ఎన్నికల నేపథ్యంలో రేవంత్ కు భద్రత పెంపు

  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొన్ని రోజుల క్రితం తనకు ప్రాణ హాని ఉందని భద్రత పెంచాలని ఈసీని కోరారు.ఈసీ దీనిపై స్పందించకపోవటంతో ఆయన  హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేసీఆర్ అవినీతిని ప్రశ్నించినందుకు తన ప్రాణాలకు ముప్పు ఉందని, కావున భద్రత పెంచాలని కేంద్ర హోంశాఖ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని కోరుతూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.పిటిషన్ స్వీకరించిన హైకోర్టు రేవంత్‌రెడ్డికి భద్రత కల్పించే విషయంలో వైఖరి ఏమిటో తెలియచేయాలని గత వారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని, కేంద్ర హోంశాఖను ఆదేశించింది.భద్రత విషయంలో రేవంత్‌రెడ్డి పెట్టుకున్న వినతిపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసింది.ఎన్నికల నోటి ఫికేషన్‌ వెలువడిన తరువాత భద్రత కల్పించాల్సిన బాధ్యత ఎవరిదో కూడా చెప్పాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆదేశించింది.ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఈసీ గడువు కోరగా అందుకు హైకోర్టు అనుమతించింది.దీనిపై తాజాగా విచారణ చేపట్టిన హైకోర్టు రేవంత్ రెడ్డి కోరిన విధంగా 4 ఫ్లస్ 4 భద్రత కల్పించాలని ఈసీ, కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.అయితే భద్రతకు అయ్యే ఖర్చును రేవంత్ రెడ్డే భరించాలని హైకోర్టు తెలిపింది.

హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు తీర్పు ఏపీకి సానుకూలం

  ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనాలు నిర్మాణం పూర్తయ్యేవరకు హైకోర్టును ఎందుకు విభజించకూడదంటూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.దీనిలో భాగంగా రెండ్రోజుల క్రితమే ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌ కోర్టుకు సమర్పించింది.అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవనాల నిర్మాణం డిసెంబరు 15లోగా పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత నోటిపికేషన్‌ విడుదల చేస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది నారీమన్‌ ఇదే విషయాన్ని ఈరోజు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైందని ఏపీ తరపు న్యాయవాది నారీమన్‌ వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం తరుపున వాదించిన న్యాయవాది వేణుగోపాల్‌.. ఏపీ ప్రభుత్వం అంత స్పష్టంగా చెబుతున్నందున భవన నిర్మాణాలకు సంబంధించి ఫోటోలను న్యాయస్థానానికి అందజేయాలని కోరారు.ఇరువురి వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి సానుకూలంగా తీర్పునిచ్చింది.అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.విభజన జరుగకుండా కొత్త జడ్జీల నియామకం చేపడితే మళ్లీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కాబట్టి.. వీలైనంత త్వరగా విభజన పూర్తైతే మంచిదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది..

జగన్ పై దాడిలో శివాజీ హస్తం

  ఏపీ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వంపై 'ఆపరేషన్ గరుడ' జరుగుతోందంటూ హీరో శివాజీ చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. 'ఆపరేషన్ గరుడ'లో భాగంగా తమ అధినేత జగన్ పై దాడి జరుగుతుందని శివాజీకి ముందే ఎలా తెలుసని తన ఫిర్యాదులో ప్రశ్నించారు. జగన్ పై జరిగిన దాడిలో శివాజీ హస్తం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు.శివాజీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనను కూడా విచారించాలని కోరారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ కు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ లు ఫిర్యాదు చేశారు.     ‘‘సీబీఐ కేసులు తెరవడం, ఆ పార్టీకి చెందిన వారి ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, చక్రబంధంలో ఇరికించడం, 2019 నాటికి ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఆపరేషన్‌ గరుడ లక్ష్యం. దీనికోసం రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మరో ముఖ్య పార్టీని, కొత్త పార్టీని ఉపయోగించుకుంటారు. ఈ వ్యూహంలోకి కొందరు అభిమన్యుల్లా ప్రవేశిస్తారు. ఇలా వచ్చేవారిలో ఒక కొత్త నాయకుడూ ఉన్నారు. ఇప్పటికే ఉన్న ముఖ్యపార్టీ నాయకుడిపైన ఇప్పటికే గుంటూరు, హైదరాబాద్‌లో రెక్కీ నిర్వహించారు. ఆయనకు ప్రాణహాని లేకుండా దాడి జరుగుతుంది. ఈ దాడివల్ల రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి’’ అని శివాజీ చెప్పిన విషయం తెలిసిందే.

ఏపీ టూ ఢిల్లీ కత్తి పంచాయితీ

  విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ పై శ్రీనివాస రావు అనే వ్యక్తి కోడి పందేలలో ఉపయోగించే కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ దాడి పై విచారణ చేపట్టిన ఏపీ పోలీసులు వాంగ్మూలం కోసం జగన్ ను సంప్రదించగా ఆయన ఏపీ పోలీసులపై నమ్మకం లేదని స్పష్టం చేశారు. విచారణ బాధ్యతలను ఏదైనా దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలని డిమాండ్ చేశారు.జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు కేంద్ర హోమ్ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు.జగన్‌పై జరిగిన దాడి ఘటనను కేంద్ర దర్యాప్తు సంస్థలో విచారణ చేయించాలని రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.సమావేశ అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై దాడి జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఘటన విమానాశ్రయంలో జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది కేంద్రం పరిధిలోని అని చెప్పారు. నిందితుడు ప్రచారం కోసమే దాడికి పాల్పడ్డాడని డీజీపీ చెప్పారు.ఈ ఘటనపై తెదేపా నేతలు, మంత్రులు వ్యవహరించిన తీరు సరిగా లేదు.వీటన్నింటిని రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించామన్నారు.దీనిపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు.రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన వారిలో విజయసాయిరెడ్డి, మేకపాటి, వైవీ సుబ్బారెడ్డి తదితరులున్నారు.

కుప్పకూలిన విమానం.. 189 మంది గల్లంతు

  ఇండోనేషియాలో విమానం గల్లంతయ్యింది. జకార్తా నుంచి టేకాఫ్ అయిన 13 నిమిషాలకే విమానం కనిపించకుండా పోయింది. రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో సముద్రంలో కూలిపోయిందని భావిస్తున్నారు. లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం పంగకల్‌ పిన్నాంగ్‌‌కు వెళ్లాల్సి ఉంది. ఇందులో మొత్తం 189 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్టు సమాచారం. వారంతా మరణించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జావా సముద్రంలో ప్రయాణికుల వస్తువులు, జెట్ విడిభాగాలు కనిపించడంతో విమానం కూలిందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. దాంతో విమాన శిథిలాల కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి.

అమరావతి నిర్మాణానికి తెలంగాణ తరపున 100 కోట్లు.!!

  హైదరాబాద్‌ నిజాంపేటలో ‘హమారా హైదరాబాద్‌’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఏపీలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారినుద్దేశించి.. అలాగే ఏపీ రాజధాని అమరావతి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ఇక్కడ ఉండే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు నా విజ్ఞప్తి. మీరందరూ నన్ను సోదరుడిగా భావించండి. మీ అందరికీ వ్యక్తిగతంగా అండగా ఉంటానని కేసీఆర్‌ కుమారుడిగా, టీఆర్‌ఎస్‌ నాయకుడిగా హామీ ఇస్తున్నా. పొరపాటున మీ మనసులో ఏమైనా అనుమానాలుంటే వాటిని పక్కకు పెట్టండి అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా కేసీఆర్‌ చేస్తున్న వ్యాఖ్యలు సీమాంధ్రులను ఉద్దేశించి కాదని, ఆయన విమర్శించింది చంద్రబాబునేనని స్పష్టం చేశారు. చంద్రబాబుతో టీఆర్‌ఎ్‌సకు అభ్యంతరాలు ఉన్నమాట వాస్తవమేనని, వాటిని ప్రజలు తమకు ఆపాదించుకోవద్దని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సాయం చేయాలనుకున్న విషయాన్ని కూడా కేటీఆర్‌ పంచుకున్నారు. అమరావతి నిర్మాణానికి తెలంగాణ తరపున రూ.100 కోట్లు ప్రకటించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. బహిరంగ సభలో ప్రకటించాలని భావించారు. అయితే అసలు ముందు కేంద్రం ఏమిస్తుందంటూ ఆయన ప్రధాన మంత్రి కార్యదర్శిని ఆరా తీయగా ‘కేవలం మట్టి, నీళ్లు మాత్రమే ఇస్తున్నామంటూ సమాధానం వచ్చింది. కేంద్రం ఇవ్వకుండా తెలంగాణ ఇస్తే వివాదం రాజుకునే ప్రమాదముందని గుర్తించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ మాతో రెండు విషయాలు పంచుకున్నారు. ఏపీ ప్రజలు సాదరంగా ఆహ్వానించి బ్రహ్మరథం పట్టారని ఆనందం వ్యక్తం చేశారు. కొత్త రాజధానికి ప్రధాని ఎలాంటి సాయం చేయకపోవడంపై కేటీఆర్‌ విస్మయం వ్యక్తం చేశారు.

టీడీపీ సానుభూతిపరులపై ఐటీ సోదాలు

  ఆంధ్ర ప్రదేశ్ లో గత కొంత కాలంగా ఐటీ దాడులు రాజకీయంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా టీడీపీ సీనియర్ నాయకుల నివాసాలు,కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.తాజాగా గుంటూరులో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.తెదేపా నేత, ఎల్వీఆర్‌ క్లబ్‌ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.రవీంద్ర ఇల్లు, కార్యాలయంతో పాటు అతిథి గృహంలోనూ సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 కార్లలో వచ్చిన ఐటీ అధికారులు రవీంద్రకు చెందిన పలు దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రవీంద్ర గ్యాస్‌, పెట్రోల్‌ బంకులు నిర్వహిస్తున్నారు. ఇందంతా గమనిస్తే గత పదిరోజుల క్రితం జిల్లాలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఇప్పుడు ఏకంగా టీడీపీ మద్దతు దారుల కార్యాలయాలపై సోదాలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. తొలుత వ్యాపార సంస్థలపై దాడులు చేసిన అధికారులు, రెండో విడతలో టీడీపీ మద్దతుదారులు, వారి వ్యాపారసంస్థలపై దృష్టిసారించినట్లు సమాచారం.

కేసీఆర్, మోదీకి జోస్యం చెప్పిన అమిత్ షా

  సికింద్రాబాద్ లోని పేరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన బిజెవైఎమ్ యువభేరీ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలలు కంటున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ కూటమికి నాయకుడంటూ లేరని,  అలాంటి  కూటమిని ప్రజలు నమ్మరని అన్నారు. 2019‌లో మోదీ మరోసారి  ప్రధాని కావడం ఖాయమని ఆయన  జోస్యం చెప్పారు. రాబోవు కాలంలో దేశంలో కాంగ్రెస్‌ ఆనవాళ్ల కోసం భూతద్దం పెట్టి చూడాల్సి వస్తోందన్నారు. ఏ అంశంలో చూసినా బీజేపీని ప్రశ్నించే అర్హత కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేదని విమర్శించారు. అంతే కాకుండా తెలంగాణా ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం మరచిపోయిందని అమిత్ షా అరోపణలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. తెలంగాణా విమోచన దినోత్సవాన్ని నిర్వహించి తీరుతుందని షా హామీ ఇచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం మారబోతోందని అమిత్ షా జోస్యం చెప్పారు.

విశాఖ మన్యంలో మావోల కదలికలు

  అరకు ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే సోమలను మావోలు హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.అయితే ఆ హత్యలపై స్పందించిన మావోలు "మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు ఆగిపోయాయని, కానీ ఎమ్మెల్యే కిడారి లేటరైట్‌, గ్రానైట్‌, రంగురాళ్ల క్వారీలను నిర్వహించారు. ఆ క్వారీలను నిలిపివేయాలంటూ ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు.ఈ సమస్యపై పోరాడుతున్న స్థానికులు, సంఘాలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది. ఈ అణచివేతకు ప్రతిఘటనగానే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలపై చర్య తీసుకొన్నాం’’ అని ప్రకటన విడుదల చేశారు.మరోమారు విశాఖ మన్యంలో మావోల పేరిట కరపత్రాలు, బ్యానర్లు కలకలం సృష్టిస్తున్నాయి.గూడెం కొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్‌ వద్ద తెల్లవారుజామున వీటిని పడేసినట్లు సమాచారం.కాఫీ తోటలపై పూర్తి హక్కు గిరిజనులదే అని, కాఫీ బోర్డును తరిమికొట్టాలని,చట్టాల ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే అయినప్పటికీ అంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ది సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు. బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టి గిరిజనుల బతుకులను నాశనం చేయడానికి పూనుకున్న అధికార తెదేపా, భాజపా నాయకులను మన్యం నుంచి తరిమి కొట్టాలని మావోలు ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు.ఈ ఘటనతో మన్యంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది.

తెలంగాణలో కంటి వెలుగు..కంటి పరీక్షలకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌

    తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,తెరాస అధినేత కేసీఆర్‌ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంతా కంటి వెలుగు పధకం ద్వారా ఉచిత కంటి పరీక్షలు,మందులు,ఉచిత కంటి ఆపరేషన్లు,కళ్ళద్దాలను అందజేశారు.తెరాస ప్రభుత్వం చేపట్టిన ఈ పధకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియాగం చేసుకున్నారు.పధకంలో భాగంగా మంత్రులు సైతం తమ కళ్ళకు పరీక్షలు చేయించుకొని పధకాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.కానీ ఇప్పుడు కేసీఆర్‌ మాత్రం కంటి, పంటి పరీక్షల కోసం ఢిల్లీ వెళ్తున్నారు.రాబోయే రోజుల్లో కేసీఆర్‌ తెరాస తరఫున అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండనున్నారు.ఈ మేరకు వైద్యుల సూచనతో పరీక్షల కోసం ఢిల్లీ వెళ్లినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.అయితే కేసీఆర్‌ కంటి పరీక్షలకు ఢిల్లీ వెళ్ళటంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.రాష్ట్ర ప్రజలందరికి వైద్యం చేయటానికి ఇక్కడ డాక్టర్లు ఉన్నారుగాని మన ముఖ్యమంత్రికి మాత్రం వైద్యం చేయటానికి డాక్టర్లు లేరా? అని పలువురు ఛలోక్తులు విసురుతున్నారు.మరికొందరైతే కంటి పరీక్షలకు ఢిల్లీ వెళ్తున్నారా లేక రహస్య రాజకీయ పర్యటనా? అని తమ సందేహాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనకు ఖరారైన ముహూర్తం

  సెప్టెంబర్‌ 6న రాష్ట్ర ప్రభుత్వం రద్దైన రోజే తెరాస తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా.. తెరాసను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమిలోని పార్టీలు కూడా సీట్ల కేటాయింపు అంశం త్వరగా తేల్చాలంటూ పలు సందర్భాల్లో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమిలోని ఏ పార్టీకి ఎన్నెన్ని సీట్లు కేటాయిస్తారో.. కాంగ్రెస్‌ ఎన్ని సీట్లలో బరిలోకి దిగుతుందో అని అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసింది.నవంబర్‌ 1న అభ్యర్థుల జాబితాతో పాటు, పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించింది.అభ్యర్థుల ఎంపికకు తుదిరూపం ఇచ్చేందుకు పార్టీ సీనియర్‌ నేతలతో ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీ భేటీ అయింది.దీంతో జాబితాపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది.

ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్‌‌ అమలయ్యేది ఎక్కడ?

  కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్‌‌ డిమాండ్‌ను తమ ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని భాజపా చెప్పుకుంటోన్న విషయం తెలిసిందే.అయితే, ఇది సరిగ్గా అమలు కావట్లేందంటూ కొందరు మాజీ సైనికులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఢిల్లీలోని తమ పార్టీ ప్రధాన కార్యాలయంలో వారితో సమావేశమై, ఓఆర్‌ఓపీతో పాటు జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులు, సైనికుల సంక్షేమం వంటి అంశాలపై చర్చించారు.సమావేశ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ..‘ఈ రోజు జరిగిన సమావేశంలో.. చాలా ఉపయోగపడే విషయాలను చర్చించాం. దీని ద్వారా కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓఆర్‌ఓపీని ప్రధానమంత్రి మోదీ అమలు జరపడం లేదని, మాజీ సైనికులు స్పష్టంగా తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను చక్కదిద్దే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించడం లేదు. దీనీ వల్ల మన జవాన్లు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మరోవైపు రఫేల్‌ ఒప్పందంలోని అవకతవకలు బయటపడుతున్నాయి. ఓ పారిశ్రామిక వేత్తకు మోదీ రూ.30,000 కోట్లు ఇచ్చారు.కానీ,దాని వల్ల దేశానికి ఏ ప్రయోజనమూ లేదు. మరోవైపు, మాజీ సైనికుల కోసం ఓఆర్‌ఓపీని మాత్రం అమలు చేయట్లేదు’ అని విమర్శించారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఓఆర్‌ఓపీతో పాటు సైనికుల డిమాండ్‌లన్నింటినీ అమలు చేస్తుంది. రఫేల్ విషయంలో ఓ పారిశ్రామికవేత్తకు ఇచ్చిన రూ.30,000 కోట్ల కన్నా ఓఆర్‌ఓపీ అమలు చేయడానికి కేటాయించాల్సిన బడ్జెట్‌ తక్కువగానే ఉంటుంది’ అని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

కత్తికి విషం పూసారనేది అపోహ మాత్రమే

  విశాఖపట్నం విమానశ్రయంలో ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ పై ఓ వ్యక్తి కోడి పందేలలో ఉపయోగించే కత్తితో దాడి చేసిన సంఘటన విదితమే.ఈ దాడిలో జగన్ భుజానికి గాయం అవ్వగా విమానాశ్రయంలోని అపోలో వైద్యులు చికిత్స అందించారు.అనంతరం హైదరాబాద్ వెళ్లిన జగన్ సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నారు. సిటీ న్యూరో హాస్పిటల్ చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన జగన్ లోటస్ పాండ్ కు చేరుకున్నారు. కాగా దాడి జరిగింది కోడి పందేలలో ఉపయోగించే కత్తి కావటంతో విషం పూశారేమోననే అనుమానంతో జగన్ బ్లడ్ శాంపుల్స్‌ను సేకరించి డాక్టర్లు ల్యాబ్‌‌కు పంపారు.తాజాగా బ్లడ్ శాంపుల్స్ రిపోర్ట్ వచ్చిందని వైద్యులు తెలిపారు.జగన్ రక్త నమూనాలో అల్యూమినియం శాతం ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం జగన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు.

కేటీఆర్‌ బావమరిదిని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి

  నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌ లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తోన్న 'సెన్సేషన్‌‌ రైజ్‌ డ్యాన్స్‌' కార్యక్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డ్రగ్స్ సరఫరా, మద్యం, అమ్మాయిలతో యథేచ్ఛగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. భారీగా డబ్బులు వసూలు చేసి ఆ కార్యక్రమానికి మైనర్లను కూడా అనుమతిస్తున్నారని మండిపడ్డారు. ఈవెంట్స్ నౌ సంస్థ డేటింగ్ ఏర్పాటు చేస్తోందని.. అమ్మాయిలు, అబ్బాయిలను రూ. 3 వేలకే అప్పచెబుతామంటూ అరాచకాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌ సంస్థ ఈ దారుణమైన కార్యక్రమాన్ని చేపట్టిందని రేవంత్ అన్నారు. తెలంగాణ సర్కారు యువతను గంజాయి, డ్రగ్స్‌కు బానిసలుగా మారుస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమం నిర్వహణపై ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ జోక్యం చేసుకుని నిలువరించకుంటే తామే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని రేవంత్‌‌ హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా టాస్క్ ఫోర్స్, సిట్‌ నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు. బెంగళూరు, పుణేల్లో సెన్సేషన్ రైజ్ ఈవెంట్స్‌ను నిషేధిస్తే గచ్చిబౌలి స్టేడియంలో ఆ సంస్థ ఈవెంట్ నిర్వహణకు ఎలా అనుమతిచ్చారని రేవంత్‌రెడ్డి నిలదీశారు.

గవర్నర్ వచ్చి తనను పలకరించనే లేదు

  వైజాగ్ ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత జగన్‌పై జరిగిన దాడిని మంత్రి పరిటాల సునీత తోసిపుచ్చారు. జగనే కత్తితో పొడిపించుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై అనవసరంగా గొడవలు చేసి.. ప్రభుత్వం, చంద్రబాబు విఫలమయ్యారంటూ నేరం మోపుతున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ల ఉచ్చులో వాళ్లే పడ్డారు. ప్రజల కళ్లు గప్పి డ్రామాలాడాలనుకుంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. పరిటాల రవిని పట్టపగలే హత్యచేశారు. తన భర్త ఎమ్మెల్యేగా చనిపోతే అప్పటి గవర్నర్ వచ్చి తనను పలకరించనే లేదని.. అప్పట్లో చంద్రబాబు ఒక్కరే మా కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తుచేశారు. జగన్‌ ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం బాధాకరమని అన్నారు. 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. నిజాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ప్రమాదం జరిగిన వెంటనే వైజాగ్ లో కేసు పెట్టకుండా హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. అయినా ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

పులివెందుల పులి కోడి కత్తికే మంచమెక్కారు

  పులివెందుల పులి, సింహం అని చెప్పుకొనే జగన్ కోడి కత్తికే మంచమెక్కారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవాచేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై దాడి ఘటనకు సంబంధంచి ఆయన సొంత పత్రికలో వచ్చిన తప్పుడు రాతలను ప్రజలు నమ్మరని  అన్నారు. జగన్‌ నాటకం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందన్నారు. ‘అతడు’ సినిమాలో సీన్‌‌ను జగన్ ఫాలో అయ్యారని...సానుభూతి కోసం ప్రయత్నించారని విమర్శించారు. స్కెచ్‌లో భాగంగానే దాడి చేయించుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.ఏపీలోని ఏ వ్యవస్థ మీదా నమ్మకం లేని వైకాపా అధినేత జగన్‌.. హోదా ఇవ్వని మోదీపైనా, తెలంగాణ పోలీసుల పైనా నమ్మకం పెట్టుకున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.రాష్ట్రంలోని వ్యవస్థలపై నమ్మకం లేని జగన్ రాష్ట్రానికి సీఎం కావాలా? అంటూ ప్రశ్నించారు.పులివెందులలో నేర చరిత్ర జగన్‌కు ఉందని.. కానీ నారావారి పల్లెలో చంద్రబాబుకు లేదన్నారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్‌కు చీమ కుట్టకుండా చూసుకున్నామని తెలిపారు.  వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకెళ్తే ఉలుకు పలుకు లేని గవర్నర్ వద్దకెళ్లి విచారణ చేయమంటారా? అని నిలదీశారు.గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని,ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వం ఉండగా జగన్‌పై దాడి ఘటన గురించి డీజీపీని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కేంద్రం కుట్రలో గవర్నర్‌ కూడా భాగస్వామే అని ఆరోపించారు.కేంద్రంతో విచారణ అని వైకాపా అంటోందని, రాష్ట్రపతి పాలన అని భాజపా అంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.తమిళనాడు, కర్ణాటక తరహాలోనే ఇక్కడా వైకాపాని అడ్డుపెట్టుకుని భాజపా కుట్ర పన్నుతోందని మంత్రి దుయ్యబట్టారు.జగన్ మీద కేసులేస్తే సీబీఐని దొంగ అన్నారు, ఇప్పుడదే సీబీఐతో విచారణ చేయించమని అడుగుతారా? అని మండిపడ్డారు. జగన్ పక్కనుండేది చెత్త సలహాదారులని, జగన్‌పై సీబీఐ కేసులు వచ్చేలా చేసిన వాళ్లే ఇప్పుడూ సలహాలిస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీలోకి పురంధేశ్వరి.!!

  దగ్గుబాటి పురంధేశ్వరి.. ఎన్టీఆర్ కుమార్తెగానే కాకుండా తెలుగు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంపీగా, కేంద్రమంత్రిగా పనిచేసారు. రాష్ట్ర విభజన అనంతరం పురంధేశ్వరి కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరారు. అయితే బీజేపీలో ఎక్కడో ఆమె మార్క్ మిస్ అవుతుంది. అదీగాక ప్రత్యేకహోదా, విభజన హామీల విషయంలో ఏపీ ప్రజలు బీజేపీ మీద కోపంగా ఉన్నారు. విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. ఇంచుమించు బీజేపీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. దీంతో ఆమె సైలెంట్ అయ్యారు. అయితే నందమూరి అభిమానులు మాత్రం.. పురంధేశ్వరి ఆమె తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీలో చేరితే బావుంటుందని ఎప్పటినుండో ఆశపడుతున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలో ఆ ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి. పురంధేశ్వరి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీలో చేరాలి అనుకుంటున్నారట. పురంధేశ్వరి కుమారుడు టీడీపీ నుంచి అయితేనే పోటీ చేస్తాను.. లేదంటే పోటీకి దూరంగా ఉంటానని చెప్తున్నారట. దీంతో పురంధేశ్వరి నందమూరి కుటుంబసభ్యుల ద్వారా టీడీపీలో చేరిక గురించి మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. తనకు టిక్కెట్‌ ఇచ్చినా ఇవ్వకపోయినా కుమారుని రాజకీయ భవిష్యత్‌ కోసం అతనికి టిక్కెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారట. 'పర్చూరు' నుంచి తన కుమారుడు బరిలోకి దిగితే సులువుగా విజయం సాధిస్తారని.. అదేవిధంగా దగ్గుబాటి కుటుంబం వల్ల ప్రకాశంలో పార్టీకి మరింత ఊపు వస్తుందని, వెంకటేశ్వరరావు కూడా సహకరిస్తారని చెప్తున్నారట. అయితే చంద్రబాబు మాత్రం పురంధేశ్వరి చేరికపై అంత సానుకూలంగా లేనట్టు తెలుస్తోంది. నందమూరి కుటుంబసభ్యులు, ముఖ్యంగా బాలకృష్ణ చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొస్తే పురంధేశ్వరికి టీడీపీ డోర్స్ తెరుచుకునే అవకాశం ఉంటుంది. మరి పురంధేశ్వరి నిజంగానే టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారా?.. ఒకవేళ మొదలుపెట్టినా ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.

జగన్నాటకం:ఏ1 ముద్దాయి ‘జగన్ మోదీ రెడ్డి’

  విశాఖ విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై గురువారం ఓ యువకుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.విశాఖలో ప్రాధమిక చికిత్స అనంతరం హైదరాబాద్ వెళ్లారు.అక్కడ సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందారు.ఏపీ సిట్ బృందం దాడిపై వాగ్మూలం తీసుకునేందుకు జగన్ ను హాస్పిటల్ లో కలిసింది.ఈ సందర్బంగా జగన్ ఏపీ పోలీసులపై నమ్మకం లేదని, వాంగ్మూలం ఇవ్వటానికి నిరాకరించిన సంగతి విదితమే.దీనిపై మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఏ1 ముద్దాయి ‘జగన్ మోదీ రెడ్డి’.. దొంగ, దొంగ అని అరుస్తున్నారు. అవినీతి పునాదులపై వెలసిన దొంగ పేపర్, ఛానల్‌లో డబ్బా కొట్టుకున్నంత మాత్రాన కోడి కత్తి డ్రామా వెనుక ఉన్న నిజం మారదు. కుట్రలను బయట పెడితే మీ అంతు చూస్తా అని పోలీసులకు బెదిరింపులు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, రాష్ట్ర వ్యవస్థలపై నమ్మకం లేదు అంటూ ప్రజలను కించపరిచే విధంగా ‘జగన్ మోదీ రెడ్డి’ మాట్లాడటం దారుణం’ అంటూ #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్‌ జత చేశారు.  

కాంగ్రెస్‌లో చేరికపై క్లారిటీ ఇచ్చిన డీఎస్‌

  రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశం అయ్యారు.కొంతకాలంగా తెరాస పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్న ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలు వస్తున్నాయి.డీఎస్‌కు సన్నిహితుడు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డితో పాటు డీఎస్‌ అనుచరులు పలువురు ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు.ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీతో డీఎస్‌ భేటీ అవ్వటంతో ఆయన రాహుల్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు అంతా భావించారు.కానీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్‌ తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు.తాను కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడానికి సమయం అడిగానని చెప్పారు. తనకు రాహుల్‌ సమయం ఇచ్చారని.. ఆయనని కలిశానని తెలిపారు. అయితే రాహుల్‌తో ఏం మాట్లాడానో మీతో చెప్పాల్సిన పనిలేదని ఆయన మీడియానుద్దేశించి అన్నారు. తాను చాలా మంది నేతలను గతంలో కలిశానని.. కలుస్తూనే ఉంటానని వెల్లడించారు.అయితే కాంగ్రెస్ లో చేరికపై మాత్రం ఇంకా స్ఫష్టత ఇవ్వలేదు. మరోవైపు కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన తెరాస నాయకుడు టి.నర్సారెడ్డి, ఎమ్మెల్సీ రాములు నాయక్‌ కాంగ్రెస్‌లో చేరారు.ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో వీరు కాంగ్రెస్‌ కండువాలు కప్పుకొన్నారు. అనంతరం నర్సారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరడం తాము సొంత ఇంటికి వచ్చినట్లుందని అన్నారు. ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలన్నారు. తెరాసలో ఏ నాయకుడికి ఆత్మగౌరవం ముఖ్యమంత్రి ఇవ్వలేదని విమర్శించారు. తెరాస పాలనలో అన్నివర్గాలను మోసం చేశారని రాములునాయక్‌ ఆరోపించారు. ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మారుస్తామని అన్నారు. రాష్ట్రం బందీయైన తెలంగాణగా మారిందని విమర్శించారు.రాములునాయక్‌ నారాయణ్‌ఖేడ్‌ నుంచి తెరాస టికెట్‌ను ఆశించారు. అది దక్కకపోవటంతో పార్టీపై అసంతృప్తి వ్యక్తంచేయగా ఆయన్ని తెరాస సస్పెండ్‌ చేసింది.దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరారు.