పుస్తకం రాస్తున్న జైపాల్ రెడ్డి

  తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోసం తెర వెనుక కృషిచేసిన అనేక మందిలో మాజీ కేంద్రమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి కూడా ఒకరు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించినప్పటి నుండి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వరకు కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక నాటకీయమయిన సంఘటనలు జరిగిన సంగతి ప్రజలందరూ స్వయంగా చూసారు. ముఖ్యంగా బద్ధ శత్రువులయిన కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంటు సాక్షిగా ఆడిన రాజకీయ చదరంగం చూసిన ప్రజలు అసలు బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అని ఆఖరి నిమిషం వరకు ఉప్పిరి బిగపట్టి చూశారు.   కాంగ్రెస్, బీజేపీల మధ్య ఎటువంటి అవగాహన కుదిరింది? ముందు బెట్టు చేసిన బీజేపీ ఆఖరు నిమిషంలో మనసు మార్చుకొని బిల్లుకు ఎందుకు మద్దతు ఇచ్చింది? దాని వెనుక సూత్రదారులు, పాత్రదారులు ఎవరెవరున్నారు? ఆంద్ర యంపీలు, కేంద్రమంత్రుల అసలు రూపాలు ఏమిటి? వంటి అనేక ప్రశ్నలు విభజన తరువాత పూర్తిగా మరుగున పడిపోయాయి. ఇప్పుడు కేంద్రంలో, రెండు రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో పుస్తక ప్రియుడయిన జైపాల్ రెడ్డి మళ్ళీ పుస్తక పటనంతో కాలక్షేపం చేస్తున్నారు. ఆయన సన్నిహితుల కోరిక మేరకు జైపాల్ రెడ్డి విభజన బిల్లు ఆమోదం కోసం తెర వెనుక జరిగిన కధని ప్రజల కోసం అక్షరబద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అయితే కొన్ని కారణాల వలన ఆ పుస్తకాన్ని వచ్చే ఏడాది విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అది విడుదల అయితే ఎన్ని సంచలన విషయాలు బయటపడుతాయో..ఎంతమంది భాగోతాలు బయటపడుతాయో..

కేసీఆర్‌కి షాకిస్తున్న మజ్లిస్

  తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌ పాతబస్తీలో బలంగా వున్న మజ్లిస్ పార్టీతో సీఎం కేసీఆర్ అనుబంధాన్ని పెంచుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు మజ్లిస్ నేతల ఇళ్ళకి వెళ్ళి మరీ స్నేహబంధాన్ని పెరిగేలా చేశారు. మజ్లిస్ నాయకులు గతంలో తెలంగాణ ఏర్పాటునే తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌తో చేతులు కలిపి ‘భాయీ భాయీ’ అన్నారు. కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికన మజ్లిస్‌తో స్నేహం పెంచుకోవడానికి గల కారణం హైదరాబాద్‌ కార్పొరేషన్ ఎన్నికలలో మెజారిటీ సాధించడం కోసమే అని రాజకీయ పరిశీలకులు అంటూ వుంటారు. హైదరాబాద్‌లో స్థిరపడిపోయిన సీమాంధ్రులు పొరపాటున కూడా టీఆర్ఎస్‌కి ఓటు వేయరు. ఆ లోటును తీర్చుకోవాలంటే ముస్లింలను మంచి చేసుకోవాలన్నది కేసీఆర్ రాజకీయ వ్యూహమని, అందులో భాగంగానే మజ్లిస్‌తో ఫ్రెండ్ షిప్ అని పరిశీలకులు అంటారు. ఎవరు ఏమనుకున్నప్పటికీ గత ఐదు నెలలుగా టీఆర్ఎస్, మజ్లిస్ మధ్య స్నేహం మూడు పువ్వులు - ఆరు కాయలు అన్నట్టుగా వుంది. మజ్లిస్ నేతలు కేసీఆర్ని పల్లెత్తు మాట కూడా అనకుండా చుప్ చాప్‌గా వున్నారు. కేసీఆర్ కూడా ముస్లిం అనుకూల ధోరణిని ప్రదర్శిస్తూ రాబోయే హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ దశలోనే కేసీఆర్‌కి మజ్లిస్ నాయకులు షాక్‌లు ఇవ్వడం ప్రారంభించారు.   అయితే కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వ విధానాల మీద మజ్లిస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కరెంటు సమస్య మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నలతో ముంచెత్తడంతో టీఆర్ఎస్ నాయకులు కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ప్రణాళికల గురించి, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం గురించి, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ లైన్ల ఏర్పాటు గురించి అక్బరుద్దీన్ ఘాటుగా ప్రశ్నలు సంధించారు. విద్యుత్ కొనుగోలుకు, ప్రాజెక్టుల ఏర్పాటుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన స్పష్టంగా ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నుంచి మాత్రమే కాకుండా తమ మిత్రపక్షంగా భావిస్తున్న మజ్లిస్ నుంచి కూడా ఈ ప్రశ్నలు రావడం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఊహించని పరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ కొన్నప్పుడు ఆ ముందు జాగ్రత్త తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు లేకుండా పోయిందన్న అక్బరుద్దీన్ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. దీంతోపాటు మంగళవారం నాడు కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద మజ్లిస్ దాడి కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే మీద మజ్లిస్ నాయకుడు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ఉన్న ఒక్క మిత్రపక్షమూ ఇలా ఎదురుదాడి చేయడంతో కేసీఆర్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిపోయింది.

విద్యుత్ పై తెలంగాణా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం

  విద్యుత్ సంక్షోభంపై తెలంగాణా రాష్ట్ర శాసనసభలో ఈరోజు జరిగిన చర్చ ఊహించిన దానికంటే చాలా వేడిగానే సాగింది. ఈ విద్యుత్ సంక్షోభానికి, రైతుల ఆత్మహత్యలకి గత ప్రభుత్వాలదే బాధ్యత అని, కేంద్రం కూడా తెలంగాణాపట్ల కక్ష గట్టినట్లు వ్యవహరిస్తోందనే కేసీఆర్ వాదన ప్రభుత్వాన్ని కాపాడకపోగా ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్, తెదేపా, బీజేపీలను ఏకత్రాటిపైకి తీసుకువచ్చి వారు కలిసికట్టుగా ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు మాత్రం బాగా ఉపయోగపడింది. అదేవిధంగా నానాటికీ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నప్పటికీ గత ఐదు నెలలుగా నిర్లిప్తంగా కూర్చొన్న ప్రభుత్వం, శాసనసభా సమావేశాలు మొదలవుతాయనగా హడావుడిగా డిల్లీ పర్యటనలు, విద్యుత్ ఒప్పందాలు చేసుకొని తమ ప్రయత్నలోపం ఏమీ లేదని వాదించడాన్ని కూడా ప్రతిపక్షాలు తప్పు పట్టాయి. శాసనసభ్యులను మభ్యపెట్టడానికి తప్ప వాటి వల్ల మరే ప్రయోజనమూ లేదని వాదించారు.   మూడేళ్ళ తరువాత నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని కేసీఆర్ సభలో చేసిన ప్రతిజ్ఞ వారి వాదనలను బలపరుస్తున్నట్లుగా ఉంది. రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న ఈ సమస్య ఇంత త్వరలో తీరేది కాదని ఆయన చేసిన ప్రతిజ్ఞ స్వయంగా ద్రువీకరించినట్లయింది. కనీసం మూడేళ్ళ తరువాతయినా ఆ హామీ నెరవేర్చడం సాధ్యం కాదని నెరవేరిస్తే, కేసీఆర్ కు తాను స్వయంగా ఇదే సభలో పాలతో అభిషేకం చేస్తానని తెదేపా సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తమ పార్టీ సిద్దంగా ఉందని అన్నారు. కానీ తెదేపా వలననే ఈ సమస్య ఏర్పడిందని కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ముగ్గురూ గట్టిగా వాదించడంతో ప్రభుత్వం వారి సహకారం అవసరం లేదని చెప్పకనే చెప్పినట్లయింది.   ఈరోజు సభలో జరిగిన వాదోపవాదాలు విన్నట్లయితే, తెరాస ప్రభుత్వం, ప్రతిపక్షాలు కూడా చాలా గట్టిగా కసరత్తు చేసిందని అర్ధమవుతోంది. ప్రభుత్వం చాలా నిరంకుశధోరణితో వ్యవహరించడాన్ని తప్పుపట్టాయి. తెదేపా, బీజేపీ సభ్యులు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, డా. లక్ష్మణ్ తదితరులు తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రంతో మాట్లాడేందుకు నామోషీగా ఉంటే తామే స్వయంగా వెళ్లి మాట్లాడి, అవసరమయితే కేంద్రమంత్రులను రాష్ట్రానికి రప్పించి, పరిస్థితులు వివరించి సహాయం కోరుతామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ కేసీఆర్ సహాయం తీసుకోకుండా, కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించడాన్ని బీజేపీ సభ్యులు తప్పుపట్టారు.   కేంద్రంతో, పొరుగు రాష్ట్రంతో, ప్రతిపక్షాలతో సక్యంగా ఉంటూ, అందరి సహాయసహకారాలు తీసుకొంటూ సమస్యను అధిగమించేందుకు గట్టిగా కృషి చేయమని చెప్పిన తరువాతనే, కేసీఆర్ కొంత వెనక్కి తగ్గినట్లు కనబడ్డారు. పరిష్కారానికి అందరి సహకారం అవసరమని, తప్పకుండా తీసుకొంటామని, త్వరలోనే తాను స్వయంగా ప్రతిపక్షపార్టీలను డిల్లీకి తీసుకువెళతానని కెసిఆర్ ప్రకటించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి వారి సహకారం తీసుకొంటామని కేసీఆర్ తెలిపారు.   సుదీర్ఘ చర్చలు, వాదోపవాదాల తరువాత విద్యుత్ అంశంపై శాసనసభ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అందులో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణా వాటా విద్యుత్ ఇప్పించడానికి కేంద్రమే బాధ్యత తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన నిరంతరాయ విద్యుత్ పైలట్ ప్రాజెక్టును తెలంగాణా రాష్ట్రానికి కూడా కేటాయించాలని తీర్మానం చేసి ఆమోదించింది.

పోచారం బుక్కైపోయారా?

  అడ్డంగా వాగి బుక్కైపోవడం.. ఆ తర్వాత నాలుక కరుచుకోవడం కొందరు రాజకీయ నాయకులకు అలవాటే. ఏదో మామూలు అంశంపైన మాట్లాడితే ఓకే కానీ సీరియస్ ఇష్యూపైన నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం చిక్కుల్లో పడడం ఖాయం. తెలంగాణ మంత్రి పోచారం కూడా ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు.   అసెంబ్లీ నడుస్తున్న కీలక తరుణంలో పోచారం శ్రీనివాసరెడ్డి రైతు ఆత్మహత్యలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యల వెనక చాలా కారణాలున్నాయంటూ వెటకారంగా మాట్లాడారు. ఇంత సీరియస్ ఇష్యూపైనా వెటకారం అవసరమా? అది కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవమున్నా పోచారం ఇలా మాట్లాడితే దానికి అర్థం ఏముంటుంది? అందుకే అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. పోచారం శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.   ప్రతిపక్షాల విమర్శలను పక్కనబెడితే ఇప్పుడు సొంత ప్రభుత్వంలోనే పోచారంపై చాలామంది నిప్పులు చెరుగుతున్నారట. సీఎం కేసీఆర్ అయితే పోచారం శ్రీనివాసరెడ్డికి గట్టిగానే క్లాస్ పీకారట. రైతు ఆత్మహత్యలపై ఏం చేయలేక చేతులెత్తేసిన తరుణంలో ఇలాంటి మాటలు అవసరమా? అని సీరియస్ అయ్యారని అధికారపార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి పోచారం కామెంట్స్ కేసీఆర్ సర్కారును డిఫెన్స్ లో పడేశాయంటున్నారు విశ్లేషకులు.

లోక్ సత్తాలో ఏం జరుగుతోంది?

  అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది లోక్ సత్తా పరిస్థితి. ఎందుకనో అనుకున్న స్థాయిలో లోక్ సత్తా ఎదగలేకపోయింది. ఒక్కరంటే ఒక్క ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి లేడు. చివరకు జేపీ కూడా దారుణమైన ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ఎన్నికల ముందు టీడీపీతో పొత్తు ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. జేపీ కొంత చొరవ చూపిస్తే ఈ పొత్తు పట్టాలెక్కేదని ఇప్పటికీ చాలామంది చెబుతుంటారు. జేపీ లాంటి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు చట్టసభలో లేకపోవడం దారుణమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా లోక్ సత్తా విధానాలు మార్చుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా ఉంది.   అసలే గడ్డు పరిస్థితి అంటే దీనికి తోడు లోక్ సత్తా కుమ్ములాటలు కూడా పెరిగిపోయాయి. ఏకంగా జేపీనే పార్టీ నేతలు నిలదీసే పరిస్థితి వచ్చింది. మొన్న ఆ మధ్య జేపీని కొందరు బహిరంగంగానే తప్పుబట్టారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆయన బిక్కమొహమేశారు. అప్పటికప్పుడు ఎలాగోలా కవర్ చేసుకున్నారు కానీ ఈ ఇష్యూతో ఆయనకు పార్టీపై పట్టు లేదన్న మాట మాత్రం స్పష్టమైపోయిందంటున్నారు పరిశీలకులు.   ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పొత్తులు అనివార్యం. ఏ పార్టీ కూడా సొంతంగా ఎదగలేదు. ఈ చిన్న లాజిక్ కూడా జేపీకి తెలియదా? పార్టీ నేతలకంటే అంత అనుభవం లేదు. వారు పొత్తులు వద్దంటారు. కానీ లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీకి ఏది మంచి నిర్ణయమో జేపీకి తెలియకపోతే ఎలా? ఇంకా పాతకాలపు పద్దతులనే ఫాలో అవుతామంటే లోక్ సత్తా ఎదిగేదెప్పుడు? మన దగ్గర ఏ ఆధారం లేనప్పుడు దొరికిన ఏదో ఒక వస్తువును పట్టుకొని పైకొచ్చే ప్రయత్నం చేయాలి. అంతేకానీ దానికి ముక్కు లేదు. మూతి లేదంటూ కూర్చుంటే ఎలా? చివరకు లోక్ సత్తా నేతలే జేపీని నిలదీస్తున్నారంటే ఆ పార్టీలో ఇంటర్నల్ ఏం జరుగుతోంది ఎవరైనా ఊహించుకోవచ్చు.   జేపీకి మంచి పేరుంది. ఇతర పార్టీల నేతలు కూడా ఆయన మంచి గౌరవమిస్తారు. అలాంటి నేత తమతో చట్టసభల్లో కూర్చొని ఉండాల్సిందని ఇప్పటికీ చింతించే ఎమ్మెల్యేలు చాలామంది. కానీ ఏం చేస్తాం? ఎన్నికల్లో ఏదో ఒక పెద్ద పార్టీతో కలిసి పోటీ చేయకపోతే ఎలా గెలుస్తారు? అందుకే ఇప్పటికైనా జేపీ అంతర్మథనం చేసుకోవాలి. పార్టీని బతికించుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే లోక్ సత్తా ఉనికికే ప్రమాదం పొంచి ఉందంటున్నారు విశ్లేషకులు.

ఆంద్ర, తెలంగాణా ముఖ్యమంత్రుల మధ్య ఎంత వ్యత్యాసమో?

  ఈరోజు జరుగుతున్న కొన్ని ఆసక్తికరమయిన పరిణామాలు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ల ఆలోచన తీరులో ఎంత వ్యత్యాసం ఉందో స్పష్టంగా అర్ధమవుతుంది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఇంతవరకు కూడా కేసీఆర్ ఆంధ్రప్రభుత్వం, దాని ముఖ్యమంత్రి చంద్రబాబుపై కత్తులు నూరూతూనే ఉన్నారు తప్ప ఎన్నడూ కూర్చొని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భావించలేదు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చును. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేతగా సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవలసి ఉంటుందనే సంగతిని విస్మరించి, ఆయన నిత్యం కయ్యానికే కాలుదువ్వుతున్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు సూచించినప్పటికీ కోర్టుల్లోనే పరిష్కరించుకొందామనుకొంటున్నారు. అనుకోవడమే కాదు ఇప్పటికే అనేక సార్లు కోర్టులకెక్కారు కూడా. ఈసారి కృష్ణానదీ బోర్డుని ఆయన కోర్టుకు ఈడ్చారు. ఆ బోర్డు యాజమాన్యం కూడా ఆంధ్రప్రదేశ్ ఒత్తిళ్లకు లొంగి తమకు అన్యాయం చేసిందంటూ తెలంగాణా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ జస్టిస్ రమణ మరియు ముఖోపాధ్యాయ్ లతో కూడిన ధర్మాసనం ‘నాట్ బిఫోర్’ అనే చిన్న కామెంటుతో తన నిర్ణయాన్ని రిజర్వులో ఉంచడం విశేషం.   కేసీఆర్ ప్రభుత్వం నిత్యం కోర్టుగడపలు ఎక్కి దిగుతుంటే, చంద్రబాబు నాయుడు పొరుగునున్న కర్నాటక రాష్ట్రంలో తుంగభద్రా నది నుండి ఆంధ్రాకు రావలసిన నీళ్ళు తదితర అంశాలపై కర్నాటక ముఖ్యమంత్రితో చర్చించడానికి ఈరోజు బెంగళూరు వెళ్ళారు. వారిరువురూ కూడా చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలని భావిస్తున్నందున కోర్టులు, కేసులు అవసరం ఉండవని ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చంద్రబాబు తన రాష్ట్రానికి రావలసిన నీళ్ళ గురించి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు స్వయంగా వెళ్ళడానికి కూడా నామోషీ పడలేదు. కానీ కేసీఆర్ కి అహం (ఇగో) అడ్డుపడుతుండటంతో చర్చలకు బదులు కోర్టులకి వెళుతున్నట్లున్నారు. గోటితో పోయేదానికి గొడ్డలి వాడటం అంటే ఇదేనేమో? ఆయన తీరు వల్ల వ్యక్తిగతంగా ఆయనకేమీ నష్టం కలగకపోవచ్చునేమో, కానీ తెలంగాణాకి మాత్రం నష్టం కలిగే ప్రమాదం ఉందని చెప్పవచ్చును.

కేసీఆర్ వైఎస్ ను ఫాలో అవుతున్నారా?

  వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ ను బలంగా ప్రయోగించారు. ఇతర పార్టీల్లోని నేతలను కాంగ్రెస్ లోకి లాగడానికి అన్నిరకాలుగా ట్రై చేశారు. నయానో.. భయానో ఎలాగైనా కాంగ్రెస్ లోకి చేర్చుకొని ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేందుకు గట్టిగా ప్రయత్నం చేశారు. ముఖ్యంగా టీడీపీ నేతలనైతే వైఎస్ ఘోరంగా టార్గెట్ చేశారు. వైఎస్ మాట వినని టీడీపీ నేతలు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇలాంటి పనులు మంచివి కావని కాంగ్రెస్ నేతలే ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మొండిగా ముందుకెళ్లారు. ఏకంగా టీడీపీని చీల్చేందుకు కుట్ర చేశారు. కానీ చంద్రబాబు సమర్థత ముందు ఆ కుట్రలు పారలేదనుకోండి... అది వేరే విషయం కానీ ఇప్పుడు తెలంగాణ లో సీఎం కేసీఆర్ కూడా అదే ఆకర్ష్ సిద్ధాంతాన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది.   తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి సరిపడా మెజార్టీ ఉంది. చంద్రబాబులో పెద్ద మెజార్టీ కాకపోయినా సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు. అయినా సీఎం కేసీఆర్ మాత్రం కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన నేతలు.. ముఖ్యంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. నయానో భయానో టీఆర్ఎస్ లోకి లాగేందుకు ట్రై చేస్తున్నారు. కారు ఎక్కకపోతే నియోజకవర్గానికి నిధులిచ్చేది లేదని ఇతర పార్టీల ఎమ్మెల్యేలను భయపెడుతున్నారని చెప్పుకుంటున్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో చాలామంది తమకు ఇష్టం లేకపోయినా టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఇప్పటికి ఇలా చాలామంది ఎమ్మెల్యేలు గులాబీదళంలోకి వచ్చారు. అయినా సీఎం కేసీఆర్ వెనక్కు తగ్గడం లేదు. ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచుతున్నారట. ఎలాగైనా టీఆర్ఎస్ లోకి వచ్చేయాలని గట్టిగా చెబుతున్నారట. అధికారపార్టీ నుంచి ఈరేంజ్ లో బెదిరింపులు రావడం గతంలో ఎప్పుడూ వినలేదని టీడీపీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.   తలసాని, తీగల వంటి నేతలు టీడీపీకి రాజీనామా చేశారు. కానీ వారు మాత్రం తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఒకపార్టీకి రాజీనామా చేసి అదే పార్టీ తరపున ఎమ్మెల్యేగా కొనసాగడం దేనికి సంకేతం? మాటల తూటాలతో విరుచుకుపడే కేసీఆర్ దీనికి ఏం సమాధానం చెబుతారు? తెలంగాణలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, క్రిష్ణయ్య లాంటి ఉద్దండులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉంది. అందుకే టీడీపీ మరింత ఎదగకుండా కావాలనే సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు వల వేయడం మాని పాలనపై ఫోకస్ చేయాలని సూచిస్తున్నాయి.

అల్లుడి పనైపోయిందా?

  అత్త సొమ్ము అల్లుడికి దానమిచ్చినట్టు రాబర్ట్ వాద్రాకు అప్పనంగా భూములు కట్టబెట్టారని అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అయ్యగారు సోనియా అల్లుడు కాబట్టి తెర వెనక ఇదంతా జరిగే ఉంటుందని జోరుగా ప్రచారం జరిగింది. ఈ కథ ఇలా ఉంచితే అప్పట్లో అంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండగా... హర్యానా, రాజస్థాన్ లో సారు మొత్తం 6 కంపెనీలు పెట్టారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారం కోల్పోగానే ఆ 6 కంపెనీల్లో 4 దివాళా తీశాయి. అదేంటి హస్తం పవర్ కోల్పోతే అల్లుడు దివాళా తీయడమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఆ 4 కంపెనీల్లో చాలా రోజులుగా ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేదట. పోనీ ఏమైనా చేద్దామంటే వాద్రా వల్ల కావడం లేదు. ఈ పరిస్థితుల్లో మారు మాట్లాడకుండా 4 కంపెనీలను మూసివేసి ఉద్యోగులను నట్టేట ముంచారు. ఇక ప్రస్తుతానికి ఉన్న కంపెనీలు రెండే. అవి ఉంటాయో ఊడుతాయో క్లారిటీ లేదు. దీనికి తోడు హర్యానా, రాజస్థాన్ లతో రెండు చోట్ల ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. దీంతో వాద్రాకు భయం పట్టుకుందట. అటు బీజేపీ నేతలు కూడా వాద్రాను షాడోలా వెంటాడుతున్నారట. అయ్యగారి అవినీతిని బట్టబయలు చేసేందుకు కంకణం కట్టుకున్నారట. ఇప్పటికే సారు గురించి రహస్యాలను వెలికి తీసే పనిలో ఉన్నారట కొంతమంది బీజేపీ లీడర్లు. పక్కా ఆధారాలు కూడా దొరికాయట. కేవలం టైమ్ కోసమే చూస్తున్నారట. ఒక్కసారి ముహూర్తం కుదిరితే చాలు వాద్రాకు కంటిమీద కునుకు కూడా కష్టమేనంటున్నారు పరిశీలకులు. అదే జరిగితే సోనియా ఫ్యామిలీ ఎలా స్పందిస్తో? అయినా ఆమె కూడా ఏం చేయలేని పరిస్థితి. ఎలాగూ పవర్ లో లేరు. మా అల్లుడు వెరీగుడ్ అని చెప్పుకోవడానికి ఆమె ఎంత ప్రయత్నించినా వాద్రాను కాపాడుకోవడం కష్టమేనంటున్నారు పరిశీలకులు. ఈ దెబ్బతో చివరకు రాజస్థాన్, హర్యానాల్లోని కాంగ్రెస్ పెద్దలు కొంతమంది సోనియాగాంధీ ఫ్యామిలీతో డిస్టన్స్ మెయింటెయిన్ చేస్తున్నారట. ఎందుకంటే వాద్రా ఇష్యూ అటు తిరిగి ఇటు తిరిగి తమకు ఎక్కడ బ్యాడ్ టైమ్ తెస్తుందోనని వాళ్ల భయం. అంతే లే మరి ఎవరి భయం వారిది. పాలిటిక్స్ లో ఉండాలంటే ముందు క్లీన్ ఇమేజ్ కూడా ముఖ్యమే కదా..

రాజధానిపై విషప్రచారం నమ్మొద్దు...

  ఏదైనా విషయంలో అనుమానమొస్తే .. క్లారిటీ ఇవ్వడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా. ఎందుకంటే రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల విషయంలో కొంత గందరగోళం నెలకొంది. రైతుల భూములను లాక్కుంటున్నారంటూ కొన్ని పార్టీలు అపోహలు క్రియేట్ చేశాయి. భూములు ఇస్తే దానికి సరిపడా ప్రతిఫలం ఇస్తామని చంద్రబాబు సర్కారు కుండబద్దలు కొట్టినా వినకుండా కొందరు విషప్రచారం చేశారు. ఏదో జరిగిపోతుందంటూ బురదజల్లేప్రయత్నం చేశారు. కానీ వాటన్నంటిని చంద్రబాబు పటాపంచలు చేశారు. భూములను కోల్పోయే రైతులు ఏమాత్రం భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఒక ముఖ్యమంత్రిగా అన్నదాతలకు ఏం చేయాలో అన్ని చేసి చూపిస్తానని మాట ఇచ్చారు.   రాజధానిపై చెప్పుడు మాటలు వినొద్దని చంద్రబాబు సూచించారు. రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయే రైతులకు ఏడాదిలోపు ధ్రువపత్రాలిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తానని స్పష్టం చేశారాయన. జీవితకాలంలో ఒక్కసారే ఇలాంటి మంచి ఛాన్సు వస్తుందని... మిస్ చేసుకోవద్దని కూడా అప్పీల్ చేశారు. రాజధాని ప్రాంత రైతులను అన్నివిధాలా పైకి తేవడమే తన సంకల్పమని స్పష్టం చేశారాయన. అంతేకాదు రాజధానికి భూములిచ్చే రైతులకు ఎక్కడో మూల భూమి ఇవ్వకుండా.. మంచి డిమాండ్ ఉన్న చోటే ఇచ్చేందుకు ప్లాన్ జరుగుతోందట.   నిజానికి రాజధాని ప్రాంత రైతులకు పెద్ద లాభమే కలగనుంది. భూమి కోల్పోయే రైతులకు కొంత భూమితో పాటు పరిహారం.. ఇలా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. రాజధాని రాకతో భూముల విలువ పెరుగుతుంది. దానికి తోడు ప్రభుత్వం నుంచి తగిన సహకారం కూడా ఉంటుంది కాబట్టి భవిష్యత్తుకు ఢోకా ఉండదు.   రాజధాని అంటే అదేదో ఆషామాషీగా కాకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. ఛండీగఢ్, ఢిల్లీ నగరాలను ఆదర్శంగా తీసుకుంటున్నారు. అలాగే నయా రాయపూర్ నమూనాపై స్టడీ చేశారు. రాబోయే తరాలు గుర్తుంచునేలా కనివినీ ఎరుగని రీతిలో క్యాపిటల్ సిటీని కట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా మురికివాడలు లేని... అంతర్జాతీయ నగరాన్ని నిర్మించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. స్మార్ట్ సిటీగా హైఫై రేంజ్ లో ఉండేలా వర్కవుట్ జరుగుతోంది. హైటెక్ సిటీతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందిన చంద్రబాబు... ఇప్పుడు ఏపీ రాజధానిని కూడా అదేరేంజ్‌లో కట్టబోతున్నారు. రాజధాని నిర్మాణంలో బాబుకు ఉన్న అనుభవం కూడా కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

శివసేన సెల్ఫ్ గోల్

  శివసేనకు మహారాష్ట్రలో బలమైన క్యాడర్ ఉంది. బీజేపీకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్న శివసేన కు హఠాత్తుగా ఏమైందో ఏమో... అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పుకుంటున్నారు జనాలు. లేకపోతే బాల్ థాకరే ఉన్నప్పుడు ఎంత అటాకింగ్ గా ఉండేది. స్కెచ్చ్ వేస్తే అనుకున్నది జరిగిపోయేది. అంత కరెక్టుగా ఉండేది బాల్ థాకరే ఉన్నప్పుడు. గతంలో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కు దీటైన పార్టీగా పేరు తెచ్చుకుంది. పాపం పెద్దాయన తర్వాత ఇప్పుడు పార్టీ కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది. మోడీ పవనాలు దేశంలో వీస్తున్నాయని తెలిసి కూడా ఉద్ధవ్ థాకరే ఎన్నికలకు ముందే పప్పులో కాలేశారు. బీజేపీ జాతీయ నేతలే ఎంత నచ్చజెప్పినా వినకుండా స్థానాల విషయంలో అనవసరంగా తెగేదాకా లాగారు. ఒంటరిగా పోయి బొక్క బోల్తా పడ్డారు. చెప్పుకోదగ్గ స్థానాలు సాధించలేక చతికిలపడ్డారు. పోనీ అప్పుడైనా తప్పును సవరించుకునే అవకాశం చిక్కింది శివసేనకు. ఎంచక్కా బీజేపీకి మద్దతిచ్చి మహారాష్ట్రలో మంత్రివర్గంలో చేరే ఛాన్సొస్సింది. దాన్ని కూడా మిస్ చేసుకున్నారు. ఎందుకంటే దానికి బలమైన కారణాలు లేవు. రాజకీయాల్లో తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లంటే కుదరదన్న విషయం ఇంకా ఉద్ధవ్ కు తెలిసినట్టు లేదు. పోనీ ఇప్పుడు అద్వానీ లాంటి అగ్రనేతలు జోక్యం చేసుకుంటామంటున్నా పెద్దగా స్పందించడం లేదట. అటు మంత్రివర్గంలో చేరక... బీజేపీకి సపోర్టు ఇవ్వక ఏం చేయాలనుకుంటున్నారో శివసేన నేతలు. పోనీ కేంద్రమంత్రివర్గంలో చేరే బంపర్ ఆఫర్ ఇచ్చారు మోడీ. దాన్ని కూడా మిస్ చేసుకున్నారు. చివరకు చేసేది లేక బీజేపీ శివసేనకు కటీఫ్ చెప్పాలని నిర్ణయించుకుందని సమాచారం. అదే జరిగితే నష్టం శివసేనకే తప్ప బీజేపీకి కాదంటున్నారు విశ్లేషకులు. ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. ముల్లు వెళ్లి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే తప్ప ముల్లుకు కాదనే విషయం ఇంకా ఉద్ధవ్ థాకరేకు అర్థం కాకపోవడం ... శివసేన నేతలనే విస్మయానికి గురిచేస్తోందట. బీజేపీని దూరం చేసుకోవడమంటే ఖచ్చితంగా సెల్ఫ్ గోలేనంటున్నారు పరిశీలకులు.

సుజనా చౌదరి: విధేయతకు పట్టం

  రాజకీయాల్లో విధేయత, కష్టపడేతత్వం ఉన్న నేతలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వారే ఉన్నత స్థానానికి వెళ్లగలుగుతారు. లీడర్లు ఎంతమంది ఉన్నా వారికుండే గుర్తింపు వారికుంటుంది. అలాంటి వారిలో ఒకరు సుజనా చౌదరి. టీడీపీకి కష్టకాలంలో ఎంతో అండగా నిలిచిన వ్యక్తుల్లో సుజనా చౌదరి ఒకరు. పార్టీకి సంబంధించిన పలు వ్యవహారాల్లో కీ రోల్ పోషించారాయన. చంద్రబాబుకు వెన్నుదన్నుగా ఉంటూ మంచి వ్యూహకర్తగా పేరుపొందారు. టీడీపీ డెవలప్ మెంట్ కోసం అనుక్షణం తపించే ఈ స్వభావమే ఆయనను బాబుకు దగ్గర చూసింది. అందుకే టీడీపీ రాజ్యసభ కోసం ఎంతో పోటీ ఉన్నా... వారందరినీ కాదని మరీ సుజనాకు ఎంపీ సీటిచ్చి గౌరవించారు చంద్రబాబు. ఆ తర్వాత ఎన్నికల సమయంలోనూ సుజనా అమూల్యమైన సేవలందించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు పలు వ్యవహారాలను చూశారు. ముఖ్యంగా టీడీపీ, బీజేపీ పొత్తు ఉండాల్సిందేనని మొదటి నుంచి పట్టుబట్టిన నేతల్లో ఈయన కూడా ఒకరు. స్టేట్ డెవలప్ మెంట్ జరగాలంటే కేంద్రం సహకారం కాబట్టి... బీజేపీతో అలయన్స్ ఉండాల్సిందేనని చంద్రబాబుకు ముందు నుంచి చెబుతూ వచ్చారు. అనుకున్నట్టే పొత్తు కుదిరింది... కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది. టీడీపీ మిత్రపక్షం కాబట్టి కేంద్ర మంత్రివర్గంలో సుజనాకు మొదటి విస్తరణలోనే పదవిఖాయం అనుకున్నారంతా. కానీ సామాజిక సమీకరణల్లో ఆయన పేరు మిస్సయ్యింది. అయినా ఏం ఆందోళన అవసరం లేదని ... మలి విస్తరణలో చోటు కంపల్సరీ అని చంద్రబాబే స్వయంగా సుజనాకు అభయమిచ్చారట. అనుకున్నట్టే పునర్ వ్యవస్థీకరణలో బాబు ఆయన పేరును రికమెండ్ చేశారు. మోడీ ఓకే చెప్పేశారు. సుజనా కేంద్రమంత్రి అయ్యారు. విధేయత కలిసొచ్చింది. హార్డ్ వర్క్ ఫలితాన్నిచ్చింది. మొత్తానికి పార్టీకి ఆయన చేసిన సేవే.. ఆయన్ను కేంద్రమంత్రిని చేసిందంటున్నారు విశ్లేషకులు. సుజనాకు కేంద్రమంత్రి ఛాన్స్ ఇవ్వడం ఎంతో సముచితమంటూ... చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

తెలంగాణా జేయేసీ తన ఉనికి కాపాడుకోగలదా?

  ఒకానొక సమయంలో తెలంగాణా ఉద్యమాలలో చాలా చురుకుగా పాల్గొని, కీలక పాత్ర పోషించిన తెలంగాణా జేయేసీ, రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా పునర్నిర్మాణంలో చురుకుగా పాల్గొంటానని ప్రకటించింది. తెరాసతో కలిసి పనిచేసినప్పటికీ తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే గట్టిగా నిలదీస్తానని కూడా చెప్పింది. కానీ ఈ ఐదు నెలల కాలంలో తెరాస ప్రభుత్వం చాలా బలపడి, ప్రతిపక్షాలను, ఆంధ్ర, కేంద్రప్రభుత్వాలని కూడా చాలా ధీటుగా ఎదుర్కొంటూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుండటంతో క్రమంగా టీ- జేయేసీ తన ఉనికిని కోల్పోసాగింది. నిజానికి టీ- జేయేసీని కేవలం తెలంగాణా సాధన కోసమే ఏర్పాటు చేసినప్పుడు, రాష్ట్రం ఏర్పడగానే పూర్తిగా రద్దు చేసి ఉండి ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండేది. కానీ చేయలేదు. అటువంటప్పుడు నీళ్ళు, విద్యుత్ తదితర అంశాలపై తెలంగాణా ప్రభుత్వం పొరుగు రాష్ట్రంతో చేస్తున్న యుద్దాలు, రాష్ట్రాన్ని కుదిపివేస్తున్న విద్యుత్ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, విద్యార్ధుల ఫీజు రీ ఇంబర్సుమెంటు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి అనేక సమస్యలపై మాట్లాడి ఉండాలి. కానీ నోరు మెదపకుండా మౌనం వహించింది. చివరికి తెలంగాణా ప్రభుత్వం కేవలం 453 మందిని మాత్రమే అమరవీరులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించినపుడు, టీ- జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్, తన వద్ద అమరవీరుల జాబితా ఉందని దానిని ప్రభుత్వానికి అందజేస్తానని అన్నారు. ఆయన ఆ జాబితాను ప్రభుత్వానికి అందజేసినట్లయితే, ప్రభుత్వం కేవలం తను గుర్తించి అమరవీరుల కుటుంబాలకు మాత్రమే పరిహారం మంజూరు చేస్తున్నప్పుడయినా మిగిలిన వారి కుటుంబాలకు కూడా తప్పనిసరిగా పరిహారం ఇచ్చితీరాలని టీ- జేయేసీ ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోయింది ఎందుకో. ఇక రాష్ట్ర పునర్ణిర్మాణంలో పాల్గోవడం సరేసరి.   బహుశః ఆవిధంగా చేసినట్లయితే సమాంతర ప్రభుత్వం నడుపుతున్నామనే విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే భయమో లేకపోతే కేంద్రప్రభుత్వంతోనే యుద్ధం చేయడానికి వెనకాడని కేసీఆర్ తో పెట్టుకొంటే తట్టుకోలేమనే భయమో లేకపోతే కొత్తగా ఏర్పడిన తెలంగాణా ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి చూడాలనే ఆలోచనతోనో తెలియదు కానీ టీ- జేయేసీ ఇంతవరకు మౌనం వహించి ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. అందువల్లే ప్రజలు కూడా దానిని పట్టించుకోవడం మానివేశారు.   ఈ పరిస్థితుల్లో మళ్ళీ చాలా రోజుల తరువాత ఈ రోజు టీ-జేయేసీ స్టీరింగ్ కమిటీ హైదరాబాద్ లో సమావేశమవుతోంది. ఈ సమావేశంలో పైన పేర్కొన్న అన్ని సమస్యలపై చర్చిస్తారని సమాచారం. అందువలన ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉందని భావించవచ్చును. ఒకవేళ ఇక నుండి తాము కూడా తెలంగాణా ప్రభుత్వాన్ని నిలదీయాలని టీ-జేయేసీ నిర్ణయించుకొంటే, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితులు ఏర్పడతాయి. అదే టీ-జేయేసీ ప్రభుత్వానికి అండగా నిలబడి దానిని వెనకేసుకొని వస్తూ మాట్లాడే ప్రయత్నం చేసినట్లయితే, ఇప్పటికే క్రమంగా తన ఉనికిని కోల్పోపోతున్న టీ-జేయేసీ పూర్తిగా తన ఉనికిని పోగొట్టుకొంటుంది.   అందువలన ఈ సమావేశంలో టీ-జేయేసీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే దానిపైనే దాని భవితవ్యం ఆధారపడి ఉంటుందని భావించవచ్చును. అయితే కేసీఆర్ తో కత్తులు దూసి ఇబ్బందులు పడటంకంటే, మౌనం వహించడమే మేలని భావించినట్లయితే, తెలంగాణా ప్రభుత్వానికి శ్రేయోభిలాషిగా ఏవో కొన్ని సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నా ఆశ్చర్యం లేదు.

రామచంద్రయ్య తిక్క కుదిరింది!

  ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా వుందంటే, ఆ పార్టీ నాయకులు జనాల్లోకి వెళ్తే పట్టించుకునేవారే లేకుండా పోయారు. కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏవైనా విమర్శలు చేసినా ప్రజలు వాటిని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు. రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడే కనీస హక్కు కూడా లేదని ప్రజలు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా వున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు జనంలోకి వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానాల పాలు అవుతూనే వున్నారు. ప్రజలు ఛీ కొడుతున్నా ఎంతమాత్రం సిగ్గుపడకుండా జనంలోకి వెళ్తూ భంగపడుతూనే వున్నారు. ఇలా భంగపడే సీన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య విషయంలో జరిగింది.   ఆంధ్రప్రదేశ్‌ రాజధానికి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాజధాని కోసం విజయవాడ సమీపంలోని 18 గ్రామాలలో భూ సమీకరణ కోసం మంచి ప్రతిపాదనలను కూడా స్థానిక ప్రజలు, రైతుల ముందు వుంచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించకుండా చేయాలని, స్థానికులు ప్రభుత్వానికి ఎదురు తిరగాలని ఒకవైపు వైసీపీ నాయకులు, మరోవైపు కాంగ్రెస్ నాయకులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. భూ సమీకరణ విషయంలో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టి తమ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునే కుట్రలు ఆ ప్రాంతంలో నిర్విరామంగా జరుగుతూ వున్నాయి. ఈ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు గ్రామానికి శనివారం నాడు వెళ్ళారు. అక్కడ ఓ ప్రెస్ మీట్ పెట్టి భూ సమీకరణ ద్వారా తెలుగుదేశ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని, రైతులు ప్రభుత్వం మీద తిరగబడాలని, రాజధాని కోసం భూములు ఇవ్వకూడదని చెప్పడం మొదలుపెట్టారు. ఈయనగారి మాటలు విని స్థానిక రైతులకు ఆవేశం ముంచుకొచ్చింది. అందరూ ఒక్కసారిగా రామచంద్రయ్య మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు మీకు ఎంతమాత్రం లేదని ఆయన ముఖం మీదే చెప్పేశారు. కొందరు రైతులైతే రామచంద్రయ్య మీదకి ఆగ్రహంగా వెళ్ళబోతే పోలీసులు జోక్యం చేసుకుని రామచంద్రయ్యని రక్షించారు.   ఈ సందర్భంగా తుళ్ళూరు ప్రాంత రైతులు మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి సహకరించడానికి తాము సిద్ధంగా వున్నామని, భూములను అప్పగించే విషయంలో ప్రభుత్వంతో తాము చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. దుర్మార్గంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దుష్టబుద్ధితో ఇక్కడకి వచ్చి ఇక్కడి రైతుల మనసులలో విషాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి పనులను తాము ఎంతమాత్రం సహించబోమని అన్నారు. అలాంటి ప్రయత్నం చేసినందుకే రామచంద్రయ్య మీద తాము తిరగబడ్డామని వారు చెప్పారు. దయచేసి ప్రతిపక్ష నాయకులు ఇప్పటికైనా ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలను నడపకుండా రాజధాని నిర్మాణం విషయంలో హుందాగా వ్యవహరిస్తే మంచిదని సూచించారు. ఏవండీ ఎమ్మల్సీ రామచంద్రయ్యగారూ... తుళ్ళూరు రైతుల ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చూశారుగా... తిక్క కుదిరింది కదూ!?

పొలిటికల్ మీడియేటర్ ‘పెద్దాయన’

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఫొటోకి దండపడి చాలాకాలమైంది. కాంగ్రెస్ పార్టీ డెడ్ బాడీ పొరపాటున అయినా లేచి కూర్చుంటుందేమోనన్న డౌట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొన్నటి ఎన్నికలలో కాంక్రీటుతో సమాధి కట్టేశారు. ఇంతకాలం పెద్ద దిక్కుగా వున్న పార్టీ బాల్చీ తన్నేయడంతో కాంగ్రెస్ నాయకులు గత కొన్ని నెలలుగా శ్మశాన వైరాగ్యంలో, రాజకీయ వైధవ్యంలో వున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా తేరుకుంటూ, ఇప్పుడిక ఏ పార్టీని ఆశ్రయిస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులలో నూటికి 99 శాతం మంది నాయకులకు తెలుగుదేశం పార్టీలోకి నో ఎంట్రీ. వాళ్ళు అరచి గీపెట్టినా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంతమాత్రం పట్టించుకోదు. ఇక రాష్ట్రంలో వున్న మరో పార్టీ వైసీపీ. ఈ పార్టీలో చేరడం కంటే సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళిపోవడం మంచిదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వుంది. రేపో మాపో మునిగిపోయే చిల్లు పడవలాంటి వైసీపీలో చేరి బావుకునేదేమీ లేదన్న కనీస జ్ఞానం అందరిలోనూ వుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులందరి దృష్టీ భారతీయ జనతాపార్టీ మీద పడింది. ఇది మీడియేటర్ల కాలం... ఏ పని జరగాలన్నా మీడియేటర్‌ని ఆశ్రయిస్తే ఈజీగా పనైపోతుంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులందరూ బీజేపీలో చేరడానికి ఓ ‘పెద్దాయన’ని మీడియేటర్‌గా ఉపయోగించుకుంటున్నారు.   ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడిగా రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన ఆ పెద్దాయన కేంద్ర మంత్రి పదవికి ఆశపడి రాష్ట్ర విభజనకు సహకరించారన్న పాపాన్ని మూటగట్టుకున్నారు. జరగాల్సిన విభజన ఘోరం జరిగిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచకు చేరారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులను బీజేపీలోకి చేర్పించే బృహత్కార్యంలో బిజీగా వున్నారు. తన వద్దకు వచ్చి బీజేపీలో చేరతానని బతిమాలుకున్న వారిని బీజేపీలో చేర్చడమే కాకుండా.. తన దగ్గరకు రానివారి దగ్గరకు కూడా వెళ్ళి బీజేపీలో చేరండని రిక్వెస్ట్ చేసే పనిలో కూడా ఆయన నిమగ్నమై వున్నారు. మొన్నీమధ్య గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రిని ఆయన విజయవంతంగా బీజేపీలో చేర్చారు. అలాగే విశాఖ జిల్లాకి చెందిన మాజీ ఎంపీగారిని కుటుంబ సమేతంగా బీజేపీలో చేర్చారు. మొన్నటి వరకూ జగన్ చేత ‘అన్నా’ అని ప్రేమగా పిలిపించుకుని, ఆ తర్వాత ఆయనకి దూరమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ ప్రస్తుతం ఖాళీగా కూర్చున్నారు. ప్రస్తుతం ‘పెద్దాయన’ దృష్టి ఆయన మీద కూడా పడింది. ఆయన ఇంటికి వెళ్ళి మరీ బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పుడు సదరు పెద్దాయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వున్న పెద్ద, చిన్న నాయకులను, చెత్తా చెదారాన్ని కూడా బీజేపీలోకి తరలించే పనిలో నిమగ్నమై వున్నారు.   సదరు పెద్దాయన బీజేపీలో చేరినప్పటి నుంచి చేయడానికి పెద్దగా పనేం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ - బీజేపీ బంధం కూడా బలంగా వుండటంతో ఈయన ఏవైనా రాజకీయాలు చేసి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఈ పెద్దాయన్ని పార్టీలో చేర్చుకున్నందుకు పార్టీకి ఏం ఒరిగిందన్న ఆలోచన బీజేపీ నాయకత్వానికి రాకముందే తానే ఏదో ఒక హడావిడి చేసి పార్టీ నాయకత్వం నుంచి మంచి మార్కులు పొందాలన్న ఉద్దేశంతోనే ఈ ఆయన ‘పొలిటికల్ మీడియేటర్’ అవతారం ఎత్తారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఐదేళ్ళ కాలంలో కాంగ్రెస్ పార్టీలోని నాయకులందర్నీ బీజేపీలోకి చేర్పించేస్తే వచ్చే ఎన్నికల సమాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీకి ధీటుగా బీజేపీని తయారవుతుందన్న ఆశావాదం ఆయనలో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులను హోల్‌సేల్‌గా బీజేపీలో చేర్చుకోవడం వల్ల బీజేపీకి మేలు జరిగే సంగతి అటుంచితే, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి వున్న పరువును కూడా బీజేపీలో చేరిన కాంగ్రెస్ నాయకులు పాడుచేసే ప్రమాదం లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి పెద్దాయన ఏపీలో బీజేపీని బాగుచేస్తారో, పాడు చేస్తారో వేచి చూడాలి.

ఆంధ్రప్రదేశ్‌కి అతి త్వరలో ప్రత్యేక హోదా

  రాష్ట్ర విభజనలో దారుణంగా అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నోరకాలుగా సహకరించాల్సి వుంది. విభజన బిల్లులో వున్న అంశాలను సక్రమంగా అమలు చేయడంతోపాటు విభజన బిల్లు ఆమోదం సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సి వుంది. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా కొంతయినా పుంజుకునే అవకాశం వుంది. అయితే ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్న దుష్ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలన్న వెటకారం డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదేమోనన్న భయం రాష్ట్ర ప్రజల్లో కలిగింది. అయితే అవన్నీ అనవసరపు భయాలేనన్న క్లారిటీ వస్తోంది. రెండు వారాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అవకాశం వుందని ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.   రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పట్టుబట్టింది. దానికి సంబంధించి లోక్‌సభ సాక్షిగా అప్పటి యుపిఎ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని పొందింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడానికి బీజేపీ కృతనిశ్చయంతో వున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ అధికారులతో, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుతో సమావేశం నిర్వహించి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన కొన్ని ఫైళ్ళు కేంద్ర ఆర్థిక, పారిశ్రామిక అధికారుల వద్దే వున్నాయని, అవి తిరిగి తన వద్దకు రాగానే ప్రత్యేక హోదా ప్రక్రియను ముమ్మరం చేస్తానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి వుంటుందని ఆయన స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.   మొత్తమ్మీద పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ప్రకటించే అవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ పదిహేను రోజుల్లో ప్రత్యేక హోదాను ప్రకటించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కి అదనపు ప్రయోజనం కూడా చేకూరే అవకాశం వుందంటున్నారు. ఈనెల 24 నుంచి 28వ తేదీ మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జపాన్‌లో పర్యటించనున్నారు. ఆయన జపాన్ పర్యటనకు వెళ్ళే ముందే ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించడం వల్ల చంద్రబాబు జపాన్ నుంచి భారీ పెట్టుబడులను తెచ్చే అవకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు జపాన్ పర్యటనకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం వుందని అనుకుంటున్నారు.

కొండ నాలుక్కి మందేస్తే..

  కొండ నాలుక్కి మందేస్తే.. ఉన్న నాలుక కూడా ఊడిందన్నట్లుంది గోవాలో బీజేపీ పరిస్థితి ఇప్పుడు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పర్రికర్ ను కేంద్రమంత్రి పదవి చేప్పట్టమని ప్రధాని మోడీ కోరడంతో, ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ మంత్రిగా చేస్తున్నలక్ష్మీకాంత్ పర్శేఖర్ లేదా స్పీకర్ గా వ్యవహరిస్తున్న రాజేంద అర్లేఖర్ లలో ఎవరినో ఒకరిని తన స్థానంలో ముఖ్యమంత్రిగా నియమించాలని పర్రికర్ చేసిన ప్రతిపాదనకు బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగానే స్పందించింది.   కానీ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న డిసౌజా ఆ పదవి తనకే ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. మొత్తం 21మంది శాసనసభ్యులలో 10మంది తనకే మద్దతు ఇస్తున్నారు కనుక తనకే తప్పనిసరిగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. పదిమందిలో తొమ్మిదిమంది ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు కూడా. కనుక ముఖ్యమంత్రి పదవి విషయంలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఈరోజు సాయంత్రం 4గంటలకి గోవాలో పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఆలోగా ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు బీజేపీ అధిష్టానం గట్టిగా కృషి చేస్తోంది. అందుకోసం డిల్లీ నుండి కేంద్ర పరిశీలకుడిగా గోవా వచ్చిన రాజీవ్ రూడీ ప్రస్తుతం అసమ్మతి వర్గంతో చర్చలు జరుపుతున్నారు.   నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిచి, రాష్ట్రంలో అత్యధిక జనాభా గల కెతోలిక్ క్రీష్టియన్లను పార్టీ వైపు ఆకర్షించి బీజేపీకి అధికారం దక్కేలా చేసిన తనను కాదని వేరొకరికి ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే తాను, తనకు మద్దతు ఇస్తున్న 10మంది శాసనసభ్యులు తిరుగుబాటు చేస్తామని డిసౌజా కుండబ్రద్దలు కొట్టినట్లుగా తెగేసి చెపుతున్నారు. మరి బీజేపీ ఈ ఒత్తిళ్లకు లొంగి ఆయనకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి రాష్ట్రంలో పార్టీని బ్రతికించుకొంటుoదా? లేక ఆయనను బ్రతిమాలుకోనో లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటానని బెదిరించి తనకు నచ్చిన వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి కట్టబెడుతుందో ఈ సాయంత్రంలోగా తేలిపోతుంది.   గోవాలో అధికారం కోల్పోవడానికి బీజేపీ ఇష్టపడదు కనుక డిసౌజాకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టి పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును. లేదా ఆయనకు ఏదో ఒకగట్టి హామీనిచ్చి ప్రస్తుతానికి శాంతింపజేయవచ్చును. పర్రికర్ కి కేంద్రమంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం కోల్పోయే పరిస్థితి దాపురించడం విడ్డూరంగానే ఉంది.

ప్చ్.. పాపం ఈటెల...

  తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఎంత పవర్ ఫుల్ నాయకుడో అందరికీ తెలిసిందే. ఆయన సీమాంధ్రుల మీద మాటల ఈటెలు విసిరారంటే ఆ ఈటెలు డైరెక్టుగా సీమాంధ్రుల గుండెల్లో దిగబడతాయి. ఆయన మాటల కారణంగానే ఈటెల టీఆర్ఎస్‌లో ముఖ్య నాయకుడిగా ఎదిగారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవిని కూడా చేపట్టారు. ఇంత పవర్‌ఫుల్ వ్యక్తి కాబట్టి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కి చాలా సన్నిహితుడు కాబట్టి తెలంగాణ ప్రభుత్వంలో ఆయన మాట వేదంలా చెల్లుతుందని ఎవరైనా అనుకుంటారు. బట్.. ఈటెలకి ప్రభుత్వంలో అంత సీన్ లేదని, ఆయన మాటకు గడ్డిపోచంత విలువ కూడా లేదని ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలను విశ్వసనీయ వర్గాలు బయటకి లీక్ చేశాయి.   ఈటెల రాజేందర్ మంత్రి అయిన తర్వాత ఆయన బంధువులు కొంతమంది ఆయన దగ్గరకి వచ్చి ‘‘రాజేందరన్నా.. రాజేందరన్నా... మేం తెలంగాణలో ఫలానా చోట ఉద్యోగం చేస్తున్నాం. మమ్మల్ని ఆ ఫలానా చోట నుంచి ఈ ఫలానా చోటకి ట్రాన్స్‌ఫర్ చేయించవా... ప్లీజ్’’ అని రిక్వెస్ట్ చేసుకున్నారట. వారి రిక్వెస్టులకి కరిగిపోయిన ఈటెల ‘‘మీరు కోరినట్టే ట్రాన్స్‌ఫర్ చేయిస్తా పొండి’’ అని వాళ్ళకి హామీ ఇచ్చేశారట. సదరు బంధువులు ఇక తాము ట్రాన్స్‌ఫర్ అయిపోయినట్టే అనుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయారట. అయితే ఆ తర్వాత జరిగిన సంఘటనలు ఈటెలకి బుర్ర తిరిగిపోయేలా చేశాయట. మా బంధువులని కాస్త ట్రాన్స్‌ఫర్ చేసిపెట్టరూ అని ప్రభుత్వంలో ఎవరిని అడిగినా పని కాలేదట. సీఎం కేసీఆర్ చెబితేనే ట్రాన్స్‌ఫర్ చేస్తామని అధికారులు నిర్మొహమాటంగా చెప్పడంతో ఈటెల బిత్తరపోయారట. అయినప్పటికీ గుండె రాయి చేసుకుని కేసీఆర్‌కి కూడా ఈ విషయాన్ని విన్నవించుకుంటే, ఆయన చాలాకాలంగా ఏ విషయమూ తేల్చకుండా ఇష్యూని పక్కన పెట్టేశారట. ఈ ట్రాన్స్‌ఫర్లు జరక్కపోతే తన బంధువర్గంలో తన పరువు ఫినాయిల్‌, యాసిడ్‌తో కడిగినట్టుగా పోతుందని ఈటెల ఫీలైపోయారట.   సరే, నామాట ఎలాగూ చెల్లడం లేదు. నా ఫ్రెండ్, తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి చెబితే అయినా పని అవుతుందేమోననని ఈ విషయాన్ని జగదీశ్వర్ రెడ్డి చెవిలో వేశారట. తన సహచర మంత్రి ఈటెల ఆవేదనను విని గుండె చెరువైపోయిన జగదీశ్వర్‌రెడ్డి ఈటెలకి హెల్ప్ చేయాలని డిసైడ్ అయ్యారట. సీఎం కేసీఆర్ మూడ్ బాగున్నప్పుడే నీ బంధువుల ట్రాన్స్‌ఫర్ విషయం సీఎం దగ్గర ప్రస్తావించి పనయ్యేట్టు చూస్తానని జగదీశ్వర్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఈటెల హ్యాపీగా ఫీలయ్యారట. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి తన మిత్ర ధర్మం ప్రకారం ఓ సందర్భంలో కేసీఆర్ మూడ్ బాగుందని అనుకుని ఈ ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం ఆయన దగ్గర ప్రస్తావించారట. అంతే, కేసీఆర్ ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమైపోయి అక్కడే వున్న ఓ అరడజను మంది ఐఏఎస్ ఆఫీసర్ల ముందే జగదీశ్వర్‌రెడ్డిని ‘‘ఈటెల ట్రాన్స్‌ఫర్ల వ్యవహారం గురించి నా దగ్గర ప్రస్తావిస్తున్నావ్.. నువ్వేమైనా తురుంఖాన్‌వా‌? ఈటెల చెప్పడమేంటి.. నువ్వు నాకు చెప్పడమేంటి’’ అని చెడామడా క్లాస్ పీకేశారట. దాంతో జగదీశ్వర్‌రెడ్డి ముఖం చెల్లని చిల్లుకాణీ అంత అయిపోయిందట. మొగుడు తిట్టినందుకు బాధలేదు.. తోడికోడలు నవ్విందనే బాధ అన్నట్టుగా, కేసీఆర్ చెడామడా క్లాస్ పీకినందుకు బాధ లేదుగానీ, ఐఏఎస్ ఆఫీసర్ల ముందే క్లాస్ పీకారని జగదీశ్వర్‌రెడ్డి ఈటెలతో ఆవేదనగా చెప్పుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ తమ పరిస్థితి ఇలా అయిపోయిందేంటా అని జాయింటుగా బాధపడి, ఒకర్నొకరు ఓదార్చుకున్నారట.

టీఆర్ఎస్‌ పాలిట తుమ్మల తుమ్మముల్లు కానున్నారా?

    నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ఆయన ద్వితీయ కళత్రం లక్ష్మీపార్వతి చేతిలో పెట్టేసిన సందర్భంలో రాజకీయంగా పార్టీ కుప్పకూలే పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడే ఉద్దేశంతో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. ఆనాడు చంద్రబాబు చేసిన తిరుగుబాటు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పచ్చగా కళకళలాడుతూవుండటానికి ప్రధాన కారణమైంది.    ఆనాడు ఎన్టీఆర్‌ ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి పరిస్థితిని ఎదుర్కొనబోతున్నారన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆనాడు లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేస్తే, ఈనాడు తుమ్మల నాగేశ్వరరావు కారణంగా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు తిరుగుబాటు చేసే అవకాశం వుందని అంటున్నారు.   గతంలో తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఖమ్మం జిల్లా నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కేసీఆర్‌కి జిగిరీ దోస్త్. ఎంత దోస్త్ అంటే... ఒకర్నొకరు ఆప్యాయంగా ‘బావా.. బావా’ అని పిలుచుకునేంత దోస్త్. ఆ దోస్తీ కారణంగానే తుమ్మల తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తుమ్మల పార్టీ మారడం వెనుక కేసీఆర్ ఇచ్చిన మంత్రి పదవి ఆఫర్ కూడా ప్రధాన కారణమనే అభిప్రాయాలు వున్నాయి. కేసీఆర్ అవసరమైతే తల నరుక్కుంటారు తప్ప తన సొంత మనుషులకు ఇచ్చిన మాట మాత్రం ఎంతమాత్రం తప్పరు. తుమ్మలకు మంత్రి పదవి ఇస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ త్వరలో ఆయనకు హోంమంత్రి పదవి ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్‌కి మొదటి నుంచీ సేవ చేసిన నాయిని నరసింహారెడ్డి ఇప్పుడు హోం మంత్రిగా వున్న విషయం తెలిసిందే. నాయినిన తప్పించి తుమ్మలను ఆ స్థానంలో హోం మంత్రి చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.   తన అనుంగు మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావుకు హోం మంత్రి పదవిని అప్పగించిన అనంతరం కేసీఆర్ తన ఆరోగ్యాన్ని బాగుచేసుకునే నిమిత్తం ఓ రెండు నెలలపాటు అమెరికా వెళ్ళనున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చే వరకూ తెలంగాణ ప్రభుత్వ బాధ్యత మొత్తం హోం మంత్రి పదవిలో వుండే తుమ్మలతోపాటు కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కి అప్పగించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ ఆలోచన ఇలా వుంటే, కేసీఆర్ మేనల్లుడు, తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆలోచన మాత్రం మరోరకంగా వున్నట్టు తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ హోం మంత్రి బాధ్యతలు అప్పగించిన వెంటనే పార్టీలో తిరుగుబాటు చేయడానికి హరీష్ రావు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. హరీష్ రావు తిరుగుబాటు చేసిన పక్షంలో ఆయనకు 25 నుంచి 30 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలుస్తారని తెలుస్తోంది. వారికి తోడుగా టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు కూడా తీసుకుని హరీష్ రావు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.   హరీష్‌రావు ఈ తరహా ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసి కూడా సీఎం కేసీఆర్ లైట్‌గా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. హరీష్ రావు కూడా పైకి తాను కేసీఆర్‌కి విధేయుడిగా వుంటానని చెబుతున్నప్పటికీ, తుమ్మలకు హోం మంత్రి పదవి ఇవ్వగానే తన యాక్షన్ ప్లాన్ అమలులో పెడతారని తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌ నాయకులలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా వుంది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన వారికి, తన బంధుమిత్రులకే అన్ని విషయాలలోనూ కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్న బాధ వారిలో వుంది. దీనితోపాటు తెలంగాణలోని వివిధ వర్గాల వారు కూడా కేసీఆర్‌ని వ్యతిరేకిస్తూ వున్నారు. త్వరలో నాయిని పదవి ఊడిపోబోతోందని తెలిసిన రెడ్డి సామాజిక వర్గం వారు కూడా కొంత ఆగ్రహంగా వున్నారు. ఇలాంటి వ్యతిరేక శక్తులన్నిటికీ చేరువ అవుతున్న హరీష్ రావు ‘కీలక సమయం’లో వీరందరి సహకారం తీసుకోవడానికి వ్యూహ రచన చేసినట్టు సమాచారం.   తెలుగునాట గతంలో రెండు సందర్భాలలో అధికార మార్పిడి ‘కుదుపు’లు సంభవించాయి. ఒక కుదుపుకు కారణం నాదెండ్ల భాస్కరరావు అయితే, మరోసారి లక్ష్మీపార్వతి కారణం అయ్యారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఆ కుదుపుకు తుమ్మల నాగేశ్వరరావు కారణం అవుతారనీ, టీఆర్ఎస్ ప్రభుత్వ బుడగ పాలిట తుమ్మల తుమ్మముల్లుగా మారతారనీ అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఈ అంశం మీద మరో రెండు మూడు నెలల్లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం వుంది.

శివసేనకు రెండు, తెదేపాకు ఒక కేంద్ర మంత్రి పదవి

  ఈ ఆదివారంనాడు ప్రధాని మోడీ తన మంత్రి వర్గంలో మరో 10 నుండి 12మంది కొత్త మంత్రులను చేర్చుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలో 22మంది క్యాబినెట్ హోదా గల మంత్రులు 22మంది సహాయమంత్రులతో కలిపి మొత్తం 44మంది ఉన్నారు. మంత్రివర్గ విస్తరణతో ఇప్పుడు ఆ సంఖ్య 54-56కు చేరవచ్చును. ఇటీవల మహారాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఎన్డీయే భాగస్వాములుగా బీజేపీ, శివసేనలు తెగతెంపులు చేసుకొని వేర్వేరుగా పోటీ చేసినప్పటికీ, ఎన్నికల తరువాత వారు మళ్ళీ కలిసి పనిచేసేందుకు సిద్దపడటంతో, మంత్రివర్గ విస్తరణలో శివసేనకు కూడా రెండు కేంద్రమంత్రి పదవులు ఇచ్చేందుకు మోడీ అంగీకరించినట్లు సమాచారం. అదే నిజమనుకొంటే, తనతో తెగతెంపులు చేసుకొన్న శివసేనకు రెండు మంత్రి పదవులు, మిత్రపక్షమయిన తెదేపాకు ఒకటే మంత్రి పదవి కేటాయించడం కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. తెదేపా నుండి సుజనాచౌదరికి కేంద్రమంత్రి పదవి ఇవ్వబోతున్నారు. బీజేపీ నుండి బండారు దత్తాత్రేయ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, మనోహర్ పారిక్కర్ తదితరులు కేంద్రమంత్రి పదవులు దక్కనున్నాయి. పారిక్కర్ కు రక్షణశాఖ కేటాయిస్తునట్లు ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. దానిని బీజేపీ వర్గాలు ఖండించనందున ఆయనకు రక్షణశాఖ ఖరారయినట్లే భావించవచ్చును.