కాంగ్రెస్, వై.కాంగ్రెస్ రాజధాని భూసేకరణ వ్యతిరేఖ కమిటీలు

  రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే రెండు, మూడు కమిటీలు వేసింది. విజయవాడలో రాజధాని నిర్మాణాన్ని స్వాగతించిన కాంగ్రెస్, వైకాపాలు ఇప్పుడు ప్రభుత్వం రైతుల నుండి బలవంతంగా భూములు గుంజుకొంటోందని ఆరోపిస్తూ ప్రభుత్వంతో పోరాడేందుకు చెరో కమిటీ ఏర్పాటు చేసుకొన్నాయి. ఇంతవరకు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రమే చూసిన ప్రజలకి ఇప్పుడు అధికార కమిటీ, ప్రతిపక్ష కమిటీలను కూడా చూసే భాగ్యం కలుగుతోంది. అధికార కమిటీ రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి రాజధాని నిర్మాణం కోసం వారి భూములు తీసుకొనేందుకు కృషి చేస్తుంటే, ప్రతిపక్ష కమిటీలు అధికార పార్టీ ప్రయత్నాలను విఫలం చేయడానికి కృషి చేస్తాయి.   అధికార పార్టీ నేతలు రైతుల నుండి బలవంతంగా భూములు స్వాధీనం చేసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు కనుకనే తాము రైతుల తరపున నిలబడి ప్రభుత్వంతో పోరాడవలసి వస్తోందని చెప్పుకొంటున్నారు. ప్రభుత్వం తూళ్ళూరు మండలం కేంద్రంగా రాజధాని నిర్మాణం తలబెట్టినట్లు తెలియగానే ఆ మండలంలో ఇంతవరకు మూడు గ్రామ సభలు జరిగినట్లు సమాచారం. అందులో కొన్ని గ్రామాలు తప్ప చాలా గ్రామాలలో రైతులు ప్రభుత్వం తమ డిమాండ్లన్నిటికీ ఒప్పుకొన్నట్లయితే తాము సంతోషంగా తమ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని మీడియా ముఖంగా ప్రభుత్వానికి తెలియజేసారు. వారు మరో సంగతి కూడా చెప్పారు. ఈ వ్యవహారంపై గ్రామాలలో అప్పుడే రాజకీయాలు కూడా మొదలయ్యాయని తెలిపారు. బహుశః అది ప్రతిపక్షాలు చేస్తున్న ఈ ప్రయత్నాలను ఉద్దేశించి అన్నమాటలే అయ్యి ఉండవచ్చును.   ప్రభుత్వం రైతుల దగ్గర నుండి దౌర్జన్యంగా భూములు గుంజుకొనే ప్రయత్నం చేస్తే, దాని వలన తనకే కొత్త సమస్యలు, అప్రతిష్ట తప్పదని ప్రభుత్వానికి కూడా తెలుసు. అందుకే రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తే, రాజధానిని వేరొక చోటికి తరలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందే ప్రకటించారు. అటువంటప్పుడు అధికార పార్టీ రైతులపై ఎందుకు దౌర్జన్యం చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు కమిటీలు వేసుకొన్నాయంటే, సున్నితమయిన ఈ అంశం నుండి కూడా రాజకీయ మైలేజి పొందాలనే తాపత్రయమే తప్ప మరొకటి కాదని చెప్పవచ్చును. ప్రభుత్వం తమ షరతులు, డిమాండ్లకు అంగీకరిస్తే తాము భూములు అప్పగించేందుకు సిద్దంగా ఉన్నామని అనేక గ్రామాలలో రైతులు స్వయంగా చెపుతున్నప్పుడు, వైకాపా మాత్రం చాలా హడావుడిగా ఒక కమిటీ వేసేసుకోవడం విశేషం.   రైతులు తమ జీవనాధారమయిన భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకొంటే నిశబ్దంగా ఉంటారని ఎవరూ అనుకోనవసరం లేదు. వారు తమకు అన్యాయం జరిగిందని నిరసన కార్యక్రమాలు మొదలుపెడితే కాంగ్రెస్, వైకాపాలు వెళ్లి వారికి అండగా నిలబడితే అందరూ హర్శిస్తారు. కానీ వారికి లేనిపోనివి చెప్పి భయాందోళనలకు గురిచేసి, ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఉసిగొల్పాలనుకొంటే దానివలన చివరికి వారే నవ్వుల పాలయ్యే ప్రమాదం ఉంది. అయినా ప్రతీ అంశంపై రాజకీయ మైలేజి పొందాలని ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు ప్రజల చేతిలో భంగపడక తప్పదని వారు గ్రహించాలి.వారు గ్రహించాల్సిన ముఖ్యమయిన విషయం మరొకటి కూడా ఉంది. ఈవిధంగా రాజధాని నిర్మాణానికి అడ్డంపడుతుండటం రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారనే సంగతి గుర్తుంచుకోవడం మంచిది. 

పెట్టుబడుల ఆకర్షణే బాబు ఎజెండా

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది. అయితే ఈ ఢిల్లీ టూర్ మెయిన్ ఎజెండా పెట్టుబడుల ఆకర్షణేనని ప్రచారం జరుగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చే దిశగా బాబు ఢిల్లీ టూర్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.   ఏపీకి పెట్టుబడుల వెల్లువను తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు.  ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని ఆయన జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతిచోట నుంచి ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారాయన.  ఏపీని సాధ్యమైనంత త్వరగా డెవలప్ చేసి తన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి అనుక్షణం తపిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన బాగా సఫలమయ్యారు కూడా. అయినా ఏ కోశాన ఆయన రిలాక్స్ మూడ్ లో కనిపించడం లేదు.     దేశం గర్వించేలా ఏపీని డెవలప్ చేయాలని కంకణం కట్టుకున్నారు.  బాబు కష్టపడుతున్న తీరుకు ప్రధాని మోడీ కూడా అబ్బురపడుతున్నారట. అందుకే బాబు ఏ సాయం కావాలని కోరినా... ఇవ్వడానికి ఓకే చెప్పేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి సీఎం ఏపీకి ఉండడం నిజంగా ఎంతో అభినందనీయమని కేంద్రమంత్రులతో చెబుతున్నారట మోడీ.  

కేసీఆర్ మార్క్ బడ్జెట్

  ఈరోజు తెలంగాణా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ ప్రవేశపెట్టిన రాష్ట్ర తొలి బడ్జెట్ తెరాస అధినేత కేసీఆర్ ముద్ర చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలను అన్నిటినీ అమలుచేసేందుకు బడ్జెట్ లో కేటాయింపులు చేసారు. ముఖ్యంగా విద్య, వైద్య, విద్యుత్ రంగాల అభివృద్ధికి తగిన విధంగా బడ్జెట్ లో కేటాయింపులు జరిపారు. అదేవిధంగా రోడ్ల నిర్మాణం, చెరువుల పునరుద్దరణ, సాంఘిక సంక్షేమానికి కూడా బడ్జెట్ లో చాలా ప్రాధాన్యం ఇచ్చినట్లు కనబడుతోంది. అయితే తెలంగాణా రాష్ట్ర సాధన కోసం దాదాపు 1200-2000 మంది వరకు యువకులు బలిదానాలు చేసుకొన్నట్లు చాలాసార్లు చెప్పిన తెరాస ఇప్పుడు కేవలం తను గుర్తించిన 459మంది అమర వీరులకు మాత్రమే బడ్జట్ లో రూ.100కోట్లు కేటాయించడం చాలా ఆక్షేపించవలసిన విషయం. మిగిలిన అమరవీరులు చేసిన త్యాగాలను గుర్తించకపోవడం వారిని అవమానించినట్లే. వారి త్యాగాల కారణంగానే ఈ రోజు తెరాస అధికారంలోకి వచ్చిందనే విషయం గ్రహించి ఉంటే, మిగిలిన అందరి కుటుంబాలను తప్పకుండా ఆదుకొనిఉండేది. అందుకోసం ఇందిరా పార్క్ లో రూ.15కోట్లతో నిర్మించతలపెట్టిన తెలంగాణా కళా భవన్ మానుకోవచ్చును లేదా న్యాయవాదులు, జర్నలిస్టులకి కలిపి కేటాయించిన 115కోట్ల ఖర్చు తగ్గించుకోవచ్చును.   ఇక తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సమయంలో విద్యుత్ ఉత్పాదనకి చాలా భారీగా కేటాయింపు చేస్తారని అందరూ భావించారు. కానీ విద్యుత్ రంగానికి కేవలం రూ.3241 కోట్లు, తెలంగాణా జెన్ కోలో ప్రభుత్వ పెట్టుబడిగా మరో 1000కోట్లు మాత్రమే కేటాయించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కానీ రోడ్ల నిర్మాణానికి ఏకంగా రూ 10వేల కోట్లు కేటాయించారు. మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో, జిల్లా కేంద్రాలను రాజధానితో కలుపుతూ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.   అదేవిధంగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సాగునీటి సమస్యను పరిష్కరించడానికి రూ 2వేల కోట్ల కేటాయించారు. తొలివిడతలో రాష్ట్రంలో తొమ్మిదివేల చెరువులను పూడికలు తీసి రిపేర్లు చేస్తున్నారు. వాటి పునరుద్దరణతో పొలాలకు నీటి సౌకర్యం ఏర్పడటమే కాక బోరు బావులలో మళ్ళీ నీటిమట్టాలు పెరుగుతాయి. అదేసమయంలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి, సరఫరాకు కూడా ప్రభుత్వం చేప్పటిన చర్యల కారణంగా రైతులు నీళ్ళ మోటర్లకు విద్యుత్ సరఫరా మెరుగయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఈవిధంగా కేసీఆర్ సాగు నీరు, విద్యుత్ రెండు సమస్యలను ఒకేసారి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నందున బహుశః ఒకటి రెండు సం.లలో సమస్యలు ఒక కొలొక్కి రావచ్చును.   ఇక రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీ, యస్సీ,ఎస్టీ మరియు మైనార్టీ వర్గాలకు బడ్జెటులో తగు కేటాయింపులు చేసారు. బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు, ఎస్సీల సబ్ ప్లాన్ కు రూ.7579 కోట్లు, ఎస్టీల సబ్ ప్లాన్ కు రూ.4559 కోట్లు కేటాయించారు. కళ్యాణ లక్ష్మి పధకం క్రింద ఎస్సీలకు రూ.150 కోట్లు, ఎస్టీలకు రూ.80కోట్లు కేటాయించారు. ఎస్సీల అభివృద్ధి కోసం 2014-19 వరకు రూ.50 వేల కోట్లు ఖర్చుచేయబోతున్నట్లు ప్రకటించారు. ఒకవిధంగా ఈ బడ్జెట్ తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కలలు కంటున్న ‘బంగారి తెలంగాణా’ సాధనకు వేసిన తొలి అడుగుగా చెప్పవచ్చును.

కిరణ్ బీజేపీలోకి వస్తారా?

కన్నా తర్వాత బీజేపీలోకి వచ్చే పేర్లలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కు మార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కిరణ్ ఇప్పటికే బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు కూడా జరిపారట. బీజేపీ హైకమాండ్ కూడా కిరణ్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తోందట.   రాష్ట్ర విభజనను  ఆపడానికి గట్టిగా ప్రయత్నించిన వ్యక్తిగా కిరణ్ కు కొంత సానుభూతి ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ కు కిరణ్ ఎదురొడ్డిన తీరునుకు  అప్పట్లో జాతీయ మీడియా కూడా ప్రాముఖ్యత ఇచ్చింది. అయితే జై సమైక్యాంధ్ర పార్టీ అంటూ వేరుకుంపటి పెట్టుకొని ఆయన దెబ్బతిన్నారు. ఎన్నికలకు ముందు పార్టీ పెట్టడంతో తన కేబినెట్ సహచరులు మద్దతిస్తారని కిరణ్ ఆశించారు. కానీ ఆయన ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోయాయి. కిరణ్ కు ఎన్నికలకు ముందే తన భవిష్యత్తేంటో అర్థమైపోతుంది. చివరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఎలాగోలా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశారాయన. ఎన్నికల ఫలితాలు ఊహించినవే కాబట్టి పెద్దగా ఆశలు కూడా పెట్టుకోలేదు కిరణ్. ఇక ఫలితాల తర్వాత ఆయన మీడియాలో కనిపించడం కూడా అరుదైపోయింది. అసలు ఎన్నికల తర్వాత కిరణ్ ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు.       మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన తాను ఇలా అనుకోని పరిస్థితుల్లో ఖాళీగా ఉండడం కిరణ్ కు నచ్చడం లేదట. అందుకే తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన గట్టిగానే కసరత్తు చేశారని సమాచారం. తన సన్నిహితులతో సుదీర్ఘ మంతనాలు జరిపారని తెలిసింది. ఏ పార్టీ అయితే బెటరని గట్టిగానే వర్కవుట్ చేశాట. పార్టీల వారీగా లెక్కలు వేసుకన్నారట. టీడీపీలోకి వెళ్లలేరు. వైసీపీకి దగ్గర కాలేరు. అలా అని తిరిగి కాంగ్రెస్ లోనూ వెళ్లలేరు. ఎలాగూ ఆపార్టీకి ఏపీలో అంతసీనే లేదు. ఇక మిగిలిన ప్రధాన పార్టీ బీజేపీ ఒక్కటే. ప్రస్తుతం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో బీజేపీ సూపర్ ఫామ్ లో ఉంది. మోడీ ఏది కావాలంటే అది జరుగుతోంది. దేశవ్యాప్తంగా మోడీ అనుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ అంశాలన్నింటినీ ఆయన బేరీజువేసుకొని బీజేపీ వైపే ఇంట్రెస్టు చూపిస్తున్నారని తెలుస్తోంది.       కిరణ్ రాకపై బీజేపీ నుంచి కూడా పాజిటివ్ సిగ్నల్  వస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ కూడా ఏపీలో కిరణ్ వస్తే బలపడతామని గట్టిగా విశ్వసిస్తోందట. అమిత్ షా అయితే కిరణ్ బయోడేటా అంతా పరిశీలించి ఓకే కూడా చెప్పేశారట. అయితే ముహూర్తంపైనే తర్జనభర్జనలు జరుగుతున్నాయని చెబుతున్నారు. త్వరలోనే ఈ అంశాన్నింటిపైనా క్లారిటీ ఇచ్చేందుకు కిరణ్ సిద్ధంగా ఉన్నారట. మరి ఆయన ఏం చెబుతారన్నది వేచి చూడాల్సిందే.

అందుకే డిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్రం ఆమోద ముద్ర?

  డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీతో సహా ఏ పార్టీ ముందుకు రాకపోవడంతో డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ డిల్లీ అసెంబ్లీని రద్దు చేసేందుకు రాష్ట్రపతికి సిఫార్సు చేసారు. దానిని ఈరోజు సమావేశమయిన కేంద్రమంత్రి వర్గం ఆమోదించింది. కనుక కాంగ్రెస్, ఆమాద్మీ పార్టీలు కోరుకొంటున్న విధంగానే డిల్లీ అసెంబ్లీకి త్వరలో మళ్ళీ ఎన్నికలు జరగడం ఖాయమయిపోయింది. ఇదివరకు జాలు కట్టబెట్టిన అధికారాన్ని కుంటి సాకుతో వదులుకొన్న ఆమాద్మీ పార్టీ, ఈసారి ఎలాగయినా ఎన్నికలలో పూర్తి మెజార్టీతో గెలిచి పూర్తి కాలం అధికారం చెలాయించాలని ఉవ్విళ్ళూరుతోంది. అయితే ప్రస్తుతం దేశంలో మోడీ హవా చాలా జోరుగా వీస్తునందున్న డిల్లీ ఎన్నికలలో అవలీలగా గెలవడం తధ్యమని బీజేపీ నేతలు దృడంగా విశ్వసిస్తున్నారు. అటువంటప్పుడు మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భంగ పడటం కంటే ఎన్నికలు నిర్వహించి పూర్తి మెజార్టీతో అధికారం చెప్పట్టడమే మంచిదనే ఆలోచనతోనే,  మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా కాదనుకొని ఎన్నికలకి మొగ్గు చూపుతున్నారు. కానీ ఒక రాష్ట్రం తరువాత ఒక దానిని బీజీపికి ధారాదత్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు.

ఆ సన్నాసుల సహకారమే కావాలిప్పుడు

  కృష్ణా బోర్డు చైర్మన్ పట్టుకొని కేసీఆర్ 'సన్నాసి' అనేసినట్లు వార్తలు వచ్చేయి. సన్యాసి కాని వాడిని పట్టుకొని సన్నాసి అనడం ఏమిటని చాలా మంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసారు. కానీ కేసీఆర్ ఒకసారి కమిట్ అయితే తన మాట తానే వినడు. కనుక ఇక ఆ విషయం గురించి ఎంత గొంతు చించుకొన్నా కంటశోష తప్ప మరొక ప్రయోజనం ఉండదు.   ఆనక ఆయన మేనల్లుడు హరీష్ రావు నిజంగా సన్యాసిణి అయిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి ఆంధ్రాపై, సదరు సన్నాసిపై కూడా పిర్యాదులు చేయడానికి డిల్లీ బయలుదేరినప్పుడు, కేసీఆర్ మళ్ళీ ఆమెను కూడా సన్నాసి(ణి) అని అనేస్తారేమోనని జనాలు తెగ కంగారు పడ్డారు. కానీ ఆమె మంత్రి హరీష్ రావు పిర్యాదులకు సానుకూలంగా స్పందించడమే కాకుండా శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసుకోమని అనుమతి కూడా ఇచ్చేయడంతో బ్రతిపోయారు. లేకుంటే కేసీఆర్ ఆ సన్యాసిణిని కూడా సన్నాసి అనేసేవారేమో! అయితే చంద్రబాబు నాయుడు తనకు దూరదృష్టి లేదంటేనే చాలా హర్ట్ అయిపోయిన కేసీఆర్, ఇలా ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని సన్నాసులు, దద్దమ్మలు అంటూ తిడుతుంటే వాళ్ళు మాత్రం హర్ట్ అవరా? హర్ట్ అయినా అవనట్లు సర్దిచెప్పుకొని వాళ్ళు ఆయనకి, తెలంగాణా ప్రభుత్వానికి సహకరిస్తారా?

అబ్బ...ఆయనే గుర్తొస్తున్నారు..

  ఈ మధ్యన ఏమిటో తరచూ ఆయనే అందరి కలల్లోకి వస్తున్నారుట! ఆయన అనగానే స్వర్గీయ యన్టీఆరో..లేక స్వర్గీయ రాజశేఖ రెడ్డో అనుకొనేరు...రాష్ట్ర విభజనని తీవ్రంగా వ్యతిరేఖిస్తూ పోరాడిన వ్యక్తి. అలాగని జగన్మోహన్ రెడ్డి అనుకొనేరు...స్మీ! చివరి దాక రాష్ట్ర విభజనని, ఆ నిర్ణయం తీసుకొన్న తన కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించిన వ్యక్తి...మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు తరచుగా అందరి కలల్లోకి వస్తున్నట్లు తెగ ప్రచారం అవుతోంది.   ఆనాడు రాష్ట్ర విభజన చేస్తే నీళ్ళ కోసం కరెంటు కోసం గొడవలొస్తాయని చిలక్కి చెప్పినట్లు చెప్పారు. కానీ ఆయన మాటేవరూ చెవికెక్కించుకోలేదు. రాష్ట్రాన్ని విభజిస్తే పార్టీ మట్టి కొట్టుకుపోతుందని అరిచి గ్గీ పెట్టారు, కానీ ఆయనే పార్టీకి ఎసరు పెట్టేలా ఉన్నారని సాటి కాంగ్రెస్ జీవులన్నీ అప్పుడు చెవులు కొరుకొన్నాయి. ఆయన వేరు కుంపటి పెట్టుకొని బయటకు వెళ్ళిపోయిన తరువాత ఆయనిక మళ్ళీ పార్టీలోకి తిరిగి రాడనీ రూడీ చేసుకొన్నాక, ఆ చెవులు కొరుకొన్న కాంగ్రెస్ జీవులన్నీ దైర్యంగా ఇంటి కప్పుపైకి ఎక్కి మరీ జనాల చెవులు చిల్లులు పడేలా ఆయనే పార్టీకి ఎసరు పెట్టారు అని తెగేసి ప్రకటించేశారు. కానీ జనాలు మాత్రం వాళ్ళ మాటలసలు నమ్మలేదు, కానీ జనాలే కాంగ్రెస్ పార్టీకి ఎసరు పెట్టేసారు. కాంగ్రెస్ పార్టీకే కాదు చెప్పులరిగిపోయేలా తిరిగినా పాపం ఆయన చెప్పుల పార్టీకి కూడా ఒక్కసీటు రాలేదు. పాపం అందరికీ శకునం చెప్పిన బల్లి కుడితిలో పడి చచ్చిందన్నట్లయింది ఆయన పరిస్థితి. రాష్ట్రానికి, తెలుగు జాతికి, కాంగ్రెస్ పార్టీకి ఎంచక్కగా జోస్యం చెప్పిన ఆయన కనబడకుండా పోయాడు.   కానీ జనాలు మాత్రం ఇప్పుడు ఆయన చెప్పిన జోస్యం గుర్తు తెచ్చుకొంటూ ఆకులు పట్టుకొంటున్నారు. అయితే జనాలెవరూ కూడా ఆయనలాగే జోస్యం చెప్పి, విభజనను వ్యతిరేఖిస్తూ పోరాడి చివరికి దేశాటన కూడా చేసి వచ్చిన మరో పెద్దమనిషి జగన్మోహన్ రెడ్డి గురించి ఈవిధంగా ఎప్పుడు అనుకోకపోవడం ఏమిటో..అస్సలు అర్ధం కావడం లేదు. ఒకానొకప్పుడు సమైక్య ఛాంపియన్ రేసులో ఇద్దరూ సరి సమానంగానే పరిగెత్తారు. ఇద్దరూ కూడా ఒక్కలాగే జోస్యం చెప్పారు. కానీ జనాలు ఆయనని తలచుకొని ఈయనగారిని మరిచిపోవడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏమంటే ఆయన ముందే ప్రామిస్ చేసినట్లు రాజకీయ సన్యాసం తీసుకొన్నారు కనుక ఆయనొక గొప్ప త్యాగమూర్తని...ఈయనగారు సమైక్యాంధ్ర ఉద్యమం పేరుతో జనాలకి కుచ్చు టోపీ పెట్టిన వాడని...లక్షా తొంబై కారణాలు చెప్పవచ్చు గాక, కానీ అంతమాత్రాన్న క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చేయడం ఏ మాత్రం భావ్యం కాదు.   నిజానికి పెరటి మొక్క వైద్యానికి పనికి రాదనే సంగతి గ్రహించకుండా కిరణ్ కుమార్ రెడ్డి తన అధిష్టానానికి నచ్చచెప్పాలని చూడటం మొదటి తప్పు. ఒకపక్క అధిష్టానానికి వద్దు వద్దు అని చెపుతూనే చివరి నిమిషం వరకు ముఖ్యమంత్రి కుర్చీని అంటి పెట్టుకొని కూర్చొవడం మరో తప్పు. కూర్చొని మళ్ళీ అదే అధిష్టానానికి రాష్ట్ర విభజనకి ‘ఫుల్ కోపరేషన్’ ఇవ్వడం ఇంకో తప్పు. కోపరేషన్ చేస్తూనే చేయడం లేదని బుకాయించడం మరో తప్పు. సమయం కాని సమయంలో వేరు కుంపటి పెట్టుకోవడం మరో పెద్ద తప్పు. ఒక పక్క రాష్ట్రం విడిపోతుంటే సమైక్యాంధ్ర పార్టీ అని పేరు పెట్టుకోవడం ఇంకో తప్పు.   ఇన్ని తప్పులు చేసి, కేవలం స్వీయ తప్పిదాల కారణంగానే కనబడకుండాపోయిన ఆయనను జనాలు తలుచుకొంటున్నారే గానీ కంటికెదురుగా తిరుగుతున్న చెట్టంత మనిషిని పట్టించుకోక పోవడం చాలా దారుణం. ఇంతకీ ఆయనగారి గొప్పదనం ఏమిటి ఈయనగారు చేసిన నేరం ఏమిటి?ఈ జనాల తీరు చూస్తే కడుపు రగిలిపోతోంది...విశ్వసనీయతే లేదు వీళ్ళకి... 

విలేఖరిపై ఘరానా అల్లుడు గారి దౌర్జన్యం

  ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో యువరాజు రాహుల్ గాంధీ గారి హవా నడిచేది. ఎక్కడ చూసినా ఆయన నామస్మరణే వినిపించేది. కానీ ఇప్పుడు ఆయన స్థానంలోకి బావగారు రాబర్ట్ వాద్రా వచ్చేసినట్లు కనబడుతోంది. అంటే ఆయనేదో కాంగ్రెస్ పార్టీ బాధ్యత చేపడతారని కాదు గానీ హర్యానా రాష్ట్రంలో ఆయనగారి భూభాగోతాల కారణంగా ఇప్పుడు నిత్యం ఆయన పేరు మీడియాలో కనబడుతోంది. ఇంతవరకు ఆయనకు అండగా నిలబడిన హర్యానా ముఖ్యమంత్రి భూపేంద్ర హుడా స్థానంలోకి ఇప్పుడు బీజేపీకి చెందిన మనోహర్ లాల్ కత్తార్ రావడంతో ఘరానా అల్లుడిగారు పేరు మరింత మారు మ్రోగిపోతోంది. ఎందుకంటే హర్యానాలో కొత్తగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అల్లుడిగారి భూ భాగోతాల మీద విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది.   నిన్న ఘరానా అల్లుడుగారు డిల్లీలో ఒక స్టార్ హోటల్ కి వచ్చినప్పుడు అదే విషయంపై ఆయన స్పందన తెలుసుకోవడానికి వెళ్ళిన విలేఖరిని “నన్ను ఆ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? అని గద్దించారు. అయినా ఆ విలేఖరి నక్షత్రకుడిలా వదలకుండా ఆయన వెంట పడటంతో అల్లుడుగారికి మా చెడ్డ చిరాకు వచ్చేసినట్లుంది. దానితో ఆయన కోపంగా అతని చేతిలో ఉన్న మైకును పక్కకు నెట్టేసి “ఆర్ యూ సీరియస్...ఆర్ యూ సీరియస్....ఆర్ యూ సీరియస్... ఆర్ యూ సీరియస్?” అంటూ నాలుగు సార్లు గట్టిగా అరిచేసరికి పాపం ఆ విలేఖరి బిక్క మొహం వేయక తప్పలేదు.   అయితే ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం కొసమెరుపు. ఎందువలన అంటే ఇది జరగగానే "అల్లుడుగారు అమ్మగారి కుటుంబంతో ఉన్న బంధుత్వం వలన రాజ్యాంగేతర శక్తిలా తయారవుతున్నారని, ఆయనపై సదరు విలేఖరి పిర్యాదు చేసినట్లయితే చర్యలు తీసుకొంటామని" కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని అల్లుడుగారి సంగతి ఆయన అత్తగారో లేదా శ్రీమతిగారో ఎవరో ఒకరు చూసుకొంటారని కాంగ్రెస్ పెద్దలు భావించారో ఏమో.. ఈ వ్యవహారంతో తమా పార్టీకి సంబంధం లేదని ప్రకటించి చేతులు దులుపుకొన్నట్లు సమాచారం. అందువల్ల ఘరానా అల్లుడు గారిని కాపాడుకోవడానికి అత్తగారో లేక ఆయన శ్రీమతిగారో  కొంగు బిగించకతప్పదేమో.

తెలంగాణా రైతన్నలను కాపాడుకొందాము

  యధా రాజా తధా ప్రజా అన్నారు పెద్దలు. అది తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మంత్రులకి కూడా సరిగ్గా వర్తిస్తుందని చెప్పవచ్చును. విద్యుత్ కష్టాలకు గత ప్రభుత్వాలే కారణం కనుక రైతుల ఆత్మహత్యలకు కూడా గత ప్రభుత్వాలే కారణమవుతాయనే సిద్దాంతాన్ని ఆయన కనుగొన్న తరువాత దానిని ఆయన మంత్రులు కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు.   వారిలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరు. కానీ ఆయన మరో అడుగు ముందుకు వేసి “తెరాస అధికారంలోకి వచ్చిన తరువాతనే రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లు తెదేపా, కాంగ్రెస్ పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ వారి హయాం నుండే రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వారి పరిపాలనలో మూడువేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. కావాలంటే ఇదిగో సాక్ష్యం..” అని ఏవో కాగితాలు చూపించారు. అంతేకాదు రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లాలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొన్నారో లిస్టులు తెప్పించుకొని వారి కుటుంబాలకి తమ ప్రభుత్వం సాయం చేద్దామని ఆలోచిస్తున్నట్లు చెప్పడం చూస్తే ఆయన రైతుల ఆత్మహత్యలకు, వారి కష్టాలకు ఆయన మానవత్వంతో స్పందిస్తున్నట్లు కనబడలేదు.   అసలు ప్రభుత్వంలో మంత్రులు, శాసనసభ్యులు, యంపీలు, యం.యల్సీలు అందరూ స్వయంగా రైతులను కలుస్తూ వారికి భరోసా కల్పించే విధంగా మాట్లాడి, వీలయినంత తక్షణ సహాయం అందించి వారు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎందుకు అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం లేదు? రైతన్నలు బ్రతికున్నప్పుడు పట్టించుకోకుండా చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం చేస్తామని చెప్పడం ద్వారా వారికి ఎటువంటి సందేశం అందిస్తున్నారు? అని తెలంగాణా మంత్రులు తమను తాము ప్రశ్నించుకోవాలి.   ఇక తెలంగాణాలో ప్రతిపక్షాలు కూడా సున్నితమయిన ఈ సమస్యపై రాస్తారోకోలు, ఆందోళనలు చేసి రాజకీయంగా మరింత బలం పెంచుకోవాలని చూస్తున్నాయే తప్ప అన్ని పార్టీలు కలిసి డిల్లీ వెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేకపోవడం చాలా శోచనీయం. ఈ సమస్య వలన అధికార పార్టీ ఇబ్బందిపడితే దానిపై తాము పైచేయి సాద్ధిదామనే తపనే కానీ తమ కళ్ళ ముందు ఆత్మహత్యలు చేసుకొంటున్న రైతన్నలను చూసి కంటతడి పెట్టలేకపోతున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం కలిసి పోరాడిన రాజకీయ పార్టీలు, జేఏసీలు ఇప్పుడు తమ రైతన్నలను రక్షించుకోవడానికి ముందుకు రాకుండా ఏమి చేస్తున్నాయి?   కేవలం తెలంగాణా ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షాలే కాదు, ఆంధ్రా ప్రభుత్వం, అక్కడి ప్రతిపక్షాలు కూడా తెలంగాణా రైతన్నలను కాపాడుకోవడం కోసం స్వచ్చందంగా ముందుకు రావాలి. కరెంటు ఇవాళ్ళ కాకపోతే రేపు వస్తుంది. కానీ రైతన్నలు చనిపోతే మరిక ఎన్నడూ తిరిగిరారనే సంగతి అందరూ గుర్తుంచుకొని, తక్షణం వారి సంక్షేమం కోసం అందరూ ఏమి చేయగలరో అది చేసి అందరికీ అన్నం పెట్టె అభాగ్య అన్నదాతలను కాపాడుకోవాలి. కార్ల మీద, మోటార్ సైకిల్ల నెంబరు ప్లేట్ల మీద ‘ఐ లవ్ ఇండియా’ అని స్టిక్కర్లు అంటించుకొని తిరగడం కాదు. ఇటువంటి సమయంలో కష్టాలలో ఉన్న రైతన్నలను ఆదుకొని ఇండియా పట్ల తమ ప్రేమ నిజమయిందని నిరూపించుకోవాలి. ఇరుగు పొరుగు రాష్ట్రాలలో, విదేశాలలో స్థిరపడిన ప్రవాస ఆంధ్ర, తెలంగాణా ప్రజలందరూ కూడా తెలంగాణా రైతన్నకి సహాయం చేసేందుకు తక్షణమే ముందుకు రావాలి.

మాటలు కాదు చేతలు కూడా అవసరం

  తెలంగాణా ఉద్యమానికి, ఎన్నికలలో గెలవడానికి అద్భుతంగా పనిచేసిన తెలంగాణా సెంటిమెంటు, పరిపాలన సాగించడానికి మాత్రం అంతగా వర్కవుట్ అవడం లేదనిపిస్తోంది. ఇదివరకు కేసీఆర్ మాటల గారడీకి మెచ్చుకొని జనాలు చప్పట్లు కొట్టినా, ఇప్పుడు ఆయన కరెంటు ఈయలేక చేతులు పిసుకొంటూ కూర్చోవడంతో జనాలు కూడా ఇప్పుడు చప్పట్లు కొట్టడం మరిచిపోతున్నారు. కరెంటు కోసం మరో రెండు మూడేళ్ళు ఆగమని ఆయన చెపుతున్నా వినకుండా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయితే ఆ పాపం గత ప్రభుత్వాలదేనని ఆయన చేతులు కడిగేసుకొన్నారు.   ఇప్పుడు ఆయన ఏమి చెప్పినా జనాలు కూడా వినిపించుకొనే పరిస్థితి కనబడటం లేదు. అందుకే హైదరాబాద్ రోడ్లని సినీ హీరోయిన్ బుగ్గలా నున్నగా మెరిపిస్తామని, వైఫీ సౌకర్యం కల్పిస్తామని, గొలుసుకట్టు చెరువులు బాగు చేయించి నీళ్ళు ఇస్తామని ఏవేవో కొత్త కొత్త హామీలు గుప్పిస్తున్నారు. కానీ ‘సమస్యల గొంగళీ’ మాత్రం వేసిన చోటనే ఉంది.   ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణా ప్రభుత్వ ఆదాయం బాగానే ఉందనే టాక్ ఒకటుంది. ఆంధ్రా దగ్గర కరెంటు ఉంది. కానీ డబ్బు లేదు. కనుక తనదగ్గర ఉన్న డబ్బు పెట్టి ఆంధ్రా దగ్గర కరెంటు కొనుకొనే ఆలోచన చేస్తే ఇరువురి కష్టాలు తీరవచ్చును. కానీ అందుకు అహం అడ్డువస్తోంది. పోనీ కేంద్రాన్ని కరెంటు ఇమ్మని అడగవచ్చును కానీ కేంద్రంతో కూడా పడదాయే.   ఇప్పుడు కేసీఆర్ కొత్తగా మరో గొప్ప సత్యం కనుకొన్నారు. అదేమంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కంటే రాష్ట్ర విభజన తరువాతే తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువయిపోయిందని! అయితే ఈ ఐదు నెలలలో తెలంగాణాకి కొత్తగా భారీ పరిశ్రమలేవీ రాలేదు. కొత్తగా లక్షల ఎకరాలలో ఎవరూ పంటలు వేయలేదు. మరి అటువంటప్పుడు అకస్మాత్తుగా విద్యుత్ వినియోగం ఎలా పెరిగిపోయిందో ఆయనే వివరించితే బాగుండేది. అయినా విద్యుత్ సరఫరాయే లేకపోతే ఇక వినియోగం ఎలా పెరుగుతుంది? అని ఆలోచిస్తే తగినంత విద్యుత్ సరఫరా లేకపోవడం వలననే కొరత ఏర్పడింది తప్ప వినియోగం పెరగడం వలన కాదని అర్ధమవుతోంది.   అటువంటప్పుడు బేషజానికి పోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తానంటున్న 300మెగావాట్స్ విద్యుత్ తీసుకొని వీలయితే అదనపు విద్యుత్ కూడా అడగవచ్చును. అదేవిధంగా విద్యుత్ సమస్యపై తనను నిలదీస్తున్న ప్రతిపక్షాలను, ముఖ్యంగా బీజేపీ నేతలను కూడా వెంటేసుకొని కేసీఆర్ డిల్లీ వెళ్లి మోడీపై ఒత్తిడి తెస్తే ఏమయినా ప్రయోజనం ఉండవచ్చును. కానీ మాటలతోనే ప్రజలను మురిపిద్దామని ప్రయత్నిస్తే కధ అడ్డం తిరిగే ప్రమాదం ఉంది.

సర్దార్‌కి సెల్యూట్... నెహ్రూ ఫ్యామిలీకి చెక్...

  భారత ప్రధాని నరేంద్రమోడీ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలందరి భాగస్వామ్యంతో విజయాలు సాధిస్తున్నాయి. మొన్నీమధ్య ఆయన గాంధీజీ స్ఫూర్తితో చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ప్రతిస్పందన లభిస్తోంది. ఆ కార్యక్రమం ఇక నిర్విరామంగా, నిరాటంకంగా కొనసాగుతుందన్న నమ్మకం బలంగా ఏర్పడింది. అలాగే ఇప్పుడు మోడీ చేపట్టిన మరో కార్యక్రమం దేశ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అది ముక్కలు చెక్కలుగా వున్న భారతదేశాన్ని ఒక్కటి చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’గా నిర్వహించడం, ఈ సందర్భంగా ప్రజలతో కలసిపోయి సమైక్యతా పరుగు, సమైక్యతా ప్రతిజ్ఞ వంటి కార్యక్రమాలను నిర్వహించడం! ప్రధాని నరేంద్రమోడీ సర్దార్ పటేల్ జయంతిని ఇంత భారీగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడం వెనుక దేశంకోసం జీవితాన్ని అంకితం చేసిన సర్దార్ పటేల్‌కి సరైన రీతిలో నివాళులు అర్పించడం మాత్రమే కాకుండా, ఇంతకాలం దేశం నెత్తిన గుదిబండలా కూర్చున్న నెహ్రూ కుటుంబానికి చెక్‌ పెట్టే ఉద్దేశం వుందని కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.   దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి ప్రధానమంత్రి హోదాలో నాయకత్వం వహించే అంశంలో పటేల్, నెహ్రూ మధ్య నెలకొన్నపోటీ, ఆ పోటీలో నెహ్రూ ‘తెలివిగా’ సాధించిన విజయం అందరికీ తెలిసిందే. దేశంలో ముక్కలు చెక్కలుగా వున్న సంస్థానాలను విలీనం చేసి అఖండ భారతదేశాన్ని నిర్మించడంలో హోంమంత్రి హోదాలో సర్దార్ పటేల్ చేసిన కృషి అనితరసాధ్యమైనది. నెహ్రూ కాకుండా పటేల్ దేశానికి మొదటి ప్రధానమంత్రి అయితే భారతదేశం ఇప్పుడు మరోలా వుండేదన్న అభిప్రాయాలు వినిపిస్తూ వుంటాయి. సాహసి, దార్శనీకుడు, నిస్వార్థపరుడు అయిన పటేల్ ప్రధానమంత్రి కాకపోవడం ఈ దేశ దురదృష్టాల్లో ఒకటన్న అభిప్రాయం కూడా వుంది. నెహ్రూ కూడా గొప్ప నాయకుడే... కానీ ఆయన వారసత్వం మాత్రం దేశాన్ని అధోగతిపాలు చేసింది. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత అభివృద్ధిలోకి వెళ్ళాల్సిన దేశం తిరోగమన దిశగా పయనించడానికి నెహ్రూ కుటుంబం ప్రధాన కారణమన్న అభిప్రాయాలూ వున్నాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూకంటే మిన్నగా కృషి చేసిన సర్దార్ వల్లభాయ్‌ పటేల్‌కి ఆ తర్వాత నెహ్రూ కుటుంబ పాలనలో సరైన గుర్తింపు లభించలేదు. దానికి కారణం ప్రధాని పదవి విషయంలో నెహ్రూతో పటేల్ పోటీపడటమేననేది బహిరంగ రహస్యమే. ఈ రాజకీయ కారణంతోనే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో వున్న ఇంతకాలం పటేల్‌కి సరైన రీతిలో నివాళులు అర్పించలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏ కార్యక్రమంలోనయినా దేశాన్ని సుదీర్ఘంగా పాలించిన నెహ్రూ కుటుంబం పేర్లు వినిపిస్తాయే తప్ప, దేశంకోసం సర్వస్వం అర్పించిన పటేల్ లాంటి నాయకుల పేర్లు ఏనాడూ వినిపించలేదు. ఆ పొరపాటును దిద్దే పనిని ఇప్పుడు మోడీ చేయడం అభినందనీయం.   ఇప్పుడు దేశం నెత్తిన కాంగ్రెస్ పార్టీ రూపంలో నెహ్రూ కుటుంబ గుదిబండ వుంది. దీనిని క్రమంగా తొలగించే పనిని మోడీ చేపట్టినట్టు కనిపిస్తోంది. మోడీ ఒక వైపు మహాత్మాగాంధీని, మరోవైపు సర్దార్ పటేల్‌ని స్ఫూర్తిగా తీసుకుంటూ వీరిద్దరూ దేశంకోసం సమంగా పోరాడిన నాయకులని అంటున్నారు. గాంధీజీ, పటేల్ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా మరొకరు అసంపూర్ణంగా వుండేవారని మోడీ చెబుతున్నారు. అంతే తప్ప ఆయన ఏ సందర్భంలోనూ నెహ్రూ పేరును ప్రస్తావించిన దాఖలాలు లేవు. అక్టోబర్ 31వ తేదీన పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారే తప్ప, నెహ్రూ కుటుంబానికి చెందిన ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో మోడీ పాల్గొనలేదు. ఇది దేశానికి పట్టిన నెహ్రూ కుటుంబ జాడ్యాన్ని క్రమక్రమంగా తొలగించే బృహత్తర కార్యక్రమంలో మొదటి అడుగుగా భావించవచ్చన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేశారు. నెహ్రూ దగ్గర మొదలుపెట్టి.. ఇందిర.. రాజీవ్.. సోనియా... రాహుల్... ఇలా క్రమక్రమంగా నాసిరకంగా మారుతున్న నెహ్రూ కుటుంబ వారసత్వ చెర నుంచి దేశాన్ని కాపాడే ఉద్దేశంతో మోడీ వున్నారని పరిశీలకులు అంటున్నారు.

పెరిగిన రాష్ట్ర ఆదాయం, ఖర్చుపై నియంత్రణకు కృషి

  రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా బాగా దెబ్బతింది. ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం ఇప్పుడప్పుడే కోలుకోలేదని చాలా మంది ఆందోళన చెందారు. కానీ అదృష్టవశాత్తు రాష్ట్రం త్వరగానే కోలుకొంటున్న సూచనలు కనబడుతున్నాయి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సమావేశమయిన వివిదశాఖాల ఉన్నతాధికారులు, గత సంవత్సరంతో పోలిస్తే తమ తమ శాఖల ఆదాయం ఆశించిన దానికంటే బాగానే పెరిగిందని చెప్పారు.   గత సం.తో పోలిస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో ఎక్సైజ్ శాఖ ఆదాయంలో-85శాతం వృద్ధి కనబడగా, కమర్షియల్ టాక్స్-93శాతం, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్-85శాతం, రెవిన్యూ- 115.6శాతం, రవాణా-78శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. మొత్తం మీద ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో అన్ని శాఖల ఆదాయం కలిపి రూ.12, 881 కోట్లు వచ్చిందని, గత సం. ఇదే కాలానికి రూ.11,313కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఏడాదిలో ఇంతవరకు 17.6 శాతం వృద్ధి కనబడిందని వారు తెలిపారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారినందరినీ అభినందిస్తూనే, రాష్ట్ర ఆర్దికపరిస్థితి పూర్తిగా కుదుటపడేవరకు అందరూ తమ తమ శాఖలకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను చాలా పొదుపుగా వాడుకోవాలని, అదేవిధంగా బడ్జెట్ లోటు మరింత పెరగకుండా ఖర్చుల మీద పూర్తి నియంత్రణ సాధించాలని కోరారు. వృదాఖర్చులను అరికట్టి ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఇదివరకు మహారాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన ‘ఎకనామిక్ ఇంటలిజెన్స్’ పద్దతిని మన రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నించమని ఆయన కోరారు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సయిజ్ పాలసీనే రాష్ట్రంలో అమలు చేయడానికి అనువుగా ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించమని ఆయన ఎక్సయిజ్ అధికారులను కోరారు. రవాణాశాఖ తన ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు మరింత కృషి చేయాలని ఆయన కోరారు.   గత డిశంబరు నెలలో కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలలో కనుగొన్న అపారమయిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు ఆరు నెలలోగా ఒక కన్సల్టెన్సీ ఏజన్సీని నియమించాలని ఆయన కోరారు.   ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రాణాలికేతర వ్యయాన్ని కనీసం 20శాతం కంటే తక్కువలో ఉండేలా ఖర్చులను నియంత్రించుకోవాలని అన్ని శాఖల అధికారులను కోరారు. అన్ని శాఖల అధికారులు కూడా ఏ శాఖ ఆదాయం ఎక్కువగా ఉంటుందో దానికి అన్ని విధాల సహకరిస్తూ ఆ ఆదాయం మరింత పెరిగేందుకు తోడ్పడాలని ఆయన కోరారు. అన్ని శాఖల మధ్య మరింత సమన్వయం సాధించడం ద్వారా అన్ని శాఖలు తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.

ఇక చిరంజీవి మారడం కష్టమే...

  మాజీ మెగాస్టార్ చిరంజీవి రాజకీయ విధానాలు తెలుగు ప్రజలకు విసుగు తెప్పించాయి. ఆయన్ని సినిమా తెరమీద చూస్తే ఆనందంతో బట్టలు చించుకునే అభిమానులు కూడా రాజకీయంగా చిరంజీవి పేరు చెబితేనే చిరాకుపడే పరిస్థితికి వచ్చారు. పార్టీ పెట్టడం దగ్గర్నుంచి, పార్టీ మూసేసి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు, రాష్ట్ర విభజన సందర్భంలో వ్యవహరించిన తీరు వరకు అనేక అంశాలు చిరంజీవి రాజకీయ అపరిపక్వతకు, స్వార్థపూరిత రాజకీయాలకు అద్దం పట్టాయి. తన రాజకీయ ప్రస్థానంలో చిరంజీవి తెలుగు ప్రజలకు విసుగు పుట్టించడంతోపాటు అనేక గుణపాఠాలు నేర్చుకునే అవకాశాలను కూడా పొందారు. అయితే ఆ అవకాశాల నుంచి చిరంజీవి గుణపాఠాలను నేర్చుకున్న దాఖాలు ఎంతమాత్రం కనిపించడం లేదు. చిరంజీవి అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు ఎందుకూ పనికిరాని వ్యూహాలని, వాటివల్ల చిరంజీవికి కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కితే దక్కవచ్చేమోగానీ, ప్రజల నుంచి తిరస్కరణే ఎదురవుతుందన్న పెద్ద గుణపాఠాన్ని కూడా ఆయన నేర్చుకోలేదు. ప్రజల్లో ఎంతో ఛరిష్మా వున్న తాను కాలికి బలపం కట్టుకుని సీమాంధ్ర అంతా తిరిగినా ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా రాకపోవడం నుంచి ఆయన ఎలాంటి జ్ఞానోదయాన్నీ పొందలేదు. అందుకే ఆయన ఇప్పటికీ తన పంథాలోనే వెనక్కి దూసుకువెళ్తున్నారు.   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వారానికో పదిరోజులకో ఒకసారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నేనింకా బతికే వున్నానని చెప్పుకునే స్థితిలో వుంది. అలాంటి పార్టీని ఐదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికలలో గెలిపించే బాధ్యతని భుజాన వేసుకున్న చిరంజీవి ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు రాజకీయాలు, కామెంట్లు చేస్తున్నారు. విశాఖ తుఫాను బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు చేసిన కృషిని దేశమంతా ప్రశంసిస్తోంది. చీటికి మాటికి చంద్రబాబును విమర్శించే కార్యక్రమంలోనే మునిగివుండే జగన్ కూడా ఈ విషయంలో చంద్రబాబును ఎలా విమర్శించాలా అని రకరకాల సాకులు వెతుకుతూ విమర్శిస్తున్నారు. అయితే ఆ విమర్శలన్నీ బెడిసికొడుతూ వుండటంతో నాలుక కరుచుకుంటున్నారు. జగన్ పరిస్థితిని చూసి అయినా చిరంజీవికి జ్ఞానోదయం కలగలేదు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని, అదనీ, ఇదనీ ఏవేవో విమర్శలు చేస్తూ ప్రజల్లో ఆయన మీద వున్న కాస్తంత మర్యాదని కూడా పోగొట్టుకునేలా వ్యవహరిస్తున్నారు. హుదూద్ తుఫాను సంభవించగానే చంద్రబాబు నాయుడు విశాఖకు వెళ్ళి అక్కడ అనేక సహాయ కార్యక్రమాలు చేసి, ఎన్నోరోజులు అక్కడే మకాం వేశారు. అలాంటి పరిస్థితుల్లో చిరంజీవి ఏం చేశారు? సహాయ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత, తుఫాను వచ్చిపోయిన వారం రోజుల తర్వాత విశాఖకు వెళ్ళి గెస్ట్ ఆర్టిస్టులాగా డైలాగులు చెప్పి వచ్చారని ప్రజలు అంటున్నారు. తుఫాను సహాయం విషయంలో చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు చిరంజీవికి ఎంతమాత్రం లేదని ప్రజలు అంటున్నారు. తుఫాను బాధితులకు ఎంపీ లాడ్స్ నుంచి విరాళం ఇచ్చారే తప్ప తన సొంత జేబులోంచి పైసా కూడా విదల్చని చిరంజీవికి తుఫాను బాధితుల సహాయ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అంటున్నారు. రాజకీయంగా పాతాళంలోకి పడిపోయినా తన తీరు మార్చుకోని చిరంజీవి భవిష్యత్తులో అయినా మారడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు.

అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదు

  విద్యుత్ సంక్షోభంతో నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నా తక్షణమే స్పందించి వారికి భరోసా కల్పించి, అందుకు నివారణ చర్యలు చెప్పట్టకపోగా ఈ విద్యుత్ సంక్షోభానికి ఇంతవరకు రాష్ట్రాన్ని పాలించిన తెదేపా, కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమని ఆరోపిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కరెంటు లేక కాళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే, అప్పుల భయంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొంటుంటే మరో మూడేళ్ళు ఓపిక పట్టండి విద్యుత్ సంక్షోభాన్ని పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇస్తున్నారు. విద్యుత్ సంక్షోభంతో రాష్ట్రం విలవిలలాడుతుంటే, తక్షణమే డిల్లీ వెళ్లి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి చేసి జాతీయ గ్రిడ్ నుండి అదనపు విద్యుత్ పొందే ప్రయత్నాలు గట్టిగా చేయకపోగా, ఆపని చేసిన తెలంగాణా తెదేపా యంపీ, యం.యల్యే.లను విమర్శిస్తున్నారు.   తెదేపా సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ గుండు సుధారాణి తదితరులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిల్లీలో ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావుతో నేతృత్వంలో కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్, కలిసి తెలంగాణాలో విద్యుత్ సంక్షోభం దాని వలన ఎండిపోతున్న పంటలు, నానాటికి పెరుగుతున్న రైతుల ఆత్మహత్యలు వంటి పరిస్థితులన్నీ వివరించి తక్షణమే కేంద్ర గ్రిడ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి అదనపు విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసారు. ఆ తరువాత వారందరూ కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి రాధా మోహన్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు మరియు వాణిజ్యమంత్రి నిర్మలా సీతారామన్ లను కూడా కలిసి పరిస్థితి వివరించి తెలంగాణా రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసారు.   తెలంగాణా ప్రభుత్వం తరపున ఎవరూ వెళ్లి కేంద్రంతో మాట్లాడి అదనపు విద్యుత్ పొందే ప్రయత్నం చేయకపోయినా, అందుకోసం వెళ్ళిన తెదేపా నేతలపై విరుచుకు పడుతున్నారు. “తెదేపా నేతలు మా ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికే పనిగట్టుకొని డిల్లీ వెళ్ళారు తప్ప తెలంగాణా రాష్ట్రానికి కేంద్ర సహాయం కోరేందుకు కాదు” అని తెరాస యంపీ జితేందర్ రెడ్డి అనడం చూస్తే అమ్మ అన్నం పెట్టదు..అడుక్కు తిననివ్వదన్నట్లుంది. తెలంగాణా ప్రభుత్వమే చొరవ తీసుకొంటే మేమెందుకు డిల్లీ వెళతామని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికయినా తెలంగాణా ప్రభుత్వం మేల్కొని అన్ని పార్టీల ప్రతినిధులను వెంటబెట్టుకొని డిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అదనపు విద్యుత్ పొందే ఆలోచన చేస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.  

తెలంగాణలో బోర్లు భోరుమంటాయి...

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రైతులు ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న కరెంటు సమస్యను ఎలా అధిగమించాలో తెలియక ప్రభుత్వం విలవిలలాడుతుంటే, కరెంటు కోతల కారణంగా తమ పంటలకు నీరు అందడం లేదని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎండాకాలం రాకముందే పరిస్థితి ఇలా వుంది.. ఎండాకాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా వుంటుందోనన్న ఆందోళన తెలంగాణ రాష్ట్రంలోని అందర్లోనూ వుంది. ఇదిలా వుంటే తెలంగాణ రైతులకు షాక్‌లాంటి మరో విషయం బయటపడింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వున్న బోర్లు త్వరలో ఎండిపోబోతున్నాయని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు. అసలే కరెంటు లేక సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల పరిస్థితి ఇప్పుడు బోర్లు కూడా ఎండిపోతే ఏమైపోతుందో ఊహించడానికే భయం వేస్తోంది. తెలంగాణలో వ్యవసాయం 80 శాతానికి పైగా బోర్లమీదే ఆధారపడి వుంది. దాదాపు 18 లక్షల బోర్లు తెలంగాణలో వున్నాయి. ఇప్పుడు భూగర్భ జల నిపుణులు ఈ బోర్లు భోరుమనబోతున్నాయని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ రైతాంగం భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారోనన్న ఆందోళన కలుగుతోంది.

మరో కొత్త వివాదం: హైదరాబాద్ లో ఆంద్ర ప్రదేశ్ అధికారి అరెస్ట్

  ఇప్పటికే వివిధ అంశాలతో కత్తులు దూసుకొంటున్న ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలకి తమ యుద్ధం కొనసాగించడానికి మరొక బలమయిన కారణం దొరికింది. తెలంగాణ పోలీసులు హైదరాబాద్ ఆర్.టీ.సి క్రాస్ రోడ్స్ వద్దగల ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖకు చెందిన కార్యాలయంలో ప్రవేశించి రాష్ట్రానికి చెందిన అధికారి పీవీ మురళీ సాగర్ అనే అధికారి బీరువాను పగులగొట్టి అందులో ఫైళ్ళను స్వాధీనం చేసుకొన్నారు. ఆ తరువాత ఆయన ఇంట్లో కూడా శోధించారు.   మురళీసాగర్ తెలంగాణా రాష్ట్రానికి చెందిన రూ.609కోట్ల సొమ్మును అక్రమంగా విజయవాడ ఆంద్ర ప్రదేశ్ కార్మికశాఖ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి మళ్ళించారంటూ తెలంగాణా కార్మికశాఖ కమీషనర్ ఎ.అశోక్ చిక్కడపల్లి పోలీసు స్టేషనులో నిన్న ఉదయం పిర్యాదు చేయడంతో, పోలీసులు మురళీసాగర్ పై ‘చీటింగ్ మరియు నమ్మకద్రోహం’ కేసులు నమోదు చేసి ఆయన లేనప్పుడు ఆయన ఇంట్లో, కార్యాలయంలో తనికీలు నిర్వహించి, ఆయన ఆంద్రప్రదేశ్ చీఫ్ సెక్రెటరీతో సమావేశం ముగించుకొని సాయంత్రం సచివాలయానికి తిరిగి వచ్చినప్పుడు అరెస్ట్ చేసారు.   అవిబాజ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కార్మికశాఖ రాష్ట్రంలో గల మునిసిపాలిటీల నుండి కార్మిక సంక్షేమం కోసం 1శాతం సెస్ గా వసూలు చేసేది. ఆ మొత్తం రూ.1400కోట్లు ఉందని తెలంగాణా కమీషనర్ వాదన. విభజన చట్టం ప్రకారం ఆ మొత్తాన్ని రెండు రాష్ట్రాలు 58:42 నిష్పత్తిలో పంచుకొంటే తెలంగాణ వాటాగా రూ.609కోట్లు వస్తుంది. కానీ మురళీసాగర్ తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా ఆ మొత్తాన్ని విజయవాడకు తరలించారని పిర్యాదు చేసారు.   కానీ మురళీసాగర్ మీడియాతో మాట్లాడుతూ, తమ శాఖ వసూలు చేసిన మొత్తం రూ. 910 కోట్లు మాత్రమేనని, అందులో తెలంగాణకు రూ.410కోట్లు మాత్రమే వాటాగా వస్తుందని తెలిపారు. ఇంతవరకు ఆ మొత్తాన్ని ఫిక్సడ్ డిపాజిస్ట్ రూపంలో హైదరాబాద్ లోగల వివిధ బ్యాంకులలో ఉంచామని, దానిని రెండు రాష్ట్రాలు పంచుకోవాలంటే అందుకోసం రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో ఒక కమిటీని వేసి మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని, కానీ ఇంతవరకు కమిటీని ఏర్పాటు చేసుకోకపోవడంతో త్వరలో తమ కార్మికశాఖ కార్యాలయం విజయవాడకు తరలిపోతున్నందున ఆ మొత్తాన్ని విజయవాడలోని వివిధ బ్యాంకులలోకి బదిలీ చేసామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకే తాను ఈ మొత్తాన్ని విజయవాడకు బదిలీ చేసానని మురళీసాగర్ తెలిపారు.   తెలంగాణా పోలీసులు తమకు చెప్పకుండా, అనుమతి తీసుకోకుండా తమ ప్రభుత్వ కార్యాలయంలో జొరబడి, ఫైళ్ళను స్వాధీనం చేసుకోవడం, ఆంద్ర అధికారి ఇంట్లో తనికీలు నిర్వహించి ఆయనను అరెస్ట్ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ వ్యవహారంపై తక్షణమే దర్యాప్తు చేసి ఒక నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీ.జీ.పీ. రాముడుని ఆయన ఆదేశించారు.

వైకాపా యంపీ కొత్తపల్లి గీతకు కోర్టు సమన్లు

  అరకు వైకాపా యంపీ కొత్తపల్లి గీత గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటూ తెదేపా-బీజేపీ నేతలతో కలిసి తిరుగుతున్నారు. తనను గౌరవించని వైకాపాలో తను ఇమడలేనని ఇకపై తెదేపా-బీజేపీలతోనే కలిసి పనిచేస్తానని ఆమె ప్రకటించారు.   అప్పుడు ఆమె నియోజక వర్గానికే చెందిన పార్టీ యం.యల్యే. ఈశ్వరి ఆమె తాను దళిత కులానికి చెందిన వ్యక్తినని రిటర్నింగ్ అధికారికి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఆరోపణలు చేసారు. దానిపై యంపీ గీత స్పందిస్తూ “నాకు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ అధిష్టానం అవేవి చూడకుండానే టికెట్ ఇచ్చిందా? నేను యస్సీనని దృవీకరించుకొన్న తరువాతనే పార్టీ నాకు టికెట్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఆ విషయంపై ప్రశ్నించడం అంటే పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని తప్పుపట్టినట్లే కనుక ఈశ్వరి నన్ను ప్రశ్నిస్తున్నారా లేక పార్టీ అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారా?” అని ఎదురు ప్రశ్నించి ఆమె నోరు మూయించగలిగారు.   అయితే కొత్తపల్లి గీతపై పోటీ చేసి ఓడిపోయిన తెదేపా నేత సంద్యారాణి ఆమె ఎన్నికలలో పోటీ చేసేందుకు తప్పుడు కుల దృవీకరణ పత్రాలు సమర్పించారంటూ ఆమెపై హైకోర్టులో ఒక పిటిషను వేసారు. అయితే అప్పుడు కొత్తపల్లి గీత తెదేపాలోకి వచ్చి చేరుతుందని ఊహించకపోవడంతో ఇప్పుడు హైకోర్టు ఆమె వేసిన ఆ పిటిషను విచారణకు చెప్పట్టి ఆమెను ఈ నెల 31న కోర్టు విచారణకు హాజరు కమ్మంటూ నోటీసులు జారీ చేయడంతో తెదేపాకు కొంచెం ఇబ్బందికరం పరిస్థితి ఎదురయింది.   అది చూసి వైకాపా చాలా సంతోషపడిపోతోంది. అయితే నేటికీ కొత్తపల్లి గీతను తెదేపాలో చేర్చుకోకపోవడంతో ఆమె నేటికీ వైకాపా యంపీగానే పరిగణింపబడతారు. అయితే ఆవిషయం పట్టించుకోకుండా వైకాపా చంకలు కొట్టుకొని తెగ ఆనందపడిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకవేళ గీత కనుక ఈ వ్యవహారంలో దోషిగా తేలితే అందుకు వైకాపాయే బాధ్యత వహించాల్సి ఉంటుంది తప్ప తెదేపా కాదనే సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వైకాపా కేర్ ఆఫ్ లోటస్ పాండ్

  త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని త్వరలో విజయవాడకు తరలించబోతోంది. కనుక ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్నఆ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని జగన్ నివాసమయిన ‘లోటస్ పాండ్’ ప్యాలస్ లోకి తరలించబోతున్నారు. విజయవాడలో కార్యాలయం ఏర్పడేవరకూ అక్కడి నుండే తాత్కాలికంగా ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తారు. త్వరలోనే తెలంగాణా రాష్ట్రానికి కూడా వేరొకచోట పార్టీ కార్యాలయం ఏర్పాటుచేయబోతున్నట్లు సమాచారం.   రాష్ట్ర విభజన జరిగి విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయబోతున్నారు కనుక అక్కడ అన్ని పార్టీలు తమతమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం సహజమే. కనుక వైకాపా కూడా విజయవాడలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంలో ఎటువంటి తప్పులేదు. కానీ తెలంగాణా రాష్ట్రంలో కూడా పార్టీని నడపాలని భావిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్ దాని కోసం ‘లోటస్ పాండ్’లో కాక వేరొకచోట కార్యాలయం ఏర్పాటుచేయాలని భావిస్తున్నప్పుడు ముందుగా ఆ ఏర్పాటు చేసుకొని అక్కడికి పార్టీ కార్యాలయాన్ని తరలించి ఉండిఉంటే బాగుండేది. కానీ ముందు ఆ పనిచేయకుండా పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసి, తాళం వేయడం తెలంగాణా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపినట్లయింది. అసలే పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న పార్టీ తెలంగాణా నేతలకు, కార్యకర్తలకు ఇది మింగుడుపడని విషయమే. అయితే అది జగన్ కి చెప్పుకోవాలన్నా వారికి ‘లోటస్ పాండ్’ లోకి ఎంట్రీ అంత వీజీ కాదు.

ముదిరి పాకానపడుతున్న ఇరు రాష్ట్రాల విభేదాలు

  కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా హడావుడిగా రాష్ట్ర విభజన చేసి తను నష్టపోవడమే కాకుండా ఇరు రాష్ట్ర ప్రజలకి, ప్రభుత్వాలకీ కూడా అనేక కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. దానికి తోడూ ఆంధ్రాపాలకులను, తెదేపా ప్రభుత్వాన్ని, దాని అధినేత చంద్రబాబు నాయుడుని తీవ్రంగా ద్వేషించే కేసీఆర్ తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టడంతో నిత్యం ఏదో ఒక అంశం మీద రెండు రాష్ట్రాల మధ్య గొడవలు, విమర్శలు ప్రతివిమర్శలు మామూలయిపోయాయి. చివరికి అవి గవర్నరు, సుప్రీంకోర్టు వరకు కూడా వెళుతుండటం సర్వ సాధారణ విషయమయిపోయింది.   ఇప్పటికే నీళ్ళు, విద్యుత్ పంపకాల విషయంలో గొడవ పడుతున్న రెండు రాష్ట్రాలు ఇప్పుడు ఇంటర్ మరియు ఎంసెట్ పరీక్షల నిర్వహణ మీద విభేదించాయి. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ప్రస్తుత విద్యావిధానమే మరో పదేళ్ళు కొనసాగవలసి ఉండగా, తెలంగాణా ప్రభుత్వం ఇంటర్ పరీక్షలను వేరేగా నిర్వహించుకొంటామని వాదిస్తోంది. దానికి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ తెలంగాణా ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో ఈసారి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఆలోచిస్తోంది.   తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ మరియు జలవివాదాలలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇప్పటికే గవర్నరు మరియు కృష్ణానది జల యాజమాన్య బోర్దులకు పిర్యాదులు చేసి త్వరలోనే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లేందుకు సిద్దపడుతుంటే, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్, ఎంసెట్ అడ్మిషన్లు, పరీక్షల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్దపడుతోంది. బహుశః ఇటువంటి పోరాటాలు మరో ఐదేళ్ళపాటు కొనసాగినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే ఇరు రాష్ట్రాల ప్రతిష్ట దెబ్బతింటుంది. అభివృద్ధి కూడా కుంటుపడుతుంది.