తెలంగాణ ఆలయాలకు తిరుమల నిధులు.. ఎందుకు వివాదం అవుతోందంటే?
తెలంగాణ ఆలయాలకు తిరుమల నిధులు.. ఎందుకు వివాదం అవుతోందంటే?

కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఒక జీవో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టిటిడి బోర్డు, శ్రీవాణి ట్రస్ట్ తీర్మానాల ప్రకారం.. మొత్తం 6 పురాతన ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం నిధులను ఉపయోగించేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడమే ఇందుకు కారణం. పురాతన ఆయయాల అభివృద్ధికి టీటీడీ నిధుల కేటాయింపునకు అనుమతి ఇస్తూ జారీ అయిన జీవో వివాదాస్పదం కావడానికి, పెను రాజకీయ చర్చకు దారి తీయడానికి కారణమేంటంటే.. ఈ ఆరు ఆలయాల్లో మూడు తెలంగాణలోని ఆలయాలు కావడమే. ఆంధ్రప్రదేశ్ కు చెందిన శ్రీవాణి ట్రస్ట్ నిధులను తెలంగాణలోని దేవాలయాలకు ఎలా కేటాయిస్తారంటూ, పెద్ద ఎత్తున విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్, వైసీసీ ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ.. ప్రాంతీయ విద్వేషాలు పెచ్చరిల్లేలా వ్యవమరిస్తున్నాది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇ ఏపీ ప్రజల సొమ్మును తెలంగాణలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం, అక్కడ తమ పార్టీల బలోపేతం చేసుకోవడం కోసం వాడుకుంటున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని, తెలంగాణ ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయించడాన్ని తప్పుపడుతున్న వారూ.. విస్మరిస్తున్న కీలక అంశమేంటంటటే.. ట్రస్ట్ నిధులను తెలంగాణలో మూడు ఆలయాల అభివృద్ధికి వినియోగించడాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిందే కానీ, ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా పొరుగురాష్ట్రానికి తరలించడంలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం సొంత నిధులను తెలంగాణలో ఆలయాల అభివృద్ధికి వినియోగించడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లాంటిది ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవో. ఇక తిరుమలేశుడికి భక్తులు కానుకల ద్వారా సమర్పించుకున్న నిధుల వినియోగం విషయంలో కూడా ప్రాంతీయ బేధాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు విమర్శలు చేయడం సరికాదంటున్నారు పరిశీలకులు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి, ప్రాంతీయ సరిహద్దులు, కుల, మతాల భేదాలు ఉండవు. తిరుమలేశునికి కానుకలు సమర్పించుకున్న వారిలో తెలంగాణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో ఉంటూ స్వామివారి హుండీకి కోట్ల రూపాయల కానుకలు సమర్పిస్తున్నారు. ఒక్క తెలుగురాష్ట్రాల నుంచి అని కాకుండా, దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తుంటారు. కానుకలు సమర్పించుకుంటారు. ఆ కానుకల ద్వారా వచ్చిన నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం.. తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో కూడా ఆలయాల నిర్మాణానికి, ఆధ్యాత్మిక ధర్మ ప్రచారానికీ వినియోగించడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇది పూర్తిగా ఒక ధార్మిక కార్యక్రమం, దీనికి రాజకీయాలను, ప్రాంతీయతలను ఆపాదించడం ఇసుమంతైనా సరికాదు. హిందూ ధర్మాన్ని రక్షణ, పురాతన ఆలయాల అభివృద్ధి విషయంలో టిటిడి, ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రాంతీయ కోణంలో చూడటం తగదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Publish Date: Jun 26, 2026 12:22PM
ఏపీలో మరింత బలోపేతానికి  జనసేన వ్యూహం.. వైసీపీ మహిళానేతలే టార్గెట్?!
ఏపీలో మరింత బలోపేతానికి జనసేన వ్యూహం.. వైసీపీ మహిళానేతలే టార్గెట్?!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. రానున్న కాలంలో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి సమీకరణాలను మార్చేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీకి చెందిన కీలక మహిళా నేతలను జనసేనలోకి తీసుకువచ్చేందుకు వ్యూహరచన చేస్తోంది. రాజకీయవర్గాలలో విస్తృతంగా జరుగుతున్న చర్చ మేరకు.. ఇటీవల పార్లమెంట్ వేదికగా చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి. గత నెలలో పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. చట్టసభల్లో మూడింట రెండు వంతుల ప్రత్యేక మెజారిటీ అవసరమైన తరుణంలో లోక్‌సభలో ఈ బిల్లుల ఆమోద ప్రక్రియలో ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే దీనిని బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పార్లమెంటు ఆమెదం పొందేందుకు ఈ బిల్లులను ఈ వర్షాకాల సమావేశాలలోనే మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో.. ఆ బిల్లులు ఇమోదం పొందితే చట్ట సభల్లో స్థానాలు గణనీయంగా పెరుగుతాయి. ముఖ్యంగా మహిళలకు కేటాయించే స్థానాలను దక్కించుకునే వ్యూహంతో జనసేన వైసీపీ మహిళా నేతలకు తమ పార్టీ తలుపులు బార్లా తెరవాలని నిర్ణయానికి వచ్చినట్ల జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ.. క్షేత్రస్థాయిలో పట్టున్న మహిళా నేతలను గుర్తించిందని చెబుతున్నారు. వారిలో వైసీపీలో సరైన ప్రాధాన్యత లేక, అసంతృప్తితో ఉన్న పలువురు మాజీ మహిళా మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో ఇప్పటికే జనసేన వర్గాలు సంప్రదింపులు జరిపినట్లు చెబుతున్నారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే.. రిజర్వ్ అయ్యే స్థానాల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా విజయావకాశాలను మెరుగుపరుచుకోవచ్చన్న ఉద్దేశంతో జనసేన వారికి టికెట్లు ఆఫర్ చేయడం ద్వారా పార్టీలో చేర్చుకోవాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డీలిమిటేషన్ కూడా ఏపీ రాజకీయాల్లో మార్పులకు దోహదపడనుంది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో, కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో ముందస్తుగా పట్టు సాధించడం అన్ని పార్టీలకూ అనివార్యంగా మారింది. ఈ పునర్విభజన సమయంలోనే మహిళా రిజర్వేషన్ల కోటాను కూడా అనుసంధానం చేసే అవకాశం ఉండటంతో, జనసేన పార్టీ ఈ స్ట్రాటజీని తెరపైకి తెచ్చిందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత వైసీపీలో పలువురు మహిళా నేతలు సైలంట్ అయ్యారు. ఇప్పుడు జనసేన అటువంటి వారిపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇందుకు వారి నుంచి కూడా సానుకూలత వ్యక్తమౌతోందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కూటమి హవా, భవిష్యత్ రాజకీయ అవకాశాల దృష్ట్యా పలువురు వైసీపీ మహిళా నేతలు.. పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

Publish Date: Jun 24, 2026 11:41AM
వైసీపీలో ‘కాపు’ చిచ్చు.. వికటిస్తున్న జగన్ వ్యూహం!
వైసీపీలో ‘కాపు’ చిచ్చు.. వికటిస్తున్న జగన్ వ్యూహం!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలు వికటిస్తున్నాయా? ఆయన వ్యూహాల పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి పెచ్చరిల్లుతోందా? అన్న ప్రశ్నకు జరుగుతున్న పరిణామాలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాపు సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసేందుకు జగన్ అను సరిస్తున్న వ్యూహాలు వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలకు మింగుడుపడటం లేదు. ఇదే విధానంతో వ్యూహాలతో ముందుకు వెడితే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. ఈ విషయాన్ని పలువురు వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో గట్టిగా చెబుతున్నారు. ఇంత కాలం ఎస్సీలు, బీసీలు అంటూ వచ్చిన జగన్ ఇప్పుడు కాపు సామాజిక వర్గం విషయంలో అనుసరిస్తున్న విధానం.. పార్టీకి బీసీలనూ, ఎస్సీలనూ దూరం చేసే ప్రమాదం తీసుకువస్తున్నదని అంటున్నారు. అన్నిటికీ మించి.. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గాన్ని దూరం పెట్టి, ఇప్పుడు కాపు సామాజికవర్గాలనికి జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ పార్టీలో మొందలైంది. అధికారంలో ఉన్న సమయంలో కీలక పదవులు, ప్రాధాన్యత కలిగిన స్థానాల్లో సొంత వర్గానికి ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించలేదనే భావన మొదటి నుంచీ ఉంది. అయినప్పటికీ పార్టీ లైన్‌కు కట్టుబడి ఉన్న నేతలకు, తాజా రాజకీయ పరిణామాలు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం.. జగన్ సిద్ధం చేసిన ప్రణాళికల పట్ల వైసీపీలో అసంతృప్తి భగ్గుమంటోంది. రాజకీయంగా పట్టు సాధించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహం వల్ల ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు దూరం అయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వైసీపీ నాయకులలో వ్యక్తం అవుతోంది. దూరం జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకోవడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం కూటమి బలంగా ఉన్న నేపథ్యంలో.. కాపు సామాజికవర్గం వైసీపీ వైపు గంపగుత్తగా మొగ్గు చూపే అవకాశాలు దాదాపుగా లేవని అంటున్నారు. అసలు తొలి నుంచీ రాజకీయ వ్యూహల విషయంలో జగన్ విఫలమౌతున్నారని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నా బీసీలు అంటూ బీసీ పల్లవి అందుకున్న జగన్ అప్పట్లో కాపు సామాజికవర్గాన్ని పట్టించుకోలేదంటున్నారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంటూ.. సొంత పార్టీలోని కాపు నేతలతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయించడం వల్ల మిగతా సామాజిక వర్గాలు దూరమయ్యే ప్రమాదాన్ని జగన్ గుర్తించడం లేదని అంటున్నారు. అన్ని కులాలకూ సమప్రాధాన్యత ఇవ్వకుండా.. కుల రాజకీయాలను నమ్ముకుంటే మొదటికే మోసం రావడం తథ్యమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది.

Publish Date: Jun 22, 2026 1:58PM
క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి
క్యాన్సర్ బాధితుల పాలిట ఆశాకిరణం బసవతారకం ఆస్పత్రి

హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు.. సోమవారం రజతోత్సవాలకు హాజరు కానున్న సీఎం చంద్రబాబు.. క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ప్రారంభమైన బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న వారి జీవితాలు మధ్యలోనే ముగిసిపోకూడదన్న ఆలోచనతో బసవతారకం పేరుతో క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో రూపుదిద్దుకుంది ఈ సంస్థ. ప్రపంచ స్థాయి క్యాన్సర్ వైద్య సేవలను తక్కువ ఖర్చుతో, లాభాపేక్ష లేకుండా అందించాలన్న లక్ష్యంతో దివంగత నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో 1988లో ఈ కార్యక్రమానికి అంకురార్పణ జరిగింది. వైద్య రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, ప్రవాస భారతీయులు, దాతల సహకారంతో ట్రస్ట్ ఏర్పాటుకు పునాదులు పడగా, 2000 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా 100 పడకలతో ఆస్పత్రి ప్రారంభమైంది. అనంతరం సేవల విస్తరణకు అనుగుణంగా దశలవారీగా అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 650 పడకల సామర్థ్యంతో దేశంలోనే ప్రముఖ సమగ్ర క్యాన్సర్ చికిత్స, పరిశోధనా కేంద్రంగా ఎదిగింది. పేదల ఆస్పత్రి బసవ తారకం గత పాతికేళ్లుగా సేవాభావం, మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందిస్తూ బసవతారకం ఆస్పత్రి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది రోగులు బసవ తారకం ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రతేడాది 3 లక్షల మందికి పైగా అవుట్‌పేషెంట్లు, సుమారు 90 వేల మంది ఇన్‌పేషెంట్లకు ఆస్పత్రి సేవలందిస్తోంది. ఇప్పటివరకు 8 వేలకుపైగా క్యాన్సర్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగా, 86 బోన్ మ్యారో మార్పిడి చికిత్సలు నిర్వహించారు. క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రిని ఆశ్రయించే వారిలో 65 శాతం మందికిపైగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే ఉన్నారు. తక్కువ వ్యయంతో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడం వల్ల పేదల ఆస్పత్రిగా బసవతారకం పేరు పొందింది. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్–పీఎం జే (PM-JAY)తో పాటు ఇతర ప్రభుత్వ ఆరోగ్య పథకాల పరిధిలోని లబ్ధిదారులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. అత్యాధునిక క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడంలో ఆస్పత్రి ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. ప్రస్తుతం సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగాలతో పాటు రేడియాలజీ, పాథాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, మెడికల్ ఫిజిక్స్, పరిశోధన మరియు అభివృద్ధి విభాగాల్లో నైపుణ్యం కలిగిన వైద్యులు, సాంకేతిక నిపుణులు సేవలందిస్తున్నారు. సర్జికల్, మెడికల్, రేడియేషన్ ఆంకాలజీ రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన సుమారు 250 మంది వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు సేవలందిస్తున్నారు. స్క్రీనింగ్ బస్ ద్వారా గ్రామాల్లో క్యాన్సర్ బాధితులకు సేవలు తల, మెడ, రొమ్ము, సర్వికల్, ప్రొస్టేట్ క్యాన్సర్లతో పాటు వివిధ అవయవాలకు సంబంధించిన క్యాన్సర్లకు సమగ్ర చికిత్సలను ఈ ఆస్పత్రిలో అందిస్తున్నారు. క్యాన్సర్ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నొప్పి నివారణ, సంపూర్ణ సంరక్షణకు సేవలు అందించే ప్రత్యేక పాలియేటివ్ కేర్ యూనిట్‌ను ఆస్పత్రి నిర్వహిస్తోంది. చికిత్సతో పాటు బాధితులు, వారి కుటుంబ సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే చర్యలను చేపడుతోంది. క్యాన్సర్ నివారణకు ముందస్తు గుర్తింపు, విస్తృత స్థాయి స్క్రీనింగ్ కార్యక్రమాలు జాతీయ ప్రాధాన్యతగా మారాలన్న లక్ష్యంతో గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలను ఆస్పత్రి నిర్వహిస్తోంది. డిజిటల్ మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే సదుపాయాలు కలిగిన మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు ద్వారా వైద్య సేవలను ఆస్పత్రికే పరిమితం చేయకుండా గ్రామాలు, మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజల వద్దకే తీసుకెళ్తోంది. ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా ప్రాణాలను కాపాడాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైద్య సేవలతో పాటు మానవత్వం, కరుణ, సేవాభావాన్ని మేళవిస్తూ క్యాన్సర్ బాధితులకు అండగా నిలుస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, సేవా దృక్పథంతో కూడిన వైద్య రంగ సంస్థగా గుర్తింపు పొందింది. దాతృత్వం, వైద్య నిపుణుల ప్రతిభ, సమాజం వైపు నుంచి లభించే మద్దతు, ప్రభుత్వ ప్రజారోగ్య కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ క్యాన్సర్‌పై సమర్థవంతమైన పోరాటం చేయవచ్చని ఈ సంస్థ తన 25 ఏళ్ల ప్రస్థానంతో చాటిచెప్పింది. భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో సేవలను అందించాలన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించేలా బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రజతోత్సవాలను నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం చివరి కోరిక మేరకు బసవ తారకం ఆస్పత్రిని నందమూరి తారక రామారావు మొదలు పెట్టగా... ఆయన వారసుడు.. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్పత్రి నిర్వహణను పవిత్ర యజ్ఞంగా భావిస్తున్నారు. ఆస్పత్రి ఛైర్మన్, మేనేజింగ్ ట్రస్టీగా బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం ఆస్పత్రి పేదలకు మరిన్ని అత్యాధునిక సేవలను అందిస్తోంది. క్యాన్సర్ బాధితులకు అత్యాధునిక వైద్య సేవలను మానవత్వం, సేవాభావంతో అందిస్తూ దేశంలోనే గుర్తింపు పొందిన ఈ వైద్యసంస్థ రజతోత్సవ వేడుకలు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, వైద్య నిపుణులు, దాతలు, ఆస్పత్రి సేవలతో అనుబంధం కలిగిన అతిథులు హాజరు కానున్నారు.

Publish Date: Jun 21, 2026 4:40PM
పొత్తుకు, లొంగుబాటుకు ఇదీ తేడా!
పొత్తుకు, లొంగుబాటుకు ఇదీ తేడా!

ప్రస్తుత భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పొత్తుల పేరుతో తమ పార్టీల స్వయం ప్రతిపత్తిని హస్తిన కేంద్రంగా పని చేసే జాతీయ పార్టీలకు తాకట్టు పెట్టడం వల్లే ఉనికి కాపాడుకోగలమన్నట్లుగా పలు ప్రాంతీయ పార్టీల తీరు ఉంది. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్.. పొత్తుకు, లొంగుబాటుకు తేడా ఏంటో ప్రస్ఫుటంగా కనిపించేలా వ్యవహరించారు. తద్వారా తన, తన పార్టీ టీవీకే రాజకీయ వ్యక్తిత్వాన్ని చాటారు. సినీమా హీరో నుంచి రాజకీయనాయకుడిగా మారిన విజయ్.. తొలి ప్రయత్నంలోనే ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. అయితే.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉంటాననీ, అధికారం కోసం సిద్ధాంతాలను వదులుకునే రకం తాను కాదనీ చేతల ద్వారా చూపించారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఆ పార్టీ ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. పొత్తు అంటే కేవలం ఎన్నికల సర్దుబాటు మాత్రమేనని.. అది ఢిల్లీ నాయకత్వానికి లొంగిపోవడం కాదని ఆచరణలో చూపుతున్నారు. ఇంతకీ ఇంత పెద్ద ఉపోద్ఘాతమెందుకంటే.. తాజాగా తమిళనాడు అసెంబ్లీ వేదికగా సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేకేదాటు డ్యామ్ ప్రతిపాదనను విజయ్ వ్యతిరేకించారు. తమిళనాడుకు వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించే ఏ ప్రాజెక్టునైనా సహించేది లేదని ఆయన శాసనసభ వేదికగా కుండబద్దలు కొట్టారు. కర్ణాటకలో అధికారంలో ఉన్నది తమ కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీయే అయినప్పటికీ.. పొరుగు రాష్ట్ర నిర్ణయం వల్ల తమిళనాడు రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని చెప్పడం ద్వారా తనకు రాజకీయ అవసరాల కంటే తమిళనాడు ప్రయోజనాలే ముఖ్యమని చాటారు. మామూలుగా ఒక జాతీయ పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు, ఇతర రాష్ట్రాల్లోని అదే పార్టీ ప్రభుత్వంపై మాట్లాడటానికి ప్రాంతీయ నేతలు ముందు వెనుకలాడతారు. అయితే.. తమిళనాడు ముఖ్యమంత్రి.. రాజకీయ ప్రయోజనాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలే తనకైనా, తన పార్టీకైనా అత్యంత ప్రాధాన్యతా అంశాలను అసెంబ్లీ వేదికగా ఉద్ఘాటించారు. పొత్తులు పెట్టుకోవడం వేరు, లొంగిపోవడం వేరు అనే స్పష్టమైన సంకేతాన్ని విజయ్ తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారని పరిశీలకులు సైతం విజయ్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ చూపిన ఈ రాజకీయ పరిణితి, పొత్తు విచ్ఛిన్నమయ్యే ముప్పు ఉన్నా.. వెరవని సాహసంపై ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. పొత్తులో ఉంటూనే.. రాష్ట్ర హక్కుల కోసం రాజీ లేకుండా పోరాడే కొత్త ఒరవడికి విజయ్ శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు.

Publish Date: Jun 20, 2026 11:19AM
ఇప్పుడిక సమాజ్ వాదీ పార్టీ వంతు!
ఇప్పుడిక సమాజ్ వాదీ పార్టీ వంతు!

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి పార్లమెంటు ఉభయసభల్లోనూ మూడింట రెండు వంతుల మెజార్టీని సాధించడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధమైన ఆమోదం లభించాలంటే ఈ మెజార్టీ అత్యంత కీలకం. ఈ బిల్లును ఎలాగైనా గట్టెక్కించేందుకు వీలుగా విపక్ష ఇండియా కూటమిని బలహీనపరిచే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తున్నది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుమారు 20 మంది ఎంపీలు, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు తిరుగు బావుటా ఎగురవేసి స్పీకర్‌కు లేఖలు సమర్పించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది. మహారాష్ట్ర, బెంగాల్ తరహాలోనే త్వరలోనే సమాజ్‌వాదీ పార్టీలోనూ అతిపెద్ద చీలిక రాబోతోందనీ, ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, సీనియర్ నేతలు ఇప్పటికే బీజేపీ హైకమాండ్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నారంటూ ఓం ప్రకాష్ రాజ్‌భర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. పాత కేసుల ఉచ్చు బిగుస్తుండటంతో కొందరు ఎస్పీ ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ బాట పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే సమాజ్‌వాదీ పార్టీ ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించింది. మూడింట రెండు వంతుల మెజార్టీ కోసం ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ ఇలాంటి డ్రామాలకు తెరలేపిందని పేర్కొంది. అయితే.. చీలికల నుంచి తన పార్టీని కాపాడుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వై కేంద్రంతో నేరుగా ఘర్షణ పడే వైఖరిని పక్కనపెట్టి, తమ పార్టీ జోలికి రాకుండా ఉండేలా ఆయన ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు స్పష్టమైన సంకేతాలు పంపినట్లు రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాపై అఖిలేష్ యాదవ్ సభలో చాలా సానుకూలంగా స్పందించడాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. 50 శాతం సీట్ల పెంపు ఫార్ములాను అధికారికంగా డీలిమిటేషన్ బిల్లులో చేరిస్తే తాము ఖచ్చితంగా మద్దతు ఇస్తామని అఖిలేష్ సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ సక్సెస్ అయితే ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ సీట్ల పెంపు ఫార్ములాకు అఖిలేష్ కూడా ఆమోదం తెలపడంతో బీజేపీ హైకమాండ్‌కు ఆయన వైపు నుండి లైన్ క్లియర్ అయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఈ సీట్ల పెంపు ఫార్ములా ఒప్పందం గనుక కుదిరితే, సమాజ్‌వాదీ పార్టీని చీల్చాల్సిన అవసరం బీజేపీకి ఉండకపోవచ్చంటున్నారు. దీనివల్ల అఖిలేష్ యాదవ్ తన పార్టీని కాపాడుకుంటూనే, వ్యూహాత్మకంగా సేఫ్ జోన్‌లోకి వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకున్నారని చెబుతున్నారు.

Publish Date: Jun 18, 2026 3:47AM
అమరావతి.. సస్టైనబుల్ గ్లోబల్ సిటీ.. చంద్రబాబు విజన్ కు దర్పణం!
అమరావతి.. సస్టైనబుల్ గ్లోబల్ సిటీ.. చంద్రబాబు విజన్ కు దర్పణం!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చంద్రబాబు విజన్ కు దర్పణం పట్టేవిధంగా రూపుదిద్దుకుంటోంది. రాజధాని నగరం అమరావతి కేవలం భవనాల నగరం మాత్రమే కాదు.. ఈ మహానగరం అందరికీ కొత్త అనుభూతిని పంచే ఎక్స్‌పీరియన్స్ సిటీ గా రూపుదాల్చాలన్నదే చంద్రబావు విజన్. ఇటీవలి సింగపూర్ పర్యటన, అలాగే అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీని నిర్మించి.. హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ పటంలో నిలిపిన చంద్రబాబు.. ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఐటీ, గ్రీన్ ఎనర్జీ, ఏఐ, క్వాంటం వంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీల సమ్మేళనంగా అమరావతి రూపుదిద్దుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు. పర్యావరణ హితంగా ఉండేలా స్మార్ట్, బ్లూ అండ్ గ్రీన్ సిటీ కాన్సెప్ట్‌తో అమరావతి రూపుదిద్దుకుంటోంది. దేశవిదేశీ సంస్థలను, ప్రపంచస్థాయి విద్యాసంస్థలను ఇక్కడికి ఆకర్షించడం ద్వారా ఈ ప్రాంతాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా సీబీఎన్ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రతిష్టాత్మక నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్ యూఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ టాన్ ఎంగ్ చ్యేతో జరిపిన భేటీలో.. అమరావతిలో ఎన్‌యూఎస్, బ్రాంచ్ లేదా శాటిలైట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో ఉన్నత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ స్థాయి పరిశోధనలకు అమరావతిని వేదికగా మార్చాలని కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే..గతంలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న సింగపూర్ బృందం, మళ్లీ ఇప్పుడు రాజధాని నిర్మాణ పురోగతిని తెలుసుకుని ఇక్కడ తమ ఉనికిని చాటుకునేందుకు తహతహలాడుతోంది. అమరావతిని గ్లోబల్ హబ్‌గా మార్చే వ్యూహంలో అత్యంత కీలకమైన క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్.. భవిష్యత్ సాంకేతికత అయిన క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అమరావతి దేశంలోనే అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న చంద్రబాబు.. అందుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. క్వాంటమ్ వ్యాలీలో నిర్మించబోయే అద్భుతమైన ట్విన్ టవర్స్ ప్రాజెక్ట్ కోసం 1,208.41 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే సెక్రటేరియట్, అడ్మినిస్ట్రేటివ్ టవర్ల ఫాసాడ్, స్ట్రక్చరల్ పనుల కోసం రెండు వేల 540 కోట్ల రూపాయలు, అసెంబ్లీ భవన పనుల కోసం 798 కోట్ల రూపాయలు కేటాయించారు. కృష్ణా నదిపై పాతిక వందల కోట్లతో నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే.. బిట్స్ పిలానీ వంటి ప్రముఖ సంస్థలు 250 కోట్ల రూపాయల పెట్టుబడితో అమరావతి క్యాంపస్‌ను సిద్ధం చేస్తున్నాయి. 2027 నాటికి ఇక్కడ అడ్మిషన్లు ప్రారంభించి, దాదాపు పదివేల మంది విద్యార్థులకు క్వాంటమ్, ఏఐ విభాగాల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు. కేవలం విద్యారంగమే కాకుండా గ్యాస్, పవర్, వాటర్ సప్లై కోసం అండర్‌గ్రౌండ్ యుటిలిటీ డక్ట్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్స్ వంటి అధునాతన మౌలిక వసతులతో అమరావతి నిజమైన గ్లోబల్ ఎక్స్‌పీరియన్స్ సిటీగా అవతరించబోతున్నది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్ వేదికగా చంద్రబాబు.. ఎవరైతే సుదీర్ఘకాలం, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనుకుంటున్నారో.. వారు అమరావతికి రావాలి అంటూ పిలుపునిచ్చారు. కాలుష్య రహిత వాతావరణం, గ్రీన్-బ్లూ సిటీ కాన్సెప్ట్, అత్యాధునిక అండర్‌గ్రౌండ్ డక్ట్ సిస్టమ్స్ ద్వారా అమరావతిని గ్లోబల్ లెవన్ జీవన ప్రమాణాలతో రూపుదిద్దుకుంటోందంటే అది చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. ఈ క్రమంలో ఎన్నో ఆటంకాలు, మరెన్నో పొలిటికల్ చాలెంజెస్ ఎదురయ్యాయి. చంద్రబాబు పట్టుదల, అకుంఠిత దీక్ష, విజన్ తో వాటన్నిటినీ అధిగమించి.. దేశంలోనే తొట్ట తొలి సస్టైనబుల్ గ్లోబల్ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నారు.

Publish Date: Jun 16, 2026 2:14PM
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఎవరికి లాభం?
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఎవరికి లాభం?

దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి ఏకంగా 824కు పెంచాలని సిఫార్సు చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ బిల్లు సందర్భంగా స్థానాల సంఖ్యను 815గా అంచనా వేయగా, ఆర్థిక సలహా మండలి 824 చేయాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక సలహా మండలి తాజా నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు కీలక నియోజకవర్గాల రూపురేఖలు మారనున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలను మూడేసి కొత్త నియోజకవర్గాలుగా మార్చాలని, చేవెళ్ల స్థానాన్ని రెండుగా విభజించాలని స్పష్టం చేసింది ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. దాంతో ఏపీలో 25 ఎంపీ సీట్లు నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి పెరుగుతాయి. అందులో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ సెగ్మెంట్లను 3గా, చేవెళ్ల స్థానాన్ని 2గా విభజించాలని సూచించింది. ఆ ప్రకారం డిలిమిటేషన్ జరిగితే ఎవరికి లాభం అన్న చర్చ జరుగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన రిగితే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి నష్టం, అధికార కూటమికి లాభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరిగితే పట్టణ ప్రాంతాలు.. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర జిల్లాల్లో బీజేపీ లబ్ది పొందే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2009 ఎన్నికల ముందు జరిగిన డిలిమిటేషన్ సమయంలో కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరగకపోయినా నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారిపోయాయి. అనేక పాత నియోజకవర్గాలు రద్దయి, కొత్తవి ఏర్పడ్డాయి. ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి ఆధారంగా చాలా జనరల్ స్థానాలు రిజర్వ్‌డ్ స్థానాలుగా మారాయి. అది కలిసి వచ్చి ఏపీలో కాంగ్రెస్ రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఆ లెక్కలతోనే ఈ సారి నియోజకవర్గాల పెంపుతో ఎన్డీఏ కూటమికి ప్లస్ అవుతుందన్న విశ్లేషణలున్నాయి. అయితే ఏపీలో నియోజకవర్గాలపై ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదికతో వైసీపీకి లబ్ది చేకూరే అవకాశం ఉందంటున్నారు. నియోజకవర్గాల పెంపునకు పట్టణ, ఎస్సీ, ఎస్టీ, మహిళా జనాభాతో పాటు భాషా సమీకరణాలు, గత ఎన్నికల పోలింగ్ శాతాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించింది. ఏపీలో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గాలను మూడేసి స్థానాలుగా విడగొట్టాలని, మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని ప్రతిపాదించింది. వీటిలో రాజంపేట, కడప మినహా మిగిలిన చోట్ల ప్రస్తుతం కూటమి ఎంపీలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఈ 7 లోక్‌సభ స్థానాలను విడగొట్టి 20 చేయాలి. ఆ పెరిగే స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ నియోకవర్గాలు వైసీపీకి కలిసి వచ్చే అవకాశముంది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన 4 ఎంపీ స్థానాల్లో అరకు ఎస్టీ, తిరుపతి ఎస్సీ రిజర్వ్‌డ్ కావడం గమనార్హం. నియోజకవర్గాల పెంపుతో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆర్థిక సలహా మండలి సూచిస్తోంది. గత ఎన్నికల్లో 11 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లకు పరిమితమైన వైసీపీ దాదాపు 40 శాతం ఓటు షేరు దక్కించుకుంది. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుకు తోడు, సహజంగా ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత తోడైతే వైసీపీ ఓటు షేరు ఎంతోకొంత పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో వచ్చే ఎన్నికల్లో చట్టసభల్లో వైసీపీ బలం పెరిగే అవకాశాన్ని కొట్టిపారేయలేం అంటున్నారు. ఇటు తెలంగాణలో బీజేపీకి ఉన్న ఓటర్ల బలమంతా అర్బన్ ప్రాంతాల్లోనే. అంతో ఇంతో విద్యావంతులే మోడీ చరిష్మాకు ఆకర్షితులవుతున్నారు. ఆ బలంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకు పరిమితమైన బీజేపీ తెలంగాణలో ఏకంగా 8 లోక్‌సభ స్థానాలు దక్కించుకుంది. ఇక ఇఫ్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ , చేవెళ్ల లోక్‌సభ స్థానాలను విడగొట్టి 14 స్థానాలు చేయాలన్న ప్రతిపాదనలు తెరమీదకొచ్చాయి. వాటిలో హైదరాబాద్ మినహా మిగిలిన నాలుగు చోట్ల బీజేపీ ఎంపీలే గెలిచారు. ఇక ముందు నుంచి కాషాయపార్టీకి కొరకరాని కొయ్యగా మారిన హైదరాబాద్‌లో ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ సారి హైదరాబాద్‌ను మూడు లోక్‌సభ స్థానాలుగా మారిస్తే ఎంఐఎంను పరిమిత ప్రాంతానికి కట్టడి చేసి, బీజేపీ బలం పెంచుకునే అవకాశముందంటున్నారు. మరి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదనలు ఎంత వరకు అమల్లోకి వస్తాయో? నియోజకవర్గాల పెంపు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని ఏ రేంజ్లో ప్రభావితం చేస్తాయో? ఖచ్చితంగా తేలాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Publish Date: Jun 14, 2026 5:17PM
 జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు!
జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు!

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో ఇది ఒక సినిమాలో పాట.. ఇప్పుడీ పాట ప్రస్తావన ఎందుకంటే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. మెగా డీఎస్సీని తన హయాంలో ఇచ్చిన సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ తో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు, ఏపీలో తానే కాక్రోచ్ ని అవుతానన్న మాటలూ చూస్తుంటే... ఆయన రూటే సెపరేటు అని నెటిజనులు ఎద్దెవా చేస్తున్నారు. నలుగురికి అవసరమైనది కాకుండా, ఆయనకు ఏది తోస్తే అది చేస్తారనీ, ఎది అనిపిస్తే అది మాట్లాడతారని అంటున్నారు. 2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు. ఆయన మీడియా సమావేశంలో ప్రజా సమస్యలను ప్రస్తావించకుండా.. క్షేత్రస్థాయి వాస్తవాలకు పట్టించుకోకుండా.. ఆవు కథలాంటి ఊకదంపుడు ప్రసంగం చేసి చేతులు దులుపుకోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ పై ఈ సమావేశంలో జగన్ మోహన్ రెడ్డి పాత పల్లవినే వినిపించారు. ఇప్పటికే ఈ నియామకాలు పూర్తై.. అభ్యర్థులు విధుల్లో చేరినప్పటికీ.. పాతచింతకాయ పచ్చడి లాంటి ధోరణిలోనే జగన్ ఆరోపణలు గుప్పించడంపై సొంత పార్టీ నేతలలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఎందుకంటే డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించి గతంలో జగన్, వైసీపీ చేసిన ఆరోపణలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పబ్లిక్ డొమైన్‌లో సాక్ష్యాధారాలతో సహా స్పష్టమైన వివరణ ఇచ్చింది. అయినప్పటికీ జగన్ పాత ధోరణిలోనే తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా గతంలో చేసిన ఆరోపణలే మళ్లీ చేయడం గమనార్హం. ఇక జగన్ యువతను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలపై రాజకీయవర్గాలలోనే విస్మయం వ్యక్తం అవుతున్నది. నిరుద్యోగ యువత తిరగబడుతుందంటూ.. ఆయన "ఇది జెన్-జీ , జెన్-ఆల్ఫా, రాష్ట్రంలో కాక్రోచ్‌లు లేస్తాయి.. తాను కూడా కాక్రోచ్ నే అంటూ చేసిన వ్యాఖ్యలు ఆయనను నవ్వుల పాటు చేశాయి. నెటిజనులైతే జగన్ వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. జగన్ కాక్రోచ్ అయితే జనం ‘హిట్’ అవుతారు అంటూ బొద్దింకలను హిట్ నిర్మూలించినట్లే.. జనం జగన్ ను ఛీ కొడతారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అన్నిటికీ మించి రాజకీయవర్గాలలో జగన్ పరిపక్వతపైనే సందేహాలు వ్యక్తమయ్యేలా ఆయన కాక్రోచ్ వ్యాఖ్యలు ఉన్నాయి. వ్యవస్థలపై కనీస అవగాహన లేకుండా.. కేవలం ప్రభుత్వాన్ని దూషించడమే పరమావధిగా పెట్టుకుంటే.. జగన్ ను జనం మరింత దూరం పెట్టడం ఖాయమని పరిశీలుకులు అంటున్నారు. తన ఐదేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలురపాలనలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికే పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అప్పట్లో అధినేత విధానాలను గుడ్డిగా సమర్థించిన కీలక నేతలు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పార్టీ నుంచి ముఖ్య నేతలు వరుసగా వలసలు పోతుంటే, ఉన్నవారైనా వాస్తవ పరిస్థితులను అధినేతకు వివరించే ధైర్యం చేయలేకపోతున్నారు. తప్పులను తెలుసుకుని సరిదిద్దుకునే నైజం ఆ పార్టీ లీడర్‌షిప్‌లో లోపించిందనే అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. తాజా ప్రెస్‌మీట్‌తో వైసీపీ శ్రేణులకు మరియు మిగిలిన నాయకులకు తమ భవిష్యత్తుపై ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంకా ఇదే పంథాను నమ్ముకుని వెళ్తే రాజకీయంగా మరింత నష్టపోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమవుతున్న వైఖరిని గమనించిన తర్వాత, సొంత పార్టీ నేతల్లోనే అంతర్మథనం మొదలైనట్లు సమాచారం. తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పటికైనా ఒక నిశ్చయానికి రావడం మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ తరహా రాజకీయ వ్యూహాలు వైసీపీకి ఎంతవరకు నష్టం చేకూరుస్తాయో వేచి చూడాలి. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా కాకుండా, కేవలం ఊహాజనిత ఆరోపణలతో కాలం గడిపితే ప్రజల్లో ఉన్న కనీస ఆదరణ కూడా కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలోనైనా వైసీపీ అధినాయకత్వం ప్రజా క్షేత్రంలోని వాస్తవాలను గ్రహించి ప్రవర్తిస్తుందా లేదా అనే అంశంపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు పరిశీలకులు.

Publish Date: Jun 13, 2026 9:56AM
 మద్యం కుంభకోణం ప్రభావం.. జగన్ పాదయాత్ర 2.o అంత వీజీ కాదా?
మద్యం కుంభకోణం ప్రభావం.. జగన్ పాదయాత్ర 2.o అంత వీజీ కాదా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వచ్చే ఏడాది సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. 2019 ఎన్నికలలో తన ఘన విజయానికి పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమవ్వడమే కారణమని భావిస్తున్న ఆయన మరో సారి అదే వ్యూహంతో ముందుకు వెళ్లలని నిర్ణయించుకున్నారు. అయితే.. ఆయన పాదయాత్ర 2.o అంత వీజీ కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగం పుంజుకోవడంతో జగన్ కు చిక్కులు తప్పవన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో గట్టిగా వ్యక్తం అవుతోంది. వాస్తవానికి కొన్ని రోజుల క్రితం వరకూ వైసీపీ అసలు రాష్ట్రంలో మద్యం కుంభకోణమే జరగలేదని చెబుతూ వచ్చారు. అయితే మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ మద్యం కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించి, వైఎస్ జగన్‌ పీఏగా పనిచేసిన కేఎన్ఆర్ నుంచి వైసీపీ ప్రధాన కార్యాలయంలో పనిచేసే అటెండర్ మనోహర్ వరకు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా విచారించింది. ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నట్లుగా దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. మనీ ల్యాండరింగ్ ఆరోపణలతో ఈడీ కూడా రంగంలోకి దిగడంతో ఇక ఇహనో, ఇప్పుడో ఈ కేసులో దర్యాప్తు సంస్థల విచారణకు హాజరు కాక తప్పని పరిస్థితి ఎదురౌతుందని అంటున్నారు. జగన్ మాజీ పీఏ కేఎన్ఆర్ ఆస్తులు, ఆయన విదేశాలకు తరలించినట్లుగా భావిస్తున్న భారీ నిధులు, ఆ లావాదేవీల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై ఈడీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్థిక లావాదేవీల చెయిన్.. జగన్ చుట్టూ తిరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే అంశంపై రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న రోజుల్లో జగన్ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలే మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే.. ఇప్పటికే ప్రకటించినట్లుగా పాదయాత్ర చేపట్టే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయంటున్నారు. ఒకవేళ కేసుల తీవ్రత పెరిగి, చట్టపరమైన చర్యలు గనుక ముమ్మరమైతే అది ఆయన రాజకీయ పర్యటనలకు, ప్రజాక్షేత్రంలో తిరగడానికి ప్రతిబంధకంగా మారే అవకాశం ఉందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. కోర్టులు, విచారణలు, ఈడీ, సిట్ అధికారుల ఎదుట హాజరుకావడం వంటి వాటితో ఆయన పాదయాత్ర చేపట్టడం అంత వీజీకాని పరిశీలకులు అంటున్నారు.

Publish Date: Jun 11, 2026 11:41AM
TeluguOne Picks For You
rss-imgRss Feeds