కేటీఆర్ దృష్టికి మెడికల్ స్టూడెంట్స్ సమస్య

 

మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలలో అర్హత సాధించినప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్ధానికత జీవో కారణంగా ప్రవేశాలకు అనర్హులుగా మిగిలి పోతున్న తెలంగాణ విద్యార్థుల ఆవేదనపై  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకు రావడానికి తెలంగాణ భవన్‌కు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కేటీఆర్ సమావేశమయ్యారు. 

కొత్తగా అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికతకు సంబంధించి ఒక ఇబ్బందికరమైన జీవోను తీసుకు వచ్చిందని విద్యార్థులు కేటీఆర్‌కు తెలిపారు. గతంలో పదవ తరగతి వరకు 7 సంవత్సరాలు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులుగా పరిగణించే నిబంధన ఉండేదని, అయితే, ఇప్పుడు 9, 10, 11, 12 తరగతులు వరుసగా చదివిన వారికే స్థానికత వర్తిస్తుందని, వారికే మెడికల్ సీట్ల అడ్మిషన్లు దక్కుతాయని కొత్తగా ఇచ్చిన ఆదేశాల వల్ల వందల మంది విద్యార్థులు నష్ట పోతున్నారని వారు వివరించారు. 

పదో తరగతి వరకు తెలంగాణలో చదివిన తర్వాత, అత్యుత్తమ శిక్షణ కోసం ఆంధ్రాతో పాటు అనేక నాన్-తెలుగు రాష్ట్రాలలో కోచింగ్‌లు తీసుకుని నీట్ పరీక్షలకు సన్నద్ధమయ్యారని, ఇప్పుడు ఆ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్హత సాధించి నప్పటికీ, ప్రభుత్వం వారిని అనర్హులుగా ప్రకటించి ప్రవేశాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం మొండిగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందని వారు తెలిపారు.

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను సవివరంగా విన్న కేటీఆర్, వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమస్యను సానుకూలంగా పరిశీలించాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ  దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్రతినిధి బృందం రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తుందని తెలిపారు.

కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పాలసీ పరమైన మార్పులు లేదా స్థానికతకు సంబంధించిన అర్హతలను మార్చినప్పుడు, వాటిని గతానుగతంగా కాకుండా భవిష్యత్తు కోసం ఒక కటాఫ్ డేట్ పెట్టి, రెండు లేదా మూడు సంవత్సరాల సమయం ఇచ్చి అలాంటి నిబంధనలు తీసుకు వస్తే బాగుంటుందని సూచించారు. 

కానీ, విద్యార్థులు అప్పటికే తమ ఇంటర్మీడియట్ కోసం ఇతర ప్రాంతాల్లో చదువుతూ, ప్రిపేర్ అవుతున్న వారిని పరిగణన లోకి తీసుకోకుండా ఇచ్చిన ఆదేశాల వల్లనే ఈ పరిస్థితి నెలకొందని కేటీఆర్ అన్నారు. ఈ అంశంలో మానవతా కోణంలో నిర్ణయం తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకొని విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu