Top Stories

political-news-img

డబుల్, డూప్లికేట్ ఓట్లు తొలగించండి..ఈసీకి బీఆర్ఎస్ విజ్ఞప్తి..!

తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రం సమర్పిం చింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమై తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న అవకతవకలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల విశ్వసనీయత ఓటరు జాబితా స్వచ్ఛతపై ఆధారపడి ఉంటుందని, అందువల్ల డబుల్, డూప్లికేట్ ఓట్లను వెంటనే గుర్తించి తొలగించే చర్యలు చేపట్టాలని కోరారు. ఓటరు గుర్తింపు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఒకే వ్యక్తి పేరుతో వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన ఓట్లను సులభం గా గుర్తించి తొలగించవచ్చని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి వివరించారు. ఈ విధానం అమలులోకి వస్తే నకిలీ, డూప్లికేట్ ఓట్ల సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం లభించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పలు సూచనలు చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించడంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో అనర్హులు, డూప్లికేట్ నమోదులను తప్పకుండా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టాలని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కోరింది. తాము సమర్పిం చిన వినతిపత్రంలోని అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణ యాలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది.

Publish Date: Jul 10, 2026 6:53PM

political-news-img

గాల్లోనే పగిలిన విమానం విండో.. ప్రయాణికుడు సగం బయటకి..!

గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తి తీవ్ర కలకలం రేపింది. ప్రయాణంలో ఉండగానే విమానం కిటికీ ఒక్కసారిగా బద్దలుకావడంతో ఓ ప్రయాణికుడు దాదాపు విమానం వెలుపలికి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఈ భయానక ఉదంతం ప్రయాణికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మరో కొన్ని నిమిషాల్లో జర్మనీ చేరుకోవాల్సిన ఈ విమానం గ్రీస్‌లోని థెసలనికి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ 'ర్యాన్‌ఎయిర్‌'కు చెందిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా వచ్చిన భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాని ఇంజిన్‌లో ఒక్కసారిగా సాంకేతిక లోపం ఏర్పడింది. ఇంజిన్‌కు సంబంధించిన ఒక లోహపు భాగం ఊడిపోయి వేగంగా వచ్చి విమానం కిటికీని బలంగా తాకింది. దాంతో ఆ కిటికీ గ్లాస్ ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది. కిటికీ పగలడంతో విమానం లోపల క్యాబిన్ ప్రెజర్ (గాలి పీడనం) ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్‌లు కిందకు పడ్డాయి. అదే సమయంలో కిటికీ పక్కనే కూర్చున్న 61 ఏళ్ల వృద్ధుడిని బయట ఉన్న గాలి వేగం తీవ్రంగా లాగేసింది. దాంతో అతడి శరీర పైభాగం విమానం కిటికీ దాటి బయటకు వెళ్ళిపోయింది. ఆ సమయంలో పక్కనే ఉన్న అతడి భార్య, సహ ప్రయాణికులు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి ఆ వృద్ధుడిని గట్టిగా పట్టుకుని లోపలికి లాగారు. దీంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే ఈ పెనుగులాటలో ఆ వృద్ధుడి తల, భుజాల భాగానికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో పైలట్లు చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని తక్షణమే గ్రీస్ వైపు మళ్లించారు. విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరి సురక్షితంగా దించేశారు. రన్‌వేపై సిద్ధంగా ఉన్న వైద్య సిబ్బంది గాయపడిన ప్రయాణికుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. విమానం లోపల బాంబు పేలినట్లు శబ్దం వచ్చిందని, వెనక్కి తిరిగి చూసేసరికి తోటి ప్రయాణికుడు కిటికీలో సగం ఇరుక్కుపోయి కనిపించాడని తోటి ప్రయాణికులు భయాందోళనలతో వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంపై విమానయాన రంగ నిపుణులు మరియు ప్రయాణికుల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటనపై ర్యాన్‌ఎయిర్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేస్తూ ఘటనను ధ్రువీకరించింది. ప్రయాణికుల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంటూ.. విమాన ఇంజిన్ భాగం ఎలా ఊడిపోయిందనే అంశంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు సంస్థ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

Publish Date: Jul 10, 2026 6:08PM

political-news-img

క్రిప్టో ట్రాప్.. కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసులో పాక్ ఉప ప్రధాని మనవడు.!

పాకిస్థాన్ సాంస్కృతిక రాజధాని లాహోర్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన, అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన ఒక భారీ నేర ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ దేశ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మనవడు మహమ్మద్ రజా దార్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఒక గ్యాంగ్ రేప్, కిడ్నాప్, క్రిప్టో కరెన్సీ దోపిడీ ఉదంతం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ పరువును బజారున పడేసింది. ఇద్దరు విదేశీ మహిళలను నమ్మించి, వ్యాపారం నెపంతో రప్పించి, వారిపై అఘాయిత్యానికి ఒడిగట్టడమే కాకుండా లక్షలాది డాలర్ల డిజిటల్ కరెన్సీని గుంజడానికి సాగించిన ఈ క్రూరమైన ప్లాన్ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కేవలం ఒక సాధారణ నేరంగా కాకుండా, రాజకీయ అండదండలు, అంతర్జాతీయ క్రిప్టో నెట్‌వర్క్, భద్రతా లోపాలు, వ్యవస్థాగత వైఫల్యాల సమ్మేళనంగా ఈ కేసు నిలుస్తుంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీలో అత్యంత కీలక నేత, నవాజ్ షరీఫ్ కుటుంబానికి నమ్మకస్తుడు, ఆర్థిక వ్యూహకర్తగా ఉన్న ఇషాక్ దార్ కుటుంబం చుట్టూ ఈ వివాదం ముసురుకోవడం అక్కడి పవర్ కారిడార్లలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీల హవా నడుస్తోంది. అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడికి చెందిన క్రిప్టో వెంచర్లు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న తరుణంలో.. పాకిస్తాన్ వంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలలో ఇలాంటి క్రిప్టో కరెన్సీ లావాదేవీలు క్రమబద్ధీకరణ లేకపోవడంతో నేరగాళ్లకు అడ్డాగా మారుతున్నాయి. బలహీనమైన చట్టాలు, రాజకీయ పరపతి ఉన్న కుటుంబాల మితిమీరిన స్వేచ్ఛ కలగలిసి చివరకు విదేశీ ఇన్వెస్టర్లపై దాడులు, లైంగిక హింసకు దారితీసే పరిస్థితులను సృష్టించాయి. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్, లభ్యమైన వివరాల ప్రకారం.. ఈ ఘోరానికి సంబంధించిన ఆరంభం.. 2025 అక్టోబర్‌లో సింగపూర్‌లో జరిగింది. నెదర్లాండ్స్‌కు చెందిన స్టెఫనీ అడ్రియానా మౌ-అరున్, వెనిజువెలాకు చెందిన ఆస్ట్రిడ్ రాబిన్సన్ బ్రాచో అనే ఇద్దరు మహిళలతో ఉప ప్రధాని మనవడు మహమ్మద్ రజా దార్‌కకు క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల నేపథ్యంలో పరిచయం ఏర్పడింది. తొలుత దాదాపు 60 వేల డాలర్లతో మొదలైన వీరి వ్యాపార భాగస్వామ్యం, కాలక్రమేణా ఐదు లక్షల డాలర్ల పెట్టుబడి స్థాయికి చేరింది. తానొక పెద్ద వ్యాపారవేత్తనని నమ్మించిన రజాదార్, సదరు మహిళలను పాకిస్థాన్‌కు బిజినెస్ విజిట్ నిమిత్తం రావాలని ఆహ్వానించి.. స్వయంగా వీసాలు ఏర్పాటు చేశాడు. తీరా వారు 2026 జూన్ 29న లాహోర్ విమానాశ్రయం చేరుకోగానే అసలు కథ మొదలైంది. వారిని డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ (డీహహెచ్ఏ) పరిధిలోని ఒక నివాసానికి తీసుకెళ్లి, అక్కడి నుంచి నిర్బంధించి మరొక నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. చేతులు కట్టేసి, తుపాకులతో బెదిరిస్తూ వారి క్రిప్టో కరెన్సీ వాలెట్లు, కంప్యూటర్లు, డిజిటల్ పాస్‌వర్డ్‌లను అప్పగించాలని హింసించారు. దాదాపు 2 మిలియన్ డాలర్ల నుంచి డిమాండ్ మొదలుపెట్టి, 1.5 మిలియన్ డాలర్ల వరకు డిజిటల్ సొమ్మును లాక్కోవడానికి ప్రయత్నించారు. చివరకు 19 వేల డాలర్ల విలువైన క్రిప్టో బదిలీలతో పాటు ఒకరి విడుదల కోసం 1 లక్ష డాలర్ల దాకా బేరసారాలు సాగాయి. అయితే బాధితుల్లో ఒకరు చాకచక్యంగా తమ కుటుంబ సభ్యులకు పంపిన వాయిస్ మెసేజ్‌లో ముందే అనుకున్న ‘CARLITOS’ అనే రహస్య కోడ్ వర్డ్‌ను ఉపయోగించడంతో ఐరోపాలోని వారి బంధువులు ప్రమాదాన్ని పసిగట్టారు. స్పెయిన్ నుంచి లాహోర్ రెస్క్యూ హెల్ప్‌లైన్‌కు, డచ్ రాయబార కార్యాలయానికి సమాచారం చేరడంతో పాక్ అధికారులు రంగంలోకి దిగక తప్పలేదు. ఈ కేసుకు సంబంధించి లాహోర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. మహమ్మద్ రజా దార్ సహా దాదాపు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అపహరణ, సామూహిక అత్యాచారం, బలవంతపు వసూళ్లు, క్రిమినల్ కుట్ర వంటి సెక్షన్లను వీరిపై ప్రయోగించారు. అయినప్పటికీ.. ఈ కేసులో బాస్ అని పిలవబడుతున్న ఐదో ప్రధాన సూత్రధారి వివరాలను పోలీసులు ఇంకా గోప్యంగా ఉంచడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇంకా విచిత్రంగా.. ఈ దారుణంపై ధైర్యంగా కేసు నమోదు చేసిన సదరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్ హెచ్ఓ) పైనే తిరుగు కేసు నమోదు కావడం, పాకిస్తాన్‌లోని న్యాయవ్యవస్థపై రాజకీయ, సైనిక శక్తుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది. రాజకీయంగా ఈ వ్యవహారం పాకిస్తాన్ పాలకులను తీవ్ర ఇరకాటంలో పడేసింది. ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లతో కలిసి విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అంతర్జాతీయ దౌత్య పర్యటనల్లో బిజీగా ఉన్న సమయంలోనే ఇషాక్ దార్ సొంత మనవడు ఇలాంటి నీచమైన కేసులో పట్టుబడటం దేశ ప్రతిష్టను మంటగలిపింది. సైనిక ప్రాబల్యం ఎక్కువగా ఉండే పాకిస్తాన్‌లో సామాన్య ప్రజలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇటువంటి ఉన్నత స్థాయి రాజకీయ కుటుంబాలకు లభించే అపారమైన రక్షణ వల్లే విదేశీ మహిళలకు సైతం రక్షణ కరువైందని నెటిజన్లు మండిపడుతున్నారు. ఎకనామిక్ టైమ్స్, హిందుస్తాన్ టైమ్స్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ ఉదంతాన్ని ప్రముఖంగా కవర్ చేయడంతో పాక్ పాలకుల జవాబుదారీతనంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ మొత్తం ఉదంతాన్ని పరిశీలిస్తే.. ఇది కేవలం లైంగిక దాడి కేసు మాత్రమే కాక, పాకిస్తాన్ చరిత్రలోనే అత్యంత పెద్ద క్రిప్టో కరెన్సీ స్కామ్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పక్కా వ్యూహం ప్రకారం విదేశీయులను ట్రాప్ చేయడం, డిజిటల్ అసెట్స్, వాలెట్ ఐడీలను ఆయుధాల ద్వారా దోచుకోవడం వంటి అంశాలు క్రిప్టో ఆధారిత నేరాల తీవ్రతను సూచిస్తున్నాయి. దేశంలో సరైన నియంత్రణ సంస్థలు లేకపోవడం, కేవైసీ నిబంధనల ఉల్లంఘనలు ఇలాంటి హైటెక్ మోసాలకు కారణమవుతున్నాయి. అంతర్జాతీయంగా గ్లోబల్ క్రిప్టో రాజకీయాలు మారుతున్న వేళ.. అమెరికా వంటి అగ్రరాజ్యాల అగ్రనేతల కుటుంబాలు క్రిప్టో రంగంలో బిలియన్ల కొద్దీ ఆదాయాన్ని అధికారికంగా వెల్లడిస్తున్న తరుణంలో.. పాకిస్తాన్‌ లాంటి దేశాలలో అదే క్రిప్టోను ఆధారం చేసుకుని సామూహిక అత్యాచారాలు, కిడ్నాప్‌లు జరగడం గమనార్హం. ఇది ప్రపంచ ఫైనాన్షియల్ గవర్నెన్స్‌లోని లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ దారుణ ఉదంతం భవిష్యత్తులో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా విదేశీ పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. పర్యాటకం, టెక్నాలజీ, స్టార్టప్ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపార పర్యటనలకు రావాలనుకునే విదేశీ మహిళలు, పెట్టుబడిదారులు ఇప్పుడు పాకిస్తాన్ రావడానికి వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చట్టబద్ధమైన పాలన లేని చోట తమ ప్రాణాలకు, ఆస్తులకు భద్రత ఉండదని వారు వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ.. ఈ కేసులో బాధితులకు పూర్తి న్యాయం జరుగుతుందా లేదా రాజకీయ బలంతో నిందితులు తప్పించుకుంటారా అనేది భవిష్యత్ కోర్టు విచారణలే తేల్చాల్సి ఉంది. భద్రత, నైతికత లేని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎంతటి ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి లాహోర్ ఘటనే ఒక పెద్ద హెచ్చరిక. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. Pakistan Crypto Scam, Ishaq Dar Grandson Raza Dar, Lahore Gangrape Case, Crypto Currency Kidnap Case

Publish Date: Jul 10, 2026 5:46PM

political-news-img

పేదల ఇళ్లకే బుల్డోజర్లా?..ఒవైసీ కాలేజీపై మౌనం ఎందుకు? : బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ హైడ్రా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయం అనే విధానం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఒవైసీకి చెందిన కాలేజీపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కాలేజీ చెరువు భూమిలో లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నిజంగా ఎలాంటి ఆక్రమణలు లేకపోతే ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని, ఒకవేళ ఆక్రమణలు జరిగి ఉంటే చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్ల పైనే బుల్డోజర్లు నడుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంటే, ప్రభావశీలులకు చెందిన నిర్మాణాల విషయం లో మాత్రం ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు. "చట్టం అనేది వ్యక్తులను బట్టి మారకూడదు. పేదవాడైనా, పెద్దవాడైనా, అధికార పార్టీ నేతైనా, ప్రతిపక్ష నాయకు డైనా ఒకే నిబంధనలు వర్తించాలి. అదే రాజ్యాంగ స్ఫూర్తి" అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఆక్రమణలు జరిగినా రాజకీయాలు, మతం, వ్యక్తులను పక్కనపెట్టి సమానంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రా చర్యలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి దుమారం రేపుతున్నాయి.

Publish Date: Jul 10, 2026 5:29PM

political-news-img

గుజరాత్‌లో జైష్ ఎ-మహమ్మద్ విస్తరణ వ్యూహం భగ్నం.. ఏటీఎస్ ఆపరేషన్ వెనుక ఉన్న సంచలన నిజాలు.!

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ (జేఈఎమ్) ఇండియాలో మళ్లీ తన కోరలు చాచడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా పశ్చిమ భారత దేశంలోని కీలక రాష్ట్రమైన గుజరాత్‌లో నిశ్శబ్దంగా ఒక భారీ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు ఆ సంస్థ వేసిన ఒక రహస్య ప్రణాళికను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సమర్థవంతంగా భగ్నం చేసింది. కేవలం ఒక ఉగ్రవాద ముఠాను పట్టుకోవడమే కాకుండా.. దేశ అంతర్గత భద్రతా వ్యవస్థలకు ఎదురవుతున్న సరికొత్త సవాళ్లను ఈ ఆపరేషన్ బహిర్గతం చేసింది. బనస్కాంత, పటాన్, నవసారి, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ వంటి వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఎనిమిది మంది ఉగ్రవాదులను ఏటీఎస్ అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పట్టుబడిన వారిలో కొందరు స్థానిక విద్యాసంస్థలు, మతపరమైన కేంద్రాలతో సంబంధాలు కలిగి ఉండటం, అంతర్జాలం ద్వారా యువతను తప్పుదోవ పట్టించే వ్యూహాలు అమలు చేయడం వంటి వాస్వాలు ఈ దర్యాప్తులో వెలుగుచూశాయి. సరిహద్దుల అవతల నుంచే కాకుండా.. దేశం లోపల స్థానికంగా స్లీపర్ సెల్స్, లాజిస్టికల్ సపోర్ట్ గ్రూపులను తయారు చేయడం ద్వారా జైష్ సంస్థ కొత్త కొత్త పద్ధతుల్లో విస్తరించాలని చూస్తోందని స్పష్టమవుతోంది. భారతదేశ చరిత్రలో జైష్-ఎ-మహమ్మద్ అత్యంత కిరాతకమైన దాడులకు పాల్పడిన రికార్డు ఉంది. గతంలో దేశ రాజధానిలో పార్లమెంట్‌పై జరిగిన దాడితో పాటు, జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో సిఆర్‌పిఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడి వెనుక ఈ సంస్థే కీలక పాత్ర పోషించింది. ఆ సంస్థ అధినేత మసూద్ అజార్ రాసిన తీవ్రవాద గ్రంథాలు, ఆడియో, వీడియో సందేశాల ద్వారా యువత ఆలోచనా విధానాన్ని కలుషితం చేయడం జైష్ అనుసరిస్తున్న పాత పద్ధతి. అయితే.. గత రెండు దశాబ్దాలుగా గుజరాత్ రాష్ట్రం భద్రతా పరంగా ఎంతో సున్నితమైన ప్రాంతంగా ఉంటూ వస్తోంది. ఇక్కడి కమ్యూనల్ వాతావరణాన్ని దెబ్బతీయడానికి ఉగ్రవాద శక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నప్పటికీ, గుజరాత్ ఏటీఎస్, ఇంటెలిజెన్స్ విభాగాలు ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలను విఫలం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. దారుల్ ఇస్లాం గుజరాత్ జైష్-ఎ-మహమ్మద్ అనే సరికొత్త పేరుతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి.. ఉర్దూ భాషలో ఉన్న ఉగ్రవాద సాహిత్యాన్ని స్థానిక గుజరాతీ భాషలోకి అనువదించి పంపిణీ చేయాలని చూడడం వారి ఆధునిక వ్యూహాల్లో ఒక భాగం. ఈ సంచలన కేసు కాలక్రమాన్ని పరిశీలిస్తే.. భద్రతా దళాల అప్రమత్తత ఎంత వేగంగా పనిచేసిందో అర్థమవుతుంది. జూలై తొలి వారంలో గుజరాత్ ఏటీఎస్ ఉన్నతాధికారులకు అందిన విశ్వసనీయమైన నిఘా సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు గుజరాత్ సరిహద్దుల్లో ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తూ.. స్థానిక యువకులను తమ నెట్‌వర్క్‌లోకి ఆకర్షిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక ఏటీఎస్ బృందం ఆధునిక సైబర్ టెక్నాలజీ, టెక్నికల్ నిఘా , క్షేత్రస్థాయి మానవ వనరుల సాయంతో నిందితుల కదలికలపై నిఘా ఉంచింది. వారు పాకిస్తాన్‌లోని తమ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు నిర్ధారించుకున్న భద్రతా సిబ్బంది, ఐదు వేర్వేరు బృందాలుగా విడిపోయి గుజరాత్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని వివిధ జిల్లాలపై సమాంతరంగా దాడులు నిర్వహించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిని అహ్మద్ గాజివాలా, ఇబ్రహీం ఘాఘా, ముదస్సిర్ గాజివాలా, జకరియా దురానీ మహమ్మద్ అమ్మార్ ఘాఘా, ముఫ్తీ ఫౌజాన్ దౌవా, మహమ్మద్ అమీన్ పాలన్‌పురి, మహమ్మద్ అబ్దుల్ సావ్ది, బిలాల్ దురానీ ఘాఘాగా గుర్తించారు. వీరిపై కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ఉపాతో పాటు బీఎన్ఎస్ లోని వివిధ సెక్షన్ల కింద దేశద్రోహం, క్రిమినల్ కుట్ర కేసులు నమోదు చేశారు. న్యాయస్థానం వీరికి ఏటీఎస్ కస్టడీ విధించడంతో, వీరి పాకిస్తాన్ లింకులు, వారికి అందిన నిధుల ప్రవాహం, డిజిటల్ కమ్యూనికేషన్ల నెట్‌వర్క్‌పై మరింత లోతైన విచారణ ప్రారంభమైంది. దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఈ ముఠా వద్ద నుండి ప్రస్తుతానికి ఎలాంటి భారీ ఆయుధాలు లేదా పేలుడు పదార్థాలు లభించలేదు. అయినప్పటికీ.. ఉగ్ర సంస్థకు మద్దతు ఇవ్వడం, నిధులు సేకరించడం, ప్రచార కంటెంట్‌ను వ్యాప్తి చేయడం కూడా చట్టప్రకారం తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి. నిందితుల మొబైల్ ఫోన్లు, ఎన్‌క్రిప్టెడ్ అప్లికేషన్ల నుండి వందలాది డిజిటల్ ఫైళ్లు, జైష్ సంస్థ పథకాలు, ఉగ్రవాద సిద్ధాంతాలకు సంబంధించిన పుస్తకాలను పోలీసులు రికవర్ చేశారు. ముఖ్యంగా మసూద్ అజార్‌కు రాసిన లేఖలు, స్థానిక భాషలోకి అనువదించిన సాహిత్యం వీరు ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారో నిరూపిస్తున్నాయి. ఈ కుట్రలో డిజిటల్ మాధ్యమాల పాత్ర అత్యంత కీలకంగా మారింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, యూట్యూబ్, ఇతర ఆన్‌లైన్ ఛానెళ్ల ద్వారా యువతను క్రమక్రమంగా తీవ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది. నిందితులకు పాకిస్తాన్‌కు చెందిన అబ్దుల్లా, మహమ్మద్ ఉమర్ అనే హ్యాండ్లర్ల నుండి ఆదేశాలు అందుతున్నట్లు, అలాగే ప్రాథమిక కార్యకలాపాల కోసం, ఒక సురక్షితమైన స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు 3 లక్షల రూపాయల నిధులు కూడా అందినట్లు తేలింది. ఈ తరహా సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో కొన్ని సున్నితమైన చర్చలు తెరపైకి రావడం సహజం. మతపరమైన విద్యాసంస్థల పరిసరాలను ఉగ్రవాద సంస్థలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడడం ఆందోళనకరమైన విషయం. అయితే.. కొద్దిమంది చేసిన తప్పుల కారణంగా మొత్తం ఒక విద్యా వ్యవస్థను లేదా ఒక వర్గాన్ని అనుమానించడం సమాజ శాంతికి భంగకరం కలిగిస్తుంది. ఉగ్రవాద శక్తుల అసలు రంగు బయటపెట్టడంతో పాటు.. సాధారణ ప్రజల హక్కులకు, గౌరవానికి భంగం కలగకుండా చూడవలసిన బాధ్యత కూడా వ్యవస్థలపై ఉంది. జాతీయ మీడియా సైతం ఈ ఆపరేషన్ ప్రాధాన్యతను గుర్తిస్తూ, ఒక పెద్ద ప్రమాదాన్ని ఏటీఎస్ ముందుగానే అడ్డుకోగలిగిందని ప్రశంసించింది. భవిష్యత్తులో ఇటువంటి ముప్పులను పూర్తిగా అరికట్టాలంటే కేవలం పోలీసు చర్యలు మాత్రమే సరిపోవు. అంతర్గత భద్రతను బలోపేతం చేయడంతో పాటు, ఆన్‌లైన్ వేదికలపై జరుగుతున్న డిజిటల్ ప్రచారాలను పర్యవేక్షించేందుకు కఠినమైన నిఘా వ్యవస్థలు అవసరం. యువత తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు సామాజిక చైతన్యం, కౌంటర్ నేరేటివ్ కార్యక్రమాలు, మతపరమైన సంస్థల్లో మరింత పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చివరగా, గుజరాత్ ఏటీఎస్ సాధించిన ఈ విజయం దేశ భద్రతా దళాల సమర్థతకు నిదర్శనం. ఉగ్రవాదం అనేది కేవలం సరిహద్దుల వద్ద కాపలా కాయడం ద్వారానే కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో మన ఇళ్లలోకి, మొబైల్ స్క్రీన్లలోకి చొరబడుతున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. భద్రతా సంస్థలు, పౌర సమాజం, మత పెద్దలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే ఇటువంటి విస్తరణ ప్రణాళికలను శాశ్వతంగా నిర్మూలించడం సాధ్యమవుతుంది. -సీతారాం కంఠంనేని ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి. Gujarat ATS JeM Terror Module, Jaish e Mohammed Gujarat arrests, Darul Islam Gujarat Module, Anti Terrorist Squad Terror Crackdown

Publish Date: Jul 10, 2026 5:17PM

political-news-img

కాలం మారినా..స్నేహం మారలేదు..! 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన మిత్రుడు..!

1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు.. ! ఈ రోజుల్లో రూపాయి కోసం తోబుట్టువులను, నమ్మిన స్నేహితులను మోసం చేసే మనుషులను మనం చూస్తూనే ఉన్నాం. డబ్బు మనుషుల మధ్య బంధాలను విచ్ఛిన్నం చేస్తున్న ఈ కాలంలో, స్నేహానికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన, హృదయపూర్వకమైన ఘటన తెలంగాణలో వెలుగుచూసింది. పాతికేళ్ల క్రితం తీసుకున్న ఒక చిన్న అప్పును తిరిగి ఇచ్చేందుకు, రుణభారం దింపుకోవాలనే ఒకే ఒక్క ఆశయంతో ఒక వ్యక్తి ఏకంగా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ, భావోద్వేగానికి గురిచేస్తోంది. సమాజంలో ఇంకా మానవత్వం, విలువలు బతికే ఉన్నాయనే నమ్మకాన్ని ఈ సంఘటన మనకు గట్టిగా ఇస్తోంది. ఈ కథలోని ఇద్దరు మిత్రులు ఒకరు కేరళకు చెందిన మహ్మద్ ఇస్మాయిల్, మరొకరు తెలంగాణకు చెందిన ఎడ్ల లచ్చన్న. దాదాపు 25 ఏళ్ల క్రితం, వీరిద్దరూ ఉపాధి కోసం గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఒకే చోట పనిచేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఆ సమయంలో మహ్మద్ ఇస్మాయిల్‌కు ఏదో అవసరం రాగా, రూ. 25,000 నగదును లచ్చన్న అప్పుగా ఇచ్చి ఆదుకున్నారు. ఆ తర్వాత కాలక్రమేణా ఇద్దరి కాంట్రాక్టులు ముగియడం, ఎవరి ఊర్లకు వారు తిరిగి వచ్చేయడంతో ఒకరికొకరు పూర్తిగా దూరమయ్యారు. ఆ రోజుల్లో ఇప్పటిలాగా స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా అకౌంట్లు లేకపోవడంతో, ఇస్మాయిల్ వద్ద లచ్చన్నకు సంబంధించిన ఫోన్ నంబర్ గానీ, పూర్తి చిరునామా గానీ లేకుండా పోయాయి. కేవలం తెలంగాణలోని 'ధర్మపురి' అనే ఒకే ఒక్క ఊరి పేరు మాత్రమే ఇస్మాయిల్ గుండెల్లో గుర్తుంది. సంవత్సరాలు గడిచినా, లచ్చన్న చేసిన సహాయం మరియు ఆయనకు ఇవ్వాల్సిన రూ. 25,000 అప్పు ఇస్మాయిల్ మనసును తొలిచేస్తూనే ఉంది. ఎలాగైనా తన పాత మిత్రుడిని కలిసి ఆ అప్పు తీర్చి, తన రుణభారం దింపుకోవాలని ఇస్మాయిల్ బలంగా నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆధునిక సాంకేతికతను వాడుకోవాలని భావించిన ఆయన, గూగుల్ మ్యాప్స్ సహాయంతో కేరళలోని తన సొంత ప్రాంతమైన పాలక్కాడ్ నుండి బయలుదేరారు. దాదాపు 1000 కిలోమీటర్ల సుదీర్ఘ దూరాన్ని అధిగమిస్తూ, ఎన్నో వ్యయప్రయాసల కోర్చి చివరకు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణానికి చేరుకున్నారు. ధర్మపురి చేరుకున్నాక లచ్చన్న ఇల్లు కనుగొనడం ఇస్మాయిల్‌కు అంత సులువు కాలేదు. లచ్చన్న పూర్తి వివరాలు తెలియకపోయినా, స్థానికులను ఆరా తీస్తూ, అడుగడుగునా అడుగుతూ ఎంతో శ్రమించి ఎట్టకేలకు లచ్చన్న ఇంటిని కనుగొన్నారు. అయితే, ఇస్మాయిల్ లచ్చన్న ఇంటికి వెళ్లేసరికి లచ్చన్న అక్కడ లేరు. ఉపాధి నిమిత్తం ఆయన మళ్లీ గల్ఫ్ దేశానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ సమయంలో ఇస్మాయిల్ ఏమాత్రం నిరాశ పడకుండా, అక్కడి నుంచే లచ్చన్నకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇన్నేళ్ల తర్వాత తన పాత స్నేహితుడి గొంతు వినగానే ఇస్మాయిల్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఫోన్ సంభాషణ అనంతరం, తాను పాతికేళ్ల క్రితం తీసుకున్న రూ. 25,000 నగదును ఒక్క రూపాయి కూడా అటు ఇటు కాకుండా లచ్చన్న భార్య, కుటుంబ సభ్యులకు ఎంతో నమ్మకంగా అందజేశారు. ఇన్నేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత, కేవలం అప్పు తీర్చడమే ధ్యేయంగా అంత దూరం వెతుక్కుంటూ వచ్చిన పాత మిత్రుడి నిజాయితీని, స్నేహ గుణాన్ని లచ్చన్న ఫోన్ ద్వారానే ఎంతో అభినందించారు. ఈ అపురూప దృశ్యాన్ని చూసిన స్థానికులు సైతం ఇస్మాయిల్ నిజాయితీకి జేజేలు పలికారు. నిజమైన స్నేహానికి, నమ్మకానికి కాలంతో పనిలేదని, మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన బంధం ఎలాంటి గమ్యాలనైనా చేరనిస్తుందని ఈ కేరళ మిత్రుడు నిరూపించాడు.

Publish Date: Jul 10, 2026 5:11PM

MOVIE NEWS