వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026...116వ ర్యాంకుతో సరిపెట్టుకున్న భారత్
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, వారు అనుభవిస్తున్న సంతోషం ఆధారంగా రూపొందించిన 'ప్రపంచ సంతోష సూచీ 2026' తాజాగా విడుదలైంది. ఈ ఏడాది నివేదికలో భారత్ తన గత రికార్డును స్వల్పంగా మెరుగుపరుచుకుంటూ 116వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 118వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి రెండు మెట్లు పైకి ఎగబాకడం గమనార్హం. అయితే, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్, నేపాల్ వంటి పొరుగు దేశాల కంటే భారత్ వెనుకబడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా, స్వీడన్ దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా కోస్టారికా 2023లో 23వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది ఏకంగా 4వ స్థానానికి చేరుకోవడం విశేషం. భారత్ పొరుగు దేశాల విషయానికి వస్తే, నేపాల్ 99వ ర్యాంకుతో, పాకిస్థాన్ 104వ ర్యాంకుతో భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. శ్రీలంక 134, బంగ్లాదేశ్ 127వ స్థానాల్లో నిలవగా, యుద్ధ ప్రాతిపదికన ఉన్న ఆఫ్ఘనిస్థాన్ 147వ ర్యాంకుతో ప్రపంచంలోనే అత్యంత అసంతృప్తికర దేశంగా చివరి స్థానంలో నిలిచింది. అమెరికా ఈసారి 23వ స్థానానికి పరిమితం కాగా, చైనా 65వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ను కేవలం సంపద ఆధారంగానే కాకుండా.. తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన కాలం, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఉదారత, మరియు అవినీతి రహిత పాలన వంటి ఆరు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కించారు. భారత్ అవినీతి వ్యతిరేకత (64వ ర్యాంకు), ఉదారత (78వ ర్యాంకు) వంటి అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, సామాజిక మద్దతు (123వ ర్యాంకు) వంటి విషయాల్లో వెనుకబడటం వల్ల ఓవరాల్ ర్యాంకు ప్రభావితమైంది. ఈ నివేదికపై స్పందిస్తూ, భారత్లోని ఫిన్లాండ్ రాయబారి కిమ్మో లాహ్దేవిర్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిన్లాండ్ సంతోషకరమైన దేశం కావచ్చు కానీ, భారతీయులు ప్రపంచంలోనే అత్యంత ఆశావాదులని ఆయన కొనియాడారు. భారతీయ ఆశావాదం, ఫిన్లాండ్ సంతోషం కలిస్తే అది ఒక అద్భుతమైన కలయిక అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నివేదికలో 'సోషల్ మీడియా మరియు సంతోషం' అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా యువతలో సోషల్ మీడియా వాడకం వారి మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావంపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారత్ తన సామాజిక మద్దతు వ్యవస్థలను బలోపేతం చేసుకుంటే, సంతోష సూచీలో మరిన్ని మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Publish Date: Mar 20, 2026 8:04PM