ప్రకృతి సంరక్షణ దినోత్సవం రోజు ఈ ప్రమాణాలు చేద్దాం!

ప్రస్తుతకాలంలో మనిషి తెలిసి కొంత తెలియక కొంత చేస్తున్న తప్పు ఏదైనా ఉందంటే ప్రకృతిని కాలుష్యం చేయడం. ప్రకృతి కాలుష్యం అవడం వల్ల మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జులై 28 వ తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రపంచమంతటా ఏర్పడుతున్న కాలుష్యం, ప్రకృతి విషయంలో మనుషులు చేస్తున్న తప్పులు, ప్రకృతిని కాపాడుకునే మార్గాలు. ప్రణాళికలు వంటివి చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్త దేశాలు అన్నీ తీసుకునే ఈ నిర్ణయాల గురించి పక్కన పెడితే ఈ ప్రపంచం మీద అధిపత్యం చూపిస్తున్న మనుషులమైన మనం ప్రకృతి పరిరక్షణ కోసం ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు?? ప్రకృతిని అంతో ఇంతో మనకు తోచినంత కాపాడుకుంటే ఆ ప్రకృతి మన రేపటితరాలకు మంచి చేస్తుంది. ప్రపంచ పర్యవరణ, ప్రకృతి సంరక్షకులు అందరికీ సూచిస్తున్న, అందరూ చేయగలిగిన కొన్ని పనులు తెలుసుకోవాల్సిందే. వాటిని పటిస్తామని ప్రమాణాలు చేసుకోవాల్సిందే. ప్లాస్టిక్ వాడకం ఆపేయాలి! పర్యావరణం గురించి ఆలోచించే అందరూ మొదట చెప్పేమాట ప్లాస్టిక్ వాడకం ఆపేయాలని. నిజానికి సాధారణ ప్రజలకు కూడా ఎంతో సరసమైన ధరలో అందుబాటులో ఉండటం వల్ల ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఈ ప్లాస్టిక్ ను తిరిగి పునర్వినియోగించే అవకాశాలు ఉన్నా అది పర్యావరణానికి నష్టం చేసేదే. దీన్ని కరిగిస్తే వాయుకాలుష్యం జరుగుతుంది. పోనీ భూమిలో కలిసిపోతుందా అంటే అదీ లేదు.  అందుకే మనిషి తన జీవనశైలిలో ప్లాస్టిక్ ను వాడటం ఆపెయ్యాలి. బదులుగా క్లాత్ బ్యాగ్ లు, పేపర్ బ్యాగ్ లు వాడటం మొదలుపెట్టాలి. విద్యుత్ ఆదా చెయ్యాలి! విద్యుత్ ఉత్పత్తి నీటి ద్వారా, గాలి ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీనికోసం ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. విద్యుత్ కోసం పక్కరాష్ట్రాల నుండి అప్పు తీసుకునే స్థితికి ఎన్నో రాష్ట్రాలు దిగజరిపోయాయి. విద్యుత్ ను ఆదా చేయడం మొదలుపెడితే ఖర్చు తిరుగుతుంది, దాని వృధా అరికట్టినవాళ్ళం అవుతాము. అవసరం లేని సమయంలో ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంటి పనులలో వీలైనంత వరకు సొంతంగా పని చేసుకోవాలి. చీటికీ మాటికి విద్యుత్ ఆధారిత వస్తువులు కొని క్రమంగా ఇంటిపని చేయకుండా ఉంటే బద్దకం కూడా ఎక్కువైపోయి తొందరగా డయాబెటిస్ రావడం ఖాయం. నీటిని పొదుపు చేయాలి! అందరికీ నీరు ఎంతో అవసరం. విద్యుత్ లేకపోతే పక్షులు, జంతువులు ఎంచక్కా బ్రతికేస్తాయి కానీ నీరు మాత్రం అన్ని జీవులకు కావాలి. ఇంట్లో కుళాయి తిప్పితే వచ్చేస్తున్న నీళ్ల గురించి చాలామందికి భయమే ఉండదు. పైగా ఇళ్లలో ఫిల్టర్ అయిన నీళ్లను వదులుతారు. అలాంటి నీళ్లు ఎంతో విలువైనవి. మనఇంట్లో మన ట్యాంక్ లో నీళ్లున్నాయని దానికి మనం డబ్బు కడతామని ఇష్టమొచ్చినట్టు వృధాచేయకూడదు. ఇల్లు చదవడం, బట్టలు ఉతకడం, వంట పాత్రలు కడగడం ఇలా వీటికోసం వాడే నీటిని పెరట్లో చెట్లకు మళ్లించాలి. పునర్వినియోగం! దేన్నైనాస్ అర్ పడేసేముందు తిరిగి వాడుకునే అవకాశం ఉందేమో ఆలోచించాలి. రీసైక్లింగ్ చేయడం, తిరిగి ఉపయోగించుకోవడం వల్ల వ్యర్థాలను తగ్గించవచ్చు.  చాలామంది వస్తువులను తిరిగి వాడటం అనేది షేమ్ గా ఫీలవుతారు. ఆ భావాన్ని తగ్గించుకోవాలి. ఇంట్లో ఉండే కంటైనర్లు, సీసాలు మొదలైనవాటిని మొక్కలు పెంచుకోవడానికి వేరే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి వాడుకోవాలి. అవసరం అయితే తప్ప కొత్తవి కొనకూడదు! చాలామంది వస్తువులు పాతబడగానే కొత్తవి కొనేస్తారు. కానీ వస్తువులు చక్కగా పనిచేస్తున్నప్పుడు అలా పాతవి మార్చేయడం అవసరమా. మారుస్తున్న ఆ వస్తువుల వల్ల వాటిని తిరిగి రీసైకిల్ చేయడంలో చాలా పొల్యూట్ అయిపోతుంది. పరిశ్రమలు సెలరించే కొన్నిరకాల పాత వస్తువుల వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోంది అనే విషయం ఆలోచించవు. అందుకే ప్రతిఒక్కరు ప్రకృతిని కాపాడుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.

కజిన్స్ కోసం ఉందోక రోజు!

ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఫాథర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వాలెంటైన్స్ డే లాగా నేషనల్ కజిన్స్ డే అని ఒకటి ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు, ఎక్కువ శాతం మంది పట్టించుకోరు కూడా. అయితే కజిన్స్ అనగానే అందరిలో ఒకానొక ఎమోషన్ చోటుచేసుకుంటుంది. ఒకే రక్తం పంచుకుని పుట్టకపోయినా తోబుట్టువుల కంటే స్ట్రాంగ్ బాండ్ కజిన్స్ తో ఉంటుంది ఎక్కువ శాతం మందికి. కజిన్స్ లో 90% మంది చిన్నతనంలో కలసి పెరిగినవాళ్ళు అయి ఉండటం వల్ల ఎన్నో చిన్నతనపు జ్ఞాపకాలు, తుంటరి పనులు, గొడవలు, ప్రేమలు ఉంటాయి కజిన్స్ మధ్య.  కాలం గడుస్తూ ఉంటే తల్లిదండ్రుల వృత్తులు, పోటీ ప్రపంచంలో చదువుల కోసం పరుగులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు మొదలైన కారణాల వల్ల కజిన్స్ దూరదూరంగా వెళ్ళిపోతారు. అయితే కాలం మారినా తాము ఏమీ మారలేదు అనే విషయం అపుడపుడు కలవడం వల్ల తెలుస్తూ ఉంటుంది. మరికొందరు కాలంతో పాటు మార్పుకు లోనవుతారు కూడా. ఏదేమైనా కజిన్స్ అంటే కొట్టుకోవడంలోనూ, వెనక నిలబడి సపోర్ట్ గా ఉండటంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ప్రతి సంవత్సరం జులై నెల 24 వ తారీఖున నేషనల్ కజిన్స్ డే జరుపుకుంటున్న సందర్బంగా ఈసారి మీరు మీ కజిన్స్ ను కాస్త సర్ప్రైజ్ చేయడం, కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవడం చేస్తే చిన్ననాటి బంధమయినా, పెద్దల మధ్య అనుబంధమైనా ఇంకా గట్టిపడుతుంది. సడెన్ సర్ప్రైజ్! చెప్పకుండా కజిన్స్ దగ్గరకు వెళ్లడం, వాళ్ళను ఆశ్చర్యంలో ముంచెత్తడం అద్భుతంగా ఉంటుంది. నిజానికి పెద్దయ్యాక చదువులు, ఉద్యోగాల వల్ల దూరంగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఏదోలా కలిసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. కానీ పెళ్లిళ్లు అయినవాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లి తరువాత ఒక సెపరేట్ ప్రపంచం ఏర్పడుతుంది. భర్త, భర్త వైపు చుట్టాలు, అత్త, మామ. ఇంకా పిల్లలు వీళ్ళందరి ప్రపంచంలో అమ్మాయిలు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం వల్ల కజిన్స్ ను, ఫ్రెండ్స్ ను కలవాలని ఉన్నా కలవడానికి తగినంత సమయం దొరకకపోవచ్చు. కాబట్టి ఒక చిన్న స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది. చెప్పకుండా వెళ్లి కలిస్తే. బహుమతులు ఇవ్వడం! బహుమతులు చిన్నవో, పెద్దవో అనేది లెక్క కాదు. కానీ అవి ఎంత ప్రేమగా ఇస్తున్నాం అనేది ముఖ్యం. చిన్నతనంలో ఇష్టపడి ఆర్థిక పరిస్థితి వల్ల లేక పిల్లల మధ్య ఉన్న కాంపిటేషన్ వల్ల కొన్ని చేజారిపోయి ఉంటాయి. స్కూల్, కాలేజి, పోటీలలో గెలిచిన ప్రైజెస్, చిన్నప్పటి అరుదైన ఫోటోలు వంటివి బహుమతిగా ఇవ్వడం వల్ల చాలా సంతోషిస్తారు. ఆత్మీయ కలయిక! కజిన్స్ డే సందర్బంగా అందరూ కలసి ఆత్మీయంగా కలవడం చాలా బాగుంటుంది. కుదిరితే ఫ్యామిలీ తో సహా కలవడం పెద్ద పండగలాగే ఉంటుంది. ఇప్పటి వేగవంతమైన కాలంలో పిల్లలకు ఇలా రిలేషన్స్ గురించి నేరుగా అర్థం చేసుకున్న అనుభూతి కలుగుతుంది. జీవిత భాగస్వాములు పక్కన ఉంటే కొంతమంది తాము ఉండాల్సినంత ఫ్రీగా, కజిన్స్ తో క్లోజ్ గా ఉండలేకపోవచ్చు కాబట్టి ఆరోగ్యవంతమైన రిలేషన్స్ చాలా ముఖ్యం. అమ్మానాన్నలతో చెప్పుకోలేని పరీక్షల మార్కుల విషయాల నుండి, జీవితంలో స్పెషల్ గా భావించే ప్రేమ సంగతులు, గొడవలు, అల్లర్లు, అప్పులు వంటి ఎన్నో విషయాలలో స్నేహపూర్వకంగా ఉంటూనే బాధ్యతగా సపోర్ట్ ఇచ్చే కజిన్స్ పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కాబట్టి కజిన్స్ ను సంతోషపెట్టండి ఎంతో కొంత వీలైనంత. వారి నుండి తిరిగి మీరు పొందే ప్రేమ మాత్రం విలువ కట్టలేనంత ఆనందాన్ని కలిగించడం ఖాయం.                                  ◆వెంకటేష్ పువ్వాడ.  

జాతీయోద్యమ శక్తి లోకమాన్య తిలక్!

బాలగంగాధర తిలక్. భారతజాతీయ ఉద్యమ పితామహునిగా పేరు పొందిన ఈయనను అందరూ లోకమాన్య అనే బిరుదుతో పిలుస్తారు. భారత జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించడంలోనూ, సామాన్య ప్రజలను ఆ ఉద్యోమంలో చురుగ్గా పాల్గొనేలా చేయడంలోనూ గొప్ప పాత్ర పోషించినవాడు లోకమాన్య తిలక్. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో నీకున్న అశాంతికి కారణం ఆయనేనని, ఆయన వల్లనే బ్రిటిష్ వారి మీద భారతీయుల మనసులో పోరాట స్థాయి ఏర్పడటం కానీ, అది పెరగడం కానీ జరిగిందని చెబుతారు. బాలగంగాధర్ తిలక్ 1856 జులై 23 వ తేదీన జన్మించాడు. ఈయన తండ్రి సంస్కృత పండితుడు, ఉపాద్యాయుడు. అందువల్ల చిన్నతనం నుండి చదువు విషయంలో మంచి అవగాహన ఉండేది. గణితశాస్త్రంలో ఈయనకు మంచి ప్రతిభ ఉండేది. తిలక్ జీవితంలో ఒక గొప్ప మార్పు తన పదేళ్ల వయసులో జరిగింది. అది అతని తండ్రి రత్నగిరి నుండి పుణెకి బదిలీ కావడం.  పూణేలో ఉండే ఆంగ్లో- వెర్నాక్యులర్ పాఠశాలలో ఎంతో గొప్ప ఉపాధ్యాయుల దగ్గర చదువుకునే అవకాశం తిలక్ కు లభించింది. అయితే పుణెకి వచ్చిన ఆరేళ్ళ వ్యవధిలోనే తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయాడు ఈయన. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ తరువాత దక్కన్ కాలేజీలో చేరాడు. కాలేజీకి వెళ్లి చదువుకున్న తొలితరం భారతీయుల యువకుల్లో తిలక్ ఉండటం గమనార్హం. 1877 లో గణితశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత L.L.B పట్టా పొందాడు. రాజకీయ  లోకమాన్య తిలక్ 1890 వ సంవత్సరంలో భారతజాతీయ కాంగ్రెస్ లో సభ్యుడిగా చేరాడు. అయితే అప్పటి కాలంలో జరుగుతున్న మితవాద రాజకీయాలపై ఆయనకు పెద్దగా నమ్మకం ఏర్పడలేదు. దేశానికి స్వాతంత్య్రం కావాలంటే పోరాటం చేయడమే సరైన మార్గమని ఆయన నమ్మారు.  కాంగ్రెస్ పై విమర్శ! కాంగ్రెస్ అప్పటికాలంలో సంవత్సరంలో డిసెంబర్ నెలలో కేవలం మూడురోజుల పాటు "pray, petition, protest" అనే  మూడు విఆహాయలు గురించి మాట్లాడటంతోనే సరిపెట్టుకుంది. దాని గురించి విమర్శిస్తూ "మీరు కేవలం మూడురోజుల పాటు కప్పల మాదిరి బెకబెకలాడితే  ప్రయోజనం ఉండదు" అని వ్యంగ్యంగా విమర్శించారు. అది మాత్రమే కాకుండా కాంగ్రెస్ అడ్డుకునే సంస్థ అయిపోయింది(బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడుక్కోవడం కాదు వాళ్ళ మీద తిరగబడి పోరాటం చేసి మన దేశాన్ని మనం సొంతం చేసుకోవాలని తిలక్ అభిప్రాయం) అని అన్నారు.  నినాద కర్త! "స్వరాజ్యం నా జన్మ హక్కు" అని గొంతెత్తి నినదించిన వాడు తిలక్. ఈయన తన గళాన్ని గట్టిగా వినిపించడం వల్ల అతివాదుల వర్గంలోకి చేర్చబడ్డాడు. 1907లో సూరత్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. అతివాదులు, మితవాదులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అప్పుడు చీలిపోయినా వాళ్ళు తిరిగి 1917 లో ముస్లిం లీగుకు, కాంగ్రెస్ కు జరిగిన ఒప్పందం సమయంలో మళ్ళీ కలిసిపోయారు. సమాజంలో చురుకైన పాత్ర! ఈయన సమాజంలో చాలా చురుకైన పాత్ర పోషించాడు. పాశ్చాత్య విద్యావిధానాన్ని వ్యతిరేకించాడు. అది భారతీయ వారసత్వాన్ని అగౌరవపరుస్తుందని చెప్పాడు. భారతదేశ ఔన్నత్యాన్ని భోధించాలనే ఉద్దేశ్యంతో అగర్కార్, విష్ణు శాస్త్రి చిప్లుంకర్ లతో కలసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ"  స్థాపించాడు. ఇంకా బ్రిటిష్ వారి పట్ల భారతీయుల ధోరణి మారాలనే ఉద్దేశ్యంతో మరాఠా పత్రిక, కేసరి పత్రికలలో ఘాటుగా వ్యాసాలు రాసేవాడు. ఈయన బాల్యవివాహాలను నిరసించాడు, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. ఉత్సవాల విస్ఫోటనం! భారతదేశంలో పౌరులను భారతజాతీయోద్యమం వైపు నడిపేందుకు ప్రజలను ఒక్కచోటికి చేర్చేందుకు ఈయన చేసినది శివాజీ జయంతి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం. వీటి ద్వారా భారతీయ హిందూధర్మ గొప్పదనాన్ని తెలియజేయడమే కాకుండా జాతీయోద్యమం వైపు నడిపించే అవకాశం సృష్టించుకున్నాడు.  కారాగార శిక్ష! ఈయన పత్రికల్లో రాసే తన రాతల ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నాడనే కారణంతో ఒకటిన్నర సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. ఆ ఒకటిన్నర సంవత్సరం పూర్తవగానే స్వదేశీ ఉద్యమానికి సిద్ధమయ్యాడు. 1906 సంవత్సరంలో దేశద్రోహం కేసు మీద ఆరు సంవత్సరాలు ప్రవాస శిక్ష అనుభవించాడు. గ్రంధకర్తగా! ఈయన ప్రవాస శిక్ష అనుభవిస్తున్నప్పుడే గీతారహాస్యం అనే గ్రంధాన్ని రచించారు. అది మాత్రమే కాకుండా ఈయన మంచి చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని ఈయన తను రచించిన గ్రంధంలో పేర్కొన్నారు.  హోంరూల్! 1916 లో హోంరూల్ లీగ్ స్థాపించారు. దాని గురించి వివరిస్తూ పల్లెపల్లెకు తిరిగాడు. అనీబిసెంట్ అదే సంవత్సరంలో ఆ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. అయితే తిలక్ ఒక కేసులో లండన్ వెళ్లగా బ్రిటిష్ వారు తెలివిగా పథకం వేసి అనీబిసెంట్ ఆ ఉద్యమాన్ని విరమించుకునేలా చేసింది. తిలక్, అనీబిసెంట్ ఇద్దరూ చెరొక దారిలో ఉండటం వల్ల హోంరూల్ లీగ్ మెల్లిగా చల్లారిపోయింది. ఆ తరువాత 1920 సంవత్సరంలో తిలక్ మరణించారు. ఆయన చనిపోగానే జాతీయోద్యమం ఇక దిక్కులేనిదైపోయిందని అందరూ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా లోకమాన్య బలగంగాధర తిలక్ భారతజాతీయోద్యమ కర్తగా, ఒక గొప్ప సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, బ్రిటిషు వారిని ఎదిరించిన శక్తిగా అన్నిటికంటే ముఖ్యంగా ఒక గొప్ప విద్యావంతుడిగా భారతీయ చరిత్రలో నిలిచిపోయాడు.                                  ◆ వెంకటేష్ పువ్వాడ.

మండే సూర్యుడు నెల్సన్ మండేలా!

నెల్సన్ మండేలా నల్లజాతి సూర్యుడిగా తెలుగువారు పిలుచుకునే ఈ వ్యక్తిత్వం మండే సూర్యుడిలాంటిది. దక్షిణాఫ్రికా రాజకీయ చరిత్రలో పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల అంగీకారంతో అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తొలి నల్లజాతి వ్యక్తి నెల్సన్ మండేలా. నల్లజాతీయుల హక్కుల కోసం, వారి స్వేచ్ఛ, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మండేలా జన్మదినోత్సవాన్ని నెల్సన్ మండేలా డే గా ప్రపంచ వ్యాప్తంగా జులై 18న జరుపుకుంటారు. నోబెల్ బహుమతి గ్రహీతగా, భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం భారతరత్న గ్రహీతగా మండేలా కేవలం దక్షిణాఫ్రికాకే కాదు మొత్తం ప్రపంచదేశాలకు ప్రేరణగా నిలిచే గొప్ప వ్యక్తి, నాయకుడు, ప్రజలను నడిపించే శక్తి. ఈయన జీవితం ఎన్నో మలుపులతో ఎన్నో పోరాటాలతో నిండి ఉంది. మహాత్మ గాంధీ ప్రేరణగా మండేలా అహింసాయుత మార్గం వైపు ప్రపంచ శాంతి వైపు తనవంతు కృషి చేసారు. బాల్యం విద్యాభ్యాసం! ఈయన తెంబు వంశానికి చెందినవాడు. దక్షిణ ఆఫ్రికాలో కేప్ ప్రాంతాల్లో ఉండేవారు. అక్కడి పాలన వీరిచేతుల్లో  ఉండేది. మండేలా 1918 జులై 18న తన తండ్రి మూడవ భార్యకు జన్మించాడు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రోలిహ్లాహ్లా. ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈయన పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టాడు. పాఠశాల ఉపాద్యాయుడికి రోలిహ్లాహ్లా అనే పేరు పలకడం రాక ప్రసిద్ధులైన బ్రిటిష్ నావికాదళ నాయకుడు హోరేషియా నెల్సన్ పేరు నుండి నెల్సన్ ను ఈయనకు తగిలించాడు. ఈయనకు 9 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. తరువాత ఈయన తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ 1937లో "ఫోర్ట్ బ్యూఫోర్ట్"లో "హీల్డ్‌టౌన్" కళాశాలలో చేరాడు. ఈయనకు బాక్సింగ్, రన్నింగ్ మీద చాలా ఆసక్తి ఉండేది. అది కాస్తా వాటిలో ఆయనకు ప్రతిభ తెచ్చిపెట్టింది. కానీ సమాజంలో జరుగుతున్న పరిస్థితుల వల్ల అవన్నీ అటకెక్కాయి. మెట్రిక్యులేషన్ తరువాత ఈయన బి.ఏ లో చేరాడు. అయితే ఒక సంవత్సరం తరువాత ఈయన రాజకీయాలలో పాల్గొన్న కారణంగా ఈయనను విశ్వవిద్యాలయం నుండి తీసేసారు. తరువాత పెళ్లి గోల తపించుకోవడానికి జొహెన్నెస్ బర్గ్ కు వెళ్ళిపోయాడు. అక్కడ చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసాడు. దూరవిద్య ద్వారా ఆగిపోయిన బి.ఏ పూర్తి చేశాడు.  తరువాత విల్ వాటర్స్ రాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదవసాగాడు. అక్కడే అనూహ్యమైన మార్పులు జరిగాయి. జాతివివక్షత, దానికి వ్యతిరేక పోరాటం చేసేవారు అక్కడే మండేలా కు పరిచయం అయ్యారు. రాజకీయ అనుబంధం! రాజకీయంతో అనుభంధాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మండేలా జీవితంలో పొరటాలే. 1948లో ఆఫ్రికనెర్ లు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా నేషనలిష్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక నల్లజాతి తెల్లజాతి అంటూ ప్రజలను వర్గాలుగా విడదీయడం చేసింది. మండేలా పీపుల్స్ కాంగ్రెస్ కార్యక్రమాలలో భాగంగా తన స్నేహితుడితో కలసి స్థాపించిన లా సంస్థ ద్వారా ఎంతోమంది పేద నల్లజాతి వారికి ఉచిత న్యాయవాద సౌకర్యం కల్పించారు.  ఈయన మొదట గాంధిలా శాంతియుతంగా పోరాటం చేసిన అవేవి నాటి దక్షిణ ఆఫ్రికా పరిస్థితులను మార్చేలా కనబడక అసహనానికి లోనయ్యారు. 1961లో సాయుధ విభాగాన్ని ఏర్పరిచి ప్రభుత్వ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. జాతి వివక్షత అంతం చేయడానికి గెరిల్లా పోరాటాలను కూడా సిద్ధం చేసుకున్నారు. దీనివల్ల చాలామంది మరణించారు. జైలు శిక్ష! మండేలా 1962 ఆగష్టు లో అరెస్టయ్యాడు, 1962 అక్టోబర్ లో అయిదు సంవత్సరాల జైలుశిక్ష వేశారు. తరువాత 1964లో న్యాయస్థానం ఎదుట హాజరైనప్పుడు ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించాడు ఆ సందర్భంలో.  °నా జీవితమంతా ఆఫ్రికన్ జనుల సంఘర్షణకే అంకితం. తెల్లవారి పెత్తనాన్నీ, నల్లవారి పెత్తనాన్నీ నేను ప్రతిఘటించాను. అందరూ సహృద్భావంతో కలిసి ఉండే, అందరికీ సమానావకాశాలు లభించే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా సమాజం నాకత్యంత ప్రియమైన లక్ష్యాలు. అందుకోసమే నేను జీవిస్తాను. అవసరమైతే అందుకోసం మరణించడానికి కూడా నేను సంసిద్ధుడను" అని చెప్పాడు.  దీని తరువాత ఆయనకు జీవితకాల శిక్ష విధించారు. తరువాత 27 సంవత్సరాల జైలు జీవితంలో 18 సంవత్సరాలు రొబెన్ దీవిలో గడిపాడు. ఈయనకు తక్కువస్థాయి ఖైదీగా చాలా తక్కువ వసతులు కల్పించారు. సున్నపు క్వారీలో పనిచేయించేవారు. అలా అన్నేళ్ళు జైలు జీవితం గడిపిన తరువాత 1990లో మండేలాను విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీచేశారు. స్వీయ చరిత్ర! మండేలా "లాంగ్ వాక్ టూ ఫ్రీడమ్" అని స్వీయ చరిత్ర రాసాడు. అది 1994లో ప్రచురించబడింది. అదంతా ఆయన తన జైలు శిక్ష సమయంలో రహస్యంగా రాసాడు. అధ్యక్షుడిగా! 1994 సంవత్సరంలో మొట్టమొదటి నల్లజాతి వ్యక్తి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా  ఎన్నిక కాబడ్డారు. 1999 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత థాబో ఎంబెకీ  పదవిని స్వీకరించాడు. చివరి పదేళ్లు! జూలై 2001లో మండేలాకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించబడింది. రేడియేషన్ వైద్యం చేశారు.  జూన్ 2004లో తాను పబ్లిక్ జీవితం నుండి విరమిస్తున్నట్లుగాను, అధికంగా కుటుంబంతో గడపదలచుకొన్నట్లుగాను  ప్రకటించాడు. కాని పూర్తిగా సమాజం నుండి దూరంగా ఉండలేదు. ఈయన తన చివరి కాలంలో శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న జొహెన్నస్ బర్గ్ లో మరణించాడు. అలా 20 వ శతాబ్దానికి చెందిన గొప్ప పోరాట నాయకుల్లో ఒకరైన నెల్సన్ మండేలా అస్తమయం చెందాడు. కానీ ఆయన పోరాట పటిమ, ఆయన జీవితం మండే సూర్యుడిలా ఎంతోమందిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ◆ వెంకటేష్ పువ్వాడ.

మూర్ఛ వ్యాధి లైఫ్ స్టైల్ ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

మనిషిని అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని తాత్కాలిక ఉపశమనం తప్పితే శాశ్వత పరిష్కారం లేకుండా ఉంటాయి. దీర్ఘకాలిక మందుల వాడకం వల్ల  తగ్గే అవకాశాలు ఉంటాయేమో కానీ అది కొద్దిశాతం మాత్రమే. వయసుతోను, జెండర్ తోనూ సంబంధం లేకుండా సమయం అంటూ లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టె సమస్య మూర్ఛ రోగం. ఇది నరాల సంబంధ సమస్య వల్ల వస్తుంది.  ప్రపంచంలో  అందరినీ ఇబ్బంది పెడుతున్న నరాలకు సంబంధించిన నాలుగవ సమస్యగా మూర్చరోగం నమోదయింది. మూర్చరోగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో మెదడు పనితీరు గురించి ఒక విషయాన్ని తెలుసుకున్నారు. మూర్ఛ రోగులు నిద్రపోతున్న సమయంలో బయటి శబ్దాలకు స్పందించే లక్షణం సాధారణ వ్యక్తులకంటే ఎక్కువగా ఉంటుందట. అల్ఫా-బీటా తరంగాల స్థాయి వల్ల ఇందులో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అసలు సమస్య ఎక్కడ?? ఏంటి? ◆అల్ఫా-బీటా తరంగాలు క్షీణించిపోయి తక్కువ స్థాయిలో ఉంటే శబ్దాలకు స్పందించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గుణం వల్ల తరువాత ఏమి జరుగుతుందో అనే ఆలోచనా వలయం మెదడులో క్రమంగా పెరిగిపోతుందట. ఈ కారణం వల్ల మూర్ఛ రోగులు రాత్రి సమయాల్లో మెలకువ వచ్చి లేస్తే తరువాత నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ◆మూర్ఛ రోగులలో మెదడులోని న్యూరాన్ లు వీణ మీద తీగల్లాగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కసారి కంపనానికి లోనైతే ఇక వాటి తాలూకూ శబ్దాన్ని రీసౌండ్ చేస్తున్నట్టు ఉంటాయి. మనిషి మానసిక పరిస్థితిని బట్టి వాటి శబ్ద తీవ్రత అనుభూతి చెందడంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కుంటారు. ◆ ఈ పరిస్థితులు ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాలను  పరిశోధకులు దగ్గరగా పరిశోధించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. పరిశోధనలో మెదడులో కొన్ని ఎలాక్ట్రోడ్ లు అమర్చి లోపలి పనితీరు వ్యవస్థను గమనించినప్పుడు ఆశ్చర్యంగా మూర్ఛ సమస్య ఉన్న వాళ్లలో మెదడు కణాలు అన్నీ ఒకే విధంగా స్పందించాయి. ◆ 7 సంవత్సరాలలో సుమారు 700 మంది నుండి న్యూరాన్ ల డేటా ను సేకరించి పరిశీలించిన ఫలితాలలో మెదడు కణాలు నిద్రలో చాలా తీవ్ర స్థాయిలో స్పందించాయని తెలుసుకున్నారు. ◆  అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పరిశోధనలు, వాటి ఫలితాలు, బాధితుల అనుభవాలను గమనిస్తే ఈ మూర్ఛ వ్యాధి అనేది మనుషులను ఎంతగా ఇబ్బంది పెడుతోందో అర్థం చేసుకోవచ్చు. పరిష్కారం ఎలా? ఇది పూర్తిగా నరాల సంబంధిత సమస్య. కొన్ని జన్యు పరంగానూ ఉండచ్చు, మరికొన్ని అకస్మాత్తుగా సంభవించేవి కావచ్చు.  కొంతమందిలో ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మార్చ వ్యాధి అటాక్ అవ్వచ్చు, మహిళల్లో ప్రసవ సమయంలో ఈ సమస్య ఎదురవ్వచ్చు. దీనికి స్వీయ పరిష్కారం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. నరాలను ఒత్తిడిలోకి నెట్టే ఆలోచనలు, శారీరక శ్రమ ఎక్కువ చేయకుండా ఉండటం మంచిది. జీవన విధానాన్ని ఆహ్లాదంగా ఉంచుకోవడం. ◆ నరాలకు శక్తిని ఇచ్చే ఆహారపదార్థాలు తీసుకోవాలి. నువ్వులు, నువ్వుల నూనె ఎంతో మంచివి. ◆ సహజసిద్ధమైన జీవన విధానానికి దగ్గరగా ఉండాలి. తిండి, నీరు, గాలి, నివసించే వాతావరణం విషయంలో జాగ్రత్తలు అవసరం. ◆ కుటుంబ సభ్యుల నుండి సహకారం అవసరం అవుతుంది. అనవసరపు గొడవలకు, రాద్ధాంతాలకు దూరం ఉండాలి. ముఖ్యంగా ఎమోషన్స్ ను బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవడం కుటుంబ సభ్యుల కర్తవ్యం. ఇవన్నీ కేవలం జాగ్రత్తలు మాత్రమే. వైద్యులను సంప్రదించి మందులు వాడటం మంచి మార్గం. ఇలా చేస్తుంటే జీవన విధానంలో మూర్ఛ అనే సమస్య ప్రభావం కాసింత తక్కువే ఉంటుంది.                                          ◆వెంకటేష్ పువ్వాడ.

లేటెస్ట్ నవరస చిత్రాలు ఈ ఎమోజీలు!

మనిషికి జీవితంలో భావవ్యక్తీకరణ ఎంతో ముఖ్యమైనది. కొందరు ఈ వ్యక్తికరణను ముఖకవళికల ఆధారంగా వ్యక్తం చేస్తుంటారు. ఏదైనా ఒక భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి నవరసాలను ముఖంలోకి తీసుకొచ్చి వాటిని బయటపెడుతుంటారు. సందర్భాన్ని బట్టి, మనిషి మూడ్ ని బట్టి వ్యక్తీకరణలు మారుతుంటాయి. అయితే నేటి వేగవంతమైన కాలంలో స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, రిలేషన్ లో ఉన్నవారు కావచ్చు దూరంగా ఉంటున్నవాళ్ళు ఫోన్ కాల్స్ లోనూ, చాటింగ్ లోనూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ  ఉంటారు. ఇలా పలకరించుకునే  సమయంలో ఎక్స్ప్రెషన్స్ బయట పెట్టడానికి అందరూ వాడుతున్నవి ఎమోజిస్.  నవ్వడం, ఏడవడం, కోపం, బాధ, అసహనం, ప్రయాణాలు, వంట చేయడం, అనారోగ్యం ఇలా ప్రతి సందర్భానికి ఎమోజీలు ఉన్నాయి. చాటింగ్ చేసుకునేవాళ్ళు సింపుల్ గా ఎమోజీలు పెట్టి తమ సిట్యుయేషన్ ను అవతలివాళ్లకు చెబుతుంటారు. అయితే ఈ ఎమోజీలు ప్రస్తుత నెట్ యుగంలో చాలా చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. వీటి వాడకం లేని సామాజిక మాధ్యమాల సంభాషణలు సాగడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మొదలైన మాధ్యమాలలో ఎమోజీల హాంగమా అంతా ఇంతా కాదు.  అసలు ఎమోజీలు ఎక్కడివి? ఒకసారి మీరు చేసిన ఆన్లైన్ చాటింగ్ గమనిస్తే ఆ చాటింగ్ లో హార్ట్ సింబల్స్, లాఫింగ్ సింబల్స్, స్లీపింగ్ సింబల్స్, స్మైలీ ఫేస్ లు, యాంగ్రీ ఫేస్ లు ఇలా ఎన్నో రకాల ఎమోజీలు చాలానే వచ్చి ఉంటాయి. ఎమోజి అని పిలువబడే ఈ ఐకానిక్  జపనీస్ చిత్రాలు ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పట్లో కామన్ అయినట్టు ఈ ఎమోజీల విజయాన్ని కూడా  జూలై 17న ఎమోజీ డే గా గుర్తించి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎమోజీ డే రోజు జరిగే అక్టీవిటీస్! బుల్లి ఎమోజీలతో, చిన్న సరదాలు, చెప్పలేనంత సంతోషాలు స్నేహితులు, సన్నిహితుల మధ్య క్రియేట్ చేసుకోవచ్చు. సంభాషణలను కేవలం ఎమోజీలు ద్వారా మాత్రమే చేయడం చెప్పలేనంత ఫన్ గా ఉంటుంది. ఈకాలంలో క్రియేటివిటికి కొదవలేదు. ప్రయోగాలు చేసి సొంత ఎమోజీలు సృష్టించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి క్రియేటివిటీల విషయంలో  స్నేహితుల మధ్య చిన్న చిన్న ఛాలెంజ్ లు కూడా పెట్టుకోవచ్చు. వేసుకునే డ్రెస్ , ఉపయోగించే వస్తువులు ఇంకా వివిధ రకాల వాటి మీద ఎమోజీ చిత్రాలు వేయడం, రోజంతా ఆ ఎమోజీల ఫన్ ను అందరితో ఎంజాయ్ చేయడం. ఎమోజీలు విషయంలో అందరూ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ◆భాషతో సంబంధం లేకుండా వ్యక్తీకరణ అందరికీ తెలిసిపోవడం ఈ ఎమోజీల స్పెషల్. ◆ వెటకారం, వ్యంగ్యం, హాస్యం, సంతోషం వంటి అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఎమోజీలతో సాధ్యమవుతుంది. మొబైల్ పాడ్ లో లేని ఎమోజీ అంటూ ఉండదు. బహుశా వాటిలో చాలావరకు మనం వాడనివి కూడా ఉంటాయి. ◆ ఇవి మంచి కోడింగ్ కాన్సెప్ట్ లాగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్  జరిగేటప్పుడు సరదాగా వీటితో చిన్న చిన్న పజిల్స్ లాంటివి ప్లే చేయచ్చు. ◆ అవన్నీ సరదా అయితే కాస్త చిరాకు, కోపం, అసహమ్ లో ఉన్నప్పుడు మాట్లాడాలని లేనప్పుడు కూడా ఎమోజీ తో రిప్లయ్ ఇవ్వచ్చు, అలాగే పనులలో ఉన్నప్పుడు ఎమోజిలే మంచి మార్గం. ఇలా ఎమోజీలు రోజువారీ మన చేతుల్లో చాలానే దొర్లిపోతుంటాయి. ఒకవేళ ఈ ఎమోజీ డే లు గట్రా పిచ్చి పనిగా ఎవరికైనా తోస్తే ఒక సైలెంట్ ఎమోజీ చూసి ఆ భంగిమలోకి మారిపోండి.                                ◆ వెంకటేష్ పువ్వాడ.

పేపర్ బ్యాగ్స్ తీసుకుందామా?

మనిషి విజ్ఞానపరంగా అభివృద్ధి చెందేకొద్ది ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసాడు. నిత్యం అన్నిరకాలుగా ఉపయోగించుకుంటున్న ప్లాస్టిక్ అలాంటిదే. అయితే కాలం గడిచేకొద్దీ ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసొచ్చింది. దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నెన్నో ప్రయోగలు చేశారు. ప్రకృతికి హాని కలిగించకుండా ఉండాలని చేసిన ఆ ప్రయత్నాలలో ఆవిష్కారం అయ్యిందే పేపర్ బ్యాగ్. పండ్లు తీసుకోవలన్నా, పూలు తీసుకోవలన్నా, కూరగాయలు, సరుకులు, చివరికి చెత్త పడేయడానికి కూడా ప్లాస్టిక్ వాడటం వల్ల చాలా పెద్ద నష్టాలే ఎదురయ్యాయి. ఇప్పుడు మాత్రం ప్లాస్టిక్ బ్యాన్ చేసి పేపర్ బ్యాగ్ వైపు మొగ్గుచూపారు.  పేపర్ బ్యాగ్ పుట్టుక! ప్రతి సంవత్సరం జూలై 12న పేపర్ బ్యాగ్ డేగా జరుపుకుంటారు. ప్లాస్టిక్‌కు బదులు పేపర్ బ్యాగుల వాడకంపై అవగాహన కల్పించే సమావేశాలు, కార్యకలాపాలు చేపడతారు.    పర్యావరణానికి  ప్లాస్టిక్ సంచుల వల్ల జరిగే  దుష్ప్రభావమే పేపర్ బ్యాగుల వినియోగానికి దారితీసింది. మనం ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి సంవత్సరాలు పడుతుంది, అయితే కాగితపు సంచుల ద్వారా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ పేపర్ బ్యాగులను తిరిగి రీసైకిల్ చేయడం లేదా వీటిని సులువుగా నేలలో కలిసిపోయేలా చేయచ్చు.  ప్రజలు స్థిరమైన జీవనశైలిని ఎంచుకుంటున్న దశలో పర్యావరణం గురించి ఆలోచించి ప్లాస్టిక్ ను దూరం పెట్టి పేపర్ బ్యాగ్ లను వాడితే ఎంతో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి.    పేపర్ బ్యాగ్ చరిత్ర: ప్లాస్టిక్ వినియోగం వల్ల ఎదురవుతున్న నష్టాలకు పరిష్కారంగా పేపర్ బ్యాగ్ ల వాడకం మొదలైనా, పేపర్ బ్యాగ్ ల  పుట్టుక మాత్రం ఇప్పటిదేమీ కాదని చరిత్ర చెబుతోంది. భారతదేశ ప్రాచీనులు వస్త్రాలతో తయారుచేసిన సంచులు, జనపనార, టెంకాయ పీచు వంటి వాటితో తయారుచేసిన  చేతి సంచులు వాడేవాళ్ళు. అయితే 1852లో ఫ్రాన్సిస్ వోల్లే అనే అమెరికన్ ఆవిష్కర్త మొదటి పేపర్ బ్యాగ్ మెషీన్‌ను స్థాపించాడు.  తరువాత 1871లో మార్గరెట్ ఇ నైట్ ఫ్లాట్-బాటమ్ పేపర్ బ్యాగ్‌లను ఉత్పత్తి చేసే మరొక యంత్రాన్ని అభివృద్ధి చేసింది.  ఆమె "the mother of the grocery bag"గా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత అనేక సంవత్సరాలుగా, చార్లెస్ స్టిల్‌వెల్ మరియు వాల్టర్ డ్యూబెనర్ వంటి అనేక మంది ఆవిష్కర్తలు మెరుగైన డిజైన్‌లు మరియు మాన్నికైన కాగితపు సంచులను ఉత్పత్తి చేశారు.  కాగితపు సంచులు లేదా పేపర్ బ్యాగ్స్ ఎందుకు వాడాలి? కాగితపు సంచులు ఎందుకు వాడాలి అనేదానిపై చెప్పుకోవాల్సిన మొదటి విషయం పర్యావరణానికి హాని కలిగించకపోవడం. వాడేసి పడేసిన తరువాత తొందరగా భూమిలో కలిసిపోవడం, లేదా రీసైకిల్ చేయడానికి అనువుగా ఉండటం.  పేపర్ బ్యాగ్స్ వాడటం వల్ల అన్ని రకాల కాలుష్యాలను  తగ్గించవచ్చు.  పేపర్ బ్యాగ్స్ ను ఒక్కసారి వాడి పడేయకుండా రియూజ్ చేసుకోవచ్చు. అంటే ఓకేదాన్ని  మళ్ళీ ఉపయోగించుకోవడం.  ◆ఒకసారి వాడేసిన పేపర్ బ్యాగ్ పరిస్థితిని బట్టి వంటగదిలో వాడొచ్చు. నూనెలో వేయించిన పకోడీలు ఇతర పదార్థాలను శుభ్రంగా ఉన్న పేపర్ బ్యాగ్ లపై వేస్తే నూనెను పీల్చుకుంటాయి. కిచెన్ నాప్కిన్స్ కొనే ఖర్చు కాస్త అయినా తగ్గుతుంది. ◆ గాజు, పింగాణీ వంటి వస్తువులను ప్యాక్ చేయడానికి పేపర్ బ్యాగ్స్ బాగా ఉపయోగపడతాయి. వీటి వల్ల వస్తువులు విరిగిపోకుండా ఉంటాయి. ◆ పేపర్ బ్యాగ్స్ లో కార్బన్ మూలం ఉంటుంది. కాబట్టి కంపోస్టు ఎరువుగా మార్చడానికి బాగా అనువుగా ఉంటుంది. ఈ ఎరువు మొక్కలకు మంచి పోషకంగా ఉపయోగపడుతుంది. ◆ ఉల్లి వెల్లుళ్లు వంటి వాటిని పేపర్ బ్యాగ్స్ లో వేసి పొడి ప్రదేశాలలో ఉంచితే నెలల తరబడి పాడుకాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆకుకూరలు వంటివి పేపర్ బ్యాగ్స్ లో వేసి ఫ్రిజ్ లో ఉంచితే అదనపు తేమను పీల్చుకుని ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ◆ ఎక్కడికి వెళ్లినా ఓ పేపర్ బాగ్ మనతో ఉంచుకుంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. లేకుంటే సింపుల్ గా రికైల్ కోసం వాడేయచ్చు కూడా. ◆పేపర్ బ్యాగ్స్ ను ఏవిధంగా వాదుకున్నా వీటి నుండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, నష్టాలు కానీ ఉండవు. ధర విషయంలో మరీ అంత ఎక్కువగా ఏమి ఉండవు.  కాబట్టి పర్యావరణానికి మంచి చేసే పేపర్ బ్యాగ్స్ వైపు అడుగులు వేసి కాసింత ఈ భూమిని, ప్రకృతిని కాపాడుకోవాలి అందరూ.                                  ◆వెంకటేష్ పువ్వాడ.  

జ్ఞానాన్ని గుభాళింపజేసే గురుపూర్ణిమ!

ఆషాడ శుద్ద పౌర్ణమి రోజును గురుపౌర్ణిమ అని కూడా అంటారు. గురుపూర్ణిమ అనేది గురువును స్మరించుకుంటూ జరుపుకునే వేడుక అని అందరి అభిప్రాయం. గురుపూర్ణిమ రోజునే వ్యాసుడు జన్మించాడు కాబట్టి దీన్ని వ్యాసపూర్ణిమ అంటారని కొందరు చెబుతారు. ఏది ఏమైనా ఆషాడ శుద్ధ పూర్ణిమ రోజును అందరూ ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.  గురువును పూజించడం భారతీయ సనాతన ధర్మంలో ఎప్పటి నుండో ఉంది. భక్తుడు లేదా శిష్యుడిలో ఉన్న అంధకారాన్ని తొలగించేవాడు గురువు. మన భారతదేశంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మసాక్షాత్కారం పొంది ప్రజలకు ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రశాంత జీవితాన్ని గురించి తమ భోధనల ద్వారా చెప్పినవాళ్ళు. ఇంకా ముఖ్యంగా తమ జీవితం ద్వారానే ప్రజలకు, శిష్యులకు గొప్ప మార్గాన్ని చూపినవాళ్ళు. బుద్ధుని జీవితాన్ని ప్రజలకు ఎలా అయితే ఒక గొప్ప మార్గంగా ప్రచారం చేస్తారో, బుద్ధ పూర్ణిమను ఎంతో ప్రత్యేకంగా ఎలా చూస్తోరో, అలాగే గురుపూర్ణిమ కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. గురుపూర్ణిమ రోజున ఎంతో మంది తమ గురువుల అనుగ్రహం కోసం గురువును ఆశ్రయిస్తారు. కొందరు ఉపదేశాలు తీసుకుంటారు. మరికొందరు గురువుకు సేవ చేసుకుంటారు, గురువును గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. షిరిడి సాయి బాబా లాంటి గురువుల మందిరాలు భక్తులతో కిటకిటలాడుతాయి. గురుపూర్ణిమ వెనుక కథనం!! అందరూ గురుపూర్ణిమ వెనుక కథ ఏంటి అంటే వ్యాసుడు జన్మించాడు కాబట్టి గురుపూర్ణిమ జరుపుకుంటారు అని చెబుతారు. కానీ వ్యాసుడు జన్మించడం  నిజమే అయినా దానికంటే అరుదైన విశిష్టమైన కథనం గురుపూర్ణిమ వెనుక ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురుపూర్ణిమ వెనుక ఆసక్తికర కథనాన్ని చెప్పారు. ఆయన ఆరాధించే పరమేశ్వరుడు ఆదియోగి. ఆయనే ఈ సృష్టిలో మొదటి యోగి అని ఆయనే మొదటి గురువు అని సద్గురు చెబుతారు. ఈ సృష్టిలో మొట్టమొదటిసారి ఒక యోగి హిమాలయాల్లో కనిపించాడు ఆయన్ను చూసిన ప్రజలు ఆయన ఏమైనా చెబుతాడేమో ఎదురుచూసారు కానీ ఏమీ చెప్పకపోవడం వల్ల అందరూ వెళ్లిపోయారు. అయితే అక్కడ ఏడుమంది మాత్రం అలాగే ఉండిపోయారు. ఆదియోగి వాళ్ళను పట్టించుకోలేదు. కానీ వాళ్ళు అక్కడి నుండి వెళ్లకుండా సుమారు 84 సంవత్సరాలు అక్కడే ఉన్నారట. చివరికి ఆదియోగి వాళ్ళవైపు చూసినప్పుడు సరిగ్గా దక్షిణాయనం మొదలైందట. ఆదియోగి ఆ ఏడుమందికి గురువుగా మారి ఉపదేశం చేశారు. ఆ ఏడుమంది సప్తర్షులుగా పిలవబడ్డారు. అంతేకాదు ఆదియోగి ఆ సప్తర్షులవైపు దక్షిణదిక్కుగా చూసాడు కాబట్టి ఆయన దక్షిణామూర్తిగా పిలబడ్డాడు. ఆదియోగి సప్తర్షులకు గురువుగా మారి చేసిన ఉపదేశాన్ని సప్తర్షులు ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. ఇదీ గురుపూర్ణిమ వెనుక కథనం. అయితే గురువు ఎవరైనా శిష్యుడికి ఎంతో గొప్పవాడు కాబట్టి ఎందరో గురువులున్న ఈ భారతదేశంలో తమ తమ గురువును తలచుకుంటూ, పూజిస్తూ, సేవిస్తూ గురుపూర్ణిమను చాలా భక్తితో జరుపుకుంటారు. కాబట్టి అందరికీ గురువు అనుగ్రహం ఉండాలని కోరుకుందాం. ఈ గురుపూర్ణిమ నాడు అందరూ గురువులూ తమ శిష్యులకు గొప్ప జ్ఞానాన్ని పంచాలని ఆశిద్దాం.                                   ◆ వెంకటేష్ పువ్వాడ.

జగన్నాథుని రథచక్రాలు సాగుతున్నాయి!!

భారతదేశం మొత్తం రథయాత్ర పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుని రథోత్సవం ప్రస్తుతం జరుగుతోంది. ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన వెలసిన పూరీ క్షేత్రం శ్రీకృష్ణుణ్ణి ఆరాధించే వాళ్లకు ఎంతో పవిత్రమైనది. చార్ ధామ్ యాత్రలో ఉన్న ప్రముఖ నాలుగు క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథుని రథోత్సవం ప్రత్యేకత, విశేషాలు మొదలైన వాటి గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. పూరీ క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో రథయాత్రకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. జగన్నాథుడు బలభద్రుడు, సుభద్రలతో కలసి ఇక్కడ రథాల మీద ఉరేగడం చాలా కన్నుల పండుగగా ఉంటుంది. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఇక్కడి గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని తయారుచేసి ఆ రథాల్లోనే రథోత్సవం జరుపుతారు. రథోత్సవాలు ఎక్కడ జరిగినా మూలవిగ్రహాలు వేరు, ఊరేగింపు విగ్రహాలు వేరు ఉంటాయి. కానీ పూరీ క్షేత్రంలో అలా కాకుండా  మూలవిగ్రహాలనే ఊరేగింపు చేస్తారు. కొత్త రాథాలపై మూల మూర్తులను చూడటం ఇక్కడే సాధ్యం. అందుకే పూరీ రథయాత్రకు ఇంత విశిష్టత ఏర్పడింది. ఆషాడ శుద్ధ విదియ రోజున సంవత్సరం నుండి మూలమూర్తిగా పూజలందుకుంటున్న జగన్నాథుణ్ణి, బలభద్రుణ్ణి, సుభద్రని గర్భాలయంలో నుండి బయటకు తీసుకుని వస్తారు. అథిత్యం గుండిచా వేదిక!! పూరీజగన్నాథ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుండిచా ఆలయం ఉంటుంది. ఇది పూరీ ఆలయాన్ని  నిర్మించిన ఇంద్రద్యుమ్నుడి భార్య గుండిచా కట్టించినది. పూరీ ప్రధాన గుంది నుండి మూడు కిలోమీటర్లు రథం మీద వెళ్లి గుండిచా ఆలయంలో రత్న సింహాసనం మీద కొలువవుతాడు జగన్నాథుడు. రథం ప్రత్యేకత!! అంతా ఎక్కువభాగం రథాల్లోనే ఉంది ప్రత్యేకత. రథం తయారీ కోసం 1072 వృక్ష భాగాలను పూరీకి తరలిస్తారు. అక్షయతృతీయ రోజు 125 మంది ఈ 1072 బాగాలను 2188 ముక్కలుగా చేస్తారు. వీటిలో 832 ముక్కలు జగన్నాధుడి రథం కోసం, 763 భాగాలు బలభద్రుడి రథం కోసం, మిగిలిన 593 భాగాలను సుభద్ర రథం కోసం కేటాయిస్తారు. వాటితో రథాలను తయారుచేయడం మొదలు పెడతారు. ఆషాడ పాడ్యమి నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుంది. జగన్నాధుడి రథం 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తుతో అన్నిటి కంటే పెద్దగా ఉంటుంది. ఎర్రటిచారలు ఉన్న పసుపు వస్త్రంతో దీన్ని కప్పుతారు. దీన్ని నందిఘోష అంటారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్ర రథాన్ని పద్మధ్వజం అని అంటారు. తిరుగు ప్రయాణం!! రథాల మీద ఊరేగుతూ గుండిచా ఆలయాన్ని చేరుకున్న ఆతరువాత వారం రోజుల పాటు అక్కడే గడుపుతారు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురూ, వారం రోజుల తరువాత దశమి రోజు తిరిగి పూరీ ప్రధాన ఆలయానికి వెళతారు. దశమి తరువాత ఏకాదశి రోజున స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. మళ్ళీ ద్వాదశి రోజున విగ్రహాలను తిరిగి గర్భగుడిలోకి తీసుకెళ్లిపోతారు. దీంతో రథయాత్ర ముగుస్తుంది. ఆసక్తికర విషయాలు!! జగన్నాథుని రథోత్సవం జరిగేటప్పుడు రథాన్ని లాగుతున్నప్పుడు రథానికి ఏ అడ్డు వచ్చినా దాని ప్రయాణం ఆగదు. మనుషులు రథం కింద పడినా వేరే ఇతర సమస్యలు వచ్చినా కూడా రథాన్ని ఆపరు.  రథాలను, మూలవిగ్రహాలను మొత్తం చెక్కతోనే తయారుచేస్తారు. ఇది ఎంతో విశిష్టమైన వేప చెట్ల నుండి తయారుచేస్తారు. చాలామంది రథానికి ఉపాయోగించే కలప గురించి, ప్రతి సంవత్సరం కొత్త రథాల గురించి వినగానే అన్ని చెట్లను నరికేస్తున్నారా అని కొంచెం వ్యతిరేకత చూపిస్తారు. కానీ నిజానికి రథాల కోసం ఎంతో ప్రత్యేకంగా వృక్షాలను పెంచుతారు. వాటినే రథాల కోసం వినియోగిస్తారు.  8, 11, 19 సంవత్సరాలకు ఒకసారి మూలమూర్తుల విగ్రహాలను కూడా మార్పులు చేస్తారు. కొత్త చెక్క విగ్రహాలను తయారుచేసి, పాత వాటిని శాస్త్రోక్తంగా ఖర్మకాండలు జరుపుతారు. మనిషి జనన మరణాలకు ఇది గొప్ప సందేశాన్ని ఇస్తుందని కొందరి అభిప్రాయం. ◆ వెంకటేష్ పువ్వాడ.

పైపై మెరుగుల కోసం పాకులాడితే

అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది.   ‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది.   ‘ సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు. అవన్నీ సరిదిద్దుతాను,’ అంటూ అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ‘ఈ తల చూసారా! మరీ మెడకి అంటుకుపోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా మరీ సన్నగా ఉందేమో అని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దురూ!’ అంది గుర్రం. ‘తథాస్తు! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునే సరికి ఈ లోపాలేవీ లేని సరికొత్త రూపం నీకు వస్తుంది,’ అన్నాడు భగవంతుడు.   మొదటి గుర్రం సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. ‘హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించుకోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణచాల్సిందే! అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ లక్షణాలనైతే కోరుకొందో... అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి,’ అని వేడుకుంది. ‘అయ్యో అదెంత భాగ్యం! అసలే నువ్వు దేవతా గుర్రానివి. నీ కోరికను తీర్చాల్సిందే! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు!’ అంటూ నవ్వాడు భగవంతుడు.   ఆ రాత్రి గుర్రాలకి సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడ తెల్లవారుతుందా... నిబిడీకృతమైన తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. ఎప్పుడో అర్ధరాత్రి వాటికి మాగన్నుగా నిద్రపట్టింది. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే... మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది!!!   తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి. ఆయనను చూస్తూనే ‘ఏమిటీ మాకీ అన్యాయం!’ అంటూ ఆక్రోశించాయి.   ‘మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే... ఎలాంటి నిస్సత్తువా దరిచేరకుండా బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాలని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది! కానీ మీరు పైపై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. ఇక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారుకొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి వస్తుంది. పోండి!,’ అనేశాడు భగవంతుడు. అదీ విషయం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

మీ తాళం చెవి ఎక్కడుంది??

టైటిల్ చూడగానే మన తాళం చెవి ఇంకెక్కడ ఉంటుంది మనదగ్గరే!! అనుకుంటున్నారా?? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.  సరే!! మీరు అనుకున్నట్టే మీ ఇంటి తాళం చెవో, లేదా మీ బీరువా తాళం చెవో, లేక మీ టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న మీ మొబైల్ కావచ్చు ఇలా ఇవన్నీ కూడా మీ ఆధీనంలో ఉన్నా వాటి తాళం చెవి లేదా వాటిని వాడటానికి  ఇతరుల అనుమతి తీసుకోవాలని ఇతరులు మీతో చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది??  నా వస్తువు నేను వాడుకోవడానికి ఇతరుల అనుమతి ఏంటి?? అని అనిపించవచ్చు కదా!! మరి వస్తువు మన సొంతమైనప్పుడు, దాన్ని మనం డబ్బు పెట్టి కొన్నప్పుడు దాని విషయంలో సర్వ హక్కులు మనకే ఉండాలన్నది సబబే!!  మరి అలాగే మీ జీవిత తాళం చెవి ఎక్కడుందో ఒక్కసారి గుర్తుచేసుకోండి ఇప్పుడు. జీవిత తాళం చెవి ఏమిటి విచిత్రంగా అనిపిస్తుందా??  అవును ఒక వస్తువు నాది అని చెప్పుకోవడానికి ఆ వస్తువు మీద సర్వ హక్కులను ప్రదర్శిస్తూ, నచ్చినట్టు వాడుతూ ఉంటారు కదా. మరి మీ జీవితం మీద మీరు పూర్తిగా హక్కు కలిగి ఉన్నారా అనే విషయం ఆలోచించండి మరి. ఇతరుల ప్రమేయం లేని జీవితాలు చాలా తక్కువ. ఎవరూ తమ జీవితాన్ని తాము సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం లేదు అనేదానికంటే ఇతరుల చేతుల్లో ఉంచి ముందుకు నడుస్తున్నారు అనుకోవడం మంచిదేమో కదా!! కాస్త ఆలోచించి చూస్తే అదే నిజమని నమ్ముతారు కూడా. ఇలా తమ జీవితం తమ కంట్రోల్ లో లేక ఇతరుల ప్రమేయంతో ముడిపడి, లేక సమాజంతో ముడిపడి, తమకేం  కావాలో తెలుసుకోకుండా సమాజానికి తగ్గట్టుగా ఉండటం ఉత్తమ వ్యక్తిత్వం అనుకుంటారు కానీ తమ జీవితంలో కోల్పోతున్నది చివరలో మాత్రమే అర్థమవుతుంది వాళ్లకు. అలాంటి వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రత్యేకత లేకుండా, ఎలాంటి సొంత అభిరుచులు, అభిప్రాయాలు లేకుండా ఒకానొక యంత్రంలా సాగుతూ ఉంటుంది.  ఒకటి చదవాలని ఇష్టం ఉంటుంది కానీ ఎవరో సలహా ఇస్తారు అదొద్దు ఇది చదువు అని, అలాగే అటువైపు వెళ్తారు. మరొకరు అలా ఉండకు ఇలా ఉండు అంటారు, ఇంకొకరు కుటుంబ విషయాలలో జోక్యం చేసుకుని సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. కొందరేమో అనుభవంతో చెబుతున్నాం అంటూ లెక్చర్  ఇస్తారు. ఇట్లా ఈ పరంపర కేవలం ఒక విషయంతోనో, ఒకరోజుతోనో ఆగిపోకుండా పూర్తిగా మనిషి మానసిక విషయాల్లో కూడా చొచ్చుకు వస్తుంది. ఎంతగా అంటే జీవితాల్లో జరిగే ప్రతిదానికి ఇతరులు ముందుకొచ్చి మాట్లాడేంతగా, ప్రతి విషయాన్ని ఇతరులు తమ చేతుల్లోకి తీసుకుని జడ్జ్ చేసేంతగా. ఇలా ఇంకొకరు మీ జీవితాన్ని కంట్రోల్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం?? మొబైల్ ఫోన్ ను అడగకుండా ఇతరులు తీసుకుని వాడతారనో, లేక అందులో కాస్త పర్సనల్ విషయాలు ఉంటాయనో ఫోన్ లాక్ పెట్టుకుంటున్న వాళ్ళం జీవిత తాళం చెవిని మాత్రం ఇతరుల చేతుల్లో అంత సులువుగా ఎందుకు పెట్టేస్తున్నాం?? ఎప్పుడైనా ఆలోచించారా??  కొలీగ్స్ ఏమనుకుంటారనో, పక్కింటి వాళ్ళు ఏదో అనుకుంటారనో, ఇతరులు విమర్శిస్తారనో ఇలా ఎన్నో కారణాల వల్ల జీవితాల్లో ఎంతో విలువైన విషయాల్లో కొన్ని నిర్ణయాలను మార్చేసుకుంటూ ఉంటారు చాలామంది. జీవితం అనేది సమాజ ఆమోద యోగ్యమైనదిగా లేకపోయినా పర్వాలేదు అని చెప్పడం లేదు ఇక్కడ. ఎవ్వరికీ నష్టం కలిగించనతవరకు ఎలాంటి సమస్య ఉండదు కదా!! ఇక్కడున్న చిక్కల్లా మరొకరి జీవితంలోకి దూరి వారి విషయాలను జడ్జ్ చేసేయడం అనే అత్యుత్సాహం మరియు తమ జీవితం కంటే ఇతరుల జీవితం గూర్చి ఉన్న కుతూహలం కూడా కారణం కావచ్చు. ఫలితంగా జరుగుతున్నది ఒకటే ఎవరి జీవితం ఆశించినట్టు లేకుండా గందరగోళంగా  సాగిపోతోంది. ఎందుకు ఈ గందరగోళం అంటే ఎవరికి తొందరగా సమాధానం బయటకు రాదు. కానీ, ఒక్కసారి కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది తమ జీవిత  నిర్ణయాలను తీసుకునే అవకాశం, తమకు లేకపోగా ఇతరుల చేతుల్లో నిర్ణయాలు జరిగిపోవడమే అని. అందుకే మరి జీవితాలు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా సాగాలి అంటే ఎవరి జీవిత తాళం చెవి వారిదగ్గరే ఉండాలి. తద్వారా ఎవరి సాధ్యాసాధ్యాలు వారికి తెలుస్తాయి. ఎవరి లక్ష్యాలు వారు సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు.  ఇప్పుడు ఆలోచించండి. మీ తాళం చెవి ఎక్కడుంది?? ఎక్కడున్నా సరే దాన్ని చేజిక్కించుకోవలసినది మీరే!! ఒకవేళ మరొకరి జీవిత తాళం చెవి మీ దగ్గర ఉంటే వారిది వారికి ఇచ్చేయండి. ఇవేమీ ఆర్థిక కార్యకలాపాలు కాదు, జీవితాలు అనే విషయం మర్చిపోకండి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

కాళిదాసు చమత్కారం!

మహాకవి కాళిదాసు గురించి అందరికీ తెలుసు. ఆయన అంత సుప్రసిద్ధుడు. శతాబ్దాల గడుస్తున్నా వన్నె తగ్గని కీర్తి ఆయనది.  సాధారణ విషయాలను కూడా ఎంతో చమత్కారంగా చెప్పడం, అడగడం ఆయనకే చెల్లింది అంటారు పండితులు.ఆయన కాలంలో జరిగిన ఒక ఆసక్తి కథనం ఇది. అది ధారా నగరంలో వారవనితల వీధి. ఆ వీధిలో ఒక రంగుటద్దాల మేడ! ఆ మేడ వసారాలో, పూసల తెరల వెనుక, పందొమ్మిదేళ్ళ పడుచుపిల్ల తూగుటుయ్యాలలో ఊగుతూ ఏవేవో శ్లోకాలు రాగయుక్తంగా వల్లె వేస్తోంది. అదే వీధి గుండా పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ భవభూతి, కాళిదాసు వెళ్తున్నారు. వాళ్ళు వీనుల విందుగా వినబడుతున్న ఆ స్వరానికి ఆకర్షితులై అటు వైపు చూసారు. తాంబూల చర్వణంతో ఎర్రగా పండిన ఆ అమ్మాయి అధరాలు చూడగానే వారిరువురికి తాంబూలం గుర్తుకువచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గరున్న తాంబూలపు పెట్టె తెరచి చూసారు. భవభూతి పెట్టెలో సున్నం అయిపోయింది.  అప్పుడు భవభూతి ఆ అమ్మాయిని ఉద్దేశించి, “తూర్ణమానీయతాం చూర్ణమ్ పూర్ణచంద్రనిభాననే” అని అడిగాడు. అనగా, “పున్నమి చంద్రునివంటి ముఖము గల ఓ సొగసరీ! కాసింత సున్నం తెచ్చిపెట్టు” అని అర్థం.  తరువాత కాళిదాసు తన పెట్టెలో తమలపాకులు కూడా లేకపోవడం చూసి, వెంటనే “వర్ణాని స్వర్ణపర్ణాని కర్ణంతాకీర్ణలోచనే” అంటూ శ్లోకాన్ని పూర్తి చేసేడు. అనగా, “చెంపకి చేరడేసి కళ్ళు గల ఓ చక్కని చుక్కా! పసిడివన్నె గల లేత తమలపాకులు కూడా ఇవ్వూ!” అని అర్థం. మహాకవులు వలె ఉన్న ఆ ఆగంతుకులని చూచి, చటుక్కున లేచి, అంజలి ఘటించి, వారిరువురికి కూర్చోవడానికి ఆసనాలు చూపించి, లోపలికి వెళ్లి ఆకులూ, వక్కలు, సున్నం ఉన్న వెండి పళ్లెం వారి ముందు ఉంచి, వినయము, విలాసము ఉట్టిపడుతూ ఉండగా మొదట కాళిదాసుకి తమలపాకులు, తరువాత భవభూతికి సున్నం అందించిందిట ఆ అమ్మాయి. ఈ ప్రవర్తన చూసి భవభూతికి కోపం వచ్చింది., “ఏమిటీ పక్షపాతం? సున్నం తెమ్మని ముందుగా అడిగింది నేను. తరువాత కదా కాళిదాసు ఆకులు అడిగింది? ఇదెక్కడి ధర్మం?” అని నిలదీసి అడిగేడట. దానికి ఆ అమ్మాయి సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో, “క్షమించాలి. పూజా వ్యతిక్రమం జరిగితే మన్నించాలి. సామాన్య ధర్మం మాట ఎలా ఉన్నా, మా వృత్తి ధర్మం ప్రకారం మిక్కిలి రొక్కము ఇచ్చినవారంటేనే మా కులంవారు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారు. తక్కినవాళ్లు తరువాతే!” అని గడుసుగా సమాధానం చెప్పిందిట! ఆ జవాబు విని ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి, సంవాద చాతుర్యానికి ముచ్చటపడి, కవులిద్దరూ ఆమెని మనసారా ఆశీర్వదించి, ముందుకి కదిలి వెళ్లిపోయారట! అదీ కథ!! పై విషయం చదివిన వాళ్లకు ఒక అనుమానం వస్తుంది. భవభూతి కాళిదాసు ఇద్దరూ ఆ అమ్మాయికి ఎలాంటి డబ్బూ ఇవ్వలేదు కదా మరి వాళ్ళు ఏమిచ్చారు?? ఎప్పుడిచ్చారు?? ఆ అమ్మాయి ఎప్పుడు తీసుకుంది?? అనే అనుమానాలు.  పైన శ్లోకంలో ఒక చమత్కారం ఉంది. అదే కథకి ఆయువుపట్టు. భవభూతి చెప్పిన శ్లోక పాదంలో తూర్ణ, చూర్ణ, పూర్ణ అనే మాటలలో మూడు “ణ” లు ఉన్నాయి. కాళిదాసు పూర్తి చేసిన పాదంలో వర్ణ, స్వర్ణ, పర్ణ, కర్ణ, అకీర్ణ అనే మాటలలో అయిదు “ణ” లు ఉన్నాయి. తెలుగువారు ణ అనే అక్షరాన్ని “అణా” అని ఉచ్చరిస్తారు: ట, ఠ, డ, ఢ, అణా. కానీ అణా అనేది ఒక నాణెం కూడా కదా! ఈ కోణంలో చూస్తే భవభూతి ముట్టజెప్పినది మూడు అణాలు, కాళిదాసు ఇచ్చినది అయిదు అణాలు అని మనం అన్వయించుకోవాలి.  ఇలా ఎన్నో చమత్కారాలతో కవుల కాలం అద్భుతంగా సాగిందని ఇలాంటి విషయాలతో అర్థమవుతుంది.                            ◆వెంకటేష్ పువ్వాడ.

రాక్ ఫెల్లర్ జీవితం చెప్పిన కథ ఇది!

ప్రపంచాన్ని డబ్బు శాసిస్తోంది. డబ్బు మనిషిని శాసిస్తోంది. కానీ మనిషి డబ్బు దగ్గర ఓడిపోతున్నాడు. నిజానికి మనిషి డబ్బును సంపాదించి తాను గెలిచాను అనుకుంటాడు.కానీ డబ్బు సంపాదిస్తే అది గెలుపు కాదు, డబ్బుకు లొంగకుండా జీవితాన్ని ఏ సమస్యా లేకుండా, వచ్చిన సమస్యలను అధిగమించినప్పుడే గెలిచినట్టు.  జాన్ డి రాక్‌ఫెల్లర్ ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోనే మొదటి బిలియనీర్ కూడా.  25 సంవత్సరాల వయస్సులో, అతను USలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకదానికి యజమాని అయ్యాడు. 31 సంవత్సరాల వయస్సులో, అతను ప్రపంచంలోనే చమురు శుద్దిచేసేవాళ్ళలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తరువాత  38 సంవత్సరాల వయస్సులో U.Sలో 90%  చమురును శుద్ధిచేసేవాడిగా గుర్తింపబడ్డాడు.  50 సంవత్సరాల వయసుకు దేశంలోనే అత్యంత ధనవంతుడుగా మారిపోయాడు.  ఈయన యువకుడిగా ఉన్నప్పుడు  ప్రతి నిర్ణయం, వైఖరి మరియు సంబంధం అతని వ్యక్తిగత శక్తిని మరియు సంపదను సృష్టించడానికి అనుగుణంగా ఉండేది. దానివల్ల అతను చమురు ఉత్పత్తి చేసే వ్యాపారంలో తనకంటూ ఓ గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేసుకోగలిగాడు. అయితే అంతా సవ్యంగా జరిగితే జీవితాల్లో వింతేముంది అన్నట్టు  ఈయన 53 ఏళ్ల వయసులో అనారోగ్యానికి గురయ్యారు. ఆ అనారోగ్య ప్రభావం వల్ల అతని శరీరం మొత్తం నొప్పితో నిండిపోయింది. ఆ నొప్పి తలుకూ ప్రభావాల వల్ల తన వెంట్రుకలను కోల్పోయాడు. దాని వల్ల పూర్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, తనకు కావాల్సింది ఏదైనా కొనగల వ్యక్తి కేవలం సూపులు మాత్రమే తాగి వాటిని మాత్రమే జీర్ణించుకునే స్థాయికి దిగజారిపోయాడు.  ఆ సమయంలో ఆయన స్నేహితుడు ఒకడు ఇలా అన్నాడు "రాక్ పెల్లర్  నిద్రపోలేడు, నవ్వలేడు. జీవితంలో అతనికి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు" అని. అతని దగ్గర వ్యక్తిగతంగా ఎంతో గొప్ప నైపుణ్యం కలిగిన  వైద్యులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆయనతో సంవత్సతంలోపు చనిపోవడం ఖాయం అని చెప్పారు.  ఆ సంవత్సరం చాలా నెమ్మదిగా గడిచిపోయింది. అతను మృత్యువుకు చేరువవుతుండగా అతనిలో ఆలోచనలు పెరిగాయి. చనిపోయిన తరువాత తన సంపదలో దేనినీ తనతో పాటు తీసుకెళ్లలేను అనే విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఆ తరువాత అతనిలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి.  ఒకరోజు ఉదయమే లేచి   "నా జీవితాన్ని నేను నియంత్రించుకోలేదు" అని అనుకున్నాడు.అప్పుడే అతనిలో ఒక ఆలోచన రూపు దిద్దుకుంది.  అతను తన న్యాయవాదులు, అకౌంటెంట్లు, మేనేజర్‌లను పిలిచి, తన ఆస్తులను హాస్పిటల్స్, రీసెర్చ్ మరియు ఛారిటీ వర్క్‌లకు పంపాలనుకుంటున్నట్లు ప్రకటించాడు. జాన్ డి. రాక్‌ఫెల్లర్ తన ఫౌండేషన్‌ని స్థాపించాడు. ఈ కొత్త దిశ చివరికి పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణకు దారితీసింది, మలేరియా, క్షయ మరియు డిఫ్తీరియాకు నివారణల నివారణకు పెన్సిలిన్ ఎంతగానో సహాయపడింది  రాక్‌ఫెల్లర్ జీవితంలో అత్యంత అద్భుతమైన విషయం ఒకటుంది. అదేమిటంటే అతను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని అందరికీ పంచడం మొదలుపెట్టిన తరువాత అతని శరీరం మందులకు పాజిటివ్ గా స్పందించడం మొదలుపెట్టింది. ఫలితంగా అతనిలో అనారోగ్యం క్రమంగా తగ్గిపోయి సాధారణస్థితికి చేరుకున్నాడు.   53 సంవత్సరాల వయస్సులో చనిపోవాల్సిన వ్యక్తి ఆశ్చర్యంగా 98 సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతను తన జీవితంలో కృతజ్ఞత అనే విషయన్ని ఎప్పటికీ వదలకుండా తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని సామాజిక సేవ కోసం వినియోగించారు.పూర్తిగా కొలుకున్న తరువాత ఆయన తన సంపాదన మొత్తాన్ని  దానం చేయడానికే నిర్ణయించుకున్నాడు.  ఆయనఆ తన మరణానికి ముందు తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు.  “అన్నీ అతనికే చెందుతాయి, నేను అతని కోరికలను నెరవేర్చడానికి ఎంపికను మాత్రమే. ఒక తెలుయని శక్తి నాలో చోటుచేసుకున్న కొత్త ఆలోచనలు, జీవితంలో కొత్త మలుపులకు కారణం అయ్యింది" "నా జీవితం ఒక సుదీర్ఘమైన, సంతోషకరమైన సెలవుదినం. పూర్తి పని, పూర్తి ఆటతో నేను ఆందోళనను దారిలో వదిలిపెట్టాను. దేవుడు తో ప్రతిరోజూ నాకు మంచిరోజు.” అని. పై విషయం అంత తెలుసుకుంటే మనిషి తన జీవితంలో సంపాదించే దాంట్లో కొంత భాగాన్ని దానం చేయడం వల్ల కూడా జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. అవి అద్బుతాలు చేస్తాయని అర్థమవుతుంది. ◆వెంకటేష్ పువ్వాడ.

క్రాక్ చెయ్యాలంటే కొన్ని తెలియాలి!

గ్రాండ్స్ గోల్స్ అంటే చాలామంది మనసులో ఐ.ఏ.యస్, ఐ.పి.యస్ వంటి ఉద్యోగాల పేర్లు ఉండిపోతాయి. నిజానికి అవి ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు కూడా. ప్రభుత్వం స్వయంగా ఎంపిక చేసే ఈ వర్గాలలో ఉద్యోగం సంపాదించడం చాలామంది కల. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను స్ఫూర్తిగా తీసుకుంటూ ఆ కలను నెరవేర్చుకోవాలని అనుకునేవాళ్ళు చాలామంది ఉంటారు కూడా. అయితే సాధారణ గ్రామీణ ప్రాంతాల వ్యక్తులు కూడా ఈ వైపు సక్సెస్ అవ్వాలంటే అందరూ తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది.  సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో నివసించేవాళ్లకు డిగ్రీ అయిపోయాక ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరడం తప్పనిసరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులు కారణంగా అలా చేస్తారు.  ఓ  మధ్యతరగతి వ్యక్తికి ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపేర్ అవ్వడం సరైనదేనా అనే విషయం ఆలోచించినప్పుడు కొన్ని విషయాలు ముక్కుసూటిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడే మొదలు పెట్టినట్లైతే.. మొదలు పెట్టిన పని పూర్తి చేయడం  అనేది వయసు మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఇంటర్, డిగ్రీ, ఎం.ఏ, ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వాళ్లకు అటు ఇటుగా సుమారు పాతిక సంవత్సరాల వయసు ఉండే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ వైపు ఆలోచనలు కూడా దాదాపుగా 22-25 సంవత్సరాల వయసు వారికే ఎక్కువ ఉంటుంది కూడా. చాలామంది ప్రాక్టీకల్ గా ఆలోచించలేక నోటి లెక్కలు వేసుకుని పాతిక సంవత్సరాల వయసులో నిర్ణయం తీసుకుని ర్యాంకులు కొడతాము అనుకుంటారు. అయితే అక్కడే ఒక తప్పు జరిగిపోతుంది.  చాలా మంది జాబ్ కొట్టిన వాళ్ళు, ఐ.ఏ.యస్, ఐ.పి.యస్ క్లియర్ చేసినవాళ్ళు వల్ల ఫ్యామిలీ ఇంకా స్నేహితులు మీడియా ముందు ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. వాటిలో చాలామంది జాబ్ చేసుకుంటూ రాత్రి పగలు కష్టపడి చదివేసి, నిజాయితీగా ఉంటూ ప్రిపేర్ అయినట్టు చెబుతారు. అయితే వాటిలో నిజం చాలా తక్కువగా ఉంటుంది.ఆ మాటలు అన్నీ బాగా షేక్ చేసిన కూల్ డ్రింక్ బాటల్ ఓపెన్ చేయగానే ఎలాగైనా బుస్సు మని పొంగుతుందో అలాంటివే. సినిమాటిక్ గా జరిగే వాటికి రియాలిటికి ఉన్న తేడాను అందరూ అర్థం చేసుకోవాలి.  ఐ.ఏ.యస్, ఐ.పి.యస్  పరీక్షలు నెగ్గాలంటే కొన్ని లక్షణాలుండాలి. అవి కొన్ని పుట్టుకతోనూ ఉంటయి, మరికొన్ని  పెంపకం తో వస్తాయి.కొన్ని ఏం చేసినా రావు. ఓ స్థిర నిర్ణయం!! ఏ పని అయినా సరే చేయాలా వద్దా అనేదానికోసం ఒక స్థిరనిర్ణయం ముఖ్యం. అలాగే దేనికి ఇంపోర్టెన్స్ ఇవ్వాలనే విషయం కూడా ముఖ్యమే. ఇద్దరు వ్యక్తులు సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. వాళ్లలో ఒకడికిజాబ్ కొట్టాలి అంటే దేశభక్తి ఎక్కువ ఉండాలి, సమాజాసేవ బాగా చేసే గుణం ఉండాలి అనుకుని చదువుకుంటూ సమాజాసేవ కార్యక్రమాలకు అటెండ్ అవుతాడు, ఇంకొకడు అన్ని వదిలేసి సివిల్స్ కు చదువుతూ ఉంటాడు. ఉన్న సమయంలో తాను చేరాలనుకున్నా లక్ష్యం గురించి ఆలోచించేవాడే దాన్ని చేరగలడు. అందుకే కేవలం బాగా చదువుకున్న వాడే ఆ లక్ష్యాన్ని చేరగలిగాడు. ప్రిపేరేషన్ మీద ఒక స్థిరనిర్ణయంతో ఉండాలి. కష్టం!! కష్టం అందరూ చేస్తారు కానీ పది లక్షలమంది పోటీదారులు నుండి కేవలం 180 మాత్రమే ఎంపిక అవుతారు. మరి మిగిలిన వాళ్ళు చదవలేదనా?? కానీ కాదు కాబట్టి  కష్టం చేసినంత మాత్రాన ఫలితం దక్కాలనే రూల్ లేదు. దాదాపు పది సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి, ఆరు అట్టెంప్ట్ ల తర్వాత ఒక్క మార్కుతో క్లియర్ కాని వాళ్ళెందరో ఉన్నారు. పర్ఫెక్ట్ మార్గం!! కొందరికి కుటుంబం లో, కాలేజీ లో గైడెన్స్ దొరుకుతుంది. లేకపోతే కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా ఉండనే ఉన్నాయి. ఇంకా ఇప్పటి టెక్నాలజీ వల్ల ఆన్లైన్ లో చూసి నేర్చుకోవచ్చు. కానీ కోచింగ్ తీసుకునేవాళ్లకు సమయం కలిసొస్తుంది. అంటే ఇక్క టైమ్ మేనేజ్మెంట్ ఎంతో ముఖ్యం. కోచింగ్ వల్ల అందరికీ లభించేది అదే. అలాగే పర్ఫెక్ట్ గా ఏమి చదవాలి అనే విషయం గురించి క్లారిటీ ఉండాలి కూడా. అవగాహన లేకుండా అనవసరమైన విషయాలు చదువుతూ ఉంటే ఎప్పటికీ చదవాల్సిన విషయాలను సగం కూడా క్లియర్ చెయ్యలేరు.  ఆప్షన్స్!! సాదారణంగా ఇలాంటి పెద్ద పెద్ద లక్ష్యాలకు ఎలాంటి ఇతర ఒత్తిడి ఉండకూడదు. అది ఇంటి పని కావచ్చు, ఇతర ఉద్యోగం కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఇతర చదువులు కావచ్చు. ఇవన్నీ చేస్తూ ప్రిపేరేషన్ అంటే నెలలు, సంవత్సరాల కొద్దీ అయ్యేదేనా అనే విషయం కొంచెం ఆలోచించుకోవాలి. సంవత్సరాల కొద్దీ చదివినా తరగని  నిదిలా ఉండే ఆ సిలబస్ లను కవర్ చేయాలంటే పూర్తి సమయాన్ని దానికి ఇచ్చేయ్యాలి.  వేగంగా రాసినా అందంగా ఉండే దస్తూరి, ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, అదృష్టం.. ఇవి ఒకదానికి ఒకటి లింక్ అయి జటాయి.  ప్రశాంతంగా ఉండాలంటే ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వంటివి ఉండకూడదు. ప్రిపేరేషన్ మొదలు పెడితే, ప్రేపరషన్ కి1.5 సంవత్సరం, పరీక్షకి 1 సంవత్సరం. ఒక అట్టెంప్ట్ కి రెండున్నర సంవత్సరాలు పెట్టాలి. వీటన్నింటినీ లెక్కేసుకుంటే సగటు మధ్యతరగతి వ్యక్తికి 5 సంవత్సరాలు ఇక్కడ అయిపోతాయి. అంటే 25 నుండి 30 కి జంప్ అవుతారు. సీరియస్ గా చేసే అటెంప్ట్ లో మానసిక ఒత్తిడి చాలా ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూ బాధ్యతగా ఉంటూ మానసిక ఒత్తిడి భరిస్తూ చదవడం కుదిరేపనేనా??  22 కల్లా ఐఏఎస్ అయినవాడు 16 ఏట నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తాడు. బయటికి చెప్పరు అంతే.  ఒకసారి హైదరాబాద్ లో ఐ.ఏ.యస్ కోచింగ్ అకాడమీకి వెళ్తే అక్కడ కోచింగ్ తీసుకుంటున్న అవల్లలో ఇంటర్ పిల్లకాయలు కూడా కనబడి ఆశ్చర్యపోయేట్టు చేస్తారు. అంటే ఇదంతా డిగ్రీ అయిపోయాకనో, ఎం.ఏ అయిపోయాకనో మొదలుపెట్టే పని కానే కాదు.  ఉద్యోగం చేస్తూ క్లియర్ చేసినవాళ్లకు ఒక ఆప్షన్ ఉంటుంది. క్లియర్ కాకపోయినా ఒక జాబ్ అంటూ ఉంది కదా అనే నిశ్చింత. అది లేకుంటే ఒకసారి అటెంప్ట్ కు టోటల్ గా 5 సంవత్సరాలు నష్టపోయి వేరే ఉద్యోగాల విషయంలో కూడా వెనుకబడిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో పెద్ద లక్ష్యాలు చేరాలంటే చాలా తొందరగా వాటి కోసం కసరత్తు చేయాలి. అలాగని ఇప్పుడు ఆశ వదిలేసుకోమని కాదు. ఏమో అదృష్టమనే ఆప్షన్ కూడా ఉంటుంది.                                ◆వెంకటేష్ పువ్వాడ.

శరణుజొచ్చినవాడికి అభయమిద్దాం!

సాకారుడైన హరి శరణుజొచ్చిన చాలు అంటాడు అన్నమయ్య తన కీర్తనలో. హరి అంటే విష్ణువు అని అర్థం. ఆ మహావిష్ణువును శరణు కోరితే, ప్రార్థిస్తే ఆయన సమస్యలను పరిష్కరిస్తాడు అని అర్థం. బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి అనేది అందరికీ తెలిసిన మాట. బుద్ధుడికి లొంగిపోవడం, సంఘానికి లొంగిపోవడం, ధర్మానికి లొంగిపోవడం అనేవి అర్థాలు. బుద్ధుడు చెప్పిన విషయాలు అన్నీ సమాజాన్ని మార్చే శక్తివంతమైన వాక్యాలు. అహింసను పాటించడం, దుఃఖాన్ని జయించడం, కోర్కెలను జయించడం ప్రశాంతమైన జీవితాన్ని గడపడం ఇవన్నీ. కానీ ఇవి ఎలా సాధ్యం అంటే హింస లేనప్పుడు, స్వేచ్ఛగా బతకగలిగినపుడు.  ఎక్కడైతే హింస చోటు చేసుకుంటుందో, అక్కడ మానవ జీవితాలు ప్రభావితం అవుతాయి. సమస్యలు చిన్నగా మొదలై స్వేచ్ఛ కోల్పోవడం దగ్గర నుండి చివరకి తిండి దొరడం కష్టమయ్యి, ప్రాణహాని సంభవించేవరకు దారితీస్తుంటాయి. అలాంటి వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఇంకొకరి సహాయం కోసం ఎదురుచూడటం లేదా ఎక్కడైనా కాసింత తిండి, ఉండటానికి షెల్డర్ దొరుకుతుందేమో అని ఉన్న ప్రాంతాన్ని వదిలి మరొకచోటుకు వెళ్లిపోవడం చేస్తుంటారు. ఇలా కష్టసమయంలో ఒకచోటి నుండి మరొకచోటుకు సహాయం కోసం వలస వెళ్లే వాళ్ళను శరణార్థులు అంటారు.  ఉద్యోగాల కోసం, బ్రతుకు తెరువు కోసం ఒక ప్రాంతం  నుండి మరొకప్రాంతనికి  వెళ్ళేవాళ్ళు వలసదారులు అయితే, సర్వం కోల్పోయి సహాయం కోరుతూ వెళ్లేవాళ్ళు శరణార్థులు అనబడతారు. ప్రశ్నార్థక జీవితాలు! తినడానికి తిండి, ఉండటానికి నివాసం, కాసింత ప్రాణ రక్షణ, కొద్దిగా స్వేచ్ఛ ఉంటే ఎవరూ ఉన్న ప్రాంతాలను వదిలి వెళ్లిపోరు. ముఖ్యంగా కొందరు కష్టపడి సంపాదించుకుని భూములు కొని, ఇళ్ళు కట్టుకుని, స్థిరస్థులను పొగుచేసుకుని ఎంతో చక్కగా ఉంటారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఉన్న ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయి పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా యుద్ధాలు జరిగే ప్రాంతాలలో, కరువులు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినపుడు బాధిత ప్రాంతాలలో నష్టం చాలా ఘోరంగా ఉంటుంది. అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. ఒక్కసారిగా నిర్వాసితులు అయిపోతారు. అలాంటి వీళ్ళు సహాయం దొరుకుతుందనే ఆశతో వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రభుత్వాలు అలాంటి వాళ్ళను తరలించి ప్రభుత్వ సంరక్షణ హొమ్స్ లో కొద్దిరోజుల పాటు ఉంచుకుంటారు. కానీ జీవితంలో మళ్ళీ ఏదో ఒక అడుగు ముందుకు వెయ్యాలి కదా సొంతంగా ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతుకు బండి నెట్టుకురావాలి. కానీ అలాంటి వాళ్లకు కొన్నిచోట్ల తగినంత ఆదరణ లభించదు.  అపన్నహస్తం! హిందువులు అయినా, ముస్లింలు అయినా ఇతర వర్గాల వాళ్ళు అయినా వాళ్ళ వాళ్ళ మతాలలో ఉన్న ముఖ్యసారం ఇతరులను ఆదుకోవడం, ఇతరులకు సహాయం చేయడం , ఇతరుల పట్ల ప్రేమ, అభిమానం, జాలి, కరుణ వంటివి కలిగి ఉండటమే అనే ముఖ్య విషయం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్ననాడు ఇతరుల విషయంలో మానవత్వాన్ని కలిగి ఉంటాడు. నాకెందుకులే సమస్య నాది కాదు కదా అనే స్వార్థబుద్దిని ఎప్పుడూ ప్రదర్శించడు. మన చుట్టూనే! ఒకప్పుడు గొప్పగా బ్రతికిన వాళ్ళు పరిస్థితుల ప్రభావం వల్ల సర్వం కోల్పోయి నిస్సహాయతతో బ్రతికిస్తూ ఉంటారు. గుడులు, రైల్వే స్టేషన్ లు, బస్టాండ్ లు, చుట్టూ ఉన్న ప్రాంతాలలో బయటకు అడగలేని వ్యక్తిత్వంతో కూడా ఉంటారు. మరికొందరు ఎక్కడినుంచో వలస వచ్చి కష్టాలు పడుతూ ఉంటారు. ప్రభుత్వాలు, స్వచ్చంధసంస్థలు చేసేవి ఎవరికీ పూర్తిగా భరోసాను ఇవ్వలేవు. అందుకే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి శరణార్ధుల విషయంలో బాధ్యతగా ఉండాలి. శరణుజొచ్చినవాడు శత్రువు అయినా వాడిని ఆదుకోవాలని చెబుతుంది మన భారతీయ సంస్కారపు సంస్కృతి. ఎన్నెన్నో దేశాల నుండి భారతదేశానికి శరణంటూ వచ్చి ఇక్కడే ఉన్న విదేశీయులు ఎందరో ఉన్నారు. పక్కదేశాలకు మన దేశం ఆవాసం కల్పించినప్పుడు మన పక్కవాడికి కష్టం వస్తే మనం తోచిన సహాయం చేయలేమా?? ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి సుమారు 20 మంది తమ స్వంత ప్రాంతాలను వదులుకుని ఇతర ప్రాంతాలకు సహయాలకోసం తరలివెళ్లిపోతున్నారు. వీళ్ళలో ఎక్కువ బాగం  చిన్నపిల్లలు, మహిళలే ఉంటున్నారు. ఇలాంటి  వాళ్ళను ఆదుకోవడం ప్రతిఒక్కరి బాద్యతనే కదా!!                                ◆వెంకటేష్ పువ్వాడ.

జోక్యం చేసుకుంటే జోక్ అయిపోతారు!

స్నేహితులు, చుట్టాలు, ఇరుగు పొరుగు, ఆత్మీయంగా ఉండేవాళ్ళు, సహోద్యోగులు ఇలా మన లైఫ్ లో చాలామంది ఉంటారు. వీళ్ళందరిలో కొందరు కేవలం తెలిసిన వాళ్ళలా ఉండిపోతే మరికొందరు చాలా సన్నిహితులు అవుతారు. దగ్గరితనం వల్లనో లేక వయసులో అవతలి వాళ్ళకంటే  కాస్త పెద్దవాళ్ళం అవడం వల్లనో మొత్తానికి కారణం ఏదైనా వాళ్ళ లైఫ్ లో కొన్ని ముఖ్యమైన విషయాలు, వాటిలో వాళ్ళ సమస్యలు చెప్పి సలహాలు అడుగుతూ ఉంటారు. అయితే విన్నవాళ్ళు తోచిన సలహా ఏదో ఇస్తూ ఉంటారు. మరికొందరు అత్యుత్సాహంతో సాధ్యం కాని సలహాలను సొల్యూషన్ గా సజెస్ట్ చేస్తుంటారు. అయితే ఇలా ఇతరులు అడిగితేనో లేక సాన్నిత్యం ఉందనే అనే కారణంతోనో సలహాలు ఇచ్చేస్తే ఆ తరువాత ఎదుటివారి దృష్టిలో మీ పట్ల ఉన్న అభిప్రాయాలు మారిపోతాయి. ఎందుకని? జీవితంలో సమస్యలు, సందేహాలు అనేవి సహజమే. వాటి సొల్యూషన్ కోసం చాలామంది తమకు సన్నిహితులుగా  ఉన్నవారిని అడుగుతూ ఉంటారు. అయితే ప్రతి విషయం ఆ వ్యక్తి మానసిక, ఆర్థిక, సామాజిక స్థితికి తగ్గట్టు ఎక్కువ ప్రభావవంతంగానూ ఉండచ్చు, సాధారణంగానూ ఉండచ్చు. ముఖ్యంగా వాటిని మోసేవాళ్లకే ఆ సమస్యల బరువు వాటి తాలూకూ ఎమోషన్స్ స్పష్టంగా తెలుస్తాయి. కానీ సలహా అడిగారు కదా అని బుర్రకు తోచిన ఐడియా ఇచ్చేస్తే అది ఆచరణలోకి వచ్చేసరికి ఇంకా పెద్ద ప్రాబ్లెమ్ తెచ్చి పెట్టడం లేదా ఏదైనా నష్టాన్ని కలిగించడం వంటి వాటికి కారణం కావచ్చు. అసలే సమస్యతో ఏడుస్తున్నవాళ్లకు పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ ఎదురయ్యే సమస్య ఇంకా ఎక్కువ ఇర్రిటేషన్ తెప్పించి చెత్త సలహా ఇచ్చి సచ్చారు అనే మాట ఇన్నర్ వాయిస్ గా దొర్లిపోతుంది అవతలి వాళ్లకు.  మరేం చెయ్యాలి? ఎవరైన ఏదైనా చెప్పుకుని సలహా లేదా సొల్యూషన్ అడిగినప్పుడు అవగాహన గనుక ఉంటే వాళ్ళ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి, దాన్ని అన్ని కోణాల నుండి ఎలా చూడాలి, దానికి కారణం ఏంటి?? దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు వంటి విషయాలను మాత్రం చెప్పాలి. అవన్నీ చెప్పిన తరువాత వాళ్ళకే అర్థం అయిపోతుంది ప్రాబ్లెమ్ లో ఉన్న మెయిన్ రీసన్ ఏంటి దానికి ఏమి చెయ్యాలి అనేది.  ఫోర్స్ చేయద్దు! బాగా పరిచయం ఉన్నవాళ్లు, ఎంతో సన్నిహితంగా ఉన్నవాళ్లు వాళ్ళ సమస్యను షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకు ఎంతో ఇష్టం లేక అభిమానం అయి ఉంటే అలా చేసుకో ఇలా చేసుకో ఇదే కరెక్ట్, ఇలాగైతేనే బాగుంటుంది అంటూ ఒకటే చెప్పేస్తూ ఉంటారు. ఇంకా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటే గనుక చెప్పినట్టు వినూ, తం వేస్ట్ చేసుకోకు, తరువాత లాస్ అవుతావు అని కూడా చెబుతూ ఉంటారు. అయితే ప్రతి మనిషికి సమస్యలో ఉన్నప్పుడు ఒక స్టెప్ వేయడానికి సొంతంగా ఒక క్లీయరెన్స్ అనేది ఎంతో ముఖ్యం. అది లేకుండా వేసే స్టెప్ వల్ల ఎదుటివారిని దానికి బాధ్యులుగా చేసేస్తారు. కాబట్టి ఎవరి సమస్యనూ చేతుల్లోకి తీసుకుని వాళ్ళను ఫోర్స్ చేయద్దు. తోడుగా ఉండాలి తేడాగా కాదు! కొందరు సమస్యలు చెప్పినప్పుడు అది ఎంతో సిల్లిగానూ, కామెడిగానూ అనిపిస్తుంది. అలాంటి వాటిని గురించి బాగా నవ్వేసి ఆ తరువాత ఎదో చెత్త సలహా ఒకటి పడేసి వేరే పనుల్లోకి వెళ్లిపోతుంటారు. అయితే సమస్య ఎంతో ఇబ్బంది పెట్టేది అయితే తప్ప మనతో చెప్పుకునేవాళ్ళు అంత ఎమోషన్ అవ్వరు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సమస్యకు సలహా ఇవ్వకపోయినా పర్లేదు కానీ హేళన చేయడం అనేది చాలా తప్పు. దానివల్ల మరింత మానసిక బాధ అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోవాలి. సమస్యకు సలహా ఇవ్వకపోయినా పర్లేదు కానీ హేళన చేయడం అనేది చాలా తప్పు. దానివల్ల మరింత మానసిక బాధ అనుభవిస్తారు.  కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే మీరు జోక్ అయిపోతారు.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

వెలిగే సూర్యుడు నాన్న!

సూర్యుడు ఈ సృష్టికి వెలుగు పంచేవాడు. ఉదయాన్నే లేలేత ఎండతోనూ, మధ్యాహ్నం భగభగ మండే ఎండతోనూ, సాయంత్రానికి చల్లబడి మెల్లిగా తన ప్రతాపం తగ్గిస్తూ ఉంటాడు. కానీ సూర్యుడు రాత్రి పూట కూడా తన పని తాను చేస్తూ ఉంటాడు. అయితే అది మనకు కనిపించదు. దాన్ని చీకటని, రాత్రి అని, ఇంకా వేరే వేరే పేర్లు పెట్టుకుంటాము. ఈ భూమండలం పెద్దది కాబట్టి సూర్యుడు మరొకవైపుకు వెళ్ళినప్పుడు ఆ వెలుగు మనకు కనిపించదు. బహుశా దీన్ని అవతలి కోణం అని కూడా అనచ్చేమో. ఇప్పుడు సూర్యుడి గురించి ఎందుకు?? అని అందరికీ సందేహం వస్తుందేమో కానీ మన ఇంట్లో నాన్న కూడా సూర్యుడి లాంటివాడే. నాన్న ప్రేమ ఉదయాన్నే సూర్యుడి వెలుగులా ఉంటుంది. నాన్న కోపం మధ్యాహ్నపు ఎండలా ఉంటుంది. నాన్న కష్టం అస్తమిస్తున్న సూర్యుడిలా నిశ్శబ్దంగా ఉంటుంది. నాన్న ఓర్పు ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగే సూర్యుడి గమనంలా ఉంటుంది.  నాన్నంటే!! నాన్నంటే ఓ ధైర్యం, ఓ భరోసా, ఇంట్లో అందరి అవసరాలు తీరుస్తూ అందరి బాధ్యత మోస్తూ నిత్యం వెలిగే సూర్యుడి లాంటి వాడు నాన్న. అమ్మను అమ్మ ప్రేమను ఎప్పుడూ బయట పెడుతూ ఉంటాము. అమ్మను దేవతతో పోల్చి గొప్పగా పొగుడుతూ ఉంటాము. కానీ నాన్న విషయంలో మాత్రం అంతగా బయటకు చెప్పము. నాన్న ఎంత గొప్ప వాడు అయినా పిల్లల ముందు ఓడిపోవడానికే ఇష్టపడతాడు. అమ్మ ప్రేమ అమ్మ త్యాగం ఎప్పటికప్పుడు బయటకు కనిపించేవి అయితే నాన్న ప్రేమ, నాన్న త్యాగం కనిపించని ప్రాణవాయువు లాంటివి. గాలి కంటికి కనిపించదు కానీ అది లేకుంటే సమస్ధానికి మరణమే గతి. అలాగే నాన్న ప్రేమ, నాన్న త్యాగం బయటకు కనిపించవు కానీ నాన్న లేకుంటే ఏ కుటుంబం నిశ్చింతగా ఉండదు. నాన్న ఎందుకో చిన్నబోయాడు!! అమ్మ నవమాసాలు మోస్తుంది, నొప్పులు భరించి బిడ్డలకు జన్మనిస్తుంది. పాలిస్తుంది,. తన కొంగు వెనుక దాచుకుని పెంచుతుంది. ఇల్లాలకు ఏదైనా అవసరం వస్తే మొదట అమ్మ దగ్గరకే వెళ్తారు, బడి వయసు వచ్చేదాకా అమ్మ చేతుల్లోనే ఉంటారు పిల్లలు. అందుకే అమ్మకు దగ్గరగా ఉంటారు. నాన్నంటే అదొక భయం. ఉదయం లేచి ఏదో తిని, క్యారియర్ లో కట్టుకుని ఉద్యోగానికి వెళ్ళిపోయి ఎప్పుడో సాయంత్రం చీకటిపడే ముందు నాన్న ఇంటికి చేరుకుంటాడు. పాపం తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డల్ని ప్రేమగా ఎత్తుకోవాలని, ముద్దాడాలని అనుకుంటాడు. కానీ ఇంట్లో పిల్లలు అలసిపోయి అన్నం తిని నిద్రపోతూ ఉంటారు. చిన్న పిల్లలు అంటే నిద్రలోనే ఎక్కువ గడుపుతారు. పిల్లలు కొంచెం పెద్దయ్యాక వాళ్ళు బడికి అలవాటు పడ్డాక, నాన్నలో ఆశ మొలకేస్తుంది. నా బిడ్డ మంచి స్థాయికి చేరుకోవాలి అని. అందుకే బాగా చదువుకోవాలని, మంచి మార్కులు రావాలని కొప్పడతాడు, అప్పుడప్పుడూ దెబ్బ వేస్తాడు. కోపం వెనుక, దెబ్బల వెనుక ప్రేమను అర్థం చేసుకోవడం మనవల్ల కాదప్పుడు. అందుకే అందరి మనసుల్లో నాన్న ఒక విలన్ లాగా ముద్రించుకుపోయి వెనుకబడ్డాడు. అన్ని విషయాల మెజ్నదు ప్రాధాన్యత లేని వ్యక్తిలా కనిపిస్తాడు. నాన్నకు ఒక ఉత్తరం!! ఓ పాతికేళ్ల వ్యక్తితో తన తండ్రికి ఉత్తరం రాయమంటే ఏమి రాయాలి అనే నిర్లక్ష్య సమాధానం వస్తుందేమో, కానీ తండ్రి స్థానానికి మారిన తరువాత అదే వ్యక్తితో ఉత్తరం రాయమని చెబితే తప్పకుండా ఎంతో బావిద్వేగంతో కూడుకున్న ఉత్తరం రాస్తాడు. అవును మరి బాధ్యత మీద పడితే తప్ప నాన్న సంఘర్షణ, నాన్న ప్రేమ, నాన్న ఆరాటం, నాన్న ఆశ, నాన్న త్యాగం ఇవ్వేమీ తెలిసిరావు.  ఎప్పుడూ అమ్మ అమ్మ అమ్మ అని అమ్మకోసమే కాదు ఆకాశమంత వ్యక్తిత్వం కలిగి, నిశ్శబ్దంగా తన పిల్లలకోసం తలవంచే నాన్న కోసం కూడా కొద్దిగా సమయం కేటాయించండి. అమ్మ అనే పదాన్ని కలుపుకున్నంత సులభంగా నాన్న అనే పదాన్ని కలుపుకోలేం మరి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి!

ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి అంటారు పల్లె ప్రజలు. అరుద్రలో పడే వాన అమృతంతో సమానమని వ్యవసాయదారులు భావిస్తారు. మృగశిర కార్తెలో వర్షాల కదలిక మొదలైతే ఆరుద్ర కార్తెలో ఆ వర్షాలు ఇంకొంచెం పుంజుకుంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే భూమి పుష్కలంగా తడిసి రైతులు వారి నాట్లు, జొన్న, మొక్కజొన్న, ప్రతి వంటి పంటల సాగుకు ఇక నడుం కట్టినట్టే. వ్యవసాయంలో ఎంతో ముఖ్యమైన అంశం అయిన మార్పులు చోటుచేసుకునే కాలాన్ని వ్యవసాయ పంచాంగంలో ఆరుద్ర కార్తె అని పిలుస్తారు.  ఆరుద్ర పురుగు! వ్యవసాయదారులకు ఈ ఆరుద్ర కార్తెలో కనిపించే గొప్ప అతిథి ఆరుద్ర పురుగు. ఎరుపు రంగులో వెల్వెట్ క్లాత్ చుట్టుకుని ఉందా అన్నట్టుగా కనిపించే ఈ ఆరుద్ర పురుగు పంట పొలాల్లో, వ్యవసాయ భూముల్లో కనిపిస్తే ఇక రైతులు తమ పని గట్టిగా ముందుకు లాగాల్సిందే అని సోఇచన ఇచ్చినట్టు అంట. వ్యవసాయం, వాతావరణ పరిస్థితుల మీద గొప్ప అవగాహన ఉన్న వాళ్లకు ప్రకృతి మార్పులను అనుసరించి ఎప్పుడు ఏ పని చేయాలి అనేది బాగా అర్థమయ్యేది. దాన్ని అనుసరించి మంచి పంటలు సాగుచేసి పుష్కలమైన దిగుబడి సాధించేవాళ్ళు. వ్యవసాయదారుల నేస్తం అయిన ఈ ఆరుద్ర పురుగు కేవలం సంవత్సరంలో ఒక్కసారి, ఆరుద్ర కార్తె సమయంలో మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఆరుద్ర పురుగును చూసి నాట్లు వేయడానికి కదిలిపోవచ్చు రైతన్నలు. చాలామంది ఎవరైనా కనిపించడం తగ్గిపోయినప్పుడు, చాలారోజులు దూరంగా వెళ్ళినప్పుడు చాలా నల్లపూస అయిపోయావు, ఆరుద్రపురుగులాగా అంటూ ఉంటారు. దాని అర్థం ఆరుద్ర పురుగు కూడా సంవత్సరంలో ఒకసారి మాత్రమే కనబడుతుంది అని, అలా చాలా బిజీ అయిపోయి బొత్తిగా కనబడటం లేదని అర్థం. ఆరుద్ర కార్తెలో కోలాహలం! ఆరుద్ర కార్తెలో రైతన్నలు కోలాహలం చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పంటలు వేసేవాళ్ళు చాలా హడావిడిగా కనిపిస్తారు. వరి పంట వేసేవాళ్ళు నారుమళ్లలో అంతరకృషి చేస్తారు. అంటే బాగా తడిసిన  భూమిని దుక్కి దున్నడం, వారి నట్లు వెయ్యడం, వంటివి చేస్తారు. వర్షం సమృద్దిగా పడితే వరి నాట్లు వేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ మొదటి దశలో జరిగేవి. ఇప్పుడే ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వంగడాల విషయంలో మంచి అవగాహన, సలహాలు, సూచనలు కలిగి ఉంటారు.  జొన్న పంట వేసేవాళ్ళు దుక్కులు దున్నడం, రసాయనిక ఎరువులు వేయుట, విత్తనం వేయడం వంటివి చేస్తారు. విత్తనాల ఎంపిక ఎంతో కీలకమైంది. మొక్కజొన్న పంటలు వేసేవాళ్ళు సస్యరక్షణ  చేపడతారు. అప్పటికే నాటిన మొక్కజొన్నకు రెండవ సారి ఎరువులు వేయడం వంటి పనులు చేస్తారు. అలాగే ఎరువుల ఎంపిక ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ప్రత్తి పంట వేసేవాళ్ళు అంతరకృషి చేస్తారు, మొక్కలను పలుచన చేయడం చేస్తారు.   గోగు  పంట వేసేవాళ్ళు అంతరకృషి చేయడం, మొక్కలను పలుచన చేయడం చేస్తారు. ఇక పంటల నుండి తోటల పెంపకంలోకి వస్తే పండ్ల తోటల సాగు చేసేవారిలో అరటి, మామిడి, జామనాట్లు వేయడం చేస్తారు. అలాగే కొబ్బరి చెట్లకు ఎరువులు వేయడం, రేగు, దానిమ్మ వంటి చెట్ల నాట్లు వేయడం చేస్తారు. పప్పుధాన్యాల తరహా పంటలు పండించేవారు చాలా ఆలోచన చేస్తారు. వీటికి నీటి అవసరం ఎంతో ఉంటుంది.  వర్షాలు ఆలస్యం అయితే కంది పంట విత్తడానికి భూమిని తయారు చేయడం, విత్తడం చేస్తారు.   కూరగాయల పంటలు ఏడాది పొడవునా సజీవి అయినా వీటిని మొదటగా అరుద్రకార్తెలో నాటితే ఏడాది మొత్తం వాటి దిగుబడి బాగుంటుందని నమ్ముతారు.  బీర, సొర, పొట్ల, గుమ్మడి మొదలైన విత్తనాలు విత్తడం చేస్తారు. ఇకపోతే సువాసన మొక్కలు అయిన నిమ్మగడ్డి, కామాక్షిగడ్డి, సిట్రొనెల్లా వంటి నాట్లు కూడా ఇదే సమయంలో వేస్తారు. ఇవన్నీ పెద్దగా సాగులో లేకపోయినా పండిన వరకు ఎన్నో లాభాలు ఇస్తాయి. ఇలా ఆరుద్ర కార్తెలో పంటల సాగులో రైతన్నలు మునిగి తేలతారు.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

రెడ్ అలెర్ట్!

రెడ్ అలెర్ట్ అనేది ప్రమాద సూచన. ప్రమాదం ఏ విషయంలో అంటే ఏదైనా కావచ్చు. కానీ అందులో ఉన్న రెడ్ హెడ్లైన్ గా మరి డేంజర్ బెల్స్ మోగిస్తే. ఇదేదో క్రైమ్ సీన్ కు ఎక్స్ప్లేన్టేషన్ ఇచ్చినట్టు ఉందేంటి అనుకోకండి. ఈ రెడ్ అలర్ట్ అంతా మనలో ఉన్న రెడ్ గురించే. అదే అదే మనలో ఉన్న ఎరుపు అంటే మనిషి శరీరంలో ఉండే రక్తమే. అందరి శరీరాల్లో ఉండే రక్తం రంగు ఎరుపు అయినా కొందరి శరీరంలో రక్తం విషయంలో సమస్యలు బాగా వచ్చేస్తున్నాయ్. చాలామంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహిళల్లో……. భారతదేశంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది అనిమియా!! శరీరంలో రక్తం తగినంత లేకపోవడం, రక్తకణాల క్షీణత, హిమోగ్లోబిన్ లోపించడం వంటి సమస్యలు మహిళలను భూతాళ్లా వెంటాడుతున్నాయి. ఎన్నిరకాల మందులు వాడినా అవి వాడినన్ని రోజులు బాగుండి తరువాత మళ్ళీ సమస్య మొదటికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ రక్తహీనత అనే సమస్య మహిళల్లో వేరే సమస్యలను సృష్టిస్తుంది. మహిళల్లో నెలసరి సమస్యలను అటు ఇటు చేసి మహాసికంగా, శారీరకంగా మహిళలను ఒత్తిడిలోకి నెట్టేస్తుంది. ఇదంతా ఒక కోణం అయితే మరొక కోణం ఉంటుంది. అదే అత్యవసర సమయాల్లో రక్తం దొరకకపోవడం. ఎమర్జెన్సీ!! ఇప్పటి కాలంలో రోడ్ లు, వాహనాల రూపురేఖలు చాలా మారిపోయాయి. ఎక్కడికక్కడ ఆక్సిడెంట్ లు చాలా సాధారణ విషయాలు అన్నట్టు జరిగిపోతూ ఉన్నాయి. అలాంటి సందర్భాలలో బాధితులు హాస్పిటల్ వెళ్లెవరకు బతకడం వారి అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే హాస్పిటల్ కి వెళ్లిన తరువాత అవసరము అయ్యే  రక్తం అనుకున్న సమయానికి దొరకక ఎన్నో ప్రాణాలు గందరగోళంలో పడిపోతున్నాయి.  బ్లడ్ డోనర్స్!! ఈ సమాజంలో బ్లడ్ డోనర్స్ పాత్ర నిజంగా ఎంతో అభినందనీయమైనది. రక్తదాతలు కేవలం రక్తాన్ని దానం చేసినవాళ్ళు మాత్రమే కాదు, ప్రాణాలను దానం చేసినవాళ్ళు, ప్రాణాన్ని నిలబెట్టినవాళ్ళు. కొంతమంది అత్యవసర సమయాల్లో ఎవరైనా ఎమర్జెన్సీ ఉందంటూ కాల్ చేస్తే ఉన్న పనులు వదిలిపెట్టుకుని మరీ హాస్పిటల్స్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైనవాళ్ళు  హాస్పిటల్స్ దగ్గరకు పరిగెత్తుకుని వెళ్లిపోతూ ఉంటారు. ఇలాంటి బాధ్యతాయుతమైనవాళ్ళు  చాలా కొద్దిమంది ఉన్నారు. కనిపించే దేవుళ్ళు అని పిలిచినా వీళ్ల రుణం తీర్చుకోలేము. బ్లడ్ డోనర్స్ డే!! రక్తదాతల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అనే ఆలోచన ఎవరికైనా వస్తుందో లేదో తెలియదు కానీ కొందరు ఈరోజు సామాజిక సేవల కింద రక్తాదాన శిబిరాలు నిర్వహించడం, రక్తాన్ని దానం చేయడం చేస్తుంటారు. మరికొందరు రక్తదానం చేసినవారి ఆరోగ్యం కోసం పండ్లు ఇస్తుంటారు. ఎవరెవరి ఆలోచన వాళ్ళది.  అయితే 1901 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్ లాండ్ స్టీనర్ అనే వ్యక్తి రక్తాన్ని వర్గాలుగా విభజించారు. ఈయన నోబెల్ బహుమతి గ్రహీత కూడా. రక్తాన్ని వర్గాలుగా విభజించడం వల్లనే ఈరోజు ఇంతమంది ప్రమాధాలలో ఉన్నప్పుడు అత్యవసరంగా వర్గాల వారిగా రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. అందుకనే ఈయన పుట్టినరోజు గుర్తుగా రక్తాదాన దినోత్సవాన్ని అదేనండి వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే ని నివాహిస్తున్నారు.  కొంచెం ఆలోచించండి!! రక్తం అనేది కృత్రిమంగా తయారుచేసే ద్రవం కాదు. అది శరీరంలో ఉత్పత్తి అయ్యేది. మహిళల్లో నెలవారీ రక్తం పోతున్నా తిరిగి తీసుకునే ఆహారపదార్థాలు వల్ల ఆ రక్తం భర్తీ అవుతూ ఉంటుంది. కాబట్టి రక్తాన్ని ఇవ్వడంలో సమస్య ఏమీ ఉండదు. కాకపోతే శరీరంలో రక్తం పుష్టిగా ఉన్నవాళ్లు రక్తాన్ని దానం చేస్తే ఎంతో మంచిది. 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవాళ్లు రక్తాన్ని దానం చేయచ్చు. తినే ఆహారం వల్ల వృద్ధి చెందే రక్తాన్ని అప్పుడప్పుడు దానం చేయడం వల్ల మరొకరి ప్రాణాన్ని కాపాడటమే కాకుండా కొత్త రక్తం వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి శరీరంలో రక్తం మలినమైందేమో అనే పిచ్చి ఆలోచనలు కూడా ఉండవు.  ఆలోచించండి మరి. ◆వెంకటేష్ పువ్వాడ.