Top Stories

dummy

political-news-img

వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026...116వ ర్యాంకుతో సరిపెట్టుకున్న భారత్

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు, వారు అనుభవిస్తున్న సంతోషం ఆధారంగా రూపొందించిన 'ప్రపంచ సంతోష సూచీ 2026' తాజాగా విడుదలైంది. ఈ ఏడాది నివేదికలో భారత్ తన గత రికార్డును స్వల్పంగా మెరుగుపరుచుకుంటూ 116వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 118వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి రెండు మెట్లు పైకి ఎగబాకడం గమనార్హం. అయితే, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్, నేపాల్ వంటి పొరుగు దేశాల కంటే భారత్ వెనుకబడి ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఐక్యరాజ్యసమితికి చెందిన సస్టైనబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్స్ నెట్‌వర్క్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్ వరుసగా తొమ్మిదో ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐస్లాండ్, డెన్మార్క్, కోస్టారికా, స్వీడన్ దేశాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా కోస్టారికా 2023లో 23వ స్థానంలో ఉండగా, ఈ ఏడాది ఏకంగా 4వ స్థానానికి చేరుకోవడం విశేషం. భారత్ పొరుగు దేశాల విషయానికి వస్తే, నేపాల్ 99వ ర్యాంకుతో, పాకిస్థాన్ 104వ ర్యాంకుతో భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉన్నాయి. శ్రీలంక 134, బంగ్లాదేశ్ 127వ స్థానాల్లో నిలవగా, యుద్ధ ప్రాతిపదికన ఉన్న ఆఫ్ఘనిస్థాన్ 147వ ర్యాంకుతో ప్రపంచంలోనే అత్యంత అసంతృప్తికర దేశంగా చివరి స్థానంలో నిలిచింది. అమెరికా ఈసారి 23వ స్థానానికి పరిమితం కాగా, చైనా 65వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం సంపద ఆధారంగానే కాకుండా.. తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన కాలం, నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, ఉదారత, మరియు అవినీతి రహిత పాలన వంటి ఆరు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని లెక్కించారు. భారత్ అవినీతి వ్యతిరేకత (64వ ర్యాంకు), ఉదారత (78వ ర్యాంకు) వంటి అంశాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, సామాజిక మద్దతు (123వ ర్యాంకు) వంటి విషయాల్లో వెనుకబడటం వల్ల ఓవరాల్ ర్యాంకు ప్రభావితమైంది. ఈ నివేదికపై స్పందిస్తూ, భారత్‌లోని ఫిన్లాండ్ రాయబారి కిమ్మో లాహ్దేవిర్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిన్లాండ్ సంతోషకరమైన దేశం కావచ్చు కానీ, భారతీయులు ప్రపంచంలోనే అత్యంత ఆశావాదులని ఆయన కొనియాడారు. భారతీయ ఆశావాదం, ఫిన్లాండ్ సంతోషం కలిస్తే అది ఒక అద్భుతమైన కలయిక అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నివేదికలో 'సోషల్ మీడియా మరియు సంతోషం' అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా యువతలో సోషల్ మీడియా వాడకం వారి మానసిక ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావంపై పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారత్ తన సామాజిక మద్దతు వ్యవస్థలను బలోపేతం చేసుకుంటే, సంతోష సూచీలో మరిన్ని మెరుగైన ర్యాంకులు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Publish Date: Mar 20, 2026 8:04PM

political-news-img

ఇక పదో తరగతి పరీక్షలు ఉండవు! : సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు, పరిపాలనా పారదర్శకత, వివాదాస్పద కేసులపై దర్యాప్తు వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం రాజీ పడబోదని ఆయన వ్యాఖ్యలు వెల్లడిస్తున్నాయి. విద్యా రంగంలో సమూల మార్పులు తీసుకురాను న్నట్లు సీఎం ప్రకటించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ప్రత్యేక విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడి యట్‌ వరకు ఒకే విధానాన్ని ప్రవేశపెడతామని, విద్యార్థులపై ఉండే పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విద్యార్థుల సృజనాత్మకత, నైపుణ్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుపై స్పందిస్తూ, చట్టపరమైన ప్రక్రియల ప్రకారమే దర్యాప్తు కొనసాగుతోందని, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని సీఎం పేర్కొన్నారు. ఎలాంటి కక్ష సాధింపు లేకుండా న్యాయపరమైన ఆధారాల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉన్నతాధికారి ప్రభాకర్ రావు నుంచి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని స్టేట్మెంట్లు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ జరుగుతున్న సమయంలో తాను ప్రత్యక్షంగా సమీక్ష చేయడం సరికాదని కూడా వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నాయకుడు హరీష్ రావు కు ఎలాంటి క్లీన్ చిట్ లభించలేదని సీఎం స్పష్టం చేశారు. చక్రధర్ గౌడ్ కేసులో కోర్టు నుంచి తాత్కాలిక ఊరట లభించినా, ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో మాత్రం ఎలాంటి ఉపశమనం లేదని తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. కేబినెట్ విస్తరణపై వస్తున్న ఊహాగానాలను సీఎం కొట్టిపారేశారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి విస్తరణ కోసమే అన్న ప్రచారం సరికాదని పేర్కొన్నారు. సరైన సమయంలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మాజీ భారత క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నియమించే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సీఎం తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ వద్ద తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించినట్లు ఆయన వెల్లడించారు. మూసి నది ప్రక్షాళన ప్రాజెక్టుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని పేర్కొన్నారు. ప్రాజెక్టు కారణంగా ఇబ్బంది పడే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మూసి పునరుజ్జీవం చారిత్రాత్మక అవసరమని, నదిని అదే ప్రదేశంలో కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన అన్నారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం, గత పదేళ్లలో చేసిన అప్పుల భారాన్ని ప్రస్తుతం ప్రభుత్వం భరిస్తోందని వ్యాఖ్యానించారు. అప్పులపై వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని, గత పాలకులు తమ తప్పులకు బాధ్యత వహించాలని ఆయన సూచించారు. ఫార్ములా ఈ రేసు కేసుపై కూడా సీఎం స్పందిస్తూ, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్నతాధికారి అరవింద్ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. పోలీసులు త్వరలోనే చార్జ్ షీట్ దాఖలు చేయాలని సూచించారు. హెల్త్ పాలసీపై వస్తున్న అవినీతి ఆరోపణలను సీఎం ఖండించారు. సంబంధిత భూమిని విక్రయించినా ప్రచారంలో ఉన్నంత మొత్తంలో నిధులు రాబట్టలేమని పేర్కొన్నారు. ఎలాంటి విచారణకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై కూడా సీఎం స్పందించారు. ఏ గ్యారెంటీ ఎప్పుడు అమలు చేయాలో తమకు స్పష్టమైన ప్రణాళిక ఉందని తెలిపారు. ప్రతిపక్షాల్లా తప్పుడు ప్రచారాలు చేయబోమని అన్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం టెలరేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. ఇతర రాజకీయ అంశాలపై స్పందిస్తూ, జీవన్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ స్థాయిలోనే పరిష్కరిస్తారని, ఈ విషయాన్ని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మరియు ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజ్ పరిశీలిస్తున్నారని తెలిపారు. అలాగే మహాత్మా గాంధీ ఎవరి సొత్తు కాదని, ఆయన ఆలోచనలు సమాజానికే చెందాయని వ్యాఖ్యానించారు. మొత్తం మీద రాష్ట్రంలో పారదర్శక పాలన, అభివృద్ధి, సంక్షేమం అనే మూడు సూత్రాలపై ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి.

Publish Date: Mar 20, 2026 7:20PM

political-news-img

భవిష్యత్తులో రోబోలే కార్మికులు... 100 బిలియన్ డాలర్లతో బెజోస్ భారీ స్కెచ్!

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీ రంగం మరియు ఫ్యాక్టరీల రూపురేఖలను పూర్తిగా మార్చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.3 లక్షల కోట్లు) భారీ నిధుల సేకరణకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. కేవలం కృత్రిమ మేధ (AI) మరియు అత్యాధునిక రోబోటిక్స్‌ను పారిశ్రామిక రంగంలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా ఈ భారీ పెట్టుబడులు పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా బెజోస్ "ప్రాజెక్ట్ ప్రోమేతియస్ అనే కొత్త స్టార్టప్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. దీని ద్వారా చిప్ తయారీ, రక్షణ రంగం మరియు ఏరోస్పేస్ వంటి కీలక పరిశ్రమలను కొనుగోలు చేసి, అక్కడ మానవ శ్రమ అవసరం లేకుండా పూర్తిస్థాయిలో ఏఐ ఆధారిత ఆటోమేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే దీని కోసం మధ్య ప్రాచ్యం మరియు ఆగ్నేయాసియాలోని ప్రముఖ పెట్టుబడిదారులతో బెజోస్ చర్చలు జరుపుతున్నారు. నిజానికి, అమెజాన్ వేర్‌హౌస్‌లలో ఇప్పటికే రోబోల వినియోగం భారీగా పెరిగింది. అయితే ఇప్పుడు బెజోస్ లక్ష్యం కేవలం అమెజాన్ మాత్రమే కాదు, ప్రపంచంలోని అన్ని రకాల తయారీ సంస్థలను ఏఐ మయం చేయడం. ఈ పరిణామం వల్ల ఉత్పాదకత మరియు నాణ్యత పెరుగుతాయని బెజోస్ వాదిస్తున్నప్పటికీ, దీని వెనుక ఉన్న అసలు భయం "ఉద్యోగాల కోత". దాదాపు 6 లక్షల మంది కార్మికుల స్థానాన్ని భవిష్యత్తులో రోబోలు భర్తీ చేసే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ఈ భారీ ఆటోమేషన్ ప్లాన్‌పై కార్మిక సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ వంటి వారు బెజోస్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. బిలియనీర్లు కార్మికులపై యుద్ధం ప్రకటిస్తున్నారని, మనుషుల ఉపాధిని రోబోలకు ధారాదత్తం చేయడం ఆందోళనకరమని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం లాభాల కోసమే సామాన్య కార్మికుల పొట్ట కొట్టవద్దని సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామం పారిశ్రామిక విప్లవం 4.0లో కీలక ఘట్టం కానుంది. రోబోలు బరువులు ఎత్తడం, ప్యాకింగ్ చేయడం వంటి పనులను తప్పులు లేకుండా వేగంగా పూర్తి చేస్తాయి. అయితే, సామాన్య కార్మికులు తమ ఉపాధిని కోల్పోకుండా ఉండాలంటే వారికి కొత్త రకం సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం తప్పనిసరి. రానున్న ఐదేళ్లలో ఈ ఏఐ ఫండ్' ప్రభావం ప్రపంచ మార్కెట్‌పై ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Publish Date: Mar 20, 2026 6:34PM

political-news-img

ఐఏఎస్ సాధించిన కూలీ కొడుకు...సినిమాను మించిన సక్సెస్ స్టోరీ

సినీ తెరపై కనిపించే అసాధారణ విజయగాథలు అప్పుడప్పుడు నిజ జీవితంలోనూ ఆవిష్కృతమవుతుంటాయి. తాజాగా చెన్నైకి చెందిన ఒక సాధారణ దినసరి కూలీ కుమారుడు దేశంలోనే అత్యున్నతమైన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ యువకుడి పట్టుదల, కష్టం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా నటుడు ఆర్. మాధవన్ నటించబోతున్న 'ధురంధర్ 2' చిత్రంలోని స్ఫూర్తిదాయక అంశాలకు ఈ యువకుడి ప్రయాణం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. చెన్నైలోని మురికివాడకు సమీపంలో నివసించే ఈ యువకుడి తండ్రి రోజూ కూలీ పనులకు వెళ్తేనే ఇల్లు గడిచే పరిస్థితి. ఆర్థిక ఇబ్బందులు, కనీస సౌకర్యాల లేమి వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ, అతను తన లక్ష్యం నుంచి పక్కకు తప్పుకోలేదు. తండ్రి పడుతున్న కష్టాన్ని చూస్తూ పెరిగిన ఆ యువకుడు, చదువే తన జీవితాన్ని మారుస్తుందని బలంగా నమ్మాడు. పగలు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూనే, రాత్రి పూట దీపాల వెలుతురులో కష్టపడి చదివి ఈ ఘనత సాధించాడు. నిజానికి, మాధవన్ రాబోయే ప్రాజెక్ట్ 'ధురంధర్ 2' కూడా ఇలాంటి అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తుల నేపథ్యంతోనే రూపొందుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సదరు యువకుడి విజయం చిత్ర బృందాన్ని, ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. సినిమా కథల్లో ఉండే భావోద్వేగాలు, సంఘర్షణలు ఈ యువకుడి నిజ జీవితంలో అక్షరాలా కనిపించడం విశేషం. కేవలం కోచింగ్ సెంటర్ల వల్లే కాకుండా, అంకితభావం ఉంటే ఏ శిఖరాన్నైనా అధిరోహించవచ్చని అతను నిరూపించాడు. ఈ విజయం కేవలం ఆ కుటుంబానికే కాకుండా, దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ కావాలని కలలు కనే వేలాది మంది పేద విద్యార్థులకు కొండంత ఆశను కల్పిస్తోంది. వనరులు లేవని బాధపడటం కంటే, ఉన్న వనరులతోనే ఎలా ముందుకు వెళ్లాలో ఈ యువకుడి ప్రయాణం నేర్పుతోంది. ప్రస్తుతం ఇతని సక్సెస్ స్టోరీపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు సైతం ఈ 'రియల్ ధురంధర్'ను అభినందిస్తూ పోస్టులు చేస్తున్నారు.రాబోయే రోజుల్లో ఈ యువకుడు శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు చేపట్టిన తర్వాత, వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకువస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాన్యుడి కష్టం తెలిసిన వ్యక్తి పాలనలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు.

Publish Date: Mar 20, 2026 6:07PM

political-news-img

డోనాల్డ్ ట్రంప్ నోటిదురుసు.. జపాన్ ప్రధాని ఎదుటే పెర్ల్ హార్బర్ జోక్!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జపాన్ కొత్త ప్రధానమంత్రి సనే తకైచితో జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఇరాన్‌పై అమెరికా జరిపిన మెరుపు దాడుల విషయంలో మిత్రదేశమైన జపాన్‌కు ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అడిగిన ప్రశ్నకు, ట్రంప్ రెండో ప్రపంచ యుద్ధం నాటి పెర్ల్ హార్బర్ దాడిని గుర్తు చేస్తూ సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో ఒక జపాన్ జర్నలిస్ట్ ప్రతినిధి.. "ఇరాన్ పై యుద్ధం ప్రకటించే ముందు జపాన్ వంటి సన్నిహిత మిత్రదేశాలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?" అని ప్రశ్నించారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ.. "సైనిక చర్యల్లో గోప్యత చాలా ముఖ్యం. మేము శత్రువును ఆశ్చర్యపరచాలని అనుకున్నాం. అసలు సర్ ప్రైజ్ అటాక్ గురించి జపాన్ కంటే బాగా ఎవరికి తెలుస్తుంది? మరి మీరు పెర్ల్ హార్బర్ దాడి గురించి మాకు ముందుగా చెప్పారా?" అంటూ ఎదురు ప్రశ్నించారు. ట్రంప్ చేసిన ఈ ఆకస్మిక వ్యాఖ్యలతో పక్కనే కూర్చున్న జపాన్ ప్రధాని తకైచి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ట్రంప్ వ్యాఖ్యలు విన్న వెంటనే ప్రధాని తకైచి ముఖంలో నవ్వు మాయమైంది. ఆమె విస్మయంతో కనుబొమ్మలు ఎగురవేస్తూ అసహనానికి లోనైనట్లు కనిపించారు. పెర్ల్ హార్బర్ అనేది అమెరికా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటన. 1941లో జపాన్ జరిపిన ఈ మెరుపు దాడిలోనే వేల సంఖ్యలో అమెరికన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అటువంటి సున్నితమైన అంశాన్ని ఒక దౌత్యపరమైన భేటీలో జోక్‌గా ప్రస్తావించడం అక్కడ ఉన్నవారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అనంతరం ట్రంప్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. ముందస్తుగా సమాచారం ఇస్తే అది సర్ ప్రైజ్ అటాక్ కాదని, రహస్యంగా ఉంచడం వల్లే తాము అనుకున్న దానికంటే 50 శాతం ఎక్కువ విజయం సాధించామని పేర్కొన్నారు. అలాగే, హోర్ముజ్ జలసంధి ద్వారా జపాన్‌కు భారీగా చమురు సరఫరా అవుతుందని, కాబట్టి ఈ యుద్ధంలో జపాన్ మరింత చురుగ్గా అమెరికాకు సహకరించాలని ఆయన కోరారు. జపాన్ రక్షణ కోసం అమెరికా చేస్తున్న ఖర్చును కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే, జపాన్ ప్రధాని సనే తకైచి మాత్రం అత్యంత సంయమనంతో వ్యవహరించారు. ఇరాన్ అణు కార్యక్రమాలను జపాన్ వ్యతిరేకిస్తుందని చెబుతూనే, ప్రపంచ శాంతిని నెలకొల్పగల శక్తి కేవలం ట్రంప్‌కే ఉందని ప్రశంసించారు. జపాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం ఇతర దేశాల యుద్ధాల్లో నేరుగా పాల్గొనడంపై ఉన్న పరిమితులను ఆమె పరోక్షంగా గుర్తు చేస్తూనే, అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించారు.గతంలో కూడా ట్రంప్ మాజీ ప్రధాని షింజో అబేతో జరిగిన భేటీలో "నాకు పెర్ల్ హార్బర్ గుర్తుంది" అని వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు నేరుగా కొత్త ప్రధాని ముందే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Publish Date: Mar 20, 2026 5:42PM

political-news-img

డాడీ..మోడీ..చిన్నమోడీ..ఏకకాలంలో ముగ్గురిపై కవిత విమర్శల దాడి

తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ జనజాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు వేగంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన తండ్రి కేసీఆర్ టార్గెట్ గా తాజాగా సంధించిన వమర్శనాస్త్రాలు రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన తండ్రి కేసీఆర్ ను, ప్రధాని మోడీనీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ ఒకే సమయంలో విమర్శలతో చెరిగేయడం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డాడీ, మోడీ, చిన్న మోడీ అంటూ ఆమె ప్రయోగించిన పదాలు ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ' అంటే తన తండ్రి కేసీఆర్ అని, 'చిన్న మోదీ' అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలను ఆమె తూర్పారబట్టారు. అలాగే తన తండ్రి కేసీఆర్ సీఎంగా ఉండగా రాష్ట్ర ప్రగతి కుంటుపడిందంటూ విమర్శలు గుప్పించారు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ నూ ఆమె వదల లేదు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత కొద్ది కాలం పాటు తన తండ్రి కేసీఆర్ ను మాత్రం మినహాయించి బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్, తన అన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లు లక్ష్యంగా ఆమె విరుచుకుపడ్డారు. అంతే కాకుండా బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకులను సైతం వదలకుండా విమర్శల వర్షం కురిపించారు. అయితే ఇక సొంత పార్టీ పెట్టడానికి ముందు ఆమె ఏకంగా బీఆర్ఎస్ కుంభ స్థలాన్నే గురిపెట్టారన్నట్లుగా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారు. ఆయన మానసపుత్రిక అయిన కాళేశ్వరాన్ని దండగమారి ప్రాజెక్టు గా అభివర్ణించారు. కాళేశ్వరం అవినీతిపై విచారణకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ధర్నా చౌక్ వద్ద ఆందోళనకు దిగిన కవిత ఇప్పుడు అదే కాళేశ్వరం ప్రాజెక్టును ఇసుమంతైనా ఉపయోగం లేని ప్రాజెక్టు అని దుయ్యబట్డడమే కాకుండా.. ప్రజాధనం దుర్విని యోగమయ్యిందంటూ విమర్శలు చేశారు. కాళేశ్వరంలో అవినీతికి హరీష్ రావును బాధ్యుడిని చేయాలంటూ డిమాండ్ చేయడం ద్వారా ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దీంతో రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీపై కవిత విమర్శలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. కవిత విమర్శలు, ఆరోపణలపై బీఆర్ఎస్ అగ్రనాయకత్వం స్పందించకపోవడంతో మౌనం అర్ధాంగీకరం అన్న చందంగా కవిత ఆరోపణలల్లో వాస్తవం ఉందా అన్న చర్చ బీఆర్ఎస్ శ్రేణులలోనే మొదలైంది.

Publish Date: Mar 20, 2026 5:31PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img