కేసీఆర్ కుటుంబంలో కొత్త డ్రామా... తండ్రి వైఫల్యాలను ఎత్తి చూపించిన కవిత

 

బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? కెసిఆర్ స్థానంలో పార్టీపై పెత్తనం కోసం కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తున్నట్టు ప్రచారం జరిగింది. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లకు తల్లిదండ్రుల్లో తలా ఒకరు సపోర్ట్ చేస్తున్నారన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఇటీవల కేటీఆర్, హరీష్ రావు భేటీ అయ్యారు. బావా బామ్మర్దులు ఒకటికి రెండుసార్లు భేటీ అవ్వటం, కేటీఆర్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే తన సపోర్టు ఉంటుందని హరీష్ రావు ప్రకటించటంతో  వారి మధ్య ఏమీ లేదని గులాబీ శ్రేణులు సంబరపడిపోయాయి. అయితే తాజాగా కవిత... కేసీఆర్ కు రాసిన లేఖ హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా నియోజకవర్గాలు చుట్టి వచ్చిన కవిత.. పార్టీ క్యాడర్, లీడర్ షిప్ ఏమనుకుంటుందో అవే విషయాలను చెబుతున్నా అంటూనే పార్టీకి కొన్ని సూటి ప్రశ్నలనే సంధించారు. మహిళా సమానతలో పదేళ్లలో అనుకున్నంత ముందుకు వెళ్లలేక పోయామన్న  కవిత డైలాగ్ తో గులాబీదళం ఇరకాటంలో పడింది. 

ప్రత్యర్థి పార్టీలు కూడా కెసిఆర్ పై ఎప్పటి నుంచో అవే విమర్శలు చేస్తున్నాయి.కేసీఆర్ కు కవిత కొన్ని రోజుల క్రితమే రాసినట్లుగా చెబుతున్న లేఖ తాజాగా బయటికొచ్చింది. ఇప్పుడు ఆ లేఖ చుట్టూ కొత్త రాజకీయ చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభ తర్వాత కేసీఆర్‌కు ఆయన కుమార్తె,  కవిత ఓ లేఖ రాశారు. సభ నిర్వహించిన తీరుపై తన అభిప్రాయాన్ని లేఖలో కుండ బద్దలు కొట్టారు . పార్టీ మీటింగ్ సక్సెస్ అయ్యిందంటూనే లోపాలను బయటపెట్టారామె. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ రెండు పార్టులుగా లేఖ రాశారు. తెలంగాణ అంటే బీఆర్‌ఎస్ - తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలామంది అనుకున్నారని కవిత తన తండ్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతంపై మాట్లాడతారని అనుకున్నట్టు కవిత రాసుకొచ్చారు. కేసీఆర్ స్పీచ్ బాగుందంటూనే.. ఇంకొంచెం పంచ్‌ ను కేడర్ ఎక్స్‌పెక్ట్ చేసిందని కవిత తెలిపారు. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్‌ బిల్లు మీద మాట్లాడకపోవడం నెగిటివ్ అయిందన్నారు.

బీసీలకు 42శాతం అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడమూ నెగిటివ్ అని లేఖలో ప్రస్తావించారామె. ఇంత పెద్ద మీటింగ్‌కు పాత ఇంచార్జులను ఇవ్వడంపై కొన్ని నియోజకవర్గాల్లో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని, లోకల్‌బాడీ ఎన్నికల్లో ఈ ఇంఛార్జులే బీఫామ్స్ ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, ఎంపీపీలుగా ఉండాలనుకునేవాళ్లు రాష్ట్ర నాయకత్వమే బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారని కవిత తన లెటర్‌లో రాశారు.భవిష్యత్తులో బీజేపీతో పొత్తుపెట్టుకుంటారన్న ప్రచారాన్ని చాలామంది మొదలుపెట్టారన్న విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంకొంచెం బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ  అంటూ... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితురాలిగా ఉన్న కవిత  పేర్కొనటం చర్చనీయాంశం అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామన్న మెసేజ్‌ను కాంగ్రెస్ జనంలోకి బలంగా తీసుకెళ్లిందని  ఆమె ఎత్తి చూపారు. అన్నీ చెప్పాక పెద్దలేఖ రాసినందుకు క్షమించాలని ప్రత్యేకంగా కవిత కోరుతూ అందరికీ అందుబాటులో ఉండాలని కెసిఆర్ ని కవిత  కోరడం కూడా ఇప్పుడు బిగ్ డిబేట్ కు దారి తీసింది. 
 
టిఆర్ఎస్  రజతోత్సవం మొత్తం కేసీఆర్, కేటీఆర్ నిర్వహించారని, కవిత, హరీశ్ రావు డమ్మీగా మారిపోయారన్న ప్రచారం ఉంది . పేరుకే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా కేటీఆర్ ప్రెసిడెంట్‌‌గా వ్యవహరిస్తున్నారు అని గులాబీ శ్రేణులే అంటున్నాయి . ప్రస్తుతం కవిత లేఖతో  వైఎస్ జగన్‌‌పై షర్మిల ఎలాగైతే ఎదురు తిరిగారో.. కేటీఆర్‌‌‌‌పై కూడా కవిత పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్న చర్చ మొదలైంది.వీటికి తోడు ఇటీవల ములుగు జిల్లాలో సోదమ్మలతో సోది జోస్యం చెప్పించుకున్నారు కవిత. అందులో కవిత సీఎం అవుతారని జోస్యం చెప్పారంట. ఆ విషయం కూడా హాట్ టాపిక్ అయింది. కవిత బీసీల గురించి చాలా మీటింగ్స్ పెట్టారు. అక్కడ ఆమె అనుచరులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు కవిత ఏ నియోజకవర్గం వెళ్లినా ఆమె అనుచరగణం సీఎం సీఎం అంటూ స్లోగన్స్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ లేఖతో కెసిఆర్ కుటుంబంలో కొత్త డ్రామా మొదలైంది అంటున్నారు .