Top Stories

కరోనా కలకలం.. చండీగఢ్‌లో వైరస్‌తో ఒకరు మృతి

  కరోనాతో పంజాబ్‌ చండీగఢ్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. చండీగఢ్‌లోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలోని సెక్టార్‌-32లో బుధవారం 40 సంవత్సరాల వ్యక్తి కొవిడ్‌ బారినపడి చనిపోయాడని ఓ అధికారి పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేకంగా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సదరు రోగి మంగళవారం ఆసుపత్రిలో చేరాడని.. అతనికి కొవిడ్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యిందని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందించారు. అతనికి కరోనాతో పాటు ఇతర వ్యాధులూ ఉన్నాయని దీంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. భారత్‌లో సోమవారం వెయ్యికిపైగా యాక్టివ్‌ కొవిడ్‌ కేసులు ఉన్నట్లుగా కేంద్ర రోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. అత్యధికంగా యాక్టివ్‌ కేసులు కేరళలో 430 ఉండగా.. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌, కర్నాటకలో అత్యధికంగా ఉన్నాయి.  
కరోనా కలకలం.. చండీగఢ్‌లో వైరస్‌తో ఒకరు మృతి Publish Date: May 28, 2025 9:34PM

అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి ఆయుధాలు

  అస్సాం ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు ఎక్కువ ప్రాంతాలో స్థానికులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయంచింది. ముస్లింలు ఎక్కువ ప్రాంతాల్లో అలాగే బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాల్లో నివసించే స్థానిక, ఆదివాసీ ప్రజలకు భద్రత కోసం గన్ లైసెన్సులు  ఇవ్వాలని  సీఎం హిమంత బిశ్వ శర్మ  కీలక ప్రకటన జారీ చేశారు.  గౌహతిలోని లోక్ సేవా భవన్‌లో జరిగిన మంత్రి వర్గ మీటింగ్ జరిగిన తర్వాత శర్మ మాట్లాడుతూ.. నాగావ్‌లోని ఢింగ్, రూపోహి, దక్షిణ సల్మారా, గౌహతిలోని హాటిగావ్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో ఈ లైసెన్సులు ఇస్తామని చెప్పారు. ఈ ప్రాంతాలను ప్రభుత్వమే గుర్తిస్తుందని, దరఖాస్తుదారులు నేర చరిత్ర లేకుండా ఉండాలని షరతు విధించారు. అస్సాం అల్లర్లు సమయం నుంచి స్థానికులు ఈ డిమాండ్ చేస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నరు. 
అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికి ఆయుధాలు Publish Date: May 28, 2025 8:29PM

10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం : సీఎం చంద్రబాబు

  తెలుగుజాతి ఉన్నంత కాలం తెలుగు దేశం పార్టీ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన అనంతరం ఆయన మాట్లాడారు.  దేవుడి ఇచ్చిన శక్తి మేరకు పార్టీని సమర్థవంతంగా నడిపిస్తాని ఆయన అన్నారు. నా బలం, బలగం టీడీపీ నాయకత్వమే అన్నారు. నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు తెలిపారు. మహానాడులో ఆరు శాసనాలపై అర్థవంతంగా చర్చలు జరిగాయి. రాబోయే 40 ఏళ్లకు ప్రణాళిక రచించుకున్నాం. నక్సలిజం రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ టీడీపీ అని ఆయన అన్నారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం తుదముట్టించి అభివృద్ధికి బాటలు పరిచామని పేర్కొన్నారు.  రాయలసీమ రాళ్ల సీమ కాదు..రత్నాల సీమగా మారుస్తానని చెప్పాని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ కంటే సంపదలో అనంతపురం ముందుండడానికి టీడీపీ అని అన్నారు.  బసకచర్ల ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని సీఎం చంద్రబాబు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు నేను ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదని ఆయన అన్నారు. నదుల అనుసంధానంతో తెలంగాణకు లాభమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు అని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేసింది నేనే అని ఆయన అన్నారు. 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.రూ.9వేల కోట్లతో కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. దీంతో కడప స్టీల్‌ ప్లాంట్ ద్వారా 3వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆయన తెలిపారు.175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి.. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.  
10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభం : సీఎం చంద్రబాబు Publish Date: May 28, 2025 7:30PM

ఎన్టీఆర్ పుట్ట‌క‌ పోయి ఉంటే!?

ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే సినిమాల్లో మ‌న‌కు స్టార్ డ‌మ్ ఎలాంటిదో   తెలిసేది కాదేమో. ఆనాటికి తెలుగు చిత్ర సీమ‌కు అతి పెద్ద హీరో చిత్తూరు నాగ‌య్య‌..  అప్ప‌ట్లో ఇటు చారిత్రక అటు పౌరాణిక అంటూ ఏ పాత్ర చేయాల్సి వ‌చ్చినా ఆయ‌నే చేసేవారు. ఎప్పుడైతే  ఎన్టీఆర్ పాతాళ భైర‌వి(1951) అనే ఒక సినిమా చేశారో ఆనాటి నుంచి తెలుగు చిత్ర సీమ డైన‌మిక్స్ మొత్తం ఛేంజ్ అయిపోయాయి. అప్ప‌టి  నుంచి ఎన్టీఆర్- ఎన్టీఆర్- ఎన్టీఆర్.. ఎటు చూసినా ఎన్టీఆర్ నామ జ‌పం  మొద‌లైంది.  చుక్క‌లు చాలానే ఉంటాయ్.. కానీ చంద్రుడొక్క‌డే అన్న‌ట్టు.. న‌టులు చాలా మందే ఉంటారు కానీ వాళ్ల‌లో మాత్రం మ‌హాన‌టుడు ఎన్టీఆర్ ఒక్క‌డే అన్న‌ట్టుగా త‌యారైంది  ప‌రిస్థితి. ఇక రెండో విష‌యం ఏంటంటే రాముడు- కృష్ణుడు- రావ‌ణాస‌ురుడు- ధుర్యోధ‌నుడు- క‌ర్ణ‌- భిష్మ వంటి ప‌లు పౌరాణిక చిత్రాలు చేయ‌డం మాత్ర‌మే కాకుండా ఆనాటి మాస్ జ‌నాల ద‌గ్గ‌ర‌కు క్లాసిక్స్ అయిన రామాయ‌ణ,  మ‌హాభార‌తాల‌ను తీసుకెళ్లిన ఘ‌న‌త కూడా ఎన్టీఆర్ దే.  ఒక వేళ ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే..  కొంద‌రికి రాముడు, కృష్ణుడు ఎలా ఉండేవారో అస్స‌లు తెలియ‌క పోయేదేమో. అంత‌గా ఆయ‌న ఆయా పాత్ర‌ల‌కు జీవం పోశారు. ఎంతైనా ఇది తెలుగు వారు మాత్ర‌మే చేసుకున్న అదృష్ట‌మ‌ని చెప్పాల్సి  ఉంటుంది. 1928 మే 28న నిమ్మ‌కూరులో పుట్టిన ఎన్టీఆర్ కి మొద‌ట పెట్టాల‌నుకున్న పేరు కృష్ణ‌. బిడ్డ చూడ్డానికి బాల‌కృష్ణుడిలా ఉన్నాడనుకున్న త‌ల్లి వెంక‌ట‌రామ‌మ్మ‌  ముచ్చ‌ట ఆ నాడు తీర‌లేదు. మేన‌మామ వ‌చ్చి తార‌క రాముడ‌న్న పేరైతే బాగుంటుంద‌ని అనే స‌రికి.. ఆ మ‌హాత‌ల్లి త‌న సోద‌రుడి మాట కాద‌న‌లేక‌.. పెట్టిన పేరు తార‌క రామారావు.  కృష్ణ అని త‌న త‌ల్లి పేరు పెట్ట‌లేక పోయింది. ఆమె ముచ్చ‌ట ఎలాగైనా స‌రే తీర్చాల‌నుకున్నాడో ఏమో ఎన్టీవోడు ఏకంగా 18 సార్లు శ్రీకృష్ణుడి వేషం ధ‌రించి.. ఇటు ఆ పాత్ర‌కు వ‌న్నె తేవ‌డం మాత్ర‌మే కాదు.. అటు తెలుగు ప్రేక్ష‌క‌జ‌నుల‌ను ఎంత‌గానో అల‌రించాడు.  ఇదిలా ఉంటే ఇదే అంశం మీద మ‌నం గుర్తించాల్సిన  మ‌రో అంశ‌మేంటంటే.. ఎన్టీఆర్ త‌న పిల్ల‌ల్లో అంద‌రి పేర్ల‌కు కృష్ణ అన్న ప‌దం చేర్చి మ‌రీ పెట్ట‌డం వెన‌క ఆ నాడు త‌న త‌ల్లి త‌న‌కు కృష్ణ అన్న పేరు పెట్టలేక పోవ‌డ‌మే అన్న న‌మ్మ‌కాలుండొచ్చ‌నీ అంటారు.  అందుకే తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం కాగా. ఆ పదకొండు మందిలో ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. కుమారుల పేర్లు ఏంట‌ని చూస్తే.. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కాగా.. లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమామహేశ్వరి కుమార్తెల పేర్లు. అలా ఎన్టీఆర్ త‌న త‌ల్లి.. కృష్ణ అన్న పేరు పెట్టలేక పోయింద‌న్న బాధ‌ను తుడిచేస్తూ ఆ పేరు త‌న పిల్ల‌ల‌కు పెట్టి.. ఆమె క‌న్న‌రుణం తీర్చుకున్నారా అనిపిస్తుంది.    త‌ర్వాత చెప్ప‌పుకోద‌గ్గ విష‌య‌మేంటంటే.. పారితోష‌కం.  అత్య‌ధిక పారితోష‌కం అందుకున్న తొలి త‌రం న‌టుల్లో ఎన్టీఆరే ముందుండేవాడు. ఆయ‌న తొలి  నాళ్ల‌లో అంటే 1951 నుంచి మొద‌లైన స్టార్ డ‌మ్ ద్వారా ఆయ‌న నెల‌కు 500 నుంచి 5 వేల వ‌ర‌కూ జీతం తీసుకునేవాడు. 1956లో విడుద‌లైన మాయా బ‌జార్ లో ఏకంగా 7500 రూపాయ‌లు తీసుకోవ‌డం.. అప్ప‌ట్లో అది అతి పెద్ద పారితోష‌కం.  సంవత్సరానికి 10 సినిమాల చొప్పున నటిస్తూ ఉండేవారు ఎన్టీఆర్. 1963 లో విడుదలైన లవకుశ అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన 22 సంవత్సరాల వరకు  పారితోషికం నాలుగైదు అంకెల్లోనే ఉండేది. 1972 నుంచి ఎన్టీఆర్ పారితోషికం లక్షల్లోకి చేరింది. ఇది కూడా అప్ప‌ట్లో ఒక రికార్డే. అంటే పారితోష‌కంలో ఒక ట్రెండ్ సెట్ చేసింది కూడా ఎన్టీఆరేన‌ని చెప్పాలి.  యాక్టింగ్ తో ఒక స్టార్ డ‌మ్ క్రియేట్ చేయ‌డంతో అత్యంత  ప్ర‌జాద‌ర‌ణ  పొంద‌డం.  సినిమా తీస్తే ఎన్టీఆర్ తోనే తీయాల‌న్న ఆలోచ‌న కొద్దీ నిర్మాత‌లు ఎగ‌బ‌డడం.. పారితోష‌కం అంత‌కంత‌కూ పెరుగుద‌ల అనే ప‌రిణామ క్ర‌మాన్ని తెలుగు సినీ ప‌రిశ్ర‌మ చూసింది కూడా ఎన్టీఆర్ ద్వారానే. ద్విపాత్రాభిన‌యం, త్రిపాత్రాభిన‌యం, పంచ‌పాత్రాభిన‌యం ఇలా ఎన్టీఆర్ ఇక్క‌డా ఒక‌ ట్రెండ్ సెట్ చేశాడు. రాముడు- భీముడితో మొద‌లైన ఈ ప‌రంప‌ర త‌ర్వాతి కాలంలో.. దాన వీర శూర క‌ర్ణ లో త్రిపాత్రాభిన‌యం, శ్రీమ‌ద్విరాట ప‌ర్వంలో ఐదు పాత్ర‌ల పోష‌ణ.. ఇలా ఈ విష‌యంలోనూ  ట్రెండ్ సెట్ట‌ర్ ఎన్టీఆరే. ఒక న‌టుడిగా ఉండి ద‌ర్శ‌క‌త్వంలోకి ప్ర‌వేశించిన తొలి త‌రం న‌టుల్లోనూ ఎన్టీఆర్ త‌ర్వాతే ఎవ‌రైనా. కొంద‌రు ఇది వ‌ర‌కే ఉన్నా..   స్టోరీ- స్క్రీన్ ప్లే-  డైలాగ్స్ లో త‌న‌దైన ముద్ర వేయ‌డంతో పాటు, సూప‌ర్ డూప‌ర్ హిట్స్ అందించిన ఘ‌న‌త  మాత్రం ఎన్టీఆర్ దే. ఇటు య‌మ‌గోల‌, అడ‌విరాముడు, వేట‌గాడు వంటి చిత్రాల ద్వారా మాస్ హిట్స్ అందించిన క్రెడిబిలిటీ కూడా ఎన్టీఆర్ దే. ఆ మాట‌కొస్తే సినిమాల్లో వంద  రోజులు, నూట యాభై రోజులు, 200, 250, 365 రోజులంటూ.. రోజులు- వారాలు- నెల‌లు- సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఆడిన సినిమాలు తీసిన చ‌రిత్ర కూడా మాస్ కా బాప్ ఎన్టీవోడి పేరిటే లిఖించ‌బ‌డి ఉండేది.  అంటే సినిమాల్లో ఏ రికార్డు ఉన్నా ఆ  రికార్డుల‌న్నీ దాదాపు ఎన్టీఆర్ ని మొద‌ట ప‌ల‌క‌రించాకే త‌ర్వాత ఇతరుల ప‌ర‌మ‌య్యేవన్నంతగా ఎన్టీఆర్ ద స్టార్ ఆఫ్ ద ఎంటైర్ తెలుగు ఫిలిమ్ ఇండ‌స్ట్రీగా ఉన్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ అంటే ఎన్టీఆర్- ఎన్టీఆర్ అంటేనే క్ర‌మ‌శిక్ష‌ణ‌. ఉదాత్త‌మైన, పౌరాణిక‌మైన పాత్ర‌ల పోష‌ణ స‌మ‌యంలో త‌న హావ‌భావాల‌తో పాటు.. నిద్రాహారాల‌ను సైతం మార్చుకుని వాటి కోసం తీవ్రంగా శ్ర‌మించ‌డం  అనే విద్య‌ను కూడా ఎన్టీఆర్ నేర్పిందే. ఆయ‌న పౌరాణిక పాత్ర‌లు పోషించేట‌పుడు సాత్వికాహార‌మే తినేవారు. నేల‌పై నిద్రించేవాడు.  ఇక న‌ర్త‌న శాల‌లో న‌టించేట‌పుడు నాట్యం రావాల్సి ఉండ‌గా.. అందు కోసం వెంప‌టి  చిన స‌త్యం ద‌గ్గ‌ర కూచిపూడి నాట్యం అభ్య‌సించారు ఎన్టీఆర్. అందుకే ఆయ‌న కెమెరా ముందు ఇంత వ‌ర‌కూ ఎప్పుడూ త‌డ‌బ‌డిందే లేదు. అంత‌గా ఎన్టీవోడు ఇటు క్లాస్ అటు మాస్ ప్రేక్ష‌క జ‌న  నీరాజ‌నాలు అందుకున్నాడు. డైలాగ్ డిక్ష‌న్ కు కొత్త డిక్ష‌న‌రీ క‌నిపెట్టింది కూడా ఎన్టీఆరే.  డైలాగ్ కొడితే ఎన్టీఆర్ కొట్టిన‌ట్టు ఉండాల‌న్న పేరుండేది. ఇప్ప‌టికీ ఆయ‌న డైలాగ్.. ఏమంటివి ఏమంటివి.. ఆచార్య దేవ‌!  డెలివ‌రీ ఒక ట్రెండ్ సెట్ట‌రే.  ఆయ‌న్ని ఫాలో అయ్యేవాళ్లే కానీ, ఆయ‌న ఫాలో అయిన వాళ్లు ఇంత వ‌ర‌కూ లేరంటే అతిశ‌యోక్తి కాదు.  అంత‌గా ప్ర‌తిదీ ఒక ల్యాండ్ మార్క్ లా స్థాపించారు ఎన్టీఆర్.  అందుకే ఆయ‌న విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ బిరుదాంకితుడ‌య్యారు. త‌న 44 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో 13 చారిత్ర‌కాలు, 55 జాన‌ప‌దాలు, 186 సాంఘీకాలు, 44 పౌరాణికాలు చేశారు. 1968లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్నారు. 1978లో ఆంధ్ర విశ్వ విద్యాల‌యం నుంచి గౌర‌వ డాక్ట‌రేట్, క‌ళాప్ర‌పూర్ణ స్వీక‌రించారు. అందుకే ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం, ప్ర‌చార నిర్వ‌హ‌ణ  అన్నీ ఒక ట్రెండ్ సెట్ట‌ర్లుగా మారాయి. 1978లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో అట్టుడికేది. న‌లుగురు ముఖ్య‌మంత్రులు మారారు. అంతే కాదు ఇక్క‌డి సీఎంని ఎక్క‌డో ఢిల్లీలో నిర్ణ‌యించేవారు. దీంతో తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య ఉండేది. ఏదో నామ్ కే వాస్తే ప‌ద‌వులుండేవి. వీట‌న్నిటిని బ‌ద్ద‌లు కొట్టిన చ‌రిత్ర కూడా ఎన్టీఆర్ దే. ఇదెలా జ‌రిగిందో చూస్తే.. 1981లో ఊటీలో స‌ర్దార్ పాపారాయుడు సినిమా షూటింగ్ జ‌రుగుతున్న సమయంలో..  షూటింగ్ విరామంలో ఒక విలేఖ‌రి.. ఒక ప్ర‌శ్న  వేశాడు. మీకు వ‌చ్చే 6 నెల‌ల్లో అర‌వై ఏళ్లు వ‌స్తాయ్. ఈ క్ర‌మంలో మీరేదైనా  కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నారా? అని అడ‌గ్గా.. అందుకు ఎన్టీఆర్ తాను ఇక‌పై తెలుగు ప్ర‌జ‌ల కోసం నెల‌లో 15 రోజులు వారి సేవ‌కోసం కేటాయిస్తాన‌ని అన్నాడు. తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని చెప్ప‌డానికి అదే తొలి సంకేతంగా మారింది. ఆనాటి నుంచి పెండింగ్ లో ఉన్న సినిమాల‌న్నిటినీ త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేసిన ఎన్టీఆర్ 1982 మార్చి 21న హైద‌రాబాద్ వ‌చ్చారు. 1982 మార్చి 29వ తేదీ మ‌ధ్యాహ్నం.. రెండున్న‌ర గంట‌ల‌కు కొత్త  పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అంతే కాదు దానికి తెలుగు దేశం అనే పేరు సైతం ప్ర‌క‌టించారు ఎన్టీఆర్.  పార్టీ ప్ర‌చారానికి త‌న పాత చెవ్రొలెట్ వ్యాను బాగు చేయించి.. దాన్నో క‌దిలే వేదిక‌గా త‌యారు చేయించారు. చైత‌న్య ర‌థం అంటూ దానిపై రాయించ‌డ‌మే కాకుండా తెలుగు దేశం పిలుస్తోంది రా క‌ద‌లిరా!  అంటూ నినాదాలు రాయించారు. దానిపై నుంచే అద్భుత‌మైన ప్ర‌సంగాలు చేశారు ఎన్టీఆర్. ఆ త‌ర్వాతి కాలంలో భార‌త రాజ‌కీయాల్లో ప్ర‌చార ర‌థాల‌కు ఈ చైత‌న్య ర‌థ‌మే ఒక స్ఫూర్తి   అంటే అతిశ‌యోక్తి కాదేమో. ప్ర‌చారంలో ఒక శ్రామికుడ్ని త‌ల‌పిస్తూ ఖాకీ డ్రెస్సు వేసుకుని మ‌రీ ప్ర‌చారం నిర్వ‌హించ‌డం కూడా అదే మొద‌లు. (ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా  కాషాయం ధ‌రించిందీ ఆయ‌నే) ఒక రాజ‌కీయ నాయ‌కుడు పిలిస్తే ఇంద‌రు ప్ర‌జ‌లు ఎగ‌బ‌డి వ‌స్తారా? అని ఈ ప్ర‌పంచానికి రుచి చూపించింది కూడా ఎన్టీఆరే.  అప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌సంగాలంటే బోరు కొట్టేవి. కానీ ఎన్టీఆర్ ప్ర‌సంగిస్తే ప్ర‌జ‌ల్లో ఒక చైత‌న్యం వ‌చ్చి ఊగిపోయేవారు. తెలుగువారి ఆత్మ‌గౌర‌వం వంటి ప‌దాలు చేర్చి.. వాటి ద్వారా  ఆయ‌న చెప్ప మాట‌ల‌కు చెవులు కోసుకునేవారు తెలుగు ప్ర‌జ‌లు.  ఈవిష‌యంలోనూ ఆయ‌న  త‌ర్వాతే ఎవ‌రైనా. 1983 జనవరి 7 న   ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. తెలుగుదేశం- 199, కాంగ్రెసు- 60, సిపిఐ- 4, సిపిఎం- 5, బిజెపి- 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ రాజ‌కీయ‌ చరిత్ర గ‌ల‌ కాంగ్రెసు పార్టీ.. 9 నెలల వ‌య‌సుగ‌ల‌ తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయిందంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య తేడా కూడా ఎన్టీఆరే. ఈ విష‌యంలోనూ ఎన్టీఆర్ రికార్డుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కూ ఎవ్వ‌రూ అందుకోలేక పోయారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెల‌ల‌కే అధికారంలోకి అన్న‌ది కూడా ఎన్టీఆర్ పేరిట అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉండే పొలిటిక‌ల్ రికార్డ్. ఇక ఎన్టీఆర్ గెలుపు ఓట‌ములు రెండూ రాజ‌కీయ సంచ‌ల‌నాలే. నాదెండ్ల కుట్ర కారణంగా శాసనసభలో తనకు తగ్గిన ఆధిక్యతను తిరిగి సంపాదించే ఉద్దేశంతో 1985 మార్చిలో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు ఎన్టీఆర్. కేంద్రం మిథ్య అని తేల్చి చెప్పిన ఘ‌న‌డు ఎన్టీఆర్. స‌రిగ్గా అదే స‌మ‌యంలో తాను అధికారం కోల్పోయాక ఆయ‌న్ను తిరిగి సీఎంగా నియ‌మించింది కూడా అదే కేంద్రంలోని కాంగ్రెస్. అంటే ఆయ‌నెంత విమ‌ర్శించినా.. ఆయ‌న్ను కాద‌నే ద‌మ్ము ధైర్యం కేంద్రానికి కూడా ఉండేది కాదు. అలాంటి కీర్తీ- ప్ర‌తిష్ట రెండూ ఎన్టీఆర్ సొంతం.. ఒక ప్రాంతీయ పార్టీ కేంద్రంలో ప్ర‌తిప‌క్ష హోదా  పొంద‌డం కూడా ఎన్టీఆర్ సెట్ చేసిన ట్రెండ్స్ లో ఒక‌టి. 1989 ఎన్నికల్లో  ఓడిపోయినా భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో కలిపి కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ అనే ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. అదే నేష‌న‌ల్ ఫ్రంట్ ఏర్పాటు. ఆనాడు ఎన్టీఆర్ సృష్టించిన ఆ ఫ్రంట్ పాలిటిక్సే ఇప్ప‌టికీ ఎన్డీఏ, యూపీఏల‌కు ప్రేర‌ణ‌.  ఇక ఆయ‌న తీసుకొచ్చిన సంక్షేమ ప‌థ‌కాలే నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో న‌డుస్తున్నాయ్. ఎన్టీఆర్ రాజ‌కీయ రంగంలోకి రాకుంటే ఇవి కూడా వ‌చ్చేవి కావేమో. ఇక ప్ర‌క్షాళ‌న కార్య‌క్ర‌మాల్లోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్ట‌ర్. అంతెందుకు మ‌నం నేడు హైద‌రాబాద్ ట్యాంక్ బండ్ పై చూస్తున్న చారిత్ర‌క పురుషుల విగ్ర‌హాల‌తో పాటు సాగ‌ర్  మ‌ధ్య‌లో నెల‌కొన్న బుద్ధుడి విగ్ర‌హం కూడా ఎన్టీఆర్ ఆలోచన, ఆచరణే. ఇక ప్ర‌త్య‌ర్ధి పార్టీ అయినా స‌రే నంద్యాల‌లో నాడు పీవీ న‌ర‌సింహ‌రావు పోటీ చేస్తే ఆయనకు  పోటీ పెట్ట‌కుండా సాటి తెలుగు వాడ‌న్న గౌర‌వ‌మిచ్చిందీ ఎన్టీఆరే. ఇక రెండు రూపాయ‌ల‌కు కిలో బియ్యం, సంపూర్ణ మ‌ద్యపాన నిషేధం,  ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు త‌గ్గింపు, శాస‌న మండ‌లి ర‌ద్దు.. ఇలా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు చాలానే.. సినిమా హాళ్ల‌కు స్లాబ్ సిస్ట‌మ్స్.. ఇలా ర‌క‌రాల రాజ‌కీయ నిర్ణ‌యాలకు ఆద్యుడు ఎన్టీఆరే. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు.. ఎన్టీఆర్ నాలుగు సినిమాల్లో న‌టించారు. ఇలాంటి  ఎన్నో విష‌యాల్లో ఎన్టీఆర్ కి తిరుగు లేదు. ఆ మాట‌కొస్తే ప్ర‌చార సినిమాలుగా విశ్వామిత్ర వంటి  చిత్రాలు తీయ‌డంలోనూ ఎన్టీఆర్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశార‌నే చెప్పాలి.   తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్. ఇదే ఆయ‌న కుటుంబ, రాజ‌కీయ జీవితాన్ని స‌మూలంగా మార్చేసింద‌ని చెప్పాలి.  ఆ త‌ర్వాత 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మ‌ర‌ణించారు విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు. మొత్తం 33 ఏళ్ల సినిమా జీవితం, 13 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఇటు క‌థానాయ‌కుడిగా, అటు మ‌హానాయ‌కుడిగా ఒక వెలుగు వెలిగిన ఎన్టీఆర్ పేరిట ఇంకా ఎన్నో రికార్డులు అలాగే నిల‌చి ఉన్నాయి. తిరిగి  ఆయ‌నే పుట్టి ఆయ‌నే వాటిని బ్రేక్  చేస్తే త‌ప్ప వాటినెవ‌రూ క్రాస్ చేయ‌లేరనడం అతిశయోక్తి కాదు.    మీసాల నాగ‌మ్మ‌గా ఆయ‌న వేసిన తొలి పాత్ర‌, మ‌న దేశంలో ఆయ‌న పోషించిన తొలి  సినిమా ఇన్ స్పెక్ట‌రు పాత్ర‌.. త‌ర్వాత త‌ర్వాత ఆయ‌న పోషించ‌ని పాత్ర ఏదైనా ఉందా? అన్న‌ట్టు అన్ని పాత్ర‌ల‌నూ పోషించ‌డం మాత్ర‌మే కాదు. రాజ‌కీయాల్లోనూ ఒక పెను సంచ‌ల‌నంగా ఎదిగిన  ఎన్టీఆర్ ఉత్తానాలే కాదు ప‌త‌నాల‌ను అందుకోవాల‌న్నా గుండెలుండాలి. ఈనాటికీ అత్యంత ప్ర‌జాద‌ర‌ణ గ‌లిగిన తెలుగు సెల‌బ్రిటీల్లో ఆయ‌నదే తొలి  స్థానం. ఆ స్థానాన్ని చేరుకోవ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. ఒక స‌మ‌యంలో అంటే ఆయ‌న రామ‌, కృష్ణ‌, వెంక‌టేశ్వ‌ర వంటి పౌరాణిక పాత్ర‌లు పోషిస్తున్న స‌మ‌యంలో ఇటు తిరుప‌తికి వ‌చ్చిన జ‌నం అటు చెన్నైకి వెళ్లి ఆయ‌న్ను రెండో వెంక‌టేశ్వ‌ర స్వామిగా చూసుకుని వెళ్లేవారు. ఆ కృత‌జ్ఞ‌త కొద్దీ టీటీడీలోనూ స‌మూల మార్పులు తెచ్చి.. ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టింది  కూడా ఎన్టీఆరే.  ఇదీ ఎన్టీఆరే పుట్ట‌క పోయి ఉంటే తెలుగు సినీ రాజ‌కీయాల్లో ఇన్నేసి అంశాల‌ను మ‌న‌మెవ‌రం చూసి ఉండేవాళ్లం కామని అంటారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఒక సాధార‌ణ స‌బ్ రిజిస్ట్రార్ గా ఆయ‌న త‌న జీవితాన్ని వెళ్ల‌దీసి ఉంటే ఆయ‌న సంత‌కానికి  కేవ‌లం ఆస్తులపై పేరు మాత్ర‌మే మారి ఉండేదేమో.. అదే ఆయ‌న సినీ న‌టుడిగా తాను ఎద‌గ‌డంతో పాటు త‌న ప‌రిశ్ర‌మ‌ను సైతం అంతేలా ఎదిగేలా చేసిన  ఘ‌న‌డు. రాజాకీయాల్లో ఎంద‌రో ఆయ‌న సంత‌కం  పొందిన బీఫామ్స్ తో బీసీ ఎస్సీ క్రిష్టియ‌న్ ముస్లిం మైనార్టీలు చ‌ట్ట స‌భ‌ల్లో అడుగు పెట్టారు. వీట‌న్నిటినీ మ‌నం ఎన్టీఆర్ పుట్ట‌క పోయి ఉంటే చూసేవారం కాదేమో!
ఎన్టీఆర్ పుట్ట‌క‌ పోయి ఉంటే!? Publish Date: May 28, 2025 5:56PM

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక

  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు మరోసారి ఎన్నియ్యారు. టీడీపీ నేత వర్ల రామయ్య  ఈ విషయాన్ని మహానాడు వేదికగా ప్రకటించారు. చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు. కాగా తొలిసారి 1995లో చంద్రబాబు టీడీపీ పగ్గాలు అందుకున్నారు. 30 ఏళ్లుగా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రెండెళ్లకోకసారి అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది.  పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న క్రమంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఇక 2014లో పార్టీ అధినేత చంద్రబాబు మీద నమ్మకంతో ఏపీ ప్రజలు ఆయన్ని గెలిపించారు. 2019లో టీడీపీ మరోసారి అధికారానికి దూరమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు రాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా మరోసారి చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు.  
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవ ఎన్నిక Publish Date: May 28, 2025 5:44PM

నిరుద్యోగుల నోటికాడ ముద్ద లాగేసే కుట్ర : సీఎం రేవంత్‌రెడ్డి

  రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఏర్పడిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని  సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అనేక మందిమహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు.. చదువు మాత్రమే. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే విద్యాతోనే సాధ్యమవుతుంది. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.  ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు చదువులు వద్దు.. కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారు. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలి. నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారు. ఆర్నెల్లు కూడా విరామం లేకుండా వాళ్ల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు. విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారు రేవంత్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే అది స్కామ్ అని నన్ను విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు 25 వేల కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. మేము కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే లాగా ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల 200 కోట్లు పెట్టి కడుతున్నామని ఆయన అన్నారు.
నిరుద్యోగుల నోటికాడ ముద్ద లాగేసే కుట్ర : సీఎం రేవంత్‌రెడ్డి Publish Date: May 28, 2025 5:02PM

జూన్ 2 సంచలనాలకు వేదిక కానుందా?

తెలంగాణ చరిత్రలో జూన్ 2వ తేదీకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలితంగా..  అమరవీరుల త్యాగాల ఫలంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన  రోజు, జూన్ 2. అవును తెలంగాణ రాష్ట అవతరణ దినోత్సవం జూన్ 2. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచం నలుమూలల ఉన్న తెలంగాణ ప్రజలు రాష్ట్ర అవతరణ వేడుకలను, స్వాతంత్ర దినోత్సవ వేడుకలా ఘనంగా జరుపుకుంటారు.  రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను తలచుకుని, నివాళులు అర్పిస్తారు. అలాగే, ప్రభుత్వ,  ప్రభుత్వేతర సంస్థలు, రాజకీయ పార్టీలు,  ప్రజా సంఘాలు, సాంస్కృతిక సంస్థలు వివిధ, కార్యక్రమాలు నిర్వహిస్తాయి. తెలంగాణ ఇంటింటి పండగ జరుపుకుంటుంది. ఇదంతా 2014 నుంచి ప్రతి ఏటా జరుగతున్నదే.. కానీ ఈ సంవత్సరం జూన్ 2 న అంతకు మించి ఏదో జరుగుతందని, సంచలన నిర్ణయాలు ఉంటాయని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అది కూడా ఏదో ఒకటి, ఆరా కాదు ఏకంగా మూడు సంచలన నిర్ణయాలకు స్కోప్ ఉందనే ప్రచారం జరుగుతోంది.  అందులో మొదటిది  ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న, ఇప్పటికే ఎన్నో సార్లు పీటల వరకు వచ్చి ఆగిపోయిన రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ. జూన్ మొదటి వారంలో ఉంటుందని ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపధ్యంలో.. మంత్రి వర్గ విస్తరణ జూన్ 2  నే ఉండవచ్చని అంటున్నారు. తెలంగాణకు సంబంధించినంత వరకూ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2కు మించిన మంచి ముహుర్తహం మరొకటి ఉండదు. సో .. అసలంటూ, మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే జూన్ 2 నే ఉంటుందని  ఆశావహులు రెడీ అవుతున్నారు. అలాగే అదే రోజున తెలంగాణ పీసీసీ పూర్ణ కార్యవర్గం ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే.. మంత్రివర్గ విస్తరణ ముహుర్తహం అయినా, పీసీసీ ప్రమాణ స్వీకార ముహూర్తం అయినా  ఈ నెల 30న ఢిల్లీలో జరిగే నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.  అదలా ఉంటే.. తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక పోషించిన  బీఆర్ఎస్ (టీఆర్ఎస్) లో ఏ  రాజకీయ తుపాను. మరింత బలపడి జూన్ 2 న కొత్త టర్న్ తీసుకుంటుందని  అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే తెలంగాణ ఇంటి పార్టీ,  బీఆర్ఎస్ అధికారికంగా రెండుగా చీలడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు.  లేఖాస్త్రంతో తిరుగుబాటు జెండా ఎగరేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె  కల్వకుట్ల కవిత  రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునే  తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ,  అదే రోజు కవిత సొంత పార్టీ ప్రకటన వచ్చే అవకాశాలున్నాయనీ  పరిశీలకులు భావిస్తున్నారు.  ఇటు పార్టీని అటు కుటుంబాన్ని ఐక్యంగా ఉంచేందుకు కేసీఆర్  నెరపిన  రాయబారం కూడా విఫల కావడంతో..  కవిత పార్టీ పెట్టడం, కాదంటే, పార్టీ ఏర్పాటు దిశగా మరో అడుగు వేయడం  ఖాయమని అంటున్నారు. అఫ్కోర్స్, గులబీ పార్టీలో ఇదే తోలో చీలిక కాదు గతంలోనూ పార్టీ చీలింది.  అయితే ఇప్పడు వస్తున్న చీలిక కేవలం పార్టీలో వస్తున్న చీలిక మాత్రమే కాదు. పార్టీ అధినేత కుటుంబంలో వస్తున్న చీలిక.  అందుకే ఈ చీలిక రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనం సృష్టించడం ఖాయమంటున్నారు.   ఈ నేపథ్యంలోనే కవిత నిజంగా కొత్త పార్టీ పెడతారా? అది కూడా జూన్ 2 నే ఉంటుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.  బీఆర్ఎస్‌లో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. అందుకే కవిత ఇక ఆ పార్టీలో ఉండాలనుకోవడం లేదని ఆమె అనుచరులు చెబుతున్నారు ఈ క్రమంలోనే కవిత  పార్టీ ఏర్పాటుకు సన్నాహలు ముమ్మరం చేశారని అంటున్నారు. తెలంగాణ జాగృతి వేదికగా వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం కూడా అందులో భాగమేననిచెబుతున్నారు.  జాగృతిని విస్తరిస్తూ పలు కొత్త కమిటీలను కవిత ఏర్పాటు చేశారు. మరో వంక ఇప్పటికే ఆమె పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కవిత అనుచరులే కాదు, బీజేపీ ఎంపీ రఘునందన రావు వంటి ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా జూన్ 2వ తేదీన కవిత కొత్త పార్టీని ప్రకటిస్తారని చెబుతున్నారు. అయితే.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ఏర్పాటు విషయంలో ఎలాగైతే.. ఇఫ్స్ అండ్ బట్స్ అంటే అయితే గియితేలు  ఉన్నాయో అలాగే కవిత పార్టీ ప్రకటన ముహుర్తహం విషయంలోనూ ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదన్నది మాత్రం వాస్తవం. మరోవంక, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాయబారాలు నడుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారంగా ప్రచారం జరుగుతోంది   ఇక రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ, కవిత కొత్త పార్టీ ప్రకటన కంటే మంరిత సెన్సేషనల్ పొలిటికల్ డెవలప్ మెంట్ ఏమిటంటే..  కాంగ్రెస్ లో బీఆర్ఎస్  విలీనానికి ముహూర్తం ఖరారైందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పెట్టినరెండు ముహుర్తలలో మొదటి ముహూర్తం జూన్ 2. అయితే ఆ దిశగా కదలికలు ఏవీ కనిపించడం లేదు. అయినా, రాజకీయాల్లో ఏ క్షణానికి ఏమి జరుగునో .. ఎవరూ ఊహించలేరు.   ఈ మూడింటికి తోడు..  జూన్ 2 నే  ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గంట కొడతారని అంటున్నారు. ఇలా .. జూన్ 2 కేవలం తెలంగాణ అవతరణ దినోత్సవం మాత్రమే కాదు.. ఇంకా చాలా సెన్సేషన్స్ కు వేదిక కానుందని అంటున్నారు. అయితే ఈ వ్యుహాగానాల్లో ఏది నిజం అవుతుందో ..ఏది కాదో వేచి చూడవలసిందే. 
జూన్ 2 సంచలనాలకు వేదిక కానుందా? Publish Date: May 28, 2025 4:23PM

సీఎం చంద్రబాబుకు యువగళం పుస్తకం అందించిన లోకేశ్

  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో యువగళం పాదయాత్ర పుస్తకాన్ని అందించారు. ఆ పుస్తకంలో అంశలను పరిశీలించి లోకేశ్‌ను చంద్రబాబు అభినందించారు. ఈ క్రమంలో లోకేశ్ తన తండ్రి పాదాలను నమస్కరించారు. తన పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని మహనాడు సందర్బంగా ముఖ్యమంత్రికి ఇవ్వడం సంతోషంగా ఉందని లోకేశ్ ట్వీట్ చేశారు.  ఈ సందర్భంగా లోకేశ్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తుచేసుకున్నారు.ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తిప్రదాత అయిన చంద్రబాబుకు అందించడం ఎంతో సంతోషంగా ఉందని లోకేశ్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా స్ఫురణకు తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర ఆసాంతం తనకు అండగా నిలిచి, నాపై ప్రేమ, ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేశ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.  
సీఎం చంద్రబాబుకు యువగళం పుస్తకం అందించిన లోకేశ్ Publish Date: May 28, 2025 3:47PM

లోకేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు : పయ్యావుల

  యువనేత లోకేశ్‌కు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కావాలని టీడీపీ కార్యకర్తల నుంచి బలంగా డిమాండ్ వస్తోందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కడప మహానాడు’ ప్రాంగణంలో మంత్రి పయ్యావుల మాట్లాడుతూ… టీడీపీ కార్యకర్తలతో పాటు నేతలంతా ఈ డిమాండ్ నెరవేరాలని కోరుకుంటున్నారని చెప్పారు. లోకేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావాలన్నది ఇప్పుడు అత్యవసరం అన్నారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే ఇది సహేతుకమైన నిర్ణయమని పేర్కొన్నారు. పార్టీలో వినూత్న మార్పులకు మహానాడు ద్వారా శ్రీకారం చుట్టామని అన్నారు.  నారా లోకేశ్ ప్రతిపాదించిన 6 శాసనాలు గేమ్ ఛేంజర్‌ కానున్నాయని తెలిపారు. తొలిరోజు మహానాడుకు అంచనాలకు మించి ప్రతినిధులు వచ్చారని చెప్పారు. మహానాడులో సాయంత్రం చేసే రాజకీయ తీర్మానానికి ప్రాధాన్యం ఉందని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు.లోకేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలన్నది నీడ్ ఆఫ్ ది అవర్ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మరింత బలోపేతం కావాలంటే లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలన్నది సహేతుకమైన నిర్ణయమని తెలిపారు. అందరి అభిప్రాయాలకు అనుగుణంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
లోకేశ్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కావాలని కార్యకర్తలు బలంగా కోరుకుంటున్నారు : పయ్యావుల Publish Date: May 28, 2025 3:19PM

కవితకు బీఆర్ఎస్ తలుపులు మూసుకుపోయినట్లేనా?

పార్టీ కంటే ముందే అనుబంధ సంస్థల ప్రకటన? కవిత స్పీడ్ మామూలుగా లేదుగా? తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత స్పీడ్ ఓ రేంజ్ లో ఉంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. కవిత బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె   జాగృతి సంస్థతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతే కాదు సింగరేణి  ప్రాంతంలో పార్టీతో సంబంధం లేకుండా తన సొంత కమిటీలను ఏర్పాటు చేసేశారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. తెలంగాణ రాజకీయాలలో మరీ ముఖ్యంగా నార్త్ తెలంగాణ లో సింగరేణి  ప్రాబల్యం ఎక్కువ. సింగరేణి ప్రాంతంలో కవితకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి ప్రాంతానికి సబంధించి కవిత సొంతంగా కమిటీలను ఏర్పాటు చేయడం, కోఆర్డినేటర్లను నియమించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో అంతా బాగున్నప్పుడు సింగరేణి ప్రాంతంలో అనుబంధ సంఘాల బాధ్యతలన్నీ కవితే నిర్వహించిన సంగతి తెలిసిందే.  అలాగే సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలలోనూ బీఆర్ఎస్ తరఫున కవితే అన్నీ తానై చూసుకునే వారు.  అటువంటి కవిత ఇప్పుడు బీఆర్ఎస్ తో సబంధంధం లేకుండా జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించడం, కోఆర్డినేటర్లను నియమించడంతో ఆమె భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   గత కొన్ని రోజులుగా వరుసగా జరిగిన పరిణామాలను గమనించిన ఎవరికైనా కవిత అడుగులు బీఆర్ఎస్ కు దూరంగా పడుతున్నాయన్న విషయం ఇట్టే అవగతమైపోతుంది. సామాజిక తెలంగాణ అంటూ కవిత గతంలో చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలను  బీఆర్ఎస్ నేతలు కానీ, కార్యకర్తలు కానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైతే ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారో.. అప్పుడే ఆమె పార్టీకి మానసికంగా దూరమయ్యాన్న విషయం అవగతమైందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఆ లేఖ లీక్.. తదననంతర పరిణామాలు గమనిస్తే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శిబిరం నుంచి కవితకు ఇసుమంతైనా ప్రాధాన్యం లేదన్న క్లారటీ వచ్చేస్తుంది.  అన్నిటికీ మించి కవిత తన తండ్రి, పార్టీ అధనేత కేసీఆర్ కు రాసిన లేఖలో చేసిన ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆమె లేఖను బట్టి చేస్తే ఇంత కాలంగా కాంగ్రెస్ చేస్తున్న బీజీపీ బీటీమ్ బిఆర్ఎస్ అన్న విమర్శలలో వాస్తవం ఉంది అనిపించకమానదని పరిశీలకులు అంటున్నారు. కవిత లేఖ మేరకు గులాబీ జెండా కాషాయ వర్ణంలోకి మారుతోందా అన్న అనుమానాలు కలగక మానవని బెబుతున్నారు. ఆ లేఖ ద్వారా బీఆర్ఎస్, బీజేపీ నెక్సస్ వాస్తవమేనని కవిత చాటినట్లైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత లేఖపై స్పందించే కంటే ఆమెను దూరం పెట్టి ఆమె దారి ఆమె చూసుకునేలా చేయడమే బటరన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చేసినట్లు కనిపిస్తోందంటున్నారు. అందుకే లేఖ వెలుగులోకి వచ్చి ఇన్ని రోజులైనా కేసీఆర్ ఆమెను పిలిపించుకుని మాట్లాడటం కానీ, ఆ లేఖపై స్పందించడం కానీ చేయలేదని చెబుతున్నారు. సో.. ఇహనో ఇప్పుడో, తేదా నేడో, రేపో కవిత తన దారి తాను చూసుకోవడం ఖాయమంటున్నారు. అదే జరిగితే కవితను అనుసరించడానికి బీఆర్ఎస్ లో  చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కవితకు బీఆర్ఎస్ తలుపులు మూసుకుపోయినట్లేనా? Publish Date: May 28, 2025 3:04PM

యువనేత లోకేశ్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇవ్వాలి : ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌

    తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత మంత్రి నారా లోకేశ్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలని పొన్నూరు ఎమ్మెల్యే  ధూళిపాళ్ల‌ నరేంద్ర మహానాడులో తీర్మానించారు. ఈ విష‌య‌మై గుంటూరు జిల్లా స్థాయిలో జ‌రిగిన మినీ మహానాడులో తీర్మానం చేసిన‌ట్లు చంద్ర‌బాబుతో ఎమ్మెల్యే తెలియ‌జేశారు. ఇక, ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మరో టీడీపీ సీనియ‌ర్‌ నేత ఆనం వెంకటరమణారెడ్డి కూడా ఇదే అంశాన్ని మహానాడులో అధినేత చంద్రబాబు  దృష్టికి కచ్చితంగా తీసుకెళతామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా యువశక్తితో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలన్నదే అందరి లక్ష్యమని జీవీ ఆంజనేయులు తెలిపారు. గ‌త కొంత‌కాలంగా టీడీపీలో యువనేత నారా లోకేశ్‌కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలనే చర్చ జోరుగా సాగుతున్న విష‌యం తెలిసిందే. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్‌ను నియమించాలనే డిమాండ్ పార్టీ శ్రేణుల నుంచి బలంగా వినిపిస్తోంది.   
యువనేత లోకేశ్‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇవ్వాలి : ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌ Publish Date: May 28, 2025 2:52PM

లోకేష్ కు ఎలివేషన్ లాంఛనమేగా?

కడప మహానాడు వేదికగా ఐటీ, విద్యాశాఖ మంత్రి,  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ప్రమోషన్ లంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీలో, ప్రభుత్వంలో  తనదైన ముద్ర వేస్తున్న నారా లోకేష్ కు టీడీపీలో నిర్ణయాత్మక పదవి ఇచ్చేందుకు కడప మహానాడు వేదిక అవుతుందన్న  ప్రచారం జోరందుకుంది. లోకేష్‌కు ప్రమోషన్‌పై టీడీపీలో ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉండబోతుందనే ప్రశ్నలకు ఈ మహానాడు సమాధానం చెప్పనుందని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే లోకేష్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేయాలంటూ పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర వంటి వారు మహానాడు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే వాస్తవానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కాకుండా లోకేష్ కు తెలుగుదేశం ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. లోకేష్ కోసమే ప్రత్యేకంగా పార్టీలో  ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌ పోస్ట్‌ క్రియేట్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. పార్టీలో ఒక నేతకు ఒకే పదవి, అది కూడా రెండు సార్లు మాత్రమే అంటూ ఒక చర్చ జరుగుతోందనీ, ఆ చర్చను ప్రారంభించిందే లోకేష్ అని కూడా చెబుతున్నారు. ఆ మేరకు పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని వదులు కోవడానికి లోకేష్ సిద్ధమయ్యారనీ కూడా అంటున్నారు. అందుకే  పార్టీలో ఇప్పటి వరకూ లేని ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేసి ఆ పదవిలో లోకేష్ ను నియమించాలన్నది చంద్రబాబు ఉద్దేశంగా చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుగుదేశం తొలి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా లోకేష్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమేనని చెబుతున్నారు. వాస్తవానికి  తెలుగుదేశంలో ఇప్పటి వరకూ కార్యనిర్వాహక అధ్యక్ష పదవే లేదు. ఇప్పుడా పదవిని క్రియేట్ చేసి మరీ లోకేష్ కు అప్పగించనున్నారని పార్టీ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.  నారా లోకేశ్ ఇప్పుడు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా ఉన్నారు.  పార్టీ వ్యవహారాలలోనూ, పాలనాపరంగానూ కూడా లోకేష్ తన ముద్ర బలంగా వేశారు.  అన్నిటికీ మించి లోకేష్ నడక, నడత, ప్రసంగాలూ, ఆలోచనలూ అన్ని యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశంలో పెరుగుతోంది. పైగా ఈ డిమాండ్ పార్టీలోని సీనియర్ మోస్ట్ లీడర్స్ నుంచే వస్తోంది.  ప్రభుత్వంలో ప్రమోషన్ అంటూ డిప్యూటీ సీఎం. అయితే ఆ విషయంపై మాట్లాడొద్దని చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలను హెచ్చరించడంతో, ఇప్పుడు పార్టీలో ప్రమోషన్ విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.  పార్టీ కీలక నేతలు సైతం లోకేష్ కు పార్టీలో మరింత ప్రాధాన్యత పెరగాలని పట్టుబడుతున్నారు.  పార్టీ మరింత బలోపేతం కావాలంటే లోకేష్ కు ఎలివేషన్ ఇచ్చి తీరాల్సిందే అంటున్నారు.    ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలోనూ లోకేష్ చాలా కీలకంగా ఉన్నారు. ఆయన  నేతృత్వంలో ఇప్పటి వ‌ర‌కూ 91 ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటుచేయడానికి ముందుకు వచ్చాయి.  భారీ స్థాయిలో పెట్టుబడులు, భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలూ కల్పించేందుకు ఆ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి.   రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ రంగాల్లో 5 ల‌క్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయన పలు సందర్భాలలో చెప్పారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో మరింత నిర్ణయాత్మక పాత్ర లోకేష్ కు అప్పగిం చాలని చంద్రబాబు కూడా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో కూడా లోకేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. స్వయంగా ప్రధాని మోడీ లోకేష్ ను తన నివాసానికి విందుకు ఆహ్వానిం చారు. మహామహులకే అంత తేలిగ్గా లభించని ప్రధాని మోడీ అప్పాయింట్ మెంట్ లోకేష్ కు అడగకుండానే లభించడమే ఆయన స్థాయి ఏమిటన్నది అవగతమౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు ప్రాంగణం నుంచే పార్టీ సీనియర్ లీడర్లు లోకేష్ కు ఎలివేషన్, ప్రమోషన్ కోసం డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
లోకేష్ కు ఎలివేషన్ లాంఛనమేగా? Publish Date: May 28, 2025 2:31PM

భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే పెద్దపీట : సీఎం చంద్రబాబు

  భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  సీఎం చంద్రబాబు అన్నారు. రెండో రోజు మహానాడులో చంద్రబాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి  అన్నారు. ప్రజలు, పార్టీ భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించిన ఆరు శాసనాలు గొప్పగా ఉన్నాయని ప్రశంసించారు. మహానాడును లోకేశ్ ఒక మలుపు తిప్పారని కితాబునిచ్చారు. భవిష్యత్తు కోసమే ఆ శాసనాలని అన్నారు. ఈ ఆరు శాసనాలు సరికొత్త చరిత్రకు నాంది అని చెప్పారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్పచారాలు చేస్తే సహించబోనని సీఎం తెలిపారు.  ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు చెప్పారు. బనకచర్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. పంద్రాగస్టు నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిసపారు. కార్యకర్తలే టీడీపీ అధినేత అనేది టీడీపీ సిద్ధాంతమని తెలిపారు. వలస పక్షులు వస్తుంటాయి, పోతుంటాయని... కార్యకర్తలే శాశ్వతంగా ఉంటారని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు.  లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పారు. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం మోపాలని చూశారని చంద్రబాబు వైసీపీపై మండిపడ్డారు. ఏమీ తెలియనట్టు గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. మెదడు చితికిపోయేలా వివేకాను దారుణంగా నరికి చంపారని అన్నారు. నేరస్తుల ఆటలు సాగబోవని చెప్పారు. కోవర్టుల పట్ల పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. టీడీపీలో వర్గపోరు అంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు.   
భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకే పెద్దపీట :  సీఎం చంద్రబాబు Publish Date: May 28, 2025 2:27PM

రేవంత్ కు పొమ్మనకుండా పొగ?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు. వచ్చారు. అందులో విశేషం లేదు. మరో రెండు మూడు రోజుల్లో ఈ నెల 30న మరో సారి  కూడా వెడతారు. గ డచిన  17 నెలల్లో మొత్తం 44 సార్లు.. అంటే సగటున నెలకు రెండు సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్రలు చేశారు. ఆ విషయాన్ని ఆయనే  స్వయంగా చెప్పారు. నెలలో రెండు సార్లు కాదు, ఒకే  రోజులో రెండు సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.  అయితే..  గతంలో చేసిన యాత్రలకు, ప్రస్తుత యాత్రకు   చాలా, ‘తేడా ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి..పార్టీ అధిష్టానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అందులో ఎలాంటి దాపరికం లేదు. ముఖ్యంగా పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి సంబంధాలు అస్సలు బాలేవు.  ఇది కూడా  అందిరికీ తెలిసిన రహస్యమే. అందుకే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా..  రాహుల్ గాంధీ దర్శన భాగ్యం కలగడం లేదు. అందులోనూ ఈ మధ్య కాలం లో అయితే..  ఇద్దరిమధ్య దూరం మరింతగా పెరిగిందనే ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. నిజానికి.. ముఖ్యమంత్రి ప్రస్తుత ఢిల్లీ యాత్ర రాజకీయ యాత్ర కాదు.  నీతి అయోగ్  సమావేశంలో పాల్గొనేందుకు ఆయన గత శుక్రవారమే ఢిల్లీ చేరుకున్నారు. శనివారం, ప్రధాని నరేంద్ర మోడీ అద్యక్షతన జరిగిన నీతి అయోగ్’ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరో ఒకరో ఇద్దరో కేంద్ర మంత్రులతోనూ భేటీ అయ్యారు. అంతవరకు అంతా సవ్యంగానే జరిగింది. అయితే అప్పటికే ఢిల్లీలో ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి ఎఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేసమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ పీసీసీ ఏర్పాటు..  మంత్రివర్గ విస్తరణఫై చర్చించినట్లు సమాచారం. నిజానికి ఈ సమావేశం ముందుగా అనుకున్నదా లేక అప్పటికప్పుడు ఫిక్స్ అయ్యిందా? అన్న విషయంలో క్లారిటీ లేదు.   అయితే..  ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ముడిపడక పోయినా..  పీసీసీ కూర్పు వరకు అయితే ఓకే అయిందని అంటున్నారు.  ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఢిల్లీలో లేక పోవడం వలన నిర్ణయం మే 30కి వాయిదా పడిందని అంటున్నారు. అందుకే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డిలను కూడా ఢిల్లీ రమ్మని అధిష్టానం ఆహ్వానించిందని అంటున్నారు. అదే రోజున మంత్రివర్గ మంత్రి వర్గ విస్తరణ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కానీ, ఆరోజు ఏమి జరుగుతుంది అనేది.. ఇప్పుడే, ఆ రోజే   చెప్పడం కష్టం అంటున్నారు. అదెలా ఉన్నా.. ఇప్పడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ అంతా.. త్రిబుల్  ఆర్ అంటే రాహుల్ రేవంత్ రిలేషన్స్ చుట్టూనే తిరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా..  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీలో తీవ్ర అవ మానం జరిగిందని కాంగ్రెస్ నాయకులే గుసగుసలు పోతున్నారు. ఒక విధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితి  పూలమ్మిన చోట కట్టెలు అమ్మడలా  తయారైందని  అంటున్నారు.  అవును. ఒకప్పుడు రాహుల్ గాంధీ అండదండలతోనే  రేవంత్ రెడ్డి  సీనియర్ నాయకులను తొక్కుకుంటూ పీసీసీ పీఠానికి.. అక్కడి నుంచి ముఖ్యమంత్రి కుర్చీకి చేరుకున్నారు. ఇప్పడు అదే రాహుల్ గాంధీ తలుపు తీయడం లేదు.     రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి అప్పాయింట్మెంట్ ఇవ్వలేదు. ఓకే.. కానీ.. ముఖ్య మంత్రిని ఢిల్లీలో ఉండమని చెప్పి..  మూడు రోజులుగా అక్కడే ఉన్నా..  ఆయన్ని పట్టించుకోకుండా, ఆయన ఎదురుగానే  పార్టీ సంస్థాగత వ్యవహరాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాత్రమే  రాహుల్ గాంధీ, మంత్రివర్గ  విస్తరణతో పాటు పీసీసీ ఏర్పాటుపై  చర్చలు జరపడం,  పీసీసీ చీఫ్ వచ్చి ముఖ్యమంత్రికి  రాహుల్ ఏమన్నారో చెప్పడం సీఎం రేవంత్ కు జరిగిన ఘోర అవమానంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ నాయకులు అయితే ఇది సామాన్యమైన అవమానం కాదని  చెవులు కొరుక్కుంటున్నారు. రాహుల్ గాంధీ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు ఇంతలా అవమానించారో ఏమో కానీ..  ముఖ్యమంత్రి పరిస్థితి చూస్తే మాత్రం  మొగుడు కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లుగా ఉందని అంటున్నారు.  రేవంత్ రెడ్డి వ్యవహారశైలిపై కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యంగా రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యక్ష సంబం ధాలు ఏర్పరచుకుంటున్నారనే అనుమానంతోనే రాహుల్ గాందీ..  ముఖ్యమత్రి  రేవంత్ రెడ్డిని దూరం పెట్టడం మొదలైందని అంటున్నారు. అందుకే, పొమ్మన కుండా పొగ పెడుతున్నారా?  అనే అను మానాలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయి. అంతే కాదు, రేవంత్ రెడ్డి అడ్డు తొలిగితే.. కొత్త స్నేహాలకు దారులు ఏర్పడతాయనే ఆలోచన కూడా అధిష్టానం మదిలో ఉందేమో అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. మరో వంక, అలాంటిది ఏదైనా జరిగితే ఏమి చేయాలనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి వ్యూహాన్ని సిద్థం చేసుకున్నారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో, అధికార పార్టీలో ఎలాంటి అనూహ్య మార్పులు జరిగినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని అంటున్నారు.
రేవంత్ కు పొమ్మనకుండా పొగ? Publish Date: May 28, 2025 12:28PM

మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్ లో పిల్ల సజ్జల.. ఎందుకంటే?

వైసీపీ  సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్  పిల్ల సజ్జల అదేనండీ.. సజ్జల భార్గవరెడ్డి మంగళగిరి పోలీసు స్టేషన్ లో ఉన్నారు. సామాజిక మాధ్యమంలో అనుచిత వ్యాఖ్యలు కేసులో ఆయనకు జారీ అయిన నోటీసుల మేరకు విచారణకు ఆయన మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ సూప్రీం కోర్టు వరకూ వెళ్లానా కూడా పిల్ల సజ్జలకు ఊరట లభించలేదు. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు చేపట్టిన సజ్జల భార్గవ్ రెడ్డి  అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై  అనుచిత, అసభ్య, అశ్లీల పోస్టులతో రెచ్చిపోయారు. అయితే.. గత ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలై.. అద్భుత విజయంతో తెలుగుదేశం కూటమి అధకార పగ్గాలు అందుకున్న తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చాకచక్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించేశారు. ఆ తరువాత   సజ్జల భార్గవ్ రెడ్డి ఎక్కడా కనిపించింది లేదు. వినిపించింది లేదు. అయతే చేసిన తప్పులు వదలవుగా..  జగన్ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పెట్టిన పోస్టులపై  కేసు నమోదయ్యింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి తొలుత హైకోర్టునూ అక్కడ చుక్కెదురవ్వడంతో సుప్రీం ను ఆశ్రయించారు. సజ్జల ముందస్తు బెయిలు పిటిషన్ పై  ఈ నెల 23న విచారించిన సుప్రీం కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. అయితే రెండు వారాల వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ, ఆ లోగా సంబంధింత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలన పేర్కొంది.   అదే సమయంలో అంటే  సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం  సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని భావిస్తున్నారా?  ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో మేము గ్రహించలేమని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.   సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే కేసుల్లో అంత తేలిగ్గా బెయిల్ లభిస్తుందని ఆశించవద్దని కూడా పేర్కొంది. దీంతో ఆయన తప్పని సరిగా తనకు అందిన నోటీసుల మేరకు పోలీసుల విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సజ్జల భార్గవ్ రెడ్డి బుధవారం (మే 28)  విచారణకు హాజరయ్యారు.  పోలీసుల నోటీసుల మేరకు ఆయన బుధవారం  మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సి ఉంది. అయితే సజ్జల భార్గవ్ రెడ్డి మాత్రం అంత కంటే ముందుగానే పోలీసు విచారణకు హాజరయ్యారు.  
మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్ లో పిల్ల సజ్జల.. ఎందుకంటే? Publish Date: May 28, 2025 12:05PM

పేదవాడి అన్నంముద్ద ఎన్టీఆర్.. చంద్రబాబు

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి,  దివంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఒక సంఘ సంస్కర్త అని, సంక్షేమానికి సరికొత్త మార్గం చూపిన మహనీయుడని కొనియాడారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు ప్రాథమిక అవసరాలు తీర్చడమే తన జీవిత లక్ష్యంగా భావించి కృషి చేసిన  ధీరోదాత్తుడు అని పేర్కొన్నారు.   సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం పలికిన దార్శనికుడిగా ఎన్టీఆర్ ను అభివర్ణించారు.   ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు కల్పించి వారికి అన్నయ్యారని పేర్కొన్నారు. మండల వ్యవస్థ తీసుకురావడం ద్వారా  పాలనను ప్రజల ముంగిటకు చేర్చిన ఎన్టీఆర్ పక్కా ఇళ్ల నిర్మాణ పథకంతో పేదలకు చేరువయ్యారనీ, అలాగే రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదలకు అన్నం ముద్దయ్యారని చంద్రబాబు అన్నారు. తెలుగుజాతి ప్రపంచ ముందు గర్వంగా తలెత్తుకు నిలబడాలన్నదే ఆయన సంకల్పమని చెప్పిన ఆయన... తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఉజ్వలంగా ప్రకాశిస్తోందంటే అందుకు ఎన్టీఆర్ ఆశీస్సులే కారణమన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు నిరంతరం శ్రమించడమే ఎన్టీఆర్ కు ఇచ్చే ఘన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు.  
పేదవాడి అన్నంముద్ద ఎన్టీఆర్.. చంద్రబాబు Publish Date: May 28, 2025 10:23AM

మహానాడు రెండో రోజు కార్యక్రమాలేంటో తెలుసా?

కడప వేదికగా జరుగుతున్న తెలుగుదేశం మహానాడులో రెండో రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజు తీర్మానం ప్రవేశ పెడతారు. ఆ తీర్మానాన్ని  సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప బలపరుస్తారు.   అనంతరం తెలుగుజాతి విశ్వ ఖ్యాతి.. విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు అన్న అంశంపై చర్చ జరుగుతుంది. అదే విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై కూడా విస్తృత చర్చ జరుగుతుంది. ఇక సాయంత్రం మహానాడులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం ఉంటుంది. పార్టీ అధినేతగా నారా చంద్రబాబునాయుడి ఎన్నిక లాంఛనమే కానుంది.  
 మహానాడు రెండో రోజు కార్యక్రమాలేంటో తెలుసా? Publish Date: May 28, 2025 10:03AM

తెలుగుదేశం మహానాడు తోలి రోజు సూపర్ హిట్

తెలుగుదేశం పెద్ద పండుగ మహానాడు ఈ సారి కడపలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తొలి రోజు మంగళవారం (మే26) పూర్తిగా పార్టీ అజెండాలపైనే సాగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు లోకేశ్  తెలుగుజాతి విశ్వఖ్యాతి, యువగళం,   స్త్రీశక్తి,  పేదల సేవలో సోషల్‌ రీఇంజినీరింగ్‌, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత అన్న ఆరు శాసనాలను ప్రతిపాదించారు. అలాగే పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే నిలబడింది, ప్రజల కోసమే పని చేసిందని చెప్పారు. నాలుగు దశాబ్దాల పైబడిన తెలుగుదేశం ప్రస్థానంలో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ జెండాను వదల కుండా మోసిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పిన లోకేష్.. మరో నాలుగు దశాబ్దాలు పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించేందుకు అవసరమైన అంశాలపై మహానాడు వేదికగా సమగ్ర చర్చ జరగాలన్నారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు అయితే  పార్టీ పటిష్ఠత, రాష్ట్రఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తన ఆలోచనలు, ప్రణాళికలను తొలిరోజు మహానాడు వేదికపై ఆవిష్కరించారు.  అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తేడాలను కళ్లకు కట్టారు. ఇక కార్యకర్తల విషయంలో జగన్ అధికారంలో ఉన్నసమయంలో ఒకలా.. అధికారం కోల్పోయిన తరువాత మరోలా మాట్లాడుతున్న తీరును చక్కగా ఎండగట్టారు.  అదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తల నిబద్దత, పోరాటాలు, త్యాగాలను గుర్తు చేసుకోవడమే కాకుండా.. పార్టీ కోసం కార్యకర్తలు చేసిన త్యాగాలను వృధాకానివ్వబోమని భరోసా ఇచ్చారు. అయితే అది ఒట్టి భరోసా మాత్రమే కాదని ఇప్పటికే ఆచరణలో చేసి చూపడంతో కార్యకర్తలలోనే కాదు, ప్రజలలోనూ వారి పట్ల విశ్వసనీయత పెరిగింది.  మొత్తం మీద మహానాడు తొలి రోజు సూపర్ సక్సెస్ అయ్యింది. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలి వచ్చిన కార్యకర్తల ఉత్సాహం ఇనుమడింప చేసేలా పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఇతర నాయకులు, మహానాడు వేదికగా చేసిన తీర్మానాలు ఉన్నాయి. 
తెలుగుదేశం మహానాడు తోలి రోజు సూపర్ హిట్ Publish Date: May 28, 2025 9:54AM

కొన్ని మొహమాటాలు లేకుంటే జీవితం ఎంతో బాగుంటుంది!

జీవితం చాలా విలువైనది. ముఖ్యంగా జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మరీ ముఖ్యమైనవి. జీవితాన్ని అవి ప్రభావితం చేస్తాయి. జీవితం ప్రభావితమైనపుడు అనుకూలతలు చోటు చేసుకుంటే  ఒకే. కానీ ప్రతికూలతలు ఎదురైతే మాత్రం జీవితం కుదుపులకు లోనవుతుంది. ఆ కుదుపులు అన్నీ మనిషి మానసిక పరిస్థితులను అతలాకుతలం చేస్తాయి. మరి ఇన్ని అనర్థాలకు ఒకే ఒక విషయం కారణం అవుతుందంటే అది నిజంగా చిన్న విషయం అని ఎలా అనుకోవాలి? మొహమాటం! కాదని, లేదని లేక ఇష్టం లేకపోయినా ఒప్పుకునే ప్రవర్తన స్వభావం మొహమాటం. ఇది ఎంతో సున్నితమైన అంశం కూడా.  *మా అమ్మాయికి మొహమాటం ఎక్కువ పెద్దగా మాట్లాడదు. (పర్లేదు మనుషులు అలవాటు కానిది ఈ కాలంలో మునిగిపోయి మాట్లాడేవాళ్ళు తక్కువే. అలవాటైతే మాట్లాడతారు) * మా అబ్బాయికి మొహమాటం ఎక్కువ ఎవరితో ఎక్కువగా కలవడు(బహుశా ఇంట్రోవేర్ట్ కావచ్చు. అంతర్ముఖులుగా ఉండేవారు అనవసర గోడవల్లోకి వెళ్లరు కాబట్టి సమస్య ఏమీలేదు) * మా ఆయనకు మోహమాటం ఎక్కువండి ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెప్పలేరు.(ఇదీ పాయింట్. మోహమాటంతో ఏమీ కాదని చెప్పలేక ఇబ్బందుల్లో ఇరుక్కుపోరూ) *అయ్యో మీరు మరీ మొహమాట పడకండి. మీకేం కావాలన్నా అడగండి. నేను సహాయం చేస్తాను కదా( ఈ బాపతు మనుషులు దారిన పోయే దాన్ని నెత్తికి ఎక్కించుకునేరకం) *సరేనని చెప్పకపోతే వాళ్ళు నొచ్చుకుంటారేమో (ఇలా భావించి ఎన్నో విషయాలలో దిగబడిపోయేవాళ్ళు ఎక్కువ) పై విధంగా  చెప్పుకుంటే ఎంతో మంది ఇలా మొహమాటంతో తమని తాము ఇబ్బందుల్లోకి నెట్టేసుకుంటారు. తరువాత తీరిగ్గా అలా చెయ్యకుండా ఉంది ఉంటే బాగుండెమో, ఏమి చేస్తాం పరిస్థితి అలా మారిపోయింది అనుకుంటారు. ఇంతకూ ఏ పరిస్థితి ఎలా మతింది. మొహమాటం అనేది  ఎలాంటి విషయాలలో వదిలేస్తే జీవితం బాగుంటుంది?? ఆర్థిక విషయాలు! డబ్బులు ఎవరికీ చెట్లకు కాయవు. కొందరు సహాయం అడుగుతుంటారు. అవతలి వాళ్లకు సహాయం చేయడం మానవత్వమే. కానీ ఈ ఆర్థిక విషయాలలో అనవసరమైన తలనొప్పుల్లోకి వెళ్ళకపోవడమే మంచిది. అప్పులు ఇవ్వడం, ఇప్పించడం, ష్యురిటీలు ఇవ్వడం వంటివి మీరు ఆర్థికపరంగా కాసింత మంచి స్థాయిలో ఉంటేనే చెయ్యండి. ఒకవేళ సమస్య మీకు ఎదురైనా భరించగలను అనే నమ్మకం ఉంటేనే చెయ్యండి. వ్యక్తిగత నిర్ణయాలు! సాధారణంగా వ్యక్తిగత నిర్ణయాలలో చదువు, పెళ్లి ముఖ్యమైనవి. అది వద్దు ఇది చదువు అని కొందరు చెబుతారు, అక్కడొద్దు ఇక్కడే ఉండు అని కొందరు చెబుతారు. మోహమాటానికో వాళ్లకు అనుభవం ఉంది కాబట్టి చెబుతున్నారు అనో ఆసక్తి లేని రంగంలోనూ, ఆసక్తి లేని కోర్సులలోనూ చేరద్దు.  అలాగే మరొక విషయం పెళ్లి. అబ్బాయి బాగున్నాడు, ఆర్థికంగా మంచి స్థాయి. మంచి ఉద్యోగం, సాలరీ బాగుంది. ఒకమ్మాయికి కావాల్సింది నిజంగా ఇంతేనా?? ఎంత కేర్ గా చూసుకుంటారు, ఎంత అర్థం చేసుకుంటారు అనేది కదా ముఖ్యమైన విషయం. ఇంకా కేవలం అమ్మాయి, అబ్బాయి మధ్య మాత్రమే జరిగే విషయాల మాటేమిటి?? చుట్టాలు, తెలిసినవాళ్ళు చెప్పే పై విషయాలు విని పెళ్లి లాంటి వాటికి ఒప్పేసుకుంటే తరువాత జీవితకాల బాధలు అనుభవించాలి. అందుకే కాబోయే జీవిత భాగస్వామితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిది కదా. ఇక్కడ మిస్సయిన ఇంకొక విషయం సహోద్యోగుల దగ్గర మొహమాటం. వాళ్ళు అడిగారని వాళ్ళ పనులు కూడా చేసిపెడుతూ ఉండటం. వ్యక్తిగత సమయాలను త్యాగం చేసేయ్యడం. ఇది మొదట్లో పెద్ద సమస్య కాదు కానీ మెల్లిగా వాటి ఫలితాలు తెలుస్తాయి. అలాగే ఇరుగు పొరుగు మనుషుల దగ్గర కూడా ఇదే అవుతుంది. అందుకే మొహమాటం లేకుండా ఇబ్బందికరం అనిపించే విషయాలను కాదని చెప్పడం కుదరదని చెప్పడం మంచిది.                                  ◆వెంకటేష్ పువ్వాడ.
కొన్ని మొహమాటాలు లేకుంటే జీవితం ఎంతో బాగుంటుంది! Publish Date: May 28, 2025 9:30AM

నాలుగు కప్పుల కాఫీతో ఏం కాదెహే!

  ప్రపంచంలో కాఫీ తాగే అలవాటు మొదలైన దగ్గర్నుంచీ... అది మంచిదా! కాదా! అనే వివాదం కూడా మొదలైంది. కాఫీ మంచిందంటూ ఒక పరిశోధన బయటకు వచ్చిన వెంటనే... కాఫీ తాగితే ఆరోగ్యం మీద ఆశ వదిలేసుకోవాలంటూ మరో పరిశోధన భయపెడుతుంది. ఈ వివాదానికి ముగింపు ఇచ్చేందుకు టెక్సాస్‌లోని ToxStrategies అనే సంస్థ నడుం బిగించింది. ఇంతకీ అదేం తేల్చిందంటే... ఇదీ లిమిట్‌ - 2001 నుంచి 2015 వరకూ కాఫీ మీద జరిగిన దాదాపు 700 పరిశోధనల ఫలితాలను ToxStrategies సేకరించింది. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని... ఒక మోతాదు వరకు కాఫీ తాగితే అంత ప్రమాదం లేని తేల్చింది. రోజుకి దాదాపు 400 మిల్లీగ్రాముల వరకూ కెఫిన్‌ పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టేమమీ ఉండదట. ఇది దాదాపు నాలుగు కప్పుల కాఫీతో సమానం. గర్భిణీలూ పుచ్చుకోవచ్చు - ఇప్పటివరకూ గర్భిణీలు కాఫీకి వీలైనంద దూరంగా ఉండాలని హెచ్చరించేవారు. వారు కాఫీ తాగడం వల్ల అబార్షన్లు జరగే ప్రమాదం ఉందనీ, ఒకవేళ బిడ్డ పుట్టిన కూడా తక్కువ బరువుతోనో అవయవలోపంతోనో పుడతారనీ భయపెట్టేవారు. కానీ కాఫీ అలవాటు ఉండే గర్భిణీలు ఇక మీదట నోరు కట్టేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదంటున్నారు. వారు 300 మిల్లీగ్రాములు కెఫిన్‌ లేదా మూడు కప్పుల కాఫీ తాగితే ఫర్వాలేదంటున్నారు. పిల్లలు అతి తక్కువగా - పిల్లలు మాత్రం కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండక తప్పదని తేల్చారు. పిల్లలు బరువుండే ప్రతి కిలోకీ 2.5 మిల్లీగ్రాములకి మించి కెఫన్ పుచ్చుకోవద్దని అంటున్నారు. అంటే 20 కిలోలు ఉండే పిల్లవాడు రోజుకి 50 మి.గ్రాల మించి కెఫిన్‌ తీసుకోకూడదన్నమాట. మోతాదుతో ఉపయోగాలు – కాఫీని మోతాదులో పుచ్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే! కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, లివర్ ఆరోగ్యంగా ఉంటుంది, టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు దరిచేరవు. కానీ మోతాదు దాటిని కెఫిన్ మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. నిద్రలేమి దగ్గర నుంచీ గుండెపోటు వరకు కెఫిన్‌తో నానారకాల సమస్యలూ మొదలవుతాయన్నది నిపుణుల హెచ్చరిక. చివరగా చిన్న మాట... కాఫీని మోతాదులో పుచ్చుకుంటే సురక్షితమే అని తేలడం మంచి విషయమే! కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. మనం తీసుకునే కాఫీలో మాత్రమే కెఫిన్‌ ఉండదు. టీ, కూల్‌డ్రింక్స్, తలనొప్పి మాత్రలు, చాక్లెట్లు.. ఇలా బోలెడు పదార్థాలలో కెఫిన్ కనిపిస్తుంది. కాబట్టి ఒకోసారి మనకి తెలియకుండానే కెఫిన్‌ మోతాదుని దాటేసే ప్రమాదం ఉంది! అంచేత పరిశోధకులు నాలుగు కప్పుల కాఫీకి అనుమతిస్తే మనం రెండు కప్పులతోనే సరిపుచ్చుకోవడం మంచిది. పైగా కొందరి శరీర తత్వానికి కాఫీ అస్సలు సరిపడకపోవచ్చు. అలాంటివారు కాఫీకి దూరంగా ఉండాల్సిందే! - నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
నాలుగు కప్పుల కాఫీతో ఏం కాదెహే! Publish Date: May 28, 2025 9:30AM

పెంచుకుంటానని కుక్కల్ని తెచ్చుకుని ఆమె ఏం చేసిందో తెలుసా?

పైకి జంతుప్రేమికురాలిగా నటిస్తూ.. కుక్కలను చంపి తింటున్న మహిళ ఉదంతం చైనాలో వెలుగు చూసింది. గతంలో చైనాలో కుక్క మాంసంపై ఎలాంటి ఆంక్షలు లేకపోయినా.. కరోనా అనంతరం నిబంధనలు కఠినతరం చేసారు. కుక్కమాంసం తినడం పై నిషేధం విధించారు. చైనా లోని లియోనింగ్ ప్రావిన్స్ కు చెందిన ఒకమహిళ కుక్కల సంరక్షణా కేంద్రాలకు వెళ్లి మంచి మంచి కుక్కలను ఎంపిక చేసుకుని దత్తత పేరు చెప్పి ఇంటికి తీసుకు వెళ్లేది. అక్కడ వాటిని చంపి వండుకుని తినేసేది.  చాలా కాలం పాటు ఈ తంతు నిరాఘాటంగా సాగింది. అయితే తాాగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు కారణంగా ఆమె నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆమె సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టు ఏమిటంటే..  కుక్క మాంసం రెడీ, బయట వర్షం పడుతోంది. వేడివేడి కుక్క మాంసం తింటుంటే భలే రుచిగా ఉంటుంది అని.అంతే కాకుండా  పిల్లలకు మంచి ఆహారం కుక్క మాంసం అని కూడా ఆ పోస్టులో పేర్కొంది. అలాగే ఆ పోస్టుకు కొన్ని వీడియోలనూ జత చేసింది.  దీంతో ఆమె బండారం బయటపడింది.  నెటిజన్లు  ఆమెపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  పోలీసులురంగంలో దిగి ఆమె ఇంట్లో సోదాలు చేసి కుక్క మాంసం గుర్తించి అరెస్ట్ చేసారు. ఇప్పుడు ఆమె జిహ్వ చాపల్యానికి  ఎన్ని కుక్కలు బలయ్యాయా అని  లెక్కలు తీస్తున్నారు. 
పెంచుకుంటానని కుక్కల్ని తెచ్చుకుని ఆమె ఏం చేసిందో తెలుసా? Publish Date: May 28, 2025 9:28AM

అజరామరం మన అన్నగారు

తెలుగు జాతి గుండె చప్పుడు ఎన్టీఆర్. తెలుగు నేల, తెలుగు జాతి ఉన్నంత వరకూ గుర్తుండి పోయే మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. తెలుగుజాతి ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడిన సందర్భంలో ఆయన చేసిన సింహ గర్జన యావత్ దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఎన్టీవోడి గర్జన నుంచి పుట్టిన వేడిగాలి దావానలంలా వ్యాపించి, తెలుగు వారి వాడి, వేడి, పౌరుష ప్రతాపాల ప్రభావాన్ని విశ్వవ్యాపితం చేసింది. అతడే ఒక సైన్యం, అతడే ఒక ప్రేరణ, అతడి మాటే వేదం, ఆయన పిలుపే ప్రభంజనం, అన్ని యుద్ధాలూ ఆయనే చేశారు, అన్ని ప్రయాణాలు ఆయనే సాగించారు, అన్ని తానై ముందుకు నడిచి అందరినీ తన వెంట నడిపారు, తన  మాటే శిరోధార్యంగా మలిచారు ఎన్టీఆర్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లని తలచి సంక్షేమ రాజ్యం సృష్టించి సమసమాజ నిర్మాతగా, లౌకికవాదిగా నందమూరి తారక రామారావు పేరు ప్రఖ్యాతులు పొందారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించి సినీ వినీలాకాశంలో సాటిలేని ధ్రువతారగా వెలుగొంది, తన నటనా కౌశలంతో 300కు పైగా చిత్రాల్లో నటించి దేశ వ్యాప్తంగా ప్రజల మనసులను కొల్లగొట్టారు. 6 దశాబ్దాల సుదీర్ఘ నట ప్రస్థానంలో ఎదురులేని రారాజుగా వెలుగొందారు. అందమైన రాముడిగా, కృష్ణుడిగానే కాదు. ఠీవీ, రాజసం ఉట్టిపడే దుర్యోధనుడు, రావణాసురుడు లాంటి ప్రతినాయక పాత్రలు సైతం పోషించారు. పోషించడమే కాదు.. ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసి వాటికి జీవం పోశారు. ఎన్టీఆర్ శ్వాస, ధ్యాస, ఘోష తెలుగు. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు జ్యోతికి జీవం పోసిన ప్రదాత. ఒక అరుదైన సుందర సాంస్కృతిక స్వప్నాన్ని సాకారం చేశారు. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు. కులాలు, మతాలు, కూలిన విధానాలతో కుళ్లిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయ సంస్కృతిని తీసుకురావడమే ఎన్టీఆర్ ఆశయం. నాటి ఢిల్లీ పెద్దలు ఏడాదికి నలుగురు ముఖ్యమంత్రులను మారుస్తూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారు. తెలుగు జాతి ఖ్యాతిని పునర్జీవింప చేయడానికి తన 60 వ ఏట రాజకీయ రంగ ప్రవేశం చేసి తెలుగుదేశానికి జీవం పోసి దేశ రాజకీయాల స్వరూపాన్నే మార్చేశారు. అందుకే 9 నెలల కాలంలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నియంతృత్వ పోకడలపై తిరుగుబాటు చేసి తెలుగుదేశం బావుటాను ఎగురవేశారు. అప్రజాస్వామికంగా ఎన్టీఆర్‌ను గద్దెదింపినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో ఆయన విజయం సాధించిన తీరు  నభూతో న భవిష్యత్ అనే చెప్పాలి. నాడు ఆయన చూపిన ధైర్య సాహసాలు రాజకీయ రంగలో రారాజుగా నిలిపాయి. రెండు రూపాయలకే కిలో బియ్యం, పక్కా ఇళ్లు, సగం ధరకే చేనేత వస్త్రాలు, వితంతువులకు, కూలీలకు పింఛన్ల పంపిణీ వంటి వినూత్న పథకాలకు ఆయనే ఆదిగురువు. రాయలసీమ వాసుల దాహార్తిని తీర్చేందుకు తెలుగు గంగ, అదే నీటితో చెన్నై వాసుల దాహార్తి తీర్చడం, మహిళా విశ్వవిద్యాలయం, ప్రజా సదస్సులు  వంటి కార్యక్రమాలకు ఎన్టీఆర్‌ శ్రీకారం చుట్టారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, పటేల్, పట్వారీల వ్యవస్థ రద్దు, ప్రధానంగా అధికార వికేంద్రీకరణ జరగాలి. ప్రజల వద్దకే పాలన రావాలి, ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ వ్యవస్థలు ఉండాలి, స్థానిక సంస్థలు బలోపేతం కావాలని మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మునుపు అధికారం కొన్ని వర్గాల గుత్తాధిపత్యంలో ఉండేది. ఆ సమయంలో మిగతా కులాల వారికి రామారావు ఆశాకిరణంలాగా కనిపించారు. ఎన్టీఆర్‌ బడుగు బలహీన వర్గాలవారికి పార్టీలో ఉన్నతపదవులు కల్పించారు. అన్ని వర్గాలలో  యువతరానికి చెందిన సామాన్యులకు, విద్యావంతులకు, మహిళల పార్టీ టికెట్లు   కేటాయించి రాజకీయాలను సామాన్యుల చెంతకు చేర్చారు. మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు రాజ్యాధికారం కల్పించారు. ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్న వారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటి చేత్తో వారిని గెలిపించిన ప్రజా నాయకుడిలా చరిత్రలో నిలిచారు. సరికొత్త తరాన్ని, వినూత్న సేవా సంస్కృతిని రాజకీయాల్లో ప్రవేశపెట్టిన ' భారత ప్రజాస్వామ్య దిక్సూచి ఎన్టీఆర్‌. జాతీయ పార్టీల నాయకులు వారి ఇలాకాలకే పరిమితమైన వేళ, ఎన్టీఆర్ తన చరిష్మాతో జాతీయ నేతగా ఎదిగారు. ఇందిరాగాంధీ హత్య నుంచి పుట్టిన సానుభూతి పవనాలను తన సమర స్ఫూర్తితో అధిగమించి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం విజయ దుందుభి మ్రోగేలా చేశారు. రాష్ట్రంలో 42 లోక్‌సభ స్థానాల్లో 35 గెలిచి పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షహోదా సాధించింది. జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు అనేక సమ్మేళనాలు నిర్వహించారు. ఉప్పు నిప్పులా ఉండే రాజకీయ పక్షాలైన వామపక్షాలు, భారతీయ జనతా పార్టీల మద్ధతును ఎన్టీఆర్ కూడగట్టారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జాతీయ రాజకీయాలను జనం మెచ్చేలా ప్రభావితం చేసి వాటిలో కీలక పాత్ర పోషించిన తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్. పార్టీ ఆవిర్భావం నుండి స్పష్టమైన సిద్దాంతాలు, విధానాలు, జాతీయ దృక్పథం, ఉన్నత రాజకీయ విలువలతో ఏ ఆశయాల కోసమైతే ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారో అవే ఆశయాల కోసం 4 దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో కుటిల రాజకీయాలను ఎదుర్కొంటూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తోంది. దేశ సమకాలికుల్లో ఎన్టీఆర్‌ వంటి ప్రజా నాయకుడు మరొకరులేరు, ఎన్నటికీ ఉండబోరు. ప్రజా నాయకుడిగా చరిత్రలోనే కాదు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ స్థానం సుస్థిరం. ఆయన కీర్తి అజరామరం. అందుకే ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని యావత్ తెలుగు జాతి కోరుకుంటోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా...
అజరామరం మన అన్నగారు Publish Date: May 27, 2025 12:28AM

పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ

  ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో  పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై, వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందజేశారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, తొలి విడతలో నందమూరి బాలకృష్ణ, డాక్టర్ నాగేశ్వర్‌ రెడ్డి వంటి తెలుగు ప్రముఖులతో పాటు మొత్తం 71 మందికి ఏప్రిల్ 28న పురస్కారాలు ప్రదానం చేశారు. తాజాగా జరిగిన రెండో విడత కార్యక్రమంలో మరికొందరు ప్రముఖులు ఈ గౌరవాన్ని అందుకున్నారు.2025 పద్మ అవార్డుల్లో మొత్తం 139 మందికి అవార్డులు అందించారు.  అందులో 7 మందికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25, 2025న ఈ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి శోభన పద్మభూషణ్‌ పురస్కారాన్ని స్వీకరించారు. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పద్మశ్రీ అవార్డును ప్రదానం చేశారు. ఏపీకీ చెందిన వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య), ప్రొఫెసర్‌ కేఎల్‌ కృష్ణ (సాహిత్యం, విద్య) కూడా రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. ప్రముఖ కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌కు పద్మభూషణ్‌ పురస్కారం లభించింది పద్మభూషణ్‌ అవార్డును కన్నడ నటుడు అనంత్‌ నాగ్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌ షా, జైశంకర్‌, కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌, ప్రహ్లాద్‌ జోషీ సహా పలువురు హాజరయ్యారు.  
 పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పద్మశ్రీ అందుకున్న మందకృష్ణ Publish Date: May 27, 2025 9:32PM

నకిలీ సీడ్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీఎం రేవంత్

  తెలంగాణలో  ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘భూభారతి’ అనేది పేద రైతుకు చుట్టమని ముఖ్యమంత్రి అన్నారు. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని,  ఈ చట్టాన్ని ప్రజలకు మరింత చేరువ చెయ్యాలని పేర్కొన్నారు. ఈరోజు అధికారులు, కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా జూన్ 3వ తేదీ నుంచి 20 వరకూ మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులకు, కలెక్టర్లకు సీఎం రేవంత్ సూచించారు. రుతుపవనాలు 15 రోజులు ముందే రావడంతో రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంత్రులు, కలెక్టర్లు సమీక్షలో సీఎం సూచించారు. నకిలీ సీడ్స్ అమ్మేవారి పీడీ యాక్ట్ పెట్టాలన్నారు.  గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నాం. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను తెలిపాలని ముఖ్యమంత్రి తెలిపారు. కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉండాలి. వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలి. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించండి. ఒక్క నిముషం వృధా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి. ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది. సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు.ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం. క్షేత్రస్థాయిలో ఈ పథకం అమలు బాగా జరిపించాల్సింది కలెక్టర్లే. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని సీఎం అన్నారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.  
నకిలీ సీడ్స్ అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : సీఎం రేవంత్ Publish Date: May 27, 2025 9:07PM

ఆ పదం వింటే వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు దేశం పార్టీనే : పవన్ కళ్యాణ్

  మహానాడు ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది  తెలుగు దేశం పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయిందని జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కడపలో ప్రారంభమైన మహానాడుకు తన తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని  పవన్ కళ్యాణ్  ఒక ప్రకటన విడుదల చేశారు. ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై... కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు  మంత్రి నారా లోకేష్‌కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.   చంద్రబాబు  నాయకత్వములో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్ బక్కని నరసింహులు శుభాభినందనలు.ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ మూడు రోజుల వేడుకలో చర్చించనున్న ఆరు అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్తే అధినేత, యువ గళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని అంటూ జనసేని తన ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ పదం వింటే వెంటనే గుర్తుకు వచ్చేది తెలుగు దేశం పార్టీనే :  పవన్ కళ్యాణ్ Publish Date: May 27, 2025 8:19PM

సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్

  సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ నడిపేందుకు ఇండియన్ రైల్వేశాఖ ప్లాన్ చేస్తోంది.1667కి.మీ దూరాన్ని ఈ రైలు ఒక్క రోజులోనే చేరనుంది. ఢిల్లీలో రాత్రి 8.50కు బయల్దేరే ఈ రైలు తర్వాతి రోజు రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ రానుంది. థర్డ్ AC ధర ₹3600, సెకండ్ AC ₹4800, ఫస్ట్ AC ₹6వేలు వరకూ ఉండొచ్చు. ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సి, నాగ్పూర్, బల్లార్ష, కాజీపేట స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది.వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మార్గంలో నడుస్తున్న మూడవ ప్రీమియం రైలు.  ఈ మార్గంలో ఇప్పటికే రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఈ రైలును రాత్రి ప్రయాణం కోసం ప్రత్యేకంగా రూపొందించారు. తద్వారా ప్రయాణీకులు నిద్రపోతున్నప్పుడు కూడా తమ గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు.వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుండి సికింద్రాబాద్ వరకు దాదాపు 1667 కి.మీ దూరాన్ని కేవలం 20 గంటల్లోనే చేరుకుంటుంది.
సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందే భారత్ స్లీపర్ Publish Date: May 27, 2025 7:57PM

మహానాడు వేదికపై మంత్రి టీజీ భరత్ సూపర్ స్పీచ్

    ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు  మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియడం లేదని  మంత్రి టీజీ భరత్ అన్నారు. బయటి దేశాల్లో ఆయన విలువ చాలా ఎక్కువ. నేను ఈ మధ్య ఇండియా టుడే కాన్క్లేవ్ కి దుబాయ్ కి వెళ్లాను. శోభ బిల్డర్స్ అధినేత చంద్రబాబుకి పరిచయం లేదు, చూసింది కలిసింది లేదు. ఓ సందర్భంలో మాట్లాడుతూ రూ.100 కోట్లు ఏపీకి విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా అన్నారు. చంద్రబాబు లాంటి లీడర్ షిప్ నాయకుడు మీకు ఉన్నాడు. ఆ రూ.100 కోట్లు ఏ విధంగా ఉపయోగించుకుంటారో వినియోగించుకోండని తెలిపారు. చంద్రబాబు ఏ విధంగా కష్టపడుతున్నారో మనందరికి తెలియాలి. కష్టపడే లీడర్ మనకు ఉన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసేటప్పుడు వారం తర్వాత పాదయాత్ర ఉండదు టీజీ భరత్  అన్నారు.  కానీ పట్టుదలతో దాదాపు 3 వేల కి.మీ. పైగా లోకేష్ గారు పాదయాత్ర చేశారు. ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వారి బాధలను చూశారు. వారికన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చాక వారికి అండగా ఉన్నారు. నారా లోకేష్ కు ఓ మాట చెప్పమని నా స్నేహితుడు మంత్రి అన్నారు. నువ్వు మగాడ్రా బుజ్జి అని చెప్పమన్నారు. పల్లా శ్రీనివాస్ ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.   గత ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక వేత్తలు ఎంత బాధపడ్డారో అందరికీ తెలుసు. ఏపీలో పెట్టుబడులు పెట్టకండని ఫారెన్ కంపెనీలు మన ఏపీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. ఆ విధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలన సాగింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్వాతంత్ర్యం వచ్చిందని కొందరు పారిశ్రామిక వేత్తలు నాతో చెప్పారని ఆయన పేర్కొన్నారు  మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామిక వేత్తలు వస్తే మనం ఎయిర్ పోర్ట్ కు వెళ్లి స్వాగతిస్తాం.. కానీ గత వైసీపీ హయాంలో పెట్టుబడిదారులను దారుణంగా అవమానించారు. గత ప్రభుత్వంలో టెక్స్ టైల్స్ పాలసీ ఇచ్చి గైడ్ లైన్స్ ఇవ్వలేదు. గైడ్ లైన్స్ మనం అధికారంలోకి వచ్చాక ఇచ్చాం. గత ప్రభుత్వం అంత ఘోరంగా పారిశ్రామిక వేత్తలను అవమానించారు. ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకు వైసీపీ హయాంలో 10 మందికే పరిమితం చేశారు. 2014-19 లో 60 మందితో పనిచేశాం.  నేడు దాదాపు 50 మంది పనిచేస్తున్నారు. మన విధానాలు ప్రమోట్ చేయడంలో ఈ బోర్డు పనిచేస్తుంది. ఇప్పుడు కూడా ఒక బోర్డు జపాన్ లో పర్యటిస్తోంది. మన ప్రభుత్వం వచ్చాక అన్ని పాలసీలు, గైడ్ లైన్స్ తీసుకొచ్చాం. చంద్రబాబు  ఎప్పుడు స్పీడ్ అప్ డూయింగ్ బిజినెన్స్ పై చెబుతారు.  ఒక కంపెనీ ఏర్పాటు కావడం ఆలస్యం అయితే వడ్డీ ఎక్కువగా పెరిగిపోతుంది. ఉదాహరణకి కర్నూల్ లో ఉన్న జైరాజ్ స్టీల్స్ ప్రాజెక్ట్ ఆలస్యం కావడంతో కొన్ని కోట్లు వడ్డీలే సరిపోతుంది. రూ.9.40 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ ఏడాదిలో మనం సాధించాం. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టే కంపెనీ ఉంటే త్వరగా అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభింపజేసేలా పాలన సాగిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే 11 ప్రారంభించాం. 39 పార్కులకు ఫౌండేషన్ వేశాం. 20 లక్షల ఉద్యోగాలు సాధించే దిశగా పనిచేస్తున్నాం. కాస్త ఓపికతో ఉండండి. కచ్చితంగా ఈ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని మంత్రి వెల్లడించారు
మహానాడు వేదికపై మంత్రి టీజీ భరత్ సూపర్ స్పీచ్ Publish Date: May 27, 2025 7:41PM