ఇదెక్కడి చోద్యం.. ముగ్గులు వేసిన మహిళలు అరెస్ట్!!

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో వినూత్నమైన నిరసన తెలిపారు. కొందరు మహిళలు బీసెంట్ నగర్ లోని 17వ క్రాస్ స్ట్రీట్ లో ఇళ్ల ముందు ముగ్గురు ముగ్గులు వేసి నో సీఏఏ నో ఎన్ఆర్సీ అంటూ రాశారు. చాలా ఇళ్ల ముందు ఇలా కనిపించడంతో విషయం తెలుసుకొని ఆ ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు. ఈ నిరసనకు కారణమైన వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా అందుకు కొందరు ప్రతిఘటించారు. పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలియజేస్తుంటే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. చివరకు నిరసనకారులను బలవంతంగా వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు అధికారులు.ఈ ఘటనలో నలుగురు మహిళలతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల తీరును డిఎంకె చీఫ్ స్టాలిన్ తప్పుబట్టారు. సీఏఏను వ్యతిరేకిస్తూ ముగ్గులు వేస్తే కేసులు పెడతారా అని ఫేస్ బుక్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఈ ముగ్గుల నిరసన డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆ పార్టీ నేత కనిమొళి ఇళ్లకు కూడా పాకింది. నిరసనకారులు వారి వారి ఇళ్ల ముందు కూడా సీఐఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ముగ్గులు వేశారు. మాజీ సీఎం కరుణా నిధి ఇంటి ముందు సైతం ఇదే తరహాలో నిరసనలకు కూడా దిగారు.

టీఆర్ఎస్ మంత్రులకు సవాల్ గా మారిన మునిసిపల్ ఎన్నికలు!!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ దశాబ్ద కాలంగా తన సత్తా చాటుతోంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీలున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో మంత్రులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. గత ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరోసారి మేయర్ పీఠం దక్కించుకునే బాధ్యత జిల్లా మంత్రులైన ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ పై పడింది. కరీంనగర్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్ నియోజక వర్గ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో అభ్యర్తులను గెలిపించుకునే బాధ్యతను మంత్రి ఈటెల రాజేందర్ భుజానికెత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నందున క్లీన్ స్వీపే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. జమ్మికుంటలో 30, హుజూరాబాద్ లోని 30 వార్డుల్లో గులాబీ జెండా ఎగుర వేసేందుకు ప్రజాదరణ ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో అన్ని స్థానాలూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకునే విధంగా మంత్రి కేటీఆర్ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. గత 2 నెలల నుంచే ఇందు కోసం కసరత్తు చేస్తున్నారు. గతంలో మాదిరి గానే ఈ సారి కూడా సిరిసిల్ల చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు. 33 కు 33 వార్డుల్లో జయకేతనం ఎగురవేసేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.  అటు కొత్తగా ఏర్పడ్డ ధర్మపురి మునిసిపాలిటీల్లో 15 కు 15 వార్డుల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో కొప్పుల పని చేస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని మునిసిపాలిటీల్లో అభ్యర్థులను గెలిపించుకోవడం మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కత్తిమీద సవాలనే చెప్పుకోవాలి. ధర్మపురి, జగిత్యాల, రాయికల్, పెద్దపల్లి, కోరుట్ల, మెట్ పల్లి, సుల్తానాబాద్ మునిసిపాలిటీలతో పాటు రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ పైనే ఉంది. రామగుండంలో ఈ సారి బీజేపీ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఇటీవల బీజేపీలో చేరిన సోమారపు సత్యనారాయణ బిజెపి అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టడంతో కొప్పుల ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పోటీని తట్టుకుని టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం మంత్రులకు పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు.  

టీడీపీకి షాకిచ్చిన మరో ఎమ్మెల్యే!!

టీడీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి.. ఆయన సోమవారం సీఎం జగన్‌ను కలిశారు. అమరావతి నుంచి రాజధాని తరలించడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తోంది. ఇలాంటి పరిస్థితిల్లో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడుతుండటం గమనార్హం. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వంశీ కొద్దిరోజులు క్రితం సీఎం జగన్ ని కలిసిన తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైసీపీలో చేరనప్పటికీ.. టీడీపీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీలోనూ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు. ఇప్పుడు అదే బాటలో మద్దాలి గిరి పయనించనున్నారు. ముందు ముందు టీడీపీకి ఇంకెంతమంది ఎమ్మెల్యేలు షాకిస్తారో చూడాలి.

ఆనందమానందమాయే.. మిడ్ మానేరు ప్రాజెక్టును సందర్శించిన కేసీఆర్

కేసిఆర్ కి దైవ భక్తి చాలా ఎక్కువన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. అధికారంలోకి రాగానే యాదగిరి గుట్టను గొప్ప పుణ్యక్షేత్రంగా రూపొందించేందుకు చర్యలు కూడా చేపట్టారు. ఇటీవలే ఆయన దానిని ప్రత్యేకంగా కూడా సందర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి సిరిసిల్ల పర్యటనకు బయలుదేరారు. శామీర్ పేట దగ్గర ఆగిన కేసీఆర్ మంత్రి ఈటెల రాజేందర్ ను కాన్వాయ్ లో ఎక్కించుకొని అక్కడ నుంచి పయనమయ్యారు. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల మీదుగా వేములవాడకు చేరుకుంటారు. అక్కడ కేసీఆర్, కేటీఆర్ దంపతులు రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్, కేటీఆర్లు వేములవాడ నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టు బయలుదేరుతారు. ప్రాజెక్టు దగ్గర జలహారతి చేపట్టనున్నారు. మిడ్ మానేరు ప్రాజెక్టు తొలి ఏడాదే నిండి పరవళ్లు తొక్కడం పై సీఎం ఆనందంగా ఉందన్నారు. అయితే దాదాపు గంట సేపు ఇవాళ మిడ్ మానేరు ప్రాజెక్టు వద్ద గడపనున్నారు కేసీఆర్. అనంతరం అక్కడి నుంచి కరీంనగర్ కు చేరుకుంటారు. అక్కడ తీగలగుట్టపల్లి లోని తెలంగాణ భవన్ లో భోజనం చేస్తారు. భోజన విరామం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు పయనమవుతారు.

జగన్ జోరు.. మూడు వారాల్లో మూడు రాజధానుల ప్రకటన

మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధానితో పాటు రాష్ట్ర అభివృద్ధి పై నిపుణుల కమిటీ నివేదికలను పరిశీలించేందుకు హైపవర్ కమిటీని నియమించింది వైసిపి సర్కార్. 10 మంది మంత్రులతో సహా 16 మంది కమిటీలో సభ్యులుగా ఉంటారు. మంత్రుల బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్సా సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకట రమణ, కొడాలి నాని, పేర్ని నానితో పాటు సీఎం ప్రధాన సలహాదారు అజయ్ కల్లం, ఏపి డిజిపి గౌతం సవాంగ్, సిసిఎల్ఎ, మునిసిపల్ సెక్రటరీ, లా సెక్రెటరీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ మెంబర్ కన్వీనర్ గా కమిటీలో ఉంటారు. ఈ కమిటీ 3 వారాల్లోగా తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని జీవోలో ప్రస్తావించారు. అవసరం మేరకు అడ్వకేట్ జనరల్ సలహాలు తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం. అన్ని అంశాల పై అధ్యయనం చేసి సమగ్ర రిపోర్టు ఇస్తామన్నారు మంత్రి కొడాలి నాని. అభివృద్ధి వికేంద్రీకరణ జిల్లాల సమగ్ర ప్రణాళికలపైన హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు ఎలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదని దృఢ సంకల్పంతో సీఎం ఉన్నట్టు మంత్రి మోపిదేవి తెలిపారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ విధానంగా చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇందు కోసం ప్రణాళికా బద్ధంగా ముందుకెళతామన్నారు. హైపవర్ కమిటీ నివేదిక అందిన వెంటనే 3 క్యాపిటల్స్ పై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వీలుంది. దీనిపై జనవరి చివరి నాటికి క్లారిటీ వస్తుంది అని అనుకుంటున్నారు.

కనిపించని కళ్యాణ్.. కార్యాచరణలో రాజధాని రైతులకు జనసేనాని అండగా ఉంటాడా ?

ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది . మూడు రాజధానుల ప్రతిపాదన సీఎం నోట వెలువడినప్పటి నుండి అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు. రాజధానిగా అమరావతిని మార్చొద్దనే డిమాండ్ వినిపిస్తూనే ఉన్నారు. రైతులు కొనసాగిస్తున్న ఆందోళనల్లో జనసేనాని పాల్గొనలేదు. అసలు రైతుల నిరసనలపై కానీ ఆ తర్వాత గానీ మళ్లీ మాట్లాడింది లేదు. అయితే ఇప్పుడు జనసేన కార్యచరణ ప్రకటించటానికి సిద్ధమవుతున్నారు పవన్ . నేడు మంగళగిరిలో పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం కానున్నారు జనసేనాని. ఈ సమావేశానికి పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్ , నాగేంద్రబాబులతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశం లో ప్రధానంగా ఏపీ రాజధానుల పై చర్చించనున్నారు. రాజధాని తరలింపును జనసేనాని గతంలో వ్యతిరేకించారు. అయితే క్యాబినెట్ భేటీ తర్వాత పవన్ రాజు దానిపై స్పందించలేదు. దీంతో రాజధాని పై జనసేన పార్టీ పరంగా నిర్వహించవలసిన కార్యక్రమాలపై కొన్ని కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు, రాయలసీమ నేతలు, పార్టీ ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మరోవైపు ఇప్పటికే అన్న చిరంజీవి జగన్ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రత్యేకంగా లేఖని విడుదల చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజధాని పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది.

సూపర్ పోలీస్.. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్న ఎస్పీ

  ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే మాట అక్షరాల వరకే పరిమితం అవ్వకుండా చేశారు ప్రకాశం జిల్లాకు చెందిన ఎస్పీ కౌషల్. క్రైమ్ రేట్ పై ఉక్కుపాదం మోపుతున్న పోలీసు అధికారిగా.. సంచలన కేసుల్లో మిస్టరీని చేధించి నేరస్తుల్ని కటకటాల బాటపట్టించారు. ఆదేశాలకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవల్లో దర్యాప్తు కొనసాగించగల గట్స్ ఉన్న ఎస్పీగా కూడా పేరొందారు. ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు చేపట్టేలా జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సమాయత్తం చేయటమే కాకుండా అర్ధరాత్రి కూడా వెంటనే స్పందిస్తారు.ఇటీవల సంచలనం రేపిన తల్లీ కూతురు హత్య కేసులో గంటల వ్యవధి లోనే మిస్టరీ ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తనే.. భార్యాబిడ్డల్ని చంపిన కేసులో నిందితుడ్ని కటకటాల బాటపట్టించారు.ఇలా ఎన్నో కేసుల్ని ఛేదించిన పోలీస్ గా పేరొందారు కౌషల్. స్పందన కార్యక్రమంలో వెల్లువెత్తే ఫిర్యాదుల పై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు ఎప్పటికప్పుడు దర్యాప్తును ట్రాక్ చేయటమే కాక డిపార్ట్ మెంట్ లో తనదైన మార్కును చాటుకున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌషల్. క్రైమ్ రేట్ కు కళ్లెం వేయడంతో పాటు పోలీసుల పని తీరు పై కూడా నిఘా పెంచారు. ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్తే కొన్ని పోలీస్ స్టేషన్ లలో సరైన స్పందన ఉండడం లేదన్న ఆరోపణల క్రమంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు ఎస్పీ. ఒంగోలు ఠాణాలో ఫిర్యాదు దారులతో పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకునేందుకు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ ను రంగంలోకి దింపారు. ఆయన మఫ్టీలో సామాన్య పౌరుడిలా ఒంగోలు తాలూకా పీఎస్ కు వెళ్లి తన మొబైల్ లో గుర్తు తెలియని వ్యక్తి లాక్కేల్లాడని కంప్లైంట్ తీసుకోవాలని కోరారు.కానీ సిబ్బంది స్పందించలేదు సిఐ లేరు ఆయన సాయంత్రం వస్తారు అప్పుడు దాని తిప్పి పంపారు. సాయంత్రం మళ్లీ స్టేషన్ కు వెళ్లారు జగదీష్. రిక్వెస్ట్ చేస్తే ఎట్టకేలకు ఫిర్యాదు తీసుకున్నారు కానీ రసీదు ఇవ్వ మని అడిగితే మళ్లీ వెళ్ళవయ్యా వెళ్లు అని కాసురుకున్నారు. ఎందుకివ్వరు అని గట్టిగా అడిగితే అసలు ఫోన్ నీదే అని గ్యారెంటీ ఏంటి అంటూ తిట్ల పురాణం అందుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదేనా అని అవాక్కైన ట్రైనీ ఎస్పీ ఒంగోలు తాలూకా పీఎస్ లో తనకు ఎదురైన అనుభవాన్ని.. ప్రతి అంశాన్ని సిద్దార్థ్ కౌశల్ కు రిపోర్టు చేశారు. ఫిర్యాదు తీసుకోవడానికి వేధించడమే కాకుండా అవమానపరచడం దురుసుగా మాట్లాడటం వంటి చర్యల్ని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తీవ్రంగా పరిగణించారు. ట్రైనీ ఐపీఎస్ జగదీష్ రిపోర్ట్ పై వెంటనే స్పందించారు. ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు దారుని అవమానపరచిన స్టేషన్ రైటర్ సుధాకర్ ను వెంటనే సస్పెండ్ చేశారు.సీఐ లక్ష్మణ్, ఎస్ ఐ సాంబశివయ్య, హెడ్ కానిస్టేబుల్ ఏడుకొండలు, కానిస్టేబుల్ రాజేష్, మహిళా కానిస్టేబుల్ రమ్య కిరణ్ లకు శిక్షగా చార్జ్ మెమోలు జారీ చేశారు ఎస్పీ. పోలీస్ యంత్రాంగాన్ని ఉరుకులు పెట్టించటమే కాక ఫ్రెండ్లీ పోలీసింగ్ కు కట్టుబడి ఉండాలని పదేపదే సూచిస్తున్నారు.ప్రజల్లో పోలీసులంటే భరోసా.. గౌరవం ఉండాలన్నారు. ఆ దిశగా ప్రతి పోలీస్ బాధ్యతాయుతంగా ఉండేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది నిజమయ్యేలా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ చేపడుతున్న చర్యలకు జే జే లు కొడుతున్నారు ప్రజలు.

రాజధాని మారడం బాబుకి ఇష్టం లేదు.. ఢిల్లీ స్థాయిలో రాజకీయం చేస్తున్న చంద్రబాబు

మూడు రాజధానుల విషయంలో టిడిపి చేసే విమర్శలను తిప్పికొట్టేందుకు బాబు లక్ష్యంగా పదునైన వాగ్బాణాలు సంధిస్తున్నారు అధికార పార్టీ నాయకులు. చంద్రబాబును నమ్మలేమని.. ఆయన పైకి ఒకటి చెబుతారు తెరవెనుక మరొకటి చేస్తారంటూ వైసిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సమన్యాయం పేరుతో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకు ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యాయవ్యవస్థకు చెందిన కొందరి సాయంతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విశాఖ పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. ఆధారాలు లేకుండా విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారని.. ఢిల్లీ స్థాయిలో టిడిపి నేతలు ఎవరితో మాట్లాడారని ప్రశ్నించారు ప్రతిపక్ష నేతలు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు బాబు ఎలాంటి కుట్రలకు తెర తీశారనే ప్రశ్నలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ వేడి కొనసాగుతుండగానే ఇదే స్థాయిలో ఆరోపణలు గుప్పించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను బీజేపీ వ్యతిరేకిస్తోంది. ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడు కూడా చెప్పాల్సిన వారికే చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో విజయసాయి , అవంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.

మాజీ ఎంపీ హర్ష కుమార్ పై అక్రమ కేసు.. ఎస్సై వీడియో లీక్!!

మాజీ ఎంపీ హర్ష కుమార్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యలు. పోలీస్ అధికారులు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ పోలీస్ అధికారి చెప్పిన మాటలను, వీడియోను మీడీయాకు అందజేశారు హర్ష కుమార్ కుటుంబ సభ్యులు. తన పై ఒత్తడి తెచ్చి హర్ష కుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయించారని వీడియోలో పోలీస్ ఆఫీసర్ వివరిస్తున్నట్లుగా ఉంది. వైద్యులు వద్దంటున్న హర్ష కుమార్ ను బలవంతంగా జైలుకు తరలిస్తున్నారని ఆయన కుమారులు శ్రీరాజ్ సుందర్ ఆందోళన వ్యక్తం చేశారు. తమ తండ్రిని ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. కనీసం లేవలేని స్థితిలో ఉన్న హర్ష కుమార్ ను జైలుకి ఎలా తీసుకువెళ్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తమ తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసారని ఆరోపిస్తున్నా కూడా పట్టించుకునే నాధుడు కరువయ్యాడని అంటున్నారు. సమాజం  సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.  దీని పై స్పందించిన హర్ష కుమార్ కుమారుడు.. " మా నాన్నగారి పై ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసిన  ఎస్సై ఆయన దగ్గరకు వచ్చి..రెండు చేతులు పట్టుకుని చాలా తప్పు జరిగిపోయిందని చెప్పారన్నారు. ఒక పేద బ్రాహ్మణ కుటుంబానికి, ఒక పేద బడుగు బలహీన చిన్నస్థాయి మనుషుల గురించి పోరాడుతుంటే మీ పై కక్షసాధింపు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. మిమ్మల్ని ఇబ్బంది గురిచేయడానికి ఇలా అక్రమ కేసులు పెట్టడం తప్పని  ఎస్సై చెప్పారు" అని వెల్లడించారు.  

జగన్‌పై సుబ్రమణ్యస్వామికి అంత ప్రేమెందుకు?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పాజిటివ్ కామెంట్స్ చేశారు. జగన్ ప్రభుత్వంపై విపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జగన్ తీరు సరిగానే ఉందన్నారు. తిరుమలను క్రిస్టియానిటీ కేంద్రంగా మారుస్తున్నారన్న ఆరోపణలను సుబ్రమణ్యస్వామి తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలన్నారు. అలాగే, టీటీడీ ఛైర్మన్ క్రిస్టియన్ అంటూ ప్రచారం చేశారని, అది కూడా తప్పేనన్నారు. తమ దృష్టికి వచ్చిన అన్ని ఆరోపణలపైనా నిజనిర్ధారణ జరిపామని, అయితే అవన్నీ అవాస్తవాలుగా తేలాయన్నారు. ఒకవేళ నిజంగానే తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే మొదట రియాక్ట్ అయ్యేది తానేనన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మతపరమైన ఆరోపణలు చేసేవారిపై కేసులు పెట్టాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి సుబ్రమణ్యస్వామి సూచించారు. అయితే, దేవాలయాలను వచ్చిన డబ్బును హజ్ యాత్రలకు, జెరూషలేము టూర్స్‌కి ఎలా ఇస్తారని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. దేవాలయాల అభివృద్ధిని ప్రభుత్వాలు గాలికి వదిలేస్తున్నాయని అన్నారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వందేళ్లుగా వచ్చిన కానుకలపై కాగ్‌‌తో ఆడిట్ చేయించాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అంతేకాదు, టీటీడీ ఆడిట్ బాధ్యతలను పూర్తిగా కాగ్ కి అప్పగించాలన్నారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానంపై రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఉండొద్దని... స్వర్ణ దేవాలయం మాదిరిగా స్వతంత్రంగా ఉండాలన్నారు సుబ్రమణ్యస్వామి. అయితే, జగన్ పై సుబ్రమణ్యస్వామి పాజిటివ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. జగన్ పరిపాలనపై విపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తుంటే.... సుబ్రమణ్యస్వామి మాత్రం ప్రతిపక్షాలనే తప్పుబట్టడం.... అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది. అసలు జగన్ పై అంత ప్రేమెందుకో అంటూ మాట్లాడుకుంటున్నారు.

 జనవరి 3న రాజధానుల ప్రకటనకు ముహూర్తం ఖరారు చేసిన బిసిజి కమిటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు మరియు ఇతర అంశాల పై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, మంత్రి పేర్ని నానితో పాటు ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం డీజీపీ గౌతం సభ సీసీఎల్ పురపాలక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. అవసరమైతే ఈ కమిటీ అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోవచ్చని సూచించారు. కమిటీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను కూడా విశ్లేషిస్తుంది. మూడు వారాల లోపు సిఫారసులతో కూడిన నివేదిక అందించాలని కమిటీని ఆదేశించారు. కాగా రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చెయ్యాలనీ జీఎన్ రావు కమిటీ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. దీంతో అమరావతి రైతులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. అనంతరం క్యాబినెట్ సమావేశంలో అమెరికాకు చెందిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక రావాలని.. ఆ తరువాత రెండు నివేదికలపై ఉన్నత స్థాయి కమిటీ వేసి అధ్యయనం చేయిస్తామని చెప్పారు. జనవరి 3వ తేదీన బిసిజి నివేదిక అందించనుంది. హైపవర్ కమిటీ దీనిని జీఎన్ రావు కమిటీ నివేదికను పరిశీలించి సిఫార్సు చేస్తోంది. వాటిని ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో చర్చించి చట్టబద్ధంగా రాజధాని మార్పు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అన్యాయం జరిగితే కోర్టుకెళ్లొచ్చు... అమరావతి రైతులపై బొత్స ఘాటు కామెంట్స్

                    హైదరాబాద్‌ను తలదన్నే నగరాన్ని నిర్మించాలంటే... ఒక్క విశాఖలోనే సాధ్యమని మంత్రి బొత్స అన్నారు. విశాఖకు కొంచెం తోడ్పాటునిస్తే... దేశంలోనే మహానగరంగా మారుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పది నగరాల్లో వైజాగ్ ఒకటన్న బొత్స... ఏపీ రాజధానికి సరైన ప్రాంతం విశాఖ మాత్రమే అన్నారు. విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్‌ను తలదన్నేలా మార్చుకోవచ్చన్నారు. కేవలం పదివేల కోట్లు ఖర్చు చేస్తే చాలు.... హైదరాబాద్‌ను మించిన నగరంగా విశాఖ తయారవుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ సామానంగా అభివృద్ధి చెందడం చంద్రబాబుకు ఇష్టం లేదా అంటూ బొత్స ప్రశ్నించారు. రాజధానిని మారిస్తే కేంద్రం, బీజేపీ ఊరుకోదని కొందరంటున్నారని... మోడీ ఏమైనా మీ చెవిలో చెప్పారా అంటూ నిలదీశారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతల మాటలు.... చంద్రబాబు మాటలూ ఒకే విధంగా ఉంటున్నాయని... మీరసలు బీజేపీ లీడర్లా లేక బాబు తొత్తులా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధానిని మారిస్తే కేంద్రానికి సమాచారమిస్తామన్న బొత్స.... నివేదికలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయినా, మూడు రాజధానులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయకుండానే రాద్ధాంతం చేయడం తగదన్నారు. జీఎన్‌రావు అండ్ బీసీజీ నివేదికలపై హైపవర్ కమిటీ వేశామని, 21రోజుల్లో రిపోర్ట్ ఇస్తుందని అన్నారు. ఆ తర్వాత సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. అమరావతి రైతులు చంద్రబాబు మాటల్ని నమ్మి మోసపోవద్దన్న బొత్స.... ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్లొచ్చన్నారు.

 మున్సిపల్ ఎన్నికల కై ఓటర్ల సర్వే మొదలు పెట్టిన కేటీఆర్.......

మున్సిపల్ ఎన్నికలు దెగ్గరలోనే ఉండటంతో అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఓటర్ల జాబితా పెట్టేందుకు ప్రయత్నిస్తొంది. ఓటర్ల అంతరంగాన్ని తెలుసుకునేందుకు మూడు సర్వేలు చేయిస్తున్నారు. ఒక సర్వే కోసం పార్టీ ముఖ్య నేతలను వినియోగించగా,మరొకటి పోలీస్ నిఘా విభాగం నుంచి తెప్పిస్తోంది. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా మూడో సర్వే చేయిస్తోంది. సేకరించాల్సిన సమాచారం ఒకటే అయినప్పటికీ వేర్వేరు వ్యక్తులు సంస్థల ద్వారా జరుగుతున్నాయి ఈ మూడు సర్వే లు దాదాపు కొలిక్కి వచ్చాయి. ఈ ప్రక్రియను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మూడు సర్వేల నివేదికలు అందాక క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన అంచనాకు రావాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఆ తర్వాత టీఆర్ఎస్ అధ్యక్షుడు ముఖ్య మంత్రి కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల పై పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జనవరి 7న నోటిఫికేషన్ వెలువడనుంది. 22న పోలింగ్ జరగనుంది. పరిషత్ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేయాలన్న పట్టుదలతో టిఆర్ఎస్ అధిష్టానం ఉంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్టుగా పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డాక టీఆర్ఎస్ తొలి సన్నాహక సమావేశం ఈ నెల 27న జరిగింది. ఇందులో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ రాష్ట్ర కమిటీకి మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ప్రాథమిక అవగాహన కల్పించారు. మూడు నాలుగు నెలల కిందట లోక్ సభ నియోజక వర్గం యూనిట్ గా మునిసిపాలిటీల్లో సర్వే నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకత్వానికే మళ్లీ అక్కడ సర్వే చేసే బాధ్యతను అప్పగించారు. ఈ మేరకు ప్రతి లోక్ సభ నియోజకవర్గానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఒకరిని ఇన్ చార్జిగా నియమించి ఇద్దరు ముగ్గురు రాష్ట్ర కార్యదర్శులకు ఆ నియోజక వర్గ బాధ్యతలను అప్పగించారు. టీఆర్ఎస్ అభ్యర్ధులు మునిసిపల్ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలన్న అంశాన్ని ఈ సర్వేను ప్రామాణికంగా నిర్దేశించినట్లు సమాచారం. మునిసిపాలిటీల వారీగా పార్టీల బలాబలాలు సులభంగా గెలిచే స్థానాలే ఏవి, కష్టపడితే గెలుపొందే స్థానాలు ఏవి, పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ఏం చేయాలి. కొత్త మునిసిపాలిటీల్లో పరిస్థితేమిటి. నేతల మధ్య సమన్వయం ఎట్లా అనే విషయాలు సర్వే అంశాలుగా ఉన్నట్టు సమాచారం వీటి ఆధారంగా క్షేత్ర స్థాయిలోని పరిస్థితులను తెలుసుకోవచ్చని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. వార్డులు, డివిజన్ల వారీగా ఎవరెవరి మధ్య పోటీ ఉంటుంది. టీఆర్ ఎస్ అభ్యర్ధులుగా ఎవరైతే బాగుంటుందో కూడా నివేదికలో పొందుపరచాలని కోరారు. వార్డులు డివిజన్లలో జనాభా ఆధారంగా రిజర్వేషన్ ఎవరికి వస్తుందనేది అంచనా వేసి టిక్కెట్ ఎవరికివ్వాలో సూచించాలని ఆదేశించినట్టు సమాచారం. పాత,కొత్త సమాచారాన్ని పరిశీలించి ఈ నెల ముప్పై ఒకటి లోగా నివేదిక లు అందించా లని పార్టీ నేతలను అధిష్టానం ఆదేశించింది. అప్పటిలోగా పోలీస్ నిఘా విభాగం స్వతంత్ర ఏజెన్సీ సర్వే నివేదికలు అందుతాయని భావిస్తున్నారు. వాటన్నింటిని సమగ్రంగా పరిశీలించి స్పష్టమైన అంచనాకు రావాలని టీఆర్ఎస్ పెద్దలు నిర్ణయించగా, సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు మునిసిపల్ ఎన్నికల పై దిశా నిర్దేశం చేయనున్నారు.టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్ర కమిటీ జడ్పీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు ఇతర సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ భేటీ జనవరి 2న ఉండవచ్చని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.మొత్తం మీద అధికారంలో ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు ఈ మున్సిపల్ ఎన్నికల పై ప్రత్యేక దృష్టి పెట్టారనే భావించవచ్చు.చూడాలి మరి వారి కృషి ఏ మేర సత్ఫలితాన్ని ఇస్తాయో వేచి చూడాలి.

విశాఖలో మావోయిస్టుల కదలికలు... రాజధానిగా సేఫ్ కాదంటోన్న పోలీసులు..!

అమరావతి రైతుల ఆందోళనలు... విపక్షాల విమర్శలతో మూడు రాజధానుల ప్రకటనను తాత్కాలికంగా వాయిదా వేసినా... జగన్ ప్రభుత్వం తాను అనుకున్న గడువులోపు మొత్తం తతంగాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. అయితే, రాజధానిని విశాఖకు తరలించాలన్న నిర్ణయంపై అమరావతి రైతుల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రాష్ట్రప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. పక్కా ప్లాన్ తో తాను అనుకున్న గడువులోపు రాజధాని తరలింపు ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటోంది. అయితే, రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై పోలీస్ అధికారులు వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లాలో మావోయిస్టులు కదలికలు ఎక్కువగా ఉన్నాయని, భద్రత దృష్ట్యా వైజాగ్ లో రాజధాని పెట్టడం మంచిది కాదంటున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావును, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమాను మావోయిస్టులు కాల్చిచంపిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే, ఇటీవల డీజీపీ విడుదల చేసిన వార్షిక నివేదికలోనూ మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉందని తేలిందని, అలాంటి ప్రాంతంలో రాజధాని పెట్టడమంటే... ప్రముఖులను రిస్క్ లోకి నెట్టడమేనంటున్నారు. అయితే, రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీలోకి డీజీపీ గౌతమ్ సవాంగ్ ను కూడా తీసుకోవడంపై పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖలో రాజధాని ఏర్పాటును కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వ్యతిరేకిస్తుండటంతో.... పోలీస్ బాస్ తోనే... ఎస్ అనిపించుకోవడానికే గౌతమ్ సవాంగ్ ను  హైపవర్ కమిటీలోకి తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. రాజధానిగా విశాఖ అనువైన ప్రాంతమని పోలీస్ బాస్ చెబితే ఇంకెవరికీ అభ్యంతరాలు ఉండవనేది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. మొత్తానికి అడ్డంకులేమీ లేకుండా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించేందుకు పక్కా ప్లాన్ ప్రకారం జగన్ ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు.  

మున్సిపల్ బరిలో టీడీపీ... సందడిగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్...

తెలంగాణ మున్సిపల్ పోరులో సత్తా చాటేందుకు తెలుగుదేశం సమాయత్తమవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని... ఖమ్మం జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకున్న టీడీపీ.... తన ఉనికిని కాపాడుకునేందుకు పాట్లు పడుతోంది. మరోవైపు, తెలంగాణలో పార్టీని బతికించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోన్న చంద్రబాబు.... మున్సిపోల్స్‌ వ్యూహంపై టీటీడీపీ నేతలతో చర్చించారు. పోగొట్టుకున్న చోటే తిరిగి సాధించుకోవాలన్న సిద్ధాంతాన్ని మున్సిపల్ ఎన్నికల్లో అమలు చేసేందుకు వ్యూహరచన చేశారు. ఇప్పటికీ తెలంగాణ అంతటా టీడీపీకి క్యాడర్ ఉందని... అలాగే ప్రజల్లో తెలుగుదేశానికి ఆదరణ ఉందన్న చంద్రబాబు... నేతలు గట్టిగా కష్టపడితే మున్సిపోల్స్ లో మంచి ఫలితాలు వస్తాయంటూ దిశానిర్దేశం చేశారు. ఇకపై కచ్చితంగా వారంలో ఒకరోజు టీటీడీపీకి కేటాయిస్తానని, అందరం కలిసి తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామంటూ నేతల్లో ఉత్సాహం నింపారు. అయితే, పార్టీనే నమ్ముకుని ఇప్పటికీ టీటీడీలో కొనసాగుతోన్న పలువురు నేతలు... మున్సిపల్ బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు క్యూకడుతున్నారు. దాంతో, చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సందడిగా కనిపిస్తోంది.

బీజేపీకి అగ్నిపరీక్ష... సత్తా చాటకపోతే అంతే సంగతులు...

మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ ఊహించనివిధంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో... టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంటూ బీజేపీ చెప్పుకున్నా... మిగతా ఏ ఎన్నికల్లోనూ ఆ స్థాయి ఫలితాలు సాధించలేకపోతోంది. ఇక, ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉపఎన్నికలో అయితే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే మున్సిపోల్స్ లో బీజేపీకి మంచి ఫలితాలు సాధించి పెడతాయని భావిస్తున్నారు. ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్ పై నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నా... హిందూవర్గాల్లో చాలా సానుకూలత ఉందని, అదే తమకు కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్నారు.  మున్సిపోల్స్ లో ఒంటరి పోరుకు దిగుతోన్న బీజేపీ... గతంలో ప్రభావం చూపించిన మున్సిపాలిటీలపై దృష్టిపెట్టింది. మోస్తరు ఓట్లు సాధించిన మున్సిపాలిటీల్లో నేరుగా ప్రజలను కలవాలని నిర్ణయించింది. అలాగే, మున్సిపాలిటీల వారీగా మేనిఫెస్టోలను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి అంతోఇంతో పట్టుండటంతో ఓటర్లను ప్రభావితం చేసే అన్ని అంశాలపై దృష్టిపెడుతున్నారు. అలాగే, ప్రజల్లో పేరున్న చోటామోటా నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక క్లస్టర్ గా తీసుకొని నలుగురిని ఇన్ ఛార్జులుగా నియమిస్తున్నారు. మొత్తానికి మున్సిపోల్స్ ను బీజేపీ నేతలు సీరియస్ గానే తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి... 2023లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనన్న సంకేతాలను ప్రజల్లోకి పంపాలని భావిస్తున్నారు. అయితే, ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్పీఆర్ ఇష్యూస్.... తెలంగాణ మున్సిపోల్స్ లో బీజేపీకి బలంగా మారతాయో లేక డిపాజిట్లు దక్కకుండా చేస్తాయో చూడాలి.

ఈసారి పన్నుల మోతే... బడ్జెట్ పై కేసీఆర్ డైరెక్షన్...

2020-21 బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జనవరి తొమ్మిదిలోగా ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలకు సూచించింది. ఆర్ధిక మాంద్యం ప్రభావం కారణంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రిపరేషన్ చేపడుతున్నారు. ఆర్ధిక మాంద్యం ఎఫెక్ట్ తో గతేడాది బడ్జెట్‌లో అంచనాలు అవసరాల కంటే 35వేల కోట్లను ప్రభుత్వం తగ్గించుకుంది. అందుకే, ఈసారి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్ధికశాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. అయితే, ఫిబ్రవరి మూడో వారంలోగా బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశమున్నందున... జనవరి తొమ్మిదిలోపే ప్రతిపాదనలు ఇవ్వాలని ఆయా విభాగాలను ఆర్ధికశాఖ కోరింది. అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందిన తర్వాత బడ్జెట్‌పై ఆర్ధికశాఖ కసరత్తు చేయనుంది. అలాగే, మున్సిపోల్స్ ముగిసిన తర్వాత బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సమీక్ష చేసే అవకాశం కనిపిస్తోంది. తీవ్ర ఆర్ధిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్‌ అంచనాలను అందుకోలేకపోయారు. అయితే, ఈ ఏడాది కూడా ఆర్ధిక మాంద్యం పరిస్థితులు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. దాంతో, ఆర్ధిక లోటును పూడ్చుకునేందుకు ఈసారి పన్నుల మోత మోగే అవకాశముందంటున్నారు.   

మూడు రాజధానులు... జగన్ పాలనపై... కేటీఆర్ ఏమన్నారంటే...

టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ అండ్ మున్సిపల్‌ మినిస్టర్ కేటీఆర్‌....  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే కేటీఆర్‌... అప్పుడు ఫాలోవర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తూ ఉంటారు. అయితే, ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో చేపట్టిన ఇంటయాక్టివ్ ప్రోగ్రామ్ ...వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. పలు సమస్యలు, అనేక అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానాలిచ్చారు. అయితే, ఏపీ సీఎం జగన్ ఆర్నెళ్ల పాలన, అలాగే రాజధాని వివాదంపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ డిఫరెంట్ గా స్పందించారు. మూడు రాజధానుల అంశంపై స్పందించాల్సింది కేవలం ఏపీ ప్రజలు మాత్రమేనంటూ తెలివిగా సమాధానిచ్చారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ఆర్నెళ్ల పాలన మాత్రం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు.  రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో నాయకత్వ లేమి ఉందని ఆంధ్రా నాయకులు అనేవారని, కానీ ఇప్పుడు టీఆర్‌ఎస్‌నే ఏపీలో పోటీ చేయాలని ఆంధ్రా ప్రజలు కోరుతున్నారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిపథాన దూసుకుపోతోందని, అందుకే టీఆర్ఎస్‌ పాలనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు.

పోలీసులకు చిక్కిన ఘరానా దొంగ

  అసలే దొంగబుద్ది దానికి తోడు అమోఘమైన హస్తలాఘవం ఇక ఆగుతాడా అరవై నాలుగు విద్యలలో ఒకటైన చోరకళకి ప్రాణం పోసేలా.. సక్సెస్ ఫుల్ గా వందల చోరీలు చేసి పోలీసులకు సవాలు విసిరాడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఘరానా దొంగ. అతని పేరు దర్శి. మొదట్లో సింగిల్ గానే దొంగతనాలు చేసేవాడు, ఆ తరువాత గ్యాంగ్ ను తయారు చేసుకొని గ్యాంగ్ లీడర్ అయ్యాడు.2004 నుంచి 2009 వరకు ఏకంగా 400 చేశాడు. పూణేకు చెందిన యువతిని పెళ్లి చేసుకొని వ్యక్తిగత జీవితంలో కూడా స్థిరపడ్డాడు. కొట్టుకొచ్చిన సొమ్ముతో ఇల్లాలికీ ప్లాట్లు , నగలు భారీగానే కొనిచ్చేవాడు. వీటి విలువ సుమారు కోటి రూపాయల వరకు వుంటుంది. భార్యకు నగలు నట్రా కొనిపెట్టంతో సరిపెట్టుకోకుండా పిల్లల్ని ఏకంగా ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు.జాగ్రత్తగా దోచుకోవడం దోచుకున్న సొమ్మును అంతే జాగ్రత్తగా అమ్ముకోవడం ఇంటి పట్టునే ఉంటూ ఆ డబ్బు తో ఎంజాయ్ చేయటంతో పోలీసులకు చిక్కకుండా ఇంతకాలం తప్పించుకు తిరిగాడు.ఎంత జాగ్రత్త పడినా ఎదో ఒక రోజు తప్పు చెయ్యక తప్పదు.క్రికెట్ బెట్టింగ్ లో ఏకంగా 16 లక్షలు పోగొట్టుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేక ఈజీగా పోలీసులకు దొరికిపోయాడు.ఈ సారి కూడా సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశాడు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ ను వదిలేసి పారిపోవలసి వచ్చింది. ఇప్పుడు మునుపటి రోజులు కావు కదా బైక్ కోసం మళ్లీ వచ్చి అక్కడే కాపు కాచుకొని ఉన్న పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఈ సారి పోలీసులు పక్కా సాక్ష్యాలతో కేసు ఫైల్ చేశారు. జైలుకెళ్లడం తప్పదు అయితే చోర కళలో ఆరితేరి పోయాడు. దీనికి తోడు దీర్చి లైఫ్ కు అలవాటు అయిపోయాడు. పైగా జైల్లో చిప్పకూడు కూడా తినేశాడు అన్ని రకాలుగా ముదిరిపోయాడు. మరి భవిష్యత్తులో బయటకు వచ్చిన తర్వాత కష్ట పడి చేస్తాడా లేక మళ్లీ పాత రోజుల్ని రిపీట్ చేస్తాడా అనేది మాత్రం వేచి చూడాలి.