కొత్త చట్టాలు వద్దేవద్దని తెగేసి చెప్పిన రైతు సంఘాలు

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల పై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. రైతులకు బాసటగా నిన్న దేశ వ్యాప్త బంద్ విజయవంతమైన తరువాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి మేరకు ఆయనతో రైతు సంఘాలు నిన్న సాయంత్రం సమావేశమయ్యాయి. అయితే ఇరు పక్షాలు కూడా తమ పూర్వ వాదనలకే కట్టుబడ్డాయి. నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో ఈరోజు బుధవారంనాడు జరగాల్సిన ఆరో రౌండ్‌ చర్చలు రద్దయ్యాయి. అయితే కొత్త చట్టాల రద్దుకు ససేమిరా అంటున్న కేంద్ర ప్రభుత్వం వాటిలో తామెలాంటి సవరణలు తేదల్చుకున్నదీ వివరిస్తూ ఒక ప్రతిపాదనను ఈరోజు రైతులకు పంపనుంది. ఈ సవరణల పై రైతు సంఘాల నేతలు బుధవారం 12 గంటలకు సింఘూ సరిహద్దు కేంద్రం వద్ద సమావేశమై చర్చించి తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని రైతు సంఘాల ప్రతినిధులు చెప్పారు. అయితే మంగళవారం జరిగిన భారత్‌ బంద్‌ చాల రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపడం, దేశ విదేశాల్లో ప్రభుత్వ ఇమేజి దెబ్బతింటూండడంతో హోమ్ మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. ఓ పక్క బంద్‌ జరుగుతున్న సమయంలోనే ఆయన రైతు సంఘాల నాయకులకు కబురు పంపారు. దాంతో సింఘూ సరిహద్దుల నుంచి 13 మంది రైతు సంఘం నేతలు నిన్న రాత్రి ఆయనను కలిశారు.   అయితే షా నివాసంలో చర్చలకు కొందరు రైతు నేతలు విముఖత చూపడంతో పూసా ఏరియాలో ఉన్న వ్యవసాయ పరిశోధన సంస్థ వద్ద సమావేశం రెండు గంటల ఆలస్యంగా రాత్రి తొమ్మిది గంటలకు మొదలైంది. ఈ సమావేశంలో పాల్గొన్న 13 మందిలో ఎనిమిది మంది పంజాబీ రైతు సంఘాల వారు కాగా మిగిలిన ఐదుగురూ దేశంలోని వివిధ యూనియన్లకు చెందినవారు. ఆలిండియా కిసాన్‌ సభకు చెందిన హన్నన్‌ మొల్లా, భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన రాకేశ్‌ తికాయత్‌ వారిలో ఉన్నారు. అసలు దీనిపై అమిత్‌ షాతో చర్చించేందుకు ఏమీ లేదని, "చట్టాలను రద్దు చేస్తారా లేదా... అవును లేదా కాదు... అన్నది మాత్రమే అడుగుతున్నామని" రైతు నేత రుద్రు సింగ్‌ మాన్సా సమావేశానికి ముందే చెప్పారు. దీంతో సమావేశం కూడా అదే తరహాలో సాగింది. అయితే రైతు నేతలిచ్చిన సమాచారం ప్రకారం... కొత్తగా చేసిన చట్టాల్ని రద్దు చేయడం అసాధ్యమని అమిత్‌ షా తేల్చి చెప్పారు. చట్టాల రద్దు తప్ప ఏ తరహా సవరణలకైనా సిద్ధంగా ఉన్నామని అమిత్ షా చెప్పారు. అయితే చట్ట సవరణలకు తాము వ్యతిరేకమని, తమ వాదనలో మార్పు లేదని రైతు నేతలు తేల్చిచెప్పారు. ఆ సమయంలో షా వారి ముందు మరో ప్రతిపాదన ఉంచారు. "చట్టాలపై మీకున్న 39 అభ్యంతరాలనూ మేము పరిశీలించాం. ప్రభుత్వం ఏమేం సవరణలు చేయదలిచిందీ మీకు రేపటికి పంపిస్తాం... పరిశీలించండి" అని కోరారు. దీంతో రైతు సంఘాల నేతలు అందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఈరోజు బుధవారం మంత్రులు నరేంద్ర తోమర్‌, పీయూష్‌ గోయల్‌ సారథ్యంలోని ప్రభుత్వ బృందంతో తాము జరిపే చర్చలను రద్దు చేసినట్లు కిసాన్‌ సభ నేత హన్నన్‌ మోలా రాత్రి 11-30 గంటలకు మీడియాకు తెలిపారు. "ఈ సాయంత్రం నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అమిత్ షా తో సమావేశానికి రావాలని.. అయితే సమావేశానికి వెళ్లినా రైతులకు ఉపయోగపడేలా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఏమీ చెప్పలేదు" అని రైతుల నేత రాకేశ్ తికైత్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంపై తమకు విశ్వాసం కలగడం లేదని చెప్పిన మరి కొందరు రైతు ప్రతినిధులు ఆందోళనను మరింత ఉధృతం చేయడమే మార్గాంతరమంటున్నారు. దీంతో బుధవారం రైతులు తమలో తాము జరిపే చర్చల్లో ఏ విషయమూ తేలవచ్చని తెలుస్తోంది.   ఇది ఇలా ఉండగా రైతుల నిరసనలో భాగమయ్యేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌ పవార్‌, సిపిఎం నేత సీతారాం ఏచూరి ఈ విషయంపై చర్చలు జరిపారు. ఈరోజు (బుధవారం) సాయంత్రం 5 గంటలకు రాహుల్‌, పవార్‌, ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, డిఎంకె నేత టిఆర్‌ బాలులతో కూడిన అయిదుగురు సభ్యుల ప్రతినిధి బృందం రాష్ట్రపతి కోవింద్‌ను కలుసుకోనుంది. రైతాంగ సంక్షోభాన్ని సృష్టిస్తున్న సాగు చట్టాలను రద్దు చేసేలా రాష్ట్రపతి జోక్యం కోరనున్నట్లు ఏచూరి వెల్లడించారు.

‘వ్యవసాయ’ విన్యాసాలు చూడతరమా...

కోరస్ కలిపిన పార్టీలే కదం తొక్కుతున్న వైచిత్రి   గళం మార్చిన పవార్, కేజ్రీవాల్, జగన్, బాబు   తెలంగాణలో టీఆర్‌ఎస్-బీజేపీ కార్టూన్ల యుద్ధం   మన రాజకీయ పార్టీలకు రైతులపై టన్నుల కొద్దీ పొంగుకువస్తున్న ప్రేమానురాగాలు చూస్తుంటే.. రైతులంటే వారికి ఇంత సానుభూతి ఉందా అనిపిస్తుంది. పాపం రైతన్నలు కూడా రాజకీయ పార్టీలు తమ పట్ల ప్రదర్శిస్తున్న మద్దతు, సానుభూతి చూసి మురిసిముక్కలవుతున్నాడు. అంతా కట్టకట్టుకుని, తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కి, దేశమంతా బందు పెట్టినందుకు పాపం ఆ పిచ్చి మారాజులు,  తమ జన్మధన్యమయిందనుకుంటున్నారు. కానీ.. ఇప్పుడు తమకు దన్నుగా ఉన్న ఇవే పార్టీలు.. కొద్దికాలం క్రితం కొత్త చట్టం తెచ్చిన సర్కారుకు, పార్లమెంటు సాక్షిగా సాగిలబడ్డాయన్న నిజాన్ని,  నిలకడమీద గానీ తెలుసుకోలేకపోయారు. నరేంద్రమోదీ సర్కారు తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై.. వివిధ రాజకీయ పార్టీల విన్యాసాలు చూస్తే,  ఊసరవెల్లి కూడా సిగ్గుపడక తప్పదేమో?   మోదీ సర్కారు తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు.. బీజేపీ వాదిస్తున్నట్లు రైతులకు మేలు చేయవచ్చు. అదే సమయంలో విపక్షాలు ఆరోపిస్తున్నట్లు రైతు ప్రయోజనాలను అంబానీ- అదానీలకు తాకట్టుపెట్టేలా ఉండవచ్చు. ఎవరి కోణం వారిది. ఎవరి వాదన వారిది. కాబట్టి ఎవరి కోణంలో వారిదే రైటనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే వారంతా ఏ సమస్యలయినా తమ కళ్లతో చూసి, తమ మెదడుతో ఆలోచిస్తారు కాబట్టి! అయితే.. ఆయా అంశాలపై మొదట వినిపించిన వాణి, ఆ తర్వాత సమయానుకూలంగా మారి,  అవకాశవాద మలుపు తీసుకోవడమే అభ్యంతరం, అనైతికం. ఒక అంశంపై ప్రాంతీయ-జాతీయ పార్టీలన్నీ నిర్లజ్జగా యూటర్ను తీసుకోవడమే రోత. దేశ ప్రజలంతా చూస్తుండగా, బిల్లుకు మద్దతునిచ్చిన అవే స్వరాలు.. బయటకొచ్చి రంగుమార్చి, అందుకు భిన్నంగా గళమెత్తడమే ఇప్పటి (అ)రాజకీయం!   ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయ బిల్లును  పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు.. ఆమ్ ఆద్మీ, వైసీపీ, టీడీపీ వంటి పార్టీలన్నీ సమర్ధించాయి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అయితే.. బీజేపీ కంటే ఎక్కువగా బిల్లును సమర్థించారు. బిల్లును సమర్ధించని వారంతా దళారీనన్న వ్యాఖ్యలు కూడా చేశారు. ఇలాంటి బిల్లు తీసుకురావలసిన అవసరం ఉందని సమర్ధించారు. టీడీపీ దానికి కొన్ని సవరణలు చేసింది. మద్దతుధర, కార్పొరేట్ల పెత్తనంతో వచ్చే నష్టం, కాంట్రాక్టు ఫార్మింగు వల్ల రైతులకొచ్చే నష్టం వంటి అంశాలను ప్రస్తావించింది. కానీ బిల్లును మాత్రం వ్యతిరేకించలేదు.   ఇప్పుడు మాట మార్చిన వైసీపీ స్వరాన్ని, విజయసాయిరెడ్డి ప్రసంగాలతో కలిపి టీడీపీ మీడియాకు విడుదల చేసింది. ఆ రకంగా ఏపీకి సంబంధించినంత వరకూ,  రెండు ప్రధాన పార్టీలు బిల్లును సమర్ధించాయి. కాకపోతే.. తాము బిల్లుకు సవరణలు ప్రతిపాదించామని వాదించేందుకు, టీడీపీ ఒక వెసులుబాటు కల్పించుకుంది. ఎన్డీఏ మిత్రపక్షాలు కూడా బిల్లును సమర్ధించాయి. ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమే బిల్లును వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా అది రైతులకు మద్దతుగానే రోడ్డెక్కింది. అయితే రైతులకు మద్దతుపై టీఆర్‌ఎస్ వైఖరిని విమర్శిస్తూ బీజేపీ.. ఎన్డీఏ రైతులకు చేసిన మోసాన్ని ఎండగడుతూ, టీఆర్‌ఎస్...  సోషల్‌మీడియా వేదికగా సంధించుకుంటున్న కార్టూన్ల యుద్ధం ఆసక్తికలిగిస్తోంది. తాజాగా  రైతులు రోడ్డెక్కి, ఢిల్లీని ముట్టడించిన అంశంపై అగ్గిరాజుకుంది. దీనితో బీజేపీ మినహా అన్ని పార్టీలూ,  తమ మనుగడ కోసం  రైతుల వెంట నడవటం అనివార్యమయింది. ఫలితంగా మంగళవారం భారత్‌బంద్‌కు పిలుపునివ్వడంతో, బీజేపీ మినహా అన్ని పార్టీలూ దానికి మద్దతునివ్వక తప్పని పరిస్థితి. విచిత్రమేమిటంటే... యుపిఏ హయాంలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న శరద్‌పవార్..  వ్యవసాయంలో చట్టాలు, సంస్కరణలు తీసుకురావల్సిన అవసరం ఉందని వాదించారు. ఆ మేరకు ఆయన  ఢిల్లీ-మధ్యప్రదేశ్ సీఎం లయిన షీలాదీక్షిత్, శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు లేఖలు కూడా రాశారు. ఇప్పుడు ఆయన పార్టీ కూడా, రైతు ఉద్యమానికి మద్దతునివ్వడం విస్మయకరం. అయితే, తాను ఆ లేఖ రాసిన మాట నిజమేనని ఇప్పుడు అంగీకరించడం కొంత నయం. ఇప్పుడు రైతు సమస్యపై గత్తర చేస్తున్న పంజాబ్ కిసాన్ యూనియన్.. 2018లో దళారుల వల్ల తమకు మద్దతుధర లభించడం లేదని, తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేసే అవకాశం కార్పొరేట్లకు ఇవ్వాలని నానా యాగీ చేసింది. ఆ మేరకు ప్రతి ఏటా  కేంద్రానికి లేఖ రాస్తూనే ఉంది.  ఆ తర్వాత చాలా ఏళ్లకు మోదీ సర్కారు రైతుచట్టం తెచ్చింది. కానీ విచిత్రంగా అదే పంజాబ్ కిసాన్ యూనియన్, ఇప్పుడు రోడ్డెక్కిన రైతులకు నాయకత్వం వహిస్తోంది. తాను కోరిన రైతుచట్టాన్నే తెచ్చిన మోదీ సర్కారును దునుమాడుతోంది. ఇక పార్లమెంటులో ఈ బిల్లుకు మద్దతునిచ్చిన ఆమ్ ఆద్మీ.. ఇప్పుడు ఢిల్లీలో రోడ్డెక్కిన రైతులకు అన్నపానీయాలు సమకూరుస్తోంది.  ఇది అవసరార్ధ రాజకీయాలకు పరాకాష్ఠ కాదా?   ఇక పార్లమెంటులో బేషరతుగా బిల్లు ఆమోదించిన వైసీపీ...ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పక్షానే బంద్‌కు మద్దతునివ్వడం, అప్పుడు పార్లమెంటులో బిల్లును వ్యతిరేకించకుండా ఉన్న టీడీపీ కూడా,  రైతన్నకు మద్దతునివ్వడం రోత రాజకీయాలకు పరాకాష్ఠ. అన్నట్లు.. ఓవైపు వైసీపీ ఈ బిల్లును ఇప్పుడు వ్యతిరేకిస్తుంటే, ఆ పార్టీకి చెందిన నేత పొట్లూరి మాత్రం.. బ్రహ్మాండంగా ఉన్న బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్ధం కావడం లేదని, ట్వీట్ చేయడం మరో ట్విస్టు.   చిరాఖరుగా బీజేపీ కూడా వ్యవసాయంపై రాష్ట్రానికో రకంగా స్పందించడం మరో వైచిత్రి. రైతులు దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తులు అమ్ముకోవచ్చని ప్రధాని మోదీ చెబుతున్నారు. కానీ అదే పార్టీకి చెందిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మాత్రం తన రాష్ట్రంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఇతర రాష్ట్రాల నుంచి రైతులెవరయినా వచ్చి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తే వారి లారీలు జప్తు చేసి, జైల్లో పెడతామని హెచ్చరించడం.. బీజేపీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనం.  ఈవిధంగా.. వ్యవసాయ బిల్లులో,  రాజకీయ పార్టీల విన్యాసాలు చూసిన వారికెవరికయినా.. ‘స్టేట్‌మెంట్లు మార్చని వాడు పొలిటీషియనే కాదు పొమ్మన్న’ గిరీశం ఉపదేశం గుర్తుకురావడం ఖాయం! -మార్తి సుబ్రహ్మణ్యం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. కాళ్లు, చేతులు నరుకుతా

పటాన్‌ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రెచ్చిపోయారు. ఓ మీడియా ప్రతినిధితో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. భూ కబ్జాలపై ఓ కథనాన్ని రాసిన సదరు రిపోర్టర్‌ కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. నీవు ఎవ్వడివిరా? అంటూ బూతు పురాణం అందుకోవడమే కాదు.. వస్తావా? లేదా ఎక్కడున్నావో చెప్పు.. నేనే వస్తా.. కాళ్లు, చేతులు నరుకుతానంటూ వార్నింగ్ ఇచ్చారు. కావాలంటే నేను మాట్లాడేది రికార్డు చేసుకో.. దిక్కు ఉన్న చోట చెప్పుకో.. పోలీసులకు ఫిర్యాదు చేసుకో.. అంటూ బూతులు తిట్టారు. ఇప్పుడు ఈ ఆడియో వైరల్ అయింది. జర్నలిస్టు పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి.

కేజ్రీవాల్ ప్లాన్ లీక్.. దీంతో సీఎం హౌస్ అరెస్ట్

దేశ వ్యాప్తంగా ఈరోజు రైతులకు బాసటగా నిర్వహించిన ఒక రోజు బంద్ విజయవంతమైన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాల పై రైతులు దేశ వ్యాప్తంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ బంద్ జరిగింది. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ రోజు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో కలిసి ధర్నా చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ సంగతి లీక్ కావడంతో ఆయనను అడుగు బయట పెట్టకుండా ఢిల్లీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అయితే తాను సీఎం హోదాలో కాకుండా ఓ మామూలు వ్యక్తిలా రైతుల్ని కలవడానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే తాను బయల్దేరే సమయంలో పోలీసులకు తమ ప్లాన్ తెలిసిపోవడంతో బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ సరిహద్దులో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను కలవడానికి బయల్దేరిన కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే బంద్ ముగియడంతో ఆయనకు గృహ నిర్బంధం నుంచి విముక్తి లభించింది.   అయితే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గృహ నిర్బంధంపై ఆప్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. కేజ్రీవాల్‌ను, రైతులను చూసి మోదీ ప్రభుత్వం భయపడుతోందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా విమర్శించారు. దీంతో ఆప్ కార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ ఇంటి ముందు సిసోడియా ధర్నా నిర్వహించారు.

ఓటుకు నోటు కేసు.. ఎమ్మెల్యే సండ్రకు నిరాశ

ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు నిరాశ ఎదురైంది. ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ఆ కేసులో సండ్ర దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నెల 15న సండ్ర వెంకట వీరయ్య కూడా ఏసీబీ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.   కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ ఏసీబీ కోర్టులో జరిగింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా గైర్హాజరు కాగా.. ఈనెల 15వ తేదీన జరిగే తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. హాజరు మినహాయింపు కోసం పిటిషన్లను అనుమతించమని కోర్టు స్పష్టం చేసింది. 

టీఆర్ఎస్ నేతలకు నిలదీతలు! బంద్ లో కనిపించని రైతులు 

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిర్వహించిన భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో పాక్షికంగానే జరిగింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించినా ప్రజల నుంచి స్పందన పెద్దగా కనిపించలేదు. కేటీఆర్ సహా మంత్రులంతా రోడ్డెక్కినా.. ఎక్కడా రైతులు వాళ్లకు సపోర్ట్ గా నిలవలేదు. బంద్ లో టీఆర్ఎస్ నేతల, కార్యకర్తల హడావుడే ఎక్కువగా కనిపించింది. హైదరాబాద్ లోనూ భారత్ బంద్ ప్రభావం ప్రజలపై పడలేదు. రోడ్లు బ్లాక్ చేసి ఆందోళనలు చేసినా.. స్థానికులు వ్యతిరేకించడంతో నిరసనకారులు వెనక్కి తగ్గారు. రైతుల సమస్యలపై బంద్ నిర్వహిస్తూ.. రైతులు లేకుండా నిరసనలు చేయడంపై విమర్శలు వచ్చాయి. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతుల ఫోటోలు కాకుండా కేసీఆర్ ఫోటోలు పెట్టుకుని ధర్నాలు చేయడాన్ని కొందరు ప్రశ్నించారు.   భారత్ బంద్ లో భాగంగా రోడ్డుపై ఆందోళనలు చేస్తున్న టీఆర్ఎస్ నేతలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. చాాలా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలపై స్థానికులు తిరగబడ్డారు. రాష్ట్రంలో రైతులు సమస్యలను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఆందోళనలు చేయడం ఏంటనీ అన్నదాతలు కూడా పలు ప్రాంతాల్లో  టీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై స్థానికులు జనం తిరగపడ్డారు. ఉష ముళ్లపూడి కామన్ వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ఆందోళన చేస్తుండగా.. ఎందుకు ధర్నా చేస్తున్నారో చెప్పాలని జనాలు ప్రశ్నించారు. ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు.. ఇప్పుడే కనిపించాయా? అంటూ ఓ మహిళ నిలదీసింది. తమకు ఇబ్బందులకు గురి చేసి బారికేడ్లు పెట్టడం ఏంటని ఎమ్మెల్యేను కడిగి పారేసింది. కరీంనగర్ జిల్లా  హుజురాబాద్ ధర్నాలో మంత్రి  ఈటల రాజేందర్ ముందే రైతుల కష్టాలను ఏకరువు పెట్టాడు యువ రైతు. రైసు మిల్లుల్లో తాలు పేరిట కోతలు విధిస్తున్నారని, మద్ధతు ధర కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు మంత్రి రాజేందర్.    రైతులు పిలుపిచ్చిన భారత్ బంద్ కు టీఆర్ఎస్, కాంగ్రెస్ మద్దతు ప్రకటించాయి. వేరువేరుగా ఆందోళనలు నిర్వహించాయి.అయితే నిరసనల్లో భాగంగా రెండు పార్టీల మధ్య చాలా ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. మోడీ సర్కార్ తో పాటు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు వారితో గొడవలకు దిగారు.  కరీంనగర్ జిల్లాలో భారత్‌ బంద్ ఉద్రిక్తంగా మారింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు రచ్చ రచ్చ చేశారు. భారత్ బంద్‌లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొనడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. భారత్ బంద్‌లో టీఆర్ఎస్ ఎలా పాల్గొంటుందని కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. ఇరు పార్టీల నేతల మధ్య తోపులాట జరిగింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల ఘర్షణతో కరీంనగర్ ప్రధాన బస్టాండ్ ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లావెల్గటూర్ మండలంలో  మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అడ్డుకునే ప్రయత్నం చేసారు కాంగ్రెస్నాయకులు. భారత్ బంద్ లో పాల్గొనేందుకు ధర్మపురి వెళుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ను చొప్పదండి వద్ద అడ్డుకున్నారు.ఖమ్మం జిల్లా మధిర లో కాంగ్రెస్ టిఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ వర్గీయులు సీఎం డౌన్ డౌన్ అన్న నినాదాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది.   భారత్ బంద్ లో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ లో వర్గపోరు బయటపడింది. నాగర్ కర్నూల్ జిల్లా అమనగల్ మండలకేంద్రంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి వర్గీయులు మధ్య గొడవ జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు.తూప్రాన్ హైవె పై జరిగిన టిఆర్ఎస్  దర్నా లో ఫ్లెక్సిల వివాదం తలెత్తింది.ఉద్యమ కాలం నుండి టిఆర్ఎస్ లో పని చేస్తున్న వారి ఫోటోలు లేవని కొందరు గొడవ చేశారు. ధర్నా చేయకుండానే ఓ వర్గం నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదిలాబాద్ జిల్లా తానూర్ మండలం బెల్తరోడాలో టీఆర్ఏస్, బీజేపీ నాయకుల పోటా పోటీ ధర్నాలకు దిగారు. భువనగిరిలో సిపిఎం, బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. తెరిచి ఉన్న బేకరీ షాపుపై సీపీఎం కార్యకర్తలు రాళ్ల విసరడంతో బీజేపీ కార్యకర్తకు గాయమైంది.    ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష టీడీపీలు బంద్ లో పాల్గొనలేదు. ఈ రెండు పార్టీలు పార్లమెంట్ లో వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇవ్వడంతో.. రైతుల పోరాటానికి నేరుగా సపోర్ట్ చేయలేకపోయాయి. ఏపీలో బంద్ వామపక్షాలు, కార్మిక సంఘాల వరకే పరిమితమైంది. వ్యాపార సంస్థలు కొంత వరకే మూత పడ్డాయి. ఉదయం వరకు కొన్ని ప్రాంతాల్లో బంద్ ప్రభావం కనిపించినా.. మధ్యాహ్నం తర్వాత అంతటా సాధారణ పరిస్థితులు కనిపించాయి.బంద్ లో పాల్గొనకపోయినప్పటికి.. విజయవాడలో రైతులకు ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మద్దతు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు.  కొత్త వ్యవసాయ చట్టాలకు తమ పార్టీ సూచించిన సవరణలు చేయాలని కోరారు. రైతుల ఉద్యమం దేశ చరిత్రలో నిలిచిపోతుందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రైతు సంఘాలతో చర్చించి కొత్త చట్టాలను తేవాలని, దీనిపై ప్రధాని మోడీ వెంటనే ప్రకటన చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. భారత్ బంద్ పైనా టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకున్నారు. 

మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు! కేసీఆర్ సర్కార్ లో కలకలం

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఊహించని షాక్ తగిలింది. దిండిగల్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై  భూ కబ్జా కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్‌ మండలం సూరారంలోని సర్వే నెంబర్ 115, 116, 117లోని తనకు సంబంధించిన భూమిని అమ్మాలంటూ మంత్రి మల్లారెడ్డి అనుచరుల చేత బెదిరింపులు చేస్తున్నారని శ్యామల అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం 2 ఎకరాల 13 గుంటల భూమిలో ఇప్పటికే 20 గుంటల భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నారని బాధితురాలు ఆరోపించింది. అంతేకాదు కోర్టులో పిటిషన్ వేయడానికి నియమించుకున్న లాయర్ ను  కూడా మంత్రి కొనేశారని ఆరోపించింది. మంత్రికి అమ్ముడుపోయిన లాయర్ నకిలీ అగ్రిమెంట్‌ను సృష్టించాడని మహిళ చెప్పింది.  దిక్కుతోచని స్థితిలో పోలీసులు ఆశ్రయించినట్టు శ్యామల ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి మరో ఐదుగురిపై సెక్షన్ 446,506r/w, 34 ఐపీసీ సెక్షన్ల కింద దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.

మోడీతో పెట్టుకుంటే కాలిపోతారు: కేసీఆర్ పై రాజా సింగ్ ఫైర్ 

కేంద్ర సర్కార్ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. రైతుల సంక్షేమ కోసం మంచి చట్టాలను తీసుకొస్తే... మాయమాటలు చెపుతూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. భారత్ బంద్ కు కేసీఆర్ మద్దతు ప్రకటించడం హాస్యాస్పదమన్నారు రాజా సింగ్. రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచారని విమర్శించారు.    దళారుల చేతిలో రైతులు మోసపోకూడనే ఉద్దేశంతోనే  మోడీ సర్కార్ కొత్త చట్టాలను తీసుకు వచ్చిందన్నారు రాజా సింగ్. ఈ చట్టాలపై రైతులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయన్న రాాజా సింగ్... మోడీ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అనే విషయాన్ని ప్రతిపక్ష నేతలు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. శక్తితో పెట్టుకుంటే కాలిపోతారని హెచ్చరించారు. రైతుల భూములను కబ్జా చేసి, వెంచర్లు వేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. కేసీఆర్ ఉచ్చులో రైతులు పడొద్దని సూచించారు రాజా సింగ్.

90ఏళ్ల బ్రిటన్ బామ్మకు తొలి టీకా! రెండు వారాల్లో భారత్ కరోనా వ్యాక్సిన్ ?

కరోనా వ్యాక్సిన్ పంపిణిని ప్రారంభించింది బ్రిటన్. 90 ఏళ్ల వృద్ధురాలికి తొలి కరోనా టీకా ఇచ్చారు. ప్రపంచంలోనే కొవిడ్‌ టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన ఈ బామ్మ నిలిచారు. యూకేలో ఫైజర్‌ టీకా పంపిణీ అధికారికంగా మంగళవారం ప్రారంభమైంది. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కోవెంట్రీలోని యూనివర్శిటీ హాస్పిటల్‌లో 90ఏళ్ల మార్గరెట్‌ కీనన్‌ తొలి టీకా‌ వేయించుకున్నారు. ఫైజర్‌ టీకాకు క్లినికల్‌ అనుమతి లభించిన తర్వాత అధికారికంగా‌ తీసుకున్న తొలి వ్యక్తి ఈమే. మొట్టమొదటి టీకా తీసుకోవడం చాలా ప్రత్యేకంగా, ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బామ్మ చెప్పారు.  జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌తో కలిసి ఫైజర్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి యూకే ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది. తొలి ప్రాధాన్యంగా కరోనా ప్రమాదం పొంచి ఉన్న ఆరోగ్య సిబ్బందికి, 80ఏళ్ల వయసు పైబడిన వృద్ధులతో పాటు కేర్‌ హోంలో ఉండే వర్కర్లకు  ఇవ్వనున్నారు. యూకేతో పాటు ఫైజర్‌ అమెరికాలో కూడా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకుంది. దీనిపై అక్కడి ప్రభుత్వం డిసెంబరు 10న సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. యూఎస్‌లో కూడా అనుమతి లభిస్తే.. డిసెంబరు మూడోవారం నుంచి అగ్రరాజ్యంలో టీకా పంపిణీ చేయాలని ఫైజర్‌ భావిస్తోంది.  భారత్ లోనూ కరోనా వ్యాక్సిన్‌ అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొవిడ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్నాయి.  దీనిపై డీసీజీఐ రెండు వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం. ఫైజర్‌, సీరం, భారత్‌ బయోటెక్‌ కంపెనీల విజ్ఞప్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థలోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనుంది. టీకా పనితీరు, పంపిణీ వంటి అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరపుతుంది. ఈ కమిటీ తమ పరిశీలనలను అందించిన తర్వాత రెండు వారాల్లోగా కొవిడ్‌ టీకా అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.  కరోనా వ్యాక్సిన్ అవసరంతో పాటు దాని  భద్రత కూడా ముఖ్యమైన అంశం. అత్యవసర అనుమతులు ఇచ్చే ముందు వ్యాక్సిన్‌ సామర్థ్యాలు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.అందుకే కరోనా టీకా పురోగతిపై భారత ప్రభుత్వం గట్టిగా దృష్టిపెట్టింది. స్వయంగా ప్రధాని మోడీ  ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటించి వ్యాక్సిన్‌ ప్రయోగాలను పరిశీలించారు. దేశంలో కొద్దివారాల్లోనే కొవిడ్‌ -19 టీకా సిద్ధమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. మన దేశంలో  టీకా అందుబాటులోకి వస్తే తొలి ప్రాధాన్యంగా ఆరోగ్య సిబ్బంది, వృద్ధులకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.

రైతులు ఇపుడే గుర్తొచ్చారా సార్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆందోళన చేస్తున్న రైతన్నలకు సంఘీభావంగా వివిధ రాజకీయ పక్షాలు ఈరోజు భారత్ బంద్ కు పిలుపు ఇవ్వడంతో బంద్ ఉధృతంగా జరుగుతోంది. ఈ నేపద్యంలో తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ బంద్ కు పూర్తి మద్దతు తెలుపుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మంత్రులతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.   దీంట్లో భాగంగా హైదరాబాద్ లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా బంద్ కు మద్దతుగా తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నిరసనకు దిగారు. దీంతో పోలీసులు కూడా వారికి సహకరిస్తూ బారీకేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను నిలిపివేశారు. అయితే ఈ నిరసనతో తీవ్ర ఇబ్బందులకు గురయిన వాహనదారులు, స్థానికులు ఇదేంటని ఎమ్మెల్యే గాంధీని నిలదీశారు. ఇలా తమను ఇబ్బందులకు గురిచేయడం తగదని... అంతేకాకుండా ఇన్నాళ్లు కనపడని రైతు కష్టాలు మీకు ఇప్పుడే కనిపించాయా? అంటూ ఎమ్మెల్యేను ఓ మహిళ గట్టిగా ప్రశ్నించింది. అయితే ఎమ్మెల్యేను నిలదీస్తున్న స్థానికులతో టీఆర్ఎస్ నాయకులు కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో.. ఎమ్మెల్యేను ప్రశ్నించడానికి వచ్చిన ఒక స్థానికుడి పై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో పరిస్థితి చేయిదాటి పోయేలా వుండటంతో పోలీసులు రంగంలోకి దిగి టీఆర్ఎస్ కార్యకర్తలకు, స్థానికులకు సర్ది చెప్పి పంపించివేశారు. దీంతో గొడవ సద్దుమణగడంతో స్థానికులు అక్కడి నుండి వెళ్లిపోగా టీఆర్ఎస్ నాయకులు తమ నిరసనను కొనసాగించారు.

వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్.. భారత్ లో రెండు వారాల్లో అనుమతి..! 

కరోనాతో సతమతమవుతున్న దేశ ప్రజలకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేశంలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఫైజర్, సీరం ఇండియా, భారత్ బయోటెక్ ఇప్పటికే డిసిజిఐ కి దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో దీనిపై రెండు వారాల్లోగా అనుకూల నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాల ద్వారా తెల్సుస్తోంది. వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల అభ్యర్థనలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సిడిఎస్ సిఓ) నిపుణుల కమిటీ రేపు బుధవారం వ్యాక్సిన్ పనితీరు, పంపిణి పైన కూలంకషంగా చర్చించే అవకాశం ఉంది. ఈ కమిటీ తన రిపోర్ట్ అందించిన తరువాత డిసిజిఐ రెండు వారాల్లోగా అత్యవసర అనుమతి మంజూరు చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈనెల 4 న జరిగిన అఖిలపక్ష సమావేశంలో మరికొద్ది వారాల్లో వ్యాక్సిన్ సిద్ధమవుతుందని మోడీ ప్రకటించిన నేపథ్యంలో ఈ వార్తలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.   అయితే అత్యవసర అనుమతి ఇచ్చే ముందు వ్యాక్సిన్ ప్రభావం, భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అన్నిటికంటే ముఖ్యం కనుక దీనిపై పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ మూడు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల పర్యటన, ఆ వెంటనే ఉత్పత్తి సంస్థలు వ్యాక్సిన్ అత్యవసర అనుమతి కోసం దరఖాస్తు చేయడం గమనిస్తే.. బహుశా త్వరలోనే వ్యాక్సిన్ కు అత్యవసర అనుమతి లభించే అవకాశం ఉంది.

స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వలేం! ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. గతంలో కరోణా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందు కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని జగన్ సర్కార్ చెబుతోంది. దీని కోసమే హైకోర్టుకు వెళ్లింది. ఫిబ్రవరిలో జరపతలపెట్టిన స్థానిక ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ సర్కార్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఎన్నికలపై స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

గ్రామ వాలంటీర్లకు జగన్ సర్కార్ షాక్

ఏపీ సీఎం జగన్ అధికారం చేపట్టగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నవరత్నాల పథకాల అమలులో భాగంగా సంక్షేమ లబ్ధిని ఇంటింటికీ అందించే లక్ష్యంతో ఈ వాలంటీర్ వ్యవస్థను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే 35 ఏళ్ల వయసు నిండిన వారిని ఉద్యోగం నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన తాజా ఆదేశాలతో వాలంటీర్లకు పెద్ద షాక్ తగిలింది. తాజా ఉత్తర్వుల ప్రకారం 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు వారితోపాటు 35 సంవత్సరాల వయసు నిండిన వారిని తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిందిగా గ్రామ వలంటీరు సచివాలయం, వార్డు వలంటీరు సచివాలయం శాఖ డైరెక్టర్‌, కమిషనర్‌ జీఎస్‌.నవీన్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో వాలంటీర్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా వాలంటీర్ల పోస్టులను భర్తీ చేశారు. 50 ఇళ్లకు ఒక వాలంటీరు లెక్కన రాష్ట్రంలో 2.60 లక్షల మందిని గ్రామ, వార్డు వాలంటీర్లను నియమించారు. వీరిలో ఎక్కువ మంది అధికార వైసీపీ గ్రామ, మండలస్థాయి నాయకులతో పాటు ఎమ్మెల్యేల సిఫారసులతో నియమితులైన వారే.   ఇప్పటికే 35 ఏళ్లు నిండి వాలంటీరుగా పనిచేస్తున్న వాలంటీర్లకు సీఎఫ్‌ఎంఎస్‌ సిస్టమ్‌ ద్వారా అందించే జీతాలు రావడంలేదు. గత కొంతకాలం నుంచి ఈ అంశం చర్చనీయాంశమైంది. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో వాలంటీర్ల నియామకాలు జోరుగా సాగాయి. అయితే 35 ఏళ్లు నిండిన వారెవరైనా ఉంటే వారిని వెంటనే ఆ విధుల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. వారిని విధుల నుంచి తొలగించి.. ఆ ఖాళీల భర్తీకి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశాలు అందాయి. ఈ ఉత్తర్వులు ఖచ్చితంగా అమలైతే ప్రభుత్వ నిబంధనలు ప్రకారం 35 సంవత్సరాల వయస్సు దాటిన వారి సంఖ్య కొన్ని వేలలో ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. నిబంధనలు అనుసరించి 35 సంవత్సరాలు దాటి ఒక్కరోజు ఉన్నా సరే సదరు వాలంటీరును ఉద్యోగం నుంచి తొలగిస్తారు.

రైతుల పోరాటానికి భారీ మద్దతు! ప్రశాంతంగా భారత్ బంద్ 

రైతు సంఘాల పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రైతుల బంద్ కు వివిధ కార్మిక సంఘాలు విపక్షాలు మద్ధతు ప్రకటించడంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. రైతులు రోడ్లు, రైలుపట్టాలపై బైఠాయించడంతో వాహనాలు, రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. యూపీలోని ప్రయాగరాజ్ నగరంలో సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. బనారస్ నుంచి గ్వాలియర్ వెళ్లాల్సిన బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ రైలును  ఆపివేశారు. భువనేశ్వర్ రైల్వే స్టేషనులో రైళ్లను రైతులు నిలిపివేశారు. రవాణ సంఘాలు బంద్ కు మద్ధతు ప్రకటించడంతో సరుకుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపించింది. పూణే మార్కెటును తెరిచినా రైతుల బంద్ కు మద్ధతు వ్యాపారులు దుకాణాలు తెరవలేదు. జైపూర్ లో రైతులు, ఎన్ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బీజేపీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.   బంద్ సందర్భంగా  నిలిచిపోయిన ప్రయాణికులకు మంచినీరు, పండ్లను ఇస్తున్నారు నిరసనకారులు. ఢిల్లీ సరిహద్దుల్లో 13వ రోజు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు చలిని సైతం లెక్క చేయకుండా రోడ్లపై భైఠాయించారు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు రైతులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.  రైతుల ఆందోళనతో సింఘు, టిక్రి, జారోదా, ఘజిపూర్, చల్లా, నోయిడా లింక్ రోడ్డు, జటిక్రా సరిహద్దు రహదారులను పోలీసులు మూసివేశారు. హరియనా, నోయిడా నుంచి ఢిల్లీ వచ్చే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. సరిహద్దుల్లో భారీగా కేంద్ర బలగాల మోహరించాయి. ఇప్పటికే ఐదు సార్లు చర్చలు జరిపినా రైతులు పట్టువీడలేదు. బుధవారం మరోసారి రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరపనుంది.

పరకాల సత్యాన్వేషణ.. అమరావతి విషాదం!

ఒక రాష్ట్రం కళ్లు తెరిచి ఆరున్నరేళ్లవుతోంది. అర్థరాత్రి పార్లమెంటు తలుపులు మూసి.. తెలుగు ప్రజ తలపులు పట్టించుకోకుండా.. విభజిత రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేసిన విభజనకూ అంతే వయస్సు. ఇంతవరకూ దానికంటూ ఒక రాజధాని నగరం లేని దౌర్భాగ్యం. ఆ విషాదాన్ని  సొంతం చేసుకున్న ఆంధప్రదేశ్ ప్రజల దురదృష్టానికి కారణాలు.. ఇకపై ఏం చేయాలో  ఆలోచించాలనే ‘స్పృహ లాంటి చైతన్యం’ కలిగించేందుకు తొలిసారిగా ఓ ప్రయత్నం.  ఈ దుస్థితి నాకే ఎందుకన్న ఆలోచన, సగటు ఆంధ్రుడిలో జనింపచేసే ఓ పెను సంకల్పం. కలసి వెరసి..  ప్రభుత్వ మాజీ సలహాదారయిన డాక్టర్ పరకాల ప్రభాకర్  ఆవేదనాభరిత హృదయం నుంచి ఆవిష్కృతమయినదే ‘అమరావతి విషాదం’.   అమరావతి రాజధాని పూర్వ- ప్రస్తుత స్థితిగతులు, ప్రజాభిప్రాయం-నేతల అంతరంగాలను గుదిగుచ్చి,  ఓ గంటసేపు రూపొందించిన డాక్యుమెంటరీ  చూసిన వారికెవరికయినా.. ‘అమరావతి అంత విషాదంలో ఉందా’ అనిపించక మానదు. అందుకే దానికి పరకాల ‘అమరావతి విషాదం’ అని పేరు పెట్టారేమో?! నిజానికి ఆ డాక్యుమెంటరీ చూపిన వాస్తవ దృశ్యాలు కూడా,  ఆ పేరుకు తగిన ట్లుగానే ఉంది. దానిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారాయన. మంచిదే. విషాదం-సంతోషం దాచిపెట్టుకోకూడదు. అవి పదుగురితో పంచుకోవలసినవి కదా!   అసలు అమరావతిలో ఏం జరిగింది? ఇప్పుడేం జరుగుతోంది? ఇకపై  ఏం జరగబోతోంది? ప్రజల మానసిక పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా భూములిచ్చి గాయపడిన రైతుల మనోభావాలు ఎలా ఉన్నాయి? రాజకీయ-రైతుసంఘాల నాయకుల మనసులో మాటేమిటన్న ప్రశ్నలను, పరకాల తనతో అమరావతి వరకూ  కారులో వెంటపెట్టుకుని వెళ్లినట్లు కనిపించింది. అది ఒక సత్యాన్వేషి  ప్రయత్నంగానే అనిపించింది.   ప్రధాని మోదీ దేశంలోని అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన మట్టి-నీటిని హోమంలో వేసిన ప్రాంత పరిసరాలను చూపిన ప్రభాకర్.. మళ్లీ అలనాటి అమరావతి నగర భూమిపూజ హడావిడి దృశ్యాలను జ్ఞప్తికి తెచ్చారు. అప్పటి ఆ సంరంభంలో ఆయన కూడా ఒక భాగస్వామి కాగా.. మాలాంటి జర్నలిస్టులంతా సాక్షులం. పరకాల ‘అమరావతి విషాదం’ చూడగానే, తొలుత స్ఫురణకు వచ్చినవి ఆ దృశ్యాలే.   పార్లమెంటులో నాటి కాంగ్రెస్ దర్శకత్వంలో, బీజేపీ సహ నిర్మాణంలో జరిగిన రాష్ట్ర విభజన నుంచి.. నేటి మూడు రాజధానుల అగమ్యగోచర పరిస్థితులను, పరకాల చాలా సహనంతో దృశ్యంగా మార్చడం అభినందనీయమే. హైదరాబాద్ టు అమరావతి వరకూ సాగిన పరకాల ‘అమరావతి విషాద ’ యాత్రలో.. ఉండవల్లి అరుణ్‌కుమార్, అంబటి రాంబాబు, ఐవైఆర్ కృష్ణారావు, వర్ల రామయ్య, ఇంకా రైతులు, సామాజికవేత్తల మనోగతాన్నీ ప్రజల ముందు ఆవిష్కరించారు. ఆ మధ్యలోనే నాటి అధికార టీడీపీ- నేటి వైసీపీ ప్రభుత్వ విధానాలు, ఆ పార్టీ అగ్రనేతలిద్దరి వైఖరినీ ప్రజల ముందుంచారు. అసలు ప్రభుత్వాలు మారినా,  అమరావతి తలరాత మారకపోవడానికి కారణమేమిటన్న ప్రశ్నలు సంధించిన పరకాల.. వాటికి పరిష్కారాలు కూడా సూచిస్తే, ఆయన ప్రయత్నానికి సంపూర్ణత్వం చేకూరేది. ప్రజల ఆవేదన, రైతుల ఆందోళన, ప్రధానంగా మూడుపంటలు పండే భూములిచ్చిన తాము.. ‘పెయిడ్ ఆర్టిస్టులనే బిరుదు’ పొందుతున్న విషాదం.. రాజకీయ నేతల అనుకూల-వ్యతిరేక వాదనలు, ప్రస్తుత శిధిలావస్థలో ఉన్న అమరావతి కట్టడాలు, వాటి భవిష్యత్తు.. వీటికి మించి... ఎంతో ఆసక్తితో, ‘జగన్ ప్రవచిత దక్షిణాప్రికా రాజధానుల’ కథేమిటో తెలుసుకోవాలన్న సంకల్పం..  అక్కడి ప్రముఖులతో చేసిన ఇంటర్వ్యూ.. ఇవన్నీ విజజిత ఆంధ్రప్రదేశ్ విషాదంపై పరకాలకు ఉన్న సానుభూతిని బహిర్గతం చేశాయి.   రాజధాని కోసం రైతులు-ప్రజలు పడుతున్న ఆవేదనలో పాలుపంచుకుని, వాటిని ప్రపంచానికి చాటిన పరకాల ప్రయత్నం స్వాగతించదగ్గదే. ఎందుకంటే అసలు ఇలాంటి ప్రయత్నం, ఆలోచన ఇంతవరకూ ఎవరూ చేయలేదు కాబట్టి! అయితే.. ఇప్పటి అమరావతి విషాదానికి, పరిష్కారం కూడా సూచిస్తే ఇంకా బాగుండేది. పైగా.. అలనాటి అమరావతి రాజధాని ప్రయత్నంలో,  పరకాల ప్రభుత్వపరంగా ఓ భాగస్వామి కూడా. అందుకే ఆయన మస్తిష్కం నుంచి జాలువారిన ఈ ప్రయత్నంపై సహజంగా ఎక్కువ ఆ, అంచనాలుంటాయి. కాబట్టి.. నాటి తెరవెనుక కథలు, గాథలు కూడా ఆవిష్కరిస్తే బాగుండేదనిపించింది.   ‘అమరావతి విషాదం’ ప్రశ్నలు.. ఆవేదన.. వాదన.. విమర్శ.. చరిత్రకే పరిమితం అయిందనిపించింది. చివరకు ఉండవల్లి వంటి నేతలు, ఐవైఆర్ కృష్ణారావు లాంటి మేధావులు కూడా,  అమరావతిని విషాదం నుంచి తప్పించేందుకు ఏం చేయాలో చెప్పలేకపోవడం కనిపించింది. ఇక పరకాల గళం.. అందులోని తెలుగుతనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు. అమరావతి విషాదం గురించి అరటిపండు వలిచినట్లు దృశ్యకావ్యం ఇచ్చారు. నిష్ణాతులయిన సాంకేతిక నిపుణులను ఎంచుకోవడంలో.. ఈ డాక్యుమెంటరీకి నిండుతనం వచ్చింది. అంతా బాగుంది. కానీ అమరావతి విషాదాన్ని ఎంతో శ్రమించి, దృశ్యంగా అందించిన పరకాల.. దానిని హైదరాబాద్‌లో కాకుండా, అదే అమరావతి ప్రాంతంలోనే ప్రివ్యూ వేసి ఉంటే,  మరింత సహజత్వం  ఉండేదన్న మాటలు అక్కడ వినిపించాయి.     ఏదేమైనా,  ఒక ప్రశ్న.. మరొక అవమానం..  ఆంధ్రుడి ఇంకొక సిగ్గుమాలిన తనం..ప్రజల చేతకాని చేవలేనితనాన్ని ‘అమరావతి విషాదం’ ధైర్యంగా ఆవిష్కరించింది. ఇందుకు తొలిసారి గజ్జె కట్టిన పరకాల ప్రభాకర్ అభినందనీయులు. సహజంగానే పరకాల దగ్గర కూర్చుంటే బోలెడన్ని విషయాలు దొరుకుతాయి. అప్పటి అనేక  అనుభవాలు గుర్తుకొస్తాయి.  ఫోన్‌లోనయినా అంతే. అయితే కావలసిందల్లా అంశమే!  అంశం బాగుందనుకుంటే అవి దొంతరలా వచ్చేస్తుంటాయి. విషయ పరిజ్ఞానానికి కొదువ లేని మేధావి అయిన పరకాల.. ఇన్నాళ్లూ అమరావతికి దూరంగా ఉంటూ కూడా, అదే ‘అమరావతి విషాదం’ గురించి ఆలోచించడం..  జన్మభూమిపై ఆయనకున్న మక్కువకు నిలువెత్తు నిదర్శనం. 

ఏలూరు వింత రోగానికి కారణం ఇదే.. నిపుణుల అంచనా..! 

ఏలూరులో భయాందోళనకు గురిచేస్తున్న వింత రోగంపై ఏపీలో తీవ్ర కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వింత రోగానికి సంబంధించిన కారణాలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. ఈ వింత రోగంపై వివిధ సంస్థలు, అలాగే ప్రభుత్వ సంస్థలు నివేదికలు సిద్ధం చేశాయి. తాజాగా బాధితుల శరీరంలో లెడ్, నికెల్ వంటి హెవీ మెటల్ పదార్ధాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది. ఇవి తాగునీరు లేదా పాల ద్వారా శరీరంలో చేరి ఉండవచ్చని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిపుణుల తాజా నివేదిక అధికారికంగా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అయితే దీనికోసం తొమ్మిది డెయిరీల నుంచి పాల నమూనాలు తీసుకుని ల్యాబ్ కు పంపించారు. వీటికి సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉంది. కల్చర్‌ రిపోర్టు, ఈ-కోలీ పరీక్ష ఫలితాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.    న్యూరో టాక్సిన్స్ కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తినే ఆహారం లేదా తాగునీరు లేదా పాల ద్వారా ఈ వింత రోగం వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. రోగుల నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించడం తో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. బాధితుల్లో కంటి నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు తాజాగా గుర్తించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సోమవారం పరిశీలించిన రోగుల్లో 70 నుంచి 80 శాతం మందికి ఈ సమస్య ఉందని గుర్తించారు. వైద్య పరిభాషలో "ప్యూపిల్ డైలటేషన్‌" గా దీనిని వైద్యులు పేర్కొంటున్నారు. ఇది మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం చెబుతోంది. 

ఉపరాష్ట్రపతి చొరవతో.. అంతుపట్టని వ్యాధి పై రంగంలోకి కేంద్ర ప్రత్యేక బృందం 

ఏపీలోని ఏలూరు పట్టణంలో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టిస్తున్న సంగతి తెల్సిందే. నాలుగు రోజులుగా పలువురు కళ్లుతిరగడం, నోటి నుండి నురగ, మూర్ఛ వంటి లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరుతూ చికిత్స తీసుకుని.. రెండ్రోజుల్లో కోలుకొని ఇంటికి వెళ్లిపోతున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరగడంతోపాటు ఇందులో చిన్నారులు, మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆందోళన మొదలైన సంగతి తెలిసిందే. లక్షణాలను బట్టి ఇది సంక్రమణ వ్యాధి లాగా అనిపించడం లేదని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నా.. దీనికి అసలు కారణాలేంటనేది మాత్రం అంతుచిక్కడం లేదు. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని విజయవాడ, విశాఖపట్టణం పంపి చికిత్సనందిస్తున్నారు.   తాజాగా ఈ విపత్తు పై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దీని గురించి తెలియగానే అయన కలెక్టర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడి అక్కడి పర్సిస్థితుల గురించి తెలుసుకున్నారు. దీనిపై స్థానిక వైద్యులతోపాటు మంగళగిరి నుండి వచ్చిన ఎయిమ్స్ వైద్య బృందం కూడా పరిశీలించిందని.. అయితే ఇప్పటివరకు జరిపిన వైద్యపరీక్షల్లో దీనికి కారణమేంటనేది మాత్రం తెలియడం లేదని ఉపరాష్ట్రపతికి అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడారు. ఈ అంతుచిక్కని వ్యాధి బాధితులకు ఉన్నతస్థాయి వైద్యం అందించడంతోపాటు.. అసలు దీనికి గల కారణాన్ని గుర్తించి.. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు రాష్ట్రప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.   ఉపరాష్ట్రపతి సూచనతో కేంద్రమంత్రి ఏయిమ్స్ అత్యవసర వైద్య విభాగం ప్రొఫెసర్ డాక్టర్ జంషెడ్ నాయర్, పుణే ఎన్ఐవీ వైరాలజిస్ట్ డాక్టర్ అవినాష్ దేవష్టవర్, ఎన్డీసీసీ డిప్యూటీ డైరెక్టర్, డాక్టర్ సంకేత్ కులకర్ణిలతో కూడిన ముగ్గురు వైద్య నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేశారు. ఈ బృందం ఏలూరు లోని వైద్యుల నుండి ఇక్కడి పరిస్థితిని ఇప్పటికే అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ బృందం ఏలూరుకు వచ్చి, ల్యాబ్ నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందజేస్తారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కేంద్ర మంత్రి తెలియజేశారు.

బీజేపీలో చేరిన రాములమ్మ.. కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కొద్దిసేపటి క్రితం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.   1998లో బీజేపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని విజయశాంతి చెప్పారు. తెలంగాణ కోసం చాలా కష్ట పడ్డానని తెలిపారు. అయితే కొన్ని కారణాల వల్ల అప్పట్లో బీజేపీ నుంచి బయటకు వచ్చి, ప్రత్యేక తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. అయితే, తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని కేసీఆర్ ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపారు. ఏ పార్టీ ఉండకూడదన్న దురుద్దేశ్యంతో కేసీఆర్ వ్యవహరించారని అన్నారు. కేసీఆర్ కంటే ముందు నుంచే తాను తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చానని తెలిపారు. టీఆర్ఎస్ నుంచి తాను, కేసీఆర్ ఇద్దరం ఎంపీలుగా గెలిచామని గుర్తు చేసిన ఆమె.. 2013 జూలైలో తనను పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారని చెప్పారు. ముందు నుంచే కేసీఆర్ తనపై కుట్ర పూరితంగా వ్యవహరించారని, టీఆర్ఎస్ నుంచి తానే బయటకు వెళ్లానని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.   తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాగాంధీకి చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడే నాయకులు ఎవరూ ఉండకూడదన్న ఆలోచనతో ఇతర పార్టీల నేతలందరినీ టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారని మండిపడ్డారు. కానీ, ప్రస్తుతం తెలంగాణ‌లో టీఆర్ఎస్‌ కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదిగిందని చెప్పారు. తెలంగాణలో పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోందని, కేసీఆర్ అవినీతి భాగోతాన్ని బయటపెడతానని అన్నారు.  కేసీఆర్‌ను గద్దె దించుతాం, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే రాబోతోందని విజయశాంతి తెలిపారు.

వరంగల్ మెడికల్ కాలేజీలో సినీ ఫక్కీలో ఎలక్ట్రానిక్ మాస్ కాపీయింగ్

చదువుకొని టెక్నాలజీని డెవలప్ చేసేవాళ్ళు కొందరైతే.. చదవలేక టెక్నాలజీని ఉపయోగించి పరీక్షల్లో కాపీ కొట్టేవాళ్ళు కొందరు. అలాంటి ఆణిముత్యం తాజాగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో దొరికింది. ఎన్నో సినిమాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో కాపీ కొట్టడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ ఘనకార్యం వరంగల్ లో వెలుగులోకి వచ్చింది.   వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థి అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డాడు. అతడు చెవిలో మైక్రోఫోన్ పెట్టుకోగా, బయట కళాశాల ఆవరణలో కారులో కూర్చుని ఓ డాక్టర్ ఎలక్ట్రానిక్ పరికరాల సాయంతో సమాధానాలు అందించాడు. ఇది గమనించిన కళాశాల సిబ్బంది విద్యార్ధిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు విద్యార్థి నవంబరు 26,28, డిసెంబరు 3వ తేదీల్లో జరిగిన పరీక్షల్లో ఈ విధంగా కాపీయింగ్ కు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు, నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.    నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. పరీక్షలు రాయడం కోసం వైద్య విద్యార్థి ఓ డాక్టర్ సాయం తీసుకొని కాపీ కొట్టాడు. భవిష్యత్ లో పొరపాటున డాక్టర్ అయితే.. ఎవరైనా పేషెంట్ కి ఆపరేషన్ చేయాల్సి వస్తే.. ఇలాగే చెవిలో మైక్రోఫోన్ పెట్టుకోని మరో డాక్టర్ సాయంతో ఆపరేషన్ చేస్తాడా?.. వామ్మో ఇలాంటి వారిని వదిలేస్తే అంతే సంగతులు!!