సరికొత్త పదవి: తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడు

  తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త పదవి త్వరలో సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సరికొత్త పదవి పేరు ‘తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడు’. తెలంగాణ ముఖ్యంమంత్రి కేసీఆర్‌కి వాస్తుకు సంబంధించిన అమూల్యమైన సూచనలను సుద్దాల సుధాకర్ తేజ అనే వాస్తు పండితుడు ఇస్తూ వున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసానికి సంబంధించిన వాస్తు సూచనలు ఈయనే ఇచ్చారు. ఈయన మీద, ఈయన చెప్పే వాస్తు సూత్రాల మీద కేసీఆర్‌కి మాంఛి గురి వున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇప్పటికే నిర్మాణం పూర్తయిన భవంతులు, నిర్మాణంలో వున్న భవంతులు.... వీటన్నిటి వాస్తు బాగోగులు చూసే బాధ్యతను ప్రభుత్వం సుద్దాల సుధాకర్ తేజకు అప్పగించినట్టు సమాచారం. ఆయన కూడా ఎంతో శ్రద్ధగా వాస్తు పండితుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కోసం ఎంతో శ్రమిస్తున్న సుద్దాల సుధాకర్ తేజకు ‘తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడు’ అనే పోస్టు ఇచ్చేస్తే ఓ పని అయిపోతుందన్న ఆలోచన ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా కూడా సుద్దాల సుధాకర్ తేజను తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడిగా నియమించాలన్న ఆసక్తితో వున్నట్టు తెలుస్తోంది. సుధాకర్ తేజ అంటే సీఎం కేసీఆర్‌కి కూడా ఎంతో గురి వుంది కాబట్టి త్వరలో తెలంగాణ ఆస్థాన వాస్తు పండితుడి పోస్టు సృష్టించి, ఆ పోస్టులో సుద్దాల సుధాకర తేజను కూర్చోబెట్టే అవకాశం వుందని తెలుస్తోంది. ఇంతకీ ఈ సుద్దాల సుధాకర్ తేజ మరెవరో కాదు... పాటల రచయిత సుద్దాల అశోక్‌తేజకు స్వయానా తమ్ముడు. అలాగే ఈ సుద్దాల సుధాకర్ తేజకు వాస్తులో పాఠాలు చెప్పిన గురువుగారు మరెవరో కాదు.. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ వాస్తు పండితుడు గౌరు తిరుపతి రెడ్డి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గురువుగారి దగ్గర శిష్యరికం చేయడం సుధాకర్ తేజకు పదవి రావడానికి అడ్డంకి కాకపోవచ్చేమో.

చంద్రబాబు పేషీలో పెంచల్‌రెడ్డి పేచీ...

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకి తాజాగా ఒక ఫైల్ వచ్చింది. సీఎం పేషీలో డిప్యూటీ సెక్రటరీగా పోస్టుకు పెంచల్ రెడ్డి అనే పరిశ్రమల శాఖ అధికారిని నియమిస్తే బాగుంటుందనేది ఆ ఫైల్‌లో వున్న సారాంశం. చంద్రబాబు దగ్గరకి ఫైల్ రావాలంటే అది రకరకాల దశలు దాటుకుని రావాలి. అన్ని దశలు దాటుకుని వచ్చిన ఆ ఫైల్ మీద చంద్రబాబు ఓ సంతకం చేసేశారంటే పెంచల్ రెడ్డి అనే అధికారి ఎంచక్కా సీఎం పేషీలో డిప్యూటీ సెక్రటరీ పోస్టులో కూర్చునేవారు. అయితే ఇంతకీ ఎవరీ పెంచల్ రెడ్డి అని ఎంక్వయిరీ చేసిన చంద్రబాబు నాయుడికి మైండ్ బ్లాక్ అయ్యే లెవల్లో సమాధానం వచ్చింది. సదరు పెంచల్ రెడ్డి ఎవరో కాదు. వైసీపీ నాయకుడు బాలినేనీ శ్రీనివాసరెడ్డికి చాలా సన్నిహితుడు, బంధువు, అలాగే వైసీపీ నాయకుడు జగన్‌కి కూడా బంధువే. జగన్ పార్టీ సన్నిహితుడికి తన పేషీలో స్థానం ఇవ్వడం అంటే కొరివితో తల గోక్కున్నట్టేనని అర్థం చేసుకున్న చంద్రబాబు అర్జెంటుగా ఆ ఫైలును పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. వైసీపీ నాయకులకు సన్నిహితుడు, బంధువు అయిన వ్యక్తిని తన పేషీలోకి తీసుకోవాలంటూ తనకు ప్రతిపాదన పంపిన వారి మీద చంద్రబాబును దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు చకచక... ఎంపీల విలవిల...

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల ముఖ్యమంత్రి కాదు.. చేతల ముఖ్యమంత్రి. రాజకీయంగా చంద్రబాబును వ్యతిరేకించేవారు కూడా ఆయన పనితనాన్ని ఎంతమాత్రం విమర్శించరు. ఏదైనా అనుకుంటే దాన్ని సాధించడం కోసం నిర్విరామంగా శ్రమించే తత్వం చంద్రబాబుది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. ఏ విషయంలో అయినా మెరుపు వేగంతో చకచకా దూసుకువెళ్తూ ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. అయితే ఈ చంద్రబాబు చకచక రాష్ట్రం నుంచి ఎంపికైన తెలుగుదేశం ఎంపీలు విలవిలలాడేలా చేస్తోంది. చంద్రబాబు నాయుడు ప్రతి పనినీ తానే చేస్తూ వుండటం వల్ల ఎంపీలు చేయడానికి ఏమీ మిగలటం లేదు. కేంద్రంతోగానీ, కేంద్రమంత్రులతోగానీ సంప్రదింపులు జరిపే విషయం గానీ, వారు రాష్ట్రానికి వచ్చినప్పుడు గానీ చంద్రబాబు ఎంపీల ప్రమేయం లేకుండా ప్రతి విషయాన్నీ తానే డీల్ చేస్తున్నారు. ఎంపీలు చేయాల్సిన పనులు కూడా తానే చేసేస్తూ ఎంపీలను కేవలం ఉత్సవ విగ్రహాల మాదిరిగా కూర్చోబెడుతున్నారు. ఎంపీలు ఏదైనా పని చేయాలని అనుకుని అడుగు ముందుకు వేసేలోపు చంద్రబాబు నాయుడు అప్పటికే ఆ పని పూర్తి చేస్తున్నారు. దాంతో తెలుగుదేశం ఎంపీల పరిస్థితి అయోమయంగా తయారైంది. మాక్కూడా పనిచేసే అవకాశం ఇవ్వండి సార్ అని చంద్రబాబుతో చెప్పలేక, మింగలేక, కక్కలేక ఎంపీలు అల్లాడిపోతున్నారు. చంద్రబాబు తమను ఏ పనీ చేయనివ్వడం లేదని, తమకూ పనిచేసే అవకాశం ఇస్తే ఎంపీలుగా ఎన్నికైనందుకు సార్థకత వుంటుందని టీడీపీ ఎంపీలు సహచరుల దగ్గర వాపోతున్నారు. అందుకే ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ‘బొమ్మరిల్లు’ సినిమాలో తండ్రిలా అన్ని పనులూ తానే చేయడం కాకుండా, ఎంపీలకు కూడా పనిచేసే అవకాశం, వారి శక్తి సామర్థ్యాలను కూడా వినియోగించుకునే ఆలోచన చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

‘దేశం’ తూర్పున భాస్కరుడు ఉదయిస్తాడా?

  తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. ఇది మామూలే.. కానీ తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీలో గతంలో ఒకసారి అస్తమించి, మళ్ళీ ఇంకోసారి ఉదయించడానికి ఓ భాస్కరుడు నానా ప్రయత్నాలు చేస్తున్నాడు. కీలక సమయంలో పార్టీకి జెల్లకొట్టి వెళ్ళిపోయిన ఆ పెద్దాయన, ఇప్పుడు మళ్ళీ పుట్టింటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా పెద్దాయన? ఆ పెద్దాయన ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్. తెలుగుదేశం పార్టీకి ‘బొడ్డు’ కోసి పేరు పెట్టినప్పటి నుంచీ పార్టీలో వున్న నాయకుడు. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని తూర్పు గోదావరి జిల్లాలో తన హవా నడిపిన నాయకుడు. రాష్ట్ర స్థాయిలో ఎన్టీ రామారావు ఏ స్థాయిలో వెలిగారో తూర్పు గోదావరి జిల్లాలో క్యాబినెట్ ర్యాంక్ పదవితో రాష్ట్ర స్థాయిలో కూడా వెలుగు వెలిగిన నాయకుడు. అయినప్పటికీ కీలక సమయంలో పార్టీకి జెల్ల కొట్టి అవినీతి పునాదుల మీద కట్టిన ఓ పార్టీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పార్టీ తూర్పు తిరిగి దణ్ణం పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ వుండటంతో మళ్ళీ ఆ నాయకుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చే ప్రయత్నాలు ప్రారంభించాడు.   తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పార్టీని, పార్టీ నాయకుడిని ఇష్టమొచ్చినట్టు విమర్శించిన సదరు నాయకుడు తాను తిట్టిన తిట్లన్నీ మర్చిపోయి మళ్ళీ తెలుగుదేశం గడప తొక్కాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే సదరు నాయకుడి పునరాగమన ప్రయత్నాలను స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీకి ద్రోహం చేసిన నాయకులలో మొదటి వరుసలో నిలిచే ఆ వ్యక్తిని తిరిగి తెలుగుదేశం పార్టీలోకి తీసుకోరాదని స్పష్టంగా చెబుతూ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయనగారు మాత్రం తన ప్రయత్నాలను మాత్రం మానుకోవడం లేదు. ‘‘నేను మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాలి. దానికోసం ఎంత ఖర్చయినా పర్లేదు’’ అని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఈ బృహత్ కార్యాన్ని సాధించడం కోసం తెలుగుదేశం పార్టీలో కాస్త లెక్కా డొక్కా తెలిసిన కీలక నాయకుడిని సదరు ‘తూర్పు భాస్కరుడు’ ఆశ్రయించినట్టు తెలుస్తోంది. మరి తెలుగుదేశం అధినేత స్థానిక కార్యకర్తల నిరసనలను పట్టించుకుంటారో లేదో చూడాలి.

కేసీఆర్ పై యుద్ధానికి చేతులు కలిపిన ఎర్రబెల్లి, రేవంత్

  ఆ మధ్య తెదేపా సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని రహస్యంగా కలిసినట్లు వార్తలు రావడంతో, ఇక నేడో రేపో ఆయన తెదేపాను వీడి తెరాసలో చేరబోతున్నారని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈరోజు ఆయన రేవంత్ రెడ్డితో కలిసి కేసీఆర్ పై విరుచుకుపడటంతో అందరూ ఆశ్చర్యపోక తప్పలేదు. తెలంగాణాలో ప్రస్తుత కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాలే కారణమని తెరాస నేతలు చెప్పుకోవడం చూసి, వారిని ధీటుగా ఎదుర్కోమని చంద్రబాబు కోరడంతో, ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి తెలంగాణా మంత్రులపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.   "ఎన్నికల సమయంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రోజుకి 8 గంటలు నాణ్యమయిన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు మరో మూడేళ్ళు ఆగాలని చెప్పడాన్ని ఇంటికి నిప్పు అంటుకొంటే నుయ్యి త్రవ్వడం మొదలు పెట్టినట్లుందని" ఎర్రవెల్లి ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉందని తెలిసినప్పటికీ కనీసం పక్క రాష్ట్రాల నుండి, కేంద్రం నుండి అదనపు విద్యుత్ ఎందుకు తెచ్చుకోలేకపోయారని ఆయన ప్రశ్నించారు.   రేవంత్ రెడ్డి కూడా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పై సరికొత్త ఆరోపణలతో తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన మంత్రివర్గంలో మిగిలిన వారినందరినీ డమ్మీలుగా మార్చేవేసారని ఆక్షేపించారు. ఇంతవరకు మెట్రో రైలు విషయంలో కాస్త దూరమయిన ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి ఇద్దరూ మళ్ళీ ఒకే వేదికపై నుండి తెరాస ప్రభుత్వాన్ని, దాని అధినేత కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించడంతో వారిలో చీలిక తెచ్చి లబ్దిపొందుదామనే కేసీఆర్ ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది.   వారిరువురితో సహా తెలంగాణా-తెదేపా ముఖ్య నేతలందరూ త్వరలో తెలంగాణాలో బస్సు యాత్ర మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు తాజా సమాచారం. కేసీఆర్ ఆకర్షకు విరుగుడుగా ఈ బస్సు యాత్ర చేప్పట్టి తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలనేది దీని ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. తెలంగాణాలో మిగిలిన తెదేపా నేతలు కూడా ఏకత్రాటిపైకి రాగలిగితే, పార్టీ మళ్ళీ పుంజుకోవడం పెద్ద కష్టమయిన పనేమీ కాదని చెప్పవచ్చును.

హరిబాబు ఇది మంచి పద్ధతేనా?

  తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమయిన బీజేపీ కూడా అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మీడియా ద్వారా చురకలు వేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు ఇదివరకోసారి ఆయన “చంద్రబాబు నాయుడు హైదరాబాదులో కూర్చొని ఏమి చేస్తున్నారు? వెంటనే రాష్ట్రానికి తరలిరాకుండా అక్కడి నుండే పాలిస్తానంటే ఎలా?” అని నిలదీశారు.   ఆ తరువాత వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ కూడా బలమయిన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని అన్నారు. మళ్ళీ నిన్న గుంటూరులో జరిగిన బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని కోసం లక్ష ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. రాజధానిని వికేంద్రీకరించే అవకాశం ఉన్నప్పటికీ, విజయవాడ-గుంటూరు పరిధిలో ప్రభుత్వం లక్ష ఎకరాల భూమి సేకరించాలనే ఆలోచనను ఆయన తప్పు పట్టారు.   ఆయన విమర్శలు సహేతుకమయినవే కావచ్చును. కానీ అధికార పార్టీకి మిత్ర పక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా బీజేపీ కొనసాగుతున్నప్పుడు, ఇటువంటి విమర్శలు చేయడం ద్వారా తమ ప్రభుత్వాన్ని తామే విమర్శించుకొన్నట్లవుతుంది. అనేకమంది తెదేపా నేతలు, ఉప ముఖ్యమంత్రి కె.ఈ. కృష్ణమూర్తి వంటివారు కూడా ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసారు. కానీ తరువాత ప్రభుత్వనిర్ణయానికి అందరూ కట్టుబడి మౌనం వహించారులక్ష ఎకరాల భూసేకరణపై ప్రతిపక్షాల నుండి వస్తున్నవిమర్శలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ఇప్పుడు నిర్మించబోయే రాజధాని ప్రస్తుత జనాభా, ఆ ప్రాంత అభివృద్ధిని మాత్రమే కాకుండా రాబోయే 100 సం.లకు సరిపోయే విధంగా రాజధానిని తీర్చిదిద్దేందుకే సేకరిస్తున్నామని చెప్పిన సమాధానం బహుశః హరిబాబు దృష్టికి రాలేదేమో?   ఏమయినప్పటికీ కంబంపాటి హరిబాబు ప్రభుత్వంపై ఈ విధంగా బహిరంగ విమర్శలు చేయడం కంటే నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడి తన అభిప్రాయం తెలియజేస్తే బాగుంటుంది కదా. మిత్రపక్షమయి ఉండి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం వలన రెండు పార్టీల మధ్య సంబంధాలు దెబ్బ తినడం మినహా ఒరిగేదేముంటుంది?

ఆయన దగ్గర చాలా నేర్చుకొన్నా: చిరంజీవి

  విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రముఖ హాస్యనటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య విగ్రహాన్ని మాజీ కేంద్ర మంత్రి మరియు రాజ్యసభ సభ్యుడు చిరంజీవి నిన్నఆవిష్కరించారు. డాక్టర్‌ అల్లు రామలింగయ్య కళాపీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయితలు పరుచూరి సోదరులకు అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ స్వర్గీయ అల్లు రామలింగయ్య గొప్పదనం గురించి వివరించి, జీవితాన్ని బంగారు బాట పట్టించేందుకు అవసరమైన అనేక మార్గదర్శక నీతి సూక్తులను ఆయన దగ్గర నేర్చుకున్నానని చెప్పారు.   కానీ, ఆయన మెగాస్టారుగా సినీ రంగంలో ఆర్జించిన మంచిపేరు, ప్రఖ్యాతులు, ప్రజాభిమానం అన్నిటినీ కూడా ఆయన రాజకీయాలలోకి వచ్చిన తరువాత పోగొట్టుకొన్నారు. అందుకు ఆయన పరిస్తితులనో లేక వేరెవరినో నిందించడం కంటే తనను తానే నిందించుకోవలసి ఉంటుంది. సినీ పరిశ్రమలో ఆయన ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంత కష్టపడ్డారో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా సినిమాలలో ఆయన ఒక గొప్ప ఆదర్శమూర్తిగా, ప్రజల కోసం ఎంతటి త్యాగానికయినా సిద్దపడే వ్యక్తిగా తనను తాను ఆవిష్కరించుకోవడం చూసిన ప్రజలు, ఆయన నిజ జీవితంలో కూడా అంతే గొప్ప విలువలు కలిగి ఉంటారని భావించారు. కానీ ఆయన రాజకీయాలలోకి అడుగుపెట్టిన తరువాత, సినిమాలలో చూసిన చిరంజీవికి, నిజజీవితంలో చిరంజీవికి మధ్య చాలా వ్యత్యాసం ఉందని పదేపదే నిరూపిస్తూ వచ్చేరు.   సినిమాలలో అంచెలంచెలుగా సమున్నత స్థాయికి ఎదిగిన ఆయన, రాజకీయాలలో మాత్రం అడ్డుదారిలో పైకి ఎదగాలని ప్రయత్నించి భంగపడ్డారు. నిజం చెప్పాలంటే ఆయన అసలు వ్యక్తిత్వం ఏమిటో ఆయన రాజకీయాలలోకి వచ్చిన తరువాతే ప్రజలకు అర్ధమయింది. అంతకు ముందు సినీనటులు డా.రాజశేఖర్, జీవిత వంటివారు ఆయనపై ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మని ప్రజలు, ఆయన రాజకీయాలలో అనుసరించిన ద్వంద వైఖరిని చూసిన తరువాత ఆ ఆరోపణలు నిజమని నమ్మక తప్పలేదు.   కర్నాటకకు చెందిన జైరామ్ రమేష్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎంపికయిన కారణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతుంటే, ప్రజాసేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చేనని పదేపదే చెప్పుకొనే చిరంజీవి తన రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా కనబడుతుండటంతో, రాజ్యసభ సభ్యుడిననే సంగతి కూడా మరిచిపోయినట్లు మళ్ళీ 150వ సినిమా తీయడానికి సిద్దమయిపోతున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్న చిరంజీవి ‘స్వర్గీయ అల్లు రామలింగయ్య దగ్గర జీవితాన్ని బంగారు బాట పట్టించేందుకు అవసరమైన అనేక మార్గదర్శక నీతి సూక్తులను నేర్చుకున్నానని’ చెప్పుకోవడం వింటే నిజమేనని ఎవరయినా ఒప్పుకోక తప్పదు మరి.

కలిసి ఉంటే కలదు సుఖము..గవర్నర్

  కలిసి ఉంటే కలదు సుఖము... అని పెద్దలే కాదు రెండు రాష్ట్రాలకు పెద్దన్న వంటి గవర్నర్ నరసింహన్ కూడా ఇద్దరు ముఖ్యమంత్రులకు మరోమారు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. బీజేపీ నేత బండారు దత్తాత్రేయ నిర్వహించిన 'అలాయ్ బలాయ్' కార్యక్రమానికి హాజరయిన గవర్నరుతో బాటు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా రాజకీయ నాయకులందరినీ ఒక్క వేదిక మీదకు తీసుకువచ్చే ఈ కార్యక్రమాన్ని గత పదేళ్లుగా నిర్వహిస్తున్న బండారు దత్తాత్రేయను అభినందించారు. తెలుగు ప్రజలు అందరూ అన్నదమ్ములులా కలిసి మెలిసి జీవిస్తూ. ఒకరికొకరు సహకరించుకొంటేనే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.   ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందిస్తూ, ‘రాష్ట్రాలు వేరయినా తెలుగుజాతి ఒకటేనని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తను కోరుకొంటున్నానని, రెండు రాష్ట్రాలలో తెదేపా ఉన్నందున ఆ పార్టీ అధ్యక్షుడిగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తను కోరుకొంటున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఆలింగనం చేసుకోవడం హైలైట్ గా నిలిచింది.

మోడీ విమానంలో డమ్మీ గ్రెనేడ్ నిజమే!

  ప్రధాని మోడీ అమెరికా ప్రయాణానికి సిద్దంగా ఉంచిన 'స్టాండ్-బై' ఎయిర్ ఇండియా విమానంలో నిర్వీర్యం చేయబడిన గ్రెనేడ్ దొరకడం కలకలం రేపింది. ప్రధాని మోడీ తమ అమెరికా పర్యటన ముగించుకొని వచ్చేసిన తరువాత ఆ విమానాన్ని యన్.యస్.జీ. కమెండోలు ‘యాంటీ-హైజాక్-ఆపరేషన్స్-శిక్షణ' నిమిత్తం తమ అధీనంలో తీసుకొన్నారు. ఆ తరువాత దానిని తిరిగి ఎయిర్ ఇండియాకు అప్పగించారు. కానీ అందులో తేఖాన్పూరు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తయారుకాబడినట్లు ముద్ర ఉన్న ఒక ‘స్టన్-గ్రెనేడ్’ ఒకటి వదిలివేశారు. వారు దానిని అందులో పెట్టి పొరపాటున మరిచిపోయారా? లేక కోరుండే వదిలిపెట్టారా? అనే సంగతి ఇంకా తేలవలసి ఉంది.   ఆ నిర్వీర్యమయిన గ్రేనేడ్ విమానంలో ఉండగానే డిల్లీ, ముంబై, హైదరాబాదులలో ప్రయాణికులను ఎక్కించుకొని సౌదీ అరేబియాలోని జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొంది. అక్కడ జరిగిన తనికీలలో విమానంలో స్టన్-గ్రెనేడ్ ఉన్న సంగతి బయటపడింది. అయితే ఎయిర్ ఇండియా అధికారులు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు అదే గ్రెనేడ్ కాదని కేవలం పనికిరాని ప్లాస్టిక్ వస్తువని నమ్మబలికే ప్రయత్నం చేసారు. కానీ అది ఒక నిర్వీర్యం చేయబడిన ‘స్టన్-గ్రెనేడ్’ అని యన్.యస్.జీ. కమెండోలు నిర్దారించడంతో, ముంబై, హైదరాబాదుల విమానాశ్రయాలలో ఎయిర్ ఇండియాకు చెందిన నలుగురు అధికారులు, ఇద్దరు సెక్యురిటీ అధికారులు సస్పెండ్ చేయబడ్డారు.   డిల్లీలో విమానం బయలుదేరినప్పటి నుండి జెడ్డా చేరేవరకు ప్రతీ విమానాశ్రయంలో కూడా సెక్యూరిటీ అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అందులో ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేవని నిర్దారించుకొన్న తరువాతనే ప్రయాణానికి అనుమతిస్తుంటారు. అయితే బోయింగ్ 747వంటి భారీ విమానాన్ని కేవలం ఒకే ఒక్క సెక్యూరిటీ అధికారి మొక్కుబడిగా పరిశీలించి, క్లియరెన్స్ ఇస్తుండటం చేతనే ఈవిధంగా జరిగిఉండవచ్చని దర్యాప్తు చేస్తున్న అధికారులు అభిప్రాయపడుతున్నారు.   కేంద్ర విమానయాన శాఖామంత్రి అశోక్ గజపతి రాజుకు ఈ విషయం తెలిసిన వెంటనే దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఎయిర్ ఇండియా డిప్యూటీ చీఫ్ సయ్యద్ నసీర్ అలీ, విమానయాన భద్రతాధికారి బిబి.దాస్ లతో కూడిన ఒక కమిటీని వేసారు. ఏమయినప్పటికీ ఈ వ్యవహారం వలన మన భద్రతా వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా ఉందో కళ్ళకు కట్టినట్లు చూపుతోంది.

ప్రధాని విమానంలో గ్రెనేడ్!

  ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నపుడు ఆయన కోసం ఎయిర్ ఇండియా వారి మరొక బోయింగ్-747 విమానం డిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టాండ్-బైగా సిద్దం చేసి ఉంచారు. ఒకవేళ మోడీ పయనించబోయే ప్రత్యేక విమానంలో ఏవయినా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే, ఆ స్టాండ్-బై విమానంలో అమెరికా బయలుదేరి ఉండేవారు. అందువల్ల ఆ విమానాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోనికి తీసుకొని క్షుణ్ణంగా తనికీలు నిర్వహిస్తాయి. కానీ మోడీ అమెరికా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని భారత్ తిరిగివచ్చేసిన తరువాత దానిని తిరిగి ఎయిర్ ఇండియా సంస్థకు అప్పగించేశారు.   ఆ తరువాత ఆ విమానంలో సాధారణ ప్రయాణికులను తీసుకొని డిల్లీ నుండి ముంబై- హైదరాబాద్ మీదుగా-సౌదీ అరేబియా దేశంలోని జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున దిగినప్పుడు, ఆ విమానపు బిజినెస్ క్లాసులో నిర్వీర్యం చేయబడిన ఒక గ్రెనేడ్ దొరకడం సంచలనం సృష్టించింది.   దానిని మోడీ ప్రయాణానికి ముందుగానే విమానంలో అమర్చబడి, ఆయన దానిని ఉపయోగించకపోవడంతో నిర్వీర్యం చేయబడిందా? లేక డిల్లీ, ముంబై, హైదరాబాదు మూడు విమానాశ్రయాలలో ఎక్కడయినా ఎవరయినా విమానాన్ని హైజాక్ చేసే ఉద్దేశ్యంతో లోపలకి తీసుకువచ్చేరా? తెచ్చి ఉండి ఉంటే ఎందుకు ఎప్పుడు నిర్వీర్యం చేసారు? అసలు ఆ బాంబుని ఎవరు, ఎప్పుడు, ఎందుకు తీసుకు వచ్చేరు? సాధారణ ప్రయాణికులను, విమానాన్నయినా బయలుదేరేముందు క్షుణ్ణంగా తనికీ చేసినపుడు అది ఏవిధంగా లోపాలకి వచ్చింది? అనే విషయం తెలుసుకొనేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఏమయినప్పటికీ ఇది చాలా దిగ్బ్రాంతి కలిగించే విషయమని అంగీకరించక తప్పదు.

జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీటింగ్ ఎందుకు?

  సాధారణంగా ఎవరైనా చేతులు కాలిన తర్వాతే ఆకులు పట్టుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే తయారైంది. నందమూరి వంశంలో తానే నంబర్‌వన్ అనే భ్రమలో ఇంతకాలం వున్న జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో బోలెడంత ప్రాధాన్యత ఆశించాడు. ఆ ప్రాధాన్యత లభించకపోవడంతో ఆ పార్టీకి దూరమయ్యాడు. ఇప్పుడు పార్టీ ఆయన్ని దూరంగా పెట్టింది. దానికితోడు వరస ఫ్లాపులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని కొల్లేరు చేశాయి. ఈ పరిణామాల వల్ల నందమూరి ఫ్యాన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి క్రమంగా దూరమవుతున్నారు. ఈ ప్రమాదాన్ని గ్రహించిన జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ఎన్టీఆర్ అభిమానులకు చేరువయ్యేందుకు ముమ్మర ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందులోభాగంగా వైజాగ్‌లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీట్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి నందమూరి ఫ్యామిలీ ఫాన్స్‌తో పాటు తెలుగుదేశం యూత్ కేడర్‌ని కూడా ఈ మీట్‌కు ఆయన ఆహ్వానించనున్నాడని సమాచారం. ఈ మీట్‌లో, ఫ్యాన్స్ అందరితో స్వయంగా మాట్లాడి వారిని ఉత్సాహపరిచే సన్నాహాల్లో ఎన్టీఆర్ ఉన్నాడని జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు.

హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ డాటా సెంటరు?

  భారతదేశంలో కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, వాటి కోసం రకరకాల అప్లికేషన్ల (సాఫ్ట్ వేర్) వినియోగం చాలా పెరిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజలు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఇంతకాలం వరకు తమ విలువయిన డాటాను హార్డ్ డిస్కులలోనో లేకపోతే సీడీలు, పెన్ డ్రైవులలోనో భద్రం చేసుకొంటున్నారు. కానీ నానాటికి పెరిగిపోతున్న ఈ డాటాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డాటా సెంటర్లలో భద్రపరిచి అవసరమయినప్పుడు ‘క్లౌడ్ కంప్యూటింగ్’ అనే సర్వీసుల ద్వారా తిరిగి పొందవచ్చును. ఇప్పటికే గూగుల్, బింగ్, ఎంఎస్‌ఎన్, ఆఫీస్ 365, ఎక్స్‌బాక్స్ లైవ్, స్కైప్, వన్‌డ్రైవ్, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటివి ఈ సేవలు అందిస్తున్నాయి. వాటిలో కొన్ని ఉచితంగా, మరికొన్ని నామమాత్ర చార్జీలతో ఈ సేవలు అందిస్తున్నాయి. ఇటీవల భారత్ వచ్చిన మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సి.ఈ.ఓ.) సత్య నాదెళ్ళ డిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశంలో క్లౌడ్ కంప్యూటర్ సర్వీసులు అందించేందుకు వచ్చే ఏడాది చివరిలోగా మూడు నగరాలలో మైక్రో సాఫ్ట్ డాటా సెంటర్లు నెలకొల్పుతామని ప్రకటించారు. దాదాపు 125కోట్ల జనాభా గల భారతదేశంలో క్లౌడ్ కంప్యూటర్ సర్వీసులకు చాలా భారీ మార్కెట్ ఉందని తను భావిస్తున్నట్లు తెలిపారు.   ఆ మూడు సెంటర్లను ఏ నగరాలలో ఏర్పాటు చేస్తారో ఇంకా ప్రకటించవలసి ఉంది. అయితే సత్య నాదెళ్ళ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశం అవడం గమనిస్తే, ఈ మూడింట్లో ఒకదానిని హైదరాబాదులోనే నెలకొల్పే ఆలోచనలో ఉన్నట్లు భావించవచ్చును. ఇప్పటికే హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ చాలా కాలంగా పనిచేస్తోంది. ఇప్పుడు ఈ డాటా సెంటరు కూడా వచ్చినట్లయితే ఐటీ ప్రపంచంలో హైదరాబాద్ పేరు మరింత మారుమ్రోగిపోవడం ఖాయం. అదేవిధంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. భారతదేశ భారీ జనాభాయే ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప అతిపెద్ద మార్కెట్టుగా ఊరిస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశ్యంతో మైక్రోసాఫ్ట్ ఒక్కోడాటా సెంటరు కోసం సుమారు రూ. 5,000కోట్లు పెట్టుబడి ఈ డాటా సెంటర్లు నెలకొల్పేందుకు సిద్దమవుతోంది.   కోట్లాది భారతీయులకు వివిధ సేవలు అందిస్తున్న అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సేకరించిన డాటాను నిక్షిప్తం చేసి తిరిగి వారికి అవసరమయినప్పుడు అందించే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసుల కోసం చాలా మంది సాఫ్ట్ వేర్ నిపుణులు, ఇంజనీర్లు అవసరం ఉంటారు. అంతేకాక ఈ డాటా సెంటర్లలో పనిచేసే ఉద్యోగులకు ఆహారం, రవాణా వంటి వివిధ సేవలవసరం ఉంటాయి కనుక దీనివలన పరోక్షంగా కూడా కొన్ని వేలమందికి ఉపాధి దొరుకుతుంది. కనుక ఇది ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకుండా తెలంగాణా ప్రభుత్వం చాలా జాగ్రత్తపడవలసి ఉంది.

జయలలితకు సంఘీభావం తెలపడం సమంజసమేనా?

  అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విదించడంతో తమిళనాట ఆమె పార్టీ కార్యకర్తలు వీరంగం ఆడి బస్సులను తగులబెట్టారు. దుఖాణాలను బలవంతంగా మూయించారు. ఆమెకు మద్దతుగా తమిళ సినీ పరిశ్రమ అంతా తరలివచ్చి చెన్నైలో ఈరోజు నిరాహారదీక్ష చేసారు. తెలంగాణాలో విజయశాంతి కూడా ఆమెకు మద్దతు ప్రకటించారు. బహుశః ఇంకా చాలా మంది ఆమెకు మద్దతు ప్రకటిస్తూ ఉండవచ్చు కూడా.   అయితే 18ఏళ్ళపాటు ఆమె కేసును క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఆమె నేరం చేసిందని అభిప్రాయపడిన ప్రత్యేక కోర్టు ఆమెకు జైలు శిక్ష వేసింది. అటువంటప్పుడు ఆమెకు మద్దతు తెలుపుతున్న వారందరూ తమ చర్యలను ఏవిధంగా సమర్దించుకొంటారు? ఆమెను కోర్టు దోషిగా నిర్ధారించి జైలు శిక్ష వేసినందుకు నిరసనగా అధికార పార్టీకి చెందినవారే బస్సులను తగులబెట్టడం, బందులు నిర్వహించడాన్ని ఏవిధంగా సమర్దించుకొంటారు? కోర్టు దోషిగా తేల్చిన వ్యక్తి కోసం యావత్ సినీ పరిశ్రమ నిరాహార దీక్ష చేయడాన్ని ఏమనాలి?   వీరందరి ప్రతిచర్యలు గమనిస్తే ఆమెకు జైలు శిక్ష విదించి కోర్టే తప్పు చేసిందేమో? అని అనిపించేలా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రజలకు నచ్చిన వ్యక్తి దోషి అని తెలిసినా శిక్షించ కూడదన్నట్లుంది వారి ధోరణి. ఈ విధంగా ప్రజలు తాము అభిమానించే నేతలను దేశంలో కోర్టులు శిక్షించ కూడదని, వారు దేశంలో చట్టాలకు అతీతులుగా ఉంచాలనే ఆలోచన చాలా ప్రమాదకర ధోరణి. నిరాక్షరాస్యులు, లోకజ్ఞానం లేని వారు ఆవిధంగా ఆలోచిస్తే వారిని తప్పు పట్టలేము. కానీ అధికారంలో ఉన్నవారు, చదువుకొన్నవారు, అన్నీ తెలిసినవారు కూడా ఆమెకు సంఘీబావం పలకడం, ఆమె కోసం బస్సులు తగులబెడుతూ మరొక నేరానికి పాల్పడటం, ఆత్మహత్యలు చేసుకోవడం చాలా విచారకరం.   ఒకవేళ ఆమె తనకు ప్రత్యేకకోర్టులో అన్యాయం జరిగిందని భావిస్తే, హైకోర్టుకు లేకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయవచ్చును. ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటకు వస్తే, ఆమెకు బ్రహ్మ రధం పట్టినా తప్పులేదు. కానీ కోర్టు దోషిగా నిర్దారించి జైలు శిక్ష విదిస్తే దానిని నిరసించడం, ఆమెకు సంఘీభావం ప్రకటించడం, ఆమె కోసం ఆత్మహత్యలు చేసుకోవడం, బస్సులు తగులబెట్టడం చాలా శోచనీయం.

విజయవాడకు ప్రభుత్వ శాఖల తరలింపు సాధ్యమేనా?

  ఈ దసరా పండుగలోగా విజయవాడకు రాష్ట్ర ప్రభుత్వ అన్ని ప్రధాన శాఖలను తరలించి ఇకపై అక్కడి నుండే పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టాలనుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన, కనీసం వచ్చేదసరా పండుగ నాటికయినా తీరుతుందో లేదో అనే అనుమానం కలుగుతోంది ప్రభుత్వోద్యోగుల తీరు చూస్తుంటే. ప్రభుత్వ శాఖల తరలింపు కోసం ఆర్ధిక శాఖ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లాం, రవాణా శాఖా ప్రధాన కార్యదర్శి బీ. శ్యాం బాబు, మునిసిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి డి. సాంబశివరావులతో వేసిన త్రిసభ్య కమిటీ నిన్న హైదరాబాదులో ప్రభుత్వ శాఖల అధిపతులతో సమావేశమయినప్పుడు, ఉద్యోగులలో చాలా మంది తక్షణమే విజయవాడకు తరలి వెళ్లేందుకు సిద్దంగా లేరనే విషయం స్పష్టమయింది. ముందుగా ప్రజలతో నేరుగా సంబంధాలుండే మునిసిపల్, ఆరోగ్య, పౌర సరఫరా, విద్యా శాఖ వంటి కొన్ని ముఖ్యమయిన కార్యాలయాలు వెళ్ళినట్లయితే సరిపోతుందని, విజయవాడలో అన్ని ప్రభుత్వ శాఖలు నడిపేందుకు కార్యాలయాలు, ఉద్యోగులకు, అధికారులకు ఇళ్లు వంటివన్నీ అమరిన తరువాత అంచెలంచెలుగా తరలించినట్లయితే, ప్రభుత్వ కార్యకలాపాలు కూడా ఎటువంటి ఆటంకమూ లేకుండా సజావుగా సాగుతుంటాయని ఉద్యోగుల వాదన. వారి వాదన నిజమే కావచ్చు. కానీ వారి అయిష్టతకు కారణాలు మాత్రం వేరే ఉన్నాయి.   హైదరాబాదులో పనిచేస్తున్న ఉద్యోగులలో చాలామంది అక్కడే ఇళ్లు కొనుకొని స్థిరపడ్డారు. వారి పిల్లలు చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అన్నీ కూడా అక్కడే జరుగుతున్నాయి. అందువలన వారు ఇప్పటికిప్పుడు విజయవాడకు తరలి వచ్చే పరిస్థితి లేదు. అలాగని నిరాకరించడానికి కూడా కుదరదు. కనుక తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరుకొంటున్నారు. కానీ అదెంతో ఎవరూ చెప్పలేరు కనుక ప్రభుత్వమే ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. కనుక వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు, కార్యాలయాల ఏర్పాటుకు ఎంత స్థలం అవసరం, తక్షణమే ఏయే శాఖల తరలింపు సాధ్యమవుతుంది? మిగిలినవి ఎన్ని దశలలో, ఎప్పటిలోగా పూర్తి తరలించవచ్చును? వంటి వివరాలతో వచ్చే అక్టోబరు 6న జరిగే సమావేశానికి హాజరుకమ్మని త్రిసభ్య కమిటీ అన్ని శాఖల అధిపతులకు ఆదేశించింది.   సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. విజయవాడలో అన్ని హంగులతో రాజధాని ఏర్పడే వరకు హైదరాబాదునే అంటిపెట్టుకొని ఉంటామని వాదిస్తే, పాలనాపరంగా చాలా సమస్యలు ఉత్పన్నం కావచ్చును. అలాగని రాత్రికి రాత్రి ఉద్యోగులను తట్టాబుట్టా సర్దుకొని విజయవాడ వచ్చేయమని ఆదేశించడం సబబు కాదు. కనుక దశాలవారిగానే ప్రభుత్వ శాఖలను తరలించడం అందరికీ మంచిదేమో?

ఆంద్ర, తెలంగాణా దోస్తీ కుదిరింది

  ఆంద్ర తెలంగాణా ప్రభుత్వాల మధ్య మొదటిలో కనబడిన ఘర్షణ వాతావరణం క్రమేపీ తగ్గుముఖం పడుతోందని చెప్పడానికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చును. అటువంటిదే మరో ఉదాహరణ రెండు రాష్ట్రాలు కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసుకొని ఒడిష రాష్ట్రంలో నౌపార వద్దగల సర్పాల్‌ బొగ్గు గనులను అభివృద్ధి చేసుకొని, అందులో వచ్చే బొగ్గును సమానంగా వాటాలు పంచుకోవాలని అంగీకరించడం ఒకటని చెప్పుకోవచ్చును. ఇటీవల సుప్రీం కోర్టు 1993 నుండి వివిధ ప్రైవేటు సంస్థలకు కేటాయించిన బొగ్గు గనుల కేటాయింపులను రద్దు చేసింది. కానీ సమైక్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఈ బొగ్గు గనులను మాత్రం రద్దు చేయకపోవడంతో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేసేందుకు సిద్దపడినట్లయితే, ఆ గనిలో లభ్యమయ్యే 280 మిలియన్‌ టన్నుల బొగ్గును దక్కించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెంటనే సానుకూలంగా స్పందించారు.   తీవ్ర విద్యుత్ కొరతతో ఇబ్బందులు పడుతున్న రెండు రాష్ట్రాలకు ఇది ఊహించని వరమని చెప్పవచ్చును. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అనేకం ఉన్నప్పటికీ నిత్యం బొగ్గు కొరతతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదొక వరమని చెప్పవచ్చును. ఈ బొగ్గు గనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పక్కనే ఉన్న ఓడిషా రాష్ట్రంలో ఉండటం వలన రవాణా ఖర్చు కూడా తగ్గుతుంది. అదేవిధంగా తెలంగాణకు అక్షయపాత్ర వంటి సింగరేణి బొగ్గు గనులున్నప్పటికీ ఇప్పుడు అదనంగా లభిస్తున్న ఈ బొగ్గును అవసరమయితే వాడుకోవచ్చును, లేదా తెలంగాణాలో కొత్తగా విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏర్పాటు చేసుకొనేవరకు తన వాటాను కూడా ఆంధ్రాకే అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చును.   ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకోసం ఏపీ జెన్ కో మరియు ఏపీ మినరల్ డేవలప్మెంటు సంస్థలకు ఈ బాధ్యత అప్పగిస్తే, తెలంగాణా ప్రభుత్వం తెలంగాణా జెన్ కో సంస్థకు ఈ బాధ్యత అప్పగించింది. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు చెందిన ఆ మూడు సంస్థలు కలిసి ఒక సంయుక్త సంస్థను ఏర్పాటు చేసుకొని నౌపారాలో బొగ్గును త్రవ్వి వెలికి తీసి చెరిసగం సమానంగా పంచుకొనేందుకు సిద్దమవుతున్నాయి. ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరువురూ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంతో, సంబంధిత అధికారులు సంయుక్త సంస్థ ఏర్పాటుకు అవసరమయిన విధివిధానాలు, దానికి అధికారుల నియామకాలు తదితర అంశాలపై కసరత్తు త్వరలోనే మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇదే విధంగా మిగిలిన వ్యవహరాలలో కూడా రెండు ప్రభుత్వాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణి అవలంభిస్తే, రెండు రాష్ట్రాలు సమానంగా వేగంగా అభివృద్ధి సాధించగలవు.

జయమ్మ ఓదార్పు యాత్ర కబుర్లు

  అదేమిటో ఈ వెర్రిబాగుల జనాలు అక్కడెక్కడో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసుకి రాష్ట్రంలో మన రెడ్డిగారి కేసులకి ముడిపెట్టేసి, ‘అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత?’ అని ఏవేవో కాకి లెక్కలు కట్టేస్తున్నారు. మరి అదేమీ వెర్రి ఆనందమో ఏమో? పైగా అన్నీ అచ్చం ఇక్కడిలాగే జరగడం వెనుక రాజకీయ కుట్ర ఏమయినా ఉందా? అనే అనుమానాలొకటి? వారి అనుమానాలను అంత వీజీగా కొట్టిపారేయడానికి లేదట. ఎందుకంటే జయలలిత అరెస్టు కావడంతో అక్కడ కూడా అనేకమంది ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకొంటున్నారుట. ఇంకెంతో మంది గుండెలు పెటేల్ పెటేల్మని కుండల్లా బ్రద్దలయినపోతున్నాయిట. ఇదంతా చూస్తున్నా మీకేమి గుర్తుకు రాకపోతే గజినీలాగా మెమొరీ లాసుందేమో చూపించుకొండని ఉంచిత సలహా ఒకటి.     అందువల్ల జయమ్మను ఇంకా మరికొన్నాళ్ళు ఇలాగే జైల్లో ఉంచినట్లయితే ఇంకా ఎన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకొంటారో ఊహించడం కష్టం కనుక ఆ (మానవీయ) కోణంలో ఆలోచించయినా ఆమెకు బెయిలు మంజూరు చేయమని ఆమె తరపున వాదిస్తున్న జెట్మలానీగారు కోర్టు వారిని అడిగారో లేదో అని ఇక్కడి జనాలు ఒకటే ఇదయిపోతున్నారు. ఏమయినప్పటికీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా జయమ్మ కారణంగానే జనాలు ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు కనుక ఇక తప్పనిసరిగా ఆమె కూడా వీలు వెంబడి ఓదార్పు యాత్రలు చేయక తప్పదని ఇక్కడి జనాలు అభిప్రాయపడుతున్నారు.     ఇంతవరకు ఆమె చేసింది చూసి మిగిలినవారు ఫాలో అయిపోవడమే తప్ప ఆమె ఏనాడు ఎవరినీ ఫాలో అయిన దాఖలాలు లేనప్పటికీ, ఓదార్పు యాత్రలు చేయడంలో మంచి అనుభవం ఉన్న మన రెడ్డిగారిని సంప్రదించడంలో తప్పేమీ లేదని జనాలు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు వైకాపా జాతీయపార్టీ అయిపోతోంది కనుక ఒకటేమిటి ఏడ్చేవాళ్ళు ఉండాలే కానీ అవసరమయితే చుట్టుపక్కల మరో నాలుగయిదు రాష్ట్రాలలో కూడా ఓదార్పు యాత్రలు చేసుకోగోలదని బల్ల గుద్ది వాదిస్తున్నారు అభిమానులు.   కానీ ఒట్టి తమిళనాడుకే పరిమితమయిన జయమ్మ ప్రస్తుతం సెల్లులో తనను తాను ఓదార్చుకొంటూ, అందులో నుండి బయటపడ్డాక తన కోసం ప్రాణాలు పోగొట్టుకొంటున్న తమిళ తంభిల కుటుంబాలను ఓదార్చక తప్పేలా లేదు. కానీ నాలుగేళ్ళు జైలులో కూర్చొంటే, పదేళ్ళ దాక ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుండదు కనుక, ఎవరినో ఓదార్చడం కంటే తనను తానే ఓదార్చుకోవడమే మంచిదని ‘నిపుణులు’ అభిప్రాయపడుతున్నారు.   ముష్టి అరవై కోట్ల అక్రమాస్తుల కేసును పట్టుకొని ఇరవై ఏళ్ళు సాగదీయగలిగినప్పుడు, ఇప్పుడు జెట్మలానీ గారు తిమ్మిని బమ్మిని చేసేసి కోర్టు కళ్ళకు మరో నల్లగుడ్డ ముక్కను గట్టిగా కట్టేసి బెయిలు మీద విడిపించకుండా ఉంటారా? అని సానుకూల దృక్పధంతో ఆలోచిస్తున్న వారూ లేకపోలేదు. అటువంటి వారు ఒకవేళ ఆమె బెయిలుపై బయట పడగలిగినట్లయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు, బెయిలు దొరికినప్పుడే ఓదార్పు యాత్రలు చేసుకోవాలని సూచిస్తున్నారు.   అయితే ఎంతసేపు ఆమె కేసులు, ఆమె బెయిలు, ఆమె ఓదార్పు యాత్రల గురించి మాట్లాడటమే కానీ మనోళ్ళ గొప్పదనం గురించి చెప్పుకొనే మంచి బుద్ధులు, మంచి అలవాట్లు బొత్తిగా మనోళ్ళకి లేవని జనాలు చాలా బాధ పడుతున్నారు. అది చూసి నిక్షేపంగా బెయిలు మీద తిరుగుతున్నవాడిని పట్టుకొని ఆ మాటనడానికి మీకు నోరెలా వచ్చిందని కసురుకొనే వారు లేకపోలేదు.   అయినా జయమ్మ జైల్లోకి వెళ్ళింది కదాని మన రెడ్డిగారు, కనిమోలి, రాజావారు అందరూ అలాగే జైలుపాలయిపోతారనుకోవడం అవివేకం కాదా? ఎంత చెట్టుకు అంత గాలన్నట్లు ఎవరి కేసులు వారివి. ఎవరు ఎప్పుడు లోపలకి వెళతారో ఎప్పుడు ఎలా బయటకు వస్తారో ఎవరికీ తెలియదు. కానీ లోకులు కాకులు వంటి వారు. మడమ తిప్పని మంచి వాళ్లకే కష్టాలన్నీ. అలాగని జైలు శిక్ష పడగానే బెంబేలు ఎత్తిపోనవసరం లేదంటున్నారు నిపుణులు.   విలాసవంతమయిన తమ జీవితాలను ప్రజల కోసమే త్యాగం చేసేసి జైలుకు వెళుతున్నట్లు చెప్పుకొనే ఒక కొత్త వెసులుబాటు కనుగొనబడిందిప్పుడు. పంటి బిగువున తాము భరించిన జైలు కష్టాలన్నీ ప్రజల కోసమే పడుతున్నట్లు చెప్పుకోనే వెసులుబాటున్నపుడు జైలు శిక్ష కూడా రాజకీయ జీవితానికి పెట్టుబడి క్రిందే భావించడం అలవాటు చేసుకోగలిగితే ఇంక ఏ బాధ ఉండదు. అప్పుడు పోలీసు వ్యానులో ఎక్కుతున్నప్పుడు, జైల్లోకి వెళుతున్నప్పుడు, మధ్యమధ్య కోర్టు కేసులకి హాజరవుతున్నప్పుడు, బెయిలు మీద బయటకు వస్తున్నప్పుడు హుషారుగా అభిమానులు వెంటరాగా ఎంచక్కా ఊరేగింపులు కూడా నిర్వహించుకోవచ్చునని అనుభవజ్ఞుల సలహా.

ఇసుకమాఫియాపై సీబీఐ విచారణకు వైకాపా డిమాండ్

  రాష్ట్రంలో నానాటికి పెరిగిపోతున్న ఇసుక మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని వై.యస్సార్. కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ ఉదాసీనత వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా తీవ్ర నష్టం జరుగుతోందని, కనుక ప్రభుత్వం తక్షణమే ఇసుక మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.   రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం ఇసుక మాఫియానే కాక, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఎర్రచందనం దొంగల మాఫియా, గనుల మాఫియా వంటి రకరకాల మాఫియా గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. అయితే జ్యోతుల నెహ్రూ కోరినట్లుగా వాటిపై సీబీఐ విచారణకు ఆదేశించినంత మాత్రాన్న ఆ మాఫియాలు వెనక్కు తగ్గుతాయని ఆశించలేము. వాటన్నిటి వెనుక రాజకీయ పార్టీ నేతలలున్నంత కాలం వారి ఆటలు కొనసాగుతూనే ఉంటాయి. గత రెండు దశాబ్దాలుగా శేషాచలం అడవులలో నుండి ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్నప్పటికీ, ఇంతవరకు ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరు బయటపడకపోవడం గమనిస్తే పరిస్థితి అర్ధమవుతుంది. ఇటువంటి ప్రతీ అక్రమం వెనుకా ఏదో ఒక పార్టీకి చెందిన రాజకీయ నాయకులే ఉంటునప్పుడు వాటిపై సీబీఐ విచారణలు చేయాలని డిమాండ్ చేయడం ద్వారా దాని వెనుక ఉన్న సదరు నేతను ఇబ్బంది పెట్టడానికే తప్ప వేరే ఇతరత్రా ఏ ఉపయోగం ఉండబోదని చెప్పవచ్చును. దేశంలో ఉగ్రవాదులను, మావోయిస్టులను ప్రభుత్వం ఏవిధంగా ఉక్కు పాదంతో అణచివేస్తుందో ఈ మాఫియాలను కూడా అదే విధంగా అణచి వేయగలిగినప్పుడే ఈ మాఫియా ఆగడాలు తగ్గుముఖం పడతాయి.

యూపీయే డీలా...ఎన్డీయే టైట్: వినోద్ రాయ్

యూపీయే హయంలో 2జి, బొగ్గు కుంభకోణాలను బయటపెట్టిన మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ వ్రాసిన ‘జస్ట్ నాట్ యాన్ అకౌంట్’ అనే పుస్తకం కొద్ది రోజుల క్రితం మార్కెట్లోకి విడుదలయింది. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “సంకీర్ణ రాజకీయాల కారణంగా యూపీయే ప్రభుత్వాన్ని కూటమిలో భాగస్వామ పార్టీలు తలోదిక్కుకు లాగుతుండటం వలన పాలనపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లేకుండా పోయిందని, దాని వలన అధికారులలో కూడా జవాబుదారీతనం లోపం కొట్టవచ్చినట్లు కనబడేదని అన్నారు. కానీ ఎన్డీయే ప్రభుత్వంపై మాత్రం ఆ పార్టీ నాయకత్వం పూర్తి నియంత్రణ సాధించిందని ఆయన అన్నారు. అదే విధంగా ఎన్డీయే ప్రభుత్వం అనేక నిరుపయోగామయిన వ్యవస్థలను రద్దు చేయడం వలన అధికారులకు స్వేచ్చగా నిర్ణయాలు తీసుకొనేందుకు వీలుపడుతోందని అంతే కాక దాని వలన వారిలో జవాబుదారీతనం పెరిగినట్లు స్పష్టంగా కనబడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే తానిప్పుడు ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు నిర్వహించడం లేదు కనుక మరింత లోతుగా విశ్లేషించలేనని ఆయన తెలిపారు. మోడీ ప్రభుత్వంపై వినోద్ రాయ్ ప్రశంశలు గమనిస్తే బహుశః ఆయన ఏదయినా పదవి ఆశిస్తున్నారేమో అనే అనుమానం కలగడం సహజం. అయితే అటువంటి నిజాయితీపరుడయిన మాజీ ఉన్నతాధికారి సేవలను మోడీ ప్రభుత్వం ఉపయోగించుకొంటే మంచిదే.

జగన్మోహన్ రెడ్డికీ జయలలిత పరిస్థితే ఎదురవుతుందా?

  అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, ఆమె అనుచరులకు ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షలు చూస్తున్నవారికి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కూడా మనసులో మెదలడం సహజం. జయలలితపై రూ.63 కోట్ల అక్రమాస్తుల కేసులు నమోదు అయితే జగన్ పై వేల కోట్ల అక్రమాస్తుల కేసులు నమోదు చేయబడ్డాయి. జయలలితపై కేవలం ఒక్క కేసు మాత్రమే ఉండగా, జగన్మోహన్ రెడ్డిపై ఏకంగా పదకొండు చార్జ్ షీట్లు నమోదు చేయబడి ఉన్నాయి. వాటిలో పదింటిని నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మినారాయణ పూర్తి సాక్ష్యాధారాలతో చాలా పకడ్బందీగా నమోదు చేసారు. ఒకవేళ ఆ పది చార్జ్ షీట్లలో ఏ కొన్నిటిలో జగన్మోహన్ రెడ్డి, మిగిలిన నిందితులు దోషులుగా నిర్ధారించబడినా శిక్షలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించడం కూడా కష్టమే. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిలుపై బయట ఉన్నప్పటికీ, సీబీఐ కోర్టుకు తరచూ హాజరవుతూనే ఉన్నారు. ఇదివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చలువ వలననే ఆయన బయటున్నారనే వాదనలు వినబడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆయన తీవ్రంగా వ్యతిరేఖించే తెదేపా మిత్రపక్షమయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కనుక ఆయన కేసుల విషయంలో కలుగజేసుకోకపోవచ్చును. జయలలిత అక్రమాస్తుల కేసులను ఆమె లాయర్లు దాదాపు రెండు దశాబ్దాలు నెట్టుకు రాగలిగారు. కానీ చివరికి శిక్షపడకుండా మాత్రం ఆమెను కాపాడలేకపోయారు. అందువలన ఆయన తరపున వాదిస్తున్న లాయర్లు ఈ కేసులన్నిటినీ ఎంత సమర్ధంగా, ఎంత ఎక్కువ కాలం పొడిగించగలరనే దానిపైనే ఆయన భవిష్యత్ ఆధారపడిఉందని చెప్పవచ్చును. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న లాయర్లు కూడా కనీసం వచ్చే ఎన్నికలవరకు కేసులను సాగదీయగలిగితే, అప్పటికి రాష్ట్రంలో కానీ, కేంద్రంలో గానీ రాజకీయ పరిస్థితులలో మార్పులు వస్తే ఆయనకు ఎంతో కొంత ఉపశమనం దొరకవచ్చును. కానీ ఈలోగానే ఆయన కేసులలో ఏ ఒక్కటి కొలిక్కి వచ్చినా ఆయనకు ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు తప్పక పోవచ్చును.   జయలలిత అక్రమాస్తుల కేసులు ఆమె రాజకీయ భవిష్యత్తును ఏవిధంగా ప్రభావితం చేసాయో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కూడా ఆయన రాజకీయ భవిష్యత్ పై తీవ్ర ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.