సెమీ లాక్ డౌన్.. మోడీ ప్రతిపాదనల ఉద్దేశం ఇదేనా?
Publish Date:May 12, 2026
Advertisement
ముంచుకొస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుని ఎదుర్కొని నిలదొక్కుకోవాలంటే సెమీ లాక్ డౌన్ శరణ్యమని ప్రధాని మోడీ చెప్పకనే చెబుతున్నారా? అంటే ఆయన వరుసగా జారీ చేస్తున్న మార్గదర్శకాలను చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తుంది. అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మోజ్ జలసంధి వద్ద నెలకొన్న పరిస్థితులు చమురు సరఫరా చెయిన్ ను దెబ్బతీసే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉండటంతో.. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడం, నానాటికీ పెరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తకొత్త వ్యూహాలకు పదును పెట్టి మరీ తెరపైకి తెస్తున్నారు. బంగారం కొనవద్దు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం వంటి ప్రతిపాదనల తరువాత ప్రధాని మోడీ తాజాగా ఆయన పాఠశాల విద్యా వ్యవస్థలో కీలక మార్పులను సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు సాధ్యమైనంత వరకు వర్చువల్ లేదా ఆన్లైన్ తరగతులను నిర్వహించాలని పిలుపునిచ్చారు. అంటే దాదాపుగా సెమీ లాక్ డౌన్ పరిస్థితులను ఆహ్వానిస్తున్నారన్న మాట. సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా ఉంటే.. ఇంధన వినియోగం భారీగా తగ్గుతుందన్నది ఆయన ఉద్దేశంగా కనిపిస్తోంది. గత కొద్దిరోజులుగా ప్రధాని మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పలు మార్గదర్శకాలను విడుదల చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ వేదికగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ఐటీ , ఇతర రంగాల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే. దాని కొనసాగింపుగానే తాజాగా పాఠశాలల నిర్వహణకు సంబంధించి కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ , అమెరికా మధ్య నెలకొన్న విభేదాలు గ్లోబల్ ఆయిల్ సప్లై చైన్పై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. దీనివల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా ఇంధన భారాన్ని తగ్గించుకోవాలంటే ప్రయాణాలను తగ్గించడం ఒక్కటే మార్గమని ప్రధాని చెబుతున్నారు. అందుకే కోవిడ్ సమయంలో విజయవంతమైన వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతులను మళ్ళీ ప్రోత్సహించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/modi-prapose-semi-lock-down-36-219501.html





