ఏప్రిల్ పూల్ అవ్వకండి ఈసారైనా!!

మార్చ్ ముగింపు వచ్చేసింది. మార్చ్ అవ్వగానే ఏప్రిల్ వస్తుంది. అయితే ఏంటి?? ఏప్రిల్ అవ్వగానే మే వస్తుంది, తరువాత జూన్, మళ్ళీ జులై ఇంతేగా అని అందరూ అంటారేమో. కానీ ఏప్రిల్ నెలకు ఒక తుంటరి తనాన్ని జోడించారు అందరూ. ఆ తుంటరి తనమే ఏప్రిల్ ఫూల్ చెయ్యడం. ఎదో ఒకటి చెప్పి నమ్మించి తీరా గాభరా పడో, నమ్మేయడమో చేయగానే ఏప్రిల్ పూల్ అని అని వెక్కించే వాళ్ళు చాలా మంది. ముఖ్యంగా పిల్లలకు, యూత్ కు ఇదొక పెద్ద సరదా. ఆ సరదా ఏప్రిల్ ఒకటవ తారీఖు మొత్తం హంగామా చేస్తుంది. అయితే సరదాగా సంవత్సరానికి ఒకసారి అయిపోయే ఈ ఫ్యూలిష్ నెస్ జీవితంలో కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి. నిర్ణయాలు!! తీసుకునే నిర్ణయాలు ఆవేశంతో లేకుండా ఆలోచనతో ఉంటే వాటి తాలూకూ ఫలితాలు బానే ఉంటాయి. అలాగే ఎవరికోసమో మీకు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం కాకుండా మీకు తృప్తి కలిగించేలా తీసుకుంటే తరువాత బాధపడాల్సిన అవసరమే ఉండదు.  ఫూల్స్ ఏమి కాదు!! ఏదో ఏప్రిల్ 1st న ఫూల్ అవ్వగానే ఇక సంవత్సరమంతా ఫూల్ అయిపోయినట్టు ఫీలవుతుంటారు చాలామంది. అయినా మీద రంగు పడిందనో, డ్రెస్సు చిరిగిపోయిందనో చెప్పే మాటలు వినేసి ఫూల్స్ అయిపోయినదానికి, ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంవత్సర కాలానికి ఎలా ముడిపెడతారు?? ఆ సంవత్సరమంతా ఫూల్స్ అయిపోయినట్టు ఎందుకు అనుకుంటారు. ఎంత అర్థం లేని విషయం కదా అది. ఎప్పుడూ ఇవి కూడా ఉండవు!! భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట చెబుతాడు. మనిషికి దుఃఖం పుడుతుంది, ఆ దుఃఖం పుట్టగానే అది పోయేవరకు మనిషి ఎంతో ఇదైపోతాడు. ఆ తరువాత సుఖం వచ్చాక అది కూడా దుఃఖంలా కొన్నిరోజులు ఉంటుంది అని అర్థం చేసుకోడు, మనిషికి ఎప్పుడూ సుఖమే కావాలి అదే కదా మనిషి అత్యాశ. అందుకే సుఖాలు కూడా ఎప్పుడూ ఉండవని, సుఖం, దుఃఖం ఒకదాని తరువాత మరొకటి వస్తూ వుంటాయని అర్థం చేసుకుంటే ఇక నిశ్చింతనే. అనవసర ఆందోళనలు!! అందరూ చేసే చాలా పెద్ద తప్పు అనవసర విషయాలకు ఆందోళన పడటం. ఏదైనా చేయాలన్నా ఆందోళన, ఏదైనా చెప్పాలన్నా ఆందోళన, నిర్ణయాలు తీసుకోవాలన్న ఆందోళన, ఏదైనా వద్దనుకోవాలన్నా ఆందోళన ఇలా ఆందోళన వలయంలో పడి మనుషులు నిజంగా ఫూల్స్ అయిపోతారు. ఆ ఆందోళనలో చాలా వరకు ఎన్నో రకాల తప్పులు చేసి తరువాత అయ్యో అనుకుంటారు. కాబట్టి ఇలాంటి ఆందోళన, ఖంగారు లాంటివి ఉంటేనే నిజమైన ఫూల్స్ అన్నట్టు మరి. తొక్కి పడేయండి!! ఒత్తిడులు, వేదనలు మనిషిని ఊరికే బాధిస్తాయి. అవన్నీ జీవితం నుండి వెళ్లిపోవాలి. అందుకే మెల్లగా వాటి కోసం ఎక్సిట్ గేట్ వెతకండి. వాటిని కాలికింద తొక్కి బయటకు తన్నేయండి. ఈ ఒక్క పని మనిషిలో ఎన్నో ప్రశ్నలను పటాపంచలు చేస్తుంది.   గెలుపు సూత్రం!! ఒకే ఒక పని మనిషిని అన్ని కాలాలలోనూ స్థిరంగా, ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. అదే అంతా మంచికే అనుకోవడం, నవ్వుతూ ఉండటం. ఎవరేమన్నా పట్టించుకోకుండా చెయ్యాల్సిన పనిని ఏకాగ్రతగా చేసెయ్యడం. ఇంకా ఇంకా చెప్పాలి అంటే మనిషి ఎప్పుడూ ఏ విషయంలో మాట్లాడకూడదు, పని మాత్రమే కనిపించాలి. అలాంటి మనస్తత్వాన్ని తీర్చిదిద్దుకుంటే ఇలాంటి ఏప్రిల్ ఫూల్స్, ఇంకా ఫెయిల్యూర్స్ ఏమీ చేయలేవు మరి. లేదూ వాటిని మనసుకుని ఫీలైపోతే నిజంగా ఏప్రిల్ ఫూల్స్ అయినట్టే మీరు.                                                            ◆వెంకటేష్ పువ్వాడ.  

మీ కోసం....మీరు ఉన్నారా??

ప్రతి మనిషి జీవితంలో బతకడానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఇది ఒక వర్గం అయితే చాలామంది కొన్ని లక్ష్యాలు, కొన్ని కలలు అంటూ వాటిలో మునిగి తేలుతూ ఉంటారు. ఇల్లు, పనిచేసే చోటు, ప్రయాణం చేసే చోటు, బంధువులు కలిసే కార్యక్రమాలు, పరిచయస్తులు పార్టీలు, ఫంక్షన్ లు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జీవితాల్లో భాగంగా ఉంటాయి. అయితే అలాంటివి జరిగే ప్రతిచోటా మనిషి ఎదుటివాళ్లను గమనిస్తూ ఉంటారు. వాళ్లలో ప్రత్యేకత, వాళ్లలో బలహీనత, వాళ్ళ బలం ఇలాంటివన్నీ గమనిస్తూ ఉంటారు. అంటే మనిషి తన జీవితంలో తన రోజువారీ పనులలో మునిగిపోయి, ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలలో ఎదుటివారిని చదువుతూ, ఇంకొకరి గురించి తెలుసుకుంటూ బతికేస్తున్నాడు అనే విషయం గమనిస్తే తప్ప అర్థమవ్వదు. కానీ ప్రతి మనిషి చెయ్యాల్సిన పని ఒకటుంది.  అదే తమ గురించి తాము తెలుసుకోవడం. ఇది ఒకరకంగా ఆత్మ విమర్శ లాంటిదే అనుకోవచ్చు. మరి ఇందులో ఏముంటుంది?? ప్రాధాన్యతలు!! మీరు వేటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు?? అవి మీ ఇష్టాఇష్టాలకు ఎంతమాత్రం సరోపోతున్నాయి. నిజంగానే ప్రాధాన్యతలన్నీ పూర్తి సంతృప్తిగా ఉన్నాయా?? లేక ఆర్థిక కోణం చూసి వాటిని ప్రాధాన్యతలుగా మార్చుకున్నారా?? మనిషి జీవితంలో ఎన్నో ఉండచ్చు కానీ తనకు కాసింత తృప్తినిచ్చే వాటిని వదిలేసుకోకూడదు కదా. చాలామంది అదేదో చిన్నతనం అనే ఫీలింగ్ తో కొన్ని తృప్తికరమైన వాటిని వదిలేసుకుంటారు. బలాలు, బలహీనతలు!! మనిషిలో ఉన్న మానసిక జీవితంలో బలాలు, బలహీనతలే బలగాలు. బలం మనిషి పట్టు అయితే బలహీనత మనిషిని వెనక్కులాగేది అవుతుందని అనుకుంటారు కానీ మీకు తెలుసా బలహీనతలు ఉన్నవాడే గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. బలహీనతను బలంగా మార్చుకోవడం, ఆ బలహీనతపై పై చెయ్యి సాధించడం, దానిని అధిగమించడం దీని వల్ల సాధారణ బలం కంటే ఎన్నోరెట్ల ఆత్మవిశ్వాసం సొంతమవుతుంది. ప్రవర్తన!! ఇక్కడ ప్రతి మనిషి తన మెంటాలిటీని బట్టి ప్రవర్తన అంటే ఇలా ఉండాలి అని ఒక వివరణ ఇస్తాడు. అయితే అందరి విషయానికి సరిపోదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కో విధంగా ఉంటుంది కాబట్టి. అందుకే ప్రవర్తన అనేదానికి ఒక ఖచ్చితమైన నిర్వచనం అంటూ ఇవ్వలేము. ఇంకా దాని మీద విభిన్న వాదనలను కూడా చూస్తుంటాము. కానీ ప్రవర్తన విషయంలో మాత్రం కాసింత సాటిసిఫాక్షన్ ఉండాలి. కారణాలు ఎన్నైనా ఉండచ్చు కానీ ఒకరిని పలకరించడం, ఒకరు పలకరించినపుడు స్పందించడం. నలుగురిలో మాట్లాడినప్పుడు హుందాతనం, పెద్దల విషయంలో కాసింత గౌరవం, చిరునవ్వుతో పలకరించడం. ఇలాంటివన్నీ చాలా సాధారణమైన విషయాలు. మీరు ఒకరిని గమనిస్తున్నట్టు, మిమ్మల్ని వేరే వాళ్ళు గమణిస్తుంటారు అనే విషయాన్ని మరచిపోకూడదు. మీకోసం మీరు!! మీకోసం మీరు కొంచమైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని కాస్త ఆలోచించాల్సిందే. ప్రస్తుత కాలంలో మనిషుల్లో frustration  పెరిగిపోవడానికి కారణం ఎవరికి వారు లేకుండా పోవడమే. అంటే మీకోసం మీరు కొంచమైనా ఉండాలి. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, వృత్తి, బయటకు వెళ్తే స్నేహితులు, సన్నిహితులు వీళ్ళందరి కోసం ఇష్టం లేనివాటిని భరించేస్తూ ఉండటం వల్ల అసహనం ఎక్కువైపోతుంది. కనీసం అలా ఏదైనా చిన్న షాప్ కు వెళ్లి నచ్చిన టీ తాగుదామా అంటే అక్కడే ఎవరో ఒకరు ఆత్మీయులు కనబడి అధోద్దు ఇది బాగుంటుంది అని నచ్చనిది చేతికిచ్చి తాగమన్నట్టు, ఎంతమందికి ఎన్ని సమకూర్చినా మీ విషయంలో మీకు నచ్చిన దేన్నీ మార్చుకోవద్దు. హాయిగా మీదైన ఇష్టాన్ని ఆస్వాదించాలి. అప్పుడే కాసింత తృప్తి లభిస్తుంది. అది చిన్నపుడు తిన్న పుల్లైసులాంటిది.                                                                                                              ◆వెంకటేష్ పువ్వాడ.  

సేంద్రియ సాగుకు జై కొడదాం!!

విద్య, విజ్ఞానం దేశ అభివృద్ధికి అవసరమైనవి అయిన వ్యవసాయం మాత్రం మనిషి మనుగడకు ఖచ్చితంగా ఉండాల్సినది. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత దేశం మనది. దేశానికి వెన్నెముక రైతు అనే మాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము. అయితే రైతు దిగుబడి మీద ఆశతో తెలిసీ తెలియక తప్పులు చేసేస్తూ ఉంటాడు. ఆ తపుల్లో భాగంగానే పంటలకు రసాయనిక ఎరువులు విపరీతంగా వాడటం చేస్తాడు. ఫలితంగా దిగుబడి కూడా రసాయనిక మూలాలు నింపుకుని రుచి తగ్గడమే కాకుండా అందులో ఎంతో అనారోగ్యం కలిగించే విషబీజాలు ఉంటాయి. ఇలాంటి వాటిలో నుండి మళ్ళీ పుట్టింది సేంద్రియ వ్యవసాయం. మళ్లీ పుట్టడం ఏంటి అని ఇప్పటి వాళ్లకు చాలామందికి అనుమానం వస్తుంది. కానీ నిజానికి ఈ సేంద్రియ వ్యవసాయం భారతదేశంలో ఎన్నో ఏళ్ల నుండి వారసత్వంగా వస్తున్నదే. ఒకప్పుడు పంట దిగుబడి వస్తే అందులో కొన్ని విత్తనాలను ఆవు పంచితంలో శుద్దిచేసి ఆ తరువాత వాటిని జాగ్రత్త చేసి తిరిగి మళ్ళీ పంట వేయాల్సి వచ్చినప్పుడు విత్తడానికి వాడేవాళ్ళు. అయితే శాస్త్రవేత్తల పుణ్యమా అని ఎన్నో రకాల రసాయనిక మందులు కనుక్కుని, కృత్రిమ వంగడాలు ఆవిష్కరించడం వల్ల అవి వాడితే గొప్ప దిగుబడి ఉంటుందనే వెర్రిలో ఎడా పెడా కృత్రిమ ఎరువులు వాడి భూమిలో సారాన్ని చేతులారా క్షీణింపజేసుకుంటున్నారు. ఫలితంగానే ఆ కృత్రిమ ఎరువులు వాడిన మొదట్లో దిగుబడి బాగా వచ్చి క్రమంగా ఎలాంటి దిగుబడి లేకుండా వరుస నష్టాలు రైతుల పాలిట శాపాలు అవుతున్నాయి. అవి రైతుల సమస్యలు అయితే క్రమంగా మనిషి ఆరోగ్యం క్షీణించడం కూడా మరొక కారణం. ఈ కారణం వల్ల అందరూ మళ్లీ సేంద్రియ పంటల ద్వారా లభ్యమైన వాటినే కొనుగోలు చేయడానికి తినడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు.  అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్స్ హవా కొనసాగుతోంది.  ముఖ్యంగా జీవరసాయనాలు తయారుచేసి, జీవామృతం సహాయంతోనూ, సహజమైన ఎరువులతోనూ పంటలను పండించి రాసి కన్నా వాసి ముఖ్యం అన్నట్టు దిగుబడులు మరీ బీభత్సంగా రాకపోయినా ఆశాజనకంగా వస్తున్నందుకు ఆ తరహా సాగు వైపు వెల్తూ, భూమికి మళ్ళీ జీవాన్ని ఇస్తున్నారు. ఇందులో ముఖ్యంగా అగ్రికల్చర్ వైపు యువత అడుగులు వేస్తూ, సాంకేతికతను, సెంద్రియానికి జోడించి వ్యవసాయ రంగాన్ని కొత్తబాటలు పట్టిస్తున్నారు.  ఆరోగ్యం, సంక్షేమం!! సేంద్రియ వ్యవసాయం వల్ల రోగాలతో చిక్కిపోయిన ఆరోగ్యాలు మళ్లీ నూతనోత్తేజంతో చిగురులు తొడిగిన పచ్చని ఆకుల్లా మారుతున్నాయనేది వాస్తవం. ఎందరో జీవితాలే ఇందుకు నిదర్శనం కూడా. ప్రకృతికి దగ్గర పంటలు సాగడం వల్ల ఆ పంట దిగుబడిలో ఎంతో రుచి కూడా ఉంటుంది, పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటున్నాయి.  అయితే నేటి కాలంలో అన్నిచోట్లా ఈరకమైన సాగు ఉండటం లేదు. ముఖ్యంగా సగటు మధ్యతరగతి రైతు ఈ రకమైన వ్యవసాయం వైపు రావడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు. స్వంతంగా జీవామృతాలు తయారుచేసుకోవడం అనేది ఒక అదనపు పని అయితే దిగుబడి రాకపోతే ఎలా అనేది చాలా పెద్ద భయం.  కానీ నేటి వేగవంతమైన ప్రపంచంలో, నూటికి 90% మంది రోగాల బారిన పడినవారే ఉంటున్న రోజుల్లో ఈ సేంద్రియ వ్యవసాయం ఒక ఉద్యమంలా మారాలి. దాని వైపు రైతులను నడిపేలా అందరూ మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చెయ్యాలి, ప్రజలు వాటిని కొనడానికే ముందడుగు వేయాలి. కాసింత ధర ఎక్కువైనా సేంద్రియ ఉత్పత్తులు వాడటం వల్ల మన ఆరోగ్యాలు బాగుపడతాయి, రైతులు బాగుపడతారు, ముఖ్యంగా పుడమితల్లి మళ్లీ ప్రాణం పోసుకుంటుంది.  అందుకే సేంద్రియ సాగుకు జై కొడదాం!! సేంద్రియ ఉత్పత్తులు కొనడానికి ప్రాధాన్యత ఇద్దాం. వ్యాపిక్అర సామ్రాజ్యాధిపతులకు మేలు చేయడం వదిలి మన చుట్టూ ఉన్న రైతులకు మేలు చేద్దాం!!                                                                                                                                ◆వెంకటేష్ పువ్వాడ.  

కాలుష్యంపై పచ్చని మందు!!

పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం చాలా పెరిగిపోయింది, పెరిగిపోతూ ఉంది కూడా. అయినా మనుషులు మాత్రం ఏమీ మారడం లేదు, ప్రకృతికి కలిగించాల్సినంత నష్టం కలిగిస్తూనే ఉన్నారు. కొంతమంది మాత్రం పర్యావరణం గురించి ఆందోళన పడిపోతూ సంరక్షణా చర్యలు చేపడుతూ ఉంటారు. అయితే అదంతా బాగా తాపం పెరిగిపోయిన భూమి మీద చెంబుడు నీళ్లు చల్లినట్టే అవుతోంది. క్షీణిస్తున్న పర్యావరణానికి ఆ కొద్ది సంరక్షణా చర్యలు ఏ మూలకు సరిపోవడం లేదు. ఫలితంగా నష్టం పెరుగుతూ పోతోంది.  ఎలా పెరుగుతోంది ఈ కాలుష్యం!! ఆలోచించాల్సిన అవసరం లేకుండా అందరికీ ఈ పర్యావరణం కాలుష్యం అవుతున్నందుకు కారణాలు ఏంటి అనేది తెలుస్తూనే ఉంటుంది. ఒకటో ఎక్కం అప్పజెప్పినంత వేగంగా పర్యావరణం కాలుష్యం అవ్వడానికి గల కారణాలను వివరించి చెప్పగలరు ఈ మనుషులు. కానీ మనిషిలో ఉన్న స్వార్థపు బీజాలు మెల్లిగా పెరుగుతూ ఇంకా ఇంకా నష్టాన్ని పెంచుతూ పోతారు.  నివారణే కాదు సరిచేయడమూ తెలియాలి. నిజం చెప్పాలంటే కొంతమంది పర్యావరణ స్పృహతో మొక్కలు నాటడం చేస్తారు అందరికీ మొదట గుర్తొచ్చేది కూడా మొక్కలు నాటడమనే ప్రక్రియనే. అయితే ఇందులో చాలామంది మొక్కను నాటడం చేస్తారు కానీ దాన్ని చెట్టుగా మార్చే అంత ఓపిక తెచ్చిపెట్టుకోరు. అంతా తాత్కాలిక ఉద్ధరించడాలు. దారెంటా వెళ్తున్నప్పుడు ఏ చెట్టుకో ఒక పండు కనబడితే దాన్ని కోసుకోవడానికి చూపించినంత ఆసక్తి అదే దారిలో ఎండిపోతున్న ఓ మొక్కకు కొన్ని నీళ్లు తెచ్చి పోయాలనే విషయంలో మాత్రం ఉండదు మనిషికి. ఇలా మనిషి ఎన్నో విధాలుగా ఎన్నో కోణాలలో తప్పులు చేస్తూ సమాజం ముందు మాత్రం ఉద్దరిస్తున్నట్టు ఫోజులు కొడతాడు.  అరికట్టడానికి కట్టుబడి ఉండాలి!! పర్యావరణ కాలుష్యం అరికట్టడం అంటే ఓ పది స్లోగన్ లు రాసిన బోర్డ్ లు పట్టుకుని, నాలుగు ర్యాలీలు చేసి, గొంతు చించుకుని అరచి, కార్యక్రమం ముగియగానే ఆ సమావేశ ప్రాంగణం అంతా కూల్డ్రింకులు, నీళ్లు తాగి పడేసిన ప్లాస్టిక్ గ్లాసులతోనూ, పులిహోర, చిరుతిండ్లు తినేసి పడేసిన ప్లాస్టిక్ కవర్లతోనూ నింపేసి చాలా గొప్ప మేలే వెలగబెడుతుంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండకపోగా జరిగే నష్టమే ఎక్కువ.  భూటాన్ దేశంలో ప్రజలు వీధుల గుండా ఇంకా దారిలో   పోతున్నప్పుడు గమనిస్తే వాళ్ళు 99% నడుచుకుంటూ వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుంటారు. ఇంకా వాళ్ళు పర్యావరణానికి హాని కలిగించే పనులు ఏమి చెయ్యరు. కాలుష్యాన్ని తన్ని తరిమేశారు.  వాళ్ళ రాజ్యాంగంలో పర్యావరణాన్ని రక్షించడం అనేది చాలా ముఖ్యమైన విషయం కూడా. ఇక ఇంకో విషయం ఏమిటంటే వాళ్లు తమదేశంలో ఉన్న విహారాయాత్రకు ప్రముఖమైన ప్రాంతాలలో కొన్ని నియమాలు విధించుకున్నారు. పర్యాటకుల వల్ల ఆయా ప్రాంతాల నుండి ఆదాయం వస్తోంది కదా అని ఎలా పడితే అలా అనుమతులు ఇవ్వలేదు. ఆ విధంగా తమ ప్రాంత సహజత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు.  పైవన్నీ గమనిస్తే మన దేశంలో కాలుష్యానికి, పర్యావరణం కలుషితం అవ్వడానికి కారణం ముమ్మాటికీ సాంకేతిక మరియు పారిశ్రామిక అభివృద్ధి. వాటి ముసుగులో కావలసినట్టు ప్రకృతిని నాశనం చేస్తూ పోతున్నారు. వాటి ఫలితమే ఆకారణ భీభత్సాలు.  మన ప్రకృతిని మనం బాగుచేసుకోవాలి అంటే కృతిమ జీవితానికి దూరంగా ఉండాలి, సంపాదనల వెంట పరిగెత్తకుండా తృప్తితో బతకడం నేర్చుకోవాలి. పచ్చదనాన్ని సృష్టించాలి, ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోవాలి. నష్టం కలిగించే పనులు మానేయాలి. ఇలా చేస్తుంటేనే అందరూ కాసింత స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతారు. లేకపోతే నగరాలలో ఎగురుతూ కనిపించే నల్లని గాలి కెరటాలే మనుషుల శ్వాస కేంద్రకాలు అవుతాయి.                                                                                                                                ◆వెంకటేష్ పువ్వాడ.  

లోకానికి రంగులు జల్లేద్దామా??

ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు అంటాడు ఒక సినీగేయ రచయిత. నల్లానల్లాని కళ్ళ పిల్లా అంటాడు మరొక రచయిత. ఎర్రని జాంపండు అని ఊరిస్తారు అందరూ. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయా అని ముద్దుగుమ్మలు అందాన్ని, సంప్రదాయాన్ని కలిపి అలరిస్తారు. పచ్చని ప్రకృతి అంటూ ప్రకృతి ప్రేమికులు నినదిస్తారు. పిండారబోసినట్టు వెన్నెలా, సముద్రం మీద తెల్లని కలువపువ్వాలా చందమామా అంటూ చమత్కారాలు కురిపిస్తారు. కేంజాయ రంగు సూరీడు ఆకాశమంత నోటితో నవ్వుతాడన్నట్టు అంతా నారింజ వర్ణమే.  ఇట్లా అన్నింటిలో రంగుల హొయలు, రంగేళి పాటలా ప్రపంచాన్ని కనువిందు చేస్తూ ఉంటుంది. ఆకులోనూ, పువ్వులోనూ, మట్టిలోనే కాక నీటిలోనూ, గాలిలోనూ రంగుల్ని చూసే మనసును, సృజనాత్మక వర్ణనను ఆ రంగులే కొందరికి ఇచ్చేసాయేమో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడిదంతా ఎందుకూ అంటే!! ప్రపంచమంతా రంగులతోనూ, రంగులలో ఉన్న ఆనందంతోనూ నిండిపోయి అందరినీ ఆనందంలో ఉంచుతున్నా రంగుల పండగ ప్రత్యేకంగా ఉంది మనకు. తెల్లని మల్లెపూవుల్లాంటి బట్టలు వేసుకుని రంగులు జల్లుకుని సప్తవర్ణ హరివిల్లులా ఒక్కొక్కరూ మెరిసిపోతూ ఉంటే ఎంతో సంబరంగా ఉంటుంది.  వసంతఋతువులో అందరిని పలకరించే రంగుల పండగ వర్ణశోభిత వికసిత మాలిక అయిన హొలీ పండుగ భారతదేశమంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా కృష్ణుడి ఆరాధకులు వ్రేపల్లె కన్నయ్యను తలచుకుంటూ గోధూళి పాటలు పాడుకుంటూ ఆనంద పరవశంలో మునిగి తేలుతూ ఉంటారు. రంగులు జల్లుకోవడాలు, ఉట్టి కొట్టడాలు, బృందావనంలో రాధాకృష్ణులను తలపించే దాండియా నృత్యాలు ఇలా హొలీ పండుగ హడావిడి అంతా ఇంతా కాదు. ఇవన్నీ ఒకెత్తు అయితే హొలీ పిండివంటల హాంగామా వేరే లెవెల్ అనుకోవచ్చు. ముఖ్యంగా తీపి పదార్థాలదే ఇక్కడ పైచెయ్యి. పాలతో చేసే పదార్థాలకు పెద్ద పీట వేస్తారు. ప్రతి ఇంట్లో నేతి వాసనలు గుబాలిస్తూ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలలో హొలీ సందడి తక్కువే అయినా ముంబయ్, బెంగాల్, గుజరాత్, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో హొలీ పండుగ, దాని తాలూకూ హంగామా ఆకాశాన్నంటుతుంది. పిల్లలు పెద్దలు తారతమ్యం లేకుండా రంగులలో తడిసి ముద్దవుతూ ఉంటుంది.  సంబరంతో జాగ్రత్తలు!! అయితే సంబరాలలో అపశ్రుతులు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి తెలిసిన ప్రజలు ముందుజాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని విషయం కూడా మరచిపోకూడదు. రంగులు జల్లుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కళ్ళలోకి రంగులు పడకుండా సంబరాన్ని ఆస్వాదించాలి. అలాగే కృత్రిమ రంగులకు దూరంగా ఉండాలి. ఎలాగైతే వినాయకచవితి సంబరాలలో కాలుష్యం పెరగకూడదని మట్టి గణపతిని ప్రోత్సహిస్తున్నామో అలాగే రంగుల విషయంలో కూడా సహజమైన పదార్థాలను ఎంచుకోవాలి. నిజానికి ఇలా సహజమైన రంగులు తయారు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గడం మాత్రమే కాకుండా కాసింత ఓపిక పెరుగుతుంది. మనుషుల్లో సృజనాత్మకత బయటకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే బోలెడంత ఆత్మసంతృప్తి మిగులుతుంది.  ఇంకా శరీరానికి కొబ్బరి నూనె, బాడీ లోషన్ వంటివి ముందుగానే పూసుకోవడం వల్ల రంగుల ప్రభావం చర్మం మీద పడకుండా ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ దగ్గరలో ఉంచుకోవడం మంచిదే. ఇబ్బంది పెట్టని సంబరాలు ఆనందాలు!! కొందరికి రంగులు చల్లుకుని హంగామా చేయడం ఇష్టం లేకపోవచ్చు. ఏవో కారణాల వల్ల హొలీ మూడ్ ను ఎంజాయ్ చేయలేకపోవచ్చు. మరేవో కారణాల వల్ల దూరంగా ఉండాలని అనుకోవచ్చు. స్నేహితులు, చుట్టాలు, పక్కాలు, కొలీగ్స్ ఇలా అందరిలోనూ ఎవరో కొందరు ఇలాంటి వాళ్ళు ఉండచ్చు. అలాంటి వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి కానీ బలవంతంగా రంగులు పూయడం అల్లరి చేయడం వంటివి చేస్తే అవతలి వాళ్లకి అది గోలగానూ, సాడిజంగానూ అనిపిస్తుంది. అందుకే వీలైనంత వరకు ఎదుటి వారిని, వారి అభిప్రాయాలను గౌరవించాలి. పంచభూతాలూ, ప్రకృతి, మనుషులూ, ఆనందాలు, అల్లర్లు, సంతోషాలు, అలకలు, ఆటపట్టించడాలు ఇలా అన్ని రంగులలో కలసి వసంతఋతువులో లోకానికి మరింత కొత్తశోభను అద్దుతాయి.  ఎలాంటి అపశ్రుతులు ఎదురుకాకుండా లోకం మీద  హొలీ రంగులు జల్లేద్దాం!! ◆వెంకటేష్ పువ్వాడ.

వాతావరణ వీరులు!!

  బంగాళాఖాతంలో అల్పపీడనం మరో వారం రోజుల పాటు కొనసాగనున్న వర్షాలు. చెన్నై తీరం దాటనున్న తుఫాను. ఆ సమయంలో వేగంగా గాలులు ఉంటాయని, వర్షాపాతం ఉధృతంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఎక్కువ ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన వాతావరణ శాఖ. మారుతున్న ఋతుపవనాల దిశ.  గాలిలో తేమశాతం తగ్గుతోందని సమాచారం. పైవన్నీ వాతావరణ నివేదికల్లాంటివి కానీ అవన్నీ ప్రస్తుతానికి అసలు ఆంబంధం లేనివి. మరిప్పుడెందుకు  ఇవన్నీ అంటే….. భారతదేశంలో  ఎన్నో రంగాలు ఉన్నాయి. రైల్వే, వైమానిక, జల, సైనిక వంటి రంగాలు అన్నీ  ప్రజలకు సేవలు అందిస్తున్నవే. అయితే ప్రజలకు ఎప్పుడూ తక్షణ సమాచారాలు అందిస్తూ, విరామం లేకుండా సాగే మరొక రంగం వాతవారణ శాఖ. Indian meteorological department ద్వారానే అన్ని రంగాలు సవ్యంగా సాగుతున్నాయనేది అక్షరసత్యం. ఆకాశంలో విమానాలు సరైన దిశలో ప్రయాణం చేయడానికి అందించే తోడ్పాటు నుండి సాధారణ వర్షపాతాలు, రోజువారీ వాతావరణ నివేదికలు, రైల్వే రంగాలకు, సముద్ర ప్రయాణాలకు ఇలా అన్ని విధాలుగా తమ సేవలను అందిస్తున్నది వాతావరణ శాఖ. ఇంకా ముఖ్యంగా ప్రకృతీ విపత్తులు సంభవించినప్పుడు వారు అందించే అత్యవసర సేవలు, నిమిష నిమిషానికి అందించే నివేదికలు, వాటి ఆధారంగా తీసుకునే జాగ్రత్తలు ఎన్నో ప్రాంతాలను, ఆ ప్రాంతాలలో నివసించే ప్రజలను కాపాడుతూ వస్తున్నాయి. అలుపెరుగని సేవలు!! స్కూళ్ళు, బ్యాంకులు, మండల, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదివారం, పండుగ, ప్రభుత్వం ప్రకటించిన ఇతర ప్రత్యేక దినాలలో సెలవులు ఉంటాయి. కానీ ఈ వాతావరణ శాఖకు సెలవు అంటూ లేదు. సూర్యుడికి, చంద్రుడికి, పవనాలకు విరామం లేనట్టే ఈ శాఖ కూడా నిరంతరం గడియంరంలో ముల్లుతోపాటు పనిచేస్తూనే ఉంటుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా వాతావరణంలోని తేమ, గాలుల దిశ ఆధారంగా రోజువారీ నివేదికలు అందిస్తూనే ఉంటుంది. నైటౌట్లతో మెలకువగానే ఉంటుంది. అన్నిటికీ ఆధారం!! మనిషి మనుగడకు ఈ ప్రకృతి ఎంత ముఖ్యమైనదో, మనిషి కార్యకలాపాలకు ప్రకృతి స్థితి గతులు అంతే ముఖ్యమైనవి. ముఖ్యంగా భారతీయ ముఖ్య రంగం అయిన వ్యవసాయం పూర్తిగా వాతావరణ హెచ్చరికల ఆధారంగా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తుంది. వ్యవసాయానికి, వర్షపాతానికి, వాతావరణ శాఖకు ఉన్న అవినాభావ సంబంధం మాటల్లో చెప్పలేనిది. అలాగే ప్రయాణాల విషయంలో వాయు మార్గాలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్, జలమార్గాలు అయిన ఇండియన్ నేవీ వంటివి వాతావరణ శాఖ సహాయంతో భారతీయ సైనిక దళం అయిన ఇండియన్ ఆర్మీ తో సమానమైన సేవల్ని అందిస్తోందని అనడంలో అతిశయోక్తి లేదు. చిన్నప్పుడు పుస్తకాలలో వాతావరణం, నీరు, తేమ, ఆర్థ్రత, ఉష్ణోగ్రత, గాలులు, పవనాలు, దిశలు, తుఫానులు, వర్షాపాతం వంటి వాటిని అనుసంధానం చేసుకుని, మానవ మనుగడకు అవసరమైన ఎన్నో రంగాలతో అనుసంధానమైన వాతావరణ శాఖ గురించి అందులో ఉద్యోగాల గురించి తెలిసినవాళ్ళు చాలా తక్కువ. ప్రస్తుతం యువత ఎక్కడ చూసినా ఇంజనీర్లు, డాక్టర్లు, బ్యాంక్ ఆఫీసర్లు వంటి వాటివైపే దృష్టి పెడుతున్న తరుణంతో ఇతర రంగాల మీద కూడా ఒకసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.                                                                                                                ◆వెంకటేష్ పువ్వాడ.  

నీటిబొట్టుకు కొత్త గొంతు!!

ప్రయాణాలు చేస్తూ ఉంటాం. అంతా హైవే రహదారి, ఎక్కడా హోటళ్లు ఉండవు, చిన్న బడ్డీ కొట్టు కూడా కనిపించదు. ఒకవైపు దాహం పట్టిపీడుస్తూ ఉంటుంది. వెంట తెచ్చుకున్న బాటల్ లో నీళ్లు కూడా అయిపోయి ఉంటాయి. నోరంతా పిడచకట్టుకుని పోతూ ఉంటుంది. శరీరం క్రమంగా తేమను కోల్పోయి స్వాధీనం తప్పేంత డైలమాలో పడిపోతుంది. ఏదో చెయ్యాలని అనుకుంటాం. ఎవరైనా మనకు ఎదురైతే బాగుండు, కాసిన్ని నీళ్లిచ్చి దాహం తీరిస్తే బాగుండు అనుకుంటాం. కానీ అలా జరగదు, ఒక్కసారిగా దుఃఖం పొంగుకొస్తుంది. ఇంట్లో ఉంటే గనుక ఇలాంటి నరకం ఉండేది కాదు కదా అనిపిస్తుంది.  చాలామందికి పైన అనుభవం జీవితంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో(ప్రయాణాలు అనే కాదు వేరే ఏదైనా సందర్భం కావచ్చు) ఎదురయ్యి తీరుతుంది. కొందరు పైన చెప్పుకున్నవరకే తమ ఆలోచనలు సాగిస్తారు. మరికొందరు దాంతోపాటు ఇంకొంచెం ముందుకు సాగుతారు. బాత్రూమ్లోనూ, బట్టలు ఉతకడం లోనూ, ఇంటి పనులలోనూ, బయటకు వెళ్లినప్పుడూ, అతిశుభ్రత పేరుతోనూ ఎన్నెన్ని నీళ్లను కాలువలపాలు చేసామా అని కొందరు పశ్చాత్తాపపడతారు. బాత్రూమ్లో దూకే కుళాయి నీళ్లు కూడా అత్యంత విలువైనవిగా అనిపిస్తాయి అప్పుడు.  ఇది ఒకమనిషి ఆవేదన అయితే గ్రామాలు, మండలాలు, జిల్లాలు అందులో నివసించే వేలు, లక్షల ప్రజానీకం ఏళ్లకేళ్ళుగా నీటి తళతళలు తమ నేలల మీద కనబడక ఎంతెంత ఆవేదన చెందుతూ ఉండి ఉండాలి. మినరల్ వాటర్ సృష్టించి వాటర్ వార్ లకు కారణమైన వ్యాపార సామ్రాజ్యాలు కూడా ఉన్న నేటి అభివృద్ధి ప్రపంచంలో  కనీస అవసరాల కోసం నీటి సరఫరా లేని జనావాస ప్రాంతాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. గంధపుచెక్కల చెట్లు సమృద్ధిగా ఉన్నవాడికి ఆ గందపుచెట్టు పెద్ద విలువైనదిగా ఎట్లా అనిపించదో, అలాగే అన్ని సౌకర్యాల మధ్యా కుళాయి తిప్పి నీటిని వాడేసేవాళ్లకు దాహం గొంతుల ఆవేదన అర్థం కాదని అనిపిస్తుంది. కానీ….. ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో నీటి ఆవరణా ప్రాంతాల శాతం, అడవుల విస్తరణ శాతం తగ్గిపోతూ ప్రజల అవాస ప్రాంతాలు అభివృద్ధిలో భాగంగా పెరిగిపోతుంటే కరువు ప్రాంతాల శాతం పెరుగుతూ వస్తోంది. చెట్ల నరికివేత విచ్చలవిడిగా జరుగుతూ ఉండటం వల్ల ప్రతి నీటి బొట్టూ ప్రశ్నార్థకంగానే మారుతోంది. మనుషులను మినహాయిస్తే మూగజీవుల ఆవేదన వర్ణించని విధంగా మారిపోతోంది. వృక్షో రక్షతి రక్షితః!! చెట్టును మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్నట్టు, భూగర్భజలాలు పెరగాలి అంటే చెట్లు నాటడమే సరైన మార్గమని అందరికీ తెలుసు. కానీ నష్టం మనవరకు రాలేదులే అనే దారుణమైన నిర్లక్ష్యపు ఆలోచనల వల్ల ఎంతో స్వార్థం వల్ల మనుషులు తగిన మూల్యం చెల్లించుకునే దిశగా నడుస్తున్నారు. వాటి ఫలితాలే అసందర్బపు ప్రళయాలు.  మరోవైపు!! శరీర ఆరోగ్యానికి నీరు ఎంత అవసరమో అందరికీ తెలిసినదే. కానీ చాలామంది నీటిని సరిపడినంత తాగకపోవడం వల్ల శరీరంలో తేమశాతం తక్కువై కిడ్నీ సమస్యలు మొదలుకుని శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఎన్నో అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కారణం బయటకు వెళ్లే మహిళలు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, దారి మధ్యలోనూ, పనుల మధ్యలోనూ మూత్రవిసర్జనకు దారిదొరక్క మగవాళ్ళలాగా రోడ్డుపక్కన కానిచ్చేయలేక మూత్రాన్ని బిగించడం లేదా, నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల చాలా తొందరగా కిడ్నీలు పాడైపోతూ ఉంటాయి.  శరీరానికి ఇంధనమైన నీటిని మనం తగుతున్నంత బాద్యతగానే నీటి సంరక్షణ చర్యలు కూడా చేపట్టాలి. భూగర్భజలాలు పెరగడానికి ఉత్తమమార్గం అయిన చెట్ల పెంపకాన్ని కూడా బాధ్యతగా చేపట్టాలి. ఇంటి అవసరాలలో నీటిని ఎంతో పొదుపుగా వాడుకోవాలి. సామాన్లు కడిగిన, బట్టలు ఉతికిన నీటిని సింకుల్లో, కాలువల్లో తోసేయకుండా వాటిని మొక్కలకు, చెట్లకు మళ్లించాలి. అన్నిటికీ మించి పిల్లలకు నీటి విలువ తెలియజెప్పాలి.  శరీరానికి నీరు ఎంత అవసరమో చెబుతూనే, నీటిని వృధా చేయడం ఎంత తప్పో చెప్పాలి. మనం చేతయాల్సింది అంత చేస్తే, ప్రకృతి నీటి గొంతును వినిపిస్తుంది.                                                                                     ◆వెంకటేష్ పువ్వాడ.  

అమరజీవి జయంతి!!

ఆంధ్రరాష్ట్రం ఏర్పడి తెలుగు నేల కొత్త అడుగులు వేయడానికి కారణమైన నాయకుడు పొట్టిశ్రీరాములు. ఈయన ప్రాణత్యాగం ఫలితంగా ఎంతో క్లిష్టమైన తెలుగు రాష్ట్రం ఏర్పాటు జరిగింది.  బాల్యం!! ఎక్కడో మద్రాసులో 1901 సంవత్సరంలో పుట్టిన శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం మరణించడం అనే విషయం వింటే ఆశ్చర్యం వేస్తుంది. మనుషులకు మనుషులకు మధ్యా, మనుషులకు ప్రాంతాలకు మధ్య ఇంత గొప్ప అనుబంధాలు ఉంటాయా అనిపిస్తుంది. ఇరవై సంవత్సరాల వరకు మద్రాసులోనే చదువుకున్న శ్రీరాములు గారు తన విద్యను పూర్తి చేసుకుని చక్కగా ఉద్యోగం సంపాదించారు.   విషాదం, జీవితంలో పెద్ద మలుపు!! మనిషి జీవితం ఎప్పుడు ప్రభావానికి లోనవుతుంది అంటే అనుకోని విధంగా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు. పొట్టి శ్రీరాములు గారి జీవితంలోనూ అలాంటిదే జరిగింది. చదువు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించి, పెళ్లి చేసుకుని చక్కగా ఉన్న జీవితంలో పెద్ద కుదుపు పుట్టిన బిడ్డ చనిపోవడం, ఆ తరువాత కొన్ని రోజులకే భార్య కూడా మరణించడం. వెంట వెంట రెండు చావులను చూడటంతో వైరాగ్యానికి లోనైన శ్రీరాములు గారు ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టేసి గాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమంలో చేరిపోయాడు.  అదే ఆయన జీవితంలో పెద్ద మలుపుగా చెప్పవచ్చు. గాంధీ మాటలకు ప్రభావితుడై సత్యాన్ని, సత్య మార్గాన్ని నమ్మి, అహింసాయుత జీవితాన్ని గడిపిన గొప్ప వ్యక్తి అయ్యాడు. సత్యాగ్రహాలు, ఉద్యమాలు!! గాంధీ వెంటే ఉండటం వల్ల పొట్టి శ్రీరాములు గారిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా దేశం కోసం దేశ స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరటాలలో తనదైన పాత్ర పోషించారు. ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. క్విట్ ఇండియా ఉద్యమం వల్ల మూడు సార్లు జైలుకు వెళ్ళాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే హరిజనుల కోసం పాటు పడిన గొప్ప వ్యక్తి శ్రీరాములు గారు అన్న విషయం చాలామందికి తెలియదు. హరిజనుల ఆలయ రవేశం కోసం ఎన్నో దీక్షలు చేపట్టి హరిజనోద్ధరణ శాసనాలను మద్రాసు ప్రభుత్వం చేత ఆమోధింపజేశాడు. గురు శిష్యుల అనుబంధం!! గాంధీని గురువుగా భావించి ఆయన అడుగుజాడల్లో నడిచినవాడు శ్రీరాములు గారు. కాకపోతే ఈయనలో మొండితనం ఎక్కువ ఉండేదని గాంధీ చెబుతూ ఉండేవారు. ఒకోసారి ఆ విషయంలో గాంధీ చిరాకు పడేవారు కూడా. సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు గారు ఎంతో క్రమశిక్షణతో మరెంతో ప్రేమతో అందరిని పలకరిస్తూ ఉండేవారు. ఆంధ్రరాష్ట్ర ఉద్యమం!! తెలుగు భాషా ప్రయుక్త ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలని చర్చలు మొదలుపెట్టింది ఎంతో మంది ఆంధ్రరాష్ట్రం కోసం గొంతులు విప్పారు. అయితే చూసి చూడనట్టు కాలం ముందుకు సాగిపోతూ ఉంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆంధ్రరాష్ట్రం కోసం ఎన్ని అభ్యర్థనలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించక పోవడం ఇంకా ఇంకా నిరుత్సాహాన్ని నింపి కొందరిని వెనక్కు లాగేసింది కూడా.  అయితే పొట్టి శ్రీరాములు గారు అమరనిరాహారదీక్ష మొదలుపెట్టినప్పుడు అందరూ ఎగతాళి చేసినవారే!! కానీ క్రమంగా ఆయనే ఒక మహాశక్తిగా ఎదిగిపోయి కృశించిపోతున్న తన శరీరాన్ని లెక్కచేయకుండా దీక్ష విరమించకుండా ప్రాణాన్ని కూడా వదులుకున్నారు.  మహాత్మా గాంధీ గనుక బతికి ఉంటే శ్రీరాములు గారు దీక్షలో అలా మరణం కౌగిట్లోకి వెళ్లిపోయేవారు కాదని ఎందరో అభిప్రాయ పడ్డారు. కానీ చరిత్ర మాత్రం తన రాత తాను రాసుకున్నట్టు అందులో శ్రీరాములు గారి ప్రాణత్యాగాన్ని విషాదాక్షరాలతో లిఖించుకుంది. ప్రాణత్యాగమే నేటి సంతోషాల పలితం!! శ్రీరాములు గారి ప్రాణత్యాగం వల్లనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది అనేది అందరికీ తెలిసిన నిజం. కానీ ఆయన మరణించినప్పుడు ఆయన మృతదేహాన్ని తాకడానికి కూడా వెనకడుగు వేసిన ఈ మనుషుల వారసత్వాలే నేడు ఆయన ప్రాణత్యాగం వల్ల లభించిన స్వేచ్ఛయుత ఆంధ్రరాష్ట్రంలో బతుకుతున్నాయి. ఆనాటి తప్పిదాలు వదిలినా నేటి తరాలకు, రేపటి తరాలకు  అమరజీవి పొట్టిశ్రీరాములు గారి గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ◆వెంకటేష్ పువ్వాడ  

సర్వమతాల అధ్యయన స్వరూపం పరమహంస!!

భారతీయ ఆధ్యాత్మిక గురువుల చిట్టా విప్పితే అందులో రామకృష్ణ పరమహంస తప్పక ఉంటారు. రామకృష్ణ మిషన్ ద్వారానూ, ఆయన ఆధ్యాత్మిక భోధనల ద్వారానూ ఆదిశంకరాచార్యుల తరువాత ఆధ్యాత్మికతను, హిందూ మతంలో ఉన్న విశిష్టతను ముస్లిం మరియు క్రైస్తవ మతాలకు ధీటుగా నిలబెట్టిన వారు రామకృష్ణ పరమహంసనే. బాల్యంలో….. 1836 ఫిబ్రవరి 18 న పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు ఈయన. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. పేదబ్రాహ్మణ కుటుంబానికి చెందిన వీళ్ళు ఎంతో విశాలమైన హృదయం కలిగినవాళ్ళు.  ఈయనలో  సృజనాత్మకత ఎక్కువ. చదువు మీద ఆసక్తి తక్కువ. అందుకే పెద్దగా చదువుకోలేదు. ఎంతోమంది సాధువులు వీళ్ళ గ్రామం మీదుగా పూరీ జగన్నాథుడి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. అలా వెల్తూ వీళ్ళ గ్రామంలో ఆగినప్పుడు ఆ గ్రామంలో ప్రజలకు హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళ గురించి ఎంతో గొప్పగా ప్రవచనాలు చెప్పేవాళ్ళు. వాటిని ఎంతో ఆసక్తిగా వినేవారు. అలా ఈయనకు భారతీయ ఆధ్యాత్మికత మీద ఒకానొక ఆసక్తి ఏర్పడింది. వృత్తిలో అన్వేషణ!! రామకృష్ణుల వారి అన్న ఒక అమ్మవారి గుడిలో పనిచేసేవారు. ఆయన చనిపోయిన తరువాత కుటుంబం కగడవడం కోసం రామకృష్ణులు ఆ గుడిలో పూజరిగా చేరారు. అమ్మవారి విగ్రహంతో మాట్లాడేవారు. అమ్మవారు తనతో మాట్లాడాలని ఎంతో అడిగేవారు. అడవిలోకి వెళ్లి ఒంటరిగా కూర్చుని ప్రశ్నలు వేసుకునేవారు. ఎప్పుడూ అమ్మవారి ఆలోచనల్లో మునిగిపోయి ఉండేవారు. ఫలితంగా ఒకసారి అమ్మవారి ప్రత్యక్ష దర్శనం పొందారు. అప్పటి నుండి తరచుగా అమ్మవారితో మాట్లాడుతూ ఉండేవారు ఈయన.  అంతేకాదు మిగిలిన మతాలు ఎందుకున్నాయి?? వాటి ప్రత్యేకత ఏమిటి అని విషయం తెలుసుకోవడానికి ముస్లిం మరియు క్రైస్తవ మతాలను అందులో నియమాలను కూడా స్వయంగా ఆచరించి ఆ మతాలను కూడా అధ్యయనం చేసాడు రామకృష్ణులు. ఆ అన్వేషణ ఫలితంగా ఆయన చెప్పింది ఒక్కటే. మతం అనేది ఆ దేవుడిని తెలుసుకోవడానికి చేరుకోవడానికి మార్గం మాత్రమే అని. అది మనుషుల మధ్య హింసాత్మక విభేదాలు సృష్టించడానికి కాదని నొక్కి వక్కాణించారు. వివాహం ఆధ్యాత్మిక బంధం!! ఈయన పెళ్లి చేసుకున్నప్పుడు శారదాదేవి గారి వయసు కేవలం అయిదు సంవత్సరాలు మాత్రమే. కానీ రామకృష్ణుల వారు తనకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను అన్నిటినీ ఆమెకు నేర్పించారు. నిజానికి ఆయన మొదటి శిష్యురాలు కూడా ఆయన భార్యే. శారదాదేవి గారు ఎంతో బాగా సులువుగా అర్థం చేసుకునేవారు. అందుకని ఆమెను త్రిపురసుందరీ దేవి ప్రతిరూపంగా భావించి ఆమెను ఎంతో భక్తిగా పూజించేవాడు. ఇలా వాళ్ళిద్దరిమధ్య ఆధ్యాత్మిక బంధమే కొనసాగింది. గురుశిష్యుల ప్రయాణం!! రామకృష్ణుల వారి శిష్యులలో ప్రసిద్ధి చెందినవాడు స్వామి వివేకానంద. ఈయన ఎందరో గురువులను ఆశ్రయించి విఫలమై చివరికి  రామకృష్ణులను చేరి సార్థకత పొందాడు. రామకృష్ణుల ఉపన్యాసాలను విదేశాలకు వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా యువతను ఆకర్షించాడు. విదేశాలలో హిందూధర్మం గురించి దైర్యంగానూ గొప్పగానూ చాటి చెప్పాడు. రామకృష్ణుల వారి శిష్యులు అందరూ కూడా ఎంతో ఉన్నత విద్యావంతులు. వీళ్ళు ఎవరూ దేన్నీ ఆధారం లేకుండా కారణం లేకుండా సమ్మతించేవారు కాదు. ఆ విధంగా రామకృష్ణులు చెపినా విషయాలు ఎంతో వాస్తవికతను నిండుకుని ఉన్నవే  అయ్యాయి. అంతిమ దశ!! ఎందరో గురువులను చూస్తే ఆఖరి దశలో తమ శరీరాన్ని ఏదో మొండి రోగానికి అర్పించి మరణించిన ఆనవాళ్లు కనబడతాయి. రామకృష్ణుల విషయంలోనూ అదే జరిగింది. ఈయన కాన్సర్ బారిన పడి, ఆరోగ్యపరంగా ఎంతో నలిగినా మానసికంగా ఎంతో దృఢచిత్తంతో ఉండేవారు. తనలో ఉన్న ఆధ్యాత్మిక సంపదను మొత్తం స్వామి వివేకానందకు ధారపోసి 1886 ఆగష్టు 16 వ తేదీన మహాసమాధిని పొందాడు. ఈయన హిందూసంప్రదయంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు తొలగించడంలో కృషి చేసారు. ఈయనవల్లనే అరభిందో ప్రభావితం అయ్యారు. అలాగే భక్తి ఉద్యమం కూడా ప్రభావితమయ్యింది. సృష్టిలో ఏకత్వాన్ని, జీవులలో దైవత్వాన్ని, అన్ని మతాలలో ఉన్న మార్గ ముఖ్య ఉద్దేశం దేవుడిని తెలుసుకోవడం చేరడం, మతాలు ఆ మార్గాలు మాత్రమే అనేది ఈయన చెప్పిన గొప్ప సత్యం.

ఫోబియాలపై యుద్ధమిలా చేయండి!!

  చీకటంటే కొందసరికి భయం, వెలుగంటే మరికొందరికి భయం, పురుగులను చూస్తే కొందరికి భయం, తినే పదార్థాలు కొన్ని చూస్తే భయం, ఎత్తైన ప్రదేశాలు అంటే భయం, రక్తం చూసినా ఆ రంగు అన్నా భయం, ఎక్కువ నీళ్లు చూస్తే భయం ఇలా మనిషి బుర్రలో ఎన్నో భయాలు. వైద్యరంగంలో డాక్టర్లు ఈ భయాలకు ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టి, వాటికి ఫలానా ఫలానా మందులు కనుగొన్నామని వైద్యం చేస్తామని చెబుతూ ఉంటారు ప్రజలు కూడా డాక్టర్ల దగ్గరకు పరిగెత్తుకుంటూ పోతుంటారు.  ఇలా మనిషిలో ఉన్న అతి భయానికి ఫోబియా అనే పేరు పెట్టి దానికి వైద్యం గట్రా కనిపెట్టి మనుషుల మానసిక బలహీనతలను డబ్బు చేసుకుంటున్నారు వైద్యరంగంలో జబ్బుల ఆవిష్కర్తలు. ఫోబియాలు ఎందుకు?? అవునూ నిజానికి ఫోబియాలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి అని ఆలోచిస్తే అదొక మానసిక బలహీనత అని ఆ బలహీనత చాలా పెరిగిపోతే దానికి ఫోబియా అనే పేరు పెడుతున్నారని అర్థమవుతోంది. కాలక్రమేణా మనిషి మెదడుపై వేస్తున్న భారమే మనిషిలో ఆలోచనలు పెరగడం లేదా అతిగా రూపాంతరం చెందడం జరుగుతూ వస్తోంది. అది మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుకోని సంఘటనలు ఒత్తిడిలోకి నెట్టి అవి క్రమేణా భయాలకు దారి తీసే, ఆ భయాలు కాస్తా ఫోబియాలుగా ఎదిగి మనిషిని ప్రశాంతతకు దూరం చేస్తాయి. ఇలా ఫోబియాలు మనిషి జీవితాల్లో భాగం అవుతూ వస్తున్నాయి. తప్పు ఎక్కడుంది?? నిజానికి ప్రతి భయం మనిషి మానసిక స్థితిని దెబ్బతీసేదే అయితే ఆ మానసిక స్థితి దెబ్బ తింటూ ఉన్నపుడు మానసిక స్థితిని మెరుగుపరుచుకోకపోగా…. దానికోసం లేనిపోని మందులు వాడుతూ శరీరాన్ని మత్తులోకి నెడుతూ శరీర ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారు.   ఒకరి భయం మరొకరి వ్యాపారం!! ప్రపంచం అన్ని కోణాల లోనూ వ్యాపారం చేస్తుంది. ముఖ్యంగా ఒకరి బలహీనతే మరొకరికి వ్యాపారం. ఈ సూత్రాన్ని పాటించని రంగం కూడా లేదు. వైద్యరంగంలో ఇది మరీ ఎక్కువగా కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా చిన్న విషయాలను భూతద్దమంత చూపెట్టి ప్రజలను ఆ భయంలోకి నెట్టి, ఉన్న మానసిక సమస్యని ఎన్నో రెట్లు పెంచేది వైద్యరంగాలే. ఈ విధంగా చూస్తే మనుషుల్లో ఫోబియాలు, రోగాలు సృష్టిస్తున్నది తరువాత మనుషుల నుండి ఆర్జిస్తున్నది పూర్తిగా వైద్యరంగంలో రహస్య చర్యలే. ఫోబియకు మందు!! జీవితానికి పరిష్కారం!! ఫోబియాలు ఎన్నైనా ఉండనివ్వండి అవన్నీ మనిషిని మానసికంగా దెబ్బతీసేవే, ప్రశాంతతను దూరం చేసేవే. ఇలాటి ఫోబియాలకు డాక్టర్లు రాసిచ్చే మందులు వాడితే తగ్గిపోతుందా??  డాక్టర్లు నెలల వారిగా కోర్సుల పేరిట మందులు రాసిచ్చి వాటిని వాడమని చెబుతారు. ఆ ఫోబియా బాధితులు కూడా మందులు వాడుతూ ఆ మందులలో ఉన్న ప్రభావం వల్ల కాస్త మత్తులోకి జోగుతూ రాత్రిళ్ళు చక్కగా నిద్రపోతూ ఉద్యోగాల పనులలో పడిపోయి ఆ అతి ఆలోచనలకు దూరంగా ఉంటూ మందుల వల్ల తమకు బాగవుతోంది అనే భ్రమలో ఉంటారు.  ఒకవేళ అదే నిజమైతే ఆ మందుల వాడకం పూర్తయ్యాక సమస్య పరిష్కారం అవ్వాలి కదా కానీ మళ్ళీ సమస్య మొదటికి వచ్చినట్టు మందులు అపగానే మళ్ళీ ఆలోచనలు, భయం మొదలయ్యి నిద్ర దూరమయ్యి మళ్ళీ ముందులాగా మారిపోతుంటారు.  ఇలాంటి వాళ్ళు కేవలం తాత్కాలిక పరిష్కారం కోసం మందులు వాడేస్తారు కానీ శాశ్వత పరిష్కారం కోసం ఎప్పుడూ కృషి చెయ్యరు. శాశ్వత పరిష్కారముందా?? అవును ప్రతి సమస్యకూ ఓ శాశ్వత పరిష్కారం అంటూ ఉండనే ఉంటుంది. అయితే అదంతా మనిషి మానసిక స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. మనిషి ఎప్పుడైతే మానసిక స్థాయిని మెరుగుపరుచుకుంటాడో అప్పుడు శారీరక సమస్యలు, లోపాలు కూడా ఎక్కువ భాదించవు. ఎంతోమంది శారీరక లోపాలు కలిగిన వాళ్ళు జీవితాలలో ఎన్నో విజయాలకు చేరువ అవుతున్నారు. వాటన్నిటికీ  కారణం ఏమి అని తరచి చూస్తే వాళ్ళ మానసిక స్థాయి సాధారణ మనుషుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. తమలో లోపాన్ని మరచి మరీ విజయంవైపు అడుగులు వేస్తూ ఉంటారు. అలాంటిది మానసిక సమస్య ఉన్న శారీరక ఆరోగ్యవంతులు మానసిక సమస్యను అధిగమించడం అసాధ్యమేమి కాదు. మన భారతీయ ఆయుర్వేదం మరియు మన సనాతన ధర్మం మన మహర్షులు ప్రసాదించిన ధ్యానం, ప్రాణాయామం, యోగ వంటివి జీవితంలో భాగం చేసుకుని పాటిస్తే కేవలం నెల రోజులలో ఎంతో గొప్ప పరిష్కారం లభిస్తుంది. ◆వెంకటేష్ పువ్వాడ◆  

కూతురిని కోల్పోయినా... 800 ఆడపిల్లలకు ఆసరా!

చాలామంది జీవితంలో కష్టాలు వస్తాయి. కలలా సాగిపోతున్న జీవితం కాస్తా తలకిందులైపోతుంది. అలా తారుమారైన జీవితాన్ని తల్చుకుని తల్చుకుని వారు కుమిలిపోతుంటారు. కానీ కొందరు మాత్రం తాము పడిన కష్టానికి ఉపశమనంగా, అలాంటి కష్టంలో ఉన్న తోటివారందరికీ ఓదార్పుగా..... ఓ భిన్నమైన మార్గాన్ని ఎన్నుకొంటారు. తన కష్టాన్ని సమాజానికి ఓ వరంగా అందిస్తారు. అలాంటి ఓ వ్యక్తే సరోజనీ అగర్వాల్‌!   లక్నోలో ఉండే సరోజనీది ఓ అందమైన కుటుంబం. చక్కగా చూసుకునే భర్త, రత్నాల్లాంటి పిల్లలు... అంతా బాగుంది. హిందీలో పీ.హెచ్‌.డీ చేసిన సరోజనీకి కథలన్నా, కవితలన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టంతో స్వయంగా ఎన్నో రచనలు చేశారు. ఓ రోజు సరోజనీ తన కూతురుతో కలిసి ప్రయాణిస్తుండగా... అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆమె నడుపుతున్న బండి ప్రమాదానికి లోనై, ఆమె కళ్ల ముందే కూతురు చనిపోయింది.   కళ్లముందే కూతురు చనిపోవడం, అది కూడా తను నడుపుతున్న బండి వల్లే చనిపోవడంతో సరోజనీ తేరుకోలేకపోయింది. కానీ అందరిలా ఆమె ఆవేదనతో మిగిలిపోలేదు. తన కూతురు జ్ఞాపకాలకు విలువనిచ్చేలా ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1985లో తన ఇంట్లోనే ఆడపిల్లల కోసం ఓ అనాథ శరణాలయాన్ని నెలకొల్పారు. ఆ శరణాలయానికి తన కూతురు పేరు మీదుగా ‘మనీషా మందిర్‌’ అని పేరు పెట్టారు. తన రచనల మీద వచ్చే రాయల్టీలతో దాన్ని నడపసాగారు.   మనీషా మందిర్‌ను మొదలుపెట్టడమే ఆలస్యం... ఎందరో పిల్లలకి అది ఆసరాగా మారింది. వికలాంగులుగా ఉన్నారనో, పెంచే ఆర్థిక స్తోమత లేదనో... వదిలేసే ఆడపిల్లలకు మనీషా మందిర్‌ నీడనిచ్చింది. రోడ్ల మీద తనకు అనాథలా కనిపించినవారినీ, వేశ్యాగృహాలలో పుట్టినవారినీ కూడా సరోజనీ అక్కున చేర్చుకునేవారు. మనీషా మందిర్లో అనాథలను చేర్చేందుకు ఆ ఇంటి ముంగిట ఒక ఊయల కట్టి ఉండేదంటే... ఆమె నిశ్చయం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.   మనీషా మందిర్‌లో ఇప్పటివరకూ 800 మందికి పైగా ఆడపిల్లలకు ఆశ్రయం లభించింది. అలాగని వారిని కేవలం అనాథలుగా చూడలేదావిడ. వారందరిలోనూ దూరమైన తన కూతురిని చూసుకుని మురుసుకునేవారు. ఒక కూతురి కోసం ఎలాంటి సుదాపాయాలు కల్పించాలని తల్లి తాపత్రయపడుతుందో... తన ఆశ్రమంలో ఉన్నవారికి అలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తారు సరోజని. లైబ్రరీ, కంప్యూటర్‌ లాబ్‌, బాడ్మింటన్ కోర్ట్‌... లాంటివన్నీ మనీషా మందిర్‌లో కనిపిస్తాయి. ఇక అందులోని పిల్లలకు విద్య, వృత్తి నైపుణ్యాలని అందించడం సరేసరి!   మనీషా మందర్‌లో రోజుల వయసులో చేరిన పిల్లలు, తమ కాళ్ల మీద తాము నిలబడేవరకూ చేయూతగా నిలుస్తారు సరోజనీ. అలా మనీషా మందిర్‌లో ఎదిగిన ఎందరో పిల్లలు బ్యాంక్‌ మేనేజర్లుగా, టీచర్లుగా, ప్రభుత్వోద్యోగులుగా గౌరవప్రదమైన స్థానాలకు ఎదిగారు. మరికొందరు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడ్డారు. ‘‘ఇంతమందికి సాయపడేందుకే భగవంతుడు నా కూతురిని తీసుకువెళ్లిపోయాడేమో! ఇన్ని వందల మందిలో నా కూతురిని పదిలంగా చూసుకునే అవకాశం కల్పించినందుకు ఆయనకి నేను రుణపడిపోయాను,’’ అంటారు సరోజనీ. మనీషా మందిర్‌ ముంగిట ఉన్న మనీష విగ్రహంలోని చిరునవ్వుని గమనిస్తే... ఆమె ఈ మాటలను వింటున్నట్లుగానే తోస్తుంది.   - నిర్జర.

ఉద్యోగాలలో విజయం మహిళలదే

మహిళలకి ఉన్న ఉద్యోగ ప్రజ్ణకి సాటి లేదు అంటున్నారు పరిశోధకులు .ఇక భవిష్యత్తు వారిదే అని కూడా గట్టిగా చెబుతున్నారు. నిన్నటి దాకా మేధస్సు, అనుభవం , మాత్రమే కార్పొరేట్ కార్యాలయాలలో మంచి స్తితి లో ఉండటానికి ఉపయోగ పడతాయి అని నమ్మేవారు . అయితే ఈ మధ్య అమెరికాకు చెందిన " ఈగన్ జెండర్ " అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఆ రెండింటి కన్నా , ఉద్యోగంలో ప్రజ్న ఉన్నవారే గొప్ప విజయాలు సాధించగలరని తేలింది. సుమారు అయిదు వందల మందికి పైగా సీనియర్ ఎగ్సిక్యుటివ్ ల పనితీరుని పరిశీలించి న మీదట ఈ విషయం తెలిసింది.  ఓ బృందంగా పని చేసేటప్పుడు పరస్పర సహకారం, కోప తాపాల నియంత్రణ , స్నేహంగా వుండటం, మొదలైన లక్షణాలు వున్నవారు ఉద్యోగం లో చక చకా పైకి ఎక్కుతున్నారుట.     అలా కాకుండా కేవలం ప్రతిభ , అనుభవాన్నే నమ్ముకున్నవారు వెనకపడుతున్నారుట. సో మహిళల సహజ లక్షణాలు అయిన స్నేహశీలత ,సహనం వంటివి వారి బలాలు గా మారి , వారిని ఉన్నత స్తాయికి చేరుస్తున్నాయి అని వీరు పరిశీలించి, పరిశోధించి , చెబుతున్నారు . అయితే వీరు ఒక సలహా కూడా చెబుతున్నారు ..వీరి అద్యయనం లో అమ్మాయిలలో ఆత్మవిశ్వాసం ఆశించిన స్తాయిలో లేకపోవటం, స్వతంత్రం గా వ్యవహరించటం లో తడబాటులని కూడా గమనించారుట. ఈ విషయాల మీద కాస్త ఫోకస్ పెట్టండి చాలు ..మీకు తిరుగు లేదు అని గట్టిగా చెబుతున్నారు. మరి ఆ రెండు అస్త్రాలని కూడా మన అమ్ముల పొదిలో చేర్చు కుంటే సరి ...

వాళ్లంతా కట్నాలను తిరిగి ఇచ్చేశారు... ఎందుకంటే!

కట్నం తీసుకోవడం శిక్షార్హం అని ప్రభుత్వం తెగ ప్రకటనలు చేస్తుంటుంది. కట్నం అడిగేవాడు గాడిదతో సమానం అంటూ టీవీలు చెడ తిడుతుంటాయి. కానీ కట్నం తీసుకునే ఆచారంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. మునుపటిలా కట్నం తేలేదని కిరసనాయిలు పోసి తగటబెట్టేసిన వార్తలు వినిపించకపోవచ్చు. కానీ వేధింపులు మాత్రం యథాతథంగానే సాగుతున్నాయి. ఇలాంటి ఆచారానికి ముగింపు పలుకుతున్నాడు ఓ యోధుడు.... జార్ఖండ్లోని పొఖారీ గ్రామానికి చెందిన హాజీ ముంతాజ్ అలీకి కట్నం అంటే మా చెడ్డ చిరాకు. ఆ కట్నం కారణంగానే తన తోటి ముస్లిం కుటుంబాలు ఛిద్రమైపోతున్నాయన్నది అతని అభిప్రాయం. కానీ మిగతావారిలాగా ముంతాజ్ అలీ ఈ దురాచారం గురించి బాధపడుతూ కూర్చోలేదు. కట్నం తీసుకోవడం ఎంత అనాగరికమో, దాని వల్ల పేద కుటుంబాలు ఎలా నాశనం అయిపోతున్నాయో, యువత ఎలా అత్యాశలో కూరుకుపోతోందో ఊరిలో ఇంటింటికీ వెళ్లి చెప్పసాగాడు. 2016 ఏప్రిల్లో ముంతాజ్ అలీ మొదలుపెట్టిన ప్రచారం నెలలు గడిచేసరికి సత్ఫలితాలను ఇవ్వసాగింది. తాము కట్నం తీసుకోమంటూ తోటి ముస్లిం కుటుంబాలన్నీ ముంతాజ్ అలీకి మాట ఇచ్చాయి. అంతేకాదు! ఇప్పటికే కట్నం తీసుకున్నవారైతే తాము తీసుకున్న కట్నాన్ని ఆడపిల్లల కుటుంబానికి తిరిగి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు... ఏకంగా 800 కుటుబాల వారు ఆరుకోట్ల రూపాయల కట్నాన్ని తిరిగి ఇచ్చేశారు. కట్నానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ముంతాజ్ అలీ పోరాటం రానురానూ ఓ ఉద్యమం స్థాయికి చేరుకుతంది. జార్ఖండ్లోని లాతేహర్, పాలము జిల్లాలలోని ముస్లిం కుటుంబాలు ఇప్పుడు కట్నం అంటేనే మండిపడుతున్నారు. ఆఖరికి పెళ్లిళ్లు చేయించే మతగురువులు (మౌల్వీలు) కూడా కట్నం తీసుకునేవారి పెళ్లిళ్లు చేయించం అంటూ ప్రతిజ్ఞ చేశారు. తన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు దల్తోన్గంజ్ అనే ఊరిలో ఈ నెల 7వ తేదీన ఓ పెద్ద సభను ఏర్పాటు చేస్తున్నారు ముంతాజ్ అలీ. మతం ఏదైనా కానీ... కట్నం ఇచ్చే ఆచారం వెనుక ఒకప్పటి ఉద్దేశం వేరు. ప్రస్తుతం మాత్రం అది ఆడపిల్లల జీవితాలని తలకిందులుగా మార్చేస్తోంది. అలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు నడుం కట్టుకున్నారు ముంతాజ్ అలీ. అతను ఆశయం అసాధ్యం కాదని 800 కుటుంబాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒక్క ముంతాజ్ అలీ ఒంటరిగా ఇంత సాధిస్తే... గంటల కొద్దీ కబుర్లు చెప్పే మన సమాజ సేవకులు ఇంకెంత సాధించాలి! - నిర్జర.        

భుజం తట్టే చేయి లేకపోతే!

ఇంగ్లండులో ఒకప్పుడు రోసెట్టి అనే గొప్ప చిత్రకారుడు ఉండేవాడు. ఆయన దగ్గరకి ఓసారి ఓ నడివయసు మనిషి వచ్చాడు. ఆయన చేతిలో చాలా కాగితాలు ఉన్నాయి. వాటిలో ఒక బొత్తిని రోసెట్టి చేతిలో పెట్టి- ‘ఇవన్నీ నేను వేసిన బొమ్మలు. వాటిని మీరొక్కసారి పరిశీలించి నేను బొమ్మలు గీసేందుకు పనికొస్తానో లేదో తెలియచేయగలరా!’ అని ప్రాథేయపడ్డాడు. నిజానికి రోసెట్టి ఆ రోజు చాలా పనిఒత్తిడిలో ఉన్నాడు. అయినా కూడా పెద్దాయన మాటని కాదనలేకపోయాడు. నిదానంగా ఆ బొత్తిని చేతిలోకి తీసుకుని వాటిలో ఒకో చిత్రాన్నే పరిశీలించసాగాడు. ప్చ్‌! ఆ బొమ్మలు చాలా సాదాసీదాగా ఉన్నాయి. వాటిలో ఏ ఒక్క చిత్రంలోనూ చిత్రకారుడి ప్రతిభ కనిపించనేలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే అవన్నీ నాసిరకంగానూ, ప్రాథమిక స్థాయిలోనూ ఉన్నాయి. ఆ విషయం చెబితే వచ్చిన మనిషి బాధపడతాడని తెలుసు. కానీ ఓ విమర్శకుడిగా ఉన్నమాటని సున్నితంగా అయినా చెప్పక తప్పలేదు. ‘మీ బొమ్మలు ఏమంత గొప్పగా లేవండీ! మరిన్ని మంచి చిత్రాలు గీయాలంటే మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది,’ అంటూ సుతిమెత్తగా చెప్పాడు రోసెట్టి. రోసెట్టి నోటి వెంట అలాంటి మాటలే వస్తాయని ఆ పెద్దాయనకు తెలుసు. అయినా ఆయన మనసు బాధగా మూలిగింది. ‘మీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు క్షమించండి. మరేమనుకోకపోతే నా దగ్గర మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఓసారి చూడగలరా,’ అంటూ ఇంకో బొత్తిని చేతిలో పెట్టాడు. నిరాసక్తిగా రెండో బొత్తిని చేతిలోకి తీసుకున్న రోసెట్టి  కళ్లు చెదిరిపోయాయి. ఆ చిత్రాలలోని నైపుణ్యం చాలా అసాధారణంగా ఉంది. చిత్రాలలో చిన్న చిన్న వివరాలను కూడా చాలా అద్భుతంగా మలిచాడు చిత్రాకారుడు. ఒక్కమాటలో చెప్పాలంటే తను ఈ మధ్య కాలంలో ఇంత ప్రతిభ చూపిన చిత్రాలను చూడనే లేదు. ‘ఈ చిత్రాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వీటిని గీసిన చిత్రకారుడి భవిష్యత్తుకి తిరుగులేదు. కాస్త ప్రోత్సాహం కనుక ఉంటే... అతను దేశంలోనే గొప్ప చిత్రకారుడిగా నిలుస్తాడు. ఇంతకీ ఇవన్నీ మీ కొడుకు గీశాడా లేకపోతే మీ ఊరిలో ఎవరన్నా కుర్రవాడు గీశాడా. ఎవరతను ఓసారి అతణ్ని నా దగ్గరకి తీసుకురండి. అతణ్ని చూడాలని ఉంది,’ అంటూ ఉద్రేకపడిపోయాడు. ఆ మాటలు వింటూనే పెద్దాయన కంటి వెంట నీరు ఆగలేదు. ‘అయ్యా! ఇవన్నీ నేను వయసులో ఉన్నప్పుడు గీసిన చిత్రాలు. అప్పట్లో నాకు చిత్రాలు గీసేందుకు తగిన ప్రతిభ ఉందనుకునేవాడిని. ఎవరి దగ్గరా శిక్షణ లేకుండానే ఈ చిత్రాలన్నీ గీయగలిగాను. కానీ నాలో ప్రతిభ ఉందన్న విషయం ఏ ఒక్కరూ కూడా ఒప్పుకోలేదు. నా భుజం తట్టి ప్రోత్సహించలేదు. నేను గీసిన చిత్రాలను చూసి మనస్ఫూర్తిగా మెచ్చుకోలేదు. ఎన్నాళ్లని నాలో ప్రతిభ ఉందన్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలను? నిదానంగా నా మీద నాకే అపనమ్మకం మొదలైంది. ఆ న్యూనత నా చిత్రాలలోనూ కనిపించసాగింది. అయినా చేతులాగక అడపాదడపా అనురక్తితో బొమ్మలు గీస్తూనే ఉన్నాను. కానీ అవి ఎలా ఉంటున్నాయో మీరు ఇందాక చూశారుగా!’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

వ్యాయామం అల‌వాటుగా మారితే...

రోజంతా సుదీర్ఘంగా ప‌నిచేశాక మ‌న శ‌రీరాన్ని వ్యాయామం చెయ్య‌డానికి ఒప్పించ‌డం అంత తేలికైన ప‌నికాదు. మ‌న‌సులో వ్యాయామం చెయ్యాల‌ని ఎంత‌గా ఉన్నా శ‌రీరం అందుకు స‌హ‌క‌రించ‌దు. కానీ క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేసే కొంత‌మంది మాత్రం అదేదో ట్రిక్ ప్లే చేసిన‌ట్లు ఠంచ‌నుగా చేసేస్తుంటారు. బహుశా, వాళ్లు కూడా ఆ విష‌యాన్ని గుర్తించ‌క‌పోవ‌చ్చు. వ్యాయామాన్ని ఒక నిర్దిష్ట‌మైన అల‌వాటుగా చేసుకున్న‌వాళ్లు మాత్ర‌మే క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేస్తార‌ని హెల్త్ సైకాల‌జీ అనే ప‌త్రిక‌లో ప్ర‌చురించిన ఒక అధ్య‌య‌నం తెలిపింది. పొద్దున అలారం మోగితే ఎలా లేస్తామో, అలా పొద్దున్నే సంకేతం అందిన‌ట్లుగా లేచి, మ‌రో ఆలోచ‌న లేకుండా వ్యాయామంలోకి వాళ్లు దిగిపోతారు. అలాగే ఆఫీసు ప‌ని త‌ర్వాత వెళ్తే క‌లిగే లాభ‌న‌ష్టాల గురించిన ఆలోచ‌న లేకుండా వాళ్లు జిమ్‌కు వెళ్లిపోతుంటారు. ఎందుకంటే అది వాళ్ల‌లోని అంత‌ర్గ‌త సంకేతాల ద్వారా ప్రేరేపిత‌మైన స్వ‌తంత్ర నిర్ణ‌యం. మ‌రికొంత‌మంది వ్యాయామాన్ని రొటీన్ వ్య‌వ‌హార‌మ‌న్న‌ట్లు చేసుకుంటూ పోతారు. ప్రేర‌ణ‌తో కూడిన అల‌వాటు మంచిదా, లేక వేరే ర‌క‌మైన ఎగ్జిక్యూష‌న్ హ్యాబిట్ మంచిదా అనే విష‌యం తెలుసుకోవ‌డానికి వ్యాయామం చేసేవాళ్ల‌పై నెల రోజుల పాటు అధ్య‌య‌నం చేశారు ప‌రిశోధ‌కులు. ఈ అధ్య‌య‌నం కోసం యూనివ‌ర్సిటీ విద్యార్థుల్ని, బోధ‌నా సిబ్బందిని వారు ఎంచుకున్నారు. ఎన్నో ప్ర‌శ్న‌లు వేసి వారి ద‌గ్గ‌ర్నుంచి స‌మాచారం రాబ‌ట్టారు. ఎంత త‌ర‌చుగా వ్యాయామం చేస్తుంటారు?  మీ వ్యాయామ అల‌వాటు ఎంత బ‌ల‌మైంది?  వేరు ఆలోచ‌న‌లు లేకుండా వ్యాయామం చేస్తున్నారా?.. లాంటి ప్ర‌శ్న‌ల‌తో వారి అల‌వాటును అంచ‌నా వేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. జిమ్‌లో ఎలాంటి వ్యాయామాలు చేస్తారు? ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు కూడా రెగ్యుల‌ర్‌గా చేసే వ్యాయామాల‌న్నీ త‌ప్ప‌కుండా చేస్తుంటారా?.. అనే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రాబ‌ట్టారు. వీటి ఆధారంగా వాళ్ల‌లోని అల‌వాటు ప్రేర‌ణ‌తో కూడిన‌దా, లేక 'చేయాలి కాబ‌ట్టి చేస్తున్నాం' అనే భావన‌తో కూడిన‌దా అనే విష‌యాన్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. దీర్ఘ కాలంలో ఒక వ్య‌క్తి ఎంత త‌ర‌చుగా వ్యాయామం చేస్తార‌నే విష‌యాన్ని ఊహించేందుకు ఉప‌యోగ‌ప‌డ్డ ఒకే ఒక అంశం, ప్రేర‌ణ‌తో కూడిన అల‌వాటు బ‌ల‌మే. కాలంతో పాటు వాళ్ల‌ల్లో వ్యాయామ అల‌వాటు కూడా బ‌ల‌ప‌డింది. "ప్రేర‌ణ‌తో కూడిన అల‌వాటు క‌లిగిన‌వాళ్లు ఒక నెల‌రోజుల పాటు త‌ర‌చుగా వ్యాయామం చేస్తూ చురుగ్గా త‌యార‌య్యాక, వాళ్ల అల‌వాటు మ‌రింత బ‌లాన్ని పుంజుకోవ‌డం నేను గ‌మ‌నించాను. అదే నిర్వాహ‌క హాబీ క‌లిగిన‌వాళ్ల‌లో అయితే ఎలాంటి మార్పూ క‌నిపించ‌లేదు." అని ప‌రిశోధ‌కుల్లో ఒక‌రైన ఎన్‌. అలీస‌న్ ఫిలిప్స్ తెలిపారు. ఒకే ర‌క‌మైన వ్యాయామాల‌పై దృష్టి పెట్ట‌డం అనేది మాన‌సికంగా ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌లేదు కానీ, ఒక వ్య‌క్తి ఒక నియ‌మావ‌ళికి క‌ట్టుబ‌డి ఉండ‌టానికి కూడా ఇది దోహ‌దం చేయ‌లేదు. రోజూ పొద్దున‌, సాయంత్రం ఒకే ర‌క‌మైన ప‌నులు చేస్తూ విసుగు చెందుతూ కొత్త‌గా క‌స‌రత్తులు మొద‌లుపెట్టిన‌వాళ్ల‌కు ఇది శుభ‌వార్తే. "ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన వ్యాయామాలు చేస్తుండ‌టం దీర్ఘ‌కాలంలో ఉప‌యోగ‌క‌ర‌మైందే త‌ప్ప హానిక‌రం కాదు. చాలామంది వ్యాయామం మొద‌లుపెట్ట‌డాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాయిదా వేస్తుంటారు. ఎందుకంటే, వాళ్ల‌కు వ్యాయామం ఒక పెద్ద భూతంలా క‌నిపిస్తుంటుంది. ఒక‌సారి ప‌ట్టుకుంటే ఇక అది మ‌న‌ల్ని వ‌ద‌ల‌దేమోన‌ని భ‌య‌ప‌డుతుంటారు. వాళ్ల‌కు ట్రెడ్‌మిల్ మీద ప‌రిగెత్త‌డం అనేది చాలా బోరింగ్ రొటీన్‌. అదో హింస‌లాగా క‌నిపించి, వ్యాయామాన్ని ప్రారంభించ‌కుండానే దాన్ని ముగించేస్తుంటారు." అని చెప్పారు ఫిలిప్స్‌. కొన్ని అంశాలు ప‌దే ప‌దే పున‌రావృతం అవుతూ వ్యాయామం చెయ్యాల‌నే సంక‌ల్పాన్ని బ‌లోపేతం చేస్తాయి. "మీరు ఒక నిర్దిష్ట వ్యాయామాన్ని వృద్ధి చేసుకుంటున్న‌ప్పుడు, మీతో స‌రిపోయే భావ‌జాలం క‌లిగిన‌వాళ్ల‌తో ఉండ‌టం మీకు తోడ్పాటునిస్తుంది. అయితే ఏదో ఒకే ర‌క‌మైన వ్యాయామానికి అల‌వాటుప‌డ్డం విసుగు పుట్టిస్తుంది. అందువ‌ల్ల అంత‌ర్గ‌త సంకేతాల‌కు త‌గ్గ‌ట్లు చేయ‌డ‌మే మంచిది. అదే మిమ్మ‌ల్ని మ‌ళ్లీ మ‌ళ్లీ మీ ఎక్స‌ర్‌సైజ్ రొటీన్ వైపు మ‌ళ్లిస్తుంటుంది." అంటారు ఫిలిప్స్‌.

సుఖానికి నిర్వచనం!! 

  ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలనే అనుకుంటాడు. బాధలు దగ్గరకి వచ్చినా అవి ఎప్పుడు వెళ్లిపోతాయా అని ఆలోచిస్తాడు. ఆవైపుగా పరిష్కారాలు మొదలుపెట్టేస్తాడు. అయితే సుఖం గురించి భగవద్గీతలో కృష్ణుడు ఇలా చెబుతాడు. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభః అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాస్తం చ నిగచ్ఛతి|| ఈ లోకంలో ఎల్లప్పుడూ దుఃఖము విషాదము కష్టములే కాదు సుఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు ఎక్కువయి, ఒక వేళ ఆ సుఖాలు తొలగిపోతే కలిగే దుఃఖాలు కూడా ఉన్నాయి. ఆ సుఖాలు కూడా మూడు విధాలుగా విభజింపబడ్డాయి.  సుఖం మానవుని సహజ గుణం. మానవుడు సాత్విక కర్మల చేత సుఖాన్ని పొందుతాడు. అప్పటి కే ఉన్న దుఃఖములను పోగొట్టుకుంటాడు. ఇది మానవుని కర్తవ్యము. కాని మానవులు తమ అజ్ఞానం వలనా, తాము చేసే రాజన, తామన కర్మల వలన దుఃఖములను కొని తెచ్చుకుంటున్నారు. రాజన గుణం కలవాడికి వాడు చేసే కర్మల వలన సుఖం లభిస్తుంది. తామస గుణం కలవాడికి, నిద్రలో, నిద్రలాంటి మత్తులో సుఖం లభిస్తుంది. కాబట్టి మానవులు అనుభవించే సుఖము ఎలా వస్తుంది అంటే వాళ్లు చేసే పనుల వలన వస్తుంది. అందుకే.. మానవులు అందరూ "నేను సుఖంగా ఉన్నాను" అనే భావన ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దీనినే పాజిటివ్ తింగింగ్ అని అంటారు. దానికి అవసరమయ్యేది అధ్యాత్మ విద్య, దానిని అభ్యాసం చేస్తే నిరంతరం సుఖం కలుగుతుంది. సుఖాలను పొందడం దుఃఖాలను పోగొట్టుకోవడం మన చేతిలో ఉంది.  అది కేవలం అభ్యాసం వలననే వస్తుంది కానీ మాటల వలన రాదు, తినడం కొంత మందికి సుఖం ఇస్తుంది. కాని ఏది తినాలి అనేది మన చేతుల్లో ఉంది. మితంగా తింటే సుఖం. ఎక్కువగా తింటే దుఃఖం. నీరు తాగితే దాహం తీరి సుఖం ఇస్తుంది. కాని తాగకూడనివి తాగితే దాహం ఎక్కువ అవుతుంది. మత్తు వస్తుంది. ఇంకా ఎక్కువ తాగితే కక్కేస్తాడు. తరువాత అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ మన అలవాట్లు. ఈ అలవాట్లు మంచివి అయితే పరవాలేదు. కాని చెడ్డవి అయితే దుఃఖం తెచ్చిపెడతాయి. ఇక్కడ ఒక పదం వాడాడు. దుఃఖాస్తం చ నిగచ్ఛతి. ఎవడు ఏ పని చేసినా, సుఖపడటానికే చేస్తాడు కానీ దుఃఖ పడటానికి చెయ్యడు. పైగా ఉన్న దుఃఖాలను పోగొట్టుకోవడానికి ప్రయాస పడతాడు. అంటే దుఃఖం అంతం అయితే సుఖం దానంతట అదే వస్తుంది. అది మానవ సహజం. కాని తన అవివేకం వలన ఉన్న సుఖాలు రాకపోగా, కొత్త దుఃఖాలు వచ్చిపడుతున్నాయి. ఒక్కోసారి ఈ దుఃఖాలకు అంతం లేదా అనిపిస్తుంది.  మనంకొన్ని ప్రశ్నలు వేసుకుంటే…..  దుఃఖమునకు అంతం ఎప్పుడు?? దుఃఖము లేని చోటు ఎక్కడ ఉంది?? దుఃఖములు ఎక్కడ అంతం అవుతాయి?? శాశ్వత సుఖం ఎక్కడ దొరుకుతుంది?? శాశ్వత సుఖం ఏం చేస్తే లభిస్తుంది?? ఎవరి వలన లభిస్తుంది?? ఈ ప్రపంచంలో దొరికే వస్తువులతో, అనుభవించే విషయ వాంఛలతో సుఖం దొరుకుతుందా??  ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఒకటే జవాబు, సుఖము, దుఃఖము, ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. మన భావనలో ఉన్నాయి. మనం చేసే కర్మలలో ఉన్నాయి. మనలను మనం సంస్కరించుకుంటే, అంటే మనల్ని మనం సరిచేందుకుంటే శాశ్వత సుఖం దానంతట అదే వస్తుంది. సుఖం కోసం ఎక్కడా వెదకవలసిన పని లేదు. అందుకే సుఖం కావాలంటే అభ్యాసం చేయాలి. మంచి అలవాట్లు చేసుకోవాలి అని అన్నాడు గీతలో కృష్ణుడు. ◆ వెంకటేష్ పువ్వాడ

వినదగునెవ్వరు చెప్పిన...

"ఒరేయ్ బాబూ… అది కాదురా దారి ఇది. ఇలా వెళ్ళాలి" అంటాడు ఓ పెద్దాయన. "ఎహె!! నేను నీ మాట ఎందుకు వినాలి పెద్దరికం ఉంటే ఇంతే, ప్రతిదానికి అడ్డుపడతారు" అంటాడు ఓ కుర్రకుంక. "ఒరేయ్ నానీ నీకు కథ చెబుతానురా…." అంటాడు ఒక ముసలాయన. "ఉరుకో నాన్నా చదస్తపు కథలతో ఎందుకు పిల్లొళ్లను మూర్ఖులుగా మార్చుతావు అంటాడు కొడుకు. "అన్నా!! నువ్వు వెతుకుతున్న ప్రశ్నకు సమాధానం నాకు తెలుసు. నేను చెబుతానురా" అంటాడు ఒక పిల్లాడు. "ఒరేయ్ నాకంటే నీకు ఎక్కువ తెలుసా ఊరికే నా టైమ్ వేస్ట్ చేయక పోరా ఇక్కణ్ణుంచి" అంటాడు ఆ పెద్దోడు. ఇలాంటివి ప్రతి మనిషి జీవితంలో, ఆ మనిషి చుట్టూరా చాలా వినబడుతూ, కనబడుతూ ఉంటాయి. ఈకాలం మనుషులు చాలా తక్కువ విస్తృతంలో ఇరుక్కుపోయారు. మనిషి ఎంత ఆలోచిస్తే అంత, ఎంత తెలుసుకుంటే అంత అనే విషయాన్ని మెల్లిగా మెదళ్లలో నుండి తీసేసారు. ఫలితంగా తెలుసుకోవడాన్ని, వినడాన్ని ఓర్పుతో సహా కోల్పోయారు. అంతేనా ఏదైనా విషయం తెలిసిందీ అంటే అందులో తమ గురించి ఇతరులు ఎదో అన్నారు అని తెలిసిందంటే ఒకేసారి యుద్దానికి వెళ్లినట్టు వెళ్లి, గొడవ చేసి, రచ్చ చేసి కానీ వదిలిపెట్టరు. కానీ చివరకు ఒకోసారి తెలుస్తుంది అవగాహన లేకపోవడం వల్ల ఏదో అనేసుకున్నారు అని, అది కూడా అవగింజ అంత విషయాన్ని కొండంత చేసి చెప్పారని. సుమతీ శతకకర్త పద్యంలో చెబుతాడు  వినదగునెవ్వరు చెప్పిన  వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము దెలిసిన  మనుజుడేపో నీతిపరుడు మహిలో సుమతీ!! అని ఎవరు ఏమి చెప్పినా వినాలి అలా విన్న తరువాత ఆ చెప్పిన విషయంలో నిజమెంత అనేది తెలుసుకోవాలి, అలా తెలుసుకున్న తరువాత చెప్పిన విషయం మీద ఒక నిర్ణయానికి రావాలి. అలా నిదానంగా అన్నీ తెలుసుకున్నవాడే నీతివంతమైనవాడు ఈ ప్రపంచంలో అని అర్థం.  కానీ అందరూ ప్రస్తుత కాలంలో ఏమి చేస్తున్నారు??  చాలామంది ఎవరైనా ఏదైనా చెబితే అనే మొదటి మాట అంతా తెలిసినట్టు బిల్డప్పు అని అంటారు. ఇది బయటకు అనకపోయినా మనసులో అయినా అనుకునేస్తారు. అంతేనా!! ఏదైనా ఒక విషయం ఎవరైనా చెప్పెయ్యగానే అందులో పొరపాటున తమ పేరు ఉంటే ఇక అయిపాయే!! ఉగ్రతాండవం చేస్తారు ఆ వ్యక్తి మీద. ఇంకా కొందరుంటారు వైరస్ లెక్కన. ఒక విషయం తెలియగానే అందులో నిజానిజాలు, కారణాలు ఏమి తెలుసుకోకుండా వైరస్ ఎలాగైతే వ్యాపిస్తోందో అలా విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేసేస్తారు. అది కూడా మాములుగా కాదు, ఉన్న విషయానికి ఇంకాస్త తమలో ఉన్న నైపుణ్యం జోడించి చిలువలు పలువలు చేసి చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అదొక పైశాచిక ఆనందం వాళ్లకు. ప్రస్తుత కాలం ఇట్లా ఏడ్చింది కాబట్టే మనుషుల మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇంకా అన్నిటికీ మించి స్నేహాభావం కూడా కరువయ్యింది. కనీసం కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య కూడా సరైన అవగాహన ఉండటం లేదు. వస్తువులకు, ఆర్థిక కలాపాలకు ఇచ్చిన ప్రాధాన్యత మనుషుల విషయంలో  ఇవ్వడం లేదు.  ఒకసారి ఓపిక తెచ్చుకోవాలి ఒకసారి ఎదుటివారి మాట వినాలి ఒకసారి నిజానిజాలు గ్రహించాలి ఆ తరువాత అన్నీ అర్థమవుతాయి మనుషులే కాదు ప్రపంచం కూడా….. ◆ వెంకటేష్ పువ్వాడ

చివరికి మిగిలేది?

బాలాస్తావతీ క్రీడాసక్తః  తరుణస్తావత్తరుణీసక్తః | వృద్ధస్తావాచ్చింతాసక్తః పరమే బ్రహ్మణి కో పి సక్తః  భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!! వయసి గతే కః కామవికారః  శుష్కే నీరే కః కాసారః | క్షీణే విత్తే కః పరివారః జ్ఞాతే తత్వే కః సంసారః  భావం: వయస్సు మళ్ళిపోతే కా మవికారాలుండవు. నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.  భజ గోవిందం లోని ఈ రెండు శ్లోకాలు నాకు కాలగమనము యొక్క ప్రాముఖ్యత నేర్పిస్తూ ఉంటాయి. నిజమే కదా ఈ వయస్సు అన్నది శాశ్వతం కాదు. బాల్య వయసులో మనం ఆటల్లో గడిపేస్తాం. కొద్దిగా యవ్వనం లోకి రాగానే మన మనసుకు నచ్చిన వారితో సంసార సాగరంలో పడిపోతాము. మళ్లీ ముసలి వయసు రాగానే ఈ జబ్బులు ఆ జబ్బులతో ఒళ్లంతా రోగాలు మయం చేసుకుని, మనకు పాడి కట్టే రోజు కోసం రోజులు లెక్కపెట్టుకుంటూ ఉంటాము. ఇదేనా జీవితం అంటే? నాకైతే ఇంతకుమించి ఏదో ఉంది అనిపిస్తుంది. మనం జీవితంలో ఎన్ని సాధించినా ఎంత గొప్ప స్థాయికి చేరుకున్న చివరికి చేరాల్సింది ఈ మట్టిలోనే. ఈ మట్టిలో కలిసిపోయే దేహం కోసం ఎన్నో మారణహోమాలు, ఎన్నో దుర్మార్గాలు, మరెన్నో అవినీతి కార్యాలలో, చేతకాని వారిగా భాగస్వాములమవుతాం లేదా అటువంటి వారిని చూస్తూ చేతలుడిగి కూర్చుంటాము. నిజానికి చివరికి మిగిలేది అనేది మనం ఎవరము ఆలోచించము కదా. ఎవరో మహానుభావుడు చెప్పినట్టు మనిషి చావు అనేదే లేనట్టు బతుకుతాడు కానీ ఎన్నడూ బతక లేనట్టు చస్తాడు. ఇది నిజం కాదంటారా? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్టు మనకు సమయం ఉండగానే మనం మనతోపాటు చివరి క్షణాల్లో మనకు అండగా వచ్చే వాటిని తీసుకుపోవాలి మరి మనకు అండగా వచ్చేదేంటి? ధర్మరాజుకున్నంత ధర్మాన్ని మనం పాటించలేము. ఈ కాలంలో అది అసలు కుదరని పని. కానీ కొంతలో కొంతైనా మనం ధర్మం పక్షాన నిలబడలేమా? చివరికి మనతోపాటు కొన్ని ఆత్మీయ అనుభూతులను మోసుకెళ్లలేమా?  మన ఊపిరి వదిలే ప్రతి క్షణాన్ని చివరి క్షణంగా ఆస్వాదిస్తూ, మనతోపాటు పయనం చేస్తున్న సమస్త జీవరాశిని ప్రేమిస్తూ సాధ్యమైనంతలో సేవ చేస్తూ, బతికితే అదే చాలు ఈ జీవితానికి. ఏముందిలే ఇంకా నాకు బోలెడంత వయసు ఉంది. తీర్ధయాత్రలవీ చేసుకుని బోలెడంత పుణ్యం సంపాదించేసుకుంటాను అనే భ్రమను వదిలి ఈ క్షణమే ఆఖరి క్షణం అన్నట్టు బతుకు నావను ఈశ్వరునికి అంకితం చేసేద్దాం. మనం చనిపోయినప్పుడు మన కోసం ఏడ్చే కళ్ళు లేకున్నా పర్వాలేదు కానీ వీడు పోయి భూమికి భారం తగ్గింది అనుకుని నవ్వే పెదవులు ఉండకూడదు. వెంకటేష్ పువ్వాడ  

ఈ హక్కుకు న్యాయం చేస్తున్నామా??

  మనిషికి సమాజం, ఈ రాజ్యాంగం బోలెడు హక్కులు ఇచ్చింది. పిల్లల నుండి పెద్దల వరకు వయసును, వికాసాన్ని, స్వేచ్ఛను ప్రతిబింబించేలా బోలెడు హక్కులు ఉన్నాయి. వాటిని మనిషి తనకు అవసరమైనప్పుడు చక్కగా వినియోగించుకుంటూ ఉంటాడు. అలాంటి హక్కుల జాబితాలో చాలా అరుధైనది, సమాజాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించగలిగేది ప్రజాస్వామ్య పాలనకు బ్రహ్మాస్త్రం వంటిది ఓటు హక్కు. చట్టమిచ్చిన ఆయుధం!! నిజానికి అన్ని హక్కులు మనిషికి స్వేచ్ఛను ఇస్తే, ఓటు హక్కు రూపంలో న్యాయాధికారాన్ని ప్రజల చేతుల్లో పెట్టింది రాజ్యాంగం. రాజ్యాంగంలో ఆర్టికల్ 326 ద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కేటాయించింది. ఈ ఓటు హక్కు ద్వారా అవినీతి లేని, సమర్థవంతమైన నాయకులను ఎన్నుకుని ప్రభుత్వాన్ని నడిపిస్తూ సుపరిపాలన అందించాలనేది ఓటు హక్కు ముఖ్య ఉద్దేశం. పౌరుల అపహాస్యం!! ఒక గొప్ప ఆయుధాన్ని చేతికి ఇచ్చినప్పుడు ఒక మూర్ఖుడు ఆ ఆయుధాన్ని దారిన వెళ్లే పీచుమిఠాయి బండి వాడికి అంటే పాత సామాను కొనేవాడికి వేసాడంటా, ఆ ఆయుధం తీసుకున్నవాడు ఓ గుప్పెడు పీచుమిఠాయిని వీడి చేతిలో పెట్టి ఎంచక్కా వెళ్ళిపోయాడు. ఆ పీచుమిఠాయిని నిమిషంలో తినేసి అసంతృప్తిగా వెళ్లినా ఉచితంగా వచ్చింది కదా అని తృప్తి పడ్డాడు వాడు. అయితే ఆయుధం తీసుకుని పోయిన వాడు దాంతో అన్యాయంగా అందరి ప్రాణాలు తీస్తూ, ఉండిపోయాడు.  ఇలా ప్రస్తుతం భారతదేశ పౌరులు కూడా ఓటు హక్కును సరిగా వినియోగించుకోకుండా తాత్కాలిక తృప్తి ఇస్తోందని అయిదు వందల నుండి, రెండు వేల వరకు ఓటును రాజకీయ నాయకులకు అమ్మేస్తూ ఓటు హక్కును అపహాస్యం చేస్తున్నారు. రాజకీయ నాయకుల దందా!! రాజకీయ నాయకులు ప్రజలకు సరైన న్యాయం చేయరు. లబ్ధిదారులకు పథకాలను మంజూరు చేయడంలో అలసత్వం, ప్రాజెక్టుల పేరుతో స్కాములు చేసి చల్లగా ఆ నిధులు మింగేయడం,  భూములను స్వాధీనం చేసుకోవడం. అవినీతి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం, ప్రోత్సహించడం వాళ్ళ నుండి  కమీషన్లు తీసుకోవడం చేస్తారు. ఇలా వాళ్ళు రాజకీయ ప్రవేశం చేసిన ముందు, తరువాత అని గమనిస్తే వాళ్ళ జీవితాల్లో ఎంత తేడా ఉందొ అందరికీ అర్థమవుతుంది. అర్థం చేసుకోరేందుకు?? ప్రజలు ఏమీ అమాయకులు కాదు. చాలా  తెలివితేటలు ఉంటాయి ప్రజలకు. కానీ ఒక రాజకీయ నాయకుడు మోసాలతో ఎంత ఎదిగిపోతూ ప్రజల ధనాన్ని ఎంత వెనకేసుకుంటున్నాడో అందరికీ తెలుసు కానీ పిచ్చి జనాలు ఈ ఓటు హక్కును అంత నిర్లక్ష్యంగా చూస్తారెందుకు??  సమాజాన్ని, ప్రజలను అధికారం పేరుతో ముప్పుతిప్పలు పెట్టె ఈ రాజకీయ నాయకులకు కరెన్సీ కాగితాలు తీసుకుని ఓటు వేస్తే, వాళ్ళు తిరిగి ఎన్నికలు వచ్చేవరకు ప్రజల గూర్చి మర్చిపోతారు. అలాంటి మహానుభావుల కోసం ఎంతో గొప్ప ఆయుధాన్ని వ్యర్థం చేస్తారెందుకు?? మార్పు కావలిప్పుడే!! న్యాయాన్ని, ధర్మాన్ని, ప్రజలను ముఖ్యంగా ప్రజలకు ఎంతో గొప్ప ఆయుధాన్ని ఇచ్చిన ఓటు హక్కును అపహాస్యం చేస్తున్న రాజకీయ ప్రస్థానాలకు ముగింపు పలకాలి. వాస్తవాన్ని  మాత్రమే కాదు భవిష్యత్తును గురించి ఆలోచించాలి. సమాజాన్ని సంస్కరిస్తూ రేపటి తరాలకు గొప్ప సమాజాన్ని ఇవ్వగలిగే నాయకులను అధికారంలో నిలబెట్టాలి. ఇలా జరగాలి అంటే మీ ఓటు హక్కును న్యాయం చేస్తున్నామా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలిప్పుడు. ◆ వెంకటేష్ పువ్వాడ