బీజేపీకి పవన్ కళ్యాణ్ రాంరాం?

బీజేపీకి జనసేనానిని కటీఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తనకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకే  మిత్రిపక్షంగా ఉన్న బీజేపీతో కనీసం సంప్రదింపులు కూడా చేయకుండా.. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబుతో ములాఖత్ అనంతరం నేరుగా మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశంతో కలిసి వేడతానని ప్రకటించేశారు.  చంద్రబాబు అరెస్టుతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ మూడ్ పూర్తిగా మారిపోయింది. జగన్ రెడ్డి సర్కార్ పై అన్ని వర్గాలలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అంతకు ముందు కూడా  రాష్ట్రంలో వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు తరువాత ఆ ఆగ్రహం అవదులనేవే లేకుండా పెరిగిపోయింది. రాజకీయాలతో సంబంధం లేకుండా దాదాపుగా  సమాజంలోని అన్ని వర్గాలలోనూ జగన్ రెడ్డి పాలన అరాచకమని, వదిలిచుకు తీరాలన్న పట్టుదల కనిపించింది. ఇక విషయానికి వస్తే ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్ పెరిగిపోయింది.  , ఏపీలో పొత్తులు ఉంటాయా? ఉంటే ఏఏ పార్టీలు కలిసి వెళ్తాయి? ఎవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది పక్కన పెడితే.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో జనసేన పొత్తు అయితే ఖరారైపోయింది. ఒక్క సారి జనసేనాని పొత్త ప్రకటన చేసిన తరువాత క్షత్ర స్థాయిలో కూడా జనసేన, తెలుగుదేశం శ్రేణులు కలిసే పని చేస్తున్నాయి.  తాజాగా పవన్ కళ్యాణ్ వారాహీ నాల్గవ విడత పర్యటనలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసన కార్యక్రమాలలో జన సైనికులు అంతే యాక్టివ్ ఉంటున్నారు. అయితే, ఎటొచ్చి ఏపీలో బీజేపీ పరిస్థితి ఏంటన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. తెలుగుదేశం, జనసేనలు బీజేపీని కూడా కలుపుకొని వెళ్తారా? లేక బీజేపీని సైడ్ చేస్తారా అన్న మీమాంస కొనసాగుతుంది. జనసేన ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉండగా.. ఇప్పుడు టీడీపీతో పొత్తును ప్రకటించింది. టీడీపీతో పొత్తు ప్రకటన వేళ కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలను ఒప్పిస్తానని, ఆ పార్టీ కూడా  కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ బీజేపీకి రాంరాం చెప్పేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో నాలుగో విడత వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతూ.. రాబోయే తెలంగాణా ఎన్నికల్లో జనసేన 32 నియోజకవర్గాల్లో పోటీచేస్తుందని ప్రకటించారు. తెలంగాణా ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని.. ఎవరితోనూ పొత్తులు ఉండవని పేర్కొన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలలో రాజకీయ వర్గాలలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా తెలంగాణలో పొత్తులకు సమయం వచ్చేసింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి స్టేక్ ఉంది. కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవడం ఇక్కడ బీజేపీకి అవసరం కూడా. ఇప్పటికీ బీజేపీతో కలిసే ఉన్నామని చెప్తున్న పవన్ మాత్రం అనూహ్యంగా ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఏకపక్షంగా ప్రకటించేశారు.  దీంతో తెలంగాణలో ఒంటరిగానే జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించటంలో అర్ధమేంటి అనే చర్చ పెరిగిపోతోంది. పవన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో బీజేపీతో పొత్తు వలన టీడీపీ,జనసేన కూటమికి  ప్రయోజనం లేకపోగా..నష్టం జరిగే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్న క్రమంలో  టీడీపీ, జనసేన బీజేపీకి దూరం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  వారాహి యాత్రలో పవన్ మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగుదేశంతో పొత్తు గురించే ప్రస్తావిస్తున్నారు తప్ప బీజేపీఊసే ఎత్తడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణమే అధికారంలోకి వస్తుందని పదేపదే చెబుతున్నారు తప్ప బీజేపీ గురించి మాటమాత్రంగానైనా చెప్పడం లేదు. ఈ క్రమంలోనే  పవన్ కల్యాణ్   బీజేపీకి రాంరాం చెప్పేశారనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఏపీలో బీజేపీని కాదని తెలంగాణలో పొత్తుకు వెళ్తే ప్రజలలో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని భావించే పవన్ బీజేపీ నుండి దూరం జరిగినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.   అన్నిటికీ మించి  చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తముందని పవన్ కల్యాణ్ బలంగా నమ్ముతున్నారని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుతో బీజేపీకి సంబంధంలేదని మీడియాతో చెప్పినా అంతర్గతంగా బీజేపీ, కేంద్రం హస్తం ఉందనే  ఆయన భావిస్తున్నట్లు జనసేన వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ఏపీ ప్రజలలో బీజేపీపై వ్యతిరేకత ఉందని కూడా పవన్ కళ్యాణ్  సొంతంగా నిర్వహించుకున్న సర్వేలలో తేటతెల్లమైందని అంటున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం, రైల్వే జోన్, స్పెషల్ స్టేటస్ వంటి విషయాలలో కేంద్రం ఏపీ ప్రజలను మోసం చేయడంపై పవన్ చాలా కాలంగా బీజేపీని ప్రశ్నిస్తున్నారు.   ఇప్పుడు సమయం రావడంతో  ఆయన కమలం పార్టీకీ, కమలనాథులకు దూరం జరిగారని అంటున్నారు.  మరోవైపు చంద్రబాబు అరెస్టు విషయంలో   బీజేపీ పెద్దల తీరు అర్ధం కావడం వల్లనే పవన్ ఢిల్లీ కూడా వెళ్లడం లేదన్ననీ, వారితో సంప్రదింపులు కూడా జరపడం లేదనీ జనసేన వర్గాలు చెబుతున్నాయి.   
Publish Date: Oct 3, 2023 5:21PM

అగ్రరాజ్యంలో అంబేద్కర్ కు అరుదైన గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ కు అరుదైన గౌరవం లభించనుంది. అమెరికాలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సిద్ధాంతాలు ప్రతిబింబించేలా రూపొందించిన 19 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. భారత్ అవతల ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ అతి పెద్ద విగ్రహం ఇదే కానుంది.మేరీల్యాండ్‌లోని అకోకీక్‌ నగరంలో 13 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్ లో  ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘స్టాచూ ఆఫ్‌ ఈక్వాలిటీ’గా నామకరణం చేసిన ఈ విగ్రహాన్ని అక్టోబరు 14న ఆవిష్కరించనున్నారు. ఈ స్మారక చిహ్నం అంబేద్కర్‌ బోధనలు, సిద్ధాంతాలను వ్యాప్తి చేసే ఉద్దేశంతో  ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరుకానున్నారు. గుజరాత్‌లోని సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని డిజైన్‌ చేసిన ప్రముఖ విగ్రహ రూపశిల్పి రామ్ సుతార్‌ ఈ విగ్రహాన్ని రూపొందించారు.
Publish Date: Oct 3, 2023 4:09PM

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి బెయిలు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి  ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.  మంత్రి రోజాపై, ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై  పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తిపై కేసు నమోదు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి, ఆయన సోదరుడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టుకు 41ఏ నోటీసులు అందించామని తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. వందల సంఖ్యలో పోలీసులతో ఆయన ఇంటిని దిగ్బంధనం చేసి మరీ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు.  తనకు బెయిల్ మంజూరు చేయాలన్న బండారు అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. బండారుకు భారీ ఊరట లభించిన విషయాన్ని పక్కన పెడితే ఆయనను అరెస్టు చేసిన విధానం మాత్రం తీవ్ర విమర్శల పాలౌతోంది. బండారుకు నోటీసులు ఇచ్చామంటూ కోర్టులో చెప్పడాన్ని  ఎత్తి చూపితే.. నిజంగానే నోటీసులు ఇచ్చి ఉంటే బండారును అరెస్టు చేసే అవకాశమే ఉండదనీ, కేవలం విచారణకు రావాల్సిందిగా మాత్రమే కోరాలని అంటున్నారు.  కానీ పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, మంత్రి రోజానూ దూషించారంటూ  కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అరెస్టు ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా ఒక ప్రత్యేక రాజ్యాగం అమలులో ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. ముఖ్యమంత్రిని, రోజానూ దూషించారంటూ బండారును అరెస్టు చేయడానికి నిబంధనలను సైతం తుంగలోకి తొక్కడమే కాకుండా, న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించిన పోలీసులకు, నిత్యం బూతుల పంచాగంతో విపక్ష నేతలపై విరుచుకుపడే వైసీపీ నేతలు కనిపించడం లేదా, వారి దూషణలు వినిపించడం లేదా అని సామాన్యులు సైతం నిలదీస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  
Publish Date: Oct 3, 2023 4:06PM

తెలుగుదేశం జనసేన కూటమి క్లీన్ స్వీప్ పక్కా.. బీజేపీని కలుపుకుంటే మాత్రం బొక్కబోర్లా!

ఏపీలో వచ్చే ఎన్నికలలో  తెలుగుదేశం, జనసేన కూటమి విజయం పక్కా అని ఆత్మసాక్షి సర్వే నిర్ద్వంద్వంగా తేల్చేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. చంద్రబాబు అరెస్టు తరువాత ఈ సెప్టెంబర్ 30 వరకూ నిర్వహించిన ఈ సర్వేలో  తెలుగుదేశం, జనసేన పొత్తు వచ్చే ఎన్నికలలో ప్రభంజనం లాంటి విజయాన్ని అందిస్తుందనీ, అదే ఈ కూటమి బీజేపీని కూడా కలుపుకుంటే మాత్రం బొక్క బోర్లా పడుతుందనీ తేల్చింది. అంతే కాదు ఒంటరిగా పోటీ చేసినా తెలుగుదేశం విజయం ఖాయమని, అయితే బీజేపీతో జతకడితే మాత్రం తీవ్రంగా నష్టపోక తప్పదని పేర్కొంది.  తెలుగుదేశం,జనసేన పొత్తుగా ఎన్నికలు వెడితే ప్రస్తుతం  జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రులలో 17 మంది పరాజయం పాలు కావడం తథ్యమని పేర్కొంది.  ఇప్పటి వరకూ శ్రీ ఆత్మసాక్షి సర్వే మూడు విడతలు గా సర్వే నిర్వహించింది. విడత విడతకూ తెలుగుదేశం పుంజుకుంటున్నదని సర్వే  ఫలితం తేల్చింది. చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో జనం తెలుగుదేశం పార్టీకి మరింత దగ్గరయ్యారని సర్వే పేర్కొంది.  వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగి పరిస్థితులన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.  2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి  151 స్థానాలను తన ఖాతాలో వేసుకోగా, అప్పట్లో తెలుగుదేశం 23 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే.  అప్పటి ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలలలోనూ ప్రజలలో అసంతృప్తికి బీజం పడింది. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలనపై ప్రజాగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది.   రెండేళ్ల కిందట ఇదే ఆత్మసాక్షి సర్వే తెలుగుదేశం కు వైసీపీ కంటే నాలుగు శాతం ఓట్లు అదనంగా వస్తాయని పేర్కొనగా తాజా సర్వేలో  తెలుగుదుశం, జనసేన కూటమికి 54% ఓట్లు ఖాయమనీ, వైసీపీ 43 శాతానికి పరిమితం అవుతుందనీ పేర్కొంది. అంటే వైసీపీ కంటే తెలుగుదేశం,జనసేన కూటమి 11% అధిక ఓట్లతో అధికారం చేపట్టడ తథ్యమని పేర్కొంది. ఇందులో తెలుగుదేశం ఓట్ల షేర్ 44 శాతం ఓట్లు, జనసేన షేర్10 శాతం ఓట్లు అని పేర్కొంది.  రానున్న రోజులలో తెలుగుదేశం, జనసేనకు ఓటింగ్ శాతం గణనీయంగా  పెరిగే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది.  చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పెరిగిందని.. చంద్రబాబు అరెస్ట్, జనసేనతో పొత్తు ప్రకటన తర్వాత ప్రజల ఆదరణ పెరిగినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ప్లస్ అయి జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మరింత పెరిగిందన్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ టీడీపీతో జతకట్టడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయని శ్రీఆత్మసాక్షి సర్వే వివరించింది.  కాగా, బీజేపీని కూడా తమతో చేర్చుకుంటే మాత్రం టీడీపీ, జనసేన కూటమి భారీగా నష్టపోతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. బీజేపీతో  కాకుండా లెప్ట్ పార్టీలతో జతకడితే తెలుగుదేశం,జనసేన కూటమి మంచి ఫలితాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది.  తెలుగుదేశం, జనసేన, లెప్ట్ పార్టీలు కలిసి ఎన్నికలకు వెడితే 120కి పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వే గణాంక సహితంగా వెల్లడించింది. సామాజిక వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలను విభజించి మూడు శాంపిల్స్ రూపంలో సర్వే నిర్వహించినట్లు వివరించింది.  ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు పేర్కొంది. అటు అర్బన్ ఓటర్ల నుండి గ్రామీణ ఓటర్ల వరకూ ఎటు చూసినా వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్నట్లు ఈ సర్వేలో తేల్చారు. మొత్తంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం పక్కా అని సర్వే ఫలితం తేల్చింది.     
Publish Date: Oct 3, 2023 3:18PM

బాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి క్వాష్ పిటిషన్ విచారణ సుప్రీం కోర్టులో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన సంగతి విదితమే. సుప్రీం కోర్టులో మంగళవారం (అక్టోబర్ 3) విచారణకు వచ్చిన చంద్రబాబు పిటిషన్ ను జస్జిట్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేదీ ధర్మాసనం సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ సోమవారంలోగా సమర్పించాలని సుప్రీం కోర్టు సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీని ఆదేశించింది. డాక్యుమెంట్లు అన్నీ హైకోర్టు ముందు ఉంచారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉన్నందును విచారణను వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.  ఈ కేసులో చంద్రబాబు తరఫున లూథ్రాతో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, మను సింఘ్వీ  వాదనలు వినిపించారు. కాగా సీఐడీ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ చంద్రబాబు బెయిల్ కోసం వెళ్ల కుండా క్వాష్ పిటిషన్ పైనే వాదిస్తున్నారని, చంద్రబాబుకు 17ఏ వర్తించదని పేర్కొన్నారు. 17 సవరణ 2018లో జరిగిందనీ, కానీ స్కిల్ స్కాం అంతకు ముందే జరిగిందనీ ముకుల్ రోహత్గీ వాదించారు. అయితే ఈ దశలో జోక్యం చేసుకున్న సుప్రీం కోర్టు 2018కి ముందు జరిగిన వాటికి 17ఏ వర్తించదని ఎలా చెబుతారని ప్రశ్నించింది. ఆ దశలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతి జరిగిందని ముకుల్ రోహత్గీ పేర్కొంటే జస్టిస్ బేలా త్రివేది వెంటనే అవీనీతి సంగతి తరువాత ముందు 17ఏ గురించి మాత్రమే చెప్పండని నిలువరించారు. అంతే కాకుండా సెక్షన్ 17ఏ అవినీతి కేసులకు మాత్రమే వర్తిస్తుందా? అన్ని కేసులకూ వర్తిస్తుందా అని ప్రశ్నించారు. ఆ దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే జోక్యం చేసుకుని 17ఏ అన్ని కేసులకూ వర్తిస్తుందని చెప్పారు.  ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకున్నదని సాల్వే ఈ సొందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు.  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ ఒక్క ఆధారం చూడా చూపలేకపోయిందని మరో న్యాయవాది మను సింఘ్వీ పేర్కొన్నారు.   కేసు విచారణలో భాగంగా జస్టిస్ అనిరుధ్ బోస్ అసలు స్కిల్ కేసులో దర్యాప్తు ఎప్పుడు ప్రారంభమైందని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదందనీ అడిగారు. దీనిపై చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 2021 డిసెంబర్ 9న ఎఫ్ ఐఆర్ నమోదు చేశారని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేస్తున్నారని న్యాయమూర్తులకు తెలిపారు. అలాగే సిద్ధార్థ లూధ్రా ఈ కేసులో చంద్రబాబునాయుడిని సుదీర్ఘ కాలం జైల్లో ఉంచాలన్న ఏకైక లక్ష్యమే ఉందని స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అనంతరం ఈ కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ అప్పటి లోగా హైకోర్టులో సమర్పించిన పత్రాలన్నీ తమకు సమర్పించాలని సీఐడీ తరఫు న్యాయవాదిని సుప్రీం కోర్టు ఆదేశించింది. 
Publish Date: Oct 3, 2023 2:49PM

మోడీ మళ్లీ ఎన్నికల వాగ్దానాలేనా?

తెలంగాణలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో బిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపిలు దూకుడు పెంచాయి. అందరికంటే ముందే 115 మంది అభ్యర్థులతో జాబితాను ప్రకటించిన బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలోకి వెళ్లింది. కాంగ్రెస్ పార్టీ రేపో మాపో అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల సమరశంఖం పూరించింది. కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజెపి పెద్దలు అమిత్ షా, నడ్డాలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది. అయితే ఈ నెల ఒకటో తేదీన మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన మోదీ తెలంగాణలో రెండు కీలక ప్రకటనలు చేశారు. ఒకటి ములుగు జిల్లాలో 900 కోట్ల రూపాయలతో ఎస్టి యూనివర్శిటీ, రెండు తెలంగాణకు పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటన చేయడం బిజెపిలో జోష్ పెంచింది. 2014 ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ పార్లమెంటు  టీఆర్ ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎంపీ అయినప్పటికీ పసుపు బోర్డు మాత్రం తీసుకురాలేకపోయాయారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రస్తుత బిజెపి పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ వోటర్లకు బాండ్ పేపర్ రాసిచ్చారు. ఎన్నికల వేళ సాక్షాత్తు  ప్రధాని పాలమూరు సభకు వచ్చి పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటన చేయడంతో బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది. ఇంతకు ముందు ఓ లెక్క. ఇప్పటి నుంచి ఓ లెక్క అంటూ బిజెపి శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో  నిజామా బాద్ బిఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ ధర్మపురి అరవింద్  కేంద్ర పెద్దలతో పసుపు బోర్డుపై పై కీలక ప్రకటన చేయించడం  తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2014 నుంచి 2019 వరకు ఎంపీగా కొనసాగిన కవిత పసుపు బోర్డు తీసుకురాలేకపోయారు. దీనికి కౌంటర్ గా ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ప్రకటన చేయించడం వచ్చే ఎన్నికల్లో బిజెపికి సానుకూల అంశమైతే బిఆర్ఎస్ కు పెద్ద షాక్ అయిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా విభజన హామీలను బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదన్న ఆరోపణలు కొత్తగా తెరమీదికొస్తున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జులై 8 తెలంగాణ పర్యటనకు వచ్చారు. వరంగల్ జిల్లాలో ఖాజీపేట రైల్వే ఓవర్ హాలింగ్ సెంటర్ సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.ఏప్రిల్‌లో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి సహా వివిధ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలోనూ పాల్గొన్నారు. అప్పట్లో  ప్రధాని వరుస పర్యటనలు రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రధాని పర్యటనలకు దూరంగా ఉంటోంది.  వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కేటీ రామారావు గతంలో ప్రకటించారు. చెప్పినట్లుగానే ఎవరూ హాజరుకాలేదు. దీనిపై ప్రధాని సభలో మాట్లాడిన తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎందుకు బహిష్కరించాలో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఇచ్చిన హామీలపై విస్తృత చర్చ జరుగుతోంది.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ప్రధానమైనవి ఏమిటి? వాటిల్లో ఏ మేరకు నెరవేరాయి? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ప్రధాని పర్యటన సందర్భంగా ఎక్కువగా చర్చలోకి వచ్చిన అంశం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా విమర్శలు, ప్రతి విమర్శలు దీని చుట్టూనే తిరుగుతున్నాయి.దీన్ని ఖాజీపేట కేంద్రంగా ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనూ చెప్పింది.దీనికి సంబంధించి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో నిధులు కేటాయించలేదు.ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో పిరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు మోదీ శంకుస్థాపన చేశారు. దీనికితోడు వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నామని కిషన్ రెడ్డి చెబుతున్నారు.అయితే.. ప్రతిపాదిత కోచ్ ఫ్యాక్టరీకి, వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని రాష్ట్ర ప్రభుత్వ వాదిస్తోంది.అది వ్యాగన్ల మరమ్మతుల కేంద్రంగా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. వ్యాగన్ల తయారీ కేంద్రం అడిగితే వ్యాగన్లకు మరమ్మతులు చేసే వర్క్ షాపు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అంశం 2009 నుంచే  పెండింగులో ఉంది. తొలిసారిగా ఆ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ఖాజీపేట రైల్వే కోచ్ తయారీ ‌ప్యాక్టరీ అంశం ప్రతిపాదించారు . అలా అప్పట్నుంచి పెండింగులో ఉంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటును చట్టంలో ప్రతిపాదించింది.తర్వాత బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోలేదని బీ‌‍ఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చే ముందు తెలంగా‌‍‌‍‌‍ణకు కేంద్ర ప్ర‌‍‌భుత్వం ఇచ్చిన ‌‍‌హామీలపై తేల్చాలి అని బిజెపి యేతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్ జిల్లాలోని ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పి.. ఇప్పుడు రిపేర్ల ‌షాపు పెడుతున్నారని విమర్శించాయి. తెలంగా‌‍ణకు కేటాయించిన కోచ్ ‌ఫ్యాక్టరీని గుజరాత్ కు తరలించారని విమర్శిస్తున్నాయి.ప్రధాని అంటే గుజరాత్ కు కాదు, యావత్ దేశానికి కదా..? అని ప్రశ్నిస్తున్నారు. 
Publish Date: Oct 3, 2023 2:43PM