అసలు మోపిదేవి.. జగన్ మధ్య ఏం జరిగింది?

వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ సీనియర్ నాయకుడు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేయడం రాజకీయంగా ఒకింత సంచలనం సృష్టించింది. వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ తో కలిసి నడిచిన మోపిదేవి వెంకట రమణ.. పార్టీల కంటే వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉ:టూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టు కూడా అయ్యారు. అటువంటి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాలలో రానున్న భారీ మార్పులకు సంకేతంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  వైసీపీ ఆవిర్భావం నుంచీ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మోపిదేవి వెంకటరమణ, పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఆయన వైసీపీకి ముఖచిత్రంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ కూడా ఆయన జగన్ కు విధేయంగా ఉంటూ వచ్చారు. అటువంటి మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పడమే కాకుండా తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు ప్రకటించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమౌతోంది.  పార్టీకీ రాజీనామా చేసుంతగా మోపిదేవిలో జగన్ పట్ల అసంతృప్తి పేరుకుపోవడానికి పలు కారణాలు ఉన్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 2024 అసెంబ్లీ ఎన్నికలలో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి తనకు కానీ, తన సోదరుడికి కానీ జగన్ టికెట్ నిరాకరించడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. మోపిదేవి పలు మార్లు కోరినప్పటికీ రేపల్లె నుంచి మోపిదేవికి టికెట్ నిరాకరించే విషయంలో జగన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అలాగే ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో తనను పూర్తిగా పక్కన పెట్టేడయంతో మోపిదేవికి అవమానకరంగా మారింది. అంతే కాకుండా పార్టీ వ్యవహారాలలో కూడా మోపిదేవికి ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక పార్టీ పరాజయం తరువాత మోపిదేవి పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. పార్టీ వ్యవహారాలు, కార్యక్రమాలలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఫలితాల తరువాత నుంచీ మోపిదేవి వైసీపీకి గుడ్ బై చెబుతారన్న టాక్ పోలిటికల్ సర్కిల్స్ లో వినబడుతూనే ఉంది.  ఇప్పుడు తెలుగుదేశంలో చేరేందుకు మోపిదేవి పార్టీకే కాకుండా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం ఆయన రాజకీయ విధేయతలో స్పష్టమైన మార్పు వచ్చిందన్నది అవగతమౌతోంది.   ఇంతకీ మోపిదేవి చంద్రబాబుతో టచ్ లోకి ఎలా వెళ్లారంటే రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ హైదరాబాద్ లో చంద్రబాబుతో మోపిదేవి సమావేశమయ్యేందుకు సహకరించారు. ఆ సమావేశంలో మోపిదేవి వెంకటరమణతో పాటు మరో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఇరువురూ కూడా వైసీపీకి, తమతమ రాజ్యసభ సభ్యత్వాలకూ రాజీనామా చేశారు. ఏ క్షణంలోనైనా తెలుగుదేశం కండువా కప్పుకుని ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏది ఏమైనా మోపిదేవి రాజీనామా మాత్రం వైసీపీకి గట్టి షాక్ అనే చెప్పాలి.  మొత్తం మీద మోపిదేవి వంటి విధేయుడే  దూరం అవ్వడం పార్టీలో జగన్ నాయకత్వంపై అవిశ్వాసం, అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ తనకు బలం ఉందని భావిస్తున్న రాజ్యసభలోనూ, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలోనూ కూడా వైసీపీకి రానున్న రోజులలో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని అంటున్నారు. 

ఈ జర్మనీ చట్టానికో దణ్ణం...!

ఏది ఏమైనప్పటికీ మన దేశం చాలా గొప్పది. తమ పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లిదండ్రులు నాలుగు పీకితే చప్పుడు చేయకుండా కూర్చుంటారు. కొంతమంది తల్లిదండ్రులు తమకు సంబంధించిన వేరే టెన్షన్లని పిల్లల్ని చావగొట్టి తగ్గించుకుంటారు.. ఈ రకంగా పిల్లల్ని తల్లిదండ్రులు ఎంత చావబాదినా మన దేశంలో నేరం కాదు. అయితే, జర్మనీలో మాత్రం ఇది చాలా పెద్ద నేరం. పిల్లల్ని చావగొట్టే సంగతి అలా వుంచండి, వాళ్ళని కొట్టే ఉద్దేశంతో అలా ముట్టుకున్నా సరే అది పెద్ద నేరమై కూర్చుంటుంది. నన్ను మా పేరెంట్స్ కొట్టారు అని ఆ పిల్లలు పోలీసులకు చెప్పినా, ఎవరైనా చూసి పోలీసులకు చెప్పినా ఇక ఆ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. ఇలాంటి పరిస్థితి మన ఇండియా నుంచి వెళ్ళిన పేరెంట్స్.కి జర్మనీలో ఎదురైంది. థానే ప్రాంతానికి చెందిన జంట జర్మనీలో నివసిస్తోంది. ఓసారి వాళ్ళ కూతురు ఏదో అల్లరి చేస్తే, నా కూతురే కదా అని ఏదో కొద్దిగా చెయ్యి చేసుకున్నారు. అంతే, ఈ ఘోరాన్ని ఇరుగుపొరుగు వాళ్ళు చూశారు.. పోలీసులకు మోసేశారు. దాంతో పోలీసులు రెచ్చిపోయారు. ఆ తల్లిదండ్రుల మీద కేసు పెట్టారు. వాళ్ళ కూతుర్ని పిల్లల సంరక్షణ కేంద్రానికి తరలించేశారు. ఈ సంఘటన జరిగి ఇప్పటికి మూడేళ్ళయింది. ఇక్కడ పిల్ల, అక్కడ తల్లిదండ్రులు లబోదిబో అంటున్నారు. కోర్టుని తల్లిదండ్రులు మా కూతుర్ని మాకు ఇచ్చేయండి కుయ్యో అంటే, లేదు, మీ కూతుర్ని మీరు కొట్టి చంపేస్తారు అందువల్ల మీ కూతుర్ని మీకు ఇచ్చేదే లేదు అని కోర్టు తేల్చి చెబుతోంది. సంరక్షణ కేంద్రంలో వున్న కూతురు నేను నా పేరెంట్స్ దగ్గరకి వెళ్ళిపోతాను మొర్రో అంటే, నో, మీ పేరెంట్స్ నిన్ను కొట్టి చంపేస్తారు అని రిజెక్ట్ చేస్తోంది. ఈ విషయాన్ని థానె పార్లమెంట్ సభ్యుడు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకెళ్ళారు. వీలైనంత త్వరగా ఆ కూతుర్ని, తల్లిదండ్రులను కలిపి, ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని జై శంకర్ హామీ ఇచ్చారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి. పిల్లలను కొట్టడం లేదా శారీరకంగా శిక్షించడం జర్మనీలో నేరంగా పరిగణించబడుతుంది. జర్మనీ 2000లో పిల్లలపై శారీరక దండనను నిషేధించింది, అలా చేసిన మొదటి దేశాలలో ఒకటిగా నిలిచింది. పిల్లలు శారీరక హింస లేకుండా పెరిగే హక్కును కలిగి ఉంటారని చట్టం పేర్కొంది. వారి పిల్లలపై శారీరక బలాన్ని ఉపయోగించే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు జరిమానాలు లేదా నేరారోపణలను సదరు చట్టం ద్వారా ఎదుర్కోవాల్సి వుంటుంది. జర్మన్ సివిల్ కోడ్ సెక్షన్ 1631 ప్రకారం, "పిల్లలకు శారీరక లేదా మానసిక హింస లేకుండా పెరిగే హక్కు ఉంది." జర్మన్ క్రిమినల్ కోడ్ సెక్షన్ 223 పిల్లలకు శారీరక హాని కలిగించడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తుంది. 

పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు గడపదొక్కిన కెఎ పాల్ 

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రజా శాంతి పార్టీ  అధ్యక్షుడు కెఏ పాల్ న్యాయ పోరాటానికి దిగారు. తెలుగునాట రాజకీయాల్లో ఫిరాయింపులు కొత్తేం కాదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో వలసలను ఆ  పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ ప్రోత్సహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రోత్సహించి బిఆర్ఎస్ లో విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. అదే ఫార్ములాను కాంగ్రెస్ కొనసాగించింది.  గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పరాజయం చెందిన తర్వాత కాంగ్రెస్ లోకి వలసలు పెరిగాయి. హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఈ వలసలు లేదా ఫిరాయింపులు నేటి వరకు ఆగడం లేదు. కెఏ పాల్ కు ఇది రుచించలేదు. కోర్టు తలుపు తట్టి న్యాయం కావాలని అర్థిస్తున్నారు.  ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరడం అన్యాయమని కెఏ పాల్ భావన. హైకోర్టులో వేసిన పిటిషన్ లో కూడా దానం నాగేందర్ ప్రస్తావన తెచ్చారు. బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయడం తగదన్నారు. ఆరు నెలలు తిరగకముందే కాంగ్రెస్ లో జంప్ కావడం అనైతికమని పాల్ వాదిస్తున్నారు. అధికారమే పరమావధిగా పార్టీలు మారుతున్నవారికి సంకెళ్లు వేయడానికి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలని పాల్ అభ్యర్థించారు.  తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.  

వైసీపీలో మరో రెండు వికెట్లు..!

జగన్ పార్టీలో రాజీనామాల పండగ కొనసాగుతోంది. ఒక పక్క లండన్ వెళ్తూ ఏపీకి బైబై చెప్పడానికి రెడీ అవుతుంటే, మరోపక్క రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ‘పార్టీ’ సంగతి తర్వాత, నాకు నా కూతురు పుట్టిన రోజు ‘పార్టీ’యే ముఖ్యమని జగన్ ఈ రాజీనామాలని లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేయడానికి రెడీ అయ్యారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి మండలి ఛైర్మన్‌కు రాజీనామా లేఖలు ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ జగన్ లండన్‌కి వెళ్ళడం అంటూ జరిగితే, ఆయన ఇరవై రోజుల తర్వాత ఆయన ఒకవేళ తిరిగి వస్తే, ఇక్కడ ఖాళీ వైసీపీ స్వాగతం పలికేట్టు వుంది.

జగన్ లండన్ టూర్ రద్దు?

ఎవరు ఎలాగైనా చావండి.. నేను మాత్రం లండన్ టూర్ వెళ్ళి తీరాల్సిందే అన్నట్టుగా వుంది వైసీపీ నాయకుడు జగన్ వ్యవహారం. ఒకవైపు వైసీపీ నాయకుల రాసలీలలు, మరోవైపు ఖాళీ అవుతున్న పార్టీ, ఇంకోవైపు ముంచుకొస్తున్న కేసులు.... ఇంకా బోలెడన్ని తలనొప్పులు.. అయినప్పటికీ జగన్ లండన్ టూర్ చేయాలనే ఫిక్స్ అయిపోయారు. తన కుమార్తె పుట్టినరోజు వేడుకలలో పాల్గొనడానికి సీబీఐ కోర్టు దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే, సీబీఐ కోర్టు చాలా పెద్ద మనసు చేసుకుని అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 3 నుంచి 25 వరకు లండన్‌లో ఎంజాయ్ చేయడానికి జగన్ సామాను సర్దుకుంటున్నారు. అయితే, ఇప్పుడు ఆయన లండన్ టూర్ రద్దయ్యే అవకాశాలు వున్నాయన్న అనుమానాలు  ఏర్పడుతున్నాయి. మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును చిత్రహింసలకు గురిచేసిన కేసు విచారణ మొదలైంది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా నిందితుడు. జగన్‌తోపాటు ఈ కేసులో మిగతా నిందితులు అయిన సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్, ఇంటెలిజెన్స్ మాజీ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, మాజీ సీఐడీ డీఎస్పీ విజయ్‌పాల్‌కి కూడా గుంటూరు జిల్లా పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపించారు. మరికొందరికి కూడా నోటీసులు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీసులు నోటీసులు ఇచ్చినవారందరినీ పిలిపించి విచారణ జరపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా వున్న జగన్‌ని కూడా పోలీసులు పిలిచే అవకాశం వుంది. ఈ కేసులో విచారణకు పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాల్సి వుంది. నా ఇష్టమొచ్చినప్పుడు వస్తాను అంటే కుదరదు. విదేశాలకు వెళ్ళడానికి సీబీఐ కోర్టు ఇచ్చిన అనుమతి కూడా ఎంతవరకు చెల్లుబాటు అవుతుందనేది కూడా సందేహమే. అందువల్ల జగన్ లండన్ టూరు మీద రఘురామ కేసు ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.  రఘురామ కేసు మాత్రమే కాదు.. ముంబై హీరోయిన్‌ కాదంబరి జెత్వానీని చిత్రహింసలకు గురిచేసిన కేసు కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశం వుంది. హీరోయిన్‌ని హింసించడం వెనుక జగన్ హస్తం వుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ ఆదేశించడం వల్లనే పోలీసులు గానీ, వైసీపీ నాయకులుగానీ చాలా ‘అంకితభావం’తో హీరోయిన్‌ని వేధింపులకు గురిచేశారన్న అనుమానాలు వున్నాయి. ఈ కేసు విచారణను త్వరతగతిన పూర్తిచేసి, దోషులకు శిక్ష విధించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వుంది. కాదంబరి జెత్వానీ విజయవాడకు వచ్చి ఫిర్యాదు కూడా చేసిన నేపథ్యంలో ఈ కేసుతో  సంబంధం వున్నవారందరినీ పోలీసులు ప్రశ్నిస్తారు. జగన్‌కి కూడా ఇందులో సంబంధం వుందని సెప్టెంబర్ 3వ తేదీ లోపు తేలిన పక్షంలో జగన్ ‌లండన్ టూర్‌కి వెళ్ళకుండా పోలీసులు ఆపే అవకాశం వుంది. ఇలా జగన్ లండన్ టూర్‌కి రెండు గండాలు పొంచి వున్నాయి. 

తెలంగాణలో మూడు దశల్లో ‘స్థానిక’ ఎన్నికలు!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు జరిగే తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో వేగం పెంచింది. అందులో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన దిశగా చర్యలు ప్రారంభించింది.    గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ వినా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారాలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో గురువారం (ఆగస్టు 20) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి మార్గదర్శనం చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ లిస్టును యథావిధిగా పరిగణనలోనికి తీసుకుని, వార్డులు, పంచాయతీల వారీగా ఓటర్ జాబితాలను తయారు చేసి ముసాయిదాను వచ్చే నెల 6న ప్రచురించాలని ఆదేశించారు.  ఆ తరువాత  మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని సూచించారు. ఈ ముసాయిదా జాబితాలో వార్డు వారీగా లేదా పంచాయతీ వారీగా ఓటర్లను అమర్చడంలో ఏవైనా పొరపాట్లు జరిగితే సెప్టెంబర్ 13 వరకు సంబంధిత మండల పరిషత్ అధికారులకు లేదా జిల్లా పంచాయతీ అధికారులకు రాత పూర్వకంగా తెలపాలని సూచించారు.   ఓటరు జాబితాల తయారీ, వార్డుల వారిగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పొలింగ్ సిబ్బంది శిక్షణ తదితర విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.   రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్‌  పద్ధతిలో  మూడు దశల్లో నిర్వహించనున్నట్లు  ఎస్‌ఈసీ  సి.పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసిన తరువాత నోటిఫికేషన్‌ వెలువడుతుందన్నారు.   పంచాయతీ ఎన్నికలకు ప్రవర్తనా నియమావళి  కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.  రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలున్నందున ఒకేసారి ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు.   పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని పార్థసారథి తెలిపారు.  

పెళ్లికూతురు పసుపు రాసుకోవచ్చా? 

మౌలానా ఇంటికి వచ్చాడు సిరాజ్. అదే బస్తీలో ఉండటంతో సిరాజ్ కుటుంబానికి మౌలానా చిరపరిచుతుడే.  సిరాజ్: సలాం వాలేకుం మౌలానా సాబ్. మౌలానా: వాలేకుం సలాం. తష్రీప్ రఖియే (దయచేసి కూర్చోండి)   తన చెల్లెలు రుబీనా పెళ్లి కార్డు ఇవ్వడానికి మౌలానా వద్దకు వచ్చాడు. షాదీ (పెళ్లి), వలీమా(విందు) కు ఆహ్వానిస్తాడు. మౌలానా ఆశ్యర్యపోయాడు. కేవలం రెండ్రోజులకే పెళ్లి వేడుక జరపడం తగదని వారించాడు. నేను నిఖా రోజు, విందు రోజు వస్తాను కానీ మీ ఇంట్లో పెళ్లి వేడుకలు వారం రోజులు జరుపుకోవాలని మౌలానా కోరతాడు.  సిరాజ్: ఇటీవల మా అన్నయ్య ఫసల్ బాబా పెళ్లి ఖర్చు బాగా అయ్యింది కదా మౌలానాసాబ్    మౌలానా: బడే లోగ్  జో బీ కరే అచ్చే ఇచ్  కరే. సిరాజ్ : క్యా కరే మౌలానా సాబ్  మౌలానా:  ‘బాజూ వాలా మౌలానా నహీ ముహీమ్ నికాలే సుబామే షాదీ, ష్యామ్ మే వలీమా ఏకీ దిన్ మే నిఖా, వలీమా కర్దోవ్’ యే క్యా జులుమ్ . బహుత్ జులుమ్ హై  భాయ్ యే ... ఇత్ నాబీ నై కర్నా టూమచ్ హై .. ఏక్ దిన్ మే షాదీ , వలీమా ఖర్చులు పెరిగిపోతున్నాయన్న సాకుతో ఒకే రోజు పెళ్లి , విందు నిర్వహించే క్రతువును మౌలానా వ్యతిరేకించేవాడు. ఇస్లాంలో పెళ్లిని  ఆనందోత్సహాల మధ్య జరుపుకోవాలి. కనీసం వారం రోజుల పాటు పెళ్లి జరగాలి. దుబారా ఖర్చులు తగ్గించి పెళ్లి వేడుకలు ఘనంగా నిర్వహించాలని మౌలానా తన తక్రీర్ (ప్రవచనాల్లో) చెప్పేవాడు. ఇస్లాంలో హల్దీ(పసుపు) వేడుక కంపల్సరీ కాదు కానీ దక్షిణ భారత దేశ సంస్కృతిలో హల్దీ వేడుక చేరింది.  ఐదు రోజుల పాటు జరిగే హల్దీ వేడుక ప్రాధాన్యత సంతరించుకుంది. పసుపు వల్ల చర్మంలో నిగారింపు వస్తుందని మౌలానా శాస్త్రీయ ఆధారాలను చూపెట్టాడు. తొలుత అమ్మాయిలకు మాత్రమే పసుపు రాసే వారు. ప్రస్తుతం అబ్బాయిలకు కూడా పసుపు రాస్తున్నారు. పసుపు తిన్నా, శరీరానికి రుద్దినా మంచిదే. కరోనా సమయంలో  పసుపును విరివిగా ఉపయోగించడం వల్ల మహమ్మారిని నివారించగలిగాం అని తన తక్రీర్ లలో మౌలానా చెప్పేవాడు. పెళ్లి కొడుకుకు పసుపు రాయడం వల్ల చర్మం నుంచి దుర్వాసన తొలగిపోతుంది.నిగారింపు వస్తుంది.  పెళ్లి కొడుకు కు మెహందీ (గోరింటాకు) పెట్టడవ నిషేధం. పెళ్లికూతురుకు అయితే  రక్త సంబంధీకులు మాత్రమే పసుపు రాయాలి.  కుటుంబయేతర మహిళ లేదా యువతి చేత పసుపు రుద్దించకూడదు.  అమ్మాయిల కాలి బొటనవేలి నుంచి మెడ వరకు పసుపు రుద్దకూడదు.మహిళల ఎదుట కూడా పెళ్లికూతురు కొన్ని హద్దుల్లో మాత్రమే పసుపు రాసుకోవాలి. వివస్త్రగా పసుపు రాసుకోకూడదు. పసుపు పెట్టుకుని డాన్స్ లు చేయడం ఇస్లాంలో నిషిద్దం. పెళ్లికూతరే స్వయంగా పసుపు రాసుకోవడం ఉత్తమం.వేరే మహిళలు పసుపు రాయడం కూడా ఇస్లాంలో నిషిద్దం.   పెళ్లి వేడుకను వారం రోజుల పాటు కుటుంబసభ్యులు బంధు మిత్రుల మధ్య సంతోషంగా జరుపుకోవాలని, అప్పుడే వారి కుటుంబం పదికాలాల పాటు చల్లగా ఉంటుందని ఇస్లాం చెబుతుందని మౌలానా వివరించాడు.   -బదనపల్లి శ్రీనివాసాచారి

కొల్లం గంగిరెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్

ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తీవ్ర మైన నేర చరిత ఉన్న కొల్లం గంగిరెడ్డి ఎంట్రీకి బీజేపీ ఎలా అనుమతి ఇచ్చిందన్న ఆశ్చర్యం సర్వత్రా వ్యక్తం అయ్యింది. అసలు ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందన్న అనుమానాలూ వ్యక్తం అయ్యాయి. అయితే ఆదంతా వట్టిదేనని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఖండించారు. అయితే గత కొన్ని రోజులుగా గంగిరెడ్డి బీజేపీ ఎంట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటం, బీజేపీ మౌనం వహించడం పలు అనుమాలకూ, సందేహాలకూ తావిచ్చింది. అసలు ఇటీవలి కాలంలో ఏపీ బీజేపీలో తుపాను ముందు ప్రశాంతతా అనిపించేలా భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది.  ఇటీవలి ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామే. రాష్ట్రంలో కనీసం ఒక శాతం ఓటు బ్యాంకు కూడా లేని బీజేపీ ఇటీవలి ఎన్నికలలో మంచి ఫలితాలనే సాధించింది. ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గెలుచుకోగలిగింది. ఇదంతా తెలుగుదేశం, జనసేనలతో పొత్తు కారణంగానే అన్న విషయంలో ఎటువంటి సందేహాలకూ తావు లేదు. అది పక్కన పెడితే రాష్ట్రంలో అధికారంలో భాగస్వామి అయిన బీజేపీలో జోష్ కనిపించాలి. కానీ  రాష్ట్రంలో ఆ పార్టీ అసలు ఉందా అన్నట్లుగా విస్మయకర రీతిలో సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తున్నది. ఎక్కడా ఎటువంటి హడావుడీ లేదు. పార్టీ క్యాడర్, లీడర్ అందరూ సైలెంట్ మోడ్ లోనే ఉన్నారు.  వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం గత ఐదేళ్లుగా రాష్ట్రంలో బీజేపీ హడావుడి చాలా చాలా ఎక్కువగా ఉండేది. మరీ ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశంపై విమర్శలు గుప్పించడం, అధికార వైసీపీకి మద్దతుగా నిలవడమే ఆ పార్టీకి రాష్ట్రంలో ఉన్న లక్ష్యం అన్నట్లుగా పరిస్థితి ఉండేది.  ఆ తరువాత పురంధేశ్వరి రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత కూడా బీజేపీ రాష్ట్రంలో క్రియాశీలంగానే ఉంది. జగన్ సర్కార్ అక్రమాలపై పురంధేశ్వరి తరచూ గొంతెత్తేవారు. జగన్ సర్కార్ ఆర్థిక అరాచకత్వంపై ఎన్నికలకు ముందు  ఆమె హస్తిన వెళ్లి మరీ కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తరువాత అంటే ఎన్నికల ఫలితాల తరువాత నుంచీ బీజేపీలో అంతా నిశ్శబ్దమే తాండవిస్తోంది.   కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఏపీ బీజేపీ ఎటువంటి హడావుడి లేకుండా నిశబ్ధంగానే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలి ఎన్నికలలో  పార్టీ సీనియర్లను బీజేపీ హైకమాండ్ దూరం పెట్టింది. ఎన్నికలలో పోటీకి టికెట్ లు నిరాకరించడమే కాకుండా, ప్రచారానికి కూడా రానివ్వలేదు. దీంతో వారంతా పార్టీ కార్యకలాపాలకు  దూరంగా ఉండాలని నిర్ణయించుకుని ఉంటారు. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర కేబినెట్ లో ఉన్న బీజేపీ మంత్రులు, గెలిచిన ఎమ్మెల్యేలూ కూడా నిశ్శబ్దాన్నే ఆశ్రయించడం పట్ల రాజకీయవర్గాలలో సైతం విస్మయం వ్యక్తమౌతోంది. అటువంటి నిశ్శబ్దంలోంచే గంగిరెడ్డికి కమలం తీర్థం అన్న వార్తలు ఒక్కసారిగా బయటకు రావడంతో ఇంకా జగన్ కోసం బీజేపీ రాష్ట్ర శాఖ పాకులాడుతోందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. జగన్ హయాంలో గంగిరెడ్డి స్మగ్లింగ్ వ్యవహారాలన్నీ ఎంతో స్వేచ్ఛగా నిర్వహించుకున్న సంగతి విదితమే. ఇప్పుడు గంగిరెడ్డిని బీజేపీ తన గూటికి చేర్చుకోవడం ద్వారా బహుశా రాష్ట్ర బీజేపీలో జగన్ అభిమానులను సంతృప్తి పరిచి వారి అలక తీర్చడానికేనని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు.   దానికి తోడు నామినేటెడ్ పోస్టుల రేసులో ఉన్న వారి జాబితాలో బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఉన్నట్లుగా వస్తున్న వార్తలు ఆ విశ్లేషణలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి.   ఏపీలో జగన్ ఉన్న ఐదేళ్ల కాలంలో ఆయన బీజేపీ అడుగులకు మడుగులొత్తారు. రాష్ట్ర ప్రయోజనాల ఊసే లేకుండా తన కేసుల నుంచి రక్షణ ఉంటే చాలన్నట్టుగానే వ్యవహరించారు. అధికారం కోల్పోయిన తరువాత కూడా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఈ నేపథ్యంలో బీజేపీ గంగిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే.. ఆ పార్టీ హైకమాండ్ ఇంకా జగన్ కు వత్తాసు పలుకుతోందన్న ప్రచారానికి బలం చేకూర్చినట్లు అవుతుంది. ఈ భయంతోనే గంగిరెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నిజానికి గత రెండు మూడు రోజులుగా జరిగిన ప్రచారం మేరకు  బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమక్షంలో గండిరెడ్డి గురువారం ( ఆగస్టు 29) బీజేపీ గూటికి చేరాల్సి  ఉంది. అయితే అదంతా ఒట్టి ప్రచారం మాత్రమేనని పురంధేశ్వరి కుండబద్దలు కొట్టేశారు.అసలు కొల్లం గంగిరెడ్డి ఎవరో తనకు తెలియదని చెప్పిన పురంధేశ్వరి.. బీజేపీలో అడ్డగోలు చేరికలకు అసలు ఆస్కారమే లేదని చెప్పారు. గంగిరెడ్డి బీజేపీ గూటికి చేరుతున్నారన్న వార్తలు తనకు మీడియా ద్వారానే తెలిశాయనీ, అయితే అవన్నీ పూర్తి అవాస్తవాలని పురంధేశ్వరి విస్పష్టంగా తేల్చేశారు. అయితే ఎవరు పడితే వారు బీజేపీ గూటికి చేరలేరన్న ఆమె, పార్టీ పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవారికి మాత్రమే బీజేపీలో ఎంట్రీ ఉంటుందని, అది కూడా ఆయా జిల్లాల కార్యవర్గం ఆమోదంతోనే అనీ వివరణ ఇచ్చారు.  

తమిళ‌నాడులోనూ త‌రిమేశారా.. మళ్లీ ఏపీకే రోజా?

నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని కొద్ది కాలంగా ఏపీ రాజ‌కీయాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. త‌మిళ‌నాడులో హీరోయిన్ గా రోజాకు మంచి పాపులారిటీయే ఉంది. దీనికితోడు ఆమె భ‌ర్త‌ కూడా త‌మిళ‌ సినీ రంగానికి చెందిన వ్య‌క్తి. అక్క‌డి భాష‌పై రోజాకు ప‌ట్టుంది. మ‌రోవైపు ఏపీలో ప‌ర్య‌ట‌క‌, క్రీడాశాఖ‌ల మంత్రిగా చేసిన స‌మ‌యంలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన‌ట్లు ఆమెపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం తెలుగుదేశం  కూట‌మి ప్ర‌భుత్వం రోజా అవినీతి అక్ర‌మాల‌పై దృష్టిసారించింది. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో భారీ మొత్తంలో ఆమె అవినీతికి పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఎన్ని నిధులు ఖ‌ర్చుచేశారు.. ఎన్ని నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయ‌నే విష‌యాల‌పై అధికారులు కూపీ లాగుతున్నారు. ఏపీలో రాజ‌కీయాల్లో కొన‌సాగితే తెలుగుదేశం కూటమి ప్ర‌భుత్వం త‌న అవినీతిని బ‌య‌ట‌పెడుతుంద‌ని, తాను జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని రోజా భావిస్తున్నారు‌. ఏపీ రాజ‌కీయాల్లో ఉండి క‌ష్టాలుప‌డే బ‌దులు.. త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంద‌ని రోజా, ఆమె భ‌ర్త నిర్ణ‌యించుకున్నార‌ని వైసీపీ వర్గాలే బాహాటంగా చెబుతూ వచ్చాయి. కానీ, ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది.    త‌మిళ రాకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని భావించిన రోజా ఆశ‌ల‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ రాష్ట్రంలో ప్ర‌ముఖ హీరో విజ‌య్ తమిళగ వెట్రి కళగం (టీఎంకే) పేరుతో కొత్త‌పార్టీ పెట్టారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింపేందుకు విజ‌య్, ఆయ‌న అనుచ‌రులు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రోజా టీఎంకే పార్టీ ద్వారా త‌మిళ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని భావించారు. ఆ మేర‌కు రోజా, ఆమె భ‌ర్త ప్ర‌య‌త్నాలు చేశారు‌. కానీ  ఏపీ రాజ‌కీయాల్లో రోజా వ్యవహరించిన తీరును తెలుసుకున్న విజ‌య్‌.. టీఎంకే పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రోజాకు అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని టాక్ న‌డుస్తోంది. త‌మిళ‌నాడులోని ఏపీ స‌రిహ‌ద్దుల్లో‌, తెలుగువారు అధికంగా ఉండే నియోజ‌క‌వ‌ర్గంలో ఏదోఒక నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని రోజా దంప‌తులు విజ‌య్ ముందు ప్ర‌తిపాద‌న‌లు పెట్టిన‌ట్లు తెలిసింది. రోజా దంప‌తుల ప్ర‌తిపాద‌న‌ను విజ‌య్ తిర‌స్క‌రించారు‌. మీరు కోరుకునే నియోజ‌క‌వ‌ర్గాల్లో మాకు ఇప్ప‌టికే అభ్య‌ర్థులు రెడీగా ఉన్నార‌ని చెప్ప‌డం ద్వారా.. మీరు మా పార్టీలోకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని స్పష్టంగా చెప్పేశారు.  టీఎంకేలో చేరేందుకు అవ‌కాశం లేక‌పోవ‌టంతో ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీలో చేరేందుకు రోజా దంప‌తులు ప్ర‌య‌త్నాలు చేశారు‌. ఆ పార్టీ అధిష్టానం కూడా రోజాకు నో చెప్పేసింబదని తెలిసింది.   గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ఓట‌మి త‌రువాత ఆ పార్టీ మ‌హిళా నేత‌, మాజీ మంత్రి రోజా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. ఎక్క‌డా మీడియా స‌మావేశాల్లోనూ మాట్లాడిన దాఖ‌లాలు లేవు. అధికారంలో ఉన్న‌న్ని రోజులు చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేశ్ లాంటి నేత‌ల‌పై నోటికొచ్చినట్లు మాట్లాడిన రోజా.. ప‌లు సంద‌ర్భాల్లో అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో వారిపై విమ‌ర్శ‌లు చేశారు. దీంతో రోజా వ్యాఖ్య‌లు, రాజ‌కీయాల్లో ఆమె ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల వైసీపీ శ్రేణుల్లోనూ ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది. రోజా లాంటి నేత‌ల వ‌ల్ల పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోతుంద‌ని ప‌లువురు వైసీపీ నేత‌లు ఎన్నిక‌లకు ముందు జ‌గ‌న్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అయినా, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో రోజాకు మ‌రోసారి జ‌గ‌న్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర ఓట‌మితోపాటు.. రోజా కూడా పరాజయం పాలయ్యారు. ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే తన ఓటమిని అంగీకరిస్తూ రోజా తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని మీడియా ముఖంగా చెప్పేశారు.  అయితే  ఇప్పుడు తమిళనాట రాజకీయ ఎంట్రీకి అవకాశాలు లేవని తేలిపోవడం, అక్కడి రాజకీయ పార్టీలు ఆమెకు నో ఎంట్రీ బోర్డులు చూపడంతో రోజా అనివార్యంగా  ఏపీకి తిరిగి వచ్చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తరువాత ఇంత కాలానికి ఆమె మీడియా ముందుకు వచ్చారు.  నగరి నియోజకవర్గం  పుత్తూరులో నూతనంగా నిర్మించిన బలిజ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా  రోజా ప్రసంగం విన్నవారంతా కుక్క‌తోక వంక‌రే అన్న‌ట్లుగా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పినా రోజా తీరులో ఏమాత్రం మార్పు రాలేదని విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపై మాట్లాడిన రోజా ఎన్నికలు సునామీలా వచ్చి వెళ్ళిపోయాయని అన్నారు.  ఇది ప్రజలు ఇచ్చిన ఓటమి కాదు.. ఏదో జరిగింది. ఏం జరిగిందన్నది ఏదో ఒకరోజు బయటకు వస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులు మనం చేయలేదని కామెంట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎలా అందుబాటులో ఉన్నామో.. ప్రతిపక్షంలోకూడా అలానే ఉంటామని చెప్పారు. అక్కడితో ఆగకుండా..  ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని నా కుటుంబసభ్యులుగా చూసుకుంటాను అంటూ రోజా సుదీర్ఘ ఉప‌న్యాసం ఇచ్చారు. రోజా త‌మిళ రాజ‌కీయాల్లోకి వెళ్తున్నార‌ని వార్త‌లు రావ‌డంతో సంతోష ప‌డిన వైసీపీ నేత‌లు.. ప్ర‌స్తుతం ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌తో మ‌మ్మ‌ల్ని వ‌దిలి పెట్ట‌వా త‌ల్లీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్, లోకేశ్ పై బూతుల‌తో రోజా రెచ్చిపోయారు. రోజా, కొండాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, పేర్ని నాని వంటి నేత‌ల కార‌ణంగానే వైసీపీ దారుణంగా ఓడిపోయింద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. రోజా వైసీపీలోనే కొన‌సాగినా ఆమె మాట‌ తీరు  మార్చుకోక‌పోతే ఊరుకోమ‌ని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నేత‌లైతే రోజాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గ రాజకీయాలలో ఆమె ప్రమేయాన్ని అంగీకరించేది లేదంటూ అంటూ ఇప్ప‌టికే వైసీపీ అగ్రనాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది.   మొత్తానికి త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇద్దామ‌ని భావించిన రోజాకు అక్క‌డి పార్టీలు గ‌ట్టి షాక్ ఇవ్వడంతో మళ్లీ ఏపీలోనే రాజకీయాలు చేసేందుకు  సిద్ధమయ్యారు. మరి ఇక్కడ ఆమెకు పార్టీ నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాల్సిందే. 

AmaravatI.. AI సిటీ..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సిటీగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి అభివృద్ధి అంశం మీద అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఏఐ, అమరావతి’ని కలిపి ఇంగ్లీషులో లోగో రూపొందించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా లోగో రూపొందించాలని ఆదేశించారు. 90 రోజుల్లో సీఆర్‌డిఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని చంద్రబాబు సూచించారు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

హైడ్రా పేరుతో అవినీతా? తాట తీస్తా!

హైదరాబాద్ నగరంలో హైడ్రా సంచలనం సృష్టిస్తోంది. చెరువులున్న ప్రాంతాల్లో కట్టడాలు నిర్మించిన వారు భయపడి  చస్తున్నారు. ఈ భయాన్ని కొంతమంది అధికారులు క్యాష్ చేసుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాంటి వాళ్ళ తాట తీస్తానని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. హైడ్రా పేరుతో చెప్పి కొంతమంది అవినీతికి పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చింది రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకొని డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలిసిందని ఆయన చెప్పారు. ప్రజలకు భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఆరోపణలు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైడ్రా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

రేవంత్ వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం!

ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చిన విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌, బీజేపీ మధ్య డీల్ కుదరడం వల్లే బెయిల్ వచ్చిందని ఆయన అన్నారు.  రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్ట్ స్పందించింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తాము బెయిల్ ఇస్తామా అని ప్రశ్నించింది. 2015 నాటి ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బైఆర్‌ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇలా వ్యాఖ్యానించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవంతో ఉండాలని, రాజ్యాంగ బద్ధమైనపదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. కాబట్టి కేసును బదిలీ చేయాలంటూ పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయమంటారా?’’ అంటూ రేవంత్ రెడ్డి అడ్వకేట్లు ముకుల్ రోహత్గీ, సిద్దార్థ్ లూథ్రాలను న్యాయమూర్తులు ప్రశ్నించారు. 

హీరోయిన్ జిత్వానీ అంశంపై పోలీసుల దూకుడు!

వైసీపీ నాయకుల, పోలీసు అధికారుల చేతిలో శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురైన ముంబై హీరోయిన్ జిత్వానీ అంశం మీద ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించే ప్రత్యేక అధికారిగా ఎసిపి స్రవంతి రాయ్‌ని సీపీ రాజశేఖర్ బాబు నియమించారు. జిత్వానీ నుంచి ఆన్‍లైన్‍లో ఫిర్యాదు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జత్వానీ పోలీసులకు ఆన్‌లైన్లోనే ఫిర్యాదు చేశారు. దాంతో విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. స్రవంతి రాయ్ నేతృత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం శుక్రవారం నాడు ముంబై వెళ్లనుంది.

వామ్మో.. ఎంపీకి 908 కోట్ల జరిమానా!

అసలు 908 కోట్లేంటండీ బాబు.. పైగా అది కూడా జరిమానా.. పైగా మన భారతీయ ఎంపీకి! సదరు ఎంపీ 908 కోట్లు జరిమానాగానే కట్టే స్థాయిలో వున్నాడంటే, ఆయన గారి అసలు ఆస్తి ఎంత వుంటుందో కదా..! ఇంతకీ ఎవరా ఎంపీ, అంత జరిమానా ఎవరు విధించారు? ఎందుకు విధించారు? ఆ వివరాల్లోకి వెళ్తే, తమిళనాడులోని అర్కోణానికి చెందిన డీఎంకే పార్టమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి జగద్రక్షకన్‌కి ఈడీ (ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్) 908 కోట్ల జరిమానా విధించింది. ఈ ఎంపీ మీద మనీలాండరింగ్ కేసు వుంది. ఈ కేసు విషయంలో 2020లో ఈయన ఇల్లు, ఇతర ప్రాంతాల మీద ఈడీ సోదాలు నిర్వహించి దాదాపు 90 కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసింది. జగద్రక్షన్‌కి చెందిన సంస్థలు, పరిశ్రమలు పన్నులు సక్రమంగా చెల్లించలేదన్న ఆరోపణలో ఈడీ ఈ సోదాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ నిర్వహణ చట్టం కింద జగద్రక్షన్‌కి ఈడీ 908 కోట్ల రూపాయల జరిమానా విధించింది. 

పోలీసులా.. నాలుగో కుందేళ్ళా?

‘ఈ టోపీ  మీద కనిపించే మూడు సింహాలూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలైతే, కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్’ అని ఆవేశంగా మాట్లాడే సీను ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కనిపించడం లేదు. ఆ కనిపించని నాలుగోది సింహం కాదు.. కుందేలు అన్నట్టుగా తయారయ్యారు. ఐదేళ్ళపాటు అధికారపార్టీ నాయకులకు, వారి అనుచరులకు, కుటుంబ సభ్యులకు సెల్యూట్లు చేయడం అలవాటు అయిపోయిన ప్రాణాలు కదా మరి. అధికార పార్టీ నాయకులకు సంబంధించిన వారి సేవలో తరించడానికే ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. మొన్నామధ్య రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు, ఆమె పోలీసులను నిలదీస్తూ మాట్లాడిన విధానం వార్తల్లోకి వచ్చింది. ఎలాంటి అధికార హోదా లోకపోయినప్పటికీ ఆమె దర్పంగా మాట్లాడుతున్నా పోలీసులు ఎదురు మాట్లాడలేని పరిస్థితిలో వున్నారు. ఆ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఎవరికీ విధేయులుగా వుండాల్సిన అవసరం లేదని అన్నారు. అయినప్పటికీ, అలవాటుపడ్డ ప్రాణాలు మారడం లేదు.  ఈమధ్య చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలలో స్థానిక పోలీసులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. మేడమ్ గారితో ఫొటోలు కూడా దిగారు. ఎమ్మెల్యేగారి సతీమణికి ఎలాంటి అధికారిక హోదా లేకపోయినప్పటికీ పోలీసులు అక్కడకు వెళ్ళడం మీద జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. దాంతో చిలకలూరిపేట టౌన్, రూరల్ సీఐలు సుబ్బానాయుడు, రమేష్, ఎస్సైలు అనిల్ కుమార్, పుల్లారావు, చెన్నకేశవులు, బాలకృష్ణ, ట్రాఫిక్ ఎస్ఐ ప్రసాద్ నాయక్, హోంగార్డు వీరయ్యకు నోటీసులు ఇచ్చారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

మోడీ సర్కార్ ది ఇక హిందుత్వ అజెండాయేనా?

ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థానాలు దక్కకపోవడంతో ఒకింత డీలా పడినట్లు కనిపించింది. భాగస్వామ్య పక్షాల మద్దతుతో  లోక్ సభలో ఎలాగోలా తన మాట నెగ్గించుకోగలిగినా, ఇప్పటి వరకూ రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి ఆ వెసులుబాటు లేకుండా పోయింది. దీంతో భాగస్వమ్యంలో లేని పక్షాల మద్దతు కోసం కూడా వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉండింది. మోడీ సర్కార్ ఆ బలహీనతను గుర్తించిన వైసీపీ వంటి కొన్ని పార్టీలు రాజ్యసభలో తమకున్న సభ్యుల బలాన్ని చూపి ప్రయోజనం పొందాలని భావించాయి. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రాజ్యసభలో కూడా ఎన్డీయేకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయింది. తాజాగా 12 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో విజయం సాధించడంతో రాజ్యసభలో బీజేపీ బలం పెరిగింది. దీంతో ఇక ఆలస్యం చేయకుండా తన సొంత అజెండా అమలుకు సమాయత్తమైపోతున్నది. బీజేపీ అజెండాను కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ అమలు చేయడం భాగస్వామ్య పక్షాలకు ఒకింత ఇబ్బందికరమే అయినా బీజేపీ పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వరుసగా మూడు సార్లు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి నాయకత్వం వహించిన బీజేపీ నాలుగో సారి కూడా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమౌతుందని భావించడం లేదు. ఎందుకంటే 2014, 2019 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ సర్కార్ పేరుకే ఎన్డీయే కూటమి ప్రభుత్వం. వాస్తవానికి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినంత మంది సభ్యుల బలం ఉండటంతో మోడీ పూర్తిగా తన హిందుత్వ అజెండా అములుకు ఇసుమంతైనా వెనుకాడ లేదు. అంతే కాకుండా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు కనీస విలువ ఇవ్వలేదు. ముఖ్యంగా రెండో సారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే నామమాత్రమైపోయింది. తెలుగుదేశం సహా పలు భాగస్వామ్య పక్షాలు ఎన్డీయే నుంచి వైదొలిగాయి. కొన్ని భాగస్వామ్య పార్టీలలో చిచ్చు పెట్టి, చీలిక తీసుకు వచ్చి బీజేపీ వాటిని బలహీనపరిచింది. అయితే 2024 ఎన్నికలలో బీజేపీకి జనం పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. భాగస్వామ్య పక్షాల మద్దతు, అండా లేకుండా ప్రభుత్వాన్ని నడపడం అసాధ్యం అనేలా తీర్పు ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి గట్టి ప్రతిపక్షంగా గళం విప్పడానికి తగినంత బలాన్నిచ్చారు. అదే సమయంలో  రాష్ట్రాలలో బీజేపీ బలం తగ్గుతూ వస్తోంది. పార్టీకి కంచుకోట లాంటి ఉత్తర ప్రదేశ్ లో ఈసారి బీజేపీ స్థానాలు గణనీయంగా తగ్గాయి. దీంతో అప్రమత్తమైన మోడీ సర్కర్ తన అజెండా అమలు విషయంలో ఇంకెంత మాత్రం తాత్సారం చేయరాదని భావిస్తున్నది.  రాజ్యసభలో బలం తక్కువగా ఉన్న కారణంతో లోక్ సభలో ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును విపక్షాల అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకుని సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఎందుకంటే లోక్ సభలో ఉన్న బలంలో బిల్లు ఆమోదం పొందినా రాజ్యసభ ఆమోదం సాధ్యం కాదన్న భవనతో విపక్షాల అభిప్రాయాలకు విలువను ఇస్తున్నట్లుగా బీజేపీ బిల్డప్ ఇచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇక ఇప్పుడు తన ప్రభఉత్వం ప్రవేశపెట్టే బిల్లులకు రాజ్యసభ గండం తొలగిపోవడంతో స్పీడ్ పెంచేందుకు రెడీ అయిపోయింది. క్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో పాటు, మైనారిటీ బిల్లు ముఖ్యంగా కామన్ సివిల్ కోడ్ బిల్లులకు ఉభయ సభల ఆమోదమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.  బీజేపీ అడుగులు హిందూ రాజ్యం గా ఇండియాను మార్చే లక్ష్యం దిశగా పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల విమర్శలను బీజేపీ ఖాతరు చేసే అవకాశం లేదు. అయితే బీజేపీ విధానాలు నిస్సందేహంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఇబ్బందికరంగా మారుతాయి. ముఖ్యంగా తెలుగుదేశం వంటి పార్టీలు బీజేపీ ముస్లిం వ్యతిరేక విధానాలను, హిందుత్వ అజెండాను సంపూర్ణంగా సమర్ధించే పరిస్థితి ఉండదు. మరి ముందు ముందు బీజేపీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఇబ్బంది లేకుండా తన అజెండా అమలుకు ఎలాంటి వ్యూహాలు అవలంబిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.  

కాశ్మీర్ ఎన్నికలలో పోటీ చేయను.. మెహబూబా!

జమ్మూకశ్మీర్ ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ప్రకటించారు. కేంద్ర పాలిత ప్రాంతంలో తమ పార్టీ తన విధానాలను అమలు  చేయలేదని ఆమె చెప్పారు. తాను గతంలో సీఎంగా ఉన్నప్పుడు 12 వేల మందిపై ఉన్న ఎఫ్ఐఆర్‌లు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు జమ్ము కాశ్మీర్‌లో లేవని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం మీద వుండి కూడా ఒక్క ఎఫ్ఐ‌ఆర్‌ని కూడా వెనక్కి తీసుకోలేని స్థితిలో వుంటే, ఆ ముఖ్యమంత్రి పదవే అనవసరం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా వుంటే, జమ్ము కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నంతవరకు తాము ఎన్నికలకు దూరంగా ఉంటామన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.