద్‌లో ఉమ్మడి పోలీసింగ్ విధానం విషయంలో అయినా, మరికొన్ని ఇతర అంశాల విషయంలో అయినా కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకునే విధంగానే వ్యవహరించింది. ఒకవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో చాలా సయోధ్యగా వ్యవహరిస్తోంది. కొన్ని సందర్భాలలో కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి అనుకూలంగా వ్యవహరించకపోయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఆ సందర్భాలలో కూడా కేంద్రంతో స్నేహపూర్వకంగానే వ్యవహరించింది. మరి కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం ద్వారా కేసీఆర్‌కి, టీఆర్ఎస్‌కి పెద్ద నష్టం వుండొచ్చు.. వుండకపోవచ్చు. అయితే భవిష్యత్తులో తెలంగాణకు మాత్రం నష్టం జరిగే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరితో కాకుండా సామరస్య పూర్వక వైఖరిని అనుసరించడం వల్ల తెలంగాణకు మేలు జరుగుంది. అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో తన వ్యవహారశైలిని మార్చుకుంటే తెలంగాణకు మేలు చేసినవారు అవుతారని రాజకీయ పరిశీలకులు సూచిస్తున్నారు.

రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లేనా?

  రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లేనా? కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీలకు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల దుర్వినియోగం కేసులో ఆదాయపు శాఖ నోటీసులు జారీచేసింది. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పేరు కూడా అనేక భూ కుంభకోణాలలో వినిపించింది. అయితే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉండటం వలన ఈ కేసులేవీ వారిని ఏమీ చేయలేకపోయాయి. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ అవినీతిపై ఉక్కుపాదం మోపేందుకు సిద్దమవడంతో అవినీతిపరులకు గుండెల్లో గుబులు మొదలయింది.   కేంద్రంలో యూపీయే, హర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే అశోక్ ఖిమ్కా అనే ఐఏయస్ అధికారి రాబర్ట్ వాద్రాకు చెందిన స్కై లైట్ హాస్పిటాలిటి మరియు డీయల్.యఫ్. సంస్థల మధ్య రూ.58కోట్లు విలువ చేసే భూమార్పిడి వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించి దానిని రద్దు చేయడమే కాక దర్యాప్తుకు కూడా ఆదేశించారు. దానితో ఆగ్రహం చెందిన హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా ఆయనను బదిలీ చేయడమే కాకుండా ముగ్గురు ఐఏయస్ అధికారులతో కూడిన ఒక కమిటినీ కూడా వేసి క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ ఆయనపై చర్యలకు సిద్దమయింది. అయితే నిజాయితీపరుడైన తన 22సం.లలో 44సార్లు బదిలీలు అయ్యారు. కనుక హర్యాన ప్రభుత్వ బెదిరింపులకి భయపడకుండా, హర్యానాలో జరిగిన, జరుగుతున్న అనేక కుంభకోణాలను పేర్కొంటూ ప్రభుత్వానికి 105 పేజీలతో కూడిన ఒక లేఖ వ్రాసారు. ఆ తరువాత ఆయన తనను కేంద్రానికి బదిలీ చేయవలసిందిగా ఏప్రిల్ నెలలో దరఖాస్తు చేసుకొన్నారు. కానీ అప్పటికి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ఆయనను కేంద్రానికి రప్పిస్తే పక్కలో పామును పెట్టుకోన్నట్లే అవుతుందని ఆయన విన్నపాన్ని పట్టించుకోలేదు.   కానీ ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాలు మారి నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టడంతో, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు వ్యతిరేఖంగా పోరాడిన అశోక్ ఖిమ్కాను త్వరలోనే కేంద్ర సర్వీసులకు బదిలీ చేసేందుకు మోడీ అంగీకరించినట్లు ఉన్నతాధికారులు చెపుతున్నారు. బహుశః మరొకటి రెండు వారాల్లో అశోక్ ఖిమ్కా కేంద్రానికి బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాబర్ట్ వాద్రాకు కూడా కష్టకాలం మొదలయినట్లే భావించవచ్చును. హర్యాన ముఖ్యమంత్రి నిజాయితీపరుడైన అశోక్ ఖిమ్కాను వేదించి శిక్షించబోతే, ఆయనకు మోడీ ప్రభుత్వం పదోన్నతి కల్పించి గౌరవించడం చాలా హర్షణీయం.

సత్యం రామలింగ రాజుపై రూ. 1849 కోట్ల జరిమానా

    ఒకప్పుడు దేశానికే గర్వకారణంగా నిలచిన సత్యం కంప్యూటర్స్ సంస్థ, భారీ లాభాలు ఆర్జిస్తూ భారీ బ్యాంకు నిలువలున్నట్లు చూపిస్తూ షేర్ మార్కెట్లను శాసించింది. దేశవిదేశాలకు తన వ్యాపార కార్యకలాపాలు విస్తరించింది. దేశంలో రాష్ట్రంలో కూడా వివిధ వ్యాపార రంగాలలోకి ప్రవేశించింది. కానీ, భారీ నష్టాలలలో ఉన్న కంపెనీని ఇక ఎంతో కాలం ఈ భూటకపు పునాదులపై నిలబెట్టలేమని గ్రహించిన రామలింగ రాజు జనవరి 7, 2009న స్వయంగా తమ కంపెనీ పాల్పడిన అక్రమాలను తెలియజేస్తూ స్టాక్ ఎక్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ)కి ఒక లేఖ వ్రాయడం ఆనాడు ఒక పెను సంచలనం సృష్టించింది. వేల కోట్ల ఆర్ధిక నేరానికి పాల్పడినందుకు గాను ఆయన, ఆయన సహచరులు దాదాపు మూడేళ్ళపాటు జైలు జీవితం గడిపి కొన్ని నెలల క్రితమే బయటకి వచ్చారు. మళ్ళీ ఈరోజు వారికి అంతకంటే భయంకరమయిన షాకు తగలింది.   దాదాపు ఐదేళ్ళ విచారణ చేసిన సెబీ, తీవ్ర ఆర్ధిక నేరాలకు పాల్పడిన రామలింగ రాజు, ఆయన సోదరుడు బీ.రామరాజు (సత్యం-మాజీ మేనేజింగ్ డైరెక్టర్), వదలమని శ్రీనివాస్ (సత్యం మాజీ సి.యఫ్.ఓ.), జీ.రామకృష్ణ (సత్యం-మాజీ వైస్ ప్రెసిడెంట్) మరియు వీ.యస్. ప్రభాకర్ గుప్తా (సత్యం-మాజీ హెడ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్)లకు ఏకంగా రూ. 1849 కోట్ల జరిమానా విదించింది. వారు ఐదుగురు ఆ మొత్తాన్ని కేవలం 45రోజులలో సెబీ ఖాతాలో జామా చేయాలని ఆదేశించింది. అంతే కాక ఆ మొత్తానికి ఈ కుంభకోణం బయటపెట్టిన రోజు నుండి అంటే జనవరి 7, 2009 నుండి నేటి వరకు ఏడాదికి 12శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశించింది. వారిని 14 ఏళ్ల పాటు మార్కెట్ కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధం కూడా విధించింది.   రామలింగ రాజే స్వయంగా ఈ కుంభకోణం బయటపెట్టిన తరువాత, ప్రభుత్వం ఆయన కంపెనీలో షేర్లు కొన్న వారి ప్రయోజనాలను కాపాడేందుకు సత్యం కంపెనీని స్వాధీనం చేసుకొని, దానిని టెక్ మహీంద్ర కంపెనీకి అమ్మివేసింది. పూర్తిగా దివాళా తీసిన రామలింగరాజు, మిగిలిన నలుగురు ఇంత భారీ జరిమానాను కేవలం 45 రోజుఅలలో వడ్డీతో సహా చెల్లించడం అసంభవం కనుక వారు ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్లకతప్పదు. ఇటువంటి ఆర్ధిక నేరాలు పాల్పడిన వారు మన రాష్ట్రంలో దేశంలో చాలా మందే మన కాళ్ళ ముందు దర్జాగా తిరుగుతున్నారు. విదేశాలలో నల్లదనం ఎంత మూలుగుతోందో అంతకు రెట్టింపు ధనం ఇటువంటి అవినీతిపరులనుండి రాబట్టగలిగితే దేశ, రాష్ట్ర ఆర్ధికలోటును, సమస్యలను అధిగమించవచ్చును.

రాజధాని అక్కడే నిర్మించనున్నారా?

  రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మంత్రులు ప్రకటించారు. కానీ ఆ తరువాత ఏమయిందో తెలియదు కానీ ఈ విషయంపై చంద్రబాబుతో సహా అందరూ మౌనం పాటించడం మొదలుపెట్టారు.   రాజధాని ఎంపిక కోసం వేసిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు చంద్రబాబును కలిసిన తరువాత నుండే ఈ మార్పు వచ్చింది. అంటే కమిటీ సభ్యులు అక్కడ రాజధాని నిర్మాణం వల్ల ఏమయినా పెద్ద ఇబ్బందులు వస్తాయని చెప్పారా? లేక ఇంతకంటే మంచి ప్రాంతం ఆయనకు సూచించారా? లేక ప్రస్తుతం కృష్ణా జలాల కోసం పడుతున్న తిప్పలు చూసి, అక్కడ రాజధాని నిర్మిస్తే రాజధానికి అవసరమయిన 12 టీ.యం.సి.ల నీళ్ళు లభ్యమవ్వవనే ఆలోచనతో వెనకడుగు వేస్తున్నారా? లేక కేంద్రం నిధులు మంజూరు చేయకుండా పనులు మొదలు పెట్టడం మంచిది కాదని ఆగుతున్నారా? ఆ కారణంగా ఆలస్యమవుతుంటే విజయవాడ-గుంటూరు మధ్య భూముల ధరలకు రెక్కలు వస్తున్నందున వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా? లేక ఇతరత్రా వేరే ఏవయినా కారణాలు ఉన్నాయా? అనే సంగతి ఎవరికీ తెలియక పోవడంతో ప్రజలలో ముఖ్యంగా విజయవాడ-గుంటూరు ప్రాంతాల ప్రజలలో రాజధాని విషయంపై చాల గందరగోళం నెలకొని ఉంది. ఇటీవల విజయవాడలో ఏపీయన్జీవోలు నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తప్ప అక్కడే రాజధాని నిర్మిస్తానని ఇదివరకులా ఖచ్చితమయిన హామీ ఇవ్వకపోవడం గమనార్హం.   అయితే ఈ నిశబ్దాన్ని బ్రద్దలు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ విజయవాడ-గుంటూరు మధ్యనే కొత్త రాజధాని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చూచాయగా తెలిపారు. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాల చుట్టూ దాదాపు 180కిలోమీటర్ల పరిధిలో ఒక అవుటర్ రింగు రోడ్డు నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ మోడల్ రాజధాని నిర్మాణానికయితే దాదాపు రూ.1.5 లక్షల కోట్లు, సాధారణ రాజధాని నిర్మాణానికయితే రూ.90 వేల కోట్లు అవసరమవుతాయని తాము అంచనా వేసినట్లు తెలిపారు. రాగల వంద సం.లలో రాజధాని ప్రాంతంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని రాజధానిని నిర్మించాలనుకొంటున్నామని, అందుకు లోతుగా అధ్యయనం చేయవలసి ఉన్నందున ఒక బృందాన్ని త్వరలోనే సింగపూరు పంపబోతున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మించే ప్రాంతం, దాని పరిధి, దాని రూపురేఖలు, అందుకు అయ్యే ఖర్చు వగైరా వివరాలన్నీ తెలియడానికి కనీసం మరో ఆరు నెలలు పట్టవచ్చని ఆయన తెలిపారు. అంటే మరో ఆరునెలల వరకు రాజధాని నిర్మాణం పనులు మొదలుకాక పోవచ్చని సూచన ప్రాయంగా చెప్పినట్లే భావించవచ్చును.   రాజధాని నిర్మాణం కోసం రూ.90 నుండి రూ.1.50 లక్షల కోట్లు అవసరమని ప్రాధమికంగా అంచనా వేసారు గనుక అందులో ఐదో లేక పదో వంతయినా సొమ్ము కేంద్రం విడుదల చేయనిదే పనులు మొదలుపెట్టడం మంచిదికాదనే ఉద్దేశ్యంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏమయినప్పటికీ ఇందులో రాష్ట్రప్రభుత్వం తప్పు, జాప్యం లేదు గనుక, ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఒక స్పష్టమయిన ప్రకటన చేస్తే బాగుంటుంది.

వీళ్ళు నాయకులా.. ఇంజనీర్లా?

  దేశంలోని సివిల్ ఇంజనీర్లు, డ్యామ్‌ల నిర్మాణ నిపుణులు కూడబలుక్కుని అర్జెంటుగా రాజకీయ నాయకుల దగ్గరకి వచ్చేసి, వాళ్ళదగ్గర ఇంజనీరింగ్ పాఠాలు నేర్చుకుంటే మంచింది. ఎందుకంటే ఇంజనీర్లకే పాఠాలు నేర్పించే స్థాయికి మన రాజకీయ నాయకులు ఎదిగిపోయారు. బహుళార్థక సాధక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును దశాబ్దాలుగా కార్యరూపం దాల్చకుండా చేసిన రాజకీయ నాయకులు ఇప్పుడు కీలక దశలో కూడా, పోలవరం కల నిజమవుతున్న శుభవేళ కూడా మోకాలు అడ్డు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇలాంటి నాయకుల కుట్రలన్నిటినీ దాటుకుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని అవరోధాలూ తొలగిపోయాయి. పోలవరం ముంపు గ్రామాల బిల్లుకు సంబంధించిన చర్చ రాజ్యసభలో జరుగుతున్న వేళ పలువురు రాజకీయ నాయకులు మాట్లాడిన మాటలు వింటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు పోలవరం ప్రాజెక్టు వల్ల గిరిజనులకు అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెట్టారు. తమకు మాత్రమే గిరిజనుల మీద ప్రేమ వున్నట్టు, ఆ ప్రేమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేనట్టు తెగ బాధపడిపోయారు. ఈ గోల ఇలా వుంటే, పోలవరం ప్రాజెక్టును అడ్డుకోడానికి పాత తుప్పు పట్టిపోయిన ఆయుధాన్ని కూడా బయటకి తీశారు. అది పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలి. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులతోపాటు కమ్యూనిస్టులు కూడా పోలవరం డిజైన్‌ని మార్చాలని, ఇప్పుడున్న డిజైన్ మంచిది కాదని నోటికొచ్చినట్టు చెప్పేశారు. అంటే ఈ రాజకీయ నాయకుల ఉద్దేశమేంటి? పోలవరం ప్రాజెక్టు డిజైన్‌కి రూపకల్పన చేసిన ఇంజనీర్లకు ఏమీ తెలియదనా? ఆ ఇంజనీర్లందరూ ఇంజనీరింగ్ పాఠాలు ఈ రాజకీయ నాయకుల దగ్గర్నుంచి నేర్చుకోవాలనా? ఆంధ్రప్రదేశ్‌కి ఏదైనా మేలు జరిగితే తట్టుకోలేక ఏవేవో కాకమ్మ కథలు చెబుతూ జనాన్ని నమ్మించడానికి ప్రయత్నించడం ఇలాంటి రాజకీయ నాయకులు ఇప్పటికైనా మానుకోవాలి.

రామ్‌గోపాల్ వర్మ.. ఏమిటీ ఖర్మ?

  అలుగుటయే ఎరుంగని అజాత శత్రువు అలిగిన నాడు... అని ఓ పద్యంలో చెప్పినట్టుగా అసలు ఫీలింగ్స్ అనేవే లేని, బాధపడటం అనేది బాడీలోనే లేని రామ్‌ గోపాల్ వర్మ కూడా ఈమధ్య తెగ ఫీలైపోయాడు. ఓ తెగ బాధపడిపోయాడు. ఇంతకీ ఆయన బాధ ఎవరిమీద అంటే, తాను తీసే తలాతోకా లేని సినిమాలను కష్టపడి చూసి రివ్యూలు రాసేవాళ్ళమీద. ఇంతకాలం ఆయన తీసే సినిమాలు ఎంత చెత్తగా వున్నాయని రాసినా లైట్‌గా తీసుకునే రాము ఇప్పుడు తన మీద, తన సినిమాల మీద వస్తున్న విమర్శలను తట్టుకోలేని స్థితికి చేరుకున్నట్టున్నాడు. ఎందుకంటే, వయసు మీదపడుతోంది కదా! వర్మ ఈ మధ్య ‘ఐస్ క్రీమ్’ అనే పరమ వీర బీభత్స కళాఖండాన్ని తీశాడు. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్లలో నుంచి బతుకుజీవుడా అనుకుంటూ బయటకి వస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి కళాఖండాన్ని చూసిన సినీ విశ్లేషకులు తమ రివ్యూలలో ఈ సినిమాని విమర్శించి ఖండఖండాలు చేశారు. ఇలాంటి విమర్శలు కూడా పబ్లిసిటీగా భావించే వర్మ ఆయన బుర్రలో ఏ వర్మ్ పుట్టిందోగానీ సడెన్‌గా రియాక్ట్ అయ్యారు. తన సినిమాని విమర్శిస్తూ రివ్యూ చేసిన వాళ్ళని ‘కుక్క’లతో పోలుస్తూ ఫేస్‌బుక్‌లో అచ్చ తెలుగులో మేటర్ పోస్టు చేశాడు. ఆ మేటర్లో వర్మ వాడిన భాష, ఆయన వ్యక్తం చేసిన ఆవేదన, తనది ఆవేదన కాదు చిరాకు అని వర్మ ఇచ్చిన క్లారిఫికేషన్, మేటర్ నిండా బోలెడంత వర్మ అహంకారం.. ఇవన్నీ సోషల్ మీడియాలో పెద్ద సంచలనమే సృష్టించాయి. ఆ బహిరంగ లేఖలో వర్మ వ్యక్తం చేసిన అభిప్రాయాలకు మద్దతు పలికిన వారు వన్ పర్సెంట్ వుంటే, మిగతా 99 పర్సెంట్ వర్శని తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. తన సినిమాల మీద వచ్చిన రివ్యూలని లైట్‌గా తీసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఫేస్ బుక్‌లో బహిరంగ లేఖ రాయడం వల్ల వర్మని బోలెడంత మంది తీవ్రంగా విమర్శిస్తున్నారు. దాంతో ఇప్పుడు వర్మ పరిస్థితి అడిగి మరీ తిట్టించుకున్నట్టుగా తయారైంది. వర్మకి ఎందుకీ ఖర్మ?

జగన్‌కి కేసీఆర్ జలక్!

  టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇప్పుడు అందరికీ జలక్‌లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన దృష్టి తెలంగాణలో నామ్‌కే వాస్తేగా వున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద పడింది. అందుకే ఆయన ‘‘జలక్ దిఖలాజా... జలక్ దిఖలాజా.. ఏక్‌బార్ ఆజా ఆజా’’ అన్నట్టుగా ఆ పార్టీ నాయకులను టీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తూ తెలంగాణలో వైసీపీ ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్ చేయాలన్న ఆలోచనలో వున్నారు. అసలే తెలంగాణలో టోటల్‌గా ఆరిపోయిన జగన్ పార్టీకి ఈరకంగా కూడా జలక్ ఇవ్వడానికి టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. రేపో మాపో తెలంగాణలోని వైసీపీ ప్రజా ప్రతినిధులందరూ కట్టకట్టుకుని టీఆర్ఎస్‌లో చేరిపోయే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం జగన్‌కి ఊహించని జలక్‌ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పాపం జగన్ భాయ్ మొదటి నుంచీ టీఆర్ఎస్ అన్నా, కేసీఆర్ అన్నా వల్లమాలిన ప్రేమను ప్రదర్శిస్తూనే వున్నారు. కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్ర విభజన జరిగిపోతే మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో అయినా అధికారంలోకి రావచ్చని కలలు కన్నారు. అందుకే రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చారు. కేసీఆర్‌కి జై కొట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని విమర్శించడంతోనే దినచర్యను ప్రారంభించే జగన్ గారు రాష్ట్ర విభజనకి కారకుడైన కేసీఆర్‌ని ఏనాడూ పల్లెత్తు మాట కూడా అన్న దాఖలాలు లేవు. కేసీఆర్ కూడా ఎప్పుడైనా చంద్రబాబునే టార్గెట్ చేసేవారు తప్ప జగన్‌ని ఒక్క మాట కూడా అనేవారు కాదు. కేసీఆర్ ఒక దశలో జగన్ మీద ఎంత అభిమానం ప్రదర్శించారంటే, తెలంగాణ‌లో టీఆర్ఎస్, సీమాంధ్రలో జగన్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. అప్పట్లో తనమీద అంత ప్రేమ ప్రదర్శించిన కేసీఆర్ ఇప్పుడు సడన్‌గా తెలంగాణ‌లో వైసీపీ ఉనికికే టెండర్ పెట్టే ఆలోచనలు చేస్తూ వుండటం జగన్‌కి కోలుకోలేని షాక్ అయ్యిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేసీఆర్ తనకు ఇలాంటి షాక్ ఇస్తారని జగన్ కలలో కూడా ఊహించి వుండరని అంటున్నారు.

తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిపోక తప్పదా?

   స్వర్గీయ యన్టీఆర్ హయంలో తెలుగు చిత్ర పరిశ్రమను మద్రాసు నుండి హైదరాబాదుకి రప్పించడం కోసం సినీ ప్రముఖుకు కొందరికి ప్రభుత్వం ఉదారంగా భూములు ఇచ్చి ప్రోత్సహించింది. వారందరూ తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదులో స్థిరంగా నిలద్రోక్కుకొనేందుకు చాలా కృషిచేసిన మాట ఎవరూ కాదనలేరు. వాటిలో చాలా మంది సినీ ప్రముఖులు స్టూడియోలు, రికార్డింగ్ ధియేటర్లు వంటివి నెలకొల్పినప్పటికీ, కొందరు వాటిలో మల్టీ ప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్సులు వంటివి నెలకొల్పడం, మరి కొందరు ప్రముఖులు తమ స్టూడియోలకు కేటాయించిన భూములలో భవనాలు నిర్మించి వ్యాపార సంస్థలకు లీజుకు ఇవ్వడం, తమ భూములను ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడంవంటి పనుల వలన సర్వత్రా విమర్శలు వచ్చాయి. కానీ వారు రాష్ట్ర ప్రభుత్వాలతో, వాటిని నడిపే రాజకీయ నాయకులతో సత్సంబంధాల వల్ల వారు ఆడించే ఆట, పాడిందే పాటగా ఇన్నాళ్ళు నడిచింది. అయితే కాలం ఎల్లపుడు ఒక్కలాగే సాగదని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి.   సినీ పరిశ్రమలో చాలా మంది ఆంద్ర ప్రాంతానికి చెందినవారే అయి ఉండటంతో సహజంగానే వారు తెలంగాణకు వ్యతిరేకులనే భావన చాలా మందిలో ఉంది. పవన్ కళ్యాణ్ వంటి నటులు ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో తెరాస పార్టీని తీవ్రంగా విమర్శించడం ఆ వాదనలకు బలం చేకూర్చినట్లయింది. అదిగాక చిత్ర పరిశ్రమ చాలా కాలంగా కొందరు ఆంద్ర నిర్మాతల చేతిలో ఉండిపోవడంతో, పరిశ్రమలో తెలంగాణాకు చెందినవారు తమకు చాలా అన్యాయం జరుగుతోందనే అభిప్రాయంతో ఉన్నారు.   కొందరు వ్యక్తులు చేసిన తప్పులకు, దానివల్ల ఏర్పడిన వ్యతిరేఖత కారణంగా ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం కూడా ఇటువంటి అభిప్రాయాలే కలిగి ఉండటంతో అక్రమాలకు పాల్పడిన సినీ ప్రముఖులకు కేటాయించిన భూములను వెనక్కు తీసుకోవడం మొదలుపెట్టింది. అంతేగాక ప్రభుత్వ భూములలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని నిశ్చయించుకొంది. ఆ లిస్టులో చాలా మంది సినీ ప్రముఖులే ఉన్నారు. గనుక వారందరూ ఇప్పుడు తీవ్ర అభద్రతా భావంతో ఉండటం సహజమే.   అయితే ఇప్పటికిప్పుడు హైదరాబాదు నుండి సినీ పరిశ్రమను ఏ వైజాగుకో తరలించడం సాధ్యమయ్యే పనికాదు గనుక తీవ్ర అభద్రతాభావంతో ఉన్న సినీ ప్రముఖులు వీలయినంత త్వరగానే పరిశ్రమను ఆంధ్రాకు తరలించే అవకాశం ఉంది. వారు సినీ పరిశ్రమకు ఎనలేని సేవలు అందించినప్పటికీ, కొన్ని స్వయంకృతాపరాధాల వల్లనే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పదు. వాటికి తోడూ రాష్ట్ర విభజన వల్ల సినీ పరిశ్రమలో చీలికలు ఏర్పడటం, ప్రభుత్వం కూడా తెలంగాణా సినీ పరిశ్రమను, కళాకారులను ప్రోత్సహించాలని భావించడం వంటి అనేక కారణాలు తెలుగు సినీపరిశ్రమ ఆంధ్రాకు తరలిపోయేందుకు అవకాశం కల్పిస్తోంది.   బహుశః రానున్న ఒకటి రెండేళ్ళలోనే తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రాకు పూర్తిగా తరలివచ్చేసినా ఆశ్చర్యం లేదు. కానీ వారు దురాశకు పోయి మళ్ళీ అవే తప్పులు పునరావృతం చేయకుండా ఇప్పుడయినా జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇటువంటి దుస్థితి కలగదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిరావడానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూనే, ఎవరూ నిబంధనలు అతిక్రమించకుండా కటినంగా వ్యవహరించడం చాలా అవసరం.

మీ మొసలి కన్నీరు ఆపండయ్యా!

  పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపకూడదు, అసలు పోలవరం ప్రాజెక్టే కట్టకూడదు.. ఇంకా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు కట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదు.... ఇది పార్టీలకి అతీతంగా తెలంగాణ రాజకీయ నాయకులందరికీ వున్న ఏకాభిప్రాయం. అందుకే పోలవరం ప్రాజెక్టుకు అందరూ యథాశక్తి అడ్డుపడుతున్నారు. చివరికి పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే, పోలవరం ప్రాజెక్టును ఇస్తున్నామనే సాకును చూపించి హైదరాబాద్‌ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా చేసిన కాంగ్రెస్ నాయకులు కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు మోకాలు అడ్డు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాల బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఇప్పుడు రాజ్యసభ ముంగిట వుంది. ఈ సందర్భంగా రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాట వింటే ముసలి కన్నీరు అనే మాటకి అర్థం క్లియర్‌గా తెలుస్తుంది. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందభాస్కర్, వి.హనుమంతరావు రాజ్యసభలో పోలవరం ప్రాజెక్టు కట్టడం ఘోరం, నేరం అన్నట్టుగా మాట్లాడారు. ఇలాంటి మాటలు మామూలే అని సరిపెట్టుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరూ మొసలి కన్నీరు కారుస్తూ మాట్లాడిన మాటలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కడుపులో మండేట్టు చేస్తున్నాయి. రాపోలు ఆనందభాస్కర్ గారు ఏమంటారంటే, పోలవరం ప్రాజెక్టు డిజైన్ అర్జెంటుగా మార్చేయాలట. లేకపోతే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక రాజమండ్రి నగరం మునిగిపోతుందట. అలాగే మరో కాంగ్రెస్ నాయకుడు వి.హనుమంతరావు గారు ఏమంటారంటే, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చకుండా కడితే అమలాపురం మునిగిపోతుందట. సీమాంధ్ర మీద విషం కక్కే ఈ ఇద్దరు నాయకులు రాజమండ్రి, అమలాపురం మీద చూపిస్తున్న ఈ అతి జాలిని మొసలి కన్నీరు అనకుండా ఇంకేమనాలి? అయ్యా పెద్దమనుషులూ.. ఇప్పటికైనా మీ మొసలి కన్నీరు ఆపండయ్యా.. లేకపోతే మీ కన్నీటితోనే పోలవరం ప్రాజెక్టు నిండిపోయి రాజమండ్రి, అమలాపురం మునిగిపోతాయి.

జగన్ గూటికి బొత్స?

  కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన పీసీసీ మాజీ చీఫ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణని ఇప్పుడు పట్టించుకునేవారెవరూ లేకుండా పోయారు. చీపురుపల్లి ప్రజలు కూడా ఆయన్ని చీపురుతో ఊడ్చేయడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి పూలు అమ్మినచోట కట్టెలు అమ్మినట్టుగా వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు బొత్స కూడా ఒక కారణం అని ప్రజలు భావిస్తున్నారు. అందువల్ల ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి గౌరవం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుని పోయింది. భవిష్యత్తులో కూడా కోలుకునే అవకాశం కనిపించడం లేదు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో వుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అని భావించిన బొత్స సత్యనారాయణకు టీడీపీలో చేరే అవకాశం ఎలాగూ లేకపోవడంతో బీజేపీని ఆశ్రయించే ప్రయత్నం చేశారు. అయితే అన్ని విషయాలలోనూ అయ్యగారికున్న మంచి పేరు బాగా తెలుసుకున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఆయన్ని పార్టీలో చేర్చుకోలేదు. దాంతో కొంతకాలం స్తబ్దుగా వున్న బొత్స వారు ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. వైఎస్సార్ బతికి వుండగా ఆయనకి సన్నిహితంగా వున్న బొత్స, ఆయన చనిపోయిన కొంతకాలానికే వైఎస్సార్ మీద, ఆయన పుత్రరత్నం జగన్ మీద కామెంట్లు చేశారు. ఇప్పుడు కాలం కలసిరాకపోవడంతో జగన్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే గత కొన్ని రోజులుగా జగన్‌కి అనుకూలంగా వుండేలా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ పార్టీకి కూడా బొత్స లాంటి నోరున్న నాయకుడి అవసరం వుంది. ఈ నేపథ్యంతో త్వరలో బొత్స వైసీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం నీటి బుడగా? ఎలా?

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మెజారిటీతో తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వాన్ని స్థాపించింది. ఆ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తోందన్న సంగతి పక్కన పెడితే, అన్నీ సరిగ్గా జరిగితే అయిదేళ్ళు ఆ ప్రభుత్వం అధికారంలో వుండే అవకాశాలు వున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చీటికి మాటికి కేసీఆర్ ప్రభుత్వం అయిదేళ్ళుండే ప్రభుత్వం కాదని స్టేట్‌మెంట్లు ఇస్తూ వుండటం తెలంగాణ ప్రజల్ని అయోమయానికి గురిచేస్తోంది. తెలంగాణ ప్రజలు కేసీఆర్ తమకు ముఖ్యమంత్రి కావాలని తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు నానా హడావిడీ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు నిర్దాక్షిణ్యంగా ఛీ కొట్టారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ప్రభుత్వం మీద అపశకునపు మాటలు మాట్లాడుతూ వుండటం తెలంగాణ ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. మొన్నామధ్య గురుకుల్ ట్రస్ట్ భూముల్లో ఇళ్లను కూల్చినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రభుత్వం త్వరలోనే కూలిపోయేట్టుందని కామెంట్లు చేశారు. తాజాగా కేసీఆర్ తాను ఇచ్చిన హామీలపై మాట తప్పుతున్నారని, అందువల్ల కేసీఆర్ ప్రభుత్వం నీటి బుడగలాంటిదని కాంగ్రెస్ నాయకుడు, మొన్నీమధ్య ఎన్నికలలో ఓడిపోయిన గండ్ర వెంకట రమణారెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ ప్రభుత్వం కూలిపోతుంది అని నోటికొచ్చిన కామెంట్ చేయడం కాకుండా.. కేసీఆర్ ప్రభుత్వం ఎలా కూలిపోతుందో, పూర్తి మెజారిటీ వున్న కేసీఆర్ ప్రభుత్వం అసలు మెజారిటీ లేకుండా ఎలా పడిపోతుందో కాంగ్రెస్ నాయకులు క్లారిటీగా చెప్పాలి. లేకపోతే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కాంగ్రెస్ పార్టీ ఏవైనా కుట్రలూ గట్రా చేస్తుంటే అవి కూడా చెప్పాలి. ఇవేవీ చెప్పలేకపోతే నిన్నగాక మొన్న ఏర్పడిన ప్రభుత్వం కూలిపోతుంది... కూలిపోతుంది అని అపశకునపు మాటలు మాట్లాడ్డం కాంగ్రెస్ నాయకులు మానుకోవాలి.

జైపాల్‌రెడ్డి పెద్దరికాన్ని కాపాడుకోవాలి!

  గతంలో తెలుగు ప్రజలందరికీ కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి అంటే అంతో ఇంతో గౌరవం వుండేది. రాజకీయాల్లో వుండే కొంతమంది పెద్దమనుషుల్లో ఆయన కూడా ఒకరన్న అభిప్రాయం వుండేది. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన సీమాంధ్రులకు వ్యతిరేకంగా చేసిన పనులు, సీమాంధ్రులను ‘శుంఠలు’ అంటూ మాట్లాడిన తీరు చూశాక సీమాంధ్ర ప్రజలకు ఆయన మీద వున్న గౌరవం పూర్తిగా పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే బాధ్యతను తన భుజాన వేసుకుని, కాంగ్రెస్ అధిష్ఠానానికి అబద్ధాల కబుర్లు చెప్పి తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆయన కారణమయ్యారు. అందువల్ల ఆయనకు తెలంగాణ ప్రాంతంలో అయినా గౌరవం వుంటుందని అందరూ భావించారు. అయితే ఎన్నికలలో దారుణంగా ఓడిపోయిన ఆయనకు తెలంగాణ ప్రాంతంలో కూడా గౌరవం లేదని అర్థమయిపోయింది. ఇప్పుడు ఆయన తెలంగాణ ప్రాంతంలో అయినా పోయిన తన గౌరవాన్ని తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో వున్నట్టున్నారు. ఆ ప్రయత్నంలో ఆయన సీమాంధ్ర ప్రజల దృష్టిలో మరింత కిందకి దిగజారిపోతున్నారు. తాజాగా కేంద్రం లోక్‌సభలో పోలవరం ముంపు గ్రామాల బిల్లును ఆమోదించినప్పుడు జైపాల్ రెడ్డి అనవసరంగా ఆవేశపడిపోయారు. రాష్ట్ర పునర్విభజన బిల్లుకు సవరణలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదంటూ రాజ్యాంగం మొత్తం తనకే తెలిసినట్టుగా స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు చెల్లదని తేల్చిపారేశారు. అయితే ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. చివరికి కాంగ్రెస్ అధిష్ఠానం కూడా పట్టించుకోలేదు. పోలవరం బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగిన సందర్భంగా జైరాం రమేష్ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు అమలు కోసం బిల్లులో ఎలాంటి సవరణలైనా చేసుకోవచ్చని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారని గుర్తు చేశారు. మరి ఈ విషయం ఘనతవహించిన జైపాల్ రెడ్డి గారు కూడా గుర్తు చేసుకుంటే మంచింది. ఈ నేపథ్యంలో జైపాల్ రెడ్డి భవిష్యత్తులో తన పెద్దరికానికి మరింత భంగం వాటిల్లే కామెంట్లు చేయకుండా వుంటారని సీమాంధ్ర ప్రజలు ఆశిస్తున్నారు.

ఉమ్మడి పోలీసింగ్‌తో సీమాంధ్రులకు భద్రత

  ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో వుంటున్న సీమాంధ్ర ప్రజల భద్రతకు చర్యలు, ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద వుంది. హైదరాబాద్‌లో వుంటున్న సీమాంధ్రులు రాష్ట్ర విభజన తర్వాత అభద్రతాభావానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీమాంధ్రులను కడుపులో పెట్టుకుని చూస్తామని హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులను నమ్మే స్థితిలో సీమాంధ్రులు లేరు. కక్ష కట్టినట్టు వ్యవహరిస్తున్న తెలంగాణ నాయకుల తీరు కూడా సీమాంధ్రులకు భయాందోళనలు కలిగిస్తోంది. హైదరాబాద్‌లో తమ భద్రతకు స్పష్టమైన భరోసా వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఉమ్మడి పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం నుంచి గవర్నర్‌కి లేఖ రావడం, ఈ విధానాన్ని త్వరగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వత్తిడి చేస్తూ వుండటం హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు కొంత ఊరటగా వుంది. ఈ విధానం అమలులోకి వస్తేనే సీమాంధ్రులు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోగలుగుతారు. అయితే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని సీమాంధ్రుల మీద కర్రపెత్తనం చెలాయించాలనుకునే తెలంగాణ నాయకులు మాత్రం ఉమ్మడి పోలీసింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతకాలం తమ రాజధాని అనుకుని హైదరాబాద్‌లో జీవించిన సీమాంధ్రులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడటానికే ఇలా ఉమ్మడి పోలీసింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో వున్న సీమాంధ్రుల ఆందోళనలు తొలగాలంటే తెలంగాణ నాయకులు ఉమ్మడి పోలీసింగ్ విధానాన్ని అంగీకరించాలన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.

పోలవరం బిల్లుపై కాంగ్రెస్ మార్కు రాజకీయం!

  పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. ఈ బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితేనే ఈ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే రాజ్యసభలో అధికార ఎన్డీయే కూటమికి బలం తక్కువగా వుంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తే బిల్లు సులభంగా గట్టెక్కే అవకాశం వుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వకపోయినా ఇతర ఎన్డీయే యేతర పార్టీలన్నీ మద్దతు ఇస్తే బిల్లుకు ఆమోదం లభిస్తుంది. అయితే అన్ని పార్టీలను ఒకే తాటిమీద నడపటం కష్టమైన విషయం కాబట్టి బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు కోరడం తప్పనిసరి అవుతుంది. వాస్తవానికి ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభ్యంతరం లేకుండా మద్దతు తెలపాల్సిన అవసరం వుంది. పోలవరం ప్రాజెక్టు కట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే హామీ ఇచ్చింది. అలాగే పోలవరం ముంపు గ్రామాల ఆర్డినెన్స్‌ను జారీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా పోలవరం ముంపు గ్రామాల బిల్లుకు మద్దతు తెలపాల్సిన అవసరం వుంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ దశలో తోక జాడిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే ఒక కీలకమైన తన డిమాండ్‌ని నెరవేర్చాలని మెలిక వేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత మొత్తుకున్నా అధికార పార్టీ ముందు పప్పులు ఉడకటం లేదు. ఈ నేపథ్యంలో లోక్ సభలో తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోలవరం ముంపు గ్రామాల బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇస్తామని కాంగ్రెస్ లోపాయికారీగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తు్న్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్డీయే ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటున్నట్టు సమాచారం. వాస్తవానికి సోమవారం నాడు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాల్సి వుంది. ఏమవుతుందో చూడాలి.

నీతి సూత్రాలు ఏమయ్యాయి జగన్ గారూ?

  వైసీపీ నాయకుడు జగన్ గారు గత పది రోజుల నుంచి అన్యాయం జరిగిపోయింది, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అన్యాయం చేసింది, న్యాయం కావాలి అని మొత్తుకుంటూ రాష్ట్ర గవర్నర్ దగ్గరకి, ఢిల్లీకి వెళ్ళి చాలా గడపలు ఎక్కి చాలా సీన్‌ క్రియేట్ చేశారు. జగన్ గారు సీన్ క్రియేట్ చేయడం వెనుక రీజన్ ఏమిటయ్యా అంటే, స్థానిక సంస్థల అధ్యక్ష ఎన్నికలలో తమ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారని, అందువల్ల చాలాచోట్ల తమ పార్టీ అధ్యక్ష పీఠాలను గెలుచుకోలేకపోయిందని జగన్ చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల అధ్యక్ష ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ బోలెడన్ని ఘోరాలు చేసేసిందని కనబడిన ప్రతి ఒక్కరికీ చెప్పుకుంటూ తిరిగారాయన. తెలుగుదేశం పార్టీని చూసి తాను భయపడిపోతున్నానని, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాలంటేనే భయం వేస్తోందని జగన్ చాలా అమాయకుడిలా చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యాలు చేశారా లేదా అనే విషయం అలా వుంచితే, జగన్ పార్టీ తీరు మాత్రం కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకినట్టుగా వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆదివారం జరిగిన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా స్థానిక అధ్యక్ష పీఠాల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు చేసిన దౌర్జన్యకాండ, ప్రకాశం జిల్లా అధ్యక్ష పీఠాన్ని తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి దక్కించుకున్న తీరును రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మా పార్టీకి చెందిన నాయకులను తెలుగుదేశం పార్టీ లాక్కుందని నిన్నటి వరకు జగన్ చెప్పిన నీతి సూత్రాలు ఇప్పుడేమయ్యాయని అంటున్నాయి.

స్వశక్తిని నమ్మే చంద్రబాబుకి స్వామీజీలతో పనేంటి?

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ఎవరూ ఊహించని, కనీవినీ ఎరుగని పని పనిచేశారు. చంద్రబాబు నాయుడేంటి.. ఈ పని చేయడమేంటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసిన పని ఏమిటంటే, ఆయన ఒక స్వామీజీ హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ చంద్రబాబు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. సదరు స్వామీజీ చంద్రబాబు చేత ప్రత్యేక పూజలు చేయించారు. ఆ స్వామీజీ మరెవరో కాదు.. ప్రకాశం జిల్లాకు చెందిన వివాదాస్పద స్వామీజీ రామదూత స్వామి. రామదూత స్వామీజీ మీద భూ కబ్జాలకు సంబంధించిన ఎన్నో ఆరోపణలున్నాయి. అలాంటి స్వామీజీ నిర్వహించిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం వింతల్లోకెల్లా వింత! రాజకీయ నాయకులు స్వామీజీల దగ్గరకి వెళ్ళడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మామూలే. అయితే చంద్రబాబు నాయుడు లాంటి ప్రాక్టికల్ వ్యక్తి ఇలా స్వామీజీ దగ్గరకి వెళ్ళడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తెలుగు ప్రజలకు చంద్రబాబు నాయుడి మీద కొన్ని నిశ్చితాభిప్రాయాలు వున్నాయి. చంద్రబాబు నాయుడు స్వశక్తిని నమ్ముకుంటారు. ఏ పనినైనా శ్రమశక్తి ద్వారానే సాధిస్తారు. స్వామీజీలు, బాబాల దగ్గరకి ఆయన వెళ్ళరు.. వారిని ఆయన దగ్గరకి రానివ్వరు. కానీ, ఆదివారం జరిగిన సంఘటన ప్రజల నమ్మకానికి విరుద్ధంగా వుంది. తొమ్మిదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపినప్పటికీ ప్రజలు ఆయన్ని పదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ ఆయన నిరాశపడకుండా తన శక్తిని తాను నమ్మకున్నారు. ప్రజల్లో తనమీద వున్న నమ్మకాన్ని నమ్మకున్నారు. మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారంటే దానికి కారణం ప్రజలకు ఆయన మీద వున్న నమ్మకం, తెలుగుదేశం కార్యకర్తల శ్రమే తప్ప స్వామీజీలు కాదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సింది చంద్రబాబు నాయుడి శ్రమే తప్ప స్వామీజీల ఆశీస్సులు కాదు.   ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ క్షేమం కోరుకుని రామదూత స్వామీజీ ఆశీస్సుల కోసం వెళ్ళారని కాసేపు అనుకుందాం. ఆ కోణంలో చూసినా రామదూత స్వామీజీకి అంత సీను లేదు. ఎందుకంటే గతంలో ఆయన్ని సందర్శించుకుని ఆశీస్సులు తీసుకున్న చాలామంది రాజకీయ నాయకులు, సినిమావాళ్ళు బావుకుందేమీ లేదు. వాళ్ళెవరిమీదా సదరు స్వామీజీ ఆశీస్సులు ఫలించలేదు. వాళ్ళంతా ఫెయిల్యూర్స్ బాటలోనే నడిచారు. ఉదాహరణకి గాలి జనార్దన‌రెడ్డిని తీసుకుందాం. ఆయన గతంలో చాలాసార్లు రామదూత స్వామీజీని సందర్శించడానికి ఆయన ఆశ్రమానికి హెలికాప్టర్లో వెళ్ళేవారు. హెలికాప్టర్లో పెట్రోలు అయిపోయేలా ఎన్నిసార్లు స్వామీజీ చుట్టూ తిరిగినా గాలి జనార్దనరెడ్డికి, ఆయన తమ్ముడికి జైల్లోపడే రాత తప్పలేదు. ఇంకా మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు డి.శ్రీనివాస్, టి.సుబ్బరామిరెడ్డి, జయప్రద, అమర్‌సింగ్, మురళీ మనోహర్ జోషి, కేంద్ర మాజీ మంత్రి మునియప్ప... ఇలాంటి రాజకీయ నాయకులందరూ రామదూత స్వామీజీ ఆశ్రమాన్ని సందర్శించుకుని ఆశీస్సులు అందుకున్నవారే. స్వామీజీ అశీస్సులు అందుకోకముందు అందరూ బాగానే వున్నారు. ఆశీస్సులు అందుకున్న తర్వాత అదేం చిత్రమోగానీ ఎవరూ బాగాలేరు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప నాలుగైదుసార్లు స్వామీజీ ఆశ్రమానికి వచ్చి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ ఆశీస్సుల పుణ్యమా అని ఆ తర్వాత ఎడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి ఊడిపోయింది. ఆయన ఇంతవరకూ రాజకీయంగా నిలదొక్కుకోలేక అల్లాడుతున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ జూనియర్ ఎన్టీఆర్‌తో ‘శక్తి’ సినిమా తీసే సమయంలో చీటికి మాటికి రామదూత స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి ఆశీస్సులు అందుకునేవారు. ఆయన ఎన్ని ఆశీస్సులు అందుకున్నా ‘శక్తి’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇలాంటి ఉదాహరణలన్నీ చూస్తే రామదూత స్వామీజీ ఆశీస్సులకు అంత పవర్ లేదని అర్థమవుతోంది. పవర్ లేని సంగతి అలా వుంచితే, సదరు స్వామీజీ ఆశీస్సులు అందుకున్న అందరి కెరీర్లూ రివర్స్ గేర్‌లో నడిచాయి. చదివిస్తే ఉన్నమతి పోయిందన్నట్టు, ఈ స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న తర్వాతే కింగుల్లాంటి వాళ్ళు కూడా డంగైపోయారు.   అందువల్ల మేమెంతో గౌరవించే చంద్రబాబు నాయుడు గారూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీమీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు మీ స్వశక్తితో ఒక సైనికుడిలా పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు స్వామీజీల సందర్శనానికి వెళ్ళడాన్ని ప్రజలు ఎంతమాత్రం జీర్ణించుకోలేదు. కాబట్టి మీరు ఇలాంటి స్వామీజీల చుట్టూ తిరగడం మానేయండి. ఆ తిరిగేదేదో ప్రజల చుట్టూ తిరగండి. ప్రజల్ని, తెలుగుదేశం విజయానికి తోడ్పడిన కార్యకర్తల్ని ఆదుకోండి. ఒక్కమాటలో చెప్పాలంటే.. తెలుగు ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే వుంటాయి.. మీకు ఏ స్వామీజీలు.. బాబాజీల ఆశీస్సులు అవసరం లేదు.