మూడు రాజధానుల నిర్ణయంపై రెండు లక్షల మంది ఇచ్చిన తీర్పు

ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే.. మూడు రాజధానుల అంశమనే చెప్పాలి. అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులని వ్యాఖ్యలు చేయడం. ఆ వ్యాఖ్యలకు తగ్గట్టే జీఎన్ రావు కమిటీ నివేదిక ఉండటంతో.. ఏపీకి మూడు రాజధానులు వస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఈ మూడు రాజధానుల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తుంటే.. కొందరు మాత్రం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంత రైతులు పార్టీలకతీతంగా జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు వైసీపీ కార్యకర్తలు సైతం.. పార్టీ కార్యాలయానికి నల్లరంగు వేసి నిరసన వ్యక్తం చేసారు. మేము ముందు ఈ ప్రాంత రైతులం, ఆ తర్వాతే మాకు పార్టీ అని స్పష్టం చేసారు. మరోవైపు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారు మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. మొత్తానికి జగన్ నిర్ణయం కొందరికి ఇష్టం, కొందరికి కష్టం అన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల అంశంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవాలని... 'తెలుగువన్' యూట్యూబ్ ఛానెల్ లో ఓ పోల్ పెట్టింది. రాజధాని విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టే అని భావిస్తున్నారా? అని క్వశ్చన్ అడిగింది. దీనికి విశేషమైన స్పందన వచ్చింది. దాదాపు రెండు లక్షల మంది ఈ పోల్ లో పాల్గొన్నారు. 43 శాతం మంది ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తే.. 57 శాతం మంది ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అంటే మెజారిటీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని అర్థమవుతోంది. ఈ పోల్ కి వెయ్యికి పైగా కామెంట్స్ కూడా వచ్చాయి. ఈ కామెంట్స్ లో కూడా మెజారిటీ శాతం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కామెంట్స్ రావడం గమనార్హం. ఇది పనికిమాలిన చర్య అని కొందరు అంటే.. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పొతే రాష్ట్ర మనుగడకే ప్రమాదమని కొందరు కామెంట్స్ చేశారు. ముందు.. ఉన్న రాజధాని నగరం అమరావతిని డెవలప్ చేయండి చాలు.. మీరిలా మూడు రాజధానులు అంటే ఏపీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కూడా పోయే ప్రమాదముందని కొందరు అభిప్రాయపడ్డారు. కొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏదిఏమైనా రెండు లక్షల మంది పాల్గొన్న ఈ పోల్ ని గమనిస్తే మాత్రం.. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వారే ఎక్కువగా ఉన్నారని అర్థమవుతోంది.

 ప్రముఖ సినీ నటి,యాంకర్ల ఇళ్ళల్లో అకస్మాత్తుగా సోదాలు నిర్వహించిన జీఎస్టీ అధికారులు.....

  ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి, యాంకర్లు సుమ కనకాల, అనసూయ భరద్వాజ్ ఇళ్ళల్లో శుక్రవారం జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీని ఎగ్గొట్టిన కేసులకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. ఉదయం నుంచి తనిఖీలు జరిగాయి. విరిగి ఇళ్లతో పాటు నగరంలోని మొత్తం 23 చోట్ల ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. కోట్లలో సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీని ఎగ్గొట్టారన్న ఆరోపణలతో సోదాలు జరిగాయి. జూబ్లీహిల్స్ లోని లావణ్య త్రిపాఠి ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఆమె సినిమా షూటింగ్ ను రద్దు చేసుకొని ఇంటికి చేరుకున్నారు. అదే సమయంలో మణికొండలోని యాంకర్ సుమ కనకాల, బంజారాహిల్స్ లోని అనసూయ భరద్వాజ్ ఇళ్లల్లో తనిఖీ చేశారు. సినీ నటి యాంకర్ల ఇళ్లతో పాటు నగరం లోని చిట్ ఫండ్ కంపెనీలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, భవన నిర్మాణ సంస్థలు, సాఫ్ట్ వేర్ సంస్థలు, ఓవర్సిస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో ఫిట్ నెస్ సెంటర్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటర్ టైన్ మెంట్ తదితర ఇరవై మూడు సంస్థలలో ఏక కాలంలో ఈ సోదాలు జరిగాయి. కొన్ని సంస్థల్లో లావణ్య త్రిపాఠి, సుమ, అనుసూయ పెట్టుబడులు పెట్టారని ఆ సంస్థల పై సర్వీస్ ట్యాక్స్ జీఎస్టీ ఎగ్గొట్టిన ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. ఆ సంస్థల్లో సోదాలలో భాగంగానే లావణ్య త్రిపాఠి, సుమ, అనుసూయ ఇళ్లల్లో సోదాలు జరిగినట్టు తెలిసింది. సాధారణంగా సినీ నటులు వ్యక్తిగతంగా సర్వీస్ టాక్స్ జిఎస్టి చెల్లించే నిబంధనలు ఉండవు. వీరి భాగస్వామ్యం ఉన్న సంస్థలు గతంలో సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.ఆయా పెట్టుబడుల్లో భాగస్వామ్యం ఉన్న కారణంగా వీరి ఇళ్ళల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు సమాచారం.  

దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్ట్ మార్టం చేయనున్న ఢిల్లీ ఫోరెన్ సీక్ అధికారులు .....

దిశ నిందితుల మృతదేహాలను వారి కుటుంబాలకు ఎప్పుడూ అప్పగిస్తారనే ఉత్కంఠరేపుతోంది. సామాజిక కార్యకర్త పిటిషన్ తో నిన్న హై కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మృతదేహాలను ఎప్పుడూ అప్పగిస్తారని ప్రభుత్వం తమ అభిప్రాయం తెలపాలని హై కోర్టు ఆదేశించింది. దిశ నిందితుల మృతదేహానికి రీపోస్ట్ మార్టం చెయ్యటానికి ఆదేశాలిచ్చేందుకు హైకోర్ట్ సిద్ధమైనట్టుగా తెలిపింది. ఇందు కోసం ఢిల్లీకి చెందిన ఫోరెన్సిక్ నిపుణులు నేడు గాంధీ ఆస్పత్రికి వెళ్లి రీపోస్టుమార్టం చేస్తారని సమాచారం. ఎన్ కౌంటర్ పై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల17న మహిళా సంఘాలు సుప్రీం కోర్టుకు వెళ్లాయి. అయితే దీని పై హై కోర్టులో తేల్చుకోవాలని మృతదేహాలను భద్రంగా వుంచాలని సుప్రీం కోర్టు చెప్పింది. అయితే మృతదేహాలకూ రీపోస్టుమార్టం నిర్వహించాలని హై కోర్టు భావిస్తుంటే అవసరం లేదని ఏజీ తెలిపారు. ఇవాళ ఉదయం 10:30 లోపు ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు మృతదేహాల పరిస్థితి పై నివేదిక ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ను హై కోర్టు ఆదేశించింది.దిశ అత్యాచారం నిందితుల్లో ఒకరి భార్య మైనర్ అని సమాచారం. నిందితుడు చెన్న కేశవులు భార్య వయస్సు 13 ఏళ్లని అధికారుల విచారణలో తేలింది. నారాయణ పేట జిల్లా బాలల సంరక్షణ విభాగం ప్రాథమిక విచారణ జరిపింది. ఆ బాలికకు సంబంధించిన వివరాలను పాఠశాల నుంచి సేకరించారు. అయితే ఆమె వయస్సు 13 సంవత్సరాల 6 నెలలుగా గుర్తించారు. రిజిస్టర్ లో 2006 జూన్ 15 న పుట్టినట్లుంది. ఆమె ప్రస్తుతం 6 నెలల గర్భవతి కూడా, దీంతో చెన్నకేశవులు తల్లితండ్రులతో అధికారులు మాట్లాడారు. బాలిక 18 ఏళ్లు వచ్చే వరకు బాలల సదనంలో రక్షణ కల్పిస్తామని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు, అందుకు వారు నిరాకరించారు.చెన్న కేశవులు భార్య మైనర్ కావడం చేత వారి చేసింది తప్పు అని పోలీసులు హెచ్చరించారు.వాళ్ళ కోడలికి గట్టి భద్రత కూడా కలిపిస్తామన్నారు.వారి మృత దేహాల పై ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలనిహైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది.

జేసీ అనుచిత వ్యాఖ్యలు టీడీపీని ఇరకాటంలోకి నెట్టాయా?

అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకించుకుంటానంటూ మాజీ ఎంపి జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యల పై మండిపడిన పోలీసు అధికారుల సంఘం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జేసీ వెనక్కు తగ్గక పోవడంతో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో జేసీ వ్యాఖ్యల పై ఫిర్యాదు చేశారు. జేసీ పై ఐపీసీ సెక్షన్ 153ఎ, 506 కింద కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు దీని పై వివరణ ఇచ్చిన చేసి తాను పోలీస్ వ్యవస్థనంతటిని అనలేదని, కొందరు అధికారులను ఉద్దేశించి విమర్శించినట్లు తెలిపారు. మరో వైపు జేసీ వ్యాఖ్యల పై ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసు బూట్ల వంటి యుద్ధంలో ఆయుధాలని వాటిని మేము ముద్దు పెట్టుకుంటామన్నారు. పోలీస్ అమరవీరుల బూట్లను తుడిచి మాదవ్ వాటిని ముద్దాడారు. పోలీసులంటే హీరోలని వారిలో ఒకరైన నేను ఒక ట్రైల్ వేస్తే ఎంపీని అయ్యానన్నారు. పోలీసుల పై మీసం తిప్పితే మీరు పతనావస్థకు చేరుకుంటారని అన్నారు. గతంలో ఏం జరిగిందో దృషి పెట్టుకోవాలని  అప్పడే మరచిపోయావా అంటూ సెటైర్లు కూడా వేశారు. జేసీ వ్యాఖ్యలు తెలుగు దేశం పార్టీ సైతం ఇరకాటంలోకి నెట్టాయి. చంద్రబాబు ముందే జేసీ పోలీసుల పై అభ్యంతరకరమైన భాషను వాడుతూ చేసిన వ్యాఖ్యల చర్చనీయాంశమయ్యాయి.జేసీ వాడిన పాదజాలాన్ని తప్పుపడుతూ పలువురు నేతలసైతం మండి పడ్డారు. చంద్రబాబు ముందే వ్యాఖ్యానించిన ఈ వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పించాలంటూ పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఏ బాబుకు ఇప్పుడు పెద్ద తల నొప్పిగా మారింది.దీని పై బాబు ఏం చేయబోతున్నారన్నది వేచి చూడాలి.

 అమరావతి రాజధాని నుంచి ఎడ్యుకేషన్ హబ్ గా మారనుందా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని భవితవ్యాన్ని నిర్దేశించే జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికతో అమరావతికి కోత పడట్టుగానే కన్పిస్తోంది. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధి పై ప్రభుత్వానికి నిపుణుల కమిటీ తుది నివేదిక సమర్పించింది. ఇందులో కమిటీ సభ్యులు చెప్పిన అంశాలు అనేక ప్రశ్నల్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ అమరావతిలోనే ఉండాలని కమిటీ, శీతాకాల సమావేశాలు, వేసవి సమావేశాలంటూ వేర్వేరు ప్రతిపాదనలు చేసింది. శీతాకాలం సమావేశాలు అమరావతిలో, వేసవి కాల సమవేశాలు విశాఖలో నిర్వహించాలని సూచించింది. దీంతో అమరావతిలో ఉండే అసెంబ్లీ కూడా టెంపరరీనే అన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టు కర్నూలుకు తరలిపోనున్న నేపథ్యంలో అమరావతిలో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కమిటీ సూచించింది. రాజ్ భవన్, మంత్రుల నివాసాలు, అధికారుల క్వార్టర్స్ కూడా మంగళగిరిలోనే నిర్మించాలని నివేదికలో పేర్కొంది. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే విషయాన్ని చెప్పారు, అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చాలని కమిటీ సూచించిందన్నారు. కమిటీ నివేదిక పై ఈ నెల 27 న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. రాజధాని ఖాళీ అవడం ఖాయం అన్న విషయాన్ని మంత్రి బొత్స పరోక్షంగా హింట్ ఇచ్చారని 29 గ్రామాల ప్రజలు అంటుంటారు. అందుకే అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని ప్రకటించినట్టు సమాచారం. త్వరలో అమరావతి ప్రాంతం ఖాళీ చేయటం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కటి క్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిపోతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కథ ముగిసినట్టేనన్న వాదన ఆ ప్రాంత వాసుల నుంచి బలంగా వినిపిస్తుంది.అక్కడి రైతులు మాత్రం తమకు అన్యాయం చేయవద్దని, మరియు ఉద్యోగులు కూడా తము రాజధాని పరిసర ప్రాంతాలల్లో పిల్లల చదువులు, సొంత నివాసాలను ఏర్పటు చేసుకున్నామని,ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తున్నారుసీఎం జగన్ చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తున్నారు.  

జార్కండ్ లో కమలదళంకు నిరాశ ఎదురవ్వనుందా?

  నిన్న మొన్నటి దాకా బీజేపీ పార్టీ ఒక ఊపు ఊపేసిన విషయం అందరికి తెలిసిందే.కానీమొన్నటి మహారాష్ట్రా ఎన్నికల తరువాత  బీజేపీ కూడా ఒక అడుగు వెనక్కు వేస్తొంది.ఎన్నికల భయం బీజేపీకి కూడా చేరుకుంది.జార్కండ్ లో కమలదళానికి నిరాశ తప్పేలా లేదు, ఆ రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకున్న ఆ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చేలా ఉన్నాయి. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ సారి జార్ఖండ్ హస్తగతమవుతుంది అని చెప్పాయి. అక్కడ జేఎంఎం ఆర్జేడీలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశముందని తెలిపాయి. మొత్తం 81 స్థానాలకు 5 దశల్లో ఎన్నికలు జరగ్గా ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి ఒంటరిగా బరిలోకి దిగగా కాంగ్రెస్ పార్టీ, జేఎంఎం ఆర్జేడీలతో కలిసి కూటమిగా పోటీ చేసింది. జేఎంఎం 43 స్థానాల్లో, కాంగ్రెస్ 31, ఆర్జెడీ 7 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక తాజాగా పలు సంస్థలు విడుదల చేసిన సర్వే ఫలితాలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే బీజేపీ 22 నుంచి 32 సీట్లు సాధిస్తుందని, కాంగ్రెస్ కూటమికి 38 నుంచి 50 స్థానాలు వస్తాయని, ఎజీఎస్యుకు 3 నుంచి 5 స్థానాలు, ఇతరులు 6 నుంచి 11 సీట్లు గెలుస్తారని జోస్యం చెప్పింది. ఐఐఎస్సీ ఓటర్ ఏబీపీ మాత్రం బీజేపీకి 32, కాంగ్రెస్ కూటమికి 35 ఏజేఎస్ యూకు 5 ఇతరులకు 9 సీట్లు వస్తాయని చెప్పింది. టైమ్స్ నౌ సర్వే ఫలితాల ప్రకారం బీజేపీ 28, కాంగ్రెస్ కూటమి 44, జేబీఎం 3, ఇతరులు 6 సీట్లు గెలవనున్నారు. స్థానిక న్యూస్ ఛానల్ కసిష్ న్యూస్ నిర్వహించిన సర్వేలో బీజేపీ 25 నుంచి 30, కాంగ్రెస్ కూటమి 37 నుంచి 49, ఏజేఎస్యూ 2 నుంచి 4, ఇతరులు 2 నుంచి 4 సీట్లు సాధిస్తాయని తెలిపింది. జార్ఖండ్ లో అధికారం చేపట్టాలంటే మాజిక్ ఫిగర్ 42 సాధించాలి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎక్కువగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న హంగ్ ఏర్పడే అవకాశమూ లేకపోలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి అసలు ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే ఈ నెల 23 దాకా వేచి చూడాలి.

ఉన్నావ్ కేసులో న్యాయం జరిగినట్టేనా? ఎమ్మెల్యేకు ఉరిశిక్ష ఎందుకు పడలేదు?

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఉన్నావ్ రేప్‌ కేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు... జీవితఖైదును విధించింది. ఇక, బాధితురాలి కుటుంబానికి 25లక్షల పరిహారంతోపాటు కుటుంబానికి రక్షణ కల్పించాంటూ సంచలన తీర్పునిచ్చింది. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడంటూ పదహారేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో, 2017 జూన్ 4న కేసు నమోదు చేసుకున్న పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. అనంతరం కేసు అనేక మలుపులు తిరిగింది. అయితే, తనకు న్యాయం జరగడం లేదంటూ యూపీ సీఎం యోగి నివాసం ముందు బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఈ కేసు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. యూపీతోపాటు దేశవ్యాప్తంగా ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించడంతో సీబీఐకి అప్పగించారు. దాంతో, కుల్దీప్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ... అతనిపై కిడ్నాప్ అండ్ రేప్‌, అలాగే నేరపూరిత బెదిరింపుల కింద కేసులు నమోదుచేసి విచారణ చేపట్టింది. అయితే, బాధితురాలి కుటుంబంపై పలుమార్లు హత్యాయత్నం జరిగింది. 2019 జులై 28న బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మృత్యువాత పడ్డారు. అయితే, తనను అంతం చేసేందుకే ట్రక్కుతో ఢీకొట్టారని బాధితురాలు ఆరోపించింది. అప్పటి సీజేఐ గొగోయ్‌కి బాధితురాలు లేఖ రాసింది. దాంతో, ఆగస్ట్‌ ఒకటిన కేసును లక్నో నుంచి ఢిల్లీకి బదిలీ చేశారు. రోజువారీ విచారణ జరిపి 45రోజుల్లోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం జోక్యంతో రోజువారీ విచారణ చేపట్టిన కోర్టు.... కుల్దీప్‌ను దోషిగా నిర్ధారించి జీవితఖైదును విధించింది. కుల్దీప్‌కు జీవితఖైదు విధించడంతో కోర్టు హాల్లోనే భోరున విలపించాడు. ఉన్నావ్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కుల్దీప్ ‌సింగ్ సెంగార్‌.... ఇకచ తన జీవితం మొత్తాన్ని జైల్లోనే గడపనున్నాడు.

అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు... దొడ్డిదారిలో జీఎన్ రావు కమిటీ...

రాజధాని రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. 29 రాజధాని గ్రామాల్లో ధర్నాలు, రాస్తారోకో, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు, రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మరింత మండిపడుతున్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రకటనతో సగం చచ్చిపోయామని... ఇప్పుడు పెద్దిరెడ్డి కామెంట్స్ మరింత తీవ్ర క్షోభకు గురిచేశాయని భగ్గుమంటున్నారు. అయితే, అసెంబ్లీ వేదికగా ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ సీఎం జగన్ మాటలనే.... జీఎన్ రావు కమిటీ కూడా చెప్పడంతో రాజధాని రైతులు మరింత ఆగ్రహావేశాలకు గురయ్యారు. అమరావతిలో పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి బ్యానర్లు, కటౌట్లు చింపేసి ఆందోళనలు నిర్వహించారు. జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీఎన్ రావు కమిటీ అసలు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని... ప్రభుత్వం చెప్పినట్లుగా నివేదిక రాసిచ్చారని మండిపడ్డారు. అయితే, సచివాలయం-మందడం వై జంక్షన్ దగ్గర రదాహరిపై జేసీబీని అడ్డంగా పెట్టి ధర్నా చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో, జీఎన్ రావు కమిటీ సభ్యులను సచివాలయం నుంచి మరో మార్గంలో తీసుకెళ్లారు పోలీసులు. అదే సమయంలో, రైతులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను దాటేందుకు విఫలయత్నం చేశారు. అయితే, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలాఉంటే, అమరావతి రైతుల నిరసనకు జనసేన సంఘీభావం ప్రకటించింది. మందడం గ్రామంలో రైతులతోపాటు ధర్నాలో పాల్గొన్న జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు... రాజధాని ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. అధికారం ఉందని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటూ, రైతులను బాధపెట్టొద్దంటూ హెచ్చరించారు‌. రాజధాని కోసం భూములను త్యాగం చేస్తే, రైతులను చులకనగా మాట్లాడటం సరికాదన్నారు నాదెండ్ల మనోహర్. రాజధాని రైతులకు జనసేన అండగా ఉంటుందన్న నాగబాబు... ప్రతి జిల్లా కేంద్రాన్నీ హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయాలని సూచించారు.

రేసులోకి దూసుకొచ్చిన డీకే అరుణ... అన్నీ కలిసొస్తే పార్టీ పగ్గాలు ఆమెకే...

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలిగా, మంత్రిగా ఒక వెలుగు వెలిగిన డీకే అరుణ... బీజేపీలో చేరిన తర్వాత సైలెంట్ అయిపోయారు. అయితే, బీజేపీలో చేరినప్పుడు ఏదో ఒక పదవి ఇస్తామంటూ హామీ ఇచ్చారని అంటారు. కానీ, రోజులు గడిచిపోతున్నా ...ఏ పదవి ఇవ్వకపోవడంతో మళ్లీ పాత గూటికి వెళ్లాలని ఆలోచన కూడా చేశారు. అయితే, చాలా రోజులుగా మౌనం దాల్చిన డీకే అరుణకు సడన్ గా ఏమైందో ఏమో తెలియదు గానీ ఒక్కసారిగా సూపర్ యాక్టివ్ అయ్యారు. మహిళా సమస్యలపై పోరుబాట పట్టారు. ముఖ్యంగా దిశ ఘటన తర్వాత మహిళల కోసం ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన సమత కుటుంబాన్ని కలిసి ఓదార్చారు.  అయితే, దిశ, సమత, మానస హత్యాచారాలకు మద్యమే ప్రధాన కారణమన్న ఆరోపణలు రావడంతో మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్యానికి వ్యతిరేకంగా రెండ్రోజులపాటు నిరాహారదీక్ష చేపట్టి వార్తల్లో నిలిచారు. అంతేకాదు, మహిళలపై పెరుగుతున్న నేరాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే, మొన్నటివరకు మౌనంగా ఉన్న డీకే అరుణ.... సడన్ గా యాక్టివ్ కావడానికి కారణాలేంటన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా ఆందోళనలు చేపట్టడం... మీడియాలో ఎక్కువగా కనిపించడం వెనుక మతలబు ఏంటని మాట్లాడుకుంటున్నారు.  అయితే, డీకే అరుణ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై కన్నేసిందనే మాట వినిపిస్తోంది. బీసీ నినాదంతో మళ్లీ లక్ష్మణ్ నే తిరిగి అధ్యక్షుడిగా కొనసాగిస్తారని ప్రచారం జరుగుతున్నా... ఒకవేళ మార్చాలనుకుంటే మాత్రం తనకే ఇవ్వాలని డీకే అరుణ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అందరినీ దృష్టిని తనవైపు తిప్పుకునేందుకు, అలాగే ఢిల్లీ పెద్దల దృష్టిలో పడేందుకే సడన్ గా పోరుబాట పట్టి హడావిడి చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే, రేసులో లక్ష్మణే ముందు ఉన్నప్పటికీ, ఆ తర్వాత డీకే అరుణ పేరే ప్రధానంగా వినిపిస్తోందని అంటున్నారు. అంతేకాదు, ఒకవేళ లక్ష్మణ్ ను గానీ కొనసాగించకపోతే, తెలంగాన బీజేపీ పగ్గాలు డీకే అరుణ చేతికే దక్కుతాయనే చర్చ నడుస్తోంది. మహిళా నాయకురాలు కావడం... అదే సమయంలో బలమైన సామాజికవర్గానికి చెందడం.... అలాగే సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండటంతో... టీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్లే స్వభావముండటం కలిసి వస్తాయని డీకే అరుణ భావిస్తున్నారు. మరి, డీకే అరుణ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో కాలమే చెప్పాలి.

జగన్ స్టేట్‌మెంటే యథాతథంగా రాజధాని కమిటీ నివేదికలో...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించే జీఎస్‌రావు కమిటీ తుది నివేదికను సమర్పించింది. అయితే, అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఏదైతే చెప్పారో .... సేమ్ టు సేమ్... దాన్నే నిపుణుల కమిటీ కూడా సిఫార్సు చేసింది. అయితే, సీఎం జగన్.... సింపుల్ స్టేట్ మెంట్ ఇస్తే.... నిపుణుల కమిటీ మాత్రం డిటైల్ట్‌గా ప్రకటన చేసింది. అంటే... విశాఖలో ఏమేమీ ఉంటాయో... అమరావతిలో ఏముంటాయో... అలాగే, కర్నూలులో ఏమేమీ ఏర్పాటు చేయాలో క్లారిటీగా చెప్పింది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పినట్లుగానే... కర్నూలులో హైకోర్టు... అనుబంధ కోర్టులు ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. సీఎం స్టేట్‌మెంట్‌కు అదనంగా కర్నూలులో అసెంబ్లీ వింటర్ సెషన్స్‌ను నిర్వహించాలని సూచించింది. అదేవిధంగా అమరావతిలో.... అసెంబ్లీ, రాజ్‌భవన్‌తోపాటు మినిస్టర్స్ క్వార్టర్స్‌, వివిధ శాఖల కార్యాలయాలు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ఇక, విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్ కార్యాలయం, హైకోర్టు బెంచ్ ఏర్పాటుతోపాటు అసెంబ్లీ సమ్మర్ సెషన్స్‌ నిర్వహించాలని సూచించింది.   రాజధానిపై గతంలో ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టును కూడా పరిశీలించామన్న జీఎస్‌రావు... ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని... మరికొన్ని వెనుకబడి ఉన్నాయన్నారు. పట్టణీకరణ అంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమై ఉందని... అలాగే, దక్షిణ కోస్తా, రాయలసీమలో పట్టణీకరణ చాలా తక్కువగా ఉందని... అందుకే తాము అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరి అంటూ సూచించామన్నారు. ముఖ్యంగా రాయలసీమలో నాలుగు జిల్లాలూ వెనుకబడే ఉన్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీని నాలుగు ప్రాంతాలుగా విభజించి ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. శ్రీకాకుళం, విజయనగరాన్ని ఒక మండలిగా.... కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు రెండో మండలిగా... ప్రకాశం, నెల్లూరును మూడో మండలిగా.... రాయలసీమను నాలుగో మండలిగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని చెప్పినట్లు కమిటీ సభ‌్యులు తెలిపారు. అలాగే, ఎలాంటి ముప్పులేని ప్రాంతాల్లోనే అభివృద్ధి జరగాలని సూచించినట్లు జీఎస్‌రావు తెలిపారు. మొత్తంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన విధానాలను ప్రభుత్వానికి సిఫార్సు చేశామని అన్నారు. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై నిపుణుల కమిటీ తుది నివేదిక సమర్పించడంతో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. డిసెంబర్ 27న సమావేశంకానున్న మంత్రివర్గం.... జీఎస్‌రావు కమిటీ నివేదికపై చర్చించనుంది. అయితే, అసెంబ్లీ వేదికగా, ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమోనంటూ సీఎం జగన్ స్టేట్‌‌మెంట్‌కు దగ్గరగా... నిపుణుల కమిటీ తుది నివేదిక ఉండటంతో... ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

జగన్ మాటే జీఎన్‌రావు కమిటీ మాట!!

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జీఎన్‌రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ తన తుది నివేదికను ఈరోజు సీఎం వైఎస్ జగన్ కు అందజేసింది. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై కమిటీ అధ్యయనం చేసి తుది నివేదిక సమర్పించింది. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి జిల్లాలోనూ పర్యటించి ప్రజల అభిప్రాయాలు తీసుకున్నామని, వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేశామని కమిటీ పేర్కొంది. జీఎన్‌రావు మాట్లాడుతూ.. గతంలో రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ రిపోర్టునూ పరిశీలించామని చెప్పారు. ఏపీలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, మరికొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని వెల్లడించారు. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పట్టణీకరణంతా మధ్య, ఉత్తర కోస్తాలోనే కేంద్రీకృతమైంది. దక్షిణకోస్తా, సీమ ప్రాంతాల్లో పట్టణీకరణ తక్కువ. అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరి అని సూచించామని తెలిపారు. పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని 4 రీజియన్లుగా విభజించాలని సూచించారు. ఉత్తర, మధ్య, దక్షిణ కోస్త, రాయలసీమ రీజియన్లుగా విభజించాలని తెలిపారు. వరదముంపులేని ప్రాంతంలో రాజధాని ఉండాలని సూచించారు. విశాఖలో సీఎం క్యాంపు ఆఫీస్, సెక్రటేరియట్, వేసవి అసెంబ్లీ, హైకోర్టు బెంచ్ ఉండాలని పేర్కొన్నారు.  శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఉండాలని.. అమరావతిలో అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు బెంచ్ ఉండాలని కమిటీ సూచించింది.

కర్నూల్ కి హైకోర్టు.. లాయర్ల సంబరాలు!!

హైకోర్టు భవనాలు శివారు ప్రాంతంలో నిర్మించాలనుకుంటే కర్నూలకు సమీపంలోని ఓర్వకల్లు మండలంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి అని న్యాయవాదులు తెలియజేశారు. ఇప్పటికే ఓర్వకల్లులో విమానాశ్రయం, ఉర్దూ యూనివర్సిటీ, డీఆర్డీవో, సోలార్ పార్కు వంటి పెద్ద సంస్థలే కాక వేల ఎకరాల్లో ప్రభుత్వ భూమి అందుబాటులో కూడా ఉన్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని హై కోర్టు నిర్మాణానికి ఎంత భూమినైనా కేటాయించవచ్చు. కర్నూలుకు పది కిలోమీటర్ల దూరములో హైదరాబాద్-బెంగుళూరు 44 వ జాతీయ రహదారి ఆనుకుని కొట్టం ఇంజనీరింగ్ కాలేజీ భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ పరిసరాలల్లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజ్ మూతపడింది,దానిలో ఒక ఐటీ కంపెనీ కాలేజీల్లోనే నిర్వహిస్తున్నారు. హై కోర్టు నిర్వహణకు అవసరమైన భవనాలు కూడా ఆ ప్రాంతంలో. స్వల్ప మార్పులతో కోర్టు హాల్స్ ఏర్పాటు చేయవచ్చు. ఈ భవన సముదాయాన్ని గతంలో పరిశీలించారని ప్రచారముంది. నలభై వ జాతీయ రహదారి పై మూత పడిన సఫా ఇంజనీరింగ్ కాలేజీ భవన సముదాయం కూడా అందుబాటులో ఉంది. కర్నూలులో హై కోర్టు ఏర్పాటుకు అన్ని వసతులు ఉన్నాయంటున్నారు న్యాయవాదులు. వీలైనంత త్వరగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.  రాష్ట్ర విభజన అంశం తెరపైకి రాగానే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాజధాని లేదా హై కోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు రాజధాని హై కోర్టు ఒకే దగ్గర ఉండాలంటూ అమరావతిలోనే రెండింటిని ఏర్పాటు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మార్పు వ్యాఖ్యల తర్వాత న్యాయవాదులు హై కోర్టు కోసం రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టారు. కర్నూల్, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో నిరంతరం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలులో 97 రోజులుగా విధులు బహిష్కరించి న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. న్యాయవాదులకు మద్దతుగా రాయలసీమలో రాజధాని హై కోర్టు ఏర్పాటు చేయాలంటూ జిల్లా లోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. చివరికి అమరావతి అసెంబ్లీను సైతం ముట్టడించారు. ఈ సమయంలోనే అసెంబ్లీలో రాజధానిపై చర్చ సందర్భంగా కర్నూలులో హై కోర్టు ఏర్పాటు చేయొచ్చని సీఎం జగన్ పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారు. దీంతో రాయలసీమ జిల్లాల్లో న్యాయవాదులు సంబురాలు చేసుకుంటున్నారు. దశాబ్దాల కల నెరవేరిందని రాయలసీమకు న్యాయం చేశారంటూ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజధాని ఎక్కడ ఉండబోతుందని అటు రైతులు, ఉద్యోగులు, రియల్ ఎస్టేట్, న్యాయవాదుల సైతం అయోమయంతో ఎదురు చూస్తున్నారు. మరి  ఈ ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.

హైదరాబాద్ కోసం కేటీఆర్ కొత్త ఆలోచనలు... ట్రాఫిక్ నియంత్రణనే ప్రధాన లక్ష్యం

మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాక ట్రాఫిక్ సమస్యల పై కూడా దృష్టి పెడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రధాన రోడ్ల పైన వాహనాల భారం తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. జీహెచ్ఎంసి సాధ్యమైనన్ని ఎక్కువ స్లిప్ రోడ్లను నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్ లో మేయర్ బొంతు రామ్మోహన్ కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రేటర్ లో ఫస్ట్ ఫేజ్ లో 55 స్లిప్ రోడ్లను గుర్తించామని వాటి నిర్మాణానికి వేగంగా ప్రణాళికలు చేస్తున్నామని అధికారులు మంత్రికి తెలియజేశారు. ఇప్పటికే 40 రోడ్లకు ఆర్టీసీ సిద్ధమైందన్నారు, ఇందులో 20 రోడ్లలో కేవలం 90 ఆస్తుల సేకరణ పూర్తి చేస్తే స్లిప్ ల నిర్మాణం మొదటి దశ ప్రారంభించేందుకు వీలవుతుందన్నారు. నగరం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నగర రోడ్ల పై వాహనాల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోందని దీన్ని ఎదుర్కొని పౌరులు సులభంగా తమ గమ్యం చేరేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్సు ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు. దీంతో పాటు అభివృద్ధి ద్వారా కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రోడ్ల వెంబడి పాదచారులు నడిచేందుకు వీలుగా పెద్ద ఎత్తున ఫుట్ పాత్ ల నిర్మాణం కూడా చేపడుతున్నామన్నారు. ఇప్పటికే ప్రతి జోన్ లో కనీసం 10 కిలోమీటర్ల చొప్పున జనసమ్మర్దం ఉండే రోడ్ల వెంబడి ఫుట్ పాత్ ల నిర్మాణం చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. జీహెచ్ఎంసీ బస్ బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను గుర్తించామని ఆయన అన్నారు. ఈ ప్రాంతాల్లో బస్ బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సిటీలో ఇప్పటికే బస్ బేల నిర్మాణం కోసం పలు ప్రాంతాలను జీహెచ్ఎంసీ గుర్తించిన అంశాన్ని అధికారులకు మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఆ ప్రాంతాల్లో బస్ బేల నిర్మాణం మరింత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చేపడుతున్న పనుల వివరాలను కేటీఆర్ ఆరా తీశారు. హైదరాబాద్ లోనే పవర్ కారిడార్ లలో రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఒక నివేదిక సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. హెచ్ఎండీఏ చేపడుతున్న రోడ్ల నిర్మాణంతో జీహెచ్ ఎంసీ చేపడుతున్న రోడ్ల నిర్మాణం ప్రణాళికలను సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు.మంత్రి కేటీఆర్ అభివృద్ధి కొరకై చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేర స్ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.

ఏపీ ఆర్ధిక పరిస్థితిని ఆర్ధిక సంఘం దృష్టికి తీసుకొచ్చిన జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 15 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్ కె సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తగిన రీతిలో సహాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల రాజధానిని కోల్పోయిన రాష్ట్రం ఏపీనే అన్న సీఎం జగన్ అన్ని రంగాల్లో కోలుకోవాలంటే ఉదార రీతిలో సహాయం చేయాలని కోరారు. విభజన హామీల అమలుకు కేంద్రంలో యంత్రాంగం ఉండేలా చూడాలని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులపై అధికారులు నివేదికలిచ్చారు. విభజన వల్ల రాజధానిని కోల్పోవడంతో పాటు పారిశ్రామిక సేవా రంగాల వాటా బాగా తగ్గిపోయాయని తలసరి ఆదాయంలో చూస్తే కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ తర్వాత ఏపీనే వెనకబడి ఉంది. షెడ్యూల్ 9 లో ఉన్న సంస్ధల ఆస్తుల విభజన ఇంకా జరగనేలేదు, షెడ్యూల్ 10 లో 152 ఆస్తులు ఉంటే తెలంగాణకు 107 కాగా ఏపీకి 15 ను మాత్రమే వచ్చాయి. ఇంకా 20 ఆస్తులు తెలంగాణ ఆంధ్రా చేతుల్లో ఉమ్మడిగా ఉన్నాయి. ఏపీ భవన్ విభజన కూడా ఇంకా జరగలేదు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇక్రిశాట్ లాంటి ప్రఖ్యాత సంస్థలన్నీ హైదరాబాద్ లోనే ఉండి పోయాయి. బీహెచ్ఇఎల్, ఈసీఐఎల్, హెచ్ఏఎల్ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణలో ఉండిపోయాయి. దీని వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గు ముఖం పట్టాయని ఆయన వివరించారు. రాష్ట్రాన్ని పునః నిర్మించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సిఫారసు చేయాలని సీఎం కోరారు. రెవిన్యూలోటు భర్తీ కింద 19,969.26 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 3,979 కోట్లు మాత్రమే వచ్చాయి. వెనకబడిన జిల్లాలకు 24,350 కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటి వరకు 1,050 కోట్లు మాత్రమే వచ్చాయని సీఎం జగన్ ఆర్ధిక సంఘం దృష్టికి తీసుకువెళ్లారు.

36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం, పోలీసులపై దిశా నిందితుల ఎన్కౌంటర్ ఘటన తరువాత మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశ కుటుంబానికి న్యాయం చేసారని అందరూ జై హో పోలీస్, జై హో సీఎం అంటూ జై జైలు కొట్టారు. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. హైకోర్టు చొరవతో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడుతో దూసుకెళ్తొంది. అత్యాచారాలు, చిన్నారుల పై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణ కోసం పెద్ద ఎత్తున ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1 కాదు 2 కాదు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవటమేకాక ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో రెండేసి చొప్పున మిగతా జిల్లాల్లో ఒక్కో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 365 రోజులు పని చేస్తాయి. కింది కోర్టు పై కోర్టులు అన్న ఆలోచనే లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే విచారణ జరిపి అక్కడే శిక్షలు ఖరారు చేయనున్నట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూలై 25 న సుమోటో విచారణ సందర్భంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీం ఆదేశాలతో ఆగస్టు 5 న అన్ని రాష్ట్రాల హైకోర్టులకు కేంద్ర న్యాయ శాఖ లేఖలు రాసింది. దాని ఆధారంగా ఈ నెల 5 న తెలంగాణ హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ అందులో సుప్రీం కోర్టు ఆదేశాలను వివరించింది. దీంతో తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తానికి వేగంగా విచారణ జరగాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ లను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని పై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

గులాబీ నేతల మధ్య కోల్డ్ వార్.. కారణం అదేనా?

తెలంగాణాలో కొందరు టీఆర్ఎస్ నేతల జోరు తగ్గినట్లు కనిపిస్తొంది. చిన్న విషయానికే మీడియా ముందు హల్ చల్ చేసే నాయకులు సైతం కనుమరుగైపోయారు. సీఎం కొదరు నేతలను పక్కన పెట్టారా లేక వారే దూరంగా ఉన్నారా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువైన వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అడ్డాగా మారింది. టిడిపి, కాంగ్రెస్ కు కంచుకోట అయిన వరంగల్ ను తమ ఖాతాల్లో వేసుకున్నారు టీఆర్ఎస్ లీడర్లు. అయితే ఉద్యమ కాలం నుంచి కొనసాగుతూ కీలకమైన నేతలుగా ఉన్న చాలా మంది నేతలు ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక కనబడకుండా పోతున్నారనే విమర్శలు కూడా తలెత్తాయి. వివిధ పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన నేతల కారణంగా పాతతరం వాళ్లు వెనక్కి నెట్టబడుతున్నారన్న భావన టీఆర్ఎస్ నేతల్లో ఉంది.  మొన్నటి సాధారణ ఎన్నికల ముందు కూడా జిల్లా గులాబీ వర్గంలో ఇలాంటి అసంతృప్తులు బయట పడ్డాయి. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉమ్మడి జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకరరావు ఒక్కరికే క్యాబినెట్ లో అవకాశం దక్కింది. జిల్లాలో ఆయనే అన్నీ తానై వ్యవహరించారు. ఆరు జిల్లాల పరిధిలో పార్టీ పరంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రెండో దఫా మంత్రి వర్గ విస్తరణలో గిరిజన ప్రాంతమైన మానుకోట నుంచి సత్యవతి రాథోడ్ కు అవకాశం దక్కింది. వరంగల్ సిటీ నుంచి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కు ప్రభుత్వ చీఫ్ విప్ గా అవకాశం వచ్చింది. వరంగల్ అర్బన్ జిల్లాలకు చెందిన ఈటెల రాజేందర్ కూడా మంత్రిగా కొనసాగుతున్నారు. వీరి మధ్య కూడా ఆధిపత్య పోరు కొనసాగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.  2014 తర్వాత పార్టీలోకి వచ్చి కీలకంగా మారిన నేతలు వారితో వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలిస్తూ పాత వారిని నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన నేతల్లో ఉంది. ఉద్యమంలో పనిచేసి నష్టపోయామని అసంతృప్తి పాతతరం నేతల్లో కనిపిస్తోంది. మొన్నటి వరకు జిల్లాలో యాక్టివ్ రోల్ పోషించిన తక్కళ్లపల్లి రవీందర్ రావు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. పాలకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్, రెండుమూడుసార్లు ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న హైదరాబాదుకే పరిమితమయ్యారు తక్కళ్లపల్లి. మరోవైపు మొదటి నుంచి ఉన్న వాళ్లకు సరైన ప్రాధాన్యం కల్పించాలని ఆ పార్టీ సీనియర్ నేత రాజయ్య మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సమక్షంలో చెప్పడం చర్చకు దారి తీసింది. పార్టీ నేతల్లో అసంతృప్తి ఇప్పటికిప్పుడు బయటపడకుండా పాత కొత్త తరం నేతల మధ్య కోల్డ్ వార్ మాత్రం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది.ఈ నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ని తెలంగాణా సీఎం ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాలి.  

పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రాణాలను కోల్పోతున్న ఆందోళనకారులు

పౌరసత్వ సవరణ బిల్లు పై పోలీసులకి, వ్యతిరేకిస్తున్న నేతల మధ్య అగ్గి రాజేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. బీజేపీ పాలిత కర్ణాటకలోని మంగళూరులో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులకు బుల్లెట్ గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్ ముట్టడించటం సహా పలు పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టినందునే కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఈ నెల 22 అర్ధరాత్రి వరకు మంగళూరులో కర్ఫ్యూ విధించి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పొరుగు రాష్ట్రం కేరళకు చెందిన ఆందోళనకారులే హింసకు కారణమని కర్ణాటక హోంశాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులోనూ నిరసనల ఉధృతరూపం దాల్చాయి. బెంగళూరులోని టౌన్ హాల్ వద్ద అరవై వేలకు పైగా ఆందోళనకారులు రహదారులను స్తంభింపజేశారు. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ వామపక్ష నేతలతో సహా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు పోలీసులు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను అదుపు లోకి తీసుకోవడం దారుణమని రామచంద్ర గుహ ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ హాల్ వద్ద నిరసనకారులు ఎంతకీ కదలకపోవడంతో బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ జాతీయ గీతం ఆలపించారు. గీతం ఆలపించిన తర్వాత ఆందోళనకారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. భాజపా అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. లఖ్నోలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రాళ్లు రువ్వి పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. సంభల్ జిల్లా లోనూ ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి ఓ బస్సుకు నిప్పు పెట్టారు. రేపు మధ్యాహ్నం వరకు లఖ్నోలో ఇంటర్నెట్, ఎస్సెమ్మెస్ సేవలు నిలిపివేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్ అహ్మదాబాద్ లోని షాహి ఆలంలో నిరసనకారులు భారీ ప్రదర్శన చేపట్టారు. అనుమతి లేకుండా నిరసన చేపట్టడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిరసనకారులు రాళ్లు రువ్విన ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు. అహ్మదాబాద్ లోని మిర్జాపూర్ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో ఇరవై మంది ఆందోళనకారులు గాయపడ్డారు.  ముంబైలో కాంగ్రెస్, ఎన్సీపీ సహా వివిధ పార్టీలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆగస్ట్ క్రాంతి మైదానంలో శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. వీటిలో పలు రాజకీయ పార్టీల కార్యకర్తలూ బాలీవుడ్ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. శివసేన ప్రదర్శనకు దూరంగా ఉన్నప్పటికీ పౌరసత్వం కల్పించిన హిందూ శరణార్థులను కేంద్రం ఎక్కడ ఎలా ఉంచాలని అనుకుంటోందని ప్రశ్నించింది. నాసిక్ లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీ జరిగింది. మధ్యప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఆందోళనలు కూడా ఎగిసిపడ్డాయి. మధ్యప్రదేశ్ లోని 43 జిల్లాలలో 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ లోనూ ఆందోళనకారులు కదం తొక్కారు. ఎర్రకోట, పాత ఢిల్లీ, జంతర్ మంతర్ వద్ద నిరసనలు హోరెత్తాయి. ఆందోళనకు దూరంగా ఉండాలన్న సూచనలను విస్మరించి ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, ఆచార్యులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఆందోళనల వల్ల 20 మెట్రో స్టేషన్ లు మూసి వేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఓ వైపు ఉచిత వైఫై సేవలను ప్రారంభించగా మరో వైపు ఇంటర్నెట్ సేవలను, ఎస్సెమ్మెస్ లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆందోళనలతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఢిల్లీలో గురుగ్రామ్ మార్గంలో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సిబ్బంది సకాలంలో చేరుకోలేక 19 ఇండిగో విమాన సర్వీసులు రద్దయ్యాయి.

జనవరి 1 నుండి టీఎస్ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అభివృద్ధి కోసం సంస్కరణల బాటపడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా జనవరి 1 నుంచి సరుకు రవాణాకు సిద్ధమవుతోంది. ఈ మేరకు డిపో గూడ్స్ ట్రాన్స్ పోర్టు సర్వీసులు అందుబాటులోకి తీసుకురానుంది. మొదటి విడతగా 1209 మంది సిబ్బందిని.. 822 ఆర్టీసీ డిజీటీ సర్వీసులను ఆర్టీసీ తెస్తోంది. ఒక్కో డిపోకు 2 డీజీటీ వెహికల్స్ ను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. హైదరాబాదులోని 29 డిపోలో సుమారు 60 టీజీటీలు అందుబాటులోకి రానున్నాయి. మిగతా వాటిని జిల్లాలోని డిపోలకు పంపిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్ 1 న ఆర్టీసీ కార్మికులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో తీసుకున్న నిర్ణయాల మేరకు టీఆర్ఎస్ ఆర్టీసీ యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా సరుకు రవాణా విభాగంలోకి ప్రవేశించాలని నిర్ణయించింది. అందుకు ముహూర్తం విధివిధానాలను ఖరారు చేసింది. జనవరి 1 నుంచి సరుకు రవాణా రంగంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలిపింది, ఇందు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధిక కిలోమీటర్లు తిరిగి కండిషన్ లో ఉన్న వెయ్యి బస్సులను సరుకు రవాణాకు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. వాటిని బస్ బాడీ బిల్డింగ్ లకు పంపిస్తున్నారు, బస్సుల రద్దుతో అదనంగా ఉండే ఉద్యోగులను కార్గో సర్వీసులను వినియోగించుకోనున్నారు.  ఆర్టీసీ సంస్కరణలపై ఉన్నతాధికారులతో రవాణశాఖామంత్రి పువ్వాడ అజయ్ సమీక్షించారు, ఆర్టీసీ అభివృద్దిపై చర్చించారు. సరుకు రవాణాకు వసూలు చేసే చార్జీలపై వేర్వేరు డిపోల పరిధిలో అధ్యయనం చేసి ఆయా డిపో మేనేజర్ లు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు అధికారులు తెలిపారు. సరుకు రవాణా బస్సులకు ఎర్ర రంగు వేయాలని నిర్ణయించారు. సరుకు రవాణా కోసం పని చేసే డ్రైవర్ లు సిబ్బందికి ప్రత్యేక డ్రస్ కోడ్ అమలు చేయాలని నిర్ణయించారు. ప్రైవేట్ ఆపరేటర్ లకు దీటుగా పని చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. తమకున్న విస్తృతమైన నెట్ వర్క్ ఆధారంగా సరుకు రవాణా రంగంలో విజయం సాధిస్తామని ఆర్టీసీ అధికారులు ధీమా వ్యక్తం చేశారు.  టీఆర్ఎస్ ఆర్టీసీలో కార్గో సేవలను దశల వారీగా విస్తరించనున్నారు. మొదటి దశలో వివిధ ప్రాంతాలు జిల్లాలో ప్రైవేటు వ్యక్తుల నుంచి బుకింగ్ స్వీకరిస్తారు, తరువాత ప్రభుత్వానికి సంబంధించి వస్తు రవాణా చేపట్టేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వ శాఖల్లో మొదట వ్యవసాయ పౌరసరఫరాల శాఖ రవాణాపై దృష్టి సారించనున్నారు. పీడీఎస్ బియ్యం, వ్యవసాయోత్పత్తులు తదితరాలను ఆర్టీసీ కార్గో ద్వారా తరలిస్తారు. తదుపరి విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ శాఖలకు విస్తరించాలని అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ప్రైవేట్ కార్గో సర్వీసులకు ధీటుగా ఆర్టీసీ సర్వీసులు నిర్వహిస్తామని అధికారులు విశ్వాసంగా చెప్తున్నారు. మరోవైపు ప్రజాప్రతి నిధులంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని లేఖలు రాసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఈ నెల 24 న గ్రేటర్ పరిధిలోని అన్ని డిపోల ఉద్యోగులతో వనభోజనాలు చేయాలని నిర్ణయించారు.

ఇవ్వాలా వద్దా అన్న ధర్మసందేహంలో ఆలయ అధికారులు...

శారదా పీఠం వారు పంపిన ప్రతిపాదనకు కొందరు ఆలయ అధికారులు ఏమి చేయాలా అన్న అయోమయంలో పడిపోయారు. జనవరి 3 వ తేదీ నుంచి ఫిబ్రవరి 3 వ తేదీ వరకు విశాఖ శారదా పీఠంలో హిందూ ధర్మ పరిరక్షణ జాతీయ మహాసభలు నిర్వహించాలని స్వరూపానందేంద్ర నిర్ణయించారు. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమ నిర్వహణకు సాయం చెయ్యాలి అంటూ గత నెల 11 న విశాఖ శారదా పీఠం నుంచి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు లేఖను పంపారు. మహాసభల నిర్వహణకు తగిన ఆర్థిక సహాయం అందించాలని శారదా పీఠం వారిని కోరింది. ఈ లేఖను పరిశీలించి పరిగణన లోకి తీసుకోవాలని మంత్రి దేవాదాయ శాఖ కమిషనర్ కు సిఫారసు చేశారు.కమిషనర్ ఇదే ప్రతిపాదనను శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం దేవస్థానాల ఈవోలుకు అందజేశారు.  స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సనాతన హిందూ ధర్మ పరిరక్షణ జాతీయ మహాసభల నిర్వహణ కోసం ఆర్థిక సహాయం కోరారు. హిందూ సనాతన ధర్మ ప్రచారం కోసం ఉద్దేశించిన కార్యక్రమానికి నిధులు ఇచ్చేందుకు అందరూ సిద్ధంగా ఉంటే, పరిగణనలోకి తీసుకోవటానికి తగిన ప్రతిపాదనలు పంపించండని దేవాదాయ శాఖ కమిషనర్ 5 ప్రధాన ఆలయాల ఈవోలకు లేఖ రాశారు. కమిషనర్ లేఖ అందుకున్నఆయా దేవస్థానాల అధికారులు ఇప్పుడు అయోమయంలో పడ్డారు. ఎందుకంటే భక్తులిచ్చే కానుకల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా ఆలయాల అవసరాలకు వాడుకోవాలి, ఎలాంటి ధార్మిక కార్యక్రమాలనైనా దేవస్థానమే నిర్వహించాలి. కానీ తమ ఆలయానికి దేవాదాయ శాఖకు సంబంధం లేకుండా ఒక పీఠం నిర్వహించే సొంత కార్యక్రమానికి దేవుడు డబ్బులు ఇవ్వొచ్చా అనే సందేహం ఆ ఆలయ అధికారులల్లో మొదలైంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం మహాసభలు నిర్వహించడం మంచిదే, కానీ అందుకు ఇతర దేవస్థానాల సొమ్మును పంపాలి అనడం శాస్త్రోక్తంగా ధర్మబద్ధంగా లేదని దేవాదాయ శాఖ అధికారులల్లో ఒకరు అభిప్రాయపడ్డారు. స్వయంగా సర్కారు పెద్దలకు దగ్గరైన స్వామి కావడం పరిగణనలోకి తీసుకొని పరిశీలించాలని దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాయడంతో ఆయా దేవస్థానాల అధికారులు దీని పై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం.మరి ఆలయ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.