టీఆర్ఎస్ మంత్రులకు సవాల్ గా మారిన మునిసిపల్ ఎన్నికలు!!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ దశాబ్ద కాలంగా తన సత్తా చాటుతోంది. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీలున్నాయి. మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో మంత్రులు రంగంలోకి దిగారు. కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. గత ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ ను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరోసారి మేయర్ పీఠం దక్కించుకునే బాధ్యత జిల్లా మంత్రులైన ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ పై పడింది.
కరీంనగర్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లలో అభ్యర్థులను గెలిపించుకునేందుకు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీని మట్టికరిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. హుజూరాబాద్ నియోజక వర్గ పరిధిలోని హుజూరాబాద్, జమ్మికుంట మునిసిపాలిటీల్లో అభ్యర్తులను గెలిపించుకునే బాధ్యతను మంత్రి ఈటెల రాజేందర్ భుజానికెత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కొంత పోటీ ఎదురయ్యే అవకాశం ఉన్నందున క్లీన్ స్వీపే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నారు. జమ్మికుంటలో 30, హుజూరాబాద్ లోని 30 వార్డుల్లో గులాబీ జెండా ఎగుర వేసేందుకు ప్రజాదరణ ఉన్న అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో అన్ని స్థానాలూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకునే విధంగా మంత్రి కేటీఆర్ ఇప్పటికే వ్యూహ రచన చేశారు. గత 2 నెలల నుంచే ఇందు కోసం కసరత్తు చేస్తున్నారు. గతంలో మాదిరి గానే ఈ సారి కూడా సిరిసిల్ల చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కృషి చేస్తున్నారు. 33 కు 33 వార్డుల్లో జయకేతనం ఎగురవేసేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు.
అటు కొత్తగా ఏర్పడ్డ ధర్మపురి మునిసిపాలిటీల్లో 15 కు 15 వార్డుల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో కొప్పుల పని చేస్తున్నారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని మునిసిపాలిటీల్లో అభ్యర్థులను గెలిపించుకోవడం మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కత్తిమీద సవాలనే చెప్పుకోవాలి. ధర్మపురి, జగిత్యాల, రాయికల్, పెద్దపల్లి, కోరుట్ల, మెట్ పల్లి, సుల్తానాబాద్ మునిసిపాలిటీలతో పాటు రామగుండం నగర పాలక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత మంత్రి కొప్పుల ఈశ్వర్ పైనే ఉంది. రామగుండంలో ఈ సారి బీజేపీ గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. ఇటీవల బీజేపీలో చేరిన సోమారపు సత్యనారాయణ బిజెపి అభ్యర్థులను గెలిపించుకునేందుకు వ్యూహాలకు పదును పెట్టడంతో కొప్పుల ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పోటీని తట్టుకుని టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవడం మంత్రులకు పెద్ద సవాలనే చెప్పుకోవచ్చు.