అంతర్యుద్ధం చేస్తున్నారా?? 

ప్రతి మనిషికి జీవితంలో సమస్యలు సాధారణం. ఆ సమస్యల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ వుంటారు. వాటిని అధిగమించేందుకు యుద్ధం చేస్తూ ఉంటారు కూడా. ఇదంతా సాధారణమే. అయితే ఇది కాకుండా అందరూ చేసే ఒకానొక నిశ్శబ్ద యుద్ధముంది. తమలో తాము, మానసికంగా చేసే యుద్ధమది. బయటకు కనిపించని, మనిషిని అంతర్లీనంగా క్రుంగదీసి, ఒత్తిడిలోకి నెట్టి జీవితాన్ని కూడా ప్రశ్నార్థకం చేయగల పెనుభూతమే సంఘర్షణ. దీన్నే మానసిక ఒత్తిడి, ఇంకా ఇప్పటి అందరికి అర్థమయ్యేట్టు చెప్పాలంటే డిప్రెషన్ అని కూడా అంటారు.  తమలో తాము సమస్యల పట్ల సమస్యల తాలూకూ ప్రభావానికి తలోంచి, వైఫల్యాలను, తలచుకుంటూ, జీవిత చట్రంలో బోల్తా పడి ఇక ఏమి మిగల్లేదనుకుని ఆఖరి క్షణాలను తమకు తామే ఆహ్వానిస్తుంటారు.   ఎందుకు ఈ అంతర్యుద్ధం?? ఇలా తమలో తాము ఏదో విషయానికి సంఘర్షణ పడే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఒకటే. ఎందుకు సంఘర్షణ పడుతున్నాం అని. జీవితం అన్నాక వైఫల్యాలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్లకు మాత్రం కేవలం ఆ వైఫల్యాలు మాత్రమే కనబడుతుంటాయి. ఇంకా చెప్పాలంటే నడిచొచ్చిన ఎన్నో అద్భుతమైన అడుగులన్ని కూడా వారి మెదడు మీద చెరిగిపోయి కేవలం ఎక్కడో పడిన చిన్నపాటి గాయాలే ఇంతింత పెద్ద ఆకారంలో కనిపిస్తూ జీవితమంతా అదే ఉన్నట్టు బుర్రను తొలిచేస్తాయి. అందుకే ఈ అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. బయటపడటం ఎలా?? ఇంట్లో నుండి తలుపులు తీసుకుని బయటకు వెళ్లిపోయినంత సులువు కాదు ఈ అంతర్యుద్ధం నుండి బయట పడటం. కేవలం సాధ్యాసాధ్యాలు, జరిగిన విషయాలను వదిలి జరగబోయే విషయాల మీద దృష్టి సారించడం, తప్పొప్పుల విచక్షణ, ముఖ్యంగా స్పోర్టివ్నెస్, అన్నిటికి మించి భయాలు, నిరాశ, పిరికితనం వదిలిపెట్టడం ఎంతో అవసరం. ఇవన్నీ వదిలేసి చూస్తే సమస్యలు ఏమి పెద్ద భూతాల్లా కనిపించవు. సంఘర్షణలు అన్ని కూడా మేఘాల్లా అలా తేలిపోతూ ఉఫ్.. అని ఊదగానే దూదిలాగా చెల్లాచెదురైపోతాయి అందరికీ కావాలోక ఆశావహదృక్పథం!! నిజమే కదా మనిషిని బతికించేది ఆశ. నిన్న ఏదో జరిగింది. అది అలా అయిపోయింది దానికి ఏమి చేయగలం?? గతం గతః. ఇక ఈరోజు చేతిలో ఉంది, రన్నింగ్ రేస్ లో ఉంది. దాన్ని సమర్థవంతంగా మన శక్తి కొలది ఉత్తమంగా మలచుకోవడం, దాన్ని అంతే హుందాగా తీర్చిద్దుకోవడం అందరి చేతుల్లోనూ ఉంది. అలాంటప్పుడు ఈ అంతర్యుద్ధాలు ఎందుకంటా?? మీతో మీరు… మీకోసం మీరు. చాలామంది తాము చేసే తప్పుల కంటే, తమ వైఫల్యాల కంటే ఇతరుల వల్ల  బాధపడటమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇతరులు తమను అవాయిడ్ చేస్తున్నారనో లేక ఏదో అన్నారనో అదీ కాకుండా తమ జీవిత విషయాలను ఇతరులు నిర్ణయించేస్తున్నారనో, తమ నిర్ణయాలు తమకు ఇవ్వకుండా తమ జీవితాన్ని తమది కాకుండా చేస్తున్నారనో ఇలా బోలెడు కారణాలు ఉంటాయి. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటని ఆలోచిస్తే సింపుల్ గా మీతో మీరు ఉండాలి, మీకోసం మీరు ఉండాలి. ఇతరుల చేతుల్లో పెట్టడానికి ఇదేమి ఆట కాదు, అంతకు మించి ఏదో భాగం ఇచ్చే ఆస్తి కూడా కాదు కదా!! అందుకే మీ నిర్ణయం మీరు తీసుకోవడానికి ఎప్పుడూ ముందుండాలి. దానికి ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఏమి తెలియని తనం చుట్టుముడుతుందో అప్పుడు అందరూ మీ జీవితంలో విషయాలను చేతుల్లోకి తీసేసుకుంటారు. అలా మీలో చేతకాని తనం కూడా అంతర్యుద్ధానికి దారి తీస్తుంది.  కాబట్టి మీలో అంతర్యుద్ధాన్ని ఆపాలంటే మీ జీవితాన్ని మీ చేతుల్లో ఉంచుకోవాలి. మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి. మీ తప్పొప్పులను స్పోర్టివ్ గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

మీ చూపుకు ఒక పరీక్ష!!

చూపుకు ఏముంది అక్షరాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి, పనులన్నీ చక్కగా చేసుకుంటున్నాం, అయినా చూపుకు పరీక్ష ఏమిటి డాక్టర్ దగ్గరకు పోతే సరిపోతుంది కదా దానికోసం. టైం వేస్ట్ పనులు కాకపోతే!! బహుశా చాలామందికి ఇలా అనిపించి  ఉంటుంది.  కానీ కాసింత ఇందులోని అంతరార్థం ఏమిటో అనే ఆలోచన చాలా తక్కువ మందికే వచ్చి ఉంటుంది.  ఇక విషయానికి వస్తే చూపు అంటే కంటి చూపు కాదండి, ఏదైనా ఒక విషయాన్ని చూసే విధానం అని, అంటే పాజిటివ్, నెగిటివ్ కోణాలు అని సింపుల్ గా చెప్పవచ్చు. ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు, ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అని అర్థం. కొందరు ఏదైనా చెబితే వెంటనే దాన్ని చాలా తేలికగా తీసుకుంటాం. కొన్నిరోజుల తరువాత  అదే విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే ఇలాటి ఆలోచనలతోనే  అపార్థాలు, మనస్పర్థలు ఏర్పడుతుంటాయి. మనుషుల మధ్య బంధాలు చాలా సులువుగా తెగిపోతుంటాయి. ఇక ఈ పాజిటివ్, నెగిటివ్ కోణాలకు సంబంధించి ఒక చిన్న కథ: ఒకసారి భీష్ముడు దుర్యోధనుడిని పిలిచి మంచివాళ్లను వెతికి తీసుకునిరా అని చెప్పి పంపించాడు. అలాగే అంటూ ధుర్యోధనుడు మంచి వాళ్లను వెతకడానికి వెళ్ళాడు. ఆ తరువాత భీష్ముడు ధర్మరాజును పిలిచి, కొంతమంది చెడ్డవాళ్లను తీసుకునిరా అని చెప్పాడు. సరేనంటూ ధర్మరాజు కూడా చెడ్డ వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళాడు. సమయం గడిచింది, సాయంత్రం అయిపోయింది. మొదట వెళ్లిన ధుర్యోధనుడు ఒంటరిగా, బాగా అలసిపోయి భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. "ఎక్కడున్నారు నువ్వు తీసుకొచ్చిన మంచివాళ్ళు??" అని అడిగాడు భీష్ముడు, దుర్యోధనుడితో. "రాజ్యం అంతా వెతికాను కానీ ఒక్కడు కూడా మంచి వాడు కనబడలేదు, అందరూ చెడ్డవాళ్లే ఉన్నారు" అని బదులిచ్చాడు ధుర్యోధనుడు.  ఆ తరువాత కొద్దిసేపటికే ధర్మరాజు కూడా ఒంటరిగానే వచ్చాడు. "నువ్వు తీసుకొచ్చిన చెడ్డవాళ్ళు ఎక్కడ?? కనిపించడం లేదు ఏమిటి??" అని అడిగాడు. ధర్మరాజు కూడా ధుర్యోధనుడు చెప్పినట్టు "రాజ్యం అంతా వెతికాను కానీ ఎక్కడా చెడ్డవాళ్ళు కనిపించలేదు. అందరూ మంచివాళ్లే ఉన్నారు" అని చెప్పాడు. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే చెడు ఆలోచనలు కలిగి ఉన్న దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్లే కనిపించారు. అందరిలోనూ చెడు గుణాలే కనిపించాయి. ఆయన అందరినీ చూసే విధానం, ఆయన దృష్టి కోణం అలాగే ఉంది. ఇక ధర్మరాజు ఎప్పుడూ నలుగురి మంచి కోరేవాడు, నలుగురి సహాయం చేసేవాడు కాబట్టి ఆయనకు ఇతరుల్లో చెడు కంటే మంచే కనిపించింది. అందుకే ఆయనకు అందరూ మంచివాళ్లుగానే కనిపించారు.   కాబట్టి ఏదైనా సరే మనం చేసే చూపును బట్టే అందులో మనకు మంచి, చెడులు కనబడతాయి. అలాగని చెడును కూడా మంచిగా అనుకోమని కాదు ఈ మాటల ఉద్దేశ్యం. ఈ జీవితం మనది, మన జీవిత నిర్ణయాలు మనవి, అన్ని మన చేతుల్లోనే ఉన్నపుడు ఇతరులతో మనం కేవలం మంచిని చూసి చెడును వారికే వదిలేస్తే మనకు ప్రశాంతత, అనవసర విషయాల కోసం సమయం వృథా కాదు ఇంకా బోలెడు మంచి కూడా మనకే. కాబట్టి మీ చూపు ఇప్పుడు ఎట్లా ఉందొ ఒకసారి మీరే ఆలోచించుకోండి. ◆ వెంకటేష్ పువ్వాడ  

దైవం మానుష్య రూపేణా!!

  దేవుడు ఎక్కడో కాదు, మనిషి రూపంలో మన చుట్టూనే ఉంటాడు అనేది దీని భావం. నిజంగానే ఎంతో గొప్ప మనసు, సహాయం చేసే గుణం, స్వార్థం లేకుండా ఉండటం, జాలి, దయ, కరుణ, మానవత్వం నిండిన వాళ్ళు అక్కడక్కడా కనబడుతూనే ఉంటారు. వీళ్ళనే మనుషుల్లో దేవుళ్ళు అని, దేవుడే మనిషి రూపంలో ఇలా వచ్చాడు అని అంటూ ఉంటారు కూడా. కానీ ఇంత సేపు ఇలా ఒకరిని అనడం, ఒకరి గురించి చెప్పుకోవడమేనా?? కలికాలం. మనుషులను కూటికి, గుడ్డకు, నిలువ నీడకు ముప్పుతిప్పలు పెట్టి, వేధిస్తున్న కాలం. ఈ ప్రపంచంలో సరైన ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, ఇవన్నీ ఎలాగోలా అమరినా ఉండటానికి కాసింత జాగా మాత్రం కలలాగే మిగిలిపోతుంది. ఫలితంగానే ఊరి పొలిమేరల్లో మురుగు ప్రాంతాలలో వెలిసే గుడిసెలు. ఇలాంటివన్నీ చూసి మనం ఏమి చేయగలం అనుకుంటాం. అంతే కానీ మనం ఏమి చేయలేమా?? అని మాత్రం చాలామంది ప్రశ్నించుకోరు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, మరెన్నో సేవా ప్రణాళికలతో నిత్యం ఏదో ఒక విధముగా ఇలాంటి వాళ్ళ కోసం పాటు పడుతూనే ఉంటాయి, ఉన్నాయి కూడా. అవాసాన్ని ఇవ్వలేకపోవచ్చు కానీ వాళ్లకు భవిష్యత్తును మాత్రం ఇవ్వగలమనే భరోసా ఆ సేవా సంస్థలలో, అందులో ఉన్న వ్యక్తులలో మెండుగా కనబడుతుంది. ఈ ప్రపంచంలో మనిషి నిలబడాలంటే కాలవసింది చదువు. కానీ ఫీజులు, పుస్తకాల కోసం, దుస్తుల కోసం ఇట్లా ఎన్నో కారణాల వల్ల ఆ చదువుకు దూరంగా ఉంటున్న బాల్యాలు బోలెడు. ముఖ్యంగా చదువుకోవడానికి బడికి వెళితే వాళ్లకు కడుపుకు తిండి ఎలా?? ప్రభుత్వం అన్ని విధాలా వాళ్లకు అన్ని అవసరాలు అందించినా ఆ పిల్లలే పనులు చేయకుండా ఉంటే గడవడం ఎలా?? ఇలాంటి ఎన్నో సందిగ్ధమైన ప్రశ్నల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది ఆ బాల్యం. మరేం చేయాలి?? చాలా కుటుంబాలకు తిండి, బట్ట, విద్య అనేవి పెద్ద సమస్య కాదు. అలాంటి కుటుంబాలలో ఉన్న పిల్లలకు వాటి ఆవశ్యకత గురించి తెలియజేయాలి. అలాగే చదువుకోవాలనే ఆసక్తి ఉండి, ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటికి దూరమైన పిల్లలు ఎందరో ఉంటారు. తమ వంతుగా కనీసం సంవత్సరానికి ఒక పిల్లవాడి చదువుకు సహాయపడితే ఆ పిల్లవాడి భవిష్యత్తు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. అంతే కాదు చదువుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ముందుకు కదిలే వాళ్ళ తపన చూసి మీ మీ కుటుంబాలలో ఉన్న పిల్లలకు కూడా చదువు మీద ఒకానొక భక్తి ఏర్పడుతుంది. చాలామందికి పుట్టినరోజులు అంటే ఎంతో సంబరమైన రోజులు, అయితే ఆర్థిక లేమితో బాధపడేవారు ఎవరూ లేని అనాథ పిల్లలు ఇలాంటి వేడుకలు ఏమి లేకుండా అన్ని రోజులను ఓకేవిధంగా గడిపేస్తూ ఉంటారు. మీ మీ కుటుంబాల్లో జరిగే వేడుకలు, సంబరాల హడావిడి కొద్దిగా తగ్గించుకుని ఆ మిగిలి డబ్బుతో ఇలాంటి పిల్లల పుట్టినరోజులు జరిపితే ఎంతో సంబరపడతారు.  ఇది ఒకటి అయితే మరొకటి వృద్ధుల సమస్యలు. వయసు ఉన్నన్నాళ్లు ఎంతో కష్టపడి, పని చేసి, డబ్బు సంపాదించి, పిల్లలకు పెట్టి, వయసయ్యాక ఎలాంటి ఆధరువు లేకుండా బిక్కు బిక్కుమనే పండుటాకులు ఎన్నో. వాళ్లకు కావాల్సింది పూటకు ఇంత తిండి, ఏదో ఒకరోజు కొద్దీ సమయం ఆప్యాయంగా పలకరించడం. ఇప్పుడు వెలసిన ఎన్నో వృద్ధాశ్రమాలలో, వీధులలోనూ, ఫూట్ పాత్ ల వెంటా ఎందరో వృద్ధులు ఆరిపోయే దీపాల్లా మెల్లగా సాగుతుంటారు.  సాధారణ మనిషి తన జీవితంలోని పుట్టినరోజుల్లోనూ, పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇట్లా ఎన్నో సందర్భాలలో అయ్యే ఖర్చులో కాసింత తగ్గించికుని ఇలాంటి దిక్కులేని పిల్లల కోసం, పండుబారిన వృద్ధుల కోసం, ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే వారికోసం ఖర్చు చేస్తే దైవం మానుష్య రూపేణా అనే మాటకు సార్థకం చేసినవారు మీరే అవుతారు. ◆ వెంకటేష్ పువ్వాడ    

మీలో స్పోర్టివ్ నెస్(లెస్) ఎంత??

ఈ వేగవంతమైన ప్రపంచంలో ప్రతి  విషయానికి పోటీ పడాలి. ముఖ్యంగా నగరజీవనంలో  నడక అస్సలు పనికిరాదు. పరిగెడుతూనే ఉండాలి. అవకాశాల కోసమూ, అవసరాల కోసమూ. కొందరికి అదొక ఛాలెంజ్ అయితే మరికొందరికి జీవన్మరణ సమస్య కూడా అవుతుంటుంది. కాకపోతే ఈ బిజీ జీవితాల్లో, గందరగోళంలో ఎవరూ ఎక్కువగా గమనించరు అంతే. అందుకే జీవితాన్ని బతకడమనే పరుగుపందెంలో దించి పరిగేడుతూనే ఉంటారు అందరూ.  చిన్ననాడు ఆడుతూ పాడుతూ మొదలు పెట్టిన పరుగు క్రమంగా విద్య, ఉద్యోగం, సంసారం, ఆశలు, ఆశయాలు, పిల్లలు, వాళ్ళ చదువులు, కుటుంబంలో అందరిని కాంప్రమైజ్ చేయాలనే ఆలోచన ఇట్లా అన్నిటి కోసం పరుగు పెడుతూనే ఉంటారు. కానీ ఒక్కోసారి ఆ పరుగులో ఏదొక అడ్డంకి వల్ల తూలి పడటమో, లేక శక్తి చాలక పడిపోవడమో లేక ఇంకా వేరే కారణాలు కూడా ఉండచ్చు.   కానీ పడిపోగానే ఇక ముగిసిపోయినట్టు కాదు కదా. సాదారణంగా చాలామంది జీవితంలో సఫర్ అయ్యేది విద్య ఉద్యోగమనే అంశాల్లోనే. సరైన విధంగా టార్గెట్ చేరుకోకపోవడం చధవలేకపోవడం, చదివినా సరైన ఏకాగ్రత లేక చదివిన దాన్ని గుర్తుపెట్టుకోలేక పరీక్షల్లో పేలవమైన మార్కులు, ఫెయిల్ అవ్వడాలు ఇట్లాంటివి ఎదురవుతూనే ఉంటయి విద్యార్థుల జీవితంలో. ఇక విద్య ముగిశాక, ఉద్యోగం సంపాదించాక హమ్మయ్య అనుకోలేరు ఎవరూ. ఎందుకంటే ఉద్యోగం కూడా హాయిగా ఏమి సాగదు. టార్గెట్లు, ప్రాజెక్టులు, పై ఆఫీసర్లను మెప్పించడంలోనూ, వర్క్ పరంగా సాటిసిఫాక్షన్ అయ్యేలా చేయడంలో విఫలం అవుతూ ఆత్మన్యూనతకు గురయ్యే ఉద్యోగస్తులు కూడా ఎందరో.  అయితే ఓటమి నుండి పాఠం నేర్చుకుంటూ గెలుపు కోసం మరింత కష్టపడుతూ, తమని తాము మెరుగుపరుచుకునే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. వాళ్ళందరిలో లోపించింది ఏమిటి అంటే ..... క్రీడాతత్వం. దాన్నే స్పోర్టివ్ నెస్ అని అచ్చంగా ఆంగ్లంలో అనేస్తున్నారు. క్రీడలనేవి చిన్నప్పటి నుండి మనకు తెలిసినవే. అయితే రాను రాను చదువుల పేరుతో వాటికి దూరం గా పిల్లలను కేవలం పుస్తకాలతోనే ఉంచడం వల్ల వాళ్లలో పెద్దయ్యే కొద్దీ గెలుపు ఓటమి అనేవాటిని ఎలా సమానంగా తీసుకోవాలి అనే విషయం అవగాహనలో లేక ఒత్తిడిలో పడిపోతున్నారు. అందుకనే మానసికంగా కూడా దృఢంగా లేక చిన్న విషయలకే ఎంతో డిస్టర్బ్ అయిపోతుంటారు ఇప్పటి తరం.   క్రీడాతత్వం వల్ల ఏమి ప్రయోజనం??  ప్రతి పనిలో విఫలం, సఫలం సహజం. పోటీ ప్రపంచంలో గెలుపు, ఓటమి మరింత సహజం. వందమంది పోటీ పడే ఉద్యోగానికి ఒక్కరే ఎంపిక అవుతారు. అందులో మిగిలిన 99 మంది పనికిరాని వాళ్ళని కాదు లెక్క. వాళ్ళ ప్రయత్నంలో ఎక్కడో ఏదో లోపం జరిగిందని, లేక అమలుపరిచే చోట ఏదో తప్పిదం చేసారని కూడా అనుకోవచ్చు. అదీ కాదు అంటే ఆ గెలిచిన వాళ్ళు, ఎంపికైన వాళ్ళు, ఇతరుల కంటే ఇంకా మంచి ప్రణాళికతో సన్నద్ధం అయ్యి ఉండవచ్చు.  ఇట్లా విషయన్ని  అన్ని విధాలా విశ్లేషించుకుని, విమర్శించుకుని తమలో ఉన్న లోటుపాట్లను తెలుసుకునేల చేసేది క్రీడాతత్వమే.  అంతే కానీ ఒడిపోవడాన్ని సమర్థించుకోవడం కాదు. ఓటమికి గల  కారణాలను తెలుసుకోవడం. పరిశీలన, ఏకాగ్రత, విభిన్న ప్రణాళికలు, వవాటిని అమలుపరిచే విధానం, ప్రతి విషయాన్ని చూసే కోణం, స్పందించే తీరు వీటన్నిటి వల్ల మనుషులతో మెలిగే విధానం. వ్యక్తిత్వ పరంగా పరిపక్వత వంటివెన్నో ఈ క్రీడాతత్వం వల్లనే అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మీలో కూడా ఈ స్పోర్టివ్ నెస్ ఉందా?? లేదా లెస్ గా ఉందా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.                                                                                       ◆ వెంకటేష్ పువ్వాడ

 వీళ్ళు ప్రత్యేక వంటలోళ్లండి!!

ఇంకెవరూ వంటలు చేసేవాళ్లే. అబ్బాబ్బా ఏమి చెప్తిరి ఆ విషయం మాకు తెలియదా అనుకుంటారా??అసలు అనుకోవద్దు. ప్రతి ఇంట్లో వంటలు చేసేవాళ్ళు ఉంటారు ఆ మాత్రానా వంటలోళ్లం అయిపోతామా?? కాదు కదా!! మరి ఈ వంటలోళ్ళ గురించి కథ ఏమిటి అంటే….. ప్రతి ఇంట్లో సాపాటు తొందరగా కాకపోతేనో, ఏదైనా సమస్య వల్ల కుదరకపోతేనో అందరూ పడే పాట్లు ఏమి లేవు. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ప్రతి ఊర్లో ఎన్నో హోటల్స్ మరెన్నో రెస్టారెంట్స్, మరెన్నో చిన్న చిన్న బడ్డి కొట్టు లాంటివి, వాటికి మించి తోపుడు బండ్ల పైన అమ్మే స్ట్రీట్ ఫుడ్ కింగ్స్ ఎక్కువ. ఎక్కువ మంది బతుకు తెరువు కోసం తోపుడు బండ్ల మీద టీ లు అమ్ముతూ క్రమంగా టిఫిన్ సెంటర్లు, తరువాత హోటల్స్ ఇట్లా మెల్లిగా ఎదిగినవారే. వీళ్ళలో చాలామటుకు జీవితం కోసం అలా మారినవారే, పైగా చిన్న పెట్టుబడితో కాసింత రుచిగా వండి మర్యాదగా వడ్డిస్తూ లాభాలు ఆర్జిస్తూ జీవితాలను కాసింత ఒడిదుడుకుల వల్యం నుండి బయటకు లాగి భరోసాను ఇచ్చుకున్న వాళ్లే. అందులోనూ తిండి లేకపోతే మనిషి పని ముందుకు సాగదు. కారణాలు ఏవైనా హోటల్స్ లో తినేవారి సంఖ్య ఎక్కువే. అయితే ఏరి కోరి ఇందులోకి వచ్చేవాళ్ళు ఉన్నారు.   ఎందులోకి అనే అనుమానం వచ్చిందా?? అదే అదే వంట చేయడమనే విద్యలోకి. ఏ ఇంట్లో అయినా మగవాళ్ళు వంటింట్లో దూరి ఏదో ఒకటి వండుతుంటే,  హవ్వా!! మగాడు వంటింట్లో వంట చేస్తుంటే ఆ ఇంటి ఆడవాళ్లు బాగా తింటున్నారా అని కొందరు అంటారు. కానీ వంట చేయడం అనేది కూడా ఒక వృత్తిలో బాగమైపోయింది ఇప్పుడు అని చెబితే దానికి మాత్రం ఓహో అని గమ్మునైపోతారు.  స్టైలిష్ గా చెఫ్స్… ఎప్పుడైనా పెద్ద రెస్టారెంట్లకు వెళ్తే అక్కడ వంట చేసేవాళ్ళు ఉంటారు.  వాళ్ళను వంటోళ్లు అని కొట్టి పడేయకూడదు. వాళ్లలో ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో ఎక్కువగా మగవాళ్ళు ఉండటం విశేషం.  ఏమిటా ప్రత్యేకత??  కళాత్మకత. కాసింత కళాపోషన ఉండాలోయ్ అన్నట్టు వీళ్ళలో ఆ కళాపోషణ పాళ్లు అధికమనే చెప్పాలి. చేసే వంట నుండి, దాన్ని చేసే విధానం, కురముక్కలు కోసే పద్దతి, వంటకు తగ్గట్టు దాన్ని ఎలా ఎంత మంట మీద వేయించాలి, లేదా ఉడికించాలి వంటివి మాత్రమే కాకుండా ఆఖరికి వంట మొత్తం అయ్యాక దాన్ని ప్లేట్ లో పెట్టి దానికి గార్నిష్(అలంకరణ) చేయడం వరకు ప్రతి చోట వాళ్ళ మార్క్ కనిపిస్తూ ఉంటుంది. అవన్నీ వాళ్ళు ఎదో మొక్కుబడిగా చేసేయడం లేదా వచ్చినట్టు చేయడం కాకుండా లక్షలు పోసి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లు చేసి కష్టపడి, ఇష్టపడి నేర్చుకొని వండటం మీద వాళ్లకున్న ఇష్టాన్నే వాళ్ళ వృత్తిగా మార్చుకునావాళ్ళు వాళ్ళు. అదే సాదారణంగా వంట చేసేవాళ్లకు, చెఫ్స్ కు ఉన్న తేడా!! ప్రయోగాలు, విభిన్న రుచులు, విదేశీ వంటకాలతో  కనువిందు చేస్తూ అందరికి విందు అందించే ఈ చెఫ్స్ పాకాశాలలో ఇప్పుడు కింగ్స్ గా గరిటలతోనూ ఘుబాళింపులతోనూ లీనపోయి ఉన్నారు. మీకూ వండటం అంటే ఇష్టమైతే దాన్నే వృత్తిగా ఎంచుకోవాలని ఉంటే చెఫ్స్ అయిపోండి.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        ◆ వెంకటేష్ పువ్వాడ

సంగీతంతో ఒత్తిడిని జయించండి

మారుతున్న పరిస్థితుల కారణంగా, జీవన నడవడికలో రకరకాల ఒత్తిళ్లు మన మనోధైర్యాన్ని పరీక్షిస్తాయి. అయితే సమయానుకూలంగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్లకుంటే మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులు మార్కుల వేటలో మధనపడుతుంటారు. వ్యాపారస్తులు లాభార్జనకు తపిస్తుంటారు. ఇంటిని ఆర్ధికంగా, ఆరోగ్యకరంగా ఉంచడానికి గృహిణి పరితపిస్తుంటుంది. ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు రకరకాల కారణాలతో మానసిక ఒత్తిడికి లోనై కొన్ని సందర్భాల్లో జీవితాలను కూడా త్యజిస్తారు. *ఒత్తిడికి ప్రధాన కారణం  మనం ఏదైనా కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టేముందు దాని ద్వారా కలిగే ఫలితాన్నీ ఎక్కువ ఊహించుకోవడం ఆ సమయంలో ఏవైనా ఇబ్బందులు కలిగి మనం అనుకున్నట్లు జరగకున్నా కృంగిపోతాము. ఇదే ఒత్తిడికి ప్రధాన కారణం. టార్గెట్లు పెట్టుకొని పని చేయడం కూడా మంచిది కాదు. ఉదాహరణకు నూతన పెళ్లి చేసుకున్న దంపతులు పాశ్చాత్య పోకడుల కారణంగా ఒకరిపై ఒకరు ఎక్కువ ఊహించుకొని ( expectations) అది నిజ జీవితంలో సాకారం కాకపోవడం వలన ప్రతి క్షణం అదే ఆలోచిస్తూ మధనపడి పోతుంటారు. ఇదో రకం ఒత్తిడి. ఇలా రకరకాల ఒత్తిళ్ల కారణంగా క్షణికావేశంలో విపత్కర నిర్ణయాలు తీసుకుంటున్నవాళ్ల గురించి మనం రోజూ టీవీల్లో చూస్తున్నాము. పత్రికల్లో చదువుతున్నాము. అయితే పరిస్కారం లేని సమస్య అంటూ ప్రపంచంలో లేదు అని అందరూ గుర్తించుకోవాలి. మౌనంగా మనతో మనం మాట్లాడుకుని సమస్యను విశ్లేషించుకుంటే పరిస్కారం కచ్చితంగా దొరుకుతుంది. *సంగీతంతో ఒత్తిడిని జయించండి పని వలన కావచ్చు లేదా ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి సమయంలో ఏదొక వ్యాపకం మనల్ని ఆ కఠిన క్షణాలనుంచి ఉపశమనం కలిగిస్తుంది. అందులో ప్రధానమైనది సంగీతం. ఇష్టమైన సంగీతాన్ని వింటూ కాలాన్ని గడిపితే ఆ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ వినిపించే పాటలో అందులోని మాటల్లో నే ఏదొక సొల్యూషన్ మనకు దొరుకుతుంది. మనసుకు ఆరోగ్యకరమైన ఎంతో ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. *పుస్తక పఠనంతో కూడా..! పుస్తక పఠనం తో కూడా ఒత్తిడిని జయించవచ్చు. ఏదైనా సమస్యతో ఒత్తిడితో ఉన్నప్పుడు ఇష్టమైన పుస్తకం చదవండి. ఖచ్చితంగా ఆ సందర్భానికి ఏదొక పేజీ లో మీ సమస్యకు పరిస్కారం చూపే మాట కనిపిస్తుంది. ఇలా కొన్ని వ్యాపకాలతో మనం ఒత్తిడిని జయించవచ్చు. ◆ వెంకటేష్ పువ్వాడ

ఏమి చెబుతోంది సంస్కృతి

విభిన్న మతాల నిలయం మన భారతదేశం. భిన్నత్వంలో ఏకత్వం దీని వైశిష్ట్యం. ఎన్నో మతాలు, ఎన్నో రకాల సంప్రదాయాలు, ఎన్నో ఆచారాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా సంప్రదాయమనే చట్రంలో భాగాలు. ప్రతి మతానికొక గ్రంథం, ఆ గ్రంథాన్ని అనుసరించి మతం పుట్టుక, అందులో సంప్రదాయాలు. ఇలా అన్ని రకాల మతాలకూ అన్ని రకాల సంప్రదాయాలు. కానీ ప్రతి మతం చెప్పేది ఒకటే మనిషి మనిషిగా జీవించాలని, మనిషి సాటి మనిషిని ప్రేమించాలని, తనకున్నదాంట్లో కాస్తో కూస్తో లేనివారికి ఇవ్వాలని. ఇలా అన్ని మతాలు కలిసి మన భారత సంస్కృతిని గొప్పగా నిలబెట్టాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా మతాల గొడవలు, ఇంకొక మతాన్ని విమర్శించడం, ఆ మతంలో దేవుళ్లను తిట్టిపోయడం, పురాణం గ్రంథాలలో చెప్పబడిన వాక్యాలకు పూర్తి అర్థం తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం. కారణం ఏమిటి??  ఆధిపత్యం….. భారతదేశానికి ఎంత చరిత్ర ఉందొ అంతకంటే పెద్దది హిందూ మతం చరిత్ర, అలాగే మిగిలిన మతాలు కూడా వివిధ దేశాలలో వారి వారి నమ్మకాలకు అనుగుణంగా పుట్టినవే. కానీ ప్రస్తుతం మాత్రం మతాధికారమే దేశ పాలనకు మూలమని, దోచుకోవడానికి అదే సరైన మార్గమని భావిస్తున్న వారు కోకొల్లలు. అవగాహన లోపం--- సంస్కృతిలో భాగంగా, సంప్రదాయంలో భాగంగా ఏ మతంలోనూ పూర్తిగా తమ మాత గ్రంథాలను పూనాదితో సహా చదివి ఉండరు. వాళ్లకు తెలిసినది కేవలం అమ్మల మాటల్లోనూ, అమ్మమ్మల కథలోనూ, తాతలు చెప్పిన కథల్లోనే సగం సగం విషయాలు తెలుసుకుని వాటినే పట్టుకుని వేలాడుతూ, ఎక్కడో చరిత్రలో జరిగిన సంఘటనలను వాటి వెనుక మూలలను తెలుసుకోకుండా ద్వేషం, పగ పెంచుకుని మతాల మధ్య శత్రువుల్లా తయారవడం.మూఢనమ్మకంనమ్మకాలు మంచివి. మతాలలో సంప్రదాయాలలో భాగం కాబడిన విషయాలు చాలావరకు శాస్త్రీయతో కూడుకున్నవి. కానీ అక్షరాస్యత ధరించిన అజ్ఞానులకు వాటిని అర్థం చేసుకోడం రావట్లా. ఫలితంగా మూఢనమ్మకాలు, ఎత్తిపోతలు, విమర్శలు, ఘాటుగా స్పందించడాలు.కొందరు కొన్ని స్వప్రయోజనాలకోసం సృష్టించిన సంప్రదాయాలు ఉన్నాయి కానీ హేతువాదనికి దూరంగా ఏ సంప్రదాయం ఎక్కువ కాలం నిలబడదు కదా!!   ఏమి చెప్పాలి పిల్లలకు?? ముందు తరాలకు అందించే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది సంస్కృతే,  పిల్లలకు చిన్నతనం నుండే ప్రతి విషయాన్ని కారణంతో, మూలలతో సహా వివరించి చెప్పాలి. తద్వారా వారిలో అవగాహన పెరుగుతుంది, ఆలోచన విస్తృతం అవుతుంది అంతే కాదు ప్రతి విషయాన్ని కూడా ఎంతో ఆలొచనాత్మకంగా చూస్తారు, ప్రతి అడుగును విశ్లేషించుకుంటూ వేస్తారు. ఇదే సంస్కృతి ఇచ్చే విజ్ఞానం. ఈ సంస్కృతిలో ఏ లోపం లేదు, లోపమున్నదల్లా మనిషి బుర్రలో. ఇక్కడ విషయం ఏమిటంటే తాను బాగుపడకపోయినా ఇంకొకరు బాగుపడుతున్నారు అంటే బాధపడిపోయే మనుషులున్న సమాజమిది.   సొంత లాభం కొంత మానుకో--- పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలు అక్షరాల సత్యమని నమ్మి వాటిని జీవితంలో ఆచరణలో పెట్టేవాళ్లు చాలా తక్కువ. ఎప్పుడైతే ఈ దేశమంటే మట్టి కాదు మనుషులని, మనుషుల మధ్య సామరస్యత, కలుపుగోలుతనం, సహాయపడే గుణం పెంపొందుతుందో అప్పుడే  ఈ దేశ సంస్కృతి గొప్పదనం మరింత ఇనుమడిస్తుందని, అది తెలుసుకుని తాము పాటిస్తూ తమ పిల్లలకు చెబుతూ ముందు తరాలకు బహుమతిగా గొప్ప వ్యక్తిత్వాన్ని ఇస్తే మన సంస్కృతి నుండి మనం ఎంతో కొంత నేర్చుకుంటున్నట్టే!! ◆ వెంకటేష్ పువ్వాడ  

ఆకలి మీద బ్రహ్మాస్త్రం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది పెద్దల మాట. అంటే అన్నాన్ని దైవంతో సమానంగా చూస్తారు. శరీరానికి శక్తినిచ్చి, ఆరోగ్యాన్ని చేకూర్చి జీవితకాలాన్ని హాయిగా సాగేలా చేసేది ఆహారం. అన్నమే కాదు మనిషి కడుపు నింపే ప్రతి ఆహారం కూడా దైవ స్వరూపమే. ఒక పండ్ల మొక్క నాటుతాం, లేదా విత్తనాన్ని విత్తుతాం. దానికి నీళ్లు పోసి, అపుడపుడు కలుపు తీస్తూ, దానికి పోషకంగా ఎరువులు వేస్తూ రోజులు, నెలలు, సంవత్సరాలు నిరీక్షిస్తే అప్పుడు చెట్టుగా ఎదిగి కాయలు కాస్తుంది. ఆ కాయలున్న చెట్టును పెంచిన వ్యక్తి ఎంతో జాగ్రత్తగా కాడుకుని కాయలు పండ్లుగా మారే దశలో వాటిని కోసి, మార్కెట్లలోనూ లేక రోడ్ల మీద లేక ఇంకా ఇతర మార్గాల ద్వారా అమ్ముతారు. ఒక పండు ధర పది రూపాయలు అయితే దాని వెనుక ఒకరు లేదా ఇంకా ఎక్కువ మంది కష్టం చేసి చిందించిన చెమట తాలూకూ అనుభవాలు కూడా ఉంటాయి. కానీ కొన్న వాటి మీద ఏదో హక్కు ఉన్నట్టు సరిగా తినీ తినక, చెత్త బట్టలలోకి వేస్తూ పండు తాలూకూ కష్టాన్ని అవమానిస్తూ ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఇలాంటి విషయాలు తెలియదు. చాలా ఇళ్లలో పిల్లలు సగం తిని వదిలేసిన పండ్లు, ఆహారపదార్థాలు ఎక్కువగా కనబడుతుంటాయి. వాళ్ళది తెలియని వయసు కావచ్చు కానీ పెద్దలది తెలియని వయసా?? లేక డబ్బె పెట్టి కొనడం ద్వారా వచ్చిన నిర్లక్ష్యపు ధోరణినా?? అన్నమో రామచంద్ర!! ఒకవైపు  ఇంట్లో ఇలాంటి వృథా జరుగుతూ ఉంటే మరొకవైపు బయట మాత్రం అన్నమో రామచంద్ర అని ఆకలికి నకనకలాడుతున్న అభాగ్యులు ఎందరో!!  మనకేంటి తల్లిదండ్రులు కొద్దో గొప్పో మంచి జీవితాన్నే ఇచ్చారు, ప్రతి తల్లిదండ్రి అలాగే ఇవ్వాలని అనుకుంటారు కూడా, కానీ కొన్ని జీవితాలు తెగిన గాలిపటాల్లా ఉంటాయి. గాలి ఎటు వేస్తే అటు గాలిపటం వెళ్లినట్టు, ఎక్కడ పని దొరికితే అక్కడ చేసుకుంటూ బతికేవాళ్ళు ఉంటారు. కష్టానికి తగ్గ డబ్బులు చేతికి అందని అమాయకులు ఉంటారు, దోపిడీ చేయబడేవారు, బానిస బతుకుకు లోబడిన వారు ఇలా ఎందరో!! వీళ్ళందరూ మురికివాడల్లోనూ, ఊరి పొలిమేరల్లోనూ చిన్న గుడిసెలు వేసుకుంటూ రేపటి గూర్చి కాకుండా ప్రస్తుతం గడిచిపోవడం గురించి ఆలోచిస్తూ బతికే వాళ్ళు. అలాంటివాళ్ళకు ఒకోసారి తిండి కష్టం అవుతుంది. నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్లడం కష్టమవుతుంది. మరోవైపు అన్నదాతా సుఖీభవ అనే స్లోగన్ లతో తెగ చైతన్యపు గొంతులు వినబడతాయి కానీ, ఆహారం దగ్గర అదొక అజమాయిషీ చేసేవాళ్ళు కోకొల్లలు. ఇష్టం వచ్చినట్టు వడ్డించుకుని, నచ్చినంత తిని, చెత్తబుట్టలో పడేసేవాళ్ళు ఎక్కువ.  జనాభా పెరుగుదల, పేదరికపు  సమస్య, జనాభా లెక్కల్లో నమోదు కాని ప్రజల దైన్యం, పారిశ్రామిక అభివృద్ధిలో యంత్రాల పాత్ర పెరుగుతూ మనిషికి సగటు ఉపాధి మార్గాలు దొరకక, ప్రభుత్వ పథకాల లబ్దికి నోచుకోక, నిరంతరం జీవితంతోనూ, ఆకలితోనూ యుద్ధం చేసేవాళ్ళు ఎందరో కనబడుతుంటారు.  ఇప్పుడేం చేయాలి?? అవగాహన ముఖ్యం, తదుపరి ఆచరణ అవసరం. అవగాహన చాలామందిలో ఉంటుంది, నిజానికి మనుషులుగా పుట్టిన అందరికి ఆకలి విలువ తెలుసు, అయితే వారి మనసు అంతరాలలో అది ఎక్కడో పెద్ద ప్రాధాన్యత లేని అంశంగా మరుగున పడి ఉంది. దాని ప్రాముఖ్యాన్ని మొదట గుర్తించాలి. ప్రతి మెతుకు వెనుక కష్టాన్ని, ప్రతీ పంట సాగుకు చిందే చెమట ధారను తెలుసుకుంటూ, పిల్లలకు చెబుతూ ఉండాలి.  పెళ్లిళ్లు, శుభకార్యాలలో అనవసరపు డాబు పోకుండా ఆహారాన్ని దైవంగా భావించి వీలైనంత వరకు వృథా కాకుండా జాగ్రత్త వహించాలి. ప్రతి ఇంట్లో పిల్లలతో ఒక చిన్న విత్తనాన్ని నాటించి వాళ్ళతోనే ఆ మొక్క సంరక్షణ చేయిస్తూ ఉంటే దాని తాలూకూ ఫలితం తప్పకుండా పిల్లల క్రమశిక్షణతో, నడవడికలో, ముఖ్యంగా ఆహారం పట్ల అవగాహన, వృథా చేయకుండా ఉండటం వంటివి అర్థమవుతాయి.అలాగే పిల్లలకు అపుడపుడు ఆహారానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళను చూపిస్తూ వారి కష్టాన్ని తెలియచేస్తూ ఉండాలి. దానివల్ల తాము వృథా చేయడం మాని ఇతరులకు ఇవ్వడమనే మంచి అలవాటు కూడా పెంపొందుతుంది. తిండి కలిగితే కండ కలదోయ్ కండ గలిగిన వాడే మనిషోయ్ అనే మాట నిజమవ్వాలంటే ఆహారం తీసుకోవడం చాలా అవసరమని ఆహారం తీసుకోవడం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో, వృథా చేయకుండా అంతే జాగ్రత్త వహించాలని పిల్లలకు చెబుతూ పెద్దలు ఆచరిస్తే ఈ భారతంలో ఆకలి బాధ ఎక్కడో ఒకచోట పరోక్షంగా అణువంత అయినా తగ్గించిన వాళ్ళం అవుతాము.                                                                                                                             ◆ వెంకటేష్ పువ్వాడ

బా(బ్ల)డీ షేమింగ్ చేస్తున్నా(రేమో)రా?.. జాగ్రత్త!

సమాజంలో మనుషులు తమని తాము చూసుకోవడం కంటే, పక్కన ఉన్న మనుషులను గమనించడానికే ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. పక్కన మనిషిని విమర్శించడం అనేది ఎన్నో చోట్ల ఎక్కువగా కనబడే అంశం. తోటి విద్యార్థులు, సహా ఉద్యోగస్తులు, స్నేహితులు, చుట్టాలు, ఇరుగు పొరుగు ఇలా అందరి దగ్గర నుండి ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధమైన విమర్శను ఎదుర్కొంటూ ఉంటారు చాలా  మంది. అయితే ఉద్యోగానికి సంబంధించిన విషయాలు, జీవిత నిర్ణయాలు, చేసే పనులు ఇలాంటి వాటి విషయంలో విమర్శ ఎదురైనా వాటిని ఆలోచించి ఒకవేళ దాని వల్ల ఏదైనా మార్పు చేర్పులు చేసుకోగలిగే అవకాశం ఉంటే తప్పక చేసుకుంటారు ఆలోచన గల వాళ్ళు అయితే. కానీ ఇప్పట్లో చాలామంది ఎదుర్కునే సమస్య బాడీ షేమింగ్.  అసలేమిటి బాడీ షేమింగ్… ఎదుటి మనిషి శరీరాన్ని, శరీర రూపాన్ని, అందులో లోపాలను వేలెత్తి చూపడం మరియు విమర్శించడమే బాడీ షేమింగ్. ఇది కేవలం లావుగా ఉన్న వాళ్ళ విషయంలో జరుగుతుందన్నది కేవలం అపోహ మాత్రమే. ప్రస్తుతం సమాజంలో అధిక శాతం మంది బాడీ షేమింగ్ కు గురవుతున్నారంటే ఇది ఎంతగా వ్యాప్తి చెందిందో అర్థం చేసుకోవచ్చు.  బాడీ షేమింగ్ ఎందుకు?? ఎదుటి వ్యక్తులు లావుగా ఉన్నా, లావుగా లేకపోయినా ఎగతాళి చేస్తూ విమర్శించడం. అమ్మాయిలలో కొందరు సరైన ఆహారం లేక కండర సామర్థ్యము పెంపొందక అవయవ సౌష్టవం లేకుండా ఉంటారు వాళ్ళను ఎగతాళి చేయడం. కొందరు జన్యు పరంగా లావుగా లేదా సన్నగా ఉంటారు వాళ్ళను ఎగతాళి చేయడం. జుట్టు పొడవుగా లేదనో, రంగు తక్కువ ఉన్నారనో, అందంగా లేరనో ఇలాంటివి మాత్రమే కాకుండా సరైన బట్టలు వేసుకోలేదనో, ఫాషన్ గా లేరనో, ఇతరుల అలవాట్లను ఇలా బోలెడు ఈ బాడీ షేమింగ్ కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు అయినప్పుడు వాటిని ఇతరులు విమర్శించడం ఎంతవరకు సమంజసం. నమ్మలేని నిజం!! ప్రతి వ్యక్తి జీవితంలో బాడీ షేమింగ్ మొదలయ్యేది కుటుంబం నుండే!! ఈ విషయం వినగానే ఆశ్చర్యం వేస్తుంది కానీ ఇదే నిజం. ముఖ్యంగా పెళ్లి తరువాత అందులోనూ గర్భవతులు అయ్యి ప్రసవం తరువాత అమ్మాయిల శరీరాల్లో వచ్చే మార్పులను వారి భర్తలు అర్థం చేసుకోకపోగా శరీరాన్ని, సౌష్టవాన్ని విమర్శించడం, గేలి చేయడం వంటివి చేస్తారు. శరీర మార్పులకు కారణమైన స్థితులను అర్థం చేసుకోవాలి. అలాగే కంపెర్ చేయడం కూడా బాడీ షేమింగ్ లో ఫస్ట్ పాయింట్. ఇతరులను చూపించి వాళ్ళలా నువ్వు లేవు అని వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అలాగే సినిమా హీరోయిన్లు, సెలబ్రిటీ లు ఇలాంటి వాళ్ళ ఫిట్నెస్ చూసి భార్యలను మాటలతో హింసించే వాళ్ళు కూడా ఉన్నారు. ఫలితంగా తిండి విషయంలో ఎంతో మాధనపడిపోతుంటారు మహిళలు. కేవలం ఆడవాళ్లేనా?? ఈ బాడీ షేమింగ్ లో మగవాళ్ళు కూడా ఉన్నారండోయ్!! మగవాళ్ళు అంటే శరీరం కండలు తిరిగి హీరోల లెక్క ఉండాలని అపోహ పడేవాళ్ళు బోలెడు. అలాగే పొట్ట ఉందని, బట్టతల ఉందని విమర్శించేవాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టైల్ గా ఉన్నా దాన్ని కూడా విమర్శించేవాళ్ళు, వస్త్రధారణ  విషయంలో, ఇంకా కొందరు అబ్బాయిలలో జన్యు పరంగా మీసాలు సరిగా రాకపోవడం, అమ్మాయిలలా వక్షోజాల్లా ఎత్తుగా ఉండటం, ఇవి మాత్రమే కాకుండా కొందరు చెవిపోగులు వంటివి పెట్టుకున్నా, చేతులకు పచ్చబొట్టులు వంటివి వేయించుకున్న ఇలా ప్రతీ విషయంలో బాడీ షేమింగ్ చేసేవాళ్ళు బోలెడు.  ఎలా మారుతుంది ఈ ధోరణి!! ప్రతి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితాన్ని కేవలం ఆ వ్యక్తి చేతిలో ఉన్నంతవరకు ఏ బాడీ షేమింగ్ ఎక్కడా కనబడదు. కానీ ఎప్పుడైతే ఇతరుల వ్యక్తిగత  విషయాల్లో తల దూర్చి ప్రతీది విమర్శించడం మొదలెడతామో అప్పుడే ఈ బాడీ షేమింగ్ పెరుగుతూ పోతుంది. కాబట్టి మొదట చేయాల్సింది ప్రతి ఒక్కరు ఇతరుల వ్యక్తిగత విషయాలను వేలెత్తి చూపకపోవడం. ఇక్కడ గమనించాల్సిన విషయమొక్కటే. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఎవరికి వారు ప్రత్యేకం. కాబట్టి ఎవరిని ఇంకొకరితో పోల్చడం కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ చేయకూడదు.  ఒకవేళ మీరు గనుక ఇలాంటి బాడీ షేమింగ్ చేస్తుంటే బ్లడీ షేమింగ్ చేస్తున్నారనే అర్థం!! ఆలోచించండి మరి.

ఇవి చెక్ చేసుకుంటే జీవితం మారిపోతుంది

జీవితంలో మనిషికి టార్గెట్ లు ఎన్నో!! ప్రతి విషయంలోనూ ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. కానీ చివరలో నిర్ణయం తీసుకునేటపుడు మాత్రం వెనకడుగు వేస్తారు. కారణం భయం. ఎందుకు అంటే ఫలితం ఎలా ఉంటుందో!! దానివల్ల సమస్యలు వస్తాయేమో!! ఆ నిర్ణయం వల్ల ఇప్పటికంటే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుందేమో!! ఇలాంటివే కారణాలు.  ఇవన్నీ జీవితం పట్ల జాగ్రత్తల్లా అనిపిస్తాయి  కానీ జాగ్రత్తలు కాదు జీవితాన్ని ఎదగనీయకుండా పెట్టె ఇబ్బందులు. అతి భయాలు అనుకోవచ్చు.  కేవలం ఇవి మాత్రమే కారణాలా లేక ఇంకా ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనే విషయం ఒక్కసారి ఎవరికి వారు ఆలోచించుకుంటే….. తరువాత…… ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ముందు చాలా మంది, తరువాత ఏమవుతుందో…. అనే భయంతో ఆగిపోతారు. తరువాత ఏమయ్యేది లేనిది తెలిసేది ముందు నిర్ణయం తీసుకుని అడుగేస్తేనే కదా!! ఏమో అనుకున్నదానికంటే  ఇంకా పెద్ద ఫలితం సొంతమవచ్చేమో కదా!! భయంతో అరుదైన అవకాశాలు, జీవితంలో గొప్ప ప్రయత్నాలు వదిలేసుకోకూడదు కదా. ఆత్మవిశ్వాసపు రేపరెపలు…. జీవితంలో ఎంతో గొప్ప మలుపు అవుతుంది. కానీ దానివైపు వెళ్లాలంటే భయం అంటూ ఉంటారు. నిజానికి మనం తీసుకునే నిర్ణయం వల్ల మనకు మంచి జరుగుతుందనే అవగాహన ఉంటేనే కదా ఏ విషయం గురించి అయినా ఆలోచిస్తాం. అలాంటప్పుడు అపనమ్మకాన్ని మనసులో పెట్టుకోవడం ఎందుకు?? అవగాహన…. ప్రతి విషయం గురించి నిర్ణయం తీసుకునేటప్పుడు ఎవరైనా సరే తీసుకునే నిర్ణయం వెనుక ఎంతో అవగాహన కలిగి ఉంటారన్నది నిజం. అసలు ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నాం. దాని వల్ల చేకూరే ప్రయోజనం ఏమిటి?? అది ఎంత అవసరం?? వంటి ప్రశ్నలు ఎవరికి వారు తప్పకుండా వేసుకోవడం ద్వారా ఓ అవగాహనకు రావచ్చు. అవకాశంతో అందలం ఎక్కాలి కొన్నిసార్లు కొన్ని అవకాశాలు ఒక్క సారి వస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ రావడం బహుశా జరగకపోవచ్చు. కాబట్టి అవకాశం ముందున్నప్పుడు ధైర్యం చెయ్యాలి.  ఇతరుల జోక్యం…. సాదారణంగా ప్రతి పని విషయంలో, ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడం సలహాలు తీసుకోవడం చేస్తుంటారు. అప్పుడు అవతలి వాళ్ళ అనుభవాలు చెబుతారు. అంతేనా ఆ పనిని గూర్చి ఇంకా ఇంకా ఏవో చెప్పి దాని మీద భయం ఏర్పడేలా చేస్తారు. కాబట్టి ఇతరుల అభిప్రాయాలు కేవలం ఆ విషయం గురించి తెలుసుకోవడానికి మాత్రమే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమో అవతలి వ్యక్తి ఆ పని పట్ల వంద శాతం పర్ఫెక్ట్ గా ఉన్నారో లేదో ఎవరికి తెలుసు. ఎప్పుడైనా చేసేపని పట్ల నమ్మకమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే సగం విజయాన్ని చేకూరుస్తుంది అనే విషయం మరువకూడదు.  మీరు ఒంటరి కాదు.. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యావసానాల గురించి ఆలోచించేటపుడు నాకు ఒక కుటుంబం ఉంది, దాని సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అని విషయాన్ని మరువకూడదు. అలాగే  తీసుకోబోయే నిర్ణయం గురించి కుటుంబ సభ్యులతో వివరంగా చెప్పాలి. దాని గురించి చర్చించాలి. ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంటున్నారో వాళ్లకు అర్థమయ్యేలా చెబితే  తప్పకుండా మీకు సపోర్ట్ లభిస్తుంది. ప్రణాళిక… నిర్ణయం వెనుక ఒక ప్రణాళిక అవసరం. ఆ ప్రణాలికను అనుసరించి మెల్లిగా అడుగులు వేస్తూ చేయబోయే పనికి సంసిద్ధం కావాలి. దానివల్ల గందరగోళం ఉండదు. గమ్యం ఏమిటో స్పష్టం గా తెలుసు కాబట్టి భయం అక్కర్లేదు. వాస్తవిక కోణం.. ఇది చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరూ ప్రతి పనీ విషయంలో, నిర్ణయం తీసుకునే విషయంలో దీన్ని తప్పక అర్థం చేసుకోవాలి. మనం చేయగలిగింది పని పట్ల వంద శాతం కష్టపడటం, నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల నుండి ఆలోచించడం. ఇలా అన్ని చేసిన తరువాత వేసే అడుగుకు, తీసుకునే నిర్ణయానికి వచ్చే ఫలితం ఏదైనా దాన్ని స్పోర్టివ్ గా రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడే మనిషిలో జీవితం పట్ల కూడా ఓ అవగాహన ఏర్పడుతుంది. పైన చెప్పుకున్న అన్నిటినీ ఫాలో అయితే నిర్ణయాలు తీసుకోవడానికి భయపడటం, ఆ తరువాత ఏదో అయిపోయిందని బాధపడటం అసలు జరగదు సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ

పెంపుడుజంతువుని బట్టి మనస్తత్వం

కొంతమందికి కుక్కపిల్లలంటే ఇష్టం. మరికొందరేమో పిల్లులంటే పడి చస్తారు. ఇంకొందరేమో చేపల్ని చూస్తూ జీవితాన్ని గడిపేస్తారు. లోకోభిన్నరుచి కదా! కానీ మనం ఇష్టపడే పెంపుడు జంతువులకీ, మన మస్తత్వానికీ మధ్య సంబంధం ఉందంటే నమ్మగలరా? మీరే చూడండి...   కుక్కలు : కుక్కపిల్లల్ని పెంచుకోవాలనుకునేవారు మంచి చలాకీగా ఉంటారట. వీళ్లు బహర్ముఖులై (extroverts) ఉంటారనీ, ఇతరులతో త్వరగా కలిసిపోతారనీ అంటున్నారు. పట్టిన పట్టు విడవని మనస్తత్వం వీరి సొంతమట. వీళ్లతో ఉంటే కాలం సరదాసరదాగా గడిచిపోతుందంటున్నారు. నలుగురితో కాలక్షేపం చేయడం, విహారయాత్రలు చేయడమంటే వీరికి మహా ఇష్టం. పైకి ఇంత సరదా సరదాగా కనిపిస్తున్నా... నిబంధనలను పాటించే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరని హామీ ఇస్తున్నారు.   పిల్లులు : కుక్కల్ని ఇష్టపడేవారు బహర్ముఖులైతే, పిల్లుల్ని పెంచుకోవడానికి మొగ్గు చూపేవారు అంతర్ముఖులుగా (introvert) ఉంటారని తేలింది. ఆ అంతర్ముఖత కారణంగా వారిలో సృజన ఎక్కువగా ఉంటుంది. ఉద్వేగమూ ఎక్కువగా ఉంటుంది. నలుగురూ వెళ్లే దారిలో కాకుండా తమకంటూ ఒక సొంత మార్గాన్ని ఎంచుకునే తత్వం వీరిలో ఉంటుంది.   పక్షులు : పక్షలని పెంచుకోవాలని తపించేవారిలో ఇతరుల పట్ల జాలి, కరుణ పొంగిపొర్లుతూ ఉంటాయట. వినయవిధేయతలు కూడా ఉట్టిపడుతూ ఉంటాయి. మనసులో మాటని వీరు ప్రభావవంతంగా చెప్పగలుగుతారట. బయట తిరిగేందుకు మహా ఇష్టపడతారట.   చేపలు: చేపలని తొట్టెలో చూసుకుంటూ మురిసిపోయేవారు అల్పసంతోషులై ఉంటారట. వీరిలో హాస్య చతురత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు! వీరు నిస్వార్థగుణం ఎక్కువగా ఉంటుందనీ, భవిష్యత్తు పట్ల నిరంతరం ఆశావహ దృక్పథంతో ఉంటారనీ చెబుతున్నారు.   పాకే జంతువులు (reptiles) : తాబేళ్లు, పాములులాంటి జీవుల్ని పెంచుకునేవారు చాలా విభిన్నంగా ఉంటారని తేలింది. ఇతరులతో పోలిస్తే చాలా స్వతంత్రంగా ప్రవర్తిస్తారట. చుట్టుపక్కలవారితో అంటీముట్టనట్లు ఉంటారట. వీరిలో హాస్య చతురత కూడా చాలా తక్కువగా ఉంటుందని తేలింది. వీరు ఎప్పుడెలా ప్రవర్తిస్తారో, దేనికెలా ప్రతిస్పందిస్తారో అంచనా వేయడం కూడా కష్టమేనని అంటున్నారు. - నిర్జర.    

మూగ జీవాలు మనసు రాగాలు

మనిషికో మాట గొడ్డుకో దెబ్బ!! ఇది పెద్దల మాట.  ప్రస్తుత కాలంలో ప్రేమ, అభిమానం, నమ్మకం ఇవన్నీ దొరుకుతున్న సందర్భాలు చాలా తక్కువ. మనిషికి మనిషికి మధ్య అర్థం చేసుకునే సామర్థ్యము చాలా తగ్గిపోయింది.పసిపిల్లలు, మూగజీవాల దగ్గర దొరికే ఆనందం, ప్రేమ మరెక్కడా దొరకవు అనేది ఒప్పుకోవలసిన నిజం. ముఖ్యంగా జంతువులతో స్నేహం చేసేవారి మనసు ఎంతో జాలి, దయ, కలిగి ఉంటాయని అంటుంటారు.  జంతువుల పెంపకం ఎలా ఎక్కడ మొదలయ్యిందో కానీ, మనిషికి, ప్రకృతికి మధ్య ఈ జంతువులు అనుసంధాన కర్తలుగా మారిపోయాయని చెప్పవచ్చు.  మొదట అవసరాల కోసం జంతువులను పెంచుకోవడం మొదలుపెట్టి ఇప్పుడు అదొక విలాసవంతమైన జీవితానికి స్టేటస్ లా మారిపోయింది. కాసింత అన్నం పెట్టామంటే రోజంతా ఇంటి ముందరే ఉంటూ తమ విశ్వాసాన్ని ప్రకటిస్తాయి. ఎక్కడికైనా వెళ్తుంటే వెంట వచ్చి నేనున్నా నీతో అనే స్నేహహస్తాన్ని ఇస్తాయి. ప్రమాదాలను పసిగడతాయి, రక్షణ కల్పిస్తాయి. ఇలా బోలెడు సంగతులున్నాయి పెంపుడు జంతువుల గురించి.  అయితే కాలంతో పాటు కొన్ని మారినట్టు జంతువుల విషయంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొన్ని జంతువుల ఉనికి మెల్లిగా మాయమైపోతోంది. పక్షులు, జంతువులు మానవుడి నాగరిక కృత్యాలకు అంతరించిపోతున్నాయి.  మాంసం, అవయవాలు, చర్మం వీటికోసం కొన్ని జంతువులను మనిషి చంపుకుంటూ పోతూ చివరికి ఆ జంతు జాతులను అంతం చేస్తున్నాడు. అడవి జాతుల జంతువులు ఇలానే తగ్గిపోయాయి, ఇంకా తగ్గిపోతూ ఉన్నాయి. అడవులను ఇష్టానుసారం నరికేయడం వల్ల వాటికి నివసించే వెసులుబాటు లేక, అవి ప్రజల మధ్యకు వస్తున్నాయి కానీ, లేకపోతే వాటికి అడవిలో ఉన్నంత హాయి మరెక్కడా ఉండదని ఆలోచించరేం?? జంతువులను హంగు కోసం పెంచేవాళ్ళు ఉంటారు. అలాంటివాళ్ళు వాటిని కట్టేస్తూ, కొడుతూ, వాళ్ళు చెపినట్టు వినాలని, వాటి నుండి ఎంటర్టైన్ పొందాలని చూస్తారు. ఇది చాలా తప్పు అని విషయం మాత్రం వాళ్ళు గ్రహించరు. డబ్బు పెట్టి పెట్స్ ను కొనుక్కున్నంత మాత్రాన వాటిని హింసించే అధికారం ఎవరికి ఉండదు అనే విషయం అందరూ తెలుసుకోవాలి.  పిల్లలకు ప్రేమ, జాలి, దయ పెంపొందాలంటే మొక్కల పెంపకం, జంతువుల పెంపకానికి మించిన ఉత్తమ మార్గం వేరొకటి లేదని చెప్పాలి. జంతువులను ట్రీట్ చేసే విధానం, వాటికి ఆహారం పెట్టడం, అసహ్యించుకోకుండా ఉండటం వంటివి పిల్లలకు నేర్పాలి. ముఖ్యంగా వీధి కుక్కలు, పిల్లులు,పిచ్చుకలు, కాకులు  మొదలైనవాటికి ఆహారం, నీరు వంటివి పెట్టడం ద్వారా వ్యక్తిత్వ విలువు పెరగడం గమనించవచ్చు. జంతు సంరక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చినా అవన్నీ కూడా చట్టలుగా మిగలకుండా ఆచరణలోకి రావాలంటే ప్రతి ఒక్కరూ వాటి విషయంలో బాధ్యతగా ఉండాలి.  అయితే ఈ పెంపుడు జంతువుల విషయంలో మరొక విషయం కూడా చెప్పుకోవాలి. ప్రస్తుత కాలం  అనుసరించి మనిషికి సంక్రమించే జబ్బులకు జంతువులు కూడా కాస్తో, కూస్తో కారణం అవుతున్నాయి. కాబట్టి వాటిని పెంచుకోవడంలో అభ్యంతరాలు ఉండకూడదు కానీ, వాటిని పడక గదిలో, వంటగదిలో, అందరూ భోజనం చేసే స్థలాలు మొదలైన వాటికీ దూరంగా ఉంచాలి. వాటిని ముద్దుపెట్టుకోవడం వంటివి చేయకూడదు.  జంతువులు కూడా ఈ ప్రపంచంలో మనుషులతో పాటు నివసించే జీవులే. వాటి కంటే మనిషి పరిధి విస్తృతం అయినంత మాత్రాన వాటిని తక్కువగా చూస్తూ వాటి పట్ల అమానుషంగా ప్రవర్తించకూడదు.  అక్టోబర్ 4, world animal day సందర్భంగా అయినా ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియబరిచి జంతువుల పట్ల మనుషుల వైఖరి ఉన్నతంగా ఉండేలా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే జంతువులు మునుషులకంటే ఉన్నతమైన హృదయం కలిగినవి మరి!! ◆ వెంకటేష్ పువ్వాడ  

జై జవాన్ జై కిసాన్ జయహో శాస్త్రీజీ!!

అక్టోబర్ 2 ప్రత్యేకత ఏమిటని అడిగితే భారతమంతా గాంధీ పేరు చెబుతుంది. కానీ దేశం కోసం పాటు పడిన శాస్త్రీ గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. భారత చరిత్రలో గర్వంగా చెప్పుకోదగ్గ పేరు లాల్ బహదూర్ శాస్త్రీ. విలువల జీవితాలు ఎప్పుడైనా చదవాలని అనిపిస్తే అందులో మొదటి వరుసలో లాల్ బహదూర్ శాస్త్రి గారి జీవితాన్ని చేర్చవచ్చు. స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, గాంధీకి నెహ్రు కు ఎంతో ప్రియమైన వ్యక్తిగా మెలిగిన శాస్త్రి గారి గురించి భారత ప్రజలకు సరిగా తెలియని ఎన్నో ఆసక్తికర  విషయాలు ఉన్నాయి. భారతదేశానికి మొట్టమొదటి రైల్వే మంత్రిగా పనిచేసిన శాస్త్రి గారు, తరువాత హోం మినిష్టర్ గా,  తరువాత ప్రధానమంత్రిగా కూడా చేసినా మరణించే వరకు తనకంటూ సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోలేదు అంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో అర్థమవుతుంది. అణువంత స్థానం దొరకగానే దొరికిన వరకు దోచుకోవాలని అనుకునే రాజకీయాల్లో ఎంతో నిజాయితీ కలిగిన శాస్త్రి గారిలాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు.  శాస్త్రి గారి వ్యక్తిత్వమెలాంటిదో ఒక చిన్న ఉదాహరణ!! లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన పెద్దకొడుకు హరికృష్ణ శాస్త్రి అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్త్రికి సీనియర్ జనరల్ మేనేజర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ రాగానే ఎంతో సంతోషించిన హరికృష్ణశాస్త్రి మరుసటిరోజు లాల్‌ బహదూర్‌ శాస్త్రి గారి దగ్గరకు వెళ్లి, తనకు ప్రమోషన్ వచ్చిన విషయం  తెలిపాడు. అప్పుడు శాస్త్రి గారు ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేను ఊహించగలను. ఇప్పుడు ప్రమోషన్ ఇస్తారు మళ్లీ కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయం చేయమని నీ ద్వారా నాదగ్గరకు వస్తారు. నేను వాళ్లకు సహాయం చేశాను అనుకో  దేశ ప్రజలు ఏమనుకుంటారో తెలుసా!! శాస్త్రి గారి అబ్బాయి పనిచేసే కంపెనీ కాబట్టే శాస్త్రి గారు సహాయం చేసారు అని అనుకుంటారు. నీటి నిజాయితీల ఆధారంగా, ధర్మ బద్దంగా ఉండాల్సిన ప్రధానమంత్రి కొడుకు కోసం ఆ సంస్థకు సహాయం చేసారు అని చెప్పుకుంటారు.  నేనే అలా.చేస్తే సామాన్య ప్రజలు ఇలా విలువల గురించి ఆలోచిస్తారా??  నీకూ తెలుసు. పాలకుల నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట. లంచాల కోసము, కొడుకుల భవిష్యత్తు కోసం ఎన్నెన్నో స్కామ్ లలో దిగుతున్న నేటి రాజకీయ నాయకులు అలవాటు చేసుకోవలసిన వ్యక్తిత్వం శాస్త్రి గారిది. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో సైనికుల కోసం, దేశంలో ఆహారం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోకుండా, సొంతంగా మన దేశమే అధిక దిగుబడులు సాదించాలంటే రైతులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో  "జై జవాన్ జై కిసాన్" నినాదాన్ని భారతానికి అందించిన శాస్త్రి గారు, ఆయన జీవితం, ఆయన నమ్మిన విలువలు, ఆచరించిన విధానం అన్ని కూడా ప్రతి ఒక్కరికి గొప్ప పాఠాల్లాంటివి!! కాదంటారా?? ◆ వెంకటేష్ పువ్వాడ

గాంధేయ మార్గమే భవిష్యత్ సోపానం!!

మామ కాని మామ ఎవరు?? చందమామ!! బావ కాని బావ ఎవరు?? కాకి బావ!! కోడి కాని కోడి ఏది?? పకోడి  చిన్నపిల్లలకు సరదాగా చెప్పే ఈ మాటల్లో మరొకటి చేర్చాలి. యావత్ భారతము ఒక్కే పలుకుగా పలికే మరొక మాటను కూడా చేర్చాలి. ప్రతి కుటుంబంలో పిల్లలు, పెద్దలు అందరూ తమ సొంతమన్నట్టు ఆప్యాయంగా పిలుచుకునే పలుకు చేర్చాలి. అదే… తాత కాని తాత ఎవరు?? గాంధీ తాత!! ప్రతి ఒక్కరూ ఏక కంఠంగా చెప్పే మాట ఇది. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల జాబితాలో మొదటగా స్మరించుకునే పేరు మహాత్మా గాంధీ!! ఎందరో ఎన్నో పోరాటాలు చేసినా గాంధీని ఎక్కువగా చెప్పుకోవడానికి కారణం ఏమిటని చూస్తే కనిపించేదే అహింసా ఆయుధం!! నిజమా చెప్పాలంటే ప్రతి మనిషిని తమ జీవితంలో దేన్నీ వదిలేస్తే హాయిగా సంతోషంగా ఉండగలడో దాన్నే వదిలి పోరాటం చేయమన్నాడు గాంధీ!!  బాపూజీ అని కూడా పిలుచుకునే మన గాందీ జీవితం విశ్లేషణగా తెలుసుకుంటే ఎన్నో అర్థమవుతాయి. మానసికంగా, వ్యక్తిగతంగా కూడా ఎంతో మార్పు మనిషిలో చోటు చేసుకుంటుంది!!  అహింసా ఆయుధం!! చాలామంది గాంధీ అహింసను భోదించాడు దానివల్ల నష్టం ఎంతో జరిగిందని అనుకుంటారు కానీ ఆ అహింస అనే మార్గం అప్పటికప్పుడు పుట్టినది కాదు. ఆయన జీవన ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఎన్నో సందర్భాల ఫలితాల నుండి పుట్టినదే ఆ ఆలోచన. ఇది అర్థం చేసుకోలేని వారు నిజంగా ఆలోచనా శక్తి లేనివాళ్లే అనుకోవాలి. ప్రతి మనిషి మరొక మనిషిని, లేదా జంతువును, లేదా పక్షులను ఇలా ఇతర జీవులను హింసించే స్వభావం అంతర్లీనంగా కలిగి ఉంటారు. వాటిని కొన్ని మార్గాల ద్వారా నిర్మూలించుకుని హింసకు దూరంగా ఉంటూ సకల జీవులను ప్రేమించే గుణాన్ని పెంపొందించుకోవచ్చు. అయితే ఆ హింసా ప్రవృత్తిని వదిలిపెట్టకపోతే మనిషిలో సాత్విక గుణం అనేది నశించిపోయి మృగానికి సమానమైన వ్యక్తిత్వానికి చేరుకుంటాడు. అందుకే అహింసా మార్గం ఎంతో గొప్పది. చిన్న పిల్లలకు కూడా బాగా తెలిసిన కథ మూడు ప్రమాణాలు, వాటినే three promises  అనే పేరుతో కథలుగా చెబుతుంటారు కూడా. గాంధీ దక్షిణాఫ్రికా ప్రయాణంలో తల్లికి చేసిన ప్రమాణాలు లేదా మాటలే ఎంతోమందికి మార్గదర్శకాల వంటివి. మద్యానికి దూరంగా ఉండటం మాంసాన్ని దూరంగా ఉండటం స్త్రీల మీద వ్యామోహం లేకుండా ఉండటం. ప్రస్తుత సమాజంలో ఈ మూడింటి వల్ల నష్టపోయేవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. ముఖ్యంగా, మద్యం,  స్త్రీల మీద వ్యామోహం ఉన్న మగవాడు బాగుపడుతున్న ఛాయలు ఎక్కడా లేవనేది నిజం. సత్యాగ్రహ సాధనం ఆయుధాలు చేతబట్టి యుద్ధంతో చేయలేని పనిని మౌనాన్ని ఆయుధంగా చేసుకుని సాదించడ్సమ్ ఎలాగో నేర్పినవాడు మహాత్ముడు. చంపారన్ సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం ఇలా ఎన్నో గాంధీ ఆధ్వర్యంలో జరిగాయి. వీటిలో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ "do or die" అని దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు ఎంతో శక్తిమంతంగా పనిచేసింది. ఇంకా తన నూలు తానే వడకటం, తన బట్టలు తానే ఉతుక్కోవడం,  గాంధీ తన ఆశ్రమంలో క్రమశిక్షణగా ఉంటూ అందరికి ఆదర్శవంతంగా ఉండటం చూస్తే!!  మనిషి మరొకరికి ఏదైనా చెప్పే ముందు తాను సక్రమంగా ఉండాలి అని విషయం గుర్తొస్తుంది. దేశానికి, ప్రపంచానికి అహింసాను భోదించింది, సత్యమేవ జయతే అనే మాటను విశ్వసించి, దాన్ని అక్షరాలా తన జీవితంలో ఆచరణలో పెట్టిన మహాత్ముడి గురించి ఇలా నాలుగు మాటలు చెప్పుకుని నిశ్శబ్దం అవ్వకూడదు. నేటి బాలలకు గాంధీ జీవితాన్ని పరిచయం చేసి విలువల కోటలను నిర్మించాలి. ◆ వెంకటేష్ పువ్వాడ

జీవితాన్ని అప్డేట్ చెయ్యండి

కాల గమనంలో జీవిత చిత్రం మునపటిలా లేదు. చాలా మార్పు వచ్చింది. ప్రపంచం ఇపుడు స్మార్ట్ ఫోన్ రూపంలో మన చేతిలోకి వచ్చింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే స్మార్ట్ ఫోన్ మనిషికి శరీరంలో భాగం అయిందంటే అతిశయోక్తి కాదు. ఈమధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో చూసి ఆశ్చర్యపోయాను. ఫోన్ వ్యాపకంలో పడి ఆటో లో బాబుని మర్చిపోయు వెళ్తుంది. అది గమనించిన ఆటో డ్రైవర్ ఆ పాపని ఎత్తుకొని వెళ్లి ఫోన్ ప్రపంచంలో ఉన్న తల్లికి ఇస్తాడు. ఇదీ పరిస్థితి  పత్రికల్ని చదవడానికి ఆన్లైన్ న్యూస్, బ్రష్ పేస్ట్ నుంచి కూరల్లో కరివేపాకు వరకు ఆన్లైన్ ఆర్డర్స్, స్నాక్స్ కావాలంటే స్విగ్గీ జామాటో లో నచ్చినవి ఇంటికి తెచ్చిపెట్టే సంస్థలు. వీటన్నింటికీ ఆవాసం స్మార్ట్ ఫోన్. అందుకే ఇది లేకుండా ప్రస్తుత జీవన విధానాన్ని ఊహించలేము. ఇంట్లో కూర్చున్న కుర్చీలోంచి లేవకుండా కావాల్సిన అవసరాలు తీరిపోతాయి.  అయితే వీటి కారణంగా మనిషి తెలియని ఒత్తిడికి లోనవుతున్నాడు. ఆర్డర్ చేసినవి సక్రమంగా వచ్చాయో లేదో! లేకుంటే తిరిగి ఆర్డర్ చేయడం, చేసినదానికోసం పడిగాపులు కాయడం, ఒక సైజ్ ఆర్డర్ చేస్తే ఇంకో సైజ్ రావడం ఇలాంటివన్నీ మనిషి కచ్చితత్వాన్ని ప్రశ్నిస్తాయి. అంతేకాదు  అంతర్లీనంగా బద్దకాన్ని  కూడా అలవాటు చేస్తుంది. ఈ కొత్త లైఫ్ స్టైల్ లో కొన్ని అవసరం లేని సౌకర్యాలను కత్తిరించుకొని బద్దకానికి ఆలవాలం అయిన వాటిని ట్రిమ్ చేస్తే జీవితం స్మాట్ గా ఉంటుంది. పొద్దున్నే పేపర్ కొని చదవండి. ఇంట్లోకి కనీస అవసరాలు అయిన వంట సామాను, కూరగాయలు, పేస్ట్, బ్రష్ షాప్ కి వెళ్లి స్వయంగా కొని తెచ్చుకోండి. బయట ప్రపంచం స్థితిగతులు,మార్కెట్ హెచ్చుతగ్గులు తెలుస్తాయి. వాస్తవిక ప్రపంచానికి దూరం కాకుండా ఉంటారు. అప్డేట్ అంటే అర్థం ఉన్న స్థితి కంటే ఇంకా సౌకర్యం అయిన స్థితికి రూపాంతరం చెందటం. కానీ ఇక్కడ మనం అచేతనమైన స్థితికి దిగజారుతున్నాము. అందుకే అవసరం లేని సౌకర్యాలను తీసేసి ఆరోగ్యకరమైన జీవితంగా అప్డేట్ చేసుకోండి. అప్పుడే సమాజం చేతనవంతమై ప్రకాశిస్తుంది. ◆ వెంకటేష్ పువ్వాడ  

మనసు తెరచి హృదయానికి వైద్యం చేద్దాం!!

సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే గా నమోదు అయింది. అయితే ఈరోజున ఇప్పటి పరిస్థితుల గురించి మాట్లాడుకోవడం కాసింత బాధగా అనిపిస్తుంది. కారణం గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి ఏడాదికి పెరుగుతూ పోవడమే. గత రెండు సంవత్సరాల నుండి అయితే ఈ గుండె సంబంధ సమస్యలు ఉన్నవారు చాలా ఇబ్బంది పడ్డారని చెప్పవచ్చు. కారణం మహమ్మారి కరోనా!! ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 18.6 మిలియన్ల మంది గుండె సంబంధ సమస్యల వల్ల మరణిస్తున్నారంటే దాని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. మనుషుల జీవన సరళిలో అలవాట్లు అయిన ధూమపానం, మద్యపానం, మధుమేహం, ఊబకాయం వంటివి కాకుండా బయటి నుండి ఎదురయ్యే వాయుకాలుష్యం వంటివి కూడా గుండె సమస్యలకు కారణం అవుతాయి.  సమస్య ఎక్కడ?? జీవన శైలిని మారుతున్న కాలానికి తగ్గట్టు మార్చుకుంటే పర్వాలేదు కానీ ఆ మారుతున్న కాలంతో పూర్తిగా లీనం చేస్తే శరీరానికి నష్టం కలుగుతుంది. అలాంటివే ఆరోగ్య సమస్యలు. మానవ శరీరానికి కొన్ని నియమాలు, మరికొన్ని మార్గనిర్దేశకాలు ఎప్పటి నుండో ఉన్నాయి. అయితే వాటిని మూలన పడేసి కాలంతో పరిగెడుతూ కాలం తెచ్చే మార్పులకు శరీరాన్ని మౌల్డ్ చేస్తే శరీరం ఇబ్బంది పడక ఇంకేమి చేస్తుంది. మనిషి మానసికంగా కాలానికి తగ్గట్టు మారాలి. శారీరకంగా ఒక పటిష్టమైన వలయాన్ని నిర్మించుకోవాలి. ఇది ఎవరు గుర్తించడంలేదు కాబట్టే ప్రస్తుత కాలంలో శరీరం జబ్బులకు లోనవుతోంది. వాటిలో గుండె సమస్య కూడా ఒకటి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవడం, పనులు చేయకపోవడం, ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం మొదటి కారణాలు. పరిష్కారాలు ఏమిటి?? గుండె సంబంధ సమస్యలకు మొదటి పరిష్కారం మానసిక ప్రశాంతత. కానీ మనుషులు మానసికంగా కష్టపడుతూ, శారీరకంగా నష్టపోతున్నారు. శారీరకంగా కాశగాపడి, మానసికంగా బలపడటం మంచి మార్గం. అలాగని చాలా కష్టం చేసేయ్యక్కర్లేదు. గుండె సంబంధ సమస్యలు లేనివాళ్ళు శారీరక కష్టం ఎక్కువ చేస్తే ఆ సమస్యలు ఏవి దరిదాపుల్లోకి రావు.  ఎప్పటికప్పుడు చెకప్ చేయించుకుంటూ ఉండాలి. దీనివల్ల ఒక నిశ్చింత. సినిమాలు, పార్టీలకు ఖర్చు పెట్టె డబ్బును ఆరోగ్యం కోసం ఖర్చు చేయవచ్చు కదా!! అందుకే చెకప్ అనేది ముఖ్యమైనది. ఈ కరోనా కాలంలో చెకప్ లకు వెళ్లలేక చాలామంది ఇబ్బంది పడ్డారు. అలాంటి వాళ్ళు ఆన్లైన్ లో డాక్టర్ ను కన్సల్ట్ అవ్వడం ఉత్తమం. ఇంటర్నెట్ సౌకర్యం లేనివాళ్ళు, అవగాహన లేనివాళ్ళు చుట్టుపక్కల చిన్న క్లినిక్ లలో ఉన్న డాక్టర్ల సహాయంతో ఆన్లైన్ కన్సల్ట్ అవ్వచ్చు. కరోనా వల్ల ఎవరితో ఎక్కువగా కలవలేకపోతున్నామని బెంగ అక్కర్లేదు. మొబైల్ లోనే కాన్ఫెరెన్సు కాల్స్, వీడియో కాల్స్ వంటి వాటితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ స్నేహితులు మరియు బంధువుల నుండి భరోసా పొందొచ్చు. తిండి, నిద్ర, వ్యాయామం చాలా ముఖ్యమైనవి. ప్రతి రోజు వీటి విషయంలో జాగ్రత్తలు అవసరం ఏమి తింటున్నాం అనే విషయం నుండి, నిద్ర, వ్యాయామం విషయంలో ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకోవాలి.  ఇష్టమైన పనిని ఇష్టంగా చేయడం వల్ల మనసుకు హయిగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచే మార్గమిది. అనవసర విషయాలు నెత్తిమీదకు వేసుకుని ప్రశాంతతను పోగొట్టుకోకూడదు. "Heart donation is the promotion of humanity"  ప్రతి సంవత్సరం గుండె సంబంధ సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్య 18.6 మిలియన్ల మంది అయితే అన్ని కారణాల వల్ల ప్రతి సంవత్సరం మరణిస్తున్నవారి సంఖ్య 60 మిలియన్లుగా నమోదు అయింది. దీన్ని బట్టి చూస్తే యాక్సిడెంట్లు, ఆకస్మిక మరణాలు వంటి వాటి ద్వారా మరణించే వారి గుండెను దానం చేయడం వల్ల 18.6 మిలియన్ల మరణాల్లో కనీసం ఒక్కరి ప్రాణాన్ని రక్షించగలిగినా ఈ సమాజంలో మానవత్వపు ఛాయలను పెంపొందించవచ్చు. రేపటి తరానికి మనం ఇవ్వగలిగే అతిగొప్ప బహుమతి కూడా ఇలాంటి మనవత్వపు విలువల ప్రాముఖ్యత తెలియజేయడమే. కాబట్టి బతికున్నతవరకు గుండెను కాపడుకోవడమే కాదు, చనిపోయిన తరువాత గుండెను దానం చేయడం వల్ల కూడా మళ్లీ బతికే అవకాశం పుష్కలంగా ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ

నేటి బాలలే రేపటి దేశముదుర్లు

మన తెలుగు క్యాలెండర్ లో ఎంతో గొప్పధనం ఉంది. వారాలు, తిథులు, నక్షత్రాలు, నెలలు, ఋతువులు, పండుగలు, సంవత్సరాలు ఇలా ఎన్నో. పిల్లల భాషా సామర్త్యానికి వీటన్నింటినీ ప్రాథమికంగా నేర్పడం మొదటి మెట్టు అని నమ్మేవాళ్ళు ఒకప్పుడు. తల్లిదండ్రుల నుండి బడిలో ఉపాధ్యాయుల వరకు అందరూ కూడా వీటిని బోధించేవారు. అయితే రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్టు అనే  పెద్దల సామేత ఇప్పుడు నిజమైందని అనుకోవచ్చు. అవును మరి పిల్లల విషయంలో, ముఖ్యంగా చదువు విషయంలో ఎటు పోతోంది ఈ సమాజం అని ప్రశ్నించుకోవలసి వస్తోంది. ఏమి నేర్పుతున్నారు అసలు?? ఈకాలంలో పిల్లలు పుట్టగానే వారిని ఏ కోర్స్ లో చేర్పించాలి, ఏ ఫీల్డ్ లో తోయాలి, ఏ వృత్తిలో చూడాలి వంటివి నిర్ణయం జరిగిపోతున్నాయంటే పిల్లల మీద ఎంత ఒత్తిడి పెంచుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు అమ్మా, నాన్నా అనే మాటలు వదిలి మామ్, డాడ్ అనే మాటలే పిల్లల తొలిపలుకులు  అవుతుంటే తెలుగు వారిగా సిగ్గుపడాలి కదా అనిపిస్తుంది.  నర్సరీలు, ఎల్.కె.జీ లు, యు. కె.జీ లు వీటితోనే ర్యాంకుల గోల మొదలై, ప్రాథమిక తరగతిలో ప్రాథమికోన్నత చఫువులు, ప్రాథమికోన్నత తరగతిలో ఐటి చదువులు, ఇలా అంతకంతకూ పిల్లల మానసిక సామర్త్యాన్ని అర్థం చేసుకోకుండా చదువుల పట్టిక పెంచుకుంటూ, తమ పిల్లలు తొందరగా అన్ని నేర్చుకుని గొప్ప ఉద్యోగాలలో చేరిపోవాలని తల్లిదండ్రులు, పిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకుంటే తమ విద్యాసంస్థలకు మరింత ఆర్థిక స్థాయి మరియు పేరు కూడా మెరుగవుతుందని విద్యాసంస్థలు ఇలా ఆలోచిస్తూ పిల్లల గురించి మాత్రం కొద్దిగా కూడా ఆలోచించడం లేదు.  ఏమి జరుగుతోంది?? ఈ విపరీత ధోరణి వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరిగి చదువు అంటేనే విరక్తి కలిగేలా తయారవుతున్నారు. చదువును పోటీగా తీసుకోవడం వల్ల దాన్ని ఆస్వాదించలేకపోతున్నారు.  ప్రతినిత్యం టార్గెట్లు, ర్యాంకుల వలయంలో నలిగిపోతూ, చదవకపోతే ఎదురయ్యే పనిష్మెంట్లు, తల్లిదండ్రుల నుండి ఎదుర్కోవలసిన తిట్లు మొదలైన వాటికి భయపడి కృత్రిమంగా పుస్తకాలలో విషయాన్ని చదువుతూ, పరీక్షలు రాస్తూ, ర్యాంకులు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ కృత్రిమత్వం అంతా కలగలిసి వారి జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తోంది. మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవన్నీ కనుమరుగై ఎలాగైతే పుస్తకాలను యాంత్రికంగా తిరిగేశారో అదే విధంగా మనుషుల విషయంలో కూడా చేస్తున్నారు. ఫలితంగా మనుషుల మధ్య బాంధవ్యాలు చాలా పెళుసుగా ఉంటున్నాయి. చిన్నచిన్న గొడవలకే బంధాలను తెంచుకోవడానికి సిద్ధమైపోతున్నారు.  ఏమి చేయాలి?? పిల్లలకు చిన్నతనం నుండే జీవిత విలువలు తెలిసేలా చేయాలి. పిల్లలకు చదువు ముఖ్యమే, ఇంగ్లీష్ భాష ప్రస్తుత పోటీ ప్రపంచానికి అవసరమే. అయితే ఇక్కడ గుర్తించాల్సింది మాతృభాషలో పిల్లల మానసిక నైపుణ్యం పదింతలు మెరుగ్గా పెంపొందుతుంది. మాతృభాషలో ఉన్న జీవం, అందులో అర్థమైన నవరసాలు వేరే ఇతర భాషలో పిల్లలు గ్రహించలేరు. దీనివల్ల పిల్లల్లో ఒకానొక ఆస్వాదించే గుణాన్ని చిన్నతనంలోనే కోల్పోతారు.  పిల్లలు ఎన్ని భాషలలో చదువుకున్నా ఇంట్లో మాతృభాషలో మాట్లాడేలా అలవాటు చేయాలి. చాలామంది తల్లిదండ్రులకు పిల్లలు చిన్నతనంలోనే మొబైల్స్, గాడ్జెట్స్, సిస్టం ఆపరేట్ చేస్తుంటే చాలా గొప్పగా సంబరంగా చెప్పుకుంటారు. దానివల్ల పిల్లలకు ఎదురయ్యే చెడు గురించి పెద్దలు పెద్దగా పట్టించుకోరు. కాబట్టి వాటిపై దృష్టి పెట్టాలి. కళల ద్వారా పిల్లలు తొందరగా నేర్చుకునే నైపుణ్యాన్ని సాదించగలుగుతాడు. పిల్లలను సంప్రదాయ ఆటల్లో మరియు, స్కిల్స్ పెంపొందెందుకు ఉపయోగపడే ఆటలలో ప్రోత్సహించాలి. కథలు చెప్పడం, కథలు చెప్పించడం, పిల్లలతో చిన్న చిన్న సంఘటనలు రాయించడం ఇలాంటివి చేయడం వల్ల పిల్లల దృష్టి విస్తృతం అవుతుంది. చివరగా పిల్లల విషయంలో తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్త పిల్లలను పిల్లలుగా ఉండనివ్వాలి. బాల్యాన్ని ఆస్వాదించేలా చేయాలి. ఎప్పుడైతే సంపూర్ణ బాల్యాన్ని వాళ్లకు అందివ్వగలుగుతామో వాళ్ళు సంపూర్ణ మేధస్సును పెంపొందించుకుని, ఉపయోగించుకోగలుగుతారు. ◆వెంకటేష్ పువ్వాడ

శాంతి కపోతాలను తయారు చేద్దాం

ప్రతి మనిషి తన జీవితంలో ఎక్కువగా అనే మాట మనశాంతి కరువైంది అని. ఈ మనశాంతి మనసులో ఎలాంటి అలజడులు లేకుండా కలిగే ఒకానొక అనిర్వచనీయ భావన. అయితే ఇది కేవలం మనిషికి మాత్రమే కాదు. మనిషి నుండి సమాజానికి, సమాజం నుండి రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచం ఇలా అన్నిటికి పాకుతూ ఉంటుంది. ఒక మనిషి విషయంలో దీన్ని మనశాంతి అని సంభోదిస్తే, సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం వీటన్నిటి కోణంలో శాంతి అని పిలుస్తాము.  సెప్టెంబర్ 21ని ప్రపంచ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే కేవలం ఇలా జరుపుకోవడంతో శాంతి చేకూరుతోందా?? దేశాల మధ్య సామరస్యత కోసం, యుద్ధాలు జరగకుండా ఉండాలని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన ఈ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని అయినా కాసింత ప్రశాంతంగా ఆలోచించాలిప్పుడు. ప్రారంభం ఎక్కడ?? హింస అనేది మనిషితో మొదలై సమాజంలో వేళ్ళూనుకుని అది కాస్తా పెరిగి పెద్దదై రాక్షసి రూపం దాల్చి సమాజాన్ని, దేశాన్ని ప్రపంచాన్ని కూడా అతలాకుతలం చేస్తుంది. ఇరుగు పొరుగు ఇళ్లలో మనుషులు కొట్టుకున్నట్టు, గొడవ పడినట్టు, ఇరుగు పొరుగు దేశాల గొడవలు, యుద్ధాలు. ఇవన్నీ మెల్లిగా మొదలై విశ్వరూపం దాల్చే విషవాయువులు. ఎంతో మందిని బలితీసుకుంటాయి. చర్యలు ?? ప్రపంచ దేశాల మధ్య శాంతి కోసం జరిగే ఒప్పందాల కంటే మనుషుల మధ్య కలగాల్సిన అవగాహన చాలా ఎక్కువ ఉంది. ఇది ముమ్మాటికీ నిజం. కులం పేరుతోనో, మతం పేరుతోనో, ఆర్థిక, సామాజిక అసమానతల వల్లనో మనుషులను మనుషులు ఇబ్బంది పెట్టుకోవడం, బాధపెట్టుకోవడంలో అధిక అశాంతి నెలకొంటున్నది అనేది వాస్తవం. మనిషి అధికార దాహం కోసం చేసే చర్యలు కూడా మనుషుల మధ్య వైరానికి అశాంతి నెలకొనడానికి కారణం అవుతాయి.  ఏమీ చేయాలి?? మనిషి నేరుగా ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు కానీ తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న కొందరిని అయినా మార్చగలడు.  ◆మొదట ఇంట్లో పిల్లలకు అహింస, శాంతి అంటే ఏమిటో వివరించి వారిని అహింసాయుత జీవితం వైపు నడిపించాలి. ఇక్కడ ముఖ్య విషయం వాళ్ళను నడిపిస్తూ వాళ్ళతో పాటు తల్లిదండ్రులు నడవడం ముఖ్యం. ◆ప్రతి పాఠశాలలో ఈ విషయం గురించి కేవలం వారానికి ఒకసారి చర్చ ఏర్పాటు చేయాలి. దీనిద్వారా పిల్లల్లో హేతుపూర్వకమైన అవగాహన తొందరగా వస్తుంది. ◆ గౌతమ బుద్ధుడు ఒకమాట చెబుతాడు. మనం ఆచరించినపుడే ఇతరులకు దాన్ని చెప్పాలని. కాబట్టి ఎపుడైనా ఎవరికైనా వీటి గూర్చి చెప్పాలని అనుకున్నప్పుడు తమని తాము మొదట విశ్లేషణ చేసుకుని తాము సరిగ్గా ఉన్నామని అనిపించినపుడు ఇతరులకు చెప్పాలి. ◆ ఒకమనిషి, ఒక కుటుంబం, ఒక వీధి, ఒక ఊరు ఇలా ప్రతి ఒకటి ఎలాంటి అలజడులకు లోను కాకుండా ఉంటే శాంతియుత సమాజం సాధ్యమవుతుంది. కాబట్టి వీలైనంతవరకు ప్రతి ఒక్కరు మరొకరితో సామరస్యంగా ఉండాలి.  ◆శాంతి కావాలంటే మొదట త్యజించాల్సినవి కోపం, అసూయ,ద్వేషం వంటి గుణాలు. నిజానికి మనిషిలో అలజడికి కారణాలు కూడా ఇవే. మనుషుల మధ్య శత్రుత్వానికి దారి తీసేవి ఇవే. వీటిని వధులుకుంటే శాంతి సాధ్యమే. ◆ప్రతి ఏడాది శాంతి అంటూ కపోతాలు ఎగిరేయగానే ప్రపంచం అంతా శాంతి నెలకొనదు. ఎగిరిన పావురం స్వేచ్ఛగా ఉండగలిగినపుడే దానికి సార్థకత. అంతేకానీ అలా ఎగరగానే మరొక చోట దాన్ని కబళించే హస్తాలు ఉండకూడదు మరి. పెద్ద పెద్ద అంతరార్థాలలోకి కాకుండా పిల్లలకు వీలైనంత వరకు నిత్యజీవితంలో ఉత్తమంగా ఉండేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇరుగుపొరుగు తర్ఫీదునిస్తే. మన పిల్లలే శాంతి కపోతాలు అవుతారు. ప్రపంచ శాంతిని నెలకొల్పుతారు. కాదంటారా మరి!! ◆ వెంకటేష్ పువ్వాడ