Read more!

శివలింగంపై కొప్పు

 

శివలింగంపై కొప్పు

 

 

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలం పలివెల గ్రామంలో ఉన్న శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామివారి క్షేత్రం బహు పురాతనమైనది. ఈ గ్రామం రావులపాలెం నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ దేవాలయానికి కొన్ని వైవిధ్యాలు ఉన్నాయి. మొదటిది – శివలింగంపై కొప్పు ఉండడం. రెండవది – అమ్మవారు స్వామివారి పక్కనే ఉండడం. శ్రీ పార్వతీపరమేశ్వరులు కలిసియున్న ఏకపీఠం ఇక్కడే ఉన్నది. మూడవది – నిజానికి శివలింగంపై కొప్పు మొదటినుండీ ఉండేది కాదు ... కాలాంతరంలో పుట్టుకొచ్చింది. గుడి వెలుపల, ఇటీవలే అమర్చిన ఒక శిలాఫలకంపై ఆ క్షేత్ర మాహాత్మ్యాన్ని తెలియజేస్తున్న వివరాలు ఉన్నాయి. వింధ్య పర్వతం, అగస్త్య మహాముని వివరాలు క్లుప్తంగా తెలుసుకుంటే కింద ఉన్న మాహాత్మ్య వర్ణనం పూర్తిగా అర్థమవుతుంది.

 

 

అగస్త్యుడు: ఒకానొక సమయంలో వింధ్య పర్వతానికి మేరు పర్వతంపై అసూయ కలిగి, తాను అదే పనిగా పెరిగిపోతూ గ్రహనక్షత్రమండల గమనానికి అవరోధం కలిగించసాగింది. అందుకు సూర్యుడు తన చుట్టూ తిరుగక మేరువు చుట్టూ తిరగడమే ప్రధాన కారణం. అలా వింధ్య పర్వతం పెరిగిపోవడంతో లోకవ్యవహారం దెబ్బ తిన్నది. దేవతలు వింధ్య పర్వతాన్ని ప్రార్థించారు. ఆయన వినలేదు, తగ్గ లేదు. చేసేదేమీలేక దేవతలందరూ బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. అంత బ్రహ్మ ఈ ఉపద్రవము నుండి మిమ్ము రక్షించువాడు అగస్త్యుడు తప్ప మరెవరూ లేరని సెలవిచ్చారు. దేవతలు తిన్నగా అగస్త్యుని వద్దకు చేరి విషయం విశదపరిచారు. విన్న అగస్త్యుడు భయము వలదని వారికి అభయమిచ్చి తాను వింధ్య పర్వత ప్రాంతాన్ని సమీపించాడు. అంత దూరాన అగస్త్యుని చూచిన వింధ్య, పూర్వం వలె ఒదిగిపోయింది. గ్రహ గమనము మరలా ప్రారంభమైంది. వింధ్య పురుషాకృతి దాల్చి అగస్త్యునకు సాష్ఠాంగదండ ప్రణామం చేసి ఆయన రాకకు కారణం వినగోరాడు.

 

 

అందుకు సమాధానంగా ఆ మహా ముని “నేను దక్షిణాపథంలో ఉన్న  తీర్థములను చూడ బయలుదేరాను. నేను తిరిగి వచ్చేవరకూ నీవు ఇలాగే ఉండవలెను” అని ఆదేశించగా వినమ్రంగా వింధ్య అంగీకరించి అలాగే ఉండి పోయింది. అప్పటి నుండి ఆయన దక్షిణ భారతంలోనే స్థిరపడి పోయారు. ఆయనకిచ్చిన మాట మేరకు వింధ్య పర్వతం కూడా అలాగే ఉండి పోయింది. అగస్త్యుని మాట వింధ్య పర్వతం విన్నది అంటే, ఆయన ఎంతటి పుణ్య పురుషుడో అర్థమవుతుంది. శ్రీమద్రామాయణం, అరణ్య కాండము సర్గలు 10, 11 లలో ఆయన ఎంతటి గొప్పవాడో స్వయంగా శ్రీరాముడే తెలియజేస్తాడు. నిజానికి ‘అగమ్ స్థంభయతీతి అగస్త్యః’ అనగా అగమును (పర్వతమును) స్థంబింపజేసిన వాడు కాబట్టి ఆయన ‘అగస్త్యుడు’ అను పేరుతో విఖ్యాతి కెక్కారు.

శ్రీ స్వామివారి పూర్వ చరిత్ర:

 

 

 

పూర్వము అగస్త్య మహాముని కౌశికానది తీరామున పల్వలపుర ప్రాంతంలో తపస్సు చేసుకుంటుండగా హిమాలయ పర్వతమున లోక కల్యాణార్థమై పార్వతీ పరమేశ్వరుల కల్యాణము అతి వైభవముగా జరుగుచుండెను. ఆ కల్యాణమును చూచి తరించవలెనని అగస్త్య మహాముని సంకల్పించెను. అగస్త్యుడు బయలుదేరి వెళ్ళినచో వింధ్య పర్వతము యెప్పటివలే తన ఉగ్రరూపమును చూపి సంభోంతరాశమునకు ఎదిగి, గ్రహభ్రమణమునకు తీవ్ర ఆఘాతము కలుగజేయును. అలాంటి ఉపద్రవం జరుగుతుందని భయపడి ఇంద్రాది దేవతలు అగస్త్యుని ప్రయాణమును విరమింపజేయుటకై విశ్వబ్రహ్మను పంపారు. అగస్త్యుడు విశ్వబ్రహ్మ ద్వారా కల్యాణ మహోత్సవ వైభవమును శ్రవణానందముగా విని, తన దివ్యదృష్టితో కనులారా గాంచి పార్వతీపరమేశ్వరులను కల్యాణ పసుపు వస్త్రములతో దర్శనమీయవలసిందిగా ప్రార్ధించెను. పార్వతీపరమేశ్వరులు అగస్త్యునికి అలాగే  దర్శనమిచ్చారు. కల్యాణపీఠముపై దివ్యమంగళ స్వరూపులుగా విరాజిల్లుచున్న పార్వతీ పరమేశ్వరులను ఏకపీఠముపై పల్వలపుర దివ్యక్షేత్రమున భక్తుల కోరికలు తీర్చుటకై లోక కల్యాణార్ధం ప్రతిష్ఠ గావించెను. అగస్త్యునిచే ఈ క్షేత్రమునకు “అగస్త్యేశ్వర క్షేత్రము” అని పేరు ఈ లింగము ప్రతిష్ఠింపబడుటచే వచ్చెను.

శ్రీ అగస్త్యేశ్వరుడు కొప్పులింగేశ్వరుడైన చరిత్ర:

 

 

 

పల్వలపురంలో అగస్త్య మహాముని వలన ప్రతిష్టింపబడిన అగస్త్యేశ్వరుని వెలనాటి వంశమునకు చెందిన ఒక విప్రుడు పరమ నిష్టాగరిష్టుడై విశేష భక్తితో పూజించుచుండెను. పౌరులు అతని వేశ్యాలోలతను సహింపజాలక రాజ్యపాలకునకు ఫిర్యాదు చేశారు. మహారాజు ఫిర్యాదులను విన్నా నిర్లక్ష్యము చేశారు. కాని నానాటికి ఫిర్యాదులు పెరుగుతుండుటంతో ఒకానొక రోజున ఆకస్మికంగా పూజారిని పరీక్షించాలని అనుకొని మహారాజు పల్వలపురమునకు వచ్చాడు.. ఆ సమయమున పూజారి వేశ్య దగ్గర ఉన్నాడు. మహారాజు రాక విని రివాజు ప్రకారము నిర్మాల్య మాలికను రాజు గారికి ప్రసాదముగా ఇవ్వటానికి ఆ సమయంలో మరి ఒక  పూలమాల లేదు కదాయని గ్రహించి, తన వేశ్య కొప్పులో అంతకుముందే వుంచిన స్వామి పూలమాలను తీసి రహస్యముగా ఆలయములోనికి తెచ్చి నిర్మాల్య మాలికగా రాజుగారికి ఇచ్చాడు.

 

 

మహారాజు ఆ నిర్మాల్య మాలికలో నిగనిగలాడుతున్న పొడవైన వెంట్రుకను చూసి శంకించి పూజారిని ప్రశ్నించగా అతను “పరమశివుడు జటాఝూటధారి” కాబట్టి పూలమాలికను అగస్త్యేశ్వరుని కేశము చుట్టుకొని ఉంటుందని బదులు పలికాడు. లింగమునకు జటాఝూటములు ఉండటమా అని రాజు ఆశ్చర్యపడి – అయినా కానీ ఈశ్వరలింగమునకు కేశములు చూపించు అన్నాడు. దానికి పూజారి నిర్మల హృదయుడై ధైర్యంగా, మహారాజా, యిది మధ్యాహ్న సమయము, స్వామివారికి అభిషేక పూజా విధులు నిర్వర్తించి మహానివేదన చేసి నాగాభరణాలు అలంకరించాను, రేపటి ఉదయం వరకు అలంకరణాదులను తొలగించరాదు. మీరు ప్రాతః కాలము వరకు ఉంటే స్వామి జటాఝూటమును చూపగలన నేను అన్నాడు.

 

 

మహారాజు దానికి అంగీకరించి జటాఝూటములు చూపింకపోతే నీకు శిరచ్ఛేదము తప్పదని చెప్పి ఆ రాత్రి పల్వలపురంలోనే విడిదిచేశాడు. దాంతో పూజారి తనకు శిరచ్ఛేదము తప్పదని తలచి అవసానకాలంబున చేసికొనినచో మోక్షం లభించునని తలచి ఆ రాత్రంతా శ్రీ స్వామి గర్భాలయములోనే ఉండి పరమశివుని పలురీతులు వేడుకొనుచూ "స్వామీ! నీ భక్త పరమాణువును నా పూర్వ జన్మ ఫలంబుచే నేనీ పాపాలు చేసి యుంటిని. నా తప్పును మన్నించి ఇప్పటి నుండి మీరు కొప్పును ధరించవలెను. మీ కొప్పును మహారాజుగారికి చూపనిచో నాకు శిరచ్ఛేదము తప్పదు. మీరు కొప్పును ధరించరేని నా శిరస్సును ఈ లింగమునకు బాదుకొని ప్రాణములు విడుస్తాను'' అని దీనముగా పలికి మూర్ఛపోయాడు.

 

 

దాంతో భక్తవల్లభుడైన నీలకంఠుడు పూజారి మొరాలకించి లింగోద్భవ కాలమున (అర్ధరాత్రి) కొప్పును ధరించాడు. స్వామి కొప్పును ధరించుట పూజారి చేసిన కృత్రిమ చర్య అని ప్రజలు ఏకకంఠముతో పలికారు. దాంతో మహారాజు “ఏది శిరోజమును పెకిలించి తీసుకొని రా” అని ఆజ్ఞాపించగా పూజారి అలాగే చేశాడు. రాజుకు శిరోజములో మొదట రక్తము కనిపించింది. వెంటనే రాజుకు నేత్ర అవరోధము కలిగింది. అప్పుడు మహారాజు పరమేశ్వరునకు అపచారము జరిగింది అని తలచి, దోషమును మన్నించి దృష్టిని ప్రసాదించమని వేనోళ్ళ పరమేశ్వరుని వేడుకొనగా అప్పుడు పరమేశ్వరుడు శాంతించి రాజుకు దృష్టిని ప్రసాదించాడు. మహారాజుకు పరమేశ్వరుడు దృష్టిని ప్రసాదించినందుకు దానికి గుర్తుగా రాజుగారు జుత్తుగపాడు గ్రామానికి చెందిన భూమిని స్వామికి కానుకగా సమర్పించు కొన్నాడు.

 

 

జుత్తుగపాడు అనే గ్రామం రావులపాలెం మండలం పొడగట్లపల్లి గ్రామానికి రెండు ఫర్లాంగుల దూరంలో వుంది. కాబట్టి అగస్త్యేశ్వరుడు తన పూజారి ప్రాణాలను కాపాడటానికి కొప్పును ధరించుడం వలన అప్పటి నుండి శ్రీ ఉమాకొప్పేశ్వర స్వామిగా నామాంతరము చెంది అప్పటి నుండి మొదలు శోభాయమానంగా విరాజిల్లు చున్నది. ఆనాటి పల్వలపురమే నేటి పలివెల గ్రామము. పలివెల (Palivela), తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామము. పలివెల రాజమండ్రికి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. మరియు అమలాపురానికి 25 కి.మీ. దూరంలో కలదు. ఈ గ్రామము లొ శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి దేవాలయం కలదు.ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం.