ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రామ్ చరణ్ దంపతులు

  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు ప్రధాని మోదీని కలిశారు. అనిల్‌ కామినేని సారథ్యంలో వరల్డ్‌ ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహిస్తున్న వరల్డ్ ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించిన వివరాలను ఉపాసనతో కలిసి ప్రధానికి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా  శ్రీ వేంకటేశ్వరస్వామి జ్ఞాపికతో పాటు, ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును ప్రధానికి అందించారు.  దీనికి సంబంధించి ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. లీగ్ విజయ వంతం అయిన సందర్బంగా మోదీని కలిసినట్లు చరణ్ తెలిపారు. మరోవైపు  రామ్‌చరణ్‌  బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీలో నటిస్తున్నారు. జాన్వీకపూర్‌ హీరోయిన్ ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఫైనాన్స్ సంస్థ మోసం...యువకుడు బలి

  మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ సంస్థ క్యూనేట్ మోసానికి ఓ యువకుడు బలి అయినా ఘటన ఆ కుటుంబంలో విషా దాన్ని నింపింది. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం లో ఉన్న వేలూరు లో నివాసముంటున్న హరికృష్ణ (26) అనే యువకుడు మల్టీ లెవెల్ చైన్ ఫైనాన్స్ సంస్థలో నాలుగు లక్షల కడితే ప్రతి నెల 15 వేల రూపాయల వడ్డీ వస్తుం దని నమ్మించారు. ఆ మాటలు నిజమని నమ్మిన హరికృష్ణ అప్పు చేసి మరి నాలుగు లక్షల రూపాయలు క్యూనెట్ కంపెనీకి ఇచ్చాడు.  ఆ తర్వాత క్యూనెట్ కంపెనీ ఇచ్చిన షాక్ కి హరికృష్ణ మైండ్ బ్లాక్ అయింది. ఇది చైన్ లింక్ కాబట్టి మరో వ్యక్తితో నాలుగు లక్షలు కట్టిస్తేనే 15 రూపా యలు వస్తాయని చెప్పారు. అసలే హరికృష్ణ గతంలో ఆన్లైన్ బెట్టింగ్స్  ఆడి రూ.18 లక్షలు నష్టపోయాడు. ఇప్పుడు తాజాగా మరో నాలుగు లక్షల అప్పుచేసి తీసుకు వచ్చి క్యూనెట్ కంపెనీలో పెట్టాడు.  ఒకవైపు అప్పుల బాధ.... మరోవైపు క్యూ నెట్  సంస్థ మోసాన్ని భరించ లేక తీవ్ర మనస్థా పానికి గురైన హరికృష్ణ ఆత్మ హత్య చేసుకున్నా డు అయితే హరి కృష్ణ ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఒక సూసైడ్ నోట్ రాశాడు. క్యూనెట్ కంపెనీ నన్ను మోసం చేసింది. వాళ్లు చెప్పింది ఒకటి అందులో చేసేది మరొకటి... వారి మాటలు నమ్మి నేను అప్పు చేసి మరీ నాలుగు లక్షల కట్టారు.  డబ్బులు కట్టిన తర్వాత ఆ కంపెనీ నన్ను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ... సూసైడ్ నోట్లో రాసి ఆత్మ హత్య చేసుకు న్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వివాహేతర సంబంధంతో విషాదం… రెండు కుటుంబాల విచ్చిన్నం

  అక్రమ సంబంధాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ప్రజలలో మార్పు రావడం లేదు. అక్రమ సంబంధాల వలన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతు ప్రాణాల మీదికి వస్తున్నప్పటికీ తమ తీరును మార్చుకోలేకపోతున్నారు. తాజాగా అక్రమ సంబంధంతో ప్రియుడు ప్రియురాలు కూడా ఒకరి మీద మోజుతో మరొకరు కుటుంబ సంబంధాలను తెంచుకొని ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.  కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గువ్వలదొడ్డి లో గ్రామానికి చెందిన  ధనుంజయ గౌడ్ (27) అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తన కంటే పెద్దది అయిన  శశికళతో  ప్రేమ లో పడ్డారు. అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ వేరే వేరే వారితో పెళ్లిళ్లు చేసుకుని జీవనం సాగించారు. అయితే పెళ్లి అయిన తరువాత కూడా వారి మధ్య వివాహేతరబంధం కొనసాగడం, ఇద్దరు గ్రామాన్ని వదిలి కొద్ది రోజులు వెల్లిపోవడంతో ధనుంజయ గౌడ్ భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్ళిపోయింది.  ఆ తరువాత కూడా వీరిద్దరి మధ్య వివాహేతరబంధం కొనసాగడమే కాకుండా ప్రియురాలు శశికళ తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడుతో గ్రామాన్ని వదిలి ఎమ్మిగనూరు కు వచ్చేసింది. ఎమ్మిగనూరు లో మెడికల్ షాప్ పెట్టుకున్న ధనుంజయ గౌడ్ ప్రియురాలిని ఓ లేడీస్ హాస్టల్ లో చేర్చి తమ బందాన్ని కొనసాగించాడు. అయితే హాస్టల్ లో ఉండలేక పోతున్నానని, పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువెళ్ళాలని ప్రియురాలు  నిత్యం ఒత్తిడి పెంచింది. ప్రియుడు కాలయాపన చేస్తుండటం తో ఆదివారం ప్రియురాలు తాను ఉంటున్న హాస్టల్ లో మెడకు ఉరిని బిగించుకొని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు  సెల్ఫీ ఫోటో ను  ధనుంజయ గౌడ్ కు పంపింది.  ఆమె చనిపోతే తనపై కేసు నమోదై జైలుకు వెళ్ళాల్సి వస్తుందని భయపడ్డ ధనుంజయ గౌడ్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామంలోని  పొలం లోకి వెళ్లి పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పొలం పక్కన ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు తెలపడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరిలించారు. అయితే  చికిత్స పొందుతూ ధనుంజయ గౌడ్ అదే రోజు  రాత్రి మృతి చెందాడు. శశికళ నిత్యం వేధింపులు చేస్తుండడంతోనే తమ కుమారుడు మరణించాడని ధనుంజయ గౌడ్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ప్రియుడు ధనుంజయ గౌడ్ మరణం తట్టుకోలేక తాను కూడా ప్రియుడి దగ్గరికి వెళ్లాలని ధనుంజయ్ మరణించిన మరుసటిరోజే ప్రియురాలు శశికళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన చికిత్స కొరకు, కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున శశికళ మృతి చెందింది. వివాహేతర సంబంధం మత్తులో గువ్వల దొడ్డి గ్రామానికి చెందిన ఇరువురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

అడవి పందులను చంపి తినేందుకు పర్మిషన్ ఇవ్వాలి : కేరళ మంత్రి

  అడవి పందులను బెడదతో పంట పొలాలు నాశనమవుతున్నాయని కేరళ వ్యవసాయశాఖ మంత్రి ప్రసాద్ అన్నారు. వాటిని చంపి తినేందుకు అనుమతి ఇస్తే సమస్య తగ్గే అవకాశం ఉందని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం చట్టం దానిని అనుమతించలేట్లదని ఆయన గుర్తు చేశారు. పాలమేల్ గ్రామ పంచాయతీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి కేరళ వ్యవసాయ మంత్రి హాజరయ్యారు.  అడవి పందులు అంతరించిపోతున్న జాతి కాదని పేర్కొన్నారు. వైల్డ్‌లైప్ ప్రొటెక్షన్ యాక్ట్-1972 ప్రకారం వన్యప్రాణుల వేట చట్ట విరుద్దం. ఈ విధంగా చేస్తేనే అడవి పందుల సమస్యను వేగంగా పరిష్కరించి, పంటలను కాపాడుకోగలమని  మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటిని చంపకుండా ఉండాలని చెప్పేందుకు అడవి పందులేమీ అంతరించిపోతున్న జాతి కూడా కాదని ఆయన పేర్కొన్నారు.

గుంటూరు జనరల్ హాస్పిటల్‌కు రూ.20 కోట్లు విరాళం

  యాభై ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట్టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు. భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవిని  తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా మిగుల్చుకోలేదు.  మొత్తం రూ.20 కోట్ల ( 2.50 లక్షల డాలర్లు ) ఆస్తిని జీ.జీ.హెచ్‌ లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ఉమ ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలిస్టు గా పనిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లిన సూపర్  స్పెషలిటీ ‌ డాక్టర్‌ ఉమ  తన జన్మభూమికి, తాను చదువుకున్న నగరానికి సేవ చేయాలనే సంకల్పంతో తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం ఆధునిక భారతంలో దాతృత్వానికి ఓ అద్భుత ఉదాహరణగా నిలిచింది.

ఈ నెల 14న తెలంగాణ బంద్...ఎందుకంటే?

  స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈనెల 14న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు  ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. అన్ని బీసీ సంఘాల మద్దతుతో బంద్ నిర్వహిస్తామని ఈ  బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కృష్ణయ్య కోరారు.బంద్‌కు బీజేపీ మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరినట్లు ఆయన పేర్కొన్నారు.  నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో హైకోర్టు స్టే విధించడం సరి అయిన పద్దతి కాదని తెలిపింది. బహుజనుల నోటికాడి కూడును లాక్కుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు శాసన సభలో బీజేపీతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. ఇది బీసీల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని ఆయన అన్నారు. వ్యవస్థల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికే ఈ బంద్ అని స్పష్టం చేశారు. బీసీలను చిన్నచూపు చూస్తున్నారని, అందుకే తమ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన అన్నారు.

వైసీపీ కుంభకోణాలు ఏపీ నుంచి ఆఫ్రికాకు చేరాయి : గోరంట్ల

  వైసీపీ కుంభకోణాలు ఏపీ నుంచి ఆఫ్రికాకు చేరాయని ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయిన ప్రతిపక్ష బాధ్యతను తాము తీసుకుని ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నామన్నారు. మెడికల్ కాలేజీల కోసం మాట్లాడితే వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అసభ్యంగా తిడుతున్నారని ధ్వజమెత్తారు.  జగన్ అండ్ కో శాడిస్టు మనస్వత్వంతో వ్యవహారిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో పేదలకు రూ.25 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని తెలిపారు. నటులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లు అగ్ర హీరోలుని వైసీపీ హయంలో  టాలీవుడ్ నటులను అవమానించారనే అంశంపైనే అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు.  సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకి జగన్ ఐదేళ్లపాటు బకాయిలు చెల్లించకపోతే.. అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీ దివాలా తీసిందని విమర్శించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. మెడికల్ కాలేజీలకు రూ.7,500 కోట్లు అవసరమైతే.. జగన్ హయాంలో ఒక్క రూపాయి కూడా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. మెడికల్ కాలేజీలను వైసీపీ పునాదుల్లోనే వదిలేసిందని  గోరంట్ల విమర్శించారు.  

విమానం గాలిలో ఉండగానే విండ్ షీల్డ్ కు పగుళ్లు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

ఇటీవలి కాలంలో విమానాలలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో  జనం విమానయానమంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మధురై నుంచి ముంబై వెడుతున్న ఇండిగో విమానానికి తృటితో పెను ప్రమాదం తప్పింది. ఆ విమానంలో ఉన్న ప్రయాణీకులు బతుకుజీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ జరిగిందేమిటంటే మధురై నుంచి ముంబై వెడుతున్న విమానం ముందు భాగంలో ఉండే అద్దానికి  (విండ్ షీల్డ్) పగుళ్లు ఏర్పడ్డాయి. విమానం ల్యాండ్ కావడానికి కొద్ది సేపటి ముందు జరిగిన ఈ ఘటనతో కంగుతిన్న పైలెట్ వెంటనే  విషయాన్ని ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కు తెలియజేశాడు. కాక్ పిట్ లోని ముందు అద్దానికి ఈ పగుళ్ల ఏర్పడ్డాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించి పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్  చేయడంతో పెను ప్రమాదం తప్పింది.  అనంతరం విమానాన్ని ప్రత్యేకంగా బే నంబర్ 95 వద్దకు తరలించి, ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు. ఈ కారణంగా ముంబై నుంచి మధురై వెళ్లాల్సిన రిటర్న్ ఫ్లైట్ ను రద్దు చేశారు.  విమానం అద్దం ఎందుకు పగిలిందనే దానిపై  దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.  

అనిల్ అంబానీకి ఈడీ షాక్

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ మేనేజర్ (సీఎఫ్ వో) అశోక్ కుమార్ పాల్ ను ఈడీ శనివారం (అక్టోబర్ 11) అరెస్టు చేసింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద ఆయనను అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. రూ. 68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లు చెబుతున్నారు.  ఏడేళ్లుగా రిలయన్స్ పవర్‌లో సీఎఫ్‌వోగా పనిచేస్తున్న అశోక్ పాల్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఈసీఐ)కి రూ.68 కోట్లకు పైగా విలువైన నకిలీ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించారని ఈడీ ఆరోపించింది. ఈ నకిలీ గ్యారెంటీలను నిజమైనవిగా నమ్మించేందుకు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ వంటి ప్రముఖ బ్యాంకుల పేర్లను పోలిన ఫేక్ ఈమెయిల్ డొమైన్లను సృష్టించి ఉపయోగించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ పేర్కొంది.  ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో అసలు ఉనికిలోనే లేని ఓ విదేశీ బ్యాంక్ బ్రాంచ్ నుంచి కూడా గ్యారెంటీ పత్రాలు సృష్టించినట్లు ఈడీ గుర్తించింది.  కేవలం కాగితాలపై మాత్రమే ఉన్న ఈ కంపెనీ ద్వారానే రిలయన్స్ పవర్ తరఫున నకిలీ గ్యారెంటీలను ఏర్పాటు చేసినట్లు తేలింది. ఈ ఆరోపణలకు సంబంధించి బిస్వాల్ కంపెనీ డైరెక్టర్‌ను గత ఆగస్టులోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా బ్యాంకు రుణాలను దారి మళ్లించాయన్న ఆరోపణలపై ఈడీ  విస్తృత దర్యాప్తు చేస్తోంది.   ఈ  దర్యాప్తులో భాగంగానే తాజా అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. 

పుస్తక పఠనం ద్వారానే పరిపక్వత.. పవన్ కల్యాణ్

పుస్తకపఠనం ద్వారానే మానసిక పరిపక్వత సాధ్యమౌతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఐరాస మాజీ సహాయ సెక్రటరీ జనరల్ లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రచించిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్, ఆ సందర్భంగా మాట్లాడుతూ తనపై పుస్తకాల ప్రభావం ఎంతో ఉందన్నారు.   విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో  మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి తదితరులు పాల్గొన్నారు.  దేశంలో స్త్రీకి అత్యున్నత గౌరవం ఉందన్న పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ మహిళా విభాగానికి 'ఝాన్సీ వీర మహిళ' అని పేరు పెట్టినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను త్వరలోనే అమలు చేయబోతున్నామని ఈ వేదికపై నుంచి కీలక ప్రకటన చేశారు.   మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తాను పవన్ అభిమానినని చెప్పుకున్నారు. మంత్రిగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటే తాను కూడా అందరితో కలిసి పవర్ స్టార్, ఓజీ అంటూ అరిచేవాడనని చెప్పారు.  

నకిలీ మద్యం కేసులో మరో అరెస్ట్...దర్యాప్తు వేగవంతం

  అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు విచారణలో ఎక్సైజ్‌ శాఖ అధికారులు దర్యాప్తు వేగం పెంచించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జయచంద్రారెడ్డి కారు డ్రైవర్‌ అష్రఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో అతను 21వ నిందితుడిగా గుర్తించబడ్డాడు. అరెస్ట్‌ అనంతరం అష్రఫ్‌కు తంబళ్లపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో తహసీల్దార్‌ శ్రీనివాసులు ఎదుట ఆయనను హాజరుపర్చనున్నారు. నకిలీ మద్యాన్ని వాహనంలో తరలించి గ్రామాలకు చేర్చడంలో అష్రఫ్‌ పాత్ర ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో జయచంద్రారెడ్డి, ఆయన బావమరదలిని పట్టుకునేందుకు బెంగళూరులో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావును  గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నా సంగతి తెలిసిందే.  

మ‌హా మాయ‌లేడి లెండి..

బిస్కెట్ల‌తో బుట్ట‌లో ప‌డేస్తుంది జాగ్ర‌త్త‌!  వైసీపీ లీడ‌ర్లు తాము చేసిన మోసాలు చాల‌వ‌న్న‌ట్టు వారి ఇన్ స్పిరేష‌న్ తో కొంద‌రు మోస‌గాళ్లు, మోస‌గ‌త్తెలు త‌యార‌య్యారంటే అతిశ‌యోక్తి కాదేమో. మొన్న‌టి వ‌ర‌కూ నెల్లూరు అరుణ ఈ కోణంలో పెద్ద ఎత్తున ప్ర‌చారంలోకి వ‌చ్చిన విష‌యం మ‌రువ‌క ముందే మ‌రో కిలేడీ లేడీ తెర‌పైకి వ‌చ్చింది. ఆమె పేరు విద్య‌. విద్య ఎంత‌టి ఘ‌టికురాలంటే ప్ర‌స్తుతం మ‌ద్యం కుంభ‌కోణంలో పీక‌లోతు కూరుకుపోయిన ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే పేరు అడ్డంగా వాడేసుకుని.. ఏకంగా 18 కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టిందని వింటే ఆశ్చ‌ర్య‌పోతారు ఎవ‌రైనా. త‌క్కువ ధ‌ర‌కు బంగారం వ‌స్తోంద‌ని.. మీరిచ్చిన డ‌బ్బుకు రెట్టింపు ఇస్తాన‌ని అమ్మ‌ల‌క్క‌ల మ‌ధ్య ఒక ప్ర‌చారం లేవ‌నెత్తింది. ఆ నోటా ఈనోటా విన్న ప‌లువురు మ‌హిళ‌లు ఇదంతా నిజ‌మేన‌ని ఆమె చెప్పిన బురిడీ క‌థ‌ల‌న్నీ న‌మ్మేశారు. కంటైన‌ర్ వ‌స్తుంది డ‌బ్బు కావాలంటూ వారి నుంచి డ‌బ్బు అడ్డంగా దోచేసింది. అంతే కాదు.. ఆమె చూపించిన బంగారు బిస్కెట్ల వ్య‌వ‌హారం నిజ‌మేన‌ని భావించి ఆమె బుట్ట‌లో ప‌డిపోయారు వీరంతా. ఇలా ఆయా మ‌హిళ‌లు జీవితాంతం దాచుకున్న సొమ్ము మొత్తం తీసుకెళ్లి ఇదిగో ఈ మాయ‌లేడి విద్య‌కు ధార‌బోసారు. ఇలా ఒక‌టీ రెండు కాదు ఏకంగా 18 కోట్ల రూపాయ‌ల మేర వీరు విద్య‌కు స‌మ‌ర్పించుకున్నారు. మేమిచ్చిన డ‌బ్బు ఏద‌ని అడిగితే ఇదిగో అదిగో, రేపూ మాపంటూ తిప్పించుకునేది. ఇలాక్కాద‌ని అంద‌రూ క‌ల‌సి ఆమెను క‌ల‌సి నిల‌దీయ‌గా.. త‌న భ‌ర్త చేత బాధిత మ‌హిళ‌ల‌ను చిత‌క‌బాదించిందీ మాయ‌లేడి. దీంతో  చేసేది లేక వీరంతా క‌ల‌సి పోలీసుల‌కు మొర‌పెట్టుకున్నారు. ఇలాంటి వారిని న‌మ్మి డ‌బ్బులివ్వ‌డం క‌రెక్టుకాద‌ని   చెబుతున్నా స‌రే, జ‌నం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎవ్వ‌రూ కూడా ఎక్కువ డ‌బ్బులిస్తామంటే న‌మ్మొద్ద‌ని తాము గ‌త కొన్నేళ్లుగా చెబుతూనే వ‌స్తున్నామంటున్న పోలీసులు కేసు టేక‌ప్ చేసి విచార‌ణ చేస్తున్నారు. మ‌రి నిందితురాలు విద్య ఈ మొత్తం డ‌బ్బు.. ఎక్క‌డ దాచింది? ఆ వివ‌రాలేంటి? బాధితుల‌కు న్యాయం జ‌రిగే దారేది? తేలాల్సి ఉంది.

గాంధీజీకి నోబెల్ ఎందుకు ఇవ్వ‌లేదో మీకు తెలుసా!?

డైనమైట్ సృష్టిక‌ర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాప‌కార్ధం ఇచ్చే ఆరు అవార్డుల్లో నోబెల్ శాంతి పురస్కారం కూడా ఒక‌టి.  ఏటా సాహిత్యం, భౌతిక‌, ర‌సాయ‌న‌, ఆర్ధిక‌, ఔష‌ధ రంగాల‌తో పాటు శాంతి స్థాప‌కుల‌కు సైతం నోబెల్ పురస్కారం ప్రదానంచేస్తుంటారు.  ఎవ‌రైతే మాన‌వాళికి మేలు చేసేలాంటి సూత్రీక‌ర‌ణ‌లు చేస్తారో వారికి నోబెల్ పురస్కారం దక్కుతుంది. ఇక ప్ర‌పంచ శాంతి కోసం పాటు ప‌డేవారికి  నోబెల్ శాంతి పురస్కారం ప్ర‌దానం చేస్తుంటారు.  అయితే ఇక్కడ గుర్తించాల్సిన విష‌య‌మేంటంటే..  మిగిలిన ఐదు విభాగాల‌కు చెందిన నోబెల్ ప్రైజులు స్వీడ‌న్ లో ఇస్తుండ‌గా.. ఒకే ఒక్క శాంతి పురస్కారం మాత్రం నార్వేలో ఇస్తారు. కార‌ణం ఏంటంటే గ‌తంలో స్వీడ‌న్ నార్వే రెండూ ఒకే దేశంగా ఉండేవి. ఇప్ప‌టి వ‌ర‌కూ నోబెల్ శాంతి శాంతి పురస్కారం పొందిన ప్ర‌ముఖులు ఎవ‌ర‌ని చూస్తే.. ఈ జాబితాలో మార్టిన్ లూథ‌ర్ కింగ్, జూనియ‌ర్, ఎలిహూ రూట్, నెల్స‌న్ మండేలా, కోఫీ అన్న‌న్, జిమ్మీ కార్ట‌ర్, వంగారి మాతై, బ‌రాక్ ఒబామా, లియు క్సియాబో స‌హా ప‌లువురు ఉన్నారు. తాజాగా వెనెజువెలా మాన‌వ‌హ‌క్కుల నేత మ‌రియా కొరీనా మ‌చాడో అనే శాంతి క‌పోతానికి ఈ పురస్కారం ద‌క్కింది. 2014 లో భారతదేశానికి చెందిన కైలాష్ సత్యార్థి, పాకిస్తాన్ కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్ సంయుక్తంగా ఈ నోబుల్ శాంతి పురస్కారం పొందారు. 1948లో నోబెల్ శాంతి బ‌హుమ‌తి కోసం మ‌హాత్మాగాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయ‌న ఆ ఏడు జ‌న‌వ‌రి 30న నాథూరామ్ గాడ్సే పేల్చిన తుపాకీ గుండ్ల‌కు బ‌లి అయ్యారు. అప్ప‌ట్లో ఉన్న నియ‌మం ప్ర‌కారం.. కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో మ‌ర‌ణించిన వారికి నోబెల్ పురస్కారం ఇవ్వాల‌న్న నిబంధ‌న ఉండేది. దానికి తోడు ఆయ‌న ఒక సంస్థ ప్ర‌తినిథి కాదు, ఆపై త‌న వీలునామా కూడా రాయ‌లేదు. దీంతో బ‌హుమ‌తి ఎవ‌రికి ఇవ్వాలో కూడా తెలియ‌లేదు. దీంతో  ఈ ప్ర‌తిపాద‌న విర‌మించుకుంది నోబెల్ క‌మిటీ. అంతే కాదు అర్హులంటూ మ‌రెవ‌రూ లేక పోవ‌డంతో ఆ ఏడాది శాంతి పురస్కార ప్రదానాన్నే విరమించుకుంది నోబెల్ కమిటీ.   1979లో మ‌ద‌ర్ థెరీసాకు నోబెల్ శాంతి బ‌హుమ‌తి  వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఆమె చేసిన మ‌రో మంచి ప‌ని ఏంటంటే నోబెల్ గ్ర‌హీత‌ల‌కు మ‌ర్యాద‌పూర్వ‌కంగా ఇచ్చే సంప్ర‌దాయ విందును నిరాక‌రించి ల‌క్షా 92 వేల డాల‌ర్ల‌ను భార‌త‌దేశంలోని పేద‌ల‌కు ఇవ్వ‌వ‌ల‌సిందిగా కోరారు. ఈ బ‌హుమ‌తులు అవ‌స‌రంలో ఉన్న‌వారికి ఉప‌యోగ‌ప‌డ్డం వ‌ల్లే ఎక్కువ విలువ‌గా అభివ‌ర్ణించారామె.   ఇక 2025 సంవత్సరానికిగానూ  వెనెజువెలా ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి  లభించింది. చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నా ధైర్యంగా నిలబడి ప్రజాస్వామ్య  జ్వాలను ఆరిపోకుండా రగిలించారు. లక్షల మందికి ఆదర్శంగా నిలిచారు.. అందుకే మచాడోను నోబెల్ శాంతి బ‌హుమ‌తికి అర్హురాలుగా ప్ర‌క‌టిస్తూ.. ప్రశంసల్లో ముంచెత్తిందీ క‌మిటీ.    కమ్యూనిస్టు వెనెజువెలాలో ప్రజాస్వామ్యం కోసం మరియా కొరినా మచాడో తీవ్రంగా పోరాడుతున్నారు. నికొలాస్‌ మదురోకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేసి మ‌రీ త‌న‌ పోరాటం సాగిస్తున్నారు. దీంతో ఆమెపై మదురో ప్రభుత్వం తీవ్ర నిర్బంధం విధించింది. ఇతర విపక్ష నేతలంతా అరెస్టులకు భయపడి దేశం విడిచి పారిపోయినా ఆమె మాత్రం సొంత దేశంలోనే ఉండి ప్రజాస్వామ్య వాదులకు స్ఫూర్తినిస్తున్నారు. అలా అజ్ఞాతంలో ఉండి కూడా ప్ర‌జాస్వామ్య జ్వాల ర‌గుల్చుతోన్న మ‌రియా కొరీనా మ‌చాడో ఈ పురస్కారానికి నిజంగా అర్హురాలేనంటారు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న శాంతి కాముకులు. శాంతి విజేతా నీకు జేజేలు అంటూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు.

ప్రభుత్వం ఏదైనా ఏపీలో మందుబాబులకు సుఖం లేదా!?

ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు సుఖం లేకండా పోయిందా? వైసీపీ హయాంలో నాసిరకం మద్యం.. ప్రభుత్వం మారింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది ఇక నాణ్యమైన మద్యం దొరుకుతుందని ఆనందపడేలోగా కల్తీ మద్యం భయం పట్టి పీడించడం మొదలైంది. వైసీపీ హయాంలో నాసిరకం, తెలుగుదేశం హయాంలో కల్తీ మద్యం తాగలేక.. తాగకుండా ఉండలేక నానాయాతనకు గురౌతున్నారు ఏపీలో మందుబాబులు. ఆచార్య ఆత్రేయ ఓ పాటలో మనసున్న మనసుకూ సుఖము లేదంతే అన్నారు. ఏపీలో అయితే మందుబాబులు దీనిని కొంచెం మార్చి తాగే అలవాటున్న మనిషికి సుఖం లేదంతే అని పాడుకుంటున్నారు.    జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో.. మందుబాబుల‌కు నాణ్యమైన మ‌ద్యం దొరికిందే లేదు. ఒక వేళ అలాంటి మంచి బ్రాండ్ల‌కు చెందిన మ‌ద్యం తాగుదామంటే ఖాతా ఖాళీ అయిపోయేది జేబు గుల్ల‌యిపోయేది. అలాంటిది ఇప్పుడు చూస్తే ఇదిగో ఈ జ‌య‌చంద్రారెడ్డి- జ‌నార్ధ‌న్ క‌ల‌సి చేసిన న‌కిలీ మ‌ద్యం బాగోతం కార‌ణంగా.. ఎక్క‌డ ఏమందు బాటిల్లో ఏం క‌లిపారో అన్న భ‌యాందోళ‌న వారిని వెంటాడుతోంది.  ఏపీ మ‌ద్యం బాబులూ మీకు మ‌ళ్లీ క‌ష్టాలు త‌ప్ప‌లేదు. మీరు తెలంగాణ వ‌చ్చిన‌పుడు మంచి మందు తాగుదురుగానీ.. ఏపీలో  మాత్రం తాగొద్దంటూ సామాజిక మాధ్య‌మాల్లో  నెటిజనులు తెగ పోస్టులు పెడుతున్నారు.  దీంతో మందు బాబులు ఏం చేయాలో తోచ‌క బుర్ర బ‌ద్ధ‌లు కొట్టుకుంటున్నారు. అస‌లే ఇలాంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందుదామ‌ని సాయంత్రం పూట ఒక నైన్టీ వేసి చిల్ అవుదామ‌న్న‌ది మందుబాబుల ఆలోచ‌న‌. అలాంటి వారికి ఇప్పుడు పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. ఇక్క‌డి మ‌ద్యం తాగొచ్చా? తాగితే ప‌రిస్థితేంట‌న్న‌ది వారికి అర్ధం కావ‌డం లేదు.   ఉన్న గొడ‌వ‌లు చాల‌వ‌న్న‌ట్టు ఇటీవ‌ల ఒక వ్య‌క్తి వైన్ షాపులోనే  చ‌నిపోయాడు. ఇదంతా న‌కిలీ మ‌ద్యం మ‌హ‌త్య‌మేనంటూ వైసీపీ తెగ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ చ‌చ్చిన పాములా ప‌డి ఉన్న వైసీపీకి ముల‌క‌ల‌చెరువు న‌కిలీ మ‌ద్యం వ్య‌వ‌హారం బయటకు రావడంతో పోయిన ప్రాణం తిరిగి వ‌చ్చిన‌ట్ట‌య్యింది. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై తామెంత ట్రై చేస్తున్నా మైలేజ్ రాక జుట్టుపీక్కుంటున్న వైసీపీకి కల్తీ మద్యం ఆయుధంగా మారింది. దీంతో ఇటు జ‌గ‌న్ నుంచి అటు సాధార‌ణ వైసీపీ కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కూ ఏపీలో న‌కిలీ మ‌ద్యం ఏరులై పారుతోందంటూ.. లెక్క‌లు క‌ట్టి మ‌రీ వివ‌రిస్తున్నారు. దీంతో మందు బాబుల‌కు మ‌న‌సు మ‌రింత‌ పాడై పోతోంది. అప్పుడు చూస్తే అలా- ఇప్పుడు చూస్తే ఇలా.. ఏంటి మాకీ అగ్ని ప‌రీక్ష అంటూ  విల‌విల‌లాడుతున్నారు. తాజా క‌బ‌ర్ ఏంటంటే న‌కిలీ మ‌ద్యం కేసులో ఏవ‌న్ గా ఉన్న జ‌నార్ద‌న‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న గ‌న్న‌వ‌రంలో దిగ‌గానే ప‌ట్టుకుపోయారు. ఎక్క‌డికి తీసుకుపోయార‌న్న సంగ‌తి అలా ఉంచితే.. ఆయ‌న నోటి ద్వారా ఎవ‌రి పేర్లు బ‌య‌ట‌కొస్తాయ‌న్న‌ది స‌స్పెన్స్ గా మారింది. చూడాలి మ‌రి  ఈ మ‌ద్యం కేసు ఏ తీరం చేరనుందో.. ఎవరెవరి పేర్లు బయటకు రానున్నాయో? 

మీరు శాంతిదూత ఎలా అవుతారు ట్రంప్?

ప‌హెల్గాం దాడికి సూత్ర‌ధారి   క‌సూరీని  ఉగ్ర‌వాదిగా ప్ర‌క‌టిస్తుంది ఐక్య‌రాజ్య‌స‌మితి. అత‌డేమో పాకిస్థాన్ న‌డి వీధుల్లో నిర్భ‌యంగా తిరుగుతుంటాడు. ట్రంప్, ఆయ‌న‌  కుటుంబం చూస్తే ఆ పాకిస్థాన్ తో వ్యాపారాలు చేస్తుంటారు. అంతేనా హ‌ఫీజ్ స‌యీద్ త‌ల‌కు సుమారు 90 కోట్ల రివార్డు ప్ర‌క‌టించింది మీరే, అత‌డికి పాకిస్థాన్ సైన్యం హైలెవ‌ల్ సెక్యూరిటీ అందిస్తూ కాపాడుతుంది. అతడేమో భార‌త్ మీద ఉగ్ర దాడుల‌కు ప‌థ‌క ర‌చ‌న  చేస్తుంటాడు. త‌ద్వారా యుద్ధ వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. అప్పుడు మీరేమో మీ ఎఫ్ 16లు ఇత‌ర‌త్రా ఆయుధాలు ఎలా ప‌ని చేస్తాయో చూద్దామ‌ని ఆలోచిస్తుంటారు. అలాంటి మీరు ఎలా అవుతారు శాంతి దూత‌?  ఇక్క‌డ మా పౌరుల చితిమంట‌ల్లో మీరు మీ మీ వ్యాపార లావాదేవీలు ఇత‌ర‌త్రా లాభ‌న‌ష్టాల బేరీజు వేస్తుంటారు. అలాంటి మీరు శాంతి దూత‌ అంటే న‌మ్మే వారెవ‌రు? ర‌ష్యా- ఉక్రెయిన్ యుద్ధం సంగ‌తే తీసుకుందాం. అక్క‌డ ఉక్రేయిన్ పీక‌లోతు క‌ష్టాల్లో ఉంటే.. మీరు చేసిందేంటి? ఆ దేశంతో ప‌దేళ్ల ఖ‌నిజ ఒప్పందం చేసుకోవ‌డం. వాళ్లు చావు బ‌తుకుల్లో ఉన్నా కూడా వ‌ద‌ల‌క వ్యాపారం చేయ‌డాన్ని ఏమంటారు? శాంతి స్థాప‌న‌గా దీన్నెలా భావించ‌గ‌లం? ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు  కొన‌డం ద్వారా, ఆ దేశానికి   నిధులు అందిస్తున్నారంటోన్న ట్రంప్.. మ‌రి గాజాపై త‌ర‌చూ విరుచుకుప‌డే ఇజ్రాయెల్ కి ఈ మ‌ధ్యే 2 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా నిధులివ్వడాన్ని ఎలా తీసుకోవాలి? ఇది శాంతికాముక‌త ఎలా అవుతుంది? ఉగ్ర‌వాదుల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకునే పాకిస్థాన్ కి మీరు ఐఎంఎఫ్, వ‌ర‌ల్డ్ బ్యాంక్ నుంచి ఏటా కొన్ని వంద‌ల కోట్ల డాల‌ర్ల నిధులు మంజూరు చేయిస్తుంటారు. వారేమో మ‌సూద్  అజ‌ర్ వంటి వారి ఉగ్ర స్థావ‌రాల ప‌రిర‌క్ష‌ణ‌కై ఈ నిధులు వెచ్చిస్తుంటారు. ఆ మాట‌కొస్తే అక్క‌డి సైన్యం ఉగ్ర‌వాదుల‌కు శిక్షణ ఇవ్వ‌డంతో  పాటు.. వారు ఏదైనా దాడుల్లో చ‌నిపోతే.. ద‌గ్గ‌రుండి జాతీయ జెండా క‌ప్పి మ‌రీ  అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తుంటుంది. అలాంటి దేశ ఆర్ధిక స్థితిని అనునిత్యం ప‌రిర‌క్షించే మీరు శాంతి సాధ‌కులు ఎలా అవుతారు? ప్చ్.. ఎనిమిది యుద్ధాల‌ను ఆపినా కూడా తనకు శాంతి బ‌హుమ‌తి రాలేద‌ని ట్రంప్ ఎలా అంటారు?  మీరు రివార్డులు ప్ర‌క‌టించిన అశాంతి కార‌కులు, ఉగ్ర‌నాయ‌కులు మీ కంటి ముందే తిరుగుతుంటే.. మీరేం చేస్తున్నారు? వారిని కట్టడి చేసి ప్ర‌పంచ శాంతి నెల‌కొల్పాల్సింది పోయి.. వారి ద్వారా ఉగ్ర‌దాడులు చేయించి ఆపై యుద్ధం వ‌చ్చేలా చేసి.. ఆ గ్యాప్ లో మీ ద‌గ్గ‌రున్న ఆయుధాల‌ను అమ్ముకోచూసే అమెరికాకు అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ పీస్ మేక‌ర్ అవుతారు?  నిజంగా ట్రంప్ శాంతి దూతే అయితే.. మొద‌ట పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ని అర్జెంటుగా అక్క‌డి నుంచి తొల‌గించాలి..  కార‌ణం ప‌హెల్గాం దాడికి కార‌కుడు ప్రేర‌కుడు. అత‌డే .  దాడికి మూడు రోజుల ముందు అత‌డు చేసిన రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లే  పహెల్గాం దాడికి కార‌ణం. అలాంటి వ్య‌క్తి యుద్ధం వ‌స్తే పారి పోయి ప్ర‌ణాళిక‌ల్లేవ్- ప్రార్ధ‌న‌ల్లేవ‌న్న పిరికిపంద‌.  మీ  కాళ్లు ప‌ట్టుకుని భార‌త్ చేత కాల్పుల విర‌మ‌ణ చేయించ‌డం.. శాంతి ప్ర‌య‌త్నం ఎలా అవుతుంది? పైపెచ్చు అటువంటి వ్యక్తిని అమెరికా  ఆర్మీ పరేడ్ కి పిలిపించ‌డం మాత్ర‌మే కాకుండా.. అత‌డికి ఫీల్డ్ మార్ష‌ల్ హోదా  ఇచ్చి.. ఆపై పాకిస్థాన్ ని మీ వ్యాపార ప్ర‌యోగ‌శాల‌గా మార్చే య‌త్నం చేస్తున్నారు. నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఇలాంటి  ర‌క్త‌దాహంతో కూడిన వ్యాపార  ప్ర‌యోజ‌నాల‌ను కాపాడే వారికి ఇవ్వ‌రు. అందుకెంతో నీతి, నిజాయితీ, ప్ర‌జా సేవ‌, ప్రాణ  త్యాగం వంటి అంశాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. మ‌రి మీరేం చేస్తున్నారు ఇప్ప‌టికీ ఏ దేశంలో ఏ స‌మ‌స్య త‌లెత్తుతుందా? దాన్ని మ‌న‌మెలా క్యాష్ చేసుకుందామా? అని చూస్తారు. క‌డుపులో ఒక‌టి పెట్టుకుని.. పైకి మాత్రం మ‌రొక నీతి వ‌చ‌నం వ‌ల్లె వేస్తుంటారు. భార‌త్ అంటే అనుక్ష‌ణం ర‌గిలిపోతూ.. ఆ దేశంపై వంద శాతం సుంకాలు విధిస్తుంటారు. మ‌రి ఇప్పుడు విధించండి.. నోబెల్ మీకు ఇవ్వ‌ని నార్వే దేశంపై వంద‌కు వంద శాతం సుంకాలు. ఎందుకంటే ఆ దేశం మిమ్మ‌ల్ని, మీ ప్ర‌తిపాద‌న‌ల‌ను క‌నీసం ప‌ట్టించుకోలేదు క‌దా? ఎప్పుడైతే ర‌క్త‌పిపాసి  పాకిస్థాన్ మిమ్మ‌ల్ని ఈ బ‌హుమ‌తికి నామినేట్ చేసిందో అప్పుడే నోబెల్ క‌మిటీకి మీరేంటో మీ వ్యూహ‌మేంటో పూర్తిగా అర్ధ‌మై పోయింది.  పైపెచ్చు ట్రంప్ ది ఎంత‌టి తెంప‌రిత‌నం అంటే.. నోబెల్ నామినేష‌న్లు జ‌న‌వ‌రిలోనే ముగిశాయి. గ‌డువు ముగిశాక పాక్, ఇజ్రాయెల్.. ఆఖ‌రికి ర‌ష్యా చేత కూడా సిఫార్సు చేయించుకుని మరీ నామినేట్ అయ్యారు. అయినా సరే త‌మ నోబెల్ ని ట్రంప్ లాంటి  వారికిచ్చి.. ఆ మ‌చ్చ‌ను కొని తెచ్చుకోవ‌డం ఇష్టం లేని క‌మిటీ.. ఇదిగో వెనిజులా హ‌క్కుల కార్య‌క‌ర్త‌,  ప్ర‌తిప‌క్ష నేత, 58 ఏళ్ల‌ మ‌రియా మ‌చాడోకు ఇచ్చి ఈ ప్ర‌పంచానికి గొప్ప సందేశం ఇచ్చింది. ఇందులో మ‌రో ట్విస్ట్ ఏంటంటే ఈమె కూడా  త‌న‌కొచ్చిన ఈ శాంతి బ‌హుమ‌తిని ట్రంప్ కే అంకితం ఇవ్వ‌డం.  ఆల్రెడీ ఈ పుర‌స్కారం త‌న‌కు ద‌క్క‌ద‌ని భావించిన ట్రంప్ వైట్ హౌస్ నుంచి ద పీస్ ప్రెసిడెంట్ అనే అవార్డ్ పొందారు. అక్క‌డంటే నిపుణుల క‌మిటీ ఉండ‌దు. ఆయ‌న  చెప్పిందే వేదం కాబ‌ట్టి దీంతో సంతృప్తి చెందాల్సి వ‌చ్చింది. ఫైన‌ల్ గా ట్రంప్ కి నోబెల్ రాక పోవ‌డానికి రాజ‌కీయాలే కార‌ణ‌మంటూ శ్వేత సౌధం స్పందించ‌డం.. ఈ ప్ర‌పంచమంతా క‌ల‌సి చేసుకున్న దుర‌దృష్టం కాక మ‌రేమిటంటారు.. అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల నిపుణులు.

అమెరికా కర్మాగారంలో పేలుడు.. 19 మంది మృతి

అమెరికాలో సంభవించిన భారీ పేలుడులో కనీసం 19 మంది మరణించారు. టేనస్సీ రాష్ట్రంలోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో  ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.   సైనిక, అంతరిక్ష, వాణిజ్య రంగాలకు అవసరమైన పేలుడు పదార్థాలను ఉత్పత్తి చేసే ఈ కంపెనీలో జరిగిన ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది కార్మికుల ఆచూకీ తెలియడం లేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న నివాసాలు బీటలు వారాయి. ప్రాణభయంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇలా ఉండగా పేలుడు ధాటికి కర్మాగారం భవనం పూర్తిగా నేలమట్టమైంది. పేలుడు తీవ్రత కారణంగా సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. కాగా పేలుడుకు కారణాలేంటన్నది వెంటనే తెలియరాలేదు. దర్యాప్తు చేపట్టామని అధికారులు చెబుతున్నారు.  

మేడారంలో క్యూఆర్ స్కానర్లు.. ఎందుకో తెలుసా?

మెడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లకు కానుకులు సమర్పించేందుకు ఆన్ లైన్ విధానాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. వన దేవతల దర్శనం తరువాత కానుకలు వేసేందుకు జేబులో క్యాష్ లేక భక్తులు ఇబ్బంది పడుతున్న విషయం అధికారుల దృష్టికి రావడంతో  అధికారులు వనదేవతలకు కానుకలు సమర్పించడానికి ఆన్ లైన్ విధానాన్ని ఏర్పాటు చేశారు. ఇందు కోసం తాడ్వాయ్ కెనరా బ్యాంకు అధికారులతో సంప్రదించి.. మేడారం ప్రాంగణంలో క్యూఆర్ కోడ్ స్కానర్ లను ఏర్పాటు చేయించారు. దీంతో వనదేవతలను దర్శించుకున్న తరువాత హుండీలో సొమ్ములు వేయాలని  అనుకున్నా చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా.. క్యూఆర్ కోడ్ స్కానర్ల ద్వారా చెల్లించే అవకాశం ఏర్పడింది. ఈ ఆన్ లైన్ స్కానర్లను మేడారం ప్రధాన పూజారి ఆవిష్కరించారు.  

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. శనివారం (అక్టోబర్ 11) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలకు పైగా పడుతోంది. ఇక శుక్రవారం శ్రీవారిని మొత్తం 74 వేల 468 మంది దర్శించుకున్నారు. వారిలో 26 వేల 878 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 86 లక్షల రూపాయలు వచ్చింది. 

నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డ్

  ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.  ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్  ఆమెను విశిష్ట వ్యక్తిగా పేర్కొంటూ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025కు ఎంపిక చేసింది. ప్రజాసేవ, సామాజిక ప్రభావం అంశాల్లో కీలకంగా పని చేసినందుకు గానూ ఈ డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును ఆమెకు అందించనున్నారు. లండన్ లోని గ్లోబల్ కన్వెన్షన్ లో నవంబరు 4 తేదీన జరిగే కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ నుంచి భువనేశ్వరి ఈ అవార్డును అందుకోనున్నారు.  సామాజిక సాధికారితకు పాటుపడుతున్న వ్యక్తిగా అమెను ఈ ప్రతిష్టాత్మక అవార్డు వరించింది.  గతంలో ఈ అవార్డు దక్కించుకున్న వారిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో చైర్మన్ గోపీచంద్, ఆదిత్య బిర్లా సెంటర్ ఫర్ కమ్యూనిటీ ఇనీషియేటివ్స్ చైర్ పర్సన్ రాజశ్రీ బిర్లా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ, దుబాయ్ ఎలక్ట్రిసిటీ-వాటర్ అథారిటీ ఎండీ సయీద్ మహ్మద్,  గోయెంకా గ్రూప్ సంస్థల చైర్మన్ సంజీవ్ గోయెంకా వంటి దిగ్గజ వ్యక్తులు ఈ ప్రతిష్టాత్మక అవార్డు ను తీసుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి అవార్డు రావటంపై ఎన్టీఆర్ ట్రస్ట్ ఉద్యోగులు, అభిమానులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో శుక్రవారం ఆమెను సన్మానించి, శుభాకాంక్షలు తెలియచేశారు.