Read more!

పెళ్ళి చేయమని హఠం చేసిన స్వామి

 

పెళ్ళి చేయమని హఠం చేసిన స్వామి

 

 

108, తిరుపతి దివ్యదేశాలలో తమిళనాడు ఉప్పిలియప్పన్ కోవెల ఒకటి. తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సమీపంలో ఉన్న తిరునాగేశ్వరం గ్రామంలో వెలసిన ఉప్పిలియప్పన్ గురించి సాక్షాత్ బ్రహ్మదేవుడు, నారద మహర్షికి వివరించినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఆ కథ ప్రకారం, పూర్వం ఒకానొక సమయంలో తులసి శ్రీమన్నారాయణుని వేడుతూ కఠోర తపమాచరింపగా, శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. కళ్ళెదుట నిలిచిన శ్రీమన్నారాయణునితో ‘స్వామీ! మీరు లక్ష్మీదేవి వక్షస్థలంపై చోటిచ్చారు. అలాంటి భాగ్యాన్ని నాకు కూడ అనుగ్రహించగలరా అంటూ వేడుకున్న తులసిని వాత్యల్యభావంతో చూసిన స్వామి, ‘అదంత సులభమైన కార్యం కాదు తులసీ. లక్ష్మీదేవి కూడ ఎంతో కఠోర తపమాచరించిన తర్వాత ఆ స్థానాన్ని పొందగలిగింది. నీ కోరిక తీరాలంటే ఓ తరుణోపాయాన్ని చెబుతాను విను. రాబోయే కాలంలో లక్ష్మీదేవి భూలోకంలో భూమిదేవి పేరిట అవతరించనున్నది. నీవు అంతకంటే ముందు భూలోకానికి వెళ్ళి తులసిచెట్టుగా అవతరించు అప్పుడు నీచెంత ప్రత్యక్షమైన లక్ష్మిని నేను చేపడతానూ అని పలికాడు స్వామి.

 

 

ఇంకా స్వామి తులసివనంలోకి ప్రవేశించినవారికి ఖచ్చితంగా మోక్షప్రాప్తి కలుగుతుందని, మొదట తులసీమాల ధరించిన తర్వాతే లక్ష్మీదేవి  పరిణయమాడుతానని పలికాడు. అందుకే విష్ణుపూజలో నేటికి తులసిమాలకు అంతటి ప్రాముఖ్యత!! ఆ ప్రకారం తులసి తిరునాగేశ్వరం గ్రామంలో ప్రత్యక్షమవగా, ఆతర్వాత లక్షీదేవి భూమిదేవిగా, విష్ణుమూర్తి ఉప్పిలియప్పన్ గా వెలిశారని ప్రతీతి.

 

 

ఇదిలా ఉండగా, మౄకండు మహర్షి పుత్రుడు మార్కండేయ మహర్షి లక్షీదేవి తన పుత్రికగా, శ్రీమన్నారాయణుడు తన అల్లుడు కావాలన్న బలీయమైన కోరికతో తీర్థాల పర్యటన చేయడం ప్రారంభించాడు. అలా ఆ మహర్థి తిరునాగేశ్వరం అనే ప్రాంతానికి వచ్చేసరికి, ఇదే సరైన తరుణమని ఆ ప్రదేశంలో వెయ్యి సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు చేయనారంభించాడు. ఆ మహర్షి తపస్సుకు మెచ్చిన లక్షీదేవి మార్కండేయ మహర్షి ఆశ్రమంలోని తులసిచెట్టు చెంత పసిపాపలా ప్రత్యక్షమైంది. మార్కండేయ మహర్షి తన తపస్సు ఫలించినందుకు సంతోషించి, ఆ బిడ్డను భూమిదేవి పేరుతో గారాబంగా పెంచసాగాడు. పెళ్ళీడుకొచ్చిన తన ముద్దుల కూతురును చూసిన మార్కండేయ మహర్షి, “ఈ గారాలపట్టిని చేపట్టేందుకు ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడోస్తాడో కదా!’ అని దీర్ఘాలోచనలో పడిపోయాడు.

 

 

ఇదిలా ఉండగా, ఓ ఏకాదశి రోజు ‘ఖల్ ఖల్ ‘ మంటూ దగ్గుతూ ఓ ముసలివాడు తూలుకుంటూ అక్కడికి వచ్చాడు. అతను స్నానం చేసి చాలరోజులు అయినట్లుంది. నడవలేక నడవలేక అవస్థలు పడుతున్న ఆ ముదుసలి మార్కండేయ ముని ఇంటికి వచ్చాడు. ఎవరో ఓ మునీశ్వరుడు తనింటికి వచ్చాడని సంతోషపడిన మార్కండేయ ముని, ఆ ముదుసలికి స్వాగత సత్కారాలు చేసాడు. అప్పుడు  లోపలున్న భూమిదేవి ముదుసలికి మంచినీళ్ళు అందించింది. అప్పుడు చూసాడా ముదుసలి భూమిదేవిని. ఇవేవి పట్టని తండ్రీకుతుళ్ళు తమ అతిథి మర్యాదలలో మునిగిపోయారు. అప్పుడా ముసలాయన, ‘మార్కండేయ మునీ! నాకంటూ ఈ ప్రంపంచంలో ఎవరూ లేరు. భార్యాబిడ్డలూ లేరు. పుత్ర సౌభాగ్యం లేనివారు పున్నామ నరకం నుండి బయటపడలేరు కదా! అన్నీ భాగ్యాలకు భార్యే కారణమవుతుంది. అందుకే గౄహస్థాశ్రమం స్వీకరించినవారు అన్నీ బాధ్యతలను నెరవేర్చుకుని స్వర్గధామాన్ని సులభంగా పొందగలుగుతున్నారు. అందుకనే నేనొక నిర్ణయం తీసుకున్నాను. మీ అమ్మాయి భూమిదేవిని వివాహమాడాలని నిశ్చయించుకున్నాను. నాకు వయసైపోయిందని అనుకోకండి. నేను బాగానే ఉన్నాను. కాబట్టి మీ అమ్మాయిని నాకిచ్చిపెళ్ళి చేయగలరూ’ అంటూ అభ్యర్థించగానే విన్న మార్కండేయముని అవాక్కై పోయాడు.

 

 

అంతలో తెప్పరిల్లుకుని, ‘స్వామీ! ఇంత వయోవృద్దుడైన మీరు పసిబాలను మనువాడతానని అడగడం న్యాయమా? అది పాపం కాదా! వయసుడిగిన తర్వాత పెళ్ళి శోభిస్తుందా?’ అని ఆన్నాడు. వెంటనే ఆ పండు ముసలి మార్కండేయముని కాళ్ళు పట్టుకుని ‘వెంటనే నాకు భూమిదేవినిచ్చి వివాహం జరిపించకపోతే, ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటూ' నంటూ ప్రకటించాడు. మార్కండేయుడు ఎంత నచ్చచెప్ప ప్రయత్నించినప్పటికి ఆ ముదుసలి వినలేదు. అప్పుడు మార్కండేయ ముని, ‘స్వామి! మీకు బంధువు లెవరు లేరంటున్నారు. ఒకవేళ మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటే భూమిదేవే మీకు వండి పెట్టాల్సి ఉంటుంది. ఆమెకు వంటలో ఎంత ఉప్పు వేయాలన్న సంగతి కూడా తెలియదు. కాబట్తి ఈ సంబంధం వద్దూ అంటూ బ్రతిమాలినప్పటికీ ఆ ముసలి వినలేదు.

 

 

ఎటూ తోచని మార్కండేయముని కూతురు దగ్గరకు పరుగెత్తుకెళ్ళి, ‘అమ్మా! ముసలాడు నిన్ను తప్ప వేరెవర్ని పెళ్ళి చేసుకోనంటున్నాడు. ఒకవేళ ఈ పెళ్ళి జరక్కపోతే చనిపోతానంటున్నాడు. నేనేం చేసేదమ్మా! అంటూ మొరపెట్టుకున్నాడు. ఆ మాటలను విన్న భూమిదేవి లబోదిబోమంటూ ‘నావల్ల కాదు అయన్ని పెళ్ళి చేసుకొమ్మని నన్ను బలవంతపెడితే ఆత్మహత్య తప్ప నాకు వేరే మార్గం లేదూ అంటూ ఏడవసాగింది. పెళ్ళి చేయకపోతే చస్తానని ముదుసలి, పెళ్ళి చేస్తే ఛస్తానని భూమాదేవి. ఏం చేయాలో పాలుపోని మార్కండేయముని ఆ సర్వేశ్వరుని శరణు వేడాడు.

 

 

ఆశ్చర్యం!!
ఎదురుగానున్న ముసలి వ్యక్తి మాయమయ్యాడు. అక్కడ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయముని హౄదయం పులకించింది. ఇన్నేళ్ళ తన తపస్సు ఫలించింది. అప్పుడే సర్వేశ్వరుడు, ‘మునీశ్వరా మీ కోరిక ప్రకారం భూమిదేవి వివాహం నాతోనే జరుగుతుంది. అలాగే మీ అమ్మాయికి ఉప్పువేసి వంట చేయడం చేతకాదన్నారు. ఇకపై నా నైవేద్యంలో ఉప్పు లేకుండానే తీసుకుంటాను. ఈ నైవేద్యాన్ని తీసుకున్న భక్తులు వెయ్యి చాంద్రాయన వ్రత ఫలితాన్ని పొందుతారు అని అనుగ్రహించాడు.

 

 

మనం ఆలయ ప్రవేశం చేస్తూ, రాజగోపురాన్ని దాటగానే ఎడమపక్క కోనేరు ఉంది. ఆ పక్కనున్న బిల్వ వృక్షానికి భక్తురాళ్ళు కట్టుకున్న మొక్కుబళ్ళు కనిపిస్తాయి. కోనేరులో స్నానం చేసి లోపలకు వెళితే కుడిపక్కన బ్రహ్మాండమైన తులాభారం. మొక్కున్నవారు ఉప్పు తప్ప అన్నింటినీ తులాభారం ఇస్తున్నారు.
మూలవిరాట్ తూర్పువైపు ముఖంగా దర్శనమిస్తున్నాడు. మార్కండేయ ముని దక్షిణంవైపు ముఖ్యంగా కన్యాదానం చేస్తున్నాడు. గర్భగుడి బయట శ్రీదేవి సన్నిధి. ప్రాకారంలో హనుమ, ఆళ్వారులు దర్శనాలిస్తారు. తూర్పున శ్రీరాముడు, ఆలయ ప్రాకారానికి తిరుప్పావై పాశురాలు, దశావతారాలు చిత్రించబడి ఉన్నాయి. భక్తులలో నిత్యం రద్దీగా ఉండే ఉప్పిలియప్పన్ కోవెల భక్తుల పాలిట కొంగుబంగారమంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు