పల్నాడులో తల్లీ కొడుకుపై దుండగులు దాడి
posted on Nov 30, 2025 4:30PM

గుంటూరు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ళ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సాంబశివరావు అనే యువకుడుని హత్య చేశారు. అడ్డువచ్చిన తల్లిపై కూడా దాడి చేసి గాయపరిచారు. తల్లి కృష్ణకుమారి(58) పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు జిజిహెచ్ కు తరలించారు.. వివరాల్లోకి వెళితే, సాంబశివరావు, ఆయన తల్లి ఇంట్లో ఉన్న సమయంలో దుండగులు లోపలికి ప్రవేశించి వారిపై విచక్షణా రహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు.అయితే, హత్య చేసి పారిపోతున్న నిందితులను సమీపంలోని చాగల్లు గ్రామస్థులు గమనించి, వారిని పట్టుకున్నారు. వెంటనే ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. పట్టపగలు దారుణ హత్య జరగడంతో ఒక్కసారిగా గ్రామంలో ప్రజలు ఉలిక్కిపడ్డారు... జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు..