ఇక తెలుగుదేశం గెలుపు ‘గంట’ల మోతేనా?

గంటా ఎక్కడుంటే గెలుపు అక్కడ ఉంటుంది. ఒకవేళ అలా జరగకపోతే.. గెలుపు ఉన్న దగ్గరకే గంటా వెళ్తారు. గెలుపుకి, గంటాకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. గెలుపు గంటల మోత వినకపోతే గంటా శ్రీనివాసరావుకు నిద్రపట్టదు అనుకుంటా. అదేంటో విజయం కూడా ఆయన దగ్గరకు గెంతుకుంటూ వస్తుంది. 2004 లో తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యంలోకి జంప్ చేశారు. ప్రజారాజ్యం ఘోర పరాజయంపాలైనా గంటా మాత్రం మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవ్వడంతో మంత్రి కూడా అయ్యారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం విజయాన్ని ముందుగానే ఊహించిన ఆయన.. 2014 ఎన్నికలకు ముందు మళ్ళీ పసుపు కండువా కప్పుకున్నారు. ఆయన ఊహించినట్లుగానే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచింది. ఆయన కూడా గెలిచి మంత్రి పదవి చేపట్టారు. 2019 లో ఫ్యాన్ గాలి జోరులోనూ గంటా విజయ ఢంకా మోగించారు. అయితే   తెలుగుదేశం అధికారంలో లేకపోవడంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారనే వార్తలు ఆమధ్య బలంగా  వినిపించాయి. గంటా సైతం కొంతకాలం తెలుగుదేశంతో అంటీముట్టనట్టుగా ఉన్నారు. అయితే ఇప్పుడు లెక్క మారింది. 2014 సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని, 2024 ఎన్నికల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని ఆయన ముందుగానే ఊహించినట్టు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం గంటా నమ్మకాన్ని బలపరిచింది. అందుకే ఆయన సైకిల్ మీదే నా ప్రయాణం అంటున్నారు. తాజాగా ఆయన తెలుగుదేశం యువనేత నారా లోకేష్ తో కలిసి యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో తెలుగుదేశం శ్రేణులు సంబరపడుతున్నారు. "గంటా ఉన్న దగ్గర గెలుపు ఉంటుంది, గెలుపు ఉన్న దగ్గర గంటా ఉంటాడు" అనే మాట 2024 లో మరోసారి రుజువు అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక గంటా ముందుగానే ప్రజా నాడి ఏమిటన్నది తెలుసుకున్నారనడానికి లోకేష్  పాదయాత్ర ప్రారంభించడానికి ముందు హైదరాబాద్‌లో ఆయనను ఓ సారి కలిసి పాదయాత్ర విజయవంతం అవుతుందని ప్రకటించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా విస్తృత ప్రచారం చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదట చిన్న లక్ష్మి కుమారి అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించినప్పటికీ అనుకున్నప్పటికీ, గంటా సూచనతోనే చివరి క్షణంలో చిరంజీవి రావును అభ్యర్థిగా పార్టీ అధినేత ప్రకటించారని కూడా చెబుతారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గంటా విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.  ఇప్పుడు గంటా శ్రీనివాస్ పాదయాత్రలో ఉన్న లోకేష్ వద్దకు వెళ్లారు. కలిశారు.  
Publish Date: Mar 21, 2023 10:01PM

దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా  లోకేశ్ తనయుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు మార్చి 21వ తేదీ మంగళవారం. ఈ సందర్భంగా ఒక రోజు అన్నప్రసాద  వితరణకు 33 లక్షల రూపాయిల విరాళాన్ని నారా లోకేశ్ దంపతుల తరఫున వారి కుటుంబ సభ్యులు తిరుమలలోని టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు.  తిరుమలలోని తరగొండ వెంగమాంబ నిత్యన్నప్రసాద కేంద్రంలో జరిగే అన్న ప్రసాద వితరణ కోసం ఈ విరాళాన్ని వినియోగించాలని కోరారు. అయితే ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక రోజు.. అన్నప్రసాదం కోసం విరాళం ఇవ్వడం నారా ఫ్యామిలీకి  ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా  ఈ రోజు నిత్యన్నదానం కోసం విరాళం ఇవ్వడంతో.. మంగళవారం  తిరుమలలోని  శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు తరిగొండ వెంగమాంబ నిత్యన్న దానం కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన డిస్ ప్లే బోర్డుల్లో నారా దేవాన్ష్ పేరు ప్రదర్శిస్తున్నారు.   టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, బ్రహ్మణి దంపతులకు 2015లో దేవాన్ష్ జన్మించారు. దేవాన్ష్ జన్మించిన ఏడాది నుంచి ప్రతి ఏటా అతడి పుట్టిన రోజు నాడు ఇలా తిరుమలలో అన్నదానానికి విరాళం అందజేస్తోందీ నారా కుటుంబం.  మరోవైపు నారా దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.  సమాజమే దేవాలయం  అని భావించే సంస్కృతిని, దానగుణాన్ని .. చిన్ననాటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం తల్లిదండ్రుల ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. టీడీపీ అధినేత, చంద్రబాబు గారి మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు.. ఈ రోజు. ఈ సందర్బంగా తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కోసం ఒక రోజుకు సరిపడా ఖర్చను.. అంటే 33 లక్షల భారీ విరాళాన్ని అందించారు నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు, అంతేకాకుండా దేవాన్ష్ పేరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ రోజు రాష్ట్రమంతటా అన్నదానం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ  ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
Publish Date: Mar 21, 2023 3:40PM

కవిత అరెస్టేనా?.. తెలంగాణ వ్యాప్తంగా పోలీసుల అలర్ట్!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ తెలంగాణ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయనుందా?   మంగళవారం ఉదయం కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ కొనసాగుతోంది. అయితే విచారణ అనంతరం ఆమెను ఈడీ అరెస్టు చేస్తుందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎందు కంటే తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరించాయి. ఎక్కడ చూసినా పెద్ద సంఖ్యలో పోలీసులు, పారమిలిటరీ బలగాలే కనిపిస్తున్నాయి. గతంలో ఈడీ కవితను విచారించిన సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద మాత్రమే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ పరిసరాల్లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ణలు విధించారు. అయితే ఇప్పుడు మాత్రం ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్దే కాదు, తెలంగాణ వ్యాప్తంగా భద్రత పెంచారు. మరీ ముఖ్యంగా   హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ముందు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఇక నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద అయితే పోలీసు, పారామిలిటరీ బలగాలకు తోడుగా బీజేపీయే ప్రైవేటు సెక్యూరిటీని అదనంగా నియమించుకున్న పరిస్థితి కనిపిస్తోంది.  అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలోనూ భద్రత పెంచాల్సిందిగా కేంద్ర నిఘావర్గాల నుంచి సమాచారం వచ్చినట్లు భోగట్టా. అలాగే రాష్ట్రంలోని కీలక బీజేపీ నేతల నివాసాలు, కార్యాలయాల వద్ద కూడా అధనపు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  దీంతో ఈడీ కవితను అరెస్టు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు.  
Publish Date: Mar 21, 2023 3:20PM

జగన్ రెడ్డి గుండెల్లో ఆత్మ ప్రబోధం గుబులు!

జగన్ తన నీడను చూసి తానే భయపడుతున్నారు. అందుకే సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారు. అందుకే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో భయం ఎంతగా ఉందంటే  సొంత పార్టీ ఎమ్మెల్యేలనే నమ్మలేక పోతున్నారు. పట్టభద్రుల మొట్టికాయల తర్వాత  జగన్ రెడ్డిలో ముందున్న 175/175 ధైర్యం మటుమాయమైందని  పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు.  మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఎదురైన వందకు ‘వంద’శాతం ఓటమి జగన్ రెడ్డిని కంగు తినేలా చేసిందనీ,ఈ నేపధ్యంలో  మరో రెండు రోజులలో అంటే గురువారం (మార్చి23)  జరిగే,ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఎమ్మెల్యేలు ఏమీ చేస్తారో అనే భయం జగన్ రెడ్డిని వెంటాడుతోందని అంటున్నారు. నిజానికి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న కారణంగా  వైసీపీ ఎమ్మెల్యేలలో అసమ్మతి పెద్దగా పైకి కనిపించక పోయినా  ప్రతి జిల్లాలోనూ అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గడపగడపకు రివ్యూ పేరిట నిర్వహించిన సమావేశాలలో ముఖ్యమంత్రి తమను చులకన చేసి మాట్లడిన తీరును, గడపగడపకు టెస్టులో మార్కులు తెచ్చుకోక పోతే మళ్ళీ పార్టీ టికెట్ రాదని అందరి ముందు అవమాన పరిచిన తీరును ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీలు మరిచి పోలేకుండా ఉన్నారని అంటున్నారు. అందులో ఒకరిద్దరు అటూ ఇటూ అయినా, జగన్ రెడ్డి ఇమేజ్  డ్యామేజి కావడమే కాకుండా పార్టీలో ఇంతవరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్క సారిగా భగ్గు మంటుందని  అందుకే ముఖ్య మంత్రి జగన్ రెడ్డి అనుమానిత  ఎమ్మెల్యేలు మంత్రులపై  పై ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.   నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ మనసులోని భయాన్ని మరో రూపంలో బయట పెట్టుకున్నారు. తెలుగు దేశం పార్టీ తమ పార్టీ  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తోందని, తాడేపల్లి ప్యాలెస్ సన్నిహిత నేతలు ఆరోపిస్తున్నారు.  అయితే, నిజానికి అధికారాన్ని అడ్డుపెట్టుకుని  ఇప్పటికే నలుగు టీడీపీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకున్న  వైసీపీయే  అలాంటి ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీది కేవలం ఆరోపణ కాదు. అదే నిజం.  ఎమ్మెల్యేల కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. ఒక్కో అభ్యర్థికి 22 మంది ఎమ్మెల్యేలు ఓటేస్తేనే విజయం వరిస్తుంది. వైసీపీ ఏడు స్థానాలకూ అభ్యర్థులను నిలిపింది. 22 మంది ఎమ్మెల్యేల చొప్పున 154 ఓట్లు పడితేనే అందరూ గెలిచే అవకాశం ఉంటుంది.  వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 151 మాత్రమే. టీడీపీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలూ (వాసుపల్లి గణేశ్‌, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం) ఇప్పుడు వైసీపీతో ఉన్నారు. జనసేన ఏకైక సభ్యుడు రాపాక వరప్రసాద్‌ సైతం వైసీపీతోనే ఉండడంతో తమ పార్టీ అభ్యర్థులు ఏడుగురూ గెలుస్తారని జగన్‌ రెడ్డి లెక్కలు వేశారు. సొంత బలం లేకున్నా సంతలో కొనుక్కున్న ఎమ్మెల్యేల అండ చూసుకుని ఏడవ అభ్యర్ధిని బరిలో దించారు. మరో వంక ప్రతిపక్ష టీడీపీకి సాంకేతికంగా సరిపడిన సంఖ్యా బలం ( 23 మంది) ఉన్నందున  బీసీ మహిళ పంచుమర్తి అనూరాధను పోటీకి దించింది.అసెంబ్లీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నందున  తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవంక వైసీపీ నుంచి  ఇప్పటికే బయట పడిన నెల్లూరు జిల్లా అసమ్మతి ఎమ్మెల్యేలు, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీ అభ్యర్థులకు ఓటేస్తారనే నమ్మకం లేదు. నిజానికి ఆ ఇద్దరు ఇప్పటికే అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తామని ప్రకటించారు. ఆ ఇద్దరూ టీడీపీ అభ్యర్థికి  ఓటేస్తే ప్రతిపక్షం బలం 21కి చేరుతుంది. మరొక్క ఓటు పడితే టీడీపీ గెలుస్తుంది.  పట్టభద్రుల ఎమ్మెల్సీల గెలుపుతో ఊపుమీదున్న సైకిల్‌ వైపు వైసీపీ ఎమ్మెల్యేలెవరైనా మొగ్గితే..  వైసీపీ అభ్యర్థుల్లో ఒకరు ఓడిపోతారు. అదే జరిగితే పార్టీ మీద ముఖ్యమంత్రి పట్టు తప్పే ప్రమాదముంది. అందుకే  జగన్ రెడ్డి ఎమ్మెల్యేల పై ప్రత్యేక నిఘా పెట్టారని అంటున్నారు.  ముఖ్యంగా, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున..  గుంటూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు సొంత పార్టీకి ఓటేస్తారో లేదోనని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. ఈ అందరిపైన పోలీసు నిఘాతో పాటుగా పార్టీ నిఘా కూడా కొనసాగుతోందని అంటున్నారు. టీడీపీలో గెలిచి వైసీపీతో సఖ్యతగా ఉన్న ఒక ఎమ్మెల్యే సైతం ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  దీంతో ఆయన్ను కూడా ఓ కంట కనిపెట్టినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే గురువారం (మార్చి23)   జరిగే ఎమ్మెల్యే ఓటింగ్‌కు హాజరు కావాలని వైసీపీ నాయకత్వం పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్‌ జారీ చేసింది.  అయితే, ఏమి చేసినా ఇప్పటికే మనసు విరిగిన ఎమ్మెల్యేలు, ఎటూ టికెట్ రాదని నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యేలు, టికెట్ వచ్చినా వైసీపీ తరపున పోటీ చేయరాదనే నిర్ణయానికి వచ్చిన ఎమ్మెల్యేలు, ఇలా అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు,  ఆత్మ ప్రభోధం .. ప్రకారం ఓటు వేయాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
Publish Date: Mar 21, 2023 2:08PM

లిక్కర్ స్కామ్.. కవిత చూట్టూనే ఎందుకు?

దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు సంభవించినా.. వాటి మూలాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉన్నట్లు.. దేశ రాజధాని హస్తిన వేదికగా జరిగిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మూలలు అదే తెలంగాణలో ఉన్నాయా? అనే సందేహం ఆ రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ స్కామ్‌లో కవితను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైందని.. ఆ క్రమంలో ఆమెకు బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవంటూ సోషల్ మీడియాలో కథనాలు అయితే వెల్లువెత్తుతున్నాయి.  మరోవైపు ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు.. అదుపులోకి తీసుకుని.. ప్రశ్నించి.. అతడిని అరెస్ట్ తీహార్ జైలుకు తరలించారు. అయితే ఆయన ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇంకోవైపు ఈ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాలకు లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మెడలకు సైతం ఈ కేసు చుట్టుకొంది. దీంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్ చార్జ్ మంత్రి మనీష్ సిసోడియాతోపాటు మరో మంత్రిని ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసి.. తీహార్ జైలుకు తరలించారు.    దేశవ్యాప్తంగా ఇంతలా ప్రకంపనలు సృష్టిస్తోందీ ఢిల్లీ లిక్కర్ స్కామ్... అలాంటి వేళ అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏమిటీ.. ఇది ఎప్పుడు జరిగింది.. ఎందుకు జరిగింది? ఈ లిక్కర్ స్కామ్ వల్ల ఎవరికీ లాభం.. మరెవరికీ నష్టం.. ఇంతకీ ఈ స్కామ్ ఎలా వెలుగులోకి వచ్చింది? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? అంటే ఒక్క సారి వెనక్కి వెళ్లాలి.     దేశ రాజధాని ఢిల్లీలో కొలువు తీరిన కేజ్రీవాల్ సర్కార్.. 2021, నవంబర్ 17న కొత్త లిక్కర్ పాలసీని అమలులోకి తీసుకు వచ్చింది. కొంత మంది నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పాలసీని అమలు చేస్తున్నట్లు కేజీవ్రాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అంతేకాదు ఇది పూర్తి పారదర్శకతతో దేశంలోనే అత్యత్తమ పాలసీ అని సీఎం కేజ్రావాలే సైతం స్పష్టం చేశారు. ఈ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం బాగా పెరుగుతోందని.. అలాగే వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుతాయని.. అంతేకాకుండా లిక్కర్ మాఫియతోపాటు బ్లాక్ మార్కెట్ విధానానికి పుల్ స్టాప్ పడుతోందని ఆయన చెప్పుకొచ్చారు.  మరోవైపు.. ప్రభుత్వ మద్యం అమ్మకాల్లో బ్లాక్ మార్కెట్‌ను నిలువరించడం కోసం.. మద్యం విక్రయాల ద్వారా రెవెన్యూ పెంచుకోవడం కోసం... మద్యం విక్రయాలను ఇకపై ప్రభుత్వం నిర్వహించకుండా.. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టాలని నిర్ణయించడం.. ఆ క్రమంలో మద్యాన్ని హోం డెలివరీ చేయడం.. అలాగే తెల్లవారుజాము 3గంటల వరకు మద్యం షాపులు బార్లా తెరిచి ఉంచడం.. మద్యం షాపులకు లైసెన్స్‌లను విచ్చల విడిగా కట్టబెట్టడం.. మద్యం విక్రయాలపై డిస్కోంట్‌ను అన్‌లిమిటెడ్‌ అంటూ ప్రకటించుకొనే అవకాశం దుకణాల యజమానులకు కల్పించడం.. వంటి అంశాలకు చోటు కల్పించారు. అలాగే ఈ నూతన మద్యం విధానం వల్ల ప్రభుత్వానికి 27 శాతం ఆదాయం పెరుగుతోంది.. అంటే అక్షరాల 8,900 కోట్ల రూపాయిల అధిక ఆదాయం ఢిల్లీ ప్రభుత్వానికి సమకూరనుంది. అయితే ఈ లిక్కర్ పాలసీపై పౌర సమాజంతోపాటు వాటి అనుబంధం సంఘాలు.. పలు ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్, విద్యా సంస్థలతోపాటు వివిధ  సంఘాలు, సంస్థలు సైతం తీవ్రంగా వ్యతిరేకరించాయి.  ఇంకోవైపు ఈ ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీ.. జీఎన్‌సీటీడీ యాక్ట్ 1991, టీఓబీఆర్ 1993, ఢిల్లీ ఎక్సైజ్ యాక్ట్ 2009, ఢిల్లీ ఎక్సైజ్ రూల్ 2010లకు తూట్లు పొడిచే విధంగా ఉందంటూ 2022, జులై 8వ తేదీన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ వీకే సక్సెనాకు ఢీల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పించారు. అలాగే ఈ లిక్కర్ పాలసీలో డిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ ఇన్‌చార్జ్ మంత్రి మనీష్ సీసోడియా అనుసరించి విధి విధానాలతోపాటు తీసుకున్న కీలక నిర్ణయాలను సైతం ఈ నివేదికలో పొందు పరిచారు. ఈ నేపథ్యంలో అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన లిక్కర్ పాలసీ 2021 - 2022పై విచారణ జరపాలని సీబీఐకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ లేఖ రాశారు.  అయితే ఈ ఢిల్లీ కొత్త లిక్కర్ పాలసీపై విచారణ జరిపించాలంటూ సీబీఐకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాయడంతో... ఢిల్లీ ఎక్సైజ్ శాఖ ఇన్ ఛార్జ్ మంత్రి మనిష్ సిసోడియా వెంటనే స్పందించారు...  మద్యం విక్రయదారులను బెదిరించేందుకు బీజేపీ తన నియంత్రణలో ఉన్న దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఆ క్రమంలో నూతన ఢిల్లీ లిక్కర్ పాలసీని వెనక్కి తీసుకొంటున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాదు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపైనే ప్రస్తుత ఎల్జీ వీకే సక్సేనా, ఆయనకు ముందు ఉన్న ఢిల్లీ ఎల్జీ అనిల్ బైజాల్‌పై ఈ సందర్భంగా మనీష్ సిసోడియా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ ఢీల్లీ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ విచారణ చేపట్టడం.. అందులోభాగంగా మనీ ల్యాండరీంగ్ జరిగినట్లు గుర్తించడంతో... ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి.. మనిషీ సిసోడియాతోపాటు ఆయన బంధువులు, సన్నిహితల ఇళ్లు కార్యాలయాలపై సోదాలు నిర్వహించారు. అలా ఈ కేసుకు సంబంధించిన తయారు చేసిన చార్జ్ షీట్‌లో తెలుగు రాష్టాలకు చెందిన పలువురు నేతల పేర్లు వచ్చి చేరాయి.  అలా ఈడీ అధికారుల చేపట్టిన దర్యాప్తులో సౌత్ గ్రూప్ అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలు లిక్కర్ లాబీగా ఏర్పడి ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు రూపాయిల నగదును ముడుపుల కింద ఇచ్చారని.. ఆ నగదును గోవా ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ వినియోగించుకొందని.. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ ఎదుట ఓ వ్యాపారవేత్త పేర్కొన్నారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సైతం ఈడీ విచారించి.. మరింత సమాచారం సేకరించి.. అనంతరం అతడిని సైతం అరెస్ట్ చేసింది.  అయితే ఢిల్లీని 32 ఎక్సైజ్ జోన్లుగా విభజించి.. వాటిలో 849 షాపులు ఏర్పాటు చేసుకునేందుకు రిటైల్ లిక్కర్ లైసెన్లు ప్రైవేట్ వ్యక్తులకు అందజేయడం ద్వారా.. మద్యం విక్రయ వ్యాపారం నుంచి ఢిల్లీ ప్రభుత్వం బయటకు వచ్చేయాలని నిర్ణయించింది. ఆ క్రమంలో మద్యం విక్రయించుకునే ప్రైవేట్ మద్యం దుకాణదారులకు పలు సడలింపులు సైతం చేసుకునే అవకాశాన్ని కల్పించింది. మద్యం విక్రయాల సందర్భంగా ఎమ్‌ఆర్పీ ధరను పక్కన పెట్టి.. సొంతంగా రేట్లు నిర్ణయించే అధికారాన్ని సైతం వారికి కట్టబెట్టింది. ఆ క్రమంలో మద్యంపై ప్రత్యేక ఆఫర్లు సైతం ఇవ్వోచ్చని చెప్పకనే చెప్పినట్లు అయింది.  మరోవైపు ఈ స్కామ్‌లో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసి.. విచారించింది. ఆ క్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు తాను ప్రతినిధిగా ఈ వ్యవహారంలో వ్యవహరించినట్లు ఈడీ ముందు ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. మరోవైపు కల్వకుంట్ల కవితకు ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో.. తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటానంటూ.. అరుణ్ రామచంద్ర పిళ్లై ప్రకటించడం ద్వారా ఆయన యూ టర్న్ తీసుకున్నట్లు అయింది.  అదీకాక.. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోని ఈ సౌత్ గ్రూప్‌ ఏర్పాటులో కల్వకుంట్ల కవిత ఉండడం వెనుక అరుణ్ రామచంద్రన్ పిళ్లై కీలక వ్యక్తిల్లో ఒకరుగా ఉన్నారని స్పష్టమవుతోంది. అలాగే ఈ స్కామ్‌లో ఒంగోలు ఎంపీ, వైయస్ఆర్ సీపీ నాయకుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు ఎం రాఘవరెడ్డితోపాటు అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిలు కూడా ఉన్నారు.  ఇక ఇండో స్పిరిట్‌లో అరుణ్ రామచంద్రన్ పిళ్లై 32.5 షేర్ హోల్డర్‌గా ఉన్నారు. దీంతో ఆయన ఎల్ 1 లైసెన్స్ కలిగి ఉన్నారు. ప్రేమ్ రాహుల్‌ 32.5 శాతం, అలాగే ఇండో స్పిరిట్ డిస్ట్రిబ్యూట్ కంపెనీ లిమిటెడ్ 35 శాతం ఇతర బాగస్వాములుగా ఉన్నారు. మరోవైపు అరుణ్ పిళ్లై, ప్రేమ్ రాహుల్‌లు.. కల్వకుంట్ల కవితతోపాటు మాగుంట రాఘవరెడ్డికి బినామీలుగా పెట్టుబడులు పెట్టారు. ఫిళైతోపాటు అతడి అసోసియేట్స్ అభిషేక్ బోయినపల్లి, గోరంట్ల బుచ్చిబాబు తదితరులు ... సౌత్ గ్రూప్ ఏర్పాటుతోపాటు ఈ మొత్తం లిక్కర్ స్కీమ్‌లో.... తయారీదారులు, హోల్‌సేల్, రిటైలర్లు ఏర్పాటు తదితర అంశాలను పర్యవేక్షించారు. ఇంకోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్.. విలువ మొత్తం పది వేల కోట్ల ఉంటుందని బీజేపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
Publish Date: Mar 21, 2023 12:41PM

తెరపైకి మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం.. ఫలించేనా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తన కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత నిండా ఇరుక్కోవడంతో ఆమెను కాపాడుకోవాలన్నా, తెలంగాణ సమాజం నుంచి ఆమెకు సానుభూతి మద్దతును కూడగట్టాలన్నా సెంటిమెంట్ తప్ప మరో దారి లేదని కేసీఆర్ భావించారా? అందుకే బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన నాటి నుంచి అటకెక్కించేసిన తెలంగాణ వాదాన్ని మళ్లీ కిందకు దించారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. మరో సారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నా.. రాష్ట్రంలో బీజేపీ దూకుడుకు కళ్లెం వేయాలన్నా జాతీయ రాజకీయాల జపం కాదు.. తెలంగాణ సెంటిమెంట్ అస్త్రమే ‘శ్రీరామ రక్ష’ అని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను మళ్లీ జనంలో రగిలించాలని చూస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం ఉద్యమ నేతగా తాను పడిన కష్టాన్ని, రాష్ట్రం సాధించుకున్న తరువాత ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధి సంక్షేమాలలో సాధించిన విజయాలను మరోసారి ప్రముఖంగా చాటుతూ జనంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఆయన జనాలకు ఓ బహిరంగ లేఖ రాశారు. పార్టీపై ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ ప్రజలకు పిలుపు నిచ్చారు. ఆ లేఖ ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెర లేపింది. గత కొంత కాలంగా అంటే  తాను జాతీయ రాజకీయాలలోని జంప్ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తొలగించి భారత్ ను చేర్చి తెరాసను బీఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచి కేసీఆర్ తెలంగాణ పదాన్ని బహిరంగంగా పలకడానికే ఇష్టపడటం లేదు. తెలంగాణ అస్త్రం నిర్వీర్యమైపోయిందని ఆయన భావించారో.. లేక నిర్వీర్యం చేయడమే తన జాతీయ రాజకీయాలలో చురుకుగా ముందుకు సాగడానికి దోహదం చేస్తుందనో కానీ ఆయన తెలంగాణ పదాన్ని తన వాడుకలో నిషేధిత పదాల్లోకి చేర్చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించిన సభలో ఎక్కడా తెలంగాణ సెంటిమెంట్ కనిపించకుండా, తలెత్తకుండా కేసీఆర్ అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు.  తెలంగాణ అస్తిత్వ రాజకీయాలకు ఆ సభ వేదికగా గుడ్ బై చెప్పేశారు. అందుకే ఆ సభలో ఎక్కడా జై తెలంగాణ నినాదమే వినిపించలేదు.  అంతకు ముందు గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎక్కడ   సభ జరిగినా, జై తెలంగాణ నినాదమే ప్రధానంగా వినిపించేది.  ఆ నినాదంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం ముగిసేది.  కానీ ఖమ్మం సభ నుంచి జై తెలంగాణ స్థానంలో  జై భారత్ నినాదం వచ్చి చేరింది. కేసీఆర్ లోని ఈ మార్పును తెలంగాణ ప్రజానీకమే కాదు, ఉద్యమ కాలం నుంచీ పార్టీలో కొనసాగుతూ వచ్చిన వారు, తెరాస అధికారం చేపట్టిన తరవాత కేసీఆర్ పోకడలు నచ్చక దూరమైన వారూ, ఉద్యమకారులూ, మేధావులూ కూడా అప్పుడే వ్యతిరేకించారు. విమర్శలు గుప్పించారు.   బీఆర్ఎస్ ఆవిర్భావంతో తెలంగాణ అస్థిత్వాన్ని లేకుండా చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. అయితే ఇప్పుడు సమస్య తన కుటుంబం దగ్గరకు వచ్చే సరికి కేసీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను ఆశ్రయించారన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ బహిరంగ లేఖల  కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రాన్ని వాడడానికి కారణం సమస్య తన కుటుంబం దగ్గరకు రావడమేనా అని ప్రజలలో చర్చ జరుగుతోంది. అంతేనా పార్టీ క్యాడర్ లో సైతం ఇప్పటి వరకూ సైడ్ చేసిన తెలంగాణ నినాదం, సెంటిమెంట్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అన్న చర్చ జరుగుతున్నది.    బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత ‘తెలంగాణ’ పదం దూరమయ్యిందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతోంది. తెరాసను అక్కున చేర్చుకున్న విధంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ ను తమ పార్టీగా భావించడం లేదన్న అభిప్రాయాన్ని పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి.  ఆ విషయాన్ని గుర్తించిన కేసీఆర్ ఇప్పుడు కష్టం తన ప్రగతి భవన్ గుమ్మంలోకి రావడంతోనే కేసీఆర్ కు తాను వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం గుర్తుకు వచ్చిందా అని బీఆర్ఎస్ శ్రేణులే అంటున్నాయి.  ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అక్కర తీరిపోయిందని వదిలేసిన సెంటిమెంట్ ఆస్త్రాన్ని ఇప్పుడు ప్రయోగించినా ఫలితం ఉంటుందా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 
Publish Date: Mar 21, 2023 12:24PM