కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేస్తారా?
posted on May 22, 2025 7:44PM

కేసీఆర్ కు బహిరంగ లేఖ సంకేతమేంటి?
సొంత కుంపటికి రెడీ అయిపోయినట్లేనా?
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీ తీరు పట్ల, పార్టీలో తనకు ప్రాముఖ్యత దక్కక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకునే నిర్ణయానికి వచ్చేశారా? అంటే ఇటీవలి పరిణామాలకు తోడు తాజాగా ఆమె పార్టీ అధినేత, తన కన్న తండ్రి అయిన కేసీఆర్ కు రాసిన ఘాటు లేఖ చూస్తుంటే ఔనని అనక తప్పడం లేదంటున్నారు విశ్లేషకులు.
ఇటీవలి కాలంలో పార్టీ పట్ల కవిత తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు జోరుగా వినిపించాయి. వినిపిస్తున్నాయి కూడా.
ఇపపుడు తాజాగా ఆమె పేరుతో తాజాగా బయటకు వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. ఇందులో ఆమె బీఆర్ఎస్ రజతోత్సవ సభపై తనకు వచ్చిన ఫీడ్ బ్యాక్ గురించి ప్రస్తావించారు. రజతోత్సవ సభకు పాజిటివ్ రెస్సాన్ తో పాటు నెగటివ్ రెస్పీన్స్ కూడా గట్టిగానే ఉందని కేసీఆర్ ను ఉద్దేశించిన ఆ లేఖలో పేర్కొన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంలోని మంచి, చెడులను ఆ లేఖలో పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకించడం , పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలపడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి పేరు ప్రస్తావించకుండానే ప్రకటించడం కేసీఆర్ ప్రసంగంలో మంచి అంశాలని పేర్కొన్న కవిత.. అదే లేఖలో కేసీఆర్ ప్రసంగంలోని బేడ్ ఎలిమెంట్స్ కూడా ప్రస్తావించారు. కేసీఆర్ రజతోత్సవ సభలో చేసిన మొత్తం ప్రసంగంలో బీజేపీని విమర్శించడానికి కేవలం రెండంటే రెండు నిముషాలే వెచ్చించారనీ, ఇది ప్రజలకు భవిష్యత్ లో బీఆర్ఎస్, బీజేపీల పొత్తు ఉంటుందన్న సంకేతాన్ని ఇచ్చిందని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. తనను జైలుపాలు చేసిన బీజేపీని విమర్శించకపోవడం వ్యక్తిగతంగా తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందని, .
అలాగే , బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశాన్ని కేసీఆర్ తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించకపోవడం కూడా బీసీలను పార్టీలకు దూరం చేసిందని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం కూడా ప్రజలలో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెచ్చరిల్లడానికి దోహదపడిందన్నారు. ఇక ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉన్న నేతలకు రజతోత్సవ సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వకపోవడం కూడా పార్టీకి మైనస్ గా మారిందని పేర్కొన్నారు.
మొత్తం మీద కవిత కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. అదే సమయంలో ఆ లేఖ కవిత రాసి ఉండకపోవచ్చునని కూడా కొందరు అంటున్నారు. కన్నతండ్రి అయిన కేసీఆర్ తో ఏ విషయాన్నైనా దైర్యంగా చెప్పే చనువు, స్వేచ్ఛ ఉన్న తన అభిప్రాయాలు, అసంతృప్తిని ఆయనకు లేఖ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో పార్టీ లైన్ కు భిన్నంగా కవిత చేస్తున్న ప్రకటనల కారణంగా కేసీఆర్ తో భేటీకి కవితకు అవకాశం లేకుండా పోయి ఉండొచ్చనీ, అందుకే బహిరంగ లేఖ రూపంలో తన అభిప్రాయాలను, అసంతృప్తినీ వ్యక్తం చేసి ఉంటారన్న చర్చ కూడా రాజకీయవర్గాలలో జరుగుతోంది. మొత్తం మీద కవిత పేరుతో వెలువడిన బహిరంగ చర్చ బీఆర్ఎస్ లో ఆల్ ఈజ్ నాట్ వెల్ వాతావరణం ఉందనడానికి తార్కానమని అంటున్నారు.