కొత్త సంవత్సరం కొత్త గోల్స్ లో వీటిని తప్పక చేర్చండి!!

కొత్త సంవత్సరం అనగానే చాలామంది కొన్ని గోల్డ్ పెట్టుకుంటారు. అన్ని లిస్ట్ కూడా రాసేసుకుంటారు. కానీ అవన్నీ న్యూ ఇయర్ రోజు అందరికీ శుభాకంక్షాలు తెలుపుతూ, పార్టీలు చేసుకుంటూ ఆ సందడిలో మొదటి రోజే లక్ష్యాలకు పంగనామాలు పెడతారు. అయితే… కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా అవన్నీ పాటిస్తేనే తగిన పలితం ఉంటుంది. లిస్ట్ లో రాసుకున్నంత సులువుగానే వాటిని కూడా అటక ఎక్కిస్తారు. కానీ… కొత్త సంవత్సరం గోల్డ్ లిస్ట్ లో ఎన్ని రసుకున్నా… వాటిలో ఎన్ని ఫాలో అయినా… అవ్వకపోయినా… ప్రస్తుతం మీరు చదవబోయే వాటికి మాత్రం తప్పకుండా చోటు కల్పించి వాటిని ఫాలో అయితే.. కొత్త ఏడాదిలో మీ జీవితంలోంచాలా గొప్ప మార్పు చూస్తారు. అవి ఏమిటంటే… కొత్త స్నేహం.. స్నేహితులు ఇప్పటికే చాలామంది ఉన్నారు. మళ్లీ కొత్త కొత్త స్నేహం ఏంటి?? అని అనుమానం, కొత్త స్నేహాలు ఎందుకు?? అనే ప్రశ్న చాలామందిలో పుడుతుంది. అయితే స్నేహితులు ఇంతమందే ఉండాలి.. కొత్తగా ఎవరితోనూ స్నేహం చేయకూడదు అనే రూల్స్ ఏమీ జీవితాల్లో లేవు కదా… కొత్త స్నేహం మొదలుపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? అనే ప్రశ్న ఆ తరువాత పుట్టచ్చు… స్నేహాలు పెరగడం వల్ల ఎప్పుడూ వ్యక్తికి ఇతరులతో సంబంధాలు విస్తృతం అవుతాయి. ఈ కారణంగా సర్కిల్ పెరుగుతుంది. దీనివల్ల మనకు ఉన్న ఆత్మీయులు ఎక్కువ అవుతారు. మనిషి సంఘజీవి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. పదిమందితో సత్సంబంధాలు కలిగి, పందిమందితో సంతోషంగా జీవించేవాడికి సమస్యల వల్ల కలిగే ఇబ్బందులు చిన్నవిగా అనిపిస్తాయి. కాబట్టి కొత్త స్నేహం మొదలుపెట్టండి..  ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఎన్నో సాధించగలుగుతారు. నిజానికి ఆరోగ్యం సరిగా లేకపోయినా అన్ని ఇబ్బందులనూ ఎదుర్కొంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన చుట్టూనే అలాంటి వారు మనకు ప్రేరణ కలిగిస్తూ ఉంటారు. అయితే ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యకరంగా జీవించడం ఎంతో ముఖ్యం. అదే మనకు శ్రీరామ రక్ష. బరువుకు బ్రేక్స్… కొందరు అధికబరువు ఉంటారు. నిజానికి దీనివల్ల శరీరాన్ని చుట్టుముట్టే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ చేయాల్సిన మొదటిపని శరీరానికి తగిన బరువు ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడం. ఒకవేళ తగిన బరువుకంటే ఎక్కువ ఉంటే బరువు తగ్గడం మీద దృష్టి పెట్టడం. బ్యాడ్ హబిట్స్ కు బై బై.. చెడు అలవాట్లు అనగానే చాలామంది ఏవేవో ఉహించుకుంటారు. తినకూడని పదార్థం తినడం, సమయవేళలు పాటించకపోవడం, అతిగా తినడం, సంబందం లేకపోయినా ఇతరులతో గొడవ పడటం, నోటి దురుసు, ఇతరులను నొప్పించేలా మాట్లాడటం ఇలా చూసుకుంటే చాలా చిన్న విషయాలలో కూడా తప్పుగా ప్రవర్తించేవారు ఉంటారు. ఇలాంటి వాటిని సురిచేసుకుని చూస్తే తమ జీవితం ఎంత మారుతుందో వారికే స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. ఆహార మంత్రం!! చలి వనికిస్తుంది, మళ్ళీ కోవిడ్ వేవ్స్ వినబడుతున్నాయి. మరి సాదారణంగా సరిపోతుందా?? లేదు కదా.. పోషకాహారం తీసుకోవాలి. తాజాగా ఉండేలా చూసుకోవాలి. రుచి గురించి కాదు, ఆహార నాణ్యత గురించి, అది శరీరానికి చేసే మేలు గురించి ఆలోచించి ఆహారం విషయంలో అడుగులు వెయ్యాలి.  ఇలా పైన చెప్పుకున్న విషయాలను  మీ న్యూ ఇయర్ లిస్ట్ లో చేరిస్తే.. జీవితాన్ని ఎంతగానో మార్పుకు లోను చేసి సంతోషంగా ఉండటానికి కారణం అవుతుంది.                                         ◆నిశ్శబ్ద.

మీరూ.. గతంలో జీవిస్తున్నారా? అయితే ఇది చదవండి!

మనిషి తన జీవితంలో చేసే పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది వర్తమానంలో ప్రయాణిస్తూ గతంలో జీవిస్తూ ఉండటం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుత కాలంలో ఎంతోమంది చేస్తున్న పని అదే..  "మా తాతలు నేతులు త్రాగారు మీరు మా మూతులు వాసన చూడండి," అన్నాడట వెనకటికొకాయన. కొందరికి తమ పూర్వీకులు చాలా గొప్పవారని వీరు వారి సంతతి వారేనని మన సాంప్రదాయం సంస్కృతి వారిలో కూడా వారసత్వంగా వచ్చిందని గొప్పలు చెప్పకుంటూ వుంటారు చాలామంది.  సూర్యునికి  ఎదురుగా నిలబడితే మనిషి తన నీడను కూడా తాను చూసుకోలేడు. అలాగే గతంలో జీవించడం అలవరచుకుంటే ప్రస్తుత జీవితం శూన్యమవుతుంది. ఈ విషయం ఎంత చెప్పినా ఎవరికీ అర్థం కాదు.  యుద్ధం జరిగిన దేశాలలో ఎంతో ఆస్తి నాశనమయిన వారిని మనం చూశాం ఎంతో ధనం, ఎన్నో భవంతులు, మరెన్నో ఫ్యాక్టరీలు పోగొట్టుకుని నేలమట్టమయిన ధనికుల చరిత్రలను మనం చూస్తూ ఉంటాం. అంతటి ప్రాభవాన్ని చవిచూసిన ప్రభుద్దులు అంతా కోల్పోయాక బ్రతకడం కోసం ఒక చిన్న ఉద్యోగిగా మారి,  మరోక వ్యక్తి దగ్గర గుమాస్తాగానో, వేరే ఇంకో పనో  పనిచేస్తూ ఉంటారు. చిన్న చిన్న షాపులలో సెల్స్ మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వారు ఎంతోమంది ఉంటారు. వారు అవకాశం దొరికితే కమ గత వైభవాన్ని చెప్పుకోలేకుండా వుండలేరు. మేము ఒకప్పుడు బాగా వున్నవారమే. బ్రతికి చెడ్డవారం అంటూ వాపోతారు.  ఆ రోజుల్లో మీరు మా  ఇంటికి వచ్చివుంటే మిమ్మల్ని ఏ విధంగా అతిధ్యంతో ముంచెత్తేవాడినో... అంటూ గతంలోకి పోయి నాటి సుఖ భోగాల గుర్తులలోనూ, , ఆలోచనా పరంపరలతోనూ  తన గత వైభవ చరిత్రను కథలు కథలుగా వినిపిస్తారు. అది నిజమే కావచ్చు కాని మనకు అదంతా గత చరిత్ర క్రింద అనిపిస్తుంది. 'గతజల సేతు బంధనం దేనికి' అనిపిస్తుంది. ప్రస్తుతం అటువంటి చరిత్రలని ఆదరించి ఆదుకునేవారు మన నవసమాజంలో కనిపించరు. గతాన్ని ప్రస్తుతంతో పోల్చడం ఎవరికి ఇష్టం ఉండదు. అదంతా యదార్ధమే కావచ్చు కాని ప్రస్తుతానికి చరిత్ర అనేది అప్రస్తుతం, లాభంలేని వ్యర్థ కాలక్షేపానికి మాత్రమే అలాంటివన్నీ ఉపకరిస్తాయి.  అలాంటి కథలన్నీ వినడానికి అంత ఓపిక ఎవరికీ లేదు.  ఈ రోజుల్లో నీ పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తారు కాని,  ఎప్పుడో గడిపిన సుఖ సంతోషాల గురించి, సమస్తం చెయ్యి జారిపోయిన తరువాత పూర్వం బ్రతికిన రోజుల గురించి ఎవరికీ అవసరం లేదు.  కొందరు వ్యక్తులు ఇలా చెప్పేటప్పుడు ఉన్నఫీ ఉన్నట్టు చెబుతూ ఉంటారు. అయితే మరికొందరు ఆనాటి వైభోగం ఏదీ ఇప్పుడు లేదు కాబట్టి, ఇప్పుడు తనని ఎవసరూ ఆధారాలు చూపించమని అడగరు కాబట్టి లేనివన్నీ కల్పించి కథలు అల్లుతారు.  అందులో మూడు వంతులు ఆతిశయోక్తులే ఉంటాయి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో అనేక ప్రమాదాలు సంభవించి ఎన్నో కోట్లమంది నిరాశ్రయులుగా మారిపోయారు. కొన్ని ప్రాంతాలు ప్రపంచపటం నుంచే తొలిగిపోయాయి. కోట్లాది ఆస్తులు నామరూపాలు లేకుండా పోయాయి. కాని రుజువులు లేని నిజాలను మనం విశ్వసించం, అది మానవ నైజం. పోయిందని చెబితేనే నమ్మం అలాంటిది జరిగిపోయిన వాటిని కథలుగా చెప్పుకుంటూ ఉండటం ఎంతవరకు అవసరం. బహుశా కొందరు తమ గత జీవితాన్ని గుర్తుచేసుకుని వాస్తవంలో ఇలా ఉన్నామే అని బాధపడుతూ ఉంటారు. ఎన్నో సుఖాలు అనుభవించిన జీవితం కష్టాల మధ్య ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వస్తోందే అని సంఘర్షణకు గురవుతుంది. కానీ గతాన్ని ఆలోచించడం వల్ల, దాని గురించి ఇతరులకు చెప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమి ఉండదని తెలుసుకోవాలి. గతం ఏమీ లేదని, వర్తమానమే జీవితానికి మొదలు అని తనకు తాను చెప్పుకుని సాగిపోవాలి. అప్పుడే జీవితంలో ముందుకు సాగగలడు.                                         ◆నిశ్శబ్ద.

పరీక్షలకు సవాల్ విసిరే అద్భుత సూత్రాలు!

డిసెంబర్ నెల గడిచిపోతోంది. పిల్లలకు పరీక్షల కాలం దగ్గరకు వచ్చేస్తోంది. పిల్లలకు పరీక్షలు అంటే పెద్దలకు విషమపరీక్ష. పిల్లల కోసం పెద్దలు కుస్తీ పడతారు. తమ పిల్లలు బాగా పరీక్షలు రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అనేది ప్రతి తల్లిదండ్రుల ఆశ. అయితే చదవడంలో కాస్త విభిన్నత, సరైన విధానం తెలుసుకుంటే చక్కని ప్రిపరేషన్ సాగించవచ్చు. వాటికోసం ఇదిగో టిప్స్... పరిశీలన:- మెదడులో శాశ్వతంగా ముద్రవేసుకోవాలంటే మనం వస్తువు లేదా విషయాలను శ్రద్ధగా పరిశీలించాలి. ఒక వ్యక్తిని ఒక్కసారి చూస్తాం. అతని బొమ్మ మెదడులో కొద్దికాలమే గుర్తుంచుకుంటాం. అదే వ్యక్తిని పరిశీలనగా, శ్రద్ధగా ఉత్సుకతతో చూస్తే అధిక కాలం గుర్తుండిపోతాడు. ఈ పరిశీలన అనేది మన మనసులో ఉత్సుకత రేకెత్తించి విషయం పట్ల శ్రద్ధను, ప్రాముఖ్యతను కలుగచేస్తుంది. పరిశీలించడం అంటే ఆ వస్తువు లేదా విషయం పట్ల మన జ్ఞానేంద్రియాలన్నింటినీ ఉపయోగించి పర్యవేక్షించడం. విద్యార్థికి ఉండవలసిన ప్రాధమిక లక్షణం పరిశీలనాత్మకత. చదివినవి, లేదా చూసినవి దీర్ఘకాలం గుర్తుంచుకోతగ్గవా కాదా అని నిర్ణయించుకొని విషయ సంగ్రహణం చేయాలి.  ఏకాగ్రత :- ఏకాగ్రతకు మనిషిని దేవుడిలా మార్చగల శక్తి ఉంది. ఏకాగ్రత వలన సర్వమూ లభిస్తుంది. మనం దేన్నయితే ఏకాగ్రతో పరిశీలిస్తామో అది మనకు తలవంచి తీరుతుంది. ఏకాగ్రత వలన చేయలేని విషయాలు ఈ సృష్టిలోనే లేవు. ఏకాగ్రత మనలో దాగి ఉన్న అద్భుత అపూర్వ శక్తులను వెలికి తీస్తుంది. మనల్ని మానవాతీతులుగా కూడా మార్చేస్తుంది. ఏకాగ్రత వలన వస్తువుల్ని సైతం కదిలించగలం. ఎటువంటి అద్భుతశక్తికైనా అవసరమైన ఒకే ఒక్క మూలకం ఏకాగ్రత. జ్ఞాపకశక్తిని పెంచుకోవడంలో తిరుగులేని ఆయుధం ఎకాగ్రత. మనం ఒక వస్తువు పైన ఏకాగ్రత ఉంచితే ఆ వస్తువుపై స్పష్టత, ఆసక్తి కల్గి ఆ వస్తువు దీర్ఘకాలం గుర్తుండిపోవడానికి దోహదమవుతుంది. మీరు గుర్తుంచుకోవాలన్న విషయాలపై అపారమైన ఏకాగ్రతను కనబర్చండి. ఎప్పుడైతే ఏకాగ్రత లోపిస్తుందో వెంటనే దాని స్థానంలో అశ్రద్ధ, అనాసక్తి, బద్ధకం మొదలవుతాయి. ఇది జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంది. మనుషులు రుషులౌతారు ఎలాగంటే కేవలం ఏకాగ్రతను అపారంగా కల్గి ఉండటం వలన. ధ్యానం :- ధ్యానం అంటే ఏకాగ్రతగా ఉండటమే. మనం నిరంతరం  ఎన్నో వ్యర్ధమైన విషయాలపై దృష్టిసారించి మన అపారమైన శక్తిని వృధా చేస్తుంటాం. ఒకే దానిపై దృష్టి ఉంచడమే ఏకాగ్రత అంటే. ధ్యానంలో మనం చేసే పని ఇదే. ప్రతి రోజూ 20 నిముషాల పాటు అన్నింటినీ మరిచిపోయి మీ మెదడుకు సంపూర్ణ విశ్రాంతినిచ్చి ఎటువంటి అనవసర విషయాలను జ్ఞాపకం రానీయకుండా నిరోధించి కళ్ళు మూసుకొని హాయిగా మీ శ్వాసను గమనించండి. రెండు నిముషాలు మీరలా శ్వాసను గమనించడం చేస్తే మెల్లమెల్లగా మీ మెదడు విశ్రాంత స్థితికి చేరి శక్తిని జనించుకుంటుంది. ప్రతిరోజూ 20 నిముషాల పాటు అన్నింటినీ మరిచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం మెదడుకు గొప్ప విశ్రాంతి కల్గించండి. మీ శ్వాసను ప్రతి సెకనూ కళ్ళు మూసుకొని గమనించడం వలన మీ ధ్యాస ఒక్కటే వస్తువు అంటే మీ శ్వాసపై ఏకాగ్రమై అపరిమితమైన శక్తి, ప్రశాంతత లభిస్తుంది. ఇలా శక్తిని పుంజుకున్న మన మెదడు రెట్టించిన శక్తితో తన పని ప్రారంభిస్తుంది. శ్రద్ధ, ఇష్టం:  మనం ఎప్పుడైనా ఇష్టం లేనివి చూడాలని గానీ చదవాలని కానీ అనుకోము కదా: మనకు నచ్చిందీ అంటే ఖచ్చితంగా దానిపై ప్రేమ, ఇష్టం, శ్రద్ధ ఉన్నాయని అర్థం. కథలనైతే ఇష్టంగా, శ్రద్ధగా ఎంతోసేపు పఠిస్తాం, ఆనందిస్తాం. అలా చదివిన ఆ కథలు మరణించే వరకూ గుర్తుండిపోతాయి. బాగా గమనించండి. ఎప్పుడో మీ 4 సంవత్సరాల వయస్సులో మనకు తాతయ్య చెప్పిన కథలు ఇంకా గుర్తుండి ఉంటాయి. కారణం ఏమిటంటే కథలంటే ఆసక్తి, ఇష్టం ఉండటం వలన  వాటిని వినడానికి శ్రద్ధగా సమయము కేటాయించడం వలన. ఏ విషయం మీదనైతే ఆసక్తి, శ్రద్ధ, ఇష్టం ఉంటాయో అవి దీర్ఘకాలం మన మెదడులో నిక్షిప్తం అయిపోతాయి. 5. ఊహాత్మక శక్తి :-  చదివిన దానికంటే విన్నదీ, విన్నదానికంటే చూసినదీ మనం ఎక్కువగా గుర్తుంచుకుంటాం. అసలు విషయం  ఏమిటంటే మన మెదడుకు ఏ భాషా రాదు. తెలుగు, తమిళం, ఇంగ్లీషు, మరాఠీ లాంటి ఏ భాషా రాదు. దానికి తెలిసిన ఒకే ఒక్క భాష బొమ్మల భాష. "Picture | | language" ఎటువంటి విషయాలనైనా సరే మన మెదడు ఖచ్చితంగా తనకు తెలిసిన బొమ్మల భాషలోకి మార్చిన తర్వాతే నిక్షిప్తం చేసుకుంటుంది. ఉదాహరణకు మనం  ఇంగ్లీషులో Elephant అని అంటే వెంటనే మన మనసులో ఏనుగు రూపం కనిపిస్తుంది. తెలుగులో పులి అన్నా కూడా పులి చిత్రం ప్రత్యక్షమైపోతుంది. మీరు ఏది విన్నా, చదివినా చివరికి తిన్నా కూడా ఈ విషయాలన్నీ ఖచ్చితంగా బొమ్మలుగా మార్చబడి మెదడులో నిక్షిప్తం అవుతాయి. కావాలంటే చూడండి "పులుపు, కారం, చేదు”.. ఈ పదాలు పలుకగానే చింతకాయ, మిరపకాయ, వేపకాయ గుర్తుకు వస్తాయి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన మెదడు బొమ్మలను దృశ్యాలనూ అత్యంత వేగంగా నిక్షిప్తం చేసుకోగలదు. మళ్ళీ వేగంగా పునరావృతం చేసుకోగలదు. పైవాటిని ఫాలో అయితే ప్రిపేరేషన్ చాలా తొందరగా సమర్థవంతంగా పూర్తవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

స్వేచ్ఛ గురించి జిడ్డు కృష్ణమూర్తి ఏమి చెప్పాడు?

ప్రస్తుత సమాజంలో మనిషి తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడు. తనకు కావలసిన దానికోసం ఎంత అయినా వాదిస్తారు, తనకూ అస్తిత్వం ఉందని తనకు స్వేచ్ఛ కావాలని, తనని ఏవరూ వారి చేతుల్లోకి తీసుకోకూడదు అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టపరుచు కోవాలి  మనకు  నిజంగా స్వేచ్ఛ కావాలని అనుకుంటున్నామా? పూర్తి స్వేచ్ఛ కావాలనుకుంటున్నామా లేక ఏదో అనుకూలం లేనిచోటు నుంచి, తాత్కాలిక అసౌకర్యం నుంచి బయటకు రావాలని అనుకుంటున్నామా? మనకు ఇష్టం  లేని అనాహ్లాదకర, అవాంఛనీయ పరిస్థితుల నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నామా?  బాధ కలిగించే, జుగుప్సలో ముంచే అనుభవాల నుంచి, అసౌఖ్యదాయక అనుభవాల నుండి బయటపడాలని అనుకుంటాము. అవాంఛనీయమయిన జ్ఞాపకాల నుంచి దూరంగా వుండాలనుకుంటాము. మన మనసుకు ఆహ్లాదం చేకూర్చే, కొన్ని సంతృప్తి చేకూర్చే ఆదర్శాలు, సూత్రాలు, వదిలి సంబంధాలు కావాలనుకుంటాము. ఒకదానిని వుంచుకొని మరొకదానిని వదిలివేయడం చాలా కష్టం. ఎందుకంటే  సుఖం అనేది దుఃఖం నుంచి విడదీయరానిది అని అందరికీ తెలిసిన తెలియనట్టే సుఖమే సర్వస్వం అనుకుంటూ భ్రమలో ఉంటారు.  అందువల్ల ముందుగా మనం తేల్చుకోవలసిన అంశం ఏమిటంటే, మనం పరిపూర్ణమయిన స్వేచ్ఛ కావాలనుకుంటున్నామా?? లేదా?? అని! కావాలనుకుంటున్నాం అనుకునేట్లయితే, అప్పుడు స్వేచ్ఛ అంటే ఏమిటి స్వభావం, నిర్మాణ రూపం ఎలా వుంటుంది అన్న విషయాలు తెలుసుకోవాలి.  అలా దేన్నించో వైదొలగి వుండడమే స్వేచ్ఛా? బాధనుండి స్వేచ్ఛ, ఏదో రకమయిన ఆదుర్దానుంచి స్వేచ్ఛ. ఇంతేనా  లేక మరేదో భిన్నమైన పరిపూర్ణ స్వేచ్ఛ ఉందా? మనిషిని ఇబ్బంది పెట్టే వృత్తంను వదిలి మరొక వృత్తంలోకి వెళ్ళడమే  స్వేచ్చనా...అసూయ నుంచి స్వేచ్ఛ పోందవచ్చును. కాని, అది కేవలం ప్రతిక్రియ మాత్రమే అయిపోయి, నిజమయిన, స్వేచ్ఛ కాకుండా వుండవచ్చును కదా? సంప్రదాయం నుంచి స్వేచ్ఛ సంపాదించ వచ్చును. దానిని వివరించి చూడడం ద్వారా,  త్రోసిరాజు అనడం ద్వారా. కానీ అటువంటి స్వేచ్ఛ వుద్దేశ్యం యేమిటి? ఆ సిద్ధాంతం ఈ కాలానికి తగినది కాదు కాబట్టి, ప్రస్తుతానికి అనుకూలమయినది కాదు కాబట్టి దాని కోసం ప్రయత్నం చేస్తున్నామా?  అంతర్జాతీయత పట్ల మక్కువ వల్ల జాతీయ భావాలు సరయినవి కావనీ వాటి నుంచి స్వేచ్ఛ కావాలనీ అనుకుంటున్నామా? లేక ప్రస్తుత ఆర్థిక అనుకూలతల దృష్ట్యా సంకుచితమయిన జాతీయ భావనలు సరిఅయినవి కావని అనుకుంటున్నామా? ఇదంతా తేలికగా అర్థం చేసుకోవచ్చును. లేదా ఎవరో ఆధ్యాత్మిక రాజకీయనాయకుని పట్ల విరోధంతో క్రమశిక్షణ, విప్లవం పట్ల తిరుగుబాటు ధోరణితో మనం ఇటువంటి ఆలోచనలకు రావచ్చును. ఆ రకమయిన హేతువాదం, తార్కిక తీర్మానం  నిజ స్వేచ్ఛతో ఏ మాత్రమయినా పొందిక పొంది వున్నదా? దేనినుంచయినా, ఎవరైనా  స్వేచ్ఛగా వున్నాము అనుకుంటే, అది గూడా ఒక ప్రతి చర్యే అవుతుంది. అది మరోరకమయిన కట్టుబాటును, ఆధిపత్యాన్ని తీసుకువస్తుంది. ఈ విధంగా మనం ప్రతిచర్యల పరంపరలతో స్పందిస్తూ. 'ప్రతిచర్య'ను విముక్తి అని ఆమోదించవచ్చు. కాని, అది నిజానికి స్వేచ్ఛ కాదు. వెనకటి కట్టుబాటు తాలూకు కొనసాగింపే అవుతుంది. మనసు ఇరుక్కుపోయిన గతానికి సంబంధించినదే అవుతుంది.                                        ◆నిశ్శబ్ద

ఔరంగజేబు జీవితంలో ఆసక్తికర విషయం!!

మొగల్ పాదుషా ఔరంగజేబు కఠినమైన మనిషని చరిత్రలో చదువుతుంటాం. కానీ ఈ కాఠిన్యం ఇతరుల విషయంలోనే కాకుండా, తన విషయంలో కూడా అంతే కఠినంగానూ ఉండేవాడు. మతవిధుల్ని తు.చ. తప్పకుండా అమలు జరుపాలనే విషయంలో చాలా నిక్కచ్చిగా వుండేవాడు. తన స్వంత ఖర్చు కోసం ఖజానాలోని డబ్బు ముట్టుకొనేవాడు కాదు. ప్రార్థన వేళల్లో ముస్లిములు శిరస్సుపై ధరించే టోపీలు, కోరాన్ గ్రంథం కాపీలు తయారు చేసి వాటి అమ్మకం ద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. ప్రవక్త, దేవుడు వీరిద్దరి యెడల అతడి భక్తి అపారం.  తను నివసించే ప్రాంతంలోని వారంతా ఒకచోట చేరి భగవత్ ప్రార్థనలు జరిపితే బాగుంటుందని అతడికో ఆలోచన తట్టింది. ఎంతోమంది ఒక్కచోట చేరి ఏకహృదయంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే చూడముచ్చటగా వుంటుందని అనిపించింది. దానికోసం పెద్ద మసీదును ఒకదాన్ని నిర్మింపజేసాడు. ప్రార్థన చేపే ఒక్కొక్కరికి ఒక్కో నలుచదరపు గడి ఉండేట్లుగా ఏర్పాటు చేయించాడు. మిగతా అందరితో బాటు తాను కూడా ప్రార్థన వేళకు అక్కడ హాజరయేవాడు. అంతా వస్తున్నారా? అందరూ ఈ ఏర్పాట్లు చూసి సంతోషిస్తున్నారా? అని కనుక్కుంటుండేవాడు. అందరు వస్తున్నారు కానీ, మసీదు పక్కనే నివసించే ఒకతడు మాత్రం రావడం లేదని చెప్పారు పనివారు.   “ఎవరా మనిషి? నేను చేసిన శాసనం తెలియదా? అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థించాలనే నా ఆకాంక్ష అతడికి తెలియజేయలేదా?” అన్నాడు.  "తెలియజేశామండీ, కానీ పట్టించు కోకుండా ఆ వీధుల కూడలిలో అలాగే కూచుంటాడండీ" అని సమాధాన మిచ్చారు వాళ్ళు. "మసీదుకు ప్రార్థన సమయంలో వచ్చి తీరాలనే నా ఆజ్ఞ అతడికి తెలియజేయండి” అన్నాడు పాదుషా.  పాదుషా వారి ఆజ్ఞ అని చెప్పామండీ. ఎంతో వేడుకున్నాము. కానీ కదలడండీ." అన్నారు పనివారు. "అయితే బలవంతంగా పట్టుకురండి” అన్నాడు  పాదుషా.  ఆ మర్నాడు అతన్ని బలవంతంగా మసీదుకు పట్టుకువచ్చి ఒక నలచదరపు గడిలో నుంచోబెట్టారు. అలా నుంచోనుండగా అక్కడున్న మిగతా వారందరూ మోకాళ్ళమీద వంగి ప్రార్థనలు చేస్తున్నారు. చక్రవర్తి కూడా ప్రార్థిస్తున్నాడు. మసీదులోని ముల్లా ఎలుగెత్తి ప్రార్థన ప్రారంభించాడు. ఇటువంటి పవిత్ర వాతావరణంలో, ఈ బలవంతం మీద వచ్చిన మనిషి హఠాత్తుగా పెద్ద పెట్టున అరిచాడు. “నీ తుచ్ఛమైన దైవం నా పాదాలకింద ఉన్నాడు" అని వెర్రికేక పెట్టి ఆ మసీదు నుండి విసురుగా నడుస్తూ వెళ్ళిపోయాడు. భక్తులు నివ్వెరపోయారు. సాక్షాత్తూ పాదుషా కూడా వారి మధ్యనే ఉన్నాడు. ఎంత అపచారం జరిగిందనేది అందరూ కళ్లారా చూశారు, చెవులారా విన్నారు. ప్రార్థన పూర్తయిన తర్వాత పాదుషా తన మంత్రులను పిలిచి "అరిచిందెవరో, ఆ దైవ ద్రోహిని ఉరి తీయించండి" అని ఆదేశించాడు. అలా అరిచిన వ్యక్తిని ఉరితీసారు.  కానీ ఆనాటి నుండి ఔరంగజేబు మనసు హాయిగా వుండేది కాదు. తానే అపరాధం చేశానేమో అన్నట్లు బాధపడుతుండేవాడు. ఒకనాడు మంత్రుల్ని పిలిచి ఆ మసీదు వద్దకు పోయివద్దాం పదండి. ఆ మసీదులో నుంచోనుండగా ఆ వ్యక్తి అలా వెర్రికేక పెట్టటానికి ఏదో బలమైన కారణముండి వుండాలి అంటూ దారి తీసాడు. మసీదువద్దకు వెళ్ళి, ముల్లాను పిలిపించి "నిజంచెప్పు. సంకోచించవద్దు. నీవు ఆనాడు ప్రార్థన చేసే సమయంలో ఆ వ్యక్తి అలా దురుసుగా కేక పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ ప్రార్థన వేళలో నీ మనస్సు సంపూర్తిగా అల్లామీదనే వుండేనా?” అని అడిగాడు.  అందుకు సమాధానంగా ఆ ముల్లా "ప్రార్థన ప్రారంభించేప్పుడు మనసు దేవుడు మీదనే లగ్నమై వుండెనండీ, కాని కొద్ది సేపట్లోనే నా మనసులో ఒక రకమైన ఆలోచన మెదిలింది. చక్రవర్తి ఇక్కడే వున్నారు కదా మరింత గట్టిగా ప్రార్థన సలిపితే పాదుషా సంతోషిస్తారు. నా కూతురు వివాహం తలపెట్టినప్పుడు పాదుషాను అభ్యర్థిస్తే డబ్బు సులభంగా మంజూరవుతుంది" అనే ఆలోచన వచ్చింది. పాదుషాకు ఛట్టున ఏదో స్ఫురించి "ఆ మనిషి నుంచున్న గడి క్రింద తవ్వి చూడండి" అన్నాడు. తవ్వారు. లోతున పెద్ద పాతర కనిపించింది. ఎంతో ధనమున్నది. చక్రవర్తికి పూర్తిగా అర్థమై పోయింది. “నీ దేవుడు నా పాదాలక్రింద ఉన్నాడని" ఆ మనిషి ఆగ్రహంతో ఎందుకు కేక పెట్టాడో, తాను ఎటువంటి మహాభక్తున్ని సంహరింప జేసాడో తెలిసే సరికి, అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది.  పాప పరిహారార్థం తన మరణానంతరం తన దేహాన్ని ముక్కలు చేసి, ఒక్కో ముక్కను ఒక్కొక్క మహాపురుషుడి సమాధి వద్ద ఉంచమని, ఆ విధంగానైనా తనకు మనశ్శాంతి లభిస్తుందని వీలునామాలో వ్రాసిపోయాడని అంటారు. అందుకనే ఔరంగజేబు గోరీలకు ఏవిధమైన పై పూతలు రాతలు లేకుండా సాధారణమైనవిగా నెలకొల్పారట. మట్టితో నిర్మించిన ఈ నిరాడంబరమైన గోరీల వద్ద రోజ్మేరీ మొక్కను ఒకదాన్ని మాత్రం నాటారు.          ◆నిశ్శబ్ద

మానవహక్కుల గళం విప్పుదాం!!

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కొన్ని హక్కులను కలిగి ఉన్నాడు. ఆ హక్కులు ఇప్పటికిప్పుడు సంక్రమించినవి కాదు. నాటి బ్రిటీషు కాలంలో బానిసత్వం తప్ప ఏమీ లేదు మనుషులకు. అయితే కాలానుగుణంగా జరిగిన పోరాటాల ఫలితంగా ప్రస్తుతం ఎన్నో రకాల స్వేచ్ఛ మనకు అందుతోంది. మనకు లభిస్తున్న ప్రతి స్వేచ్చా కొన్ని రకాల హక్కుల ద్వారా లభిస్తోంది. మాట్లాడే హక్కుతో స్వేచ్ఛగా మాట్లాడటం, జీవించే హక్కుతో నచ్చినట్టు బ్రతకడం, ప్రాథమిక హక్కులతో విద్య, వైద్యం, ఆహారం, కనీస అవసరాలు, తిండి-గుడ్డ మొదలైనవి పొందటం మనిషికి హక్కుల ద్వారా లభించేవి.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 వతేదీన మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు ఏర్పడింది?? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి?? దీని ద్వారా మనుషులు ఏమి సాధించుకోవచ్చు?? మానవ సమాజంలో దీని పాత్ర ఏమిటి?? వంటి విషయాలు వివరంగా… ఎప్పుడు ఏర్పడింది?? మానవ హక్కుల దినోత్సవం 1948 సంవత్సరం డిసెంబర్ 10 వ తేదీన  ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అప్పటి కాలంలో ఈ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 భాషలలో రూపొందించింది. దీన్ని పురస్కరించుకుని అప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 వ తేదీన మానవహక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటోంది.  మానవ హక్కుల దినోత్సవం వెనుక కారణం!! ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో రకాల అవసరాలను కలిగి ఉంటాడు. అయితే వాటిని పొందడంలో ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఆర్థిక, సామాజిక ఇబ్బందుల వల్ల వ్యక్తి తనకు అవసరమైన వాటిని సాధించుకోవడంలో విఫలం అవచ్చు లేదా వాటిని సాధించుకోవడానికి తగిన వనరులు అందుబాటులోకి తెచ్చుకోలేకపోవచ్చు. ఇలాంటి కారణాల వల్ల వ్యక్తి జీవితంలో ఎదుగుదల శూన్యంగా మారుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, సంతోషంగా జీవించడం వంటి విషయాలను పొందగలిగితే ఆ మనిషి జీవితం ఉన్నత దశలోకి వెళుతుంది. అందుకే అందరూ ఒక ఉన్నత దశలో ఉండటం వల్ల రాష్ట్రం, దేశం, ప్రపంచం క్రమంగా అభివృద్ధిలోకి వెళుతుంది. ఇలాంటి అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూమానవ హక్కులు పొందాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రకటననే మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మానవ హక్కుల ద్వారా వ్యక్తి ఏమి సాధించుకోవచ్చు?? వ్యక్తిగత స్వేచ్ఛ ద్వారా వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తి అభివృద్ధి పథంలో ప్రయాణిస్తే ఈ ప్రపంచం మెల్లిగా అభివృద్ధి కోణంలో ముందుకెళుతుంది. కాబట్టి వ్యక్తి తన జీవితానికి అవసరమైన హక్కులను సాధించుకుంటే వాటిని ఉపయోగించుకోవడం ద్వారా జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది. సమాజంలో మానవ హక్కుల పాత్ర ఏమిటి?? వ్యక్తుల సమూహం సమాజం అయినప్పుడు వ్యక్తులు హక్కుల ద్వారా సాధించే అభివృద్ధి సమాజ అభివృద్ధికి మూలకారణం అవుతుంది. అంతే కాకుండా సమాజానికి మనిషి మూల స్తంభం వంటివాడు. మనిషి బాధ్యతగా ఉంటే బాధ్యతాయుతమైన సమాజం ఏర్పాటు అవుతుంది. కాబట్టి మానవ హక్కుల వినియోగం ఆరోగ్యకరంగా ఉంటే బాధ్యతాయుతమైన సమాజం ఏర్పాటు అవుతుంది. ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చరిత్రలో నమోదు అయిన  కొన్ని ముఖ్య ఘట్టాలు.. 1865 సంవత్సరంలో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను అనుసరించి అమెరికాలో బానిసత్వం రద్దు చేయబడింది. ఈ రద్దు కారణంగా అమెరికాలో స్వేచ్ఛకు బీజం పడింది.    ప్రపంచ చరిత్రలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది చాలా దారుణమైన సంఘటనగా వర్ణించవచ్చు.  1941 నుండి 1945 వరకు జరిగిన ఈ యుద్ధంలో చెప్పలేనంత మారణకాండ చోటుచేసుకుంది. హిట్లర్, నాజీ జర్మనీల పోరు బీజం కాస్తా దాదాపు కోటి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యింది.. ఇది ప్రపంచ చరిత్రలో భయంకరమైన అక్షరాలతో లిఖితమైంది.    డిసెంబర్ 1948 గురించి పైన చెప్పుకున్నట్టు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన ఆధారంగా ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన స్వేచ్ఛను హక్కుల రూపంలో పొందేందుకు అవకాశం కల్పించింది.    2015 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య అసమానత్వం తొలగించే దిశగా చేసిన కృషి ఫలితంగా  అందరికీ సమానత్వం అనే నినాదంతో ఫిన్లాండ్ నాన్-డిస్క్రిమినేషన్ యాక్ట్‌ను ఆమోదించింది. ఇది విద్య, వ్యాపారం, ఉద్యోగాలలో వివక్షతను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన అంశం.  ఈ విధంగా ప్రపంచ చరిత్రలో  మానవహక్కుల గురించి ఎన్నో విషయాలు పొందుపరచబడ్డాయి. వీటిని దుర్వినియోగం చేయకుండా సరైన రీతిలో వినియోగించుకుంటే ప్రతి వ్యక్తి తాను అభివృద్ధి చెందడమే కాకుండా ఇతరులను, సమాజాన్ని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలడు.                                     ◆నిశ్శబ్ద.

భారతదేశం అభివృద్ధి పేరుతో ముందుకెళుతుందా లేదా వెనక్కా?

అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం 131 వ స్థానంలో స్థానంలో ఉంది. ఇది 189 దేశాల పట్టికలో పొందిన స్థానం. సామాజిక, ఆర్థిక ఎదుగుదలలో భారతదేశం మిగిలిన దేశాలతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందవలసి ఉంది. అభివృద్ధి అంటూ ముందుకు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి బలహీనపడిపోతున్నట్టు ఎన్నో విషయాలు స్పష్టం చేస్తున్నాయి కూడా. ఇంతకూ మనం ముందుకు వెళుతున్నామా?? లేక వెనక్కు వెళుతున్నామా??   సమాజంలో పెరుగుతున్న దాష్టీకాలు, దౌర్జన్యాలు గమనిస్తే మనం పాలరాతి యుగంలో ఉన్నామా! లేక పాత రాతి యుగంలోనే ఉన్నామా అనిపిస్తోంది. పొత్తిళ్ళలోనే బిడ్డల్ని గొంతు నులిమేస్తున్న కసాయి కన్నతల్లులు... ఎంతో మంది కనిపిస్తున్నారు. తమ జీవితాలు సంతోషంగా లేవని బిడ్డలను చంపి తాము చావడానికి సిద్ధపడుతున్న మహిళలు కోకొల్లలు. వీరు అమ్మ అనే పేరుకే మచ్చ తెస్తున్నారని అనిపిస్తుంది.  వావివరసలు మరచి మగవారు జరుపుతున్న విశృంఖల ఘోరకృత్యాలు... చూస్తే అడవి మృగాలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి.  మన ప్రవర్తన రోజురోజుకూ ఎందుకింత పతనావస్థకు చేరుకుంటోంది?? మనుషులుగా పుట్టిన అందరం క్రమంగా పశుప్రవృత్తిని పెంచుకుంటున్నాం అనే విషయం అక్కడక్కడా జరుగుతున్న సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. అందుకే స్వామి వివేకానంద అంటారు "పవిత్రత, మానవీయత లోపించి, ప్రాపంచికత మితిమీరిన రోజున, ఆ జాతికి అంత్యకాలం దాపురిస్తుంది. సమాచార విప్లవంతో పురోగమించామని సంబరపడుతున్నా, సదాచారం లోపిస్తే మాత్రం అది తిరోగమనమేనన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. సాంకేతికత, సంబంధిత విజ్ఞానం మన జీవన వ్యవహారాన్ని సులభతరం చేయవచ్చు; అంతమాత్రం చేత దానిని మన జీవనశైలిగా మలచుకుంటే దుష్ఫలితాలు అనంతం” అని.  ఇది స్వామి వివేకానంద చెప్పిన నాటి నుండి నేటి వరకు కూడా సాగుతున్న వ్యవహారం. లోపం ఎక్కడుంది?? వైఫల్యం ఎవరిది?? సమాజం గాడి తప్పుతోందన్న చర్చ సర్వత్రా జరుగుతూనే ఉంది. మరి లోపం ఎక్కడో, వైఫల్యం ఎవరిదో అంతుచిక్కడం లేదు. ఆలోచిస్తే ఈ లోపం, వైఫల్యం ఒక్కరిది కాదు. ఇది మనందరిదీ! ప్రాథమిక స్థాయి నుంచి నేటి సమాజం మీట నొక్కితే వేగమే తప్పా వివేకం లేని మరమనుషులను తయారు చేస్తోంది. విద్యాలయాల నుంచి వ్యక్తిత్వం లోపిస్తున్న సాంకేతిక సాధనాల్లా ఈ తరం యువతీ యువకులు బయటి ప్రపంచానికి పరిచయమవుతున్నారు. వీరికి విచక్షణ, వివేకంతో పనిలేదు. కేవలం చెప్పింది అప్పజెప్పగలరు, అప్పగించిన పనిని చేసి చూపించగలరు. అంతే కాని తమకు తాము దేని మీదా ధారాళంగా ఏది చెప్పలేరు, అవగాహనతో చేయలేరు.  భారతదేశంలో విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం, సృజనాత్మకతతో కూడిన వారు పదిహేను శాతానికి మించి కూడా లేరనే ఓ వాస్తవం విస్మయపరుస్తుంది. అంటే అభిరుచి, ఆసక్తి, స్వయం నిర్ణయం... ఇలా ఏవీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇతరుల ప్రోద్బలం వల్లో, ఉపాధి లక్ష్యం వల్లో విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకుంటున్నాం తప్ప అవగాహన, నైపుణ్యం  మొదలైనవాటి వల్ల కాదు. అలా అవగాహన లేకుండా అంత చదువులు చదివితే ఆ తరువాత పరిస్థితి అయోమయం, అగమ్యగోచరం. నేటికాలంలో జరుగుతున్నది అదే.. అందుకే మనం అభివృద్ధి పేరుతో ముందుకు వెళుతున్నామా లేక వెనక్కు వెళుతున్నామా అనే సందేహం వస్తుంది. నిజమా కాదా?? మీరూ ఆలోచించండి ఒకసారి.                                       ◆నిశ్శబ్ద.

రాజ్యాంగ రూపశిల్పి అస్తమించిన రోజు!

అంబేద్కర్ పేరు వినని వ్యక్తి ఉండడు ఏమో. భారతదేశ స్థితి గతులను మార్చివేసిన వ్యక్తి అంబేద్కర్. ప్రజలు ఈయనను దేవుడితో సమానంగా కొలుస్తారు. విద్య, ఉద్యోగం, సమానత్వం మొదలైన ప్రతి విషయంలో అంబేద్కర్ ఒక స్ఫూర్తి తేజంగా అందరికీ ఆదర్శనీయుడు. దేశానికి ఎంతో చేసిన వ్యక్తి తన తనువు చాలించిన దినం డిసెంబర్ నెలలోనే వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈయన ప్రజల కోసం చేసిన పోరాటం, త్యాగం, సేవ మొదలైన వాటిని గుర్తుచేసుకోవాలి. ఈయన వర్ధంతి సందర్భంగా ఈయన గురించి….  డిసెంబర్ నెలలో ముఖ్యమైన రోజులలో అంబేద్కర్ వర్ధంతి కూడా  ఒకటి.  BR అంబేద్కర్ వర్ధంతి పరిస్థి సంవత్సరం డిసెంబర్ 6న జరుపుకుంటారు.  ఈయన భారత రాజ్యాంగం యొక్క ప్రధాన రూపశిల్పిగా పరిగణించబడ్డాడు.  సమానత్వం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి గానూ  నేటి ప్రజలకు అవగాహన కల్పించడానికి  భారతదేశంలో డాక్టర్ BR అంబేద్కర్ యొక్క వర్ధంతిని జరుపుకుంటారు.   బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈయన జీవితంలోకి తొంగి చూస్తే…   అంబేద్కర్ నాటి కాలానికి(ఎంతో అభివృద్ధి చెందినా నేటికి కూడా) అందరూ వెనుకబడిన వర్గంగా భావించే దళిత కులంలో జన్మించారు, ఈ కారణం వల్ల వారు అంటరానివారిగా పరిగణించబడ్డారు మరియు సామాజిక-ఆర్థిక వివక్షకు గురయ్యారు.  అంబేద్కర్ పూర్వీకులు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చాలా కాలం పనిచేశారు. ఈయన తండ్రి మోవ్ కంటోన్మెంట్ వద్ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.  చదువు నిమిత్తం పాఠశాలకు హాజరైనప్పటికీ, అంబేద్కర్, మరికొందరు కులం కారణంగా  ఇతర  పిల్లల నుండి వేరు చేయబడ్డారు. అంతే కాకుండా ఉపాధ్యాయులు కూడా దళిత కులమనే కారణంతో ఇలాంటి వారికి చదువు విషయంలోనూ ఇతర తరగతి గది కార్యకలాపాలలోనూ సహకారం అందించలేదు. పైగా వీరిని తరగతి గదిలో కూర్చోనివ్వడానికి అనుమతి నిరాకరించారు. బాల్యమంతా ఇలాంటి పరిస్థితులు మధ్య సాగిన BR అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి.  భారతదేశంలోని వివిధ కులాల అభివృద్ధికి ఆయన అనేక పనులు చేశారు, ప్రధానంగా అంటరానితనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు.  భారతదేశంలోని నివాసితులందరికీ వారి కులాలతో సంబంధం లేకుండా  సరైన వనరులు కల్పించడంలో కృషి చేసారు.  ఇలా వెనుకబడిన వారికోసం అంబెడ్కర్ చేసిన కృషి ఫలితంగా ఈయన వర్దంతి రోజున దేశం మొత్తం ఈయనను గుర్తుచేసుకుంటుంది. ఇక  BR అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ సంవత్సరం 2022 డిసెంబర్6 న వివిధ ప్రాంతాలలో జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే… డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ మరణించి ఈ. సంవత్సరానికి 66 సంవత్సరాలు పోయిర్తయ్యి  67వ వర్ధంతి వచ్చింది.  దేశం మొత్తం మీద దీన్ని  మహాపరినిర్వాణ దివస్ గా పేర్కొంటారు.  ఆయన 67వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేయనున్నారు. భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి అంబేద్కర్ వర్ధంతిలో కీలకంగా పాల్గొంటారు. వీరు  సమాజానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు కులతత్వాన్ని నిర్మూలించడంలో ఆయన చేసిన కృషి గురించి ఉపన్యాసాలు ఇస్తారు.  ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.  భారత రాజ్యాంగ పితామహుడిగా పిలువబడిన ఈయన సంఘ సంస్కర్తగా దేశానికి, సమాజానికి అతను చేసిన సేవలు వెలకట్టలేనివి. ఈ సేవలకు గానూ  1990లో భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నను కూడా పొందాడు. ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈయనకు  తొమ్మిది భాషలు తెలుసు, అంతే కాకుండా  భారతదేశంలో డాక్టరేట్‌ను అభ్యసించిన మొదటి వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తికి పరిస్థి ఒక్కరూ నివాళులు అర్పించాలి..                                        ◆నిశ్శబ్ద.

మనిషి గురించి, కాలం గురించి జిడ్డు కృష్ణమూర్తి మాటలు!

ఓ గొప్ప శిష్యుడు భగవంతుని దగ్గరకు వెళ్లి తనకు సత్యబోధ చేయమని కోరిన కథను ఇక్కడ చెప్పుకోవాలి. పాపం! ఆ భగవంతుడు అన్నాడు. 'నాయనా, చాల ఎండగా వుంది, ఓ గ్లాసెడు మంచినీళ్లు తెచ్చిపెట్టు.' అని. ఆ శిష్యుడు సరేనని చెప్పి ఓ యింటి ముందుకు వెళ్లి తలుపు తట్టాడు. ఓ సుందరాంగి తలుపు తెరిచింది. శిష్యుడు ఆమెను ప్రేమించడం జరిగింది. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. వారికి వివాహం అయింది, అనేక మంది పిల్లలు కూడా కలిగారు. ఒక రోజు విపరీతంగా వర్షం కురవసాగింది. రోడ్లన్నీ వరదలమయం అయినాయి. ఇళ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. శిష్యుడు భార్యను భుజాల మీదుగా ఎత్తుకుని, పిల్లలను చంకన వేసుకుని ఆ వరదలో పడి కొట్టుకుపోతూనే 'ఓ భగవంతుడా! నన్ను కాపాడు' అని ఎలుగెత్తి కేక వేశాడు.  అప్పుడు భగవంతుడు శిష్యుడితో 'నేను అడిగిన మంచినీళ్లు యేవయ్యా?' అని అడిగాడు. ఇది మంచి కథ. ఎందుకంటే, మనం చాలమందిమి ప్రతిదానినీ కాలక్రమేణ కాలప్రమేయంతో తూచుకుంటాము. మనిషి కాలం ఆధారంగా జీవిస్తాడు. అతని పలాయన వాదంలో భవిష్యత్తును రూపొందించుకోవడం ఓ మంచి ఎత్తు. మనలో మార్పులన్నీ కాలానుగుణంగా కాలక్రమేణ వస్తాయని అనుకుంటాము. క్రమతను మనలో కొద్దికొద్దిగా క్రమక్రమంగా రూపొందించుకోవచ్చునని  అనుకుంటాము. కాని కాలం క్రమతనుగానీ శాంతిని గానీ తీసుకురాదు. అందుచేత ఏదో కాలక్రమేణ జరుగుతుంది సుమా అన్న విషయం మనం మరచిపోవాలి. అంటే, రేపు అనే రోజు ఒకటి ఉందనీ అప్పుడు ప్రశాంతంగా వుంటామనీ అనుకోగూడదు. మనం ఈ క్షణంలోనే, యిప్పుడే క్రమంలో వుండిపోవాలి. నిజంగా ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడు కాలం అంతర్ధానమైపోతుంది కదూ? అప్పుడు తక్షణ చర్య వుంటుంది. అయితే, మనకున్న అనేక సమస్యల తాలూకు ప్రమాదాన్ని మనం పసికట్టం, అందుచేత వాటినుంచి తట్టుకోవటానికి సమయం, కాలం అనే సాధనాన్ని కల్పించుకుంటాం, అన్వేషిస్తాం. సమయం మనకేమి సహాయం చేయదు. పైగా దగా చేస్తుంది. మనలో మార్పు తీసుకురాదు. సమయం అనేదానిని గతం, వర్తమానం, భవితవ్యం అని భాగాలు చేసుకున్నాడు మనిషి. ఈ విభాగాలు చేసుకున్నందువల్ల సంఘర్షణ తప్ప యింకేమి సంప్రాప్తం కావడం లేదు. నేర్చుకోవడం అనేది కూడా కాలక్రమేణ జరిగే పనేనా? వేల సంవత్సరాల తరువాత కూడా మనం ఒకళ్ల నొకళ్లం చంపుకోవడం, అసహ్యించుకోవడం కంటే వేరయిన సక్రమ జీవన విధానం వున్నదని నేర్చుకోలేకపోయాము. కాలానికి సంబంధించిన సమస్య చాల ముఖ్యము. జీవితాన్ని రాక్షసమయము, అర్థ విహీనము చేసుకున్న మనం యే సమస్యనయినా పరిష్కరించుకోవాలనుకుంటే, ముఖ్యంగా ముందుగా కాలాన్ని గురించిన విషయమే ప్రస్తావించుకోవాలి. మనం లోగడ ప్రస్తావించుకుని, గమనానికి తెచ్చుకున్న తాజాతనం, అమాయకత్వంతో కూడిన మనసుతో మటుకే చూచి, కాలాన్ని అర్థం చేసుకోగలమనే సంగతి ముందు గ్రహించగలగాలి. అనేక సమస్యలు మనను గందరగోళ పరుస్తున్నాయి. మనం యీ గందరగోళంలో చిక్కుకుపోయాము. ఒక అడవిలో దారి కనబడక చిక్కుకుపోయామనుకోండి, అప్పుడు యేం చేస్తాం? ఉన్న చోట ఆగిపోతాం. ముందుగా మనం చేసే పని యిదీ. ఆగిపోయి, చుట్టూ పరికించి చూస్తాం. అయితే, మనం గందరగోళంలో ఎక్కువగా  చిక్కుకుపోయాం కాబట్టి, జీవితంలో దారి కనబడక యిరుక్కుపోయాం కాబట్టి  మనం యేం చేస్తున్నామంటే: అటుయిటు పరుగులు తీస్తున్నాం, వెదుకులాడుతున్నాం, అడుగుతున్నాం, దబాయిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. అందుచేత మొదటి విషయం యేమిటంటే - మనం చేయవలసిన మొదటి పని యేమిటి అనే విషయం గురించి సాగే ఆలోచనలో పడిపోయిన మనం అంతరంగికంగా మనం అగిపోవాలి ముందు. అంతరంగికంగా అగిపోయినప్పుడు, మానసికంగా నిశ్చలంగా వున్నప్పుడు  మనసు ప్రశాంతంగా తయారవుతుంది, స్పష్టత యేర్పడుతుంది. అప్పుడు ఈ కాలపు ప్రశ్నను గురించి జాగ్రత్తగా గమనించవచ్చును. ఇదీ జిడ్డు కృష్ణమూర్తి గారు మనిషి గురించి, కాలం గురించి, మనిషి కాలం విషయంలో చేస్తున్న ఆలోచన గురించి ఇచ్చిన వివరణ.                                     ◆నిశ్శబ్ద.

విజేతలను పరాజితులను వేరు చేసేది ఏంటి?

చాలా మంది విజయాన్ని సాధించాలని అనుకుంటారు. కానీ అధైర్యంతో వెనకడుగు వేస్తారు. విజయం సాధించాలంటే అందుకు కావలసింది ధైర్యమే కానీ అధైర్య పడటం కాదు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసుకోగల సామర్థ్యం మనలో వున్నప్పుడే విజయ శిఖరాలను చేరుకోగలగుతాము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోవాలి.  విజయాలు సాధిస్తే పొంగిపోతాడు కొందరు. కానీ విజయాలను సాధించినప్పుడు అణకువతో ఉండటమే అత్యత్తుమ సంస్కారం. విజయాన్ని సాధించాలంటే ప్రతీ మనిషి మొదట తన మీద తాను విజయం సాధించాలి. ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం మొదలైన పరిస్థితుల్లాంటి పరిమితుల్ని ఛేదించుకుని బయటపడాలి. సంకల్ప బలంతో ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా మార్చగలం అనే నమ్మకం కలిగి వుండాలి.  కష్టే ఫలి అన్నారు పెద్దలు. అంటే కష్టపడనిదే ఏదీ సొంతం కాదు. కష్టపడకుండా మనకు ఏది లభించినా దాని విలువ మనకు తెలియదు. కష్టపడకుండా లభించిన దానిలో అంత థ్రిల్ కూడా వుండదు. ఆనందం ఏమీ వుండదు. అసలు అది విజయం కానేకాదు. దీన్ని బట్టి చూస్తే ఈకాలంలో ఎంతో మంది యువత సాధిస్తున్నది విజయమేనా అనే అనుమానం వస్తుంది. విజయం సాధించడం అంటే అన్ని సమకూర్చగా దాన్ని తమ ఖాతాలో వేసుకుని విజయం సాధించామని చెప్పడం కాదు. సమస్యలతో రాజీలేని పోరాటం చేసి మనం అనుకున్న గమ్యం చేరాలి. కష్టాలను ఎదుర్కొని, పోరాడి విజేతలుగా రూపాంతరం చెందాలి. ఎవరైనా విజయం సాధించారు అంటే  వారికేముందిలే అన్ని సమకూరతాయి అని నిర్లక్ష్యంగా మాట్లాడతారు. కానీ తమ శక్తి సామర్థ్యాల ద్వారానే ఎదుటివారు విజయాలు  కైవసం చేసుకున్నారని గుర్తించనే గుర్తించరు. ఎందుకంటే మనకంటే గొప్పవారు, ప్రతిభావంతులు వున్నారని మనం అంగీకరించం గనుక. అలా అంగీకరించకపోవడమే మనిషిలో ఉన్న అహం. ఆ అహంతో మనిషి తానే గొప్ప అనుకుంటూ ఉంటాడు.  విజయ పోరాటంలో సమస్యలు వస్తూనే వుంటాయి. ఆ సమస్యలను పరిష్కరించాలి తప్పితే వాటినే తలచుకుంటూ దిగులు పడటం అర్థంలేని వ్యాపకం అవుతుంది.  ఎందుకంటే ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం అనేది వుంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ వుండదు. ప్రతి చిక్కుకు ఒక చిట్కా వుంటుంది. అదేదో తెలుసుకొని, సరైన సమయంలో ప్రయోగించాలి. విశ్వాసం, నమ్మకం వున్నప్పుడే వాటి వెనకాల విజయం కూడా వుంటుంది. సవాలు ఎంత పెద్దదైతే విజయమూ అంతే పెద్దది అయి వుంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్న నానుడి పూర్తిగా నమ్మి జీవితాంతం దానిని ఆచరించి విజయాలు సొంతం చేసుకోవచ్చు. పోటీలు, పందాలు సవాళ్ళు చిన్నప్పటి నుంచి మనందరికీ ఎదురవుతాయి. చాలమందింపిల్లల్లో ఇలాంటి పెట్టి పాడు చేస్తున్నారు వారిని స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదు అని అంటారు. కానీ అన్నీ మన మంచికే అని అనుకోవాలి. అలా అనుకుంటే ప్రతి పనిలో అనుభవం వస్తుంది కదా అనే విషయం కూడా తెలుసుకోగలుగుతారు.  ఏ పనిని కూడా అసాధ్యం అని మన మనస్సులో చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే సాధ్యమనుకుంటే అన్నీ సాధ్యమే...! అసాధ్యమనుకుంటే అన్నీ అసాధ్యాలే...! విజేతలను, పరాజితులను వేరుచేసేది ఈ నమ్మకమే...!                                         ◆నిశ్శబ్ద.

సమానత్వం గురించి మాట్లాడేవారికొక చక్కని విశ్లేషణ!

ప్రస్తుత సమాజంలో కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. నెలజీతం అందుకొన్న మొదటి పదిరోజులు ఆఘమేఘాలపై తేలిపోతుంటారు. అచ్చం అమెరికన్ కాపిటలిస్టుల వైఖరిలో వారికీ వీరికీ పార్టీలు ఇచ్చేస్తారు. వీరిలో దర్జాతనం అంతా వెలిగిస్తారు. విలాసంగా ఖర్చు చేస్తారు. ఆ తర్వాత పదిరోజుల పాటు చేతిలో డబ్బు చాలనందువల్ల సోషలిస్టు భావాలు పెరుగుతాయి వాళ్లలో. దేశసంపదని ప్రజలందరికీ న్యాయంగా పంపిణీ చేస్తే బాగుంటుందని ప్రకటించడం మొదలుపెడతారు. అలాంటి వ్యక్తి నెల చివరి పదిరోజుల్లోనూ డబ్బులకు గిజగిజ ఎక్కువై, కమ్యూనిస్టు భావాలకు లోనవుతాడు. భాషలో కాఠిన్యం ఎక్కువ చోటుచేసుకుంటుంది. ముఖ్యంగా  ధనికుల్ని ఏం చేసినా పాపం లేదంటాడు. అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్నే అంతం చేయాలంటాడు. ఆ నెలకు ముఫ్పై ఒక్క రోజులుంటే నెల చివరిరోజున అతడి పరిస్థితి చెప్పనక్కరలేదు. చేబదులు కూడా పుట్టని కారణం వల్ల ఆరోజుకు కావలసిన కాఫీ ఫలహారాలకోసం స్నేహితుల గుంపు మధ్యకు వెళ్ళి కూచుంటాడు. ఆ చివరిరోజున అతడి ధోరణి యావత్తూ అనార్కిస్టుగా కనిపిస్తుంది. ఈ సమాజంలోని అసమానత్వాలను కూకటి వ్రేళ్ళతో పెరికి వేయాలంటాడు. కనిపించిందంతా ధ్వంసం చేయాలంటాడు. ఆ మర్నాడు చేతిలో జీతం రాళ్ళు పడగానే అంతకు ముందు ప్రకటించిన భావావేశమంతా తగ్గి, మళ్ళీ ముందులాగా కాపిటలిస్టులాగా తృప్తిగా నవ్వుతూ వుంటాడు. ఒక పాశ్చాత్యుడి వద్ద బట్లర్ ఒకడు ఉండేవాడు. అతడు ప్రతి శుక్రవారం యజమాని అనుమతి పొంది నగర కమ్యూనిస్టు మీటింగుకు శ్రద్ధగా వెళ్ళి తిరిగొస్తుండేవాడు. కొన్ని మాసాలు గడిచిన తర్వాత బట్లర్ అనుమతి అడిగే శుక్రవారం వచ్చినప్పటికీ అతడు తన వద్దకు రాకపోవడం గమనించి అతడి యజమాని, "ఏమి, ఇవాళ మీటింగుకు వెళ్తున్నట్లు లేదే?" అని అడిగాడట.  "వెళ్లటం లేదండీ. పోయినసారి మీటింగుకు వెళ్ళినప్పుడు మన ఫ్రాన్సుదేశ సంపదని మన జనాభాకు సరిసమానంగా పంచితే మనిషి ఒక్కింటికి నెలకు ఏడువందల ఎనభై ఎనిమిది ఫ్రాంకులు ముట్టుతాయని ఎవరో ప్రసంగిస్తూ అన్నారు. నా నెల జీతం ఎనిమిది వందల ఫ్రాంకులైనప్పుడు నేను ఆ పార్టీలో వుండడం అనవసరమని అనిపించింది. అందువల్ల మానేశాను" అని సమాధానమిచ్చాడట. పూర్వం కాథరిన్ మెకాలే అనే ప్రసిద్ధ చరిత్ర రచయిత్రి వుండేది. సాంఘిక సమానత్వం గురించి ఆవిడ చాలా ఆవేశపడుతుండేది. పదిమంది మేధావులు తన ఇంట డిన్నర్ కు కూచున్న వేళల్లో తన విశ్వాసాన్ని గట్టిగా ప్రకటిస్తుండేది. ఆనాటి మహారచయిత, ప్రసిద్ధ నిఘంటుకర్త అయిన డాక్టర్ జాన్సన్, డిన్నర్ వద్ద ఆవిడ చేసిన ఘాటైన ప్రసంగం విని మొహం సీరియస్గా పెట్టి, “అమ్మా, మీ ప్రసంగం నన్ను పూర్తిగా మార్చేసింది. మీ వాదన నాకు చాలా సహేతుకంగా కనిపిస్తున్నది. మనుషులందరూ సమానమే కాబట్టి అందర్నీ ఒకటిగా చూడాలనే మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడాను. ఈ మాటలు నేను హృదయ పూర్వకంగా అంటున్నాననే విషయం రుజువు చేయడానికి ఇప్పటికిప్పుడే ఒక సూచన చేస్తున్నాను. ఇక్కడవున్న మీ పరిచారకుడు చాలా మర్యాదస్తుడు, నెమ్మదైనవాడు. పెద్ద మనిషి, ఇతడు మనతో బాటు ఈ డైనింగ్ టేబిల్ వద్ద కూచొని భోజనం చేయాలని నా ఆకాంక్ష" అన్నాడు.  డాక్టర్ జాన్సన్ చేసిన ఈ ప్రతిపాదనను కాథరిన్ మెకాలే అగ్రహంతో తిరస్కరించింది. జాన్సన్ లోలోన నవ్వుకొని ఆ తర్వాత తన అంతరంగికులతో మాట్లాడుతూ “అందర్నీ సమానం చేసేయాలనే ఆవిడ వాదన ఎంత అసంబద్ధమైనదో ఆరోజున ఆవిడకలా తెలియజేశాను. ఆనాటి నుండి నేనంటే ఆవిడకంత గిట్టేది కాదు. అందరూ సమానమేనని సిద్ధాంతీకరించే ఈ ప్రబుద్ధులు తమకన్నా పై శ్రేణిలో వున్న వారితో తాము సమానమవాలని కోరుకుంటారేగానీ తమ క్రింది వర్గాలవారితో తాము సమానంగా వ్యవహరించడానికి అంగీకరించరు." అని అన్నారు జాన్సన్.                                     ◆నిశ్శబ్ద.

భారతీయులు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా?

ప్రపంచంలోని పుస్తకాలన్నీ అదృశ్యమైపోయినా ఒక్క భగవద్గీత మిగిలితే చాలు. ఇంకేమీ అవసరం లేదంటాడు మహాత్మాగాంధీ, మానసికతత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికం, నైతికవిలువలు....వెరసి ఒక మనిషి మనీషిగా, ఎదిగి ఉత్తమవ్యక్తిత్వంతో అలరారేందుకు అవసరమైన అంశాలన్నీ భగవద్గీతలో లభ్యమౌతాయి. జీవితానికి పునాది అయి, ప్రాణాధారం వంటి తత్వజ్ఞానం లభిస్తుంది. ఆ తత్త్వజ్ఞానాన్ని జీవితరంగంలో క్రియారూపంలో అనువర్తించే మార్గం లభిస్తుంది. నిత్యకృత్యాలలో ఎదురయ్యే చిన్న చిన్న సందేహాల నుండి క్లిష్టసమస్యల పరిష్కారం వరకూ అన్నీ భగవద్గీతలో లభిస్తాయి. అందుకే వ్యక్తి ఊహ ఎదిగి, వ్యక్తిత్వం స్థిరపడే సమయంలో గీతాపఠనం అతని ఎదుగుదల కాక దిశ కల్పిస్తుంది. ప్రపంచంలో మనిషి జన్మకు అర్ధం తెలిపి, ఆ జన్మను సార్ధకం చేసుకునేందుకు మార్గం చూపిస్తుంది. తాత్కాలిక సత్యం, శాశ్వత సత్యాలను గుర్తించటం నేర్పుతుంది. క్షణికావేశాలు, ఆకర్షణలను గుర్తించి నిజమైన భావనలను గుర్తించే విచక్షణను నేర్పుతుంది.  అంటే, శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచీ మంచి మాటలు నేర్పుతూ, జన్మించిన తరువాత మంచి ఆలోచననిస్తూ, ఎలాగైతే మొక్క ఎదిగి, తీగలా సరైన దిశలో పాకేట్టు సమాజం జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుందో, ఇప్పుడు చెట్టు, వృక్షమయ్యే సమయంలో భగవద్గీత సరైన దిశాదర్శనం చేస్తుందన్నమాట. ఈ జ్ఞానంతో సమాజసాగరంలో అడుగిడిన వ్యక్తి ఆత్మవిశ్వాసంతో, విచక్షణతో తాను విజయుడవటమే కాక సమాజాన్ని విజయం దిశలో నడిపిస్తాడు. ఇది మన భారతీయ, వ్యవస్థలో వ్యక్తి విజయం కోసం స్వాభావికంగా ఏర్పరచిన బాట. అయితే ఈ బాటను విస్మరించి, ఈ జీవనవిధానాన్ని తృణీకరించటం వల్ల ఈనాడు మనకు కృత్రిమ అవయవాల వంటి పాశ్చాత్యప్రభావిత వ్యక్తిత్వవికాస డాక్టర్ల ఆలోచనలు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతవ్యవస్థలో భార్యభర్తలిద్దరికే కలసి జీవనం సాగించే ఓపిక ఉండటం లేదు, ఇక పెద్ద బంధుగణంతో కలసి జీవించే సహనం ఉండే పరిస్థితి లేదు. దాంతో జన్మించటం తోటే పసిపిల్లవాడికి లభించే 'భద్రత కవచం' లేకుండాపోయింది. భార్యభర్తలిద్దరూ తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాల్సి రావటంతో, చివరి క్షణం వరకూ గర్భవతి అయిన స్త్రీ ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తోంది. దాంతో వాతావరణం ప్రసక్తి రావటం లేదు. మామూలు ఉద్యోగాలు, చిరాకులు, ఉద్విగ్నతలు తల్లితో పాటు గర్భంలో పిల్లవాడూ అనుభవించాల్సి వస్తోంది. ఇక పిల్లవాడు పుడుతూనే ఓ 'సమస్య' అవుతున్నాడు. తల్లిదండ్రుల జీవితంలో 'అద్భుతం' కావాల్సిన పిల్లవాడి ఆలన పాలనలు బరువైపోవటంతో, పిల్లవాడు పని సమయాల్లో 'అనాథ'లా క్రచ్లలో ఉండాల్సి వస్తోంది. సుమతీ శతకాలు, లాలిపాటలు, జోలపాటలు పాడే ఓపిక, తీరికలు ఎవరికీ ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదు. పైగా ఇది టీవీలు, మొబైల్ ఫోన్ ల యుగం కావటంతో, వ్యాపార విలువలే ప్రధానం కావటంతో పిల్లవాడికి సినీ పాటలే సుమతీ శతకాలవుతున్నాయి. రీమిక్స్లు జోలలవుతున్నాయి. కార్టూన్లు, క్రైమ్ నాటకాలు పురాణాలవుతున్నాయి. అంటే, జీవితమంటే ఏమిటో తెలియకనే, ఈ ప్రపంచంలో తన పాత్ర ఏమిటో ఆలోచన లేకుండానే, అత్యంత అశాంతితో, అభ్యనతా భావంతో, పిల్లలు ప్రపంచంలోకి అడుగిడుతున్నారు. దీనికి తోడు విజయం అంటే 'డబ్బు సంపాదన' అన్న భావం సమాజంలో స్థిరపడింది.  పాఠశాలల్లో నైతికవిలువల బోధన కొరవడింది. డబ్బును బట్టి చదువు లభ్యమౌతుంది. అదీ ఉద్యోగ సంపాదన చదువు తప్ప, మనిషికి వ్యక్తిత్వాన్నిచ్చే చదువు కాదు. దాంతో విచక్షణ అన్నది అదృశ్యం అవుతోంది. ఇటువంటి పరిస్థితులలో మనకు మానసిక డాక్టర్లు, వ్యక్తిత్వవికాస కౌన్సిలర్లు అవసరమౌతున్నారు. అంటే కోకిల కాకి అయ్యే ప్రయత్నాలు చేస్తూండటంతో, ప్రస్తుతం కాకి కోకిలకు 'పాట' నేర్పుతోందన్న మాట! ఎప్పుడైతే ఈ సత్యం అర్థమౌతుందో, అప్పుడే జీవితాలలో మార్పు మొదలవుతుంది. నిజమే కదా!!                                    ◆నిశ్శబ్ద.

ప్రపంచాన్ని ఇముడ్చుకున్న టెలివిజన్.. ఆవిష్కారమైన రోజు…

ఒక 20 సంవత్సరాల కిందటి కాలంలోకి చూస్తే అప్పటి ప్రపంచం వేరుగా ఉండేది. అక్కడక్కడా కనిపించే బుల్లితెర సందడి ఒక అద్బుతంగానే ఉండేది. బొమ్మలు కదులుతూ మాటలు, హవాభావాలు అందరికీ వీణులవిందు చేస్తుండేది. ఇదంతా టివి గా మనం పిలుచుకునే టెలివిజన్ కథ.  ప్రస్తుతకాలంలో టెలివిజన్ చాలా రూపాంతరం చెంది దీర్ఘచతురస్ర చెక్క పలక అంత పరిమాణంలోకి వచ్చింది. టీవీ లేని ఇల్లు అంటూ ఇప్పుడు ఎక్కడా లేదేమో... 1996లో, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నవంబర్ 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి టెలివిజన్ గురించి నిర్ణయం తీసుకోవడంపై బలమైన కారణమే ఉంది. టెలివిజన్ గురించి ఐక్యరాజ్యసమితి నిర్ణయం వెలువరించిన కాలానికి టెలివిజన్ అనేది ఒక అద్భుతమైన ప్రసార సాధనం. ఇది మనిషి జీవితం పై  ఎక్కువ ప్రభావం చూపుతుందని,  అలాగే వినోద పరిశ్రమకు అంబాసిడర్‌గా కూడా ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని గుర్తించింది.  టెలివిజన్ అనేది కమ్యూనికేషన్ మరియు గ్లోబలైజేషన్ యొక్క చిహ్నం అని ఐక్యరాజ్యసమితి తెలియజేసింది.  ఇంతటి ప్రధాన పాత్ర పోషించిన టెలివిజన్ చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలి. 1927లో, ఫిలో టేలర్ ఫార్న్స్‌వర్త్ అనే 21 ఏళ్ల వ్యక్తి  ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ టెలివిజన్‌ను కనుగొన్నాడు.  అతను 14 సంవత్సరాల వయస్సు వరకు కరెంటు ప్రసారం లేని ఇంటిలో నివసించాడు.  అతను తన ఉన్నత పాఠశాలలో  కదిలే చిత్రాలను సంగ్రహించి, వాటిని కోడ్‌గా మార్చగల వ్యవస్థ గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అంతేకాకుండా రేడియో తరంగాలతో ఆ చిత్రాలను వివిధ పరికరాలకు తరలించాడు.  ఎలక్ట్రాన్ల పుంజం ఉపయోగించి కదిలే చిత్రాలను సంగ్రహించడంలో అతను మెకానికల్ టెలివిజన్ వ్యవస్థ కంటే చాలా సంవత్సరాలు ముందున్నాడు.  అయితే  ప్రపంచ సమాచార వ్యాప్తిని ప్రోత్సహించే అంతర్జాతీయ దినోత్సవానికి టెలివిజన్ చిహ్నంగా మారుతుందని అప్పుడు అతను ఊహమాత్రంగా అయినా అనుకుని ఉండడు.  1996లో నవంబర్ 21 మరియు 22 తేదీల్లో ఐక్యరాజ్యసమితి మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరమ్‌ను నిర్వహించింది.  ఇక్కడ, ప్రముఖ మీడియా వ్యక్తులు వేగంగా మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్న టెలివిజన్ ప్రాముఖ్యతను చర్చించడానికి మరియు వారి పరస్పర సహకారాన్ని ఎలా పెంచుకోవచ్చో పరిశీలించడానికి సమావేశమయ్యారు.  ఐక్యరాజ్యసమితి నాయకులు ప్రజలలో టెలివిజన్  ఓ సానుకూల  దృష్టిని తీసుకురాగలదని, శాంతి మరియు భద్రతకు ముప్పుల గురించి అవగాహన పెంచుతుందని, సామాజిక మరియు ఆర్థిక సమస్యలపై దృష్టిని పదును పెట్టగలదని గుర్తించారు. ఇక  ప్రపంచ రాజకీయాలపై నిస్సందేహంగా  ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడం, ప్రసారం చేయడం మరియు ప్రభావితం చేయడంలో టెలివిజన్ ఒక ప్రధాన సాధనంగా గుర్తించబడింది.  ఈ సంఘటన కారణంగా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 21 ప్రపంచ టెలివిజన్ నిర్వహించుకోవాలని  నిర్ణయించింది, టెలివిజన్ డే అనేది కేవలం ఆ వస్తువును గుర్తుచేసుకోవడం, దాన్ని చూడటంతో ముగిసిపోయేది కాదు. అది ప్రాతినిధ్యం వహిస్తున్న సమకాలీన ప్రపంచంలో కమ్యూనికేషన్ మరియు ప్రపంచీకరణకు చిహ్నం. ఇది ఒకనాటి తరానికి అద్భుతంగా అనిపించిన టెలివిజన్ కథ.                              ◆ నిశ్శబ్ద.

నెహ్రుకు కోపం తెప్పించిన ఓ.. సందర్భం!

మనకు తెలిసిన వారిలోనో… స్నేహితుల లోనో… లేక చుట్టాలలోనో.. కొందరుంటారు. వారిలో ఎవరైనా మనకు ఏదైనా అదృష్టం కలిసివస్తే అప్పు రూపంలోనో పప్పురూపంలోనో తనింత పంచుకుంటాడు, కష్టం చెప్పుకుంటే “నాకేమి సంబంధం?” అని లేచిపోతాడు. ఇహ అలాంటప్పుడు “ఎలావున్నావ్?” అని అడిగినపుడు ఏమీ సమాధాన మివ్వకుండా నవ్వేసి ఊరుకోవడమే మంచిది. మనుషుల మధ్య ప్రవర్తిల్లే సంబంధాన్ని బాగా కనిపెట్టినందువల్లనే ఇంగ్లీషువాడు "హౌ డూయుడూ?" అని మనల్ని ఎవరైనా పలకరిస్తే, సమాధానంగా మనం అతన్ని "హౌ డూయూడూ?” అని “యు” అక్షరాన్ని దీర్ఘంచేసి పలకడమే “మానర్స్" అని తేల్చాడు. అంతేకాని వీరి బాగోగులు వారికీ, వారి బాగోగులు వీరికీ వివరించుకుంటూ కూర్చోవలసిన ఆగత్యం లేదు. సోదిగా చెప్పుకుపోయినా వినే ఓపిక ఎవరికుంటుంది? మనం ప్రభుత్వం వారివద్దనుండి ఏదైనా పొందాలనుకున్నప్పుడు సుదీర్ఘమైన ప్రశ్నావళి నొకదాన్ని మనకందిస్తారు? అది "ఫిలప్" చేసి వారికి తిరిగి ఇవ్వవలసి వుంటుంది. ఇందులో కనిపించే ప్రశ్నలన్నీ చూస్తే, ప్రభుత్వం నుండి మనమాశించే దానికీ ఇక్కడ మనం సమాధానం చెప్పవలసిన ప్రశ్నలకు అసలు సంబంధమేమైనా వుందా, ఈ సమాధానాలన్నీ ఓపిగ్గా ఎవరైనా చదువుతారా అనే అనుమానం వస్తుంది. కానీ ప్రశ్నలన్నిటికీ విధాయకంగా సమాధానాలిచ్చి తీరవలసిందే. విసుక్కుంటూనే అన్నీ రాసి దరఖాస్తు దాఖలు చేసుకుంటాం. పండిట్ నెహ్రూ బ్రతికుండే రోజుల్లో అతడి పాశ్చాత్య స్నేహితుడు ఒకాయన అసలీ భారతీయాధికారులు ఈ “ఫిలప్" చేసిన ఫారాలన్నీ నిజంగా పరికిస్తారా. లేక ఏదో ఆనవాయితీని బట్టి ఆ ఫారాలన్నీ మనచేత ఊరికే నింపిస్తున్నారా అని పరీక్షిద్దామని అనుకున్నాడు. నెహ్రూ మిత్రుడైన కింగ్ స్లీ మార్టిన్ "న్యూ స్టేట్స్మన్ అండ్ నేషనల్” అనే ప్రఖ్యాత బ్రిటిష్ వారపత్రికకు ఎడిటర్. బ్రతికున్న రోజుల్లో, భారతదేశం టూరిస్టు శాఖ ఆహ్వానంపై అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు. ఇండియాకు వచ్చినప్పుడల్లా “యల్లో ఫీవర్" జ్వరం కార్డులో యాత్రికుడు ఒకరోజు క్రితం ఎక్కడున్నదీ, రెండు రోజుల క్రితం ఎక్కడున్నదీ, అదే విధంగా మూడు, నాలుగు, వరుసక్రమంలో తొమ్మిదిరోజుల క్రితం ఎక్కడున్నదీ వ్రాయమని నిర్ధేశించి వుండేది. విజిటర్ ఏదైనా "యల్లో ఫీవర్" ప్రబలే ప్రాంతంలో నివసించి వచ్చాడా అని తెలుసుకోవడానికి ఉద్దేశించింది ఈ కార్డు. కింగ్ మార్టినికి కాస్త పదునైన హాస్యధోరణి వుండేది. అందుచేత “ఒక రోజు క్రితం" అనే పదాల ఎదురుగా "మేరీ” అనీ, “రెండు రోజుల క్రితం” కాలమ్లో “సూసాన్” అనీ, మూడురోజుల క్రితం “జేన్" అని వరసగా తొమ్మిది రోజులకు తొమ్మిది స్త్రీల పేర్లను ఉదహరించాడు. "ఈ నింపిన ఫారాలు ఎవరూ చదవరని నేను మొదట్నించే అనుమానిస్తూనే వుండేవాణ్ణి. ఇట్లా ఎట్లా రాశావు అని నన్ను అడిగినవాళ్లు లేరు” అని తన పత్రికలో రాశాడు. ఇది చూచిన నెహ్రు "ఏమిటిది?" అని ఆ శాఖలోని ఒక ఉద్యోగినిని పిలిపించి అడిగాడు. " నేను వాళ్ళకి చెప్తూనే వచ్చానండీ, ఆ కాలమ్స్ మార్చి “గత తొమ్మిది దినాల్లో మీరు ఏయేదేశాల్లో వుండి వచ్చారో పేర్కొనండి” అని వ్రాయించండని. కానీ నా మాట ఎవరూ పట్టించుకోలేదు" అన్నాడు. నెహ్రూ ఆగ్రహించి ఆ తర్వాత ఆ ఫారమ్ మార్పించాడు. ఇలా ఉంటుంది కొందరి తీరు. ప్రభుత్వాల విషయం ఇందుకు మినహాయింపు కాదు..                                       ◆నిశ్శబ్ద.

మగమహారాజులపై కాసింత దృష్టి పెట్టాలి!

గుర్తింపు మనిషికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మనిషి ఉనికిని మరింత విస్తృతం చేస్తుంది. ఇక్కడ సాధారణ మానవ ఉనికి గురించి మాట్లాడటం లేదు, ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకు ప్రస్తుతం ఎన్నో రకాల దినోత్సవాలు ఉన్నాయి. పేరెంట్స్ డే, చిల్డ్రెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే ఇలా లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ప్రతిరోజుకూ దాని ప్రాధాన్యతను అనుసరించి వాటిని జరువుకుంటూ ఉంటారు. ఆ కోవలోనిదే మెన్స్ డే. నేషనల్ మెన్స్ డే అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు.  ఎందుకంటే… ఈ సృష్టికి ఆడది ఎంత ముఖ్యమో మగవాడు కూడా అంతే ముఖ్యం. మహిళా దినోత్సవాన్ని ఎంతో విస్తృతంగా జరుపుకునే ఈ కాలంలో మగవారికి గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఖచ్చితంగా చేయాల్సిన పని. ఒకప్పుడు మగవాడి అజమాయిషీ ఎక్కువగా ఉన్న కాలంలో మగవాళ్లను విలన్లుగా చూసి, ఆడవారిని వారే అణిచివేస్తున్నారని వారి మీద విమర్శనాస్త్రాలు సంధించిన వారు చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మగవాళ్ళు ఆడవారికి మద్దతు ఇస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, లక్ష్యాలు, క్రీడలు ఇలా ఎన్నో ఆడవారు మగవారితో సమానంగా రాణిస్తున్న రంగాలు ఉన్నాయి. అయితే ఇది కేవలం ఆడవారి గెలుపా… అంటే కాదని చెప్పవచ్చు. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉన్నట్టు, ప్రతి మహిళ విజయానికి మగవాడి తోడ్పాటు, మగవాడి మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మగవారిని గౌరవించాలి, వారికి గుర్తింపు ఇవ్వాలి. నవంబర్ 19 వ తేదీ నేషనల్ మెన్స్ డే. ప్రతి సంవత్సరం ఈ మెన్స్ డే ఉన్నా.. ఉమెన్స్ డే అంత ఆర్భాటాలు ఏవి మెన్స్ డే కి జరగడం లేదని గగ్గోలు పెడుతున్నవారు ఉన్నారు. సహజంగానే మహిళలు కాస్త హైలైట్ అవుతూ ఉంటారు అన్ని విషయాలలో… దానికి అనుగుణంగా మొదటి నుండి మహిళలు అణిచివేయబడిన వర్గంలో ఒక భాగమయ్యారు కాబట్టి వారికి స్వతహాగానే తమకంటూ ప్రత్యేకత ఉందని వ్యాప్తం చెయ్యాలని ఉంటుంది. దానికి తగ్గట్టే మహిళా సంఘాలు, మహిళ సదస్సులు, మహిళా విభాగాలు ఏర్పడ్డాయి. అయితే మగవారికి ఇలాంటివి ఏమి లేవు. అందుకే మెన్స్ డే ని ప్రత్యేకంగా ఆర్భాటంగా జరిపేవాళ్ళు కనిపించరు. కానీ…. ఏం చేయచ్చు?? మెన్స్ డే అనేది ప్రపంచం మొత్తం మీద మగవారిని గుర్తించి వారికేదో సన్మానాలు గట్రా చేయాలని కాదు అర్థం. మగవారికి కూడా కాసింత ప్రాముఖ్యత ఇవ్వాలని. ఇక్కడేం తక్కువయ్యింది వాళ్లకు అనే ప్రశ్న మళ్ళీ వొస్తుందేమో… ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నా చాలా శాతం కుటుంబాలకు మగవారు బాధ్యత వహిస్తూ ఉంటారు. దీని కారణంగా మగవారు తమ ఆరోగ్యం, వ్యక్తిగత శ్రద్ధ గురించి తక్కువగానే ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి కుటుంబంలో మగవారి ఆరోగ్యం, వారి మానసిక పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలు, ఒత్తిడి వంటి విషయాల గురించి దృష్టి సారించడం ఈ మెన్స్ డే రోజు చేయవచ్చు. ఇది ఎప్పుడైనా చేయవచ్చు కానీ ఈరోజే ఎందుకనే ప్రశ్న వస్తే అవగాహనకు తొలిమెట్టు అనేది అన్నిసార్లు జరగదు. దానికోసం ప్రత్యేకంగా సమయాన్ని, శ్రద్దను కేటాయించగలగాలి. అలాంటప్పుడే సాధారణ సమయాల్లో కంటే ఎక్కువ దృష్టి దాని మీదకు వెళుతుంది.  మగవారి ఆరోగ్యం, వారి క్షేమం ఉంటే ప్రతి ఇల్లూ కొన్ని భయాలు, భారాలకు దూరంగా హాయిగా ఉండగలుగుతుంది. అందుకే మగవారికి కేటాయించిన దినోత్సవాన్ని మిస్ కాకుండా సెలబ్రేట్ చేయండి..                                     ◆నిశ్శబ్ద.

ఆలోచన గురించి జిడ్డు కృష్ణమూర్తి మాటలు!

మన జీవితాలలో ఆలోచన ఎందుకంత ప్రముఖపాత్ర వహిస్తుంది? ఆలోచన అంటే భావనలు, మెదడు కణాలలో పేరుకొని పోయిన జ్ఞాపకాల ప్రతిస్పందనలు. బహుశ  చాలమంది ఇంతవరకు ఇటువంటి ప్రశ్న వేసుకోకొకపోయి ఉండవచ్చు. ఒకవేళ వేసుకున్నా. ఇదంతా ముఖ్యమయినది కాదు. ముఖ్యమయినది భావోద్వేగం! అనుకుని వుంటారు. అయితే, యీ రెంటినీ వేరు చేయడం ఎలాగో ఆలోచన, రాగభావానికి కొనసాగింపు ఇవ్వకపోయినట్లయితే, ఆ భావన త్వరలోనే క్షీణించి పోతుంది. కాబట్టి - మన నిత్య జీవితాలలో, తిరుగుడు రాళ్ల మధ్య నలిగిపోతూ, భయ విహ్వలమయిన జీవితాలలో ఆలోచన ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుంది? ఎవరికి వారు ప్రశ్నించుకుని చూడాలి. మనిషి ఆలోచనకు ఎందుకు బానిస అయిపోయాడు? మోసకారి, తెలివి అయినది, అన్నిటినీ అమర్చేది, ప్రారంభంచేసేది, అన్వేషించి పెట్టేది, యుద్ధాలను తీసుకువచ్చింది, భయోత్పాతాన్ని సృష్టించినది, ఎంతో ఆదుర్దాను క్షణక్షణమూ రూపకల్పనలు చేస్తున్నది, తన తోకను తానే మింగుతున్నది,  నిన్నటి సుఖాలలో ఓలలాడుతూ ఆ సుఖాలను నేడు రేపు కూడా కొనసాగించేది,  ఆలోచన ఎప్పుడూ చురుకయినది, కబురు చెబుతుంది, కదులుతుంది, నిర్మాణం చేస్తుంది. తీసుకుపోతుంది, అదనంగా కలుపుతుంది, ఏవేవో అనుకుంటుంది! భావనలు మనకు ఆచరణకంటే ముఖ్యమయిపోయినాయి, అనేక క్షేత్రాలలో పాండిత్యం సంపాదించిన మహా విజ్ఞానులు వ్రాసిన పుస్తకాలలో చాతుర్యంతో వెలిబుచ్చిన అభిప్రాయాలు చాల మోసకారి, సూక్ష్మమయిన ఈ భావనలను మనం ఆరాధిస్తున్నాం. పుస్తకాలను పూజిస్తున్నాం. మనమే ఆ పుస్తకాలం. మనమే ఆ అభిప్రాయాలు. వాటితో చిక్కగా నిబద్దులమయి పోయాం. భావాలను ఆదర్శాలను ఎప్పుడూ చర్చించుకుంటూ తార్కికంగా ఉద్దేశ్యాలు వెలిబుచ్చుతున్నాం. ప్రతి మతానికి తనదే అయిన విశ్వాసము, సూత్రము, భగవంతుళ్లను చేరుకునే మూసకట్టు వున్నాయి. ఆలోచన ప్రారంభాన్ని గురించి చూస్తున్నప్పుడు యీ భావనల కట్టడాన్నే ప్రశ్నిస్తున్నాం. భావాలను చర్యలనుంచి వేరు చేశాం. ఎందుకంటే, భావనలు ఎప్పుడూ గతానికి చెందినవి. ఆచరణ వర్తమానానికి సంబంధించినది. అంటే, జీవితం ఎప్పుడూ వర్తమానంలోనే వుంటుంది. మనకు జీవించడం భయం కాబట్టి గతం భావనల రూపంలో మనకు అత్యంత ముఖ్యమయినది అయిపోయింది. మన ఆలోచన విధానాన్ని గమనించడం ఆసక్తిదాయకంగా వుంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఆలోచన అనుకుంటున్న ప్రతి చర్య ఎక్కడనుంచి బయలుదేరుతోంది? తప్పనిసరిగా జ్ఞాపకం నుంచే కదూ! ఆలోచించటానికి ప్రారంభం అంటూ ఉందా? ఉంటే, దానికి మనం పట్టుకోగలమా అంటే, జ్ఞాపకం యొక్క ప్రారంభం ఎందుకంటే మనకు జ్ఞాపకశక్తి అంటూ లేకపోతే ఆలోచనలే వుండవు. ఆలోచన ఏ రకంగా నిన్నటి ఒక సుఖానికి బలం చేకూర్చి కొనసాగింపు ఇస్తుందో సుఖానికి వ్యతిరేకమయిన దుఃఖం, భయాలను సైతం కొనసాగించడం కూడా కల్పిస్తుంది.  అనుభవించేవాడు వాడే ఆలోచించేవాడు. తానే ఆ సుఖము, దుఃఖము అయి, వాటిని పెంచి పోషించేవాడు అవడము కూడా చూపెడుతుంది.  ఆలోచన చేస్తున్నవాడు సుఖాన్ని బాధనుండి వేరు చేస్తాడు. సుఖాపేక్షలోనే దుఃఖము, బాధ, భయాలకు ఆహ్వానం ఇమిడి వున్నదని గమనించడు. మానవ సంబంధాలలో ఆలోచన ఎప్పుడూ సుఖాన్ని కోరుతోంది. దీనికి అనేక పేర్లు ఇస్తుంది. విశ్వాసం, సహాయం, దానం పోషణ, సేవ ఇలా.  మనం ఎందుకు సేవించాలనుకుంటున్నామో! పెట్రోల్ స్టేషన్ మంచి సేవలను అందిస్తుంది. ఈ మాటల అర్థం యేమిటి,  సహాయం, ఇవ్వడం, సేవలు చేయడం? ఇదంతా యేమిటి? సౌందర్యంతో, తేజస్సుతో, సౌకుమార్యంతో నిండిన కుసుమం నేను ఇస్తున్నాను, సహాయ పడుతున్నాను, సేవిస్తున్నాను' అని ప్రకటిస్తుందా? అది వుంటుంది, అంతే. అది యేమీ చేయటానికి ప్రయత్నం చేయదు గనుక భూమి అంతా ప్రసరిస్తుంది. ఆలోచన చాల మోసకారి, తెలివయినది. తన సౌకర్యం కోసం దేన్నయినా వికృత పరచగలదు. సుభాపేక్షతో విర్రవీగే ఆలోచన తన దాస్యాన్ని తానే తెచ్చుకుంటుంది. ఆలోచన ద్వంద్వ ప్రకృతిని తీసుకు వస్తుంది. మన సంబంధ బాంధవ్యాలలో, మనలో సుఖాన్ని తీసుకు వచ్చే హింస ఉంది, దయగా ఉదారంగా వుండాలనే కోరిక వున్నది. మన జీవితాలలో యెప్పుడూ జరుగుతున్నది యిదే. ఆలోచన యీ ద్వైతభావాలను తీసుకురావడం, వైరుధ్యాన్ని ప్రవేశపెట్టటమే కాక, అసంఖ్యాకంగా జ్ఞాపకాలను పోగు చేసుకుంటుంది. సుఖమూ బాధలతో కూడిన ఈ జ్ఞాపకాలద్వారా అది పునరుజ్జీవనం పొందుతుంది. కనుక ఆలోచన గతానికి చెందినది. పాతది.                                      ◆నిశ్శబ్ద.

స్ట్రీట్ షాపింగ్.. అదిరిపోయే కలెక్షన్స్

షాపింగ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు? అందులో లేడీస్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అలా ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడో లేదా అవసరానికి కొందామని వెళ్ళినపుడు ఏదైనా అట్రాక్టివ్ గా కనిపిస్తే ఇంకా టెంప్ట్ కాకుండా ఉండగలమా చెప్పండి. సాధారణంగా ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి లేదా మ్యాచ్ అవ్వలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు  కొందామని ప్లాన్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు అనుకోకుండా కూడా షాపింగ్ చేస్తాం. అయితే మనం సాధారణంగా చేసే షాపింగ్ ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సరదాగా టైం పాస్ కి షాపింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ లేదా స్ట్రీట్ షాపింగ్ ని ప్రిఫర్ చేసుకుంటాము. ఎందుకంటే ఇందులో వెరైటీ కలెక్షన్స్ ఉంటాయి. అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అంతే కాకుండా వెస్ట్రన్ వేర్, ఇండో వెస్ట్రన్, అందమైన ట్యాంక్ టాప్స్, ఫ్రాక్స్, నీ లెన్త్ ఫ్రాక్స్, ఈవెనింగ్ గౌన్స్, జాకెట్స్ ఇలా రకరకాల వెరైటీస్ తో రకరకాల కలర్స్ లో దొరుకుతాయి. మన పర్సనాలిటీని, మన స్కిన్ టోన్ ని బట్టి మనకి నప్పే దుస్తులను మనం ఎంపిక చేసుకుంటాం. టాప్స్.. స్కర్ట్స్ లేదా జీన్స్ మీద  మ్యాచ్ చూసుకొని వేసుకోవచ్చు అదిరిపోతుంది. చిన్న బర్త్ డే పార్టీలకు లేదా వీకెండ్ ఔటింగ్స్ కి ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఒక్కోసారి టాప్ బ్రాండెడ్ వి కాపీ వెర్షన్స్ కూడా దొరుకుతాయి. ఒరిజినల్ కి ఏ మాత్రం తీసిపోవు అంటే నమ్మండి. కాకపోతే కాపీ వెర్షన్స్ కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోవాలి. లేదు అంటే దొరికిపోతాం(కాపీ అని తెలిసిపోతుంది). బట్టలతో పాటుగా మ్యాచ్ అయ్యే చెప్పులు, బ్యాగ్స్, జ్యువలరీ, హెయిర్ యాక్ససరీస్ ఇలా చాలా వెరైటీస్ మనం షాపింగ్ చేసుకోవచ్చు. మన హైదరబాద్ లో చాలా ప్లేసెస్ లో స్ట్రీట్ షాపింగ్ చేసుకోటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అమీర్ పేట్, కోఠి, ఓల్డ్ సిటీ, బేగం బజార్, సికింద్రాబాద్-జనరల్ బజార్… ఒక్కో ఏరియాలో ఒక్కో వెరైటీ అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ చేసేయండి.

దేశ జ్ఞానాన్ని వెలిగించే జాతీయ విద్యాదినోత్సవం!

విధ్యా వినయేన శోభతేః... అన్నారు పెద్దలు. అంటే వినయాన్ని చేకూర్చే విద్యనే ఉత్తమమైనది అని అర్థం. విధ్య లేని వాడు వింత పశువు అని కూడా అన్నారు.. విద్య వల్ల మనిషిలో మేధాపరంగా గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత గొప్ప జ్ఞానం వ్యక్తి సొంతం అవుతుందని చెప్పేవారు. అయితే కేవలం డిగ్రీ పట్టాలకు మాత్రమే పరిమితమయ్యే జ్ఞానం మనిషి మాససిక వికాసానికి దోహదం చెయ్యదు. అక్షరము అంటే నాశనం లేనిది అని అర్థం.అందుకే కాలం ఎంత మారినా చదువుకున్న చదువు మనిషికి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉంటుంది. చరిత్రలోకి చూస్తే ఎంతో మంది గొప్పగా ఎదిగిన వారు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగినవారే... వారందరికీ చదువు విలువ ఎంతో స్పష్టంగా తెలుసు కాబట్టే వారు ఎంత గొప్పవారు అయినా చివరికంటూ నిత్యవిద్యార్థులుగా కొనసాగారు.  భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. భారతదేశ మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.  ఎప్పుడు ఏర్పడింది.. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ గా పిలువబడుతున్న విద్యాశాఖ  2008 సంవత్సరం నవంబర్ 11 న భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి, ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ విద్యా దినోత్సవ వేడుక సాగుతోంది.  థీమ్ ఏంటో తెలుసా... ఈ విషయం మీద అవగాహన పెంపొందించే దిశగా ప్రతి సంపత్సరం ఒక కొత్త థీమ్ ను ప్రకటించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది భారత ప్రభుత్వం. అదే విధంగా 2022 సంవత్సరానికి సంబంధించిన థీమ్ "Changing the course and transforming education". పై థీమ్ తో భారత ప్రభుత్వం ప్రజల్లో విద్యమీద అవగాహన పెంచే కార్యక్రమాలను ఈ ఏడాది చేపట్టబోతోంది. జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్న మౌలానా అబుల్ కలామ్ గురించి తెలుసుకుంటే….. నవంబర్ 18, 1888న జన్మించిన మౌలానా అబుల్ కలాం  పూర్తి పేరు "అబుల్ కలాం గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్-హుస్సేనీ ఆజాద్". ఈయన  భారత స్వాతంత్ర్య కార్యకర్త,  రచయిత మరియు భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఈయన భారత ప్రభుత్వంలో మొదటి విద్యా మంత్రి అయ్యాడు.   ఆగస్టు 15, 1947 నుండి ఫిబ్రవరి 2, 1958 వరకు ఈయన భారత విద్యా మంత్రిగా పనిచేశాడు.  ఫిబ్రవరి 22, 1958న ఢిల్లీలో మరణించాడు. అంటే ఈయన తన పదవి నుండి  తాను మరణించడానికి 20 రోజుల ముందు తప్పుకున్నాడు.  జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏమి చేయవచ్చు?? జాతీయ విద్యాదినోత్సవ సందర్భంగానే కాకుండా సాధారణ రోజుల్లో కూడా  కృషి చేయవచ్చు కదా అని కొందరు ఎద్దేవా చేస్తూ ఉంటారు. అయితే జాతీయ విద్యాదినోత్సవం నాడు ఈ అవగాహనా కార్యక్రమాలు మరింత పుంజుకుంటాయి. అవగాహన!! జాతీయ విద్యాదినోత్సవం రోజు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నిరక్షరాస్యత కలిగిన ప్రాంతాలలో ఈ కార్యక్రమాల ఏర్పాటు ఉండేలా చూసుకోవాలి. పిల్లలను పనికి పంపే పెద్దవారి విద్య విలువ అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలను పని నుండి బడికి పంపే దిశగా వారి ఆలోచనలు మళ్లించాలి. విద్య వల్ల ఉద్యోగావకాశాలు ఎలా చేజిక్కించుకోవచ్చో, ఉద్యోగం చేసే వారికి ఈ సమాజంలో ఎంతటి సముచిత స్థానం లభిస్తోందో వివరించి చెప్పాలి.  సహాయం!! చదువు కోవడానికి ఇబ్బంది పడే పిల్లలు ఈ కాలంలో చాలామందే ఉన్నారు. చదువు ఖరీదు అయిపోయిన ఈ కాలంలో ఆర్థిక సమస్యలు కారణంగా విద్యకు ఉద్వాసన పలికే పేద మాణిక్యాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిని చదువులో ప్రోత్సహించాలి. నేరుగా సహాయం కావచ్చు, లేదా స్వచ్చంధ సంస్థల తరపున కావచ్చు లేదా విరాళాలు సేకరించి కావచ్చు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను చదువులో రాణించేలా చేస్తే దేశానికి విద్యా వంతులను అందించినట్టు అవుతుంది.   ఇలా ప్రతి ఒక్కరూ ఈ జాతీయ విద్యాదినోత్సవం రోజున తమకు చేతనైన విధంగా చేయూతను అందించవచ్చు.                                       ◆నిశ్శబ్ద.

స్వీయ క్రమశిక్షణ ఎందుకు అవసరం?

ప్రతి మనిషి జీవితం ఓ సరళ రేఖ లాగా అలా సాగిపోవాలి అంటే ఎన్నో విషయాలు సక్రమంగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఉద్యమ లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి విషయం ఎగుడుదిగుడు దారిలాగా సాగుతూ ఉంటుంది చాలా మందికి. ఇలాంటి సమస్య లేకుండా హాయిగా సాగిపోవాలంటే ప్రతి వ్యక్తి నైతికంగా దృఢంగా ఉండాలి. నైతిక విలువలు, నైతికత అనేవి మనిషిని ప్రతి పనిలో సమర్థవంతుడిగా నిలబడతాయి.  నిజజీవితంలో నైతిక ప్రవర్తన ప్రభావవంతంగా ఉండాలంటే స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ప్రతి వ్యక్తి తనకు తాను కొన్ని ఉద్దేశ్యాలు, కొన్ని పరిధులు, కొన్ని అలవాట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల తన పరిధిలో తాను ఉండటం కుదురుతుంది. ఇలా ఆత్మవిశ్వాసంతో తమపై తాము విధించుకొని అమలుపరచేదే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో విజయం సాధించాలంటే మనంతట మనం నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవనాన్ని గడపాలి.  చాలామంది జీవితంలో ఓటమి పాలవ్వడానికి ముఖ్యమైన కారణం స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే. ఇది చాలామందికి అర్థం కాదు. తాము బానే కష్టపడుతున్నాం, బానే చదజేవుతున్నాం అనుకుంటారు. కానీ జరుగుతున్న తప్పేమిటంటే స్వీయ క్రమశిక్షణ లేకపోవడం. ఎవరో చెబితే తప్ప తాను చేయాల్సిన పనులు చేయలేకపోవడం. ఈ తరహా తీరు మనిషిని తప్పకుండా బద్ధకిష్టుల జాబితాలోకి సులువుగా చేరిపోయేందుకు సహకరిస్తుంది. చాలామంది నియమబద్ధమైన జీవనశైలి లేని కారణంగా విజయాన్ని సాధించలేకపోతారు. స్వీయ మూడు రకాలుగా ఉంటుంది. భౌతిక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ,  ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనే మూడు విధాలుగా ఉంటుంది.  భౌతిక క్రమశిక్షణ:-  నిర్దిష్టమైన దైనందిన కార్యకలాపాలు, నియమిత ఆహారం, విశ్రాంతి, వినోదాలు, నిద్ర, నిర్దిష్టమైనపని, అన్నిచోట్ల క్రమశిక్షణతో మెలగడం వంటివి భౌతిక విధానానికి చెందిన స్వీయ క్రమశిక్షణలోకి వస్తాయి. మానసిక క్రమశిక్షణ:- అనవసరమైన వాటిపైకి దృష్టిని మరల్చి, మానసిక శక్తిని వృథాచేసే అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండటమే మానసిక క్రమశిక్షణ. అతిగా దిగులు చెందడం, కృంగుపాటుకు గురవ్వడం, నిరాశ చెందడం, పగటి కలలు కంటూ ఉండటం వలన కూడా మానసిక శక్తి వృథా అవుతూ ఉంటుంది. ఏ విధమైన చంచలత్వానికి లోను కాకుండా నిర్దేశిత లక్ష్యంపై మనస్సును లగ్నం చేయాలి. అలాగే క్రమబద్ధమైన, తర్కబద్ధమైన ఆలోచనా విధానాలపై మనస్సుకి శిక్షణనివ్వాలి.  ఆధ్యాత్మిక క్రమశిక్షణ:- మనస్సుని ఏకాగ్రం చేయడంపై ఇచ్చే శిక్షణ కూడా మానసిక శిక్షణలోనిదే. "నేను యథార్థ సత్యాలను అభ్యసించను. నేను ఏకాగ్రతా శక్తిని, విషయ పరిత్యాగ శక్తిని సాధన చేస్తాను. అలా పరిణతి చెందిన మనస్సుతో విషయ గ్రహణానికి పూనుకొంటాను" అని స్వామి వివేకానంద వక్కాణించారు. స్వీయ క్రమశిక్షణను అలవరచుకొన్నవారికి అంతర్గత స్వేచ్ఛ, శక్తులు లభిస్తాయి. ఎంచుకొన్న ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించడంలో ఇవి తోడ్పడతాయి. నియమబద్ధమైన జీవనం లేనివారు అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేసేవారు, సోమరిపోతు విద్యార్థులు తమ అలవాట్లకు తామే బలి అవుతూ, తమకేకాక ఇతరులకు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంటారు. అందుకే మనిషి జీవితానికి స్వీయ క్రమశిక్షణ అనేది జీవితాన్ని మర్చివేసే మార్గం అవుతుంది.                                       ◆నిశ్శబ్ద.