పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ పవన్ పడవ ప్రయాణం.. ఎందుకంటే?
Publish Date:May 24, 2026
Advertisement
వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించారు. పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి ఘాట్ల ఆధునీకరణ, భక్తుల సౌకర్యాలపై అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. పవన్ కల్యాణ్ పుష్కర్ ఘాట్ నుండి కోటిలింగాల ఘాట్ వరకు పడవలో ప్రయాణించి, పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో కీలక సమావేశం నిర్వహించి, పుష్కర ఏర్పాట్లు, భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పుష్కరాలకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పిన పవన్ కల్యాణ్.. పుష్కరాలను కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కాలుష్యరహిత గోదావరి అనే లక్ష్యంతో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకమైన రీతిలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని, దీనికి అనుగుణంగా ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. నల్లా ఛానెల్ కాలుష్యం, ఛానల్ నుంచి గోదావరిలోకి నేరుగా కలుస్తున్న కాలుష్యకారక వ్యర్ధాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి, గోదావరి పేపర్ మిల్ వ్యర్ధ జలాలు ఎక్కడ శుద్ధి చేస్తున్నారని పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్యను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. నల్లా ఛానల్ డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ పరిస్థితిని స్వయంగా పరిశీలించి, రోజువారి వ్యర్ధాలను ఎలా వేరు చేస్తున్నారని, వచ్చే మురికి నీటిని ఎలా శుద్ధి చేస్తున్నారనీ ఆరా తీశారు. శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తున్నారా అని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో పవన్ కల్యాణ్ వెంట మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్సి సోము వీర్రాజు , రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు , రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ , అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
http://www.teluguone.com/news/content/pawan-boat-journey-from-pushkar-ghat-to-kotilingala-ghat-36-220754.html





