చంద్రబాబుతో పిఠాపురం వర్మ భేటీ.. నామినేటెడ్ పోస్టు ఖాయమేనా?

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించడం వెనుక ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ త్యాగం, కృషి, పట్టుదల ఉన్నాయనడంలో ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. పైగా పిఠాపురంలో తన విజయానికి సర్వశక్తులూ ఒడ్డి శ్రమించిన వర్మను విజయం తరువాత స్వయంగా పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా వర్మ త్యాగాన్ని, కృషిని గుర్తించారు. సరైన న్యాయం చేస్తానని హామీ కూడా ఇచ్చారు.  నిజమే గత ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి కూటమి అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేయాలని నిర్ణయించినప్పుడు, ఆ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయాలని ఆశించి గత ఐదేళ్లుగా నియోజకవర్గంలోనే పని చేస్తూ వస్తున్న వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన అభిమానులైతే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేశారు. సరిగ్గా ఆ సమయంలో చంద్రబాబు జోక్యం చేసుకుని వర్మను ఉండవల్లి పిలిపించుకుని మాట్లాడారు. కూటమి అవసరాలు వివరించారు. సమన్వయంతో పని చేసి పవన్ కల్యాణ్ విజయానికి దోహదపడమని ఆదేశించారు. దీంతో క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తలా వర్మ ఆ క్షణం నుంచీ పవన్ కల్యాణ్ విజయమే లక్ష్యంగా పని చేశారు. దీంతో పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో ఇటు చంద్రబాబు, అటు పవన్ కల్యాణ్ కూడా వర్మను ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ్ అయితే వర్మకు అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చారు. కానీ క్రమంగా పరిస్థితిలో మార్పు వచ్చింది.  జనసేన మద్దతు దారులతో వర్మకు గ్యాప్ ఏర్పడింది. తన నాయకుడి ఘన విజయం క్రెడిట్ లో కొంతైనా వర్మకు ఇచ్చుందుకు ఇష్టం లేకపోవడమో మరో కారణమో తెలియదు కానీ నియోజకవర్గంలో వర్మను క్రమంగా దూరం పెట్టడం మొదలైంది. అంతే కాకుండా నియోజకవర్గంలో ఆయన వ్యతిరేకులైన వైసీపీ వారిని జనసేనలో చేర్చుకున్నారు. ఇది సహజంగానే వర్మకు ఒకింత ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో వర్మ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు.  గత ఏడాది జరిగిన ఎన్నికల సమయంలో చంద్రబాబు వర్మకు ప్రధాన్యమున్న పోస్టులోకి తీసుకుం టానని హామీ ఇచ్చినట్లు చెబుతారు. ఇప్పుడు చంద్రబాబుతో వర్మ భేటీ ఈ నేపథ్యంలోనే ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీకి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అటువంటి తరుణంలో వర్మ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  
Publish Date: Feb 6, 2025 2:30PM

మటంపల్లిలో ఇనుప యుగపు ఆనవాళ్లు

క్రీ.పూ.1000 ఏళ్లనాటి నిలువురాయి కాపాడుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరెడ్డి సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌ మండలం, మటంపల్లిలో ఇనుపయుగపు ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. కొత్త తెలంగాణా చరిత్ర బృందం సభ్యులు, అహోబిలం కరుణాకర్‌, నసీరుద్దీన్‌, చంటి ఇచ్చిన సమాచారం మేరకు గురువారం నాడు, ఆయన మటంపల్లి పాత శివాలయం దారిలో రోడ్డు పక్కనే ఉన్న 12 అడుగల ఎత్తు, 5 అడుగల వెడల్పు, 6 అంగుళాల మందం ఉన్న నిలువురాయి (స్మారకశిల)ని క్షుణ్ణంగా పరిశీలించి మటంపల్లి క్రీ.పూ.1000 ఏళ్ల నాటి ఇనుపయుగపు స్థావరమని చెప్పారు. ఆకాలంలో మరణించిన వారిని ఒక గుంటలో పూడ్చి, పైన మట్టితో కప్పి, గుర్తుగా ఒక స్మారక శిలను నిలిపే ఆచారముండేదని, అందులో భాగంగానే ఈ నిలువురాతిని ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పారు. పురావస్తు, చారిత్రక ప్రాధాన్యతగల ఈ నిలువురాయిని కాపాడుకోవాలని మటంపల్లి గ్రామస్థులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సహకరించిన హుజూర్‌నగర్‌ బార్‌కౌన్సిల్‌ అధ్యక్షులు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్‌ సాముల రామిరెడ్డికి శివనాగిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Publish Date: Feb 6, 2025 2:09PM

అయినా మనిషి మారలేదు అతని తీరు మారలేదు!

సీతయ్య అనే సినిమాకు ఓ ట్యాగ్ లైన్ ఉంది. అదేమిటంటే ఎవరి మాటా వినడు అని. ఆ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ ఎంత వరకూ యాప్ట్ అన్నది పక్కన పెడితే.. ఎవడి మాటా వినడు అన్న ట్యాగ్ లైన్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతికి నట్లు సరిపోతుంది. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చెలాయించిన జగన్ తన అరాచక పాలన ద్వారా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చేలా చేశారు. అందుకే గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం ఆయనకు నీ సేవలించ చాలు జగన్ బాబూ అని పక్కన పెట్టేశారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కనంత ఘోరంగా ఓడించి   నీకు మా తరఫున మాట్లాడే అర్హత కూడా లేదు అని  ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు చెప్పకనే చెప్పారు. అయినా ఆ విషయం అర్ధం చేసుకోలేని జగన్ జనం కోరుకున్నదే చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. ప్రజల తరఫున తాను మాట్లాడనని భీష్మించారు.  జగన్ పార్టీ ఘోర పరాజయం పాలై ఎనిమిది నెలలు గడిచింది. ఇప్పటికీ జగన్ కు ప్రజలను తనను ఎందుకు ఓడించారో అర్ధం కాలేదు. ఎవరైనా చెప్పబోయినా ఆయన ఎవరి మాటా వినరాయె. అందుకే ఆయన తీరిక దొరికినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా ఎవరైనా సరే ఆయన మాట్లాడింది వినాల్సిందే.. వేరే వారు ఎవరైనా మాట్లాడితే ఆయన వినరు. ఇప్పుడు తాజాగా గురువారం (ఫిబ్రవరి 6) ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా కాలం తరువాత తొలి సారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం అంటే పొరబడతారేమో.. జగన్ తాను ఏర్పాటు చేసే మీడియా సమావేశానికి తనకు అనుకూల మీడియాను మాత్రమే ఆహ్వానిస్తారు. ఆ ప్రెస్ మీట్ కు వచ్చన వారంతా ఆయన చెప్పింది విని రాసుకుపోవడం తప్ప మాట్లాడడానికీ, ప్రశ్నలు అడగడానికి ఇసుమంతైనా అవకాశం ఉండదు. గురువారం కూడా జగన్ అలాంటి ప్రెస్ మీట్ లోనే దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు.  ఈ రెండు గంటల ప్రసంగం కూడా సింగిల్ పాయింట్ ఎజెండా కేంద్రంగానే సాగింది. మళ్లీ ప్రసంగం అంటే ఆశువుగా తాను చెప్పదలచుకున్నది చెప్పేశారనుకునేరు. కాదు కాదు. రాసుకొచ్చిన లేదా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను ఆయన చదివారు. ఆ స్క్రిప్ట్ మొత్తం తన ఐదేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించే ఉంది. తాను బటన్ నొక్కి పందేరం చేసిన సొమ్ముల గురించే చెప్పుకున్నారు. పనిలో పనిగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గొప్పగా సంక్షేమం అమలు చేశాననీ, చంద్రబాబు సర్కార్ సంక్షేమాన్ని మూలన పడేసిందన్నదే ఆయన రెండు గంటల ప్రసంగ సారాంశం.  మరి అంత గొప్పగా సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్ ప్రభుత్వాన్ని జనం ఎందుకంత ఘోరంగా ఓడించారు? ఈ ప్రశ్న ఆ మీడియా మీట్ కు హాజరైన వారెవరూ అడలేదు. అడిగినా ఉపయోగం లేదని వారికి తెలుసు. కనీసం జగన్ కి అయినా ఈ ఎనిమిది నెలల కాలంలో ఆ సందేహం వచ్చిన దాఖలాలు లేవు.  వాస్తవమేమిటంటే కేవలం ఉచితాలను అందించి అదే సంక్షేమం, అభివృద్ధి అంటే జనం ఆమోదించరనీ, అంగీకరించరనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ కు తమ తీర్పుతో విస్పష్టంగా చెప్పారు. కానీ ఆ విషయం అర్ధం చేసుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన ఎవరి మాటా వినరు మరి. ఇక విషయానికి వస్తే జగన్ కు పరిపాలన అంటే బటన్ నొక్కడం మాత్రమే. అదొక్కటే సరిపోదని ప్రజలిచ్చిన తీర్పును ఆయన పట్టించుకోరు. తనలా చంద్రబాబు బటన్ లు ఎందుకు నొక్కడం లేదని మాత్రం ప్రశ్నిస్తారు. ఆయన ఇదే తీరులో కొనసాగితే మాత్రం 2024లో ఎదురైన ఘోర పరాభవ పరాజయాన్ని మించిన ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఆయన ఆ దిశగానే ముందుకు సాగుతున్నారనడానికి ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీ ఎందకు మీడియా ఉందిగా అన్న ఆయన మాటలే తార్కానం. ఈ మీడియా సమావేశం ద్వారా భవిష్యత్ లో కూడా తాను అసెంబ్లీకి హాజరు కాబోనన్న స్పష్టత ఇచ్చారు. తానే కాదు తన పార్టీ ఎమ్మెల్యేలెవరూ అసెంబ్లీకి హాజరు కారన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు.  అంతే జగన్ ఎవరి మాటా వినరు.  అంతే కాదు.. ఎన్ని పరాభవాలెదురైనా మారరు. అంతే జగన్ అంటే అంతే మరి.
Publish Date: Feb 6, 2025 1:13PM

మద్యం అక్రమాలపై దర్యాప్తునకు సిట్.. ఏపీ సర్కార్ నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుండి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి నగదు లావాదేవీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై దర్యాప్తునకు తెలుగుదేశం కూటమి సిట్ ను ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులతో ప్రభుత్వం సిట్‌ను నియమిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది. నగదు లావాదేవీల్లో అక్రమాలతో పాటు హోలోగ్రామ్‍‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలపై కూడా ఈ సిట్ దర్యాప్తు చేస్తుంది.  జగన్ హయాంలో మద్యం అమ్మకాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిట్ కు అందజేయాలని ఎక్సైజ్ శాఖకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.  ఇక సిట్ తన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను ప్రతి 15 రోజులకు   ప్రభుత్వానికి నివేదిక  ఇవ్వాల్సి ఉంటుంది.  సీఐడీ డీఐజీ  నేతృత్వంలో  పని చేసే ఈ సిట్ బృందంలో.    ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ ఎస్పీ సుబ్బారాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శివాజీ సభ్యులుగా ఉన్నారు. 
Publish Date: Feb 6, 2025 1:11PM

బ్బా..బ్బా అంటున్న జగన్.. జోలె ఒక్కటే తక్కువ!

అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లూ   ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించిన వైసీపీ అధినేత, మాజీ  ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఓటు ద్వారా గ‌ట్టి షాకిచ్చారు. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా  కూడా ఇవ్వ‌లేదు. దీంతో దారుణ ఓట‌మిని జీర్ణించుకోలేని జ‌గ‌న్‌.. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ప్ర‌జ‌ల‌పై ఆక్రోశాన్ని వెల్ల‌గ‌క్కుతున్నారు. నెల‌నెలా డ‌బ్బులు ఇచ్చా.. అయినా నాకు ఓటు వేయ‌లేదంటూ ప్ర‌జ‌ల‌పై నింద‌లు మోపుతూ శాప‌నార్దాలు సైతం పెట్టాడు. దారుణంగా ఓడిపోయినా బుద్దిరాక‌పోవ‌టంతో వైసీపీ నేత‌లుసైతం జ‌గ‌న్‌ తీరును జీర్ణించుకోలేక దూరం జరుగుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు కీల‌క నేత‌లు ఆ పార్టీని వీడి టీడీపీ, జ‌న‌సేన పార్టీల్లో చేరిపోయారు. విజ‌య‌ సాయిరెడ్డి, మ‌రి కొంద‌రు నేత‌లు వైసీపీకి రాజీనామా చేసి జ‌గ‌న్ వింత చేష్ట‌ల‌ను భ‌రించ‌లేమంటూ దూర‌మైపోయారు. ఇంకొందరు కూడా నేత‌లుసైతం రాజీనామా బాట ప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.  ఈ పరిస్థితుల్లో వైసీపీ మరో ఏడాదిలోనే ఉనికి మాత్రంగా కూడా లేకుండా పూర్తిస్థాయిలో నిర్వీర్యం అవుతుంద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ‌తుకుతుంది. మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు. అలా ఆయన చెప్పడం మీరెవ‌రూ పార్టీని వీడ‌కండి అంటూ  నేతలను, కార్యకర్తలను ప్రాధేయ పడుతు న్నట్లుగా కనిపించింది. అదే స‌మ‌యంలో  త‌న సైకోయిజాన్ని జగన్ మళ్లీ బయటపెట్టుకున్నారు.  ఈ సారి 30 ఏళ్ల పాటు వైసీపీ రాష్ట్రాన్ని ఏలుతుంది.. ఈసారి జ‌గ‌న్‌ 2.0ను చూస్తారంటూ చెప్పుకొచ్చారు. ఐదేళ్లే భరించ లేకపోయిన జనం జగన్ కు మళ్లీ అధికారం అప్పగిస్తారా? 30 ఏళ్ల పాటు ఆయన అరాచకాలను భరిస్తారా? అంటూ వైసీపీ నేతలే సెటైర్లు వేసేలా జగన్ ప్రసంగం సాగింది.  జ‌గ‌న్ ద్వంద వైఖ‌రి ప‌ట్ల వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చింత చచ్చినా పులుపు చావ‌లేద‌న్న‌ట్లుగా జ‌గ‌న్ తీరు ఉంద‌ని.. వైసీపీలో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని వైసీపీ నేతలే అంతర్గత సంభాషణల్లో చర్చించుకుంటున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్ధలోని వైసీపీ కార్పొరేటర్లు  ముఖ్య నాయకులతో జగన్ సమావేశమైన సందర్భంగా జగన్ ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   ఒక‌వైపు వైసీపీ చచ్చిపోతోందంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తూనే.. మ‌రో వైపు 30ఏళ్లు మ‌నం ఈ రాష్ట్రాన్ని పాలిస్తామంటూ వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను అయోమ‌యానికి గురిచేశారు. జ‌గ‌న్ ప్ర‌సంగాన్ని విన్న ఆ పార్టీ నేత‌లు.. ఈయన ఇక మారడు బాబోయ్ అని తలలు పట్టుకునే పరిస్థితికి వచ్చారు.  అంతే కాదు.. ఇన్నాళ్లు కేవ‌లం ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేశా.. ఇప్పుడు జగన్ 2.0ను చూస్తారు. ఈసారి కార్యకర్తల కోసం జగన్‌ ఏం చేస్తాడో చూపిస్తా.. గతంలో పార్టీ శ్రేణులకు ప్రాధాన్యత ఇవ్వ లేకపోయానంటూ  జగన్ చేసిన వ్యాఖ్యలతో ఆయనలో అయోమయం ఏ స్థాయిలో ఉందో అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  గత ఐదేళ్లలో జగన్ ప్రజల కోసం చేసిందేమీ లేదన్నది ఆయన పార్టీకి గత ఎన్నికలలో దక్కిన ఘోర ఓటమే నిర్ద్వంద్వంగా తేల్చేసింది. ఇప్పుడు ఆయన కొత్తగా చెప్పిందేమిటంటే.. తాను ప్రజలనే కాదు పార్టీ క్యాడర్ ను కూడా పట్టించుకోలేదని మాత్రమే. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే మరో మారు గెలిపిస్తే 30 ఏళ్ల పాటు ప్రజలను పట్టించుకోను అని మాత్రమే.    నిజంగా ఐదేళ్ల తన పాలనలో జగన్  ప్ర‌జ‌ల‌కు మంచి చేసిఉంటే వైసీపీ ఇప్పుడు అధికారం కోల్పో యేదా..? అధికారం దేవుడెరుగు.. కేవ‌లం 11 సీట్ల‌కే ప‌డిపోయేదా.. 175 సీట్ల‌లో గెలుస్తామంటూ ఎన్నిక‌ల ముందు ప‌దేప‌దే చెప్పిన జ‌గ‌న్‌.. కేవ‌లం 11 స్థానాల‌కే ఎందుకు ప‌డిపోవాల్సి వ‌చ్చింది..? ఇలాంటి విష‌యాల‌పై జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికీ ఆలోచన చేయకపోవడంతో వైసీపీ నేతలు తమ దారి తాము చూసుకోవడం మంచిదన్న భావనలోకి వచ్చేశారు.   రాజ‌కీయాల్లో గెలుపోట‌ములు స‌హ‌జం. అందుకు ఏ పార్టీ అతీతం కాదు. కానీ, ఓడిపోయిన త‌రువాత పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను ఒకేతాటిపైకి తెచ్చి ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంకోసం ప్ర‌భుత్వంపై  పోరాటం చేయాలి.  ఆ బాధ్య‌త‌ను పార్టీ అధినేత తీసుకోవాలి. గ‌తంలో టీడీపీ ఓడిపోయిన ప్రతిసారీ చంద్రబాబు అదే చేశారు. ఆయన ఎన్నడూ ఎప్పుడూ ప్ర‌జ‌లు న‌న్ను ఓడించార‌ని వారిపై నింద‌లు వేయ‌లేదు. వాస్త‌వంగా చెప్పాలంటే.. ప్ర‌జ‌ల జీవన ప్రమాణాలు పెంచేందుకు  చంద్ర‌బాబు అనేక అద్భుత‌ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. చంద్ర‌బాబు చేసిన పాల‌న‌కు ప్ర‌జ‌లు టీడీపీని ఒక్క‌సారికూడా ఓడించ‌ కూడ‌దు. కానీ, రాజ‌కీయాల్లో గెలుపోట‌ముల అనివార్యం. జ‌గ‌న్ ఆ విష‌యాన్ని ఇప్ప‌టికీ గ‌మ‌నించ‌క పోవ‌టమే  వైసీపీ వేగంగా ప‌త‌నం కావ‌టానికి కార‌ణంగా మారుతోంది. అధికారం కోల్పోయి ఏడు నెల‌లు అవుతున్నా.. జ‌గ‌న్ మాత్రం ప్ర‌జ‌ల‌పై నింద‌లు వేస్తూ ఐదేళ్లు తాను సుపరిపాలన అందించినా జనం తనను ఓడించారని చెబుతూ ఆత్మవంచన చేసుకుంటున్నారు.   త‌ద్వారా పార్టీని మ‌రింత ప‌త‌కానికి తీసుకెళ్తున్నారు. జ‌గ‌న్ తీరుతో వైసీపీ నేత‌లు కూడా విసుగు చెందుతున్నారు. ఇప్ప‌టికే ఏపీ ప్ర‌జ‌లు వైసీపీ అంటేనే ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. ఎందుకంటే జ‌గ‌న్ పాల‌న‌లో వైసీపీ నేత‌ల అరాచ‌కం ఆ స్థాయిలో కొన‌సాగింది. జ‌గ‌న్  తానుఅధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పార్టీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను క‌లిసేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌లేదు. బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొనేందుకు వ‌చ్చిన స‌మ‌యంలోనూ రోడ్డుకు ఇరువైపులా ప‌ర‌దాలు క‌ట్టుకొని వెళ్లారు. జనం ముఖం చూడటమే ఇష్టం లేదన్నట్లు వ్యవహరించారు. అటువంటి జగన్ కు ఇప్పుడు  ఉన్న‌ట్లుండి పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై ఎక్కడ లేని ప్రేమా పుట్టుకొచ్చింది.  ఇందుకు కారణం లేకపోలేదు.. అక్రమాస్తుల కేసులో  త్వ‌ర‌లో జైలుకు వెళ్లాల్సి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భావిస్తున్నారు. గతంలో జైలుకు వెళ్లిన సమయంలో జగన్ పట్ల సానుభూతి వ్యక్తం అయ్యింది. ఆయనకు పెద్ద సంఖ్యలో పార్టీ వర్గాలూ, ప్రజలూ అండగా నిలిచారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.  పార్టీని కీలక నేతలు వీడిపోయారు. ప్రజలలోనూ పార్టీ పట్ల ఆదరణ లేదు. తన పట్ల సానుభూతి లేదు. ఈ పరిస్థితుల్లో తాను అరెస్టైతే కనీసం నిరసన తెలపడానికి కూడా ఎవరూ ఉండరు. అందుకే పార్టీ నేతలూ, కార్యకర్తలను ఆయన పార్టీ వీడొద్దని బతిమలాడుకుంటున్నారు. మద్దతు కోరుతున్నారు. తన వెంట నిలబడాలని ప్రాధేయపడుతున్నారు. అయితే ఆయన ఎంత బతిమలాడుకున్నా  వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు మాత్రం ఈసారి జ‌గ‌న్‌ కోసం నిలబడే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Feb 6, 2025 11:48AM

అన్నాన్ని ఇలా వండి తీసుకుంటే బ్లడ్ షుగర్ పెరగదు..!

  అన్నం భారతీయుల ప్రధాన ఆహారం. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో  అన్నం లేకపోతే తిన్నట్టు ఉండదని అంటుంటారు. అయితే అన్నం తినడం వల్ల  బ్లడ్ షుగర్ పెరుగుతుందని అంటారు.  అన్నంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఈ కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని అంటారు. ఇందుకే మధుమేహం ఉన్నవారు అన్నానికి దూరం ఉండటం మంచిదని అంటారు. అయితే అన్నాన్ని కింది పద్దతిలో వండుకుని తింటే చక్కెర స్థాయిలు పెరగవు.  అదెలాగో తెలుసుకుంటే..  బియ్యాన్ని బాగా కడగాలి.. అన్నాన్ని వండటానికి  ముందు బియ్యాన్ని బాగా కడగాలి. కనీసం 3 నుండి 4 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడగడం వల్ల బియ్యం మీద ఉన్న దుమ్ము, ధూళి పోవడమే కాదు.. బియ్యానికి అంటుకుని ఉండే ముతక పదార్థం వదిలిపోతుంది. బియ్యాన్ని వండటానికి నీరు పోసి అందులో నాలుగైదు లవంగాలు వేయాలి.  నీళ్ళు బాగా మరిగించాలి.  నీరు మరుగుతున్నప్పుడు అందులో బియ్యం వేయాలి. ఇలా నీటిలో బియ్యం వేసినప్పుడు పైన నురుగు వస్తుంది.  ఈ నురుగును తొలగించాలి.  స్టవ్ ఆప్ చేసి బియ్యంలో నీటిని వంపేయాలని.  ఇలాఒంపేసిన తరువాత వేరే నీటితో బియ్యాన్ని మళ్లీ కడగాలి.  ఇలా చేయడం వల్ల బియ్యంలో కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయట. బియ్యంలో సాధారణంగానే గ్లైసెమిక్ ఇండెక్స్  ఎక్కువగా ఉంటుంది.  కాబట్టి మధుమేహం ఉన్నవారు అన్నాన్ని ఏ పద్దతిలో వండినా కార్బోహైడ్రేట్స్,  గ్లూకోజ్ శరీరంలోకి వెళతాయి.  ఇందుకే మధుమేహం ఉన్నవారు అన్నం తినే విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. పై పద్దతిలో బ్లడ్ షుగర్ పెరగకపోయినా మరీ అతిగా అన్నం తినడం ప్రమాదమే.. ముఖ్యంగా అన్నం,  బంగాళదుంపలు మధుమేహాన్ని చాలా తొందరగా పెంచుతాయి. అన్నం, బంగాళదుంపల కాంబినేషన్ అస్సలు తినకపోవడం మంచిది.                                                   *రూపశ్రీ
Publish Date: Feb 6, 2025 9:30AM