జగన్ పై దాడి.. ఏ-1 చంద్రబాబు, ఏ-2 డీజీపీ.!!
విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ అధినేత జగన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అసలు ఈ దాడి వెనుకున్న కోణాలేంటో ఇంకా పూర్తిగా బయటికిరాలేదు కానీ.. వైసీపీ నేతలు మాత్రం దాడికి కారణం టీడీపీనే అన్నట్టుగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ తీసుకొని.. అదే స్థాయిలో సమాధానాలు చెప్తూ.. ప్రశ్నలు సంధిస్తూ.. విచారణ జరిపి అసలు ఈ దాడి వెనుక ఎవరి కుట్ర ఉందో బయటపెడతామని స్పష్టం చేసింది. అయినా వైసీపీ నేతలు టీడీపీ ప్రభుత్వం మీద విమర్శలు ఆపట్లేదు.
తాజాగా వైసీపీ నేత మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి టీడీపీ ప్రభుత్వం మీద, వైసీపీ మీద విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ప్రమేయం లేకుండానే జగన్పై దాడి జరిగిందా? అని ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావు టీడీపీకి చెందిన వ్యక్తి క్యాంటిన్లో పనిచేస్తున్నాడని.. శ్రీనివాసరావును వైసీపీ అభిమానిగా చిత్రీకరించడానికి టీడీపీ ప్రయత్నించిందని ఆరోపించారు. 11 నెలల క్రితం పెట్టిన ఫ్లెక్సీని ఇప్పుడు తెరపైకి తెచ్చారని, ఆరు నెలలుగా టీడీపీలో ఉన్నామని శ్రీనివాసరావు సోదరుడు చెప్పాడని వైవీ తెలిపారు. శ్రీనివాసరావు వద్ద ఉన్న లెటర్ రాత్రి 10 గంటలకు విడుదల చేయడమేంటని, ఫ్లెక్సీ మాదిరిగానే లెటర్ కూడా టీడీపీ వాళ్లే సృష్టించారని ఆరోపించారు. గత ఆరు నెలల్లో శ్రీనివాసరావు కుటుంబానికి రెండు లోన్లు ఇచ్చారని ఆరోపించారు. ఆపరేషన్ గరుడ స్క్రీన్ ప్లే డైరెక్షన్ చంద్రబాబుదేనని, ఆపరేషన్ గరుడపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని వైవీ అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు స్పందించిన తీరును చూసి జనం అసహ్యించుకుంటున్నారని, అలిపిరి ఘటన జరిగినప్పుడు వైఎస్ ఎలా స్పందించారో అందరికీ తెలుసని వైవీ అన్నారు. ఇప్పుడు జగన్పై దాడి జరిగితే చంద్రబాబు ఎలా స్పందిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని, జగన్ మెరుగైన వైద్యం, భద్రత కోసమే విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చారని తెలిపారు. జగన్పై దాడి ఘటనలో ఏ-1 చంద్రబాబు, ఏ-2 డీజీపీ అని ఆరోపణ చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని, రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదని అన్నారు. థర్డ్ పార్టీ ఏజెన్సీతో విచారణ జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.