తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు

  ఏపీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీసులకు మెయిల్ పంపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్టు ఆ బెదిరింపు ఈమెయిల్ లో హెచ్చరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించారు. కాలేజి వద్ద హెలిప్యాడ్ పరిసరాల్లో అణువణువును క్షుణ్ణంగా తనిఖీ చేశారు.  ఓ ఫ్యామిలీ ప్రోగ్రాం కోసం ముఖ్యమంత్రి కుటుంబం స్వగ్రామం నారావారిపల్లె వస్తున్నారు. మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారావారిపల్లె చేరుకోనుండగా... సీఎం చంద్రబాబు రేపు ప్రత్యేక హెలికాప్టర్ లో తిరుపతి వస్తున్నారు. ఆయన రాక కోసం ఎస్వీ అగ్రికల్చర్ కాలేజి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.   

బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు శుభ పరిణామం : డిప్యూటీ సీఎం భట్టి

  బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంలో విచారణ సందర్బంగా ఆయనతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్,వాకిటి శ్రీహరి  సుప్రీం కోర్టులో ఉన్నారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి  మీడియాతో మాట్లాడారు. ఈ తీర్పుపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే నిర్ణయానికి రాష్ట్ర శాసనసభ ఆమోదం ఉందని భట్టి తెలిపారు. కొందరు దురుద్దేశంతో కావాలనే బీసీ రిజర్వేషన్ల అమలును అడ్డుకోవడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడం హర్షణీయమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతామని  డిప్యూటీ సీఎం దీమా వ్యక్తం చేశారు.  మరోవైపు  పీసీసీ చీప్ మహేష్ గౌడ్ స్పందిస్తూ.. సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీం కోర్టులో వేసిన కేసును కొట్టివేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామని మహేష్ గౌడ్ అన్నారు.  

సీజేఐ గవాయ్‌పై దాడికి యత్నం!

సీజేఐ గవాయ్ పై సుప్రీం కోర్టులోనే దాడిక యత్నం జరిగింది. ఈ దాడికి ప్రయత్నించినది సుప్రీం కోర్టు న్యాయవాదే కావడం విశేషం. సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనంలో సోమవారం (అక్టోబర్ 6() కేసు విచారణ జరుగుతుండగా ఒ లాయర్ ఆయనపై దాడికి ప్రయత్నించారు. చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ పై చెప్పు విసిరారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.  లాయర్ విసిరిన చెప్పు జస్టిస్ గావాయికి తగలలేదు. ఈ ఘటన తరువాత జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. ఇటువంటి దాడులకు భయపడేది లేదని అన్నారు. జస్టిస్ గవాయ్ పై దాడికి యత్నించిన న్యాయవాదిని రాకేష్ కిషోర్ గా అని గుర్తించారు. అయితే ఆయన చీఫ్ జస్టిస్ పై దాడికి పాల్పడడానికి కారణమేంటన్నదానిపై స్పష్టత లేదు. అయితే ఇటవల ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ దేవుడిని అడగండి అని వ్యాఖ్యానించారనీ, అలా వ్యాఖ్యానించడం ద్వారా జస్టిస్ గవాయ్ సనాతనాన్ని కించపరచడంగా భావిస్తూ రాకేష్ కిషోర్ ఈ దాడికి ప్రయత్నించి ఉంటారని కొందరు అంటున్నారు. కాగా చీఫ్ జస్టిస్ పై దాడికి ప్రయత్నించిన రాకేష్ కిషోర్ పై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటన అనంతరం సుప్రీం కోర్టు కార్యకలాపాలు యాథావిథిగా కొనసాగాయి. 

సాఫ్ట్ వేర్ రంగంలో సంక్షోభం.. కారణమదేనా?

పాతికేళ్లుగా దేశంలో దినదినప్రవర్ధమానంగా పెరిగిన ఐటీ రంగం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది.  దేశంలో నియో మిడిల్ క్లాస్ కు పునాది వేసిన ఐటీ రంగం దేశ ఆర్థిక పురోగతికి ఎంతగానో దోహదం చేసింది. ఈ నియో మిడిల్ క్లాస్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అదెలా అంటే..  ఈ వర్గమే కొనుగోళ్లకు ముందు వెనుకలాలోచించకుండా ముందుకు దూకుతుంది. తద్వారా మార్కెట్లు కళకళలాడుతున్నాయి.  ఐటీ రంగంలో పని చేసే వారికి లక్షల్లో వేతనాలు రావడంతో.. వారు కొనుగోళ్లకు మొగ్గు చూపుతారు. ఇలా ఐటీ రంగం విస్తృతితో సమాజంలో కొత్తగా ఆవిర్భవించిన ఈ నియో మిడిల్ క్లాస్.. ఇప్పుడు ఐటీ రంగం సంక్షోభంలో పడటంతో నియో పూర్ గా మారే అవకాశం ఉంది. అంటే సొంత ఇల్లు, లావిష్ ఫర్నిచర్, కార్లు అన్ని ఉండి కూడా కనీస అవసరాలు తీర్చుకునేందుకు సొమ్ములు లేని వర్గం అన్నమాట.   ఇప్పుడీ సంక్షోభానికి కారణమేంటని ఆలోచిస్తే.. ఐటీ ఉద్యోగాలలో మంచి వేతనాలు, జీవనస్థాయి పెరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో  ఇంజినీరింగ్ విద్యపై మక్కువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఇంజినీరింగ్ కాలేజీలు పుంఖాను పుంఖాలుగా వెలిశాయి. ప్రతిభా, సామర్ధ్యం, జ్ణానం వంటి వాటితో సంబంధం లేకుండా ఇంజినీరింగ్ పట్టభద్రులయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీరిలో అత్యధికులు సాఫ్ట వేర్ ఇంజినీరింగ్ కోర్సుల పట్లే మక్కువ చూపి చేరడంతో    గత కొన్నేళ్లుగా ఈ రంగంలో మాంద్యం ఏర్పడింది. కొత్త ఉద్యోగాల కల్పన మందగించింది.  పలు ఐటీ కంపెనీలు కొత్త వారిని తీసుకోవడం అటుంచి.. ఉన్నవారిని తొలగించే చర్యలు ప్రారంభించాయి. ఉదాహరణకు  టీసీఎస్ గత రెండేళ్లుగా వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.  ఆ ఉద్వాసనల పర్వం ఈ ఏడు కూడా కొనసాగుతుందని ప్రకటించింది కూడా. ఉద్వాసన పలికే ఉద్యోగికి రమారమి రెండేళ్ల వేతనం ఇచ్చి సాగనంపుతోంది. అలాగే మైక్రోసాఫ్ట్ లో కూడా ఉద్వాసనల పర్వం మొదలైంది. ఆ కంపెనీ ఇంచుమించు 15 వేల మందిని సాగనంపింది. ఇంకా అమెజాన్, ఇన్ఫోసిస్, డెలాయిట్ ఐబీఎం వంటి సంస్థలు కూడా ఉద్యోగులకు లేఫ్స్ ప్రకటిస్తున్నాయి.   వాస్తవానికి ఐటీ కంపెనీలలో ఉద్వాసనకు గురౌతున్న వారంతా టెక్నికల్ గా అప్ డేట్ కానివారేనని అంటున్నా.. అది పూర్తిగా వాస్తవం కాదని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. డిమాండ్ కు మించి అభ్యర్థులు అందుబాటులో ఉండటంతో.. నైపుణ్యం ఉన్నా హై సాలరీడ్ ఉద్యోగులకు ఇంటి దారి చూపడానికే ఆయా కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని చెబుతున్నారు.  అన్నిటికీ మించి ఏఐ, క్యాంటమ్ కంప్యూటింగ్ కూడా  ఐటీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వీటివల్ల భవిష్యత్లో ఐటీ ఉద్యోగాలలో మరిన్ని భారీ కోతలు అనివార్యమని అంటున్నారు.   

సా...గుతున్న బైపాస్ రోడ్డు నిర్మాణం.. బెజవాడను వీడని ట్రాఫిక్ కష్టాలు

కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో  నిర్మిస్తున్న జాతీయ రహదారి,  విజయవాడ వెస్ట్ బైపాస్  కొన సా,,,గుతూనే ఉంది. గత వైసీపీ హయాంలో ఈ బైపాస్ నిర్మాణం 80 శాతం పూర్తయ్యిందని చెప్పుకుని తమ భుజాలను తామే చరిచేసుకున్న కాంట్రాక్టర్లు.. ఇప్పుడు మిగిలిన 20 శాతం పూర్తి చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. వాస్తవానికి 80శాతం పూర్తయ్యిందంటూ గతంలో వారు చెప్పిన మాట పూర్తిగా అవాస్తవమనీ, బిల్లులు వసూలు చేసుకుని పనులను పక్కన పెట్టేశారన్న ఆరోపణలు ఉన్నాయి.   సరే ఇక ప్రస్తుతానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇతర ప్రాంతాలలో కనెక్టివిటీ కి ఈ బైపాస్ నిర్మాణం నత్తనడకను గుర్తు చేస్తుండటంతో... అవరోధాలు ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా  బెజవాడ ట్రాఫిక్ కష్టాలు తొలగడం లేదు.  ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తికాకపోవడంతో.. బెజవాడ నగరం నడిబొడ్డు నుంచే భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. దీంతో బెజవాడ నగరం   నిత్యం ట్రాఫిక్ జామ్ లతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. కృష్ణాజిల్లా చిన్న అవుట్ పల్లి నుండి, గుంటూరు జిల్లా చిన్నకాకాని వరకు.. దాదాపు  47.8 కిలోమీటర్ల  మేర విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం  2021 లో ప్రారంభమైంది.  ఇది పూర్తయితే..  కోల్ కతా,  ఒరిస్సా విశాఖ ల నుండి  వచ్చే భారీ వాహనాలు, హైదరాబాద్ చెన్నై వంటి నగరాలకు బెజవాడలోకి రావలసిన పని ఉండది.  చెన్నై, కోల్ కతాలకు వెళ్లే, వచ్చే భారీ వాహనాలు  ఇటు గన్నవరం సమీపంలోని చిన్న ఔట్ పల్లి, అటు మంగళగిరి నియోజకవర్గంలోని చిన్న కాకాని నుండి విజయవాడ వెస్ట్ బైపాస్ చేరుకుంటాయి. దీంతో  బెజవాడకు ట్రాఫిక్ భారం తొలగిపోతుంది. ఇక హైదరాబాద్ వెళ్లే వాహనాలు గొల్లపూడి జంక్షన్ వద్ద   డైవర్ట్ అవుతాయి.  వెస్ట్ బైపాస్ జాతీయ రహదారిపై అమరావతి గుండా ప్రయాణం చేసి , మూడు కిలోమీటర్ల పైగా నిర్మించిన కృష్ణ వారధిని దాటుకుంటూ వాహనాలు  చెన్నై హైదరాబాద్ కోల్ కతా వంటి నగరాలకు చేరుకునేందుకు జాతీయ రహదారిపైకి నేరుగా చేరుకుంటాయి.  అంతే కాదు ఈ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే.. గుంటూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణంలో దాదాపు గంట సమయం ఆదా అవుతుంది.  ఈ బైపాస్ పూర్తై.. బెజవాడ ట్రాఫిక్ కష్టాలు తీరే రోజెప్పుడొస్తుందా? అని జనం ఎదురు చూస్తున్నారు.  

మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీ.. 50 మంది అరెస్టు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని పెద్దమంగళం  లో ఓ ఫామ్ హౌస్ పై పోలీసులు ఆదివారం (అక్టోబర్ 5) రాత్రి పోలీసులు దాడి చేసి దాదాపు 50 మంది యువతీయువకులను అదుపు చేసుకుంటున్నారు. ఆ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో ఓఎస్టీ పోలీసులు ఈ దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అరెస్టైన వారిలో పన్నెండు మంది అమ్మాయిలు, 38 మంది అబ్యాయిలు ఉన్నారు. వీరిలో అత్యధికులు మైనర్లే కావడం విశేషం.   ఆ ఫామ్ హౌస్ యజమాని ఒక్కొక్కరి నుంచి 13 వందల రూపాయలు ఎంట్రీఫీజుగా వసూలు చేసి ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల దాడిలో  పెద్ద ఎత్తున మద్యం, గంజాయి పట్టుబడినట్లు చెబుతున్నారు. అలాగే యువత గంజాయి సేవించినట్లు టెస్టుల్లో తేలింది.  అరెస్టు చేసిన యువతీ యువకులను మొయినాబాద్ పీఎస్ కు తరలించారు.  అలాగే పామ్ హౌస్ యజమానికి కూడా అదుపులోనికి తీసుకున్నారు.  

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది.  వారాంతాలలో భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచీ భక్తులు తిరుమలేశుని దర్శనానికి పోటెత్తుతుంటారు. సోమవారం (అక్టోబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా పడుతోంది. ఇక ఆదివారం శ్రీవారిని మొత్తం 83 వేల 412 మంది దర్శించుకున్నారు. వారిలో  33 వేల 68 మంది తల నీలాలు సమర్పించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 9 లక్షల రూపాయలు వచ్చింది. 

శ్రీశైల క్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి : సీఎం చంద్రబాబు

  శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలోనే అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.  శ్రీశైల క్షేత్రంలో వసతుల కల్పనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలసిన దివ్యక్షేత్రంగా శ్రీశైలం గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆలయ సమగ్రాభివృద్ధి, భక్తుల సౌకర్యాల విస్తరణపై చర్చించారు. ఏటా లక్షలాది భక్తులు శ్రీశైలాన్ని సందర్శిస్తున్నందున, వారికి మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. తిరుమల నమూనాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఆధ్యాత్మిక, పర్యాటక, పర్యావరణ దృక్కోణాల్లో శ్రీశైలం ప్రాంత అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు. దేవాలయ విస్తరణ కోసం సుమారు 2 వేల హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించేందుకు కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదేవిధంగా, శ్రీశైలాన్ని జాతీయ రహదారులతో అనుసంధానించే ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధిపై కూడా ముఖ్యమంత్రి సూచనలు చేశారు. భక్తుల సంఖ్య సంవత్సరానికొకసారి పెరుగుతున్న నేపథ్యంలో ఆలయ సమగ్రాభివృద్ధికి వేగవంతమైన చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యాల విస్తరణపై దృష్టి సారించాలని సూచించారు. శబరిమల వంటి ప్రసిద్ధ దేవాలయాల్లో ఉన్న సౌకర్యాలను పరిశీలించి, వాటి తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కోల్డ్రీఫ్ దగ్గు సిరప్ బ్యాన్

  కోల్డ్రీఫ్ దగ్గు మందు సిరప్‌పై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సిరప్ వల్ల 14 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సిరప్‌ను తెలంగాణలో బ్యాన్ చేస్తూ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దగ్గు మందులో 42% విష రసాయనం ఉన్నట్లు తేలింది. ఇప్పటికే తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కేరళ రాష్ట్రాలు దీన్ని నిషేధించాయి. మరోవైపు ఈ దగ్గు సిరప్‌ ను సూచించిన డాక్టర్‌ ప్రవీణ్‌ సోనిని తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.  ఆదివారం తెల్లవారుజామున డాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాధిత చిన్నారులకు ఇచ్చిన దగ్గు మందును ఈయనే సూచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం అతడిని విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్నారని తెలిపారు.ఇదే సమయంలో, ఆ మందును తయారు చేసిన తమిళనాడులోని కాంచీపురం జిల్లాకు చెందిన శ్రీసన్‌ ఫార్మా కంపెనీపై కూడా కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్‌ పరీక్షల్లో ఆ కంపెనీ తయారు చేసిన సిరప్‌లో 48.6 శాతం డైఇథైలిన్‌ గ్లైకాల్‌ ఉన్నట్లు తేలింది. ఇది అత్యంత విషపూరితమైన రసాయనమని, మానవ శరీరానికి హానికరమని అధికారులు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో, ఆ కంపెనీపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు.  

రావ‌ణుడ్ని కాల్చ‌వద్దంటూ...రోడ్డెక్కిన బ్రాహ్మ‌ణులు!

  దేవుడా ఈ స‌మాజాన్నినువ్వే కాపాడాలి? అయినా ఎటు పోతోందీ స‌మాజం? ఏంటీ వైప‌రీత్యం.. నువ్వే మాకు ర‌క్ష అంటూ ప్రార్ధించాల్సి వ‌స్తోంది చూస్తోంటే.. తాజాగా కొంద‌రు బ్రాహ్మ‌ణులు.. ఒక కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చారు.. అదేంటంటే  రావ‌ణుడు బ్రాహ్మ‌ణుడు ఆయ‌న్ను ద‌స‌రా సంద‌ర్భంగా కాల్చ‌వ‌ద్దంటూ డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే ద‌ళితులు రావ‌ణుడు, న‌ర‌కాస‌రుడు మా వాళ్లు. వాళ్ల‌ను అవ‌మానించ‌వ‌ద్ద‌న్ని వీరి వాద‌న‌గా ఉంటూ వ‌చ్చింది ఇన్నాళ్లు. ఇప్పుడీ వాద‌న కాస్తా బ్రాహ్మ‌ణులు అందుకున్నారు. దీంతో రావ‌ణుడు ఎవ‌ర‌న్న చ‌ర్చ‌కు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. బేసిగ్గానే రావ‌ణుడ్ని పిలవ‌డ‌మే రావ‌ణ బ్ర‌హ్మ అంటారు. అలాంటి రావ‌ణ బ్ర‌హ్మ బ్రాహ్మ‌ణుడ‌ని ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎలాంటి పురాణాలు తిర‌గ‌వేయ‌క్క‌ర్లేదు. ఇక న‌ర‌కాస‌రుడు కూడా రాక్ష‌సుడేం కాదు.. మ‌హా విష్ణువు వ‌రాహ అవ‌తారంలో భూమిని కాపాడిన‌పుడు జ‌రిగిన సంయోగం ద్వారా పుట్టిన వాడు. అత‌డి పుట్టుక‌కు బీజం వేసిన వేళా విశేషం.. రాక్ష‌స ల‌క్ష‌ణాలు అల‌వ‌డ్డాయి. దీంతో.. అత‌డు జ‌న‌పీడితుడ‌య్యాడు. ఈ విష‌యం గుర్తించిన భూదేవి మ‌హా విష్ణువును ఒక వ‌రం అడిగింది. త‌నే స్వ‌యంగా త‌న పుత్రుడ్ని క‌డ‌తేర్చుతాన‌ని కోరారామె. అందులో భాగంగానే ద్వాప‌ర యుగంలో స‌త్య‌భామ‌గా న‌ర‌కాసుర వ‌ధ చేశారు. అదే మ‌న‌కు దీపావ‌ళి అయ్యింది. ఈ ఇరువురు రాక్ష‌సుల‌కు ద‌ళితుల‌కు సంబంధమే లేదు. బ్ర‌హ్మ రాక్ష‌సుడు అన్న ప‌దంలో శూచించే బ్ర‌హ్మ శ‌బ్ధం కూడా ఇదే. పాండిత్య శోధ‌న‌లో.. ఒక్కోసారి త‌ప్పులు దొర్లి వారికంటూ ఆ జ‌న్మ శాపంగా ల‌భిస్తుంది. దీంతో వారు బ్ర‌హ్మ రాక్ష‌సులై జ‌న‌కంట‌కుల‌వుతారు. అయితే ఇక్క‌డ రావ‌ణాసురుడి విష‌యంలో బ్రాహ్మ‌ణులు తెలుసుకోవ‌ల్సినదేంటంటే అస‌లు దేవ‌త‌ల్లో కూడా బ్రాహ్మ‌ణులు ఎవ‌రూ ఉండ‌రు. శివుడు ఏకంగా జంగ‌మ‌య్య‌, స్మ‌శాన  వాసి. ఆపై ద‌శావ‌తారాల్లో ప‌రుశురామ‌, వామ‌న అవ‌తారాలు త‌ప్ప మిగిలినవ‌న్నీ బ్రాహ్మ‌ణేత‌ర అవ‌తారాలే. బ్రాహ్మ‌ణ అవ‌తారాలైన ప‌రుశురామ‌, వ‌రాహ మూర్తుల‌కు అస‌లు పూజ‌లు, అర్చ‌న‌లే పెద్ద‌గా ఉండ‌వు. బ్రాహ్మ‌ణుల వైదీక‌మంతా న‌డిచేది క్ష‌త్రియ రామ‌, యాద‌వ కృష్ణ‌, ఆపై అర్ధ‌న‌రులైన న‌ర‌సింహ వంటి అవ‌తారాల‌కే. ఇందులోని అర్ధ‌మేంటంటే.. స‌త్య‌భామ‌లా మ‌న‌మూ వ్య‌వ‌హ‌రించ‌క త‌ప్ప‌ద‌ని. త‌ప్పు చేసిన వాడు ఎవ‌రైనా స‌రే స‌మ‌న్యాయం పాటించాలి.  కుల‌మ‌త వ‌ర్గ వైష‌మ్యాల‌కు, రాగ ద్వేషాల‌కు తావు లేద‌న్న ధ‌ర్మం పాటించ‌డంలో భాగంగా.. బ్రాహ్మ‌ణుడైనా.. రావ‌ణుడు త‌ప్పే అన్న‌ది ఎప్ప‌టి నుంచో ఈ బ్రాహ్మ‌ణీకం ఆచ‌రిస్తూ వ‌చ్చిన ఆచారం. ఆపై న‌ర‌కాసురుడి విష‌యంలోనూ ఇదే నియమం. వారు ఆది నుంచీ పాటిస్తూ వ‌స్తున్నారు. ధ‌ర్మ నిబ‌ద్ధులు, బ్ర‌హ్మ జ్ఞానులైతే త‌ప్ప‌క ఆద‌రించాల‌న్న‌ ఆలోచ‌న‌ల్లోంచి పుట్టుకొచ్చిందే రామ‌కృష్ణ‌నార‌సింహ వంటి బ్రాహ్మ‌ణేత‌ర దేవుళ్ల ఆరాధ‌న‌. కాబ‌ట్టి ఈ విష‌యం తెలుసుకోకుండా ఇలా రోడ్లు ఎక్క‌డం స‌రికాదంటారు చాగంటి, గ‌రిక‌పాటి వంటి  పండితోత్త‌ములు!  

వైభవంగా ప్రారంభమైన పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు

  ఉత్తరాంధ్ర వాసుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయం వద్ద జెండా ఊపి ఈ ఉత్సవాల శోభాయాత్రను మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు.  అనంతరం గిరిజన మహిళలతో కలిసి హొం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు దింసా నృత్యం చేశారు. మరోవైపు కళాకారుల పులివేషాలు, నృత్యలు ఆకట్టుకున్నాయి. సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు పోటైత్తారు. స్థానిక సంగీత కళాశాలలో కార్యక్రమాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అతి పెద్ద జాతరలలో ఒకటి. ప్రతి సంవత్సరం తోలేళ్ల ఉత్సవంతో ప్రారంభమై, ఉయ్యాల కంబాల జాతరతో ముగిసే ఈ సిరిమాను సంబరాలకు ఏర్పాట్లు రెండు నెలల ముందుగానే మొదలవుతాయి. భక్తులు ఉత్సాహంగా పాల్గొనే ఈ వేడుకలు ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.  

నటుడు రాహుల్ రామ‌కృష్ణ వెన‌కున్న శ‌క్తులేవి?

  ద‌స‌రాకు క‌క్కా ముక్క లేద‌ని ఫీలైన వారికి పెద్ద ఎత్తున కిక్కునందించారు అర్జున్ రెడ్డి, జాతిర‌త్నాలు ఫేమ్ రామ‌కృష్ణ‌. సైన్మా అనే త‌రుణ్ భాస్కర్ షార్ట్ ఫిలింతో లైమ్ లైట్లోకి వ‌చ్చిన రాహుల్ క్ర‌మేపీ వెండితెర‌మీద ఒక చిన్న పాటి న‌టుడిగా  ఎస్టాబ్లిష్ అయిపోయాడు. దానికి తోడు బిగ్గెస్ట్ హిట్స్ లో పార్టిసిపేష‌న్ ఉండ‌టంతో.. రీసెంట్ టైమ్స్- పాపుల‌ర్ ఆర్టిస్టుల్లో త‌ను కూడా ఒక‌రిగా పేరు సాధించారు. తాజాగా ఈయ‌న చేసిన ట్వీట్ ఇటు సోష‌ల్ మీడియా వ‌ర్గాల‌తో పాటు, అటు రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఒక క‌ల‌క‌లం చెల‌రేగేలా చేసింది. ఇప్ప‌టికే సారే రావాలంటున్న‌రు.. తెలంగాణ ప‌ల్లెల్లోన అనే పాట‌లు, దేఖ్ లేంగే వంటి డ్యాన్సుల‌తో బీఆర్ఎస్ ఒక టైప్ ఆఫ్ ప్రో అట్మాస్ఫియ‌ర్ క్రియేట్ చేసుకుంటోంది. కార‌ణం ఏంటంటే తాము ఓడిందే  సోష‌ల్ మీడియా ప్ర‌భావం వ‌ల్ల‌. కాబ‌ట్టి ఈ దిశ‌గా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన కేటీఆర్, ఇది వ‌ర‌కే కొంద‌రు సోష‌ల్ మీడియా కూలీల‌ను హైర్ చేస్కున్నారు కూడా.. అందులో భాగంగా ఇటీవ‌ల కొంద‌రు సీఎం రేవంత్ కి వ్య‌తిరేకంగా భారీ ఎత్తున ట్రోలింగ్ కి పాల్ప‌డ్డ‌ కార‌ణంగా అరెస్టు కావ‌డం తెలిసిందే.  దీంతో ప్లాన్ నెంబ‌ర్ వ‌న్ వ‌ర్క‌వుట్ అయ్యింద‌ని భావించిన కేటీఆర్ నెక్స్ట్ లెవ‌ల్ లోకి వెళ్లార‌న్న‌ది ఒక టాక్. ఆయ‌న గ‌తంలోనే అన్నారు.. తాను యూట్యూబ్ చానెళ్లు పెట్టుకోకుండా అన‌వ‌స‌రంగా అభివృద్ధి ప‌నులు చేశాన‌ని. దీన్నిబ‌ట్టీ చూస్తే సోష‌ల్ మీడియాను త‌మ‌కు అనుకూలంగా యాక్టివేట్ చేస్కుంటే అది వ‌చ్చే రోజుల్లో మ‌న‌కు పాజిటివ్ వైబ్  క్రియేట్ చేయ‌డం ఖాయం అన్న కోణంలో స్టెప్ బై స్టెప్ కేటీఆర్ ముందుకు వెళ్తున్న‌ట్టుగా తెలుస్తోంది.  బేసిగ్గా కేటీఆర్ కి ట్విట్ట‌ర్ కింగ్ అన్న పేరుంది కాంగ్రెస్ వ‌ర్గాల్లో. అంటే సోష‌ల్ మీడియా వేదిక‌పై యాక్టివ్ గా ఉండే కొంద‌రంటే కొంద‌రు పొలిటీషియ‌న్ల‌లో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. ఈ విష‌యంలో మ‌రో అడుగు ముందుకేసిన కేటీఆర్.. త‌న గురించి తాను మాత్ర‌మే చెప్పుకుంటే కిక్కేముందీ? అదే మ‌న గురించి ఇత‌రులు చెబితే ఆ లెవ‌లే వేరుగా ఉంటుంద‌ని భావించారో ఏమో.. ఇదిగో.. రాహుల్  రామ‌కృష్ణ వంటి వారిని గిల్లి వ‌దిలిన‌ట్టున్నారని అంటారు కొంద‌రు. ఇటు రాహుల్ కూడా ద‌స‌రా సంద‌ర్భంగా క‌క్కా ముక్కా లేని వైరాగ్యంలో కేసీఆర్ రావాల‌ని జ‌నం కోరుకుంటున్నార‌న్న యాంగిల్లో కామెంట్ల కాక రేపారు. ఇది క్ష‌ణాల్లో వైర‌ల్ కావ‌డంతో త‌న ఖాతా నుంచి వైదొల‌గాల్సి వ‌చ్చింది కూడా. ఇంత‌కీ ఏంటీ రాహుల్ రామ‌కృష్ణ ఇంత‌టి వైరాగ్యానికి గ‌ల కార‌ణ‌మ‌ని చూస్తే ఆయ‌న ఐదేళ్ల క్రితం ఒక ట్వీట్ చేశారు. బాల్యంలో తాను అత్యాచారానికి గుర‌య్యానంటూ అప్ప‌ట్లో ఆయ‌న చేసిన ట్వీట్ ఎవ్వ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ, కొంద‌రు విశ్లేష‌కులు అంటున్న మాట‌లేంటంటే.. మ‌న‌కు పైకి క‌నిపించేంత జ‌న‌ర‌ల్ కండీష‌న్లో రాహుల్ రామ‌కృష్ణ లేడ‌ని తెలుస్తోంది. ఇక్క‌డ రాహుల్ రామ‌కృష్ణ‌లోని మ‌రో యాంగిల్ ఏంటంటే, గాంధీ కి వ్య‌తిరేకంగానూ కొన్ని కామెంట్లు గుప్పించారాయ‌న‌. ఇది బీజేపీకి వ‌ర్గాల వారికి ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అయితే బీఆర్ఎస్, లేదా బీజేపీకి ప్రో కామెంట్లు చేస్తే ఆయ‌న రాజ‌కీయ విధానం ఏంటో స్ప‌ష్టంగా తెలుస్తుంది.  కానీ ఇదేంటీ ఈ రెండూ మిక్స్ చేసి కొట్ట‌డ‌మేంట‌న్న‌ది ఎవ‌రీకీ అర్ధం కావ‌డం లేదు. కొంప‌దీసి ఇదిగానీ బీఆర్ఎస్- బీజేపీలో విలీనం అవుతుంద‌నడానికి సంకేత‌మా? ఏంట‌న్న‌ది కూడా ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. ఎనీహౌ రాహుల్ రామ‌కృష్ణ ఆయ‌న‌కు ఆయ‌న ఏదైనా స్వ‌యంగానే ఈ కామెంట్లు చేశారా? లేక కేటీఆర్ ఇన్ ఫ్లూయెన్స్ తో ఇలాంటి వ్యాఖ్య నిర్మాణం వెలుగులోకి వ‌చ్చిందా? తేలాలంటే మ‌రికొన్నాళ్ల పాటు మ‌నం వేచి చూడాల్సిందే.

ఐ బొమ్మ సినిమాల‌ను...చాటుగా ఎలా షూట్ చేస్తుందో తెలుసా!?

  నువ్వీ త‌ప్పెందుకు చేస్తున్నావ్ అంటే.. మీరంతా ఇన్నేసి త‌ప్పులు చేస్తున్నారు కాబ‌ట్టి! అన్నాట్ట ఒక నిందితుడు.. స‌రిగ్గా అలాగే ఉంది ఐ బొమ్మ వ్య‌వ‌హారం. కావాలంటే చూడండీ.. చిన్న సినిమాలే కాదు పెద్ద పెద్ద సినిమాల పాలిటి కూడా మెయిన్ విల‌న్ గా మారిపోయిందీ బొమ్మ ఉర‌ఫ్ బెప్పం టీవీ పైర‌సీ సైట్. ఒక మ‌నిషి ఖ‌ర్చు చేసే వినోద వ్య‌యాన్ని దాదాపు తగ్గించేసిన ఐ బొమ్మ‌.. సినిమా వాళ్ల‌ను మాత్రం దారుణంగా దెబ్బ తీస్తోంది. ఈ సినిమా బాగుంద‌న్న పాజిటివ్ టాక్ వ‌చ్చేలోపు ఇందులో టీజ‌ర్ వేసి మ‌రీ  రిలీజ్ చేసేస్తున్నారు. రీసెంట్ గా ఓజీని క‌మింగ్ సూన్ అని చెప్పి మ‌రీ వ‌దిలారు. క‌నీసం ఒక‌టీ రెండు రోజుల టైం కూడా ఇవ్వ‌కుండా ఈ పైర‌సీ సైట్లో ప్ర‌తి సినిమా ప్ర‌త్యక్ష‌మ‌వుతోంది.  ఈ పైర‌సీ సినిమాల‌ను వీరెలా తీస్తారో కూడా వివ‌రించారు పోలీసులు. స్టాండ్ బై యాప్ ని త‌మ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకుంటారు.. సినిమా ఎలా తీసినా స‌రే అది స‌రి చేసి ఒక వీడియో రూపొందించి డెలివ‌రీ చేస్తుంది. ఎక్స్ ట్రా మ‌నీ కోసం కిర‌ణ్ వంటి వారు ఈ ప‌ని చేస్తుంటార‌ని చెబుతున్నారు పోలీసులు. ఇటీవ‌ల ప‌ట్టుబ‌డ్డ ఏసీ టెక్నీషియ‌న్ కిర‌ణ్ చేస్తోంది ఇదేనంటారు పోలీసులు. వీర్ని క్యామ్ కాడ‌ర్స్ అంటారు. అమ‌లాపురానికి చెందిన కిర‌ణ్ ఏసీ టెక్నీషియ‌న్ గా ప‌ని చేస్తూ మ‌రింత ఎక్కువ‌ డ‌బ్బు అవ‌స‌రానికై ఈ ఫీల్డ్ లోకి వచ్చాడని చెబుతారు పోలీసులు. ఇత‌డ్ని ఎట్ట‌కేల‌కు ప‌ట్టుకున్న పోలీసుల‌కు ఈ మొత్తం నెట్ వ‌ర్క్ ఎలా న‌డుస్తుందో అర్ధ‌మైం పోయింది. పోలీసులు త‌మ‌పై నిఘా పెట్టార‌ని తెలిసిన ఐ బొమ్మ ఇటీవ‌ల ఒక మెసేజ్ రిలీజ్ చేసింది.   ఇందులో ప్ర‌ధాన‌ చ‌ర్చ‌నీయాంశం ఏంటంటే హీరోల‌కు అంతంత రెమ్యున‌రేష‌న్లు ఎందుక‌న్న‌ది.  నిజానికి ఒక సినిమాలో స‌గం క్యాస్టింగ్ కి స‌రిపోతుంది. అందులోనూ స‌గం హీరో కి వెచ్చించాల్సి వ‌స్తుంది. ఇక్క‌డ ఐబొమ్మ వాడికి తెలియాల్సింది ఏంటంటే, హీరో ఆ సినిమాకు మెయిన్ మార్కెట్ లీడ‌ర్. చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ అంటూ గ‌తంలో..  ప‌వ‌న్, మ‌హేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజ‌య్ దేవ‌ర‌కొండ అంటూ ఇప్పుడూ ఒక మార్కెట్ విస్త‌ర‌ణ జ‌రిగింది. ఈ మార్కెట్ ఆయా న‌టుల సినిమాల క‌లెక్ష‌న్ల‌ను బ‌ట్టీ ఏర్ప‌డుతుంది. చిరంజీవికి మెగా స్టార్ అనే బిరుదు ఊర‌కే ఇవ్వ‌లేదు.. ఆయ‌న సినిమా క‌లెక్ష‌న్ల‌ను బ‌ట్టీ ఇచ్చారు.  ఇప్పుడంటే బాల‌కృష్ణ‌కు న‌ట సింహ అంటూ ఏవో బిరుదులున్నాయి. కానీ, గ‌తంలో బాల‌కృష్ణ‌కు బాక్సాఫీస్ బోనాంజా అనేవారు. అంటే బాల‌కృష్ణ సినిమాగానీ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ క‌లెక్ష‌న్ల వ‌ర‌ద అంత తేలిగ్గా ఆగ‌దు. ఇప్ప‌టికీ కొన్ని థియేట‌ర్ల‌లో బాల‌య్య సినిమాలు నాన్ స్టాప్ గా న‌డుస్తుంటాయంటే అతిశ‌యోక్తి కాదేమో. ఇక నాగార్జున, వెంక‌టేష్ సంగ‌తి స‌రే స‌రి. నాగార్జున- శివ వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాక‌లు  కేరాఫ్ అయితే, వెంక‌టేష్- చంటి త‌ర‌హా ఫ్యామిలీ ఎంట‌ర్టైనర్స్ కి పెట్టింది పేరు.  ఇక ప్రెజంట్ జ‌న‌రేష‌న్ హీరోల‌కూ ఒక మార్కెట్ ఉండ‌టం ఆ మార్కెట్ ప్ర‌కార‌మే.. వారి వారి రెమ్యున‌రేష‌న్లు ఇవ్వ‌డం జ‌రుగుతోంది. ప్రొడ్యూస‌ర్లు కూడా ఏం ఊర‌కే డ‌బ్బులు ఇవ్వ‌రు. వారికున్న మార్కెట్ ప‌రిధిని బ‌ట్టీ పారితోష‌కాలుంటాయి. చిరంజీవి చెప్ప‌డం కూడా అదే.. జ‌నం థియేట‌ర్ల బాట ప‌ట్టాలంటే ఓటీటీలో తెలుగు డ‌బ్ అవుతోన్న హాలీవుడ్ రేంజ్ త‌ర‌హా మూవీస్ మ‌న‌మూ తీయాల‌నే ఇంత ఖ‌ర్చని చెప్పుకున్నారాయ‌న‌. తానేదో పెద్ద తెలుగు సినిమా ఫీల్డ్ ని ఉద్ద‌రించ‌డానికి వ‌చ్చిన రిఫార్మ‌ర్ లా.. ఈ ఐ బొమ్మ హ్యాండ్ల‌ర్ మెసేజీలు పాస్ చేయ‌డం. చేసిన త‌ప్పుకు బ‌దులు చెప్ప‌మంటే హీరోల పారితోష‌కాల‌ను నిల‌దీయ‌డం.. స‌రికాదంటారు పోలీసులు.. అది వాళ్లు వాళ్లు చూసుకుంటారు. మ‌ధ్య‌లో వీళ్లెవ‌ర‌ని అంటారు అధికారులు.  1957- కాపీ రైట్ చ‌ట్టం ప్ర‌కారం పైర‌సీ ఒక నేరం. 2019లో పైర‌సీ రాకాసిని ఎదుర్కోడానికి ఈ చ‌ట్టాన్నిస‌వ‌రించారు కూడా. దీని ప్ర‌కారం చట్టవిరుద్ధంగా సినిమా రికార్డింగ్ చేయడం, పంపిణీ చేయడం వంటివి తీవ్ర స్తాయి నేరాలుగా పరిగణిస్తారు. పైర‌సీ చేసిన‌ట్టు రుజువైతే ఎలాంటి శిక్ష‌లు ఉంటాయో చూస్తే.. మూడేళ్ల పాటు జైలు శిక్ష‌, భారీ జ‌రిమానా విధిస్తారు. నాలుగేళ్లుగా పైర‌సీ చేస్తోన్న‌ కిర‌ణ్ ద్వారా ఇండ‌స్ట్రీకి సుమారు నాలుగు వేల కోట్ల రూపాయ‌ల ఆర్ధిక న‌ష్టం సంభ‌వించిందని అంచ‌నా వేస్తున్నారు. కాబ‌ట్టి ఇత‌డికి, ఇత‌గాడి వెన‌కున్న ఐబొమ్మ నెట్ వ‌ర్క్ కి పెద్ద ఎత్తున జ‌రిమానాతో పాటు శిక్ష కూడా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.  

పసికందు మృతి ఘటనపై విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం

  అనంతపురం ఐసీడీఎస్‌ శిశుగృహంలో పసికందు మృతి ఘటనపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు. శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిందని వస్తున్న ఆరోపణలపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  సిబ్బంది మధ్య అంతర్గత విభేదాల వల్ల బిడ్డకు సమయానికి పాలు ఇవ్వలేదనే సమాచారం వస్తోందని, అది నిజమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక అధికారులు మాత్రం బిడ్డ మృతికి అనారోగ్యమే కారణమని చెబుతున్నారు. ఈ వివాదంపై మంత్రి సంధ్యారాణి ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులను సమగ్రంగా విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, పిల్లల సంరక్షణలో నిర్లక్ష్యం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

టీటీడీ వ‌ర్సెస్ ష‌ర్మిళ‌....తాజాగా మ‌రో కొత్త‌ వ్య‌వ‌హారం

  ఈ మ‌ధ్య ఏపీసీసీ చీఫ్ ష‌ర్మిళ‌తో పెద్ద చిక్కొచ్చి ప‌డింది. ఆమె త‌న ఉనికి చాటుకోవ‌డంలో భాగంగా ప్ర‌తి ఒక్క‌రిపైనా విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా టీటీడీ విష‌యంలో ఆమె ఎంత పెద్ద దుమారం చెల‌రేగేలా చేశారో తెలిసిందే. ద‌ళిత వాడ‌ల్లో ఐదు వేల ఆల‌యాల‌ను నిర్మిస్తామ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టిస్తే.. దాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించిన ష‌ర్మిళ‌.. బాబు ఆర్ఎస్ఎస్ లో చేరిపోయారా? అంటూ విరుచుకుప‌డ్డారు. అంతే కాదు ద‌ళితులు ఏమైనా ఆల‌యాలు నిర్మించ‌మ‌ని అడిగారా? అంటూ మండిప‌డ్డారామె. దీని వెన‌క నేప‌థ్యం సంగ‌తి అలా ఉంచితే.. ఇప్పుడు బాబు మ‌రో కొత్త ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టారు. టీటీడీ నిర్వ‌హించే ప్ర‌తి ఆల‌యంలో అచ్చం తిరుమ‌ల‌లోలా నిత్యాన్న‌దానం ప్ర‌వేశ‌ పెడుతున్న‌ట్టు చెప్పారు. ఇపుడు ష‌ర్మిళ దీనిపై కూడా ఏదైనా కామెంట్ చేస్తారో అన్న కామెంట్లు పేలుతున్నాయ్ బీజేపీ వ‌ర్గాల వారి నుంచి. ద‌ళిత వాడ‌ల్లో ఆల‌యాల విష‌యానికి వ‌స్తే.. ఆమె గ‌తంలో త‌న అన్న జ‌గ‌న్ తో విడిపోవ‌డానికి కార‌ణ‌మే.. ఊరూరా చ‌ర్చి నిర్మించాల‌న్న ప్ర‌తిపాద‌న చేయ‌డం వ‌ల్లేనంటారు కొంద‌రు. ఈ విష‌యంలో నిజ‌మెంతో తెలీదు కానీ దీన్ని జ‌గ‌న్ ఒప్పుకోలేద‌నీ.. ఇప్ప‌టికే త‌న‌పై హిందూయేత‌ర సీఎంగా ముద్ర ప‌డింది కాబ‌ట్టి  కుద‌ర‌ద‌ని ఖ‌రాఖండిగా తేల్చి చెప్పార‌ని అంటారు కొంద‌రు వైసీపీ వ‌ర్గాల వారు. అయితే ఇందుకు బ‌లం చేకూర్చుతూ జ‌గ‌న్ త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే వెంక‌న్న‌ ఆల‌య సెట్ వేయించారు. దీంతో జ‌గ‌న్ హిందూ ఓట్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ఎన్నో పాట్లు ప‌డుతున్నార‌ని అర్ధ‌మైందా టైంలో. అంటే, ష‌ర్మిళ జ‌గ‌న్ మ‌ధ్య ఇలాంటిదేదో జ‌రిగింద‌ని దీన్ని బ‌ట్టీ చెప్పొచ్చంటారు కొంద‌రు.  ఇదిలా ఉంటే, ష‌ర్మిళ భ‌ర్త బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్.. మ‌రో లీడ్ ఇచ్చారీ విష‌యంలో. అదేంటంటే, 2024 ఎన్నిక‌ల ముందు విశాఖ వెళ్లిన  అనిల్.. క్రిష్టియ‌న్ స‌మూహాల‌ను ఏకం చేసి ఒక రౌండ్ టేబుల్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. మీరెవ‌రూ మా బావ‌ జ‌గ‌న్ కి ఓటు వేయొద్ద‌ని వారికి సూచించారాయ‌న‌. వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తుంటే.. ష‌ర్మిళ‌ త‌న అన్న జ‌గ‌న్ తో ఇలాంటి మ‌త‌ప‌ర‌మైన అంశ‌మేదో ప్ర‌తిపాదించార‌నీ.. అందుకు ఆయ‌న స‌సేమిరా అన్నార‌నీ.. ఆ త‌ర్వాత ష‌ర్మిళ దంప‌తులు పార్టీ నుంచి వేరుప‌డి.. కొత్త పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ లో క‌లిపి.. ఏపీకి పీసీసీ చీఫ్ గా వ‌చ్చార‌ని అంచ‌నా వేస్తారు కొంద‌రు.  మొన్న‌ కూడా ఆమె ఆర్ఎస్ఎస్ భావ‌జాలానికి చెందిన ఉప‌రాష్ట్ర‌పతి అభ్య‌ర్ధి  రాధాకృష్ణ‌న్ కి జ‌గ‌న్ త‌న ఎంపీల చేత ఓట్లు వేయించ‌డాన్ని సైతం త‌ప్పు ప‌ట్టారామె.  ఏతా వాతా చెప్పొచ్చేదేంటంటే.. త‌న అన్న జ‌గ‌న్ తో స‌హా సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కూ అంద‌ర్నీ మ‌త‌ప‌రంగా ఆక్షేప‌ణ‌లు చేస్తోన్న ష‌ర్మిళ అస‌లు గుట్టు మొత్తం ఈ మ‌త‌మ‌నే వ్య‌వ‌హారం చుట్టూ అల్లుకుని క‌నిపిస్తుంది మ‌న‌కు. ఆమె వైవాహిక బంధ‌మే మ‌త‌ప‌ర‌మైన కోణంలో జ‌రిగింది. అలాంటి షర్మిళ మ‌తం మీద ఈ విధంగా విరుచుకుప‌డ్డ‌మేంట‌న్న‌ది కొంద‌రు సంధించే ప్ర‌శ్నాస్త్రం. తాజాగా టీటీడీ ఆల‌యాల్లో అన్న‌దానంపైనా ఆమె ఎలా రియాక్ట‌వుతారో అన్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. వారేమైనా  మిమ్మ‌ల్ని అన్న‌దానం చేయ‌మని అడిగారా? అని ఆమె ఎక్క‌డ‌ అంటారేమో అన్న ఛ‌లోక్తులు విసురుతున్నారు కొంద‌రు నెటిజ‌న్లు.

తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటలు

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ల లేని భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. శనివారం 83,380 మంది స్వామివారిని దర్శించుకోగా 32,275 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.71 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు ప్రకటించారు.  తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వసతి, అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. సీఎం చంద్రబాబు తనకు రెండవసారి శ్రీవారి సన్నిధిలో ఈవోగా అవకాశం ఇవ్వడం నా అదృష్టమని పేర్కొన్నారు.  శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులు గంటల తరబడి వేచి ఉండి స్వామివారి వాహన సేవలు దర్శించుకున్నారు. భక్తులకు టీటీడీ అందించిన అన్న ప్రసాదాలు, రవాణా, పారిశుద్ధ్యం, భద్రత, శ్రీవారి సేవకుల సేవలు, తదితర సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని ఈవో తెలిపారు  

ఉన్నతాధికారుల సత్వర స్పందన.. మహిళకు పునర్జన్మ

ఉన్నతాధికారులు సమష్టిగా సత్వరం స్పందించడంతో ఓ మహిళ ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన విజయవాడలో శనివారం (అక్టోబర్ 4) చోటు చేసుకుంది. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు  ఆ సందర్భంగా జరిగిన సభలో విజయవాడ వాంబే కాలనీకి చెందిన నాగజ్యోతి అనే మహిళ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమె ఆ సభకు మానసిక వికలాంగురాలైన తన ఐదేళ్ల కుమార్తెకు ప్రభుత్వ సాయం అర్థించడానికి వచ్చింది. అయితే సభ జరుగుతుండగా ఆమె ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. నాగజ్యోతి ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం గమనించిన పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా వెళ్లి అంబులెన్స్ తీసుకు వచ్చారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ సరిత ఆమెకు సపర్యలు చేశారు. అరికాళ్లపై గట్టిగా రుద్దుతూ ఆమె శరీరం చల్లబడిపోకుండా చర్యలు తీసుకున్నారు. సభలోనే ఉన్న డీఎంహెచ్ ఓ సుహాసిని పరుగు పరుగున బాధితురాలి వద్దకు చేరుకున్నారు. ఆమె నాడి అందకపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని గ్రహించారు. నాగజ్యోతి సెరిబ్రల్ ఎనాక్సియాకు గురైనట్లు గుర్తించి వెంటనే ఆమె కాళ్లను తన భుజంపైకి పెట్టుకుని మెదడుకు ఆక్సిజన్ అందేలా చేశారు. దీంతో బాధితురాలిలో నాడీ స్పందనలు మొదలయ్యాయి.   వెంటనే ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం నాగజ్యోతి ఆరోగ్యం నిలకడగా ఉంది.  హోదాలను పక్కన పెట్టి ఉన్నతాధికారులు సమష్టిగా సత్వరమే స్పందించి నాగజ్యోతికి పునర్జన్మ ప్రసాదించారంటూ ప్రజలు అధికారులను ప్రశంసిస్తున్నారు.   

కెప్టెన్స్ అంటే వీళ్లేరా!

  భార‌త కెప్టెన్సీ శ‌కం మొద‌లైంది.. క‌పిల్ దేవ్ నుంచి. ఆయ‌న 1983లో అబేధ్య‌మైన వెస్టిండీస్ జ‌ట్టు నుంచి వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్పు ఎప్పుడు కైవ‌సం  చేస్కున్నారో.... ఆనాటి నుంచి కెప్టెన్సీ అనేది ఒక‌టుంద‌న్న విష‌యం మ‌న‌కు స్ప‌ష్టంగా  తెలిసి రావ‌డం మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌పంచానికి తెలిసింది ఒకే ఒక్క‌ క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీ మాత్ర‌మే. క్లైవ్ లాయ‌డ్ వ‌రుస క‌ప్పులు కొట్ట‌డం వెన‌క ఆయ‌న నాయ‌క‌త్వ చిట్కాలే ప్ర‌ధాన‌ కార‌ణ‌మ‌న్న‌ది అప్ప‌టి వ‌ర‌కూ  ఉన్న కెప్టెన్సీ కామెంట్. కావాల‌ని కొంద‌రి క్యాచ్ లు జార‌విడ‌వ‌డం వంటివి లాయిడ్ చేసేవార‌నీ.. ద‌టీజ్ కెప్టెన్సీ అంటూ ఆహా ఓహో అంటూ ఆయ‌న గురించి ఊద‌ర‌గొట్టేవారు. క్లైవ్ లాయిడ్ త‌ర్వాత ఆ కెప్టెన్సీ గ్రేట్ నెస్ త‌న పేరిట లిఖింప చేసుకున్న‌ది మాత్రం భార‌త క్రికెట్ ఫ‌స్ట్ లెజండ్, హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ మాత్ర‌మే. ఒక స‌మ‌యంలో జ‌ట్టు ఇక ఓడిపోతుంద‌న్న స‌మ‌యంలో 175 ప‌రుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడి.. వ‌న్డే హ‌య్య‌స్ట్ స్కోర్ వ‌ర‌ల్డ్ రికార్డ్ స్థాపించ‌డంతో క‌పిల్ పేరు ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత‌మైంది. ఇక ఆనాటి వ‌ర‌ల్డ్ క‌ప్ సైతం సాధించ‌డంతో.. ప్ర‌పంచ క్రికెట్ చరిత్ర‌లోనే  కెప్టెన్సీ ఇన్నింగ్స్ అన్న‌దొక ఎరా మొద‌లైంది. ఒక అండ‌ర్ డాగ్ టీమ్.. కూడా వ‌ర‌ల్డ్ క‌ప్ కొల్ల‌గొట్ట‌గ‌ల‌ద‌న్న ఇన్ స్పిరేష‌న్ వ‌చ్చిందే క‌పిల్ నుంచి. ఈ ప్ర‌భావంతోనే ఇమ్రాన్ ఖాన్- పాకిస్థాన్, ఆపై అర్జున ర‌ణ‌తుంగ‌- శ్రీలంక‌కు క‌ప్పులు సాధించి పెట్టారంటే అతిశ‌యెక్తి కాదేమో.  త‌ర్వాత భార‌త జ‌ట్టు వ‌రుస వ‌ర‌ల్డ్ క‌ప్పులు ఆడుతూ వ‌చ్చింది. కానీ అజ‌ర్ వంటి వారు అప్ప‌టి భార‌త‌ జ‌ట్ల‌కు కెప్టెన్ గా ప‌ని చేసిన పేరే గానీ.. సార‌ధ్యం అంటే ఇది, కెప్టెన్సీ అంటే ఇదీ అన్న పేరొచ్చింది మాత్రం.. గంగూలీ నుంచి మొద‌లైంద‌ని చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కెప్టెన్సీని త‌న ప‌ర్స‌న‌ల్ ఇష్యూ గా గంగూలీ తీస్కుని లార్డ్స్ లో చొక్కా ఎగ‌రేశారో ఆనాటి నుంచి మ‌న వాళ్ల కెప్టెన్సీలో ఒక జోష్ వ‌చ్చిందని చెప్ప‌క త‌ప్ప‌దు. ఆ త‌ర్వాత మ‌న‌కు ధోనీ రూపంలో ఒక కంప్లీట్ కెప్టెన్ దొరికాడ‌నే చెప్పాలి. ఈ రాంచీ రాక్ స్టార్.. ఇటు 2007 టీ ట్వంటీ వ‌ర‌ల్డ్ క‌ప్, ఆపై 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్, అటు పిమ్మ‌ట టెస్ట్ చాంపియ‌న్ షిప్ సైతం సాధించి.. ఇటు క‌పిల్ కి కూడాలేని అరుదైన రికార్డు త‌న పేరిట లిఖింప చేస్కుని ఆల్ టైం గ్రేటెస్ట్ ల‌లోనే టాప్ మోస్ట్ గా నిలిచాడు. ఆపై కోహ్లీ వంటి వారు కెప్టెన్సీ చేసినా.. అదేమంత రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు. రోహిత్ శ‌ర్మ సార‌ధ్యంలోని భార‌త జ‌ట్టు తొలినాటి వెస్టిండీస్ జ‌ట్టులా త‌యారైంది. అయితే ఇక్క‌డ ఆస్ట్రేలియా ప్ర‌స్తావ‌న కొంత చేయాల్సి ఉంటుంది. అలెన్ బోర్డ‌ర్, రికీపాంటింగ్, పాట్ క‌మిన్స్ వీరంతా కూడా వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ కెప్టెన్సే. వ‌ర‌ల్డ్ క‌ప్ విన్నింగ్ కెప్టెన్సే ఎందుకు ప్రామాణికం అంటే  అవి వారి వారి కెప్టెన్సీకి గీటురాళ్లు కాబ‌ట్టి. మ‌న ద‌గ్గ‌ర కెప్టెన్సీ ఎఫెక్ట్ ఆన్ టీం మొద‌లైందే.. వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి కాబ‌ట్టి.. దీన్ని మ‌నం ప‌రిగ‌ణ‌లోకి తీస్కోవల్సి వ‌స్తోంది.  అయితే ప్ర‌పంచ క్రికెట్ జ‌ట్ల‌న్నీ వేరు వేరు. ఆస్ట్రేలియా మాత్ర‌మే వేరు వేరు. కార‌ణం ఏంటంటే.. ఆస్ట్రేలియా జ‌ట్టు అన్న‌ది కేవ‌లం కెప్టెన్సీ మీద ఆధార‌ప‌డ్డ జ‌ట్టు కాదు. అస‌లా బోర్డే సూప‌ర్ డూప‌ర్ బోర్డు. అక్క‌డ ఆస్ట్రేలియా ప్లేయ‌ర్లు క్రికెట్ ఆడ‌రు. ఆ బోర్డు వారి చేత ఆడిస్తుంది. క‌మిన్స్ లాంటి బ‌ల‌హీనులున్నా కూడా క‌ప్పు కొల్ల‌గొట్ట‌డం ఖాయం. ఇలా ఎందుకు అనాల్సి ఉంటుందంటే.. ఇదే క‌మిన్స్ హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్ కూడా. మ‌రి పోయిన ఐపీఎల్ లో ఆయ‌న కెప్టెన్సీ పెర్ఫామెన్స్ ఏపాటిదో మ‌న‌మంతా చూసే ఉంటాం. దీన్నిబ‌ట్టీ చూస్తే.. కెప్టెన్లంటే ఆస్ట్రేలియ‌న్లు ఈ కోవ‌లోకి రారని చెప్పాల్స ఉంటుంది.  ఈ లెక్క‌న మ‌నం క‌పిల్ త‌ర్వాత పాత త‌రంలో ఇమ్రాన్, ర‌ణ‌తుంగ‌నైనా కెప్టెన్లుగా అంగీక‌రించ‌వ‌చ్చుగానీ  వ‌ర‌ల్డ్ క‌ప్ విన్న‌ర్ల‌యిన బోర్డ‌ర్, పాంటింగ్, క‌మిన్స్ ని ఊహించుకోలేం. వీరిలో పాంటింగ్ ఒక‌టిక‌న్నా ఎక్కువ క‌ప్పులు కొల్ల‌గొట్టిన కెప్టెన్. అయినా స‌రే ఆయ‌న‌కంటూ ఆ కిరీటం పెట్ట‌డానికి వీల్లేదంటాఉ క్రికెట్ క్రిటిక్స్.  కార‌ణం ఏంటంటే వారి టీమే అల్టిమేట్ గా ఉంటుంది. రిజ‌ర్వ్ బెంచ్ కూడా ఎంతో స్ట్రాంగ్ గా ఉండే టీముల్లోనే నెంబ‌ర్ వ‌న్ ఆసీస్ కావ‌డం వ‌ల్ల‌.. వారికంటూ ప్ర‌త్యేక కెప్టెన్సీ కెపాసిటీని ఆపాదించ‌లేం. సో.. త‌ర్వాతి కాలంలో టీమిండియా కెప్టెన్సీల్లోనే బాగా పేరు ప‌డింది.. మాత్రం రోహితే.. రోహిత్ శ‌ర్మ నాయ‌క‌త్వంలోని టీమిండియా ఎన్నో టైటిళ్లు.. అన్ డిఫీట‌బుల్ గా కొల్ల‌గొట్టింది. ఆ మాట‌కొస్తే గ‌త వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో రోహిత్ కెప్టెన్సీలో మ‌న వాళ్లు ఫైన‌ల్లో త‌ప్ప మరే మ్యాచ్ లోనూ ఓడి పోలేదు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్2024 కూడా ఇలాగే ఎక్క‌డా ఓడిపోకుండా గెలిచింది రోహిత్ నాయ‌క‌త్వంలోని టీమిండియా. ఈ లెక్క‌న చూస్తే భార‌త బెస్ట్ కెప్టెన్స్ వ‌రుస‌ ఒక‌సారి చూసుకుంటే మొట్ట మొద‌ట క‌పిల్ ద ఫ‌స్ట్ లెజండ‌రీ కెప్టెన్ కాగా, సెకండ్ వ‌న్- ధ‌నా ధ‌న్ ధోనీ. ఆ మ‌ధ్య కాలంలో సౌర‌వ్ గంగూలీ. ఆ త‌ర్వాత మాత్రం రోహిత్ శ‌ర్మగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. ఎనీహౌ కంగ్రాట్స్ రోహిత్! వియ్ ప్రౌడ్ ఆఫ్ యూ!! థాంక్యూ థాంక్యూ వెరీ మ‌చ్ ఫ‌ర్ యువ‌ర్ మెమ‌ర‌బుల్ కెప్టెన్సీ నాక్స్ ఎట్ ఆల్!!! అన్న‌ది స‌గ‌టు భార‌త క్రికెట్ అభిమాని కామెంట్ గా తెలుస్తోంది.  

ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంపు

  హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగన  ఛార్జీలు ఈ నెల 6నుంచి అమలులోకి వస్తాయని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.మొదటి 3 స్టేజీల వరకు రూ.5 పెంపు 4 స్టాపుల తరువాత రూ.10 చొప్పున అదనపు ఛార్జీ వసూలు చేయనుంది. ఆర్డినరీ బస్సులో 1 నుండి 3 స్టాపుల వరకు రూ.5 పెంచారు.    మెట్రో డీలక్స్‌, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ.5, రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేయనున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది. నగరంలో దశలవారీగా హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ లోపల రాబోయే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్‌ బస్సులను దశల వారీగా డీజిల్‌ బస్సుల స్థానంలో ప్రవేశ పెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో పది డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని, వాటికి 10 ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.