ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ గా స్మితా సభర్వాల్

   తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పర్యాటక సెక్రటరీ స్మితా సభర్వాల్‌ను ఫైనాన్స్ క‌మిష‌న్ మెంబ‌ర్ సెక్ర‌ట‌రీగా స్మితా స‌బ‌ర్వాల్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. గుడ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌గా శశాంక్ గోయెల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్. వెంకట్ రావు, కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్, ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంక, జెన్‌కో సీఎండీగా హరీష్, హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, పరిశ్రమలు, పెట్టుబడుల సీఈవోగా జయేశ్ రంజన్, హెచ్‌ఎండీఏ సెక్రటరీగా ఇలంబర్తిలను నియమించారు. కంచ గ‌చ్చిబౌలి భూముల విష‌యంలో మార్ఫింగ్ చేసిన ఫొటోను రీ ట్వీట్ చేసిన స్మితా స‌బర్వాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ నోటీసులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.
ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ గా స్మితా సభర్వాల్ Publish Date: Apr 27, 2025 8:19PM

రాసిపెట్టుకోండి మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే..కేసీఆర్ దీమా

  హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్‌ రజతోత్సవ సభ వైభవంగా ప్రారంభమైంది. ముందుగా జమ్మూకశ్మీర్‌లోని పెహల్గాం ఉగ్రదాడి మృతులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కన్నతల్లి, జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు. వరంగల్ మామూలు నేల కాదు.. ఎంతోమంది వీరుల్ని కన్న గడ్డ అని చెప్పారు. ఇవాళ ఈ గడ్డ మీద బీఆర్ఎస్ సభ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు. ఆ నాడు గులాబీ జెండాను ఎంతోమంది అవమానించారని చెప్పారు. కానీ ఎనాడూ నిరాశ చెందలేదని.. నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామని అన్నారు.  వ‌ల‌స‌వాదుల విష‌కౌగిలిలో న‌లిగిపోతున్న‌టువంటి తెలంగాణను ఎట్టి ప‌రిస్థితుల్లో విముక్తి చేయాల‌ని స్వ‌రాష్ట్రం సాధించాల‌ని, జ‌న‌నీని, జ‌న్మ‌భూమిని మించింది లేద‌ని చెప్పి నేను ఒక్క‌డిగా బ‌య‌ల్దేరి తెలంగాణ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టాను. 25 ఏండ్ల క్రితం ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది అవ‌మాన‌ప‌రిచారు.  ఎన్నో మాట‌లు అన్నారు. ఎగ‌తాళి, అవ‌హేళ‌న చేశారు. మఖ‌లో పుట్టింది పుబ్బ‌లో పోత‌ద‌ని అన్నారు. కానీ అనేక మంది త్యాగాల‌తోని, వంద‌లాది మంది బ‌లిదానాల‌తోని, అనేక ఉద్య‌మాల‌తోని యావ‌త్ తెలంగాణ అద్భుత‌మైన ఉద్య‌మమై ఎగిసిప‌డింది. ఒక స‌మ‌యంలో తెలంగాణ యావ‌త్ ఒక ప‌క్క‌న నిల్చుని బ‌రిగీసి నా తెలంగాణ అక్క‌డ పెట్టు అని నిల‌బ‌డ్డ‌ సంద‌ర్భం సృష్టించాం. తెలంగాణ‌ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, కంటి వెలుగు కార్యక్రమాలను నన్ను ఎవరూ అడుగలేదని.. మన ప్రజలను మనమే బాగు చేసుకోవాలని ఆ పథకాలను అమలు చేశామని అన్నారు.కేసీఆర్ రైతు బంధు కింద ఏం ఇస్తుండు.. ప‌దివేలు ఇస్తుండు.. మేం 15 వేలు ఇస్తామ‌ని చెప్పిండ్రు. పెన్ష‌న్లు 2 వేలు ఇస్తుండు మేం 4 వేలు ఇస్తామ‌ని చెప్పిండ్రు. ఇద్ద‌రు ఉంటే ఒక్క‌రికే ఇస్తుండు.. మేం ముస‌లిది ముస‌లోడికి ఇద్ద‌రం ఇస్త‌మ‌ని చెప్పిండ్రు.. ఇవ‌న్నీ కాంగ్రెసోళ్లు చెప్పిండ్రు క‌దా.. దివ్యాంగుల‌కు కేసీఆర్ 4 వేలు ఇస్తుండు మేం 6 వేలు ఇస్త‌మండ్రు. ఆడ‌పిల్ల‌ల‌కు స్కూటీలు కొనిస్తామ‌న్నారు.  విద్యార్థుల‌కు విద్యాకార్డు కింద‌ ఐదు ల‌క్ష్య‌ల గ్యారెంటీ కార్డు ఇస్తామ‌ని ఎన్నో మాట‌లు చెప్పిండ్రు. ఇక ఒక‌రి వెనుక ఒక‌రు ఉరిచి.. 2 ల‌క్ష‌ల లోన్ తెచ్చుకోండి డిసెంబ‌ర్ 9న ఒక క‌లంపోటుతో ఖ‌తం చేస్తా అని అన్నారు. చేసిండ్రా అంటే చేయ‌లేదు అని కేసీఆర్ విమ‌ర్శించారు.ఏప్రిల్ 27, 2001న జ‌ల‌దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చ‌రిత్ర‌ను మలుపుతిప్పిన మ‌హోజ్వ‌ల‌ ఘ‌ట్టం. కులం, మ‌తం, ప‌ద‌వుల కోసం పుట్ట‌లేదు.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ. ప‌ద‌వీ త్యాగాల‌తోనే మ‌న తెలంగాణ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. అది ఫ‌లించి సొంత రాష్ట్ర క‌ల కూడా నెర‌వేరింది. చీక‌ట్ల‌ను పార‌దోల‌డానిక ప్ర‌జ‌ల్లో ఆత్మ‌విశ్వాసం పెంపొందించ‌డానికి ఒక మాట చెప్పాను. ఉద్య‌మం నుంచి వెన‌క్కి మ‌ళ్లితే, ఉద్య‌మ జెండాను దించితే రాళ్ల‌తో కొట్టి చంపాండ‌ని అని చెప్పి ఉద్య‌మాన్ని ప్రారంభించాను.  ఆ త‌న‌ద‌నంత‌రం జ‌రిగిన పంచాయతీ ఎన్నిక‌ల్లో, సిద్ధిపేట ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ప్రాణం పోసి ఊపిరిలూదితే అద్భుతంగా ఉద్య‌మం పురోగ‌మించిందన్నారు.హెచ్‌సీయూ భూములు అమ్ముకుంటున్నారు. అసలు ఏ భూములు అమ్ముకోవాలి. ఏ భూములు అమ్మకూడదో విచక్షణ ఉండాలని సూచించారు. వందకు వందశాతం మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అవసరమైతే డైరీల్లో రాసుకోండి అని సూచించారు. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండాలని.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. అత్యుత్సాహం ప్రదర్శించొద్దని సూచించారు. ఇక నుంచి ఊరుకునే ప్రసక్తే లేదని.. నేను కూడా రేపటినుంచి బయల్దేరుతా ఒక్కొక్కరి సంగతి చూస్తా అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాసిపెట్టుకోండి మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే..కేసీఆర్ దీమా Publish Date: Apr 27, 2025 8:15PM

సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ

    సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి నివాసంలో వారు భేటీ అయ్యారు.  మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్,  జంపన్న,  రవిచందర్ లు విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని ముఖ్యమంత్రి ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ  నేతలు.  ఈ సందర్బంగా సీఎం రేవంత్ వారితో మాట్లాడుతూ.. ‘నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించదు. గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం మాజీ మంత్రి జానారెడ్డికి ఉంది. ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటాం. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్‌ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.
సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ Publish Date: Apr 27, 2025 7:38PM

తెలంగాణ నూతన సీఎస్‌గా కె.రామకృష్ణారావు నియామకం

  తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్‌ శాంతి కుమారి ఈ నెల 30 పదవీవిరమణ చేయనున్నారు. 1991 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన కె.రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. రామకృష్ణారావు తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వచ్చే ఆగస్టులో ఆయన రిటైర్ కానున్నారు. ప్రస్తుతమున్న ఐఏఎస్‌ల్లో శశాంక్ గోయల్  తరువాత రామకృష్ణారావు సీనియర్‌గా ఉన్నారు. ఆర్థిక శాఖలో ఆయన చేసిన సేవలు, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో తనకున్న అనుభవం తోడ్పడుతుందన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆయనను నియమించారు. రామకృష్ణారావు గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్‌,  గుంటూరు కలెక్టర్‌ గా  కూడా విధులు నిర్వహించారు.  
తెలంగాణ నూతన సీఎస్‌గా కె.రామకృష్ణారావు నియామకం Publish Date: Apr 27, 2025 6:42PM

ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష

  ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటనలో తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లు, పర్యటన రోడ్ మ్యాప్ పై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం ఎయిర్‌ఫోర్ట్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతికి చేరుకుని 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ సందర్శిస్తారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.  ఈ సమావేశంలో ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రధాని పర్యటనను సక్సెస్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. 5లక్షల మందితో భారీ సభ నిర్వహించాలని యోచిస్తున్నారు.   
ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష Publish Date: Apr 27, 2025 5:23PM

ఈడీకి లేఖ రాసిన మహేష్ బాబు ఎందుకంటే?

  మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇచ్చిన నోటీసులకు బదులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు రాశారు.  రేపు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల.. విచారణకు హాజరు కాలేనని ఈడీ అధికారులకు సూపర్ స్టార్ బదులిచ్చారు. సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ప్రమోషన్ కోసం మహేష్ బాబు 5.9 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇందులో కొంత మొత్తం చెక్కుల రూపంలో, మరికొంత నగదు రూపంలో అందుకున్నారు. ఈ తీసుకున్న డబ్బులకు సంబంధించిన లెక్కలు వివరించాల్సిందిగా ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ శివారులో ‘సాయి సూర్య డెవలపర్స్’ పేరుతో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రజల వద్ద కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.సంస్థ యాజమాన్యంలో ఉన్న సతీష్ గుప్త ప్రజలను మోసం చేసినట్టు నిర్ధారణ కావడంతో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.అనంతరం ఈ కేసును ఈడీకి బదిలీ చేశారు. సాయి సూర్య డెవలపర్స్‌తో పాటు సూరానా ఇండస్ట్రీస్ సంస్థ కూడా మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
ఈడీకి లేఖ రాసిన మహేష్ బాబు ఎందుకంటే? Publish Date: Apr 27, 2025 4:58PM

హైదరాబాద్‌ ఓఆర్ఆర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్..కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

  బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ టోల్ ప్లాజా వద్ద  భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  సభకు హైదరాబాద్ నుంచి భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో ఓఆర్ఆర్‌పై ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అక్కడకు చేరుకొని.. క్రియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన వెహికల్స్ భారీగా వచ్చాయి. ఓఆర్‌ఆర్ మీదగా వరంగల్ వెళ్లుండటంతో ట్రాఫిమ్ భారీగా ఏర్పడింది. 500 మంది వేదిక పై కూర్చునేలా బాహుబలీ స్టేజీ సిద్ధం చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లిస్తున్నారు. 1213 ఎకరాల్లో సభ కోసం భారీ ఏర్పాట్లు చేసారు. 1100 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు ఈ సభను బీఆర్‌ఎస్ పార్టీ అధినాయ‌క‌త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. ప‌క్కా రాజ‌కీయ వ్యూహం, ప్రణాళిక‌తో గులాబీబాస్  ఈ సభకు హాజరవుతున్నట్టు నేతలు చెబుతున్నారు. అయితే ఈ సభలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండ‌బోతోంది..? ఆయన ఏం మాట్లాడబోతున్నారు? పార్టీ నాయ‌కుల‌కు, శ్రేణుల‌కు ఎలాంటి సందేశం, దిశానిర్దేశం చేయనున్నారు? కాంగ్రెస్ పార్టీపై విమర్శలు ఎలా ఉంటాయి అనే దానిపై స‌ర్వత్రా చ‌ర్చ జ‌రుగుతోంది.
హైదరాబాద్‌ ఓఆర్ఆర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్..కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు Publish Date: Apr 27, 2025 4:33PM

బీఆర్ఎస్ సభపై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

    బీఆర్ఎస్ రజతోత్సవ సభపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఒక రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకుల నరాలు తెగుతాయ్. రూపాయి రూపాయి పోగేసి సభను సక్సెస్ చేస్తే చాలు… అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. అందులోనూ ప్రతిపక్షంలో ఉండి సభ నిర్వహించాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదని ఎంపీ చామల ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కానీ, బీఆర్ఎస్ వరంగల్ సభ ఏర్పాట్లు చూస్తుంటే కళ్లు చెదురుతున్నాయి. వందల కోట్లు ఖర్చు చేస్తే తప్ప ఆ రకంగా సభ పెట్టడం సాధ్యం కాదు. జనాన్ని ఎంత మందిని తోలుతారు… ఆ పనికి ఎంత ఖర్చు చేస్తారు అన్నది వేరే విషయం. సభ ఏర్పాటు తీరే కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. ఆ వేదిక, హంగామా, ఆర్భాటం చూస్తుంటే ఊహకందనంత ఖర్చు అయ్యుంటుందని సామాన్యుడికి కూడా అర్థమవుతోంది.  ఎక్కడిది ఈ డబ్బు… కూలిన కాళేశ్వరం కమీషన్ సొమ్మా…!?మిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకులకు రంగులు వేసి… పాత తాగునీటి పథకాలను లింక్ చేసి దోచిన సొమ్మా…!?హైదరాబాద్ బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కోసం వసూలు చేసిన “అదనపు ఫ్లోర్ల” కమీషన్ సొమ్మా…!? ఫార్ములా కార్ రేస్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు దోచిన సొమ్మా…!? ధరణి పేరుతో అర్ధరాత్రులు భూ హక్కులను మార్చేసి దోచిన వేల ఎకరాల దోపిడీ సొమ్మా…!? కానామెట్, నియోపోలీస్, కోకాపేట్ లలో వేల కోట్ల విలువ చేసే భూములను వేలం పేరుతో ఐనవారికి దోచిపెట్టడం ద్వారా సంపాదించిన సొమ్మా…!? లక్షల కోట్ల విలువ చేసే ఔటర్ రింగ్ రోడ్డును కేవలం రూ.7000 కోట్లకు 33 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేయడం వల్ల వచ్చిన “కిక్ బ్యాక్” సొమ్మా… !? అని ఆయన ప్రశ్నించారు. రెండు గంటల సభ కోసం ఖర్చు చేస్తోన్న ఈ వందల కోట్ల ధన్ ప్రవాహం … ఏ కమీషన్ల తాలుఖాదో తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ చెప్పాలని అంటూ చామల ట్వీట్ చేశారు. 
బీఆర్ఎస్ సభపై కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు Publish Date: Apr 27, 2025 4:04PM

మన్ కీ బాత్ లోనూ పహెల్గాం ఉగ్రదాడి ప్రస్తావన

పెహల్గాం ఉగ్రదాడి  తరువాత దేశ భద్రత  అంశంపై ఏర్పాటు   చేసిన అఖిలక్ష సమావేశానికి డుమ్మా కొట్టి మరీ బీహార్ పర్యటనకు వెళ్లి అక్కడ  ఎన్నికల ప్రసంగం చేసి విమర్శలను ఎదుర్కొంటున్న  ప్రధాని  నరేంద్రమోడీ  ఆదివారం (ఏప్రిల్ 27) మన్ కీ బాత్ కార్యక్రమంలో  పహెల్గాం ఉగ్రదాడి ప్రస్తావన  తీసుకువచ్చారు.   ప్రతి భారతీయుడూ ఈ దాడి  పట్ల ఆగ్రహంతో రగిలిపోతున్నారని దాడికి పాల్పడిన ఏ ఉగ్రవాదినీ  వదిలేది  లేదని హెచ్చరించారు. ఉగ్రవాదం  అంతానికి కంకణం  కట్టుకున్నట్లు ఉద్ఘాటించారు.   పహెల్గాంలో ఉగ్రవాదులు తమ పిరికితనాన్ని ప్రదర్శించారని విమర్శలు గుప్పించారు. కాశ్మీర్ లో శాంతియుత వాతావరణం నెలకొనడం, అన్ని రంగాలలోనూ భారత్ అగ్రపథంలో దూసుకు వళ్లడం ఓర్చుకోలేని శత్రువులు దొంగదెబ్బ తీయడానికి చేసిన ప్రయత్నంగా పహల్గాం  ఉగ్రదాడిని  మోడీ అభివర్ణించారు.  దాడి చేసిన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని,  కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం భారత్‌కు అండగా నిలిచిందని.. పహెల్గాం బాధితులకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భారోసా ఇచ్చారు. ఈ ఉగ్రవాద దాడి చిత్రాలను చూసిన తర్వాత ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతోందనీ.. కానీ  పహెల్గాం  దాడి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారి నిరాశను, డొల్లతనాన్ని, భయాన్ని ఎత్తి చూపిందని పేర్కొన్న  మోడీ కాశ్మీర్ లో మళ్లీ పాతరోజులురావాలని  కోరుకుంటున్న వారి ఆశ మాత్రం నెరవేరదన్నారు. ఉగ్రవాదంపై పోరులో   దేశ ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభామే మనకున్న అతి పెద్ద ఆయుదమని చెప్పారు.  కాశ్మీర్‌లో శాంతి తిరిగి వికసిస్తున్న సమయంలో జరిగిన ఈ దాడి కాశ్మీరీల్లో కూడా ఉగ్రవాదం పట్ల ఏహ్యతను పెంచిందనీ, ప్రజాస్వామ్య పునరుద్ధరణలో భాగస్వాములు కావాలన్న సంకల్పం కలిగించిందని  మోడీ  అన్నారు.  ఉగ్రవాద నాయకులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలని కోరుకుంటున్నారు, కుట్రలు పన్నుతున్నారు. ఈ తరుణంలో మన సంకల్పాన్ని బలోపేతం చేసుకోవాలి. ఈ సవాలును దీటుగా ఎదుర్కోవాలి అని పిలుపునిచ్చారు.  
మన్ కీ బాత్ లోనూ పహెల్గాం ఉగ్రదాడి  ప్రస్తావన Publish Date: Apr 27, 2025 3:33PM

పోరాటాల గడ్డ ఓరుగల్లుకు కదిలిన గులాబీ దండు..కేసీఆర్ స్పీచ్‌పైనే సర్వత్రా ఉత్కంఠ

  బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరువాడా సిద్ధమైంది. పోరాటాల గడ్డ ఓరుగల్లుకు తెలంగాణ రాష్ట్ర నుంచి నలుదిక్కులా ప్రజలు తమ ఇంటి పండుగలా భావించి వెల్లువలా కదిలివస్తున్నారు. ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో గులాబీ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అలాగే పార్టీ ఏర్పాటైన జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మరోవైపు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై గౌరవం, ఇంటిపార్టీపై అభిమానంతో రైతులు, సాధారణ ప్రజలు ఎందరో ఎల్కతుర్తిలో జరగనున్న సభకు ముందుగానే బయలుదేరారు. సూర్యాపేటకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు ఎండ్లబండ్లపై ఎల్కతుర్తికి వెళ్తున్నారు. సిద్దిపేటకు చెందిన యువకులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఎందరో పార్టీ అభిమానులు సై కిల్‌ యాత్రగా వెళ్లారు. సిరిసిల్ల, గజ్వేల్‌, బాల్కొండ, నిర్మల్‌ తదితర నియోజవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాత్కాలిక కంట్రోల్‌ కమాండ్‌ సెంటర్‌లో హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.  ఏదైనా అత్యవసర పరిస్థితులు తలెత్తితే 9014206465 నంబర్‌కు ఫోన్‌ చేయాలని పార్టీ బాధ్యులు సూచించారు. వేసవి ఎండల తీవ్రత ఎక్కువ ఉండడంతో సభకు వచ్చేవారి కోసం 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. గులాబీ బాస్ స్పీచ్ వినడానికి పార్కింగ్‌ ప్రాంతాలతో పాటు 23 చోట్ల భారీ ఎల్‌ఈడీ తెరలను అమర్చారు. మహిళలు, దివ్యాంగులు, ముఖ్య నేతలకు ప్రత్యేక గ్యాలరీలను సమకూర్చారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సభా వేదిక పక్కన ప్రత్యేకంగా మరో వేదికను నిర్మించారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఎడ్లబండ్లు, ప్రభలు, సైకిళ్లు, కార్ల ర్యాలీలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు తరలివస్తున్నారు. సూర్యాపేట నుంచి ఎడ్లబండ్ల ర్యాలీ ఐదు రోజుల కిందట బయలుదేరింది. సైకిల్‌ ర్యాలీని శనివారం ప్రారంభించారు. పరకాల, నర్సంపేట నియోజకవర్గాల నుంచి ప్రభలతో నాయకులు తరలివస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి గులాబీ రంగు కార్లతో కూట్‌కపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ర్యాలీ రానుంది.  బీఆర్‌ఎస్ సభకు సుమారు 50 వేల వెహికల్స్ వస్తాయని గులాబీ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే సుమారు 3 లక్షల మంది వరకు జనసమీకరణ చేస్తుండగా.. ప్రతి నియోజకవర్గానికి 25 వేలకు తక్కువ కాకుండా జనాల్ని తరలించే ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ అందరికీ కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, సౌండ్‌ సిస్టం ఏర్పాటు చేశారు. వరంగల్‌ నగరం ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, కటౌట్లతో గులాబీమయమైంది. చాల కాలం తర్వాత గులాబీ దళపతి బహిరంగసభలో ప్రసంగించనుండడంతో సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. సాయంత్రం 5.30 గంటలకు సభా వేదిక వద్దకు చేరుకుంటారని, సుమారు గంటన్నర పాటు ప్రసంగించే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్గలు చెబుతున్నాయి
పోరాటాల గడ్డ ఓరుగల్లుకు కదిలిన గులాబీ దండు..కేసీఆర్ స్పీచ్‌పైనే సర్వత్రా ఉత్కంఠ Publish Date: Apr 27, 2025 1:18PM

మదనపల్లి ఫైల్స్ దగ్థం కేసులో నెక్ట్ టార్గెట్ ఎవరు?

  గత ప్రభుత్వం హయాంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలు వెలుగులోకి రాకుండా ఉండాలని కుట్ర పన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిందనేది సీఐడీ ఆరోపణ. ఇది నిజం అనేలా పలు రకాల ఆధారాలు సైతం సేకరించింది. ఇందులో పాత్ర ఉందని అనుమానాలు ఉన్న వారికి సంబంధించిన సీడీఆర్ ఫైల్స్ ను సంపాదించిన సిట్ యాక్షన్ లోకి దిగింది. తొలుత సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అయినా , అర్థరాత్రి వరకు పనిచేసిన ఉద్యోగి గౌతమ్ తేజ్ ను అరెస్టు చేశారు. అక్కడే పని చేస్తున్న మాజీ ఆర్డీవో, ఆర్డీవో ఇతర అధికారుల పై సైతం చర్యలు తీసుకున్నారు. అయితే గత కొన్ని నెలలుగా కేసు కు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంతో , ఇంత పెద్ద కేసు గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని చర్చనడిచింది.  ఈ కేసులో కీలకంగా మారిన ఏ2 మాధవ రెడ్డిని రీజనల్ సీఐడీ పోలీసులు రెండు రోజులు క్రితం హడావుడిగా అరెస్టు చేశారు. ఘటన జరిగిన తరువాత పక్కా ప్లాన్ తో మాధవ రెడ్డి అజ్ణాతంలోకి వెళ్లిపోయాడు. ఎవరికి అందుబాటులోకి రాకుండా తిరుగుతున్నాడు. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం పెద్దగొట్టిగల్లు సమీపంలోని తన ఫామ్ హౌస్ లో ఉంటూ కల్యాణ మండపం నిర్వహిస్తున్నారు. దీన్ని గుర్తించిన సిట్ డీఎస్పీ కొండయ్య నాయుడు పక్కా ప్లాన్ చేశారు.  కల్యాణ మండపం కావాలంటూ వెళ్లి పట్టుకున్నారు. రొంపుచర్ల నుంచి అరెస్టు చేసి తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించి విచారణ అనంతరం చిత్తూరు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు సరైన పత్రాలు లేవని బెయిల్ మంజూరు చేసింది. తుకారాం కోసం వేట కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని, ఆయన చేసిన అక్రమాలు బయట పడుతాయని ఫైల్స్ దగ్థం చేసి అగ్ని ప్రమాదం గా సృష్టించారనే దాని పై కేసు నమోదు చేశారు. ఇందులో పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు గా ఉన్న మాధవరెడ్డి ఒక్కరు కాగా ఘటన జరిగిన తరువాత నుంచి విదేశాలకు వెళ్లిపోయిన తుకారాం కీలకం అని అనుమానిస్తున్నారు. ఈ కేసులో నెక్ట్ టార్గెట్ అయిన తుకారాం ను విదేశాల నుంచి రప్పించేందుకు సీఐడీ పోలీసులు చర్యలు చేపట్టారు. త్వరలో మరికొందరిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మదనపల్లి ఫైల్స్ దగ్థం కేసులో నెక్ట్ టార్గెట్ ఎవరు? Publish Date: Apr 27, 2025 12:19PM

భార‌త్ పాక్ పై ఎలాంటి యుద్ధ వ్యూహం ర‌చిస్తోంది... మ‌న ద‌గ్గ‌రున్న ఎవిడెన్సులు ఏంటి?

ఉగ్ర‌దాడికి భార‌త్ గ‌ట్టి బ‌దులే ఇస్తుంది. అది మ‌రెవ్వ‌రూ ఊహించ‌న‌దిగా ఉంటుంది. ఇదీ మోడీ ప‌హెల్గామ్ అటాక్ త‌ర్వాత చేసిన కామెంట్. మోడీ ఇంత సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం ఇదే మొద‌టి సారి. అయితే ఇప్ప‌టికే సింధూ జ‌లాల ఒప్పందం ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు ప్ర‌ధాని మోడీ. యుద్ధం చేయ‌డం కంటే నీళ్లు ఆప‌డం అతి పెద్ద యుద్ధం. దీని సాధ్యాసాధ్యాలు వ‌చ్చే రోజుల్లోగానీ తెలీదు. అలాగ‌ని ఇదే చాల‌నుకున్నా క‌ష్ట‌మే. ఎందుకంటే ఇందుకు కావ‌ల్సినంత టైం తీస్కుంటుంది. ఈలోగా ఇలాంటి ఎన్నో ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంది. దానికి తోడు ఇదే అంశంపై ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యిద్ మీరు మా నీరు ఆపితే మేము మీ శ్వాస ఆపేస్తామ‌ని.. ఈ స‌రికే ప్ర‌క‌టించి ఉన్నాడు.. రీసెంట్ గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావ‌ర్ భుట్టో సైతం స‌రిగ్గా ఇలాంటి లాంగ్వేజీనే వాడి భార‌త్ ను హెచ్చ‌రించాడు. దీన్నిబ‌ట్టీ చూస్తే ఈ లాగ్ తో కూడిన  వాట‌ర్ వార్ తో పాక్ ని అంత తేలిగ్గా భ‌య‌పెట్ట‌లేం. ఇక మిగిలింది ఏంట‌ని చూస్తే..ముందుగా ఐఎన్ఎస్ విక్రాంత్ అనే విమాన వాహ‌క యుద్ధ నౌక‌ను అరేబియా స‌ముద్రంలో అంత‌ర్జాతీయ జ‌లాల‌లో ఉండేలా.. కారాచీ రేవుకు ద‌గ్గ‌ర్లోకి పంపారు. ఒక ర‌కంగా చెబితే ఇది పూర్తి స్థాయి యుద్ధ స‌న్న‌ద్ధానికి స‌మాయుత్తం అవుతున్న‌ట్టుగానే భావించాలంటారు ర‌క్ష‌ణ రంగ నిపుణులు.విక్రాంత్ అనే విమాన వాహ‌క నౌక అంటే అది ఒక్క‌టే వెళ్ల‌దు. దీంతో పాటు నాలుగు ఫ్రీగెట్ లు, ఒక కార్వేటి, రెండు డెస్ట్రాయ‌ర్లు ఉంటాయి. ఇవే కాక‌.. వీటిని అనుస‌రిస్తూ స‌ముద్ర జ‌లాల్లో రెండు అటాక్ స‌బ్ మెరైన్లు ప్ర‌యాణిస్తాయి. ఈ మొత్తాన్ని క‌లిపి కారియ‌ర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు షార్ట్ క‌ట్ లో సీటీజీ అంటారు.యుద్ధం జ‌రుగుతోంద‌న్న నిర్ణ‌యిస్తేనే ఈ కారియ‌ర్ స్ట్రైక్ గ్రూప్ ని పంపుతారు.  కాబ‌ట్టి ఈసారికి స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అయితే ఉండ‌బోదని అంటున్నారు ఎక్స్ ప‌ర్ట్స్. ఒక సారి అంటే 2016లో అజిత్ దోవ‌ల్ అన్న‌మాట‌ల‌ను అనుస‌రించి చెబితే.. పాకిస్థాన్ కానీ మ‌రో ముంబై లాంటి దాడుల‌కు పాల్ప‌డితే బ‌లూచిస్తాన్ని కోల్పోతారని అన్నారాయ‌న‌. అంటే దీన‌ర్ధ‌మేంటో సుల‌భంగానే అర్ధం చేసుకోవ‌చ్చు. ఇంతకీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఎందుకు చేయ‌కూడ‌దు? అని చూస్తే ఇప్ప‌టికే రెండు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసింది భార‌త్. మొద‌టిది యూరీ సెక్టార్లో ఆర్మీ నిర్వ‌హించ‌గా.. రెండోది బాలాకోట్ పై ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చేసిన‌ది.  ఇక మిగిలింది ఇండియ‌న్ నావీ తో స్ట్రైక్స్ చేయించ‌డం. అయితే నావీ అలాంటి స్ట్రైక్స్ చేయ‌దు. డైరెక్ట్ వారే.  ఇదిలా ఉంచితే పీవోకేని స్వాధీనం చేసుకోవ‌డం. పీవోకేని స్వాధీనం చేసుకునే స‌మ‌యంలో పాకిస్థాన్ నావీ భార‌త్ పై దాడి  చేయ‌కుండా నిలువ‌రించ‌డానికే విక్రాంత్ ని అరేబియా స‌ముద్రంలో మొహ‌రించార‌ని అంటారు నిపుణులు. ఇక బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీకి మ‌ద్ద‌తుగా గ్వ‌ద‌ర్ పోర్టు వైపు విక్రాంత్ ని పంపి ఉండొచ్చు కూడా. ఇక్క‌డ స‌స్పెన్స్ ఏంటంటే భార‌త్ అస‌లు యుద్ధ వ్యూహ‌మేంట‌న్న‌ది. ఇండియ‌న్ ఆర్మీ ప్లాన్ ఏమిటో ఎవ‌ర‌కీ తెలియ‌దు. ఏద‌యినా జ‌ర‌గొచ్చు కూడా. ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్ రెండున్న‌ర ల‌క్ష‌ల ఫ్రంట్ ల‌తో యుద్ధం చేయాల్సి ఉంటుంద‌ని భావించేవారు. ఇప్పుడు చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది ప‌రిస్థితి. పాకిస్థాన్ త్రీ ఫ్రాంట్ వార్ ఫేస్ చేయాల్సి రావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.అదెలాగో చూస్తే మొద‌ట బ‌లూచ్ లిబ‌రేష‌న్ ఆర్మీని భార‌త్ నావీ స‌పోర్ట్ తో పాక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఖైబ‌ర్ ప‌ఖ్క్తున్ క్వాని తాలిబాన్లు అటు నుంచి ముట్ట‌డిస్తారు. కాశ్మీర్ వైపు భార‌త దాడిని చ‌వి చూడాల్సి వ‌స్తుంది. ఇక్క‌డ గుర్తించాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. ఇప్ప‌టికే తాలిబ‌న్లు భార‌త్ కి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మోడీతో మాట్లాడుతూ త‌న స‌పోర్ట్ తెలియ చేశారు. ఇదెలా ప‌నికి  వ‌స్తుందంటే.. మ‌న ఆయ‌ధాల‌లో 70 శాతం పైగా సోవియ‌ట్ ర‌ష్యాకి చెందిన‌వి ఉన్నాయి. వీటి స్పేర్ పార్ట్స్ అవ‌స‌రాలు చాలానే ఉంటాయి. ఈ మాత్రం సాయం చేసినా చాలు మ‌నం యుద్ధాన్ని ఎంతో గొప్ప‌గా చేయ‌గ‌లం అంతే స్థాయిలో ముగించ‌గ‌లం.ఇక అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా ఫోన్ చేసి త‌న స‌పోర్ట్ ప్ర‌క‌టించారు. ఈ దిశ‌గా త‌న యంత్రాంగం ద్వారా ఒక అధికారిక ప్ర‌క‌ట‌న సైతం చేయించారు. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మ‌క్రాన్ మోడీకి గ‌ట్టి మ‌ద్ధ‌తే ప్ర‌క‌టించారు. మిరేజ్ 200 జెట్ ఫైట‌ర్స్, రాఫెల్ ఓమ్ని రోల్ ఫైట‌ర్ జ‌ట్స్ ఫ్రాన్స్ కి చెందినివి కావ‌డం గుర్తించాల్సిన విష‌యం.కాబ‌ట్టి పాక్ పై మోడీ ఎలాంటి అటాక్ చేసినా అడిగే దిక్కు లేదు. ప్ర‌పంచ ఉగ్ర‌వాద క‌ర్మాగారం పాక్ లో తిష్ట‌వేసి.. అక్క‌డి నుంచి ప్ర‌పంచం మీద‌కు వ‌దులుతోంద‌ని స్ప‌ష్టంగా తెలిసి పోతోంది. ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి వ్యాఖ్య‌లే ఇందుకు సాక్షి.ప‌హెల్గామ్ దాడి జ‌ర‌గ్గానే పాకిస్థాన్ వెంట‌నే త‌న ఎయిర్ స్పేస్ మూసేసింది. ఎప్పుడైనా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ జ‌ర‌గొచ్చ‌నే భ‌యంతో క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర‌కు త‌ర‌లించారు. బ‌లూచిస్తాన్ లో ఉన్న సైన్యాన్ని పీఓకీ స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర‌కు త‌ర‌లించే టైంలో నిన్న పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్ మీద దాడి చేసి ప‌ది మంది పాక్ సైనికుల‌ను చంపింది బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ.మ‌రోవైపు క‌రాచీ ఓడ‌రేవుకు ద‌గ్గ‌ర్లో పాకిస్థాన్ నావీ  డ‌మ్మీ మిస్సైల్స్ ప్ర‌యోగించి టెస్ట్ చేస్తోంది. శుక్ర‌, శ‌ని.. రెండు రోజుల పాటు అరేబియా స‌ముద్రంలో నావీ డ్రిల్ ఉంటుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది.. పాపిస్తాన్...కాబ‌ట్టి స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అయితే ఉండ‌ద‌ని క‌న్ఫం అయ్యింది. ఇక మిగిలింది ఏంటంటే పూర్తి స్థాయి లేదా పాక్షిక యుద్ధం మాత్ర‌మే మిగిలాయి. పాకిస్థాన్ యుద్ధ ఖ‌ర్చు భ‌రించ‌గ‌ల‌దా? అన్న‌ది మ‌రొక ప్ర‌శ్న‌.  అయితే ఇది ఎంతో క‌ష్ట‌సాధ్య‌మైన ప‌ని. ఒక సారి యుద్ధం ప్ర‌క‌టిస్తే.. ముందుగా గోధుమ‌లు చ‌క్కెర‌, బియ్యం, పెట్రోల్- డీజిల్ పై రేష‌న్ విదిస్తుంది పాక్ ఆర్మీ. ముందు సైన్యానికి స‌ర‌ఫ‌రా చేశాక మిగిలితే సాధార‌ణ  పౌరుల‌కు అమ్మాల్సి వ‌స్తుంది.యుద్ధం లేని  టైంలో కూడా పాకిస్థాన్ కి గోధుమ పిండి క‌ర‌వుగా ఉంది. ఈ సిట్యువేష‌న్లో ఆ కాస్త పిండి  కూడా సైన్యం ప‌ట్టుకుపోతే ప‌రిస్థితేంటి? ఇక సాధార‌ణ  పాకిస్తానీయుల ఆహాకారాలు ఆకాశాన్ని అంట‌డం ఖాయం.  ఇప్ప‌టికే న‌గ‌రాల మాట అటుంచితే.. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సంగ‌తి దేవుడెరుగు ప‌గ‌టి పూట కూడా క‌రెంటు స‌ప్లై ఉండ‌టం లేదు. ఇక యుద్ధం మొద‌లైతే న‌గ‌రాలు కూడా చీక‌ట్లో అల‌మ‌టించాల్సి వ‌స్తుంది. ఆయుధాల క‌ర్మాగారాల‌కు ఈ విద్యుత్ మొత్తం మ‌ళ్లించాలి కాబ‌ట్టి.. ఈ మాత్రం క‌రెంటు కోత పాకీయుల‌కు త‌ప్ప‌దు.కాబ‌ట్టి పాకిస్థాన్ యుద్ధం చేయ‌డం మాత్ర‌మే కాదు చేయ‌డానికి ప్లాన్ చేసుకోవ‌డం కూడా గ‌గ‌న‌మే.. కొన్నాళ్లు పాటు ఎలాంటి యుద్ధం చేయ‌కుండా యుద్ధ స‌న్నాహాల్లో ఉంచినా  చాలు పాకిస్థాన్ వ్య‌వ‌స్థ మొత్తం నిలువునా  కుప్ప‌కూలిపోతుంది. ఎందుకంటే యుద్ధం చేయ‌డానికి వంద రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌నుకుంటే, యుద్ధ స‌న్నాహం కోసం యాభై రూపాయ‌లు వెచ్చించాల్సి వ‌స్తుంది. ఈ మొత్తం ఖ‌ర్చు చేస్తే చాలు పాకిస్తాన్ మ‌ల‌మ‌ల‌మాడిపోవ‌డానికి.  ఇప్ప‌టికే యుద్ధ భ‌యానికి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ మూత ప‌డింది. ఇక కొన్నాళ్లు ఇలాగే ఉంటే మార్కెట్ల మీద ఎగ‌బ‌డి అవీ ఇవీ ఎగ‌బ‌డి కొనేస్తారు పాకిస్తానీలు. ఇక క‌రాచీ పోర్టు మీద దాడి చేస్తే  దిగుమ‌తులు వెంట‌నే ఆగిపోతాయి. ఇండియ‌న్ నావీ క‌రాచీ పోర్టును దిగ్బంధించే ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. స‌ప్లైస్ ఆగినా చాలు పాకిస్థాన్ ఖేల్ ఖ‌తం కావ‌డానికి. చూశారుగా అదీ పరిస్తితి. కేవ‌లం 26 మంది  ప్రాణాల‌ను తీసిన  పాపానికి దేశం మొత్తం గ‌జ‌గ‌జ ఒణ‌కాల్సిన‌ప‌రిస్థితి. అవ‌స‌ర‌మా ఇదంతా అంటూ పాకిస్తానీయులు తెగ కుమిలిపోతున్నారు. ఏం చేద్దాం వారి చేతుల్లో కూడా ఏమీ ఉండ‌దు. పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ టెర్ర‌రిస్టులు ఇదో టెర్ర‌ర్ కారిడార్. ఈ మొత్తం లింకు తెగితే గానీ పాపం పాకిస్థానీయుల‌కు సైతం ఊర‌ట ల‌భించ‌దు. దీన్నే ప్ర‌పంచ అగ్ర దేశాలు గుర్తించి తునాతున‌క‌లు చేయాల్సి ఉంటుంది. మ‌రి చూడాలి... ప్ర‌పంచ‌మంతా క‌ల‌సి ఇప్పుడు భార‌త్ ద్వారా  ఎలాంటి యాంటీ టెర్ర‌ర్ ఆప‌రేష‌న్ చేయిస్తాయో తేలాల్సి ఉంది.
భార‌త్ పాక్ పై ఎలాంటి యుద్ధ వ్యూహం ర‌చిస్తోంది... మ‌న ద‌గ్గ‌రున్న ఎవిడెన్సులు ఏంటి? Publish Date: Apr 27, 2025 12:04PM

పహల్గామ్ ఉగ్రదాడి కేసు..ఎన్ఐఏకు దర్యాప్తు బాధ్యతలు

    జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటనపై కేసు దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్వీకరించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేసినట్లు అధికారికంగా పేర్కొన్నాది. ఇప్పటివరకు ఈ కేసు దర్యాప్తును జమ్మూకాశ్మీర్ పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఘటన తీవ్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దీనిని ఎన్ఐఏకి అప్పగించాలని నిర్ణయించింది. దాడి జరిగిన మరుసటి రోజైన ఏప్రిల్ 23 నుంచే ఎన్ఐఏ బృందాలు పహల్గామ్‌లోని ఘటనా స్థలంలో మోహరించాయి. ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. సుందరమైన పర్యాటక ప్రాంతమైన బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఈ భయానక దాడిని ప్రత్యక్షంగా చూసిన సాక్షులను ఎన్ఐఏ అధికారులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. సంఘటన జరిగిన తీరును, ఉగ్రవాదుల కదలికలను కూలంకషంగా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, ఉగ్రవాదులు పర్యాటకుల వద్దకు వచ్చి, వారి మతాన్ని అడిగి తెలుసుకుని, హిందువులని నిర్ధారించుకున్న తర్వాత కాల్పులు జరిపారని తెలిసింది. మృతుల్లో 25 మంది హిందూ పురుషులు ఉన్నారు. ఉగ్రవాదులు ఘటనా స్థలానికి ఎలా చేరుకున్నారు, దాడి తర్వాత ఎలా తప్పించుకున్నారు అనే కోణంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఎన్ఐఏ బృందాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో ఘటనా స్థలంలో లభించే ప్రతి చిన్న ఆధారాన్ని జాగ్రత్తగా సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఈ దారుణ మారణకాండ వెనుక ఉన్న ఉగ్ర కుట్రను ఛేదించేందుకు ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తోంది. భారత భద్రతా బలగాలు జమ్మూకశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కు చెందిన ఉగ్రవాది జమీల్ అహ్మద్ ఇంటిని పేల్చివేశాయి. ఉగ్రవాదుల ఇల్లు పేల్చివేతలో ఇది తొమ్మిదో ఘటన కావడం గమనార్హం. జమీల్ 2016 నుంచి లష్కరేలో క్రియాశీలంగా ఉన్నాడు. గత రాత్రి త్రాల్ ప్రాంతంలో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జేషే మొహ్మద్ (జేఈఎం) సంబంధాలున్న ఉగ్రవాది ఆమిర్ నజీర్ ఇంటిని కూడా భద్రతా బలగాలు పేల్చివేశాయి.
పహల్గామ్ ఉగ్రదాడి కేసు..ఎన్ఐఏకు దర్యాప్తు బాధ్యతలు Publish Date: Apr 27, 2025 11:45AM

అఖిలపక్షానికి మోడీ డుమ్మా.. సర్వత్రా విమర్శలు

జమ్మూ కాశ్మీర్‌లోని పహెల్గాం ఉగ్రదాడిపై  చర్చించడానికి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశానికి ప్రధాని  నరేంద్ర మోడీ డుమ్మా కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దాడి అనంతరం రెండు రోజుల పాటు వ్యూహాత్మక మౌనంతో మోడీ అందరి దృష్టినీ ఆకర్షించారు. ఏదో కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా భావించారు. అఖల పక్ష సమావేశంలో అందరి అనుమానాలూ, సందేహాలూ నివృత్తి చేస్తారనీ, అన్నిప్రశ్నలకూ సమాధానాలు చెబుతారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ప్రధాని మోడీ  అఖిల పక్ష సమావేశానికి గైర్హాజరు కావడం,  బీహార్ లో ఎన్నికల ప్రసంగం చేయడానికే ప్రాధాన్యత ఇవ్వడం సర్వత్రా  విమర్శలకు తావిచ్చింది. రక్ణణ మంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీకి అన్ని  రాజకీయ పార్టీల ప్రతినిథులూ హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధాని  పహెల్గాం  దాడికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తారనీ, ఈ దాడి  తరువాత కేంద్రం తీసుకున్న నిర్ణయాలు ప్రకటిస్తతారనీ, అలాగే భద్రతా లోపాల  గురించి ప్రతిపక్షాల ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు చెబుతారనీ అంతా భావించారు. అయితే ప్రధాని మోడీ..అత్యంత కీలకమైన ఈ భేటీకి గైర్హాజరు కావడం, ఇంతటీ కీలక భేటీ కంటే బీహార్ లో సభ ద్వారా రాజకీయ లబ్థి పొందడమే ముఖ్యమనుకోవడం పట్ల సర్వతత్రా అసంతృప్తి, అసహనం వ్యక్తమైంది. ఇదే అసంతృప్తి, అసహనాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్  వేదిక ద్వారా వ్యక్తం చేశారు. ఎందుకు జరిగింది? ఎవరు బాధ్యత వహించాలి? ఇది భద్రతా లోపం, పహెల్గాం దాడి.. నిఘా వర్గాల వైఫల్యం,   పోలీసు వైఫల్యం వంటి అంశాలపై  అఖిలపక్షంలో మోడీ క్లారిటీ ఇస్తారని  భావించామనీ, అయితే ఆయన డుమ్మా కొట్టడం తమను తీవ్ర నిరాశకు  లోను చేసిందనీ ఖర్గే పేర్కొన్నారు.  అయితే దేశంలో ఉగ్రవాదాన్ని  తుదముట్టించే విషయంలో తాము  ప్రభుత్వం తీసుకునే చర్యలు, నిర్ణయాలకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. అయితే మోడీ వైఖరి ఎంత మాత్రం సమర్ధనీయం  కాదని  విమర్శించారు. 
అఖిలపక్షానికి మోడీ డుమ్మా.. సర్వత్రా  విమర్శలు Publish Date: Apr 27, 2025 10:51AM

తిరుమలలో కొనసాగుతున్న బక్తుల రద్దీ

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ  కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.  ఆదివారం (ఏప్రిల్ 27) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు  నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు  పైగా  సమయం పడుతోంది. ఇక శనివారం (ఏప్రిల్ 26) శ్రీవారిని మొత్తం  82వేల 811 మంది దర్శించుకున్నారు. వారిలో 34వేల 913 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం 3 కోట్ల 24 లక్షల రూపాయలు వచ్చింది. అదలా ఉండగా ప్రముఖ నటుడు నాని ఆదివారం (ఏప్రిల్ 27) ఉదయం సుప్రభాత సేవలో స్వామి వారిని  దర్శించుకున్నారు.  తన తాజా సినీమా హిట్ 23 విజయం  సాధించాలని కోరుకుంటూ ఆయన శనివారం కలినడకన తిరుమల చేరుకున్నారు. ఆ రాత్రి తిరుమలలో బస చేసి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. నానితో పాటు హిట్ 3 హీరోయిన్, చిత్ర బందం కూడా ఉన్నారు. 
తిరుమలలో కొనసాగుతున్న బక్తుల రద్దీ Publish Date: Apr 27, 2025 8:03AM

ఆ పదిమందికీ బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉన్నాయా?

బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగతున్న వేళ, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై గెలిచిన, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల పునరాగమనం గురించి ఆసక్తికర  చర్చ జరుగుతోంది.  నిజానికి నిన్న మొన్నటి వరకు పార్టీ కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీ రామరావు చాలా స్పష్టంగా ఆ పది మందిలో ఏ ఒక్కరినీ వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని ఖరాఖండిగా చెపుతూ వచ్చారు. అయితే.. తాజాగా కేటీఆర్ అది తన వ్యక్తిగత అభిప్రాయమనీ,  అలాంటి  అతి ముఖ్యమైన విషయంలో పార్టీ, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు.  అంటే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లు అయిందని అంటున్నారు. నిజానికి.. చాలా కాలంగా కేటీఆర్ పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ తలుపులు శాశ్వతంగా ముసుకు పోయాయనీ.. మళ్ళీ వస్తామని వేడుకున్నా, ప్రాధేయ పడినా  బీఆర్ఎస్ తలుపులు మళ్ళీ తెరుచుకోవని అడిగినా,  అడగక పోయిా అందరికీ చెపుతూ వచ్చారు. ఆ పది మందిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదని ఒకసారి కాదు..  ఒక భాషలో, ఒక ఇంటర్వ్యూలో కాదు ప్రతి ఇంటర్వ్యూలో అదే మాట చెపుతూ వచ్చారు. అలాగే ఆ పది నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, చెప్పారు.   అలాగే.. పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలు భయపడవలసిన అవసరం లేదని, ఉప ఎన్నికలు రావంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటనను కేటీఆర్  ప్రతి ఇంటర్వ్యూలోనూ  తప్పు పట్టారు.  సుప్రీం కోర్టు విచారణలో ఉన్న అంశంపై  ముఖ్యమంత్రి సభలో మాట్లాడదాన్ని కూడా తప్పు పట్టారు.సుప్రీం కోర్టు కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టిందని అన్నారు. ఆ పది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు తప్పవని కటీఆర్ చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని, ఒకటికి  పదిసార్లు చెప్పారు. అంతే కాదు, పార్టీ నాయకులు కార్యకర్తల సెంటిమెంట్స్ ను గౌరవించాలని అన్నారు. కొత్త నాయకత్వాన్ని పోటీకి సిద్దం చేస్తున్నామని చెప్పారు. మరోవంక,ఆ పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ.. కేటీఆర్ మరి కొందరు  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు విచారణ పూర్తి చేసింది. తీర్పును వాయిదా వేసింది. ఈ నేపధ్యంలోనే కేటీఆర్  ఉప ఎన్నికలు తధ్యమని చెపుతూ వచ్చారు.  అయితే, ఇప్పడు అదే కేటీఆర్  పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకోరాదనేది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అంటూ.. తుది నిర్ణయం తీసుకోవలసింది పార్టీనే అంటూ.. కొత్త పాట, కొత్త పల్లవి ఎత్తుకున్నారు.  ఈ నేపధ్యంలోనే కేటీఆర్  మాటల్లో ఈ మార్పు ఎందుకొచ్చింది అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోందని అంటున్నారు. అది కూడా, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ముందు కేటీఆర్ టోన్ ఎందుకు మారింది? రజతోత్సవ సభ వేదికగా, ఎవరైనా స్వగృహ ప్రవేశం చేస్తారా? అందుకే కేటీఆర్, మాట మారిందా? అనే చర్చ జరుగుతోందని అంటున్నారు.అయినా,  పార్టీలు ఫిరాయించడం ఎలాగో, మాట మార్చడం కూడా రాజకీయాల్లో  మాములే..  అందుకే ఏనాడో కన్యాశుల్కం, గిరీశం ఒపీనియన్స్ మార్చుకోలేని వాడు పొలిటీషియన్ కాలేరని అన్నారని అంటున్నారు. సో... ఇతర విషయాలు ఎలా ఉన్నా... పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్ళీ  గులాబీ గూటికి రావాలనుకుంటే రావచ్చును.అన్ని తలుపులు అన్ని వైపులా తెరిచే ఉన్నాయి.. అంటున్నారు.
ఆ పదిమందికీ బీఆర్ఎస్ తలుపులు తెరిచే ఉన్నాయా? Publish Date: Apr 27, 2025 7:43AM

బీఆర్ఎ రజతోత్సవాలు పార్టీ జాతర కాదు తెలంగాణ పండగ!

తెలంగాణ రాష్ట్ర సమితి, (టీఆర్ఎస్) రజతోత్సవం జరుపుకుంటోంది. తెలంగాణ పండగ చేసుకుంటోంది.అయితే, ఇది టీఆర్ఎస్/ బీఆర్ఎస్ పండగేనా అంటే కాదు.ఇది, తెలంగాణ పండగ. తెలంగాణ ప్రజల పండగ. ఎవరు అవున న్నా, ఎవరు కాదన్నా, టీఆర్ఎస్ తెలంగాణ ఇంటి పార్టీ. అందుకే, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం (ఏప్రిల్ 27)జరుపుకుంటున్న రజతోత్సవ వేడుక. ఒక పార్టీ వేడుక కాదు, తెలంగాణ ప్రజల పండగ. తెలంగాణ ఇంటింటి పండగ. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పాతికేళ్ళ క్రితం,2001 ఏప్రిల్‌ 27న, కల్వకుట్ల చంద్రశేఖర రావు సారధ్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్,(ప్రస్తుత భారత రాష్ట్ర సమితి-బీఆర్ఎస్), లక్ష్యాన్ని సాధించి చరిత్రను సృష్టించింది. నిజానికి, టీఆర్ఎస్ కు ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ వుంది. ప్రత్యేక రాష్ట సాధన కోసం ఉద్యమాలు సాగాయి. పార్టీలు పుట్టాయి. కానీ, తెలంగాణ ప్రజల ఆరుపదుల ఆకాంక్ష  నెరవేరింది మాత్రం టీఆర్ఎస్ సారథ్యంలో  సాగిన 14 ఎళ్ల పోరాటం ద్వారానే అనేది కాదనలేని నిజం. నిజం. రాష్ట్ర ఆవిర్భావానికి, ఇతర కారాణాలు ఎన్నున్నా, మూలం మాత్రం టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్. అవును పాతికేళ్ళ నాడు జలదృశ్యంలో కేసీఆర్ ఎగరేసిన గులాబీ జెండానే  ఉద్యమాన్ని, విజయ తీరాలకు చేర్చింది.       తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పాతికేళ్ళ క్రితం 2001 ఏప్రిల్‌ 27న  కల్వకుట్ల చంద్రశేఖర రావు సారథ్యంలో ఆవిర్భవించిన టీఆర్ఎస్ (ప్రస్తుత భారత రాష్ట్ర సమితి-బీఆర్ఎస్) పాతికేళ్ళ ప్రస్థానంలో మెరుపులు,మరకలు, చూసింది. అయినా.. టీఆర్ఎస్ ఆవిర్భావం  చరిత్రలో స్థిరంగా నిలిచి పోయే ఒక  చారిత్రిక సత్యం.  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా, ఒక ఉద్యమ పార్టీగా అవతరించిన టీఆర్ఎస్  పుష్కర కాలానికి పైగా సాగించిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యింది.  నిజానికి.. భారతదేశ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను లిఖించిన రాజకీయ పార్టీ. ఓ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నిస్తూ స్వయం పాలనే లక్ష్యంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చింది. అంతకుముందున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని.. రాజకీయ ప్రక్రియ ద్వారానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమని బలంగా నమ్మి ముందుకెళ్లి గమ్యాన్ని ముద్దాడిన నాయకుడు టీఆర్ఎస్ అధినేత, గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన కేసీఆర్.. గులాబీ జెండాను ఎగరవేశారు. నాటి నుంచి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగింది టీఆర్ఎస్. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొన్నాక.. కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది.  ఆ తర్వాత టీఆర్ఎస్ రాజకీయం పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. కేసీఆర్‌తో పాటు పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు పదవులను లెక్కచేయక రాజీనామాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత 2010లో జరిగిన ఉప ఎన్నికలు మొదలు క్రమంగా బలపడుతూ, బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. అదే ఏడాది డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర ప్రకటన.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు కేసీఆర్. ఇక తెలంగాణ రాష్ట్రంలోనే కాలు పెడతానంటూ హస్తిన వెళ్లిన కేసీఆర్ స్వప్నం.. 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల ఆమోదం పొందడంతో నెరవేరింది. 2014 జూన్ రెండో తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఘన విజయాన్ని సాధించి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా నవ తెలంగాణకు భవితకు బాటలు వేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగుతామని ప్రకటించారు. 2014 మొదలు ఏ ఎన్నిక వచ్చినా టీఆర్ఎస్ ఘనవిజయం సాధిస్తూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఏకంగా 99 స్థానాలను సాధించి రికార్డు సృష్టించింది. ఇదే సమయంలో తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన గులాబీ నాయకత్వం.. కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల నాయకులను ఆకర్షించింది. పదవీకాలం మరో తొమ్మిది నెలలు ఉండగానే శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్.. 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో సత్తా చాటింది. దీంతో కేసీఆర్ రెండోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ బాధ్యతలు చేపట్టడంతో గులాబీ పార్టీలో కొత్త వాతావరణం ఏర్పడింది. ఫెడరల్ ఫ్రంట్ పేరిట జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ మధ్యలో దృష్టి సారించారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయంతో అది సాధ్యం కాలేదు. అటు రాష్ట్రంలోనూ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అంత అనుకూలంగా రాలేదు.  స్వపరిపాలనలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్.. పలు అంశాల్లో తనదైన ముద్ర వేసింది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, హరితహారం, రెండు పడకల గదుల ఇండ్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది.ఆయితే 2024 ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్‌ఎస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో మరింత డీలా పడింది. ఈనేపధ్యంలో ఈరోజు బీఆర్ఎస్ జరుపుకుంటున్న రజతోత్సవాలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
బీఆర్ఎ రజతోత్సవాలు పార్టీ జాతర కాదు  తెలంగాణ పండగ! Publish Date: Apr 27, 2025 7:16AM

విశాఖ జీవిఎంసి లో పడిపోయిన మరో వైసీపీ వికెట్

విశాఖ నగరపాలక సంస్థ లో మరో వైసీపీ వికెట్ పడిపోయింది. గతవారం జీవీఎంసీ మేయర్ పదవిని కోల్పోయిన వైఎస్ఆర్సిపి డిప్యూటీ మేయర్ పదవిని కూడా కోల్పోయింది. డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.   దీంతో వైసీపీ డిప్యూటీ పదవిని కూడా కోల్పోయినట్లే. వచ్చే నెలలో మరొక డిప్యూటీ మేయర్ నాలుగేళ్ల పదవి కాలం ముగియడంతో అప్పుడు కూడా మరో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి సభ్యులు నిర్ణయించారు ఇదిలా ఉండగా కేవలం పదవి మాత్రమే కాక వైఎస్ఆర్సిపి పాలనలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు జియ్యాని శ్రీధర్ పాల్పడినట్లు ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకునే దిశలో కూటమి కార్పొరేటర్లు అడుగులు వేస్తున్నారు ఇప్పటికే అతనితో వ్యాపార సంబంధాలు నెరపే కూటమి నాయకులపై చర్యలు తీసుకుంటామని మూడు పార్టీల అధిష్టానాలూ హెచ్చరికలు జారీ చేశాయి.
విశాఖ జీవిఎంసి లో  పడిపోయిన మరో వైసీపీ వికెట్ Publish Date: Apr 26, 2025 9:32PM

బీఆర్ఎస్ రజతోత్సవ సభ..కేసీఆర్ ఏమి చెపుతారు?

సర్వత్రా అదే ఉత్కంఠ! భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) రజతోత్సవ సభకు సర్వం సిద్దమైంది. ఆదివారం (ఏప్రిల్ 27) జరిగే రజతోత్సవ సభ  వరంగల్ జిల్లా  ఎల్కతుర్తి సభా ప్రాంగణం సర్వాంగ సుదరంగా వెలిగి పోతోంది. సభా ప్రాంగణమే కాదు పరిసరాలు మొత్తం గులాబీ మయమయ్యాయి.ఇంచుమించుగా పది లక్షల  మంది  సభకు వస్తారన్న అంచనాలతో  ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. లక్షలాదిగా వచ్చే ప్రజలకు ఏ లోటూ లేకుండా, ఎలాంటి అసౌకర్యం కలగా ఃకుండ.. వైద్య సేవలు, అంబులెన్స్ లు సహా అని సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  మరో వంక తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్‌ 27న ఏర్పడిన గులాబీ పార్టీ పాతికేళ్ల   పండుగను, ధూమ్ ధామ్ గా, అత్యంత వైభవంగా, నభూతో నభవిష్యత్  అన్న విధంగా నిర్వహించేందుకు గులాబీ పార్టీ గత నెల రోజులకు పైగానే కసరత్తు చేస్తోంది. ఓ వంక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు  జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తునారు. సభను ఎలా సక్సెస్ చేయాలనే విషయంలో నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.  ఒక్కసారి ఓడిపోయినా, మళ్ళీ వచ్చేది మనమే  అన్న భరోసా ఇస్తున్నారు. నాయకుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మరో వంక పార్టీ కార్యనిర్వక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత ఇతర ముఖ్యనాయకులు జిల్లాలలో పర్యటించి నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా గట్టిగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా జన సమీకరణ పై గులాబీ దళం ప్రత్యేక దృష్టిని కేద్రీకరించింది. ఒక విధంగా చూస్తే రజతోత్సవ సభను బలప్రదర్శన సభగా నిర్వహించే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.   అయితే  రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలు నిర్వహించడం సహాజమే.  అయితే..  ఎన్నికల సమయంలో లేదా ఎన్నికలు సమీపిస్తున్నసమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు భారీ బహిరంగ సభలను ప్లాన్ చేస్తాయి.  అయితే, బీఆర్ఎస్  ఇప్పుడు ఏ ఎన్నికలు ఉన్నాయని బల ప్రదర్శన లక్ష్యంగా సభను నిర్వహిస్తోంది  అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదని అంటున్నారు. సమీప భవిష్యత్ లో పంచాయతీ ఎన్నికలు,  వస్తే గిస్తే, ఆ పది నియోజక  వర్గాల ఉప ఎన్నికలు మినహా చెప్పుకోదగ్గ ఎన్నికలు ఏవీ కనిపించడం లేదు.అయినా, బీఆర్ఎస్ పదిలక్షల మందితో భారీ బహిరంగ సభను ఈ సమయంలో ఎందుకు నిర్వహిస్తోంది? ఈ సభ నిర్వహించేందుకు గులాబీ  పార్టీ  ఇంచుమించుగా రూ.100 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని అంటున్నారు. అందులో ఎంత నిజం ఉందో ఏమో కానీ..  జరుగుతున్న ఏర్పాట్లు, ప్రచార హోరు చూస్తుంటే, ఇంకొంచెం ఎక్కువే ఖర్చయినా ఆశ్చర్య పోనవసరం లేదని కారు నేతలే అంటున్నారు. అవును.. డబ్బుకు వెనకాడకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని నేతలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.  అయితే.., ఈ సమయంలో  ఎందుకింత ఆర్భాటం, ఎందుకీ బల ప్రదర్శన అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.  ఆఫ్కోర్స్.. ఒక పార్టీ చరిత్రలో రజతోత్సవాలకు ఉండే ప్రాధాన్యతను, ప్రాముఖ్యతని ఎవరూ కాదన లేరు. నిజానికి  ఒక ప్రాంతీయ పార్టీ పాతికేళ్లు  మనుగడ సాగించడమే గొప్ప విషయం.   ముఖ్యంగా.. ఒక ఉద్యమ పార్టీగా.. తెలంగాణ రాష్ట్ర సాధన ఒక్కటే సింగల్ పాయింట్ ఎజెండాగా  పుట్టిన పార్టీ పాతికేళ్ళు ప్రస్థానం సాగించడం సాధారణ విషయం కాదు.  అందుకే    బీఆర్ఎస్ గాపేరుమార్చుకున్న టీఆర్ఎస్  రజతోత్సవాలను ఎంత ఘనంగా జరుపుకున్నా అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. అందులోన.. ,ఈ పాతికేళ్లలో గులాబీ పార్టీ,రాష్రాన్ని సాధించి, లక్ష్యాన్ని చేరుకోవమే కాకుండా, దేశ  రాష్ట్ర రాజకీయాలను ఎంతో కొంత  ప్రభావితం చేసింది. అవును..  ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 నుంచి 2014 వరకు ఉద్యమ పార్టీగా (14 ఏళ్ళు) ప్రజాస్వామ్య పద్దతిలో రాజకీయ పోరాటం చేసి రాష్ట్రన్ని సాధించినగులాబీ పార్టీ, పదేళ్ళ అధికార పార్టీగా ఓ వెలుగు వెలిగిన పార్టీ రజతోత్సవాలను జరుపుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు. కానీ..  కోట్లు ఖర్చు పెట్టి, ఎన్నికల సభను తలపించే విధంగా లక్షల మందితో సభను నిర్వహించడం  ఎందు కోసం?  దేనికి సంకేతం?  అనే ప్రశ్నలకు ఆస్కారం కల్పిస్తోందని అంటున్నారు. అదొటి అయితే..  రజతోత్సవ సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసేఅర్  ఏమి మాట్లాడతారు?  అనేది   ఆసక్తిని రేకెత్తిస్తోందని అంటున్నారు. గడచిన 15- 16 నెలల్లో కేసీఆర్ ఫార్మ హౌస్ గడపదాటి బయటకు వచ్చిన సందర్భాలు పెద్దగా లేవు. ఇక బహిరంగ సభలో ప్రసంగించి కూడా చాల కాలమైంది. ఎప్పుడో  సంవత్సరం సంవత్సరం క్రితం నల్గొండ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభల్లో కనిపించారు. అంతే..  ఆ తర్వాత కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన లేదు. సో .. సహజంగానే  కేసీఆర్ ఏమి మాట్లాడతారు అన్నది  మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్లు బీఆర్ఎస్ వారికే కాదు, కాంగ్రెస్, బీజేపీ వారికి, సామాన్య ప్రజలకు కూడా ఆసక్తి కల్గిస్తోంది. అయితే..  విశ్వసనీయ సమాచారం మేరకు  కేసీఆర్... తెలంగాణ ఉద్యమ చరిత్రతో  మొదలు పెట్టి.. బీఆర్ఎస్పదేళ్ళ పాలన,  ప్రస్తుత కాంగ్రెస్ పాలన గురించి ప్రసంగించే అవకాశాలే ఎక్కువగా  కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాల పైనే, కేసీఆర్ ఫోకస్  ఉంటుందని, అంటున్నారు. మరోవంక, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ ఏమి మాట్లాడతారు? అనేది కూడా ఆసక్తిని రేకిస్తోందని అంటున్నారు. అలాగే.. ఈ సభ తర్వాత కేసీఆర్ ఏమి చేస్తారు?  బ్యాక్ టూ ఫార్మ్ హౌస్ అంటారా? ముందుండి పార్టీని నడిపిస్తారా అ నేది అన్నిటినీ మించిన  వంద కోట్ల ప్రశ్న.
బీఆర్ఎస్ రజతోత్సవ సభ..కేసీఆర్ ఏమి చెపుతారు? Publish Date: Apr 26, 2025 8:01PM

సజ్జల.. పిల్ల సజ్జల సరే.. ఈ మూడో సజ్జల ఎవరు?

జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డిని  పోలీసులు శుక్రవారం (ఏప్రిల్ 25) అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఇప్పటి వరకూ జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో అన్నీ తానై వ్యవహరించి  సకల శాఖల మంత్రిగా, సీఎం జగన్ కు కళ్లు, చెవులూ నోరుగా ఇంకా స్పష్టంగా చెప్పాలంటే డిఫాక్టో సీఎంగా చక్రం తిప్పిన రామకృష్ణారెడ్డి, అలాగే వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ గా  సామాజిక మాధ్యమంలో అడ్డగోలు పోస్టులు, అనిచిత వ్యాఖ్యలు, మార్ఫింగ్ ఫొటోలతో రెచ్చిపోయి భ్రష్టుపట్టిన పిల్ల సజ్జల అదేనండి సజ్జల రామకృష్ణారెడ్డి పుత్రరత్నం సజ్జల భార్గవ  రెడ్డే అందరికీ సుపరిచితులు. కానీ ఇప్పుడు జగన్ హయాంలో జరిగిన భారీ మద్యం  కుంభకోణం కేసులో అరెస్టయిన ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు అన్న  ఆసక్తి  సర్వత్రా వ్యక్తం అవుతోంది.  ఈ కేసులో కర్త, కర్మ, క్రియ అని చెప్పబడుతున్న రాజ్ కసిరెడ్డి తరువాత అరెస్టైన వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డి. మద్యం  కకుంభకోణంలో  ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి వసూల్ రాజాగా వ్యవహరించారనీ,  మద్యం తయారీ కంపెనీలు కమీషన్లు చెల్లించేలా కంపెనీలను వాటిని బెదిరించడం, వసూలు చేసిన కమిషన్లను చేర్చాల్సిన చోటికి చేర్చడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించినది   సజ్జల శ్రీధర్ రెడ్డిది దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. సరే ఇప్పుడు అసలు ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే.. మళ్లీ సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకే వెళ్లాల్సి ఉంటుంది.  జగన్ ప్రభుత్వంలో కీలక ప్రాత పోషించిన, సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువు. జగన్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో  సజ్జల రామకృష్ణారెడ్డి  తన పలుకుబడిని ఉపయోగించి.. తన కుమారుడు  సజ్జల భార్గవ్ రెడ్డి (పిల్ల సజ్జల) సహా తన   మిత్రులు,బందువులు, సన్నిహితులే కీలక వ్యవహారాల్లో చక్రం తిప్పేలా చర్యలు తీసుకున్నారు. అలాంటి వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి సమీపబందువు సజ్జల శ్రీధర్ రెడ్డి  ఒకరు. ఈ సజ్జల శ్రీధర్ ెడ్డి   నంద్యాల మాజీ ఎంపి ఎస్పీవై రెడ్డికి అల్లుడు కూడా.  ఎస్పీవై రెడ్డికి చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ర్. అదనపు క్వాలిఫికేషన్ ఏమిటంటే.. శ్రీధర్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని తుమ్మలపల్లి గ్రామం.2012 పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.  2019లో నంద్యాల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాతే వైసీపీలో చేరారు. చేరి  మద్యం స్కామ్ లో కీలకంగా వ్యవహరించారు.  
సజ్జల..  పిల్ల సజ్జల సరే.. ఈ మూడో సజ్జల ఎవరు? Publish Date: Apr 26, 2025 7:54PM

చంద్రగిరిలో ఏనుగుల దాడి.. రైతు మృతి

  తిరుపతి జిల్లాలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి.  తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ లో ఏనుగులు భీభత్సం చేశాయి. కొత్తపల్లి సమీపంలో పొలం వద్ద పనిచేసుకుంటున్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగులు తొక్కడంతో రైతు చనిపోయాడని స్థానికులు తెలిపారు. శరీరంలోని భాగాలు బయటకు వచ్చి భయానక పరిస్థితి నెలకొందని తోటి రైతులు చెబుతున్నారు. మృతుడ్ని దాసరగూడెనికి చెందిన సిద్దయ్యగా గుర్తించారు. వరుస ఘటనలతో రాత్రివేళతో పాటు పగలు సైతం ఆ ప్రాంతాల్లో తిరగాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. జనవరి 19వ తేది నారావారిపల్లె ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి ని ఏనుగులు తొక్కి చంపడం తెలిసిందే. 
చంద్రగిరిలో ఏనుగుల దాడి.. రైతు మృతి Publish Date: Apr 26, 2025 6:57PM

లిక్కర్ స్కాం బిగ్‌బాస్ జగన్ .. అరెస్టుకు సోమిరెడ్డి డిమాండ్

  ఏపీ లిక్కర్ స్కాంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా విచారణ చేపట్టింది. ఈ కేసు విషయంలో సిట్ అధికారులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు.  ఈ స్కాంలో ఎవరున్నా విడిచి పెట్టవద్దని ఏపీ ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. దీంతో సిట్ అధికారులు ఈ కేసు విషయంలో దూకుడు పెంచారు. ఆ క్రమంలో ఇప్పటికే ఇదే కేసులో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్న సెట్ అధికారులు తాజాగా మరో కీలక వ్యక్తి సజ్జల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లిక్కర్ స్కాంకి అసలు బిగ్ బాస్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్ అని , ముందు  ఆయన్ని జైలుకు సోమిరెడ్డి డిమాండ్ చేశారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరకం మద్యం తాగి ఎందరో పేదలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.  మద్యం కుంభకోణం విషయంలో వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐ, ఈడీని రంగంలోకి దింపాలని అన్నారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మద్యపానం నిషేధ హామీతో అధికారంలోకి వచ్చి, మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని అన్నారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ కుంభకోణంలో ఇప్పటి వరకూ రూ.3200కోట్లు మాత్రమే సీఐడీ వెలికితీసిందని, అనధికార లావాదేవీలు ఇంకా పెద్దమొత్తంలో జరిగాయని ఆరోపణలు గుప్పించారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణమని షాకింగ్ కామెంట్స్ చేశారు. రూ.1.35లక్షల కోట్లు నగదు రూపంలో బదిలీ చేసి డిజిటల్ ఆంధ్రాని కాస్తా క్యాషాంధ్రగా మార్చారని విమర్శించారు. జగన్ హయాంలో అడిగిన లంచాలు ఇవ్వలేక నాటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మెక్ డోవెల్స్ కంపెనీని మూసేసుకున్నారని అన్నారు. మొత్తానికి సోమిరెడ్డి చేస్తున్న ’బిగ్‌బాస్ అరెస్ట్‘ డిమాండ్ వైరల్‌గా మారుతోందిప్పుడు
లిక్కర్ స్కాం బిగ్‌బాస్ జగన్ .. అరెస్టుకు సోమిరెడ్డి డిమాండ్ Publish Date: Apr 26, 2025 6:43PM

బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం..గులాబీ మయం అయిన ఎల్కతుర్తి

  బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ నిర్వహిస్తున్నారు. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్‌ను ఏర్పాటుచేశారు. సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్‌ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. గులాబీ దళపతి కేసీఆర్‌ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్‌ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.  500 మంది కూర్చునే సామర్థ్యంతో వేదిక గులాబీ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో వేదికను ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దాదాపు 50 వేల వాహనాల కోసం 1,059 ఎకరాల్లో పార్కింగ్‌ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా గ్రీన్‌, రెడ్‌ కార్పెట్లు ఏర్పాటుచేశారు.   బహిరంగ సభకు ఐదు చోట్లా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయగా, వాహనాల మళ్లింపు, ఇతర సేవల కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 2 వేల మందికిపైగా వలంటీర్లను అందుబాటులో ఉంచారు. ఈ మేరకు వారికి ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ ఇచ్చి వాహనాల మళ్లింపుతో పాటు జనాలకు అవసరమైన సేవలందించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వారందరికీ ట్రైనింగ్ కూడా ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. విద్యుత్తు సరఫరా అందించేందుకు 200కుపైగా జనరేటర్లు పెడుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇదిలాఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చే కరెంట్ పై తమకు నమ్మకం లేదని, అందుకే 200కుపైగా జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. వైద్య సేవల కోసం బృందాలు సభకు 10 లక్షల మంది వరకు వస్తారని పార్టీ అంచనా వేస్తుండగా, ఎండల నేపథ్యంలో అక్కడ వందకు పైగా వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.  అంతేగాకుండా ఎమర్జెన్సీ సేవల కోసం 15 అంబులెన్సులు, 10 లక్షల వాటర్ బాటిల్స్, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో పెడుతున్నారు. అంతేగాకుండా ఎక్కడికక్కడ తాత్కాళిక టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రజతోత్సవ సభ నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా, పార్టీ నేతలు జన సమీకరణపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్ఛార్జులను నియమించి, కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇప్పటికే దూర ప్రాంతాల నుంచి ఎండ్ల బండ్లతో పాటు పాదయాత్రలతో పార్టీ కార్యకర్తలు ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి బయలుదేరారు. రేపు (27వ తేదీ) సాయంత్రం వరకు సభ ప్రారంభం కానుండగా, సాయంత్రం 4 గంటలలోగా కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని గులాబీ నేతలు సూచిస్తున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం..గులాబీ మయం అయిన ఎల్కతుర్తి Publish Date: Apr 26, 2025 6:32PM

దేశంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా అణచివేస్తున్నారు : రాహుల్ గాంధీ

  దేశంలో ప్రస్తుతం ప్రతిపక్షాలన్ని మాట్లాడనివ్వకుండా గొంతునొక్కేవిధంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రయత్నిస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో కొనసాగుతున్న భారత్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని  రాహుల్‌ అన్నారు. ఆధునిక సామాజిక మాధ్యమాలతో అంతా మారిపోయిందన్నారు. తాను నిన్ననే రావాల్సి ఉన్నా, కశ్మీర్‌కు వెళ్లడం వల్ల రాలేకపోయానని, అందుకు క్షమించాలని కోరారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర (భారత్ జోడో యాత్ర) చేయాలని నిర్ణయించుకున్నట్లు రాహుల్ గాంధీ వివరించారు. తాను కశ్మీర్‌లో యాత్రను ముగించినట్లు గుర్తుచేశారు. ఈ పాదయాత్ర ద్వారా తాను ముఖ్యంగా రెండు విషయాలు నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా మా ప్రత్యర్థులు కోపం, భయం, ద్వేషంపై గుత్తాధిపత్యం కలిగి ఉన్నారు. ఆ విషయంలో వారితో పోటీ పడటం మా వల్ల కాదు. కోపం, భయం, ద్వేషం విషయంలో వారు ప్రతిసారీ మమ్మల్ని అధిగమిస్తారు, ఓడిస్తారు" అని రాహుల్ పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధే  కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. దీనికోసం అనేక పథకాలను తీసుకొచ్చామన్నారు. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే రూ.20 వేల కోట్లు రుణమాఫీ  చేశామని చెప్పారు. అంతకు ముందు శంషాబాద్‌లొ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ హెచ్ఐసీసీకి బయలుదేరారు.  
దేశంలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా అణచివేస్తున్నారు : రాహుల్ గాంధీ Publish Date: Apr 26, 2025 6:12PM

మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించారు.  బుడగట్లపాలెం సముద్రతీరంలో మత్య్సకారుల వద్దకు వెల్లి వారి జీవన విధానాన్ని పరిశీలించారు.  అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మత్స్య కారులను ఆదుకుంటామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటామని.. ఎన్ని కష్టాలున్నా మీ పరిస్థితి మారుస్తామని తెలిపారు.  ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు వేట విరామ సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్‌ వెళ్లినా.. ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ పని చేసేవారు ఇక్కడి వారే. 26 జిల్లాల్లో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే.  ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశాను. నేనూ బటన్‌ నొక్కవచ్చు.. కానీ,  మీ కష్టాలు తెలుసుకునేందుకే వచ్చా. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయం పెంచాలి. ప్రజల జీవనప్రమాణాలను మెరుగుపరచాలి. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతాం. గత ప్రభుత్వ హయాంలో రూ.10లక్షల కోట్లు అప్పులు చేశారు. వాటితో ఏం చేశారో లెక్కలు కూడా లేవు. గతంలో ఎర్రన్నాయుడు ఉద్దానం ప్రాంతానికి నీళ్లు సాధించారు. ఎంపీ రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం పూర్తికాబోతోందన్నారు.  దేశంలో ఉత్పత్తయ్యే మత్స్య సంపదలో 29శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుంది. మత్స్య ఉత్పత్తుల ద్వారా 16.50 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. మత్స్యకారుల పిల్లల్ని బాగా చదివించే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే 6 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఏర్పాటు చేశాం. ఎచ్చర్లలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తాం. స్థానిక ఉద్యోగాలు ఈ ప్రాంత వాసులకే వచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని చంద్రబాబు అన్నారు. రూ. 1990 కోట్లతో 9 షిప్పింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు రూ. 33 వేల కోట్ల పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చంద్రబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
మత్స్యకారుల సేవ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు Publish Date: Apr 26, 2025 5:05PM

కన్నడ నటి రన్యారావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

  గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెతో పాటు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్ ఎస్. విశ్వనాథ్ శెట్టి ఈ మేరకు తీర్పు వెలువరించారు. డీఆర్ఐ అధికారుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, నిందితుల అభ్యర్థనలను తోసిపుచ్చారు. గత నెలలో దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తూ రన్యారావు బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె వద్ద నుంచి సుమారు 14.7 కిలోల గోల్డ్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసులో రన్యాతో పాటు ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, తనను బెదిరించి ఇరికించారని రన్యారావు మొదట చెప్పినట్లు అధికారులు తెలిపారు.  కానీ, డీఆర్ఐ లోతైన దర్యాప్తులో భాగంగా, ఈ బంగారం అక్రమ రవాణాలో రన్యారావు కొన్నేళ్లుగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలిందని అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆమెకు బెయిల్ మంజూరు చేయవద్దని గట్టిగా వాదించారు.ఈ కేసులో మూడో నిందితుడిగా (ఏ3) ఉన్న ఆభరణాల వ్యాపారి సాహిల్ జైన్‌ను కూడా డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, బెయిల్ కోసం రన్యారావు చేసిన ప్రయత్నాలు ఇప్పటికే రెండుసార్లు విఫలమయ్యాయి. మరో ఏడాది పాటు ఆమెకు బెయిల్ లభించే పరిస్థితి లేదు. ఆమెపై నమోదైన కేసుల తీవ్రత దృష్ట్యా ఏడాది పాటు జైళ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రన్యా రావుపై అక్రమ రవాణా నిరోధక చట్టం కింద అధికారులు అభియోగాలు మోపారు. దీంతో ఒక సంవత్సరం పాటు నిర్బంధంలో ఉండొచ్చని వర్గాలు పేర్కొన్నాయి. రన్యారావుపై కన్జర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్టివిటీస్ యాక్ట్ , 1947 (COFEPOSA) కింద కేసు నమోదు చేసినట్లు శుక్రవారం సంబంధిత వర్గాలు ధ్రువీకరించాయి. కోఫెపోసా చట్టం కారణంగా ఒక సంవత్సరం పాటు బెయిల్ లభించే అవకాశం ఉండదని తెలుస్తోంది. 
కన్నడ నటి రన్యారావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ Publish Date: Apr 26, 2025 4:05PM

వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉండి ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆమెను ఆదేశించినట్లు సమాచారం. వివేకా మర్డర్ కేసులో ఫస్ట్ నుంచి సాక్షులుగా ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పద రీతిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరుగురు సాక్షులు ఇలా మరణించడంతో, ముఖ్యంగా కీలక సాక్షి రంగన్న మృతి తర్వాత, ప్రభుత్వం ఈ వరుస మరణాలపై దృష్టి సారించి సిట్ ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సిట్ అధికారులు పులివెందులలో ఉంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ దర్యాప్తులో భాగంగా, వివేకా హత్య కేసులో మరో సాక్షిగా ఉన్న కసునూరు పరమేశ్వర్ రెడ్డిని సిట్ అధికారులు నేడు విచారిస్తున్నారు. మొదట తనకు నోటీసులు ఇవ్వలేదని పరమేశ్వర్ రెడ్డి వాదించినప్పటికీ, పోలీసులు ఆయనను ఇంటి నుంచి పులివెందులలోని విచారణ కేంద్రానికి తరలించినట్లు తెలిసింది. తాజాగా, ఇటీవల మరణించిన రంగన్న భార్య సుశీలమ్మకు కూడా సిట్ నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. రంగన్న మృతికి ముందు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై ఆమె నుంచి వివరాలు సేకరించే అవకాశం ఉంది. సుశీలమ్మను కూడా ఈ రోజు సాయంత్రం విచారించవచ్చని భావిస్తున్నారు.
వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు Publish Date: Apr 26, 2025 3:32PM

రేపటిలోగా వెళ్లిపోండి.. భాగ్యనగరంలో ఉన్న పాకిస్థానీల‌కు నోటీసులు

  కాశ్మీర్ ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న నేప‌థ్యంలో హైదరాబాద్‌లో ఉంటున్న న‌లుగురు పాక్ పౌరుల‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ వీసాల‌తో ఉంటున్న‌ట్లు గుర్తించారు. రేప‌టిలోగా నగరం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. కాగా, భాగ్య‌న‌గ‌రంలో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్న‌ట్లు పోలీసుల త‌నిఖీల్లో తేలింది.  ఉగ్రదాడి నేపథ్యంలో  భార‌త ప్ర‌భుత్వం పాకిస్థానీల‌ను దేశం నుంచి వెళ్ల‌గొడుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప‌లు రాష్ట్రాల్లో పోలీసులు సోదాలు నిర్వ‌హిస్తున్నారు.  త‌నిఖీలు చేప‌ట్టి పాకిస్థానీల‌ను గుర్తిస్తున్నారు. హైదరాబాద్ లో నలుగురు పాకిస్తానీయులకు పోలీసులు నోటీసులు ఇచినట్లు తెలుస్తోంది. నలుగురు వ్యక్తులు షార్ట్ టర్మ్ వీసా (STV) హోల్డర్స్ గా ఉన్నట్లు గుర్తింపు. రేపటి లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉన్నారు. ఈ నెల 27 తర్వాత వీసాలు రద్దవుతాయి డీజీపీ జితేందర్ తెలిపారు. మెడికల్‌ వీసా దారులకు ఈ నెల 29 వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు.
రేపటిలోగా వెళ్లిపోండి.. భాగ్యనగరంలో ఉన్న పాకిస్థానీల‌కు నోటీసులు Publish Date: Apr 26, 2025 3:13PM

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులివ్వలేం : కోర్టు

  నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు నోటీసులు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. నూతన న్యాయ చట్ట నిబంధనల ప్రకారం నిందితులను విచారించకుండా ఛార్జిషీట్ తీసుకోలేమని పేర్కొంది. కాగా, మనీలాండరింగ్ కేసు ఛార్జిషీట్లో కాంగ్రెస్ అగ్రనేతలు శామ్ పిట్రోడా, సుమన్ దూబేలను కూడా ఈడీ నిందితులుగా చేర్చిన విషయం తెలిసిందే.సుమారు రూ. 5,000 కోట్ల మేర మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఈ చార్జిషీట్‌లో ఆరోపించింది. ఈ పరిణామం సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై క్రిమినల్ విచారణ ప్రారంభించే దిశగా ఈడీ వేసిన కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చార్జిషీట్‌లో ఐదుగురు వ్యక్తులు, రెండు కంపెనీలను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో గాంధీ కుటుంబానికి నియంత్రణ వాటా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థతో పాటు, గాంధీ కుటుంబానికి సన్నిహితులుగా భావించే కాంగ్రెస్ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి వారు ఉన్నట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన లావాదేవీలు, నిధుల మళ్లింపును ధృవీకరించే పత్రాలను కూడా ఈడీ కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.గత కొన్నేళ్లుగా ఈ కేసుకు సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు దివంగత కాంగ్రెస్ కోశాధికారులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌లను కూడా ఈడీ గతంలో పలుమార్లు ప్రశ్నించింది  
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు నోటీసులివ్వలేం : కోర్టు Publish Date: Apr 26, 2025 1:09PM

మూడు రోజులు భారీగా ఎండ తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

  తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగ్గుమంటున్నాడు. ముఖ్యంగా తెలంగాణ లోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే నిన్న సాయంత్రం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ.. తీవ్ర ఉక్కపొతతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. గత రెండు వారాలుగా ఎండ తీవ్రతలు అధికంగా ఉండటంతో 30 మంది వరకు వడదెబ్బ కారణంగా మరణించారు. అలాగే మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ  అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.  ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో పాటు వడగాల్పులు వీసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే అవసరం అయితే తప్ప బయటకు వెళ్ళవద్దని ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎటువంటి బయట పనులు పెట్టుకోవద్దని సూచించిచారు. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళితే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకొవాలని, నిత్యం శరీరానికి నీటిని అందించాలని, ముఖ్యంగా పండ్ల రసాలను తీసుకొవాలని తెలిపారు
మూడు రోజులు భారీగా ఎండ తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ Publish Date: Apr 26, 2025 12:46PM