మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్?!
posted on Nov 18, 2025 9:59AM
.webp)
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. హిడ్మా తలపై కోటి రూపాయలకు పైగా రివార్డు ఉన్న సంగతి తెలిసిందే. ఇంత కాలంగా భద్రతా దళాలు, పోలీసులను ముప్పతిప్పలు పెడుతూ మావోయిస్టు ఉద్యమంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్న హిడ్మా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతమైనట్లు తెలిసింది. ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మా తో పాటు మరో ఐదుగురు మావోలు కూడా హతమైనట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి టైగర్ జోన్ లో మంగళవారం (నవంబర్ 18) ఉదయం మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ మరణించారు. ఈ ప్రాంతంలో నక్సల్ అగ్రనేతలు ఉన్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
మృతుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వీధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసుల కూబింగ్ ఇంకా సాగుతోందని తెలుస్తోంది.