political-news-img

జాతికి మోడీ అబద్ధాలు చెప్పారు.. ఖర్గే

మహిళా రిజర్వేషన్ బిల్లు అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని ప్రసంగం పూర్తిగా నిరాశాజనకంగా ఉందని, ఆ ప్రసంగంలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. ఒక అధికారిక ప్రసంగాన్ని మోదీ రాజకీయ ప్రసంగంగా మార్చేశారని.. ప్రత్యర్థులపై బురద జల్లడమే లక్ష్యంగా ఆయన మాటలు ఉన్నాయని ఖర్గే దుమ్మెత్తిపోశారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రజలను వంచించే ప్రయత్నం చేసిందన్నారు. విపక్షాలు సమష్టిగా ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో మోడీ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారన్నారు. అందుకే ఆయన తన ప్రసంగంలో అబద్ధాలు వల్లెవేశారన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి నిజంగా ఉంటే, 2023లోనే ఆమోదం పొందిన చట్టాన్ని ప్రస్తుతమున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే అమలు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. దాన్ని నియోజకవర్గాల పునర్విభజన తో ముడిపెట్టడం మహిళా లోకాన్ని మోసం చేయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధాని తన ప్రసంగంలో మహిళల సంక్షేమం గురించి కాకుండా, కాంగ్రెస్ ను విమర్శించడానికి ఎక్కువ సమయం కేటాయించారన్న ఖర్గే.. మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పేరును 59 సార్లు ప్రస్తావించారని చెప్పారు. మహిళల గురించి మాట్లాడింది చాలా తక్కువ అని చెప్పారు. దీన్ని బట్టి ప్రధానికి మహిళల అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని అవగతమౌతోందన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటూ విపక్షాలపై ప్రధాని విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఖర్గే పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా రిజర్వేషన్ బిల్లుతో కలిపి ప్రచారం చేయడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూసిందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఖర్గే ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

Publish Date: Apr 19, 2026 7:45AM

political-news-img

ఉప్పల్‌లో సన్ రైజర్స్‌ ఆల్ రౌండ్ షో.. ఉత్కంఠ పోరులో చెన్నైపై ఘన విజయం!

హైదరాబాద్‌ వేదికగా శనివారం (ఏప్రిల్ 18) జరిగిన ఐపీఎల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో హైదరాబాద్ సంచలన విజయం సాధించింది. దాదాపు ఓటమి అంచుల్లో ఉన్న స్థితి నుండి కోలుకుని ఆరెంజ్ ఆర్మీ అద్భుత విజయం సాధించింది. ఇంత వరకూ సన్ రైజన్ బౌలింగ్ విభాగంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ఆఖరి ఓవర్లలో సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైకి విజయాన్ని అందించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (22 బంతుల్లో 59) ఆరంభం నుండే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 5.5 ఓవర్లలోనే ట్రావిస్ హెడ్‌తో కలిసి 75 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు గట్టి పునాది వేశాడు. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 59) తన క్లాస్ ఆటతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జామీ ఓవర్టన్ చెరో మూడు వికెట్లు తీసి హైదరాబాద్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం దీటుగా పోరాడింది. ఆయుష్ మాత్రే 30, మాథ్యూ షార్ట్ 34 పరుగులూ చేశారు. ఇద్దరూ కూడా వేగంగా ఆడటంతో ఒక దశలో చెన్నై విజయం నల్లేరుపై బండినడకే అనిపించింది. అయితే హైదరాబాద్ బౌలర్ ఎషాన్ మలింగ (3/29) కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మలింగ కేవలం 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగింది. చివరి ఓవర్లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరమైన తరుణంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ బంతిని గత మ్యాచ్ హీరో ప్రఫుల్ హింగేకు అప్పగించాడు. అప్పటికే ఎక్కువ పరుగులు ఇచ్చిన హింగేపై ఒత్తిడిలో కూడా అద్భుతంగా బౌల్ చేశాడు. జామీ ఓవర్టన్ ను ఔట్ చేశాడు. చివరికి చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుంది. ఈ విజయంలో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల సమష్టి కృషి ఉంది. ఇంత వరకూ హైదరాబాద్ బ్యాటింగ్ లో సూపర్బ్.. కానీ బౌలింగే బలహీనం అన్న ఫీలింగ్ ఉండేది. కానీ గత రెండు మ్యాచ్ ల నుంచి హైదరాబాద్ బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో రైజర్స్ అభిమానుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.

Publish Date: Apr 19, 2026 7:36AM

political-news-img

నాచారం పారిశ్రామిక వాడలో ఘోర అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నాచారం నుంచి చిల్కా నగర్‌కు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న టెంట్ హౌస్‌కు చెందిన గోదాంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గోదాంలో నిల్వ ఉంచిన టెంట్లు, అలంకరణ సామగ్రి తదితర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు భారీగా ఎగిసిపడుతూ దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గోదాంనికి ఆనుకుని ఉన్న పరుపుల కంపెనీకి మంటలు వ్యాపించే ప్రమాదం నెలకొనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు సుమారు అరగంటకు పైగా తీవ్రంగా శ్రమించారు. వారి సమయోచిత చర్యలతో మంటలు మరింత వ్యాపించకుండా నియంత్రించారు. ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే గోదాంలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమై భారీ ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Publish Date: Apr 18, 2026 10:29PM

political-news-img

మహిళలకు క్షమాపణ చెబుతున్నా...ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

మహిళా సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం చేపట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ చారిత్రక బిల్లు ఆమోదం పొందకపోవడానికి విపక్షాల అడ్డంకులు మరియు వారి సంకుచిత రాజకీయ వైఖరే ప్రధాన కారణమని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, మహిళా శక్తికి, వారి హక్కులకు వ్యతిరేకంగా విపక్షాలు వ్యవహరించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, మహిళల ప్రగతిని అడ్డుకోవడం విపక్షాలు చేసిన అతిపెద్ద చారిత్రక తప్పిదమని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేసేందుకు తమ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నించినప్పటికీ, ప్రతిపక్షాల వ్యూహాత్మక అడ్డంకుల వల్ల సాధ్యపడలేదని ప్రధాని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న తల్లులు, సోదరీమణుల కలలను సాకారం చేయడంలో విపక్షాల ద్వంద్వ ప్రమాణాలు అడ్డుగోడగా మారాయని ఆయన ఆరోపించారు. దేశ ప్రగతికి నారీ శక్తి అవసరమని నొక్కి చెప్పిన మోదీ, మహిళలకు తాము క్షమాపణలు కోరుతున్నట్లు ఉద్వేగంగా తెలిపారు. రాజకీయాలు వేరని, దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం అత్యవసరమని, మహిళా రిజర్వేషన్ల లక్ష్యం నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రధాని తాజా వ్యాఖ్యలు విపక్షాలపై రాజకీయ ఒత్తిడిని పెంచడమే కాకుండా, మహిళా ఓటర్లలో ప్రభుత్వంపై ఉన్న సానుకూలతను పెంచే వ్యూహంగా కనిపిస్తోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం భవిష్యత్తులోనూ రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మహిళా సాధికారతపై ప్రజల నుండి వస్తున్న డిమాండ్లు, ప్రభుత్వం ఈ బిల్లును ఏ విధంగా తిరిగి ముందుకు తీసుకెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాధికారంలో వారికి తగిన ప్రాధాన్యత కల్పించే దిశగా దేశం అడుగులు వేస్తుందని ఆశించవచ్చు.

Publish Date: Apr 18, 2026 10:22PM

political-news-img

విరాట్ కోహ్లీ ఒక్క లైక్...నెట్టింట పెను సంచలనం

భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చేసే చిన్న చిన్న పనులు కూడా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అభిమానుల ప్రతి కదలికను గమనించే నెటిజన్లు, తాజాగా కోహ్లీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని పట్టుకున్నారు. జర్మనీకి చెందిన ఒక ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పెట్టిన పోస్ట్‌కు కోహ్లీ 'లైక్' కొట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి, జనవరి 30న జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఆకర్షణీయమైన ఫోటోలను పంచుకున్నారు. సూర్యాస్తమయం వేళ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, 'గోల్డెన్ అవర్' మూమెంట్స్‌ను ఆ ఫోటోల రూపంలో ఆమె బంధించారు. ఈ పోస్ట్ సాధారణంగానే సాగుతున్న తరుణంలో, కోహ్లీ వీటిని లైక్ చేయడంతో ఒక్కసారిగా అందరి దృష్టి దీనిపై పడింది. కోహ్లీ లాంటి అంతర్జాతీయ క్రికెట్ స్టార్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఫోటోను లైక్ చేయడంతో, ఈ విషయం నెట్టింట సెగలు రేపుతోంది. సాధారణంగా కోహ్లీ సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాంటిది ఈ పోస్ట్‌ను ఆయన ఇష్టపడటంతో, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ పరిణామంపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. లిజ్లాజ్ ఎవరు? ఆమెకు, కోహ్లీకి ఉన్న పరిచయం ఏంటి? అని నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రొఫైల్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి, సోషల్ మీడియాలో సెలబ్రిటీల లైక్‌లు, కామెంట్లను నిశితంగా గమనించడం అభిమానులకు అలవాటుగా మారింది. ఒక చిన్న 'లైక్' కూడా ఇలాంటి పెద్ద చర్ఛలకు దారితీయడం గమనార్హం. గతంలో కూడా పలువురు సెలబ్రిటీల విషయంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, సెలబ్రిటీలు తమ అభిరుచులకు తగ్గట్టుగా ఇతరుల కంటెంట్‌ను లైక్ చేయడం చాలా సహజమని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దీనిని అనవసరమైన రాద్ధాంతం చేయకూడదని, ఇది కేవలం సోషల్ మీడియాలో ఒక సాధారణ చర్య మాత్రమేనని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ, విరాట్ కోహ్లీ పేరుతో ముడిపడి ఉన్న ప్రతి చిన్న విషయం కూడా వైరల్ కావాల్సిందేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ విషయంపై సోషల్ మీడియా వేదికల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు నెటిజన్లను అలరిస్తూనే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు.

Publish Date: Apr 18, 2026 10:00PM

political-news-img

ఆపరేషన్ సేఫ్ స్కూల్... 558 షాపులపై పోలీసుల ఏకకాల దాడులు

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు పోలీసులు నగరం మొత్తం ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్‌, పొగాకు ముప్పును మూలంలోనే అరికట్టాలనే సంకల్పంతో హైదరాబాద్ పోలీసులు శనివారం నగరవ్యాప్తంగా “ఆపరేషన్ సేఫ్ స్కూల్” పేరిట భారీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. సుమారు 5 వేల మంది సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్‌లో విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు విక్రయాలపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. పొగాకు అలవాటు డ్రగ్స్‌ వైపు నడిపించే మొదటి మెట్టు అన్న అవగాహనతో ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు అందుబాటులో ఉండటం వల్ల విద్యార్థులు క్రమంగా వ్యసనాల బారిన పడుతున్నారన్న ఆందోళన నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, లా అండ్ ఆర్డర్ సిబ్బంది కలిసి నగరంలోని 558 షాపుల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. సీపీ సజ్జనర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాలు చిరాగ్ అలీ లేన్,రెడ్ హిల్స్, మెహదీపట్నం, గోషా మహల్ వంటి ప్రాంతాల్లో విద్యాసంస్థల సమీపంలోని దుకాణాలను పరిశీలించారు.గోషామహల్ ఎంజే బ్రిడ్జి వద్ద మీడియాతో మాట్లాడుతూ, మైనర్లకు పొగాకు అమ్మే వారిపై “ఉక్కుపాదం” మోపుతామని హెచ్చరించారు. డెకాయ్ ఆపరేషన్‌లో చిన్నారులకు పొగాకు విక్రయిస్తున్నట్లు ఆధారాలతో బయటపడిన దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా హెచ్-న్యూ విభాగంలో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు సీపీ ప్రకటించారు. విద్యాసంస్థల చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ పోరాటం కేవలం పోలీసులదే కాదని, తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థలు కలిసి బాధ్యత తీసుకోవాలని కోరారు. పిల్లల ప్రవర్తన, స్నేహితులు, స్కూల్ తర్వాత కదలికలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా పొగాకు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా 8712661601కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.

Publish Date: Apr 18, 2026 9:39PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img