రైతు నాయకుడిగా మారిన రిటైర్డ్ డీజీపీ

 

కోకో గింజలు కొనుగోలు ధరపై రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు కలెక్టరేట్ లో నిర్వహించిన ద్వైపాక్షిక చర్చలు పూర్తిగా విఫలమైనట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర నాయకులు ప్రకటించారు. కోకో గింజలకు అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వకుండా మోసగిస్తున్న మోండలీజ్ కంపెనీ, ఇతర బహుళ జాతి కంపెనీల మోసాలకు నిరసనగా, రాష్ట్ర ప్రభుత్వ పరిష్కారాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులు ధర్నా నిర్వహించారు.కోకో రైతులకు న్యాయం చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ధర ఇవ్వాలని, కార్పొరేట్ కంపెనీల మోసాలను అరికట్టాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ ధర్నానుద్దేశించి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, రిటైర్డ్ డిజిపి ఏ.బీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత మూడు నెలలుగా కోకో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారని, గత వారం రోజులుగా పోరాటాన్ని ఉధృతం చేశారని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  అచ్చెన్నాయుడు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ఉన్నతాధికారులు సమక్షంలో పెద్ద సంఖ్యలో వచ్చిన కోకో రైతులతో జరిపిన చర్చలకు భౌతికంగా రాకుండా  మోండలీజ్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది కంపెనీల లెక్కలేనితనమని విమర్శించారు. రైతులకు బిక్షం వేస్తున్నట్లుగా అంతర్జాతీయ మార్కెట్ లో కిలో కోకో గింజలకు రూ.880/- ఉంటే మోండలీజ్ కంపెనీ రూ.450/- కు మించి ధర ఇవ్వలేమని చెప్పడం దుర్మార్గమని, ఇది బహుళ జాతి కంపెనీల కుట్రలో భాగమని విమర్శించారు. 

రాష్ట్ర మంత్రులు ఎన్నిసార్లు ప్రశ్నించినా మోండలీజ్ కంపెనీ ప్రతినిధుల మొండితనంతో కూడిన సమాధానం హేతుబద్ధంగా లేదన్నారు. గత సంవత్సరం వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రకారం ధర ఇచ్చిన కంపెనీలు ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కస్టమ్స్, ఇతర గణాంకాలను పరిశీలిస్తే గత నెల 25న కిలో కోకో గింజలను ఇవే కంపెనీలు రూ.1074/- దిగుమతి చేసుకొన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చట్టపరమైన నియంత్రణ లేకపోవడంతో కంపెనీల ఇష్టారాజ్యంగా మారిందన్నారు. కంపెనీ కిలో కోకో గింజలను రూ.450/- లకు కొనుగోలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.50 కంపెనీకి ఇచ్చి రూ.500లకు కొనుగోలు చేస్తామని  రాష్ట్ర మంత్రులు ప్రకటించిన నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నామన్నారు. బహుళ జాతి కంపెనీల మోసాలను అంతర్జాతీయ మీడియా ద్వారా ఎండగడతామని హెచ్చరించారు.