ఢిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. కేంద్రమంత్రులతో సీఎం వరుసగా భేటీలు అవుతున్నారు. ఈరోజు ఉదయం కేంద్ర పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషితో  ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సోలార్‌ ప్రాజెక్టులు, ప్రధాని సూర్యఘర్‌ పథకం అమలుపై ప్రహ్లాద్‌ జోషితో సీఎం చంద్రబాబు చర్చించారు. 20 లక్షల ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని కోరామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు పదివేల రూపాయల వరకూ సబ్సీడీతో సోలార్ రూఫ్ టాప్‌లో సోలార్ ప్యానల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించామని చెప్పారు. కేంద్ర సహకారంతో విద్యుత్తు ధరలు తగ్గించడంతో పాటు క్లీన్ ఎనర్జీకి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు.

అనంతరం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రక్షణ, ఏరోస్పేస్ రంగాలలో ఆంధ్రప్రదేశ్ దూరదృష్టిని కేంద్ర రక్షణ మంత్రికి సీఎం వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కీలక ప్రాంతాల్లో పారిశ్రామిక వృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పరిశోధన సహకారం, వ్యూహాత్మక సంస్థాపనలతో కూడిన సమగ్ర ప్రణాళికను వివరించారు. ఆత్మనిర్భర్ భారత్‌ను రక్షణ ఉత్పత్తి, ఆవిష్కరణల ద్వారా ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించడానికి ఏపీ సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్రమంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు సమావేశంలో పాల్గోన్నారు.