Read more!

శ్రీసాయిసచ్చరిత్రము పదిహేనవ అధ్యాయము

 

శ్రీసాయిసచ్చరిత్రము


పదిహేనవ అధ్యాయము

 

 

ఆరవ అధ్యాయంలో షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవం ఎలా ప్రారంభమయ్యిందో? ఆ సమయంలో హరిదాసును తీసుకురావటం ఎంత కషంగా ఉండేదో? చివరికి ఆ పనిని దాసగణు మహారాజు నిర్వహించేలా బాబా శాశ్వతంగా నియమించటం, దాన్ని ఇప్పటివరకు దాసగణు జయప్రదంగా నడపడం అనేవి చదివేవారు జ్ఞాపకం ఉంచుకునే వుంటారు. ఈ అధ్యాయంలో దాసగణు హరికథలు ఎలా చెప్పేవారో వర్ణిస్తాను.
నారదీయకీర్తన పధ్ధతి :

 

 


సాధారణంగా మహారాష్ట్రలో హరికథ చెప్పేటప్పుడు ఆడంబరమైన నిండు అంగరఖాలు వేసుకుంటారు. తలపైన పాగా గాని, పేటా (ఒక విధమైన ఎఱ్ఱని మహారాష్ట్రపు టోపీ)కాని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించే ధోవతిని కట్టుకుంటారు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి, షిరిడీలో హరికథ చెప్పడానికి దాసగణు తయారయ్యారు. బాబా సెలవు పొందటానికి మసీదుకు వెళ్ళాడు. బాబా అతనితో, "ఏమోయ్, పెండ్లికొడకా! యింత చక్కగా ముస్తాబై ఎక్కడికి వెళ్తున్నావు?'' అన్నారు. హరికథ చెప్పటానికి వెళ్తున్నాను అని దాసగణు జవాబిచ్చారు.

 

 

అప్పుడు బాబా ఇలా అన్నారు "దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలైనవి ముందు వెంటనే తీసి పారేయి. శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు?'' వెంటనే దాసగణు వాటినన్నిటినీ తీసి బాబా పాదాల వద్ద ఉంచాడు. అప్పటినుంచి హరికథ చెప్పేటప్పుడు వాటిని దాసగణు ఎప్పుడూ ధరించలేదు. నడుము మొదలు తలవరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలభించే పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షే హరికథలు ప్రారంభించినవారు. వారు తలపైన, శరీరముపైన ఏమీ తొడిగేవారు కాదు. చేతిలో వీణను ధరించి ఒక చోటునుంచి మరొక చోటికి హరినామ సంకీర్తన చేస్తూ వెళ్ళేవారు.
చోల్కరు చక్కరలేని తేనీరు :

 

 


పూనా ఆహ్మదునగరు జిల్లాలో బాబాను గురించి అందరికీ తెలుసుగాని, నానాసాహెబు చాందోర్కరు ఉపన్యాసాల వల్ల, దాసగణు హరికథలవల్ల బాబా పేరు కొంకణదేశమంతా ప్రాకింది. నిజంగా దాసగణు తన చక్కని హరికథలవల్ల బాబాను అనేకమందికి పరిచయం చేశారు. హరికథలు వినటానికి వచ్చినవారికి అనేక రుచులు ఉంటాయి. కొందరు హరిదాసు పాండిత్యానికి సంతోషిస్తారు; కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొదరికి హాస్యము, చమత్కారం, సంతోషము కలుగజేస్తుంది. కథాపూర్వంలో దాసుగారు సంభాషించే వేదాంత విషయాలు వినటానికి కొందరు; అసలు కథను వినడానికి కొందరు వస్తారు. వచ్చినవారిలో చాలా కొద్దిమందికి మాత్రమే భగవంతునిలో గాని, యోగులలో గాని, ప్రేమ విశ్వాసాలు కలుగుతాయి. కాని దాసగణుయొక్క హరికథలు వినేవారి మనస్సులపై కలిగే ప్రభావం అతి సమ్మోహనకరంగా ఉంటుంది. ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తాను.

 

 


ఠాణాలో ఉన్న కౌపీనేశ్వర ఆలయమ్లో ఒకనాడు దాసగణు మహారాజ్ హరికథ చెపుతూ సాయి మహిమను పాడుతున్నాడు. కథను వినటానికి వచ్చిన వారిలో చోల్కర్ అనే అతను ఉన్నాడు. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతడు దాసగణు కీర్తన అత్యంత శ్రద్ధగా విన్నాడు. వాడి మనస్సు కరిగింది. వెంటనే అక్కడకక్కడే మనస్సులో బాబాను ధ్యానించి ఇలా మొక్కుకున్నాడు "బాబా! నేను పేదవాడిని, నా కుటుంబాన్నే నేను పోషించుకోలేను. మీ అనుగ్రహంతో సర్కారువారి పరీక్షలో ఉత్తీర్ణుడని స్థిరమైన ఉద్యోగం లభిస్తే నేను షిరిడీకి వస్తాను. నీ పాదాలకు సాష్టాంగనమస్కారం చేస్తాను. నీ పేరున కలకండ పంచిపెడతాను'' బాబా కృపతో చోల్కరు పరీక్షలో పాసయ్యాడు. స్థిరమైన ఉద్యోగం దొరికింది. కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీరిస్తే అంత బాగుంటుంది అనుకున్నాడు. చోల్కరు బీదవాడు. వాడి కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడీయాత్ర చేయడానికి ఖర్చు పెట్టలేక పోయాడు. ఎవరైనా పర్వత శిఖరాన్నైనా దాటవచ్చు గాని, బీదవాడు తన యింటి గడపనే దాటలేదని కదా లోకోక్తి!

 

 

చోల్కరుకి ఎలాగైనా శ్రీసాయి మొక్కును త్వరలో చెల్లించాలని ఆతృత కలిగింది. కాబట్టి తన సంసారానికయ్యే ఖర్చులను తగ్గించి కొంత పైకాన్ని మిగుల్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. తేనీటిలో వేసే చెక్కరని మాని ఆ మిగిలిన ద్రవ్యాన్ని దాచటం ప్రారంభించాడు. ఈ విధంగా కొంత ద్రవ్యాన్ని మిగుల్చుకున్న తరువాత, షిరిడీకి వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. ఒక టెంకాయ బాబాకు సమర్పించుకున్నాడు. తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టాడు. తన మనసులోని కోరికలన్నీ ఆనాడు నెరవేరాయని తనకు ఎంతో తృప్తిగా ఉన్నదని బాబాతో చెప్పాడు. చోల్కరు బాపూసాహెబు జోగు గృహంలో దిగాడు. అప్పుడు వీరిద్దరూ మసీదులో వున్నారు. ఇంటికి వెళ్ళటం కోసం వారు లేచి నిలబడగా బాబా జోగును పిలిచి ఇలా అన్నారు "నీ అతిథికి టీ కప్పులో విరివిగా చక్కెర వేసి యివ్వు'' ఈ పలుకులలోని భావాన్ని గ్రహించినవాడి, చోల్కరు మనస్సు కరిగింది.

 

 

అతడు ఆశ్చర్య నిమగ్నుడయ్యాడు. వాడి కళ్ళు బాష్పాలతో నిండాయి. తిరిగి బాబా పాదాలపై పడ్డాడు. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలపటం అనేదాని భావం ఏమై ఉంటుందా అని ఆలోచించాడు. బాబా తన పలుకులతో చోల్కరు మనస్సులో భక్తి, నమ్మకాలను కలుగచేయాలని ఉద్దేశించారు. వాడి మొక్కు ప్రకారం తనకు రావలసిన కండచక్కెర ముట్టిందనీ, తేయాకు నీళ్ళలో చక్కెరను ఉపయోగించకుండా పోవడం అనే రహస్య మనోనిశ్చయాన్ని చక్కగా కనుకోన్నారని చెప్పాడు. బాబా యిలా ఉద్దేశించారు "నా ముందర భక్తితో మీ చేతులు చాపితే వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుంటాను. నా దేహం యిక్కడ ఉన్నప్పటికీ సప్తసముద్రాల అవతల మీరు చేస్తున్న పనులు నాకు తెలిసు. ప్రపంచంలో మీకు యిష్టమొచ్చిన చోటుకు వెళ్ళండి. నేను మీ చెంతనే ఉంటాను. నా నివాస స్థలము మీ హృదయంలోనే ఉంది. నేను మీ శరీరంలోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయంలో సర్వజన హృదయాలలో ఉన్న నన్ను పూజించండి. ఎవ్వరూ నన్ను ఈ విధంగా గుర్తిస్తారో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు''
బాబా చోల్కరుకి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించారో కదా!
రెండు బల్లులు :

 

 


ఈ అధ్యాయంలో రెండు చిన్న బల్లుల కథతో ముగిస్తాను. ఒకరోజు బాబా మసీదులో కూర్చుని ఉన్నారు. ఒక భక్తుడు బాబా మందిరంలో కూర్చుని ఉన్నాడు. ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికింది. కుతూహలంతో ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమిటని బాబాని అడిగాడు. అది శుభశకునమా, లేక ఆశుభమా అని ప్రశ్నించాడు. తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూడటానికి వస్తుందని ఆ బల్లి ఆనందిస్తూ వుందని బాబా చెప్పారు. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనకుండా కూర్చున్నాడు. బాబా పలికినదాన్ని అతడు గ్రహించలేకపోయాడు. కొంతసేపైన తరువాత ఔరంగాబాదునుండి ఎవరో గుఱ్ఱముపై బాబా దర్శనానికై షిరిడీ వచ్చారు. అతను ఇంకా కొంత దూరం పోవలసి వుంది. కాని వాడి గుఱ్ఱం ఆకలితో ముందుకు వెళ్ళలేకపోయింది. గుఱ్ఱానికి ఉలవలు కావాల్సివచ్చింది.

 

 

తన భుజంపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకొని రావడానికి వెళ్తున్నప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించాడు. అందులోనుండి ఒక బల్లి కిందపడి అందరూ చూస్తుండగా గోడ ఎక్కింది. ప్రశ్నించిన భక్తుడిని అదంతా జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పారు. వెంటనే ఆ బల్లి తన సోదరి దగ్గరికి సంతోషంతో వెళ్ళింది. చాలాకాలం తరువాత అక్కాచెల్లెళ్ళు కలుసుకున్నారు. ఒకరినొకరు కౌగలించుకుని ముద్దాడుకున్నారు. గుండ్రంగా తిరుగుతూ అధిక ప్రేమతో ఆడారు. షిరిడీ ఎక్కడ? ఔరంగాబాదు ఎక్కడ? గుఱ్ఱపు రౌతు ఔరంగాబాదునుంచి బల్లిని తీసుకుని షిరిడీకి ఎలా వచ్చాడు? రాబోయే యిద్దరు అక్కాచెల్లెళ్ళు కలుసుకుంటారని బాబా ముందుగానే ఎలా చెప్పగలిగారు? ఇది అంతా బహుచిత్రంగా ఉన్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపిస్తున్నది.
ఉత్తర లేఖనము :
ఎవరయితే ఈ అధ్యాయాన్ని భక్తిశ్రద్ధలతో నిత్యం పారాయణ చేస్తారు వారి కష్టాలన్నీ శ్రీసాయినాథుని కృపతో తొలగిపోతాయి.

పదిహేనవ అధ్యాయము సంపూర్ణం

రెండవరోజు పారాయణ సమాప్తం