యథావిథిగా ఆరోగ్య శ్రీ సేవలు
posted on Sep 18, 2025 9:32AM
.webp)
తెలంగాణలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులలో మంగళవారం అర్దరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేసినట్టుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ చేసిన ప్రకటనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఖండించింది. తెలంగాణలోని దాదాపు 87 శాతం ప్రైవేట్ ఆసుపత్రులు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద సేవలను కొనసాగిస్తున్నాయని పేర్కొంది. కేవలం 13 శాతం ఆసుపత్రుల్లోనే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని తెలిపింది.
ఈ నెల 16 నుంచి టీఎన్హెచ్ఏ సమ్మె పిలుపునిచ్చిన తర్వాత కేవలం 13 శాతం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రమే ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయనీ, ఆ ఆస్పత్రులు కూడా ఆరోగ్య శ్రీ స ేవలు కొనసాగించాలని రాష్ట్ర ఆరోగ్య శ్రీ సీఈవో ఉదయ్ కుమార్ కోరారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులలో... గత రెండు వారాలలో రోజుకు సగటున 844 శస్త్రచికిత్సలు జరుగుతుండగా, బుధవారం (సెప్టెంబర్ 17) 799 శస్త్రచికిత్సలు జరిగాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అనుసంధాన ఆస్పత్రులు 477 వరకు ఉండగా, వాటిలో 415 ఆస్పత్రులలో సేవలు యథావిథిగా కొనసాగుతున్నాయని... కేవలం 62 ఆస్పత్రులలో మాత్రమే సేవలు నిలిచిపోయాయని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.