కాంగ్రేస్ కు పెరిగిన గ్రాఫ్ నిండా మునిగిన కేసీఆర్ 

అందరికంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో నష్టపోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందే ప్రారంభించిన బీఆర్ఎస్ అభ్యర్థులు జమిలీ ఎన్నికల టాక్ తో పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలని అభ్యర్థులకు ఆదేశించారు. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనౌన్స్ చేయడంతో 20 రోజుల పాటు ప్రచారాన్ని బిఆర్ఎస్ తన ప్రచారాన్ని నిలిపి వేసింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ పుంజుకుంది.  ఈ మధ్య వచ్చిన సర్వేల్లో బిఆర్ఎస్ గ్రాఫ్ అంతకంతకు పడిపోతోంది. జమిలీ ఎన్నికల ఊసు కేంద్రం ఎత్తకపోవడంతో బిఆర్ఎస్ ఖంగుతింది. కేంద్రం అంచనాలను పసి గట్టడంలో బిఆర్ఎస్ విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.  ప్రచారానికి విరామం ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది అని పరిశీలకులు అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత సోనియాగాంధి ఈ నెల 17న హైదరాబాద్  తుక్కుగూడకు వచ్చి తాయిలాలు ప్రకటించారు. సిక్స్ గ్యారెంటీస్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ ఇమేజ్ తెలంగాణలో పెరిగింది. కర్ణాటక డిప్యూటీసీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తదితరులంతా తుక్కుగూడకు తరలిరావడం, తెలంగాణ ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడానికి కారణమైంది.  కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. నెల రోజుల క్రితం బిఆర్ఎస్ జాబితా ప్రకటించిన తర్వాత అటు అసమ్మతి వాదులను బుజ్జగించడం, అభ్యర్థులను గెలిపించుకోవడమే బిఆర్ఎస్ ముందున్న టాస్క్ గా ఉండేది . కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అసమ్మతి పెరిగిపోయింది. పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విజయావకాశాలు సన్నగిల్లాయి. బిఫామ్ మీద ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు మెండుగానే ఉన్నారు. అన్ని పార్టీల కంటే ముందే 115 మంది అభ్యర్థులను బిఆర్ఎస్ ప్రకటించింది. కానీ ప్రచారాన్ని ప్రారంభించలేకపోయింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలకమైన మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఉండకపోవచ్చు. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ప్రకారం ప్రకటిస్తారు. మహిళా బిల్లు అమలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ముందు వరసలో నిలిచారు.  మహిళా బిల్లు వల్ల తన సీటు పోయిన పర్వాలేదని కేటీఆర్ ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. బిఆర్ఎస్ అసమ్మతివాదులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలని చూస్తోంది. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే , బిఆర్ఎస్ నేత ఇప్పటికే కేసీఆర్ పార్టీకి రాజీ నామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. జమిలీ టాక్ తో   అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రచారాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. సిక్స్ గ్యారెంటీస్  సోనియాగాంధీ ప్రకటించడం, సీడబ్ల్యూసి సమావేశాలు జరగడం  కాంగ్రెస్ పార్టీ  జనాల్లో వెళ్లింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు.  కానీ బిఆర్ఎస్ లో మాత్రం నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చేసింది. తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పుకునే కేసీఆర్ కు నూకలు చెల్లినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.  రెండు సార్లు అధికారంలో వచ్చిన కేసీఆర్ పార్టీ హ్యట్రిక్ కొట్టడం కల్ల అవుతుందని వారు అంటున్నారు. 
Publish Date: Sep 25, 2023 1:07PM

సంపద సృష్టితోనే అభివృద్ధి, సంక్షేమం.. బాబు తారకమంత్రం అదే!

కంప్యూటర్లు కూడు పెడతాయా అన్న  రోజులలో ఒకే ఒక్కడుగా ఐటీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా శ్రమించారు. యువత ఉజ్వల భవిష్యత్ కోసం కలలుగని, ఆ కల నెరవేర్చుందుకు శ్రమించి, తపించి సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చారు. అది చాలదా..? ఒక్క ఐటీ పరిశ్రమ వల్ల ఒక్క సారిగా ఏపీ ముఖచిత్రమే మారిపోయింది. వేలు, లక్షల మందికి జీవితంలో స్థిరపడేలా ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మంచి జీతాలతో ఉద్యోగాలు పొందిన వారు వెంటనే సొంతింటి నిర్మాణంపై దృష్టిసారించాయి. దీంతో వారు హోంలోన్ లు తీసుకున్నారు. బ్యాంకింగ్ రంగం వృద్ధి చెందింది. అపార్ట్ మెంట్ల నిర్మాణం జోరందుకుంది. నిర్మాణ రంగం పరుగులు తీసింది. వారి కొనుగోలు శక్తి పెరిగింది. బ్రాండెడ్ దుస్తుల కొనుగోళ్లు పెరిగి టెక్స్ టైల్ ఇండస్ట్రీ వృద్ధి చెందింది.  వీకెండ్ విహారాలు పెరిగాయి. పర్యాటక రంగం జోరందుకుంది. అంతేనా ఎంటర్మైన్ మెంట్, ఏవియేషన్ ఇండస్ట్రీ అభివృద్ధిలో, పురోగమనంలో కొత్త పుంతలు తొక్కాయి. సొంత ఇంటిని సుందరంగా తీర్చిదిద్దుకోవడం, హంగుల ఏర్పాటుపై ఐటీ ఉద్యోగులు దృష్టి పెట్టారు. టీవీ, గృహోపకరణాల కొనుగోళ్లు పెరిగాయి, హోంఅప్లయెన్సెస్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా, శాఖోపశాఖలుగా విస్తరించింది.  అంతేనా ఆన్ లైన్ కొనుగోళ్లు పెరిగాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ఫుడ్ ఇండస్ట్రీ అనూహ్యంగా జోరందుకుంది. ఇలా ఒకటేమిటి.. ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న ప్రతి పురోగతి వెనుకా చంద్రబాబు విజనే ఉంది.  ప్రజల ఆర్థిక ప్రమాణాలు పెరగడం టాక్స్ పేయర్ల ను పెంచింది. దిగువ మధ్యతరగతి మధ్యతరగతిగా ఎదిగింది. మధ్యతరగతి ఎగువ మధ్య తరగతిగా ఎదిగింది. ఇలా ఎదిగిన ప్రతి కుటుంబమూ మా వాడికి, మా అమ్మాయికీ ఐటీ ఉద్యోగం వచ్చింది, మంచి జీతం వస్తోంది అందుకే బాగుపడ్డాం అని చెబుతారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ లక్షలాది మంది తెలుగు యువకులను విదేశాలకు వెళ్లి లక్షల్లో వేతనాలు సంపాదించేలా చేసింది. ఉభయ తెలుగురాష్ట్రాలలో లక్షల కుటుంబాలు చెప్పే జవాబులు ఇవే. అంతే కానీ ఎవరూ కూడా ఫలానా ఉచిత పథకం వల్ల మా దశ తిరిగింది. మేం బాగుపడ్డాం అని చెప్పే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాట సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాజాభివృద్ధికి అవసరం. అభివృద్ధి ద్వారా సృష్టించిన సంపదని సమాజానికి పంచాలి. తప్ప అప్పులు, పన్నులు ద్వారా కాదు. అందుకే జనం ఆలోచించాలి.  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి  తాత్కాలిక లబ్దిపై వల్ల ప్రయోజనం ఉండదు. దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. చంద్రబాబులో ఉన్నది అదే. అందుకే ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తే ఆయన దార్శనికత కారణంగా బాగుపడిన ప్రతి యువకుడూ ఆవేదన చెందుతున్నారు. తమ కంఫర్ట్ జోన్ ను వదిలి పోలీసు ఆంక్షలను సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. 
Publish Date: Sep 25, 2023 10:44AM

ఐయామ్ విత్ బాబు.. ఏపీ అంతటా ఇదే నినాదం.. ఎన్నికలోస్తే తడాఖా చూపుతామంటన్న జనం

స్కిల్ స్కాం అంటూ చంద్రబాబుపై మోపిన అభియోగాలు కోర్టుల్లో నిలవవని న్యాయనిపుణులు, మాజీ ఐఏఎస్ లు, చివరాఖరికి సుప్రీం కోర్టు మాజీ న్యాయవాదులు కూడా బలంగా చెబుతున్నారు. కానీ విచిత్రంగా ఆ నిలబడని అభియోగాల కారణంగానే ఆయన గత పక్షం రోజులుగా రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. దేశ విదేశాలలో ఆయన అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని చోట్లా ఆందోళనలు నిరాటంకంగా కొనసాగుతుంటే.. తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఆంక్షల నడుమ.. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, తెలుగుదేశం శ్రేణులూ పట్టువదలకుండా ఉద్యమిస్తున్నారు. లాఠీలకు, అరెస్టులకు బెదరకుండా నిలబడుతున్నారు. ఈ మధ్యలో ఇటు ఏసీబీ కోర్టు, అటు హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించలేదు. ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతించగా, హై కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇక రెండు రోజుల సీఐడీ విచారణ పూర్తయిన తరువాత ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించింది. మరో వైపు చంద్రబాబు హైకోర్టు  తన  క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు. అలాగే ఏసీబీ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండూ కూడా సోమవారం ( సెప్టెంబర్ 25)న విచారణకు రానున్నాయి. దీంతో రాజకీయవర్గాలే కాకుండా సామాన్యులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విధానం అత్యంత అప్రజాస్వామికంగా, అక్రమంగా, అన్యాయంగా ఉందన్న విషయంలో ఎవ్వరిలోనూ భిన్నాభిప్రాయమే కనిపించడం లేదు. చివరాఖరికి వైసీపీలోకి కొందరు నేతలు, శ్రేణులూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా. అసలే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న తరుణంలో చంద్రబాబును అప్రజాస్వామికంగా, అక్రమంగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టుతో తమ పరిస్థితి మరింత దయనీయంగా మారిందనీ, ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న గెలుపు ఆశలు కూడా ఆవిరైపోయాయనీ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అరెస్టు తరువాత చంద్రబాబు పక్షం రోజులుగా జైలులో ఉండటం.. జనం స్వచ్ఛందంగా ఐయామ్ విత్ బాబు అంటూ రోడ్లపైకి రావడం, పోలీసులు మొత్తం రాష్ట్రాన్నే జైలుగా మార్చేసినట్లుగా, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన విధంగా ఆంక్షలు అమలు చేయడంతో జనంలో ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొస్తాయా? జగన్ సర్కార్ ను ఎప్పుడు గద్దెదించుదామా అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు వారి వారి నియోజకవర్గాల ఎమ్మెల్యేల ముఖంమీదనే చెప్పేశారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.  ఇక స్కిల్ కేసు విషయానికి వస్తే చంద్రబాబు బెయిలుపై బయటకు రావడం కంటే.. ఈ కేసులో తాను నిర్దోషిననీ, కనీసంగా కూడా పద్ధతులు, ప్రొసీజర్, నిబంధనలు పాటించకుండా అరెస్టు చేశారనీ నిరూపించుకునే బయటకు రావాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేసినా.. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం హైకోర్టు క్వాష్ పిటిషన్ ను మెకానికల్ గా కొట్టివేసిందంటున్నారు. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదంటూ ఎప్పుడో సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఆధారం చేసుకునే ఈ తీర్పు ఇచ్చిందనీ, అరెస్టు తీరే అక్రమం అంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనను పరిగణనలోనికి తీసుకోలేదనీ చెబుతున్నారు.  ఇక సామాన్యజనమైతే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత.. వివేకా హత్యకేసులో నిందితుడు భాస్కరరెడ్డికి బెయిలును పోలుస్తూ.. జగన్ సర్కార్ వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తోంది అనడానికి అదే తార్కానంగా చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వివేకా హత్య కేసులో ఏ8ను అరెస్టు చేయడానికి వెళ్లి కూడా సీబీఐ రిక్తహస్తాలతో వెనుదిరిగిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఆధారాలున్నాయి, అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలి  అని కోర్టులో సీబీఐ విస్పష్టంగా చెప్పి, అందుకు కోర్టు అనుమతి తీసుకున్న తరువాత కూడా స్థానిక పోలీసుల సహకారం లేదు, శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ సాకులు చెప్పి ఆయనను అరెస్టు చేయకుండా వదిలేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. జగన్ సర్కార్ పూర్తిగా నియంతృత్వ ధోరణిలో, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనీ, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించేవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నిటికీ మించి మంత్రులు కూడా తరువాత ఎవరెవరి అరెస్టు కాబోతున్నారో బహిరంగంగా ప్రకటిస్తుండటం, సీఐడీ చీఫ్ స్కిల్ కేసు దర్యాప్తు వివరాలను ఊరూరా మీడియా సమావేశాలు పెట్టి మరీ వివరిస్తుండటంతో రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతోందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.   రాష్ట్రంలో ఒక విధమైన ఎమర్జెన్సీ అమలులో ఉందన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తం అవుతున్నది. 1975లో ఎమర్జెన్సీ అనుభవించని జనం ఆ తదుపరి ఎన్నికలలో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే చిత్తుచిత్తుగా ఓడించారో.. వచ్చే ఎన్నికలలో జగన్ సర్కార్ ను అలాగే చిత్తుచిత్తుగా ఓడిస్తాం అని ప్రతిన పూనుతున్నారు. ఇప్పటి వరకూ రాజకీయాలతో సంబంధం లేని తటస్థులు కూడా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలపడం చూస్తుంటే.. సామాన్య  ప్రజానీకం నుంచి మేధావులు మధ్య తరగతి ప్రజలు మొదలు, అన్ని వర్గాల ప్రజల నుంచి జగన్ సర్కార్ పట్ల వ్యక్తం అవుతున్న ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. ఆ విషయం స్పష్టంగా తెలుస్తున్నా జగన్ మాత్రం తన ప్రసంగాలలో, పార్టీ సమావేశాలలో,శాంతి భద్రతల సమీక్షల్లో ఇంకా అరెస్టులు ఉంటాయి అంటూ పేర్లతో సహా ప్రస్తావిస్తూ ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే నిండా మునిగిపోయాం.. ఇక చలేమిటి? అని సంకేతాలిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వైసీపీ నేతలు, శ్రేణులూ కూడా తమ నాయకుడు జగన్ రెడ్డి తాను మునిగిపోవడమే కాకుండా, పార్టీనీ, తమనూ కూడా ముంచేయడానికే రెడీ అయిపోయారని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో చంద్రబాబు అరెస్టు ప్రభావం అధికార వైసీపీపై తీవ్ర ప్రతికూలత చూపడం ఖాయమని ఇటీవలి సీఓటర్ సర్వే తేల్చి చెప్పేసింది. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రేనని జనం భావిస్తున్నారని కుండబద్దలు కొట్టేసింది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయం ఖాయమనీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమనీ సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పలువురు ఓటమికి మాసికంగా సిద్ధమైపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Sep 25, 2023 10:01AM

సైబర్ టవర్స్ @ 24 ఏళ్ళు!

ఒక్క ఆలోచన.. ఒకే ఒక్క ఆలోచన యావత్ రాష్ట్ర రూపు రేఖలు మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందుకే కంప్యూటర్లు కూడు పెడతాయా అని హేళన చేసి ఉంటారు. భవిష్యత్ కాలాన్ని నడిపించే ఆయుధాన్ని చేతికి అందిపుచ్చుకోవడానికి ఎంతో ముందు చూపు అవసరం. ముందుచూపుతో ఆ దార్శనికుడికి జాతిని నడిపించే ఆలోచన రావడం.. ఎన్నో విమర్శల మధ్య ఆ ఆలోచనను శ్రమకోర్చి ఆచరించడం అనితరసాధ్యమైన విషయం. అన్నిటినీ అధిగమించి నాడు నాటిన ఓ విత్తనం ఇప్పుడు భారీ వృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి ఫలాలు అందిస్తున్నది.. ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లకు మార్గదర్శనంగా నిలుస్తుంది. అదే సైబర్ టవర్స్.. ఆ దార్శనికుడు పేరే నారా చంద్రబాబు నాయుడు. నేటితో సైబర్ టవర్స్ ప్రారంభమై 24 ఏళ్ళు పూర్తైంది. సరిగ్గా 23-09-1999న సైబర్ టవర్స్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఐటీ నిపుణులతో కళకళలాడుతున్న సైబరాబాద్ ఒక‌ప్పుడు అడవిలా ఉండేది. సైబర్ టవర్స్ ఉన్న ప్రాంతం ఓ కుగ్రామంలా కనిపించేది. ఇప్పుడు అతి భారీ కట్టడాలతో, మెలికలు మెలికలు తిరిగిన వంతెనలతో కనిపిస్తున్న ఈ విశ్వనగరంలో అప్పుడు ఎటు చూసినా అంతా రాళ్లు రప్పలే కనిపించేవి. జ‌న‌సంచారం కూడా ఉండేది కాదు. గేదెలు మేపుకొనే కొండ ప్రాంతంగా కనిపించిన ఆ ప్రదేశంలో ఓ నాయకుడికి మాత్రం సిరులు పండించే ఆధునిక నగరం కనిపించింది. అప్పుడు ఆ నాయకుడి ఊహే ఇప్పుడు నిజమై  ఆ ప్రాంతం రెండు తెలుగు రాష్ట్రాలకు కాస్ట్లీ ఏరియాగా అవతరించింది. హైద‌రాబాద్ ఇన్ ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అండ్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెన్సీ సిటీగా నామకరణం చేసుకొని హైటెక్ సిటీగా పిలువబడెతొంది. ఎందరో యువ ఇంజనీర్ల భవిష్యత్  బాటగా మారింది.    సైబర్ టవర్స్ ప్రారంభం తర్వాత ఎంతోమంది ఐటీ దిగ్గజాల క‌న్ను హైద‌రాబాద్ పై ప‌డింది. ఐటీ రంగానికి మ‌రో సిలికాన్ సిటీగా నిలిచింది. అంతకు ముందు హైదరాబాద్ అంటే చారిత్రక గుర్తులే చిహ్నం. సైబర్ టవర్స్, హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత బ్రతుకును నడిపించాల్సింది చరిత్ర కాదు భవిష్యత్ అనేది అవిష్కృతమైంది. అంత‌ర్జాతీయ స్థాయిలో భాగ్య‌న‌గరానికి కీర్తి ప్ర‌తిష్ట‌లు తెచ్చిపెట్టిన హైటెక్ సిటీ ముమ్మాటికీ చంద్ర‌బాబు నాయుడి మాన‌స పుత్రిక‌నే. ఇందులో కొందరు ఎన్నో వాదనలు, అంతకు మించిన విమర్శలు చేసినా చంద్రబాబు విజనరీని ఇసుమంతైనా తగ్గించి చూపలేవు. ప్ర‌పంచ పుట‌ల్లో హైద‌రాబాద్ ను ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని ఈనాటి తెలంగాణ పాలకులు సైతం ఒప్పుకున్న సత్యం. ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చి, నేడు ప్రపంచానికే తలమానికంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని ఐటీ దిగ్గజ సంస్థల పెద్దలే చెప్తుంటారు.  ప్రస్తుతం 67 ఎక‌రాల్లో విస్త‌రించిన ఈ హైటెక్ సిటీ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్రం వహిస్తున్నది. ఇక్కడ త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్న ఐటీ కంపెనీలతో ఎంతో మందికి ప్రత్యేక, పరోక్ష ఉపాధి కలిగిస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నది. దేశానికి చెంద‌న‌వారే కాదు.. విదేశాల‌కు చెందిన ఎంతోమంది ప్రపంచ నలుమూలన నుండి భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ వస్తున్నారంటే నాడు నాటిన సైబర్ టవర్స్ విత్తనం ఏ స్థాయిలో  వృద్ధి చెంది, విస్తరించి ఫలాలు అందిస్తున్నదో ఊహించుకోవచ్చు. అంతకు ముందు దక్షణాదిన ఐటీకి కేరాఫ్ అడ్రస్ అంటే బెంగుళూరు అనే అంతా భావించారు. కానీ ఇప్పుడు బెంగళూరుకు దీటుగా భాగ్య‌న‌గ‌రంలో ఐటీ హ‌బ్ కనిపిస్తున్నది. ఎక్కడెక్కడి నుండో ఇంజనీర్లు ఇక్కడకి చేరుకోవడంతో హైటెక్ సిటీ చుట్టూ ప‌లు వ్యాపార సంస్థ‌లు వాలిపోయాయి. దేశవిదేశాలకు చెందిన స్టార్ హోటల్స్, హాస్పిట‌ల్స్ ఏర్పాటుతో రియ‌ల్ ఎస్టేట్ మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. ఫలితంగా ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా హైటెక్ సిటీ గుర్తింపు తెచ్చుకుంది. అంతటికీ మూలం ఆ టార్చ్ బేరర్. ఆ విజనరీ, ఆ దార్శనికుడు చంద్రబాబు. ఆయన మేధోపుత్రిక హైటెక్ నేడు ఆదాయం పెంచే, పంచే కల్పవృక్షంగా మారింది. 
Publish Date: Sep 23, 2023 4:58PM

జగన్ రెడ్డి బెయిలు జీవితానికి పదేళ్లు

లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్నారనే ఆరోపణలు, 42 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోచేశారని దర్యాప్తు సంస్థ సీబీఐ నిర్ధారణ, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 ముద్దాయి, 16 నెలల సుదీర్ఘ కాలం జైల్లో గడిపిన పొలిటికల్ లీడర్, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ జీవితంలో కూడా అనితరసాధ్యమైన రికార్డ్ సృష్టించారనే చెప్పాలి.  అవును.. నిజమే.. ఆయన సృష్టించిన రికార్డు నభూతో.. నభవిష్యత్ వంటిదే మరి. అదేమిటంటూ..  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై జైలు నుండి బయటకొచ్చి నేటితో పదేళ్లు పూర్తయింది.  ఔను ఆయన నేడు పదో బెయిల్ డే వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో.. సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య ఇదే  హాట్ టాపిక్ గా మారింది. ఈ పదేళ్లలో సీబీఐ కోర్టు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా జగన్ మోహన్ రెడ్డి ప్రజా పాలన సాకుగా చెప్పుకుంటూ   విచారణకు హాజరు కావడం లేదు. ఫలితంగా ఈ కేసు దశాబ్దానికి పైగా సాగుతూనే ఉంది. పదేళ్ల కాలంలో జగన్ పలుమార్లు విదేశీ యాత్రలకు వెళ్లగా.. ప్రతిసారి కోర్టు అనుమతి తీసుకొని, కోర్టులో  సమర్పించిన పాస్ పోర్ట్ తీసుకొని వెళ్లడం, తిరిగి రాగానే మళ్ళీ కోర్టుకు అప్పగించడం చేస్తున్నారు. 42 వేల కోట్ల అక్రమ ఆస్తుల కేసులో ఏ1గా ఉన్న జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఉండడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై టీడీపీ యువ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జైలు మోహన్ రెడ్డికి  పదో బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.  42 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని నారా లోకేష్ మండిపడ్డారు. జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ జైల్లో ఉన్నారని లోకేష్ చంద్రబాబు అరెస్టుపై ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి జీవితంలో ఈరోజు అత్యంత సంతోషకరమైన రోజు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా సెటైర్లు వేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన మాట్టాభి.. కోర్టు బెయిల్‌పై దర్జాగా జీవిస్తూ, తన బెయిల్ కాలాన్ని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదవ బెయిల్ డే వార్షికోత్సవం జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తించి, ‘ఎక్కువ కాలం బెయిల్‌పై జీవించిన వ్యక్తి’గా జగన్ రెడ్డిని గుర్తించి, ఆయనకు ఒక రికార్డ్ ఇవ్వాలని కోరుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టానని.. వారు త్వరలోనే జగన్ రెడ్డిని కలిసి ఆయన సాధించిన ఘనతకు సంబంధించిన సర్టిఫికెట్ అందిస్తారన్నారు. ఆ సర్టిఫికెట్‌ను జగన్ రెడ్డి పెద్దపెద్ద ఫ్రేములు కట్టించి తన ప్యాలెస్‌లతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని వ్యాఖ్యలు చేశారు. మిగతా టీడీపీ సీనియర్ నేతలు, టీడీపీ శ్రేణులు జగన్ బెయిల్ డేపై సోషల్ మీడియాలో సెటైర్లు హోరెత్తిస్తున్నారు. కాగా, పదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పైనే దర్జాగా తిరుగుతుండడంపై పరిశీలకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇంతటి హై ప్రొఫైల్ కేసు, ఇంత ప్రజా ధనం దోచుకున్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించిన ఈ కేసులో ఓ నిందితుడు ఇలా రాజ్యమేలడం, ఈ కేసు ఇప్పటికీ దర్యాప్తు దశలో ఉండడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి కేంద్రం అండదండలతోనే ఇంత కాలం పాటు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా నిలువరించగలిగారని అంటున్నారు.  ఈ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచగానే జగన్ కేంద్రం తలుపు తట్టడం.. దర్యాప్తు మందగించడం.. పదేళ్లుగా ఇదే పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి జగన్ అవినీతి, అక్రమాస్తుల కేసు ఎప్పటికి తేలుతుందో చూడాల్సి ఉంది.
Publish Date: Sep 23, 2023 3:29PM

చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ!

స్కిల్  స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబును ఏసీబీ కోర్టు షరతులతో సీఐడీ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో  ఆయనను సీఐడీ అధికారులు రెండు రోజులు పాటు విచారింస్తారు. అందులో భాగంగానే శనివారం ఉదయం చంద్రబాబుకు రాజమహేంద్రవరం జైలులో వైద్య పరీక్షల అనంతరం సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారిస్తున్నారు.  ఈ విచారణలో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ పాల్గొన్నారు! వీరితో పాటు ఒక వీడియోగ్రాఫర్‌, ఇద్దరు మధ్యవర్తులు (ఎమ్మార్వో – వీఆర్వో) ఉన్నారు. కాగా చంద్రబాబును శనివారం, ఆదివారం( సెప్టెబర్ 23, 24) రెండు రోజుల పాటు సీఐడీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారించనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫున విచారణను పర్యవేక్షించేందుకు ఇద్దరు న్యాయవాదులను కూడా కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే . రెండు రోజులూ కలిపి చంద్రబాబును సీఐడీ మొత్తం 15 గంటల పాటు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు వయస్సు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రతి గంటకూ ఐదు నిముషాలు విరామం ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా చంద్రబాబు కోరితే  మరిన్ని విరామాలు కూడా తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  చంద్రబాబుపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని కస్టడీ ఉత్వర్వులు వెలువరించే సమయంలో ఏపీసీ కోర్టు విస్పష్టమైన ఆదేశాలను ఏపీ సీఐడీకి ఇచ్చింది. అలాగే చంద్రబాబు విచారణకు సంబంధించి ఫొటోలూ, వీడియోలు లీక్ అవ్వకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. అంతే కాకుండా విచారణ గడువు ముగిసిన వెంటనే అంటే ఆదివారం (సెప్టెంబర్ 24) సాయంత్రం చంద్రబాబు విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్ తో రికార్డు చేసిన వీడియోను సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది. కస్టడీ గడువు ముగిసిన తరువాత చంద్రబాబును వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం సాయంత్రమే కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. అంతకు ముందు చంద్రబాబును విచారించేందుకు 12 మందితో కూడిన బృందంలోని వారి పేర్లను సీఐడీ న్యాయస్థానానికి సమర్పించింది.  
Publish Date: Sep 23, 2023 12:42PM

విశాఖ జగన్ ఈగో శాటిస్ ‘ఫ్యాక్షన్ ’రాజధానేనా?

జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విశాఖ కేంద్రంగా  పాలనకు సిద్ధమైంది. ఇందు కోసం దసరా ముహుర్తాన్ని కూడా నిర్ణయించింది. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే  ఈ విషయాన్ని ఇటీవలి కేబినెట్ సమావేశంలో వెల్లడించారు.  ఇందుకోసం విశాఖలో ఇప్పటికే కార్యాలయాలు, సీఎం నివాసం కూడా సిద్దమవుతున్నట్లు ఆయనే చెప్పారు. రాబోయే ఎన్నికలను అక్కడి నుంచే ఎదుర్కోవాలని వైసీపీ నిర్ణయించింది. అందుకే ఇప్పటికిప్పుడు ఎలాగైనా పరిపాలన విశాఖ నుండే చేయాలని కసరత్తులు ప్రారంభించింది. నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే మూడు రాజధానులంటూ ప్రకటించింది.  అనంతరం అమరావతి రైతుల నిరసనలు, కోర్టు చిక్కులు, కరోనా కారణంగా మూడు రాజధానులకు బ్రేకులు పడ్డాయి. కోర్టుల నుండి తీవ్ర ఒత్తిడితో మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం అదే అసెంబ్లీ సాక్షిగా వెనక్కి తీసుకుంది. ఇప్పుడు కూడా ఏపీ రాజధానిగా అమరావతి అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయినా  ప్రభుత్వం విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు చేస్తూనే ఉంది. రాజధానుల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు చెప్పినా జగన్ సర్కార్ విశాఖలో రాజధాని ఏర్పాట్లు చేపడుతూనే ఉంది. కొన్ని నెలలుగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలిస్తామని ప్రకటిస్తున్న సీఎం జగన్ తాజాగా కేబినెట్లోనూ ఈ మేరకు ప్రకటన చేసేశారు. ఆ దిశగా విశాఖకు రాజధానిని తరలించేందుకు విజయదశమిని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అంతే కాకుండా రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్, కీలక హెచ్వోడీ కార్యాలయాలను విశాఖకు తరలించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇదే విషయమై తాజాగా.. మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీనుండి జగన్ వైజాగ్ లోనే ఉంటారని ప్రకటించారు.  ప్రస్తుతం విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు కార్యాలయం, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసాలు, అవసరమైన సిబ్బంది క్వార్టర్స్ తదితరాల ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వారంలో రెండు రోజులు జగన్ వైజాగ్ లో ఉండబోతున్నట్లు తెలిసింది. అదికూడా గురు, శుక్ర వారాల్లో విశాఖపట్నంలో ఉంటారని మిగిలిన రోజుల్లో అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటనలు చేయబోతున్నట్లు చెప్తున్నారు. అయితే, జగన్ ఏ ఉద్దేశ్యంతో విశాఖ నుండి పాలన చేయనున్నారన్న చర్చ ప్రజల మధ్య జరుగుతుంది. చట్ట పరిధిలో విశాఖకు రాజధాని తరలించడం సాధ్యమయ్యేది కాదు. కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగా.. చట్టాన్ని అతిక్రమించి రాజధాని తరలించే పరిస్థితి లేదు. రాజధాని అమరావతి కోసం స్థానిక రైతుల వద్ద తీసుకున్న భూములు, వారితో ప్రభుత్వం చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాల ప్రకారం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. లేదంటే రైతులకు కొన్ని వేల కోట్లు పరిహారం చెల్లించాలి. వీటిని ఉల్లంఘించి రాజధానిని తరలించడం సాధ్యం కాదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. అంతేకాదు దీనిపై చట్టాలు కూడా చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లేదని విస్పష్టంగా పేర్కొంది. ఈ అంశంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా కోర్టు నిర్ణయం డిసెంబర్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా రాజధాని తరలింపు సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ ఇప్పుడు విశాఖకు రాజధాని తరలింపు సాంకేతికంగా జరిగే పని కాదు. కానీ, సీఎం ఎక్కడ నుంచైనా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది అని స్వయంగా జగనే చెబుతున్నారు కనుక విశాఖ నుండి పరిపాలన చేయాలని ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్,  వైసీపీ చెప్తున్నట్లుగా ఇది రాజధాని తరలింపు కాదు కేవలం సీఎం ఇల్లు, ఆఫీసు. క్యాంప్ ఆఫీసు తరలింపు మాత్రమే. ఇది కూడా కేవలం విశాఖ నుండి పాలన చేశానని చెప్పుకోవడానికీ,  జగన్ తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం మాత్రమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి రాజకీయ లబ్ది పొందడం కోసమే ఎన్నికలకు ముందు కంటితుడుపుగా ఈ విశాఖ నుండి పాలన డ్రామా మొదలు పెట్టినట్లు చూడాల్సి ఉంటుంది. అయితే, సీఎం తన ఇల్లు, ఆఫీసు తరలిస్తే రాజధాని కాదు.. దానికి ఒక చట్టం ఉంది.. అనుమతులు కావాలి.. కేంద్రం నోటిఫై చేయాలి.. ప్రభుత్వ అధికారిక ముద్ర మారాలి. కానీ, అవేమీ లేని విశాఖ జస్ట్ జగన్ ఈగో శాటిస్ఫాక్షన్ రాజధాని మాత్రమే.
Publish Date: Sep 23, 2023 11:29AM

దార్శనికుడు చంద్రబాబుకు జైలు.. వివేకా హత్యకేసు నిందితుడు భాస్కర్ రెడ్డికి బెయిలు!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 22) ఆయన్ను సీఐడీ కస్టడీకి అప్పగించింది. గత నాలుగు రోజులుగా వాయిదాల పర్వంగా సాగిన ఈ తీర్పు శుక్రవారం రానే వచ్చింది. రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే రెండు రోజుల కస్టడీ తేదీలను మాత్రం కోర్టు వెల్లడించలేదు. తేదీలను తర్వాత ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీఐడీ కోరగా ఐదు రోజులు కాకుండా రెండు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది.   కాగా, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, సీఎం జగన్ బాబాయ్ వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్ లభించింది. వివేకా హత్య కేసును ఏళ్లుగా సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ, సీఎం జగన్ కు సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో   నిందితులుగా సీబీఐ పేర్కొనగా.. ఎంపీ అవినాష్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకూ హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో ఉండగా.. ఇప్పుడు ఆయనకు కూడా బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం భాస్కర్ రెడ్డికి 12 రోజుల పాటు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. భాస్కర్‌ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్‌ గూడ సూపరింటెండెంట్‌ రిపోర్ట్‌ ఇవ్వడంతో ఆయనకు వైద్య చికిత్స అందించాలని సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, భాస్కర్ రెడ్డికి హైదరాబాద్‌ లోనే చికిత్స పొందాలని, హైదరాబాద్‌ ను విడిచివెళ్లవద్దని సీబీఐ కోర్టు  షరతులు విధించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా భాస్కర్ రెడ్డి జైలు నుంచి శుక్రవారం (సెప్టెంబర్‌ 22)న విడుదలయ్యారు. 12 రోజుల బెయిల్ అనంతరం కూడా ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి రాకపోతే కనుక మరికొన్ని రోజులు బెయిల్ పొడిగించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. అనారోగ్యం, చికిత్స పేరుతో ఇలా బెయిల్ పొడగించిన కేసులు ఇప్పటికే చాలా చూడగా.. ఇప్పుడు వివేకా హత్యకేసు నిందితుడు భాస్కర్ రెడ్డి బెయిల్ కథ కూడా ఇలా కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు.  కాగా, ఒకవైపు కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేని స్కాంలో చంద్రబాబును అక్రమంగా, కేవలం కక్షపూరితంగా కేసులు పెట్టి ఆయనను జైలుకు తరలించి.. మాజీ మంత్రి వివేకాను క్రూరాతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించాలని ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బెయిల్ పై బయటకి వదలడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక వైపేమో 43 వేల కోట్ల అవినీతి కేసులలో ఏ1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు దశాబ్ద కాలంగా బెయిల్ పై ఉంటూనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. బెయిల్ పై ఉండే కోర్టుల అనుమతితో  దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. కనీసం నాలుగేళ్లుగా కోర్టు విచారణకు కూడా హాజరుకాకుండా సాకులు చెప్తున్నారు. ఇదే కేసులలో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఢిల్లీలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ అవినీతి కేసు ఎప్పటికి తెలుస్తుందో కూడా తెలియడం లేదు.  మరోవైపు వివేకా హత్యకేసులో నిందితులు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొన్న ఎంపీ అవినాష్ ఈసారి  ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మందీ మార్బలంతో స్థానికంగా చెలరేగిపోతూ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా అనారోగ్య కారణాలతో జైలు నుండి బయటకి వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందరో యువతీ, యువకుల భవితకు బంగారు బాట వేసిన చంద్రబాబును మాత్రం జైలుకు తరలించారు. కనీసం ఒక్క అవినీతి ఆధారం చూపించలేకపోతున్న సీఐడీ కస్టడీకి అప్పగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై నగరాలు, పట్టణాలు గ్రామాలలో రచ్చబండలు అన్న తేడా లేకుండా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు సంఘీభావంగా జనం స్వచ్చందంగా రోడ్ల పైకి వస్తున్నారు.  
Publish Date: Sep 23, 2023 10:59AM

కారు డ్రైవర్ ఖాతాలోకి 9వేల కోట్లు.. ఆ తరువాత ఏమైందో తెలుసా?

బ్యాంకు అధికారులు పొరపాటుగానో, గ్రహపాటుగానో చేసిన తప్పు వారికి పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి 21 వేల రూపాయలను వదులుకోవడమే కాకుండా, ఓ వ్యక్తికి వాహన రుణం కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే.. చెన్నైలోని మర్కెంటైల్ బ్యాంకు పొరపాటుగా తొమ్మిదివేల కోట్ల రూపాయలను ఓ వ్యక్తి ఖాతాలో జమ చేసింది. వెంటనే జరిగిన పొరపాటును గ్రహించి సరిదిద్దుకునేందుకు ఆ వ్యక్తికి ఫోన్ చేసి మొత్తం సొమ్మును తమకు అప్పగించాలని కోరారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి అంత సొమ్ము తన ఖాతాలో ఎలా జమ అయ్యిందో.. అసలు అది నిజమో కాదో తెలుసుకునేందుకు తన స్నేహితుడికి ఓ 21 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసి చూశాడు. ఆ తరువాతే అతడికి బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. అదీ కథ.. అలా బ్యాంకు అధికారుల పొరపాటు వల్ల 9 కోట్ల రూపాయలు జమ అయిన ఖాతాదారులు ఓ కారు డ్రైవర్. అతడి పేరు రాజ్ కుమార్. ఈ నెల 9వ తేదీన అతడి మొబైల్ ఖాతాకు మర్కంటైల్ బ్యాంకు నుంచి 9వేల కోట్ల రూపాయలు జమ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. కంగుతిన్న రాజ్ కుమార్ అసలా మెసేజ్ నిజమా కాదా పరీక్షించేందుకు తన స్నేహితుడికి 21 వేల  రూపాయలు ట్రాన్స్ ఫర్ చేస్తే ట్రాన్స్ ఫర్ అయ్యాయి. దీంతో వేల కోట్ల రూపాయల అధిపతిని అయ్యానని ఆనందించే లోపే బ్యాంకు అధికారులు జరిగిన పొరపాటును వివరించి తక్షణమే ఆ సొమ్ము మొత్తం తమకు అప్పగించాలన్నారు. దీంతో రాజ్ కుమార్ ఓ న్యాయవాదిని సంప్రదించాడు. చర్చల తరువాత బ్యాంకు అధికారులు తమ పొరపాటుకు మూల్యం చెల్లించుకోవడానికి అంగీకరించారు. ఆ కారు డ్రైవర్ తన మిత్రుడికి ట్రాన్స్ ఫర్ చేసిన 21 రూపాయలూ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదనీ, అంతే కాకుండా మిగిలిన సొమ్మును తమకు అప్పగించినందుకు ప్రతిఫలంగా ఆ డ్రైవర్ కు వాహన రుణం ఇవ్వడానికీ అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు. కథ సుఖాంతమైంది. అయితే ఇప్పుడు నెటిజన్లు మాత్రం అసలు ఆ 9 వేల కోట్ల రూపాయల సంగతేంటి? వాటి కథాకమామిషు ఏమిటని బ్యాంకును నిలదీస్తున్నారు. అంత సొమ్మును ఎవరికి చెందినదీ, దానికి సంబంధించి లెక్కలూ అవీ సక్రమంగా ఉన్నాయా. అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 
Publish Date: Sep 23, 2023 10:47AM

కోడికత్తి శీనుకు నో బెయిల్

కోడికత్తి శీనుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఐదేళ్లు పూర్తియినా ఆయనకు బెయిలు రాలేదు. విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై కోడి కత్తితో దాడిచేశాడన్న అభియోగంపై కోడి కత్తి శీను అప్పటి నుంచీ జైళ్లోనే మగ్గుతున్నాడు. మామూలుగా అయితే ఏ కేసులోనైనా సరే  ఆరు నెలల తరువాత మామూలుగానే బెయిలు వచ్చేస్తుంది. అయితే అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న ఒకే ఒక్క కారణం చేత అప్పట్లో జగన్ ఈ కేసు విచారణ ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) చేపట్టాలని పట్టుబట్టి సాధించుకున్నారు.  సాధారణంగా ఎన్ఐఏ ఉగ్రవాద కేసులను మాత్రమే చేపడుతుంది. ఈ కేసులలో బెయిలు రావడం అంత తేలిక కాదు. దాంతో కోడికత్తి కేసు ఎన్ఐఏ చేపట్టడం.. విచారణ ముగింపు దశకు వచ్చినా బాధితుడిగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్ అందుకు విముఖంగా ఉండటంతో కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నారు. గతంలో ఒక సాయి బెయిలు మంజూరైనా ఎన్ఐఏ గట్టిగా అభ్యంతరం చెప్పడంతో రద్దైంది.  ఇప్పుడు కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తేల్చేసింది. జగన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే ఇక కేసే ఉండని పరిస్థితి. ఈ స్థితిలో జగన్ ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు సరిగా చేయలేదనీ, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యం చేసే వ్యూహాలను జగన్ అవలంబిస్తున్నారని కోడికత్తి శీను తరఫు లాయర్ అంటున్నారు. ఈ దశలో విజయవాడ నుంచి ఈ కేసు దర్యాప్తును విశాఖకు మార్చారు.   తాజాగా కోడికత్తి శీను బెయిలు పిటిషన్ విచారించిన విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు ఈ కేసులో బెయిలు ఇచ్చే అధికారం తమకు లేదనీ, బెయిలు కోసం హైకోర్టుకు వెళ్లాలనీ సూచించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోడికత్తి శీను తల్లి రెండు మార్లు లేఖలు రాసిన సంగతి విదితమే. అయితే ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. ఇదేళ్ల పాటు జైల్లో మగ్గిన కోడికత్తి కేసు నిందితుడు శీను ఇప్పుడు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించడం వినా మరో మార్గం లేదు. అక్కడ కూడా జగన్ ఎన్ఐఏ కోర్టులో బాధితుడిగా వాంగ్మూలం ఇస్తే తప్ప బెయిలు మంజూరయ్యే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.  
Publish Date: Sep 23, 2023 10:27AM

డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టమే ఎక్కువ

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఉభ సభలు ఆమోదించాయి. అన్ని పార్టీలు ఏకమై మరీ బిల్లుకు  ఆమోద ముద్ర వేశాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు, మేథావులు మహిళా రిజర్వేషన్   చట్టం అమలుకు, జనగణన, డీలిమిటేషన్ (అసెంబ్లీ,లోక్ సభ,నియోజక వర్గాల పునర్విభజన)తో  ముడిపెట్టి,  ఏకంగా ఐదేళ్ళు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరే  ఆ విషయంలో చివరకు ఏమి జరుగుతుందనేది పక్కన పెడితే, ఇప్పడు కొత్తగా డీలిమిటేషన్ పై  రాజకీయ వివాదం తెరపై కొస్తోంది. ముఖ్యంగా లోక్ సభ నియోజక వర్గాల డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుంది.   మరీ ముఖ్యంగా, రాష్ట్ర విభజ చట్టంలో హామీ ఇచ్చిన విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తక్షణమే నియోజక వర్గాల పునర్విభజన జరగాలని అప్పటి నుంచి కోరుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు జనభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే,ఉభయ తెలుగు రాష్ట్రాలకు నష్టమే జరుగుతుందని విమర్శిస్తూ ఉమ్మడి పోటానికి పిలుపు నిస్తోంది.   ఇప్పటికే ఉత్తరాది డామినేషన్ అనుభవిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు మరింతగా  నష్ట పోతాయని,  దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మరింత వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతేకాదు దక్షిణాది రాష్టాల ప్రజలు దేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్స్ (రెండవ తరగతి పౌరులు) గా అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే  రాజకీయాలకతీతంగా దక్షిణాది నేతలంతా ఈ విషయంలో ఏకమై పోరాటం చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కల్వకుంట్ల తారక రామారావు పిలుపు నిచ్చారు.  కేంద్రం తీసుకుంటున్న ఈ విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలైన కేరళ ,తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయని లోక్ సభలో  వీటి ప్రాతినిధ్యo తగ్గిపోతుందని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఇందుకు ఉదాహరణగా  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతమున్న 44 లోక్ సభ నియోజక వర్గాల సంఖ్య, 36 తగ్గుతుందని అంటే, తెలుగు రాష్ట్రాలు ఎనిమిది శానాలు కోల్పోతాయని, దీంతో పార్లమెంట్ లో తెలుగు గళం బలహీనపడుతుందనిఅంటున్నారు.  అలాగే, కేరళ,(8) తమిళనాడు,(8) కర్ణాటక (2) పశ్చిమ బెంగాల్ (4) ఇలా  దక్షిణాది రాష్ట్రాలలో నియోజక వర్గాల  సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మరో వంక ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగిన కారణంగా చాలా వరకు రాష్ట్రాలలో నియోజక వర్గాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు.  ఒక్క  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రస్తుతమున్న 80 నియోజక వర్గాల సంఖ్య 11 పెరిగి 91 చేరుకుంటుంది.  నిజానికి  డీలిమిటేషన్  తర్వాత నియోజక వర్గాల సంఖ్య అన్ని రాష్ట్రాలలో  పెరగాలి కానీ, డీలిమిటేషన్ కు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వలన జనాభా నియత్రణ పాటించిన ప్రగతి శీల రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. జనాభా నియంత్రణ పాటించడంతో పాటుగా జనాభాల్లో 18 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు   స్థూల జాతీయ ఉత్పత్తికి 35 శాతం నిధులు అందిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ప్రగతిశీల విధానాలను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ రకమైన బహుమతి సరైనది కాదని అంటున్నారు.కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడం కోసమే కేంద్రం ఇలాంటి విధానాలను ప్రతిపాదిస్తున్నదని నేతలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు ఇసుమంతైనా స్టేక్ లేని దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిథ్యం తగ్గించడమే లక్ష్యం, అదే సమయంలో తమ బలం ఎక్కువగా ఉన్నచోట మరిన్ని సీట్లు పెంచి తద్వారా దీర్ఘకాలం అధికారంలోకి ఉండాలనే స్వార్థ ప్రయోజనాల కోసమే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను తెరమీదకు తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అయితే, ఇంకా ఇప్పటి వరకు డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు జరగ  లేదు. అంతకు ముందు జరగ వలసిన జనగణన ఇంత వరకు మొదలు కాలేదు.. ఈ ప్రక్రియ మొదలయ్యేందుకే .. మరో సంవత్సరకాలం  పడుతుంది. అన్నీ సక్రమంగా జరిగితే, మరో మూడేళ్ళ తరవాత 2026- 27 నాటికి కానీ  ఈ ప్రక్రియ పూర్తి కాదు .. ఈ లోగా ఏమైనా  జరగ వచ్చును. అయితే కేంద్రం ప్రతిపాదించిన జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ మాత్రం కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను బలహీన పరచి, వారి గళం లోక్ సభలో, రాజ్యసభలో వినపడకుండా చేయాలన్న దురుద్దేశంతో చేసిందేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
Publish Date: Sep 22, 2023 6:33PM

బాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ వార్త విని గుండె ఆగి మరణించిన టీడీపీ కార్యకర్త

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు,  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఎక్కడి కక్కడ నిరశన దీక్షలు చేస్తున్నారు. అలాగే  తెలుగునా  తెలుగు దేశం పార్టీని ఇంటి పార్టీగా, చంద్రబాబును ఇంటి ఇలవేలుపుగా ఆరాధించే ప్రజలు, అభిమానులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రాణాలు ఇచ్చేందుకు అయినా సిద్దమనే రీతిలో దీక్షలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టును జీర్ణించుకోలేని పలువురు  ఆ బాధలో కన్ను ముస్తున్నారు.  చంద్రబాబు అరెస్ట్ అయిన నాటి నుంచి ఇంతవరకు పదుల సంఖ్యలో   చంద్రబాబు అభిమానులు మనస్తాపంతో కన్ను మూశారు.  తాజాగా ఏపీ హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిందన్న వార్త వినగానే ఆయన మరి కొన్ని రోజులు జైలులోనే ఉండకతప్పదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల కిందట చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసినప్పటి నుంచి తీర్పు అనుకూలంగా ఉంటుందని, ఆయన బయటకు వస్తారని ఆశతో ఎదురు చూస్తూ అదే విషయాన్ని అడిగిన వారికీ అడగని వారికీ కూడా చెబుతూ వస్తున్న చిత్తూరు జిల్లా ఒంటిమిట్టకు చెందిన తెలుగుదేశం కార్యకర్త శ్రీనివాసులు నాయుడు తీవ్ర మనస్తాపానికి లోనై గుండెపోటుతో మరణించారు. శ్రీనివాసులు నాయుడు మృతదేహానికి నివాళులర్పించిన తెలుగుదేశం నేతలు ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, ఆదుకుంటామని చెప్పారు. 
Publish Date: Sep 22, 2023 5:28PM

ఒక్క నాటికీ క్షమించరు.. ఒక్క శాతం దాట నీయరు!

బీజేపీ,తెలుగు దేశం లు చిరకాల మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయినా,  ఆ రెండు పార్టీలు మళ్ళీ అన్ని సార్లు కలిసి ఒకటయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృమిత్ర  సంబంధాలు, తారు మారైన సందర్భాలు చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి. అంతే కాదు అప్పట్లో, ఉభయ పార్టీల నేతలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఆ సమయంలోనే,  వాజ్ పేయి, అద్వానీ, వెంకయ్య నాయుడు వంటి బీజేపీ అగ్రనేతలు అనేక సందర్భాలలో టీడీపీని  విశ్వసనీయ మిత్ర పక్షంగా, చంద్రబాబును విశ్వనీయ మిత్రునిగా పేర్కొన్నారు. గౌరవించారు.  టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు బీజేపీని, బీజేపీ నాయకులను అదే విధంగా గౌరవించారు.అలాగే రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ప్రతి సందర్భంలోనూ ఉభయతారకంగా రెండు పార్టీలూకూ  లబ్ధి చేకూరింది. రెండు పార్టీలూ ప్రయోజనం పొందాయి. రాష్ట్ర విభజన తర్వాత ఉభయ పార్టీలూ కలిసి పోటీ   చేయడమే కాదు కేంద్ర, రాష్టం మంత్రి వర్గాలాలలో భాగస్వాములయ్యాయి.  అయితే  అదంతా చరిత్ర. ఒకప్పటి మాట. నిజానికి  ఒక్క తెలుగు దేశం పార్టీని, పార్టీ నాయకులను మాత్రమే కాదు, ఇతర మిత్ర పక్షాలను, మిత్ర పక్షాల నాయకులను కూడా వాజ్ పేయి, అద్వానీ నాయకత్వంలో  పనిచేసిన బీజేపీ నాయకులు గౌరవించారు. సంకీర్ణ ధర్మాన్ని చక్కగా పాటించారు. అందుకే  ఆనాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి, 1999 నుంచి 2004 వరకు ఐదేళ్ళ పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని చక్కగా  నడిపించారు. అంతవరకు కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు  సుస్థిర పాలన ఇవ్వలేవన్న ఆనాటి కాంగ్రెస్ నాయకుల విశ్వాసాన్ని వాజ్ పేయి  వమ్ము చేశారు. సరే  ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిం నుకోండి అది వేరే విషయం.   అయితే  బీజేపీ ప్రస్తుత నాయకత్వం ,(మోడీ షా జోడీ) మిత్ర పక్షాలకు గౌరవం ఇవ్వక పోవడమే కాదు, అవకాశం చిక్కితే మిత్ర పక్షాల అడ్రస్ గల్లంతు చేసేందుకు వెనకాడేది  లేదని చేతల్లో చూపిస్తున్నది. అందుకే, సిద్దాంత సారూప్యం ఉన్న శివ సేన, అకాలీ దళ్, ఒకప్పుడు బీజేపీ అగ్రనేతలే  విశ్వనీయ మిత్ర పక్షంగా మెచ్చుకున్న టీడీపీ సహా అనేక మిత్ర పక్షాలు బీజేపీకి దూరమ య్యాయి.ఇప్పుడుకేంద్రంలో ఉన్నది పేరుకు మాత్రమే ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వం. మోదీ మంత్రివర్గంలో  మిత్ర పక్షాలకు పెద్దగా స్థానం లేదు. మిత్ర పక్షాల నుంచి కాబినెట్ లో స్థానం దక్కిన మంత్రులకు పెద్ద ప్రాముఖ్యత లేదు. వాస్తవానికి మోడీ కేబినెట్ లో   అమిత్ షా మినహా మిగిలిన మంత్రులెవరికీ పెద్దగా ప్రాధాన్యత, ప్రాముఖ్యతా లేదు.    ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే  రాష్ట్రంలో బీజేపీకి నిండా ఒక్క శాతం ఓటు కూడా లేదు. ప్రత్యేక హోదా విషయంలో ఇచ్చిన మాట తప్పిన బీజేపీతో తెలుగుదేశం తెగతెంపులు చేసుకున్న నేపధ్యంలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నోటాతో పోటీ పడింది. బీజేపీకి నిండా ఒక శాతం ఓట్లు కూడా రాలేదు. అయినా  కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని, రాష్ట్రంలో చక్రం తిప్పేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలు పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా మాజీ మిత్ర పక్షం తెలుగుదేశం అడ్డు తొలిగించి ఆ తర్వాత వైసీపీనీ టార్గెట్ చేసే దీర్ఘకాల వ్యూహంతో పావులు కదుపుతున్నారు. ఆ వ్యూహంలో  భాగంగానే, బీజేపీ జాతీయ నాయకత్వం  ఓ వంక ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని కేసుల నుంచి రక్షిస్తూ మరో వంక వైసేపీ సర్కార్  బుజం మీద తుపాకీ పెట్టి టీడీపీని మట్టు పెట్టే కుట్రలు పన్నుతున్నది. అందులో భాగంగానే  చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో బీజేపీ అగ్ర నాయకత్వం, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా, చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ విషయంలో తెర వెనక కథ నడుపుతున్నది కేంద్రంలోని కమల దళమే అయినా తెర ముందు మాత్రం రాష్ట్ర నేతలతో మరో రకం డ్రామాను నడిపిస్తోందనే నిన్నటి అనుమానాలు, ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పడు  వాస్తవం అని తేలిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పరిశీలకుల విశ్లేషణలే కాదు సామాన్య జనం కూడా అదే అనుకుంటున్నారు. ఇంతవరకూ జనసేనతో కలిసి  తెలుగుదేశంతో పొత్తుపెట్టుకుని  వైసేపీని గద్దె దించడంలో బీజేపీ తమ వంతు పాత్రను పోషిస్తుందని అనుకున్న, ఆశించిన విశ్లేషకులు సైతం ఇప్పుడు బీజీపే అసలు రంగు బయట పడిందని అంటున్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో వామ్మో  బీజేపీ క్రిమినల్ బ్రెయిన్ మరీ ఇంత షార్పా అని విస్తుపోతున్నారు. అంత క్రిమినెల్ బ్రెయిన్ ఉంది కనుకనే జగన్ ను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని ఆడమన్నట్లల్లా ఆడేలా చేసుకోగలిగారని అంటున్నారు. అయితే ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు , కుతంత్రాలకు పాల్పడినా, ప్రత్యేక హోదా సహా, ఇచ్చిన విభజన హామీలు ఏవీ నెరవేర్చక పోగా, వైసీపీ అరాచక,అవినీతి ప్రభుత్వానికి, ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని రాష్ట్ర ప్రజలు ఒక్క నాటికీ క్షమించరనీ,  ఒక్క  శాతం ఓటుకు మించి రానీయరనీ అంటున్నారు.  
Publish Date: Sep 22, 2023 5:02PM

రాజమహేంద్రవరం జైలులోనే విచారణ.. ఏసీబీ కోర్టు విస్పష్ట ఆదేశం

ఏసీబీ కోర్టు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సిల్ స్కామ్ కేసులో రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ గురువారం (అక్టోబర్22)న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. చంద్రబాబునాయుడిని రాజమహేంద్రవరం జైలులోనే విచారించాలనీ, ఆయనను మరో చోటుకు తరలించడానికి వీల్లేదని షరతు విధించింది. కాగా సీఐడీ చంద్రబాబును ఐదురోజుల పాటు తమ కస్టడీకి అనుమతించాలని కోరినప్పటికీ  ఏసీబీ కోర్టు మాత్రం రెండు రోజులకు మాత్రమే అనుమతించింది. అలాగే చంద్రబాబు తరఫున ఇద్దరు న్యాయవాదులు కూడా విచారణ సమయంలో ఉండేందుకు అనుమతించింది. అదే విధంగా  ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు వరకూ మాత్రమే విచారించాలని ఆదేశించింది. ఇక విచారణను వీడియోరికార్డింగ్ చేయాలని ఆదేశిస్తూనే..  సంబంధించి ఫొటోలు, వీడియోలూ లీకు కాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.  విచారణకు సంబధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవర్ లో అందజేయాలని ఏసీబీ కోర్టు తన ఆదేశాలలో పేర్కొంది. 
Publish Date: Sep 22, 2023 4:25PM