కర్నూలులో డ్రోన్ సిటీకి 16న ప్రధాని శంకుస్థాపన
posted on Oct 7, 2025 @ 3:05PM
ప్రాజెక్టులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నది. అదే సమయంలో ఎన్డీయేలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం ఉండటంతో కేంద్రం నుంచి కూడా ఇతోధిక ప్రోత్సాహం, మద్దతు లభిస్తున్నది. అందుకు తిరుగులేని తార్కానం ఏమిటంటే.. ప్రధాని నరేంద్ర మోడీ తరచూ ఏపీలో పర్యటిస్తూ కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తూ ఉండటమే.
ఇప్పుడు ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈ నెల 16న ఆయన ఏపీ పర్యటనలో భాగంగా కర్నూలులో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ డ్రోన్ సిటీ అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కలల ప్రాజెక్ట్. రాష్ట్రాన్ని డ్రోన్ల హబ్ గా మార్చాలని చంద్రబాబు సంకల్పించిన సంగతి విదితమే. అందులో భాగంగానే కర్నూలులో డ్రోన్ల సిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆఘమేఘాల మీద అవసరమైన పనులన్నీ పూర్తి చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కర్నూలులో డ్రోన్ సిటీకి ప్రదాని నరేంద్రమోడీ భూమి పూజ చేయనున్నారు.
అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరగాలని.. ఆ దిశగా ప్రోత్సహించాలని భావిస్తున్న చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్టుగా కర్నూలులో డ్రోన్ సిటీ నిర్మాణాన్ని సంకల్పించారు. ఆ డ్రీమ్ ప్రాజెక్టుకే ఈ నెల 16న ప్రధాని మోడీ భూమి పూజ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, సీఎం చంద్ర బాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కర్నూలులో రోడ్ షోలో పాల్గొననున్నారు. కాగా ఈ సారి ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయాన్ని దర్శించనున్నారు.