విపత్తులోనూ వ్యాపారబుద్ధేనా?

  హుదూద్ తుఫాను కారణంగా విశాఖపట్టణం ఎదుర్కొన్న పెను విపత్తు దేశవ్యాప్తంగా అందర్నీ కదిలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలోనే మకాం వేసి అక్కడ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ విశాఖ సాధ్యమైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తుఫాను ధాటికి విశాఖపట్టణం అతలాకుతలం అయిపోయింది. చాలామంది సర్వం కోల్పోయి నడి రోడ్డున నిలబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో బయటి ప్రాంతాల వారే విశాఖను చూసి జాలిపడుతుంటే, విశాఖలో వ్యాపారులు మాత్రం ఈ విపత్తుని క్యాష్ చేసుకోవాలని తపిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో జనం రోడ్లమీదకి వచ్చారు. నిత్యావసరాల కోసం, పెట్రోలు, డీజిల్ కోసం రోడ్ల మీదకు వచ్చిన జనం దుకాణాల్లో ఆయా వస్తువులకు వ్యాపారులు చెబుతున్న రేట్లు విని నోళ్ళు తెరిచారు. మామూలుగా అమ్మే ధరకంటే రెట్టింపు ధరలు అమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్ ఏకంగా వందరూపాయల రౌండ్ ఫిగర్ చేసేశారు. కోడిగుడ్డు కొనాలన్నా కళ్ళలో గుడ్లు తిరిగిపోయే రేట్లు చెప్పారు. ఈ విషయాలన్నీ గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చేసరికి కొంతమంది దారికి వచ్చారు. మరికొంతమంది తమ వ్యాపార ధోరణిలోనే తమ ఇష్టం వచ్చిన ధరకు విక్రయాలు చేస్తున్నారు. ఇలాంటి దుర్మార్గపు వ్యాపారులున్న వైజాగ్‌కి తెలుగు ప్రజలందరి తరఫున ప్రగాఢ సానుభూతి. ఇలాంటి వ్యాపారులున్న వైజాగ్‌ భవిష్యత్తులో స్మార్ట్ సిటీ అవడం వల్ల ఉపయోగం ఏమిటి? అడుగడుగునా పరిస్థితులను ‘స్మార్ట్’గా క్యాష్ చేసుకునేవాళ్ళు తయారైనప్పుడు ఏ నగరమైనా ఎంత అభివృద్ధి చెందినా ఉపయోగం ఏమిటి? ఇలాంటి విపత్తు సమయంలో కూడా వ్యాపార బుద్ధితో ఆలోచించిన వారిని ఏమనాలి? అలాంటి వారికి బుద్ధొచ్చేట్టు చేయి దేవుడా అని ప్రార్థించడం తప్ప ఎవరూ ఏమీ చేయలేరు.

ఎర్రబెల్లి.. అందని ద్రాక్ష...

  ఓ కథ అందరికీ తెలిసిందే. అనగనగా ఓ నక్క. ఆ నక్కకి ఓ రోజున వెళ్తూ వెళ్తూ తల పైకెత్తి చూస్తే పైన ద్రాక్ష పళ్ళు కనిపించాయి. వాటిని సొంతం చేసుకోవడానికి నక్క రకరకాల ఫీట్లు చేసింది. ఎంత ఎగిరినా ద్రాక్షని అందుకోలేకపోయింది. చివరకు ద్రాక్షల కోసం పైకి ఎగిరీ ఎగిరీ నక్క నడుం కూడా బెణికింది. చివరికి నక్క ‘ఈ ద్రాక్షలు బాగోవు.. ఇవి పుల్లటి ద్రాక్షలు’ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన వైఫల్యాన్ని ఆ నక్క ద్రాక్ష పళ్ళ మీదకి నెట్టేసింది. ఈ కథకి, టీఆర్ఎస్ - ఎర్రబెల్లికి మధ్య పోలిక వుందని తెలంగాణ తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. నక్కకి అందని ఆ ద్రాక్షే ఎర్రబెల్లి అంటున్నాయి. తెలంగాణలో టీడీపీని బలహీనం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆకర్ష’ పథకాన్ని విజయవంతంగా అమలు చేశారు. తాజాగా ముగ్గురు టీటీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చెబుతున్న కారణాలు మరీ విచిత్రంగా వున్నాయన్న అభిప్రాయాలు వ్యకమవుతున్నాయి. ధర్మారెడ్డి అనే ఎమ్మెల్యే చెప్పే కారణం అయితే మరీ కామెడీగా వుంది. తాను టీఆర్ఎస్‌లో చేరితే తన నియోజకవర్గం అభివృ‌ద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వందల యాభై కోట్లు ఇస్తాననేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారుతున్నాడట. సరే, వీళ్ళ సంగతి అలా వుంచితే, టీఆర్ఎస్ గాలం వేసిన పెద్ద చేప ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం చిక్కలేదు. ‘మనం మనం ఒకటి’ అని సామాజిక వర్గం కోణంలో ప్రయత్నించినప్పటికీ వర్కవుట్ కాలేదు. ప్రజల సమస్యల ప్రస్తావనకు ముఖ్యమంత్రి స్థానంలో వున్న కేసీఆర్‌ని కలవటానికి ఎర్రబెల్లి వెళ్తే, దానికి పార్టీ మారడానికే కలిశారంటూ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎర్రబెల్లి మాత్రం తాను ప్రాణం పోయినా తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదన్న తన మాటకు కట్టుబడి వున్నారు. దాంతో టీఆర్ఎస్ ఎర్రబెల్లి మీద ఆశలు వదిలేసుకుంది. ఎర్రబెల్లి మీద ఆశలు వదులుకున్న టీఆర్ఎస్ అక్కడితో ఆగకుండా ఎర్రబెల్లి పుల్లని ద్రాక్ష అంటూ ప్రచారం మొదలుపెట్టింది. దానికోసం టీఆర్ఎస్ ఎంపీ కడియం శ్రీహరి సేవలను ఉపయోగించుకుంటోంది. గత కొన్ని రోజులుగా కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకరరావు మీద విమర్శల మీద విమర్శలు కురిపిస్తున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుని టీఆర్ఎస్‌లోకి రానిచ్చే ప్రసక్తే లేదని అనడం మొదలుపెట్టారు. ఎర్రబెల్లి కేసీఆర్ని అర్ధరాత్రిపూట ఎందుకు కలిశారో చెప్పాలని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏ గడ్డి పీకినా ఎర్రబెల్లిని టీఆర్ఎస్‌లో అడుగు పెట్టనిచ్చేదే లేదని చెబుతున్నారు. ఒకవైపు స్వయానా ఎర్రబెల్లే నేను టీఆర్ఎస్‌లోకి రాను మొర్రో అంటూ వుంటే మరోవైపు కడియం చేస్తున్న కామెంట్లు పుల్లటి ద్రాక్షపళ్ళ కథని గుర్తుకు తెచ్చేలా వున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఇక గూగుల్ హ్యాంగ్ ఔట్‌లో చంద్రబాబు

  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఎప్పుడు ముందుండే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఐప్యాడ్ లను ఉపయోగిస్తూ ‘పేపర్ లెస్ క్యాబినెట్ మీటింగ్’ నిర్వహించి తన ప్రత్యేకత మరోసారి చాటుకొన్నారు. దానికి క్లౌడ్ కంప్యూటర్ సర్వీస్ సేవలుపయోగించుకోవడం మరో విశేషం.   ఇక ఇప్పటికే ఆయన ట్వీటర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలతో అభిప్రాయాలు పంచుకొంటున్నారు. ఇకపై యూ ట్యూబ్, ఫేస్ బుక్, గూగూల్ ప్లస్ ద్వారా కూడా యువతరంతో అభిప్రాయలు పంచుకొబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ఆయన మాట్లాడినపుడు తీసిన వీడియో క్లిప్పింగులను, శుక్రవారం నుండి యూ ట్యూబ్ లో ఉంచుతూ దానిపై ప్రజల నుండి వచ్చే స్పందన తెలుసుకొంటున్నారు. అదేవిధంగా డిశంబరు మొదటి వారం నుండి ఆయన గూగూల్ హ్యాంగ్-అవుట్ ద్వారా కూడా నేరుగా ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకోబోతున్నారు. మొదటగా తన ప్రభుత్వం చేప్పట్టిన ఏడు మిషన్లపై చర్చతో ఆరంభించే అవకాశం ఉందని ఆయన కార్యాలయ అధికారులు తెలిపారు.   చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ సోషల్ నెట్ వర్క్ సైట్ల ద్వారా ప్రజలతో నిత్యం ‘టచ్చు’ లో ఉండటమే కాకుండా అన్ని మంత్రిత్వ శాఖలను, మంత్రులను కూడా శాఖలవారిగా ప్రత్యేక వెబ్ సైట్స్ మరియు ఫేస్ బుక్, ట్వీటర్ ల ద్వారా ఇదేవిధంగా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై ప్రజాస్పందన ఏవిధంగా ఉందనే సంగతి తెలుసుకోవడానికి ఎన్నికల వరకు భజన చేస్తూ కూర్చోవడం కంటే, ఈవిధంగా ఎప్పటికప్పుడు ప్రజలతో తమ అభిప్రాయాలు పంచుకొంటూ, వారి సలహాలు, సూచనలు తీసుకొంటూ ముందుకు సాగినట్లయితే అందరికీ అమోదయోగ్యమయిన విధంగా పరిపాలనా సాగించవచ్చని, తప్పులు జరిగితే తక్షణమే వాటిని సరిదిద్దుకొనే అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు.

పాకిస్థాన్‌కి సత్తా చాటిన భారత సైన్యం

  జమ్ము - కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం ఓవర్ యాక్షన్ చేసి భారత సైనికుల మీద, భారత భూభాగంలోని జనావాసాల మీద కొద్ది రోజుల క్రితం విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. ఈ కాల్పులలో అనేక ఇళ్ళు ధ్వంసం కాగా, ఇద్దరు మరణించారు. గత రెండు రోజుల నుంచి పాకిస్థాన్ సైనిక మూకలు కాల్పులు జరపడం ఆపేశారు. భారత సైన్యం చూపిన సత్తాయే పాక్ సైనికులు గప్‌చుప్ అయిపోవడానికి కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్థాన్ సైనికులకు గతం నుంచీ ఒక ఆటలా వుండేది. యుపిఎ హయాంలో సరైన ఆయుధ సంపత్తి లేక, దూకుడుగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం లేక భారత సైనికులు చేతులు కట్టేసినట్టు వుండేవారు. ఎన్టీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైనికులలో ఆత్మస్థైర్యాన్ని పెంచే ఎన్నో చర్యలు తీసుకున్నారు. పాకిస్థాన్ సైనికులు ఎక్కువ చేస్తే వారిని అదుపులోకి తేవడానికి అవసరమైన పూర్తి ఆయుధ సంపత్తితోపాటు నైతికంగా వారికి పూర్తి మద్దతు ఇచ్చారు. దాంతో భారత సైనికులు పాకిస్థాన్ సైనికులను విజయవంతంగా కట్టడి చేయగలిగారు.   భారత ప్రధానమంత్రి కార్యాలయం పాకిస్థాన్ సైనికులు కాల్పులు ప్రారంభించగానే తగిన చర్యలను తీసుకోవాలని సైనిక వర్గాలను ఆదేశించింది. గతంలో మాదిరిగా సందేహించాల్సిన అవసరం లేదని, పాకిస్థాన్ సైనికుల విషయంలో దూకుడుగా వ్యవహరించొచ్చని చెప్పింది. పాక్ సైనికులను తిప్పికొట్టడానికి భారీ ఆయుధ సంపత్తిని ఉపయోగించాలని సూచించింది. ప్రభుత్వం నుంచి సూచనలు అందుకున్న భారత సైనికులు తమ ప్రతాపం చూపించారు. దాదాపు ఐదు లక్షల బుల్లెట్లు వర్షంలాగా కురిపించారు. భారత సైనికులు జరిపిన కాల్పుల వల్ల పాకిస్థాన్ అధికారికంగా బయటపెట్టకపోయినప్పటికీ, వందల సంఖ్యలో పాకిస్థాన్ సైనికులు మరణించారని తెలుస్తోంది. పాకిస్థాన్ సైనికులతోపాటు సరిహద్దులు దాటి రావడానికి ప్రయత్నించిన జిహాదీ మూకలు కూడా మరణించాయని తెలుస్తోంది. భారత సైనికులు తీవ్రంగా కాల్పులు ప్రారంభించగానే, అప్పటి వరకూ సరిహద్దుల దగ్గర గోతికాడ నక్కల్లా కాచుకుని వున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాద జిహాదీ గ్రూపుల వారు దాదాపు 500 మంది చెట్టుకొకరుగా పుట్టకొకరుగా పారిపోయారని తెలుస్తోంది. భారత సైన్యం జరిపిన భారీ కాల్పుల్లో దాదాపు 90 పాకిస్థానీ సైనికుల శిబిరాలు ధ్వంసమైపోయాయని సమాచారం. భారత సైనికులు చూపిన తెగువ పాకిస్థానీయులను బిత్తరపోయేలా చేసిందని, తిరిగి ఇప్పట్లో పాకిస్థాన్ సైనికులు భారత భూభాగం మీద కాల్పులు జరిపే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు.

ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు?

  మరో ఇరవై రోజుల్లో నవంబర్ 1వతేదీ వస్తుంది. ఇంతవరకు ఆరోజును రాష్ట్ర అవతరణ దినోత్సవంగా పాటిస్తున్నాము. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరగడంతో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకోవాలనే చర్చ మొదలయింది. కొందరు అదే రోజున జరుపుకోవాలని సూచిస్తుంటే మరి కొందరు ఆంద్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన రోజున అంటే జూన్2న జరుపుకోవాలని వాదిస్తున్నారు. కానీ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు. కనుక ప్రజలలోనే కాదు ప్రభుత్వ అధికారులలో కూడా ఈ విషయంలో సందిగ్దత నెలకొని ఉంది. ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై నిర్ణయం తీసుకోకపోతే, నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు నిర్వహించవలసి ఉంటుంది కనుక దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి సమయం సరిపోదని అధికారులు భావిస్తున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలను కూడా సంప్రదిస్తే అనవసర రాద్ధాంతం నివారించవచ్చును.

మీడియా గొంతు మూగబోవలసిందేనా?

  గత మూడున్నర నెలలుగా తెలంగాణా రాష్ట్రంలో నిషేధానికి గురయిన ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ పునరుద్దరణకు ఆ సంస్థ యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. చివరికి నిన్న హైకోర్టులో కూడా వారికి చుక్కెదురయింది. జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం నిన్న తన తీర్పు ప్రకటిస్తూ ప్రైవేటు వ్యక్తులయిన తెలంగాణా యం.యస్.ఓ.లను ఛానల్ ప్రసారాలను పునరుద్దరించమని ఆదేశించలేమని, అందువలన ఈ వ్యవహారాన్ని సివిల్ కోర్టులో తేల్చుకోమని సూచించింది. సివిల్ కోర్టులో కేసులు తేలడానికి ఎన్నేళ్ళు పడతాయో అందరికీ తెలిసిన విషయమే. కనుక ఆ ప్రయత్నం కూడా వృధా ప్రయాసేనని చెప్పకతప్పదు. అందువల్ల సుప్రీంకోర్టుకు వెళ్ళడమే ఇక మిగిలింది. మన దేశంలో మీడియాకు చాలా స్వేచ్చ ఉందని విదేశాలు సైతం ప్రశంసిస్తుంటాయి. మన దేశంలో మీడియా స్వేచ్చకు సంకెళ్ళు పడటం చాలా అరుదనే చెప్పవచ్చును. కానీ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ఆ మీడియా గొంతే మూగబోతుంటే, అందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు చివరికి కోర్టులు కూడా తమ నిస్సహాయత వ్యక్తం చేయడం చాలా విచారకరం. ఇదంతా చూసి ఇతర రాష్ట్రాలు కూడా తమకు నచ్చని మీడియా గొంతులను నొక్కే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఎంత మాత్రం మంచి పరిణామం కాదనే చెప్పవచ్చును.

ఏపీ రాజధాని: అన్ని దారులూ అమరావతి వైపే!

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో ఉంటుందని ప్రకటించిన తర్వాత ఆంధ్రుల తొలి రాజధాని, సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి వైపే రాజధాని వుండే అవకాశాలు వున్నాయన్న అభిప్రాయాలు వినిపించాయి. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కృష్ణానదికి అవతలి వైపునే రాజధాని వుంటుందని స్పష్టంగా ప్రకటించడం కూడా అమరావతి ప్రాంతం రాజధాని అయ్యే అవకాశాలు వున్నాయన్న అంచనాలకు మరింత బలం చేకూరింది.   పరిశీలకుల అభిప్రాయం ప్రకారం.... అమరావతి ప్రాంతానికి రాష్ట్రానికి రాజధాని అవ్వడానికి అన్ని అర్హతలూ వున్నాయి. ముఖ్యంగా అమరావతి ప్రాంతం రాజధాని కావడం అనేది వాస్తు పరంగా అద్భుతం. ఎందుకంటే అమరావతికి ఈశాన్యం చాలా పల్లంగా వుంటుంది. పైగా కృష్ణానది నిరంతరం ప్రవహిస్తూ వుంటుంది. అలాగే అమరావతి ఈశాన్య భాగంలో పెద్ద రిజర్వాయర్ వుంది. ఆ విధంగా ఈశాన్యంలో సహజసిద్ధంగానే నీటి నిల్వలు వుండటం ఎంతో మంచిది. మరో విషయం గురించి ఆలోచించకుండానే ఏకగ్రీవంగా అమరావతి ప్రాంతాన్ని రాజధాని చేయడానికి ఈ ఒక్క కారణం చాలు. ఈ కారణంతోపాటు మరెన్నో కారణాలు ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్గాలు అమరావతి వైపు పయనించడానికి కారణం అవుతున్నాయి.   అమరావతి పరిసరాల్లో అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్‌భవన్... ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సరిపడా ప్రభుత్వ భూములు వున్నాయి. కృష్ణాతీరంలో వున్న అమరావతిని రాజధానిగా చేయడం వల్ల రాజధానికి నీటి సమస్య కూడా వుండదు. ఇప్పటికే ప్రభుత్వం అమరావతి మీద ట్రాఫిక్ ఒత్తిడి పడకుండా రింగ్ రోడ్లను ప్లాన్ చేసింది. విజయవాడ పరిసరాలు మొత్తం అభివృద్ధి చెందేలా, అమరావతి మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసేలా ఈ ప్రణాళిక వుంది.   అలాగే అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిని చేసిన తర్వాత ఆ ప్రాంతంలో రవాణా సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కృష్ణానదిపై రెండు భారీ వంతెనలను నిర్మించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.   అమరావతి అనాది నుంచి సుప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. బౌద్ధ సంస్కృతి విలసిల్లిన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేసినట్టయితే వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి సిద్ధంగా వున్నట్టు బౌద్ధ గురువు దలైలామా రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే బౌద్ధాన్ని పాటించే జపాన్ కూడా అమరావతి రాజధాని అయినట్టయితే రాజధాని అభివృద్ధికి భారీ స్థాయిలో సహకరిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. రాజధాని పేరు కూడా బౌద్ధ ధర్మాన్ని అనుసరించి పెట్టినట్టయితే తమ నుంచి మరింతగా సహకారం అందుతుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇన్ని అనుకూల అంశాలు వున్నాయి కాబట్టే అందరి ఆలోచనలూ ‘అమరావతి’ అమరావతి చుట్టూ తిరుగుతున్నాయి. అన్ని దారులూ అమరావతి వైపు వెళ్తున్నాయి.

జగన్‌కి తెలంగాణ మీద లవ్వెందుకు పుట్టిందంటే...

  జగన్‌ పార్టీ తెలంగాణలో ఎప్పుడో బాల్చీ తన్నేసింది. తెలంగాణలో వైకాపా అంత్యక్రియలు, దినవారాలు ఎప్పుడో అయిపోయాయి. అప్పటి నుంచి జగన్ బాబు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైపోయి తన ప్రతాపం అక్కడే చూపిస్తున్నారు. ఎవరి పేరు చెబితే ఆంధ్రప్రదేశ్ ప్రజల కడుపు మండిపోతుందో ఆ వ్యక్తి కేసీఆర్‌తో జగన్ దోస్తీ కట్టి స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ పాటలు పాడుతున్నాడు. ఆ పాటలనే తన మీడియాలో కూడా వినిపిస్తూ కేసీఆర్ మీద తనకున్న భక్తిని యథాశక్తి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ అధికారం చేపట్టిన ఈ నాలుగు నెలల కాలంలో తెలంగాణలో ప్రజలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా వాటి గురించి పల్లెత్తు మాట కూడా అనకుండా జగన్ తెలంగాణ అంటే తనకు ఎంతమాత్రం పట్టనట్టే వ్యవహరించాడు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ గానీ, ఆయన పార్టీ గానీ తిరిగి తెలంగాణలో ఎంటరయ్యే అవకాశం లేదని అందరూ అనుకున్నారు.   అయితే జగన్‌ బాబుకి సడెన్‌గా తెలంగాణ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కేసీఆర్ సరిగా పరిపాలించడం లేదన్న విషయం గుర్తుకొచ్చింది. వచ్చే ఎన్నికలలో తెలంగాణలో తన పార్టీకే అధికారం దక్కేస్తుందని ఆశ పుట్టుకొచ్చింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతని తన సోదరీమణి షర్మిలకి అప్పగించేశాడు. వైఎస్సార్ పోయినప్పుడు తెలంగాణలో కూడా ఎంతోమంది గుండె ఆగి చనిపోయారట. వాళ్ళ కుటుంబాలని ఐదేళ్ళ తర్వాత పరామర్శించి రమ్మంటూ షర్మిలకి పురమాయించేశాడు. ఇదంతా చూస్తుంటే జగన్‌కి తెలంగాణ మీద సడెన్‌గా ఇంత లవ్వు ఎందుకు పుట్టిందా అనే సందేహం అందర్లోనూ కలిగింది.   తెలంగాణలో తిరిగి కాలు మోపడం వెనుక కారణాలని జగన్ పైకి ఎన్ని చెబుతున్నప్పటికీ, మొన్నటి వరకూ తన భుజాన ఎక్కించుకుని తిరిగిన కేసీఆర్ని ఇప్పుడు సడెన్‌గా విమర్శిస్తున్నప్పటికీ జగన్ పార్టీ రీ ఎంట్రీ వెనుక చాలా పెద్ద ప్లానే వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్, షర్మిల పాత్రధారులైన ఆ ప్లానుకు సూత్రధారి మరెవరోకాదు.. కేసీఆరేనని కూడా అంటున్నారు. ఈ ప్లాన్ వెనుక వున్న సంగతులను కూడా విశ్లేషిస్తున్నారు.   ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వెలమ దొరల సామాజిక వర్గం అధికారంలోకి రావడంతో రెడ్డి సామాజికవర్గం దిగాలు పడిపోయింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వుండగా తెలంగాణ ప్రాంతంలో మొన్నటి వరకు హవా నడిపిన రెడ్డి సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దిగాలు పడిపోయింది. రాష్ట్ర రాజకీయాలను శాశించే బలమైన నాయకుడు తమ సామాజిక వర్గం నుంచి ఎవరైనా వస్తారా అన్న ఎదురుచూపు ఆ సామాజికవర్గంలో వుంది. కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు వున్నప్పటికీ వాళ్ళు చురుకుగా వ్యవహరించే పరిస్థితి లేదు. కేసీఆర్ గవర్నమెంట్‌ని ఎదుర్కొనే శక్తీ లేదు. దాంతో ఆ సామాజిక వర్గం ఎంతో లోటుగా భావిస్తోంది. ఆ లోటును గ్రహించిన చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఆ సామాజిక వర్గానికి చెందిన రేవంత్‌రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం మీద బాణంలా సంధించి వదిలారు. బాగా చదువుకున్నవాడు, తెలివైనవాడు, మాటకారితనం వున్నవాడు, ముక్కుసూటిగా వ్యవహరించేవాడూ అయిన రేవంత్‌రెడ్డి గత కొంతకాలంగా కేసీఆర్ ప్రభుత్వం మీద మాటల తూటాలు విసురుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. ‘దొరల’ మీదే తన పోరాటం అంటున్న రేవంత్ రెడ్డి మాటలు తెలంగాణలోని రెడ్డి సామాజికవర్గానికి కొత్త ఆశలు కలిగేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సామాజికవర్గం తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు అవుతూ చేరువ అవుతున్నారు.   రెడ్డి సామాజికవర్గం తెలుగుదేశం పార్టీకి చేరువ కావడాన్ని గ్రహించిన కేసీఆర్ తన చిరకాల మిత్రుడు జగన్మోహన్‌రెడ్డిని మళ్ళీ తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ చేసి రెడ్డి సామాజికవర్గం పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైపు వెళ్ళకుండా కాపాడుకునే ప్రయత్నం ప్రారంభించారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం జగన్ పార్టీ నాయకులు పైపైకి తనను విమర్శిస్తూ రెడ్డి సామాజిక వర్గాన్ని చెయ్యిజారిపోకుండా చూసుకుంటే ఆ తర్వాత జగనూ, తానూ బాబాయ్, అబ్బాయ్‌లా కలసిపోతే ఆయన సామాజిక వర్గం కూడా తనతో దోస్తీ చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇదంతా ఆలోచించే కేసీఆర్ మళ్ళీ తెలంగాణలో వైకాపాని సమాధిలోంచి బయటకి వెలికి తీయించారని విశ్లేషిస్తున్నారు.

అందుకే లోకేష్ కేసీఆర్‌ను ఢీ కొంటున్నారా?

  తెలంగాణాలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని నిందిస్తున్నతెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని మొన్న తీవ్రంగా విమర్శించిన నారా లోకేష్ మళ్ళీ మరోసారి ఆయనపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చెందిన సంగతి అందరికీ తెలుసని కానీ ఆ విషయం కేసీఆర్ కే తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని, ఈ విషయంపై నేరుగా చంద్రబాబుతో చర్చించే దైర్యం ఆయనకు ఉందా? అని ప్రశ్నించారు. అసలు తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తింటోందని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. ఇదివరకు కూడా లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్ధులపై చాలా సార్లు ఇటువంటి విమర్శలు చేసేరు. కానీ ఇప్పుడు ఆయన నేరుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ పైనే నేరుగా విమర్శలు చేయడం గమనిస్తే, తెరాస నేతలు చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలపట్ల తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇంతవరకు ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ కొంత సంయమనం పాటిస్తూ వచ్చినా, ఇకపై ఎంత మాత్రం ఉపేక్షించబోదని ఆయన విమర్శలు స్పష్టం చేస్తున్నాయి.

అరకు యాపిల్స్ వచ్చేస్తున్నాయోచ్

  నెత్తి మీద పండు పడినప్పుడో లేక నీళ్ళ టబ్బులో తేలినప్పుడో శాస్త్రవేత్తలకి బల్బు వెలిగినట్లే, విశాఖ జిల్లా అరుకు సమీపంలో ఉండే లంబసింగి అనే మారు మూల గ్రామంలో బొబ్బిలి రాంబాబు కూడా యాపిల్ కాయ తినేసి పెరట్లో విత్తనాలను విసిరేసినప్పుడు అక్కడ యాపిల్ మొక్కలు పుట్టి ఏపుగా ఎదిగి కాయలు కూడా కాసేస్తున్నాయని ఆ నోటా ఈ నోటా పాకి చివరికి మన వ్యవసాయ పరిశోధన సంస్థ వాళ్ళ చెవుల్లో కూడా పడేసరికి “అయితే ఆంధ్రాలో కూడా మనం ఎంచక్కా యాపిల్ మొక్కలు వేసుకోవచ్చన్నమాట” అనే కొత్త సంగతి కనుగొన్నారు.   ఇంతవరకు సీమ్లా యాపిల్, కాశ్మీర్ యాపిల్, హిమాచల్ యాపిల్ అనుకోని చెప్పుకోవడమే కానీ అరుకు యాపిల్, పాడేరు యాపిల్ అనే మాట ఎవరూ వినలేదు కదా! అందుకే హైదరాబాద్ లో గల సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయోలజీకి చెందిన శాస్త్రవేత్తలు హిమాచల్ ప్రదేశ్ నుండి వంద యాపిల్ మోక్కలు పట్టుకువచ్చి లంబసింగిలో నాటి అక్కడ యాపిల్ తోటలు సాగుకు అనువుగా ఉన్నాయా లేదా? అనే విషయంపై ఏడాదిగా పరిశోధనలు చేస్తున్నారు. అవి కాక స్థానిక వ్యవసాయ పరిశోధనా కార్యాలయ ఆవరణలో వివిధ రకాలకు చెందిన యాపిల్ మొక్కలను నాటి పరిశోధన చేస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ డా.యన్. వేణుగోపాలరావు తెలిపారు.   సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉన్న కారణంగా అరుకు, పాడేరు, చింతపల్లి, పెదబయలు, జి.మాడుగుల, అనంతగిరి తదితర గిరిజన ప్రాంతాలలో వాతావరణం ఎప్పుడూ 15డిగ్రీల లోపే ఉంటుంది. కనుక అక్కడ చల్లటి వాతావరణానికి అనుకూలమయిన కాఫీ, మిరియాల తోటలు దాదాపు 1.5లక్షల ఎకరాలలో పండిస్తున్నారు. అక్కడ పండించిన కాఫీ దేశ విదేశాలకు ఎగుమతవుతోంది కూడా. అందుకే ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఎకరం విస్తీర్ణంలో యాపిల్ మొక్కలు పెంచుతున్నారు. దాదాపు ఏడాది వయసున్న ఆ మొక్కలు మరో రెండేళ్ళ తరువాత కాయలు కాయడం మొదలుపెడతాయి.   ఒకవేళ ఈ ప్రాంతంలో కూడా యాపిల్ తోటల సాగుకు అనుకూలమని తేలినట్లయితే, యాపిల్ తోటల పెంపకానికి, వాటి మార్కెటింగ్ కు తాము గిరిజనులకు అన్ని విధాల సహకరిస్తామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్. లక్ష్మణుడు తెలిపారు.   ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తోంది. కానీ దాని బదులు ఈ ఏజన్సీ ప్రాంతాలలో స్ట్రా బెర్రీ, పసుపు, యాలకులు , సుగంధ ద్రవ్యాల మొక్కలు, వివిధ రకాల పూల తోటల సాగుకు అవసరమయిన ఆర్ధిక సహాయం, శాస్త్రీయ సహకారం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుందని స్థానిక గిరిజనులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా బొబ్బిలి రాంబాబు మాత్రం పెరట్లో కాస్తున్న యాపిల్ కాయలు చూసి లొట్టలు వేస్తున్నాడు.

ఆంధ్రాలో బిజినెస్ అదుర్స్

  భారతదేశం చాలా బీద దేశం కానీ భారతీయులు మాత్రం బీదవారు కారని విదేశీయులు చెప్పుకొంటు౦టారు. అది నిజమేనని నిరూపిస్తున్నారు ఆంధ్రాలో సౌండ్ పార్టీలు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం ఆర్ధికంగా చాలా క్లిష్ట పరిస్థితులో ఉందని నిత్యం మనల్ని మనం ఓదార్చుకోవడం పరిపాటయిపోయింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలాసవంతమయిన కార్ల అమ్మకాలు ఏకంగా 62శాతం వరకు పెరిగాయని వివిధ కార్ల షో రూమ్స్ మేనేజర్లే స్వయంగా చెపుతున్నారు. ఆ విషయాన్ని ఆర్.టీ.యే. అధికారులు కూడా ద్రువీకరిస్తున్నారు.   రూ. 10లక్షలకు పైబడి ఉన్న కార్లను విలాసవంతమయిన కార్లగా గుర్తిస్తే, మళ్ళీ వాటిలో రూ. 50 నుండి 60 లక్షల ధరలున్నకార్లని ‘సి’ మరియు ‘ఈ’ కేటగిరీల క్రింద విభజించారు. ఇవి కాక జీ.యల్. కేటగిరీ కూడా ఒకటుంది. అదొక రేంజిలో ఉంటుంది. అంటే కనీస ధర రూ.85 లక్షలతో మొదలయ్యి రూ.1.36 కోట్లవరకు సాగుతుంది. ఆ పైన ఇంకేమయినా కేటగిరీలు పెడితే మనోళ్ళు దానికీ సిద్దమేనంటున్నారు. కానీ అమ్మే వాళ్ళే లేరు.   ఇక లెక్కలోకి వస్తే గతేడాది ఏప్రిల్ నెల నుండి సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు కేటగిరీలలో మొత్తం 1,931 కార్లు రిజిస్టర్ అయ్యాయిట. కానీ ఈసారి ఏకంగా 3,129 కార్లు అమ్ముడయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఏకంగా 62శాతం అమ్మకాలు పెరిగాయన్నమాట. అవి కూడా అల్లాటప్పా కార్లు కాదు. ఆడి, బెంజ్, బి.యం.డబ్ల్యు.వోల్వో వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీల కార్లు.   ఇక హైదరాబాదులోనే సంపద అంతా పోగుపడుంది కనుక అక్కడ దీనికి రెండితలు అమ్ముడయ్యే ఉంటాయని అందరూ భావించవచ్చు. కానీ గతేడాది ఇదే సమయంలో అక్కడ ఈ కేటగిరీ కార్లు 4,162 అమ్ముడయితే, ఈ ఏడాది కేవలం 5,088 మాత్రమే అమ్ముడయ్యాయిట. అంటే కేవలం 22శాతం అమ్మకాలు పెరిగాయన్నమాట.   అందుకే ఆడి, బెంజ్, బి.యం.డబ్ల్యు.వోల్వోల షోరూములు ఇప్పుడు వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, చివరికి మంగళగిరికి కూడా వచ్చేసాయి లేదా త్వరలో వచ్చేస్తున్నాయి. అందువల్ల బెంజి కారు కొనుకోవడానికి మనం ఏ హైదరాబాదో డిల్లీకో పరిగెత్తనవసరం లేదు విజయవాడ బెంజి సర్కిల్లోనే దొరకవచ్చు, లేదా వైజాగ్ రామా టాకీస్ సందు పక్కన దొరకవచ్చును.

పంట రుణాల పేరుతో బ్యాంకులకు రైతులు కుచ్చు టోపీలు

  ఈనెల 22న దీపావళి పండగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి దఫాగా రైతుల పంట రుణాలలో 20 శాతం వారి ఖాతాలలో జామా చేయాలని భావించారు. ఆ క్రమంలో రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు తెప్పించుకొన్న ప్రభుత్వాన్ని పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే దాదాపు 40శాతం మంది రైతులు ఒకే పంట భూమిపై 12 నుండి 34 బ్యాంకులలో ఖాతాలు తెరిచి రుణాలు తీసుకొన్నట్లు బయటపడింది. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో ఒక వ్యక్తి 12 బ్యాంకులలో ఖాతాలు తెరిచి పంట రుణాలు తీసుకొంటే, పక్క జిల్లాలో మరో ఘనుడు ఏకంగా 34 ఖాతాలతో మూడు పూవులు ఆరు కాయలన్నట్లు ఒకే పంట భూమిపై ఏకంగా 34సార్లు పంట రుణాలు పొందాడు. అటువంటివన్నీ కలుపుకొని చూసినట్లయితే రాష్ట్రంలో మొత్తం 80 లక్షల పంట రుణాల ఖాతాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నకిలీ ఖాతాలన్నిటినీ గుర్తించి తొలగించగలిగినట్లయితే, ప్రస్తుతం చెల్లించాల్సిన పంట రుణాలలో ఏకంగా సగానికి సగం భారం తగ్గిపోతుందని అధికారులు భావిస్తున్నారు.   అయితే నేటికీ చాలా బ్యాంకులు వారి ఖాతాల వివరాలు ప్రభుత్వం చేతికి ఇవ్వనందున, దీపావళినాడు మొదటి దఫా రుణాల మాఫీ ప్రక్రియ ఆలస్యం జరిగేలా ఉందని అధికారులు భావిస్తున్నారు. పైగా ఈ పంట రుణాలు తీసుకొన్న రైతులు, వారి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం తయారు చేసిన 34 కాలమ్స్ తో కూడిన దరఖాస్తులను నింపవలసి రావడం వలన కూడా ఆలస్యమవవచ్చునని భావిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 22న మొదటి దఫా పంట రుణాల చెల్లింపులు జరగవలసిందేనని ఆదేశించినట్లు వారే చెపుతున్నారు.

చీపుర్లు పట్టుకోబోతున్న నాగార్జున, సానియా మిర్జా

  గతంలో సినిమా కళాకారులు రాష్ట్రంలో వరదలు, తుఫానులు లేదా ఏవయినా అటువంటి ఉపద్రవ పరిస్థితులు ఏర్పడినప్పుడు అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి భారీ విరాళాలు అందజేయడమే కాకుండా, ప్రజల మధ్యకు వెళ్లి స్వయంగా విరాళాలు సేకరించేవారు. స్వర్గీయ యన్టీఆర్ నేతృత్వంలో తెలుగు సినిమా కళాకారులు అటువంటి కార్యక్రమాలలో చాలా సార్లు పాల్గొన్నారు. అయితే కాలక్రమంలో సినిమా కళాకారులలో అటువంటి ఆలోచనలు తగ్గిపోయి వారి ద్యాసంతా నిత్యం సినిమా షూటింగులు, వ్యాపార ప్రకటనలు, టీవీ షోలలో యాంకరింగ్ చేసుకొంటూ కోట్లు కూడబెట్టుకోవడంపైనే ఉంది. వారందరూ విధిగా తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడం మరిచిపోరు కానీ ఏనాడు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి సమాజ హితానికి పాటుపడిన దాఖలాలు లేవు. మహా అయితే తమపెరిత ఒక బ్లడ్ బ్యాంకో తెరిచి, దానికి తమ అభిమానులను రక్తం ఇమ్మని చెప్తారు తప్ప స్వయంగా రక్తం కూడా ఇవ్వరు. కానీ తాము ప్రజాసేవ చేయడం ఎన్నడూ మరిచిపోలేదని చెప్పుకోవడానికి కొందరు రాజకీయాలలో ప్రవేశిస్తే, ఆ ఓపికలేని వాళ్ళు అప్పుడప్పుడు ఎక్సిబిషన్ క్రికెట్ మ్యాచులు ఆడుకొంటారు. రాజకీయాలలో ప్రవేశించిన సినిమా నటులు ఎంత గొప్పగా ప్రజాసేవ చేస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. వారి గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది.   ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ‘స్వచ్చ భారత్’ కార్యక్రమానికి పిలుపినిచ్చినప్పుడు, అందులో స్వచ్చందంగా పాల్గొన్నవారిని వ్రేళ్ళ మీద లెక్కించవచ్చును. ఆయన ప్రత్యేకంగా బొట్టుపెట్టి పిలిస్తే తప్ప తమంతట తాము అందులో పాల్గొనడం నామోషీగా భావించేవారు కొందరయితే, అటువంటి కార్యక్రమాలలో పాల్గొనే బదులు ఆ సమయంలో నాలుగు కమర్షియల్ యాడ్స్ చేసుకొంటే మరో నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చనేవారు లేకపోలేదు.   మోడీ పిలుపందుకొని ముంబైలో స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా సచిన్ టెండూల్కర్, అనిల్ అంభానీ వంటి ప్రముఖులు చీపుర్లు చేతపట్టుకొని ముంబై నగరంలో రోడ్లు ఊడ్చారు. కానీ మన తెలుగు చిత్ర పరిశ్రమ నుండి కానీ ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు గానీ ఎవరూ కూడా ఇంతవరకు స్వచ్చందంగా ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. కారణం తమను ఎవరూ బొట్టు పెట్టి పిలవకపోవడమే.   కానీ అనిల్ అంభానీ పిలుపందుకొని హీరో నాగార్జున, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే ఆ పని వారిని ఎవరూ పిలవక మునుపే చేసి ఉండి ఉంటే అది వారికి మరింత వన్నె తెచ్చేది.   జీవితంలో డబ్బు, కార్లు, బంగ్లాలు, ఆస్తులు, కీర్తి ప్రతిష్టలు ఆర్జించడం ఎంత ముఖ్యమో తమకు అవన్నీ కల్పించిన సమాజం కోసం ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం కూడా అంతే ముఖ్యమని, అది తమ బాధ్యతా కూడా అని మన సినీ తారలు, క్రీడాకారులు ఎప్పుడు గ్రహిస్తారో?ఈవిధంగా వారిని ప్రతీసారి ఎవరో ఒకరు ఏదో ఒక కార్యక్రమానికి బొట్టుపెట్టి ఆహ్వానించినప్పుడే కదలడం కంటే వారంతట వారే చొరవ తీసుకొని రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడితే వారికీ సమాజంలో మరింత గౌరవం పెరుగుతుంది. ప్రజలు కూడా సంతోషిస్తారు.

ఏపీ మెట్రో రైలు ప్రాజెక్టు బాధ్యతలు శ్రీధరన్ కే!

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో నిర్మించ తలపెట్టిన మూడు మెట్రో రైల్ ప్రాజెక్టులకు ఫీసిబిలిటీ మరియు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను తయారుచేసే బాధ్యతలను డిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కార్పోరేషన్ చైర్మన్ ఈ శ్రీధరన్ కు అప్పగిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఆయనను ఈ మూడు ప్రాజెక్టులకు ప్రధాన సలహాదారుగా నియమించుకొంది. ఇప్పుడు వాటి నివేదికలు సిద్దం చేసే బాధ్యత కూడా ఆయనకే అప్పగించింది.   క్రిందటి నెల విజయవాడలో పర్యటించిన ఆయన ఈ మెట్రో రైలు ప్రాజెక్టు నడపడం లాభదాయకం కాదు కనుక దానిని ప్రభుత్వం సూచించిన విధంగా విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి ప్రాంతాలను కలుపుతూ నిర్మించడం మంచిది కాదని, దానిని కేవలం విజయవాడ నగరానికే పరిమితం చేయమని సలహా ఇచ్చారు. వచ్చే జనవరి నెలాఖరులోగా ఇందుకోసం డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారుచేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తానని, కేంద్రప్రభుత్వం నుండి ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు రాగానే ఆరు నెలలలో మొదలుపెట్టి మూడేళ్ళలో పూర్తిచేస్తానని ఆరోజే తెలియజేసారు.   ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఈ రెండు నివేదికలు తయారు చేసే బాధ్యతలు అప్పగించడంతో ఇకపై పనులు జోరందుకోవచ్చును. ఆయన ఈనెల 15,16 తేదీలలో వైజాగులో పర్యటించి జీ.వీ.యం.సి. ప్రతిపాదిస్తున్న నాలుగు మార్గాలను అధ్యయనం చేసి నగరానికి బాగా ఉపయోగపడే ఒక మార్గాన్ని సూచిస్తారు. జీ.వీ.యం.సి. ఇప్పటికే ఈ నివేదికలు తయారు చేసేందుకు టెండర్లు పిలవగా నాలుగు కంపెనీలు టెండర్లు దాఖలు చేయ్సాయి. కానీ ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం ఆ బాధ్యతలను పూర్తిగా ఆయనకే అప్పగించడంతో ఇక ఆ కంపెనీలకు అవకాశంలేనట్లే భావించవచ్చును.   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వైజాగ్ లోనే కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. ఈ తరుణంలో మెట్రో రైలు కూడా వస్తే ఇక వైజాగ్ నగరం ఇక హైదరాబాదుతో పోటీ పడి మరీ అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

తెలంగాణలో పరిశ్రమల భవిష్యత్తు ప్రశ్నార్థకం

  ఎన్నెన్నో ఊహలతో, ఎన్నెన్నో ఆశలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు ఆ ఊహలు దూది పింజల్లా తేలిపోతున్నాయి. ఆ ఆశలు ఆవిరైపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఆర్నెల్లు కూడా గడవకముందే అన్ని రంగాల్లో అయోమయ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామికరంగాలలో అయితే ఈ పరిస్థితి మరింత తీవ్రంగా వుంది. ఈ రెండు రంగాలకూ తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు మీద ఉన్న అంచనాలు మెల్లగా పట్టు సడలుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా వెనుకబాటు దిశగా వెళ్తోన్న సంకేతాలు పొడచూపినప్పటికీ ఎవరూ ఈ అనుమానాన్ని బయటకి వ్యక్తం చేయలేదు. అయితే సాక్షాత్తూ తెలంగాణ ప్రభుత్వమే ఆర్థిక సంఘానికి రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడే ప్రమాదం వుందని చెప్పుకోవడంతో ఇప్పుడు అందరికీ ‘క్లారిటీ’ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత అనేక వ్యాపార సంస్థలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిపోయాయని తెలంగాణ ప్రభుత్వమే ఆర్థిక సంఘం దగ్గర చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం సదరు వ్యాపార సంస్థల సంఖ్య వందల్లో వుంటాయని చెప్పినప్పటికీ, వాస్తవంగా చూస్తే ఆ సంఖ్య వేలకు చేరింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోయిన వ్యాపార సంస్థల సంఖ్య మూడువేలను దాటుతోందని తెలంగాణ ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో మరికొన్ని వ్యాపార సంస్థలు తెలంగాణలోంచి జెండా పీకేసి ఆంధ్రప్రదేశ్‌లో పాతే అవకాశం వుందని కూడా అంటున్నాయి.   ఎల్ అండ్ టీ లాంటి అంతర్జాతీయ సంస్థ, జీఎమ్మార్ లాంటి జాతీయ స్థాయి సంస్థ కూడా తెలంగాణలో వ్యాపార కార్యక్రమాలు నిర్వహించడంలో అంత సంతృప్తిగా లేవని తెలుస్తోంది. ముఖ్యంగా మెట్రోరైలు వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టిన మెలికలకు విసిగిపోయిన ఎల్ అండ్ టీ సంస్థ ఒక దశలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటానని కూడా లేఖ రాసేసింది. అలాగే తెలంగాణలో అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు అనేక రహదారులను నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ రాష్ట్ర విభజన తర్వాత తమ రాబడులు తీవ్రంగా తగ్గిపోయాయని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ఆదాయం మరింత తగ్గే ప్రమాదం ఉందని భయపడుతున్నట్టు సమాచారం. దిగ్గజాల్లాంటి ఈ రెండు సంస్థలు రాష్ట్ర విభజన తర్వాత ఎదుర్కొంటున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రానికి రావాలని అనుకునే ఇతర వ్యాపార సంస్థల మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం వుందని పరిశీలకులు భావిస్తున్నారు.   ఇప్పటికే ఉన్న సమస్యలకు తోడు తెలంగాణ రాష్ట్రాన్ని కరెంటు సమస్య తీవ్రంగా వేధిస్తూ వుండటం కూడా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి ప్రశ్నార్థకంలో పడింది. ఇంకా వర్షాకాలం వుండగానే, విద్యుత్ ఉత్పత్తి బాగా జరుగుతూ వుండగానే తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి వేసవిలో కరెంటు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే పారిశ్రామిక వర్గాలు భయపడుతున్నాయి. ఇంకో మూడు నాలుగేళ్ళపాటు కరెంటు కష్టాలు ఇలాగే వుంటాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కరెంటు పుష్కలంగా లభించే ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళిపోవడం మంచిదన్న అభిప్రాయం పారిశ్రామికవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇలాంటి కరెంటు కష్టాలున్న తెలంగాణకు కొత్త పరిశ్రమలు రావడం అనేది ఎంతవరకు సాధ్యమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అటు వ్యాపారవర్గాల్లో, ఇటు పారిశ్రామిక వర్గాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న భయాన్ని పోగొట్టాల్సిన అవసరం వుంది.

తెలంగాణపైకి దూసుకు రానున్న జగనన్న బాణం

  వైకాపా తెలంగాణా పునః ప్రవేశం ఖరారయిపోయింది. ఊహించినట్లే తెలంగాణపైకి జగనన్న బాణం షర్మిల త్వరలో రివ్వున దూసుకురాబోతోంది. ఈరోజు హైదరాబాదులో జరుగుతున్న పార్టీ తెలంగాణా నేతల విస్త్రుత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యంపీ పొంగులేటిని తెలంగాణాలో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. అయితే షర్మిలే పార్టీకి సారధ్యం వహిస్తారు. అంతే కాదు తెలంగాణాలో జగన్మోహన్ రెడ్డి ఓదార్చలేకపోయిన వారినందరినీ ఆయన తరపున ఆమె ఓదారుస్తారు. వైకాపా తరపున తెరాసపై ఆమే తొలి బాణం ఎక్కుపెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తెరాస కనబడకుండా పోతుందని అన్నారు.   సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, “ప్రజల తరపున పోరాడేందుకు గుండె నిండా ఎంతో దైర్యం ఉండాలి. అప్పుడే వాడు నాయకుదనిపించు కొంటాడు. సినిమాలలో చివరి వరకు విలన్ చాలా బలంగా, గొప్పగా కనిపిస్తాడు. కానీ చివరికి హీరో చేతుల్లో చావు దెబ్బలు తింటాడు. అలాగే మన వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు రాష్ట్రాలలో ఇప్పుడు బలహీనంగా కనిపించవచ్చును. ప్రత్యర్ధ పార్టీలు చాలా బలంగా కనిపించవచ్చును. కానీ వచ్చే ఎన్నికలలో మనమే విజయం సాధిస్తామనే నమ్మకం నాకుంది. ఎందుకంటే ప్రజల తరపున మనం పోరాడుతున్నాము కనుక ప్రజలు ఎప్పుడూ మనతోనే ఉంటారు. ఆవిషయం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి మరణంతో రుజువయింది. ఆయన చనిపోయినప్పుడు ఆ వార్త విని తట్టుకోలేక చాలా మంది ప్రజలు ప్రాణాలు విడిచారు. తెలంగాణాలో కూడా చాలామంది ప్రజలు మరణించారు. కానీ దురదృష్టవశాత్తు వారినందరినీ నేను ఓదార్చలేకపోయాను. ఇప్పుడు ఆ బాధ్యతా షర్మిల తీసుకొంటుంది. ఆమె నా తరపున ఇంటింటికీ వెళ్లి అందరినీ ఓదార్చుతుంది."   “ప్రజల కోసం పోరాడేందుకు మనం ఉన్నామని గుర్తు చేయడానికి మన పార్టీ జెండా తెలంగాణా అంతటా రెపరెపలాడాలి. ప్రజలందరూ మన వెంటే ఉన్నారు. మనమందరం కలిసికట్టుగా పనిచేసినట్లయితే వచ్చే ఎన్నికలలో మనదే విజయం. తెలంగాణాలో చివరికి కేవలం కాంగ్రెస్, వై.యస్సార్ కాంగ్రెస్, బీజేపీలు మాత్రమే మిగిలి ఉంటాయి. మిగిలిన పార్టీలన్నీ కనబడకుండా పోతాయి,” అని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ పై నారా లోకేష్ విమర్శలు

  నారా లోకేష్ ప్రత్యక్ష రాజకీయాలలోకి రాకపోయినా ఇరు రాష్ట్రాలలో, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చాలా నిశితంగా గమనిస్తూ, అవసరమయినప్పుడు ప్రత్యర్ధ పార్టీల నేతలపై ట్వీటర్-అస్త్రాలను ఎక్కుబెడుతుంటారు. “తెలంగాణాలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలకు బదులిస్తూ, తెలంగాణాలో నీళ్ళు లేవు...కరెంటు లేదు..ఉద్యోగాలు లేవు...రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. అయినప్పటికీ ఆయన అన్నిటికీ చంద్రబాబు నాయుడునే నిందిస్తుంటారు. బహుశః అభివృద్ధిలో చంద్రబాబుతో పోటీపడలేకనే విమర్శలు చేస్తున్నారేమో?” అని ట్వీట్ చేసారు.   ఎన్నికల సమయంలో తమ పార్టీని గెలిపిస్తే తెలంగాణాను ‘బంగారు తెలంగాణా’గా మార్చేస్తామని హామీలు గుప్పించిన కేసీఆర్, ఇప్పుడు సర్వరోగ నివారిణి అన్నట్లు, ప్రతీదానికి గత ప్రభుత్వాలను నిందించడం అలవాటుగా మార్చుకొన్నారు. ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పులు చేసి ఉండి ఉంటే, వాటిని సరిదిద్ది బంగారి తెలంగాణా సృష్టించేందుకు కృషి చేయాలి కానీ నిత్యం అదేపనిగా గత ప్రభుత్వాలు తప్పులు నెమరు వేసుకోవడం వలన రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు కనబడదు.   నిజానికి ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు చాలా విషయాలలో బలంగా ఉంది. అయినప్పటికీ ఈ నాలుగు నెలలలో ఆశించినంత గొప్ప మార్పులు కనబడలేదు. పైగా ప్రస్తుత కరెంటు కష్టాలు తీరాలంటే మరో మూడేళ్ళు పడుతుందని స్వయంగా కేసీఆరే చెపుతున్నారు. కరెంటు కొరత వేదిస్తున్నప్పుడు పరిశ్రమలు పెట్టుబడులను ఆకర్షించడం కూడా చాలా కష్టమవుతుంది. అంటే ముందుగా కరెంటు సమస్యలు తీరితే తప్ప అభివృద్ధిలో ఆంధ్రాతో పోటీ పడటం సాధ్యం కాదని స్పష్టమవుతోంది.   తెలంగాణాతో పోలిస్తే చాలా సమస్యలను ఎదుర్కొంటున్న ఆంద్రప్రదేశ్ మాత్రం భవిష్యత్ పై చాలా ఆశాజనకంగా ఉండటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీక్షాదక్షతల మీద ప్రజలకున్న నమ్మకమేనని చెప్పవచ్చును. వారి అంచనాలను నిజం చేస్తున్నట్లు, అధికారం చేప్పట్టిన మూడు నెలలలోనే రాష్ట్రాన్ని కరెంటు కోతల నుండి విముక్తి చేసారు. కానీ నేటికీ తెలంగాణా ను కరెంటు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు నాయుడుని నిందిస్తుండటంతో ఆయన కుమారుడు లోకేష్ ఘాటుగా జవాబిచ్చారు.

జయలలిత కేసు ఫార్మాట్ మనకి సూటవుతుందా?

  పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది ఇక రోకలి తలకు చుట్టూ అన్నట్లుంది తమిళనాట జయలలిత అభిమానుల పరిస్థితి. ఈరోజు కర్ణాటక హైకోర్టు ఆమె బెయిలు పిటిషను విచారణకు చేప్పట్టబోతుండటంతో తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ఆమె అభిమానులు, ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలు, నేతలు వీరావేశంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరావేశంతో ఎందుకంటే, ఆమెకు బెయిలు దొరకాలని కొందరు తమ శరీరాలను సూదులు, బల్లేలు, కత్తులతో పొడుచుకొంటుంటే, మరికొందరు అగ్ని గుండాల మీద నడుస్తూ దేవుళ్ళకు మొక్కుకొంటున్నారు.   అటువంటి సాహాసాలు చేయలేనివారు విస్తరాకు కూడా లేకుండా గుళ్ళలో ఒట్టి నేల మీద భోజనాలు వడ్డించుకొని తింటూ జయలలితకు బెయిలు దొరకాలని దేవుళ్ళను వేడుకొంటున్నారు. మదురై జిల్లాలో ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలు కొందరు గుండు కొట్టించుకొని కామాక్షమ్మ గుడిలో అంగ ప్రదక్షిణాలు చేస్తున్నారు.   పార్టీకి చెందిన మరి కొంతమంది సౌండ్ పార్టీలు ‘మహా సుదర్శన హోమాలు’, ‘రుద్ర యజ్ఞాలు’ నిర్వహిస్తుంటే, అంత శక్తి లేని చోట మోటా నేతలు స్వామీ కార్యం స్వకార్యం అన్నట్లుగా జయలలిత విడుదల కోసం ఆమె పేరిట గుళ్ళలో పోటాపోటీగా అర్చనలు, అభిషేకాలు చేయించేస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, మానవ హారాలు, రాస్తా రోకోలు షరా మామూలుగానే సాగిపోతున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజు అన్ని గుళ్ళు, రోడ్లు ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలతో కిటకిటలాడిపోతున్నాయి. అయితే ఇవన్నీ నిజంగా ఆమె విడుదల కోరుతూ చేస్తున్నావా లేక ఆమె దృష్టిలో పడేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకొనేందుకు ఆ పార్టీ నేతలే చేయిస్తున్నవా? అనే వెర్రి ప్రశ్న వేస్తున్నారు కొందరు అజ్ఞానులు, పామరులు.   ఏమయినప్పటికీ ఒకప్పుడు మనోళ్ళు ఎవరయినా జైల్లోకి వెళ్ళినప్పుడు, ఏదో జైలు గేటు వరకు వెళ్లి సాగనంపి రావడమే కానీ మనోళ్ళు ఎవరూ కూడా గట్టిగా ఈ మాత్రం హడావుడి చేయలేకపోయారు. బహుశః ఇటువంటి కేసులకీ ఇటువంటి రకరకాల కార్యక్రమాలు నిర్వహించవచ్చనే ఐడియా మనోళ్ళకి లేకపోవడం చేతనే ఆ పొరపాటు జరిగి ఉండవచ్చును. కనుక ఇప్పుడు తమిళనాడులో ఏ.ఐ.డి.యం.కె. పార్టీ కార్యకర్తలు, నేతలు నిర్వహిస్తున్న విభిన్నమయిన ఈ వ్రత విధి విధానాలన్నిటినీ మనం కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకొని, జాగ్రత్తగా గుర్తుంచుకొంటే రేపు మనోళ్ళు ఎవరయినా ఇటువంటి కేసుల్లో జైలుకి వెళితే అప్పుడు మనమూ తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ ఎంచక్కా చేసుకోవచ్చును.

ప్రతిపక్షాలను ఏకం చేసిన కేసీఆర్

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఆకర్ష పధకంతో ప్రతిపక్షాల నేతలను తెరాసలోకి ఆకర్షించి, రాష్ట్రంలో ప్రతిపక్షాలను బలహీనపరచాలని భావించారు. కానీ ఆయన విద్యుత్ సమస్యలపై చేసిన వ్యాఖ్యలతో ప్రతిపక్షాలకు యూద్రుదాది చేసేందుకు చేజేతులా మంచి అవకాశం ఇచ్చారు. అంతే కాదు ఇదివరకు మీడియాపై నోరు జారి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేసీఆర్, “రాష్ట్రంలో ప్రస్తుత కరెంటు కష్టాలకు గత ప్రభుత్వాలే కారణమని, ప్రతిపక్ష నేతలు పరిస్థితులను అర్ధం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారని, కుక్కలు మొరిగితే మనం పట్టించుకొంటామా?” అని చేసిన వ్యాఖ్యలతో ఆయన మళ్ళీ మరో అటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నారు.   తెదేపా, కాంగ్రెస్ పార్టీల నేతలిరువురూ మూకుమ్మడిగా ఆయనపై ఎదురుదాడి ఆరంభించారు. కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణ, తెదేపా నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి ముగ్గురూ కూడా ఆయనపై వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎన్నికల సమయంలో తెరాస అధికారంలోకి రాగానే రోజుకి 8గంటలు చొప్పున విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్, తన హామీని అమలు చేయలేక, గత ప్రభుత్వాలను విమర్శించడం చేతకానితనమేనని వారు విమర్శించారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించలేని కేసీఆర్, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే గత ప్రభుత్వాలను నిందిస్తున్నారని వారు ఆరోపించారు.   విద్యుత్ సమస్యల గురించి ప్రజల తరపున ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే, వారిని మొరిగే కుక్కలతో పోల్చడం ఆయన అహంకారానికి నిదర్శనమని వారు విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు, రైతులు, పరిశ్రమలు తీవ్ర విద్యుత్ సమస్యలతో నానా బాధలు పడుతుంటే, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించకుండా, తన బాధ్యత గుర్తు చేస్తున్న ప్రతిపక్షాలను, గత ప్రభుత్వాలను నిందిస్తూ ప్రజలను మరో మూడేళ్ళు ఓపిక పట్టమని కేసీఆర్ చెప్పడం బాధ్యతారాహిత్యమేనని కాంగ్రెస్, తెదేపా నేతలు విమర్శించారు.   రాష్ట్రంలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉందని తెలిసి ఉన్నప్పటికీ పొరుగు రాష్ట్రమయిన ఛత్తిస్ ఘర్ నుండి విద్యుత్ సరఫరా కోసం వేస్తున్న హై-ట్రాన్స్ మిషన్ లైన్ల నిర్మాణాన్ని తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక మధ్యలో ఎందుకు నిలిపివేసిందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.   కేసీఆర్ ప్రజలకు పిట్టకధలు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారని అయితే ఇది ఎంతో కాలం సాగదని ప్రజల సహనం నశిస్తోందని ఎర్రబెల్లి అన్నారు. ఆంద్ర, తెలంగాణాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన తన అసమర్ధతను కప్పిపుచ్చుకోవాడానికి ఇంకా తెలంగాణా సెంటిమెంటును అడ్డంపెట్టుకోవడాన్ని ఎర్రబెల్లి ఆక్షేపించారు. ఇకనయినా కేసీఆర్ తన మాట తీరు మార్చుకొని ప్రతిపక్షాలను గౌరవించడం నేర్చుకోవాలని, లేకుంటే ప్రజలే ఆయనకు గుణపాటం చెపుతారని కాంగ్రెస్, తెదేపా నేతలు హెచ్చరించారు.