గచ్చిబౌలిలో ఘోరం... ఉన్మాది దాడిలో యువతి మృతి!

హైదరాబాద్ నగరంలో మరో కామోన్మాది రెచ్చిపోయాడు. ఒక యువతిని దారుణంగా హత్య చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గచ్చిబౌలి ప్రాంతంలోని గోపనపల్లి తండాలో ప్రేమ పేరుతో ఒక ఉన్మాది దాడి చేయడంతో దీపన తమాంగ్ అనే 32 సంవత్సరాల యువతి మరణించింది. ఉన్మాది దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం రాత్రి ఈ ఘోరం జరిగింది.  కర్ణాటకలోని బీదర్‌కి చెందిన రాకేష్ పశ్చిమ బెంగాల్‌కి చెందిన దీపన తమాంగ్‌కి కొన్నేళ్ళుగా పరిచయం వుంది. రాకేష్, దీపన చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. తనను పెళ్ళి చేసుకోవాలని దీపనని రాకేష్ చాలాకాలం నుంచి అడుగుతున్నాడు. అయితే దీపన నిరాకరిస్తోంది. బుధవారం రాత్రి దీపన ఇంటికి రాకేష్ వెళ్లాడు. అక్కడే ఉన్న కూరగాయల కత్తితో దీపనపై దాడి చేశాడు. దీంతో దీపన అక్కడికక్కడే మరణించింది. అడ్డుకునేవారి మీద కూడా రాకేష్ దాడి చేయడంతో వాళ్ళు కూడా గాయపడ్డారు. దాడి తర్వాత రాకేష్ మొయినాబాద్ సమీపంలోని కనకమామిడి వద్ద ఆత్మహత్యకు యత్నించాడు. విద్యుత్ స్తంభం ఎక్కేందుకు ప్రయత్నించడంతో షాక్ తగిలి గాయాలయ్యాయి. గచ్చిబౌలి పోలీసులు రాకేష్‌ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వేణుస్వామికి హైకోర్టులో ఊరట 

సెలబ్రిటీలపై జోస్యాలు చెప్పి పాపులర్ అయిన వేణుస్వామికి హైకోర్టులో ఊరట లభించింది. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగిన కొద్ది గంటల్లోనే వారు విడిపోతారని వేణుస్వామి జోస్యం చెప్పి వివాదానికి కారణమయ్యారు. వేణుస్వామి విడుదల చేసిన ఈ వీడియో దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వేణుస్వామి పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. గత కొన్ని దశాబ్దాలుగా సినీరంగంలో  అక్కినేని వారసత్వం కొనసాగుతోంది. ఈ కుటుంబం పాపులారిటీ దెబ్బతీసే  జోస్యాన్ని జర్నలిస్ట్ సమాజం కూడా గర్హించింది. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ సామాజిక బాధ్యతతో తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారదకు ఫిర్యాదు చేశాయి. దీంతో మహిళా కమిషన్ కూడా వేణుస్వామికి నోటీసులు అందజేసింది. ఈ నోటీసులు అందుకున్న వేణుస్వామి మహిళా కమిషన్ కార్యాలయానికి గైర్హాజరయ్యారు. పైగా తన న్యాయ పోరాటం కొనసాగిస్తానని చెప్పారు. నోటీసులను సవాల్ చేస్తూ వేణుస్వామి హైకోర్టునాశ్రయించారు. వేణుస్వామి పిటిషన్ హైకోర్టులో అడ్మిట్ అయ్యింది. నాగ చైతన్య, శోభితకు  లేని అభ్యంతరం మీకెందుకు అని ఫిలింజర్నలిస్ట్ అసోసియేషన్ ను హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు వేణుస్వామికి ఊరట లభించింది. మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులకు ఎలాంటి చట్టబద్దత లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

 ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసానికి  హైడ్రా నోటీసులు

చట్టం తన పని తాను చేసుకుపోతుంది చట్టానికి కళ్లు లేవు  , చట్టానికి చుట్టాలు లేరు అనేవి సినిమాల్లో వినిపించే సర్వసాధారణ డైలాగ్స్. గత కొన్ని రోజులుగా హైడ్రా చేపడుతున్న కూల్చివేతల కార్యక్రమం కేవలం ప్రతిపక్ష నేతలను దృష్టిలో పెట్టుకుని కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. హైదరాబాద్  చెరువుల పరిరక్షణ కోసం చేపట్టిన కూల్చివేతల కార్యక్రమంలో తన కుటుంబసభ్యులు ఉన్నా ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ సందర్భం రానే వచ్చింది. దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టిన 204 ఇళ్లకు జీహెచ్ ఎంసీ నోటీసులు జారీ చేసింది. 204 ఇళ్లకు నోటీసులు రావడం పెద్ద వార్త కాదు . కానీ ఈ ఇళ్లలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డికి నోటీసులు ఇవ్వడం పెద్ద వార్త అయ్యింది. దుర్గం చెరువు పరివాహక ప్రాంత వాసులు భయంతో వణికి పోతున్నారు.  మాదాపూర్, అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న తిరుపతి రెడ్డి నివాసానికి నోటీసులు రావడంతో  వారి భయం మరింత పెరిగింది. ఈ సొసైటీ పలువురు సినీ రాజకీయ నేతలకు స్థలాలను  గతంలో విక్రయించింది. వీరిలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు కూడా ఉన్నారు. సినీ హీరో నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయంతో రేవంత్ సర్కార్ మీద భరోసా పెరిగింది. కాంగ్రెస్ బద్ద శత్రువు అయిన బిజెపి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆ పార్టీ నేత రఘునందన్ రావు ప్రముఖ న్యాయవాది. హైడ్రా విషయంలో ప్రభుత్వం తరపున వాదనలు  వినిపిస్తానని ఇంతకుమునుపే ప్రకటించారు. 

తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి

తెలుగు భాష వైభవానికి పునాదులు వేసిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు. అందుకే ఆయనను తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. గ్రాంథికభాషలో పండితులకు మాత్రమే అర్థం అయ్యేలా ఉన్న తెలుగు భాష మాధుర్యాన్ని ప్రజలందరికీ అందేలా కృషి చేశారు. తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చారు.   శిష్ట వ్యవహారికం పేరిట వాడుక భాషలో బోధనకు ఆయన పెద్దపీట వేశారు. తెలుగు పదాల్లోని భావాన్ని, స్పష్టతను పామరులకు సైతం అర్థమయ్యేలా తెలియజెప్పిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి. తెలుగు వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. ఆయన జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా నిర్వహిస్తారు.  రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేటలో 29 ఆగస్టు1863న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకమ్మ, వీర్రాజు. స్థానిక పాఠశాలలో చదువుకున్న ఆయన 1875లో తండ్రి మరణించడంతో విశాఖలోని తన మేనమామ ఇంటికి వెళ్లారు. అక్కడ హైస్కూల్లో చేరాడు. పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడంపై ఆయనకు ఆసక్తి.  దాంతో దేవాలయం శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకునేవారు. పదోతరగతి పూర్తి చేసిన తర్వాత ప్రైవేటు టీచర్ గా పనిచేస్తూ డిగ్రీ డిస్టింక్షన్‌లో పూర్తి చేశారు. గజపతి మహారాజు  కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. పిల్లలకు అర్థమయ్యేలా  తెలుగు భాష బోధనను రోజు మాట్లాడుకునే వ్యావహారికంలో చేయాలన్న ప్రయత్నం ఆయనది.  1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు స్కూళ్ల ఇన్‌స్పెక్టర్‌గా వచ్చిన జె.ఎ.యేట్స్ అనే బ్రిటిష్ అధికారి నుంచి రామ్మూర్తికి మద్దతు లభించింది. దాంతో అప్పటివరకు గ్రాంధికంగా ఉన్న తెలుగుభాషా బోధనను సరళతరం చేస్తూ వ్యావహారికంలో బోధన ప్రారంభించారు. రామ్మూర్తి ఆశయాన్ని గుర్తించిన శ్రీనివాస అయ్యంగార్, గురజాడ అప్పారావు, మరికొందరితో కలిసి వ్యావహారిక భాషలో బోధనోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 'తెలుగు' అనే పత్రికను  ప్రారంభించారు. ఈ ఉద్యమం  ప్రభావంతో అప్పటివరకు గ్రాంధిక భాషలో నిర్వహించే పరీక్షలు వ్యావహారిక భాషలోనూ రాసే వీలు కలిగింది. దాంతో స్కూలు, కాలేజీ పాఠ్యపుస్తకాలు వ్యావహారిక భాషలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయి.  తెలుగు భాషకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్ బిరుదు తో ఆయనను సత్కరించింది. కైజర్ ఈ హింద్ బిరుదు ఆయనను వరించింది. 22జనవరి,1940న మరణించేంతవరకు తెలుగుభాషే ఊపిరిగా ఆయన జీవించాడు. (గిడుగు వెంటక రామ్మూర్తి జయంతి సందర్భంగా)

విశాఖపట్నంలో లోకేష్ కు ఘన స్వాగతం

మంత్రి హోదాలో తొలి సారిగా విశాఖ పట్నం పర్యటనకు వచ్చిన నారా లోకేష్ కు అక్కడ ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం (ఆగస్టు 28) రాత్రి విశాఖ చేరుకున్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి సారిగా విశాఖపట్నం వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ  శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పి.గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, వేపాడ చిరంజీవిరావు, విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ, బత్తుల తాతయ్యబాబు, పార్టీ నాయకులు కిడారి శ్రావణ్‌కుమార్‌, బుద్ధా నాగజగదీష్‌, దాడి రత్నాకర్‌, ప్రగడ నాగేశ్వరరావు, సీతంరాజు సుధాకర్‌లు లోకేష్ కు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.     ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా లోకేశ్‌ సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రి వెనుక ఉన్న జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు  తెలుగు మహిళలు  హారతి ఇచ్చి స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయం ఆవరణలో గల బస్సులో ఆయన రాత్రి బస చేశారు.

ఒక రోజు ముందే పెన్షన్లు.. చంద్రబాబు సర్కార్ నిర్ణయం

ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి, ప్రజలకు సుపరిపాలన అందించాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే పాలన ఎలా సాగుతుంది అనడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన చేతలలో చూపుతున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఉద్యోగులు ఏనాడూ నెలలో మొదటి తేదీన వేతనాలు అందుకున్న పరిస్థితి లేదు. అలాగే పెన్షనర్లు తమ పెన్షన్ల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే జగన్ ప్రభుత్వం పతనమై తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు వేతనాలు మొదటి తేదీనే అందుతున్నాయి. పెన్షన్ల పంపిణీ కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నెల మొదటి తేదీనే జరిగిపోతున్నది.   ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం   కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా  కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు దిశగా ఒక్కో పథకం ప్రవేశపెడుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించి అనేక చర్యలు చేపడుతోంది.    ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం గత ప్రభుత్వం రూ.3 వేలు పెన్షన్ ఇస్తే.. చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దాన్ని మరో రూ.వెయ్యి పెంచి రూ.4 వేలు అందిస్తోంది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెన్షన్ల విషయంలో  చంద్రబాబు ప్రభుత్వం చాలా పద్ధతిగా వ్యవహరిస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా మొదట పెన్షన్ల పెంపును అమలు చేయగా.. ప్రతినెల 1వ తేదీన ఠంఛనుగా పెన్షన్‌లను అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి సెప్టెంబర్ నెల పెన్షన్ ను నెల మొదటి తేదీ కంటే ఒక రోజు ముందే.. అంటే ఆగస్టు 1వ తేదీనే అందించేందుకు అన్ని ఏర్పాట్లూ చేసింది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో లబ్ధిదారులకు   ఒక రోజు ముందుగానే ఆగస్టు 31నే  అర్హులందరికీ పెన్షన్లను అందజేయాలని నిర్ణయించింది.     ఏదైనా కారణంగా ఈ నెల 31వ తేదీనన పెన్షన్లు అందకపోతే.. సెప్టెంబర్‌ 2వ తేదీన సోమవారం రోజున అందించనున్నట్లు తెలిపింది. ఇక గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం.. వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పెన్షన్లు అందించేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాలంటీర్ల ద్వారా కాకుండా సచివాలయ ఉద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్లను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి.. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు.  

వైసీపీ ఖేల్ ఖతమ్.. జగన్ పార్టీ దుకాణ్ బంద్?!

ఏపీలో ఐదేళ్లు అరాచ‌క పాల‌న సాగించిన వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బిగ్‌ షాక్ త‌గ‌ల‌బోతుంది. అధికారంలో ఉన్న‌న్ని రోజులు రాజ‌కీయాల ప‌రంగా, పాల‌నాప‌రంగా ఏపీ ప్ర‌తిష్ట‌ను దేశ‌వ్యాప్తంగా దిగ‌జార్చిన జ‌గ‌న్ రెడ్డి రాజ‌కీయ‌ ప‌తనం ఆరంభమైంది.   ఏపీలో జ‌గ‌న్  ఐదేళ్ల  అరాచ‌క పాల‌న‌లో ఇబ్బందులు ప‌డిన ప్ర‌జ‌లు.. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఓటు ద్వారా గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు. అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా వైసీపీకి ద‌క్క‌కుండా చేశారు. అయినా, జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ బ్యాచ్ ఆగ‌డాల‌కు అడ్డుక‌ట్ట ప‌డ‌లేదు. ఐదేళ్లు తీవ్రంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థ‌కంలో న‌డిపేందుకు ఒక‌ ప‌క్క సీఎం చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం సర్వశక్తులూ ఒడ్డి ముందుకు సాగుతుంటే.. రాష్ట్రంలో అల్ల‌ర్లు చెల‌రేగేలా కుట్ర‌  రాజ‌కీయం చేసేందుకు జ‌గ‌న్‌, వైసీపీ బ్యాచ్‌ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. దీనికి తోడు రాజ్య‌స‌భ‌లో త‌మ‌కు ప‌ద‌కొండు మంది ఎంపీల బ‌లం ఉంది.. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వానికి మా అవ‌స‌రం ఉందంటూ ఆ పార్టీ నేత‌లు విర్ర‌వీగుతున్నారు. కానీ, ఇప్పుడు వైసీపీ నేత‌లు అలా చెప్పుకునే అవ‌కాశాన్ని కోల్పోబోతున్నారు. రాజ్య‌స‌భ‌లో వైసీపీ త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హిస్తున్న 11 మంది ఎంపీల్లో ప‌ది మంది కూట‌మి పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యార‌ు. వీరిలో టీడీపీలోకి ముగ్గురు, బీజేపీలోకి ఐదుగురు, జ‌నసేన పార్టీలోకి ఇద్ద‌రు వెళ్ల‌బోతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది.  వైసీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యులు ఇప్ప‌టికే కూట‌మి పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్ రావులు త్వ‌ర‌లో తెలుగుదేశం గూటికి చేర‌బోతున్నారు. గురువారం (ఆగస్టు 29) ఢిల్లీలో రాజ్య‌స‌భ చైర్మ‌న్ ను క‌లిసి వారు రాజీనామా లేఖ‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిసింది. ఆ త‌రువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప‌ద‌వుల‌కు, పార్టీ స‌భ్య‌త్వానికి  రాజీనామా చేయ‌నున్నారు. వీరిద్ద‌రూ త్వ‌ర‌లో సీఎం చంద్ర‌బాబ నాయుడు స‌మ‌క్షంలో తెలుగుదేశం కండువా క‌ప్పుకోబోతున్న‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వీరి బాట‌లోనే మ‌రో ఎనిమిది మంది వైసీపీ రాజ్య‌స‌భ్యులు కూడా ప‌య‌నించేందుకు సిద్ధంగా ఉన్నార‌ని తెలుస్తోంది‌. కేవ‌లం ఒక్క రాజ్య‌స‌భ ఎంపీ మాత్ర‌మే వైసీపీకి మిగ‌ల‌నున్నారు. టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్న‌వారిలో మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ, బీదా మ‌స్తాన్ రావుతోపాటు గొల్ల బాబూరావు కూడా ఉన్నారని చెబుతున్నారు‌. అలాగే బీజేపీలో చేరేందుకు ర‌ఘునాథ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వాని సిద్ధ‌మ‌వుతున్నారు‌. ఇక పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌, ఆర్‌. కృష్ణ‌య్య‌లు జ‌న‌సేన పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. విజ‌య‌సాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిల‌లో ఒక‌రు బీజేపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది‌. అయితే, వీరిద్దరిలో వైసీపీకి గుడ్ బై చెప్పేదెవరు, పార్టీలో మిగిలేదెవరు అన్నదానిపై క్లారిటీ రాలేదు, కానీ ఈ ఇద్దరిలో ఒక్క‌రు మాత్రమే వైసీపీలో మిగులుతారని ఆ పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. దీంతో వైసీపీలో మిగిలే ఒక్క రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎవ‌ర‌నే అంశంపైనా ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్నది.   జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయి వైవీ సుబ్బారెడ్డి వైసీపీలోనే కొన‌సాగ‌నున్నార‌నీ,  విజ‌య‌సాయిరెడ్డి బీజేపీ పెద్ద‌ల‌తో ఇప్పటికే ట‌చ్‌లోకి వెళ్లార‌ని స‌మాచారం. అయితే, తాను వైసీపీని వీడ‌టం లేద‌ని విజ‌యసాయిరెడ్డి ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. కానీ, బీజేపీ పెద్ద‌ల నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే ఆయ‌న వైసీపీని వీడడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  రాజ్య‌స‌భ స‌భ్యుల్లో వైవీ సుబ్బారెడ్డి ఒక్క‌రే వైసీపీలో కొన‌సాగే అవ‌కాశాలు ఉన్నాయి. ఆయ‌న ప‌ద‌వీకాలం ముగిసిన త‌రువాత రాజ్య‌స‌భలో వైసీపీ ప్రాతినిధ్య‌మే కోల్పోనుంది.  ఎందుకంటే.. వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేల బ‌లం ప్ర‌కారం వ‌చ్చే ఐదేళ్లు ఒక్క రాజ్య‌స‌భ సీటును కూడా ఆ పార్టీ గెలుచుకునే అవ‌కాశం లేదు. రాజ్య‌స‌భ‌లోనేకాదు.. శాస‌న మండ‌లిలోనూ వైసీపీని వీడేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే పోతుల సునీత తన రాజీనామాతో బోణీ  చేశారు.   మ‌రికొంద‌రు వైసీపీ ఎమ్మెల్సీలుసైతం ఆ పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. ఇప్ప‌టికే కొంద‌రు తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జరుపుతున్నారని తెలిసింది.. అన్నీఅనుకూలిస్తే సెప్టెంబ‌ర్ నెల‌లోనే భారీ సంఖ్య‌లో వైసీపీ ఎమ్మెల్సీలు కూట‌మి పార్టీల్లోకి వెళ్లే అవ‌కాశాలు ప్రస్ఫుటంగా క‌నిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల విష‌యానికి వ‌స్తే.. వైసీపీకి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో క‌లుపుకొని ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నార‌నీ, తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీల అధినేత‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే వారు వైసీపీకి గుడ్‌బై చెప్పేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.     వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌వ్వ‌డానికి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌వ‌ర్త‌నే ప్ర‌ధాన కార‌ణం. అధికారంలో ఉన్న‌న్ని రోజులు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ ఏనాడూ విలువ ఇవ్వ‌లేదు.  తాను చెప్పింది చేయ‌డానికే మీరు ఉన్నార‌న్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తించారు. జ‌గ‌న్ స‌హా కేవ‌లం న‌లుగురైదుగురు నేత‌ల నిర్ణ‌యాలే వైసీపీ ప్ర‌భుత్వంలో అమ‌ల‌య్యాయి. దీంతో త‌మ‌త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్నా జ‌గ‌న్ అనుమ‌తి తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఉండేది. జ‌గ‌న్ తీరుపై మెజార్టీ శాతం ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ప్ప‌టికీ అధికారంలో ఉండ‌టంతో ఎవ‌రూ బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఇప్పుడు  ఒక్కొక్క‌రుగా జగన్ ప్ర‌భుత్వంలో త‌మ‌కు ఎదురైన ఇబ్బందుల‌ను చెప్పుకుంటున్నారు.   వైసీపీ అధికారంలో లేకపోయినా, ఆ పార్టీ ఎమ్మెల్యేలుగా నియోజకవర్గంలో స్వేచ్ఛగా పని చేసుకునే పరిస్థితి లేదని వైసీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వీడేందుకు సిద్ధమౌతున్నారు.  కూట‌మి పార్టీల్లోని టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన అధిష్టానాలు గేట్లు ఓపెన్ చేస్తే భారీ సంఖ్య‌లో వైసీపీ నేత‌లు కూట‌మి పార్టీల్లో చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. మొత్తానికి రాబోయే కాలంలో వైసీపీ దుకాణం బంద్ అవ్వ‌టం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎవరా ఓవర్ యాక్షన్ ఎమ్మెల్యేలు?

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన వల్ల ఇన్నాళ్ళుగా తెచ్చుకున్న మంచిపేరు పాడవుతోందని మంత్రుల దగ్గర ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం. సదరు ఎమ్మెల్యేలు చేస్తున్న పొరపాట్లు మీడియాలో పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయంటూ చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కొంతమంది చేసే పనుల వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతోందని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారని సమాచారం. ఇకపై మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని, తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, నాయకులకు దిశానిర్దేశం చేయాలని సూచించిన చంద్రబాబు ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలదేనని అన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో రహస్యంగా వుంచాల్సిన విషయాలు బయటకి పోతున్నాయని, శ్వేత పత్రాల్లో సమాచారం, ఓటాన్ అకౌంట్ వివరాలు, ఇతర కీలకమైన నిర్ణయాలు బయటకు పొక్కడం పట్ల  చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల్లో వైసీపీ గూఢచారులు ఉన్నారన్న అంశం కేబినెట్ భేటీలో విస్తృతంగా చర్చించారు.

హైదరాబాద్ చేరుకున్న కవిత... రేపు ఎర్రవల్లి ఫాం హౌజ్ కు 

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఐదున్నర నెలల తర్వాత ఆమె హైద్రాబాద్ కు చేరుకోవడంతో బిఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాతం పలికాయి. కవితపై పూలవర్షం కురిపించారు. నవ్వుతూ ఆమె అభిమానులకు అభివాదం చేశారు.  ఆమె వెంట బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, అన్నయ్య కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, భర్త అనిల్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలు ఉన్నారు. శంషాబాద్ నుంచి కవిత నేరుగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. తొలుత తండ్రి కెసీఆర్ దగ్గరికి వెళ్లాలని భావించిన్పటికీ జైలు నుంచి నేరుగా వెళ్లడాన్ని శాస్త్రం తప్పుపడుతుందని తెల్సుకుని తన ఇంటికే బయలు దేరారు. గురువారం ఎర్రవెల్లిలోని ఫామ్‌ హౌస్‌ చేరుకొని తండ్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలవనున్నారు. కెసీఆర్ గారాల పట్టీ కవిత తండ్రితో  సమావేశం ఆసక్తికరంగా మారనుంది. ఐదున్నర నెలలు జైల్లో ఉన్నప్పటికీ తండ్రి ఒక్కసారి కూడా పరామర్శించకపోవడం చర్చకు దారి తీసింది.  ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవిత ఈడీ మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మార్చి 26న కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అప్పటి నుంచి జ్యుడీషియల్‌ కస్టడీపై తిహార్‌ జైలులో ఉన్నారు. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఈడీ, సీబీఐ కేసుల్లో కవితకు బెయిల్‌ను మంజూరు చేసింది. ఆ తర్వాత బెయిల్ ఉత్తర్వు కాపీలను న్యాయవాదులు తిహార్‌ జైలు అధికారులకు అందించారు. అనంతరం కవిత జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు.  

వైసీపీ కాదు బైసీపీ!

 వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు కోర్టు ఇలా అనుమతి ఇచ్చిందో లేదో అలా వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకి గుడ్ బై చెప్పేయడానికి రెడీ అయిపోయారు.  దీంతో వైసీపీని ఇక నుంచి బైబై వైసీపీ అని పిలవాల్సి ఉంటుందేమో? అని నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఆ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతుండటమే అందుకు కారణం. తాజాగా వైసీపీ నుంచి ఓ ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక మండలి సభ్యురాలు బయటకు వెళ్లిపోవడం ఖరారైంది. మండలి సభ్యురాలు పోతుల సుజాత ఇప్పటికే రాజీనామా చేయగా, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు గురువారం (ఆగస్టు 29) వైసీపీకి రాజీనామా చేయనున్నారు. అలాగే  రాష్ట్రపతిని కలిసి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. వీరే కాకుండా మరో  మరో నలుగురు ఎంపీలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని వైసీపీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ దేశం దాటిన తరువాత వారంతా బయటకు వస్తారని అంటున్నారు. ఈ లోగా గురువారం (ఆగస్టు 28) మోపిదేవి, బీదలు రాష్ట్రపతిని కలిసి తమ రాజీనామా పత్రాలు సమర్పించే అవకాశం ఉందని అంటున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యులుగా వారు రాజీనామా చేయనున్నారు. వీరిరువురూ తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు సమాచారం.  

పనిష్మెంట్ ఐపీఎస్‌ల డుమ్మా!

జగన్ రాక్షస పాలనలో వైసీపీ దండుపాళ్యం బ్యాచ్ ఆడమన్నట్టల్లా ఆడి, చేయమన్న గలీజు పనులల్లా చేసిన పలువురు ఐపీఎస్ ఆఫీసర్లు కూటమి ప్రభుత్వంలో ఏ విధులూ లేకుండా ఖాళీగా కూర్చునే పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఆ పనిష్మెంట్‌లో భాగంగా వీరు ప్రతిరోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేయాల్సి వుంది. అయితే మొత్తం 16 మందిలో నలుగురైదుగురు ఆఫీసుకు రావడం లేదు. ఇంటెలిజెన్స్ విభాగం మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, సీఐడీ విభాగం మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ కొద్దిరోజులపాటు సెలవులో వున్నారు. ఆ తర్వాత నుంచి సంతకం చేయడానికి రావడం లేదు. అలాగే సోషల్ మీడియాలో తనను తాను ప్రమోట్ చేసుకున్న విశాల్ గున్ని, ఎస్పీలు కేకేఎస్ అన్బురాజ్, తిరుమలేశ్వర్ రెడ్డి కూడా ఆఫీసుకు రాకుండా డుమ్మా కొడుతున్నారు. వీళ్ళే కాకుండా సిద్ధార్థ కౌశల్, మేరీ ప్రశాంతి, జీఆర్ రాధిక కూడా డుమ్మా బ్యాచ్‌లో వున్నారు. డీజీపీ ప్రతిరోజూ ఆఫీసుకు వచ్చి సంతకాలు చేయాలని ఆదేశించినా పట్టించుకోకుండా ధిక్కరించడం వెనుక వీరికి వున్న ధైర్యమేంటో అర్థం కాకుండా వుంది.

పోలవరం నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ కు గుడ్ న్యూస్.  రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణం ఇక ఏ అడ్డంకులూ లేకుండా సాఫీగా సాగనుంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం  నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న నిధులనే కాకుండా ప్రాజెక్టు నిర్మాణం సత్వరంగా పూర్తి కావడానికి అవసరమైన నిధులను కూడా ఎటువంటి జాప్యం లేకుండా విడుదల చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.  ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం (ఆగస్టు 28) జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో పోలవరం మొదటి దశ నిర్మాణానికి 12వేల 500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. అలాగే ఇాప్పటి వరకూ పెండింగ్ లో ఉన్న నిధులను కూడా విడుదల చేయాలని నిర్ణయించింది. జగన్ హయాంలో గత ఐదేళ్లుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్న చందంగా నిలిచిపోయాయి. దానికి తోడు నిర్వహణ కూడా లేకపోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతింది. సజావుగా సాగుతున్న పోలవరం నిర్మాణాన్ని జగన్ సర్కార్ రివర్స్ టెండరింగ్ పేరుతో నిలిపివేసిన సంగతి తెలిసిందే. అలాగే ముంపు బాధితుల పరిహారం నిధులను కూడా పక్కదారి పట్టించింది. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో  పనులు జోరందుకున్నాయి. సీఎం చంద్రబాబు కూడా పోలవరం, అమరావతి నిర్మాణాలను అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక దృష్టి సారించారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి పర్యటన పోలవరం సందర్శనే కావడమే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటన్నది అవగతమౌతుంది.  

మస్కట్ నుంచి వస్తూ గుండెపోటుతో బస్సులో మృతి

తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంతా సత్య పద్మ ఈ నెల 24న మస్కట్‌ నుంచి స్వ‌దేశానికి బయల్దేరింది. మస్కట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆమె.. తణుకు బస్సు ఎక్కింది. కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా  క్షీణించ‌డంతో బస్సులో గుండెపోటుకు గురైంది. దాంతో కూర్చున్న సీటులోనే అసువులు బాసింది. ఆర్థిక ఇబ్బందులను అధి గమించడానికి ఆమె మస్కట్ వెళ్లింది. అక్కడ యజమాని వేధింపులు తట్టుకోలేక స్వగ్రామానికి బయలుదేరాలని నిర్ణయించుకుంది. మస్కట్ నుంచి హైద్రాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆమె తిరిగి తణుకు బయలు దేరడానికి బస్సు ఎక్కింది. అప్పటికే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్న ఆమె బస్సు సీటులోనే గుండెపోటుకు గురై చనిపోయారు. వెంటనే  బస్సు డ్రైవర్‌, కండక్టర్‌.. సత్య పద్మ భ‌ర్త‌కు ఫోన్‌ చేసి స‌మాచారం ఇచ్చారు

హోటల్ గదుల్లో రహస్య కెమెరాలు... జంటలను  బ్లాక్ మెయిల్ 

రహస్య కెమెరా ద్వారా రికార్డు చేసిన దృశ్యాలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్న హోటల్ యజమానిని పోలీసులు అరెస్ల్ చేశారు. యధాలాపంగా ఓ జంటను బ్లాక్ మెయిల్ చేయబోయి బొక్క బోర్లా పడ్డాడు సదరు వ్యక్తి.  ఓయో రూమ్ లో రహస్య కెమెరా పెట్టి కస్టమర్లను బ్లాక్ మెయిల్ చేయడం అతని వృత్తిగా ఎంచుకున్నాడు.ఏళ్ల తరబడి బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ  ఓ యజమాని నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో ఓ జంట ఫిర్యాదు చేయడంతో పోలీసులు  అప్రమత్తమయ్యారు. సదరు యజమానిని అరెస్టు చేశారు. విచారణలో ఈ తంతు చాలాకాలంగా చేస్తున్నానని, చాలామందిని ఇలాగే బ్లాక్ మెయిల్ చేశానని అంగీకరించాడు.   శంషాబాద్ లోని సితా గ్రాండ్ హోటల్ లో రహస్య కెమెరాల భాగోతం బయటపడింది. హోటల్ నిర్వాహకుడు ఓయోతో ఒప్పందం కుదుర్చుకుని  గదులను అద్దెకిచ్చేవాడు. ప్రేమజంటలకు మాత్రమే  అద్దెకు ఇచ్చేవాడు . ఈ నేపథ్యంలోనే తన హోటల్ గదులలో రహస్యంగా కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆ గదిలో దిగిన వారు క్లోజ్ గా  గడిపినదంతా ఆ కెమెరాల ద్వారా రికార్డు చేశాడు. తర్వాత  ఆ వీడియోలు చూపిస్తూ జంటలను బ్లాక్ మెయిల్ చేసేవాడు.  లేదంటే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని చెప్పి డబ్బు గుంజేవాడు.తనకు కావాల్సినంత ఇస్తే ఆ ఫోటోలు, దృశ్యాలు డిలీట్ చేసేవాడు.  తాజాగా జంట  ఫిర్యాదుతో పోలీసులు  కేసు నమోదు చేశారు. పోలీసులు సితా గ్రాండ్ హోటల్ పై దాడులు చేశారు.  రహస్య కెమెరాలు బయటపడ్డాయి. హోటల్ యజమాని సీసీ ఫుటేజి, రెండు  సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

కవితకు బెయిలుపై రాజకీయ రచ్చ!

ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవితకు బెయిలు అనూహ్యమైనదేమీ కాదు. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి  మనీష్ సిసోడియాకు సుప్రీం బెయిలు మంజూరు చేసిన రోజు నుంచీ ఇహనో ఇప్పుడో కవితకు కూడా బెయిలు లభిస్తుందన్నఅంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సుప్రీం కోర్టు మంగళవారం (ఆగస్టు 27) బెయిలు మంజూరు చేసింది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు.  అయితే కవితకు బెయిలు మంజూరు కావడంపై తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. కవితకు బెయిలు మంజూరు చేసింది సుప్రీం కోర్టు అన్న విషయాన్ని కన్వీనియెంట్ గా విస్మరిస్తూ కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం నిందలు మోపుకుంటూ రాష్ట్రంలో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీల విలీనం ఫైనలైజ్ అయ్యింది కనుకనే కవితకు బెయిలు వచ్చిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తే.. బీజేపీ కాంగ్రెస్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ ద్వారా కవితకు బెయిలు వచ్చేలా చేసిందని ప్రత్యారోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ నిర్ద్వంద్వంగా తిప్పి కొట్టింది. కవిత అరెస్టే అన్యాయమని చెబుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, సమర్థనల సంగతి ఎలా ఉన్నా ఐదు నెలలకు పైగా జైలులో ఉన్న కవిత బెయిలుపై విడుదల కావడం ఆమెకూ, బీఆర్ఎస్ కూ కూడా భారీ ఊరటే అనడంలో సందేహం లేదు.  అన్నిటికీ మించి కవితకు బెయిలు మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో చార్జి షీట్ దాఖలు కావడం, ఈబీ సీబీఐ దర్యాప్తు పూర్తికావడాన్ని కారణంగా చెబుతూ బెయిలు మంజూరు చేసింది. ఒక మహిళను ఇన్ని రోజులు జైలులో ఉంచడం సబబు కాదని వ్యాఖ్యానించింది. అయినా కూడా ఆమెకు షరతులతో కూడిన (కండీషన్డ్) బెయిలు మాత్రమే మంజూరు చేసింది. అలాగే సెల్ ఫోన్లో మెసేజీలు తొలగించడం తప్పు కాదని పేర్కొంది.  సెక్షన్ 45 మేరకు ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. కేవలం అప్రూవర్లు బుచ్చిబాబు ,మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని మాత్రమే పట్టించుకుంటారా అని ఈడీని ద్విసభ్య ధర్మాసనం చివాట్లు పెట్టింది.  ఆ అప్రూరవర్లు మొదట సీసోడియా పాత్రధారి,క్రేజీవాల్ పాత్రధారి అన్నారని, ఇప్పుడు  కవిత సూత్రధారి అంటున్నారనీ సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కవిత నిందితురాలు అనడానికి  మీ వద్ద ఉన్న ఆధారాలేమిటని సుప్రీంకోర్టు  సూటిగా ప్రశ్నించింది.  ఇక కవితకు బెయిలు వస్తుందని ముందుగానే తెలిసి కేటీఆర్, హరీష్ రావులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారని వస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ ఖండించింది. కవితకు బెయిలు మంజూరు కాకుంటే.. ఢిల్లీలో ధర్నా చేసి మరీ బీజేపీ నిజస్వరూపాన్ని బయట పెట్టాలన్న ఉద్దేశంతోనే తాము హస్తినకు వెళ్లామని బీఆర్ఎస్ చెబుతోంది.   మొత్తం మీద జైలులో రెండు సార్లు ఆనారోగ్యంతో బాధపడినా బెయిల్ లభించని కవితకు సుప్రీంకోర్టు జోక్యంతో లభించడం గమనార్హం. కాగా కవితకు బెయిలు మాత్రమే మంజూరైందనీ, కేసు ఇంకా అలాగే ఉందన్న విషయాన్ని కవిత, బీఆర్ఎస్ గుర్తుంచుకోవాలి.  కేసుల్లో బెయిల్ రావడం అన్నది సాధారణమని తెలుసుకోవాలి. ఇంత కాలంగా కవిత కు బెయిల్ రాకపోవడంపై ఆనేక ఊహాగానాలు చెలరేగాయి. ఇప్పుడు బెయిలు రావడంపై మరిన్ని ఊహాగాన సభలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కేసులో కవిత పాత్ర ఏమిటన్నది దర్యాప్తులో చేరుతుంది. ఈ లోగానే బెయిలు విషయంలో రాజకీయ రచ్చ అనవసరమని పరిశీలకులు అంటున్నారు.  

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూల్చివేతలకు హైడ్రా వెనకడగు 

సలకం చెరువు ఎఫ్ టి ఎల్ పరిధిలో   ఉండటంతో ఫాతిమా కాలేజి   కూల్చివేతకు రంగం సిద్దమైనప్పటికీ హైడ్రా వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది. చెరువు మధ్యలో ఫామిమా కాలేజి ఉందని బిజెపి కార్పోరేటర్లు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.  నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చి వేయడంతో రంగనాథ్ మీద నమ్మం పెరిగింది. ఆ నమ్మకంతోనే ఒవైసీ బ్రదర్స్ పేరిట ఉన్న ఫాతిమా కాలేజిని కూల్చేయాలని బిజెపి కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటివరకు కాన్ఫిడెంట్ గా ఉండే  రంగనాథ్ ఇవ్వాళ మాత్రం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కమీషనర్ రంగనాథ్ కు స్వేచ్చ ఇచ్చినప్పటికీ ఒవైసీ కాలేజిని కూల్చడానికి హైడ్రా దూకుడు తగ్గింది. వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ కాలేజి కూల్చివేతకు ఆచి తూచి వ్యవహరించాలని రంగనాథ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.   మల్లారెడ్డి కాలేజి, పల్లె రాజేశ్వర్ రెడ్డి కాలేజి  విషయంలో కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కూల్చలేమని హైడ్రా చెబుతుంది. ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ఉంటే తమంతామే  కూల్చేసుకోవాలని, ఒకవేళ అలా కూల్చని పక్షంలో తాము కూలుస్తామన్నారు. ఫాతిమా కాలేజి విషయంలో కూడా ఇదే వైఖరి ఉంటుందని రంగనాథ్ చెబుతున్నారు    కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డికి ఫోన్ రావడంతో ఫాతిమా కాలేజి విషయంలో ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది అని సమాచారం.  సీనియర్ నేత వి. హన్మంత్ రావు కూడా ఫాతిమా కాలేజి  చెరువులో ఉందని వస్తున్న వార్తలను కొట్టి పారేశారు. కర్ర విరగదు పాము చావదు అనే టైపులో సమాధానమిచ్చారు. నేను సలకం చెరువులోకి వెళ్లి చూడలేదు. ఇరిగేషన్ శాఖ  నివేదిక నా దగ్గర  లేదు. ఆక్రమణ జరిగిందని నేను ఎలా చెప్పగలను. అందరి మాదిరిగా నేను మాట్లాడలేను అని అన్నారు. 

ఏపీ అధికార చిహ్నమే వుండాలి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినిస్టర్లు, ఆఫీసర్లు నిర్వహించే ప్రెస్‌మీట్లలో మాట్లాడుతున్న వారి వెనుక రాష్ట్ర అధికార చిహ్నం మాత్రమే కనిపించాలని ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ చర్యలు చేపట్టింది. సెక్రటేరియట్?’లోని పబ్లిసిటీ సెల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించే ప్రాంతంలో అధికారిక చిహ్నం పెద్దగా కనిపించే తరహాలో ఏర్పాట్లు చేసింది. బోర్డు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కనిపించేలా తెలుగు, ఇంగ్లీషులో రాసి వుంది. మధ్యలో ఏపీ లోగో వుంది. అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలలో కూడా ఇలాంటి తరహా ఏర్పాట్లే చేయనున్నారు. గతంలో వైసీపీ రాక్షస పాలన జరిగిన సమయంలో వైసీపీ జెండా రంగులతోపాటు జగన్ ఫొటో, నవరత్నాల లోగో కూడా వుండేవి.

తెలంగాణ తల్లి విగ్రహా ప్రతిష్టకు భూమి పూజ

తెలంగాణ తల్లి భూమి పూజ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహంలో స్వల్ప మార్పులు చేశారు. సచివాలయం లోపల శాస్త్రోక్తంగా భూమి పూజ జరిగివంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భూమి పూజలో పాల్గొన్నారు. కొత్త తెలంగాణ తల్లి నమూనా  చిత్రం ఇంత వరకు విడుదల కాలేదు సచివాలయం మెయిన్ ఎంట్రెన్స్ సింహ ద్వారం వద్ద ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. డిసెంబర్ 9నాడు తెలంగాణా తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.  అదే రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినోత్సవం ఉంది. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినంరోజు విగ్రహం ఆవిష్కరించాలని రేవంత్ సర్కారు కృత నిశ్చయంతో ఉంది. మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి , ఎమ్మెల్యే దానం నాగేందర్, కె. కేశవరావ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం  గత ప్రభుత్వం అగౌరవ పరిచేలా రోడ్డు మీద నిలబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయం లోపల గౌరవంగా నిలబెట్టిందని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.