టీటీడీ మాజీ చైర్మన్ భూమనకు నోటీసులు.. ఎందుకంటే?
posted on Nov 25, 2025 11:40AM

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి సీఐడీ నోటీసులు పంపింది. శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో మంగళవారం (నవంబర్ 25) సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు.
2023 ఏప్రిల్ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అప్పటి టీటీడీ ఏవీఎస్వోగా పనిచేసిన సతీశ్ కుమార్ ఫిర్యాదు మేరకు తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. కేసు దర్యాప్తు జరుగుతుండగా విచారణకు వస్తున్న ఫిర్యాది దారు, టీటీడీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుకు సంబంధించి టీటీడీ అప్పటి వీజీవో గిరిధర్, ఏవీఎస్వో పద్మనాభంను సీఐడీ అధికారులు సోమవారం (నవంబర్ 24) ప్రశ్నించారు. ఇప్పుడు తాజాగా భూమనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు.