విమానాల రద్దు సమస్యకు చెక్.. ఆ నిబంధనను ఉపసంహరణ
posted on Dec 5, 2025 1:53PM

ఇటీవలి కాలంలో ఇండిగో విమానాలు వరుసగా రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానయాన కార్యకలాపాలు నిలకడగా కొనసాగేందుకు పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పలు విమానయాన సంస్థల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ పైలట్ల విధులపై విధించిన ఇటీవల విధించిన ఆంక్షలను సడలించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మునుపటి మార్గదర్శకాల్లో పైలట్లకు తప్పనిసరిగా వారపు విశ్రాంతికి బదులుగా సెలవు మంజూరు చేయరాదు అన్న కండీషన్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఆ నిబంధనను సమీక్షించి ఉపసంహరించింది.

ఈ నిర్ణయంతో ఇండిగో సహా పలు విమానయాన సంస్థలకు ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పైలట్ల వారాంత విశ్రాంతి నిబంధన సడలించడం వల్ల డ్యూటీ రోస్టర్లను సులభంగా నిర్వహించుకోవచ్చని, దీంతో విమాన రద్దుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు. మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 84 ఇండిగో విమానాలు క్యా న్సెల్ అయ్యాయి.
వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దయ్యాయి.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం...శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లాల్సిన మొత్తం 155 ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.