నాడు ఇందిర...నేడు మోడీ...హిస్టరీ రిపీట్స్
Publish Date:May 12, 2026
Advertisement
దేశ ఆర్ధిక భద్రత విషయంలో కాలం మారుతున్నా కేంద్ర నిర్ణయాలు ఒకేలా ఉంటుండటం విశేషం. బంగారం కొనుగోలుకు సంబంధించి దాదాపు 60 ఏళ్ళ క్రితం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, తాజాగా పీఎం మోడీ ఒకేలాంటి ప్రకటనలు చేయడం.. హిస్టరీ రిపీట్స్.. అన్నట్టు మారింది. పశ్చిమఆసియా పరిస్థితుల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోడి చేసిన వ్యాఖ్యలు, నాడు ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేస్తున్నాయి. ఈ రెండు కాలాల్లోనూ దేశ ఆర్థిక సంక్షోభం, విదేశీ మారక నిల్వల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా బంగారంపై ఆంక్షలు, విజ్ఞప్తులు చోటుచేసుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో, విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ఏడాది పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోడి తాజాగా ప్రజలకు పిలుపునిచ్చారు. దేశం కోసం పౌరులు ఈ స్వీయ నియంత్రణ పాటించాలని, పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం తగ్గించాలని కోరారు. భారత్ తన బంగారం అవసరాల్లో 90% పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతుల విలువ రికార్డు స్థాయికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ప్రస్తుతానికి బంగారంపై దిగుమతి సుంకాలు పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. నాడు 1969లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బంగారంపై కఠినమైన నియంత్రణలు విధించారు. బంగారం కొనుగోలుపై పరిమితులు, ఆభరణాల తయారీలో బంగారు నాణ్యతపై నిబంధనలు తెచ్చారు. దేశంలో బంగారం దాచుకునే సంస్కృతిని తగ్గించి, ఆ పెట్టుబడులను ప్రభుత్వ పథకాలకు మళ్లించడం, అక్రమ రవాణాను అరికట్టడం దీని ప్రధాన ఉద్దేశం. ఇద్దరు ప్రధానులూ దేశ ఆర్థిక పరిస్థితి, దిగుమతుల భారం, విదేశీ మారక నిల్వల ఆదా కోసమే బంగారాన్ని నియంత్రించాలని కోరారు. ఇందిరాగాంధీ కాలంలో కఠినమైన చట్టాలు అమల్లోకి తెస్తే, మోడి ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలను విజ్ఞప్తి చేయడం, స్వీయ నియంత్రణ పాటించాలని కోరడం ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం మొదలుపెట్టింది.
http://www.teluguone.com/news/content/indira-gandhi-36-219582.html





