దేశంలో తొలి డిజిటల్ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభం

  దేశంలోనే తొలి డిజిటల్ ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. రూ.19,650 కోట్ల భారీ వ్యయంతో  ప్రభుత్వ-ప్త్రెవేటు భాగస్వామ్యం కింద ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఒక టెర్మినల్‌తో ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యం దీని సోంతం. ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతు 2014లో దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు ఉంటే. ప్రస్తుతం ఆ సంఖ్య 160కి పైగా పెరిగియని తెలిపారు. నవీ ముంబై ఎయిర్‌పోర్టు ఆసియాలో బిగ్గెస్ట్ కనెక్టివిటీ హబ్‌గా మారుతుందని ప్రధాని పేర్కొన్నారు. ఇప్పుడు బహుళ విమానాశ్రయాలు కలిగిన ప్రపంచ నగరాల జాబితాలో ముంబైకి ప్రత్యేక స్థానం లభించింది. 1,160 హెక్టార్ల విస్తీర్ణంలో నిర్మితమైన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలో పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. ఈ సౌకర్యం పూర్తిస్థాయిలో పనిచేసిన తర్వాత సంవత్సరానికి తొమ్మిది కోట్ల ప్రయాణికులను, 3.25 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను రవాణా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రారంభ దశలో సంవత్సరానికి రెండు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించనుంది. అంతర్జాతీయ వాయు రవాణా సంఘం (ఐఏటీఏ) ప్రకారం, ఈ కొత్త విమానాశ్రయం ముంబై ప్రాంతపు విమాన రవాణా ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, కనెక్టివిటీని పెంచి దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన లాభాలను చేకూర్చనుంది. ఇదే సమయంలో, విమానయాన నియంత్రణ సంస్థ (డీజీసీఏ) సెప్టెంబర్ 30న ఈ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరు చేసింది. నవీ ముంబై విమానాశ్రయం అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో రూపుదిద్దుకుంది. ఇందులో 66 చెక్-ఇన్ పాయింట్లు, 22 స్వీయ-సేవ సామాను డ్రాప్ స్టేషన్లు, 29 బోర్డింగ్ వంతెనలు, బస్సు బోర్డింగ్ కోసం 10 గేట్లు ఉన్నాయి. 5జీ నెట్‌వర్క్‌లు, అధునాతన సెన్సార్‌లు, ఆటోమేటెడ్ లగేజ్ సిస్టమ్‌లు, అలాగే డీజీ యాత్ర ద్వారా కాంటాక్ట్‌లెస్ ప్రాసెసింగ్‌ వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కార్గో విభాగం పూర్తిగా ఆటోమేషన్ ఆధారంగా పనిచేస్తుంది. డిజిటల్ కన్సైన్‌మెంట్ ట్రాకింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అలాగే మందులు, పాడైపోయే వస్తువుల కోసం ప్రత్యేక ఉష్ణ నియంత్రిత విభాగాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సౌకర్యాలతో నవీ ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యాధునిక విమాన కేంద్రాలలో ఒకటిగా నిలవనుంది.  

బీసీ రిజర్వేషన్లపై విచారణ వాయిదా

  బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు విచారణకు హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు నామినేషన్లు దాఖలు చేయకుండా స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, అందుకు హైకోర్టు నిరాకరించింది. అటు రేపు మరి కొన్ని వాదనలు వినిపిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్‌ 9 జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ బుట్టెంబారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఆర్‌.కృష్ణయ్య, వి.హనుమంతరావుతో పాటు పలువురు బీసీ నేతలు ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. అన్ని పిటిషన్లను కలిపి సీజే జస్టిస్‌ ఏకే సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. బీసీ కోటా పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285-ఏను సవరించామని అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం ఇంకా లభించలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది.  

ఏపీలో రోడ్ల మరమ్మతులకు భారీగా నిధులు

  ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేసింది. మొత్తం 274 రహదారుల మరమ్మతుల కోసం ఈ నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు పాలనాపరమైన అనుమతులను మంజూరు చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్‌ హైవేస్‌లో 108 పనులకు రూ.400 కోట్లు, జిల్లా రోడ్లలో 166 పనులకు రూ.600 కోట్లు మంజూరు చేశారు.  గత వైసీపీ ప్రభుత్వం రోడ్లను పట్టించుకోలేదు. జగన్ హయాంలో చాలా రోడ్లు అధ్వాన్నంగా మారాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. దీంతో కొత్త రోడ్లతో పాటు మరమ్మతులు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల దృష్టి పెట్టింది. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో చర్చించింది. మొత్తం 274 రోడ్ల పనులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ. 1000 కోట్లు నిధులు మంజూరు చేసింది.   

రెండు దగ్గు సిరప్‌లపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం

  తెలంగాణలో రెండు దగ్గు సిరప్‌లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిలీఫ్‌, రెస్పిఫ్రెష్‌ టీఆర్‌ కాఫ్‌ సిరప్‌లను తక్షణమే నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మందుల్లో కల్తీ ఉన్నట్లు వైద్య అధికారులు నిర్ధారించారు. ఇటీవల మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లో దగ్గు సిరప్‌ సేవించి 11 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనలు సంచలనం సృష్టించాయి. ఆ నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్‌ఎస్‌) దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అలర్ట్‌ జారీ చేసింది. రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు లేదా జలుబు మందులు సూచించకూడదని స్పష్టం చేసింది. అలాగే ఐదేళ్ల లోపు పిల్లలకు కూడా సాధ్యమైనంతవరకు సిరప్‌లను ఇవ్వవద్దని హెచ్చరించింది. ఆపై వయస్సు ఉన్న చిన్నారులకు మాత్రం వైద్యుల సూచనతో, సరైన మోతాదు, నిర్ణీత కాలవ్యవధిలో మాత్రమే ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు, ఫార్మసీలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. వైద్యుల పర్యవేక్షణ లేకుండా లేదా ప్రిస్క్రిప్షన్‌ లేకుండా పిల్లలకు ఏ రకమైన దగ్గు, జలుబు మందులు ఇవ్వకూడదని తల్లిదండ్రులను హెచ్చరించింది. పిల్లల విషయంలో స్వయంగా వైద్యం చేయడం ప్రమాదకరమని, ఏ చిన్న అనారోగ్యమైనా తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలంటూ అధికారులు సూచించారు.  

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం...ఆరుగురు సజీవదహనం

  అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.  రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మందుగుండు తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 40 మంది కార్మికులు బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నారు. అకస్మాత్తుగా సంభవించిన భారీ పేలుడు ధాటికి షెడ్డు గోడ కూలిపోగా, శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుపోయి ఉండొచ్చని సమాచారం. ఘటనాస్థలిని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ స్పందిస్తూ, వారం క్రితమే స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది కేంద్రాన్ని పరిశీలించి అన్ని రక్షణ చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. అయితే అగ్నినివారణ పరికరాలు సక్రమంగా వినియోగించారా లేదా అనే అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్రస్తుత పరిస్థితులు, సహాయక చర్యలు, వైద్యసాయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలికి వెళ్లి సహాయకచర్యల్లో చురుకుగా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ఇదే విషయంపై హోంమంత్రి అనిత కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో ఆమె మాట్లాడి, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.  

నార్కో టెర్రర్ కేసులో ఎనిమిది మందిపై ఎన్ఐఏ చార్జిషీట్

  లష్కరే తోయిబాతో లింకులు ఉన్న నార్కో టెర్రర్ కేసులో ఎనిమిది మందిపై   చార్జీషీట్‌  దాఖలు అయ్యింది. పాకిస్థాన్  నుంచి సముద్ర మార్గం ద్వారా గుజరాత్‌ తీరానికి డ్రగ్స్‌ను తరలించి, స్మగ్లింగ్‌ చేసిన అంతర్జాతీయ నార్కో టెర్రర్‌ నెట్‌వర్క్‌ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 8 మందిపై చార్జీషీట్‌ దాఖలు చేసింది. నిందితులు ఈ డ్రగ్స్‌ ద్వారా వచ్చిన డబ్బును ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కార్యకలాపాలకు నిధులుగా వినియోగించినట్లు ఎన్ఐఏ విచారణ లో తేలింది.ఈ కేసులో ఇది   ఎనిమిదవ అనుబంధ చార్జీషీట్‌.    ఇటలీకి చెందిన సిమ్రంజీత్‌ సింగ్‌ సంధు, ఆస్ట్రేలియా కు చెందిన తన్వీర్‌ సింగ్‌ బేడీ, భారత్‌కు చెందిన అంకుష్‌ కపూర్‌ లు ఈ నార్కో టెర్రర్‌ కుట్రకు  సూత్రధారులుగా ఎన్ఐఏ నిర్ధారించింది.  డిజిటల్‌, టెక్నికల్‌, డాక్యుమెంటరీ ఆధారాలతో సహా  అహ్మదాబాద్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఈ  చార్జీషీట్‌ దాఖలు చేసింది.  ఈ ముగ్గురితో పాటు పాకిస్తాన్‌ కు చెందిన తారిక్‌ అలియాస్‌ భాయ్‌జాన్‌, గగన్‌దీప్‌ సింగ్‌ అరోరా, తమన్నా గుప్తా, సుఖ్‌బీర్‌ సింగ్‌ అలియాస్‌ హ్యాపీ, అన్వర్‌ మసీహ్‌ లను కూడా ఎన్ఐఏ చార్జిషీట్ లో నిందిుతులుగా పేర్కొంది.  నిందితులు పాకిస్తాన్‌ నుంచి 500 కిలోల హెరాయిన్‌ను గుట్టు చప్పుడు కాకుండా గుజరాత్‌ సముద్ర తీరానికి అక్రమంగా రవాణా చేసి అనంతరం పంజాబ్‌కు తరలించినట్లు పేర్కొంది. ఆలా డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలోసంపాదించిన సొమ్మును లష్కరే తోయిబా  ఉగ్ర కార్యకలాపాలకు మళ్లించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.   ఈ నార్కోటెర్రర్‌ నెట్‌వర్క్‌ గుజరాత్‌, ఢిల్లీ, పంజాబ్‌, చండీగఢ్‌లలో మాత్రమే కాకుండా ఇటలీ, ఆస్ట్రేలియా, యూఏఈ, పాకిస్తాన్‌, ఇరాన్‌, థాయిలాండ్‌ లకు కూడా విస్తరించి ఉందని ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.   భారతదేశంలో అంకుష్‌ కపూర్‌ ప్రధాన పాత్ర పోషించి, పంజాబ్‌లో ఈ నెట్‌వర్క్‌ కార్యకలాపాలను సమన్వయం చేశాడు. డ్రగ్స్‌ నిల్వ, రవాణా, పంపిణీ, అలాగే దేశీయంగా, విదేశాల్లో నిధుల మళ్లింపులో అతని పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. సిమ్రంజీత్‌ సింగ్‌ ఈ స్మగ్లింగ్‌ నెట్‌వర్క్‌ కు సూత్రధారి కాగా, అక్రమంగా డ్రగ్స్‌ రవాణా, నిల్వ, ప్రాసెసింగ్‌, ఉగ్ర నిధుల సేకరణలో   కూడా కీలకపాత్ర పోషించాడు.  ఇక తారిక్‌ అలియాస్‌ భాయ్‌జాన్‌ పాకిస్తాన్‌ నుంచి సముద్ర మార్గం ద్వారా హెరాయిన్‌ రవాణా చేయడం, దాని పంపిణీ, లష్కరే తోయిబా ఆపరేటివ్‌లకు నిధుల మళ్లింపులో ప్రధాన పాత్ర పోషించినట్లుగా ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఆస్ట్రేలియాలో ఉన్న తన్వీర్‌ బేడీ అంతర్జాతీయ హవాలా మార్గాల ద్వారా డ్రగ్‌ డబ్బులను లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాలకు చేరవేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది. త గుజరాత్‌ ఏటీఎస్‌ ఈ కేసులో తొలి చార్జీషీట్‌ దాఖలు చేయగా, ఎన్ఐఏ ఇప్పటివరకు ఏడు సప్లిమెంటరీ చార్జీషీట్లు దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ   26 మందిని అరెస్ట్‌ చేయగా, ఎనిమిది మంది   పరారీలో ఉన్నారు.

బనకచర్ల డీపీఆర్ తయారీకి నోటిఫికేషన్

బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.  ప్రాజెక్ట్‌ డిజైన్‌తో పాటు లిఫ్ట్‌లు, టన్నెళ్లు కట్టే చోట ఇన్వెస్టిగేషన్‌ చేయడం, కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు వీలుగా నివేదిక  తయారు చేయాలని నోటిఫికేషన్‌లో పేరొన్నది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయాల్సి ఉంటుందనీ నోటిఫికేషన్ లో  పేర్కొంది.   కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఆ కన్సల్టెన్సీదేనని పేర్కొంది. ఇందు కోసం  9.20 కోట్లు కేటాయించింది ఆ నోటిఫికేషన్ మేరకు బుధవారం (అక్టోబర్ 8) నుంచి 22వ తేదీవరకూ అనుభవజ్ణులైన కన్సెల్టెన్సీలు బిడ్ లో పాల్గొనేందుకు వీలుగా టెండర్లు దాఖలు చేయవచ్చు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలేశుని దర్శనానికి తరలి వస్తుంటారు. బుథవారం (అక్టోబర్ 8) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వెైకుంఠం కాంప్లెక్స్ లోని కాంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది.   టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక మంగళవారం (అక్టోబర్ 7)  శ్రీవారిని మొత్తం 71,634 మంది దర్శించున్నారు. వారిలో 24,980 మంది    తలనీలాలు సమర్పించుకున్నారు.  శ్రీవారి హుండీ  కానుకల ఆదాయం  4 కోట్ల 74 లక్షల రూపాయలు వచ్చింది.  

తిరుపతి జూపార్క్ లో జాగ్వార్ మృతి

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ లో వన్య ప్రాణుల మృత్యుఘోష ఆడగం లేదు. అసలు ఈ జూపార్క్ లో తరచూ వన్యమృగాలు ఎందుకు మృత్యువాత పడుతున్నాయన్న ప్రశ్నలు వినవస్తున్నాయి. తాజాగా ఇదే జూపార్క్ లో  మంగళవారం (అక్టోబర్ 7) ఒక జాగ్వార్ ప్రమాదవశాత్తూ మరణించింది.  15 సంవత్సరాల వయస్సున ఈ జాగ్వార్ పేరు కుశ.  తిరుపతి శ్రీవేంకటేశ్వర జూపార్క్ కు మంగళవారం సెలవు. దీంతో ఈ పార్క్ లో ఆ రోజు కేవలం జూపార్క్ సిబ్బంది, వణ్యప్రాణుల సంరక్షకులు ఉంటారు. జాగ్వార్ మరణించిందన్న సమాచారం అందుకున్న అటవీ శాఖ విబాగం అధికారులు జూపార్క్ కు వచ్చి పరిశీలించారు. అనంతరం పశువైద్య విద్యాలయం డాక్టర్లు మరణించిన జాగ్వార్ కు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.  2019లో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి ఈ జాగ్వర్ ను తీసుకు వచ్చారు. మంగళవారం (అక్టోబర్ 7) యథావిధిగా జాగ్వార్ ను   విశాల మైదానంలో తిరగడానికి వదిలారు. అయితే కొద్ది సేపటి తరువాత  ఏం జరిగిందో ఏమో కానీ.. ఓ చెట్టుకు చిక్కుకుని మరణించి ఉండటం కనిపించింది.  పోస్టుమార్టం నివేదికలో హైపర్ షాక్, ఆస్పిసియాతో మరణించినట్లు తేలింది.  

ఏ క్షణంలోనైనా మోహిత్ రెడ్డి అరెస్ట్?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో ఏ 39గా ఉన్న మోహిత్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.  మద్యం డిస్ట్రిబ్యూటర్లు, సరఫరా కంపెనీల నుంచి అక్రమంగా వసూలు చేసిన ముడుపులను ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేయడంలో మోహిత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ ఆరోపిస్తున్నది.  ముడుపుల నుంచి వచ్చిన అక్రమ డబ్బును రవాణా చేయడంలో మోహిత్ రెడ్డి పాలుపంచుకున్నారనీ,  తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వాహనాలను ఉపయోగించి ఈ డబ్బును రవాణా చేశారనీ సిట్ తన దర్యాప్తులో గుర్తించింది. అలాగే  తన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్ కంపెనీలు ద్వారా సొమ్మును వైట్  మనీగా మార్చినట్లు గుర్తించింది.  మోహిత్ రెడ్డి రూ. 600 కోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్లు పత్రాలు సృష్టించి మనీ లాండరింగ్ చేశారని సిట్ తన దర్యాప్తులో తేల్చింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు కోసం మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉన్న కారణంగా ఇంత కాలం మోహిత్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఉన్న సిట్.. ఇప్పుడు కోర్టు ఆ యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ రద్దు చేయడంతో ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు.  

భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

భౌతిక శాస్త్రంలో ముగ్గురు అమెరికన్ సైంటిస్టులకు భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది.  జాన్ క్లార్క్, జాన్ ఎం మార్టినిస్, మైఖేల్ హెచ్ డెవోరెట్‌లకు ఈ ఏడాది ఫిజిక్స్‌లో నోబెల్ వరించింది.  క్వాంటం మెకానిక్స్‌పై పరిశోధనలకు గాను ఈ పురస్కారం లభించింది. ఈ విషయాన్ని ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో మైక్రోస్కోపిక్ క్వాంటం మెకానికల్ టన్నెలింగ్, ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణ చేసినందుకు గానూ  జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్ డెవోరెట్, జాన్ ఎం మార్టినిస్‌లను నోబెల్ పురస్కారం వరించింది.  డిసెంబర్ 10వ తేదీన నోబెల్ పురస్కారాల ప్రదానం జరగనుంది. అన్ని డిజిటల్ టెక్నాలజీలకు క్వాంటం మెకానిక్సే పునాది  కనుక వీరి పరిశోధనలు క్వాంటం కంప్యూటర్లు, క్వాంటం సెన్సార్లు, క్వాంటం క్రిప్టోగ్రఫీ వంటి భవిష్యత్ టెక్నాలజీల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తాయని భావిస్తున్నారు.

కర్నూలులో డ్రోన్ సిటీకి 16న ప్రధాని శంకుస్థాపన

ప్రాజెక్టులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నది. అదే సమయంలో ఎన్డీయేలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం ఉండటంతో కేంద్రం నుంచి కూడా ఇతోధిక ప్రోత్సాహం, మద్దతు లభిస్తున్నది. అందుకు తిరుగులేని తార్కానం ఏమిటంటే.. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఏపీలో పర్యటిస్తూ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉండటమే. ఇప్పుడు ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ నెల 16న ఆయన ఏపీ పర్యటనలో భాగంగా కర్నూలులో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ డ్రోన్ సిటీ అన్నది  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కలల ప్రాజెక్ట్. రాష్ట్రాన్ని  డ్రోన్ల హబ్ గా  మార్చాలని చంద్రబాబు సంకల్పించిన సంగతి విదితమే. అందులో భాగంగానే  కర్నూలులో డ్రోన్ల సిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆఘమేఘాల మీద అవసరమైన పనులన్నీ పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కర్నూలులో డ్రోన్ సిటీకి ప్రదాని నరేంద్రమోడీ భూమి పూజ చేయనున్నారు.   అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరగాలని.. ఆ దిశగా ప్రోత్సహించాలని భావిస్తున్న చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్టుగా కర్నూలులో డ్రోన్ సిటీ నిర్మాణాన్ని సంకల్పించారు. ఆ డ్రీమ్ ప్రాజెక్టుకే ఈ నెల 16న ప్రధాని మోడీ భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   కర్నూలులో రోడ్ షోలో పాల్గొననున్నారు.  కాగా ఈ సారి ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించనున్నారు.

పీఎంఓ అధికారిగా నమ్మించి మోసం.. కేసు నమోదుచేసిన సీబీఐ

హైదరాబాద్‌లో మరో విచిత్రమైన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రధానమంత్రి కార్యాలయంలో సీనియర్ అధికారి నంటూ నమ్మింది, ఆంధ్రప్రదేశ్‌ కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రభుత్వ సంస్థలను మోసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తిపై  సీబీఐ కేసు నమోదు చేసింది. పీఎంఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ ఎ.కె.శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 2న  కేసు నమోదైంది. కాగా పీఎంవో డైరెక్టర్ ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో పీఎంఓ డిప్యూటీ  కార్యదర్శిగా పేర్కొంటూ ఈ లేఖను తిరుమల తిరుపతి దేవస్థానాల  కార్యనిర్వాహక అధికారికి వచ్చింది. పీఎంఓ లెటర్‌హెడ్‌పై ఉన్న ఈ లేఖలో  మే 10న తిరుమలలో మూడు ఎసీ డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయించడంతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత దర్శనం కల్పించా లని కోరారు. తీర్థ దర్శనం కోసం వచ్చిన ఈ లేఖను టిటిడి అధికారులు పీఎంఓకి ధృవీకరణ కోసం పంపగా, పీఎంఓలో రామారావు అనే డిప్యూటీ సెక్రటరీ ఎవరూ లేరనే విషయం  బయటపడింది. అయితే అధికారుల దర్యాప్తులో అదే వ్యక్తి, అదే మొబైల్ నంబర్ ఉపయో గించి ఆగస్టు 21న పూణేలోని సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ  వైస్ ఛాన్స లర్‌ను సంప్రదించినట్లు తేలింది. ఈసారి అతను పీఎంఓ జాయింట్ సెక్రటరీగా పరిచ యం చేసుకొని ఎంబీఏ అడ్మిషన్‌ కావాలని సిఫార్సు చేశాడు.. అంతేకాకుండా ఆగస్టు 29న మరో నకిలీ లేఖ వెలుగులోకి వచ్చింది. పీఎంఓ జాయింట్ సెక్రటరీ సి.శ్రీధర్ పేరుతో మైసూరు తహసీల్దార్ కార్యాలయానికి లేఖ పంపించి, భూమి రికార్డులు ఇవ్వాలని అభ్యర్థించాడు. విచారణలో ఈ లేఖలో కూడా అదే మొబైల్ నంబర్ ఉపయోగించబడినట్లు పీఎంఓ గుర్తించింది. ఈ ఘటనలపై పీఎంఓ సమర్పించిన ఆధారాల మేరకు  సీబీఐ నిందితునిపై  మోసం, ఫోర్జరీ తో పాటు  ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66డి  కింద కేసు నమోదు చేసింది. నిందితుడి పూర్తి వివరాలు, అతని కార్యకలా పాల వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని వెలికితీయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.

ఓటీపీతో పని లేకుండానే ఖాతాలు ఖాళీ!

బిగ్ బ్యాస్కెట్ పేరుతో బడా మోసం ఆన్ లైన్ మోసాలు మితిమీరి పోతున్నాయి. ఏది అస‌లో ఏది న‌కిలీయో తెలియనంతగా ఈ మోసాలు పెచ్చరిల్లుతున్నాయి.  మీ బ్యాంకులో డ‌బ్బులుంటే చాలు అవి ఖాళీ చేయడానికి సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో దండెత్తుతున్నారు.   తాజాగా యూస‌ఫ్ గూడాలో ఓ వ్యక్తి  బిగ్ బాస్కెట్ పేరిట మోస పోయిన విధం దిగ్భ్రమగొల్పేలా ఉంది. అదెలాంటిదంటే మార్కెట్ రేట్ క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు కిరాణా స‌రుకులు. ఆల‌సించిన ఆశా భంగం. మంచి త‌రుణం మించిపోతోంద‌న్న ప్ర‌క‌ట‌న చూసి.. నిజంగానే ఇదంతా ద‌స‌రా, దీపావ‌ళి ఢ‌మాకా ఆఫ‌ర్ అనుకున్నాడు. దానికి తోడు అది షారూఖ్ ఖాన్ వంటి బడా స్టార్స్ ప్రమేట్  సేసే బిగ్ బాస్కెట్ కావ‌డంతో.. క్షణం ఆలోచించకుండా ఆ యాడ్ కు రెస్పాండ్ అయ్యాడు.  వాట్స‌ప్ ద్వారా వాళ్లు పంపిన‌ ఏపీకే లింక్  క్లిక్ చేశాడు. ఇలా క్లిక్ చేశాడో లేదో.. అలా కనీసం ఓటీపీ నంబర్ కూడా అడగకుండానే  ల‌క్షా 97 వేల రూపాయ‌ల‌ను అతడి బ్యాంక్ అక్కౌంట్ నుంచి ఖాళీ అయిపోయాయి. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించిందా వ్య‌క్తికి. ఇదేంటి? చౌక ద‌ర‌ల‌కు కిరాణా సామాన్లు వ‌స్తాయ‌నుకుంటే.. మ‌న  ద‌గ్గ‌ర నుంచి ఎలాంటి ఓటీపీ అడ‌క్కుండానే డ‌బ్బులాగేశారంటూ ల‌బోదిబోమ‌న‌డం అత‌డి వంత‌య్యింది. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కూ ఉన్న స్కాముల్లో ఓటీపీలు అడ‌గ‌టంతో డౌట్ వ‌చ్చేది. ఆ దిశ‌గా అందరూ చాలా వరకూ  అలెర్ట్ గా ఉంటున్నారు. ఇప్పుడు ఓటీపీ నంబర్ తో పని లేకుండా సొమ్ము ఖాతాల నుంచి ఖాళీ చేయడమనే కొత్త ట్రిక్ తో సైబర్ నేరగాళ్లు ఆరితేరిపోయారు.  అతడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆ లింక్  ఎక్క‌డి  నుంచి వ‌చ్చింది.. ఏంట‌న్న‌ది? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఇలాంటి లింకుల ప‌ట్ల అప్ర‌మత్తంగా ఉండాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. కాబ‌ట్టి బీ అవేర్ ఆఫ్ ఇట్ అంటోంది సైబ‌ర్ క్రైమ్ డిపార్ట్ మెంట్.

విమర్శనాత్మక కథనాలపై జర్నలిస్టులపై కేసులు సరికాదు.. సుప్రీం

విమర్శనాత్మక వార్తలు రాసే జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరైనది కాదని దేశ సర్వోత్తమ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇలా కేసులు పెట్టడం భావ ప్రకటనాస్వేచ్ఛకు విఖాతం కిందకే వస్తుందని పేర్కొంది.  తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఓ జర్నలిస్టు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే సదరు జర్నలిస్టుపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి  ఆ జర్నలిస్టుకు అండగా నిలిచింది. వివరాలిలా ఉన్నాయి...  ఉత్తర్‌ప్రదేశ్‌లోని అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్ ప్రభుత్వ పాలనా విభాగంలో కుల సమీకరణాలకు సంబంధించి ఓ కథనం రాశారు. ఈ  వార్తా కథనం రాసినందుకు అభిషేక్ ఉపాధ్యాయపై  యూపీ సహా పలు ప్రాంతాలలో పోలీసు కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టివేయాలని కోరుతూ అభిషేక్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అభిషేక్ ఉపాధ్యాయ పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం  ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని పేర్కొంది.  ప్రజాస్వామ్య దేశాల్లో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించాలనీ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉందని పేర్కొంది.  కేవలం జర్నలిస్టులు రాసిన కథనాలను విమర్శలుగా భావించి.. వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని కుండబద్దలు కొట్టింది.   తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.

లోకేష్.. బ్రేకింగ్ బౌండరీస్!

మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళా క్రికెటర్లలో స్ఫూర్తి నింపే లక్ష్యంతో విశాఖలోని క్రికెట్ స్టేడియంలో రెండు స్టాండ్ లకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఆయన ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ కు చెప్పారు. దీంతో ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ ఆ మేరకు నిర్ణయం తీసుకుని ప్రకటన విడుదల చేసింది. విశాఖపట్నంలోని వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రెండు స్టాండ్లకు భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, అలాగే ఆంధ్రప్రదేశ్ కు చెందిన క్రికెటర్ రవికల్పన పేర్లు పెట్టనున్నట్లు ప్రకటించింది.  ఇప్పటి వరకూ ఒక స్టేడియంలో స్టాండ్ లకు మహిళా క్రికెటర్ల పేర్లు పెట్టిన సందర్భం లేదు. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ తొలి సారిగా ముందుకు అడుగు వేసి ఇద్దరు మహిళా క్రికెటర్ల పేర్లను విశాఖ స్టేడియంలోని స్టాండ్ లకు పెట్టింది. ఇందుకు చొరవ చూపి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆ మేరకు ప్రకటించేలా చర్యలు తీసుకోవడం ద్వారా లోకేష్ తాను బౌండరీలను బ్రేక్ చేయడానికి సదా సిద్ధంగా ఉంటానని నిరూపించుకున్నారు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక లోకేష్ ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో బ్రేకింగ్ బౌండరీస్ అనే చర్చా కార్యక్రమంలో లోకేష్ కు స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా దేశంలోని క్రికెట్ స్టేడియంలలో స్టాండ్ లకు పురుష దిగ్గజ క్రికెటర్ల పేర్లే ఎందుకు ఉంటాయి, మహిళలకు గుర్తింపు ఎందుకు లేదు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మాటల్లో కాకుండా చేతల్లో సమాధానం చెప్పారు లోకేష్. ఆగస్టులో స్మృతి మంధానా దేశంలో మహిళా క్రికెటర్లకు గుర్తింపు ఏది? అన్న ప్రశ్నకు నెల తిరగకుండా లోకేష్ సమాధానం ఇచ్చారు. మహిళల వరల్డ్ కప్ లో భాగంగా ఈ నెల 12న విశాఖ స్టేడియంలో  భారత్, ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ సందర్భంగా విశాఖ స్టేడియంలోని రెండు స్టాండ్ లకు మిథాలీరాజ్, రవి కల్పనల పేర్లు పెడుతూ ఆ ఇద్దరు క్రికెటర్లనూ ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ సన్మానించనుంది. స్టేడియంలో  ఒక స్టాండ్ కు మిథాలీరాజ్, ఒక గేటుకు రవి కల్పనల పేర్లు పెట్టడం భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే ఒక గొప్ప సంఘటనగా చెప్పవచ్చు.  ప్రస్తుతం జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్  లో భారత జట్టు అద్భుతంగా ఆడుతూ పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో ఉంది. ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లలో వరుస విజయాలతో జోరుమీద ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకేష్ చొరవతో ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో భారత మహిళా క్రికెటర్లలో జోష్ మరింత పెరిగే అవకాశం ఉందని క్రీడా పండితులు చెబుతున్నారు.  భారత మహిళా క్రికెట్ చరిత్రలోనే  అత్యంత విజయవంతమైన బ్యాట్స్ విమెన్ మిథాలీ రాజ్ ఆమె   తన కెరీర్ లో  సాధించిన విజయాలు భారత్ లో మహిళా క్రికెట్ కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయనడంలో సందేహంలేదు. తన కెరీర్ లో  మిథాలీ భారత్ తరపున 300 పైచిలుకు మ్యాచ్ లు ఆడి, పది వేల పరుగులకు పైగా సాధించారు. ఇక భారత మహిళా క్రికెట్ జట్టుకు సౌకర్యాలు, ప్రాధాన్యత, పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ పీజు వంటివి సాధించడంలో కీలక పాత్ర పోషించారు.  ఇక రవి కల్పన ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్. ఆమె రాష్ట్ర క్రికెట్ నుండి భారత జట్టు వరకు ఎదిగిన ప్రయాణం అనేక మంది యువ మహిళా క్రికెటర్లకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ ఇరువురినీ ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ సన్మానించి, గౌరవించడం ముదావహం. 

వివేకా హత్య కేసు.. మళ్లీ కోర్టును ఆశ్రయించిన డాక్టర్ సునీత

వివేకా హత్య కేసు విచారణ కొనసాగించాలని కోరుతూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు ఇంకా బయటకు రావాల్సి ఉందని, విచారణ కొనసాగిస్తేనే అది జరుగుతుందని ఆమె సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి పిటిషన్ కాపీలను నిందితులకు అందేలా చూడాలన్నారు.  గతంలో ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ దర్యాప్తునకు గత ప్రభుత్వంలో ఆటంకాలు కలిగించారని, అధికార దుర్వినియోగం జరిగిందని ధర్మాసనం వ్యాఖ్యా నించింది. దర్యాప్తును కొనసాగించాలని కోర్టు ఆదేశాసిస్తే కొనసాగిస్తామని సీబీఐ తెలిపింది. అయితే దర్యాప్తు కొనసాగింపుపై సుప్రీంకోర్టు.. నిర్ణయం తీసుకోకుండా,  ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎనిమిది వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం పేర్కొంది. దీంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం  సూచనలతో వైఎస్ సునీత హైదరాబాద్ సీబీఐ కోర్టులో కేసు విచారణ కొనసాగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.  

పిల్లల పంచాయతీకి ఓ తండ్రి బలి

పిల్లల పంచాయతీకి ఓ తండ్రి బలి అయిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ ఔషపూర్ లో నివాసం ఉంటున్న అమీర్ అనే వ్యక్తి ఇద్దరు చిన్నారులు గొడవ పడుతూ ఉంటే వారిని గట్టిగా మందలించాడు. అదే ప్రాంతానికి చెందిన ఆలీ అనే వ్యక్తి  నా కొడుకునే మందలిస్తావా అంటూ ఆగ్రహంతో  ఊగిపోయాడు. అమీర్ ఇంటికి వెళ్లి  దాడికి పాల్పడ్డాడు.  ఇరు కుటుంబ సభ్యులు వచ్చి అలీని అడ్డుకున్నారు.   నచ్చచెప్పి ఇంట్లోకి తీసుకు వెళ్లారు.. అయితే ఈ దాడి తరువాత  అమీర్ తనకు  ఛాతీ లో  బాగా నొప్పిగా ఉందని భార్యతో చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై అమీర్ ను హాస్పిటల్ కి తరలిస్తుండగా మార్గంలోనే  మరణించాడు.  విషయం తెలుసు కున్న వెంటనే దాడికి పాల్పడ్డ అలీ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అలీ దాడి చేయడం వల్లనే అమీర్ చనిపోయాడని కుటుంబ సభ్యులు రోడ్డు మీద ఆందో ళన చేపట్టారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఓ చిన్న గొడవ కారణంగా ఓ తండ్రి మరణించగా... మరో తండ్రి జైలు పాలు అవ్వాల్సి వచ్చింది. అలా రెండు కుటుంబాలూ శోకంలో మునిగిపోయిన పరిస్థతి ఏర్పడింది. 

స‌నాత‌న ధ‌ర్మం ఎంత ప‌ని చేసిందో చూశారా!?

స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ అన్న‌ది నేడు ఒక జాతీయ హీరోయిజం కింద మారిపోయింద‌న‌డానికి ఇదో ఉదాహ‌ర‌ణ‌. సుప్రీం చీఫ్ జ‌స్టిస్ గ‌వాయ్ పై సీనియ‌ర్ లాయ‌ర్ రాకేశ్ కిశోర్ దాడి యత్నం ఘ‌ట‌న‌  ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా  చ‌ర్చ‌కు దారి తీసింది. సాధార‌ణంగా ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, న్యాయ‌వాది మ‌ధ్య ఎంతో ప్ర‌త్యేక అనుబంధం ఉంటుంది. మాములుగా  న్యాయ‌మూర్తి ప‌ట్ల‌ న్యాయ‌వాదులు ఎంతో గౌర‌వ భావంతో, భ‌య‌భ‌క్తుల‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అలాంటిది ఒక న్యాయ‌వాది.. ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ పై ఇలా దాడికి ప్రయత్నించడం వెనుక ఉన్న వెన్ను ద‌న్ను.. స‌నాత‌న ధ‌ర్మ‌మేనంటారు పరిశీలకులు. ఇంత‌కీ ఈ లాయర్ ఎందుక‌ని ఒక చీఫ్ జ‌స్టిస్ దాడి చేయాలనుకున్నారంటే.. ఇటీవ‌ల జ‌స్టిస్ గ‌వాయ్ విష్ణుమూర్తిపై చేసిన కామెంట్లే కారణమని  భావిస్తున్నారు. మ‌ధ్య ప్ర‌దేశ్ లోని ఖ‌జ‌ర‌హో- జ‌వారీ ఆల‌యంలోని విష్ణుమూర్తి విగ్ర‌హం మొఘ‌లాయిల‌ కాలంలో ధ్వంసమైంది.  ఈ విగ్ర‌హాన్ని పునః ప్ర‌తిష్ట‌ చేయాలంటూ  పిటిష‌న్ దాఖలైంది. ఆ కేసు విచార‌ణ స‌మ‌యంలో జ‌స్టిస్ గ‌వాయ్.. మీరు విష్ణు భ‌క్తులు క‌దా? అయితే ఆ విష్ణుమూర్తినే వేడుకోండి! అంటూ  కామెంట్ చేశారు. అక్క‌డితో ఆగ‌కుండా ఇది ప్ర‌జా వాజ్యం కాదు.. ప‌బ్లిసిటీ స్టంట్ లో భాగం అంటూ ప‌రుషంగా మాట్లాడ్డం  లాయ‌ర్ రాకేశ్ కిశోర్ కోపానికి కారణమైంది. ఆ కారణంగానే లాయర్ రాకేష్ కిషోర్   జ‌స్టిస్ గ‌వాయ్ పై దాడికి ప్రయత్నించాడని అంటున్నారు. ఈ దాడి యత్నం తరువాత న్యాయవాది రాకేష్ కిషోర్ ను అరెస్టు చేయలేదు..   మూడు గంట‌ల పాటు విచారించి ఆయ‌న గవాయ్ పైకి విసరబోయిన బూటు ఆయ‌న‌కిచ్చి వ‌దిలేశారు.  అయితే బార్ కౌన్సిల్ స‌భ్య‌త్వం తాత్కాలికంగా ర‌ద్దు చేసి, ఆపై దేశంలో ఎక్క‌డా వాదించ‌కుండా ఆదేశాలు జారీ  చేశారు. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే ఒక ప్ర‌ధాన న్యాయ‌మూర్తిపై దాడి చేయబోయిన లాయర్ రాకేష్ కిషోర్ పై   కేసు న‌మోదు చేయ‌డానికి రిజిస్ట్రార్ సైతం ఒప్పుకోక పోవ‌డం. గ‌తంలో ప్ర‌శాంత్ భూష‌ణ్ అనే లాయ‌ర్ పై కూడా సుప్రీం కోర్టు ఇలాగే ఒక్క రూపాయ ఫైన్ వేసింది. అది భావ‌ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన విష‌యం కాగా, ఇది సీజేఐపైనే  దాడి య‌త్నం చేసిన ఘ‌ట‌న‌.  వీట‌న్నిటిని బ‌ట్టి చూస్తుంటే స‌నాత‌న ధ‌ర్మం అండ‌తో సుప్రీం చీఫ్ జ‌స్టిస్ అని కూడా చూడ‌కుండా దాడియత్నానికి తెగ‌బ‌డుతున్నారంటే దేశంలో సనాత‌న ధ‌ర్మం ఇస్తోన్న దైర్యం ఏపాటిదో అర్ధం చేసుకోవ‌చ్చంటున్నారు సామాజిక‌వేత్త‌లు.