political-news-img

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. బాల్క సుమన్ అరెస్టుకు పోలీసుల యత్నం

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ వద్ద శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నమోదైన కేసు నేపథ్యంలో ఆయనను విచారణ కోసం తీసుకెళ్లేందుకు పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల చర్యలను అడ్డుకునే ప్రయత్నం చేశాయి. టాస్క్‌ఫోర్స్, నాంపల్లి పోలీసులు తెలంగాణ భవన్‌కు చేరుకుని బాల్క సుమన్‌ను విచారణ నిమిత్తం తమ వెంట రావాలని కోరారు. అయితే పోలీసులు భవన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "పోలీసులు గో బ్యాక్", "ప్రభుత్వం కక్షసాధింపు ఆపాలి" అంటూ నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు పోలీసులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తెలంగాణ భవన్ పరిసరాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భవన్ చుట్టూ పోలీసులు మోహరించి కార్యకర్తలను చెదరగొట్టే చర్యలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఏసీపీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, బాల్క సుమన్‌పై ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సింగరేణి సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశామని చెప్పారు. సింగరేణి సంస్థతో పాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేయాలని వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని వెల్లడించారు. "విచారణలో భాగంగా బాల్క సుమన్‌ను తీసుకెళ్లేందుకు వచ్చాం. గత మూడు రోజులుగా ఆయన ఆచూకీ స్పష్టంగా తెలియలేదు. ప్రస్తుతం తెలంగాణ భవన్‌లో ఉన్నట్లు సమాచారం రావడంతో నోటీసులు అందించి విచారణకు హాజరు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం" అని ఏసీపీ తెలిపారు.మరోవైపు, ఈ చర్యలను బీఆర్ఎస్ నేతలు రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి పోలీసులు రావడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా, బాల్క సుమన్‌ను పోలీసులు విచారణ కోసం తీసుకెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Publish Date: May 30, 2026 1:09PM

political-news-img

తెలంగాణలో మైనింగ్ అక్రమాలపై సీఐడీ కేసు

తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగ్ కార్యకలాపాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మైనింగ్ తవ్వకాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం నిర్వహించిన విచారణలో ప్రాథమికంగా గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. విజిలెన్స్ సమర్పించిన నివేదిక ఆధారంగా మైనింగ్ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు మైనింగ్ అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో వివిధ జిల్లాల్లో నిర్వహించిన ఖనిజ తవ్వకాల అనుమతులు, లీజుల మంజూరు, తవ్వకాల పరిమితులు, ఖనిజాల రవాణా, రాయల్టీ చెల్లింపులు తదితర అంశాలపై దర్యాప్తు జరపనున్నారు. విజిలెన్స్ అధికారుల విచారణలో ఇంత భారీ ఎత్తున అక్రమాలు బయట పడడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ఘటనపై వెంటనే పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించాలని సీఐడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు ఇప్పటికే సంబంధిత శాఖల నుంచి రికార్డులు, అనుమతి పత్రాలు, లీజు ఒప్పందాలు, తనిఖీ నివేదికలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అప్పటి అధికారులు, మైనింగ్ కంపెనీల ప్రతినిధులు, ఇతర బాధ్యులను విచారించే అవకాశముంది. అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మైనింగ్ అక్రమాల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. సీఐడీ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముండటంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొంది.

Publish Date: May 30, 2026 12:42PM

political-news-img

పోలవరం జిల్లాలో పెద్దపులి కలకలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. గత నాలుగు నెలలుగా అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో సంచరిస్తున్న ఈ పెద్దపులి ఇప్పటివరకు సుమారు 20 పశువులపై దాడి చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు రాజమహేంద్రవరం అటవీ పరిధిలో సంచరించిన పులి తాజాగా పోలవరం జిల్లాలోని గంగవరం మండలంలోకి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. శుక్రవారం ఏలేరు రిజర్వాయర్ బ్యాక్‌ వాటర్ ప్రాంతం, ఆర్.డి. పురం పరిసరాల్లో పులి సంచరించిన ఆనవాళ్లు లభించాయి. పులి కదలి కలతో గంగవరం మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముఖ్యంగా పశువులపై వరుస దాడులు జరగడంతో రైతులు, పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. సాయంత్రం తర్వాత బయటకు వెళ్లేందుకు కూడా ప్రజలు వెనుకాడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వేములోవ, పిడతమామిడి తదితర గ్రామాల్లో పర్య టించి పరిస్థితిని సమీక్షిం చారు. గ్రామస్తులతో సమావేశమై తగు జాగ్రత్తలు సూచించారు. ఒంటరిగా అడవివైపు వెళ్లవద్దని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని, పులి ఆనవాళ్లు కనిపించిన వెంటనే అటవీశాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పెద్దపులి కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన అధికారులు, దాని సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తు న్నట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు... గత నాలుగు నెలలుగా అడవి ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలలో సంచరిస్తూ ఉండడంతో గ్రామస్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ జీవించసాగారు.

Publish Date: May 30, 2026 12:28PM

political-news-img

చెల్లెలి మార్ఫింగ్ ఫోటోలతో అన్నకు బెదిరింపులు...యువకుడి అరెస్ట్

చెల్లెలి మార్ఫింగ్ నగ్నచిత్రాలతో అన్నకు బ్లాక్‌మెయిల్.. యువకుడి గుట్టురట్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. భాగ్యనగరంలో సాంకేతికతను అడ్డుపెట్టుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్న నయా సైబర్ నేరగాళ్ల వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తనతో మాట్లాడటం లేదనే కక్షతో ఓ యువతి ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేయడమే కాకుండా.. వాటిని ఏకంగా ఆమె సోదరుడికే పంపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన ఉదంతం కలకలం రేపింది. ఈ దారుణానికి ఒడిగట్టిన కిలాడీ యువకుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. బాధిత యువతి, నిందితుడు ఒకే కాలేజీలో చదువుకుంటూ కొంతకాలం పాటు స్నేహితులుగా మెలిగారు. ఆ సమయంలో ఇద్దరూ కలిసి దిగిన కొన్ని సాధారణ ఫోటోలు, వీడియోలు సదరు యువకుడి మొబైల్‌లో ఉన్నాయి. అయితే, కాలక్రమేణా అతడి నడవడిక, ప్రవర్తనలో తేడా రావడంతో సదరు యువతి అప్రమత్తమైంది. అతడితో స్నేహాన్ని తెంచుకుని పూర్తిగా మాట్లాడటం మానేసింది. తనను దూరం పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువకుడు తీవ్ర కక్ష పెంచుకున్నాడు. మళ్లీ మాట్లాడాలంటూ పలుమార్లు వేధించినా యువతి లొంగకపోవడంతో దారుణమైన ప్లాన్ వేశాడు. తన వద్ద ఉన్న ఆమె ఫోటోలను అధునాతన టెక్నాలజీ సాయంతో నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేశాడు. అంతటితో ఆగకుండా, ఆ వికృత ఫోటోలను నేరుగా యువతి అన్న మొబైల్‌కు పంపించి బ్లాక్‌మెయిల్ కల్చర్‌కు తెరలేపాడు. తనకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకపోతే ఈ మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేసి వైరల్ చేస్తానంటూ సదరు సోదరుడిని బెదిరించాడు. ఈ ఊహించని పరిణామంతో సదరు కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురైంది. చివరకు ధైర్యం చేసి, ఇలాంటి సైకోలకు బుద్ధి చెప్పాలని భావించి పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీస్ యంత్రాంగం స్పందించిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత బాధితులు నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, సాంకేతిక పరిధి కారణాల వల్ల వారు జవహర్‌నగర్ పీఎస్‌కు రిఫర్ చేశారు. అక్కడ జవహర్‌నగర్ పోలీసులు తక్షణం స్పందించి 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేసి, తదుపరి వేగవంతమైన చర్యల కోసం కేసును మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. రంగంలోకి దిగిన మేడ్చల్ పోలీసులు అత్యాధునిక సాంకేతిక ఆధారాలు, ఐపీ అడ్రస్, మొబైల్ డేటా సాయంతో నిందితుడి గుట్టురట్టు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డిజిటల్ యుగంలో మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసినా, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడినా చట్టం దృష్టిలో తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన శిక్షలు పడేలా చేస్తామని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Publish Date: May 30, 2026 11:46AM

political-news-img

పెళ్లిచూపుల్లో కొత్త ట్రెండ్... కాబోయే అల్లుడి ‘ట్రాఫిక్ హిస్టరీ’ చెక్ చేసిన తండ్రి

జాతకాలే కాదు బాబోయ్.. కాబోయే పెళ్ళికొడుకు డ్రైవింగ్ హిస్టరీ ఆరా తీసిన మామ! ఆంధ్రప్రదేశ్‌లో పెళ్లి సంబంధాల అన్వేషణలో ఒక వినూత్నమైన, ఆసక్తికరమైన ఘటన వెలుగుచూసింది. సాధారణంగా పెళ్లిచూపుల సమయంలో అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, జాతకాలతో పాటు కుటుంబ నేపథ్యాన్ని ఆరా తీయడం కామన్. కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని కాకినాడలో ఓ తండ్రి మాత్రం కాబోయే అల్లుడి ప్రవర్తనను అంచనా వేయడానికి సరికొత్త పంథాను ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. సదరు తండ్రి తన కుమార్తెకు నిశ్చయించబోయే యువకుడి అలవాట్లు, క్రమశిక్షణ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని భావించారు. ఇందుకోసం ఆయన ఏకంగా స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, అక్కడి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)ని కలవడం విశేషం. సమాజంలో మారుతున్న అలవాట్ల దృష్ట్యా యువకుడి వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఇదొక్కటే నమ్మకమైన మార్గమని ఆయన భావించినట్లు తెలుస్తోంది. పోలీస్ రికార్డుల ద్వారా కాబోయే అల్లుడి నిజాయితీని, బాధ్యతను నిర్ధారించుకోవాలని ఆ తండ్రి ప్రయత్నించారు. సదరు యువకుడి పేరు మీద గతంలో ఎప్పుడైనా మద్యం తాగి వాహనం నడిపినట్లు (డ్రంకెన్ డ్రైవ్) కేసులు నమోదయ్యాయా? లేదా మితిమీరిన వేగంతో ప్రయాణించి (ఓవర్ స్పీడ్) ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడా? అనే వివరాలను రికార్డుల రూపంలో పరిశీలించాలని పోలీసులను కోరారు. తండ్రి అభ్యర్థన మేరకు ట్రాఫిక్ పోలీసులు వారి డేటాబేస్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం, సదరు యువకుడిపై ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలు గానీ, పెండింగ్ చలాన్లు గానీ, డ్రంకెన్ డ్రైవ్ కేసులు గానీ లేవని అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆ తండ్రి ఎంతో సంతోషించి, పెద్ద ఊపిరి పీల్చుకుంటూ పెళ్లి సంబంధానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఈ వింత వ్యవహారం కాస్తా సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేవలం జాతకాలు, జీతాలు చూస్తే సరిపోదని, ప్రభుత్వ రికార్డుల్లో అబ్బాయిల ‘ట్రాఫిక్ ట్రాక్ రికార్డ్’ కూడా అత్యంత కీలకమైన అర్హతగా మారబోతోందని కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మేధావులు, సామాజిక విశ్లేషకులు సైతం ఈ ధోరణిని స్వాగతిస్తున్నారు. రహదారిపై క్రమశిక్షణగా నడుచుకునే వ్యక్తి, జీవితంలోనూ బాధ్యతాయుతంగా ఉంటాడనే నమ్మకం పెరిగిందని అభిప్రాయపడుతున్నారు. యువతలో పెరుగుతున్న చెడు అలవాట్లు, నిర్లక్ష్యపు డ్రైవింగ్ సంస్కృతి కారణంగానే తల్లిదండ్రులు ఇంతటి కఠినమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోందని గుర్తుచేస్తున్నారు. రానున్న రోజుల్లో పెళ్లి సంబంధాల బ్రోకర్లు, మ్యాట్రిమోనీ సంస్థలు కూడా తమ ప్రొఫైల్స్‌లో ‘ట్రాఫిక్ క్లియరెన్స్ సర్టిఫికేట్’ అనే కొత్త కాలమ్‌ను చేర్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. యువత కేవలం ఉద్యోగాలపైనే కాకుండా, రోడ్లపై తిరిగేటప్పుడు కూడా తమ ప్రవర్తనను చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చర్చకు ఈ ఘటన గట్టి పునాది వేసింది.

Publish Date: May 30, 2026 11:17AM

political-news-img

విద్యార్ధినులకు ప్రతి నెలా 3 రోజులు రుతుక్రమ సెలవులు.. ఎక్కడంటే?

విద్యార్ధినులకు ప్రతి నెలా 3రోజులు రుతుక్రమ సెలవులు ఇవ్వాలని కేరళంలోని యూడీఎఫ్ ప్రభుత్వం నిర్ణయించింది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులు, వారి శారీరక ఆరోగ్యంపై సరికొత్త విప్లవానికి కేరళ రాష్ట్రం వేదికైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి, కొత్తగా కొలువుదీరిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రభుత్వం మహిళా అభ్యున్నతి, విద్యార్థినుల సంక్షేమమే ధ్యేయంగా చారిత్రాత్మక నిర్ణయాలను ప్రకటించింది. రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ రాజేంద్ర తన తొలి ప్రసంగంలో ప్రభుత్వ నూతన విధివిధానాలను వెల్లడిస్తూ, సమాజంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విద్యార్థినుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెలా 3 రోజుల పాటు రుతుక్రమ సెలవులు (Menstrual Leaves) ఇవ్వాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. యువతులకు పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే నొప్పులు, శారీరక అసౌకర్యాన్ని గుర్తించి, వారికి మానసిక ప్రశాంతతను చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ అద్భుతమైన నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేరళ ప్రభుత్వం కేవలం విద్యార్థినులకే కాకుండా, ఉద్యోగం చేసే మహిళలకు సైతం గవర్నర్ ప్రసంగంలో పలు కీలక వరాలను ప్రకటించి పెద్దపీట వేసింది. మహిళా ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడుతూ, 50 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయంలో విధిగా నాణ్యమైన డే కేర్ సెంటర్లను (Quality Daycare Centers) ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సరికొత్త విధానం వల్ల ఉద్యోగం చేసే తల్లులకు తమ చిన్న పిల్లల సంరక్షణ ఎంతో సులువవుతుంది. కార్యాలయాల్లోనే నమ్మకమైన డే కేర్ సదుపాయం ఉండటం వల్ల వారు ఎటువంటి ఆందోళన లేకుండా విధులు నిర్వహించుకోవచ్చు. వీటితో పాటు మహిళా ఉద్యోగుల మాతృత్వ హక్కులను గౌరవిస్తూ, పూర్తి జీతంతో కూడిన 6 నెలల ప్రసూతి సెలవులను (Paid Maternity Leaves) పక్కాగా అమలు చేస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. ఈ ఆరు నెలల పెయిడ్ లీవ్స్ వల్ల కొత్తగా తల్లులైన మహిళలకు ఆర్థిక భరోసాతో పాటు తమ శిశువును ఆరోగ్యంగా పెంచుకునే వీలు కలుగుతుంది. మరోవైపు, కేరళను నిరుపేదలు, అనాథలు లేని ఆదర్శవంతమైన రాష్ట్రంగా మార్చడమే తమ ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది. అందుకోసం రాష్ట్రంలో చట్టబద్ధమైన దత్తతలను (Legal Adoptions) ప్రత్యేకంగా ప్రోత్సహించనున్నట్లు గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. మహిళా సాధికారతకు మరియు సామాజిక భద్రతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కేరళ ప్రభుత్వ ఈ చారిత్రాత్మక నిర్ణయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి.

Publish Date: May 30, 2026 11:00AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img