Read more!

శ్రీసాయిసచ్చరిత్రము నలభైయవ అధ్యాయం

 

శ్రీసాయిసచ్చరిత్రము


నలభైయవ అధ్యాయం

 

 

 

 

బాబా కథలు : 1. దేవుగారి యింటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి యిద్దరిని తోడ్కొని పోవుట. 2. హేమాడ్ పంతు ఇంటికి ఫోటో రూపములో పోవుట.
ఈ అధ్యాయంలో రెండు కథలు చెబుతాము. 1. దహనులో బి.వి. దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతానికి బాబా వెళ్ళటం 2. బాంద్రాలోని హేమాండ్ పంతు ఇంటికి హోళీ పండుగనాడు భోజనానికి వెళ్ళటం.



తొలిపలుకు :



శ్రీసాయిసమర్థుడు పావనమూర్తి. తన భక్తుల ఇహపర విషయాలలో తగిన సలహాలను యిచ్చి జీవితపరమావధిని పొందేలా చేసి వారిని సంతోషపెట్టటం. సాయి తన హస్తాన్ని భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోనికి పంపించి భేదభావాన్ని నశింపజేసి, అప్రాప్యాన్ని ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల పట్ల భేదం లేక, తమకు నమస్కరించిన వారిని ఆదరంతో అక్కున చేర్చుకునే వారు. వర్షాకాలంలో నదులు కలిసే సముద్రంలా బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకు ఇస్తారు. దీన్ని బట్టి, ఎవరయితే భగవద్భక్తుల లీలలను పాడతారో వరు భగవంతుని లీలలను పాడినవారి కంటే కాని, అంతకంటే ఎక్కువ కాని దేవుని ప్రేమకు పాత్రులు అవుతారని తెలియాలి. ఇక ఈ అధ్యాయంలో కథల వేపు మరలుదాము.


దేవుగారింట ఉద్యాపన వ్రతం :

 

 

 

 


దహనులో బి.వి.రావుగారు మామలతదారుగా ఉండేవారు. వారి తల్లి 25, 30 నోములు నోచుకుంది. వాటి ఉద్యాపన చేయవలసి ఉండింది. ఈ కార్యంలో 100, 200 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉంది. ఈ శుభకార్యక్రమానికి ముహూర్తం నిశ్చయమయ్యింది. దేవుగారు బాపూసాహెబు జోగ్ గారికి ఒక లేఖ వ్రాశారు. అందులో బాబా ఈ శుభకార్యానికి దయచేయాలనీ, వారు రాకపోతే అసంతృప్తికరంగా ఉంటుందని వ్రాశారు. జోగ్ ఆ ఉత్తరాన్ని చదివి బాబాకు వినిపించారు. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇలా అన్నారు. "నన్నే గుర్తుంచుకునే వారిని నేను మరవను. నాకు బండికాని, టాంగాగాని, రైలుగాని, విమానంగాని అవసరం లేదు. నన్ను ప్రేమతో పిలిచేవారి వద్దకు నేను పరుగెత్తివెళ్ళి ప్రత్యక్షమవుతాను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయి. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వస్తామని వ్రాయి.'' జోగ్ బాబా చెప్పింది దేవుకు వ్రాశారు. దేవుగారు ఎంతో సంతోషించారు. కాని బాబా రహతా, రుయీ, నీమగాం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి వెళ్లారని ఆయనకు తెలుసు. బాబాకు ఆశక్యం అయినది ఏమీలేదు. వారు సర్వాంతర్యామి అవటంతో హఠాత్తుగా ఏ రూపంలో అయినా వచ్చి, తమ వాగ్థానాన్ని పాలించవచ్చు అనుకున్నారు.

 

 

 

 


 ఉద్యాపనకు కొద్దిరోజులు ముందుగా, బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకరు గోసం రక్షణ కోసం సేవ చేస్తూ దహను స్టేషన్ మాస్టారు దగ్గరికి చందాలు వసూలు చేసే నెపంతో వచ్చారు. స్టేషన్ మాస్త్రారు, సన్యాసిని ఊరి లోపలికి వెళ్ళి మామలతదారుని మలుసుకుని వారి సహాయంతో చందాలు వసూలు చేయమన్నారు. అంతలో మామలతదారే అక్కడికి వచ్చారు. స్టేషను మాస్టారు సన్యాసిని దేవుగారికి పరిచయం చేశారు. ఇద్దరూ ప్లాట్ ఫారమ్ మీద కూర్చుని మాట్లాడుకున్నారు. దేవు, ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావుసాహెబు నరోత్తమ శెట్టి నడుపుతుండటంతో, ఇంకొకటి ఇప్పుడే తయారు చేయటం బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసాల తరువాత రమ్మన్నారు. ఈ మాటలు విని సన్యాసి అక్కడినుండి వెళ్ళిపోయారు. ఒక నెల తరువాత ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి యింటిముందు ఆగారు. ఛందాల కోసం వచ్చారేమో అని దేవు అనుకున్నారు. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నమై ఉండటం చూసి, తాను ఛందాల కోసం రాలేదని భోజనానికి వచ్చానని సన్యాసి చెప్పారు. అందుకు దేవు "మంచిది! చాలా మంచిది! మీకు స్వాగతం. ఈ గృహం మీదే'' అన్నారు. అప్పుడు సన్యాసి "ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారు'' అన్నాడు. దేవు "మంచిది వారితో కూడా రండి' 'అన్నారు. ఇంకా రెండుగంటల కాలపరిమితి ఉండటంతో, వారికోసం ఎక్కడికి పంపించాలి అడిగారు. సన్యాసి ఎవరినీ పంపవలసిన అవసరం లేదని తామే స్వయంగా వస్తామని చెప్పారు. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పారు. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన తరువాత వెళ్ళిపోయారు.

 

 

 

 


ఉద్యాపన పూర్తికాగానే దేవుగారు బాపూసాహెబు జోగుకి ఉత్తరం వ్రాశారు. అందులో బాబా తన మాట తప్పారని వ్రాశారు. జోగు ఉత్తరం తీసుకుని బాబా దగ్గరికి వెళ్ళారు. దాన్ని తెరవకముందే బాబా ఇలా అన్నారు. "హా! వాగ్థానం చేసి, డగా చేశానని అంటున్నాడు. ఇద్దరితో కలిసి నేను సంతర్పణకు హాజరయ్యాను. కాని నన్ను పోల్చుకోలేక పోయాడని వ్రాయి. అలాంటివాడు నన్ను ఎందుకు పిలవాలి? సన్యాసి ఛందాల కోసం వచ్చానని అనుకున్నాడు. అతని సంశయాన్ని తొలగించటం కోసమే మరి ఇద్దరితో వస్తానని అన్నాను. ముగ్గురు సరిగ్గా భోజనం వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకోవడం కోసం ప్రాణాలైనా విడుస్తాను. నా మాట్లాను నేను ఎప్పుడూ పొల్లు చేయను.'' ఈ జవాబు జోగ్ హృదయంలో ఆనందం కలగజేసింది. బాబా సమాధానం అంతా దేవుగారికి వ్రాశారు. దాన్ని చదవగానే దేవుకు ఆనందబాష్పాలు దొరిలాయి. అనవసరంగా బాబాను నిందించినందుకు పశ్చాత్తాప పడ్డారు. సన్యాసి మొదటి రాకతో తాను ఎలా మోసపోయానో, సన్యాసి చందాలకు రావడం, మరి ఇద్దరితో కలిసి భోజనానికి వస్తాననే మాటలు తాను గ్రహించలేక పోసపోవటం - మొదలైనవి అతనికి ఆశ్చర్యాన్ని కలగజేశాయి

భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడుకుంటే, వారు తమ భక్తుల ఇళ్లలో శుభకార్యాలను సవ్యంగా నెరవేరేలా చూస్తారనేది ఈ కథవల్ల స్పష్టమవుతుంది.

హేమాడ్ పంతు ఇంట హోళీ పండుగ భోజనం :

 

 

 

 


ఇక బాబా తన ఫోటో రూపంలో సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెపుతాము.
1917వ సంవత్సరం హోళీ పండుగ రోజు వేకువఝామున హేమాడ్ పంతుకి ఒక దృశ్యం కనిపించింది. చక్కని దుస్తులు ధరించిన సంయాసిలా బాబా కనిపించి, నిద్రనుండి లేపి ఆనాడు భోజనం కోసం వారి యింటికి వస్తానని చెప్పారు.  ఇలా తనను నిద్రనుంచి లేపింది కూడా కలలో భాగమే. నిజంగా లేచి చూసేసరికి సన్యాసి కాని, బాబా కాని కనిపించలేదు. స్వప్నాన్ని బాగా గుర్తు తెచ్చుకోగా, సన్యాసి చెప్పిన ప్రతిమాట జ్ఞాపకం వచ్చింది. బాబాగారి సహవాసం ఏడు సంవత్సరాలనుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానం ఎల్లప్పుడు చేస్తున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేస్తారని అనుకోలేదు. బాబా మాటలకు అమితంగా సంతోషించి తన భ్యార్య దగ్గరికి వెళ్ళి ఒక సన్యాసి భోజనానికి వస్తారు కాబట్టి, కొంచెం బియ్యం ఎక్కువ వెయ్యాలని చెప్పారు. అది హోళీ పండుగరోజు. వచ్చేవారు ఎవరని ఎక్కడ్నుంచి వస్తున్నారని ఆమె అడిగింది. ఆమెని అనవసరంగా పెడదారి పట్టించకుండా ఆమె యింకొక విధంగా భావించకుండా ఉండేట్లు, జరిగింది జరిగినట్టుగా చెప్పాలని అనుకుని, తాను కన్న స్వప్నం గురించి తెలియజేశారు. షిరిడీలో మంచి మంచి పిండివంటలు విడిచి బాబా తనవంటి వారి యింటికి బాంద్రాకి వస్తారా అని, ఆమెకు సంశయం కలిగింది. అందుకు హేమాడ్ పంతు బాబా స్వయంగా రాకపోవచ్చు, కాని ఎవరినైనా పంపవచ్చు కాబట్టి కొంచెం బియ్యం ఎక్కువ పోసినట్లయితే నష్టం లేదన్నారు.

 

 

 

 


మధ్యాహ్న భోజనం కోసం ప్రయత్నాలన్నీ చేశారు. మిట్టమధ్యాహ్నానికి సర్వం సిద్ధమయ్యాయి. హోళీ పూజ ముగిసింది. విస్తళ్ళు వేశారు, ముగ్గులు పెట్టారు, భోజనానికి రెండు పంక్తులు తీర్చారు. రెండింటి మధ్య ఒక పీట బాబా కోసం అమర్చారు. గృహంలోని వారందరూ కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుళ్ళు మొదలైనవారు అందరు వచ్చి వారి వారి స్థలాలను అలంకరించారు. వండిన పదార్థాలు వడ్డించారు. అందరు అతిథి కోసం కనిపెట్టుకుని ఉన్నారు. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గొళ్ళెం పెట్టారు. అన్నశుద్ధి అయ్యింది, అంటే నెయ్యి వడ్డించారు. భోజనం ప్రారంభించడానికి ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రుడికి శ్రీ కృష్ణుడికి నైవేద్యం సమర్పించారు. అందరు భోజనం ప్రారంభించబోతుండగా, మేడమెట్లపై చప్పుడు వినిపించింది. హేమాడ్ పంతు వెంటనే వెళ్ళి తలుపు తీయగా ఇద్దరు మనుష్యులు అక్కడ ఉన్నారు. ఒకరు ఆలీమహమ్మద్ వేరొకరు మౌలానా ఇస్ముముజావర్. ఆ యిద్దరు వడ్డన అంతా పూర్తై అందరు భోజనం చేయడానికి సిద్ధంగా ఉండటం గమనించి హేమాడ్ పంతును క్షమించమని కోరి ఇలా చెప్పారు. "భోజన స్థలం విడిచిపెట్టి మా దగ్గరకి పరుగెత్తుకొని వచ్చారు. తక్కినవారు నీకోసం చూస్తున్నారు. కాబట్టి, ఇదిగో నీ వస్తువును నేవు తీసుకో. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతం అంతా తెలుపుతాము.'' అలా అంటూ తమ చంకలోనుండి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటాన్ని విప్పి టేబుల్ పైన పెట్టారు.

 

 

 

 


హేమాడ్ పంతు కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దదైన చక్కని సాయిబాబా పటం ఉంది. అతడు అత్యంత ఆశ్చర్యపడ్డాడు. అతని మనస్సు కరిగింది. కళ్ళనుండి నీరు కారింది. శరీరం గగుర్పాటు చెందింది. అతడు వంగి పటంలో ఉన్న బాబా పాదాలకు నమస్కరించారు. బాబా ఈ విధంగా తన లీలతో ఆశీర్వదించారని అనుకున్నారు. గొప్ప ఆసక్తితో నీకా పటం ఎలా వచ్చిందని ఆలీమహమ్మద్ ని అడిగారు. అతడు ఆ పటం ఒక అంగడిలో కొన్నానని, డానికి సంబంధించిన వివరాలను అన్నీ తరువాత తెలియజేస్తానన్నాడు. తక్కినవారు భోజనం కోసం కనిపెట్టుకుని ఉండడంతో త్వరగా రమ్మని అన్నారు. హేమాడ్ పంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోకి వెళ్ళారు. ఆ పటం బాబా కోసం వేసిన పీటపై పెట్టి వండిన పదార్థాలన్నీ వడ్డించి, నైవేద్యం పెట్టిన తరువాత అందరు భోజనం చేసి సకాలంలో పూర్తి చేశారు. పటంలో ఉన్న బాబా యొక్క చక్కని రూపుని చూసి అందరు అమితానందభరితులయ్యారు. ఇదంతా ఎలా జరిగిందని ఆశ్చర్యపోయారు.
ఈ విధంగా బాబా హేమాడ్ పంతుకి స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్థానాన్ని పాలించుకున్నారు. ఆ ఫోటో వివరాలు అనగా అది ఆలీమహమ్మదుకి ఎలా దొరికింది? అతడు ఎందుకు తెచ్చాడు. దాన్ని హేమాడ్ పంతుకి ఎందుకిచ్చాడు? అనేవి వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాము.

నలభయవ అధ్యాయం సంపూర్ణం