వైసీపీకి కార్యకర్తలు ఏరీ.. ఎక్కడ?

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి  ఇప్పుడు కార్యకర్తలు కూడా దూరం అయ్యారు. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ పలుమార్లు నేతల చేత పలికించినా.. ఏపీకి జగనే మళ్ళీ ఎందుకు కావాలని ఊదర గొట్టినా ప్రజల నుండి స్పందన కరువైంది.  వైసీపీ సభలు, సమావేశాలలో ఖాళీ కుర్చీలను చూస్తేనే ఇది అర్ధమైపోతున్నది. నిత్యం ప్రజల మధ్యనే ఉండాలని పార్టీ అధిష్టానం ఎన్నిసార్లు ఎన్ని ప్రణాళికలు వేసి మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పినా ఏదో తూతూ మంత్రంగానే మb అనిపిస్తున్నారు తప్ప పార్టీలో ఉత్సాహం నింపేలా ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమౌతున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మన సంక్షేమం అందింది.. ఆ విషయాన్ని మీరే వెళ్లి ప్రజలకు చెప్పాలని పార్టీ పెద్దలు ద్వితీయ శ్రేణి నాయకులకు ఎన్నిసార్లు హితబోధ చేసినా వారు అడుగు ముందుకు వేయడానికి సుముఖంగా లేరు.  ఎన్నికలేమో దగ్గరకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సొంత సర్వేల నుండి వివిధ మీడియా సంస్థల సర్వేల వరకూ ఎక్కువ శాతం వైసీపీ పరిస్థితి మునిగిపోయే నావేనని తేల్చిసిన పరిస్థితి.  మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగానైనా తేల్చేసింది.   నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో సంక్షేమం అంటు బటన్ నొక్కుడం వినా మరో పని చేసిన పాపాన పోలేదు.  అదే ఇప్పుడు వైసీపీ కొంప ముంచే పరిస్థితి తెచ్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ అధికార పీఠం ఎక్కాక సమయం గడిచే కొద్దీ ఒక్కో వర్గంలో అసంతృప్తి మొదలై పెరుగుతూ వచ్చింది. ఆయన హయాంలో రాష్ట్రంలో దాదాపు అన్ని రంగాలూ నిర్వీర్యం అయిపోయాయి. ఇదిగో మా ప్రభుత్వంలో ఈ రంగాన్ని మెరుగు పరిచాం..   సాధించిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా పోయింది.  అసలు రాష్ట్రానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టే నిర్మాణ, రియల్ ఎస్టేట్, తయారీ , ఫార్మా రంగాలు పూర్తిగా కుదేలైపోయాయి. రోడ్లు, రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు, త్రాగు సాగు నీటి ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలను అంతో ఇంతో మెరుగు పరచాల్సి ఉన్నా అసలు వాటిని పట్టించుకోకపోవడంతో అవీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. వీటిపై ప్రజల నుండి ఎన్నిసార్లు ప్రశ్నలు ఎదురైనా ప్రభుత్వం మాత్రం అన్నిటికీ బటన్ నొక్కుడే సమాధానంగా చూపించింది. మంత్రులూ, నేతలూ ప్రజలను బటన్ నొక్కి సొమ్ములిస్తున్నారుగా.. ఇక మాట్లాడకండి అంటూ ప్రజలను గదమాయించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. పెన్షన్ వదులు కుంటే రోడ్లు వేయిస్తామని కూడా చెప్పారంటే జగన్ హయాంలో పాలన ఎంతగా పడకేసిందో అర్ధం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి, ఉపాధి, ఉద్యోగం వంటివి భూతద్దం పెట్టి వెతికినా కానరాని పరిస్థితి ఏర్పడింది. పెరిగిన పన్నులతో ప్రజల జేబులు గుల్లయ్యాయి.    సంక్షేమం అంటూ పందేరం చేసిన సొమ్ములన్నీ ఏదో రూపేనా ప్రభుత్వం ముక్కుపిండి మరీ వసూలు చేసింది. మళ్ళీ ఆ సొమ్ములనే  బటన్ నొక్కి పందేరం చేసినట్లుగా ప్రచారం చేసుకుంటూ జగన్ సర్కార్ ఇప్పటి వరకూ పబ్బం గడిపింది. పైగా దొరికిన ప్రతి దాన్ని తాకట్టు పెట్టేసి చేసిన అప్పు, అప్పనంగా అమ్మేసి సొమ్ము చేసుకున్న నిధులు ఏమయ్యాయి.. వాటిని ఏ అభివృద్ధి కోసం ఖర్చు చేశారన్నది ఎవరికీ అంతు చిక్కని అంశంగా మారిపోయింది.  ఫలితంగా ఇప్పుడు ప్రజలలో వైసీపీపై అసంతృప్తి పెరిగిపోయింది. ఎంతటి కరుడుగట్టిన పార్టీ కార్యకర్తకైనా ఒక క్షణంలో తన భవిష్యత్తుపై ఆలోచన వస్తుంది. ఆ క్షణాన తడిమి చూసుకుంటే తన పార్టీ వలన ప్రయోజనం శూన్యం అన్నప్పుడు తనకు తెలియకుండానే జెండా కింద పడేస్తాడు. సరిగ్గా వైసీపీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నది. అందుకే గత ఎన్నికలలో పార్టీ విజయం కోసం జెండా మోసిన కార్యకర్తలే ఇప్పుడు వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు.  మహా మహులైన నాయకులు అనుకున్న వారు, మంత్రులుగా చక్రం తిప్పిన వారికి సైతం ప్రభుత్వ అసంతృప్తి సెగ తాకుతున్నది. సొంత అడ్డా పులివెందులలో జగన్ కూడా నిరసనలను ఎదుర్కొన్నారంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అవగతం అవుతున్నది. అందుకే పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కూడా వైసీపీకి కార్యకర్తలు అనేవారు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇదే వైసీపీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నది. ఓటమి భయాన్ని పరిచయం చేస్తున్నది.  
Publish Date: Nov 28, 2023 4:48PM

స్వీట్ల మీద సిల్వర్  కోటింగ్ ఎందుకు వేస్తారో తెలుసా!

స్వీట్లంటే ఇష్టపడని వారు ఉండరు. ఇళ్లలో మహా అయితే రెండు మూడు రకాల స్వీట్లు రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ బయట షాపులలో బోలెడు రకాల స్వీట్లు ఉంటాయి. ఇవి వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో చూడగానే తినేయాలనిపించేలా ఆకర్షిస్తాయి. కొన్ని ఖరీదైన స్వీట్లను గమనిస్తే వాటి మీద సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఇలా వెండి పూత కలిగిన స్వీట్లు పెద్ద పెద్ద షాపులలో ఎక్కువ ఖరీదులో ఉంటాయి. ఈ వెండి పూతను వరాక్ అని పిలుస్తారు. చాలామంది అలంకరణ కోసం ఈ పూత వేస్తారని అనుకుంటారు. కానీ ఇలా స్వీట్ల మీద వెండి పూత వేయడానికి వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయి. మోతీచూర్ లడ్డూ, కాజూ కట్లీ, కాజూ పిస్తా రోల్స్ వంటి స్వీట్ల మీద వెండి పూత ఉంటుంది. పాలతో మాత్రమే చేసే వివిధ స్వీట్లకు కూడా ఈ వెండి పూత అప్లై చేస్తారు. స్వీట్ల మీద అప్లై చేసే వెండి పొరలో నిజంగానే శుద్దమైన వెండి ఉపయోగిస్తారు. శుద్దమైన వెండితో తయారైన వెండిపూత ఉన్న స్వీట్లు చాలా ఆరోగ్యం. వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్దిగా ఉంటాయి. అలాగే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా స్వీట్ల మీద వెండి పూత వేస్తే స్వీట్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. లేకపోతే పాలతోనూ, నెయ్యితోనూ చేసిన స్వీట్లు    తొందరగా ముక్కిపోయిన వాసన వస్తాయి. మొట్టమొదట స్వీట్ల మీద వెండి పూత వేయడం మొదలైంది కూడా ఈ కారణంతోనే. అయితే వెండి అనేది ఖరీదైన లోహంగా మారడం వల్ల స్వీట్ల మీద వెండి పూత వేయగానే సాధారణ స్వీట్లు కూడా ధర కొండెక్కి కూర్చుంటున్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద షాపులు స్వీట్లు చాలా అట్రాక్షన్ గా కనిపించడం కోసం వెండి పూతను ఎంచుకుంటారు. .                                                   *నిశ్శబ్ద.
Publish Date: Nov 28, 2023 3:46PM

గెలిస్తే విజయయాత్ర.. ఓడితే నా శవయాత్ర.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ అభ్యర్థులలో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ప్రచారం చివరి అంకానికి వచ్చిన తరువాత వారి ప్రచార శైలిలో ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇందుకు వారు తాజాగా చూపుతున్న ఉదాహరణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్  బీఆర్ఎస్ అభ్యర్థి పాడె కౌశిక్ రెడ్డి బేలతనం ప్రస్ఫుటంగా కనిపించింది. ప్రజలను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా.. తనలోని ఓటమి భయాన్ని కూడా బయటపెట్టేసుకున్నారు. నన్న సంపుకున్నా.. సాదుకున్నా మీరేనని చేతులెత్తేశారు. బతిమాలుకుంటున్నా, మీ కాళ్లు మొక్కుతా ఒక్క సారి అవకాశమివ్వండంటూ వేడుకున్నారు. అక్కడితో ఆగకుండా ఓటమి పాలైతే భార్యా, బిడ్డతో సహా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్ అయ్యారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయనీ, గెలిస్తే జైత్ర యాత్ర చేస్తాననీ, ఓడితే కనుక ఆ మరుసటి రోజు తన శవయాత్ర జరుగుతుందనీ కౌశిక్ రెడ్డి ప్రచార సభలో చెప్పారు. ఆ మాటలు, ఆఉద్వేగం, ఆ  టెన్షన్  కౌశిక్ రెడ్డిలోని ఓటమి భయాన్ని దాపరికం లేకుండా బయటపెట్టేశాయి. ఆత్మహత్య పేరు చెప్పి సెంటిమెంట్ ను రగల్చాలన్న ఆయన ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్నది డిసెంబర్ 3న తెలిసిపోతుంది. కానీ ఈ విధమైన ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడటం, ఆత్మహత్య చేసుకుంటానంటూ ప్రకటన చేయడం చూస్తుంటే.. ఆయనకు నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తున్నదని అనిపించక మానదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సంపుకుంటారో.. సాదుకుంటారో మీ ఇష్టం అన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్య గతంలో ఇదే నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఈటల అన్న మాటలను స్ఫురింప చేస్తున్నాయనీ, అయితే నాటి ఉప ఎన్నికకూ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికకూ చాలా తేడా ఉందనీ అంటున్నారు. అప్పట్లో ఈటల బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) వేధింపులకు గురయ్యారు. పార్టీలో పెత్తనాన్ని ధిక్కరించినందుకు పార్టీ నుంచి బహిష్కృతడయ్యారు. శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ప్రజా తీర్పు కోరుతూ జనం ముందు నిలబడ్డారు. అయితే ప్రస్తుత పరిస్థితి అది కాదు. కౌశిక్ రెడ్డి పార్టీలో ఎలాంటి ఇబ్బందులకూ గురి కాలేదు. పైగా అధికార పార్టీ ఎమ్మెల్సీగా పదవిలో ఉన్నారు. ఆయనకు తన  విజయంపై అనుమానాలు లేకుంటే ఈ స్థాయిలో బేలగా ప్రచారం చేసుకోరు.  పైగా తన ప్రత్యర్థి  ఈటలను అనుకరిస్తూ, ఆయన గెలుపు ఫార్ములాగా భావిస్తున్న అదే ఫార్ములాను  ఆయనపైనే ప్రయోగించడాన్ని కూడా పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.   
Publish Date: Nov 28, 2023 2:59PM

యథా భర్త.. తథా భార్య ఏపీపై మంత్రి హరీష్ సతీమణి అవమానకర వ్యాఖ్యలు!

అదేంటో ఏపీ ప్రస్తావన లేకుండా తెలంగాణ ఎన్నికలు పూర్తి కావడం లేదు. గతంలో జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఏపీ ప్రస్తావన వచ్చినా.. అప్పుడు మరో రకంగా ప్రభావం కనిపించేది. ఆంధ్రా పాలకుల పేరిట తెలంగాణ పార్టీలు సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసేవారు. కానీ, ఈసారి రాష్ట్రంలో అసమర్దులకు పట్టం కడితే ఎలా ఉంటుందో  చెప్పడానికి తెలంగాణ పాలకులు ఏపీని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఒకటీ రెండుసార్లు బీఆర్ఎస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఎన్నికల సమయం వచ్చాక  ఇటువంటి మాటలు తరచుగా వినిపిస్తున్నాయి. ఏపీలో రోడ్ల పరిస్థితిని వివరిస్తూ సీఎం కేసీఆర్ డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ.. సింగిల్ రోడ్డయితే ఆంధ్రా, ఏపీ రోడ్లెక్కితే మంచాన పడుడే, తెలంగాణలో ఎకరం అమ్మితే ఇప్పుడు ఆంధ్రాలో యాభై ఎకరాలు కొనొచ్చనే వ్యాఖ్యలు చేశారు. అలాగే వెలుగులు ఉంటే తెలంగాణ.. అంధకారం కనిపిస్తే ఆంధ్ర అని కూడా ఏపీలో విద్యుత్ కోతలను ఎగతాళి చేశారు.  పాలన చేతకాదన్న వాళ్ళే ఇప్పుడు దివాళా తీశారని.. తెలంగాణ విడిపోతే చీకటైతది అంటే ఇప్పుడు ఏపీనే అంధకారమైందని, ఆంధ్రా వాళ్లే ఇప్పుడు తెలంగాణ వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారని కేసీఆర్ పలుమార్లు సెటైర్లు వేశారు.  ఇక మంత్రి కేటీఆర్ అయితే.. ఆంధ్రా వాళ్ళు పరిశ్రమలను పొమ్మంటే మేము వారిని ఆహ్వానించామని, పండగకో, శుభకార్యానికో ఏపీకి వెళ్లినా ఉండలేని పరిస్థితి ఉందని మాట్లాడారు. మరో మంత్రి హరీష్ రావు అయితే ఏపీలో పనితనం లేదు కానీ పగతనం ఉందని మనకి అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని ప్రజలను కోరారు. కాగా, భర్తకు తగ్గ భార్యగా మంత్రి హరీష్ రావు సతీమణి కూడా ఇప్పుడు ఏపీపై సెటైర్లు వేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రం అంటూ ఏపీ ప్రజలపై సానుభూతి చూపిస్తూనే జగన్ మోహన్ రెడ్డి పాలనపై సెటైర్లు వేశారు. ఏపీలో పరిస్థితిని పోలుస్తూ తెలంగాణలో అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత గొప్పగా పాలించిందో చెప్పేందుకు ఏపీలో వైసీపీ పాలనను వేలెత్తి చూపించారు.  కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ అనే స్థాయికి ఎదిగితే , జగన్ మోహన్ రెడ్డి పాలనతో ఏపీలో పరిస్థితి దిగాజారిపోయిందని హరీష్ సతీమణి శ్రీనిత వ్యాఖ్యానించారు.  తెలంగాణలో ఎన్నికల ప్రచారం మంగళవారం(నవంబర్ 28)తో  ముగిసింది. ఈ క్రమంలోనే అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఒక్కో అభ్యర్థి తరపున ఇంటిల్లిపాది అందరూ ప్రజల మధ్యకి వచ్చి ఇంటింటికి తిరుగుతూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత కూడా భర్త తరపున ప్రచారం నిర్వహించారు. సిద్ధిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శ్రీనిత.. ఏపీకి కనీసం రాజధాని కూడా లేదని.. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిందని.. వాళ్లకు కావాల్సినన్ని వనరులు ఉన్నా అక్కడ అభివృద్ది జరగలేదని పేర్కొన్నారు. ఏపీలో ఉత్పత్తి అవుతున్న పంటను.. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న పంటను  బేరీజు వేసుకొని చూడాలని ప్రజలను కోరారు. అన్నీ ఉన్నా అక్కడ అభివృద్ధి లేదంటే.. మనం గొప్పనా? వాళ్లు గొప్పనా? మీరే నిర్ణయించుకోవాలన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందనే దానికి ఏపీలో పరిస్థితులే నిదర్శనమనేలా ఆమె మాట్లాడారు. దీంతో సహజంగానే మరోసారి రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాలలో ఈ వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. ముఖ్యంగా ఏపీలో శ్రీనిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఏపీపై ఈ తరహా వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వం వైఫల్యమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, బీఆర్ఎస్ నేతలు ఎంతగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా   వైసీపీ నేతలలో చలనం ఉండడం లేదు. దాన్నే అలుసుగా తీసుకుని జగన్ వైఫల్యాన్ని బీఆర్ఎస్ నేతలు తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ఏపీలో ప్రతిపక్ష పార్టీల నేతలు ఒక్క మాట మాట్లాడినా కట్టకట్టుకుని ఎదురుదాడికి దిగే వైసీపీ నేతలు.. పొరుగు రాష్ట్రం నేతలు ఇలా ప్రతిసారి ఎగతాళిగా మాట్లాడినా నోరు మెదపడం లేదు. ఏపీ ప్రజలకు ఇది మరింత ఆగ్రహం తెప్పిస్తున్నది. సీఎం జగన్ ను నోరెత్తి ఒక్క మాట మాట్లాడినా వారిపై విరుచుకుపడే నేతలు.. పరాయి రాష్ట్రంలో జగన్ పాలనపై హేళన చేస్తున్నా కుక్కిన పెనులాగా కిక్కిరుమనకుండా ఉన్నారంటే వారి వైఫల్యాన్ని వారే  అంగీకరించినట్లు భావించాల్సి వస్తున్నదని   పరిశీలకులు విశ్లేషిసున్నారు.
Publish Date: Nov 28, 2023 1:32PM

వైసీపీ ఎమ్మెల్సీ మూడో పెళ్లి.. రెండో భార్య, కొడుకు సాక్షులు!

ఏపీలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ వివాహం ఇప్పుడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సోమవారం (నవంబర్ 27) వివాహం చేసుకున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాత అనే మహిళను ఆయన వివాహం చేసుకున్నారు. కైకలూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో వీరి వివాహం  నిరాడంబరంగా జరిగింది. అయితే  ఈ వివాహం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  దీనికి కారణం ఆయనకు ఇది మూడవ వివాహం కావడం.. ముందు ఇద్దరు భార్యలకు ముగ్గురు పిల్లలు ఉండడం. అంతేకాదు, ఎమ్మెల్సీ చేసుకున్న ఈ మూడవ వివాహానికి రెండో భార్య, కుమారుడు సాక్షులుగా సంతకాలు చేయడం మరో విశేషం. ఇన్ని ట్విస్టులు ఉండడం వలనే ఈ పెళ్లిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది.  జయమంగళ వెంకటరమణ 1999లో తెలుగుదేశంలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005లో కైకలూరు జెడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో తెలుగుదేశం నుండి కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచిన జయమంగళ వెంకటరమణ 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. దీంతో ఆ ఎన్నికల అనంతరం  వైసీపీ గూటికి చేరిపోయారు. వైసీపీ ఆయనను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది.  దీంతో ఆయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో   వైసీపీ నుండి ఆయనే కైకలూరు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎమ్మెల్సీ వెంకటరమణ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోగా.. వారికి ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత సునీత అనే మహిళను వెంకటరమణ వివాహం చేసుకోగా.. వారికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. వెంకటరమణ కైకలూరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే రెండో భార్యతో మనస్పర్థలు రాగా.. కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. దీంతో రెండో భార్య సునీత అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణపై కేసులు కూడా పెట్టారు. ఆ తర్వాత పరస్పర అంగీకారంతో 2019లో మచిలీపట్నం కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. కాగా ఇప్పుడు ఎమ్మెల్సీగా వెంకటరమణ మూడో వివాహం చేసుకున్నారు. ఏలూరు రేంజ్ అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సుజాతను కైకలూరు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు కాగా. వెంకట రమణ రెండో భార్య సునీత, ఆమె కుమారుడి సమక్షంలోనే ఈ వివాహం జరిగింది. రెండో భార్య సునీత ఈ వివాహానికి సాక్షి సంతకం పెట్టడం గమనార్హం. ఇక, వధువు సుజాతకు ఇది రెండో వివాహం కాగా ఆమెకు కూడా ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఆమె భర్త నుండి విడిపోగా ఇప్పుడు ఎమ్మెల్సీని వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించనున్నారు. కాగా, వీరి పెళ్లి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ వెంకటరమణ మూడవ పెళ్లిపై ఇంతగా చర్చకు కారణం సొంత పార్టీ నేతలే కావడం గమనార్హం. గతంలో వైసీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శలు చేసే సమయంలో ఆయన మూడు వివాహాల అంశాన్ని సందర్భం ఉన్నా లేకున్నా లేవనెత్తేవారు. మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకూ, చివరాఖరికి ముఖ్యమంత్రి తో సహా అందరూ ఇదే అంశంపై దారుణంమైన  విమర్శలు చేశారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి అయితే అమ్మ ఒడి నిధులు విడుదల చేస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అభం శుభం తెలియని చిన్నారుల ముందే పవన్ కళ్యాణ్ వివాహాలపై మాట్లాడారు. ఈ అంశంపై అప్పట్లోనే రాజకీయ వర్గాలు విస్తుపోయాయి. అప్పటి నుండి సీఎం జగన్ సందర్భం వచ్చినా, రాకున్నా ప్రతిసారీ పవన్ పై ఇవే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇక మంత్రులు అంబటి లాంటి వాళ్ళైతే సోషల్ మీడియాలో కూడా దారుణ వ్యాఖ్యలు చేశారు.  కాగా ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ మూడవ పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు వైసీపీ నేతలను ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతల విమర్శలే ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకటరమణ పాలిట శాపంగా మారాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Publish Date: Nov 28, 2023 12:25PM

విశాఖ జూపార్క్ లో ఎలుగుబంటి దాడి... ఒకరు మృతి

ఎలుగుబంటి దాడిలో విశాఖ జూపార్క్ కీపర్ బానవరపు నగేశ్ (23) మృతి చెందడం కలకలం రేపింది. పార్క్ పరిసరాల్లో శుభ్రం చేస్తున్న యువకుడిపై నిన్న ఉదయం ఎలుగుబంటి ఒక్కసారిగా దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన నగేశ్‌ను జూ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. జూ కీపర్‌పై ఎలుగుబంటి దాడిచేస్తుండడాన్ని చూసి సందర్శకులు హడలిపోయారు. ఎలుగుబంటి దాడిలో మృతి చెందిన నగేశ్‌ది విజయనగరం జిల్లాలోని గజపతినగరం. విశాఖ వెల్ఫేర్ సొసైటీ ద్వారా రెండేళ్లుగా విశాఖ జూలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. నగేశ్ కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారం ప్రకటించినట్టు జూ క్యురేటర్ నందిని సలేరియా తెలిపారు. నగేశ్‌పై దాడిచేసిన ఎలుగుబంటి ‘జిహ్వాన్’ను మిజోరం నుంచి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. బోనులో ఉండాల్సిన ఎలుగుబంటి బయటకు ఎలా వచ్చిందన్నది అంతుబట్టడం లేదు. బోను తలుపులు ఎవరైనా తీశారా? లేదంటే, సరిగా వేయకపోవడంతో వాటంతట అవే తెరుచుకున్నాయా? అన్నదానిపై జూ అధికారులు  ఆరా తీస్తున్నారు.ఎప్పటిలాగే పార్కు పరిసరాలు శుభ్రం చేసేందుకు ఎలుగు బంటి ఉంచిన ప్రదేశానికి నగేష్     వెళ్లాడు. ఆ తర్వాత అతను ఎవరికీ కనిపించలేదు. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చి వెతికే సరికి తీవ్ర గాయాలై కనిపించాడు. తలమీద, ఎడమ చెయ్యిపైన బలమైన గాయాలయ్యాయి.  ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించినట్లు క్యూరేటర్ చెప్పారు. ఎలుగు బోనులో ఉందనుకుని తన పని తాను చేసుకుంటుండగా ఒక్కసారిగా అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. జూ సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఎలుగు బంటిని బోనులో బంధించారు.సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
Publish Date: Nov 28, 2023 11:52AM