లుఫ్తాన్సా ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్
Publish Date:May 15, 2026
Advertisement
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ భద్రతా అలర్ట్ చోటుచేసుకుంది. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి శంషాబాద్కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్వేస్ విమానంలో బాంబు ఉందంటూ బెదరింపు రావడంతో విమానాశ్రయ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ విమానం శంషాబాద్ చేరుకునేలోపు పేల్చివేస్తామని తెలియజేస్తూ కస్టమర్ సపోర్ట్కు వచ్చిన బెదిరింపు ఈమెయిల్ తో భద్రతా యంత్రాంగం అలర్ట్ అయ్యింది. వెంటనే కేంద్ర భద్రతా సంస్థలు, ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, సీఐఎస్ఎఫ్ బృందాలు అత్యవసర చర్యలు చేపట్టాయి. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని రన్వే నుంచి దూరంగా ఉన్న ఐసోలేషన్ బేకు తరలించారు. ప్రయాణికులు మరియు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో విమానాన్ని అణువణువుగా తనిఖీ చేశారు. ప్రయాణికుల సామాన్లు, కార్గో విభాగం, కేబిన్ ప్రాంతం సహా ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా సాంకేతిక పరికరాలతో పరిశీలించారు. అలాగే ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ ఘటనతో ఇతర విమానాల రాకపోకలలో జాప్యం జరిగింది. బెదిరింపు మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది? ఎవరు పంపారు అన్న విషయాన్ని గుర్తించేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి.
http://www.teluguone.com/news/content/bomb-threat-to-lufthana-aireays-flite-36-219832.html





