రైతన్నకు అండగా నిలుస్తాం.. పవన్ కల్యాణ్
posted on Oct 31, 2025 6:40AM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్ప పొలాలను పరిశీలించారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో గురువారం (అక్టోబర్ 30) పర్యటించిన ఆయన తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని రైతులను పరామర్శించారు. కోడూరు మండలం కృష్ణాపురం గ్రామంలో బురదలో నడుస్తూ వెళ్లి మరీ నేలకొరిగిన వరి పైరు పరిశీలించారు.
రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి ఆదుకుంటామన్న భరోసా ఇచ్చారు, తుఫాను ప్రభావంతో ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్న పవన్ కల్యాణ్.. పంటలు, ఇళ్లకు నష్టం కలిగిందని.. దీని నుంచి రైతులను కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అనంతరం అవనిగడ్డ విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద తుఫాన్ ప్రభావ దృశ్యాలతో కూడిన ఫోటో ఎక్సిబిషన్ పరిశీలించారు. జరిగిన నష్టాన్ని కలెక్టర్ బాలాజీ ని అడిగి తెలుసుకున్నారు.
సీఎం చంద్రబాబు సహా మంత్రులు అందరూ నిరంతరం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడం వల్లనే ప్రాణ నష్టం కలగలేదన్న పవన్ కల్యాణ్.. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటలకు నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. నష్టాలను అంచనా వేసి ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు.