పిల్ల సజ్జలకు సుప్రీంలో చుక్కెదురు
posted on May 23, 2025 1:23PM

వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాజీ హెడ్ సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్ తగిలింది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు చేపట్టిన సజ్జల భార్గవ్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత, అసభ్య, అశ్లీల పోస్టులతో రెచ్చిపోయారు. అయితే.. గత ఎన్నికలలో వైసీపీ పరాజయం పాలై.. అద్భుత విజయంతో తెలుగుదేశం కూటమి అధకార పగ్గాలు అందుకున్న తరువాత సజ్జల భార్గవ్ రెడ్డిని ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చాకచక్యంగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి తప్పించేశారు.
ఆ తరువాత పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి ఎక్కడా కనిపించింది లేదు. వినిపించింది లేదు. అయతే చేసిన తప్పులు వదలవుగా జగన్ హయాంలో సోషల్ మీడియాలో ఇష్టారీతిగా పెట్టిన పోస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నమోదయ్యింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ సజ్జల భార్గవ్ రెడ్డి తొలుత హైకోర్టునూ అక్కడ చుక్కెదురవ్వడంతో సుప్రీం ను ఆశ్రయించారు. సజ్జల ముందస్తు బెయిలు పిటిషన్ పై శుక్రవారం (మే 23) విచారించిన సుప్రీం కోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. అయితే రెండు వారాల వరకూ అరెస్టు నుంచి మినహాయింపు ఇస్తూ, ఆ లోగా సంబంధింత ట్రయల్ కోర్టును ఆశ్రయించాలన పేర్కొంది.
అయితే సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు మాకు అర్థం కాలేదని భావిస్తున్నారా? ఏ ఉద్దేశంతో ఆ పోస్టులు పెట్టారో మేము గ్రహించలేమని అనుకుంటున్నారా? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే కేసుల్లో అంత తేలిగ్గా బెయిల్ లభిస్తుందని ఆశించవద్దని పేర్కొంది.