వెలిగొండ పేరుతో జగన్ పంగనామాలు... సీఎం చంద్రబాబు ధ్వజం
Publish Date:Feb 25, 2026
Advertisement
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యంగా వదిలేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెలిగొండ పనులు పూర్తి అయ్యాయని జగన్ దొంగ మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు. పనులు పూర్తికాకుండానే జగన్ రిబ్బన్ కటింగ్ చేశారని సెటైర్లు గుప్పించారు. ఇక్కడి రైతులు సాగునీరు లేకుండా అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పుకొచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు వల్ల మార్కాపురం జిల్లాకు అనేక లాభాలు ఉన్నాయని వివరించారు. ఇవాళ(బుధవారం) మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల ఏపీకి పూర్వ వైభవం వస్తుందని వ్యాఖ్యానించారు. పోలవరం జిల్లా ఇస్తానని చెప్పానని.. మాట నిలబెట్టుకున్నానని, అలాగే మార్కాపురం, మదనపల్లె జిల్లాలు ఇచ్చామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే అందరూ సహకరించాలని కోరారు. ఏపీకి మేలు చేసేందుకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తాను కలిశామని ప్రస్తావించారు. అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు కూటమిదే హవానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు, మార్కాపురం జిల్లాలో నూరుశాతం స్ట్రైక్రేట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/veligonda-project-36-214672.html





