political-news-img

ఏపీలో కుల రాజకీయాలపై పవన్ సంచలన వ్యాఖ్యలు

డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్టీ అంతర్గత సమీక్షా సమావేశంలో శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యర్థుల విమర్శలు, కుల రాజకీయాలు మరియు పార్టీలోని కొందరు నేతల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో దేనికైనా ఒక హద్దు ఉంటుందని, భరించే కొద్దీ లోకువగా చూస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే తాట తీస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి పదవులు వచ్చిన తర్వాత జనసేనలోని కొందరు నాయకులు మెత్తబడిపోయారని పవన్ కల్యాణ్ ఆక్షేపించారు. పార్టీని, తనను కేవలం సొంత ఎదుగుదల కోసం వాడుకోవాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మనకు శత్రువులు బయట ఎక్కడో లేరని, సొంత పార్టీలోనే ఉన్నారంటూ పరోక్షంగా కొందరు నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండేవారు మాత్రమే జనసేనలో కొనసాగాలని ఆయన తేల్చి చెప్పారు. రాష్ట్రంలో నడుస్తున్న కుల రాజకీయాలపై డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయం ఎంతో సాఫీగా, చూసి అసూయపడేలా సాగుతుందని గుర్తు చేశారు. కానీ ఏపీలో మాత్రం నిరంతరం కులాలను రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోందని మండిపడ్డారు. తాను ఎప్పుడూ కుల నాయకుడినని చెప్పుకోలేదని, సమాజంలో కుల విద్వేషాలను రేకెత్తించడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. ఇదే క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తన భేటీపై వస్తున్న ఊహాగానాలపై పవన్ స్పందించారు. ఢిల్లీలో జరిగిన అంతర్గత చర్చలు బయటి వ్యక్తులకు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఈ వ్యవహారాలపై ఏపీ బీజేపీ నాయకులు ఎందుకు నోరు విప్పడం లేదని అడిగారు. వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లాలని తాను ఎందుకు కోరుకుంటానని, ఒకరి జైలు ప్రయాణం వల్ల జనసేనకు వచ్చే లాభమేమీ లేదని స్పష్టం చేశారు. కేవలం ఏపీ అభివృద్ధి కోసమే తాను అమిత్ షాను కలిశానని వివరించారు. తాను కేవలం తెలుగుదేశం పార్టీ కోసం కాకుండా, రాష్ట్ర భవిష్యత్తు మరియు ప్రజా సంక్షేమం కోసమే కూటమిలో సర్దుకుపోతున్నానని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. శత్రువు బలంగా ఉన్నప్పుడే తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడతానని, బలహీనులపై ప్రతాపం చూపించనని అన్నారు. ఇకపై ఎవరైనా వ్యక్తిగత దూషణలకు దిగితే అదే స్థాయిలో సమాధానం ఉంటుందని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఎన్నికల విజయం తర్వాత కొంత స్తబ్దంగా ఉన్న జనసేన శ్రేణుల్లో ఈ భేటీ సరికొత్త జోష్ నింపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అటు ప్రతిపక్షాల విమర్శలకు, ఇటు పార్టీలో సొంత అజెండాతో దూసుకెళ్తున్న నేతలకు చెక్ పడినట్లయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Publish Date: May 25, 2026 9:27PM

political-news-img

తెలంగాణలో ముగ్గురు ప్రముఖులకి పద్మ పురస్కారాలు

తెలంగాణకు చెందిన ముగ్గురు ప్రముఖులకు తాజాగా పద్మ పురస్కారాలు దక్కాయి. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ వైద్యుడు జి.వెంకట్రావుకు, క్యాన్సర్‌ వైద్య సేవల్లో విశేష కృషి చేసిన డాక్టర్ పి.విజయ్ ఆనంద్ రెడ్డికి పద్మ గౌరవం లభించింది. అలాగే కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డికి పద్మ అవార్డు దక్కింది. అవార్డు గ్రహీతలను రాష్ట్రపతి అభినందిస్తూ.. దేశాభివృద్ధికి వివిధ రంగాల్లో వారు అందించిన సేవలు భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు భారత ప్రభుత్వం.. దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీలను ప్రదానం చేసింది. ఈ ఏడాది మొత్తం 131 మందికి ఈ పురస్కారం దక్కగా.. వారిలో ఐదుగురు పద్మవిభూషణ్‌, 13 మంది పద్మభూషణ్‌, 113 మంది పద్మశ్రీలకు ఎంపికయ్యారు.

Publish Date: May 25, 2026 9:15PM

political-news-img

చంద్రబాబు జైలుకెళ్లినప్పుడే సీఎం అయ్యేవాడిని : పవన్ కల్యాణ్

రాజకీయాల్లోకి తాను అన్నీ కోల్పోవడానికి సిద్ధపడే వచ్చానని, అంతేగానీ ఎవరైనా ఇష్టానుసారంగా మాట్లాడితే చేతులు కట్టుకుని కూర్చోవడానికి సిద్ధంగా లేనని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొన్ని వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల వేదికలుగా జరుగుతున్న వ్యక్తిగత విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమపై వ్యక్తిగత దాడికి దిగితే తాము కూడా అదే స్థాయిలో వ్యూహాత్మక ఎదురుదాడి చేస్తామని వైరి వర్గాలను హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన జనసేన అంతర్గత నేతలు, శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా కొందరు పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎక్కడ ఎలాంటి వివాదాలకు దిగుతారో మీ ఇష్టం, దేనికైనా నేను సిద్ధం. నిర్ణయం మీకే వదిలేస్తున్నా.. నన్ను మాత్రం అనవసరంగా రెచ్చగొట్టవద్దు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విశ్లేషణల పేరుతో కొందరు పనిగట్టుకుని చేస్తున్న పిచ్చి లాజిక్కులను పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ఎండగట్టారు. మాజీ సీఎం జగన్‌ను జైలుకు పంపాలని తాను కోరుకుంటున్నట్లు కొందరు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. జగన్ జైలుకు వెళ్తే తనకు వచ్చే రాజకీయ లాభం ఏమీ లేదన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో తాను స్వార్థంతో ఆలోచించి ఉంటే అప్పుడే సీఎం అయ్యేవాడినని గుర్తుచేశారు. తన రాజకీయ సిద్ధాంతాలు ఎప్పుడూ విభిన్నంగా ఉంటాయని జనసేనాని స్పష్టం చేశారు. శత్రువు అన్ని రకాలుగా బలంగా ఉన్నప్పుడే తాము దెబ్బకొడతామని, అతడు బలహీనపడినప్పుడు కాదని పేర్కొన్నారు. విశ్లేషణలు చేసే వారిని తాము ప్రశ్నిస్తే.. వెంటనే కొందరు కులం కార్డును తెరపైకి తీసుకురావడం ఏంటని నిలదీశారు. తమ మితిమీరిన సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని, మౌనం వెనుక బలమైన వ్యూహం దాగి ఉందన్నారు. పార్టీ నడవాలంటే పటిష్టమైన క్రమశిక్షణ ఎంతో అవసరమని, అప్పుడే కూటమి ప్రభుత్వంలో జనసేనకు సరైన గుర్తింపు, బలం లభిస్తుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పార్టీలో పదవులు దక్కించుకున్న కొందరు నేతలు ఉత్సాహంగా పనిచేయడం మానేసి పెద్దమనుషుల తరహాలో మౌనంగా ఉండిపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పదవుల కోసమే అనుకుంటే జనసేనలో కొనసాగాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. మరోవైపు కూటమి ప్రభుత్వం సజావుగా సాగడం కోసం, రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం తాను కొన్ని విషయాల్లో సర్దుకుపోతున్నానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అర్ధరాత్రి వేళ కూడా జనసేన జెండా పట్టుకుని చిన్నారితో నిలబడిన ఒక మహిళా కార్యకర్తను చూసినప్పుడు పార్టీ అసలైన బలం ఏంటో తనకు అర్థమైందని భావోద్వేగానికి గురయ్యారు. పోరాటమే జనసేన యొక్క మూల సిద్ధాంతమని ఆయన పునరుద్ఘాటించారు. రాబోయే రోజుల్లో సోషల్ మీడియా వేదికగా జరిగే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టేందుకు జనసేన సోషల్ మీడియా వింగ్‌ను మరింత బలోపేతం చేయాలని పార్టీ భావిస్తోంది. విమర్శకులకు దీటుగా సమాధానం ఇస్తూనే.. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పవన్ కల్యాణ్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. రానున్న కాలంలో జనసేనాని మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.

Publish Date: May 25, 2026 9:06PM

political-news-img

ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026లో కీలక ఒప్పందాలు

ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 ఎపీ సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్ కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంది. కొత్తగా 38 ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం రాష్ట్రంలో స్టార్టప్ లు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహానికి గాను వివిధ సంస్థలు ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో నడిచే రూరల్ అవుట్ పోస్టులను కూడా సీఎం ఆవిష్కరించారు. మంగళగిరి, పిఠాపురం, కుప్పంలో రుటాగ్ ఈ స్మార్ట్ విలేజ్ సెంటర్లను పైలట్ గా ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంక్యుబేషన్ కేంద్రాలుగా ఈ ఆర్ఎస్వీ కేంద్రాలు పనిచేయనున్నాయి. ఆర్టీఐహెచ్ తో కలిసి కియా ఇండియా సంస్థ అడ్వాన్స్డ్ ప్రోటో టైపింగ్ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. వివిధ స్టార్టప్ లకు చేయూత ఇచ్చేలా హై ఎండ్ ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీని కియా ఏర్పాటు చేయనుంది. డీప్ టెక్ స్టార్టప్ లకు ఆర్ధిక సహకారం అందించేలా ఆర్టీఐహెచ్ తో కలిసి సిడ్బీ రూ.20 కోట్ల సీడ్ ఫండ్ ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభించనుంది. దీనికి సంబంధించి సిడ్బీ బ్యాంక్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 1 లక్ష మంది ఎంఎస్ఎంఈ డిజిటల్ మెచ్యూరిటీ అసెస్మెంట్ లో భాగంగా వివిధ కళాశాలల్లో 50 డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ - ఐటీ శాఖల మధ్య ఒప్పందం కుదిరింది. వీటితో పాటు వెయ్యి ఎంఎస్ఎంఈ ఎనర్జీ, వాటర్ ఆడిట్స్, ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ లో డయాగ్నాస్టిక్స్ నిర్వహించేందుకు ఎస్సెల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 750 ఎంఎస్ఎంఈలతో పాటు 3,125 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా రూ.200 కోట్ల వ్యయంతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాలని నిర్ణయించారు. దివ్యాంగ యువతకు ఎంట్రప్రెన్యూర్ షిప్ ట్రైనింగ్ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లకు ఎంస్ఎంఈ ఉత్పత్తులు రాష్ట్రంలోని 10 ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో ఆయా రంగాల్లో జరిగే వృద్ధిని అధ్యయనం చేసేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరంతో ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. రూ.1 లక్ష ఎంఎస్ఎంఈలకు టెక్నాలజీ అడాప్షన్ తో పాటు డిజిటల్ రెడీనెస్ పై శిక్షణ కోసం వోడా ఫోన్ ఐడీయా బిజినెస్ తో ఒప్పందం కుదిరింది. ఎంఎస్ఎంఈల్లో డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ కోసం జోహో సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు తయారు చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలకు, ఎగుమతులకు చేయూతనిచ్చేలా అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ తో ఒప్పందం కుదిరింది. లాజిస్టిక్స్ సపోర్టుతో పాటు క్రాస్ బోర్డర్ ట్రేడ్, ఎగుమతుల సామర్ధ్యం పెంచేలా ఆరామెక్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈమేరకు ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 1 లక్ష మంది మైక్రో ఎంటర్ ప్రైజెస్ సామర్ధ్యాలను పెంచేలా మెటా సంస్థ చేయూత అందించేందుకు ఒప్పందం చేసుకుంది. తయారవుతున్న ఉత్పత్తుల నాణ్యత సర్టిఫికేషన్, గ్లోబల్ ప్రమాణాలతో ఉత్పత్తి తదితర అంశాల్లో సహకారం అందించేందుకు క్యూసిఐ ముందుకు వచ్చింది. ఎంఎస్ఎంఈ సంస్థల్లో నేషనల్ పెన్షన్ వ్యవస్థ అమలు, ఆర్ధిక వ్యవహారాలు, సామాజిక భద్రత అంశాల్లో తోడ్పడేందుకు పీఎఫ్ఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, డీబీవీ స్వామి సహా ప్రజాప్రతినిధులు, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పోరేషన్ సీఈఓ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు

Publish Date: May 25, 2026 8:20PM

political-news-img

అనంత శ్రీరామ్‌ స్థలంపై వైసీపీ నేతల కబ్జా కన్ను

వైసీపీ కండువా కప్పుకోగానే.. ఎలాంటి సీనియర్ నేతలకైనా, లేకపోతే వారి వారసులకైనా ‘భూ కబ్జా’లు ఫ్యాషన్‌గా మారిపోతాయనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. గత ఎన్నికలకు ముందు అంటే 2024లో కాపు సంక్షేమ సంఘ అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్‌ జనసేనను వీడి వైసీపీలో చేరారు. ఇప్పుడా వైసీపీ నేతపై భూ ఆక్రమణ ఆరోపణలతో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఫిర్యాదు చేసింది కూడా ఆషామాషీ వ్యక్తి కాదు. ప్రముఖ సెలబ్రిటీ, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామంలోని తమ ఇంటి ముందు ఉన్న ఐదు సెంట్ల తమ కుటుంబ ఉమ్మడి స్థలాన్ని మాజీ మంత్రి హరిరామజోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఆక్రమించారంటూ అనంత శ్రీరామ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ స్థల వివాదం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉందని అనంత శ్రీరామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ, సూర్యప్రకాష్ తమను నిరంతరం బెదిరింపులకు గురిచేస్తూ తీవ్ర మానసిక హింసకు గురిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదం కారణంగా దొడ్డిపట్లలో ఉంటున్న తన వృద్ధులైన తల్లిదండ్రుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి తక్షణమే రక్షణ కల్పించాలని అనంత శ్రీరామ్ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ అధికారిలను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన అధికారులను కోరారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ‘పెద్ది’ సినిమాలోని పాటలు ట్రెండ్‌ని షేక్ చేస్తున్నాయి. ‘రై రై రారా’ సాంగ్ ఇప్పటికే ఓ ఊపు ఊపేసింది. తాజాగా వచ్చిన స్పెషల్ సాంగ్ ‘హల్లల్లల్లో’ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ దిశగా వెళుతోంది. ఈ పాటలో రామ్ చరణ్‌ గ్రేస్‌ఫుల్ డ్యాన్స్‌కు అంతా ఫిదా అవుతున్నారు. అంతటి సెలబ్రిటీల విషయంలో కూడా వైసీపీ నేతలు నిర్లజ్జగా వ్యవహరిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

Publish Date: May 25, 2026 8:03PM

political-news-img

మహిళా వ్యాపారులకు విచిత్రమైన శిక్ష విధించిన కోర్టు

హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ కృత్రిమ పూల వ్యాపారం నిర్వహిస్తున్న ఐదుగురు మహిళా చిన్న తరహా వ్యాపారులపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈ ఘటనపై కోర్టు ఓ వినూత్న రీతిలో తీర్పు వెల్లడించింది... కోర్టు ఇచ్చిన తీర్పును విని నిందితులు సైతం అవాక్కయ్యారు. అంజు సింగ్ (19),సబీ దేవి (38),మనూ దేవి (43),మనీషా (20), శకుంతల (36) ఈ ఐదుగురు మహిళలు గుల్జార్ హౌజ్ నుంచి మక్కా మసీదు మరియు చార్మినార్ వైపు వెళ్లే ప్రత్యేక పాదచారుల మార్గాన్ని ఆక్రమిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. కృత్రిమ పూల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు... అయితే వీరి వల్ల అక్కడ భారీగా పర్యాటకులు మరియు పాదాచారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో పోలీసులు మహిళలను పలుమార్లు హెచ్చరించారు. అయినా కూడా ఈ మహిళలు పోలీసుల మాటలను వారు పట్టించుకోలేకుండా యధావిధిగా పూల వ్యాపారం కొనసాగించారు. దీంతో చార్మినార్ పోలీసులు మే 23న ఈ ఐదుగురు మహిళలపై CP యాక్ట్ సెక్షన్ 66-C మరియు BNS సెక్షన్ 292 కింద కేసులు నమోదయ్యాయి. అనంతరం పోలీసులు ఈరోజు సోమవారం ఉదయం నిందితులను గౌరవనీయ 1వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కోర్టు ప్రతి ఒక్కరికి రూ.200 జరిమానా విధించింది. అంతేకాకుండా, సాయంత్రం 5 గంటల వరకు చార్మినార్ పోలీస్ స్టేషన్‌లో సామాజిక సేవ చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా SHO మాట్లాడుతూ చార్మినార్ ప్రాంతంలో పర్యాటకులు మరియు పాదచారులకు ఇబ్బంది కలిగించేలా రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Publish Date: May 25, 2026 7:50PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img