political-news-img

తెరపైకి జయమ్మ పంచాయితీ...కెలుక్కున్నావేమో జగనన్నా!

ప్రస్తుతం జగన్ కారణంగా ఏపీ అంతటా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్.. ఆ కుటుంబ చరిత్ర, వారి రక్తసిక్త రాజకీయ విధానాలు, హింసాత్మక ప్రవృత్తి, వారి ఫ్యాక్షన్ రాజకీయ విధి విధానాలపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాను ఎంతో మంచివాడ్నని నిరూపించే యత్నంలో భాగంగా తమ ఇంట్లో జరిగిన మూడు మరణాలకు కుట్ర సిద్ధాంతం రుద్ది.. వాటన్నటినీ చంద్రబాబుపై నెట్టడానికి విఫలయత్నం చేసిన జగన్ ప్రస్తుతం చూస్తే తానే ఇరుక్కు పోయారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీటెక్ రవి వంటి వారు రాజారెడ్డి ఎంతటి ఫ్యాక్షనిస్టో చెప్పడం అటుంచితే.. అసలు వీరు రాజకీయ కుటుంబానికి చెందిన వారే కాదని కుండ బద్ధలు కొట్టారు. వైయస్ ఫ్యామిలీ తొలుత బ్రిటీషర్లకు తొత్తులుగా పని చేసేవారనీ.. వీరిదసలు రాజకీయ కుటుంబమే కాదని అంటారు బీటెక్ రవి. అప్పట్లో ఈ కుటుంబం బ్రిటీషర్లకు వంత పాడ్డంతో.. ఊరి నుంచి తరిమేస్తే పులివెందులకు వలస వచ్చారనీ అంటారు రవి. ఆ రోజుల్లో రాజారెడ్డి భార్య జయమ్మ పంచాయితీ వార్డు మెంబర్ గా పోటీ చేస్తే ఓడిపోయారనీ.. వార్డుమెంబర్ గా కూడా గెలవడం చేతగాని కుటుంబమనీ ఎద్దేవా చేశారు బీటెక్ రవి. రాజశేఖర్ రెడ్డి తొలి గెలుపు కూడా నిఖార్సైన గెలుపు కాదనీ.. ఏదో ఫ్లోలో కొట్టుకొచ్చిన గెలుపనీ.. ఆయన గెలిచింది ఒక పార్టీ నుంచి అయితే, కలిసింది మరో పార్టీ అన్న ఆరోపణలున్నాయి. ఇటు రెడ్డి ఓట్లతో పాటు మతపరమైన ఓట్లను కూడా కలుపుకుని గెలిచిన విధం స్పష్టంగా కనిపిస్తుందంటారు కొందరు.. అప్పట్లో వైయస్ నిత్య అసంతృప్త వాదిగా ఉంటూ, ఎన్నో రకాలుగా అధిష్టానాన్ని ఇబ్బంది పెట్టిన గతమని అంటారు కొందరు. వైయస్ అధికారంలో ఉండగా పీవీలాంటి సీనియర్ నేత మరణిస్తే.. పార్టీ పరంగా ఇవ్వాల్సిన గౌరవం కూడా సరిగా నిర్వహించలేదన్న కామెంట్లు కూడా చేస్తారు కొందరు. ఇప్పుడిదంతా ఇలా ఉంటే, అనవసరంగా జగన్ ఈ తేనెతుట్టె కదిల్చినట్టు అయ్యిందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలువురు వైసీపీ మద్దతుదారులు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి గతమంతా తవ్వి పోడం మాత్రమే కాకుండా వీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వీరి విదేశీ విధాన వ్యవహారశైలి ఎలాంటిది? అన్న విషయాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. అనవసరంగా జగన్ ఇదంతా కెలుక్కున్నారనీ.. చేజేతులా కొని తెచ్చుకున్నారనీ వాపోతున్నారు వైసీపీ కార్యకర్తలు. దీనంతటిని బట్టీ చూస్తుంటే కొండ నాలికకు మందేస్తే ఉన్న నాలిక ఉడినట్టుగా ఉందన్న మాట కూడా వినిపిస్తోంది.

Publish Date: May 24, 2026 5:34PM

political-news-img

కాలినడకన తిరుమల చేరుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్నారు. తనయుడు శివాన్ ఎర్రంనాయుడు తొలి తలనీలాలు అర్పించే సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి కాలినడకన కొండపైకి వెళ్లారు. ఉదయం 11 గంటలకు అలిపిరి మెట్ల మార్గంలో ప్రయాణం ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు కుటుంబం మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల చేరుకుంది. వెంకటేశ్వర స్వామిపై అపార భక్తి విశ్వాసాలు కలిగిన రామ్మోహన్ నాయుడు, ఆయన సతీమణి శ్రీశ్రావ్య ఆధ్యాత్మిక భావంతో మెట్ల మార్గంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్మోహన్ నాయుడు సుమారు వెయ్యి మెట్లకు పైగా బొట్లు పెట్టి, హారతులు ఇస్తూ కొండపైకి చేరుకోగా.. ఆయన సతీమణి శ్రీశ్రావ్య మాత్రం మొత్తం 3,500 మెట్లకూ బొట్లు పెట్టి హారతులు ఇస్తూ తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. అనంతరం తనయుడు శివాన్ ఎర్రంనాయుడు తొలి తలనీలాలు సమర్పించగా.. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.

Publish Date: May 24, 2026 5:26PM

political-news-img

ఉచిత విద్యుత్ రద్దు కోసమే కాంగ్రెస్ మీటర్ల పెడుతుంది : కేటీఆర్

తెలంగాణలో ప్రీపెయిడ్ మీటర్ల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల అమలుకు సిద్ధమవుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేసి విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమని కేటీఆర్ అన్నారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమలు చేయడం ద్వారా రైతులపై భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్‌లో ప్రీపెయిడ్ మీటర్ల అమలుపై చర్చ జరిగిందని, త్వరలోనే గ్రామాలు, పట్టణాల్లో ఈ విధానం అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. కేవలం వ్యవసాయ రంగానికే కాకుండా ప్రతి ఇంటిలో ఉన్న సాధారణ మీటర్ల స్థానంలో కూడా ప్రీపెయిడ్ మీటర్లను అమలు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రీపెయిడ్ మీటర్లు అమల్లోకి రాకముందే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. విద్యుత్ రంగంలో జరుగుతున్న మార్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉచిత విద్యుత్ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడం లేదని విమర్శించారు. ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ నిలిచిపోతుందని బీఆర్‌ఎస్ హెచ్చరించిందని గుర్తుచేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలోనే మీటర్ల వ్యవహారంపై హెచ్చరించారని తెలిపారు. ప్రధాని మోదీ ఒత్తిడి చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం రుణాలను ఆపినా కేసీఆర్ ప్రీపెయిడ్ మీటర్ల అమలుకు ఒప్పుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్లు అమలు చేస్తామని చెబుతోందని విమర్శించారు. అదానీ, అంబానీ వంటి ప్రైవేట్ సంస్థలకు విద్యుత్ రంగాన్ని అప్పగించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అవినీతి మరియు అరాచకాలతో పాలన కొనసాగుతోందని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో సగం కాలం పూర్తయినా ప్రజలకు చెప్పుకోదగ్గ ప్రయోజనం కలగలేదన్నారు. ప్రజలు సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇదే సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా కేటీఆర్ మాట్లాడారు. త్వరలోనే సభ్యత్వ నమోదు అనంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి వెయ్యి మందికి పైగా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈసారి సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ విధానంలో చేపడతామని వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్ధి అంశంపైనా కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఫ్యూచర్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడ్డగోలు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే ఉన్న హైదరాబాద్ నగరంలో మౌలిక సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం కొత్త నగరాల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందన్నారు. నగరంలో చెత్త, డ్రైనేజీ సమస్యలను కూడా పరిష్కరించలేని పరిస్థితిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటూ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్టీపీల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం వంటి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. వేలాది ఇండ్లను కూల్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ మూసీ ప్రక్షాళన పేరుతో భారీ అవినీతి జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు.

Publish Date: May 24, 2026 5:14PM

political-news-img

కర్ణాటకపై కన్నేసిన సీఎం విజయ్... అసలు ప్లాన్ ఇదే!

కర్ణాటక పాలిటిక్స్‌లోకి టీవీకే ఎంట్రీ సంచలన వ్యూహం.. దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి, ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన కోలీవుడ్ సూపర్ స్టార్, 'దళపతి' విజయ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తమిళనాడులో తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) తరఫున ఒంటరిగా బరిలోకి దిగి 34.9 శాతం ఓట్ల శాతాన్ని కొల్లగొట్టడమే కాకుండా, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్, కాంగ్రెస్ మరియు సీపీఐ(ఎం) మద్దతుతో 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయితే తమిళనాడులో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో ఆయన ప్రస్థానం ఆగడం లేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టేందుకు దళపతి విజయ్ వ్యూహాత్మక అడుగులు వేస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతోంది. ముఖ్యంగా కర్ణాటకలోని బెంగుళూరు నగరంతో పాటు తమిళ ప్రజలు అధిక సంఖ్యలో నివసించే సరిహద్దు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని విజయ్ తన 'టివికె' పార్టీని విస్తరించాలని యోచిస్తున్నారు. కర్ణాటకలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) మరియు గ్రామీణ స్థానిక సంస్థల (GBA) ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించడానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక వ్యాప్తంగా విజయ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉండటం, బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో తమిళ ఓటర్ల శాతం దాదాపు 25 నుండి 30 శాతం వరకు ఉండటంతో ఈ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని టీవీకే అధినేత భావిస్తున్నారు. ఈ పరిణామాలు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అంతర్గత నివేదికల ద్వారా విజయ్ ఎంట్రీ ప్రభావంపై ఆరా తీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. తమిళనాడులో 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన కేవలం రెండేళ్లలోనే ద్రావిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను మట్టికరిపించి 234 స్థానాల్లోనూ బలమైన ఉనికిని చాటుకున్న విజయ్ క్రేజ్ సాధారణమైనది కాదు. గతంలో 2025 సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది అభిమానులు మరణించిన దురదృష్టకర సంఘటన జరిగినప్పటికీ, విజయ్ ప్రజాబలం ఏమాత్రం తగ్గలేదు. అటువంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు బెంగళూరు రాజకీయాల్లో వేలు పెడితే, అది కర్ణాటక పాలిటిక్స్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో దళపతి విజయ్ కర్ణాటక పర్యటనకు రానున్నట్లు సమాచారం రావడంతో కన్నడ నాట రాజకీయం మరింత వేడెక్కింది

Publish Date: May 24, 2026 4:50PM

political-news-img

ప్రియుడి మోజులో భర్తను చంపి.. జేసీబీతో గుంత తవ్వి పూడ్చిన భార్య

నారాయణఖేడ్‌లో జరిగిన ఓ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పవిత్రమైన దాంపత్య బంధాన్ని మరిచి వివాహేతర సంబంధానికి బానిసైన ఓ మహిళ, చివరకు ప్రియుడితో కలిసి భర్తనే అడ్డుతొలగించుకోవడం విషాదంగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారడం అందరినీ కలిచివేస్తోంది. నారాయణఖేడ్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి, కల్పన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కల్పన నారాయణఖేడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు చింటూ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనలో మార్పును గమనించిన ముత్యంరెడ్డి పలుమార్లు ఆమెను హెచ్చరించినట్లు సమాచారం. కుటుంబాన్ని కాపాడుకోవాలని సూచించినా కల్పనలో మార్పు రాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రియుడితో కలిసి జీవించాలనే ఆలోచనతో భర్తను అడ్డుగా భావించిన కల్పన, అతడిని హత్య చేయాలని పక్కా ప్రణాళిక వేసినట్లు పోలీసులు తెలిపారు. తొమ్మిది రోజుల క్రితం కల్పన తన ప్రియుడు చింటూతో కలిసి ముత్యంరెడ్డిని మనూర్ మండలం ఎల్గోయి గ్రామ శివారుకు తీసుకెళ్లింది. అక్కడ అతడిని దారుణంగా హత్య చేసి, ఆధారాలు బయటపడకుండా మృతదేహాన్ని గుంత తవ్వి పూడ్చిపెట్టారు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు భర్త కనిపించడం లేదంటూ కల్పనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కల్పన ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల ప్రశ్నలకు తడబడిన కల్పన చివరకు నేరాన్ని ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో కల్పనతో పాటు ఆమె ప్రియుడు చింటూను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా ఒక కుటుంబం ఛిద్రమైపోగా, ఇద్దరు చిన్నారులు తండ్రిని కోల్పోయి.. తల్లి జైలుకు వెళ్లడంతో అనాధలుగా మారారు. ఈ విషాద ఘటన స్థానిక ప్రజలను తీవ్రంగా కలచివేసింది.

Publish Date: May 24, 2026 4:27PM

political-news-img

న్యాయవాది హత్య కేసులో సంచలన విషయాలు

న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్ వద్ద గుర్తుతెలియని దుండగులు కారుతో ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.ఈ కేసులో ఐదుగురు పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని గుర్తించిన పోలీసులు, వాహనం యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆరు నెలల క్రితమే కారును మరొకరికి అమ్మినట్లు యజమాని వెల్లడించగా, కొనుగోలు చేసిన వారు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ మార్చుకోలేదని తెలిపాడు. గుర్తుతెలియని వ్యక్తులే కారును కొనుగోలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హంతకుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు, కేసు దర్యాప్తును ప్రత్యేక బృందాలు పలు కోణాల్లో వేగవంతం చేశాయి. వక్ఫ్ ఆస్తుల వివాదాల కోణంలోనూ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ముంతాజ్ కాలేజ్, అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజ్, మదరసా హైజా భూముల వ్యవహారాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. 1962లో ఈ మూడు వక్ఫ్ ఆస్తులను మెహబూబ్ ఆలం కుటుంబానికి పరిరక్షణ బాధ్యతలతో అప్పగించినట్లు పాత రికార్డులు చెబుతున్నాయి. 2013లో ఖాజా మొయిజుద్దీన్, దస్తగిరి ఆలం ఖాన్ కలిసి వక్ఫ్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. మలక్‌పేట్ ముంతాజ్ కాలేజ్‌కు సంబంధించిన భూములను ఆటో ఫైన్ సర్వీస్ కంపెనీకి విక్రయించారనే ఆరోపణలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. భూముల లావాదేవీలకు సంబంధించిన పాత డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఖాజా మొయిజుద్దీన్‌పై గతంలో నమోదైన కేసుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఖాజా మోహినుద్దీన్ పై మలక్‌పేట్, అబిడ్స్ పోలీస్ స్టేషన్లతో పాటు హైదరాబాద్ CCSలో నమోదైన కేసులపై సమాచారంను పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. ఖాజా మొయిజుద్దీన్ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మెహబూబ్ ఆలం ఖాన్, ముజాహిద్ ఆలం ఖాన్‌లపై నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యకు ముందు జరిగిన వివాదాలు, బెదిరింపులు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు బృందాలు దృష్టి సారించాయి. హత్య వెనుక వక్ఫ్ ఆస్తుల వివాదాలే కారణమా..? అనే కోణంలో పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.

Publish Date: May 24, 2026 4:07PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img