హోంమంత్రి బంధువంటూ లై*గిక దాడి!

ఏపీ హోంమంత్రి సుచరిత బంధువునంటూ బిల్డప్ ఇచ్చాడు. పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్స్ చేస్తానంటూ నమ్మించాడు. భర్తతో గొడవ పడిన ఓ మహిళను ట్రాప్ చేశాడు. ఓ ఇంట్లో ఉంచి ఆమెపై లై*గిక దాడి చేశాడు. అతనితో పాటు ఓ కాంగ్రెస్ నాయకుడూ జత కలిశాడు. మహిళ న..గ్న వీడియోలు తీశారు. కేసు పెడితే పోలీసులూ పట్టించుకోవడం లేదు. ఇదంతా ఓ బాధితురాలి ఆరోపణ. తనకు న్యాయం చేయమంటూ గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది ఆ మహిళ. నరసరావుపేటలోని శ్రీనివాసనగర్‌కు చెందిన ఓ యువతి భర్తతో గొడవ పడి విడిపోయింది. ఆ మేటర్ సెటిల్ చేస్తామంటూ నరసరావుపేటకు చెందిన ఆవుల మస్తాన్‌రావు, కనపర్రుకు చెందిన గుంజి శ్రీనివారావు ఆమెను నమ్మించారు. ఆ మహిళ దగ్గర ఉన్న 47 సవర్ల బంగారు ఆభరణాలు కాజేశారు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేసేందుకు నరసరావుపేట టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది ఆ మహిళ. అక్కడ యడ్లపాడుకు చెందిన ఓ వ్యక్తి తాను హోంమంత్రి సుచరిత బంధువంటూ పరిచయం చేసుకున్నాడు. న్యాయం చేస్తానని ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై ఆ వ్యక్తితో పాటు ఓ కాంగ్రెస్‌ నాయకుడు లై*గిక దాడి చేశారు. అనంతరం న..గ్న వీడియోలు తీసి ఆమెను బెదిరించారు. రూరల్‌ ఎస్‌ఐ డబ్బులు తీసుకుని ఆమెకు అన్యాయం చేయటమేకాక కాంగ్రెస్‌ నాయకుడిపై కేసు పెట్టకుండా వదిలేశారు. వారిద్దరిపై తగు చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని ఆ మహిళ గుంటూరు రూరల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదులో నిజానిజాలు ఏంటని ఆరా తీస్తున్నారు పోలీసులు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు లేనట్టే!

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరగా నిర్వహించాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించలేమని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనలు విన్న హైకోర్టు.. ఎన్నికలపై ఎస్ఈసీకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ  ఈనెల 30కి వాయిదా వేసింది.    ఏపీ హైకోర్టు తీర్పుతో జగన్ సర్కార్  ఆశలకు గండి పడినట్లైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై జగన్ సర్కార్ హడావుడి చేసింది.  ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి ఇంకా ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్నందున.. వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలని ఎస్ఈసీపై ఒత్తిడి తెచ్చింది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు త్వరగా ముగిస్తే మంచిదని కామెంట్ చేశారు. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం సెలవుపై వెళ్లారు.  మరోవైపు గతంలో పంచాయతీ ఎన్నికలకు  నిమ్మగడ్డ షెడ్యూల్ ఇస్తే కరోనా సాకుతో అడ్డుకోవాలని చూసింది వైసీపీ సర్కార్. ఆయనపై యుద్ధమే చేసింది. ఎన్నికలను అడ్డుకోవడానికి సుప్రీంకోర్టుకు వరకూ వెళ్లింది. ఎక్కడా వారికి అనుకూలంగా రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లింది వైసీపీ. ఇప్పుడు మాత్రం ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని మాట మార్చింది. దీంతో వైసీపీ నేతలు, సీఎం జగన్ తీరుపై జనాల నుంచి విమర్శలు వస్తున్నాయి. 

61పై ఆగ్రహం.. నిరుద్యోగులకు శాపం!

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61ఏళ్లు. దేశంలోని అనేక రాష్ట్రాల్లోకెల్లా ఇది అత్యధిక వయసు. కేంద్ర ఉద్యోగులకు సైతం 60ఏళ్లు. పీఆర్సీ కమిటీ సైతం 60 వరకే సిఫార్సు చేసింది. కేసీఆర్ మాత్రం 61ఏళ్లకు పెంచారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీ అంటూ.. ఎవరూ అడగకపోయినా.. బిస్వాల్ కమిటీ సిఫార్సు చేయకపోయినా.. ఈ నిర్ణయం తీసేసుకున్నారు. ఉద్యోగులంతా ఖుషీ ఖుషీ. ఎంచక్కా 61ఏళ్ల వరకూ ఉద్యోగం చేసుకోవచ్చు.. దండిగా జీతం తీసుకోవచ్చు అంటూ ఫుల్ హ్యాపీ. రిటైర్మెంట్ ఏజ్ 58 నుంచి 61కి పెంచడంతో.. ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్న వారు మరో మూడేళ్ల పాటు అదనంగా ఉద్యోగంలో ఉంటారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. మరి నిరుద్యోగుల సంగతి ఏంటి అనేది ప్రశ్న. తెలంగాణలో కొత్త ఉద్యోగాలనే మాటే మర్చిపోయి చాలా కాలమైంది. గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఏళ్లుగా చకోరా పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. అవసరమైతే నిరుద్యోగ భ‌ృతి అయినా ఇస్తాం కానీ, కొత్త ఉద్యోగం అడగొద్దు అనేలా ఉంది సర్కారు తీరు. ఇక, ప్రభుత్వ తాజా నిర్ణయంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన. మా కడుపు కొడుతున్నారంటూ మండిపాటు. అందుకే, పీఆర్సీ పెంపుతో ఉద్యోగులు కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం చేస్తే.. ఓయూ స్టూడెంట్స్ చెప్పులతో నిరసన తెలిపారు.  పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది. ఉద్యోగులు రిటైర్ అవుతుంటే.. ఖాళీలు ఏర్పడి కొత్త ఉద్యోగాలు వస్తాయి. పదవి విరమణ వయసు మరో మూడేళ్లు పెంచడంతో.. ఇక ఇప్పట్లో రిటైర్ అయ్యే ఉద్యోగులు తగ్గిపోతారు. ఖాళీలు ఏర్పడవు. కొత్త ఉద్యోగాలు రావు. నిరుద్యోగం మరింత పెరుగుతుంది. ఇప్పటికే ఏళ్లుగా జాబ్స్ లేక తీవ్ర అసంతృప్తి, అసహనంలో ఉన్న గ్రాడ్యుయేట్స్‌కి ఇది మరింత ఆశాపాతం. అందుకే, పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచడంపై నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాలనలో ఇప్పుడంతా సాంకేతికత కమ్మేసింది. అంతా కంప్యూటరైజ్డ్ వర్క్. పదవీ విరమణ వయసు దగ్గర పడిన సీనియర్ మోస్ట్ ఎంప్లాయిస్.. ఈ కొత్త సాంకేతికతకు అంతగా అలవాటు పడటంలేదనేది ఓ ఆరోపణ. నిదానమైన పనితీరు, కంప్యూటర్ స్కిల్స్‌లో నైపుణ్యం లేకపోవడం వారికి మైనస్. రిటైర్మెంట్ ఏజ్ మరింత పెరిగితే.. అలాంటి సీనియర్ మోస్ట్ ఉద్యోగులు మరో మూడేళ్ల పాటు అదే సీటులో పాతుకుపోతారు. పని విధానమూ మరింత నెమ్మదిస్తుందని అంటున్నారు. అదే, కొత్త ఉద్యోగాలతో యువకులను ప్రభుత్వ శాఖల్లో తీసుకుంటే.. టెక్నికల్ నాలెడ్జ్‌తో పాటు ఉరిమే ఉత్సాహంతో మంచి పనితీరు కనిపిస్తుందనేది నిరుద్యోగుల వాదన. ఒక్కరికి ఉద్యోగం వస్తే.. వారి కుటుంబం అంతా సెటిల్ అవుతుందని.. సమాజమూ మరింత అభివృద్ధి చెందుతుందని విశ్లేషిస్తున్నారు. పాత, కొత్త ఉద్యోగుల కలయికతో ప్రభుత్వ విభాగాలు సమతూకంతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. అటు, సీనియర్ల అనుభవం, ఇటు యువకుల నైపుణ్యం రెండూ తోడైతే బాగుంటుంది కానీ, ఉన్న ఉద్యోగులనే మరింత కాలం కొనసాగిస్తే.. కొత్తదనం కరువవుతుందని అంటున్నారు.  ఇక, రిటైర్మెంట్ ఏజ్ పెంచడం ప్రభుత్వ ఖజానాపైనా ఆర్థిక భారం మోపుతుందని కొందరు అంటున్నారు. అప్పటికే సీనియర్లకు సుమారు లక్ష వరకూ శాలరీ వస్తుంటుంది. మరో మూడేళ్లు కొనసాగిస్తే.. జీతం లక్ష దాటిపోతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది సర్కారుకు పెను భారమే అంటున్నారు. ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్‌లో పని చేసే సీనియర్ టీచర్లకు 80వేలకు పైనే జీతం ఉంటుంది. చాలా స్కూల్స్‌లో 10 నుంచి 50 పిల్లలు మాత్రమే ఉంటారు. వారికి చెప్పేది కూడా.. అ, ఆ..లు, 1,2,3లు. కూడికలు, తీసివేతలు. ఇంత తక్కువ మంది పిల్లలకు.. అంత ఎలిమెంటరీ పాఠాలు చెప్పే సీనియర్ టీచర్లకు దాదాపు లక్ష వరకూ శాలరీ ఉంటుంది. అదే కొత్త టీచర్లైతే.. 20-30వేలకే వచ్చేస్తారు. అనుభవంలో తేడా ఉన్నా.. అప్పటికే వారంతా టీచర్ ట్రైనింగ్ చేసి ఉంటారు కాబట్టి ఫలితాల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చనేది నిరుద్యోగుల వాదన. పదవీ విరమణ వయసు పెంపుతో కొత్త ఉద్యోగాలకు గండి పడినట్టే. అందుకే, రిటైర్మెంట్ ఏజ్ లిమిట్ 61ఏళ్లకు పెంచడం దాదాపు 3లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అయినా.. అంతకుమించి ఉన్న నిరుద్యోగులకు మాత్రం ఇది చేదువార్త.

బీటెక్ స్టూడెంట్ సూసైడ్.. 

కారణం ఏదైనా కావచ్చు. ఈ మధ్య స్టూడెంట్ తమ భవిత మరిచి. తల్లి దండ్రులను మరిచి తనువులు చలిస్తూ ఆత్మహత్యలకు పాలుపడుతున్నారు. క్షణికావేశంలో నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. తాజాగా మేడ్చల్‌ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన విద్యార్థిని చంద్రిక ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షల ప్రిపరేషన్ కోసం వెళ్లిన చంద్రిక హాస్టల్ భవనం పై నుండి దూకి మరణించింది.  చంద్రిక స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడ. మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్ నాలుగో ఏడాది చదువుతోంది. కళాశాల సమీపంలో ఉన్న కృపా అనే ప్రైవేటు హాస్టల్ లో  ఉంటోంది. హాస్టల్ పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో చంద్రిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు మంగళవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు.  హాస్టల్ భవనం  పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు.    విద్యార్థిని చంద్రిక ఫిబ్రవరి 4న వసతిగృహాంలో చేరి.. పరీక్షల కోసం సన్నద్ధం అవుతున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థిని ఎందుకు మరణించింది. తన మృతి వెనుక ఏ కారణాలు ఉన్నాయి అనేది వివరాలు తెలియరాలేదని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

శానిటైజర్ చావులు కావు.. జగన్ సర్కారు హత్యలు! 

వాళ్లంతా నిరు పేదలు.. రోజువారీ కూలీ చేసుకుని జీవితం గడిపేవారు. రోజంతా కష్టపడి పని చేసే ఆ కూలీలకు  సాయంత్రం మద్యం తాగడం అలవాటు. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న  వైసీపీ సర్కార్ మద్యం ధరలను భారీగా పెంచింది. దీంతో మద్యానికి అలవాటు పడిన పేదలు.. ఎక్కువ ధరకు మద్యం కొనలేక అవస్థలు పడ్డారు. మత్తుకు బానిసలుగా మారడంతో మర్చిపోలేకపోయారు. లిక్కర్ కు బదులుగా శానిటైజర్ తాగారు. మత్తు కోసం నీళ్లలో శానిటైజర్ కలుపుకుని తాగారు. శానిటైజర్ డోస్ ఎక్కువ కావడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఇద్దరూ ప్రాణాలు కూడా కోల్పోయారు. విజయవాడలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగడం వల్లే విజయవాడ వన్‌టౌన్‌‌కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ  చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు.  శానిటైజర్ తాగి ఇద్దరు చనిపోయిన ఘటనకు ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీడీపీ ఆరోపిస్తోంది. మద్యపాన నిషేదం పేరుతో మహిళల ఓట్లు దండుకున్న సీఎం జగన్.. మద్యం అమ్మకాలు, రేట్లు పెంచి మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు.  సీఎం మద్యం ధరలు పెంచి పేదల రక్తం తాగుతున్నారన్నారు. మద్యం రేట్లు పెరగడంతో సామాన్యులు తన రోజు కూలీ మొత్తం మద్యానికే ఖర్చు చేస్తూ వారి కుటుంబాల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. మద్యానికి అలవాటుపడిన వారు మద్యలో మానలేక, పెరిగిన ధరలకు మద్యం కొనలేక డబ్బుల కోసం ఇంట్లో మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని, మరికొంత మంది శానిటైజర్ తాగి చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం రేట్లు పెరిగాక రాష్ట్రంలో శానిటైజర్, నాటుసారా తాగి సుమారు 50 మంది చనిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు జవహర్. పక్కనున్న తెలంగాణలో దేశంలో లభించే బ్రాండ్లన్నీ లభిస్తుంటే ఏపీలో మాత్రం జగన్ సొంత బ్రాండ్లు మాత్రమే దొరుకుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు, వాలంటీర్లే మద్యం మాఫియాను పెంచి పోషిస్తున్నారని, మద్యం రేట్లు పెంచి, అమ్మకాలు పెంచి ప్రభుత్వానికి ఖజానా నింపుకోవాలన్న ధ్యాస తప్ప మద్యపాన నిషేధం అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని ప్రజలకు అర్ధమైందని జవహర్ మండిపడ్డారు. 

వాళ్ళు సర్వ నాశనమైపోతారు..

దేవుడి సొమ్ములను టచ్ చేయాలంటే.. జనం భయపడి వెనక్కు తగ్గే రోజులు పోయాయి. దేవుడి సొమ్ములు ఆస్తులు అయితే మాత్రం ఏంటి నొక్కేద్దామనే ఆలోచనలు ప్రస్తుతం జనంలో బాగా పెరిగిపోయాయి. దీంతో రెండు తెలుగు  రాష్ట్రాలలో అనేక దేవాలయాలు సొంత భూములు, ఆస్తులు ఉన్నా నిత్య ధూప, దీప నైవేద్యాలకు కూడా నోచుకోకుండా ఉన్నాయి. అంతేకాకుండా ఇలా దేవుడి ఆస్తులు, సొమ్ములు బొక్కేసే వారిలో బడాబాబుల హస్తాలు కూడా ఉన్న సంగతి తెల్సిందే.   తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇటువంటి ఒక దేవాలయం దుస్థితి వెలుగు చూసింది. ఈ ఆలయ పారిస్తాటిని చూసి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని గుళ్ళ సీతారామపురం ఆలయమ యొక్క దుస్థితిని చూసిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా స్వామీజీ నేడు గుళ్ళ సీతారామపురం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక్కడి ఆలయానికి మూడు వేల ఎకరాల భూములున్నా..  ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ఆలయ భూముల్ని అన్యాక్రాంతం చేసిన, ఆక్రమించిన వారికి నాశనం తప్పదన్నారు. వారు దోచుకున్న భూముల్ని అలయానికి తిరిగి అప్పగించాలని స్వాత్మానందేంద్ర స్వామి డిమాండ్ చేశారు. గుళ్ళ సీతారామపురం ఆలయ దుస్థితిపై రాష్ట్ర దేవాదాయ శాఖతో చర్చిస్తామన్నారు. వచ్చే శ్రీరామనవమి వేడుకలకు విశాఖ శారదాపీఠం తరపున స్వామివారికి పట్టువస్త్రాలను పంపిస్తామన్నారు. అంతేకాకుండా సీతారాములకు వెండి కిరీటాలను కూడా చేయిస్తామని స్వాత్మానందేంద్ర స్వామి పేర్కొన్నారు.  

నీటితో ఆట.. నీటిపై మృత్యువాత..

కొందరిని వారి సరదానే ప్రాణం తీస్తుంది. మరి కొందరిని వాళ్ళ పాపం ప్రాణం తీస్తుంది.. చాలా మందిని వారి వయసు ప్రాణం తీస్తుందని తెలుసు. కానీ, ఎప్పుడైనా ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తుండగా ఆ లక్ష్యం వారి ప్రాణాలు తీస్తుందనుకుంటారా..? అనుకోరు, ఎందుకంటే.. అలా జరుగుతుందని భయపడితే ఎవరు తమ లక్షణాన్నిసాధించలేరు. ఇక్కడ మాత్రం ఆమె లక్ష్యమే తన ప్రాణం తీసింది. వాటర్ పై పయనించడమంటే ఆమెకు మహా సరదా. అందుకే సర్ఫింగ్ క్రీడా నేర్చుకుంది. క్రీడతో పాటు ఆమెకు దేశ భక్తి కూడా ఎక్కువే అందుకే  టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని తెలిసిన ఆమె క్రీడాకారిణి ఆనందానికి సద్దులు లేవు. ఎలాగైనా ఒలంపిక్స్ లో ఎలాగైనా అర్హత దాచింది దేశానికి స్వర్ణ పధకం సాధించాలని. కలకంది. కానీ చివరికి ఆ కల కలగానే మిగిలిపోయింది.  ఒలింపిక్స్‌లో తొలిసారిగా సర్ఫింగ్‌ క్రీడను ప్రవేశపెట్టబోతున్నారని. ఆ క్రీడాకారిణి సంతోషంలో మునిగి. ఎలాగైనా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని పట్టుదలతో సాధన మొదలెట్టింది. నీటి అలలపై తేలింది. క్రీడలో ఆరితేరేందుకు తీవ్రంగా శ్రమించింది. నీళ్లే తన శ్వాసగా, ద్యాసగా, ప్రాణంగా బతికిన ఆ అమ్మాయి.. చివరికి నీటిలోనే ప్రాణాల తో పాటు తన లక్ష్యాన్ని వదిలింది. ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల తీరకుండానే  అందరికి కన్నీళ్లు మిగిల్చిచి , తాను పిడుగుపాటుకు గురై మరణించింది.  ఆమె సాల్వడోర్‌కు చెందిన 22 ఏళ్ల కేథరిన్‌ డియాజ్‌. ఆ దేశంలోని అగ్రశ్రేణి సర్ఫర్‌ అయిన తను ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ కోసం సిద్ధమవుతోంది. ఆ ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీ అయిన ప్రపంచ సర్ఫ్‌ క్రీడల కోసం సాధన చేసేందుకు సముద్రంలోకి వెళ్లిన తను.. అక్కడే పిడుగుపాటుకు గురై కిందపడిపోయింది. వెంటనే అత్యవసర సహాయక సిబ్బంది ఆమెను ఒడ్డుకు చేర్చినప్పటికీ టుంకో బీచ్‌లోనే తుదిశ్వాస విడిచింది. తమ దేశానికి ప్రాతినిథ్యం వహించిన గొప్ప అథ్లెట్‌ మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. ఆమె గొప్ప యోధురాలని . దేశం బాధతో కన్నీళ్లు పెడుతోంది  అని ఆ దేశ సర్ఫ్‌ సమాఖ్య సామాజిక మాధ్యమాల్లో పోస్టు తెలుపుతుంది.   

తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా? 

తెలంగాణలో లాక్ డౌన్ తప్పదా.. రాత్రిపూట కర్ఫ్యూ పెట్టబోతున్నారా అంటే వైద్య శాఖ వర్గాలు మాత్రం అవుననే అంటున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కరోనా పంజా విసురుతోంది. 15 రోజుల నుంచి రోజుకు 3 వందలకుపైగా పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. సోమవారం ఏకంగా 4 వందలు క్రాస్ అయ్యాయి. అందులో దాదాపు సగానికిపైగా కేసులు గురుకులాల్లలోనే వచ్చాయి. కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో  రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. కేసుల సంఖ్య తగ్గాలంటే లాక్ డౌన్ తప్పదని నిపుణులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరగడంతో ఇప్పటికే మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించారు. రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేసీఆర్.. లాక్ డౌన్ అంశంపైనే చర్చించారని తెలుస్తోంది. దీంతో దీంతో తెలంగాణలో కూడా  లాక్ డౌన్. లేదా రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.  తెలంగాణలో గత 24 గంటల్లో కొత్త‌గా 412 కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్క‌రోజే కరోనాతో ముగ్గురు చనిపోయారు. అదే సమయంలో 216 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,867కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,99,042 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,674గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 3,151 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,285 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 103 మందికి క‌రోనా సోకింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోనూ కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి.  కరోనా వైరస్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యానికి తావివ్వొద్దని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యశాఖపై మంత్రి  సమీక్ష నిర్వహించారు. వైరస్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, రోజుకు 50 వేల పరీక్షలు నిర్వహించాలని అధికారులు సూచించారు.  వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు మంత్రి ఈటల. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని, నిర్లక్ష్యం కూడదని అన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని మంత్రి రాజేందర్ అన్నారు.  

ఒకే కాలేజీలో 163 మందికి వైరస్.. ఏపీలో కరోనా కల్లోలం 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఫిబ్రవరిలో అదుపులోనికి వచ్చినట్లుగా కనిపించిన వైరస్... గత రెండు వారాలుగా మళ్లీ కోరలు చాస్తోంది. పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ  కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కల్లోలం రేపింది. రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఉన్న ఓ కాలేజీలో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఆ కాలేజీలో రెండు రోజులుగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మొదటి రోజు కొందరు విద్యార్థులను టెస్ట్ చేస్తే 13 కేసులు బయటపడ్డాయి. రెండో రోజు 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గిందని భావించారు.  తాజాగా సోమవారం చేసిన టెస్టుల్లో ఏకంగా 140 కరోనా కేసులు బయటపడటంతో కాలేజీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 700 మంది విద్యార్థుల నుంచి నమూనాలను యాజమాన్యం సేకరించింది. వీటిల్లో 140 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆ కాలేజీలో 163 మంది కరోనా సోకినట్లైంది. పాజిటివ్ వచ్చిన వారందరినీ ఒకే క్యాంపస్ లో ఉంచి ఆ ప్రాంతాన్ని కంటోన్మైంట్ జోన్ గా చేశామని అధికారులు వెల్లడించారు. నెగిటివ్ వచ్చిన 450 మందిని వేరే హాస్టల్ కు తరలించినట్టు వివరించారు. ఈ పరిణామంతో తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యార్థుల్లో కరోనా కేసులు రావడంతో తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.

మందుబాబులకు సుప్రీం కోర్టు గట్టి షాక్..

మద్యం సేవించిన తరువాత మందుబాబులు చేసే గలభా అంతా ఇంతా కాదు. ఆ హడావుడిలో వీరు అయితే తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం.. లేదంటే ఎదుటి వాడి ప్రాణాలు తీయడం కూడా చూస్తున్నాం. ఇక మందుబాబులు తాగి వాహనాలు డ్రైవ్  చేస్తే జరిగే అనర్ధాలు అనేకం మనం చూసాం. ఇక సోమవారం నాడు జరిగిన ఒక కేసు విచారణ సందర్భంలో ఇటువంటి మందుబాబులకు సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. అతిగా మద్యం సేవించి చనిపోతే వారి కుటుంబానికి బీమా చెల్లించాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప బాధిత కుటుంబానికి ఎటువంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక స్పష్టమైన తీర్పు చెప్పింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి 1997లో మరణించాడు. అతిగా వర్షాలు కురవడంతోపాటు, విపరీతమైన చలి కారణంగానే అతడు మరణించాడని అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ వ్యక్తి అతిగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని పోస్టుమార్టంలో తేలింది. అంతేకాకుండా అతడు ప్రమాదంలో మరణించలేదు కాబట్టి పరిహారం చెల్లించేందుకు బీమా సంస్థ నిరాకరించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అక్కడ వారికి తీర్పు అనుకూలంగా వచ్చింది. దీంతో బీమా కంపెనీ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా..  విచారించిన ఫోరం బీమా కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, పరిహారం మాత్రం అటవీ సంస్థ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో ఈ తీర్పును అటవీ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారించిన జస్టిస్ ఎంఎం శాంతన్ గౌండర్, జస్టిస్ వినిత్ శరణ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతిగా మద్యం సేవించి  చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎవరైనా వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే బీమా వర్తిస్తుందని.. అయితే అతిగా మద్యం సేవించి చనిపోతే మాత్రం ఇది వర్తించదని ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందని.. ధర్మాసనం తేల్చి చెప్పింది.  

పనిమనిషి, డైలీ లేబర్ మహిళకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్లు

దేశవ్యాప్తంగా హాట్ హాట్ గా మారిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ హోరాహోరీగా పోరాడుతున్నాయి.  అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అందరికి షాకిచ్చింది. బుద్వాన్ జిల్లా అస్‌గ్రామ్‌ ఎస్సీ  రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి ఓ పని మనిషిని తమ అభ్యర్థిగా బరిలోకి దింపింది. కలితా మాజీ అనే పని మనిషిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడంతో స్థానిక బీజేపీ కార్యకర్తలే  ఆశ్చర్యపోయారు. కలితా ఎవరు? అంటూ సందేహంలో పడిపోయారు.  అయితే బీజేపీ టికెట్ సాధించిన కలిత.. ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నారు.నెల రోజులపాటు తన పనికి సెలవు పెట్టి, ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కలితా భర్త సుబ్రతా మాజీ.. ఓ ప్లంబర్‌. పేదరికం కారణంగా ఆమె చదువుకోలేదు. ప్రచారంలో నేరుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే ఆమె టార్గెట్ చేస్తున్నారు. ఆట ఆడదాం అని ఎన్నికల ప్రచారంలో దీదీ చేస్తున్న నినాదాన్ని ఉద్దేశించి... ‘‘మోకాలి గాయంతో ఎన్నికల ఆటను మమత ఎలా ఆడతారు’’ అంటూ వ్యంగ్యాస్తాల్రు సంధించారు.    బీజేపీ మరో అసెంబ్లీ స్థానంలో రోజువారి కూలీ చేసుకునే మహిళను రంగంలోకి దిపింది. బంకురా జిల్లాలోని సల్ తోరా స్థానాన్ని చంద్ర బౌరికి కేటాయించింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చంద్ర బౌరీనే పేదరాలు. ఆమె భర్త కూడా రోజువారీ కూలీనే. రోజుకు 4 వందల రూపాయలు సంపాదిస్తూ జీవనం గడుపుతున్నారు. కూలీ పనుల్లో భర్తకు సాయం ఉంటోంది చంద్ర బౌరీ. ఆమె జిల్లా బీజేపీలో యాక్టివ్ కార్యకర్త కావడంతో టికెట్ ఇచ్చినట్లు బీజేపీ నేతలు చెప్పారు. 

శానిటైజర్ తాగి 8 మంది మృతి.. ఈ పాపం ఎవరిది?

ఎవరైనా దాహం వేస్తే నీళ్లు తాగుతారు, లేదంటే కూల్ డ్రింక్ తాగుతారు. వేడి చేస్తే మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతారు. వీకెండ్ అయితే లైట్ గా మందు తాగుతారు. వీళ్ళు మాత్రం మద్యం ధరలు పెరిగాయని శానిటైజర్ తాగారు. కొన్నీ శానిటైజర్ బాటిల్స్ కూడా సేమ్ లిక్కర్ బాటిల్ లాగే ఉంటాయి. మరి మధ్య మత్తులో ప్యాకెట్ లో ఉన్న శానిటైజర్ బాటిల్ ని మందు అనుకుని తాగారో ఏమో గానీ మొత్తానికి వాళ్ళు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు .   విజయవాడ వన్‌టౌన్‌‌కు చెందిన బెజవాడ మధు, సత్యనారాయణ అనే వ్యక్తులు శానిటైజర్ తాగి  అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి మరణం స్థానికుల్లో కలకలం రేపుతోంది. శానిటైజర్ తాగడం వల్లే వారు చనిపోయారని కుటుంబ సభ్యులు చెబుతుండగా వైద్యులు మాత్రం ధృవీకరించడం లేదు. మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో  రిక్షా కార్మికులు, కూలీలు శానిటైజర్‌ను కూల్ డ్రింక్‌లో కలుపుకుని సేవించారు. మృతి చెందారు అని కొందరు అంటున్నారు. కాగా అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఇదెక్కడి గోల.. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నా పాజిటివ్..

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలవడంతో ప్రజలు మళ్ళీ ఏడాది క్రితం ఉన్న పరిస్థితులు వస్తాయేమోనని భయపడుతున్నారు. మరోపక్క  ప్రభుత్వాలు వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి, ఇది ఇలా ఉండగా ఢిల్లీ పరిధిలోని ఒక సర్కార్ దవాఖానాలో పనిచేస్తున్న నర్సు నిర్ణీత సమయంలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కూడా కరోనా బారినపడ్డారు. ఈ నర్సు జనవరి 18న తొలిడోసు వ్యాక్సిన్ తీసుకోగా..  ఫిబ్రవరి 17న రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. తాజాగా ఆమె కరోనా గుప్పిట్లో చిక్కుకున్నారు. ఎప్పటిలానే ఆమె ఆసుపత్రిలో డ్యూటీ చేస్తుండగా.. ఆమెకు కొన్ని లక్షణాలు కనిపించడంతో..  వెంటనే ఆమె కోవిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకోగా కరోనాకు గురైనట్టు నిర్ధారణ అయింది. మరోపక్క యూపీ రాజధాని లక్నోలోనూ ఇటువంటి ఘటనే వెలుగు చూసింది. ఇక్కడి ఎస్‌పీఎం సివిల్ ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా ఆయనకు కూడా కరోనా సోకింది. సివిల్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నితిన్ మిశ్రా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నతరువాత కూడా వైరస్ బారిన పడ్డారు. అయన ఫిబ్రవరి 15న తొలి డోసు, మార్చి 16న కోవ్యాక్సిన్ రెండవ డోసు తీసుకున్నారు. ఆ తరువాత ఆయనకు అనారోగ్యంగా అనిపించడంతో.. కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వైరస్ సంక్రమించిన ఘటన యూపీలో ఇదే మొదటిదని యూపీ మెడికల్ హెల్త్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ డీఎస్ నేగి తెలిపారు. కరోనా బారినపడిన వీరిద్దరూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు నిపుణులు మాత్రం.. మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్న 28 రోజులకు రెండో డోసు వేసుకోవాలని.. ఆ తరువాత 14 రోజులకు (అంటే మొదటి డోసు వేసుకున్న 42  రోజులకు) మనలో కరోనాపై పోరాడే శక్తి వస్తుందని.. దీంతో కరోనా నుండి రక్షణ లభిస్తుందని చెపుతున్నారు. అయితే ఈ తాజా ఘటనలతో ప్రజలలో కొంత అయోమయం నెలకొనే అవకాశం ఉంది.  

అంగన్ వాడీ కేంద్రంలో 40 పాములు 

చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైనయట్లు, చీమలు పెట్టిన పుట్టలలోనే కాదు. మనిషి కట్టుకున్న ఇళ్లల్లోనూ, అప్పుడప్పుడు ఆఫీస్ లోనూ పాములు కనిపిస్తుంటాయి. తాజాగా ఓ అంగన్‌వాడీ కేంద్రం లో పాములకు నిలయమైయింది.  మహాబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రతి రోజు లాగే చిన్నారులతో పాటు గర్భిణులకు సరకులు పంచేందుకు అంగన్ వాడి కేంద్రం తెరవడంతో కుప్పలు కుప్పలుగా పాములు  కనిపంచాయని అంగన్‌వాడీ సిబ్బంది తెలిపారు. అంగన్ వామీ కేంద్రంలో ఏకంగా 40 పాము పిల్లలు, 2 తేళ్లు కనిపించడంతో అంగన్‌వాడీ సిబ్బంది, స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.  శిథిలావస్థలో ఉన్న భవనంలో అంగన్ వాడీ కేంద్రం నడపడం వల్లే ఇలా పాములు, తేళ్లు వస్తున్నాయని సిబ్బంది, స్థానికులు తెలిపారు. అయితే అంగన్‌వాడీ కేంద్రానికి పిల్లలు ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అంగన్ వాడీ సిబ్బంది, గ్రామస్తులు  ఊపిరి పీల్చుకున్నారు.   

పార్లమెంట్ లో మహిళా ఎంపీకి వార్నింగ్! 

మహారాష్ట్రలో ప్రకంపనలు స్పష్టిస్తున్న ముకేష్ అంబానీ కేసు సెగలు పార్లమెంట్ ను తాకాయి. అంబానీ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని కోరిన మహిళా ఎంపీని శివసేన ఎంపీ బెదిరించారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అమరావతి ఎంపీ, నటి నవనీత్ కౌర్.. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. పార్లమెంట్‌లోనే తనను ఆయన బెదిరించారని ఆమె ఆరోపించారు. ‘‘మీరు మహారాష్ట్రలో ఎలా తిరుగుతారో నేనూ చూస్తా. మిమ్మల్ని కూడా జైలులో వేసేస్తాం.’’ అంటూ శివసేన ఎంపీ అరవింద్ బెదిరించారని ఎంపీ నవనీత్ కౌర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  మన్సుఖ్ హిరేన్ హత్య, సచిన్ వాజే వ్యవహరంపై ఉద్ధవ్ సర్కార్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన బెదిరింపులకు దిగుతున్నారని నవనీత్ కౌర్ ఆరోపించారు. ‘‘ఈ రోజు శివసేన ఎంపీ నన్ను బెదిరించారు. ఈ అవమానం నాకే కాదు. మొత్తం మహిళా లోకానికే అవమానం. అందుకే వీలైనంత తొందరగా ఎంపీ అరవింద్ సావంత్‌ వ్యాఖ్యలపై పోలీస్ దర్యాప్తు చేయించాలి.’’ అని నవనీత్ కౌర్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా నవనీత్ కౌర్ పంపించారు.  అయితే నవనీత్ కౌర్ చేసిన ఆరోపణలపై శివసేన ఎంపీ అరవింద్ స్పందించారు. ‘‘ఆమెను నేనెందుకు భయపెడతాను? నేను బెదిరించే సమయంలో ఆమె చుట్టుపక్కల ఎవరైనా ఉంటే చెప్పండి. ఆమె వ్యవహార శైలి, స్పందించే విధానం ఏమాత్రం బాగోలేదు.’’ అని అరవింద్ తీవ్రంగా మండిపడ్డారు.  అంబానీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తుండటంతో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఉద్దవ్ థాకరే సర్కార్ పై ఒత్తడి పెరుగుతోంది. మరోవైపు తన పార్టీకి చెందిన హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను మరోసారి వెనకేసుకొచ్చారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. 

తెలంగాణలో స్కూల్స్ క్లోజ్! 

కరోనా విజృంభణతో తెలంగాణలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండడంతో వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. పరిస్థితి చేజారిపోకుండా ఉండాలంటే పదో తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లను మూసివేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. వైరస్ వ్యాప్తికి ఇవి వాహకాలుగా మారుతున్నాయని భావిస్తున్న వైద్యాధికారులు ఈ సూచన చేశారు. వైద్యశాఖ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న వెంటనే ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం ఈ విషయంలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 700 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. నిజానికి పిల్లల్లో రోగ నిరోధకశక్తి ఎక్కువగా ఉండడంతో వారికి వైరస్ సంక్రమించినా లక్షణాలు బయటపడవు. దీంతో వారి నుంచి కుటుంబ సభ్యులకు, వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠశాలల మూసివేతే సరైన పరిష్కారమని చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సోమవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులంతా పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, లాక్ డౌన్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటిస్తారని తెలుస్తోంది. పూర్తి స్థాయికి లాక్ డౌన్ అమలుకు అవకాశం లేకపోయినా.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.   

సూర్యాపేటలో కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ.. 100 మందికి గాయాలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన 47 జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రీడాకారులు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 2 వేల మంది గ్యాలరీ కూర్చున్నట్లు సమాచారం. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చున్న కారణంగానే కూలినట్లు తెలుస్తున్నది. క్రీడాపోటీలను వీక్షించేందుకు స్టేడియంలో మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. మరికాసేపట్లో పోటీలు ప్రారంభకానుండగా ఊహించని ఘటన జరగడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. క్షతగాత్రులను 108 సిబ్బంది, పోలీసులు, స్థానికులు అందుబాటులో ఉన్న వాహనాల్లో హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీప దవాఖానలకు తరలించారు. బాధితులను పరామర్శించేందుకు మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట ఏరియా దవాఖానకు వెళ్లారు.

ఎమ్మెల్యే ఆర్కే పాపం ఊరికే పోదు...!

గంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇవాళ ప్రభుత్వం చేపట్టిన  ఆక్రమణల తొలగింపు ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇరుపక్కల గల నివాసాలను మున్సిపల్ అధికారులు కూల్చివేసారు. అక్రమ నిర్మాణాల పేరుతో కొన్ని నివాసాలను అధికారులు పొక్లెయిన్‌ల సాయంతో కూల్చేశారు. బాధితులు ఈ కూల్చివేతలను అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారీగా మోహరించిన పోలీసులు బాధితులను పక్కకు నెట్టి వేసి అక్కడ ఉన్న కట్టడాలను పడగొట్టారు. మరోపక్క ఈ విషయంపై బాధితులు గతంలోనే కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కాగా వారు వేసిన పిటిషన్ త్వరలో విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు విచారణ ప్రారంభానికి ముందే  బలవంతంగా తమ ఇళ్లను ఖాళీ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇక్కడ తాము 40 ఏళ్లుగా ఉంటున్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించకుండా తమ కట్టడాలను ఎలా తొలగిస్తారని బాధితులు ప్రశ్నించారు. అయితే అధికారులు వారి వాదనను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో టీడీపీ, వాపక్ష నేతలు అక్కడకు భారీగా చేరుకుని బాధితులకు అండగా నిలిచి.. అధికారులను నిలదీశారు. బాధితులకు ప్రత్యామ్నాయ స్థలాలు చూపించాకే ఖాళీ చేయించాలని.. అప్పటి వరకు కూల్చివేతలు ఆపాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అధికారులకు, బాధితులకు అండగా నిలబడిన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఇలా ఉండగా ప్రభుత్వం, అధికారుల వ్యవహరించిన తీరుపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. లోకేష్ గెలిస్తే మంగళగిరి లో పేదల ఇళ్లు కూల్చేస్తాడు అని ఎన్నికల్లో అసత్య ప్రచారం చేసారని.. కానీ ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మానవత్వం లేకుండా రోజుకో చోట పేదల గూడు కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ పాపం ఆయన్ని ఊరికే వదలదు అని లోకేష్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరు గ్రామంలో 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఇళ్ల సమస్య కోర్టు పరిధిలో ఉన్నా..  ఎమ్మెల్యే చేసిన ఒత్తిడితో అధికారులు, పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకి నెట్టేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో పేదలకు ఒక్క ఇళ్లు కట్టని జగన్ రెడ్డి ప్రభుత్వానికి పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇంటిని ధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. పేదలకు న్యాయం జరిగే వరకూ వారికి టీడీపీ అండగా పోరాడుతుంది లోకేష్ స్పష్టం చేశారు.  

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల పై కేంద్ర మంత్రి క్లారిటీ..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై ఏపీలో రచ్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మికులు, అటు ప్రజలు వివిధ స్థాయిలలో ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. మరోపక్క విశాఖ ఉక్కు నష్టాలను తగ్గించడానికి మిగులు భూములుగా ఉన్న 7 వేల ఎకరాలను అమ్మాలని ఎపి సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్రం నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. తాజాగా స్టీల్‌ప్లాంట్ మిగులు భూములపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది ఇవాళ  లోక్‌సభలో మిగులు భూముల విషయంపై  వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్‌ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ సమాధానం ఇచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ మిగులు భూములను ప్రైవేట్‌పరం చేసే విషయాన్నికేంద్రం పరిశీలిస్తోందని కేంద్రమంత్రి ఠాకూర్‌ చెప్పారు. అవసరమైన మేరకు స్టీల్‌ప్లాంట్ భూములను ప్రైవేట్‌పరం చేస్తామని అయన ఈ సందర్భంగా చెప్పారు. మిగిలిన వాటిని ఏం చేయాలో ఆ తర్వాత పరిశీలిస్తామని ఠాకూర్ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని అయన అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ వేస్తామని అయన స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో మొత్తం 7 వేల ఎకరాల మిగులు భూములు ఉన్నాయని కేంద్రమంత్రి ఠాకూర్‌ తెలిపారు. మొత్తానికి ఇటు ఎపి సీఎం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒకే బాటలో నడుస్తుండడం గమనార్హం.